• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: special status to Andhra pradesh

ప్రత్యేక హోదా, పాకేజీ కూడా లేదని చెప్పటానికి ఇన్ని నాటకాలు ఆడాలా ?

08 Thursday Sep 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ 1 Comment

Tags

ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, BJP, special status to Andhra pradesh, tdp

నాడు పార్లమెంట్‌ తలుపులు మూసి ప్రహసన ప్రాయంగా కాంగ్రెస్‌,బిజెపి ఇతర పార్టీల నేతలు కుమ్మక్కై చీకట్లో రాష్ట్ర విభజన తీర్మానం చేశారు. అయితే ఆ విభజన హామీలను తుంగలో తొక్కేందుకు మిగతా పార్టీలకు అవకాశం ఇవ్వకుండా నేడు బిజెపి నేతలు అర్ధరాత్రి సమాయాన్ని ఎంచుకొని ప్రత్యేక హొదా లేదని ప్రకటించారు. అది విద్రోహం అని మిగతా పార్టీలన్నీ విమర్శిస్తే తెలుగు దేశం, బిజెపి పార్టీలు స్వాగతం పలికాయి.

ఎం కోటేశ్వరరావు

     ప్రతిపక్ష వైసిపి సభ్యులు నిశ్శబ్దంగా కూర్చుంటే ప్రత్యేక హోదా గురించి ప్రకటన చేస్తానని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు శాసనసభలో పదే పదే ప్రకటించటాన్ని యావత్‌ తెలుగు ప్రజలూ గమనించారు. రెండు సంవత్సరాలకు పైగా రాజకీయ పార్టీలు, జనం నోర్మూసుకుని కూర్చున్నా ఎన్నడూ దాని గురించి సూటిగా మాట్లాడని చంద్రబాబు ప్రత్యేక హోదా, పాకేజీ కూడా ఇచ్చేది లేదని ఒకవైపు కేంద్రం తేట తెల్లంగా ప్రకటించిన తరువాత దాని గురించి తాను ప్రకటన చేస్తానని చెప్పటమే రాజకీయ జాణతనం. తెలుగుదేశం పార్టీ ఎంతగా ఆత్మరక్షణలో పడిపోయిందంటే వైసిపి సభ్యులు అసెంబ్లీ కార్యకలాపాలు సాగకుండా నినాదాలతో అడ్డుకుంటుంటే తెలుగు దేశం సభ్యులు ముఖాలు వేలాడవేసుకొని నిస్సహాయంగా కూర్చుండి పోయారు. అదే మిగతా సందర్బాలలో గతంలో వారెన్నడూ అంత వినమ్రతతో కూర్చోలేదు. బహుశా ప్రస్తుత అసెంబ్లీలో అధికారపక్షం ఇలా నీరుగారి పోయి వుండటం ఇదే మొదటిసారి.

    నాడు పార్లమెంట్‌ తలుపులు మూసి ప్రహసన ప్రాయంగా కాంగ్రెస్‌,బిజెపి ఇతర పార్టీల నేతలు కుమ్మక్కై చీకట్లో రాష్ట్ర విభజన తీర్మానం చేశారు. అయితే ఆ విభజన హామీలను తుంగలో తొక్కేందుకు మిగతా పార్టీలకు అవకాశం ఇవ్వకుండా నేడు బిజెపి నేతలు అర్ధరాత్రి సమాయాన్ని ఎంచుకొని ప్రత్యేక హొదా లేదని ప్రకటించారు. అది విద్రోహం అని మిగతా పార్టీలన్నీ విమర్శిస్తే తెలుగు దేశం, బిజెపి పార్టీలు స్వాగతం పలికాయి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు కూడా లేదని తేలిపోయింది. ప్రత్యేక పాకేజీ లేకుండా ప్రత్యేక సాయం అని అది కూడా 2015 నుంచి 2020 వరకు మాత్రమే అని కేంద్రం స్పష్టం చేసింది. పోనీ దాని వివరాలు ఏమిటి అంటే రేపు ఆర్ధిక మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పెడతాం చూసుకోమని విలేకర్లకు చెప్పి పంపారు.ఈ మాత్రం చెప్పటానికి అర్దరాత్రి ప్రత్యేకంగా పత్రికా గోష్టి పెట్టటం అవసరమా ?

    తాము రాజకీయంగా నిండా మునిగి జనాన్ని ముఖ్యంగా యువత భవిష్యత్‌ను అంధకారంలో ముంచిన పెద్దలు ముసుగులో గుద్దులాట ఎందుకనుకున్నారో ఏమో వెంటనే తేల్చివేశారు. ఇక తేల్చు కోవలసింది జనమే. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయం చేసేందుకు ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారని కేంద్ర మంత్రులు ప్రకటించినపుడే అది వట్టిస్తరి మంచినీళ్లని తేలిపోయింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తున్నట్లు పెద్ద వూదరగొడుతున్నారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు నుంచే ఆ డిమాండ్‌ వుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శక సూత్రాల ప్రకారం ఏ సాగునీరు, విద్యుత్‌ ప్రాజెక్టుకైనా ఆ సూత్రాలు వర్తిస్తే కేంద్ర ప్రభుత్వం వాటిని జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించి 90శాతం నిధులు అంద చేస్తుంది.ఇప్పటికే అలాంటి 14 ప్రాజెక్టుల జాబితాను ఈ చిరునామాలో చూడవచ్చు.http://wrmin.nic.in/writereaddata/Guidelines/NProjects572133778.pdf పోలవరం ప్రాజెక్టును కేంద్రం చేపట్టటం ద్వారా ఆ మేరకు రాష్ట్రానికి వెసులుబాటు కలుగుతుంది. అలాంటి హోదా ఇవ్వటానికి రాష్ట్రాన్ని విభజించటానికి సంబంధం లేదు. రాష్ట్రాన్ని విభజించిన కారణంగా వెసులు బాటు కోసం ఆహోదా ఇచ్చినట్లు చెప్పటం మోసం చేయటమే. నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక హోదాను కల్పించటాన్ని మిగతా రాష్ట్రాలు వ్యతిరేకించినపుడు, జాతీయ ప్రాజెక్టు హోదా తమ పధకాలకు సైతం ఎందుకు కల్పించరని కేంద్రాన్ని ఇతర రాష్ట్రాలు అడగకుండా వుంటాయా ? ఒక వేళ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రాన్ని విభజించినందుకు పరిహారంగా ఇస్తే ఆమేరకు నిబంధనలను కూడా సవరించకుండా ఎలా సాధ్యం. ఒక రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వటానికి మిగతా రాష్ట్రాలు ఎలా అంగీకరిస్తాయి ?

    ప్రత్యేక హోదా విషయమై ఒకే నోటితో రెండు మాటలు మాట్లాడుతూ అనేక అనుమానాలకు తావిస్తున్నారు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కలిపిస్తే మరో పదకొండు రాష్ట్రాలు అడుగుతాయి కనుక రాజకీయంగా సమస్యలు తలెత్తే అవకాశం వుంది కనుక కొత్తగా ఏ రాష్ట్రానికీ ఇవ్వదలచలేదు. ఒక వేళ ఇచ్చినా రాయితీలను గణనీయంగా తగ్గించిన కారణంగా పెద్దగా ప్రయోజనం వుండదు. ఇదే సమయంలో ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు కూడా పెద్దగా లబ్డి పొందింది లేదు. ఇప్పుడు ఇన్ని విషయాలు చెబుతున్న పెద్దలకు ఈ విషయాలన్నీ రెండు సంవత్సరాలకు ముందు ఎన్నికల సందర్భంగా, లేదా గత రెండు సంవత్సరాలుగా తెలియవా ? వేదికల మీద వాగ్దానాలు కురిపించిన పెద్దలు రాజ్యాంగం, నిబంధనలు తెలియని అజ్ఞానులు కాదే ! కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటా 32 నుంచి 42 శాతానికి పెంచారు. అయితే కుడి చేత్తో ఇచ్చి ఎడమచేత్తో తీసుకున్నట్లుగా కేంద్రం అమలు జరుపుతున్న అనేక పధకాలను రాష్ట్రాలకు బదలాయించారు. ఫలితంగా పది శాతం నిధులతో పాటు అంత కంటే ఎక్కువే భారం మోపారు. రెండవది రాష్ట్రాలకు వాటా లేని సెస్సుల వంటి వాటిని ఇటీవలి కాలంలో విపరీతంగా పెంచారు. దాని వలన జనం జేబుల నుంచి కేంద్రానికి వెళ్లేది కూడా పెరిగింది.

     ప్రత్యేక హోదా రాయితీలకు అవకాశం వున్న రాష్ట్రాలలో ఇప్పటికే అనేక మంది వాటిని నమ్ముకొని పరిశ్రమలు పెట్టారు. ఇప్పుడు జిఎస్‌టి వచ్చింది కనుక ఆ రాయితీలను మధ్యలో నిలిపివేస్తారా ? అదే మాదిరి జమ్మూ కాశ్మీర్‌కు రాజ్యాంగ బద్దంగానే ప్రత్యేక ప్రతిపత్తి వుంది. మరి అక్కడ ఎలా అమలు జరుపుతారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు పార్లమెంట్‌లో , వెలుపలా వాగ్దానం చేసిన మాదిరి ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటిస్తే మిగతా రాష్ట్రాలకు అమలు జరిగినంత కాలం అమలు జరుగుతాయి. మిగతావాటికి ఆగిపోతే ఆంధ్రప్రదేశ్‌కూ నిలిచిపోతాయి, నలుగురితో నారాయణ ! పేచీ వుండదు, బిజెపి మోసం చేసిందనే విమర్శలూ వుండవు. అలాంటపుడు వాగ్దానం చేసిన మేరకు ప్రకటించటానికి ఇబ్బంది ఏమిటి ? ఇప్పటికైనా చౌకబారు రాజకీయాలు మానుకొని యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు పని చేయటం అవసరం. కేంద్రం తన విధానాలు మార్చుకొని ఆంధ్రప్రదేశ్‌లో తగినన్ని పెట్టుబడులు పెట్టి వుపాధి కల్పించాలి. కడపలో మరో వుక్కు ఫ్యాక్టరీ ఎందుకు పెట్టరు, వివిధ రంగాలలో ి ప్రయివేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్న కేంద్ర ప్రభుత్వం మౌలిక రంగాలైన పెట్రోలియం, రక్షణ వంటి రంగాలకు అవసరమైన వుత్పత్తుల తయారీకి మరో ఇసిఐఎల్‌, మరో ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ,అణ ఇంధన కాంప్లెక్స్‌, వంటివి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టటానికి ఆటంకం ఏమిటి ? ఐడిపిఎల్‌ వంటి వాటిని స్ధాపించి యువతకు వుపాధితో పాటు జనానికి చౌకగా ఔషధాలు అందించటానికి వున్న ఇబ్బంది ఏమిటి ?

   ఇప్పుడున్నపరిస్థితుల్లో ఎవరైనా ఇప్పటికే మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్‌ వున్న ప్రాంతాలలోనే పరిశ్రమలు పెడతారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే చైనాలోనే ప్రయివేటు రంగం పరిశ్రమలన్నీ ఆ విధంగా కొన్ని అభివృద్ధి చెందిన ప్రాంతాలలోనే కేంద్రీకృతమయ్యాయి. అభివృద్ధి కొత్త సమస్యలను సృష్టించింది. దాంతో పరిశ్రమలు లేని ప్రాంతాలలో పెట్టుబడులకు కేంద్రీకరించింది. గతంలో ప్రభుత్వం పెట్టుబడి పెట్టిన విధానం కూడా కొన్ని అసమానతలను సృష్టించింది. ప్రభుత్వ రంగ పరిశ్రమలు, పలు సంస్థలను హైదరాబాదులోనే కేంద్రీకరించటంతో అటు తెలంగాణాలో మిగిలిన జిల్లాలు, ఇటు ఆంధ్రప్రాంతంలో కొంతమేరకు విశాఖ మినహా మిగిలిన జిల్లాలన్నీ వెనుకబడిపోయాయి. మన దేశంలో కూడా వెనుకబడిన ప్రాంతాలలో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టకుండా ప్రయివేటు వారి వచ్చి ఒరగపెడతారనుకుంటే అంతకంటే భ్రమ మరొకటి వుండదు.అందువలన ప్రత్యేక హోదాతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని డిమాండ్‌ చేయటం ఎంతో సముచితం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సత్యహరిశ్చంద్రుల వారసులకు తగని ముసుగులో రాజకీయం ఎందుకు !!

22 Friday Jul 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, NATIONAL NEWS, Opinion, Others, Politics

≈ Leave a comment

Tags

Andhrapradesh, BJP, Narendra Modi, special status to Andhra pradesh, tdp

 నిజానికి ఆ బిల్లు గురించి తెలుగుదేశం, బిజెపిలకు శ్రద్ద లేదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ఆసక్తి వుంటే ఆమోదం పొందటం కష్టం కాదు. జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందటం ముఖ్యం, ఆ ఖ్యాతి ఏ ప్రభుత్వానిది అన్నది ముఖ్యం కాదు అని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పాటి విశాల దృక్పధం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, తెలుగుదేశానికి శ్రద్ధ వుంటే, శుక్రవారం నాడు ప్రయివేటు బిల్లులపై చర్చకు అవకాశం ఇవ్వాలనుకుంటే దానిని తొలి అంశంగా తీసుకోవచ్చు

ఎం కోటేశ్వరరావు

    ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన అనధికార బిల్లు అందరూ వూహించినట్లుగానే రెండవ సారి కూడా చర్చకు రాకుండా పోయింది. అలాంటి బిల్లులను చర్చకు రానివ్వరని ఎలాంటి ఆవేశ కావేషాలకు లోనుకాకుండా ఎంతో శాంతంగా వున్న ఆంధ్రప్రదేశ్‌ పౌరులు గ్రహించటం మంచిది. రజనీకాంత్‌ ఒక సినిమాలో సినిమాలో చెప్పినట్లు అతిగా ఆశపడవద్దు. నరేంద్రమోడీ, చంద్రబాబు మంత్రదండాలు, అల్లావుద్దీన్‌ అద్బుతదీపాలు, లేస్తే మనిషిని కాదు అన్న కుంటి మల్లయ్య వంటి పవన్‌ కల్యాణ్‌ ప్రకటనల కోసం ఎదురు చూసే ఆనందం ఎంతైనా ప్రత్యేక హోదాతో రాదు కదా !

    ఆ బిల్లు చర్చకు వస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలుగు దేశం పార్టీ నేతలు చెప్పిన తీరును చూసినపుడే రాదన్న గట్టి ధీమా వారిలో వుందని తేలిపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కేవలం రాజకీయ ప్రయోజనాలకోసమే కాంగ్రెస్‌ రెండు సంవత్సరాల తరువాత ఒక ప్రయివేటు బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది అని అంగీకరిద్దాం. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు, అలాగే చంద్రబాబుకు తెలిసిన రాజకీయం కూడా అలాంటిదే. రాష్ట్ర విభజన బిల్లులో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చకుండా అన్యాయం చేశారనే శాశ్వత విమర్శను కొనసాగించాలన్నా , ఆ పేరుతో మరికొంత కాలం ఓట్లు దండుకోవాలన్నా దానిని ఇవ్వకుండా, అలాంటి బిల్లులను చర్చకు రాకుండా చేయటం బిజెపి, తెలుగుదేశం పార్టీలకు అవసరం అని శుక్రవారం నాటి పరిణామాలు నిరూపించాయని కూడా అనుకోకతప్పదు మరి. రాష్ట్రాన్ని విభజించి అసెంబ్లీ చరిత్రలో ప్రాతినిధ్యం లేకుండా పోయిన కాంగ్రెస్‌కు జ్ఞానోదయం కలిగి కావచ్చు లేదా చేసిన తప్పును దిద్దుకోవాలంటే పోయిన చోటే వెతుక్కోవాలన్న లోకోక్తి ప్రకారం గానీ ఏదైనేం రెండు సంవత్సరాలకు ఒక బిల్లును ప్రవేశపెట్టింది.

   నిజానికి ఆ బిల్లు గురించి తెలుగుదేశం, బిజెపిలకు శ్రద్ద లేదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ఆసక్తి వుంటే ఆమోదం పొందటం కష్టం కాదు. జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందటం ముఖ్యం, ఆ ఖ్యాతి ఏ ప్రభుత్వానిది అన్నది ముఖ్యం కాదు అని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పాటి విశాల దృక్పధం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, తెలుగుదేశానికి శ్రద్ధ వుంటే, శుక్రవారం నాడు ప్రయివేటు బిల్లులపై చర్చకు అవకాశం ఇవ్వాలనుకుంటే దానిని తొలి అంశంగా తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు బిజెపి నేత అవునో కాదో తెలియని మా గుంటూరు గొరిజవోలు చిన్న సినీ హీరో శివాజీ దానిని 14వ అంశంగా పెట్టారని శరభ శరభ దశ్శరభ శరభ అంటున్నాడు. బిల్లు చర్చకు రావాలని, ఆమోదం పొందాలని తెలుగుదేశం పార్టీ నిజంగా కోరుకుంటే , హోదా రాకపోతే ఆంధ్రప్రజలు ఆగ్రహిస్తారని అనుకొని వుంటే చర్చకు రాకుండా పోయిన తరువాత దాని మీద ఆ పార్టీ నేతలు, చివరికి నిన్నటి వరకు కాంగ్రెస్‌లో వుండి తెలుగుదేశంలో రాజ్యసభ సీటుకొనుక్కున్నారని విమర్శలు ఎదుర్కొన్న టిజి వెంకటేష్‌తో సహా అలాంటి వ్యాఖ్యలు చేసి వుండేవారు కాదు.

   ఆమ్‌ ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎంపీ పార్లమెంట్‌ ప్రాంగణాన్ని వీడియో తీసి దానిని సామాజిక మీడియాలో పెట్టారని అది నిబంధనలకు వ్యతిరేకం కనుక అతగాడిపై చర్య తీసుకోవాలని బిజెపి అభ్యంతరం తెలిపింది. ఓకే, అదే వాస్తవమైతే నిబంధనల ప్రకారం స్పీకరుకు ఫిర్యాదు చేయవచ్చు, రుజువైతే చర్య తీసుకోవచ్చు, ఎవరు అడ్డుపడ్డారు. వుభయ సభలలో కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల సభ్యులు కూడా చర్య తీసుకోవాలనే కోరారు తప్ప వ్యతిరేకించలేదు. అన్నింటికీ మించి సదరు సభ్యుడు క్షమాపణ చెప్పాడు. అయినా సరే అతని ప్రవర్తన అభ్యంతరకరం అనుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా మాదిరి బిజెపి వ్యూహకర్తల మేకిట్‌ ఎన్‌ ఇష్యూ (దాన్నొక సమస్యగా చేయండి ) కాకపోతే ఆ పేరుతో లోక్‌సభ, రాజ్యసభలను ఒక రోజంతా పనిచేయకుండా వాయిదా పడేట్లు అధికారపక్షమే అడ్డుకోవాల్సినంత తీవ్ర విషయమా అది.

   రాజ్యసభలో ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి పార్లమెంట్‌ భద్రతా విషయాన్ని చర్చించాలన్న అధికార పక్ష సభ్యురాలి డిమాండ్‌ను కాంగ్రెస్‌ సభ్యులు ఆమోదించలేదు. ప్రశ్నోత్తరాల తరువాత దాని గురించి చర్చించవచ్చని చెప్పారు.అయినా సరే బిజెపి దాని మిత్రపక్షాల సభ్యులు తమ పట్టువీడకుండా గొడవ చేయటంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో సహా అనధికార బిల్లులు చర్చకు రాకుండా పోయాయి. కాంగ్రెస్‌ సభ్యులు ముందే చర్చకు అంగీకరించి వుంటే బిల్లు చర్చకు వచ్చేదని నెపాన్ని కాంగ్రెస్‌ మీద నెట్టేందుకు తెలుగుదేశం మంత్రులు, ఎంపీలు ప్రయత్నించటాన్ని చూస్తే జరిగిందేమిటో అర్ధం చేసుకోలేనంత అమాయకంగా ఆంధ్రప్రజానీకం వుందని భావిస్తున్నారా ? లేక తామేం చెప్పినా నిజమే నిజమే అని తలలూపుతారనుకుంటున్నారా ? అన్నీ వదులుకున్న వాళ్లం హైకోర్టు కోసం పట్టుబట్టి హైదరాబాదులోనే కూర్చుంటామా అని చంద్రబాబు నాయుడు చెప్పారు. అలాగే అన్ని పార్టీలనీ గుడ్డిగా నమ్మి (సిపిఎం తప్ప) అన్నీ వదులుకున్న ఆంధ్రులు రాని ప్రత్యేక హోదాకోసం పట్టుబట్టి కూర్చుంటారా ?

      తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారికి ఏమైందో తెలియదు. శుక్రవారం రాత్రి తన సిబ్బంది ద్వారా ఒక అధికారిక ప్రకటన పంపారు. దాని పూర్తి పాఠం ఇలా వుంది.’రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యము అని భావించాము కాబట్టే రాష్ట్రానికి ద్రోహము చేసిన కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిల్  అని చూడకుండా మద్దతు ఇచ్చాము . సభలోకి వెళ్లకముందే AP ప్రయోజనాలు ముఖ్యము అని స్పష్టము గా చెప్పాను. టీడీపీ కృషి , ఒత్తిడి వలనే కేంద్రము క్రమము గా అన్ని పథకాలకు నిధులు కేటాయించటం జరిగింది . ప్రస్తుత పరిస్థితుల్లో స్నేహ ధర్మాన్నే పాటిస్తాము కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయము లో రాజీ పడే పరిస్థితి లేదు . రాజకీయ ఎదుగుదల కోసము కొందరు చేస్తున్న చిల్లర రాజకీయాలని తెలివైన ఆంధ్రులు తేలికగా అర్థము చేసుకుంటారు . ‘.

ఇక్కడ సామాన్యులకు అర్ధం కాని విషయం ఏమంటే కాంగ్రెస్‌ మీద అంత సానుభూతి ఎందుకు? తెలుగు దేశం పార్టీ కృషి, వత్తిడి వల్లనే కేంద్రం అన్ని పధకాలకు నిధులు ఇచ్చిందన్నారు. ఒక కేంద్రమంత్రిగా ఇలా చెప్పటం నిజంగా ఆశ్చర్యంలోనే ఆశ్చర్యం. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం నడుస్తుందా లేక వత్తిడి ద్వారా పని చేస్తుందా ? మీరు చెప్పినట్లు స్నేహంగా వున్నంత కాలం నిధులు విడుదల చేయని కారణంగానే వత్తిడి తెచ్చారని అనుకోవాలా ? వత్తిడి కారణంగా అదనంగా వచ్చిన నిధులేమిటో జనానికి తెలియ చేస్తే సంతోషిస్తారు. బిజెపి-తెలుగు దేశం మధ్య వున్నది అనుభూతికి అందని అపూర్వ స్నేహంగా కనిపిస్తోంది. మీరు తెచ్చే వత్తిడికి నిజంగా అంత సత్తా వుంటే ప్రత్యేక హోదా సంగతి ఇంతకాలం ఎందుకు తేల్చలేకపోయారు అని జనం అడుగుతున్నారు. పార్లమెంట్‌లో మీరే ఎందుకు వత్తిడి తేలేదు. ఎక్కడైనా ప్రతిపక్ష సభ్యులు సభలో గందర గోళం, వెల్‌లోకి దూసుకుపోవటం వంటివి చేస్తారు. కానీ మీ మిత్రపక్షం అధికారంలో వుండి ఆ పని చేస్తోంది. అంటే ప్రజాస్వామ్యాన్ని తలకిందులుగా అర్ధం చేసుకోవాలా ?

    కాంగ్రెస్‌కు చిత్తశుద్ది లేదు, బుద్ది రాదు అనుకుందాం . బిజెపి, తెలుగుదేశం పార్టీల వద్ద శుద్ది,బుద్ది టన్నుల కొద్దీ వున్నాయి కదా ! ఇప్పటికైనా ఎలాంటి రాజకీయాలు లేకుండా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ది కోసం ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక పాకేజీ ఏదో ఒకటి చేసి చూపండి, ఏమీ చేయకుండానే మూడో ఏడాదిలో ప్రవేశించారు. లేదా ఏదీ అవేమీ వుండవు అనైనా చెప్పండి ! సత్యహరిశ్చంద్రుల వారసులకు తగని ముసుగులో రాజకీయం ఎందుకు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

విశ్వసనీయతను దిగజార్చుకుంటున్న చంద్రబాబు

02 Thursday Jun 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Congress party, special status to Andhra pradesh

ఎం కోటేశ్వరరావు

   ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ జనాలను వెర్రివాళ్ల కింద జమకడుతున్నారా ? తన విశ్వసనీయతను తానే దెబ్బతీసుకుంటున్నారా ? ఇది ప్రతిపక్ష పార్టీల వారికి వస్తున్న ఆలోచన కాదు, స్వంత బుర్రలను వుపయోగించి తెలుగు దేశం పార్టీని పది కాలాలపాటు పరిరక్షించుకోవాలని కోరుకొనే కార్యకర్తలలో కూడా తలెత్తున్న ప్రశ్న. విజయవాడ బెంజి సర్కిల్‌లో జూన్‌ రెండవ తేదీన నవ నిర్మాణ దీక్ష పేరుతో చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని చూసిన తరువాత కలుగుతున్న సందేహాలివి.

   ముఖ్యమంత్రి, అనుచర గణం రాష్ట్ర నవనిర్మాణం కోసం దీక్ష అనే ఒక పెద్ద బ్యానర్‌ కింద మౌనంగా కూర్చొని వుంటే ఎంతో హుందాగా వుండేది. లేదూ తస్మదీయ పత్రికలు, ఛానళ్ల వారిని,తెలుగుదేశం కార్యకర్తలను సంతోష పెట్టేందుకు అసలు ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు సంవత్సరాలలో జరిగిందేమిటి? జరగాల్సిందేమిటి? విభజన సమయంలో కేంద్రం చేసిన చట్టం, వాగ్దానాలు ఏమిటి ? అవి ఎంతవరకు అమలు జరిగాయి? జరగకపోతే ఎదురైన సమస్యలేమిటి మొదలైన అంశాలతో రాష్ట్ర ప్రజల ముందు శ్వేత పత్రం పెట్టి ఏం చేయాలో చర్చించండని ఒక్క మాట చెప్పి వుంటే జనం అర్ధం చేసుకొని వుండేవారు. తమ నిర్ణయం తాము తీసుకొని వుండేవారు.

     అటువంటి సదవకాశాన్ని చంద్రబాబు చేతులారా పోగొట్టుకున్నారు. వుపాధి హామీ పధకం కింద జనానికి పని కల్పించినా లేకపోయినా, బాబొస్తే జాబొస్తుందని ఎదురు చూస్తున్న జనాలు గోళ్లు గిల్లు కుంటూ కూర్చున్నా, వున్న వుద్యోగాలు కూడా వూడగొడుతున్నారని అనేక మంది చిరుద్యోగులు నిస్సహాయులైన స్ధితిలో వున్నా, వెంకయ్య నాయుడు చెప్పినట్లు ఎవరికైనా దేవదూతేమో గాని తమకు మాత్రం మాత్రం సైతాన్‌గా పరిణమించారని నరేంద్రమోడీ గురించి ఆంధ్ర ప్రదేశ్‌ జనం భావిస్తున్న తరుణంలో చంద్రబాబు వుభయుల పక్షాన ప్రతిపక్షాలకు మాత్రం చేతి నిండా పని కల్పిస్తున్నారు. సమీప భవిష్యత్‌లో తనను సవాలు చేసే ప్రతిపక్ష పార్టీ ఏదీ లేదని, జనం విసుక్కున్నా, తిట్టుకున్నా తిరిగి తనకు తప్ప మరొకరికి పట్టం కట్టే అవకాశం లేదన్న ధీమాతో చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారా ? గతంలో కాంగ్రెస్‌ కూడా ఇలాంటి చులకన భావంతోనే ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించి ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో తెలియంది కాదు. గతం మాదిరి కాకపోయినా, పాత్రలు మారినా కొత్త రూపంతో చరిత్ర పునరావృతం కాక తప్పదు.

     గతంలో చంద్రబాబు ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు, అదేమిటంటే ఎన్నికలపుడు మాత్రమే రాజకీయాలు చేస్తాను, మాట్లాడతానని మిగతా సమయాలలో రాష్ట్ర అభివృద్ధి తప్ప తనకు మరొకటి పట్టదని, ప్రతిపక్షాలు ప్రతిదానిని రాజకీయం చేస్తున్నాయని ఆరోపించేవారు. ఒకవైపు గత రెండు సంవత్సరాలుగా దేశ, విదేశాలలో పెట్టుబడులు కోసం తిరిగిన దారి ఖర్చులు తప్ప పర్యటనలు ఏ మేరకు ఫలించాయో కనిపించటం లేదు. తరుణం రాక ముందే కూసిన కోయిల మాదిరి కొత్త రాజధాని నిర్మాణానికి ఐదు లక్షల కోట్ల రూపాయలు కావాలని రాష్ట్రం విడిపోక ముందే కోరిన చంద్రబాబు కేంద్రం నుంచి ఐదువేల కోట్ల రూపాయలు కూడా తీసుకురాలేక, వచ్చిన డబ్బుతో తాత్కాలిక రాజధాని కడుతున్నారని జనం సానుభూతి చూపుతున్నారు. తొలి బిడ్డ పెళ్లికి అవసరమైన డబ్బు సంగతి తేల్చుకోకుండానే అన్నీ కుదుర్చుకొని, చివరకు ముహూర్తాలు కూడా పెట్టుకొని పనులు మొదలు పెట్టిన తరువాత అప్పు ఇస్తానన్న వారు సొమ్ము ఇవ్వకపోతే ఆ గృహస్థు పరిస్థితి ఎలా వుంటుందో ప్రత్యేక రాష్ట్ర హోదా గురించి జనానికి కలిగించిన ఆశలు కూడా అలాగే కల్లలయ్యాయి. అప్పు ఇస్తామన్న వారు కనీసం మధ్యవర్తితో అయినా కొద్ది రోజుల ముందు డబ్బు సర్దుబాటు కాలేదు ఇవ్వలేకపోతున్నాము వేరే చూసుకోండని కబురు చేస్తారు. అదేమి చిత్రమో ఐదు కోట్ల ఆంధ్రప్రజలు ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తున్న ప్రత్యేక హోదా, లోటు నిధుల భర్తీ , పాకేజ్‌ల గురించి ప్రధాని నరేంద్రమోడీ వులకరు పలకరు, అవుననీ చెప్పరు కాదనీ చెప్పకపోగా ఇప్పటికే చాలా ఇచ్చామని పార్టీ వారి చేత చెప్పిస్తున్నారు, ఎవరైనా ప్రశ్నిస్తే ఇచ్చిన దానికి లెక్కలు చెప్పమంటున్నారు. ప్రత్యేక హోదా గురించి వూరించి చివరికి పొమ్మనకుండా పొగబెట్టినట్లు, ఇంక దాని గురించి అయితే న్యూఢిల్లీ రావద్దు అని జనానికి బాగా స్పష్టమయ్యే రీతిలో సందేశాలు పంపారు.

     ఇటువంటి స్ధితిలో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. దీనికంటే మౌనంగా దీక్ష చేసి వుంటే అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో పాటు అధోగతి పాలు చేస్తున్న బిజెపి గురించి కూడా చంద్రబాబు ఆగ్రహంతో వున్నారని అయినా జనం అనుకొనే వారు. చంద్రబాబు చెబుతున్నట్లు అసాధారణ రీతిలో అప్రజాస్వామికంగా పార్లమెంట్‌లో ఎలా విభజన బిల్లును ఆమోదించిదీ పదే పదే చెప్పనవసరం లేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో అదేగా చెప్పారు. ఇప్పుడు ఆ కాంగ్రెస్‌లేదు, అలాంటి పని చేసిన వారికి రాష్ట్ర శాసన సభలో కనీసం ప్రాతినిధ్యం కూడా లేకుండా జనం తగిన విధంగా తీర్పు నిచ్చారు. అంతటితో ఆ అధ్యాయం ముగిసింది. ఇంకా చంద్రబాబు దాని గురించి మాత్రమే మాట్లాడితే ఆయన విశ్వసనీయత సమస్య తలెత్తుతుంది. రెండు కళ్ల సిద్దాంతాలు చెప్పి విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ చరిత్ర చెరిగిపోదు. పార్లమెంట్‌లో చట్టం చేస్తున్న సమయంలో కాంగ్రెస్‌ ఒక్కటే లేదు, అంతకంటే ఎక్కువ హడావుడి చేసిన బిజెపి ఏం చేసింది? పోనీ వారేమీ చిన్న పిల్లలు, తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టిన వారు కాదే. అందువలన చంద్రబాబు చెప్పినట్లు సంబరాల బదులు విభజన కారణంగా జరిగిన అన్యాయానికి దీక్షలు చేయాల్సి రావటానికి కాంగ్రెస్‌ ఎంత కారకురాలో బిజెపి కూడా అంతే బాధ్యురాలు. కాంగ్రెస్‌ అధికారం నుంచి పోయింది. ఇంకా మూడు సంవత్సరాలు అధికారంలో కొనసాగాల్సిన బిజెపికి న్యాయం చేయాల్సిన బాధ్యత లేదా ? అలాంటి పార్టీతో స్నేహం కొనసాగించాలా లేదా అనేది తెలుగు దేశం పార్టీ ఇష్టం. తమ్ముడు తమ్ముడే న్యాయం న్యాయమే బిజెపి కూడా ఏపికి న్యాయం చేయలేదు అనే మాట చెప్పటానికి నోరు రావటం లేదే. అవ్వతో వసంత మాడినట్లు అన్నీ అయి పోయిన కాంగ్రెస్‌ను మాత్రమే విమర్శిస్తే అది జనాన్ని మభ్యపెట్టే రాజకీయం తప్ప మేలు చేసేది కాదు.

    విభజన చేసి అప్పులు మాత్రమే జనాభా దామాషాలో పంచారు, ఆస్థులు మాత్రం ఎక్కడివి అక్కడే అన్నారని చంద్రబాబు మాట్లాడుతున్నారు. సచివాలయం, ఇతర ప్రభుత్వ భవనాలను తరలించుకుపొమ్మని చెబితే చంద్రబాబు తీసుకు వస్తారా? అనేక రాష్ట్రాలను విడగొట్టారు. ఎక్కడైనా ఎక్కడి ఆస్థులు అక్కడే వుంచారు, అప్పులు పంచారు తప్ప మరొక పద్దతిని పాటించలేదు. పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా, మరో పదేండ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా దేశంలో ఒక రికార్డు సృష్టించిన చంద్రబాబుకు నిజంగా ఈ మాత్రం తెలియదా ? తెలిసినా ఎందుకు ఇలాంటి అంశాలను జనం మెదళ్లకు ఎక్కిస్తున్నారు ? ఒక సీనియర్‌ రాజకీయవేత్తగా విశ్వసనీయత కోల్పోవటం, పోసుకోలు కబుర్లకు తప్ప దాని వలన ఆంధ్రప్రదేశ్‌కు ఏమైనా వుపయోగం వుంటుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అయిననూ పోయి రావలె హస్తినకు…..

18 Wednesday May 2016

Posted by raomk in AP, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, Chandrababu Delhi mission, Narendra Modi, special status to Andhra pradesh, tdp

చంద్రబాబు ఢిల్లీ యాత్ర విఫలం !

ఎం కోటేశ్వరరావు

   అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు మరోసారి హస్థినాపురి పర్యటనకు వెళ్లి వచ్చారు. జూదంలో ఓడిపోయిన పాండవులకు చివరకు ఐదు వూళ్లు కాదుకదా సూదిమోపినంత స్థలం కూడా ఇచ్చేది లేదని కౌరవులు చెప్పినట్లుగా కేంద్రమంత్రులు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా గురించి ఎంతో స్పష్టంగానే చెప్పారు. కాదని చెప్పటానికి మీరెవరు. అవునన్నా కాదన్నా అగ్రజుడితోనే మాట్లాడి అమీతుమీ తేల్చుకుంటా అన్నట్లగా చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు, తిరిగి వచ్చారు. సాధించేదిమిటి అన్నది అర్ధంగాక రాష్ట్ర జనం జుట్టుపీక్కుంటున్నారు. తెలుగుదేశం వీరాభిమానులు కూడా వారిలో వుంటారు. కసు ఓడిపోయిన వారు కోర్టులోనే ఏడిస్తే గెలిచిన వారు ఇంట్లో ఏడ్చినట్లుగా వారు బయట పడరు అదే తేడా. ప్రధాన మంత్రిని కలిసిన తరువాత చంద్రబాబు నాయుడు మాట్లాడింది విలేకర్లందరితో ఒకేసారి, ఒకటే అయినా ఒకే పత్రికను చదివితే ఆయనేం మాట్లాడిందీ పూర్తిగా తెలియని స్థితి.

    చంద్రబాబు నాయుడు గతంలో చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వ పత్రిక ‘సాక్షి ‘(దాని ఆస్థులు ప్రభుత్వ ఆధీనంలో వున్నాయన్నారు కనుక) పత్రిక ‘ హోదాతో ఏం వస్తుంది ‘ అని చంద్రబాబు అన్నట్లు శీర్షిక పెట్టింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి చెప్పినట్లు ‘ ఆ రెండు ‘ పత్రికలలో ఒకటైన ‘ఆంధ్రజ్య్రోతి’ ‘కేంద్రానిదే బాధ్యత ‘ అనగా ‘ఈనాడు’ ప్రత్యేక హోదాపై ఆందోళన వద్దు ‘ అని ‘ప్రజాశక్తి ‘ చట్టంలోని అంశాలే ‘ అని పేర్కొన్నది. మొత్తం మీద రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది అనే దింపుడు కళ్లం ఆశను కూడా చంద్రబాబు తీర్చేశారు. రాష్ట్ర రాజకీయాలలో ఇదొక పెద్ద మలుపుకు నాంది. రాబోయే రోజుల్లో రాష్ట్రం రాజకీయం ఏ రకంగా వుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. వ్యూహాలు పన్నటానికి ప్రతి పార్టీ కొంత సమయం తీసుకోవచ్చు.లేస్తే మనిషిని కాదు అన్నట్లు ఫోజు పెడుతున్న పవన్‌ కల్యాణ్‌ వంటి వారు ఎలా లేస్తారు ? తెలుగుదేశం-బిజెపి తెగతెంపులు చేసుకుంటే పరస్పరం లాభమని భావిస్తాయా, కలిసి వుంటేనే కలదు సుఖం అనుకుంటాయా అన్నది స్పష్టం కావటానికి సమయం పట్టవచ్చు.

    దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియనట్లు ప్రత్యేక హోదా గానీ, ప్రత్యేక పాకేజీ కూడా రాదని చంద్రబాబుకు తెలిసినంతగా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు.గతేడాది రాజధాని శంకుస్థాపనకు ప్రధాని రాక సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక పాకేజిని అడిగినట్లు ప్రకటించి ప్రతిపక్షాల విమర్శలు ఎదుర్కొన్నారు. తరువాత నష్ట నివారణ చర్యగా తాను పొరపాటున హోదాబదులు పాకేజి అన్నానని సవరించుకున్నారు. కేంద్రంపై వున్న భ్రమలు, దింపుడు కళ్లం ఆశతో వున్నారని అప్పుడే వెల్లడైంది. అందువలనే గత రెండు సంవత్సరాలుగా ఎవరైనా కెలికితే తప్ప సాధ్యమైన మేరకు వాటి ప్రస్తావన రాకుండా చూసుకున్నారు, ఒక వేళ వచ్చినా బి పాజిటివ్‌ అన్న ధోరణిలో మాట్లాడారు. ఎంతైనా తెలివైన రాజకీయవేత్త కదా ! హోదా వచ్చినా పెద్దగా ఒరిగేదేమీ వుండదని జనానికి, హోదారాకపోయినా కనీసం ఆర్ధికంగా మంచి పాకేజి ఇచ్చినా సరిపెట్టుకుంటామన్నట్లుగా కేంద్రానికి అనేక సంకేతాలు పంపారు. మరోవైపు రాజధాని నిర్మాణం, విదేశాల నుంచి భారీఎత్తున పెట్టుబడుల పేరుతో పెద్ద హంగామా సృష్టించారు. ఎన్నిదేశాలు తిరిగినా ,ఎవరితో కూర్చున్నా వూసులు తప్ప కాసుల రాశులు రావటం లేదు. మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌, మా యింటికొస్తే మాకేం తెస్తావ్‌ అన్నట్లుగా ప్రతివారూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే పెట్టుబడుల కోసం పోటీ పడని రాష్ట్రం లేదని వారికీ అర్ధం అయింది. ఎవరైనా వూరికి దూరంగా ఇల్లు కడుతుంటే సామాన్లు వేసుకోవటానికి అవసరమైన తాత్కాలిక షెడ్డు వేసుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు ఏకంగా తాత్కాలిక రాజధాని నిర్మాణానికే వందల కోట్ల రూపాయలు తగలేస్తున్నారు. అంటే శాశ్వత రాజధాని శంకుస్థాపన దగ్గరే ఆగిపోతుందన్నది స్పష్టం. తనను సవాలు చేసే బలమైన ప్రతిపక్షం లేకపోయినా తాను సృష్టించుకున్న సమస్యలే ఎంతో బలంగా చంద్రబాబును నిలదీస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

    ప్రత్యేక హోదా, ప్యాకేజీల వంటివి ఏమీ రాకపోయినా జనాన్ని ఏదో విధంగా జోకొట్ట వచ్చు, అందుకు గాను ముందు ప్రతిపక్షం లేకుండా చూసుకోవాలన్నది చంద్రబాబు చాణక్యంగా కనిపిస్తోంది. ఒక వేళ బిజెపి తనను వదలి పెట్టి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే దానికి అంత సీన్‌ లేదని అందరికీ తెలుసు. అందులోనూ ఐదు కాదు పదేండ్లు ప్రత్యేక హోదా అని పార్లమెంట్‌లోపలా, వెలుపలా హడావుడి చేసిన పార్టీ అది. చివరికి నిధులు ప్రత్యేక నిధులు కూడా ఇవ్వకుండా బిజెపి ఏ మొహం పెట్టుకొని ఓటర్ల వద్దకు వెళుతుంది.అందులోనూ దానిలో కాంగ్రెస్‌ ముఖాలే కనిపిస్తాయి. చంద్రబాబు అంచనా ప్రకారం కాంగ్రెస్‌ కోలుకోలేనంతగా దెబ్బతిన్నది, దానిని పునరుద్ధరించే నాయకత్వం కూడా లేదు. వైఎస్‌ఆర్‌సిపి నేత జగన్‌ విఫల ప్రతిపక్ష నేత. ఆ పార్టీని మరింతగా దెబ్బకొట్టటానికి ఒక పధకం ప్రకారం ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఇంకా ఎవరెవరో వస్తారని మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారు. అన్ని పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి తెలుగు దేశం పార్టీని కూడా ముఠాలతో మునిగి వుండే మరొక కాంగ్రెస్‌ పార్టీగా తయారు చేసినా ఒకరి జుట్టును మరొకరికి ముడివేసి తాను చక్రం తిప్పవచ్చు. వైఎస్‌ఆర్‌సిపిని బలహీన పరిస్తే పరిపాలనలో తాను వైఫల్యం చెందినా మరొక ప్రత్యామ్నాయం వుండదు కనుక బొటాబొటా మెజారిటీతో అయినా జనం తమను తప్ప మరొకరిని ఎన్నుకొనే అవకాశం లేదన్న అంచనాతో వున్నట్లు చెబుతున్నారు. అయితే రాజకీయ నేతలు వూహించిన విధంగా పరిణామాలు వుంటాయని చెప్పలేము. అందుకు ఒకసారి వెనక్కు తిరిగి చూడాలి. అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తరువాత జరిగిన ఎన్నికలలో జనతా పార్టీ గణనీయంగా ఓట్లు సంపాదించినప్పటికీ సీట్లు పొందటంలో విఫలమైది. 1978 అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ తరఫున ఎన్నికైన ఒకరిద్దరు తప్ప మిగిలిన వారందరినీ కాంగ్రెస్‌ తనలో కలిపేసుకొని ప్రతిపక్షం లేకుండా చేసుకుంది. అయితే తెలుగు దేశం రూపంలో తన ఏకపక్ష పాలనకు తెరదించే రోజులు వస్తాయని కాంగ్రెస్‌ నాయకత్వం ఆనాడు కనీసంగా వూహించలేదు. చంద్రబాబు నాయుడు కూడా అదే పరిణామాలను పునరావృతం చేస్తూ వైఎస్‌ఆర్‌సిపి దుకాణాన్ని ఖాళీ చేస్తున్నారు. ఆయన వూహిస్తున్నట్లు లేదా చెబుతున్న విధంగా విధిలేక జనం తననే ఎన్నుకుంటారా ? ఊహించని విధంగా కొత్త శక్తులు రంగంలోకి వస్తాయా ? ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు ?

     దేశంలోని కరవు పరిస్థితులపై సుప్రీం కోర్టు చీవాట్లు వేసిన తరువాత కేంద్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతున్న క్రమంలో భాగంగానే చంద్రబాబును ఢిల్లీకి ఆహ్వానించారు తప్ప ప్రత్యేక హోదా గురించి చర్చించటానికి కాదు అన్నది తెలుసుకోవాలి. ఈ సందర్బాన్ని చంద్రబాబు వుపయోగించుకొని ప్రధానితో ప్రత్యేకంగా భేటీ అయి ప్రత్యేక హోదా, ఇతర ఆర్ధిక సమస్యలను గురించి నివేదించారు. దీన్ని గురించి కూడా అధికారిక ప్రకటనేమీ లేదు. లీకుల సమాచారమే. ఎందుకంటే నరేంద్రమోడీ, చంద్రబాబు ఇద్దరు మాత్రమే మాట్లాడుకున్నారు. వారి మధ్య ఏం నడిచిందన్నది ఎవరో ఒకరు ఏదో రూపంలో ఎక్కడో అక్కడ వెల్లడించి వుండాలి. ఈ భేటీ గురించి ఒక పత్రికలో ప్రధానితో చంద్రబాబు సూటిగా మాట్లాడారని రాశారు అంటే చేతులు నలుపుకోకుండా గట్టిగా అడిగారనే అర్ధం ధ్వనించే విధంగా. ఒక ప త్రిక పదినిమిషాలే సమయం ఇచ్చినప్పటికీ రెట్టింపు సమయం మాట్లాడినట్లు రాస్తే మరొక పత్రిక అరగంట సేపు అని రాసింది. ఏది నిజం.

   మొత్తం మీద హోదా, నిధుల గురించి నెపాన్ని కేంద్రంపై నెట్టేందుకు తెలుగు దేశం నాయకత్వానికి మార్గాలు వెతికేందుకు మరికొంత కాలం గడపవచ్చు. ఇప్పటికే తెలుగుదేశంపై ధ్వజమెత్తుతున్న బిజెపి రానున్న రోజులలో మరింతగా తెలుగుదేశం పార్టీని రెచ్చగొట్టి నెపం మోపేందుకు ప్రయత్నించవచ్చు. మంగళవారం నాడు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు విలేకర్లతో మాట్లాడిన అంశాల తీరు తెన్నులను చూస్తే బిజెపికి వ్యతిరేకంగా సెంటి మెంట్‌ను రెచ్చగొట్టే ధోరణి కనిపించింది. రాష్ట్రానికి అన్యాయం చేసిందని పదే పదే కాంగ్రెస్‌ను ఆడిపోసుకుంటున్న చంద్రబాబు మరి బిజెపి సంగతి ఏమిటంటే తాను ఎన్నికలపుడే రాజకీయాలు మాట్లాడతానని తప్పించుకున్నారు. అన్ని పార్టీలు తనకు మద్దతు ఇవ్వాలని మరొక మాట. మొత్తం మీద ప్రధానితో మాట్లాడిన తరువాత గందరగోళానికి, వత్తిడికి గురైనట్లు ఆయన మాటలు వెల్లడిస్తున్నాయి.ఎవరికి ఏమైనా రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చంద్రబాబుకు ఓ అభిమాని బహిరంగ లేఖ

03 Tuesday May 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Modi, Narendra Modi, special status to Andhra pradesh, YS jagan

బాబు గారూ మీరు మెతక మనిషని ఎవరన్నారు ?

      చంద్రబాబు నాయుడు అంటే రాజకీయంలో అపర చాణుక్యుడు, సర్దార్‌ పటేల్‌ కంటే గట్టి పిండం, గ్రీకు వీరుడు హెర్క్యులస్‌ను మించిన బలశాలి అనుకుంటున్న మీ అభిమానులను ఒక్కసారిగా నాగలోకం నుంచి నక్కల మధ్య పడేశారు. సందేహ సముద్రంలో ముంచేశారు. నేను మెతక మనిషినేం కాదు, ధృడచిత్తంతో వున్నాను అని స్వయంగా మీరు చెప్పటంతో మా చిత్తాలు చిత్తడి అయిపోతున్నాయి. బాబు గారూ అసలు మీరు మెతక మనిషని ఎవరన్నారు ? మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేసుకుంటారు ? వైఎస్‌ రాజశేఖరరెడ్డితో పోటీ పడి వస్తున్నా మీ కోసం పేరుతో మీరు చేసిన పాదయాత్ర మెతక మనుషులకు సాధ్యమా ? బిజెపి, నరేంద్రమోడీ పట్ల ఒకసారి కఠినంగా మరోసారి మెతకగా వున్నట్లు మీపై విమర్శలు వస్తే వచ్చి వుండవచ్చుగాక, అవి రాజకీయాలు, నిరంతరం మీరు కలలు కనే రాష్ట్రం కోసం తప్ప మీ మెతక తనానికి నిదర్శనాలు ఎలా అవుతాయి ? మామ అని కూడా చూడకుండా ఎన్‌టి రామారావు పట్ల కూడా ఎంత కఠినంగా వ్యవహరించారో మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసిన మాకు మీరు మెతక మనుషులని అనుకోవటానికే ఏదోగా వుంది.

    అసలు మీకు ఏమైంది ? మీరు ఏనుగు వంటి వారు. ఒక వేళ ఎప్పుడైనా ఎవరైనా రాజకీయ ప్రత్యర్ధులు మీ వెనుక ఏదో అంటే మిమ్మల్ని సమర్ధించటంలో మీ మంత్రులు సరిగా వ్యవహరించనందుకు మందలించారని పత్రికల్లో వార్తలు వచ్చాయి గానీ మా వంటి అభిమానులు ఎక్కడైనా తగ్గినట్లు విన్నారా? మేం ఎన్నడైనా అంగీకరించామా? లేదే ! అటువంటిది నేను మెతక మనిషిని కాదు అని బేలగా, జాలిగా మీరు అనటం ఏమిటి బాబూ ! మేం ఏం కావాలి ? కష్టపడటం నా తప్పా అని మీరు అంటుంటే చివరికి మనప్రత్యర్ధి వైఎస్‌ఆర్‌సిపికి, జగన్‌కు సైతం ఇలాంటి పరిస్థితి రాకూడదురా బాబూ అన్నట్లు మా కడుపు తరుక్కు పోతోంది.

   మిమ్మల్ని (మనల్ని )నమ్ముకొని అనేక మంది తమ నియోజకవర్గాలను కూడా తెల్లారేసరికి సింగపూరో, మలేషియానో, జపానో, అమెరికాగానో మార్చేద్దామనే కదా వైసిపినుంచి ఎంఎల్‌సీలు, ఎంఎల్‌ఏలు, కాంగ్రెస్‌ నుంచి గాదె వెంకట రెడ్డి వంటి నేతలు సైతం పార్టీకిలోకి ప్రవాహాలుగా వస్తున్నారు.నేను మెతక మనిషిని కాదు అన్న మాట ఏ వుద్ధేశ్యంతో అన్నారో గానీ లేస్తే మనిషిని కాదు అన్న కుంటి మల్లయ్య సామెతను గుర్తుకు తెస్తోందని ప్రతిపక్ష పార్టీల వారు అంటుంటే అటు కాదనలేక ఇటు అవుననలేక మేం మెత్తపడక పడక తప్పటం లేదు. రెండు సంవత్సరాలు చూశాం కేంద్రంలో మంత్రి పదవులు అనుభవించటం తప్ప రాష్ట్రానికి ఏం పనులు జరిగాయి, ఏం పీకారు అంటుంటే వెర్రి మొహాలు వేసుకొని ఇంకా ఎంతకాలం సమర్ధించాలో అర్ధం కావటం లేదు. దీనికి తోడు పార్టీ అధికారానికి వస్తే గడ్డ పెరుగు ముక్కల మాదిరి తిందామని అనుకుంటుంటే ఎదుటి పార్టీల నుంచి ఎందరు వస్తే అంత మందినీ కలుపుకోండని, అంతా మనమంచికే అని చెబుతున్నారు. మీకేం బాబూ ! మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుంది. గత ఎన్నికలలో ఎంత ఖర్చు చేశామో మీకు తెలియనిది కాదు. ఇది ఎప్పుడూ వుండేదే . కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుపోతుంది. ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి, ఎన్నికల సమయంలో వున్న కార్యకర్తల కంటే తరువాత ఫిరాయించిన వారు ముద్దు , ఓడమల్లయ్య బోడి మల్లయ్య వంటి ఈ విషయాల గురించి తరువాత మరోసారి విన్నవించుకుంటా.

    మన రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధికారుల నుంచి ప్రధానికి సరైన సమాచారం అందుతోందా లేదా అనే సందేహాన్ని వ్యక్తం చేసినట్లు వార్తలు చదివాం. బాబు గారూ మీరు ఒక జాగ్రత్త తీసుకోవాలి. మీరు బాగానే చేస్తున్నా మంత్రులు, అధికారులు సక్రమంగా లేరని మన శ్రేయోభిలాషుల మాదిరి వుండే కొందరు జర్నలిస్టులు రాసిందానిని నిజమే అని గతంలో నమ్మారని ఇప్పుడూ అనుకుంటున్నారని వింటున్నాం. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమంటే అదే జర్నలిస్టులు ఇటు మిమ్మల్ని, అటు కేంద్రంలో అంతకంటే ప్రధాన మంత్రిని ఎక్కువగా సమర్ధిస్తున్నారు. అందువలన కేంద్ర అధికారులు ప్రధానికి సరిగా తెలియచేయటం లేదనే పాట మీ కోసం కాదేమో చూడండి. లేక ప్రధాని మీద మాట పడకుండా మిమ్మల్ని ‘సంతృప్తి ‘ పరుస్తున్నారా? బిజెపికి సంతృప్తి రాజకీయాలు గిట్టవని తెలుసు కదా ! జర జాగ్రత్త, జనం నమ్మేట్లు లేరు. ఆంధ్రప్రదేశ్‌ విషయంలో కేంద్ర మనోగతం ఏమిటో అర్ధం కావటం లేదు, కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారా లేక సమస్య తీవ్రత తెలియక పట్టించుకోవటం లేదా అన్నది అర్ధం చేసుకోలేకపోతున్నాం. వెళ్లి కలిసినపుడు బాగా మాట్లాడుతున్నారు, కాని ఫలితం రావటం లేదు అన్నారు.

   ముందు మన శాసన మండలి, అసెంబ్లీ తీర్మానాలు చేయటమేనా, అసలు వాటిని మన అధికారులు కేంద్రానికి పంపారా ? అన్న అనుమానం కలుగుతోంది. మరి పంపితే వాటికి వచ్చిన సమాధానాలు ఏమిటి , మన మంత్రులు, ఎంపీలు కలిసినపుడు ఏం చెప్పారు. మన అధికారులు వచ్చిన వర్తమానాలను పూర్తిగా చూపటం లేదా అన్న సందేహం తలెత్తుతోంది. పార్లమెంట్‌లో సమాధానాలు, ఇతర లోగుట్టు కధనాల పేరుతో రాసిన వార్తలు తప్ప మాకు నిజం తెలియటం లేదు. రాష్ట్రం పంపిన తీర్మానాలేమిటి ? వాటికి కేంద్రం నుంచి వస్తున్న సమాధానాలు ఏమిటో అధికారికంగా తెలియచేస్తే అభిమానులం మేం కూడా ఒక పట్టు పడతాం కదా? అదేం వుండటం లేదు. అసలూ మనకు కేంద్రంలో ఇద్దరు మంత్రులు, ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధులు కూడా వున్నారు. వారు రోజూ కేంద్రంతో సంప్రదించవచ్చు. మరి వారేమి చేస్తున్నట్లు ? మీరు అనేక సార్లు ప్రధాన మంత్రిని కలిశారు. మీకేమో గుజరాతీ, హిందీ రాదు, ఆయనకేమో తెలుగు రాదు. అందువలన అసలు మీరు ఏ భాషలో మాట్లాడుకున్నారు అన్న అనుమానం కలుగుతోంది. ఆవో బాబూ ఆవో మై హూనా కాఫీ, చాయ్‌ పానీ పీనేకే బాద్‌ తుమ్‌ ఏపి జావో, బాద్‌మే అచ్చే దిన్‌ ఆ రహా హయ్‌ అంటే మీరు మంచిగా మాట్లాడుతున్నట్లు అనుకుంటున్నారా ఏమిటి ? ఇలా అయితే మీరు మరో 30 సార్లు ఢిల్లీ వెళ్లినా ఇదే జరుగుతుందన్న నీరసం వస్తోంది మాకు. మీరు నిరాశగా మాట్లాడటం చూస్తుంటే ఏదో దాస్తున్నట్లు , చెప్పుకోలేని బాధ, కేంద్రంలో మీకు అవమానం జరిగిందేమో అన్న అనుమాన బీజం మాలో పడింది.

    కేంద్రంలో వున్న మన వెంకయ్య నాయుడు గారేమో తాను రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ ఒక సమస్య పరిష్కారమో, కొత్త పధకమో తెస్తున్నట్లు చెబుతారు.ప్రధాని ఆయన ఎంత చెబితే అంత అంటారు. మీరేమో ప్రధాన మంత్రి దృష్టిపెడితే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయంటున్నారు.అంటే మీరు ప్రధాని దృష్టిని, కనీసం తోటి వెంకయ్య నాయుడి దృష్టిని సైతం ఆంధ్రప్రదేశ్‌పై మళ్లించటంలో రెండు సంవత్సరాలుగా విఫలమయినట్లేనా అన్న వూహనే తట్టుకోలేకపోతున్నాము.

    ఇంతవరకు జరిగిందానిని బట్టి, అనేక రాష్ట్రాలలో జరుగుతున్నదానిని బట్టి మన వంటి వారిపై ఆధారపడే కంటే స్వంతంగా బలపడాలని, అందుకు గాను వచ్చే ఎన్నికల నాటికి బిజెపిని మరింత బలపరుచుకోవాలన్నది మోడీ లక్ష్యంగా కనిపిస్తోంది.ఎదుటి పార్టీ వారిని ఆకర్షించటం మాకూ చేతనవును అని అనేక రాష్ట్రాలలో చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది మీకు అర్ధం అయ్యేట్లు చేయాలని బిజెపి నేతలకు అర్ధం అయింది. ఈ విషయం మీకు అర్ధం అయినా మరొక దారి లేక బింకాలు పోతున్నారని జనం చెవులు కొరుక్కుంటున్నారు.

    బిజెపి రాష్ట్ర నేతలు కేంద్రం అన్ని విధాలుగా సాయం చేస్తున్నది అనే ప్రచారం క్రమంగా పెంచుతున్నారు. కేంద్రం సహకరించినా దానిని వినియోగించుకోవటంలో బాబు గారు విఫలమయ్యారు కనుక ఒక అవకాశం మాకే ఇవ్వండి అని వారు ముందుకు వస్తారా ? వస్తే మన పార్టీలో ఎందరు మిగులుతారు అన్నవి ప్రస్తుతానికి వూహా జనిత ప్రశ్నలే కావచ్చు కానీ, ప్రస్తుతం మన వంటి పార్టీల నేతలు డొల్లుపుచ్చకాయల వంటి వారు, ఎటైనా దొర్ల వచ్చు. ఇంతకు ముందు మన పార్టీలో కాంగ్రెస్‌ రక్తం ఎంత వ్యతిరేక రక్తం ఎంత అని కొలిచేవారు, ఇప్పుడు కాక్‌టెయిల్‌ మందు మాదిరి, ఏది ఎంతో తెలియటం లేదు.

   చివరగా ఒక్క మాట. అధికారంలో లేనపుడు అభిమానుల సూచనలు పట్టించుకుంటారని, అధికారం వచ్చిన తరువాత ఇతరుల మాటలు వింటారని మీ గురించి గిట్టని వారూ, గిట్టే వారు కూడా చెబుతుంటారు. ఈ సంవత్సరం కూడా నవ నిర్మాణ దీక్ష చేపడతామని ప్రకటించారు.ఏదో తొలి ఏడాది దీక్ష అంటే అర్ధం వుంది, ప్రతి ఏడాదీ దీక్షలేమిటంటే ఏం చెప్పాలి. ప్రతిపక్ష నాయకులు దీక్షలు చేయటం అంటే అర్ధం వుంది. అధికారంలో వున్నవారు దీక్షలు చేస్తే చాలా బాగోదు. బరువు తగ్గటానికైతే ఓకే. ప్రత్యేక తరగతి రాష్ట్ర హోదా, రైల్వే జోన్‌, లోటు బడ్జెట్‌ పూడ్చేందుకు సాయం వంటి వాటిపై దీక్ష చేస్తేనన్నా ప్రధాని రాష్ట్రం వైపు దృష్టి పెడతారేమో చూడండి బాబు గారూ.ప్రావిడెంట్‌ ఫండ్‌ వుపసంహరణ, వడ్డీ తగ్గింపుపై కార్మికుల తడాఖాను చూసిన తరువాతే ప్రధాని వాటిపై దృష్టి సారించారు.వెనక్కు తగ్గారు. కేసుపోయినా మన ప్లీడరు గట్టిగా వాదించాడు అని వచ్చే ఎన్నికలలో మేమంతా చెప్పుకోవటానికి దారులు వెతుక్కోవటం మంచిదేమో చూడండి మరి.

    వుంటా బాబూ ! రెండు సంవత్సరాల నుంచి మన రాష్ట్రం, మన అమరావతి , మన ఇటుకలు, మన మట్టి, మన నీరు అంటూ వుత్సాహంతో, వుద్వేగంతో ఎంతో అభిమానంతో ఎదురు చూసిన మా వాడు జాబు గురించి హైదరాబాదో, బెంగలూరో పోవాలంటున్నాడు. దాని సంగతేదో చూడాల, మన అమరావతిలో జాబులు వచ్చినపుడు వాడిని ఇక్కడికే రప్పిస్తాలే, అప్పటి దాకా వుంచుకోలేకం కదా ! ఎంతైనా పెళ్లి కావాల్సిన పిల్లాడు కదా !

మీ అభిమాని

ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ గారికి బహిరంగ లేఖ

13 Wednesday Apr 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 2 Comments

Tags

ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, jana sena party, pavan kalyan, special status to Andhra pradesh

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ గారికి

    మీ అభిమాని ఎం కోటేశ్వరరావు  వ్రాయు బహిరంగ లేఖ. అన్నా ఇలా రాస్తున్నందుకు మీరు అన్యధా భావించవలదు. ఎంతో బిజీగా వుంటారు కనుక లేఖలను మీరు చూసే అవకాశం వుండదు. మీ సిబ్బంది కూడా అభిమానుల లేఖలన్నింటినీ పూర్తిగా చదువుతారో లేదో అనే అనుమానంతో ఇలా రాయాల్సి వస్తోంది. మీరేమీ అనుకోరని అనుకుంటున్నా.

    మీ అభిమానులందరం రాజా గబ్బర్‌ సింగ్‌ కోసం ఎదురు చూస్తూ సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ సినిమా చూస్తూ ఆనందిస్తున్నాం. అన్నదానాలు, ఇతర కార్యక్రమాలు చేస్తున్నాం. మీ (మా) సినిమా విడుదల సందర్బంగా ప్రమోషన్‌లో భాగంగా వివిధ టీవీ చానల్స్‌ , పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో 2019 ఎన్నికలలో పోటీ చేస్తానని ప్రకటించి ఖుషీ కలిగించి అభిమానులలో వున్న అనుమానాలను తొలగించారు. గత రెండు సంవత్సరాలుగా లేస్తే మనిషిని కాను అన్న కుంటి మల్లయ్య మాదిరి మీ పీకె మాటలు తప్ప ఇంతవరకు పీకిందేమీ లేదని అంటుంటే ఎంత గుడ్డి అభిమానులమైనా అడ్డగోలుగా మిమ్మల్ని సమర్ధించలేక, కాదని ఖండించలేక చచ్చిపోతున్నాము. సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని మీకు తెలుసు. రాజకీయాలలోకి వచ్చిన తరువాత ఎవరు ఏమి అన్నా పడాల్సిన పరిస్థితి.ఎన్నికలలో మీ పోటీ ప్రకటన తరువాత ఇప్పటిదాకా మనకు అత్తారింటికి దారేదో చూపిన మీ పవర్‌ స్టార్‌ ఇప్పుడు తన పదవికి మార్గమేదో వెతుక్కుంటున్నాడని కొంత మంది వ్యంగ్యంగా అంటున్నారు. పదవి కోసం పాకులాడని వాడెవడు, అదేపని మా పీకే చేస్తే తప్పేమిటి అని ఎదురుదాడి చేస్తున్నాం. ఇంకా అవసరమైతే వుధృతం చేస్తాం మీరు ఫికరు పడకండి.

   గతంలో తెలుగు దేశం పార్టీ వారు తాము పార్టీ పెట్టిన ఎనిమిది నెలలో అధికారానికి వచ్చామని గొప్పగా చెప్పుకున్నారు. అదొక పెద్ద గొప్పేంటి మే మసలు అధికారానికి వచ్చిన తరువాతే పార్టీ పెట్టామని(జనతా) మరొకరు బదులిచ్చారు. మన ప్రత్యేకత ఏమిటన్నా ? మీరు గత అసెంబ్లీ , పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు పార్టీని ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తామంటున్నారు. ఇది చాలా చిత్రంగా వుందన్నా.

    ఈ మధ్య కాలం ఐదు సంవత్సరాలో ఏం పీకారంటే ఏం చెప్పాలన్నా ! ఎన్నికలపుడు చెప్పుకోవటానికి ఏదైనా వుండాలి కదన్నా. జరిగిందేదో జరిగి పోయింది. ఇప్పటికైనా పార్టీ కార్యక్రమాలు ప్రారంభించితే మంచిది. అన్నా మనలో మాట, హైదరాబాదులో వున్నన్ని రోజులు మరొకచోట ఎక్కడా జీవించలేదని మీరు ఒక మాట అన్నారు. ఇంతకీ మన పార్టీ ఏ రాష్ట్రంలో పోటీ చేస్తుందన్నా, రెండు తెలుగు రాష్ట్రాలలోనా ? ఒక్క ఏపిలోనేనా ? వైఎస్‌ఆర్‌ సిపి, తెలుగుదేశం పార్టీ పాట్లు చూసిన తరువాత జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే మంచిదన్నా.

     ఏపికి ప్రత్యేక హోదా ఇతర విషయాల గురించి మీకింకా గుర్తుందని చెప్పినందుకు ఒకవైపు సంతోషంగా వున్నా మరో వైపు మాత్రం విచారంగా వుందన్నా. పేదరాసి పెద్దమ్మ కథలలో చెప్పే రాజహంస ఎంతో అందంగా వుంటుంది గానీ దానిని ఎవరూ చూసిన వారు లేరన్నా, ఏపికి ప్రత్యేక హోదా కూడా అలాంటిదే అంటున్నారు. అది రాదని మీకు ఎన్ని సార్లు చెప్పాలి పదే పదే అడుగుతారు ఒకసారి చెబితే అర్ధం కాదా అంటూ కేంద్ర మంత్రులు విసుక్కుంటున్నారు, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తద్దినం రోజు తప్ప మిగతా రోజులలో విస్మరించే మాదిరి పట్టించుకోవటం లేదు. జనం కూడా దాని గురించి మరిచి పోయి అంతకంటే మంచి రోజులు వస్తాయని సర్దుకు పోతున్న రోజులలో అదింకా గుర్తుందని మీరెందుకన్నా చెప్పటం.మీరేమైనా అనుకోండి ఇది అశుభ సూచకం అన్నా. జనానికి పట్టని దాన్ని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, నిబంధనలు మారిన కారణంగా ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదని అందరికీ అర్ధమైనా మీ పీకెకు అర్ధం కాలేదా, కాదా అని ఎవరైనా అడిగితే మీరేమో గానీ మేం ఇబ్బంది పడాల్సి వస్తుందన్నా. ఇంతవరకు లేదు అని కేంద్రం చెప్పలేదు కనుక మాట్లాడటం లేదుతప్ప మరొకటి కాదని మీరు చెప్పారు.

     అన్నా ! కాదని కేంద్రం ఎప్పుడు చెప్పేను మీరు ఎప్పుడు నోరు విప్పేను ! అది జరిగేది కాదన్నా ! ఆంధ్రప్రదేశ్‌ అంటే కేవలం ప్రత్యేక హోదా ఒక్కటే కాదన్నా. జనానికి సంబంధించిన సమస్యలు అనేకం వున్నాయి. దేశమంటే మట్టి కాదోయ్‌ మనుషులోయ్‌ అని ఎన్నో పుస్తకాలు చదివిన మీకు మేం చెప్పాలా అన్నా ! రాజకీయ పార్టీలు ముఖ్యంగా మీరు చెప్పిన నిబద్దతగా వుండే కమ్యూనిస్టు పార్టీలు తప్ప మిగతావి ఏనాడన్నా ఫలానిది చేయం అని ఎప్పుడైనా చెప్పాయా అన్నా ? మీకెందుకన్నా ఆ పార్టీల మీద అంత భ్రమ ? లేదు తమ్ముడూ నిజం చెప్పాలంటే మన దగ్గర చెప్పేందుకు ఇప్పుడేమీ లేదు, ఏం చెప్పాలో ఎటు పోవాలో తెలియటం లేదు అందుకే అలా చెప్పి కాలం గడుపుదాం అంటే అభిమానులంగా మేం సరే అనక చస్తామా అన్నా ? అన్నో ! అసలు విషయం మరొకటి వుంది !

    ఇంటర్వ్యూలలో మీకు ఖర్చులు ఎక్కువని, తగినంత ఆదాయంలేక రోజులు గడవటం కష్టంగా వుందని చెప్పారు. పార్టీ కోసం కూడా డబ్బు లేదన్నారు. డబ్బులేనోడు డుబ్బుకు కొరగాడని తెలియనిదేముందన్నా ! అలా అయితే మన పార్టీ వెనుక ఎవరు చేరతారన్నా ? లేదా మీరు చెప్పినట్లు చెప్పిన దానికి కట్టుబడి వుండే కమ్యూనిస్టు పార్టీల మాదిరి సమస్యలపై పని చేసి జనం దగ్గరకన్నా వెళ్లాలి. మీరది చెయ్యరు ఇది చెయ్యకుండా డబ్బు లేదంటే కష్టం అన్నా. తమ్ముడు తనోడు కావచ్చు కాని న్యాయం న్యాయమే అన్నట్లుగా చిరంజీవి మా అన్న కావచ్చు గానీ ఆయన కాంగ్రెస్‌లో వున్న కారణంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించను అని చెప్పారు. అదేంటన్నా ఆలూలేదు చూలు లేదు అన్నట్లు అప్పుడే దారులు మూసేస్తే ఎలా ? ఏ పార్టీ వాసన అంటని వీర భోగ వసంతరాయుళ్లు మన పార్టీకి దొరుకుతారంటావా అన్నా ? మీ దగ్గర డబ్బూ లేక మీ అన్న వంటి వారిని దరిచేరనీయక వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానంటే జనం నమ్మరేమో అన్నా. ఎందుకంటే గతంలో లోక్‌సత్తా జయప్రకాష్‌ నారాయణ వచ్చే ఎన్నికలలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ పై ఎన్నికలలో కేంద్రంలో పదవి చేపట్టటం నా లక్ష్యం అని చెప్పారు. చివరకు లోక్‌సత్తా దుకాణాన్నే ఎత్తివేశారు. మన పార్టీ పరిస్ధితి అలాకాకుండా చూడండన్నా, ఒకవేళ అదే జరిగితే మీరు తిరిగి సినిమాల్లోకి పోతారు, మేం ఏం కావాలో అలోచించండన్నా ? రాజకీయాలలోకి వచ్చి ఎన్నికలలో పోటీ చేసిన తరువాత ఇంక సినిమాలు చేయను అంటున్నారు, వినటానికి బాగానే వున్నా అలాంటి ప్రకటనలు మంచివి కాదేమో, అటూ ఇటూ కాకుండా పోతారేమో చూసుకోండన్నా ?

    ఇక పోటీ విషయానికి వస్తే స్వంతంగా చేస్తారా? బిజెపితో కలుస్తారా ? తెలుగుదేశంతో దోస్తీ చేస్తారా అని వూహాగానాలు మొదలయ్యాయి. కొందరేమో మీకు కులముద్ర వేసి కులానికి పరిమితం చేయాలని చూస్తున్నారు. గత ఎన్నికలలో తెలుగు దేశం, బిజెపికి మీరు అలాగే వుపయోగపడ్డారని అందరూ అనుకుంటున్నారు. ఇపుడు పార్టీల ఫిరాయింపులు, ఎత్తులు, జిత్తులు చూస్తుంటే కుల సమీకరణల చుట్టూ తిరుగుతున్నట్లే కనిపిస్తోంది. తోక, తోరెలు అధికార, ప్రతిపక్ష పార్టీలవైపు సమీకరణయ్యారని, తోకా లమద్దతు ఎవరు పొందితే వారికి వచ్చేసారి అధికారం ఖాయం అన్నట్లుగా లెక్కలు వేసుకుంటున్నారు.(తోక అంటే తోటి కమ్మ, తోరె అంటే తోటి రెడ్డి, తోకా అంటే తోటి కాపు, ఇలా ప్రతి కులానికి ఒక సాంకేతిక నామం) రాబోయే ఎన్నికలలో సినిమా రంగాన్ని కూడా తమవైపు తిప్పుకొనేందుకు పార్టీల ప్రయత్నాలు ప్రారంభమైనట్లు కనిపిస్తున్నాయి అన్నా. చివరిగా మరొక విషయం అన్నా. ప్రతి ఏడాది ఫిబ్రవరి-ఏప్రిల్‌ మధ్య రష్యాలోని సైబీరియానుంచి వలస పక్షులు వచ్చి వెళతాయి. అలాగే ఎన్నికలపుడు మాత్రమే కనిపించేవారిని ఎన్నికల పక్షులని పిలుస్తారన్నా. మీరు ఆ పేరు తెచ్చుకోకుండా జాగ్రత్త పడటం అవసరం అన్నా. వుంటా మరి మరోసారి మరో లేఖ రాస్తా

మీ అభిమాని

ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆనందం-విషాదం

16 Wednesday Mar 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

CHANDRABABU, Narendra Modi sarkar, NDA, special status to Andhra pradesh, Ycp, ycp jagan

ఢిల్లీలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లందనే నినాదంతో వునికిలోకి వచ్చిన పార్టీ అదే ఢిల్లీపై నోరు మెదపలేని స్థితిలో పడిందంటే నిజంగా ఎంత కష్ట కాలం వచ్చింది.బహుశా ఎన్‌టిరామారావు ఈ పరిస్థితిని వూహించి వుండరు.

ఎం కోటేశ్వరరావు

     ఆంధ్రప్రదేశ్‌ శాసన సభలో ప్రభుత్వం మీదా, శాసన సభాపతి మీదా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను చాకచక్యంగా తిప్పి కొట్టగలిగామని తెలుగుదేశం పార్టీలు శ్రేణులు చంకలు కొట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదూ ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా అరటి పండు వలిచి అరచేతిలో పెట్టినట్లుగా చెప్పటంతో తెలుగు తమ్ముళ్లలో ఆనందం ఆవిరై నీరు గారి పోతున్నారు. ప్రత్యేక హోదా లేదని ఎన్నిసార్లు చెప్పినా పదే పదే అడుగుతూ విసిగిస్తున్నారు అర్ధం కాదా మీకు ముందు బయటకు పొండి అన్న రీతిలో కేంద్ర మంత్రి అరుణ్‌ జెట్లీ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం, బిజెపి ఎంపీలతో మాట్లాడినట్లు తెలుగు దేశం పార్టీకి అనుకూలమైన పత్రికలోనే వార్తలు వచ్చాయి. హాస్యాస్పదం, విచారకరం ఏమంటే అది జరిగిన మరుసటి రోజే అలా మాట్లాడితే ఎలా దొరా మంచి మనసు చేసుకొని మా సంగతి చూడండి, మరొక మాట చెప్పండి అన్నట్లుగా విభజస సమయంలో తమకు ఇచ్చిన హామీలు అమలు జరపాలని అధికార తెలుగుదేశం పార్టీ బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కంద్రానికి మరోసారి విన్నవించుకుంది. ఢిల్లీలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లందనే నినాదంతో వునికిలోకి వచ్చిన పార్టీ అదే ఢిల్లీపై నోరు మెదపలేని స్ధితిలో పడిందంటే నిజంగా ఎంత కష్ట కాలం వచ్చింది.బహుశా ఎన్‌టిరామారావు ఈ పరిస్థితిని వూహించి వుండరు.

     ముందుగా ఆనందం గురించి చూద్దాం. ఒకసారి నీతి తప్పిన తరువాత ఎన్నిసార్లు తప్పినా ఒకటే అని తెలుగు దేశం పార్టీ గత రెండు రోజులలో రుజువు చేసింది. తొలిసారి పడితే సిగ్గు. ప్రతిసారీ పడితే అది ఎబ్బెట్టుగా వుంటుంది. కనుక అసలు తొలిసారే సిగ్గు పడనివారు దాని స్థానంలో పండుగ చేసుకోవటంలో ఆశ్చర్యం ఏముంది. గతంలో కాంగ్రెస్‌,బిజెపి ఇతర పార్టీలు చేసినా ఇప్పుడు తెలుగుదేశానికి అయినా అది వర్తిస్తుంది. కాకపోతే సందర్భం తెలుగుదేశం పార్టీ గనుక దాని గురించి ముచ్చటించుకోక తప్పదు. ఇతర పార్టీల అజెండా,గుర్తులపై ఎన్నికైన వారు పార్టీ మారాలనుకుంటే తాము ఎన్నికైన స్థానానికి రాజీనామా చేసి ఇష్టమొచ్చిన పార్టీలో చేరవచ్చు. చేర్చుకొనే వారికి కూడా అభ్యంతరం వుండనవసరం లేదు. ఆ నీతికి కట్టుబడి వుంటే అయినట్లే అని వారూ వీరు అనుకోవటం వలనే ఈ పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీలో చేరిన ఎనిమిది మంది వైసిపి సభ్యులను పార్టీలో చేర్చుకోవటమే రాజ్యాంగం, స్ఫూర్తికి కూడా విరుద్దం. వారిపై ఫిరాయింపు నిరోధక చట్టం వేటు పడకుండా వుండాలంటే అవిశ్వాస తీర్మానాలపై ఓటింగ్‌ సందర్బంగా వారు ఎన్నికైన పార్టీ విప్‌ జారీ చేయకుండా వుండేందుకు తగిన వ్యవధి లేకుండా తక్షణమే అనుమతించి ఓటింగ్‌ కూడా పెట్టి తీర్మానం వీగి పోయిందని సంతోషించారు. వెంటనే సభాపతిపై పెట్టిన అవిశ్వాసంపై అంతకంటే దారుణంగా ముందుగా అసలు నిబంధనలనే ఎత్తివేసి ఓటింగ్‌ పెట్టి రెండోసారి ‘ఘనవిజయం’ సాధించారు. మొదటిది చాణక్యం అనుకుందాం, మరి రెండవది ?

     ఒక తప్పుడు సాంప్రదాయం లేదా పద్దతికి తెరతీశారు. ఇలాంటి చర్య వలన సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు గౌరవం పెరగదు. గాంధీ పేరు గుర్తున్నంత కాలం గాడ్సే కూడా వుంటాడన్నట్లు పార్లమెంటరీ వ్యవస్ధలో చెడు సాంప్రదాయంతో గట్టెక్కిన స్పీకర్‌గా చరిత్రకు ఎక్కారు. స్పీకర్లు పాలక పార్టీకి చెందిన వారిగానే వుంటారు, పైకి ఏం చెప్పినా, నిబంధనలు ఎలా వున్నా పాలకపార్టీని కాపాడటానికి స్పీకర్లు తమ స్థానాలను వుపయోగిస్తున్నట్లు దాదాపు అన్ని శాసనసభల, పార్లమెంట్‌ అనుభవం. అందుకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ అతీతం కాదు. గతంలో తెలుగుదేశం అధికారంలో వుండగా స్పీకర్‌ ప్రవర్తన, దానిపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ రాజశేఖరెడ్డి ఎలా వ్యవహరించారో తెలియంది కాదు. తెలుగుదేశం ప్రతిపక్షంలో వుండగా కూడా అదేపని చేసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీపై దాడిలో భాగంగా ఆ పార్టీకి చెందిన స్పీకరుపై ప్రతిపక్ష వైసిపి నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు అదే ఎత్తుగడలను వుపయోగిస్తోంది. వుత్తమ, చెడు సాంప్రదాయాల గురించి భవిష్యత్‌లో జరిగే చర్చలో అప్పుడు ఇప్పుడూ స్పీకర్‌గా ఎవరున్నారో వారిని ప్రస్తావిస్తారు తప్ప అలాంటి తప్పుడు సలహాలు చెప్పిన వారిని కాదు.

     నిజానికి తెలుగు దేశం పార్టీకి స్పీకరు స్థానాన్ని, దానిలో వున్న గౌరవనీయ సభ్యుడిని ఫణంగా పెట్టాల్సిన అవసరం వుందా ? ఫిరాయించిన వారి మద్దతు లేకపోతే ప్రభుత్వం నిలబడే స్థితి లేదా అంటే అలాంటిదేమీ లేదు. పాలకపార్టీలో లుకలుకలున్నాయా అంటే అదీ లేదు. అంతా సర్దుబాటే తప్ప కుమ్ములాట బాట అవసరం ఏముంది. ఎక్కడ అధికారం వుంటే అక్కడ అనుభవించి తరువాత ఎవరు అధికారానికి వస్తే అభివృద్ది పేరుతో ఆ పార్టీలో చేరటానికి, చేర్చుకోవటానికి తలుపులు బార్లా తెరిచి వుంటాయి గనుక భవిష్యత్‌కూ ఢోకా వుండదని ఫిరాయింపుదార్లు రుజువు చేశారు. అవిశ్వాస తీర్మానాలు పెట్టటం అన్నది పార్లమెంటరీ చరిత్రలో ప్రతిపక్షానికి వున్న ఒక హక్కు, అవకాశం. ప్రస్తుతం శాసనసభలో వున్న బలాబలాల రీత్యా వైసిపి పెట్టిన తీర్మానాలు ఓడిపోతాయని ఆ పార్టీకి తెలుసు, పాలకపక్షానికి తెలుసు. ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలను ఎండగట్టటానికే ఈ అస్త్రాన్ని వాడతారు. అక్రమంగా పార్టీ ఫిరాయించిన వారి సభ్యత్వాలను కాపాడే క్రమంలో ప్రతిపక్ష పార్టీకి మరొక అస్త్రాన్ని అందించటంతప్ప ఇంత అప్రతిష్ట మూటగట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరైనా వుత్తమ సాంప్రదాయలను నెలకొల్పాలని లేదా ముందుకు తీసుకుపోవాలని కోరుకొనే వారికి తప్ప ఈక్షణం గడిచిందా లేదా ప్రత్యర్ధిపై దెబ్బతీశామా లేదా అని చూసే వారికి విమర్శలు పట్టవు.

     ఇక రెండో అంశం విషాదం. చంద్రబాబుపై అవిశ్వాసం, స్పీకర్‌పై అవిశ్వాసంలో విజయ తెలుగుదేశం పార్టీకి ఆనందం, వైసిపి విషాదం క్షణ భంగురాలు. ప్రత్యేక హోదా గురించి మరింత వివరణ,స్పష్టత వచ్చింది కనుక తమ అవిశ్వాస తీర్మానాలు ఓడిపోయాయని, తమ పార్టీ జంప్‌ జిలానీలపై వేటు వేసే అవకాశం చేజారిందని వైసిపి నేతలు విషాదంలో మునగనవసరం లేదు. అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యోగం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదారాదని, ప్రత్యేకంగా నిధులు కూడా రావని చంద్రబాబుకు, వెంకయ్య నాయుడికి తెలియని విషయం కాదు. ఆ విషయం తాము చెప్పకుండానే జనం గ్రహించాలని, తమపై ఎలాంటి ఆగ్రహం ప్రదర్శించకుండా చెవుల్లో పూలు పెట్టుకొని తలలాడించాలని వారు కోరుకుంటున్నారు. రాష్ట్ర విభజనే ఒక రాజకీయం. ప్రత్యేక హోదా మరొక రాజకీయం, ప్రతిదీ రాజకీయమే, ఒక్క సిపిఎం తప్ప ఎవరికి వారు ఈ రాజకీయంలో తమ వంతు పాత్రను రక్తి కట్టించి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను తప్పుదారి పట్టించారు. మంగళవారం నాటి పార్లమెంట్‌ చర్చలో విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చకుండా మోసం చేసిందని వెంకయ్య నాయుడు ఇప్పుడు ఎదురుదాడికి దిగారు. నిజమే కాంగ్రెస్‌ మోసం చేసింది. ప్రత్యేక హోదా ఐదు కాదు పది సంవత్సరాలు కావాలని కోరిన వెంకయ్య అది చట్టంలో పొందుపరచలేదనే విషయాన్ని అప్పుడు ఎలా మరిచి పోయారు ? ఆ సమయంలో బిజెపి, తెలుగు దేశం ఎంపీలు ఏ గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారు? చిన్న పిల్లలేం కాదే, చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం చెప్పారే తప్ప ఒక కన్నును పొడుస్తుంటే ఎందుకు వూరుకున్నారు? పోనీ తరువాత అయినా చట్టాన్ని సవరించి ప్రత్యేక హోదాను చేర్చటానికి ఏ పార్టీ అడ్డుచెప్పింది? ఎందుకు ఆపని చేయలేదు. ఇప్పటికైనా చట్టసవరణ చేయవచ్చు కదా ?

    ఎందుకు గతంలో చేయలేదు, ఇపుడు చేయటం లేదంటే. రాష్ట్ర విభజన జరిగే సమయంలోనే 14వ ఆర్ధిక సంఘం ముసాయిదా తయారైంది. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రకటించటాన్ని నిలిపివేయాలనే సిఫార్సు చేసే ఆలోచనలో వుంది. ఒక వేళ కాంగ్రెస్‌-బిజెపిలు ఆంధ్రప్రదేశ్‌ విషయంలో చట్టంలో చేర్చినా తరువాత వెలువడే ఆర్ధిక సంఘం సిపార్సులకు అది వ్యతిరేకం కనుక ఏ రాష్ట్రం అభ్యంతరం చెప్పినా, కోర్టుకు వెళ్లినా అది చెల్లదు. అందుకనే తెలివిగా దాని ప్రస్తావన లేకుండా చట్టం చేశారు. బిజెపి తెలిసి కూడా మౌనం దాల్చింది. తరువాత ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అవకాశం లేకుండా ఆర్ధిక సంఘం సిపార్సులు అమలులోకి వచ్చాయి. అందువలన రాజకీయాలు తప్ప చట్ట సవరణ చేసే అవకాశం లేదు. ఒక వేళ చేస్తే అనేక రాజ్యాంగ సమస్యలు వస్తాయి. అందుకే ఎవడికి పుట్టిన బిడ్డరా అన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పట్ల వ్యవహరిస్తున్నారు.

    బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలోప్రత్యేక హోదా అమలుకోసం కేంద్రాన్ని అర్ధిస్తూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో చంద్రబాబు నాయుడు ఎంతో వినమ్రతతో తన బాడీ లాంగ్వేజ్‌ను సవరించుకొని మాట్లాడారు. బిజెపి సభ్యుడు విష్ణుకుమార్‌ రాజు తమ కేంద్ర ప్రభుత్వాన్ని, అన్నింటికీ మించి తమ వెంకయ్య నాయుడిని జనం ఎక్కడ అపార్ధం చేసుకుంటారో అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం లక్షా 40వేల కోట్ల రూపాయల పాకేజి ఇచ్చిందని , ఏ విద్యా సంస్ధకు ఎన్ని వందల కోట్లు ఇచ్చిందో లెక్కలు చెప్పారు. ఆ మాటలు విన్నవారికి ఎవరికైనా అత్యాశ కాకపోతే ఇంకా ఎక్కడి నుంచి కేంద్రం ఇస్తుందనే భావం లుగుతుంది. అందుకే వెంటనే చంద్రబాబు నాయుడు చర్చమధ్యలో జోక్యం చేసుకొని అన్ని విద్యాసంస్థలకు కలిపి ఇప్పటికి ఇచ్చింది 172 కోట్లేనని, విష్ణుకుమార్‌ రాజు చెప్పే మొత్తాలు అవి పూర్తయ్యే నాటికి వస్తాయని అసలు విషయం చెప్పారు. అందువలన ఇప్పటివరకు చేసిన సాయం లేదా ప్రకటించిన సాయం గురించి అటు చంద్రబాబు ఇటు బిజెపి రెండూ కూడా అంకెల గారడీ చేస్తున్నాయి తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. ఇలాంటి తీర్మానాలు ప్రతి రోజూ పంపినా అవి నరేంద్రమోడీ చెత్తబుట్ట నింపటానికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అదనపు ఖర్చు తప్ప మరొక ప్రయోజనం వుండదన్నది స్పష్టం. అందుకే రాష్ట్ర విభజన, ఆ సందర్భంగా ఇచ్చిన హామీలు ఆంధ్రప్రదేశ్‌ యువతకు పెద్ద విషాదం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d