• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Congress

కొండవీటి చాంతాడులా పెరిగిపోతున్న పెదరావూరు ఖాతాలు !

19 Saturday Nov 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Bad loans, defaulters, Modi, RBI, Reserve Bank of India, vijay mallya, wilful defaulters, write off

అరే నేనేమిటో మీరు చూసింది చాల తక్కువే

ఎం కోటేశ్వరరావు

     పేరులో ఏమున్నది పెన్నిధి అని చులకనగా మాట్లాడారు గానీ పేరులోనే వుంది పెన్నిధి. ఇప్పుడు కుంభకోణాన్ని ఆ పేరుతో పిలవకూడదు. మేడంటే మేడా కాదు, గూడంటే గూడూ కాదు, కుంభకోణం అంటే కుంభకోణం కాదు, నరేంద్రమోడీ అని కొత్త అర్ధాలు రాసుకోవాల్సిన రోజులు వచ్చాయంటున్నారు. కాంగ్రెస్‌ పాలకులు అనేక కుంభకోణాలకు తెరతీశారు. వాటిని దేశమంతా చూసింది. అదే బాటలో బిజెపి పాలకులు నడిస్తే కిక్కేముంటుంది? అంతకంటే పెద్ద కుంభకోణాలకు వారు తెరతీశారు. వాటినింకా జనం చూడలేదు. అంతే తేడా ! కాంగ్రెస్‌ రుణాలిచ్చి విజయమాల్య వంటి వారిని పెద్దలుగా మారిస్తే జనానికి కిక్కు ఎక్కించేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ విజయ మాల్యను మర్యాదగా దేశం దాటించటానికి తన తెలివి తేటలను వుపయోగించింది. అలాంటి వారు దేశం విడిచి పోతుంటే ఎక్కడకు పోతున్నారో తెలుసుకోవాలి తప్ప పోవటాన్ని అడ్డగించకూడదన్న మార్గదర్శకాల కారణంగా నిఘాసిబ్బంది అదే పని చేశారు. కాంగ్రెస్‌ పాలకులు రుణాలు ఇస్తే బిజెపి పాలకులు గత రెండున్నర సంవత్సరాలుగా వాటిని ఎడా పెడా రద్దు చేస్తున్నారు. మాల్య వంటి 63 మంది పెద్దలు తమ బ్యాంకులకు ఎగవేసిన మొత్తాలలో తాజా విడతగా 7016 కోట్లను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బిఐ) రద్దు చేసింది. ఇది గత 23 సంవత్సరాలుగా నడుస్తోంది. ఇప్పుడు పెద్ద రగడ కావటంతో ఇక్కడే పేచీ వచ్చింది. దాన్ని రద్దు అన కూడదు, లెక్కలలో సర్దుబాటు అనాలని,ఆ మొత్తాలను వసూలు చేస్తారని ఆర్ధిక మంత్రి అరుణ్‌జెట్లీ సెలవిచ్చారు.ఆంగ్లంలో రైట్‌ ఆఫ్‌ అన్న పదానికి అర్ధం ‘బే వుమ్మేజు, రానిబాకీగా లెక్కలలో తీసివేయుట ‘ అని దిగవల్లి వెంకటశివరావు 1934లో, ‘రద్దు చేయు, తీసివేయు ‘ అని బూదరాజు రాధాకృష్ణ 2008లో అర్ధం చెప్పారు.

     ఈ పేరు, అర్ధం వివాదం రేగగానే మా ప్రాంత పెద రావూరు ఖాతాల వ్యవహారం గుర్తుకు వచ్చింది. నా చిన్నతనంలో మా వూర్లో ఒక వృద్ధుడు నాకు ఫలానా వారి కుటుంబం నుంచి ఇంత బాకీ రావాలి, అంతరావాలి అని కనిపించిన వారందరికీ పెద్ద మొత్తంలో లెక్కలు చెబుతుండే వాడు. అది నిజమేనా అని అడిగితే నిజమే అవన్నీ పెద రావూరు ఖాతాలో వున్నాయి అని పెద్దల నుంచి సమాధానం వచ్చింది. అర్ధం అయ్యేట్లు చెప్పమంటే అవి వచ్చేవి కాదు, పెట్టేవి కాదు, ఆ ముసలోడు అలాగే చెబుతూనే వుంటాడు అన్నారు. ఇప్పుడు జెట్లీ చెబుతున్నది కూడా పెదరావూరు ఖాతాల గురించే మరి. పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో తలెత్తిన పరిస్ధితి నుంచి ఎలా బయటపడాలా అని చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఎస్‌బిఐ రుణాల రద్దు వార్త కూడా తోడైంది. అయితే సామాన్యులకు తప్ప కేంద్ర ప్రభుత్వానికి ముందుగానే తెలుసు. తమదంతా ‘పారదర్శపాలన’ అని చెప్పుకుంటారు గనుక దానికి అనుగుణంగా ‘మూసి’పెట్టారు. ప్రభుత్వం ఇబ్బందులలో పడింది అనగానే ఎస్‌బిఐ దానికి ఒక చిట్కాను కనిపెట్టింది. ఆ ఏడువేల కోట్ల రూపాయల మొత్తాన్ని రైటాఫ్‌ (రద్దు) చేయలేదు, మేము అసలు ఆ పదాన్ని వుపసంహరించుకుంటున్నాము. ఆ మొత్తాన్ని ‘వసూలులో వున్న ఖాతా'(ఎయుసి-ఎకౌంట్‌ అండర్‌ కలెక్షన్‌) సొమ్ము అని పిలుస్తున్నాము అంటూ ఒక వివరణ ఇచ్చింది. సామాన్య రైతులు పంటలు పోయి తీసుకున్న రుణం చెల్లించకపోతే వూరంతా టాంటాం వేయిస్తారు.ఇంట్లో సామాను బయటకు వేసి అవమానాలు పాలు చేస్తారు. ఇండ్ల కోసం రుణాలు తీసుకున్నవారు కిస్తీలు చెల్లించకపోతే వారి పేర్లజాబితాను పత్రికలలో ప్రకటించి ఆస్ధులను వేలానికి పెడతారు. బ్యాంకులు వారి మొత్తాలను కూడా ఎయుసి ఖాతాలలో వేసి శక్తి వచ్చినపుడు ఎందుకు వసూలు చేసుకోవు ? బడాబాబుల పేర్లు పత్రికలలో ప్రకటించి ఆస్ధులను ఎందుకు వేలం వేయటం లేదు ?

    సాంకేతికంగా రైట్‌ ఆఫ్‌ అంటే రద్దు కాదన్నది వాస్తవమే. అయితే ఆచరణలో జరుగుతున్నదేమిటో ఆరుణ్‌ జెట్లీ వంటి పెద్దలు, లేదా బ్యాంకర్లు చెప్పటం లేదు. మాల్య వంటి పెద్ద మనుషులకు వేల కోట్ల రూపాయలను అప్పులు, అడ్వాన్సులుగా ఇవ్వటం వారు వాటిని తప్పుడు మార్గాలలో దారి మళ్లించి దాచుకోవటం, తరువాత చెల్లించటంలో విఫలమయ్యారనే పేరుతో కొంత కాలం గడిచిన తరువాత నిరర్ధక ఆస్థుల జాబితాలో ఎక్కించటం, తరువాత రాని బాకీల ఖాతాలో రాయటం, ఆ మేరకు జనం సొమ్మును బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించటంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరితేరింది. అది వారి హయాంలో పిల్లకాలువగా వుండేది. దానిని నరేంద్రమోడీ సర్కార్‌ దానిని ఓడలు ప్రయాణించే పనామా, సూయజ్‌ కాలువల సైజుకు పెంచింది. నరేంద్రమోడీ అనుయాయులైన సరికొత్త దేశభక్తులకు ఇలా అన్నందుకు ఆగ్రహం కలగవచ్చు.http://www.slideshare.net/deepakshenoy/kc-chakrabarty-on-npas-in-india ఇది రిజర్వుబ్యాంకు డిప్యూటీ గవర్నర్‌గా పనిచేసిన కెసి చక్రవర్తి తయారు చేసి 2013లో ఒక సమావేశంలో సమర్పించిన పత్రం. దీనిలో పేర్కొన్న వివరాల ప్రకారం 2001 మార్చినెలతో అంతమైన ఆర్ధిక సంవత్సరం నుంచి 2013 మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరాలలో ప్రభుత్వ, ప్రయివేటు, విదేశీ అన్ని బ్యాంకులు రైట్‌ ఆఫ్‌ (రద్దు ) చేసిన మొత్తం అక్షరాలా ఒక లక్షా 98వేల అరవయ్యారు( 1,98,066) కోట్ల రూపాయలు. ఇదే కాలంలో వసూలు చేసిన మొత్తం కేవలం 37,955 కోట్లు మాత్రమే. దీనికి తనది బాధ్యత ఎలా అవుతుంది అని నరేంద్రమోడీ అమాయకంగా హావభావాన్ని ప్రదర్శించవచ్చు. ఆయన అధికారానికి వచ్చిన తరువాత గత రికార్డులను తిరగరాస్తూ భారీ మొత్తాలలో పెద్దల బకాయిలను రైటాఫ్‌ లేదా రద్దు చేసి అతి పెద్ద భారీ కుంభకోణానికి తెరతీశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దానిని తిప్పికొట్టాలంటే తాను అధికారాన్ని స్వీకరించిన తరువాత అన్ని బ్యాంకులు ఎంత మొత్తాన్ని రైటాఫ్‌ చేశాయి, పాత బకాయిలను ఎంత మొత్తం వసూలు చేశాయి అన్న విషయాలను ప్రకటిస్తే చాలు. మిన్నువిరిగి మీద పడ్డా మాట్లాడకూడదని నరేంద్రమోడీ ఒక వ్రతాన్ని పాటిస్తున్నందున ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ అయినా ఆపని చేయాలి. ఎందుకో గానీ ఇంతవరకు వివరాలు చెప్పకుండా అభిమానుల్లో కూడా అనుమానాలకు తెరలేపుతున్నారు.

     ఈ ఏడాది ప్రారంభంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాచారం ప్రకారం 2013,14,15 ఆర్ధిక సంవత్సరాలలో 29 ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దు చేసిన మొత్తం లక్షా 14వేల కోట్ల రూపాయలు. రిజర్వుబ్యాంకు వెల్లడించిన సమాచారం ప్రకారం 2012 మార్చి ఆఖరుకు పారు బాకీలు రు.15,551 కోట్లు కాగా 2015 మార్చినాటికి రు.52,542 కోట్లకు పెరిగాయి. వంద కోట్లు అంతకంటే ఎక్కువ ఎగవేసిన వారి వివరాలు తమ వద్ద లేవని ఆర్‌బిఐ తెలిపింది.2004-15మధ్య రు.2.11లక్షల కోట్లను రద్దు చేయగా వాటిలో లక్షా 14వేల 182 కోట్లు 2013-15 మధ్య చేసినవే వున్నాయి. తొమ్మిది సంవత్సరాలలో కాంగ్రెస్‌ చేయలేని పనిని మూడు సంవత్సరాలలో మోడీ చేశారన్నమాట. ఎంత అభివృద్ధి ? అందుకే పెద్ద కరెన్సీ నోట్ల రద్దును బడా పారిశ్రామికవేత్తలంతా ఆకాశానికి ఎత్తుతున్నారా ? కాంగ్రెస్‌ హయాంలో ఏటా నాలుగు శాతం చొప్పున పెరిగితే 2014,15 సంవత్సరాలలో దేశంలో రెండవ పెద్ద బ్యాంక్‌ అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రద్దు చేసిన బాకీలు 2013-14 మధ్య 98శాతం అయితే మరుసటి ఏడాది 238శాతం వృద్ధి చెందాయి. ప్రస్తుతం ఏటా 50వేల కోట్లకు పైగానే బకాయిలు పెదరావూరు ఖాతాలోకి పోతున్నాయి.

    ఇలా రద్దు చేయటం అంతా వుత్తిదే, అంకెల గారడీ, బ్యాంకులు చెల్లించాల్సిన ఆదాయపన్ను తగ్గించేందుకు, ఆర్‌బిఐ నిబంధనలను పాటించేందుకు చేసిన లెక్కల సర్దుబాటు తప్ప మరేమీ కాదు, బ్యాంకుల ప్రధాన కార్యాలయాల స్ధాయిలో పారు బాకీలను రద్దు చేసినట్లు చూపినా దిగువ శాఖలలోని పుస్తకాలలో అలాగే వుంటాయని కేంద్ర ప్రభుత్వం, రిజర్వుబ్యాంకు, పెద్దదైన ఎస్‌బిఐ చెప్పాయి. బకాయిల వసూలు సంగతి మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. అనేక బ్యాంకుల పారు బాకీల వసూలు శాతాలు పడిపోతున్నాయనే వాస్తవాన్ని దాచిపెడుతున్నారు. వుదాహరణకు ఎస్‌బిఐ 2012-13లో 19.06శాతం వసూలు చేస్తే 2014-15 నాటికి 10.88శాతానికి పడిపోయినట్లు దాని లెక్కలే వెల్లడించాయి.ఐసిఐసిఐ బ్యాంకులో 26.74 నుంచి 15.96శాతానికి పడిపోయాయి. కెసి చక్రవర్తి తన పత్రంలో వెల్లడించిన సమాచారం ప్రకారం రద్దు చేసిన రుణాలలో కేవలం పదిశాతం లోపుగానే వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్ధల విలువను తక్కువగా చూపి అయినకాడికి తెగనమ్మే ప్రభుత్వం పారుబాకీల వసూలు విషయంలో మాత్రం తక్కువ ధరలకు ఆస్థులను విక్రయించటానికి నిబంధనలు ఒప్పుకోవు అని చెబుతోంది. మోడీ అధికారానికి వచ్చిన తరువాత ఎంత వసూలు చేశారనేది బ్యాంకులో, ప్రభుత్వమో వెల్లడిస్తే తప్ప వివరాలు లేవు. నిరర్ధక ఆస్తులుగా ప్రకటించిన మొత్తాలు నరేంద్రమోడీ విజయాలకు సూచికగా కొండల్లా పెరిగిపోతున్నాయి. గతేడాది అంతకు ముందున్న రు.3,24,300 కోట్ల నుంచి 2016 మార్చినాటికి రు.4,26,400 కోట్లకు పెరుగుతాయని అంచనా వేశారు. లెక్కల ఆల్జీబ్రాలో సర్దుబాటు, పునర్వ్యస్తీకరించిన మొత్తాలను కూడా కలుపుకుంటే పారు బాకీల మొత్తం రు.9,28,000 కోట్లని చెబుతున్నారు. వుద్ధేశ్యపూర్వకంగా ఎగవేసిన కార్పొరేట్ల రుణాల రద్దు ఈ శతాబ్దంలోనే ఇప్పటికి పెద్ద కుంభకోణంగా వర్ణిస్తున్నారు. గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లు డాక్టర్‌ కెసి చక్రవర్తికి రుణాల రద్దు గురించి బాగా తెలుసు. ఆయన చెప్పిన ప్రకారం ఒక కంపెనీ కేవలం ఎనిమిదివేల కోట్ల రూపాయల విలువగల ఆస్తులు మాత్రమే కలిగి వుండి 20వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుందనుకుంటే ఒక వేళ బ్యాంకులు రద్దు చేయాల్సి వస్తే పన్నెండువేల కోట్ల రూపాయలకు మాత్రమే అనుమతించాలి.కానీ పుస్తకాలలో వున్న గడువు మీరిన బకాయిలు మొత్తాన్ని రద్దుచేస్తున్నారు. సాంకేతిక కారణాలతో రద్దు చేయటానికి ఎలాంటి నియమనిబంధనలు, పద్దతులు లేవు, అందువలనే అదొక పెద్ద కుంభకోణంగా పరిగణించాలి. ఇది సరళీకరణ విధానాలు ప్రారంభమైన తరువాత 1993 నుంచి అనుసరిస్తున్నారు. రుణాలే కాదు, అడ్వాన్సులను కూడా రద్దు చేస్తున్నారు. మీరు ఒక చార్టడె ఎకౌంటెంట్‌ను సలహాదారుగా పెట్టుకొని అడ్వాన్సులను టెక్నికల్‌గా రద్దు చేయటానికి అవసమైన విధి విధానాలను రూపొందించుకోవచ్చని బ్యాంకులకు రిజర్వుబ్యాంకే స్వయంగా చెప్పటం విశేషం. గత పదిహేను సంవత్సరాలలో సాంకేతిక కారణాలతో చేసిన రద్దుల మొత్తం మూడున్నరలక్షల కోట్ల రూపాయలు, దీని గురించి ఎవరూ మాట్లాడటం లేదని, ఈ మొత్తాలకు వడ్డీని కూడా కలిపితే రద్దు చేసిన మొత్తాలు నాలుగు రెట్లు వుంటాయని చక్రవర్తి చెప్పారు. ఎగవేసిన పెద్దల పేర్లు బయట పెట్టాలని సుప్రీం కోర్టు చెప్పినప్పటికీ ఇంతవరకు ఆ పని చేయకుండా తప్పించుకుంటున్నారు.వారి నుంచి బాకీలు వసూలు చేయకపోవటం ఒకటైటే 2018 నాటికి బాసెల్‌-3 నిబంధనల ప్రకారం బ్యాంకులకు ప్రభుత్వం మరో 2.4లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడులు సమకూర్చాల్సి వుంటుందని చెబుతున్నారు. అంటే ఇది కూడా ప్రజల సొమ్మే.దీన్ని ఎలా సమకూర్చుతారనేది చూడాల్సి వుంది. చిత్రం ఏమిటంటే కాంగ్రెస్‌ అధికారంలో వుండగా ప్రతిపక్ష బిజెపి నేత యశ్వంతసిన్హా ఆర్ధికశాఖ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడిగా వున్నారు. రుణాల రద్దును సమీక్షించేందుకు ఒక సమీక్షా కమిటీని ఏర్పాటు చేయాలని రిజర్వుబ్యాంకును ఆ కమిటీ కోరింది. నరేంద్రమోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గవర్నర్‌గా వున్న రఘురాం రాజన్‌ ఎప్పుడు పోతాడా అని ఎదురు చూడటానికి, దాడి చేయటానికే తన సమయాన్ని వెచ్చించింది తప్ప ఆ కమిటి ఏమైందో తెలియదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మొన్న పప్పు షాక్‌ ! నిన్న వుప్పు షాక్‌ !! మరి రేపు ?

17 Thursday Nov 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Narendra Modi, rumors, salt shortage, salt shortage rumors

ఎంకెఆర్‌

    దేశంలో వుప్పు కొరత ఏర్పడిందనే పుకారుతో కొద్ది రోజుల క్రితం కిలో ఏడు వందల రూపాయల వరకు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొంత మంది అతిశయోక్తి అని కొట్టివేసినా మూడు వందల రూపాయల వరకు ధరలను పెంచినట్లు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వార్తలు వెల్లడించాయి. కొంత మంది ఏడాది, రెండు సంవత్సరాలకు సరిపడే పరిమాణంలో వుప్పు బస్తాలను మోసుకుపోవటాన్ని కూడా చూశాము. ఏడున్నరవేల కిలోమీటర్ల పొడవు సముద్రతీరం వున్న దేశంలో వుప్పు కొరత ఏమిటనే ప్రాధమిక ఆలోచన కూడా రాకుండా జనం ఎగబడటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ?

   ప్రధాని నరేంద్రమోడీ ‘ఎంతకైనా సమర్ధుడే ‘ అనే గట్టి విశ్వాసం జనంలో వుండటం తప్ప మరొక కారణం కనిపించటం లేదు. గుజరాత్‌లో గోద్రా రైలు వుదంతం దరిమిలా మైనారిటీలపై మారణ కాండ దగ్గర నుంచి తాజా పెద్ద కరెన్సీ నోట్ల రద్దు వరకు అనేక అంశాలు మోడీ ‘ఖ్యాతిని’ అంతర్జాతీయస్ధాయికి తీసుకుపోయాయి. ప్రతిపక్షాలు ఏమని వర్ణించినా, వ్యాఖ్యానించినా చాలా మంది జనంలో ‘ఎంతకైనా సమర్ధుడే ‘ అనే అభిప్రాయం వుంది. ఆయనపై ఈగను కూడా వాలనివ్వకుండా కాపుకాసే ఆయన భక్తులు పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని బయటకు తీశామన్న సంబరాలలో మునిగిపోయి, సామాజిక మీడియాలో అనుకూల ప్రచారంలో మునిగిపోయారు తప్ప వుప్పు బ్లాక్‌ మార్కెట్‌లోకి పోతుంటే, విపరీత ధరలకు అమ్ముతుంటే, జనాన్ని నిలువు దోపిడీ చేస్తుంటే ఎక్కడా రోడ్ల మీద కనపడలేదు. పుష్కలంగా వుప్పు వుందని మంత్రులు చెప్పినా జనం విశ్వసించలేదెందుకని? అనేక వుదంతాలను చూసినపుడు ఒక విషయం స్పష్టం అవుతోంది. మన వంటి వెనుకబడిన దేశాలలో గుడ్డినమ్మకాలు ప్రబలినపుడు ఇలాంటి పుకార్లు షికార్లు చేయటం చాలా సులభం. నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు వంటి వారు తమ మాంత్రిక దండాలతో అద్బుతాలు చేస్తారని చాలా మంది గత రెండున్నర సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. వారు ఏమైనా చేయగలరనే విశ్వాసం ఇంకా బలంగానే వుంది.

    నల్లధనాన్ని వెలికి తీసేందుకంటూ 500,1000 రూపాయల నోట్లను రద్దు చేయటం, వాటి స్ధానంలో తక్షణమే కొత్త కరెన్సీని ప్రవేశపెట్టలేకపోవటం, చిల్లర నోట్ల కొరత కారణంగా సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో నాటకీయంగా నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయాన్ని అనేక మంది తొలుత ఎంతగానో సమర్ధించారు. తీరా నోట్ల కొరత ఏర్పడి సామాన్యజనం ఇబ్బందులు పడటాన్ని చూసిన తరువాత వేళ్లమీద లెక్కించదగిన నల్లధనులను గాక కేంద్ర ప్రభుత్వం కోట్లాది తెల్లధనులను ఇబ్బందులకు గురి చేస్తోందని అర్ధం చేసుకున్నారు. ఇంట్లో ఎలుకలున్నాయని ఇంటికే నిప్పు పెట్టినట్లుగా నల్లధనులు ఎవరో అందరికీ తెలిసినప్పటికీ వారిని పట్టుకోవటం చేతగాని ప్రభుత్వం తమను ఇబ్బందుల పాల్జేయటాన్ని జీర్ణించుకోలేని జనం మోడీ ఎంతకైనా సమర్ధుడే ఏమో గతంలో పప్పుల మాదిరి వుప్పు ధర కూడా కొండెక్కుతుందేమో అని జనం గట్టిగా విశ్వసించటంలో ఆశ్చర్యం ఏముంది? అన్నింటి కంటే ఏదైనా ఒక వస్తువు బ్లాక్‌ మార్కెట్‌లోకి పోతోందంటే ప్రభుత్వాలు దానిని అరికడతాయనే విశ్వాసాన్ని జనం ఎప్పుడో కోల్పోయారు. భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పటికీ వ్యాపారుల ప్రతినిధిగానే చూసేవారు తక్కువేమీ కాదు. దొంగ వ్యాపారులను ఒక్కరిని కూడా శిక్షించిన వుదంతం గత రెండున్నర సంవత్సరాలలో గానీ అంతకు ముందుగానీ జనం చూడలేదు. తమ పార్టీ ప్రత్యేకమైంది అని బిజెపి స్వంత ప్రచారం చేసుకోవటం తప్ప జనంలో అలాంటి భావం లేదని తాజా వుప్పు వుదంతం నిరూపించింది. వుండి వుంటే వుప్పు బ్లాక్‌ మార్కెట్‌ను మోడీ, ఆయన అనుయాయులైన చంద్రబాబు నాయుడు వంటి ముఖ్యమంత్రులు అరికడతారని భరోసాగా వుండేవారు.

    గతేడాది నరేంద్రమోడీ సర్కార్‌ ఇచ్చిన పప్పు షాక్‌ నుంచి జనం తేరుకోలేదు. కోడి మాంసం కంటే పప్పుల ధరలు పెరిగిపోయి చరిత్రలో రికార్డును స్ధాపించిన ఘనత నరేంద్రమోడీదే. జనం ప్రస్తుతం ఆ ధరలకు అలవాటు పడిపోయారు. పప్పుధరలను అరికట్టలేని వారు వుప్పుధర విషయంలో పని చేస్తారన్న విశ్వాసం జనంలో ఎలా కలుగుతుంది? గత కొద్ది సంవత్సరాలుగా మన దేశంలో పప్పుల వుత్పత్తిలో పెద్ద హెచ్చు తగ్గులు లేవు. తొలిసారిగా గరిష్ట మొత్తంలో 2014లో పప్పులను దిగుమతి చేసుకున్న పూర్వరంగం వుంది.కాంగ్రెస్‌ హయాంలో అనేక కుంభకోణాలు జరిగి లక్షల కోట్ల మేరకు ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్ము రాకుండా పోయింది. నరేంద్రమోడీ హయాంలో ఇప్పటివరకు దాదాపు అంతకంటే పెద్ద కుంభకోణమే జరిగింది. గతానికి ఇప్పటికీ తేడా ఏమిటంటే మోడీ హయాంలో జనం జేబుల నుంచి సొమ్ముకొట్టి వేశారు. అది వుల్లి , పప్పుల ధరల బ్లాక్‌మార్కెట్‌, ధరల పెంపుదల రూపంలో జరిగింది. ఇలాంటి వాటిలో జనం కోల్పోయిన మొత్తం తక్కువేమీ కాదు.http://indiatoday.intoday.in/story/the-great-indian-dal-scam-revealed/1/527130.html ప్రధాని నరేంద్రమోడీ గట్టి మద్దతుదారైన అదానీ విదేశాల నుంచి చౌకగా పప్పులను దిగుమతి చేసుకొని అధిక ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారన్న విషయం తెలిసిందే.http://www.khabarbar.com/politics/explosive-adani-snatched-dal-from-your-plate-potential-scam-worth-%E2%82%B9190000-crore-unearthed/ . వుల్లి ధరలు కూడా కిలో వందరూపాయల వరకు పెరిగి జనానికి కన్నీళ్లు తెప్పించిన విషయం తెలిసిందే. కొన్ని వేల కోట్ల రూపాయలను కొన్ని వారాలలోనే వ్యాపారులు జనం జేబుల నుంచి లూటీ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇవన్నీ కళ్ల ముందే జరిగాయి.http://www.rediff.com/business/interview/interview-once-in-two-years-onion-crisis-is-bound-to-arise-in-india/20150824.htm అలాగే వుప్పు విషయంలో కూడా ఏదైనా జరుగుతోందో ఏమో అని సామాన్యులకు ఆందోళన కలగకుండా ఎలా వుంటుంది.

   పప్పుల సంగతి జనం మరిచిపోతున్నారు. నోట్ల రద్దు గురించి చేసిన ప్రకటనలు, ఆచరణలో తాము పడిన ఇబ్బందుల పూర్వరంగాన్ని కూడా వుప్పు పుకార్లలో చూడాలి. దొంగ సొమ్ము దాచుకున్న వారి పని పట్టేందుకు రద్దు అని మీడియాలో వూదరగొడుతుంటే బ్యాంకుదగ్గర బారులు దీరిన జనానికి ఒక్క నల్లధన కుబేరుడు కూడా వరసల్లో కనపడలేదు. అందరూ తమబోటి సామాన్యులే. పంటల ధరలు ఆస్మాత్తుగా పడిపోయినపుడు, లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు జరిగే నష్టాన్ని తలచుకొని రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం అందరికీ తెలుసు. పాత నోట్లను మార్చుకొనేందుకు వరుసల్లో నిలబడి కూలిపోయిన వృద్దులు, పొలం పుట్రా అమ్ముకొని శుభకార్యాలకు దాచుకున్న సొమ్ము పనికిరాకుండా పోయిందని ఆవేదనతో ప్రాణాలు పొగొట్టుకున్న వారి గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. నల్లకుబేరులను దెబ్బతీశానని మోడీ, బిజెపి నేతలు చెప్పటమే తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా రైతుల మాదిరి నల్లడబ్బు పనికిరాకుండా పోయిందని జీవితాన్ని చాలించిన వుదంతాలు, కనీసం ఆసుపత్రి పాలైన ఘటనలు మీడియాలో రాలేదెందుకని? గంటల తరబడి వరుసల్లో నిలబడి తమ వద్ద వున్న నోట్ల మార్పిడి లేదా చెక్కుల ద్వారా బ్యాంకులలో డబ్బు తీసుకొనేందుకు వచ్చిన వారు వుబుసుపోక నల్లధనులు తమ వద్ద వున్న నోట్లను ఎంత సునాయాసంగా తెల్లధనంగా మార్చుకుంటున్నారో కథకథలుగా చెప్పుకుంటున్నారు. ఇవన్నీ చూస్తున్న సామాన్య జనం వుప్పు కొరత ఏర్పడిందంటే నమ్మటంలో, పదులకొద్దీ కిలోలు అధిక ధరలకు కొనేందుకు ఎగబడటంలో ఆశ్చర్యం ఏముంది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

జనంపై నరేంద్రమోడీ పెట్రో సర్జికల్‌ దోపిడీ ఎంతో తెలుసా

11 Friday Nov 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Mody's sarkar, Narendra Modi, petro surgical looty, petrol price, petrol price build up, petrol price build up in india, subsidies

Image result for  petro  looty

మోడీ పాలనా విధానం దానికి గుజరాత్‌ నమూనా అంటారో లేక న్యూఢిల్లీ నమూనా అని పేరు పెడతారో తెలియదు గానీ జనం కోల్పోయిన సబ్సిడీల మొత్తం రు. 1,16,167 కోట్లు, తమ జేబుల్లోంచి అదనంగా చెల్లించింది లక్ష కోట్లు, అంటే మొత్తం జరిగిన లూటీ రు 2,16,000 కోట్లు, అదీ ఒక్క ఏడాదికి మాత్రమే సుమా ! ఇది ఒక్క పెట్రోలియం రంగంలో చేసిన మాజిక్‌ మాత్రమే. పోనీ పెట్రోలియం సబ్సిడీలు ఎత్తివేసి గతంలో లేని అదనపు సంక్షేమ కార్యక్రమం ఏదైనా ప్రారంభించారా అంటే లేదు. వుంటే చెప్పమనండి.

ఎం కోటేశ్వరరావు

   చెప్పింది వినటం, గొర్రెల్లా తలూపటం తప్ప ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు వేస్తే దేశద్రోహులుగా పరిగణించే రోజులివి. అయినా సరే గట్టిగా ఎవరైనా కాదంటే నరేంద్రమోడీ భక్తులు భౌతిక దాడులకు పాల్పడినా ఆశ్చర్యం లేదు. అంతగా అసహనం పెరిగిపోయింది. అలాంటి స్ధితిలో మన కంటే పాకిస్థాన్‌లో పెట్రోలు ధరలు ఎందుకు తక్కువగా వున్నాయి అని ఎవరైనా ప్రశ్నించి బతక్కగ్గలరా ? నిజంగా అక్కడ తక్కువగా వున్నాయా ? అయినా అడగక తప్పదు. అయితే వారి వద్ద సమాధానం వుండదు. లేదూ ఎవరైనా స్వంతబుర్రలు వున్నవారు వుంటే వారికి తెలిసినా చెప్పరు. సామాజిక మీడియాలో దీనికి సంబంధించిన చర్చ ప్రస్తావనకు వచ్చినపుడు వస్తున్న సమాధానాలు చదివిన తరువాత కలిగిన అభిప్రాయమిది. ఒక పోస్టులో పాకిస్థాన్‌లో పెట్రోలు లీటరు 26 రూపాయలు అని సామాజిక మీడియాలో తిరుగుతున్నది. కొందరు వాస్తవాలు సరిచూసుకోవాలని చెప్పారు. మరికొందరు పెంచిన పన్నులు యుపిఏ హయంలో నిర్ణయించినవి తప్ప మోడీ సర్కార్‌ పెంచలేదు అన్నారు. మరికొందరు జిఎస్‌టి అమలులోకి వచ్చిన తరువాత ధరలు తగ్గుతాయి అన్నారు.

    ఏ కారణం చేత అయినా మోడీ భక్తులలో తెలివిగల వారు, నిజాలు తెలిసిన వారు వాస్తవాలు చెప్పటానికి ఎందుకో జంకుతున్నారు. బహుశా వారికి కూడా ఏదో ఒక ముద్ర వేస్తారని భయం కావచ్చు. వారి పట్ల జాలి చూపుదాం. మన దేశానికి సంబంధించిన సమాచారాన్ని మన చమురు సంస్ధల నుంచే తీసుకోవచ్చు. ప్రధాన మంత్రిగా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత ప్రపంచంలో చమురు రేట్లు గణనీయంగా తగ్గాయి. కావాలంటే దీన్ని కూడా ఆయన సాధించిన విజయాల ఖాతాలోకే వేద్దాం. మన చమురు సంస్ధల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణ విధానాన్ని ఎత్తివేసింది. ఎందుకంటే సంస్ధల మధ్య పోటీ పెరిగి పెట్రోలు, డీజిల్‌, కిరోసిన్‌ వంటి పెట్రోలియం వుత్పత్తుల ధరలు తగ్గుతాయని చెప్పింది. అదే సమయంలో జనాన్ని ఆకర్షించేందుకు ప్రపంచంలో ధరలు పెరిగితే ఆమేరకు ఆటోమేటిగ్గా మీకూ పెరుగుతాయి, తగ్గితే అదే మాదిరి తగ్గుతాయంటే జనమంతా నిజమే కదా అనుకున్నారు. ఆ ముసుగులో మన సర్కార్‌ చేసిందేమిటంటే అప్పటివరకు ఇస్తున్న సబ్సిడీలు తగ్గించేందుకు పూనుకుంది. అన్నింటి మీదా ఒకేసారి తొలగిస్తే వచ్చే ప్రతికూల పర్యవసానాలకు భయపడి క్రమంగా తగ్గించటం ప్రారంభించింది. తొలుత పెట్రోలుపై పూర్తిగా ,తరువాత డీజిల్‌పై క్రమంగా మొత్తం ఎత్తేశారు. ఇప్పుడు కిరోసిన్‌పై ప్రతినెలా కొంత మొత్తం తగ్గిస్తూ రబ్బరు సుత్తితో కొడుతున్నారు. సబ్సిడీలు ఎత్తివేసినప్పటికీ ప్రపంచ మార్కెట్‌లో తగ్గిన మేరకు మన వినియోగదారులకు ధరలు తగ్గకపోగా పెరిగాయి అన్న నిజాన్ని మోడీ భక్తులు ఒక పట్టాన అంగీకరించరు.

    పెట్రోలియం రంగం మన ఖజానాకు సంపాదించి పెడుతున్న సొమ్ము కాస్తా కూస్తా కాదు. 2013-14 ఆర్ధిక సంవత్సరంలో అన్ని రకాల ఆదాయం రు. 3,05,360 కోట్లు (అక్షరాలా మూడు లక్షల ఐదువేల మూడు వందల అరవై కోట్లు) ఇది 2014-15లో 3,32,620 కోట్లు, 2015-16లో 4,18,652, వర్తమాన ఆర్ధిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో 1,02,711 కోట్లు. మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వం 2010 జూన్‌ 25 నుంచి పెట్రోల్‌పై సబ్సిడీని పూర్తిగా తగ్గించి వేసింది. మోడీ అధికారానికి వచ్చాక 2014 అక్టోబరు 18 నుంచి డీజిల్‌పై పూర్తిగా రద్దు చేశారు. ప్రస్తుతం ప్రజాపంపిణీ వ్యవస్ద ద్వారా సరఫరా చేసే కిరోసిన్‌పై మాత్రమే కొనసాగిస్తున్నారు. యుపిఏ హయాంలో 2013-14లో పెట్రోలియం వుత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం భరించిన సబ్సిడీ మొత్తం రు.1,43,738కోట్లు కాగా మోడీ వచ్చాక 2014-15లో 76,282 కోట్లకు 2015-16లో రు.27,571 కోట్లకు తగ్గిపోయింది. ఆదా రు. 1,16,167 కోట్లు. కిరోసిన్‌పై కూడా పూర్తిగా పుణ్యం కట్టుకుంటే ఏడాదికి రు.1,43,738కోట్లు మిగిలినట్లే . ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో 2013-14లో ఎక్సైజ్‌ పన్ను రూపంలో 77,982 కోట్లు, 2014-15లో 99,184 కోట్లు, 2015-16లో 1,78,591 కోట్లకు పెరిగింది. పెరిగిన ఆదాయం లక్ష కోట్లరూపాయలు. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు పెట్రోలియం వాడకం పెరిగింది కదా ఆ మేరకు ఆదాయం పెరిగి వుండవచ్చు అన్న సందేహం వెలిబుచ్చవచ్చు. రెండు సంవత్సరాలలో వినియోగం రెట్టింపు పెరగటం అనేది ఏ దేశ చరిత్రలోనూ లేదు. మన వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ మరియు విశ్లేషణ విభాగం (పిపిఏసి  http://ppac.org.in/content/147_1_ConsumptionPetroleum.aspx ) ప్రకారం 2013-14లో అన్ని రకాల పెట్రోలియం వుత్పత్తుల వినియోగం నెలవారీ సగటు 1,32,00,583 టన్నులు 2015-16లో 1,53,87,000 టన్నులు. వర్తమాన సంవత్సరంలో అక్టోబరు వరకు నెల సగటు 1,61,69,428 టన్నులు. మోడీ భక్తులేమో కొత్తగా పన్నులు పెంచలేదంటారు, అయితే ఆదాయం ఇంత పెరుగుదల ఎలా సాధ్యమైంది? మోడీ మంత్రం వేసి పెంచారా ? మోడీ పాలనా విధానం దానికి గుజరాత్‌ నమూనా అంటారో లేక న్యూఢిల్లీ నమూనా అని పేరు పెడతారో తెలియదు గానీ జనం కోల్పోయిన సబ్సిడీల మొత్తం రు. 1,16,167 కోట్లు, తమ జేబుల్లోంచి అదనంగా చెల్లించింది లక్ష కోట్లు, అంటే మొత్తం జరిగిన లూటీ రు 2,16,000 కోట్లు, అదీ ఒక్క ఏడాదికి మాత్రమే సుమా ! ఇది ఒక్క పెట్రోలియం రంగంలో చేసిన మాజిక్‌ మాత్రమే. పోనీ పెట్రోలియం సబ్సిడీలు ఎత్తివేసి గతంలో లేని అదనపు సంక్షేమ కార్యక్రమం ఏదైనా ప్రారంభించారా అంటే లేదు. వుంటే చెప్పమనండి. మన దేశంలోకి వుగ్రవాదులను పంపిన పాక్‌పై మన సైన్యం సర్జికల్‌ దాడులు చేస్తే మనమంతా అభినందించాం. దానికైన ఖర్చు వందల కోట్లు లేదా అంతకంటే తక్కువే కావచ్చు. కానీ మోడీ సర్కార్‌ ప్రతి ఏటా జనంపై పెట్రో రంగంలో జరుపుతున్న సర్జికల్‌ దాడులవలన జనానికి వదులుతున్న చేతి చమురు మాత్రం రెండు లక్షల కోట్లకు పైమాటే.

    పెట్రోలియం రంగం నుంచి ఒక్క ఏడాదిలో లక్ష కోట్ల అదనపు ఆదాయాన్ని ఎలా పిండారు ? 2014 మార్చినెల ఒకటవ తేదీన అంతర్జాతీయ మార్కెట్‌లో పీపా చమురు ధర రవాణా ఖర్చుతో సహా 118 డాలర్లు. ఒక డాలరుకు రూపాయి విలువ రు.62.12 లు. చమురు కంపెనీలు శుద్ధి కర్మాగారాలకు ఒక లీటరు పెట్రోలుకు చెల్లించిన ధర రు.47.18, డీలరుకు విక్రయించింది రు.49.50, ఎక్సయిజ్‌ పన్ను రు.9.48, డీలరు కమిషన్‌ రు.2.02, న్యూఢిల్లీలో వాట్‌ 20శాతం చొప్పున( రాష్ట్రాల రేటును బట్టి మారుతుంది) రు.12.20, మొత్తం వినియోగదారుడికి (హెచ్‌పి) ధర రు.73.20.

    తాజా పరిస్ధితికి వస్తే నవంబరు ఆరున హెచ్‌పి కంపెనీ వివరాల ప్రకారం అంతర్జాతీయ మార్కెట్‌లో పీపా చమురు ధర రవాణా ఖర్చుతో సహా 61.87 డాలర్లు. ఒక డాలరుకు రూపాయి విలువ రు.66.81 లు. చమురు కంపెనీలు శుద్ధి కర్మాగారాలకు ఒక లీటరు పెట్రోలుకు చెల్లించిన ధర రు.26.64, డీలరుకు విక్రయించింది రు.29.39 ఎక్సయిజ్‌ పన్ను రు.21.48, డీలరు కమిషన్‌ రు.2.43, న్యూఢిల్లీలో వాట్‌ 27శాతం చొప్పున( రాష్ట్రాల రేటును బట్టి మారుతుంది) రు.14.39, మొత్తం వినియోగదారుడికి (హెచ్‌పి) ధర రు.67.70. ఎక్సయిజ్‌ పన్ను రు.9.48 నుంచి 21.48కి పెంచటమే ఆదాయ పెరుగుదల రహస్యం.

    యుపిఏ హయాంలో రూపాయి విలువ నాటి అర్ధిక మంత్రి వయస్సు పెరిగినట్లు పతనం అవుతోందని స్వయంగా నరేంద్రమోడీ ఎద్దేవా చేశారు.http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2389308/India-2014-elections-Yes-Yes-Modi-launches-BJPs-poll-campaign-massive-rally-Hyderabad.html మోడీ చెప్పినట్లు 1947లో మన రూపాయి విలువ ఒక డాలరుకు ఒక రూపాయిగా వున్నమాట నిజం. కాంగ్రెస్‌ దిగిపోయే నాటికి అంటే రు.62.12కు దిగజారింది. అంటే 67 సంవత్సరాలకు సగటున ఏడాదికి 93 పైసలు పడిపోయింది. అదే మోడీ హయాంలో 62.12 నుంచి 66.81కి పతనమైంది. ఏడాదికి రు 2.34 తగ్గిపోయింది. ఇది కూడా మోడీ ఘనతే అంటారా ? మన దేశంలో పెట్రోలు ధరలు తగ్గకపోవటానికి ఇదొక కారణం. అన్నింటి కంటే పై వివరాలను బట్టి నరేంద్రమోడీ హయాంలో బాదిన ఎక్సయిజ్‌ పన్ను లీటరుకు పన్నెండు రూపాయలు. జనం జేబుల లూటీ ఇక్కడ జరుగుతోంది. దీన్ని కాదనే ధైర్యం ఎవరికైనా వుందా ?

   ఇక పాకిస్థాన్‌లో పెట్రోలు ధరలు తక్కువగా వున్నాయని మోడీ భక్తులు అంగీకరిస్తారో లేదో తెలియదు. వారు కూడా మన మాదిరే పెట్రోలు దిగుమతి చేసుకుంటారు. ఈనెల 9వ తేదీన పాకిస్ధాన్లో పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇలా వున్నాయి. అక్కడ పెట్రోలు కంటే డీజిల్‌ ధరలు ఎక్కువ.http://www.hamariweb.com/finance/petroleum_prices/ దీనిలో వున్న వివరాల ప్రకారం పెట్రోలు ధర రు. 64.27, డీజిల్‌ ధర రు.72.52 వుంది. వీటిని చూసి మోసపోయే అవకాశం వుంది. రెండు చోట్లా కరెన్సీ రూపాయే అయినప్పటికీ విలువలు వేరు. పై ధరలను మన రూపాయిల్లోకి మారిస్తే డీజిల్‌ ధర రు.46.44, పెట్రోలు ధర రు.41.15 వుంటుంది. దీనికి కారణం అక్కడ పన్నులు తక్కువగా వుండటమే.http://www.globalpetrolprices.com/gasoline_prices/ ఈ లింక్‌లోని సమాచారం ప్రకారం వివిధ దేశాలలో డాలర్లలో పెట్రో వుత్పత్తుల ధరలు ఎలా వున్నాయో ఎవరైనా పోల్చుకోవచ్చు.

   ఇక చాలా మంది పెట్రోలియం వుత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తెస్తారని, దాంతో ధరలు తగ్గుతాయనే అభిప్రాయంతో వున్నారు. ఇప్పటి వరకు జరిగిన చర్చలు, వెల్లడైన అభిప్రాయాల ప్రకారం పెట్రోలియం వుత్పత్తులను వెంటనే జిఎస్‌టి పరిధిలోకి తీసుకురారు. ప్రస్తుతం పెట్రోలు కొనుగోలు ధర లీటరుకు రు.29.39 అయితే దానిపై విధిస్తున్న పన్నులు రు.35.87 వున్నాయి. జిఎస్‌టి పద్దతిలో పన్ను మీద పన్ను వుండటానికి వీలుండదు. ప్రస్తుతం అన్ని కలుపుకుంటే 122శాతం వసూలు చేస్తున్నారు. ఇంత మొత్తాన్ని వదులుకొని ఏ ప్రభుత్వమైనా పన్ను తగ్గిస్తుందని ఎవరైనా వూహించుకుంటే అంతకంటే కావాల్సింది ఏముంది. అలాంటి వారి భ్రమలను త్వరలోనే నరేంద్రమోడీ తొలగిస్తారని వేరే చెప్పాలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎన్‌డిటివీపై నిషేధం- అసంబద్ద వాదనలు !

08 Tuesday Nov 2016

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, emergency, Free press, Modi, ndtv, ndtv ban, press freedom, un declared emergency

మీడియా స్వేచ్ఛకు ప్రమాద ఘంటికలు

ఎం కోటేశ్వరరావు

    చచ్చిన చేప వాగు వాలున కొట్టుకుపోతుంది. బతికున్న చేప మాత్రమే ఎదురు ఈదుతుంది. దేన్నయినా ప్రశ్నిస్తేనే రచ్చ, చర్చ ప్రారంభమౌతుంది. ఫలానా రోజు ఫలానా చర్యను ఎందుకు ప్రశ్నించలేదు, దీన్ని మాత్రమే ఇప్పుడు ఎందుకు తప్పు పడుతున్నారు అంటే కుదరదు. హేతుబద్దత లేకుండా అసంబద్ధతో మరొకటో వుంటేనే ఎవరైనా నిలదీస్తారు. సమర్ధించుకోవటానికి సరైన కారణాలు దొరకనపుడే చర్చను పక్కదారి పట్టించేందుకు చూస్తారు. వ్యూహాత్మకమైన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేశారని ఆరోపించి ఎన్‌డిటివీ హిందీ ఛానల్‌ ప్రసారాలను నవంబరు తొమ్మిది-పది తేదీలలో ఒక రోజంతా నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం దండన విధించింది. అత్యవసర పరిస్థితి పేరుతో కాంగ్రెస్‌ నియంతృత్వ పోకడలను వ్యతిరేకించిన ఘనత తమకు వుందని కమలనాధులు తరచూ చెప్పుకుంటారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించటానికి ఒక కారణం, చట్టమూ, అధికారమూ కావాలి. కానీ అనధికారికంగా అమలు జరపటానికి అధికారం వుంటే చాలని నేటి కేంద్ర ప్రభుత్వం ఆచరణలో చూపింది. హేతుబద్దంగా ఆలోచించే వారందరూ ముక్త కంఠంతో వ్యతిరేకించి నిషేధం ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఒక రోజు నిషేధం మీడియా స్వేచ్చకు, ప్రజాస్వామ్యానికి ముప్పని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితి సమయంలో కాంగ్రెస్‌ నేతల మాదిరి తమ చర్యను సమర్ధించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం, బిజెపి నాయకులు పెద్ద ఎత్తున ఎదురుదాడులకు పూనుకున్నారు. తమ ద్వంద్వ స్వభావాన్ని బయట పెట్టుకున్నారు.జనానికి విచక్షణా జ్ఞానం వుంటుందనే అంశాన్ని కూడా మరచిపోయి అసంబద్ద వాదనలను ముందుకు తెస్తున్నారు.

    కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాల్‌ చేస్తూ ఎన్‌డిటివీ యాజమాన్యం సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. దీంతో పాటు దేశ, విదేశాలలో నిరసన,మోడీ సర్కార్‌ అప్రజాస్వామిక చర్యపై విమర్శలతో భయపడిన కేంద్రం నిషేధం విషయమై ప్రభుత్వానికి విన్నవించిన కారణంగా ఎన్‌డిటివీ వాదనలు చెప్పుకొనేందుకు మరో అవకాశం ఇస్తున్నామంటూ నిషేధ నిర్ణయం అమలును వాయిదా వేసుకుంది. రద్దు చేయలేదు. ఈ ప్రకటన చేయబోయే ముందు సాయంత్రం వరకు నిషేధాన్ని సమర్ధించిన సమాచార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు రాత్రికి నిషేధాన్ని నిలిపివేసినట్లు అధికారుల చేత ప్రకటన చేయించారు. నవంబరు ఎనిమిదవ తేదీన ఎన్‌డిటివీ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన ఇద్దరు జడ్జీల సుప్రీం కోర్టు బెంచ్‌ తదుపరి విచారణను డిసెంబరు ఐదవ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం విధించిన నిషేధం అమలును వాయిదా వేసినందున ప్రసారంపై అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని వుభయపక్షాల అంగీకరించటంతో కోర్టు వాయిదా వేసింది. దీంతో ఇప్పుడు ఈ వివాదం మరొక మలుపు తిరిగింది.

    సమస్య తాత్కాలికంగా సర్దుమణిగింది, నిషేధాన్ని వాయిదా వేశారు తప్ప ఎత్తివేయలేదు. అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకీ చర్యకు పాల్పడింది. మీడియా, ప్రజాస్వామిక వాదులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పర్యవసానాలేమిటి ? ఎప్పటి మాదిరే దీనిపై కూడా ప్రధాని నరేంద్రమోడీ ఈ వ్యాసం రాసే సమయం వరకు నోరు విప్పలేదు. కనీసం ట్విటర్‌ ద్వారా కూడా స్పందించలేదు. మన్‌కీ బాత్‌లో ఏమైనా బయటపడతారో లేదో చూడాలి. తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలపై నోరు విప్పకపోవటం నరేంద్రమోడీ వ్యవహార శైలి అన్నది గత రెండున్నర సంవత్సరాల అనుభవం రుజువు చేసింది.

    ప్రతి తరం అత్యవసర పరిస్థితి నాటి కాలాన్ని నిష్పక్షపాతంగా చూస్తే మరొక నేత ఎవరూ అటువంటి తప్పు చేయాలన్న తలంపుకే రారు అని ప్రధాని నరేంద్రమోడీ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక అవార్డుల సభలో వుద్బోధ చేశారు. చిత్రంగా ఆ మరుసటి రోజే అత్యవసర పరిస్థితిని ప్రకటించకుండానే ఎన్‌డిటివీపై ఆ కాలం నాటి నిరంకుశ వైఖరిని ప్రతిబింబిస్తూ ఒక రోజు నిషేధం విధించటం గమనించాల్సిన అంశం. నరేంద్రమోడీకి తెలియకుండానే ఇది జరిగిందా అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. ఇదొక ముఖ్యపరిణామం, అందునా మోడీ అంతరంగం అందరికంటే బాగా ఎరిగిన వెంకయ్య నాయుడు శాఖ, మీడియా స్వేచ్చకు సంబంధించింది, దీని పర్యవసానాల గురించి ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారు అని ఎవరైనా అనుకుంటే చేయగలిగిందేమీ లేదు. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని రక్షణ, హోం, తదితర అంతర మంత్రిత్వశాఖల కమిటీ సిఫార్సుల మేరకు నవంబరు 9వ తేదీ అర్ధరాత్రి నుంచి పదవ తేదీ అర్ధరాత్రి వరకు కార్యక్రమాల ప్రసారాన్ని నిషేధించారు. ఈ ఏడాది జనవరి రెండు నుంచి ఐదువ తేదీ వరకు పఠాన్‌కోట్‌ సైనిక కేంద్రంపై పాకిస్ధాన్‌ వైపు నుంచి ప్రవేశించిన తీవ్రవాదులు దాడి జరిపిన విషయం తెలిసిందే. ఆ దాడికి సంబంధించి జనవరి నాలుగవ తేదీన ఎన్‌డిటివి ప్రసారం చేసిన అంశాలలో మన రక్షణ రహస్యాలను బహిర్గతం చేశారని ప్రభుత్వం ఆరోపించింది. అందుకు గాను 30 రోజుల పాటు నిషేధం విధించాల్సి వున్నప్పటికీ ఒక రోజుకు పరిమితం చేసినట్లు తెలిపింది.ఈ చర్య మీడియా స్వేచ్ఛను ప్రత్యక్షంగా వుల్లంఘించటమే అని, అత్యవసర పరిస్థితి నాటి అవశేషమిదని కూడా భారత సంపాదకుల మండలి (ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా) పేర్కొన్నది.

     జనవరి నాలుగవ తేదీన ఎన్‌డిటివి వార్తలను ప్రసారం చేయగా 29వ తేదీన సమాచార, ప్రసార శాఖ సంజాయిషీ నోటీసు జారీ చేసింది. వ్యూహాత్మకంగా రహస్యమైన సమాచారాన్ని ప్రసారం చేసినందున భద్రతా దళాలు చేపట్టిన ప్రతిక్రియలను అడ్డుకొనేందుకు నేరం చేసిన వారు వుపయోగించుకొనే అవకాశం వున్నందున, అది నిబంధనలకు విరుద్దమైనందునా ఎందుకు ప్రసారం చేశారో సంజాయిషీ ఇవ్వాలని దానిలో కోరింది.2015లో సవరించిన 1995 కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌(నియంత్రణ) చట్టం ప్రకారం భద్రతా దళాలు చేపట్టే ఏ విధమైన వుగ్రవాద నిరోధక చర్యలనైనా ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని ఆ చట్టం నిర్దేశించిన ప్రసార స్మృతిలో పేర్కొన్నారు. పఠాన్‌కోట్‌ వైమానిక స్ధావరంపై పాకిస్తాన్‌ నుంచి వచ్చిన వుగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు మిలిటరీ జవాన్లు, ఒక పౌరుడు మరణించారు. తీవ్రవాదులు దాడి కొనసాగుతుండగానే జనవరి నాలుగున ఎన్‌డిటివి రిపోర్టర్‌ ఆ వార్తలో చెప్పిన అంశం ఇలా వుందని ప్రభుత్వం పేర్కొన్నది.’ ఇద్దరు మిలిటెంట్లు ఇంకా సజీవంగానే వున్నారు, వారు మందుగుండు సామగ్రి డిపో పక్కనే వున్నారు. మిలిటెంట్లు మందుగుండు సామగ్రి డిపోను చేరుకున్నట్లయితే వారిని నిర్వీర్యం చేయటం కష్టమౌతుందని దాడిని ఎదుర్కొంటున్న జవాన్లు ఆందోళన చెందుతున్నారు.’ అని వ్యాఖ్యానించారని, ఆ ప్రసారంలో వైమానిక స్ధావరం గురించి కూడా సమాచారాన్ని వెల్లడించారంటూ ‘ దానిలో మిగ్‌ యుద్ధ విమానాలు, రాకెట్‌ లాంచర్లు, మోర్టార్లు, హెలికాప్టర్లు, ఇంధన నిల్వలు, పాఠశాలలు, నివాస ప్రాంతాలు వున్నాయని కూడా పేర్కొన్నట్లు ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో తెలిపింది.ఈ సమాచారాన్ని స్వయంగా టెర్రరిస్టులు లేదా వారిని ప్రయోగిస్తున్నవారు గానీ వుపయోగించుకోవచ్చని పేర్కొన్నది.

  చట్టం ముందు ఎన్‌డిటివీగానీ మరొక ఛానల్‌ గాని అమలులో వున్న నిబంధనలను పాటించాలనటంలో ఎలాంటి విబేధం లేదు, ఎవరూ అందుకు విరుద్ధంగా మాట్లాడటం లేదు. ఎవరైనా అలా చేస్త్తే చర్యతీసుకోవాలి, చట్టం తనపని తాను చేసుకుపోతుంది. అందుకు కోర్టులు, చట్టాలున్నాయి. చట్ట ప్రకారం తప్పుచేస్తే అందరికీ దండన విధించాలి. ఎన్‌డిటివీ, దానిపై విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తున్న సంపాదకుల మండలి, ప్రయివేటు టీవీ ఛానల్స్‌ సభ్యులుగా వున్న నేషనల్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ ఇతర అనేక జర్నలిస్టు సంఘాల అభ్యంతరం కూడా అలాంటి వార్తలనే ఇచ్చిన ఇతర సంస్ధలపై ఎలాంటి చర్య తీసుకోకుండా ఒక్కదానిపై మాత్రమే దండన ఎందుకు విధిస్తున్నారన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదు. ఏదైనా ఒక శిక్ష అది చిన్నదా పెద్దదా అనేదానితో నిమిత్తం లేకుండా తగిన అధికారాలుగల సంస్ధ లేదా పదవిలో వున్నవారు మాత్రమే విధించాలి. కానీ శిక్ష విధించే అధికారాన్ని సమాచార,మంత్రిత్వశాఖ తనకు తాను పుచ్చుకోవటం ఏమిటని కూడా మీడియా సంస్ధలు సవాలు చేశాయి.

    ప్రభుత్వం జారీ చేసిన నోటీసుకు ఫిబ్రవరి ఐదున ఎన్‌డిటివీ సమాధానమిచ్చింది. తమ వార్త బాధ్యతాయుతంగా,సముచితంగా వుందని, వార్తలో పేర్కొన్న అంశాలు తాము ప్రసారం చేయటానికి ముందే వార్తా పత్రికలలో వచ్చాయని తెలిపింది. వాటికి సంబంధించిన వివరాలను కూడా ప్రభుత్వానికి తెలిపింది. జనవరి మూడవ తేదీన ఐఎఎన్‌ఎస్‌ (వార్తా సంస్ధ) ఇచ్చిన వార్తను ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రచురించిందని, దానిలో ‘మిగ్‌ 21 యుద్ధ విమానాలు, ఎంఐ 35 యుద్ధ హెలికాప్టర్లు, ఇతర ముఖ్యమైన సొత్తు ‘ వైమానిక స్ధావరంలో వుందని దానిలో పేర్కొన్నారు. జనవరి మూడున టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలో వుపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, నిఘారాడార్లు వున్నాయని తెలిపారు. జనవరి నాలుగున ఒక సైనిక బ్రిగేడియర్‌ను వుటంకిస్తూ హిందుస్తాన్‌ టైమ్స్‌ పత్రిక ‘ ఇద్దరు వుగ్రవాదులు ఒక రెండంతస్ధుల భవనంలో వుండిపోయారని, అక్కడ వైమానిక దళ సిబ్బంది నివాసముంటారని ‘ పేర్కొన్నది. వాటిపై తీసుకోని చర్య తమకు ఎలా వర్తిస్తుందని ఎన్‌డిటివీ ప్రశ్నించింది.

     నేషనల్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌బిఏ) సెక్రటరీ జనరల్‌ ఆనీ జోసెఫ్‌ ఒక ప్రకటన చేస్తూ ప్రభుత్వ చర్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వార్తలను ఇతర మీడియా కూడా ఇచ్చిందని అవన్నీ బహిరంగంగా అందుబాటులోనే వున్నాయని పేర్కొంటూ ఎన్‌డిటివీ ఒక్కదానిపైనే చర్య తీసుకోవటం ఆశ్చర్యంగా వుందన్నారు. అంతర మంత్రిత్వ శాఖల కమిటీ, సమాచార మంత్రిత్వశాఖ ఈ అంశాన్ని కేబుల్‌ చట్టంలోని పక్కా నిబంధనల మేరకు గాక రాజ్యాంగంలో హామీ ఇచ్చిన మీడియా స్వేచ్చ కోణం నుంచి చూడాలని, ఒక వేళ ఎన్‌డిటివీ నిబంధనలను వుల్లంఘించిదనుకుంటే ఆ విషయాన్ని ఎన్‌బిఏ ఏర్పాటు చేసిన స్వయం నియంత్రణ సంస్ధ న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ స్టాండర్స్‌ అధారిటీ (ఎన్‌బిఎస్‌ఏ)కు నివేదించి వుండాల్సిందని, ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:పరిశీలించాలని ఎన్‌బిఏ కోరింది.

   ప్రభుత్వ నిర్ణయం అసాధారణమైందని ఖండిస్తూ తక్షణమే వెనక్కు తీసుకోవాలని భారత సంపాదకుల మండలి కోరింది.’ ఒక ఛానల్‌ను ఒక రోజు పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకోవటం మీడియా, తద్వారా దేశ పౌరుల స్వేచ్చపై ప్రత్యక్ష వుల్లంఘన, అంతేకాదు కఠినమైన సెన్సార్‌షిప్పును విధించటం అత్యవసరపరిస్థితి నాటి అవశేషమే. వార్తలు ఇచ్చిన తీరుతో ఎప్పుడైనా ప్రభుత్వం అంగీకరించకపోతే మీడియా పనిలో జోక్యం చేసుకొనే అధికారాన్ని స్వయంగా పుచ్చుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రసారాలను నిలిపివేయటం ఇదే మొదటిసారి. బాధ్యతా రహితంగా వార్తలను ఇచ్చినపుడు పౌరులు, రాజ్యానికి కోర్టు ద్వారా చర్యలు తీసుకోవటానికి చట్టపరమైన పలు పరిష్కార మార్గాలు వున్నాయి. న్యాయపరమైన జోక్యం లేకుండా నిషేధం విధింపు స్వేచ్చ, న్యాయమనే ప్రాధమిక సూత్రాలను వుల్లంఘించటమే.’ అని తన ప్రకటనలో పేర్కొన్నది. బ్రాడ్‌కాస్టర్స్‌ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ కూడా ఒక ప్రకటన చేసింది.నిషేధం విధించటం భావ ప్రకటనా స్వేచ్చను వుల్లంఘించటమే అని, నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలని కోరింది. ఈ వుదంతంపై తరువాత ఒక సమగ్రనివేదికను తయారు చేస్తామని తెలిపింది.

     ఎన్‌డిటీవిపై నిషేధాన్ని మీడియా రంగానికి చెందిన ఎడిటర్స్‌ గిల్డ్‌, బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌, అనేక జర్నలిస్టు సంఘాలు వ్యతిరేకించాయి. కారణాలు ఏమైనప్పటికీ కొంత మంది మౌనం పాటించారు. నిషేధాన్ని విమర్శిస్తే కేంద్ర ప్రభుత్వం లేదా ఎన్‌డియే పక్షాల రాష్ట్ర ప్రభుత్వాలకు కోపం వస్తుందని కావచ్చు, కొన్ని మీడియా సంస్ధలు ఆ విషయాన్ని ప్రచురించకుండా లేదా అప్రాధాన్యత ఇచ్చిగానీ మొత్తం మీద ఏదో తప్పనిసరై వార్త ఇవ్వాల్సి వచ్చిందిగానీ ప్రభుత్వానికి మేం వ్యతిరేకం కాదన్న సందేశాన్ని చేరవేశాయి. జెఎన్‌యు విద్యార్ధుల జాతీయ వ్యతిరేక నినాదాల ఆరోపణల గురించి నకిలీ వీడియోలను ప్రసారం చేసిన జీ మీడియా , ప్రముఖ పారిశ్రామిక సంస్ధ ఎస్సెల్‌ గ్రూప్‌ అధిపతి, రాజ్యసభ సభ్యుడిగా వున్న సుభాష్‌ చంద్ర మాత్రం ఎన్‌డిటివీని ఒక రోజు నిషేధించటం అన్యాయం, చిన్న శిక్ష , అసలు పూర్తిగా నిషేధించాలని ప్రకటించారు. ఒక వేళ అది కోర్టుకు వెళ్లినా అక్కడ చీవాట్లు తింటుందని కూడా ముందే చెప్పారు. అంతేకాదు, యుపిఏ హయాంలో తమ జీ న్యూస్‌ను నిషేధించాలనే ప్రతిపాదన వచ్చినపుడు మేథావులు, ఎడిటర్స్‌ గిల్డ్‌, ఎన్‌డిటివీ కూడా మౌనం వహించాయని కూడా సుభాష్‌ చంద్ర పేర్కొన్నారు.

    నిబంధనలను వుల్లంఘించినందుకు గాను ప్రభుత్వం 2005 నుంచి 28సార్లు ఇలా నిషేధ నోటీసులు జారీ చేసిందని వాటిలో 21 యుపిఏ హయాంలో జారీ అయినవే అని అధికారుల ద్వారా ప్రభుత్వం తన చర్యను సమర్ధించుకొనేందుకు చూసింది. దానిలో భాగంగానే ఎన్‌డిటీవీ తరువాత మరో రెండు ఛానల్స్‌పై తీసుకున్న చర్యలను వెల్లడించింది. ఇది జనాన్ని తప్పుదారి పట్టించే ఎత్తుగడ. నిబంధనలను వుల్లంఘించి అన్ని ఛానల్స్‌, పత్రికలపై చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ తప్పుపట్టటం లేదు. ఒకే తప్పు చేసిన మిగతావారిని వదలి ఒక్క ఎన్‌డిటివీపై మాత్రమే ఎందుకు చర్య తీసుకున్నారు? అన్నదే ప్రశ్న. గతంలో చర్యలు తీసుకున్నపుడు ఆయా ఛానల్స్‌ నిషేధాన్ని సవాలు చేయలేదు. అంటే అవి తప్పు చేసినట్లు అంగీకరించినట్లే. వాటిలో బూతు దృశ్యాలను చూపించిన కేసులు కూడా వున్నాయి.

    మీడియాలోని ప్రభుత్వ భక్తులు కొందరు విచిత్ర వాదనలను ముందుకు తెస్తున్నారు. భారత్‌లో మీడియా స్వేచ్చ తక్కువగానే వుందని చెబుతారు. అయితే అంటూ చైనా, బంగ్లాదేశ్‌, టర్కీ వంటి దేశాలలో ఇంతకంటే దారుణంగా వున్నాయనే వాదనలను ముందుకు తెస్తున్నారు.అంటే నిషేధాన్ని సమర్ధిస్తున్నట్లా ? మనకు కావాల్సిన నేత ఎలా వుండాలంటే ఎవరైనా గాంధీ గురించి చెబుతారు తప్ప అనేక మందితో పోల్చితే గాడ్సే మంచివాడే అన్నట్లుగా వుంది ఈ సమర్ధన. మన కంటే పత్రికా స్వేచ్చ మెరుగ్గా వున్న దేశాలతో పోల్చుకుంటే మనం ఎక్కడ ? ఇలాంటి చర్యలతో మనం ఎక్కడకు పోతున్నాం అన్నది ప్రశ్న.

    తన తప్పుడు చర్యను సమర్ధించుకొనేందుకు ప్రభుత్వం అనేక అసంబద్ద కారణాలను చూపుతోంది. టీవీ ఛానల్స్‌లో విలేకర్లు చెప్పిన సమాచారాన్ని వుగ్రవాదులు వుపయోగించుకొని దాడులు చేసే ప్రమాదం వుందట. వెనుకటి కెవడో అమాయకుడు నా పేరు ఫలానా రెడ్డి నీకు తెలివి వుంటే నా కులం ఏమిటో కనుక్కో అన్నాడట. ఏ దేశంలో అయినా సైనిక శిబిరాలలో సైనికులు, ట్యాంకులు, విమానాలు, మందుగుండు సామాగ్రి వుంటుందని వేరొకరు చెప్పాల్సిన అవసరం వుంటుందా ? అంతెందుకు మన ప్రభుత్వం ప్రకటించినట్లు మన సైన్యం జయప్రదంగా నిర్వహించిన సర్జికల్‌ దాడులు ఎక్కడ జరపాలో మన సైన్యం ఏ టీవీ, పత్రికా వార్తలను చూసి నిర్ణయించుకుందో ఎవరైనా చెప్పగలరా ? గూగుల్‌ మాప్‌లను చూస్తే ఎక్కడ ఏ సంస్ధలు వున్నాయో, ఎలా వెళ్లాలో కూడా ప్రపంచానికంతటికీ తెలుసు. అయినా దాడికి తెగబడిన వుగ్రవాదులు గానీ లేదా వారిని అంతంచేసేందుకు పూనుకున్న సాయుధ బలగాలు గానీ టీవీ వార్తలు చూసి తమ దాడి, ప్రతిదాడి వ్యూహాలను నిర్ణయించుకుంటారా ? ప్రభుత్వ వాదన ప్రకారమైతే దాడులకు ఒక చేత్తో ఆయుధం, మరో చేత్తో టీవీ పట్టుకోవాలి. పోనీ టీవీలో ఒక ఛానల్‌ కాదుగా అనేక ఛానల్స్‌ వుంటాయి. ఏ ఛానల్‌ ఏ సమాచారం తెలుస్తుందో రిమోట్‌లు నొక్కుతూ కాలక్షేపం చేస్తారా ? ఫఠాన్‌ కోట సైనిక శిబిరంపై దాడికి తెగబడ్డ వుగ్రవాదులను అంతం చేసిన మన సైన్యం వారి శవాల వద్ద టీవీ సెట్లు వున్నట్లు చెప్పలేదు. అత్యాధునికమైన ఇతర పరికరాలతో వారు ప్రవేశించినట్లు కదా ప్రకటించారు.

     ఒక వుదంతం గురించి దాదాపు ఒకే విధంగా వార్తలు ఇచ్చిన పత్రికలు, ఛానల్స్‌లో ఒక్క సంస్ధను మాత్రమే వేరు చేసి చర్య తీసుకోవటం వెనుక ఇతర కారణాలు వున్నాయా ? మోడీ సర్కార్‌ వివక్షను ప్రదర్శించిందా ? ఢిల్లీలోని ఆంగ్ల పత్రికలు, న్యూస్‌ ఛానల్స్‌ తమ పార్టీకి వ్యతిరేకమని భారతీయ జనతా పార్టీ అన్యాపదేశంగా గతంలో తరచూ ఆరోపించేది. ఇప్పుడు కూడా మీడియా పట్ల ఆ పార్టీ, దాని మిత్రపక్షాలకు సదభిప్రాయం లేదు. విమర్శనాత్మకంగా వుండటమే దానికి కారణం.విలేకర్లను ప్రెస్టిట్యూట్స్‌ అని ఏకంగా కేంద్రమంతి వికె సింగ్‌ నిందించారు. ఇంతకాలమైనా ప్రధాని నరేంద్రమోడీ మీడియాను కలవకుండా తప్పించుకోవటానికి ఆంగ్ల భాషా సమస్యతో పాటు ఇదొక కారణమని కూడా చెబుతారు.

    ఎన్‌డిటివీ విషయానికి వస్తే ఆ ఛానల్‌ అన్నా, దానిలో పనిచేసిన కొందరు జర్నలిస్టులన్నా నరేంద్రమోడీకి పడదు. బిజెపికి వీరాభిమాని అయిన జర్నలిస్టు, రచయిత్రి అయిన మధు కిష్వెర్‌ 2013లో మోడీ నామా పేరుతో తన పత్రికలో నరేంద్రమోడీ గురించి ఆకాశానికెత్తుతూ అనేక వ్యాసాలు రాశారు, తరువాత వాటిని పుస్తకంగా ప్రచురించారు.2014లో ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ ఆమెకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఇద్దరు జర్నలిస్టులు బర్ఖాదత్‌, రాజదీప్‌ సర్దేశాయి కారణంగానే 2002లో గుజరాత్‌లో ఘర్షణలు చెలరేగాయని మోడీ ఆరోపించారు. ‘తొలి 72 గంటలు(నాలుగు రోజులు) ఘర్షణలు అదుపులో వున్నాయి. తరువాత ఏమైంది ? కొన్ని సంఘటనలను జర్నలిస్టులు సంచలనాత్మకం గావించారు. సూరత్‌ నుంచి బర్ఖాదత్‌, ఒక దేవాలయ్యాన్ని విధ్వంసం చేశారని అంజార్‌ నుంచి సర్దేశాయి ప్రత్యక్ష ప్రసారాలలో వార్తలను అందించారు. సూరత్‌ నగరం ప్రశాంతంగా వుందని, అక్కడ పోలీసులెవరూ లేనందున అలజడులు జరిగే అవకాశముందని బర్ఖాదత్‌ పదే పదే చెప్పారని, ఆమెను పిలిచి మీరు విధ్వంసకారులను సూరత్‌కు ఆహ్వానిస్తున్నారా అని నిలదీశానని, ఆరోజే ఆ ఛానల్‌ను తాను నిషేధించానని మోడీ చెప్పారు. అయితే తరువాత తానసలు సూరత్‌ వెళ్లలేదని బర్ఖాదత్‌ వివరణ ఇచ్చారని వార్తలు వచ్చాయి. నిజానికి గుజరాత్‌ మారణకాండ సందర్భంగా అనేక ఛానల్స్‌ సంచలనాత్మక కధనాలు ఇచ్చినప్పటికీ నరేంద్రమోడీ వాటిని పట్టించుకోలేదు. లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ఒక్క ఎన్‌డిటీవితో తప్ప ఇతర అన్ని ఛానల్స్‌కు ఇంటర్వూ ఇచ్చారు.

    ఇటీవలి కాలంలో ఢిల్లీ జెఎన్‌యు ఘటనలు, గుజరాత్‌లో అమిత్‌ షా సభను ఆటంక పరిచిన పటేళ్ల ఆందోళన, దళితులపై దాడులకు వ్యతిరేకంగా జరిగిన జరిగిన యాత్ర, గుజరాత్‌ దళితనేత జిగ్నేష్‌ మేవానీ, గుజరాత్‌లో అమ్‌ పార్టీ నేత కేజిరీవాల్‌ సభ గురించి బిజెపి, నరేంద్రమోడీ అండ్‌కోకు నచ్చని రీతిలో ఎన్‌డిటివీ వార్తలను ప్రసారం చేసింది. జెఎన్‌యు ఘటనల సందర్భంగా కొన్ని టీవీ ఛానల్స్‌ వ్యవహరించిన తీరును ఎండగడుతూ ఎన్‌డిటివీ హిందీ ఛానల్‌ అరగంటపాటు బొమ్మలు లేకుండా కేవలం అక్షరాలనే ప్రదర్శించి తనదైన శైలిలో వ్యవహరించింది. ఇది కూడా బిజెపి నేతలకు ఆగ్రహం తెప్పించింది. పాలకపార్టీ, ప్రభుత్వ తీరుతెన్నులను బహిర్గత పరుస్తున్న కారణంగానే ఎన్‌డిటివీ యాజమాన్య నిర్వహణ, ఆర్ధిక వ్యవహారాల గురించి వేధింపులకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. టేకోవర్‌ నిబంధనలను సరిగా పాటించలేదంటూ సెబి, విదేశీ మారక ద్య్రవ నిబంధనలను వుల్లంఘించారంటూ ఎన్‌ఫోర్స్‌డైరెక్టరేట్‌ ద్వారా ఒక నోటీసు పంపి వేధింపులకు పూనుకుందన్న విమర్శలు వున్నాయి.

    భారతీయ జనతా పార్టీ తన అధికారాన్ని వుపయోగించి అధికారుల ద్వారా ఈ విధమైన వేధింపులకు పాల్పడటంతో పాటు ఎన్‌డిటివీపై తన అనుచరగణాన్ని వుసిగొల్పి సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున దాడి చేయిస్తున్నది. ఇది ఒక విధంగా బ్లాక్‌ మెయిలింగ్‌ ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఒక సంస్ధ తప్పు చేస్తే దానిపై ఫిర్యాదు చేయవచ్చు, కేసులు దాఖలు చేయవచ్చు. కానీ ఆ సంస్ధలలో పనిచేస్తున్న సిబ్బంది వ్యక్తిగత జీవితాలపై సామాజిక మీడియాలో ప్రచారం చేయటం హేయం. అది ముదిరితే ఏదో ఒకనాటికి నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు బిజెపి, దాని నేతలపైన కూడా దానిని ప్రయోగిస్తారని వారు తెలుసుకోవటం లేదు. వారు ఒక్క జర్నలిస్టుల గురించే కాదు, తమను వ్యతిరేకించే వారందరి పట్ల ఇదే విధంగా వ్యవహరిస్తారనే విమర్శ వుంది. స్వంత పార్టీలోనే నరేంద్రమోడీని వ్యతిరేకించిన సంజయ్‌ జోషి ఒక మహిళతో వున్నట్లు చూపే బూతు సీడీలను ఆ పార్టీ వారే పంపిణీ చేయించారనే విమర్శలు వున్న విషయం తెలిసిందే. ఆ సంజయ్‌ జోషికి తిరిగి పార్టీలో పదవి ఇచ్చినందుకు గాను పదవి నుంచి తొలగించే వరకు తాను పార్టీ సమావేశాలకు రానని 2009లో నరేంద్రమోడీ బెదిరించిన విషయం, అందుకు పార్టీ తలొగ్గిన విషయం తెలిసిందే. అందువలన ఒక ఛానల్‌, ఒక పత్రికపై జరుగుతున్న దాడిగా దీనిని చూస్తే రాబోయే ముప్పును విస్మరించినట్లే. అధికారంలో వున్న పార్టీ ఈ విధంగా తనకు నచ్చని మీడియాను వేధించటమంటే లొంగదీసుకొని భజన చేయించుకొనేందుకే తప్ప మరొకటి కాదు. ఈ రోజు ఒక పార్టీ అధికారంలో వుంటే రేపు మరొక పార్టీ రావచ్చు. అప్పుడు మరికొన్ని ఛానల్స్‌, పత్రికల పని పట్టవచ్చు. తెలంగాణాలో ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానల్‌ను కేబుల్‌ ఆపరేట్ల ద్వారా అడ్డుకోవటాన్ని ఖండించిన తెలుగు దేశం పార్టీ తాను అధికారంలో వున్న ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి ఛానల్‌ను కూడా అదే పద్దతుల్లో అడ్డుకున్న విషయం చూశాము. ఆంధ్రజ్యోతిని అడ్డుకున్నపుడు సాక్షి మౌనం వహిస్తే సాక్షిపై దాడి జరిగినపుడు ఆంధ్రజ్యోతి కూడా అదే పని చేసింది. ఇది మీడియాలో అవాంఛనీయ పోకడ. యాజమాన్యాల వైఖరి కారణంగా ఆయా సంస్ధలలో పని చేసే జర్నలిస్టులు ఇరకాటంలో పడుతున్నారు. యాజమాన్యాలతో పాటు వారిని కూడా శత్రువులుగా చూస్తున్నారు. ఇప్పుడు ఎన్‌డిటీవి విషయంలో కూడా కొన్ని మీడియా యాజమాన్యాల వైఖరి అలాగే వుంది. పాలకపార్టీలకు ముఖ్యంగా అన్ని వ్యవస్ధలను తమ చెప్పుచేతల్లో వుంచుకోవాలని చూస్తున్న శక్తులకు కావాల్సింది ఇదే. ముందు విమర్శనాత్మకంగా వున్న వాటిని తొక్కిపెడితే మిగిలిన వాటిని అదుపు చేయటం వాటికి చిటికెలో పని. అందుకే జర్నలిస్టులు యాజమాన్యాల వైఖరితో నిమిత్తం లేకుండా స్వతంత్ర వైఖరిని కలిగి వుండి, మీడియా, తద్వారా భావ ప్రకటనా స్వేచ్చపై జరిగే దాడిని ఎదుర్కోవటంలో ముందుండటం అవసరం.

గమనిక :నవంబరు నెల వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి మాస పత్రికలో ప్రచురణ నిమిత్తం రాసినది

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ సర్కార్‌పై మరో రేటింగ్‌ సంస్ధ క్రిసిల్‌ వత్తిడి

04 Friday Nov 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

CRISIL, Modi, Narendra Modi, narendra modi government, rating agency crisil, s&p

ఎం కోటేశ్వరరావు

    గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధిని దేశమంతటికీ వర్తింప చేస్తామని వూరూ వాడా ప్రచారం చేసిన నరేంద్రమోడీ అండ్‌ కో ఇప్పుడు దాని గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. అది మంచిదా, చెడ్డదా అన్న విషయాన్ని పక్కన పెడితే తాను అమలు జరిపినట్లు చెప్పుకున్న దానినే మోడీ ఎందుకు అమలు జరపటం లేదని అది మంచి విధానం అనుకొనే వారు కూడా మోడీని ప్రశ్నించటం లేదు. ఫలితాలు చూపకుండా ఎవరి డబ్బా వారు ఎంత కాలం కొట్టుకుంటారు, ఆ స్ధితిలో ఏదో ఒక సంస్ధ ఇచ్చే కితాబు కోసం ఎవరైనా ఎదురు చూస్తారు. ఇప్పుడు నరేంద్రమోడీ ఆ స్థితిలో వున్నారు కనుకనే ప్రపంచబ్యాంకు ర్యాంకింగుల  ఇండెక్సు, రేటింగ్‌ సంస్ధల రేటింగ్‌ల కోసం వెంపర్లాడుతున్నారు. గతంలో ఇందిరా గాంధీని ఏవమ్మా ధరలు పెరుగుతున్నాయేమంటే కారణం విదేశీ హస్తం అని చెప్పేవారని జోక్‌ చేసేవారు. ఎందుకంటే విదేశీ హస్తాన్ని ఆమె అంతగా వాడుకున్నారు. చివరకా విదేశీ హస్తానికే ఆమె బలికావటం విషాదం అనుకోండి. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత మన ఎగుమతులు నెలనెలా పడిపోతున్నట్లు వార్తలు రావటమే తప్ప పెరిగినట్లు ఇంతవరకు వినలేదు. కారణం విదేశాలలో పరిస్ధితులు బాగోలేవు అని చెబుతున్నారు. అది ఒక్క మన దేశానికేనా మిగతా దేశాలకు వర్తించవా ? అని ఎవరైనా అడిగితే దేశద్రోహి అన్నట్లుగా విరుచుకుపడతారు.

     మరో రెండు సంవత్సరాల వరకు రేటింగ్‌ను మార్చాల్సినంత సీన్‌ లేదని స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ రేటింగ్‌ సంస్ద గాలి తీసింది. దాని కొనసాగింపా అన్నట్లుగా ఇప్పుడు క్రిసిల్‌ అనే మరో సంస్ధ మన ఎగుమతులు పడిపోవటానికి ప్రతికూల పరిస్ధితులే కారణమని సాకు చెపితే కుదరదని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవటంతో పాటు దేశీయంగా వినియోగాన్ని కూడా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తాజాగా రూపొందించిన ఒక విశ్లేషణ పత్రంలో పేర్కొన్నది. ప్రధాని ఇచ్చిన మేకిన్‌ ఇండియా పిలుపును జయప్రదం చేయాలంటే రెండు మార్గాలు అనుసరించాలని సూచిస్తూ ఆ పత్రానికి ‘బైఫోకల్‌ ప్లీజ్‌ ‘ ( దయచేసి రెండు మార్గాల్లో నడవండి ) అని పేరు పెట్టింది.http://www.thehindu.com/business/Economy/global-situation-not-to-blame-for-fall-in-exports-crisil-study/article9301285.ece గత కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరించిన దివాలా కోరు విధానాలను కొనసాగిస్తూ, సంక్షేమ చర్యలకు మరింత కోత విధిస్తూ, పౌరుల ఆదాయాల పెంపునకు అవసరమైన విధానాలు అమలు జరపకుండా దేశీయ వినియోగాన్ని పెంచటం నరేంద్రమోడీ సర్కార్‌కు సాధ్యమేనా అన్నది ప్రశ్న. కుండలో కూడు తరగ కూడదు పిల్లాడు మాత్రం బొద్దుగా తయారు కావాలంటే సాధ్యమేనా ? రేటింగ్‌ సంస్ధలు చేసే విమర్శలు, విశ్లేషణలన్నీ కార్పొరేట్లకు అనుకూలంగానే వుంటాయన్నది గమనంలో వుంచుకోవాలి. క్రిసిల్‌ రేటింగ్‌ సంస్ధ విశ్లేషణతో ఏకీభవించటమా లేదా అన్నది పక్కన పెడితే అసలదేం చెప్పిందో చూద్దాం.

    ఎగుమతుల పోటీ తత్వాన్ని పెంచేందుకు కార్మిక చట్టాలలో వున్న కాఠిన్యతను తొలగించాలి, భూ సేకరణతో ముడిపడిన సవాళ్లను పరిష్కరించాలి, అరకొరగా వున్న రోడ్లు,రేవులు, విద్యుత్‌ వంటి వాటిని పుష్కలంగా సమకూర్చాలి, నైపుణ్యం లేని మానవశక్తి స్ధానంలో నిపుణులను అందుబాటులోకి తేవాలి. ప్రపంచబాంకు సమాచారం ప్రకారం 2014లో ఒక కంటెయినర్లో వస్తువులను ఎగుమతి చేయాలంటే భారత్‌లో ఖర్చు 1332 డాలర్లు, అదే బంగ్లాదేశ్‌కు 1281, చైనాకు 823, వియత్నాంకు 610, ఇండోనేషియాకు 572 డాలర్లుగా వుంది. చైనా తక్కువ విలువ ఆధారిత వుత్పత్తులైన వస్త్రాలు, దుస్తులు, పాదరక్షలు, బొమ్మల నుంచి వైదొలగి అధిక విలువ వుండే వస్తువుల వైపు మరలుతున్నందున దాని ఖాళీలో భారత్‌ ప్రవేశించాలంటే పైన పేర్కొన్న చర్యల వంటి వాటిని తీసుకోవాలి. అయితే ఇప్పటివరకు అందుబాటులో వున్న సమాచారం మేరకు ఇంతవరకు ఇలాంటి చర్యలు లేవు. వుదాహరణకు జౌళి రంగంలో భారత ఎగుమతులు 2001-15 మధ్య కాస్త అటూ ఇటూగా ఒకే విధంగా వున్నాయి. బంగ్లాదేశ్‌, వియత్నాం ఎన్నో రెట్లు పెంచాయి. పాదరక్షల విషయంలో కూడా భారత వాటా గిడసబారి పోగా వియత్నాం దూసుకుపోయింది.

      ఈ నివేదికలో పేర్కొన్న డిమాండ్లను విదేశీ, స్వదేశీ కార్పొరేట్లు ఇప్పుడేదో కొత్తగా తెచ్చినవి కాదు, ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం భూ సేకరణ చట్ట సవరణకు పూనుకుంది. రూపాయి విలువ పెంచకుండా, సాధ్యమైన మేరకు తగ్గించేందుకు నరేంద్రమోడీ తన సర్వశక్తులు ధారపోస్తున్నారు. ఈ పూర్వరంగంలోనే తెలంగాణా,ఆంధ్రప్రదేశ్‌లలో పూలింగ్‌ పేరుతో రైతుల నుంచి భూములు తీసుకుంటున్నారు. ప్రశ్నించిన రైతులను అరెస్టు చేస్తున్నారు, బెదిరించి దారికి తెచ్చుకుంటున్నారు. కార్మిక చట్టాలు వున్నప్పటికీ వాటి అమలును పక్కన పడేశారు, ఎక్కడైనా కార్మికులు ప్రశ్నిస్తే పోలీసులను రంగంలోకి దించి పారిశ్రామిక, వాణిజ్య వేత్తలకు భరోసా, ధైర్యం కల్పించే చర్యలకు పూనుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దివీస్‌ లాబ్‌ విస్తరణ, తుందుర్రులో రొయ్యల శుద్ధి కర్మాగారం ఏర్పాటును వ్యతిరేకిస్తున్న వారిపై జరుగుతోంది ఇదే. క్రిసిల్‌ చెప్పిన ఒక మార్గంలో ఇవన్నీ భాగమే. ఇక అది చెప్పిన రెండవ మార్గం స్ధానిక వినిమయం లేదా డిమాండ్‌ పెంచటం గురించి చూద్దాం. ఇక్కడే మన దేశానికి చైనాకు కనిపిస్తున్న ప్రధాన వైరుధ్యం. ఎవరైనా దీన్ని ప్రస్తావిస్తే అది కమ్యూనిస్టు నియంతృత్వ దేశం, మనది స్వేచ్చా ప్రజాస్వామిక దేశం అన్న సమాధానం టక్కున చెప్పేస్తారు. ప్రజాస్వామ్యంలో వేతనాల పెంపుదల ద్వారా ప్రజల ఆదాయాలు తద్వారా వినిమయాన్ని పెంచవద్దని ఎవరైనా చెప్పారా ? పోనీ కమ్యూనిస్టు నియంతృత్వంలో బలవంతగా వేతనాలు పెంచేట్లు చేశారనుకుందాం, ప్రజాస్వామ్యంలో స్వచ్చందంగా పెంచవచ్చు కదా ? ఎందుకు ఆ పని చేయటం లేదు.

   http://www.businesstoday.in/magazine/features/textile-sector-target-one-crore-jobs-in-three-years/story/238641.html బిజినెస్‌ టుడే తాజా సంచికలో జౌళి రంగం గురించి రాసిన వ్యాసంలో వివిధ దేశాలలో ఆ రంగంలో పని చేస్తున్న కార్మికుల వేతనాల గురించి ప్రస్తావన వుంది. దాని ప్రకారం చైనాలో నెలకు 314, వియత్నాంలో 145, భారత్‌లో 120, బంగ్లాదేశ్‌లో 68 డాలర్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. చైనాలో మన కంటే వేతనాలు తక్కువ కారణంగా అది చౌకగా దుస్తులను ఎగుమతి చేయగలుగుతున్నదని ఎవరైనా వాదిస్తే దీనికి ఏం జవాబు చెబుతారు ? ఒక్క ఈ రంగంలోనే కాదు అన్నింటా వేతనాలు పెరుగుతున్నాయని అమెరికా ఆర్ధికవేత్తలే చెబుతున్నారు. ఈ కారణంగానే 2008 నుంచి ధనిక దేశాలలో తలెత్తిన మాంద్మం కారణంగా చైనా ఎగుమతులు తగ్గిపోయినప్పటికీ, వాటి స్ధానాన్ని దేశీయ వినియోగం పెంచటం ద్వారా భర్తీ చేస్తున్నది. అందుకే పెద్దగా సమస్యలు రాలేదు. ఎగుమతి ఆధారిత విధానం నుంచి క్రమంగా దేశీయ డిమాండ్‌ పెంపుదలకు తీసుకుంటున్న చర్యలను విస్మరిస్తే సరైన అంచనాకు రాజాలము.http://www.sify.com/finance/struggling-indian-savers-threaten-modi-s-growth-ambition-news-economy-qk2eEhagffebf.html ఇది గతనెలాఖరులో రాయిటర్స్‌ ఇచ్చిన వార్త. చైనా నుంచి అభివృద్ధి పతాకాన్ని అందిపుచ్చుకోవాలని చూస్తున్న భారత కలలకు పడిపోతున్న పొదుపు రేటు ఒక హెచ్చరిక అని మన స్ధూల జాతీయాదాయం (జిడిపి)లో జాతీయ పొదుపు మొత్తం 2003వ సంవత్సరం తరువాత అతి తక్కువగా ఈ ఏడాది 30.2శాతానికి పడిపోయిందని, రానున్న రెండు సంవత్సరాలలో కూడా ఇది తగ్గుతుందని అంతర్జాతీయ వాణిజ్య సంస్ధ అంచనా వేస్తున్నట్లు దానిలో వుంది. రాయిటర్స్‌గానీ, ఐఎంఎఫ్‌ గానీ మోడీ వ్యతిరేక సంస్ధలు కావని గుర్తించాలి. మన జనం పైసా పైసా కూడ బెట్టి బ్యాంకులు, పోస్టాఫీసులు తదితర సంస్ధలలో దాచుకుంటారు. వుద్యోగులు ప్రావిడెంట్‌ ఫండ్స్‌, బీమా పధకాల వంటి వాటిలో జమ చేస్తారు. ఈ మొత్తాలను పారిశ్రామిక వాణిజ్య వేత్తలు తమ పెట్టుబడులుగా వుపయోగించుకుంటారు. విజయ మాల్య, కావూరు సాంబశివరావు, సుజనా చౌదరి వంటి వారు కూడా వారిలో వుంటారనుకోండి, ఆ కథలు వేరే. దేశీయంగా పొదుపు మొత్తం తగ్గితే వారు మన కంటే తక్కువ వడ్డీకి వచ్చే విదేశీ పెట్టుబడులపై ఆధారపడతారు. అయితే దాని ఇబ్బందులు దానికి వుంటాయి.

    అభివృద్ధిలో చైనాను వెనక్కు నెట్టి వుద్యోగాలు కావాలనే వారి జాబితాలో ప్రతినెలా చేరు తున్న కోటి మంది యువతీ యువకులకు వుపాధి కల్పిస్తామనే నినాదంతో కదా నరేంద్రమోడీ అధికారానికి వచ్చింది. నూట ముఫ్ఫై కోట్ల జనాభాలో మూడింట రెండు వంతుల మంది 35 సంవత్సరాల వయస్సు లోపు వారే, ఇంత మొత్తం గతంలో ఎన్నడూ లేరు. వారందరికీ వుపాధి కల్పించాలంటే నిరంతర అభివృద్ధి జరిగేందుకు ప్రధాన షరతుగా చెప్పాలంటే దేశీయ పొదుపు మొత్తం 35శాతానికి తగ్గకూడదని సీనియర్‌ ఆర్ధిక వేత్త హన్నా లుచినకావా చెప్పారు. మన దేశంలో ఏడాది క్రితం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మన పొదుపు 29.6శాతానికి పడిపోయింది. చైనా, తూర్పు ఆసియా దేశాలలో దశాబ్దాల తరబడి పొదుపు రేటు 30శాతానికి మించే వుంటున్నది. ఇప్పటి వరకు కొన్ని లక్షల కోట్ల రూపాయలను మౌలిక సదుపాయాల కల్పన పేరుతో ఖర్చు చేశారు. ఇంకా అంతరం వున్నందున పూర్తిగా సమకూర్చాలంటే మరొక లక్షా 70వేల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు అవసరం అవుతాయని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది.

    పాలకులు అనుసరించిన విధానాల కారణంగా మరోవైపున సంవత్సరాల తరబడి కొనసాగుతున్న అధిక ద్రవ్యోల్బణం, బలహీనమైన వుద్యోగ కల్పన, వున్నవి కూడా అరకొరవేతనాలు, అభివృద్ధి మందగింపు వంటి అనేక అంశాలు జనం జేబులను ఖాళీ చేస్తున్నాయి. అప్పులలో ముంచుతున్నాయి. ఈ స్ధితిలో పొదుపు చేయటానికి వారి దగ్గర డబ్బెక్కడ వుంటుంది ? న్యూఢిల్లీలోని ఒక ఎలక్ట్రిక్‌ కంపెనీలో మార్కెటింగ్‌ మేనేజర్‌గా పని చేస్తున్న 50 ఏండ్ల టేక్‌ మోహన్‌లాల్‌ గత మూడు సంవత్సరాలుగా తనకు సగటున ఏడాదికి ఎనిమిదిశాతం వేతనం పెరిగిందని అయితే పిల్లల విద్య, తల్లికి మందుల ఖర్చు 40శాతం పెరిగిందని చెప్పినట్లు రాయిటర్స్‌ తెలిపింది. ప్రయివేటు వుద్యోగుల పరిస్ధితి దాదాపు అన్ని చోట్లా ఇంతే వుంది. ద్రవ్యోల్బణం తగ్గిందంటూ రిజర్వు బ్యాంకు ఇటీవలి కాలంలో 175 పాయింట్ల మేరకు వడ్డీ రేట్లను తగ్గించింది. దాంతో బ్యాంకులు కూడా ఆ మేరకు డిపాజిటర్లకు వడ్డీ రేట్లు తగ్గించాయి. ఇవి పొదుపు చేసే వారిని ఆకర్షించటం లేదు. కొన్ని ధనిక దేశాలలో ఎవరైనా బ్యాంకులలో డబ్బు దాచుకుంటే వారే బ్యాంకులకు ఎదురు వడ్డీ ఇచ్చే పరిస్ధితి వుంది. మన దేశంలో అధిక వడ్డీ రేటు కోసం పొదుపర్లు చూసే విషయం తెలిసిందే. బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించిన కారణంగా గత 53 సంవత్సరాలలో తొలిసారిగా బ్యాంకు డిపాజిట్ల అభివృద్ధి రేటు తగ్గిపోయింది.

   2013 నుంచి సవరించిన వృత్తుల నూతన వర్గీకరణ సమాచారం ప్రకారం http://indianexpress.com/article/india/india-others/rural-wage-growth-lowest-in-10-years-signals-farm-distress-falling-inflation/ మన దేశంలో 2014 నవంబరు మాసంలో గత పది సంవత్సరాలలో అతి తక్కువ గ్రామీణ వేతనం నమోదైంది. సగటున గ్రామీణ ప్రాంత వేతనాలు నవంబరు నెలలో 3.8శాతం వార్షిక పెరుగుదల కాగా 2005 తరువాత అది కనిష్టంగా వున్నట్లు తేలింది. నిజానికి కార్మికశాఖ లెక్కలు వాస్తవ పరిస్ధితులను ప్రతిబింబించవు అనే అభిప్రాయం ఒకటి వున్నప్పటికీ వాటి ప్రకారం కూడా తగ్గింది. 2011 జూన్‌లో గరిష్టంగా 23శాతం వరకు పెరిగింది. తరువాత క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే బొగ్గులేరుకోవటానికి భలే అవకాశం వచ్చిందిలే అని మరొకడు సంబరపడినట్లుగా గ్రామీణ వేతనాల పెరుగుదల రేటు తగ్గుదల వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం కంటే తక్కువగా వున్నందున వడ్డీ రేట్లు ఇంకా తగ్గించటానికి అవకాశాలు మెరుగుపడ్డాయని రిజర్వుబ్యాంకు విధాన నిర్ణేతలు భావిస్తుండటం ఆందోళనకరం. గ్రామీణ వేతన రేట్ల పెరుగుదల తగ్గటం అంటే వారి ఆదాయాలు పడిపోవటమే, దాని పర్యవసానం కొనుగోలు శక్తి క్షీణిస్తుంది అది దేశీయ డిమాండ్‌ తగ్గటానికి దారితీసి పరిశ్రమల మూత వంటి పరిణామాలకు దారితీస్తుంది. గత ఐదు సంవత్సరాల కాలంలో గ్రామీణ వేతనాలు వేగంగా పెరిగినందున అది ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ పెరుగుదలకు దారితీసిందనే తప్పుడు సిద్ధాంతాన్ని చెబుతున్నారు. 2007 నుంచి గ్రామీణ వేతనాల పెరుగుదలకు కారణం వ్యవసాయేతర వుపాధి అవకాశాలు పెరగటం, దానికి తోడు వుపాధి హామీ పధకం తోడైందని, రైతాంగ పంటలకు మంచి ధరలు వచ్చినందున పెరిగిన వేతనాలను రైతాంగం భరించగలిగిందని సూత్రీకరిస్తున్నారు. ఇప్పుడు నిర్మాణ, వుత్పాదక రంగం బలహీనపడటం, పంటల ధరలు పడిపోవటం వంటి కారణాలతో గ్రామీణ ప్రాంతాలలో వేతనాల పెరుగుదల రేటు పడిపోయింది. దానికి తోడు వుపాధి హామీ పధకానికి తూట్లు పొడుస్తున్నందున గ్రామీణ వేతన రేట్లు ఇంకా పడిపోయే అవకాశం వుంది.

   గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో సామాన్య, మధ్యతరగతి వారి ఆదాయాలను హరిస్తున్నవాటిలో విద్య, వైద్య ఖర్చులు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు గాక రుణ వూబిలో కూరుకుపోవటం గురించి మాత్రమే తెలుసు ఇప్పుడు గ్రామీణ, పట్టణ పేదలు, సామాన్య రైతాంగం విద్య, వైద్య ఖర్చుల రుణ వూబిలో దిగబడిపోతున్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లి బయటకు రావాలంటే అప్పులు చేయటం మినహా మరొక మార్గం లేదన్నది అందరికీ తెలిసిందే. ఇటు వంటి స్ధితిలో పొదుపు మరింతగా పడిపోవటం అనివార్యం. దానితో పాటు పారిశ్రామిక వస్తువుల డిమాండ్‌ కూడా పడిపోతుంది. అపుడు క్రిసిల్‌ పేర్కొన్న రెండవ రోడ్డు మార్గం మూసుకుపోతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రేటింగ్‌ మతలబులో మరిన్ని భారాలు, సబ్సిడీల కోతకు వత్తిడి !

03 Thursday Nov 2016

Posted by raomk in BJP, CHINA, Congress, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

failure Modi, india debt, Modi Sarkar, Narendra Modi, s&p india, s&p india rating, subsidy, subsidy cuts

ఎం కోటేశ్వరరావు

    వూహల పల్లకిలో తేలుతున్న ప్రధాని నరేంద్రమోడీకి వారం రోజుల్లోనే రెండు చెడువార్తలు. సరళతర వాణిజ్య సూచికలో ప్రపంచ బ్యాంకు మన స్ధానాన్ని 131 నుంచి కేవలం 130కి మాత్రమే తాజాగా సవరించింది. పులి మీద పుట్రలా ఆ దెబ్బ నుంచి కోలుకోక ముందే అమెరికా రేటింగ్‌ సంస్ధ స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ (ఎస్‌అండ్‌ పి) వచ్చే రెండు సంవత్సరాల వరకు ప్రస్తుతం అత్యంత నాసిగా వున్న భారత్‌ రేటింగ్‌ను సవరించేది లేదని తేల్చి చెప్పింది. అంటే మన ప్రధాని నరేంద్రమోడీ సర్కార్‌ ‘పని తీరు మీద అంతగట్టి విశ్వాసం ‘ ఏర్పరుచుకుందన్న మాట. తాను రాగానే అంతర్జాతీయ సమాజంలో గత ప్రభుత్వ హయాంలో గతించిన భారత ప్రతిష్టను ఎంతగానో ఇనుమడింప చేశానని తనకు తానే కితాబు ఇచ్చుకున్న నరేంద్రమోడీకి దీన్ని పెద్ద తిట్టు, అవమానంగా భావిస్తారా ? లేక సంతృప్తి పరచే చర్యలు తీసుకుంటారా ? ఆ సంస్ధ మనకు ఇచ్చిన రేటింగ్‌‘ BBB-/A-3’ . దీన్ని వాణిజ్య పరిభాషలో చెప్పాలంటే పెట్టుబడులకు సంబంధించి అత్యంత తక్కువ గ్రేడ్‌ ఇది. ఇప్పుడున్న స్ధితి, జోస్యాలను బట్టి ఈ గ్రేడ్‌ అయితే స్ధిరంగా వుంటుందని, వచ్చే ఏడాది కూడా దీనిని సమీక్షించే అవకాశం లేదని, ప్రభుత్వ సంస్కరణలు, ద్రవ్య పరిస్ధితిని మెరుగు పరిస్తే, ప్రభుత్వ రుణం జిడిపికి 60శాతం కంటే తగ్గితే అప్పుడు రేటింగ్‌ సవరణ గురించి సమీక్షిస్తామని చెప్పటం పుండుమీద కారం చల్లటం వంటిది. సెప్టెంబరు నెలలో మూడీస్‌ సంస్ధ కూడా ఇదే విధంగా ఒకటి రెండు సంవత్సరాల తరువాతే సమీక్షిస్తామని చెప్పటాన్ని మరిచిపోరాదు. ప్రస్తుతం మన ప్రభుత్వ రుణ భారం 69శాతం వుంది. అంటే మనకు వంద రూపాయల ఆదాయం వస్తుందనుకుంటే అప్పు 69 రూపాయలు వున్నట్లు. మన జిడిపి పెరుగుదల గురించి మంచి మాటలు చెప్పిన ఎస్‌ఆండ్‌ పి 2016లో 7.9శాతం, 2016-18 సంవత్సరాలలో సగటున ఎనిమిది శాతం పెరుగుదల వుంటుందని, జిఎస్‌టి వంటి చర్యల పట్ల అభినందనలు కూడా తెలిపింది. అయితే ఈ బలంతో పాటు తక్కువగా వున్న తలసరి ఆదాయం, ప్రభుత్వ ఖజనా బలహీనంగా వుండటం, బ్యాంకింగ్‌ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల వంటి బలహీనతలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటదని తేల్చి చెప్పింది.

    ఈ ప్రకటనతో హతాశురాలైన ప్రభుత్వం పెట్టుబడిదార్ల ఆలోచన, రేటింగ్‌ ఏజన్సీల మధ్య సంబంధాలు లేనట్లు కనిపిస్తున్నదని ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌ ద్వారా వ్యాఖ్యానించింది.ఆర్ధిక వ్యవస్ధను పటిష్ట పరిచేందుకు, జిడిపి అభివృద్ధిని పెంచేందుకు, వుద్యోగ కల్పనకు ప్రయత్నిస్తామని కూడా దాస్‌ చెప్పారు.రేటింగ్‌ను మెరుగు పరచనంత మాత్రాన ప్రభుత్వం పెద్దగా ఆందోళన చెందటం లేదని, సంస్ధ నివేదికలో పేర్కొన్నట్లుగా వివిధ అంశాలను పోల్చుకుంటే భారత్‌తో సమంగా మరొక ఆర్ధిక వ్యవస్ధ వుందా అని ప్రశ్నిస్తూ రేటింగ్‌ ఇవ్వబోయే ముందు ఆత్మావలోకనం చేసుకోవాలని కూడా దాస్‌ అన్నారు. భారత రేటింగ్‌ను తక్కువ చూపుతున్నారని ప్రపంచ మదుపుదార్లు భావిస్తున్నారని, వారి ఆలోచనలు- రేటింగ్‌ సంస్ధలకు మధ్య సంబంధం లేనట్లుగా కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు.

    మన ప్రభుత్వ రుణ భారం 1991లో ఆర్ధిక సంస్కరణలు ప్రారంభించిన సమయంలో జిడిపిలో 75.33 శాతం వుండేది. అది 1998లో బిజెపి నేత వాజ్‌పేయి నాయకత్వంలో ఎన్‌డిఏ అధికారానికి వచ్చే నాటికి 68.09 శాతానికి తగ్గింది. తమ పాలనలో భారత్‌ వెలిగిపోతోంది అన్న నినాదంతో ఎన్నికల బరిలో దిగి బిజెపి ఓడిపోయిన సమయానికి 2003లో అప్పును రికార్డు స్ధాయికి 84.24 శాతానికి బిజెపి సర్కార్‌ తీసుకుపోయింది. ఆ తరువాత 2013 నాటికి 67.96 శాతానికి తగ్గింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2015 నాటికి 69.07 శాతానికి పెరిగింది.http://countryeconomy.com/national-debt/india 2015 వివరాల ప్రకారం ప్రపంచంలోని 184 దేశాల జాబితాలో జడిపి-రుణం నిష్పత్తిలో మన దేశం 140 స్ధానంలో తలసరి అప్పులో 69లో వుంది.

Image result for worried arun jaitly

    మన దేశంలో కొంత మంది దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో వుండేందుకు ప్రయత్నిస్తారు. అనేక సందర్భాలలో చైనా, పాకిస్తాన్‌లతో మన దేశాన్ని పోల్చుకుంటారు. తప్పులేదు. అందుకే మచ్చుకు కొన్ని పోలికలు చూడండి.http://countryeconomy.com/countries/compare/china/india సమాచారం ప్రకారం 2015వ సంవత్సరంలో కొన్ని వివరాలు ఇలా వున్నాయి. జిడిపి మిలియన్‌ డాలర్లలో, తలసరి ఆదాయం డాలర్లుగా గమనించాలి.

                                చైనా                    భారత్‌                 పాకిస్తాన్‌

జిడిపి                  11,181,556             2,073,002             271,050

జిడిపి తలసరి                8,141                   1,581                 1,428

జిడిపిలోరుణశాతం           42.92                   69.07                 63.57

జిడిపిలోలోటుశాతం            2.69                     6.91                   5.24

     నరేంద్రమోడీ లేదా గతంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వమైనా అనుసరిస్తున్నది విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ అనుకూల విధానాలే అన్నది స్పష్టం. వివిధ దేశాలలోని రేటింగ్‌ సంస్ధలన్నీ వారి కనుసన్నలలో నడిచేవే, వారి లాభాలను కాపాడేవే అన్నది గమనంలో వుంచుకోవాలి. ఈ పూర్వరంగంలో ప్రపంచబ్యాంకు సూచికను చూసినా, ప్రస్తుత ఎస్‌ఆండ్‌ పి రేటింగ్‌ను గమనించినా మన దేశ పాలకవర్గం నుంచి ఇంకా మరిన్ని రాయితీలు, మరింతగా మన ఆర్ధిక వ్యవస్ధను తెరవాలని వత్తిడి చేస్తున్నాయన్నది స్పష్టం. జిఎస్‌టి అమలు వలన సమీప భవిష్యత్‌లో ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడదని ఎస్‌ అండ్‌ పి పేర్కొన్నది. గత రెండు దశాబ్దాల తీరుతెన్నులను గమనిస్తే సంస్కరణలు అమలు జరుపుతున్నామని చెబుతున్నప్పటికీ రెండు దశాబ్దాలలో జిడిపిలో ద్రవ్యలోటు 8.8శాతం, గత ఐదు సంవత్సరాల సగటు ఏడు శాతంగా వుంది. దీని పర్యవసానంగా మన దేశ రుణ భారంతో పాటు దానికి చెల్లించే వడ్డీ కూడా గణనీయంగా పెరుగుతోంది. జిడిపిలో మన ఆదాయం 21శాతం తక్కువగా వున్నదని, ఖర్చులో సబ్సిడీలు గణనీయంగా వున్నట్లు తాజా నివేదికలో పేర్కొన్నారు. అంటే అర్ధం పన్నులు,సెస్సుల వంటి వాటిని పెంచి ఆదాయం పెంపు, సబ్సిడీలకు మరింత కోత విధించి పొదుపును పెంచాలని పరోక్షంగా వత్తిడి చేయటమే. జిఎస్‌టి ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరుగుతుందని అయితే అది వెంటనే ఫలితాలను ఇవ్వదని, సబ్సిడీ కోతలు ఆలశ్యమౌతాయని స్పష్టంగా చెప్పింది. బ్యాంకులు ప్రత్యామ్నాయ వనరుల ద్వారా పెట్టుబడులను సమకూర్చుకోలేని పక్షంలో బాసెల్‌-3 ప్రమాణాల ప్రకారం 2019 నాటికి 45 బిలియన్‌ డాలర్ల మేరకు ప్రభుత్వం పెట్టుబడి నిధులను సమకూర్చాల్సి వుంటుందని, ప్రస్తుతం ప్రభుత్వం వాగ్దానం చేసిన 11 బిలియన్‌ డాలర్లను గణనీయంగా పెంచాలని తెలిపింది. ద్రవ్యోల్బణం రేటును 2017 మార్చి నాటికి ఐదు శాతానికి రిజర్వుబ్యాంకు పరిమితం చేయగలదనే ఆశాభావాన్ని వెలిబుచ్చింది. సంస్కరణల నిలిపివేత, అభివృద్ధి గిడసబారటం, నిర్ధేశిత లక్ష్యాలను అమలు జరపటంలో వైఫల్యం లేదా విదేశీ చెల్లింపుల పరిస్ధితి దిగజారితే రేటింగ్‌ను తగ్గించే అవకాశం వుంది. వీటిపై మోడీ ప్రబుత్వం తీసుకొనే చర్యల పట్ల విశ్వాసం లేక లేదా గట్టిగా అమలు జరిపించేందుకు రేటింగ్‌ ఏజన్సీలు ప్రస్తుతం ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ప్రపంచబ్యాంకు,రేటింగ్‌ ఏజన్సీలను సంతృప్తి పరచే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పటమంటే రానున్న రోజులలో కార్మికులు, వుద్యోగులు, సామాన్య జనానికి మరిన్ని కష్టాలు మూడబోతున్నట్లే భావించాలి.

    రేటింగ్‌ ఏజన్సీల వత్తిడి ఇప్పుడేదో ఆకస్మికంగా ప్రారంభం అయింది కాదు. ద్రవ్య పరిస్ధితిని పటిష్ట పరచేందుకు రూపొందించిన పధకానికి కట్టుబడి వుండకపోతే అనుకున్న ప్రకారం ఆదాయం పెరగకపోవటం, సబ్సిడీల కోత ఆలస్యం కావచ్చని ఇదే ఎస్‌ అండ్‌ పి సంస్ధ ఈ ఏడాది జనవరిలోనే హెచ్చరించింది. http://articles.economictimes.indiatimes.com/2016-01-31/news/70222497_1_services-tax-subsidy-cuts-finance-minister-arun-jaitley సంస్ధ విశ్లేషకుడు కైరన్‌ కరీ పిటిఐ వార్తా సంస్ధతో మాట్లాడుతూ ద్రవ్యలోటు లక్ష్యం చేరుకోవటాన్ని ఒక ఏడాది పాటు వాయిదా వేసి 2015-16 బడ్జెట్‌లో ప్రభుత్వం దారి తప్పిందని, అనుకున్న విధంగా ఆదాయం రాకపోవటం, ఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీల కోతపై ఆటంకాలను ఎదుర్కొన్నదని చెప్పాడు. కార్పొరేట్‌ సంస్ధల వత్తిడి, రేటింగ్‌ సంస్ధలను సంతృప్తి పరచటం కోసమే నరేంద్రమోడీ సర్కార్‌ పెట్రోలు, డీజిల్‌పై ఎక్సయిజ్‌ సుంకం, సేవాపన్ను పెంపు,కిరోసిన్ పై నెలవారీ సబ్సిడీ తగ్గింపు , స్వచ్చభారత్‌, కృషి కల్యాణ్‌ వంటి రకరకాల సెస్సులను ఈ కాలంలో విధించి మరో ఔరంగజేబుగా మారిన విషయం తెలిసిందే. అయితే జనంపై మరిన్ని భారాలు మోపి 2019లో నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి, దాని మిత్ర పక్షాలు ఓట్ల కోసం జనం ముందుకు వెళతాయా? అధికారం కోసం విదేశీ, స్వదేశీ కార్పొరేట్లు కోరుతున్న సంస్కరణలను ఏం చేస్తారు అన్నది చూడాల్సి వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రజాస్వామ్యం -మిలిటరీ- ప్రశ్నించే హక్కు ?

12 Wednesday Oct 2016

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP, Congress party, dadri, dalali, democracy, Media, military, right to ask a question, surgical strike

ఎంకెఆర్‌

   సమాజంలో ఎప్పుడూ విరుద్ధ భావజాలాల మధ్య సంఘర్షణ జరుగుతూనే వుంటుంది. అయితే అన్ని వేళలా అన్నీ ఒకే విధంగా సంఘర్షించుకోవు. ఎప్పుడూ ఒకటి ప్రధాన మైన సంఘర్షణగా వుంటుంది. దీని అర్ధం మిగతావి సంఘర్షించుకోవు అని కాదు. ఏ రెండింటి మధ్య జరిగేది ప్రధాన సంఘర్షణ అన్నది గుర్తించటం ముఖ్యం. అయితే వెంటనే దానితో అందరూ ఏకీభవించకపోవచ్చు.అసలు దానిని ఒక వైరుధ్యంగా కొందరు గుర్తించకపోవచ్చు కూడా. ఇప్పుడు దేశంలో అదే పరిస్ధితి వుందన్నది అనేక మంది అభిప్రాయం. కొంత మంది విభేదించినప్పటికీ అనేక దేశాలతో పోలిస్తే మనం మెరుగైన ప్రజాస్వామ్య వ్యవస్ధలో వున్నాం. భావ ప్రకటనా స్వేచ్చ మీద జరుగుతున్న తీవ్ర దాడిని సాధారణంగా మేథావి వర్గంగా భావించే వారందరూ వ్యతిరేకించకపోయినా గట్టిగా వ్యతిరేకించే వారు కూడా వున్నారు. కలుబుర్గి హత్యను ఖండించటానికి కేంద్ర సాహిత్య అకాడమీ తిరస్కరించటం మొదలు, ఎవరు ఏమితినాలి, తినకూడదు అని నిర్ధేశించిన దానిలో భాగంగా గొడ్డు మాంసంపై తలెత్తిన వివాదం, విశ్వవిద్యాలయాలలో భావ ప్రకటనా స్వేచ్చను అడ్డుకొనే క్రమంలో భౌతిక దాడులకు పాల్పడిన వుదంతాలు, గో సంరక్షణ ముసుగులో ముస్లింలు, దళితులపై దాడులు, చివరికి తాజా సర్జికల్‌ దాడుల వరకు అనేక వుదంతాలలో తలెత్తిన ఘర్షణలను చూస్తే పూసల్లో దారంలో తిరోగామి భావజాలానికి ప్రాతినిధ్యం వహించే ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర మనువాద, మతశక్తులు అన్ని రంగాలలో, అంశాలలో తమ ఆధిపత్యాన్ని రుద్దేందుకు ప్రయత్నించటం చూస్తున్నాం. వారేమీ దాచుకోవటం లేదు, బాహాటంగానే తెగింపుతో ముందుకు వస్తున్నారు. చర్చను ప్రమాదకర పరిస్థితిల్లోకి నెడుతున్నారు. ఇది ఒక పధకం ప్రకారం జరుగుతున్నదా? యాదృచ్చికమా అన్న గుంజాటన వున్న వారు తీరికగా ఆలోచించి దానిని తేల్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ దాడులకు ప్రతిఘటన కూడా అలాగే వుంది. అనేక మంది ఇదేదో తేడాగా వుంది అని ఆలోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా అలాంటి వారు పెరుగుతారు.అయితే ఈ శక్తుల ప్రయత్నాలన్నింటికీ తీవ్రమైన ఎదురు దెబ్బలు తగులుతుండటంతో ఒక ఎత్తుగడగా అయినా వెనక్కు తగ్గి కొత్త దారులు వెతుకుతున్నారు.

    కలుబుర్గి హత్యపై తలెత్తిన రచయితలు, కళాకారులు, మేథావుల నిరసనలతో ఖంగు తిన్న శక్తులు కేంద్ర సాహిత్య అకాడమీతో సంతాపం ప్రకటింపు చేయించి పరువు దక్కించుకొని బయట పడ్డాయి. ఆవు మాసం వివాదం చివరకు దళితులపై దాడులకు తెరతీయటంతో స్వయంగా ప్రధాని జోక్యం చేసుకొని లోపల ఎలా వున్నప్పటికీ దళితుల ఓట్ల కోసం గోసంరక్షకులపేరుతో దుకాణాలు తెరిచారని తీవ్ర విమర్శలు చేయాల్సి వచ్చింది. వురి శిక్షలకు వ్యతిరేకంగా మాట్లాడిన, యాకుబ్‌ మెమెన్‌ వురి తీత సరైంది కాదని అభిప్రాయపడిన వారిని జాతి వ్యతిరేకులుగా ముద్ర వేసి హైదరాబాదులో రోహిత్‌ వేముల ఆత్మ హత్యకు కారకులు కావటం, జెన్‌యు విద్యార్ధులపై తప్పుడు ప్రచారం, తప్పుడు వీడియోలు, కేసులతో వేధించేందుకు పూనుకున్నారు. ఆ రెండు చోట్లా జరిగిన విద్యార్ధి సంఘ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు. ఈ విషయంలోనూ తాత్కాలికంగా వెనక్కు తగ్గారు. తమకు రాజకీయంగా లాభం అనుకుంటే ఏ వివాదాన్ని అయినా రావణా కాష్టంలా రగిలిస్తూనే వుంటారు, తాత్కాలికంగా అయినా నష్టం అనుకుంటే వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గుతారు.ఇప్పుడు సర్జికల్‌ దాడుల వివాద వుదంతాన్ని ఎలా ముగిస్తారో చూడాల్సి వుంది.

    ఒక్కొక్క అంశంపై తమ ఆధిపత్యాన్ని రుద్ధేందుకు ప్రయత్నిస్తున్న మత, తిరోగామి శక్తులు సమస్యలను సృష్టించేందుకు ప్రయత్నించటం ఒకటైతే , తలెత్తిన పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోవటం మరొకటి. అసహనం, దేశభక్తి, ఆవు నుంచి తాజా మిలిటరీ చర్యల వరకు నడుస్తున్న చర్చలో రెండు ఈ ధోరణులను మనం చూడవచ్చు. పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదుల అణచివేతలో భాగంగా మిలిటరీ చేపట్టిన సర్జికల్‌ దాడులను దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సమర్ధించాయి. ఎవరూ వాటిని వివాదం చేయలేదు. అయితే ఆ దాడులనుంచి రాజకీయ ప్రయోజనాలను పిండుకోవటానికి బిజెపి తెరతీయటం, అది తగదన్న అంశంపై తీవ్రమైన రెచ్చగొట్టుడు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ముందు బోనులో నిలబెట్టాల్సింది మీడియాను అంటే అతిశయోక్తిగా కనిపించవచ్చు. సర్జికల్‌ దాడుల గురించి ప్రభుత్వం ప్రతిపక్షాలకు వివరించినపుడు వచ్చిన వార్తల తీరు తెన్నులను ఒక్కసారి నెమరు వేసుకోండి. దాడుల ఖ్యాతిని పూర్తిగా మిలిటరీకే ప్రతిపక్షాలు అప్పగిస్తున్నాయని, నరేంద్రమోడీకి దానిని పంచేందుకు నిరాకరించాయని రాయటాన్ని ఏమనాలి. మరణించింది సైనికులు, ప్రాణాలకు తెగించి ప్రతిదాడులు జరిపింది సైనికులు, దీనిలో రాజకీయ నాయకులు లేదా పార్టీలకు ఖ్యాతిని ఆపాదించటం ఏమిటి ? వుప్పు తిన్న విశ్వాసం లేదా కిరాయి రాతలని ఇలాంటి వాటినే అంటారు.

    మిలిటరీ చర్యలను, మిలిటరీని రాజకీయ ప్రయోజనాలకు వుపయోగించుకున్న దేశాలలో ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన దేశాన్ని కూడా ఆ స్ధితిలోకి నెట్టదలచుకున్నారా ? కొందరి వుత్సాహం అలాగే కనిపిస్తోంది. కార్గిల్‌ యుద్ధాన్ని బిజెపి తన ఎన్నికల ప్రయోజనానికి వుపయోగించుకోవటం జగమెరిగిన సత్యం. ప్రతిపక్షం ఎంత బలహీనంగా వున్నప్పటికీ ఇది 1999 కాదు 2016 అని గుర్తించకుండా సర్జికల్‌ దాడులను కూడా అందుకు వినియోగించుకొనే ప్రయత్నం చేస్తే సహించే పరిస్థితి వుంటుందా ? మిలిటరీ చర్యలనుంచి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నించవద్దన్న అభిప్రాయాల వెల్లడి, ప్రకటనలు జాతీయ ఐక్యత ప్రదర్శించాల్సిన సమయంలో సైనికుల శౌర్య, పరాక్రమాలను అవమానించటమే అని చిత్రించటం అత్యంత ప్రమాదకర పోకడ. మొదటిది ప్రజాస్వామ్యంలోని భావ ప్రకటనా స్వేచ్చకు ప్రతిబింబం అయితే రెండవది అందుకు విరుద్ధమైన అణచివేత వ్యవస్ధ లక్షణం.

    మన దేశంలో స్వాతంత్య్రం తరువాత కాంగ్రెస్‌ పార్టీ చేయని తప్పిదం లేదు. అత్యవసర పరిస్థితి విధించి నిరంకుశత్వాన్ని రుద్ధేందుకు ప్రయత్నించింది. దివాళాకోరు ఆర్ధిక విధానాలు అనుసరించి సామాన్య జనజీవితాలను అతలాకుతలం చేసింది. మతోన్మాదులతో పోటీపడి ఓట్ల కక్కుర్తితో మతశక్తులతో రాజీపడి లౌకిక వ్యవస్ధకు హాని చేసింది. తన రాజకీయ ప్రయోజనాల కోసం వేర్పాటు, వుగ్రవాదులకు మద్దతు ఇచ్చింది. అందుకు తగిన మూల్యం కూడా చెల్లించి ఇప్పుడు ప్రతిపక్షంగా పార్లమెంట్‌లో గుర్తింపునకు తగిన సంఖ్యలో కూడా సీట్లను పొందలేకపోయింది. ఇంకా దాని తప్పిదాలు చాలా వున్నాయి.

    రెండవ ప్రపంచ యుద్ధంలో విజేతలు జర్మనీ మిలిటరీపై నిషేధం విధించారు. అదే యుద్ధంలో జపాన్‌ను ఓడించి 1945-52 మధ్య కాలంలో తమ ఆక్రమణలో వుంచుకున్న అమెరికా ఆ దేశ రక్షణ బాధ్యతను తాము తీసుకుంటున్నట్లు ఆ దేశంతో ఒక ఒప్పందం చేసుకొన్నది. రెగ్యులర్‌ మిలిటరీని నిషేధిస్తూ జపాన్‌ నూతన రాజ్యంగంలో ఒక అంశంగా చేర్పించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జర్మనీ, జపాన్‌లకు సైన్యం లేదు. గత ఎన్నికలలో కాంగ్రెస్‌ను బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ చిత్తుగా ఓడించింది. అంతే తప్ప కాంగ్రెస్‌ పార్టీని లేదా దాని హక్కులను గానీ జపాన్‌,జర్మనీ మిలిటరీల మాదిరి నిషేధించలేదు. అందువలన ఆ పార్టీ అయినా మరొకదానికి అయినా ఒక అంశం మీద అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్చను కలిగి వున్నాయి.

    ఆ విధంగా చూసినపుడు బిజెపి లేదా దాన్ని చూసి సమాజవాది పార్టీ గానీ రాజకీయ ప్రయోజనాల కోసం జరిపే ప్రచారంలో, పోస్టర్లలో సైన్యాన్ని వుపయోగించుకోకూడదని చెప్పేందుకు ఎవరికైనా హక్కుంది. ‘సర్జికల్‌ దాడులకు మా సంపూర్ణ మద్దతు వుందని నిర్ద్వంద్వంగా చెప్పాను. అయితే సైన్యాన్ని రాజకీయ పోస్టర్లు, ప్రచారానికి వినియోగించుకోవటాన్ని నేను సమర్ధించను ‘ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశాడు. అంతకు ముందు రోజు కాస్త ఘాటుగా సైనికుల త్యాగాలను సొమ్ము చేసుకొనే దళారులుగా వ్యవహరించవద్దని విమర్శించారు. ఆ విమర్శ తమను గాక మిలిటరీని అన్నట్లే అంటూ బిజెపి విరుచుకుపడింది. సైనికుని బొమ్మను, మోడీ, బిజెపి నేతల బొమ్మలతో కలిపి ముద్రించి వుత్తర ప్రదేశ్‌లో బిజెపి ప్రచారం ప్రారంభించిన విషయాన్ని పక్కదారి పట్టించేందుకు తమపై చేసిన విమర్శలను మిలిటరీకి వర్తింప చేస్తూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది.

  దళాలీ( తెలుగులో దళారీ ) అన్నది పార్లమెంటేతర భాష కాదు. భోఫోర్స్‌తో సహా అనేక కుంభకోణాలలో దళారుల పాత్ర ఏమిటో కాంగ్రెస్‌కు, బిజెపికి తెలిసినంతగా ఈ దేశంలో మరొక పార్టీకి తెలిసే అవకాశం లేదు. దానిలో భాగంగానే బిజెపి ‘ధరమ్‌ కీ దలాలీ(మతం), గాయ్‌ కీ దళాలీ( ఆవు ) గంగా కీ దళాలీ ( గంగా నది)ని వుపయోగించుకుంటున్నట్లుగానే సైనికుల త్యాగాలను కూడా వుపయోగించుకుంటున్నదని బిజెపి పోస్టర్లను వుటంకిస్తూ కాంగ్రెస్‌ ఎదురు దాడికి దిగింది. రాజకీయాలలో దళారీ పదం వాడటం వుచితమేనా అన్న ప్రశ్నకు రాజకీయాలకు తావు లేని చోట బిజెపి రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నది, మోడీని రాముడిగా చిత్రిస్తూ పోస్టర్లు వేశారు, సర్జికల్‌ దాడులతో ఆయన ఛాతీ 56 అంగుళాల నుంచి వందకు పెరిగిందని చెప్పారు, జాంబవంతుడు చెప్పిన తరువాతే హనుమంతుడికి తన బలం గురించి తెలిసి వచ్చి ఒక్క వూపులో సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించినట్లుగా సర్జికల్‌ దాడుల తరువాత మన సైన్యానికి తన బలం ఏమిటో తెలిసి వచ్చిందన్నారు రక్షణ మంత్రి పరికర్‌. ఆయనను సన్మానించేందుకు సభలు జరుపుతున్నారు. బిజెపి ప్రతినిధి జివిఎల్‌ నరసింహారావు కూడా అదే రీతిలో తొలిసారిగా మిలిటరీకి తానంటే ఏమిటో తెలిసిందని మాట్లాడారు. నిజానికి ఇవి మిలిటరీని అవమానించే మాటలు. గతంలో చేసిన సర్జికల్‌ దాడులను విస్మరించటం, త్యాగాలను కించపరచటం తప్ప మరొకటి కాదు. దాడుల ఖ్యాతి పూర్తిగా సైనికులకే దక్కాలి. ఈ పూర్వరంగంలో ఒక పదం ముఖ్యం కాదు దాని వెనుక వున్న భావాన్ని అర్ధం చేసుకోవాలని రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబాల్‌ వ్యాఖ్యానించారు. వుగ్రవాదులు పాకిస్తాన్‌ అనే వ్యాధి గ్రస్తు శరీరంలోని క్యాన్సర్‌ కణాల వంటి వారు, ప్రభుత్వం వాటిని అంతం చేయటానికి మద్దతు ఇస్తున్నాం, దానికి గుండెలు పొంగటం ఎందుకు, పోస్టర్ల ప్రచారం దేనికి, ఒక సర్జికల్‌ దాడితో వుగ్రవాదం అంతం కాదు, కానీ బిజెపి వుత్తర ప్రదేశ్‌లో ఆ పేరుతో ఓట్లు అడిగేందుకు ప్రచారం ప్రారంభించింది’ అని కూడా సిబాల్‌ చెప్పారు.

    ఆవు మాంసం కలిగివున్నారంటూ వుత్తర ప్రదేశ్‌లోని దాద్రిలో ఒక ముస్లిం కుటుంబంపై సామాహిక దాడి చేసి కుటుంబ పెద్దను హత్య చేసిన కేసులోని ఒక నిందితుడు రవి శిశోదియా జైలులో చికున్‌ గున్యా వ్యాధితో మరణించాడు. అతని మృత దేహంపై బిజెపి నేతలు జాతీయ జండా కప్పటాన్ని ఏమనాలి. హిందూత్వ వాది కనుక కావాలంటే తమ బిజెపి జెండాను కప్పుకోవచ్చు, జాతీయ జెండాను కప్పటమంటే దానిని అవమానించటం తప్ప మరొకటి కాదు. బిజెపి ప్రవచించే జాతీయవాద నిజ స్వరూపం ఇదా ? దేశం కోసం ప్రాణాలర్పించే సైనికుల మృత దేహాలపై జాతీయ జెండా కప్పుతారు. మరి శిశోదియా ఏ త్యాగం చేశాడని ఇలా చేశారు ?

Image result for dadri lynching,sisodia, national flag

చికున్‌ గున్యాతో మరణించిన దాద్రి హత్య నిందితుడికి జాతీయ జెండా కప్పిన బిజెపి జాతీయవాదం

    సర్జికల్‌ దాడుల గురించి చర్చించ కూడదని బిజెపి నేతలు మనకు చెబుతున్నారు. అడిగితే అది పాక్‌ ప్రచార వలలో పడినట్లే నట ! సైనిక చర్యకూ జాతీయ వాదానికి ముడి పెడుతున్నారు. గో వధ నిషేధానికీ అదే ముద్ర, చివరికి గో సంరక్షకుల ముసుగులో చచ్చిన ఆవుల చర్మం తీసే, చచ్చిన ఆవులను తొలగించటానికి నిరాకరించిన దళితులపైనా దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. వారిని అలాగే వదలి వేస్తే చివరికి గో సంరక్షక్షుల దాడుల గురించి కూడా చర్చించటం కూడా దేశ ద్రోహమే అంటారేమో ? కొన్ని టీవీ ఛానల్స్‌, కొన్ని పత్రికలు, కాషాయ దళాల దృష్టిలో భిన్న, బేదాభి ప్రాయం వ్యక్తం చేసే వారందరూ ప్రమాదకారులు, దేశద్రోహుల కింద లెక్క. కనుక అంతిమంగా అలాంటి వారి నోరు మూయాలి లేకపోతే మూయించాలి, ఇదేగా ఇస్తున్న సందేశం ! ఇది ప్రారంభం మాత్రమే. మొగ్గలోనే ఇలాంటి ధోరణులను ఎదుర్కొనకపోతే చివరికి మానులై కూర్చుంటాయి.

   మిలిటరీని విమర్శించకూడదు ! న్యాయ వ్యవస్ధను విమర్శించకూడదు !! మిలిటరీ, న్యాయవ్యవస్ధలనేవి ఆకాశంలోంచి వూడి పడలేదు, కనుక విమర్శలకు అతీతం కాదు. ఏ దేశంలో అయినా మిలిటరీ చర్యలపై , న్యాయ వ్యవస్ధ తీర్పులపై విమర్శలు సహజం. వుద్రేకాలు, విద్వేషాలను అదుపులో వుంచుకొని ఆలోచించాల్సిన విషయాలు వున్నాయి. న్యాయమూర్తి స్ధానంలో కూర్చున్న వారు నిష్పక్షపాతంగా తీర్పు చెప్పాలన్నది ఒక విధి. తీర్పు రాకముందే లేదా తీర్పు వచ్చిన తరువాత వారికి దురుద్ధేశ్యాలను ఆపాదించకూడదు. ఎవరికైనా అభ్యంతరాలుంటే ముందుగానే మరొక కోర్టులో తన కేసును విచారించాలని కోరే హక్కు ఎవరికైనా వుంది. అంత మాత్రాన సదరు న్యాయమూర్తిని అవమానించినట్లు కాదు. కొన్ని కేసుల విచారణలో న్యాయమూర్తులు స్వచ్చందంగా తప్పుకొంటున్న విషయం విదితమే. అయితే ఒక తీర్పు వెలువడిన తరువాత దాని మంచి చెడ్డలపై వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికైనా వుంటుంది. అంతిమ తీర్పులో కూడా తమకు న్యాయం జరగలేదని ఎవరైనా తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. మిలిటరీ వ్యవహారం కూడా అంతే . దానిలో పని చేసే వారి చిత్త శుద్ధిని శంకించటం వేరు, మిలిటరీలో జరిగే, మిలిటరీ చేసే తప్పులను ఎత్తి చూపటం వేరు అని గమనించాలి.మిలిటరీకి అవసరమైన కొనుగోళ్లలో జరిగే అక్రమాల గురించి ఎన్నో విన్నాం.సంబంధిత అధికారుల ప్రమేయం లేకుండా అవి జరగవు. మిలిటరీ గనుక అక్కడ ఏం జరిగినా విమర్శించకూడదు, మీడియాలో దాని గురించి చర్చించకూడదు అంటే ఎలా ? కార్గిల్‌ యుద్ధంలో వందల మంది సైనికులు ప్రాణాలర్పించారు. వారి భౌతిక కాయాలను తరలించేందుకు కొనుగోలులో అక్రమాలకు పాల్పడింది అపర దేశభక్తులుగా పేరుపొందిన బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ పాలనలో అన్నది తెలిసిందే. మిలిటరీ కొనుగోళ్లు కనుక విమర్శించకూడదంటే ఆ వివరాలు బయటకు వచ్చేవా ? అదే అయితే భోపోర్సు ఆయుధాల కమిషన్‌ ముడుపులూ అంతే కదా ?

    పది సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం మిలిటరీలో వున్న మైనారిటీల సంఖ్య ఎంత అనే సమాచారాన్ని సేకరించేందుకు నిర్ణయించింది. ప్రతిపక్షంలో వున్న బిజెపి, మిలిటరీ అధికారులు, మరికొందరు దానిపై నానాయాగీ చేశారు. దాంతో ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకుంది. మిలిటరీ అంటే త్యాగం తప్ప రిజర్వేషన్లు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ భాష మాట్లాడతారు, కుల మతాల లెక్క కాదు అన్నారు. వివరాలు సేకరించాలన్నవారి కారణాలు వారికి వుంటే వ్యతిరేకించే వారికారణాలు వారికి వున్నాయి. అయితే మిలిటరీలో కుల, మత లేదా తెగల ప్రస్తావన లేదా, ముస్లింల సంఖ్యా వివరాలు లేవా అంటే వున్నాయి. అలాంటపుడు ఎందుకు వ్యతిరేకించినట్లు ? మన రాజ్యాంగం ప్రకారం భారత రాష్ట్రపతి సర్వసైన్యాధ్యక్షుడు. అయితే అది గౌరవం తప్ప అధికారాలు లేవు. లెక్కలు తీయాలని కోరింది రక్షణ మంత్రిత్వశాఖ. అలా లెక్కలు తీయటం మిలిటరీలో మతతత్వ బీజాలు వేయటమే అవుతుంది కనుక ఆ ప్రక్రియను నిలిపివేయాలని మాజీ సైనికాధికారి ఆర్‌ఎస్‌ కడియన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సర్వసైన్యాధ్యక్ష హోదాలో ఇలాంటి లెక్కలు తీయటాన్ని నిలిపివేసేందుకు రాష్ట్రపతి చర్యలు తీసుకోవాలని బిజెపి డిమాండ్‌ చేసింది. మాజీ సైనికాధికారులు ధర్నాలు చేశారు. కార్గిల్‌ శవపేటికల కుంభకోణం ఫేం జార్జి ఫెర్నాండెజ్‌ సైన్యాన్ని మత పూరితం చేసే దేశ ద్రోహకర చర్య అని వర్ణించారు. 2004 జనవరి తొమ్మిదిన రక్షణ మంత్రిత్వ శాఖకు సైన్యం పంపిన ఒక నోట్‌లో పదకొండు లక్షల మంది సైనికులలో ముస్లింలు 29,093 మాత్రమే అని పేర్కొన్నారు. అంటే 13శాతం జనాభాకాగా సైనికులలో వారి శాతం 2.6 మాత్రమే. వారి శాతాన్ని పెంచమని కోరటం జాతి వ్యతిరేకం అవుతుందా ? గూర్ఖా, సిక్కు, రాజపుత్ర, డోగ్రా రెజిమెంట్లలలో ముస్లింలతో సహా ఆ తరగతులకు చెందని వారికి చాలా కాలం అసలు ప్రవేశం లేని విషయం తెలిసిందే. 1984లో అమృతసర్‌ స్వర్ణ దేవాలయంలో తిష్టవేసిన వుగ్రవాదులను బయటకు గెంటి వేసేందుకు చేపట్టిన ఆపరేషన్‌ బ్లూస్టార్‌ చర్య సందర్భంగా సిక్కు రెజిమెంట్‌లో కొందరు సైనికులు తిరుగుబాటు చేసిన తరువాతే రెజిమెంట్లలో ఇతరులకు కూడా చోటు కల్పించి అఖిల భారత స్వభావం తెచ్చేందుకు చర్యలు తీసుకున్నారు.

మన మిలిటరీ, న్యాయవ్యవస్ధ అయినా మన వైవిధ్య సమాజానికి ప్రతిబింబంగా వుండాలన్నదానితో ఎవరూ విబేధించనవసరం లేదు. అలా వుందా లేదా అన్నతి తెలియాలంటే వివరాలు వుండాలి, లోపం వుంటే అధిగమించేందుకు ప్రయత్నించాలి. మన దేశానికి వలస పాలన వారసత్వంగా అనేక అవలక్షణాలు వచ్చాయి. వాటిని వదలగొట్టుకోవాల్సి వుంది. వలస పాలకులు ఎందుకు అలా చేశారన్నది మరో సందర్భంలో చర్చించవచ్చు.మన సైన్యంలో సిక్కు, గూర్ఘా, జాట్‌, రాజపుత్ర, డోగ్రా,పంజాబ్‌, మద్రాస్‌, మరాఠా, బీహార్‌, ఇలా మరికొన్ని పేర్లతో రెజిమెంట్లు వున్నాయి. నిజానికి లౌకిక భారత్‌ లేదా స్వతంత్ర భారతంలో ఇలాంటివి ఇప్పటికీ కొనసాగటం ఆశ్చర్యకరమే. అంతే కాదు స్వాతంత్య్రం వచ్చిన తరువాత నాగా రెజిమెంట్‌ను ఏర్పాటు చేశారు. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని, దేశ రక్షణలో మరింత చురుకుగా పాల్గొనేందుకు తమ పేరుతో ఒక రెజిమెంట్‌ను ఏర్పాటు చేయాలని నాగాల ప్రతినిధులు కోరిన మేరకు 1970లో ఆ రెజిమెంట్‌ను ఏర్పాటు చేశారు. మేమెంతో మాకంత వాటా మాదిరి నినాదాలతో అస్థిత్వ భావనలు తీవ్రంగా వ్యాపించిన వర్తమాన పరిస్థితులలో ప్రత్యేక రెజిమెంట్ల ఏర్పాటు డిమాండ్‌ను ముందుకు తెచ్చేందుకు అవకాశం వుందా లేదా ?

   దేశ విభజనకు ముందు పాకిస్థాన్లో ఎంత మంది హిందువులున్నారు, ఇప్పుడు ఎంత మంది వున్నారో చూడండంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ వారు జనాన్ని తప్పుదారి పట్టించే లెక్కలు కొన్ని చెబుతుంటారు. మన రక్షణ శాఖ సహాయ శాఖ మంత్రిగా పని చేసిన మహావీర్‌ త్యాగి అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం దేశ విభజనకు ముందు భారత సైన్యంలో ముస్లింలు 32శాతంగా వుండగా విభజన తరువాత రెండు శాతానికి పడిపోయింది. ఇది ఒక్క ముస్లింలకే పరిమితం కాదు, ఇతరుల శాతం ఎంత అన్నది కూడా తెలుసుకోవాల్సిన అవసరం వుందా లేదా ? అయితే సచార్‌ కమిటీ సూచన ప్రకారం ముస్లింల సంఖ్య తెలుసుకోవాలనుకోవటంలో మైనారిటీల సంతుష్టీకరణ, దాన్ని వ్యతిరేకించటంలో మెజారిటీ సంతుష్టీకరణ కోణాలు కూడా లేకపోలేదు. అధికారంలో ఏ పార్టీ వున్నప్పటికీ రాజ్యాంగ బద్దంగా దళితులు, గిరిజనుల వుప ప్రణాళికలకు నిధులు కేటాయించాలన్నా, మత, భాషా మైనారిటీల సంక్షేమానికి చర్యలు, పధకాలను రూపొందించాలన్నా వారి సంఖ్యా, ఇతర పరిస్థితుల వివరాలు తెలియకుండా ఎలా సాధ్యం. వాటిని సేకరించటం ఆ తరగతుల సంతుష్టీకరణ అని ఇంతకాలం రాజకీయం చేసిన బిజెపి ఇప్పుడు కేంద్రంలో, అనేక రాష్ట్రాలలో అధికారంలో వుంది. అవేమీ లేకుండానే వారికి పధకాలు రూపొందిస్తుందా? వున్న పధకాలను ఎత్తివేస్తుందా ? అమెరికా అంటే బిజెపి, సంఘపరివార్‌ శక్తులకు వల్లమాలిన అభిమానం అక్కడ వర్షం కురిస్తే ఇక్కడ గొడుగులు పడతారు. అమెరికా పర్యటన జరపాలని నరేంద్రమోడీ ఎంతగా తపించి పోయారో తెలిసిందే. అలాంటి అమెరికా సైన్యంలో ముస్లింలు, నల్లవారు, తెల్లవారు, ఇతర జాతుల వారు ఎందరున్నారో ప్రతి ఏటా సంఖ్యా వివరాలను ప్రకటిస్తారని తెలియదా ? మరి అక్కడ రాని పొరపొచ్చాలు మన దేశంలో ఎందుకు వస్తాయని భావిస్తున్నారు?

    పాకిస్తాన్‌ పాలనలో మిలిటరీ ఆధిపత్యం, ప్రభావం గురించి బహిరంగ రహస్యమే. ఆ మిలిటరీ చర్యలను కూడా అక్కడి మీడియా తప్పు పట్టి ప్రశ్నించిందన్న విషయాన్ని అంగీకరిస్తారా లేక పాక్‌ మీడియా కథలను ప్రచారం చేయటంగా కొట్టి పారవేస్తారా ?http://indiatoday.intoday.in/story/pakistan-miliatry-is-no-holy-cow/1/143245.html ఈ వ్యాసాన్ని మన భారతీయ పత్రిక ఇండియా టుడే ఐదు సంవత్సరాల క్రితం ప్రచురించింది. అందరూ చూస్తుండగానే ఇస్లామాబాద్‌లో సలీమ్‌ షహజాద్‌ అనే ఒక జర్నలిస్టును గుర్తు తెలియని దుండగులు అపహరించి తరువాత చంపివేశారు.అది మిలిటరీ కనుసన్నలలో పని చేసే ఐఎస్‌ఐ పనే అని అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని ఖండిస్తూ మిలిటరీ ఒక ప్రకటన చేసింది. వార్తలు వాస్తవం కాదని తోసి పుచ్చితే ఒక రకం, అలా కాకుండా వివరాలను వెల్లడిస్తే అది జాతీయ భద్రతకు ముప్పు వస్తుందని, సైనిక బలగాల నైతిక స్ధైర్యం దెబ్బతింటుందని పేర్కొనటమే కాదు, కస్టడీలోకి తీసుకున్న పౌరులను మిలిటరీ చిత్రహింసలు పెట్టదు, చంపదు అని, సలీమ్‌ సహజాదీ హత్యలో ఐఎస్‌ఐ ప్రమేయమున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని ప్రకటించింది. దీనిపై పాక్‌ పత్రిక ఫ్రైడే టైమ్స్‌ పత్రిక సంపాదకుడు నజమ్‌ సేథీ వ్యాఖ్యానిస్తూ ప్రజాస్వామ్యంలో విమర్శలకు అతీతమైవేవీ లేవు, మిలిటరీ కూడా అలాంటిదే అని రాశాడు. మరి మనది ప్రజాస్వామ్యం. కాశ్మీర్‌, ఈ శాన్య రాష్ట్రాలలో ప్రత్యేక అధికారాలు కలిగిన మిలిటరీపై అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. మిలిటరీ సైతిక స్ధైర్యం దెబ్బతిన కుండా వుండాలంటే ఆ చర్యలను విమర్శించకూడదా ? మిలిటరీ చర్యలతో దెబ్బతింటున్న సామాన్య పౌరుల మనో స్ధైర్యం నంగతేమిటి ?

    పౌరపాలకుల పర్యవేక్షణలో పని చేస్తున్న మిలిటరీ వ్యవస్ధలలో మనది ఒకటిగా గర్వించాల్సిందే. నిత్యం సరిహద్దులను కాపాడుతున్న వారి సామర్ధ్యం, త్యాగాలకు హారతి పట్టాల్సిందే. వారి విశ్వసనీయతను ప్రశ్నించకూడదన్నది కూడా నిజమే. సర్జికల్‌ దాడులకు మన దగ్గర సాక్ష్యాలు వున్నాయని బల్లగుద్ది మరీ చెప్పినపుడు అబ్బే అసలు దాడులే జరగలేదని పాక్‌ ప్రభుత్వం ఎత్తుగడగానే చెప్పి వుండవచ్చు, ఎందుకంటే తన పౌరులకూ అది సంజాయిషీ ఇచ్చుకోవాలి గనుక.ఈ వుదంతంలో ప్రపంచ దృష్టిలో ఎవరిది పైచేయిగా కనిపిస్తుంది. పాకిస్తాన్‌ అసలు దాడులే జరగలేదనే వాదనకే కట్టుబడి వుంది. పరిస్థితులు సాధారణంగానే వున్నాయి చూడమంటూ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులకు ఆ ప్రాంతాలను చూపింది. దాడులు జరిగి వుంటే సాక్ష్యాలు వెల్లడించాలని సవాలు చేస్తున్నది. ఇది కూడా ప్రచార ఎత్తుగడే అనుకుందాం .

  మన దేశంలో జరిగిందేమిటి ? తాజా వివాదానికి అధికార రాజకీయ నేతల, మిలిటరీ వున్నతాధికారుల బాధ్యతేమీ లేదా ? సర్జికల్‌ దాడుల వివరాలతో సహా అనేక అంశాలు గోప్యంగా వుంచాల్సినవే అయినపుడు దాడులను తాము చిత్రీకరించామని, ద్రోణులను కూడా వుపయోగించామని చెప్పాల్సిన అవసరం ఏముంది. దాడులు చేశాం అని మాత్రమే చెప్పి వుంటే సరిపోయేది కదా ? అతని కంటే ఘనుడు ఆచంట మల్లన మాదిరి కాళిదాసు కవిత్వానికి స్వంతపైత్యం జోడించి నట్లు మిలిటరీ వినియోగించిన రాత్రుళ్లు చూడగలిగే పరికరాలు మా మచిలీపట్నంలోని బెల్‌లో తయారు చేశారని, ఆ ఫ్యాక్టరీని మరింత విస్తరించేందుకు మా చంద్రబాబు నాయుడు నిమ్మలూరులో మరో ప్లాంట్‌ ఏర్పాటుకు చర్య తీసుకున్నారని తెలుగు తమ్ముళ్లు సర్జికల్‌ దాడుల నుంచి రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించలేదా ? సర్జికల్‌ దాడుల రీత్యా సరిహద్దులలో పాక్‌ మిలిటరీ చర్యకు పూనుకోవచ్చంటూ వందలాది గ్రామాల నుంచి పౌరులను ఖాళీ చేయించటానికి, తరువాత ఆ కార్యక్రమాన్ని వుపసంహరించుకోవటానికి బాధ్యత ఎవరిది? దాడుల గురించి గుండెలు వుప్పొంగించుకోనవసరం లేదని జబ్బలు చరుచుకోవనవసరం లేదని ప్రధాని నరేంద్రమోడీ హితవు చెప్పారంటూ వచ్చిన వార్తలు కూడా పాక్‌ సృష్టే అంటారా ? సర్జికల్‌ దాడుల ఖ్యాతి అంతా మోడీకే దక్కాలని రాసిన మీడియా పెద్దమనుషులే రొమ్ములు విరుచుకోవనసరం లేదని ప్రధాని చెప్పినట్లు కూడా రాయటం మోడీ వ్యక్తిత్వాన్ని పెంచటంలో భాగమని సంతోషించి వుండవచ్చు. కానీ అవి సర్జికల్‌ దాడుల తీవ్రతను తగ్గించే సందేశాన్ని కలిగి వున్నాయని గ్రహించారా ? ఎవరు ఎవరి వలలో పడ్డారు.ఈ మొత్తం వుదంతం ఎలాంటి సందేశం ఇస్తున్నది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

దళిత,గిరిజన వుద్ధరణ బండారం – మోడీని నిలదీయాల్సిందే మరి !

20 Tuesday Sep 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

Narendra Modi, sc, ST's upliftment, Tribal & Scheduled Caste Sub Plan)

ఎం కోటేశ్వరరావు

   పోనీయండి వదిలేద్దాం ! రాజకీయ నాయకులన్న తరువాత జనం ముందు చెప్పేదొకటి, అధికారానికి వచ్చాక చేసేదొకటి . అందరూ అంతే . అది కాంగ్రెస్‌ అయినా బిజెపి, తెలుగు దేశం లేదా టిఆర్‌ఎస్‌ ఎవరైతేనేం అందరూ మహానుభావులే . ఇంక చూడాల్సింది కమ్యూనిస్టులనే ! వారెలా వుంటారో తెలియదు, ఇలాంటి మాటలు ఏదో ఒక సందర్భంలో వినే వుంటారు కదా ! మీరూ వదిలేసే వుండి వుంటారు. ఎందుకంటే ఎవరి పాపాన వారు పోతారని కదా మన ముందు తరాల వారు మనకు నేర్పింది. మాతాత, మానాన్న వారు స్వర్గంలో వున్నారో, నరకంలో వున్నారో అసలు ఎక్కడికైనా ఇంకా చేరారో లేదో తెలియదు. ఎందుకంటే వారి దగ్గర నుంచి స్వర్గానికి పోతే రంభ, వూర్వశి, తిలోత్తమలు కనిపించారని గానీ, లేక పాపం చేసి నరకానికి పోయి సలసలా కాగే నూనెలో పడి బొబ్బలెక్కినట్లు గానీ ఎస్‌ఎంఎస్‌, వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇ మెయిల్‌ వర్తమానం ఏదీ ఇంతవరకు రాలేదు. మా తాత పోయినపుడు ఆయనకు ఫోన్‌ అనేది ఒకటుందని మాత్రమే తెలుసు.అక్కడకు వెళ్లిన తరువాత మిగతావన్నీ తెలుసుకొని వుండాలి. ఎందుకంటే స్వర్గం, నరకంలో అంతా వేద విజ్ఞానంతో అందరి కంటే టెక్నాలజీలో ముందు వుండి వుంటారు కదా ! ఇంతకీ ఇంత వుపోధ్ఘాతం ఎందుకంటారా ?

    అధికారంలో వున్న వారిని విమర్శించటమే నేరం, దేశ ద్రోహంగా పరిగణించి కేసులు పెడుతున్న రోజులివి. కొంత మంది గురించి తాతగారి నాన్నగారి భావాలకు దాసులు అని ఒకప్పుడు ఒక కవి చెప్పాడు .అయితే మాటకు కట్టుబడి వుండకపోతే ఎవరినైనా నిలదీయాల్సిందేనని మాతాత, మానాన్న కూడా చెప్పారు.నాటి జాతీయ వాదులను నేడు దేశానికి హాని చేసిన వారిగా, నాడు బ్రిటీష్‌ వారి అడుగులకు మడుగులొత్తిన వారిని అపర దేశభక్తులుగా చూపుతున్న స్దితి. అందువలన నిలదీయాలన్న మా తాతగారి నాన్న గారి భావాలు తిరోగమనం కాదు, అందువలన నన్ను దేనికి ప్రతినిధిగా చూస్తారో మీ ఇష్టం. సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన మాటలను అమలు జరపటం లేదు గనుక నిలదీయాల్సిందే మరి. కొద్ది రోజుల క్రితం ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని అనేక అంశాలపై మాట్లాడుతూ దళితుల గురించి కూడా మాట్లాడారు. సామాజిక అసమానతల గురించి అడిగిన అంశంపై మోడీ ఇలా చెప్పారు.’ కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి వాటిని ఖండించాల్సిన అవసరం వుంది.నాగరిక సమాజంలో వాటికి చోటు లేదు. శాంతి భద్రతల సమస్య రాష్ట్రాలకు సంబంధించిన అంశం. కొంత మంది కొన్ని సమస్యలను ఎంపిక చేసుకొని మోడీ వాటికి కారకుడంటున్నారు. దీని వలన ఏ ప్రయోజనం నెరవేరుతుందో నాకు తెలియదు, కానీ ఇది దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. ఇది ఎంతో లోతుగా వేళ్లూనుకున్న సామాజిక సమస్య. సామాజిక అసమానతల మీద రాజకీయం చేయటం సమాజానికి అపకారం చేయటమే. తర తరాలుగా ఎవరైతే అన్యాయానికి గురయ్యారో ఈ రోజు చూస్తే బిజెపిలో గిరిజన ఎంపీలు, ఎంఎల్‌ఏలు గణనీయ సంఖ్యలో వున్నారు. నేను బిఆర్‌ అంబేద్కర్‌ 125వ జన్మదినాన్ని వుత్సవంగా జరిపినప్పటి నుంచి ఆయన జన్మదినాన్ని ఐక్యరాజ్య సమితి , అలాగే 102 దేశాలు పాటించిన తరువాత, రెండు రోజుల పాటు ఆయన జీవితం, చేసిన కృషి గురించి పార్లమెంట్‌లో చర్చించిన తరువాత మోడీ అంబేద్కర్‌ భక్తుడా అనే ఆలోచనతో అనేక మందికి ఒక సమస్య ఏర్పడింది. తమకు తామే సంరక్షకులుగా ప్రకటించుకున్న కొందరు వుద్రిక్తతను సృష్టించటానికి ప్రయత్నిస్తున్నారు. మోడీ దళితులతో వుండటం, స్వయంగా గిరిజనులకోసం అంకితం కావటాన్ని వారు ఇష్టపడటం లేదు. అణచివేతకు, అణగారిన, అవకాశాలు రాని దళితులందరి అభివృద్ధి కోసం కోసం నేను అంకిత మయ్యాను.’ ఇంకా కొన్ని విషయాలు చెప్పారు, గానీ ఇప్పటికే చాలా ఎక్కువైంది.

    తాజాగా ఇండియా స్పెండ్‌ అనే వెబ్‌సైట్‌ నిఖిల్‌ ఎం బాబు అనే ఒక జర్నలిస్టు రాసిన విశ్లేషణకు ‘దళితులు, గిరిజనులకు కేటాయించి ఖర్చు పెట్టని మొత్తం వ్యవసాయ బడ్జెట్‌కు ఎనిమిది రెట్లు ‘ అనే శీర్షికను పెట్టారు.ఈ విషయంలో కాంగ్రెస్‌, మరొక పార్టీ అన్న తేడా లేదు. వారి అభివృద్ధికి తాను అంకితమైనట్లు చెప్పుకున్న నరేంద్రమోడీ హయాంలో మిగతావారితో పోల్చితే ఖర్చు పెట్టని మొత్తం హిమాలయాల్లా పెరిగి పోతున్నట్లు వెల్లడైంది. కొత్త బిచ్చగాడికి లేదా దొంగ భక్తుడికి పంగనామాలెక్కువుంటాయని పెద్దలు వూరికే చెప్పారా ! ఆ వెబ్‌ సైట్‌ నిర్వాహకులు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం మేరకు గత మూడున్నర దశాబ్దాల కాలంలో దళితులు, గిరిజనులకు కేటాయించి ఖర్చు పెట్టని సొమ్ము అక్షరాలా రెండు లక్షల 80వేల కోట్లు. వారికోసం కేటాయించిన రిజర్వుడు వుద్యోగాలు తగిన అభ్యర్ధులు లేని కారణంగా కొన్నాళ్లు వాటిని ఖాళీలుగా చూపి తరువాత ఇతరులతో నింపివేయటం మనం చూస్తున్నదే. అయితే వుప ప్రణాళికల కింద కేటాయించిన సొమ్ము ఫలాన్ని అందుకొనేందుకు తగినంత సంఖ్యలో ఆ నిర్భాగ్యులు కూడా లేరా ? మరోవైపు ఇంత మొత్తం కేటాయించినా ఆ తరగతులు ఇంకా అభివృద్ధి చెందలేదంటే అదంతా వృధా అయిందని తాత్పర్యాలు చెప్పే పండితులు కూడా లేకపోలేదు.

     ప్రణాళికా సంఘం నూతన అవతారం లేదా ఎన్‌డిఏ ప్రభుత్వ నూతన సృష్టి నీతి అయోగ్‌ సిఇఓ అమితాబ్‌ కాంత్‌ ఏమంటారంటే రాష్ట్రాలు, మంత్రిత్వ శాఖలు ఏం చేస్తున్నాయో పర్యవేక్షించటం తప్ప మరింతగా ఖర్చు చేయాల్సిన బాధ్యత వాటిదే. ప్రస్తుత ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తున్నది అన్నారు. ఖర్చు చేయని మొత్తాలను తిరిగి కేంద్రానికి పంపాల్సి వుంటుందని వేరే చెప్పనవసరం లేదు. అలా వెనక్కు ఇచ్చిన మొత్తం వ్యవసాయ బడ్జెట్‌ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ లేదా వచ్చే పది హేను సంవత్సరాలలో గ్రామీణ రోడ్ల నిర్మాణానికి సరిపడే మొత్తం, లేదా నేపాల్‌, సెర్బియ, జోర్డాన్‌ దేశాల స్థూల జాతీయాదాయం కంటే ఎక్కువట. ఈ మొత్తం 2.8లక్షల కోట్లరూపాయలను దేశంలోని పాతిక కోట్ల దళితులు, గిరిజనులకు పంచితే తలా రు.11,289 రూపాయలు వస్తాయట.

     కేంద్ర ప్రభుత్వ మార్గదర్శ సూత్రాల ప్రకారం జనాభాలో దళితులు, గిరిజనుల దామాషా ప్రాతిపదిక 16.6,8.6 శాతం చొప్పున వారి అభివృద్ధి వుప ప్రణాళికలకు బడ్జెట్లలో కేటాయింపులు జరపాలి. 2006లో ప్రణాళికా సంఘం జారీ చేసిన నిబంధనల ప్రకారం సకాలంలో ఖర్చు చేయని నిధులు మురిగి పోతాయి. అలా మురగబెట్టటంలో దళితుల నిధుల విషయంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌, వుత్తర ప్రదేశ్‌, పంజాబ్‌, గిరిజన నిధులకు సంబంధించి ఝార్కండ్‌, ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌ మొదటి మూడు స్ధానాలలో వున్నాయి. తెలంగాణా కొత్త రాష్ట్రం, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని, భూములు ఇస్తామని చెప్పిన పెద్దల పాలనలో వున్న చోట 2014-15లో ఖర్చు చేయని నిధులు 61శాతం లేదా 4,643 కోట్లరూపాయలని విశ్లేషించారు.

    నరేంద్రమోడీ సర్కార్‌ను ఎందుకు తప్పు పట్టాల్సి వస్తున్నదంటే బిజెపి లేదా దాని మాతృసంస్ధ సంఘపరివార్‌ నేతలు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలను నిత్యం విమర్శిస్తున్నారు. అందుకు వారిని తప్పుపట్టటం లేదు, ఆ విధానాలు దేశాన్ని సర్వనాశనం చేశాయన్నది వాస్తవం. వారి స్ధానంలో అధికారానికి వచ్చిన బిజెపి తెచ్చిన మార్పులేమిటన్నది ప్రశ్న. ఒక రోజు వేసుకున్న చొక్కా మరుసటి రోజు మార్చినట్లుగా కాంగ్రెస్‌ స్ధానంలో బిజెపి వచ్చింది తప్ప విధానాలు మారలేదు. దళిత, గిరిజన వుప ప్రణాళికల నిధుల ఖర్చుకు సంబంధించి అవి అమలులోకి వచ్చిన 35 సంవత్సరాల నుంచి ఏ విధానాలను అనుసరిస్తున్నారో వాటిలో ఎలాంటి మార్పు చేయలేదు. ఆ తరగతులకు అంకితమైనట్లు చెప్పుకున్న పెద్ద మనిషి హయాంలో కూడా ఖర్చు పెట్టకుండా తిరిగి కేంద్రానికి చేరుతున్నాయి. భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల మీద అంటే ఇదేనా ?

      కర్ణాటకలో వున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్ధిక సంవత్సరం ముగియటానికి మూడునెలల ముందు ఈ ఏడాది జనవరిలో అక్కడి ముఖ్యమంత్రి సిద్ద రామయ్య సమీక్షిస్తూ నిధులలో కేవలం 0.87శాతమే ఖర్చు చేసినందుకు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారట. 2005-14 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌సి వుప ప్రణాళిక నిధులు రు.19,367 కోట్లు, గిరిజన వుప ప్రణాళిక నిధులు రు.6,922 కోట్లు ఖర్చు చేయలేదు. కాంగ్రెస్‌-బిజెపి ఏదో ఒక పార్టీ లేదా వాటితో సంబంధం వున్న వారే అందునా గిరిజనులే ముఖ్యమంత్రులుగా వున్న ఝార్కండ్‌లో ఇదే కాలంలో రు.17,107 కోట్ల గిరిజన నిధులు ఖర్చు చేయలేదట. నరేంద్రమోడీ ప్రభుత్వ విజయాల గురించి మన తెలుగోడు వెంకయ్య నాయుడు ప్రతి ఏటా ఒకసారి వూరూ వాడా తిరిగి గొప్పగా ప్రచారం చేసి వెళ్లారు. దళితులు, గిరిజనులకు తమ తొలి ఏడాది పాలనా కాలంలోనే అంతకు ముందుతో పోల్చితే 25శాతం బడ్జెట్‌ పెంచామని చెప్పారు. నిజమే, అయితే అది నాణానికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు చూడండి.

    కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు సంబంధించి షెడ్యూల్డు కులాల, తెగల వుప ప్రణాళికల నిధుల తీరు తెన్నులు ఎలా వున్నాయో చూడండి. (కటాయింపులు, ఖర్చు కోట్ల రూపాయలలో, ఖ.చే.పె ఖర్చు చేయని మొత్తం పెరుగుదల )

ఏడాది         కేటాయింపు       ఖర్చు           ఖర్చుచేయనిది      కే.పెరుగుదల     ఖ.చే.పె

2012-13     58,823.14    53,345.04       5,478.1 — —

2013-14     66,159.52    56,761.17       9,398.35                   12               72

2014-15      82,935.00   49,955.79      32,979.21                  25              251

నరేంద్రమోడీ ఏలుబడి మొదటి సంవత్సరంలో కేటాయింపు పెరుగుదల 25శాతం అయితే ఖర్చు పెట్టని మొత్తం పెరుగుదల 251 శాతం వుంది. ఇదేమిటని నిలదీయాలా వద్దా ? పాపం తగిలిపోతారని వదిలేద్దామా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

జనంపై తెలుగు దేశం-బిజెపి ఎదురుదాడి !

15 Thursday Sep 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others, Politics

≈ Leave a comment

Tags

AP Package, ap special asistance, ap special status, chandababu duplicity, Narendra Modi, Venkaiah naidu

Image result for Telugu desam started offensive against people

ఎం కోటేశ్వరరావు

     మహానటుడు నందమూరి తారకరామారావు సినిమాలలో చిక్కడు-దొరకడు, రేచుక్క-పగటి చుక్క వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులకు ఆనందాన్ని పంచితే సినిమా పరిభాషలో చెప్పాలంటే కొంతమంది దృష్టిలో అయినా ‘తోడు దొంగలు ‘ గా కనిపిస్తూ, ఎన్‌టిఆర్‌ అసలు సిసలు వారసులం అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ, మితృపక్షం బిజెపి నాయకులు నిజజీవితంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరుల ముందు నటిస్తున్నారు. ఎన్‌టిఆర్‌ సినిమాలు చివరకు సుఖాంతంగా ముగిశాయి. ప్రత్యేక తరహా హోదా కంటే ఎక్కువ ప్రయోజనం కలిగే ప్రత్యేక సాయం అనే వీరి నటన ఎలా ముగుస్తుందన్నది ఆసక్తికరం. ఎందుకంటే రియాలిటీ షో కదా ! ఇలాంటి షోలు ఫలానా విధంగా మాత్రమే నిర్వహించాలనే , ఫలానా విధంగా ముగించాలనే నిబంధనేమీ లేదు. వ్యాపారం కనుక వారికి అనుకూలమైన రీతిలో వాటిని రూపొందిస్తారు.ఈ రియాలిటీ షోలో రాని ప్రత్యేక హోదా , దాని కంటే ఎలా మెరుగో తెలియని లేదా వారైనా చెప్పని ప్రత్యేక సాయంపై జనంపై ఎదురు దాడికి దిగారు. త్వరలో ఈ సాయానికి కేంద్ర కాబినెట్‌ ఆమోద ముద్ర వేసిన తరువాత అదింకా పెరగవచ్చు లేదా జనంలో ప్రతికూలత వ్యక్తమైతే వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గ వచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం తమ ఆత్మరక్షణ, సమర్ధనకు వూరూరా ఎదురుదాడి చేయాలనే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

Image result for venkaiah naidu

దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో మాదిరి ‘పంచాంగ ‘ వెంకయ్య

      రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఇక రాదు అన్నది సుస్పష్టం. దీనికి జనాన్ని మానసికంగా సిద్ధం చేయటానికి 27నెలల పాటు కసరత్తు చేయాల్సి వచ్చిందంటే ఈ విషయంలో తెలుగుదేశం, బిజెపిలు ఎంత భయపడ్డాయో, ఆందోళనకు గురయ్యాయో చెప్పకనే చెప్పినట్లయింది. ఎంతైనా బిజెపివారి ఆర్‌ఎస్‌ఎస్‌ ఎత్తుగడలు, తెలుగుదేశం వారి సినిమా దర్శకత్వాలతో పార్లమెంటరీ చర్చల ట్విస్టులమీద ట్విస్టులు, అసెంబ్లీ తీర్మానాల ప్రహసనాలు, అనుకూల, సానుకూల పత్రికలు, టీవీలలో లీకుల వార్తల వడ్డన, వుత్తుత్తి బెదిరింపులు, అలకలు , పిట్టకథలు అబ్చో ఎన్ని పిల్లి మొగ్గలు వేయాలో అన్నీ వేశారు. జనానికి ఎంతో వినోదం కలిగించారు. ఇప్పుడు చెబుతున్న ఆసాధ్యాలు, సుసాధ్యాల గురించి వుభయ పార్టీల పెద్దలు పార్లమెంట్‌, అసెంబ్లీ చర్చలలో ఎందుకు చెప్పలేదని ఎవరైనా అడిగితే అది రాష్ట్ర ద్రోహం అవుతుంది. కనీసం ఎప్పుడు జ్ఞానోదయం అయిందో అదైనా చెప్పాలి. దొంగను దొంగంటే నువ్వు దొంగ, నీ కుటుంబం అంతా దొంగలే అని ఎదురుదాడి చేస్తారు. తెలుగుదేశం,బిజెపిలు ఇపుడు ఎదురుదాడికి దిగాయి. పార్లమెంట్‌లో తానొక్కడినే మాట్లాడానని,కమ్యూనిస్టులుగానీ మిగతా వారు ఎందుకు మాట్లాడలేదని వెంకయ్య నాయుడు, పాకేజి కంటే ఇంకా మెరుగైనదేమిటో చెబితే తాను పోరాడతానని చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. వెంకయ్య నాయుడి వ్యవహారం దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఆవుల్లో అన్నట్లుగా వుంది. ఇంతకాలం ప్రత్యేక హోదా గురించి తానొక్కడినే పట్టుబట్టినట్లు ఒక ఘనతగా చెప్పుకున్నారు. తీరా తామే దానికి మొండిచేయి చూపాల్సి వచ్చేసరికి తానసలు అంధ్రప్రదేశ్‌ ప్రతినిధిని కాదని అయినా దానికోసం ఎంతో చేస్తే విమర్శిస్తారా అంటున్నారు. గత రెండున్నర సంవత్సరాలలో ఎన్నడూ ఈ మాట ఎక్కడా ఇంత స్పష్టంగా ఎందుకు చెప్పలేదు ? కావమ్మ మొగుడని మీరంతా అంటే కామోసు కామోసనుకొని ఇంతకాలం కాపురం చేశా, ఇప్పుడు కాదంటున్నారు కనుక నా కర్రా బుర్రా ఇస్తే వెళ్లి పోతా అన్నాడట వెనుకటి కెవడో ! ‘పంచాంగ’ నాయుడిగారి తీరు అలాగే వుంది.

     రాష్ట్ర విభజన ఒక రాజకీయ నిర్ణయం. దానిలో భాగస్వాములు కానిది ఒక్క సిపిఎం మాత్రమే. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు మిగతా పార్టీలన్నీ ఎంతో కొంత దానిలో భాగస్వాములే. ఒక వైపు రెండు కళ్ల సిద్ధాంతం చెబుతూ చంద్రబాబు నాయుడు తన పాత్రను చక్కగా పోషించారు. విభజన చట్టంలోని అంశాల గురించి ఏం మాట్లాడితే జనం ఏమనుకుంటారో, రాజకీయంగా నష్టమా లాభమా అని ఆలోచించి విభజనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న సమయంలో విభజన సరిగా లేదంటూ తెలుగుదేశం పార్టీ గోడమీది పిల్లివాటం ప్రదర్శించింది. భాషా ప్రయ్తు రాష్ట్రాలను విడదీయకూడదన్న తమ సూత్రబద్ద వైఖరికి సిపిఎం కట్టుబడి వుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా విభజితమయ్యే రెండు రాష్ట్రాలలోనూ తమ పలుకుబడి పెంచుకోవచ్చన్న దురాశతో బిజెపి నేతలు కాంగ్రెస్‌ నిర్ణయానికి వంతపాడారన్నది నగ్నసత్యం. అందుకే వెంకయ్య నాయుడు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు తప్ప నిజానికి రాష్ట్ర ప్రజల మీద ప్రేమ కాదు. ఆ పెద్దమ్మనే (సోనియా గాంధీ) కాదు, ఈ చిన్నమ్మను కూడా గుర్తు పెట్టుకోండని సుష్మాస్వరాజ్‌ తెలంగాణా వాసులను, కాంగ్రెస్‌ ఐదంటే కాదు పది అని పట్టుబట్టి ప్రత్యేక హోదాకు ఒప్పించింది తామే అని బిజెపివారు ఆంధ్రప్రదేశ్‌లో చెప్పుకున్న విషయాన్ని కాదంటారా ? అప్పుడు ఏ పార్టీ వారు కూడా పాకేజి గురించి మాట్లాడలేదు. మాట తప్పింది, ద్రోహం చేసింది బిజెపి . అందువలన హోదా గురించి మాట్లాడింది మీరే కనుక ఆ ఖ్యాతిని కూడా గుండుగుత్తగా వుంచుకోండి , ప్రత్యేక హోదాను తప్ప అందుకు వచ్చే ఖ్యాతిలో వాటా ఇమ్మ ని ఎవరైనా అడిగితే వెంకయ్యకు కోపం వస్తే అర్ధం వుంది. ఎవరూ అడగటం లేదే ! ఒక రాజకీయ పార్టీ మీద మరొక పార్టీ ఎదురుదాడి చేస్తే కొంత వరకు అర్ధం చేసుకుంటారు, కానీ మొత్తం జనం మీదే ఎదురుదాడికి దిగి లబ్ది పొందిన రాజకీయ పార్టీ మనకు ఎక్కడా కనపడదు. ఇపుడు కొన్ని రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని బిజెపి,తెలుగుదేశం పార్టీలు ప్రశ్నించిన జనం మీదే తుపాకులు ఎక్కుపెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధిని కాకపోయినా నన్నే తిడతారా అంటూ వెంకయ్య నాయుడి రుసరుసలు.ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధి కాకపోయినా రాష్ట్రానికి ఎంతో చేశారంటూ ఆ పెద్దమనిషికి బిజెపి నేతలు సన్మానాల మీద సన్మానాలు చేస్తున్నారు. రెండు పార్టీలకు చట్ట సభల్లో సరిపడా తగిన మద్దతు వుంది,కావాలనుకుంటే ఎదుటి పార్టీల ప్రతినిధులను ఆకర్షించగలిగే అధికారం వుంది, నీతి నియమాలను ఎప్పుడో గాలికి వదిలి నిరంతరం ఎక్కడ అధికారమనే పంచదార వుంటే అక్కడికి చేరే చీమల మాదిరి పార్టీలు మారటానికి సిద్ధంగా వున్న జనం వున్నారు.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ఎదురు దాడి ప్రారంభించిన చంద్రబాబు

    వెంకయ్య నాయుడి మాటలలో చెప్పాలంటే ప్రత్యేక హోదాతో నిమిత్తం లేకుండానే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల గురించి చంద్రబాబు నాయుడు ఒప్పందాలు చేసుకున్నారు. పదేళ్లలో చేయాల్సిందానిని రెండు సంవత్సరాలలోనే కేంద్రం ఎన్నో చేసిందని వెంకయ్య నాయుడు టాం టాం వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు దీనికి కృతజ్ఞతల మీద కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా గురించి వూరూ వాడా ప్రచారం చేసింది, అశలు కల్పించింది మీరు. ఎప్పుడూ పాకేజి గురించి చెప్పలేదు. ఇప్పుడు పాకేజి కంటే మెరుగైనదేమిటో చెప్పమని చంద్రబాబు, తెలుగుదేశ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. అది కూడా చెప్పాల్సింది మీరే. పద్నాలుగవ ఆర్ధిక సంఘం కొత్తగా ప్రత్యేక హోదాను ఇవ్వకూడదని సిఫార్సు చేసిందని ఒక మాట, ప్రత్యేక హోదా ఒక రాష్ట్రానికి ఇస్తే మిగతావన్నీ తమకూ అడుగుతాయి,ఇవ్వకపోతే ఎన్‌డిసిలో వ్యతిరేకిస్తాయి అని మరోమాట, ఇప్పటికే వున్న రాష్ట్రాలకు కూడా రద్దు చేయబోతున్నాం అని ఇంకోమాట. ఏదో ఒక మాట మీద కట్టుబడి వుండాలి కదా !

    ప్రత్యేక హోదాకు ఇన్ని ఆటంకాలు చెప్పిన పెద్ద మనుషులు ప్రత్యేక పాకేజీ కూడా లేకుండా ప్రత్యేక సాయం అని పేరు పెట్టి ఒక ప్రకటన చేశారు. ఓకే ఆంధ్రప్రదేశ్‌ పట్ల జాలి, దయ, కరుణతో ఈ సాయం చేస్తున్నారని అనుకుందాం. అది నిబంధనలకు అనుగుణంగానా, లేక పక్కన పెట్టారా ? అనుగుణ్యంగానే అయితే దానిలో ప్రత్యేకత ఏమున్నట్లు. వుదాహరణకు రాష్ట్ర విభజన కారణంగా ఏర్పడిన ఆదాయలోటు రు.22,113 కోట్ల మొత్తాన్ని ఐదు సంవత్సరాలలో కేంద్రం చెల్లిస్తుంది. దీన్ని ప్రత్యేక సాయం అంటున్నారు, అది ఎలా అవుతుంది ? రాష్ట్రాన్ని విడగొట్టకపోయినా ఆ మొత్తం వచ్చేదే. ఎందుకంటే మన రాష్ట్ర విభజనతో నిమిత్తం లేని పధ్నాలుగవ ఆర్ధిక సంఘం ఆంధ్రప్రదేశ్‌తో పాటు పదకొండు రాష్ట్రాలకు రు.1,94,821 కోట్ల రూపాయలను ఐదు సంవత్సరాల కాలంలో చెల్లించాలని సిఫార్సు చేసింది. విశాఖ పట్టణం నగరం కంటే తక్కువ జనాభా వున్న నాగాలాండ్‌ రాష్ట్రానికి రు.18,475, జమ్ము కాశ్మీర్‌కు 60, హిమచల ప్రదేశ్‌కు 40వేల కోట్లు ఇవ్వనున్నారు. దీన్ని గురించి ఏమంటారు ?http://ficci.in/SPdocument/20563/Highlights_14thFinance_Commission_Report.pdf

    ప్రత్యేక హోదాకు,పరిశ్రమల రాయితీలకు సంబంధం లేదని ఒక మాట. విభజన చట్టంలోనే హోదా గురించి అప్పుడు కాంగ్రెసే పెట్టి వుంటే పోయేది, ఆ పని చేయకుండా అన్యాయం చేసిందని ఒక విమర్శ. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే పరిశ్రమలన్నీ అక్కడికే తరలి పోతాయని తమిళనాడు అభ్యంతరం చెబుతున్నదని వెల్లడించింది ఎవరు ? హోదాకు రాయితీలకు సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్‌ జనాల మెదళ్లకు ఎక్కించేందుకు కష్టపడకపోతే అదేదో అభ్యంతరాలు పెట్టే రాష్ట్రాలకు ఎందుకు నచ్చచెప్పలేకపోయినట్లు ? రాని హోదా గురించే పట్టుబట్టి ఇచ్చే రాయితీలసు కూడా వద్దందామా అని మరొక ఎదురుదాడి.ఈ కాలంలో వెంకయ్య నాయుడి చొరవతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమిటో, హోదాతో నిమిత్తం లేకుండానే తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి చేసిందేమిటో ఒక శ్వేతపత్రం ప్రకటించి వివరిస్తే తప్ప జనానికి వాస్తవం అర్ధం కాదు.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ప్రధాని అలా మనవి చేసుకుంటారా ? గవర్నర్‌ అంతగా దిగజారి పోయారా ?

      అన్నింటికీ కొత్త అర్ధాలు చెబుతున్న మాననీయ ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశానికి కూడా కొత్త భాష్యం చెప్పినట్లు ఒక అస్మదీయ పత్రిక వార్తలను బట్టి తెలిసింది. ప్రధాన మంత్రి, రాష్ట్ర గవర్నర్‌ భేటీ అయ్యారని 40 నిమిషాలలో సగం పాకేజి,ఆంధ్రప్రదేశ్‌ గురించే మాట్లాడారని లీకుల కధనం. ఆ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు ప్రధానో లేక గవర్నరో అస్మదీయ పత్రికల విలేకర్లను పిలిచి చెవిలో వూది వుండాలి. లేకపోతే వారి ప్రతినిధులు కల్పించిన కధనమైనా అయి వుండాలి. తామేం చేసినా, చెప్పినా నోరు మూసుకొని వినాలి, పడి వుండాలన్న బరితెగింపు కాకపోతే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తే సమస్య మరింత జఠిలం అవుతుందని ప్రధాని మోడీ అభిప్రాయ పడినట్లు ఆ కధనంలో వుంది.అలాంటపుడు మజ్లిస్‌ పార్టీ ప్రతినిధితో సహా అఖిల పక్ష బృందాన్ని కాశ్మీర్‌కు ఎందుకు పంపినట్లు ? సమస్యను మరింత జఠిలం చేయటానికా ? ఇక ముందు ఎలాంటి అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయరని భావించాలా ? అభివృద్ధి కావాలనుకున్నవారు ప్యాకేజీని స్వాగతిస్తారని, సమస్యను సాగదీసి రావణకాష్టం చేయాలనుకున్నవారు మాత్రమే విమర్శలు చేస్తారని ప్రతిపక్షాలపై మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారట. ప్యాకేజికి నానా కష్టాలు పడాల్సి వచ్చిందట. కొన్ని ప్రాంతాలలో ఇలాంటి వాటిని పోసుకోలు కబుర్లు అంటారు. హోదా బదులు వట్టిస్తరి మంచినీళ్ల వంటి పాకేజీకి జనాన్ని ఒప్పించటానికి పడుతున్న పాట్లు తప్ప మరొకటి దీనిలో కనిపించటం లేదు. పాకేజి పట్ల 60శాతం జనం సంతృప్తిగా వున్నారని ప్రతిపక్షాలు మాత్రం హోదా వల్ల అమిత ప్రయోజనాలు కలుగుతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నాయని గవర్నర్‌ ప్రధానితో చెప్పినట్లుగా వుంది. ఒక గవర్నర్‌ ప్రధానితో కలిసినపుడు ఒక వేళ చెప్పాల్సి వస్తే ఏ పార్టీ వైఖరి ఏమిటో చెబుతారు తప్ప దుష్ప్రచారం చేస్తున్నాయంటూ ఒక రాజకీయ నేత మాదిరి ఫిర్యాదు చేస్తారా ? గవర్నర్‌ అంతగా దిగజారి పోయారా ? ప్రతిపక్షాలపై తాము చేయదలచుకున్న ఆరోపణలను గవర్నర్‌కు ఆపాదించి వాటికి విశ్వసనీయత కల్పించ చూసే అతి తెలివి తప్ప మరొకటి కాదు . అంతకంటే పెద్ద తెలివి తక్కువ పదజాలం చూడండి. ‘ ఇంకొన్ని అంశాలలో ఏపీకి సాయం అవసరమనే విషయం మేమూ గుర్తించాం. వాటిని కూడా అందించటానికి ప్రణాళిక రూపొందించుకుంటాం ‘ అని ప్రధాని పేర్కొన్నారట. ప్రణాళికను రూపొందించుకుంటాం అని ప్రధాని అన్నట్లుగా రాయటం చంద్రబాబు మెప్పు పొందటానికి తప్ప మరొకటి కాదు. ఒక కింది స్ధాయి అధికారి పెద్ద అధికారితో ‘మనవి’ చేసుకున్నట్లుగా వుంది తప్ప ఒక ప్రధాని ఒక రాష్ట్ర ముఖ్య మంత్రితో మాట్లాడినదిగా లేదు. అయితే ఇక్కడ ఒకటి జరిగి వుండటానికి ఆస్కారం వుంది. ఆంగ్ల భాషలో ప్రధాని అంత పండితుడు కానట్లే హిందీలో కూడా చంద్రబాబు అంతే. అందువలన ఒకరు హిందీలో మరొకరు ఆంగ్లంలో ఫోన్లో మాట్లాడి నపుడు సదరు వార్త రాసిన విలేకరి పక్కనే వుండి విని రాసుకోవటం లేదా చంద్రబాబులో పరకాయ ప్రవేశం చేసి మాట్లాడిన దానిని తర్జుమా చేయటంలో వచ్చిన ఇబ్బంది కానీ అయి వుండాలి.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

చంద్రబాబు చక్రం తిప్పటంపై జనంలో ఇంకా ఆశలు

    తెలుగుదేశ నాయకత్వ ఆరోపణలను వారి మాటల్లో చెప్పాలంటే వారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తుంటే ప్రతిపక్షాలు జనాన్ని రెచ్చగొడుతున్నాయి. జనం రెచ్చిపోయిన సూచనలు ఎక్కడా కనిపించటం లేదు. అంతా శాంతియుతంగా వుంది. కనుక తెలుగుదేశమే ప్రతిపక్షాలను రెచ్చగొడుతున్నది అనుకోవాలేమో ! ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక హోదా రాష్ట్రం అంటే ఏమిటో జనానికి ఒక బ్రహ్మ పదార్ధంగా తయారైంది. అది రాదని తెలిసిన తెలుగుదేశం, బిజెపిలు , వాటికి కొమ్ముకాసే మీడియా దాని వలన కలిగే ప్రయోజనాలను జనానికి వివరించి చైతన్య పరచటం, ఆశలు కలిగించటం తమకు నష్టమని భావించాయన్నది కొందరి అభిప్రాయం. కర్ణుడి రధం నడుపుతూనే అతనిని దెబ్బతీయటానికి ప్రయత్నించిన సారధి శల్యుడి మాదిరి అస్మదీయ మీడియా జనం పక్షం అని చెపుతూనే ప్రత్యేక హోదా పట్ల జనంలో ఆసక్తి సన్నగిల్లి పోవటానికి శల్యసారధ్యం చేస్తున్నదా ? ఆ మేరకు జయప్రదమైనట్లే కనిపిస్తున్నది. ప్రత్యేక హోదా రాదన్న నిరాశ, నమ్మిన వారే మోసం చేశారన్న ఆశక్తత జనంలో కనిపిస్తోందన్నది ఒక అభిప్రాయం. రెండో వైపు ప్రతిపక్షంపై విస్వసనీయత లేకపోవటంతో నిజం చెప్పినా నమ్మని స్ధితి, వామపక్షాలు నామమాత్రంగా మారటం. మూడో అభిప్రాయం కూడా వుంది అదేమంటే తిమ్మిని బమ్మిని చేయగల చంద్రబాబు నాయుడు ఏదో ఒకటి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, ఐటి రంగంలో అమరావతిని మరో హైదరాబాదుగా మారుస్తారనే గుడ్డి విశ్వాసం బలంగా వుండబట్టే హోదా లేకపోయినా ఇచ్చిందాంతో సంతృప్తి చెందుదామనే భావనకు లోనయ్యారనే అభిప్రాయమూ వుంది.

  ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న శతకకారుడిని బిజెపి-తెలుగుదేశం పార్టీలు ఆశ్రయించినట్లు ఇప్పుడు వారి మాటలను బట్టి చెప్పవచ్చు. ఇంతకాలం ప్రత్యేక హోదా గురించి జనాన్ని భ్రమ పెడితే ఇప్పుడు ప్రత్యేక హోదా లేకపోయినా రాయితీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తారని బాబొస్తే జాబొస్తుందన్న పాత నినాదాన్ని తిరిగి జనానికి గుర్తు చేశారు. ఇది మరొక ఆశాభంగానికి నాంది అవుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

శిక్షలేని నేరం జర్నలిస్టుల హత్యలు

13 Tuesday Sep 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ 1 Comment

Tags

attacks on journalists, Journalist Murders, Journalist Murders in India, journalists

Image result for stop attacks on journalists in india

ఎం కోటేశ్వరరావు

     మీరు ఎవరినైనా మట్టు పెట్టదలచుకున్నారా ? మన దేశంలో చాలా సులభం ! ఎలాంటి శిక్షలు వుండవు !! వాణిజ్య ప్రకటనలలో షరతులు వర్తిసాయని నక్షత్ర గుర్తులు వేసినట్లే దీనికి కూడా ఒక షరతు వుంది. అదేమంటే అలాంటి వారు మీడియా వ్యక్తులై వుండాలి. ఈ రోజుల్లో వారు దొరకటం చాలా సులభం. పత్రికలు, టీవీలు, రేడియో, అంతర్జాతల మీడియాలో చాలీ చాలని లేదా అసలు వేతనం లేకుండా పని చేసే వారే కాదు, ఎలాంటి జీతం, భత్యాలు, పగలనకా, రాత్రనకా తేడా లేకుండా పని చేస్తూ , యజమానులకు విపరీత లాభాలు సమకూర్చి పెడుతున్న సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టే ప్రతి ఒక్కరూ జర్నలిస్టులే. అనుమానమా ? అక్కర లేదు మీ పోస్టులను సాక్ష్యంగా చూపి ఎవరైనా నా మనోభావాన్ని దెబ్బతీశారు అని ఫిర్యాదు చేస్తే కేసులు పెడుతున్నారు. సాంప్రదాయ మీడియాలో పని చేసే వారి మీద కూడా అలాంటి కేసులే పెట్ట వచ్చు. కానీ అలా చేయటం లేదే, భౌతికంగా మట్టు పెడుతున్నారు. అలాంటి పరిస్థితి రేపు సామాజిక మీడియా జర్నలిస్టులకు ఎదురు కాదని ఎవరైనా చెప్పగలరా ?

     చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నది అధికారంలో వున్న పెద్దల వువాచలలో ఒకటి. వంద మంది నేరగాళ్లు తప్పించుకుపోవచ్చుగాని ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదన్నది న్యాయ సూక్తి. అంతర్జాతీయ సంస్ధ జర్నలిస్టుల రక్షణ కమిటి( కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌-సిపిజె) తాజా నివేదిక ప్రకారం 1992 నుంచి 2016 జూలై వరకు 27 మంది జర్నలిస్టుల హత్య కేసులలో ఒక్కటంటే ఒక్క దానిలో కూడా నేరగాళ్లకు శిక్ష పడలేదు. నిజంగా చట్టం తనపని తాను చేస్తే ఇలాగే జరుగుతుందా ? ఒక్క కేసులో ఒక్కరికి కూడా శిక్ష పడలేదంటే నిందితులందరూ నిరపరాధులేనా ?అనేక మంది చెబుతున్నట్లు, వాటిని అనేక మంది నమ్ముతున్నట్లు మనది ప్రపంచంలో ఎంతో బాగా పనిచేస్తున్న అతి పెద్ద ప్రజాస్వామిక సంస్ధ, దర్యాప్తు చేయాల్సిన పోలీసులూ సమర్ధులే, విచారించాల్సిన న్యాయమూర్తులనూ తప్పు పట్టలేము. తిమ్మినిబమ్మిని చేసే న్యాయవాదులూ తమ వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వరిస్తున్నట్లే. మనది బూటపు ప్రజాస్వామ్యమా లేక ప్రజాస్వామ్యాన్ని బూటకంగా మార్చివేశారా ? లేక వ్యవస్ధలోనే లోపమున్నదా ? ఎవరు దీనికి బాధ్యులు ? ఎందుకిలా జరుగుతోంది? ఏం జరిగినా అన్నీ మన మంచికే అన్నట్లుగా అన్నింటినీ గుడ్లప్పగించి చూస్తున్న సమాజం ? ఏమిటీ వైపరీత్యం, ఎంతకాలమిలా ? వీటన్నింటిని చూసి అరుదుగా వున్న సున్నిత మనస్కులలో ఏ ఒక్కరైనా ఈ ప్రజాస్వామ్యం, ఈ వ్యవస్ధ మీద నమ్మకం కోల్పోయినట్లు ప్రకటిస్తే ఆ ఘోరానికి బాధ్యులెవరు ?

    భారత రాజ్యాంగం ఆర్టికల్‌ పందొమ్మిది ప్రకారం హామీ ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే నేరాలకు పాల్పడుతున్న వారి నుంచి జర్నలిస్టులను కాపాడేందుకు జాతీయ స్ధాయిలో అవసరమైన ఒక యంత్రాంగాన్ని, పద్దతిని రూపొందించేందుకు అవసరమైన ముసాయితా ప్రతిపాదనలను తయారు చేసేందుకు అనుభవమున్న న్యాయమూర్తులు, జర్నలిస్టులు, పండితులు, భావ ప్రకటనా స్వేచ్చ విషయాలలో నిపుణులైన ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని సిపిజె తన నివేదికలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

    ఈ నివేదికను సిపిజె ఆసియా కార్యక్రమ సీనియర్‌ పరిశోధకులు సుమిత్‌ గల్‌హోత్రా,స్వతంత్ర పాత్రికేయులు రక్షా కుమార్‌ సిపిజె తరఫున ఈ నివేదికను తయారు చేశారు. మీడియా తీరుతెన్నులను వీక్షించే వెబ్‌సైట్‌ ది హూట్‌ సలహా సంపాదకురాలు ముంబైకి చెందిన గీతా శేషు కేసుల వివరాలను అందచేయగా దేశంలోని పరిస్థితుల గురించి స్వతంత్ర జర్నలిస్టు ఆయుష్‌ సోనీ రాశారు.(గీతా శేషు సేకరించిన కొన్ని వివరాలను వర్కింగ్‌ జర్నలిస్టు జూన్‌ సంచికలో ఇచ్చాము). ఈ నివేదిక ముందు మాటను ప్రముఖ జర్నలిస్టు పి శాయినాధ్‌ రాశారు. నివేదిక పూర్తి పాఠం కావాల్సిన వారు దిగువ లింక్‌లో పొంద వచ్చు.https://cpj.org/reports/2016/08/dangerous-pursuit-india-corruption-journalists-killed-impunity.php పెద్ద పట్టణాలలో వున్నవారి కంటే గ్రామీణ, చిన్న పట్టణాలలో వున్న జర్నలిస్టులకు తాము రాసిన రాతలపై దాడులు జరిగే ముప్పు ఎక్కువగా వుందని అయితే ఈ నివేదికను పరిశీలించిన తరువాత దానికి తోడు జర్నలిస్టు పని చేస్తున్న స్థలం, సంస్ధ, వృత్తిలో స్థాయి, సామాజిక పూర్వరంగం కూడా ఆ ముప్పుకు అదనంగా తోడవుతున్నట్లు వెల్లడైందని శాయినాధ్‌ చెప్పారు. ప్రాంతీయ భాషలలో వార్తలు రాసే వారికి ముఖ్యంగా ఆ రాసింది శక్తివంతులైన వారిని సవాలు చేసేదిగా వుంటే విలేకర్లకు ముప్పు ఇంకా ఎక్కువగా వుంటుందని వ్యాఖ్యానించారు. జాతీయ మీడియాలో పని చేసేవారు ఇలాంటి ఘోరమైన దాడుల నుంచి తప్పించుకుంటున్నారని కారణం జాతీయ మీడియాలోని వున్నత తరగతులు, ప్రత్యేకించి ఆంగ్ల మీడియా సంస్ధలలో వున్నవారికి మెరుగైన రక్షణ కలిగి వున్నారని, పలుకబడి కలిగిన జాతీయ మీడియా సంస్ధలు ప్రభుత్వానికి అందుబాటులో వుండటంతో వాటిలో పనిచేసే వారికి అంతర్గతంగానే వ్యవస్ధా పరరక్షణ వుంటుందని శాయినాధ్‌ పేర్కొన్నారు.

     అవినీతి గురించి రాసిన కారణంగానే జర్నలిస్టులు హత్యకు గురైనట్లు నివేదికలోని 27 వుదంతాలు వివరాలు వెల్లడిస్తున్నాయి. ఏ ఒక్క కేసులోనూ ఎవరికీ శిక్షలు పడలేదు. ఈ పరిస్థితి మీడియాకు ఒక సవాలు వంటి పరిస్థితిని ముందుకు తెచ్చింది. ముఖ్యంగా చిన్న పట్టణాలలోని జర్నలిస్టులు అవినీతిని గురించి నివేదించినపుడు వారు ఎక్కువగా బెదిరింపులు, హత్యలకు గురవుతున్నారని సిపిజె నివేదిక తెలిపింది. జర్నలిస్టులు ఏమాత్రం రక్షణలేని స్ధితిలో పని చేస్తున్నారని, మీడియా సౌహార్ద్రతలేమి, న్యాయ వ్యవస్ధలో పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి వుందని, మరణించిన తరువాత బాధితులను అప్రతిష్టపాలు చేస్తున్నారని పేర్కొన్నది. 2015లో తీవ్ర కాలిన గాయాలతో మరణవాగ్ఞూలం ఇచ్చిన స్వతంత్ర జర్నలిస్టు జోగేంద్ర సింగ్‌ ఒక పోలీసు అధికారే తనను సజీవ దహనం చేసేందుకు మంటల్లోకి నెట్టారని చెప్పాడు. అతను చెప్పిన దానిని తిరస్కరించిన స్దానిక పోలీసులు అసలు అతను జర్నలిస్టే కాదని బుకాయించారు. ఒక ఏడాది గడిచినప్పటికీ రాష్ట్ర స్ధాయిలో ఇంకా దర్యాప్తు సాగుతూనే వుంది, అరెస్టులు లేవు. 2011 జనవరిలో తన ఇంటి ముందే కాల్పుల్లో హత్యకు గురైన నయా దునియా హిందీ పత్రిక జర్నలిస్టు రాజపుట్‌ కేసులో దర్యాప్తును సాగదీసి కీలక సాక్ష్యాలను కనుమరుగు చేసే యత్నం చేశారు. చివరికి ఇప్పుడు ఆ కేసును సిబిఐకి అప్పగించారు. భారత్‌లోని అతి పెద్ద కుంభకోణాలలో ఒకదానిపై పరిశోధనలో భాగంగా ఒక ఇంటర్వ్యూ సమయంలో అనుమానాస్పద స్ధితిలో మరణించి ఇండియా టుడే గ్రూప్‌ పత్రికలకు చెందిన అక్షయ్‌ సింగ్‌ కేసు మిగతా కేసులతో పోల్చితే త్వరగా సిబిఐకి అప్పగించారంటే దానికి కారణం ఒక పెద్ద సంస్థలో పని చేస్తూ వుండటమే అని నివేదిక పేర్కొన్నది.

     పైన పేర్కొన్న మూడు వుదంతాల గురించి ఈ ఏడాది మార్చినెలలో సిపిజె బృందం పరిశోధనలో భాగంగా వారి కుటుంబ సభ్యులు, బంధువులు, న్యాయవాదులు, జర్నలిస్టులను కలసి వారి అభిప్రాయాలను సేకరించింది. స్వతంత్ర జర్నలిస్టు జగేంద్ర సింగ్‌ పోలీసుల చేతిలో కాలిన గాయాలతో మరణించాడని విమర్శలు వచ్చాయి. వుత్తర ప్రదేశ్‌కు చెందిన ఒక మంత్రి భూ కబ్జా, అత్యాచారాల గురించి వార్తలు రాయటమే అతను చేసిన నేరం.ఒక రాజకీయనేత కుమారుడు అక్రమంగా జూదం నిర్వహణలో వున్నట్లు రాసిన వుమేష్‌ రాజపుట్‌ను ఇంటి ముందే కాల్చి చంపారు. మధ్య ప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణంగా ప్రసిద్ధి చెందిన అవినీతి అక్రమాలపై శోధన చేస్తుండగా అక్షయ సింగ్‌ ఆకస్మికంగా మరణించాడు. ఇలాంటి పరిశోధనలను అధికార యంత్రాంగం సహించటం లేదు.దాడులు, హత్యలు జరిగిన వుదంతాలలో పోలీసులు సరిగా దర్యాప్తు జరిపి దోషులను గుర్తించటం,అరెస్టు చేయటం జరగటంలేదు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌, 2జి స్కామ్‌ వంటి వాటిలో జరిగిన అక్రమాల గురించి సమాచార హక్కు చట్టం కింద వెలుగులోకి తేవటంలో కార్యకర్తలు, జర్నలిస్టులు ఎంతో ముందున్నారు.గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అవినీతిని ఒక కేంద్రీయ అంశంగా చేసిన నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతిపై చర్యలు తీసుకోకపోవటంతో పాటు వాటిని వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న జర్నలిస్టులకు తగిన రక్షణ చర్యలు తీసుకోవటం లేదు. భారత్‌లో ఏ ఒక్క ప్రభుత్వం కూడా పత్రికా స్వేచ్చ గురించి తీవ్రంగా పట్టించుకోలేదు. కేంద్రంలో, రాష్ట్రాలలో అధికారంలో వున్న కాంగ్రెస్‌,బిజెపి లేదా ప్రాంతీయ పార్టీలుగానీ ఎవరున్నా మౌనం వహిస్తున్నారు. శిక్షలు లేని సంస్కృతిని మాత్రమే పెంచి పోషిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు.

    సిపిజె ఇంతవరకు విధులలో భాగంగా హత్యలు జరిగిన 27 కేసులను పరిశీలించగా ఒక్కదానిలో కూడా శిక్షలు పడలేదని తేలింది. మరో 25 అనుమానిత మరణాలను కూడా ఏ కారణంతో జరిగాయనే విషయమై దర్యాప్తు జరుపుతోంది.

    ఒక జర్నలిస్టుపై దాడి లేదా హత్య జరిగిందనే ఫిర్యాదు చేయగానే పోలీసులు ముందుగా అతను జర్నలిస్టు కాదు, ఆ ఘటనకు జర్నలిజానికి సంబంధం లేదంటున్నారని గీతా శేషు పేర్కొన్నారు.దర్యాప్తులో కూడా అదే ప్రతిబింబిస్తోంది. ‘ దేశంలో గట్టి ప్రజాస్వామిక సంస్ధలు, చురుకుగా వుండే స్వతంత్ర న్యాయవ్యవస్ధ వున్నప్పటికీ జర్నలిస్టులను హత్యలు చేసిన వారు శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారు. పరిస్థితి చాలా ఆందోళనకరంగా వుంది, అది దేశంలోని ప్రజాస్వామిక సంస్ధల పనితీరుపై ప్రభావం చూపుతుందని’ 2015లో ప్రెస్‌ కౌన్సిల్‌ పేర్కొన్న అంశాన్ని సిపిజె నివేదిక వుటంకించింది.

     నాణానికి ఒకవైపు బొమ్మ ఇదైతే రెండోవైపు బొరుసు గురించి కూడా సిపిజె నివేదిక పేర్కొన్నది. భౌతికంగా అదే విధంగా సామాజిక మాధ్యమాలలో మొత్తం జర్నలిస్టు సమాజం దాడులకు గురవుతుంటే దాడులు, హత్యలకు గురైనా మీడియాలోని తోటి జర్నలిస్టులలో, మొత్తం మీద సమాజంలో నిరసన వ్యక్తం కావటం లేదని కూడా సిపిజె ఆందోళన వ్యక్తం చేసింది. దాడికి గురైన జర్నలిస్టు ఎవరా అన్నదానితో నిమిత్తం లేకుండా మీడియాపై దాడులకు సంబంధించిన అంశాలపై మెరుగ్గా శోధించి వెలుగులోకి తీసుకురావాలని భారత మీడియా సంస్ధలను సిపిజె కోరింది. జర్నలిస్టులు ప్రతికూల పరిస్ధితులలో వున్న వెలుగులో సిపిజె నివేదిక అనేక సిఫార్సులు చేసింది. జర్నలిస్టులకు రక్షణ కల్పించేందుకు ఇతర దేశాలలో వున్న వుత్తమ ఆచరణలను అధ్యయనం చేసి జాతీయ స్ధాయిలో ఒక యంగ్రాంగాన్ని ఏర్పాటు చేయటం అందులో ఒకటి.మీడియాపై దాడులు చేసి శిక్షలు పడకుండా తప్పించుకున్న వుదంతాలపై పార్లమెంటరీ కమిటీ విచారణ నిర్వహించి న్యాయం చేసేందుకు, శిక్షలు వేయటానికి ఎదురువుతున్న సవాళ్లను గుర్తించాలి. దాడులు, హత్యలు జరిగినపుడల్లా నిర్ద్వంద్వంగా బహిరంగ ప్రకటనలు చేసి కేంద్రం వాటిని ఖండించి గట్టి సందేశం పంపాలి. సిబిఐ తన దర్యాప్తులో వున్న కేసులను త్వరగా పూర్తి చేయాలని, చత్తీస్‌ఘర్‌ ప్రభుత్వం జర్నలిస్టులపై పోలీసుల వేధింపులను ఆపాలని, ఇతర సంస్ధలను కూడా నిరోధించాలని, జైళ్లలో వున్నవారిని విడుదల చేయాలని కోరింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d