• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Others

సిఎఎ వివాదం : హద్దులు దాటిన కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌

29 Sunday Dec 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

CAA, governor arif mohammad khan, Historian Irfan Habib, Indian constitution, Indian History Congress, Nathuram Godse

Image result for as a governor arif mohammad khan crossed his limits
ఎం కోటేశ్వరరావు
దేశంలో ఎవరు ‘అసహనంతో ప్రజాస్వామ్యవిరుద్దంగా ‘ ప్రవర్తిస్తున్నారో చూశారా అంటూ పొద్దున్నే ఒక పలకరింపు. కేరళలోని కన్నూరు విశ్వవిద్యాలయంలో శనివారం నాడు (ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌) భారత చరిత్ర కారుల 80వ మహాసభను ప్రారంభిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ చేసిన ప్రసంగం, దాని మీద వ్యక్తమైన నిరసన గురించి ఆ పరామర్శ. తర్కబద్దంగా సమాధానం చెబితే వినే ‘సహనం’ కనిపించకపోవటంతో మహాశయా మీరు చిన్నతనంలో చదువుకున్న కుక్క పని గాడిద చేస్తే….. కథను ఒక్కసారి చదువుకుంటే చాలు అని చెప్పి ముగించాల్సి వచ్చింది.
దేెశంలో గవర్నర్ల పాత్ర అంటే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది, రాష్ట్రాలలో రాజకీయ సంక్షోభాలు వచ్చినపుడు తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలే గుర్తుకు వస్తాయి. ఆ విషయంలో కాంగ్రెస్‌ ముందుంటే, దాన్ని అధిగమించేందుకు, కొత్త పుంతలు తొక్కేందుకు బిజెపి తహతహలాడుతోంది. మన రాజ్యాంగంలో గవర్నర్ల పాత్ర పరిమితం, వారు రాజకీయాలు చేయకూడదు, చేస్తున్నారు గనుక ఎవరైనా విమర్శిస్తే భరించాల్సిందే, గవర్నర్లంటే గౌరవం లేదా అంటే కుదరదు. ఇటీవలి కాలంలో మహారాష్ట్ర గవర్నర్‌ ప్రవర్తించిన తీరు తెన్నులను మరచి పోకముందే కేరళ గవర్నర్‌ తానూ తక్కువ తినలేదని, పదవి ఇచ్చిన వారి ఉప్పుతిన్నందున వారికి విధేయుడనై ఉన్నానని ప్రదర్శించుకొనేందుకు తాపత్రయ పడ్డారు అని చెప్పక తప్పదు.
గవర్నరు పదవిలో ఉన్న వారికి అధికారికంగా చట్ట సభల్లో ప్రభుత్వ అభిప్రాయాలు తప్ప వ్యక్తి గత అభిప్రాయాలు వ్యక్తం చేసే నిబంధనలు లేవు. బయట గవర్నర్లు గౌరవ అధ్యక్షులో మరొకటో అయిన సంస్దలు లేదా పర్యటనల్లో పరిమితమైన అంశాల మీద సందేశాలు, ప్రకటనలు చేయవచ్చు తప్ప. రాజకీయాల జోలికి పోకూడదు. అయితే చరిత్రకారుల మహాసభ లేదా మరొక సభ దేనినైనా ప్రారంభించాలని ఆహ్వానించినపుడు రావాలా లేదా అనేది గవర్నర్ల విచక్షణకు సంబంధించిన అంశం. అలా వచ్చినపుడు సాధారణంగా ముందుగా తయారు చేసుకున్న సంబంధిత అంశం మీదనే ప్రసంగిస్తారు. దానితో అందరూ ఏకీభవించాలని లేదు. కన్నూరులో జరిగింది అది కాదు. గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ తాను తయారు చేసుకు వచ్చిన ప్రసంగాన్ని పక్కన పెట్టి అంతకు ముందు వక్తలు సిఎఎ, కాశ్మీర్‌ పరిణామాలపై చేసిన ప్రస్తావనలు లేదా విమర్శలకు రాజకీయ సమాధానాలు చెప్పటం ప్రారంభించటంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఒక పార్టీ నాయకత్వంలో నడిచే ప్రభుత్వం చేసిన నిర్ణయాలు, చట్టాలను విమర్శించే హక్కు ఎవరికైనా ఉంది. వాటికి రాజకీయ పరమైన సమాధానం చెప్పాల్సింది మంత్రులు, పార్టీ నేతలు మాత్రమే. ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న అధికారులు చట్టంలోని అంశాల మీద వివరణ ఇస్తారు తప్ప రాజకీయ పరమైన విమర్శలకు సమాధానం చెప్పే అవకాశం లేదు. గవర్నర్లకూ లేదు.
తనను ప్రసంగించకుండా చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌, శ్రోతల నుంచీ కొందరు అడ్డుకున్నారని, గేలిచేశారని గవర్నర్‌ ఆరోపించారు. ఒక భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేయటాన్ని సహించలేకపోవటం అప్రజాస్వామికం అని కూడా వ్యాఖ్యానించారు. భౌతికంగా తనను నిరోధించేందుకు ఇర్ఫాన్‌ హబీబ్‌ ప్రయత్నించారని కూడా ట్వీట్ల ద్వారా తీవ్ర ఆరోపణ చేశారు. అయితే ఆ ట్వీట్లలోనే గవర్నరే జరిగిందేమిటో వివరించాల్సి వచ్చింది.” భారత చరిత్రకారుల మహాసభ ప్రారంభం ఎలాంటి వివాదాలను రేకెత్తించలేదు.అయితే కన్నూరు విశ్వవిద్యాలయంలో జరిగిన 80వ చరిత్రకారుల మహాసభలో సిఎఎ మీద ఇర్ఫాన్‌ హబీబ్‌ కొన్ని అంశాలను లేవనెత్తారు. వీటి గురించి గవర్నర్‌ జవాబు చెబుతున్న సమయంలో గవర్నర్‌ను భౌతికంగా నిరోధించేందుకు ఇర్ఫాన్‌ హబీబ్‌ తన స్ధానం నుంచి లేచారు. మౌలానా అబ్దుల్‌ కలామ్‌ పేరు ఉటంకించటానికి గవర్నర్‌కు ఉన్న హక్కును ఆయన ప్రశ్నించారు, చప్పట్లు కొడుతూ ఆయన గాడ్సే పేరును ప్రస్తావించాలని అన్నారు. అవాంఛనీయ ప్రవర్తనను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన గవర్నర్‌ ఎడిసి మరియు రక్షణ అధికారిని తోసివేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న ఒక వ్యక్తిగా తాను తనకంటే ముందు మాట్లాడిన వక్తలు పేర్కొన్న కొన్ని అంశాలపై మాత్రమే తాను స్పందించానని ” గవర్నర్‌ ట్వీట్లలో పేర్కొన్నారు.
కన్నూరు సభలో గవర్నర్‌ కంటే ముందు మాట్లాడిన వక్తలు పౌరసత్వ సవరణ చట్టం, ఇతర అంశాలపై విమర్శలు చేశారు. రాజ్యాంగంలోనే కొన్ని అంశాలపై లోపాలు ఉన్నాయనే అభిప్రాయం వెలిబుచ్చటం తప్పు కాదు, రాజ్యాంగ ఉల్లంఘన అంతకంటే కాదు, దానికి ముప్పు తలపెట్టినట్లు కాదు. ఇప్పటికి 104 రాజ్యాంగ సవరణలు చేశారు, రాబోయే రోజుల్లో ఇంకా చేయవచ్చు. చట్ట సభల్లో దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను మరొక పది సంవత్సరాల పాటు పొడిగిస్తూ, ఆంగ్లో ఇండియన్‌ల నామినేటెట్‌ సీట్లను రద్దు చేస్తూ 104 సవరణలో తీర్మానించారు. ఎవరైనా వీటిని కూడా విమర్శించవచ్చు.అలాంటపుడు పౌరసత్వ సవరణ చట్టాన్ని సవరించటాన్ని విమర్శించటం, రాజ్యాంగానికి వచ్చిన ముప్పుగా పరిగణించటం, దాన్ని కాపాడే బాధ్యతలో భాగంగా విమర్శలకు సమాధానం చెప్పబూనుకోవటమే అసలైన రాజ్యాంగ నిబంధనలకు విరుద్దం.
అదే వేదికపై ఉన్న సిపిఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు కెకె రాగేష్‌ గవర్నర్‌ కంటే ముందు మాట్లాడారు.” చరిత్రకారుల సభలో గవర్నర్‌ పూర్తిగా రాజకీయ ప్రసంగం చేశారు. ఆయన ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ వాదిలా మాట్లాడారు. ఎంపీ గారూ ఇది మీ కోసమే అంటూ నన్ను ఉద్దేశించి ప్రసంగాన్ని ప్రారంభించారు. నేనుకూడా ఇతర పెద్దలతో పాటే వేదిక మీద ఉన్నాను. ఇర్ఫాన్‌ హబీబ్‌ గవర్నర్‌ను తోసివేయలేదు, కనీసం తాకను కూడా తాకలేదు. మౌలానా అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌ మాటలను వక్రీకరించటానికి బదులు గాడ్సే చెప్పిందాన్ని ఉటంకించమని మాత్రమే కోరారు.” అని రాగేష్‌ చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. అంతే కాదు సభలో ఉన్న ఒక ప్రతినిధి జరిగిన సంఘటన గురించి ” గవర్నర్‌ మౌలానా అజాద్‌, గాంధీ ఇతరుల పేర్లను పూర్తి అసందర్భంగా ప్రస్తావించారు, అదే సమయంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా పొగడటం ప్రారంభించారు. ఎవరైనా ఆయనకు ఏమి చెబుతారు, వారిని వక్రీకరిస్తూ మాట్లాడినపుడు తరువాత గాడ్సేను కూడా ప్రస్తావించాలని చెప్పారు. ఇది చరిత్రకారుల మహాసభ, పౌరసత్వ సవరణ చట్టం మీద సెమినార్‌ కాదు.” అని పేర్కొన్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. ఖాన్‌ చెత్త మాట్లాడుతున్న సమయంలో మీరెందుకు అజాద్‌, గాంధీలను ఉదహరిస్తున్నారు గాడ్సే గురించి చెప్పండి అంటూ హబీబ్‌ అడ్డుకున్నారు అని అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ షిరీన్‌ మూస్వీ చెప్పారు.
గవర్నర్‌ ప్రసంగంశాలపై అనేక మంది ప్రతినిధులు, విద్యార్ధులు కూడా నిరసన తెలిపారు. వారిని ఉద్దేశించి ” మీకు నిరసన తెలిపే హక్కుంది, కానీ నన్ను నోరు మూయించలేరు. మీరు చర్చల ద్వారాన్ని మూయటం అంటే మీరు హింసా సంస్కృతిని ప్రోత్సహించటమే అని” వారితో గొంతు కలిపారు. నిరసనల మధ్య తన ప్రసంగాన్ని ముగించిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ తాను ముందే సిద్ధం చేసుకున్న ప్రసంగంతోనే వచ్చానని, అయితే తనకంటే ముందు మాట్లాడిన వక్తలు ఈ అంశాన్ని(సిఎఎ) ప్రస్తావించకుండా ఉంటే నేను మాట్లాడేవాడినే కాదు, మీరు ప్రస్తావించి రాజకీయ ప్రకటనలు చేశారు.రాజ్యాంగాన్ని సమర్ధించుతానని, రక్షించాలని నేను ప్రమాణం చేశాను. దానిలో భాగంగా నేను హబీబ్‌ లేవనెత్తిన అంశాలపై ప్రతిస్పందించాను. అయితే ఆయన నా ప్రసంగాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు” అని గవర్నర్‌ ఆరోపించారు.
ఈ ఉదంతంపై ఇద్దరు జర్నలిస్టులు చేసిన ట్వీట్లను గమనించాల్సిన అవసరం ఉంది. బిజెపి ఎంపీ యజమానిగా ఉన్న రిపబ్లిక్‌ టీవీతో సహా అనేక సంస్ధలలో పని చేసిన జర్నలిస్టు ఆదిత్య రాజ్‌ కౌల్‌ చేసిన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు.’ దిగ్భ్రాంతి కలిగిస్తోంది. కొంత మంది కుహనా ఉదారవాదులనబడే వారు ఇప్పుడు మాట్లాడే, భావప్రకటనా స్వేచ్చ హక్కులేదని అంటున్నారు. మౌలానా అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌ను ప్రస్తావిస్తూ సుప్రసిద్ద పండితుడైన కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ మాట్లాడుతున్న సమయంలో ఆయన్ను గేలిచేశారు” అని విమర్శించారు. దీనికి స్పందనగా ఎన్‌డిటీవీ జర్నలిస్టు గార్గి రావత్‌ ఒక ట్వీట్‌ చేస్తూ ” ఆశ్చర్యంగా ఉంది. గేలి చేయటాన్ని సమర్ధించటం లేదు. కానీ, అవకాశవాద మాజీ రాజకీయవేత్త అయిన గవర్నర్‌ అరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను మీరు ఒక పండితుడు అంటున్నారు, సుప్రసిద్ధ చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ను కుహనా ఉదారవాదిగా పిలుస్తున్నారు” అని చురక అంటించారు.


ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను అవకాశవాది అనటం సరికాదని, నిజంగా అవకాశవాది అయితే షా బానో కేసులో సుప్రీం కోర్టు తీర్పును తిరస్కరించే నిర్ణయం తీసుకున్న రాజీవ్‌ గాంధీని ఎందుకు వ్యతిరేకిస్తారు, మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేస్తారని కొందరు మీడియా విశ్లేషకులు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఇర్ఫాన్‌ హబీబ్‌ అబద్దాలు చెబుతున్నట్లు ఆరోపణలు చేశారు. ఆయోధ్యలో ముస్లింలు రాజీపడేందుకు సిద్దపడినపుడు హబీబ్‌ ఇతరులు పడనీయలేదని ఆరోపించారు. అంతవరకు పరిమితం కాలేదు గార్గి కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు ముక్తార్‌ అబ్బాస్‌ అహమ్మద్‌ అన్సారీ మనవడిని వివాహం చేసుకుందని, ఆమె భర్త యూసుఫ్‌ అహమ్మద్‌ అన్సారీ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేశారని, ఆమె కాంగ్రెస్‌ అనుకూల జర్నలిస్టు అని అసందర్భ వ్యాఖ్యలు చేయటాన్ని బట్టి వారు కాషాయ దళసైనికులన్నది స్పష్టం.
ఇక ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ విషయానికి వస్తే షాబానో కేసు తీర్పును వమ్ము చేసేందుకు నిర్ణయించిన రాజీవ్‌ గాంధీ చర్యను వ్యతిరేకించిన మాట వాస్తవం.ఆచర్యను అనేక మంది పురోగామి వాదులు ప్రశంసించారు. అలీఘర్‌ ముస్లిం విద్యార్ధి సంఘనాయకుడిగా పని చేశారు. తొలుత బికెడి తరఫున పోటీ చేసి ఓడిపోయారు, తరువాత 26 ఏండ్ల వయస్సులోనే ఎంఎల్‌సి అయ్యారు. తరువాత కాంగ్రెస్‌లో చేరి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మంత్రిగా పని చేస్తూ రాజీనామా చేశారు. తరువాత జనతాదళ్‌ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. మరోసారి మంత్రిగా పని చేశారు. తరువాత ఆ పార్టీ నుంచి బిఎస్‌పిలో చేరి మరోసారి ఎంపీ అయ్యారు. తరువాత 2004లో బిజెపిలో చేరి ఎన్నికలలో ఓడిపోయారు. మూడు సంవత్సరాల తరువాత బిజెపికి రాజీనామా చేసినట్లు ప్రకటించినా ఆ పార్టీతో సంబంధాలను వదులు కోని కారణంగానే నరేంద్రమోడీ సర్కార్‌ కేరళ గవర్నర్‌గా నియమించింది. ఇన్ని పార్టీలు మారిన వ్యక్తిని అవకాశవాది అనాలో మరొక విధంగా పిలవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ నియంత – ది న్యూయార్క్‌ర్‌ !

23 Monday Dec 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

CAA, India citizenship amendment act 2019, Narendra Modi an authoritarian, NRC

Image result for Narendra Modi authoritarian, protest keralaఎం కోటేశ్వరరావు
”భారత ఆర్ధిక సంస్కరణకు మంచి భవిష్యత్‌ నరేంద్రమోడీ అని నేను వాదించాను. ఇప్పుడు సంగతులు మారిపోయాయి.” అని చెప్పాడు ది టైమ్‌ జర్నలిస్టు ఇయాన్‌ బ్రెమర్‌. నరేంద్రమోడీ నియంతగా మారారు అని ది న్యూయార్క్‌ర్‌ అనే పత్రిక జర్నలిస్టు డెక్సటర్‌ ఫిల్‌కిన్స్‌ వ్యాఖ్యానించారు.
”వివాదాస్పద పౌర సత్వ బిల్లును ఆమోదించటంతో భారత్‌ అంతటా నిరసనలు చెలరేగాయి. దేశ లౌకిక రాజ్యాంగానికి పెద్ద ఒక పెద్ద సవాలుగా భారత్‌ తన 20కోట్ల ముస్లిం మైనారిటీలలో కొందరిని సులభంగా జైల్లో పెట్టటానికి, బయటకు పంపివేయటానికి సులభతరం గావించేందుకు పూనుకుంది.” అని ఈనెల 20న అమెరికాలోని ప్రముఖ పత్రిక టైమ్‌ విదేశీ వ్యవహారాల సంపాదకుడైన ఇయాన్‌ బ్రెమర్‌ రాసిన విశ్లేషణ, దాని సారాంశంగా రాసిన వాక్యాలను పైన చూశాము. వెంటనే మన దేశంలోని కాషాయతాలిబాన్లు దీని వెనుక పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వామపక్షాలు, కాంగ్రెస్‌ అని వెంటనే వాట్సాప్‌ యూనివర్సిటీ, అసహ్యంగా కనిపించే ఫేస్‌బుక్‌ వంటి వాటిలో దాడులు మొదలు పెడతారని వేరే చెప్పనవసరం లేదు. వాటిని గుడ్డిగా నమ్మే జనానికి మనం చెప్పాల్సిందేమంటే మగాను భావులారా అరచేతిని చూసుకొనేందుకు అద్దం అవసరం లేదు.
”తన ప్రజాస్వామ్యానికి ఉన్న పరిమితులను పరీక్షించుకొనేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నండగా తన పరిమితులు ఏమిటో ప్రపంచానికి చూపేందుకు భారత్‌ తీరిక లేకుండా ఉంది. పొరపాటు చేయవద్దు. మానవతా పూర్వక దృక్కోణంలో చూస్తే ప్రత్యేకించి దేశంలో దాదాపుగా ఉన్న 20కోట్ల మంది ముస్లింలకు భారత్‌లో ఇప్పుడు జరుగుతున్నది విషాదం. అయితే ఇది పనిచేస్తున్న, సంఘటితమైన ప్రజాస్వామ్యానికి, తన 140 కోట్ల మంది పౌరులకు అవసరమైన సేవలు, అవకాశాలను కల్పించగల ఆధునిక మరియు సంక్లిష్ట ఆర్ధిక వ్యవస్ధ ఉన్న భారత భవిష్యత్‌కు సైతం విషాదమే.”
పైన పేర్కొన్న విధంగా తన విశ్లేషణను ప్రారంభించిన బ్రెమర్‌ గతలోక్‌ సభ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు మే ఒకటవ తేదీ టైమ్‌ సంచికలో తాను నరేంద్రమోడీ గురించి ప్రశంసా పూర్వకంగా రాసిన అంశాలను ఉటంకించారు. గత కొద్ది నెలలుగా(అంటే రెండవ సారి మోడీ అధికారానికి వచ్చిన తరువాత) మరమ్మతులు చేయటానికి వీలులేని విధంగా ఆ ప్రతిమ దెబ్బతిన్నది అని వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల కారణంగా తమ పౌరులు భారత ప్రయాణాల గురించి జాగ్రత్తలు తీసుకోవాలని అమెరికాతో సహా అనేక పశ్చిమ దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. టైమ్‌ వంటి కార్పొరేట్‌ పత్రికలు ఇలా రాసిన తరువాత మన దేశంలో పెట్టుబడులు పెట్టేవారు వాటిని పట్టించుకోకుండా ఉంటారా, హెచ్చరికలుగా తీసుకోరా ? ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలకే పెట్టుబడిదారులు బారులు తీరతారు. బిజెపి మరియు నరేంద్రమోడీ మన దేశాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు, తాము చెప్పిన మంచి రోజులను తెచ్చేందుకు లేదా ఇంకా దిగజార్చేందుకు చూస్తున్నారో ఎవరికి వారు విశ్లేషించుకోవాలి.

Image result for Narendra Modi authoritarian
ఇయాన్‌ బ్రెయిన్‌ తన విశ్లేషణ ముగింపులో పేర్కొన్న అంశాలు ఇప్పటి వరకు బుర్రలకు పని పెట్టని వారికి ఎంతో ఉపయోగపడతాయి. వాటి సారాన్ని ఇలా చెప్పుకోవచ్చు.(అనుమానాలు ఉన్నవారు, ఆసక్తి కలిగిన వారికి వీలుగా లింక్‌ కూడా ఇస్తున్నాను)https://time.com/5753624/india-narendra-modi-nationalism/ ” భారత్‌ రాజకీయాల్లో స్ధిరపడిపోయిన వ్యక్తులతో విసిగిపోయిన కారణంగా అద్బుతమైన ప్రచారంతో 2014లో బిజెపి, నరేంద్రమోడీ అధికారానికి వచ్చారు. అధికారానికి వచ్చారు గనుక తన పెరుగుదలకు తోడ్పడిన హిందూ జాతీయ వాదం నుంచి పక్కకు తప్పుకొని పాలనా బాధ్యతలను స్వీకరిస్తారని కొంత మంది ఆశించారు. అయితే భారత ఆర్ధిక వ్యవస్ధ మందగించటం ప్రారంభమైన తరువాత 2019లో తన విజయం కోసం హిందూ జాతీయవాదం వైపు తిరిగారు. ఆర్ధిక అంశాలను నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వ విధానంలో జాతీయవాదం ప్రముఖపాత్రను తీసుకుంది. రాజ్యాంగబద్దంగా ఆదేశించిన లౌకిక ప్రజాస్వామ్యాన్ని ప్రత్యక్షంగా సవాలు చేయటం ప్రారంభించింది. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హౌదాను రద్దు చేసింది. ఒక ప్రజాస్వామిక వ్యవస్ధలో ఇంటర్నెట్‌ను సుదీర్ఘకాలం మూసివేసిన ప్రభుత్వంగా అంతర్జాతీయంగా పతాక శీర్షికలకు ఎక్కింది. జాతీయ పౌరుల నమోదు(ఎన్‌ఆర్‌సి) అమలును ముందుకు తెచ్చింది. ఈ కారణంగా అసోంలో దాదాపు 20లక్షల మంది తమ పౌరసత్వాన్ని కోల్పోయారు. తాజా నమోదులో పౌరసత్వం కోల్పోయిన వారిలో పన్నెండు లక్షల మంది హిందువులే ఉన్నట్లు తేలింది. ఇది ముస్లింలు కాని ఇరుగుపొరుగు దేశాల నుంచి వలస వచ్చిన వారికి పౌరసత్వం కల్పించాలనే చట్టాన్ని చేసేందుకు పురికొల్పింది. అక్రమంగా వలస వచ్చిన ముస్లింలను వెనక్కు పంపాలని బిజెపి డిమాండ్‌ చేసింది, బంగ్లాదేశ్‌ వారిని వెనక్కు తీసుకొనేందుకు అంగీకరించే అవకాశం లేదు.” అని బ్రెమర్‌ పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల సమయంలో బిజెపి ముందుకు తెచ్చిన అంశాల గురించి వామపక్షాలు ఎన్నో హెచ్చరికలు చేశాయి. ప్రస్తుతం బిజెపి పోకడలకు వ్యతిరేకంగా ఆందోళనలకు ముందుకు వచ్చిన వారితో సహా ఎక్కువ మంది వాటిని ఖాతరు చేయలేదు. ఎన్నికల ఫలితాలు రాకముందే అమెరికా టెలివిజన్‌ సిఎన్‌ఎన్‌ ప్రతినిధి గతంలో ఎన్నడూ లేని దానికంటే దేశాన్ని ఎన్నికలు మరింతగా విడదీశాయంటూ ఒక విశ్లేషణ రాశారు. బిజెపి, నరేంద్రమోడీ తీరుతెన్నులు, ప్రచార సరళిలో వచ్చిన మార్పును వర్ణిస్తూ 2014లో కొద్ది మందిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్న పరిమిత హిందూ జాతీయవాద శబ్దాలను ఇప్పుడు దేశమంతా వినిపించే లౌడ్‌ స్పీకర్లు అక్రమించాయని పేర్కొన్నారు( ఆంగ్లంలో- డాగ్‌ విజిల్‌ వస్‌ రిప్లేస్‌డ్‌ బై ఏ బుల్‌హారన్‌). ఎన్నికల ఫలితాల తరువాత నరేంద్రమోడీ విజయం భారతీయ ఆత్మకు చెడు అని లండన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక వ్యాఖ్యానించింది. ఎవరి మీద అయినా మరులు గొన్నపుడు మనం మంచి చెడ్డలు, ఎలాంటి వారమో కూడా పట్టించుకోము. ఎవరి హెచ్చరికలను పట్టించుకోము.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను అంతర్జాతీయ మీడియా ప్రముఖంగానే వార్తలుగా ఇస్తోంది. అవి పెడుతున్న శీర్షికలు వాటి అవగాహన, అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాయి. ” పెల్లుబుకుతున్న ఆగ్రహం, హిందూ రాజ్యంగా మారేందుకు భారత్‌ దగ్గర అవుతోందా ?” అని అమెరికా నుంచి వెలువడే న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొన్నది. ముస్లింలను మినహాయించటం ద్వారా మౌలికంగా వివక్షా పూరితమైనదని, దాన్ని సమీక్షించాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్‌ చేసిన వ్యాఖ్యను ఉటంకించింది. దేని మీదా ఏకీభావానికి రాని ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయని వ్యాఖ్యానించింది.
బ్రిటన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక మూడు వార్తలను ప్రచురించింది. వాటిలో ఒక దాని శీర్షిక ఇలా ఉంది.” భారత పౌరసత్వ చట్టం: తీవ్ర అణచివేత మోడీ వ్యతిరేకులను ఐక్యపరచవచ్చు” నిరసనల తీవ్రత గురించి వ్యాఖ్యానిస్తూ నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన ఆరు సంవత్సరాల తరువాత వెల్లడైన ముఖ్యమైన నిరసన అని పేర్కొన్నది.
నరేంద్రమోడీ చివరకు చాలా దూరం పోయారా అని న్యూయార్కర్‌ అనే పత్రిక విశ్లేషించింది.” ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న ప్రదర్శనలు రాజకీయాల్లో ఇప్పుడో తరువాతో నియంతలు చాలా దూరం ప్రయాణిస్తారు అని ఎంతగానో నమ్మిన పురాతన సిద్దాంతాన్ని క్రమబద్దీకరించాయి. ఈ ఉదంతంలో నియంత నరేంద్రమోడీ, భారత ప్రధాని ” అని పేర్కొన్నది.డెక్సటర్‌ ఫిల్‌కిన్స్‌ రాసిన విశ్లేషణలో ప్రధాని నాయకత్వం వహిస్తున్న హిందూ జాతీయవాద ప్రభుత్వం ఇరవై కోట్ల ముస్లింలను అంతర్గత శత్రువులుగా మలచింది అని వ్యాఖ్యానించారు.

Image result for Narendra Modi authoritarian
అంతర్జాతీయ మీడియాలో వెల్లడైన అభిప్రాయాలలో ఇవి కొన్ని మాత్రమే. భారత రాజకీయాలు ఏవైపు పయనిస్తున్నాయనే చర్చ మరోసారి ప్రపంచంలో ప్రారంభమైంది. మన దేశంలో సరేసరి. నరేంద్రమోడీ నియంతా, ఫాసిస్టా, మరొక ప్రమాదకారా ఏ తరగతికి చెందుతారు అన్న అంశంపై అనేక మందిలో ఏకీభావం ఉండకపోవచ్చు. మన విభేదాలను తరువాత చూద్దాం, ఈ అన్ని లక్షణాలు కలిగిన శక్తిని ముందు వ్యతిరేకిద్దాం అనే ఏకాభిప్రాయ క్రమం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఓట్ల రాజకీయంలో బిజెపి పోటీ పడి అది ముందుకు తెస్తున్న మతోన్మాదంతో రాజీపడుతున్న రాజకీయ పార్టీల పట్ల కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో హిందూ జాతీయవాదాన్ని ప్రత్యక్షంగా కాకపోయినా దానికి ప్రాతినిధ్యం వహించే నరేంద్రమోడీ సర్కార్‌ను బలపరిచేందుకు పోటీ పడుతున్న తెలుగుదేశం, వైసిపి వంటి పార్టీలు తమ వైఖరిని పునరాలోచించుకుంటాయా లేదా అన్నది ఇప్పుడు ఒక ప్రశ్న. వాటి వెనుక ఉన్న మైనారిటీ తరగతుల వారు ఆలోచనలో పడుతున్నారు. ఒక మెజారిటీ మతోన్మాద శక్తిని ఎదుర్కొనేందుకు మరొక మైనారిటీ మతోన్మాదశక్తి వెనుక సమీకరణ కావటం, బలపరచటం కూడా ప్రమాదకరమే. అలాంటి మొగ్గునే మెజారిటీ మతశక్తులు కోరుకుంటున్నాయి. ఆ ఊబిలో ఎప్పుడు దిగుతారా అని చూస్తున్నాయి. ఎందుకంటే దాన్ని చూపి మెజారిటీ మద్దతును కూడగట్టుకోవటం సులభం కనుక ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్న మైనారిటీలు జాగ్రత్తగా ఉండటం కూడా అవసరమే. లౌకిక, వామపక్ష భావాలవైపు సమీకృతమై ఉమ్మడిగా లౌకిక రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకొనేందుకు పూనుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మూడు రాజధానులతో అభివృద్ది-మూడు ఎండమావులు !

19 Thursday Dec 2019

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, Amaravathi capital, ANDHRA PRADESH Capital Politics, Andhrapradesh new Capitol

Image result for three capitals

ఎం కోటేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్‌లో ఐదేండ్ల క్రితం ప్రారంభమైన రాజధాని రాజకీయం కొత్త పుంతలు తొక్కింది. అది కూడా రాజధానికి-అభివృద్ధికి ముడి పెట్టటం, ఇది ప్రపంచంలో ఎనిమిదో వింత అని చెప్పక తప్పదు. తెలుగుదేశం గత ఐదేండ్ల పాలనలో భ్రమరావతిగా ఒక్క అమరావతినే చూపారు. ఇప్పుడు అభివృద్ది వికేంద్రీకరణ, అభివృద్ది పేరుతో మరో రెండు భ్రమరావతులను ప్రదర్శించేందుకు వైసిపి ఆరునెలల పాలన నాంది పలికిందా అన్న అనుమానాలు తలెత్తాయి. దీనిపై అధికారిక నిర్ణయం ఇంకా వెలువడలేదు గనుక దీని మంచి చెడ్డల పరిశీలన కూడా ఆ పరిమితుల్లోనే ఉంటుంది.
కన్యాశుల్కంలో తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అని అగ్నిహౌత్రావధానులు ఆంటాడు. డిసెంబరు17న అసెంబ్లీలో మాట్లాడుతూ మూడు రాజధానులు రావచ్చునేమో అన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రకటన ద్వారా తాంబూలాలతో నిమిత్తం లేకుండానే తన్నుకు చచ్చేందుకు తెరతీశారు. అప్పుడే నిర్ణయం జరిగిపోయినట్లుగా విశాఖ, కర్నూల్లో హార్షాతిరేకాలు వ్యక్తం చేస్తుండగా తమను మోసం చేశారంటూ అమరావతిలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బంద్‌ చేశారు. అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు, విశాఖలో సచివాలయం అని వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చెప్పేశారు.

Image result for three capitals
ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతో మరొకరో , మీడియా ఊహాగానాల్లోనో ఉన్నరాజధానిపోవచ్చు, కొత్త రాజధానులు రావచ్చేమో అంటే అదొక తీరు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే అసెంబ్లీలో వచ్చు భాష మాట్లాడితే దాన్ని రాజకీయం తప్ప అని మరొకటి అనలేరు. రాజధాని అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సూచనలు చేసేందుకు ఐదుగురు పట్టణ ప్రణాళికల నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. పట్టణాల నిపుణులు రాష్ట్ర అభివృద్ధి, అమరావతి గురించి ఏమి చెబుతారో తెలియదు. వివిధ తరగతుల నుంచి అభిప్రాయలు సేకరించారు గనుక ఏదో ఒకటి చెబుతారనుకుందాం. కొద్ది రోజుల్లో అలాంటి నివేదిక ఇవ్వబోతున్నారని వార్తలు వచ్చాయి. రాకముందే రాజధానులు మూడు వుండవచ్చు అని సిఎం చెప్పేశారంటే నివేదికలో అలాగే ఇమ్మని ముందుగానే ఉప్పందించారనే అనుకోవాలి. ఒక వేళ దానికి భిన్నంగా ఇస్తే ఏమిటి అన్నది ప్రశ్న !
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు పాలకులు తలచుకొంటే ఏదీ అసాధ్యం కాదు. కమిటీల నివేదికల సిఫార్సులకు, పాలకుల నిర్ణయాలకు సంబంధం లేదు. రాజధాని గురించి గతంలో శివరామకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులను పక్కన పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం తన స్వంత నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రోగి కోరుకున్నదే వైద్యుడు రాసి ఇచ్చినట్లుగా వైసిపి ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. భిన్నంగా ఇస్తే చంద్రబాబు చెప్పుల్లో కాళ్లు పెట్టి వైఎస్‌ జగన్‌ స్వంత నిర్ణయాలు తీసుకోవచ్చు.
ఎన్నో తర్జన భర్జనలు, తెరవెనుక మంత్రాంగాలు, లావాదేవీలు పూర్తయ్యాక అక్కడా, ఇక్కడా అని చెప్పిన పుకార్ల వ్యాప్తి, శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సుల తరువాత వాటికి భిన్నంగా రాజధాని నిర్మాణానికి చివరకు అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేశారు. దానికి ప్రతిపక్షంగా ఉన్న వైసిపి, దానికి నేతగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డి కూడా అంగీకరించారు. అప్పుడు జగన్‌ ఆయన పరివారానికి ‘ ఇంగ్లీషు, తెలుగు ‘ భాష వచ్చు అయినా ఆ సమయంలో అధికార వికేంద్రీకరణ, భిన్న రాజధానుల గురించి మాట్లాడలేదు. ఎన్నికల ప్రణాళికలో అలాంటి ఊసు లేదు. అసెంబ్లీలో అంగీకరించినా జగన్‌ అధికారానికి వస్తే రాజధానిని మార్చివేస్తారని తెలుగుదేశం ప్రచారదాడి చేసింది. చంద్రబాబు రాజధానిలో స్దిరనివాసం ఏర్పరచుకోలేదు, మానేత తాడేపల్లిలో ఏకంగా ఇల్లుకట్టుకున్నారు, అలాంటి వ్యక్తి అమరావతి నుంచి రాజధానిని ఎలా మారుస్తారని వైసిపి నేతలు ఎదురుదాడి చేశారు. ఆయనే ఇప్పుడు అధికారపీఠమెక్కారు. చంద్రబాబు అధికారానికి వచ్చిన ఆరునెలల తరువాత రాజధాని మీద నిర్ణయం తీసుకుంటే, వైఎస్‌ జగన్‌ కూడా సరిగ్గా ఆరునెలల తరువాతే రాజధాని గురించి తన మన్‌కీ బాత్‌ వెల్లడించారు. అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా బిజెపి నేతల మాటలు ఉన్నాయి.

Image result for three capitals
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మరో నాలుగున్నర సంవత్సరాల తరువాత మరో పార్టీ, ముఖ్య మంత్రి అధికారానికి వస్తే మూడింటితో అభివృద్ధి ముడిపడలేదు, మూడును పదమూడు చేస్తా అంటే ? వంతుల వారీగా ప్రతి జిల్లాలోనూ రాజధానులను ఏర్పాటు చేయవచ్చు. వారికి పోయేదేముంది. వారు లేదా వారి అనుయాయులుగా ఉన్న వారి రియలెస్టేట్‌ ప్రయోజనాలు కదా ముఖ్యం. గుడ్డిగా సమర్ధించే మద్దతుదారులు ఎలాగూ ఉంటారు. గతంలో చంద్రబాబు వాషింగ్టన్‌, కౌలాలంపూర్‌, సింగపూర్‌ ఇలా ఏ నగరం పేరు చెప్పి అలాంటి నగరాల మాదిరి ప్రపంచ స్ధాయి రాజధానిని నిర్మిస్తామంటే తెలుగుదేశం మద్దతుదారులు, అభిమానులు బుర్రలను తీసి పక్కన పెట్టి తలలు ఊపారు. మూడు ప్రాంతాలలో రాజధానులు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని జగన్మోహన్‌ రెడ్డి చెబుతుంటే ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. తేడా రంగులు, అభిమానులు మారారంతే !
రాజధాని రాజకీయంలో చంద్రబాబు కొన్ని నగరాల పేర్లను ముందుకు తెస్తే జగన్మోహన్‌రెడ్డి రాజధాని రాజకీయానికి దక్షిణాఫ్రికా దేశాన్ని తెరమీదకు తెచ్చారు. సినిమా ఇంటర్వెల్‌ వరకే చెప్పి ముగింపు చెప్పకపోతే ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రికి దక్షిణాఫ్రికా కధను చెప్పిన వారు అదే పని చేశారు. జాత్యంహార వ్యవస్ధ చిహ్నాలుగా ఉన్న మూడు రాజధానులకు బదులు సరికొత్త రాజధాని నిర్మాణం జరపాలనే ప్రతిపాదన ముందుకు వచ్చినట్లు చెప్పలేదు. వందిమాగధులు రాజుగారికి ఇష్టమైన అంశాలనే చెప్పేవారు. ఇప్పుడు వారి స్ధానాన్ని ప్రభుత్వ సలహాదారులు అక్రమించారు కనుక సగమే చెప్పి ఉండాలి.
దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులుంటే రెండు రాజధానులున్న దేశాల మరో డజను వరకు ఉన్నాయి. అసలు రాజధానికి ప్రత్యేకంగా ఒక నగరమంటూ లేకుండానే ఒక మున్సిపల్‌ జిల్లాలోని ఒక పట్టణంలో రాజధాని కలిగి ఉన్న హొండూరాస్‌ గురించి సలహాదారులకు తెలిసినా చెప్పి ఉండరు. రాజధాని-అభివృద్ధి గురించి చర్చించబోయే ముందు సిఎం ప్రకటనతో దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఎందుకున్నాయని అనేక మందిలో ఉత్సుకత తలెత్తింది. కేప్‌టౌన్‌లో పార్లమెంట్‌, ప్రిటోరియాలో పాలనా యంత్రాంగం, న్యాయవ్యవస్ధ కేంద్రంగా బ్లోయెమ్‌ ఫోంటెన్‌ ఉంది.
నేడు దక్షిణాఫ్రికాగా పిలుస్తున్న ప్రాంతాన్ని 1657లో డచ్‌ ఈస్టిండియా కంపెనీ ఆక్రమించింది. తరువాత డచ్‌వారు ఆ ప్రాంతాన్ని 1806లో బ్రిటీష్‌ వారికి ధారాదత్తం చేశారు. డచ్‌ పాలనా కాలంలో డచ్‌ జాతీయుల ఆధిపత్యంలోని ఆరు ప్రాంతాలకు స్వయంప్రతిపత్తి ఇచ్చారు. వాటిని బోయర్‌ రిపబ్లిక్‌లని పిలిచారు. వాటిలో దక్షిణాఫ్రికా, ఆరెంజ్‌ ఫ్రీ స్టేట్‌ అనే రిపబ్లిక్‌లు పెద్దవి. బ్రిటీష్‌ వారు పెత్తనానికి వచ్చిన సమయంలో ఇచ్చిన హామీలు లేదా యథాతధ స్ధితిని కొనసాగించటానికి భిన్నంగా బోయర్‌ రిపబ్లిక్‌ల మీద తమ ఆధిపత్యాన్ని నెలకొల్పే ప్రయత్నంలో బోయర్‌ రిపబ్లిక్‌లు ప్రతిఘటించాయి. వాటినే ఆంగ్లో-బోయర్‌ యుద్ధాలు అని పిలిచారు. చివరికి 1910లో బ్రిటీష్‌ వారు పాక్షిక స్వాతంత్య్రం, బ్రిటీష్‌ ప్రాంతాలు-బోయర్‌ రిపబ్లిక్‌లతో కూడిన ఒక యూనియన్‌ ఏర్పాటు చేశారు. అప్పుడు కుదిరిన ఒప్పందం ప్రకారం వారికి చెందిన రెండు పెద్ద పాలిత ప్రాంతాల రాజధానులలో ,బ్రిటీష్‌ వారి రాజధానిలో ఒక్కొక్క చోట ఒక్కో విభాగాన్ని ఏర్పాటు చేయాలనే నిబంధన అమల్లో భాగంగా పైన చెప్పుకున్న మూడు రాజధానులు ఉనికిలోకి వచ్చాయి.
1934లో పూర్తి స్వాతంత్య్రం వచ్చింది. డచ్‌, బ్రిటీష్‌ వారు ఎవరు అధికారంలో ఉన్నా వారు స్ధానిక ఆఫ్రికన్ల పట్ల జాత్యహంకారంతో వ్యవహరించారు. ఆ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరుతో చివరకు జైలు నుంచి నెల్సన్‌ మండేలా విడుదల, 1994 ఎన్నికల్లో ఎఎన్‌సి విజయంతో జాత్యహంకార పాలన ముగిసింది. ఆ వ్యవస్ధ చిహ్నాలుగా ఉన్న రాజధానుల స్ధానంలో ఒక చోట కొత్త రాజధాని నిర్మాణం జరపాలని అనేక మంది కోరారు. అయితే దాని కంటే ఇతర ప్రాధాన్యతలకు నిధులు అవసరమైనందున ఆప్రతిపాదనను పక్కన పెట్టి ఉన్న వ్యవస్ధలనే కొనసాగిస్తున్నారు.
ఈ నేపధ్యంలో దక్షిణాఫ్రికా అనుభవం నుంచి ఏమి నేర్చుకోవాలి? మూడు చోట్ల ఉన్నవాటిని ఒక చోటకు చేర్చాలంటే వారికి నిధుల సమస్య ఎదురైంది. తాత్కాలికంగా అయినా వాయిదా వేసుకున్నారు. అప్పులు, ఆర్ధిక ఇబ్బందుల గురించి చెబుతున్న జగన్మోహన్‌ రెడ్డి ఉన్న ఒక రాజధానిని మూడుకు పెంచవచ్చని చెప్పటం గమనించాల్సిన అంశం. ప్రస్తుతం ఉన్న రాజధానిలో పాలన సాగించటానికి ఎలాంటి ఇబ్బంది లేదు. తాత్కాలిక కట్టడాలుగా ఉన్నవాటినే ఉపయోగపడినంత కాలం శాశ్వతంగా మార్చినా పోయేదేమీ లేదు. ఇప్పటి వరకు సామాన్య జనానికి లేని ఇబ్బంది కొత్తగా వచ్చేదేమీ ఉండదు.
ఎన్ని రాజధానులు ఉండాలి అనేది దేశాలన్నింటా ఒకే విధంగా లేదు. నెదర్లాండ్స్‌ రాజధాని ఆమస్టర్‌ డామ్‌. మరో పట్టణం హేగ్‌ వందల సంవత్సరాలుగా రాజధానిగా ఉంది. బొలీవియాలో లాపాజ్‌ మరియు సకురే పట్టణాలను రాజధానులుగా పరిగణించి అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని శాఖలను పని చేయిస్తున్నారు. 19వ శతాబ్దంలో తలెత్తిన విబేధాల కారణాంగా ఇలా చేశారు.కోట్‌ డిలోవరీ అనే ఆఫ్రికన్‌ దేశం అధికారిక రాజధాని యెమౌసుకోరో, అయితే ప్రభుత్వం మాత్రం అబిడ్‌జాన్‌లో ఉంటుంది. అధికారికంగా రాజధాని కాదు. బెనిన్‌ అనే దేశ రాజధాని పోర్టో నోవా, కానీ పాలన మాత్రమ కోటోనౌ పట్టణం నుంచి జరుగుతుంది. చిలీ రాజధాని శాంటియాగో, కానీ 1990లో పార్లమెంట్‌ను వలపారిసోకు తరలించారు. పూర్వపు సోవియట్‌ రిప్లబిక్‌గా ఉండి ఇప్పుడు స్వతంత్ర దేశమైన జార్జియా రాజధాని తిబిలిసి, పార్లమెంట్‌ మాత్రం కుటారుసిలో ఉంది. హొండురాస్‌ అనే దేశానికి అసలు దేశ రాజధాని పట్టణం లేదు. సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌ మున్సిపాలిటీ అనే పాలనా ప్రాంతంలో తెగుసియోగాల్పా అనే పట్టణం నుంచి పాలన సాగుతుంది. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌, అయితే 1999లో పుత్ర జయ అనే పట్టణానికి తరలించారు. మాంటెనీగ్రో అనే దేశ రాజధాని పోడ్‌గార్సియా. అయితే మాజీ రాజధాని అయిన సెటినిజేను గౌరవ రాజధానిగా పరిగణిస్తున్నారు. దక్షిణ కొరియాకు రెండు రాజధానులున్నాయి. సియోల్‌ పట్టణం రద్దీగా మారినందున 2012 నుంచి సిజోంగ్‌ పట్టణాన్ని పాలనా రాజధానిగా చేశారు. శ్రీలంక రాజధాని కొలంబో అయితే శివార్లలో జయవర్ధనే పుర కొటే అనే చోట రాజధాని నిర్మాణం చేశారు. స్వాజీలాండ్‌ అనే దేశంలో కార్యాలయాలు మబాబ్‌నేలో ఉంటే లొబాంబాలో పార్లమెంట్‌ ఉంది. టాంజానియా రాజధాని దారెస్‌ సలామ్‌, అయితే దేశంలో మధ్యలో ఉండే డోడోమాకు 1973లో రాజధానిని మార్చారు. పశ్చిమ సహారాలో అంతర్యుద్ధం జరుగుతున్నది. రెండు ప్రధాన పక్షాలు రెండు ప్రాంతాలను తమ రాజధానులుగా ప్రకటించకున్నాయి. మొరాకో తన రాజధాని లాయునే అంటే సహరావీ అరబ్‌ రిపబ్లిక్‌ టిఫారిటీని రాజధానిగా పరిగణిస్తుంది.
మన దేశంలో రద్దయిన కాశ్మీర్‌కు,మహారాష్ట్రకు రెండు రాజధానులు ఉన్నాయి. చలికాలంలో శ్రీనగర్‌లో మంచు కారణంగా జమ్మూలో రాజధాని పని చేస్తుంది. స్వాతంత్య్రానికి ముందు తరువాత సెంట్రల్‌ ప్రావిన్సుగా ఉన్న ప్రాంతానికి రాజధాని నాగపూర్‌. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఏర్పడిన మహారాష్ట్రలో నాగపూర్‌ ఉన్న విదర్భ ప్రాంతాన్ని విలీనం చేశారు. రాజధాని ముంబైలో ఉంటే తమ ప్రాంత అభివృద్ధి కుంటుపడుతుందేమో అన్న భయం ఆప్రాంత జనంలో ఏర్పడటంతో నాగపూర్‌ను అనుబంధ రాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక అసెంబ్లీ సమావేశాన్ని అక్కడ జరుపుతారు.
మద్రాస్‌ ప్రావిన్సు నుంచి తెలుగు ప్రాంతాలను విడదీసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నపుడు రాయలసీమనేతలు లేవనెత్తిన సందేహాలను తీర్చేందుకు శ్రీబాగ్‌ ఒప్పందంలో భాగంగా కర్నూలులో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేశారు. అందరికీ అందుబాటులో విజయవాడలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కూడా ఉంది. అయితే విజయవాడ ప్రాంతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్నందున అక్కడ రాజధాని ఏర్పాటుకు కాంగ్రెస్‌ నేతలు వ్యతిరేకించారు. అయితే ఆ ప్రాంతాన్ని సంతృప్తి పరచేందుకు గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేశారు. తరువాత ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు సమయంలో గుంటూరులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని కోరటం తప్ప ఎలాంటి హామీలను కోరలేదు. ఆంధ్రప్రదేశ్‌ను విడదీసినపుడు, రాజధాని ఏర్పాటు సమయంలోనూ ఎలాంటి ప్రత్యేక డిమాండ్లు ముందుకు రాలేదు. అమరావతి నిర్ణయం సాఫీగానే జరిగింది.

Image result for three capitals
ప్రపంచంలో ప్రతి దేశానికి, మన దేశంలో ప్రతి రాష్ట్రానికి రాజధానులు ఉన్నాయి. అవేమీ జనాన్ని దారిద్య్రం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, వెనుకబాటు తనం, నిరక్షరాస్యత, వ్యవసాయ సంక్షోభం, సంపదల కేంద్రీకరణ, ప్రాంతీయ అసమానతల వంటి వాటి నుంచి జనాన్ని బయటపడలేక పోయాయి. అయినా రాజధానితో అభివృద్ధి సాధిస్తామని చెబుతుంటే ఎంత మంది నమ్ముతున్నారో తెలియదు గానీ నమ్మే వారంతా గుడ్డిగా ఉన్నారని చెప్పకతప్పదు.పైన పేర్కొన్నట్లుగా దేశాల రాజధానుల, మన దేశంలో రెండు రాష్ట్రాల రా నిర్ణయంలో అనేక అంశాలు పని చేశాయి. అసలే ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు మూడు మూడూ చోట్ల ఉంటే అది ఆర్ధికంగా భారాన్ని మోపేదే అనటంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా సచివాలయం, అసెంబ్లీ వేరు వేరు నగరాల్లో ఉంటే అధికారులు, సిబ్బంది పనికి అంతరాయంతో పాటు ఆర్ధికంగా అదనపు భారాన్ని మోపుతుంది. అనేక రాష్ట్రాల్లో హైకోర్టులు రాజధానికి దూరంగా ఉన్నాయి. కొన్ని చోట్ల హైకోర్టు బెంచ్‌లు ఉన్నాయి. అలాగే కొన్ని శాఖలకు ప్రాంతీయ డైరెక్టరేట్‌ కార్యాలయాలు కూడా ఉన్నాయి. అందువలన అలాంటి వాటి గురించి ఆలోచించవచ్చు తప్ప మూడు వ్యవస్దల ప్రధాన కేంద్రాలను వేర్వేరు చోట్ల నుంచి పని చేయించటం సరైంది కాదు.
అనేక మంది అధికార వికేంద్రీకరణ అంటే పలు చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయటం అనే అర్ధంలో మాట్లాడుతున్నారు. రాష్ట్ర కేంద్రంగా ఉన్న అధికారాలను వాటిని స్ధానిక సంస్ధలకు బదలాయించటం అనే విషయాన్ని మరచిపోతున్నారు. రెండవది ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేది మరొక భ్రమ. గతంలో రాజధాని ప్రాంతాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను స్ధాపించాయి. ఇప్పుడు వాటిని తెగనమ్మే కార్యక్రమాన్ని అమలు జరుపుతున్నాయి. అందువలన ప్రభుత్వాల పెట్టుబడులు రావు. ప్రయివేటు పెట్టుబడులు రాజధానిగా ఉన్న నగర ప్రాతిపదికన రావు. వాటికి ఎక్కడ లాభసాటి అయితే అక్కడకు పోతాయి తప్ప మరొకటి కాదు. విశాఖలో సచివాలయాన్ని ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్రవెనుకబాటు తనమూ, కర్నూల్లో హైకోర్టు ఏర్పడితే రాయలసీమ వెనుకబాటు తనమూ, అమరావతిలో అసెంబ్లీ ఉంటే కోస్తా జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అని ఎవరైనా వాదిస్తే వారికి వంద నమస్కారాలు పెట్టటంతప్ప తర్కంతో చర్చ జరిపితే వినే స్ధితిలో ఉండరు.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే అభివృద్ది జరుగుతుందని చెబుతున్న లేదా నిజంగా నమ్ముతుంటే బిజెపి నేతలు, ఇతరులు ఢిల్లీలో ఉన్న కేంద్ర రాజధానిని విభజించి ప్రతి రాష్ట్రంలోనూ అత్యంత వెనుకబడిన ప్రాంతంలో కేంద్ర రాజధానుల శాఖలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేయాలి. అప్పుడు దేశమంతా అభివృద్ధి చెందుతుంది.అంతకంటే కావాల్సింది ఏముంది. ప్రత్యేక హౌదా కావాలన్న డిమాండ్లు రావు, ఆ వాగ్దానంపై మడమ తిప్పను అని చెప్పుకొనే వారికి ఇబ్బంది ఉండదు ! సర్వేజనా సుఖినో భవంతు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

సావర్కర్‌పై రాహుల్‌ వ్యాఖ్యతో బిజెపి రుసరుస !

15 Sunday Dec 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Not Rahul Savarkar, Rahul Jinnah, vd savarkar

Image result for rahul gandhi ramlila maidan

ఎం కోటేశ్వరరావు
మరోసారి కాషాయ పరివారం హిందుత్వ ప్రతీక విడి సావర్కర్‌ను దేశ భక్తుడిగా దేశం ముందుకు తెచ్చింది. నరేంద్రమోడీ పాలన దేశాన్ని మేకిన్‌ ఇండియాగా మార్చటానికి బదులు రేప్‌ ఇన్‌ ఇండియా(అత్యాచారాల భారత్‌)గా మార్చిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కొద్ది రోజుల క్రితం ఒక ఎన్నికల సభలో చేసిన వ్యాఖ్య దీనికి మూలం. రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ బిజెపి పార్లమెంట్‌లోపలా బయటా డిమాండ్‌ చేసింది. ఈ అంశంపై వివాదం చెలరేగటంతో పార్లమెంట్‌ పలుసార్లు వాయిదా పడింది. రాహుల్‌ వ్యాఖ్య దేశాన్ని, మహిళలను అవమానించటమే అని, అత్యాచారాలు చేయాల్సిందిగా ఆహ్వానం పలకటం వంటిదే అని బిజెపి ఎంపీలు ఆరోపించారు. సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలో దేశద్రోహంతో సమానమని అందుకు రాహుల్‌ను జైల్లో పెట్టాలని సంఘపరివార్‌కు చెందిన వారు డిమాండ్‌ చేశారు. రాహుల్‌ ఇటలీకి పోవాలన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దావ్‌ ధాకరే బహిరంగంగా రాహుల్‌ గాంధీని కొట్టాలని సావర్కర్‌ మనవడు కోరారు.
‘నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా గురించి మాట్లాడతారు, అయితే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అది అత్యాచారాల భారత్‌గా కనిపిస్తోంది’ అన్నది రాహుల్‌ గాంధీ వ్యాఖ్య. క్షమాపణ చెప్పాలని బిజెపి చేసిన డిమాండును న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారత్‌ను రక్షించండి అనే నినాదంతో కాంగ్రెస్‌ నిర్వహించిన సభలో రాహుల్‌ గాంధీ తిప్పి కొట్టారు. పదే పదే క్షమాపణలు చెప్పటానికి నేనేమీ రాహుల్‌ సావర్కర్‌ను కాదు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తనకు క్షమాభిక్ష పెడితే బ్రిటీష్‌ వారికి సేవచేసుకుంటానని అండమాన్‌ జైలు నుంచి విడి సావర్కర్‌ పదే పదే లేఖలు రాసి వేడుకున్న అంశాన్ని రాహుల్‌ గాంధీ తన వ్యాఖ్యద్వారా ప్రస్తావించారు. దీనిపై చెలరేగిన వివాదం కారణంగా సావర్కర్‌ దే శభక్తుడని నమ్ముతున్నవారికి సావర్కర్‌ అసలు రూపం ఏమిటో చూసేందుకు ఆసక్తి రేకెత్తించినందుకు బిజెపికి ‘అభినందనలు’ చెప్పాల్సిందే.
తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేది లేదంటూ రాహుల్‌ గాంధీ విమర్శలను తిప్పికొట్టారు. ఢిల్లీని అత్యాచారాల రాజధాని అని ప్రతిపక్షంలో ఉన్నపుడు అనేక సార్లు బిజెపి పేర్కొన్నదని, సాక్షాత్తూ నరేంద్రమోడీ 2014 ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్‌ను విడుదల చేశారు. గుక్కతిప్పుకోలేని బిజెపి నేతలు రాహుల్‌ గాంధీకి తగిన పేరు రాహుల్‌ జిన్నా అని వ్యాఖ్యానించారు. సిపాయి తిరుగుబాటుగా బ్రిటీష్‌ చరిత్రకారులు వర్ణించిన 1857 పరిణామాలను ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం అని ముందుగా వర్ణించిన సావర్కర్‌ గొప్ప దేశభక్తుడని కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా గతంలో చేసిన వ్యాఖ్యను ఈ సందర్భంగా మరోసారి పునరుద్ఘాటించారు.
1857 మే పదవ తేదీన బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా మీరట్‌లో ప్రారంభమైన మిలిటరీ తీరుగుబాటు తరువాత దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించింది.1858 జూన్‌ 20న గ్వాలియర్‌లో తిరుగుబాటుదార్లను అణచివేయటంతో వెనుకపట్టు పట్టింది. అయితే సిపాయిలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే తమ పాలన అంతానికి నాంది అవుతుందని భయపడిన బ్రిటీష్‌ పాలకులు హత్యకేసులతో సంబంధం ఉన్నవారికి మినహా మిగిలిన తిరుగుబాటుదారులందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించారు.1859 జూలై ఎనిమిది తిరుగుబాటు లాంఛనంగా ముగిసింది.
ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం గురించి నాటి పాలకుల కనుసన్నలలో నడిచే బ్రిటన్‌ పత్రికలు, అధికారిక ప్రకటనలు తప్ప ప్రపంచానికి ప్రత్యామ్నాయ వాస్తవ సమాచారం అందుబాటులో లేదు. అయినప్పటికీ తిరుగుబాటు ప్రారంభమైన 50 రోజుల్లోనే కారల్‌ మార్క్స్‌- ఫెడరిక్‌ ఎంగెల్స్‌ దాని స్వభావాన్ని పసిగట్టారు. తరువాత మరొక నెల రోజులకే భారత్‌లో జరిగిన అలజడి ఒక సిపాయి తిరుగుబాటు కాదు, ఒక జాతీయ తిరుగుబాటు, జాన్‌ బుల్‌ దానిని మిలిటరీ తిరుగుబాటుగా పరిగణించవచ్చుగానీ వాస్తవం ఏమంటే అది జాతీయ తిరుగుబాటు అని 1857 జూలై 28, 31 తేదీలలోనే కారల్‌ మార్క్సు వ్యాఖ్యానించారు. 1857 జూన్‌ 30న భారత్‌లోని పరిణామాలను మార్క్స్‌ ఇలా వర్ణించారు. ‘ ముస్లింలు, హిందువుల తమ ఉమ్మడి యజమానులకు వ్యతిరేకంగా ఐక్యమయ్యారు. తిరుగుబాటు కొన్ని ప్రాంతాలకే పరిమితం కాలేదు. ఆసియా దేశాలలో తలెత్తిన సాధారణ అసంతృప్తి కాలంలోనే ఇది జరిగింది.’ అని రాశారు.ఆ తిరుగుబాటును అణచివేయటంలో నాటి సంస్ధానాధీశులలో ఒకరైన సింధియా, ఇతర ప్యూడల్‌ శక్తుల పాత్ర గురించి కూడా మార్క్స్‌-ఎంగెల్స్‌ అనుమానించారు.
సిపాయిల తిరుగుబాటులో ప్రధమ భారత స్వాతంత్య్రం సంగ్రామ లక్షణాల గురించి మార్క్స్‌-ఎంగెల్స్‌ వ్యాఖ్యానించే నాటికి అసలు వి డి సావర్కర్‌ పుట్టనే లేదు. ఐదు ద శాబ్దాల తరువాత లండన్‌లో బారిష్టర్‌ చదవటానికి వెళ్లిన సమయంలో వారి రచనలు చదివి సావర్కర్‌ ఆ అభిప్రాయానికి వచ్చి వుండవచ్చు, వారి అవగాహన, అభిప్రాయాన్ని అంగీకరించారంటే అర్ధం చేసుకోవచ్చు గానీ అసలు ముందుగా వ్యాఖ్యా నించింది సావర్కరే అంటే చరిత్రను వక్రీకరించటమే. సావర్కర్‌ లండన్‌లో ఉన్న సమయంలో 1909లో మరాఠీలో సిపాయి తిరుగుబాటును ప్రధమ భారత స్వాతంత్య్రం సంగ్రామంగా వర్ణిస్తూ పుస్తకాన్ని రాశారు. దానికి మూలం లండన్‌లో విద్యార్ధి విప్లవకారులకు కేంద్రంగా ఉన్న ఇండియా హౌస్‌లో ఏర్పడిన పరిచయాలు, అధ్యయనమే అన్నది వేరే చెప్పనవసరం లేదు.
అభినవ్‌ భారత్‌ లేదా ఇండియా హౌస్‌లో సావర్కర్‌ పని చేసిన కాలంలో ఆయన పాత్ర గురించి ఎవరికీ పేచీ లేదు. బ్రిటీష్‌ వారి అరెస్టు నుంచి తప్పించుకొని ఫ్రెంచి వారికి చిక్కారు. వారు సావర్కర్‌ను బ్రిటీష్‌ వారికి అప్పగించారు.1910లో అరెస్టయిన కేసులో మరుసటి ఏడాది అండమాన్‌ జైలుకు తరలించిన తరువాత సావర్కర్‌ లొంగుబాటు అధ్యాయం ప్రారంభమైంది. 1911,13,17,20 సంవత్సరాలలో లేఖల మీద లేఖలు రాసి క్షమాభిక్ష కోసం ప్రాకులాడిన విషయం దాస్తే దాగదు. ఎలా కావాలంటే అలా బ్రిటీష్‌ వారికి అనుకూలంగా పని చేస్తానని రాశారు. 1923లో జైలు నుంచి విడుదల అయిన తరువాత ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా స్వాతంత్య్ర పోరాటానికి దూరమయ్యారు. అంతవరకైతే అదొక దారి క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించి బ్రిటీష్‌ వారికి తన విధేయతను చాటుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు మిలిటరీలో చేరి బ్రిటీష్‌ వారికి తోడ్పడాలని ప్రచారం చేశారు. అదే ఏడాది హిందూ మహాసభ నాయకత్వాన్ని స్వీకరించి తొలిసారిగా హిందుత్వను ప్రతిపాదించి ద్విజాతి సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. ముస్లిం ద్వేషిగా మారి చివరకు మహాత్మా గాంధీ హత్య కుట్రకేసులో ముద్దాయిగా మారిన విషయం తెలిసిందే. సాక్ష్యాలను సరిగా ప్రవేశ పెట్టని కారణంగా ఆ కేసునుంచి బయటపడ్డారు.
సావర్కర్‌తో పాటు అనేక మంది దే శభక్తులు అండమాన్‌ జైలు పాలయ్యారు. వారెవరూ బ్రిటీష్‌ వారి దయాదాక్షిణ్యాల కోసం పాకులాడలేదు. అనేక మంది తరువాత కమ్యూనిస్టులుగా మారారు. అయితే సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి లేఖలు రాసిన విషయం చాలా కాలం వరకు బయటకు రాలేదు. ఆయన 1966లో మరణించారు. 1975లో నాటి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ స్వాతంత్య్ర పోరాటంలో అండమాన్‌ జైలుకు వెళ్లినవారి గురించి ఒక పుస్తకం ప్రచురించాలని నిర్ణయించింది. దాన్ని ఆర్‌సి మజుందార్‌ అనే చరిత్రకారుడు రాశారు. ఆయన 1857 తిరుగుబాటును ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామంగా గుర్తించేందుకు నిరాకరించిన వ్యక్తి. సావర్కర్‌ అభిమానిగా ఆయన గొప్పతనాన్ని చిత్రించేందుకు ఎంతగా ప్రయత్నించినా బ్రిటీష్‌ వారికి రాసిన లొంగుబాటు లేఖలను దాచిపెట్టలేకపోయారు. అలాంటి సావర్కర్‌కు భారత రత్న బిరుదు ఇవ్వాలని కాషాయ దళాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. మోడీ సర్కార్‌ అందుకు ఇప్పటి వరకు ‘ఆ సాహసానికి ‘పూనుకొనేందుకు జంకింది. అక్టోబరు నెలలో మహారాష్ట్ర ఎన్నికల సమయంలో తాము అధికారానికి వస్తే సావర్కర్‌కు భారత రత్న కోసం కృషి చేస్తామని బిజెపి-శివసేన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాయి.

Image result for rahul gandhi ramlila maidan
రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలతో తలెత్తిన వివాదంలో శివసేన నేతలు సావర్కర్‌ దే శభక్తుడనే తమ పాత వైఖరిని పునరుద్ఘాటించారు. నాటకీయ పరిణామాల మధ్య శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌ మహారాష్ట్రలో సంకీర్ణ సర్కార్‌ భాగస్వాములుగా ఉన్నాయి. తాము గాంధీ, నెహ్రూలను గౌరవిస్తామని అలాగే కాంగ్రెస్‌ కూడా సావర్కర్‌ను గౌరవించాలని శివసేన నేత సంజయరౌత్‌ వ్యాఖ్యానించారు. ప్రతిఒక్కరూ ప్రతిదానినీ అంగీకరించలేరని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను కూడా అలాగే చూడాలంటూ ఎన్‌సిపి నేత ఛాగన్‌ భుజబల్‌ రాహుల్‌కు మద్దతు ప్రకటించారు. ఆవు మన మాతృమూర్తి కాదని సావర్కర్‌ అన్నారు, బిజెపి దానితో విబేధిస్తోంది, అదే మాదిరి పెద్ద వారి గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని చెప్పారు. దేశంలో ఈ వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉన్నప్పటికీ ఈ కారణంగా మహారాష్ట్ర సంకీర్ణ కూటమికి వచ్చే ముప్పు ఉండదని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వెంట తిరిగే హచ్‌ కుక్కలు – చంకనెక్కే బొచ్చు కుక్కలు !

05 Thursday Dec 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Janasena, P&K, pavan kalyan, tdp, Ycp, YS jagan

Image result for pawan kalyan chandrababu naidu jagan

ఎం కోటేశ్వరరావు
కొత్త సర్కార్‌కు ఈ మధ్యనే ఆరు నెలలు నిండాయి. అసాధారణ పరిస్ధితులు ఏర్పడితే తప్ప ఇప్పుడప్పుడే ఎన్నికలు రావు. అయినా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ రంగంలో వేడి పుడుతోంది. ఇది ప్రకటనలకు ఆవేశ, కావేషాలకే పరిమితం అవుతుందా ? అంతకు మించుతుందా ? ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చదరంగంలో ఎలా గెలవాలా అని ప్రతిపక్షాలు చూస్తుంటే ప్రత్యర్ధులను ఎలా కట్టడి చేయాలా అని సహజంగానే అధికారపక్షం ప్రయత్నిస్తుంది.ఈ క్రమంలో ఎత్తులు పై ఎత్తులు సహజం.
ఆరునెలల క్రితం జరిగిన ఎన్నికలకు ముందు వైసిపి-బిజెపి బంధం గురించి తెలుగుదేశం మైండ్‌ గేమ్‌ ఆడింది. ఇప్పుడు వైసిపి నాయకత్వం ఆడుతున్న ప్రతి క్రీడలో భాగంగా బిజెపి-తెలుగుదేశం-జనసేన బంధాన్ని ముందుకు తెస్తోంది. గత ఎన్నికల్లో జనసేన-వామపక్షాలు సర్దుబాట్లతో ఐక్యంగా పోటీ చేశాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఏ పార్టీతోనూ కలసి కార్యాచరణ చేపట్టకూడదని జనసేన నాయకత్వం నిర్ణయించినపుడే ఆ పార్టీ వామపక్షాలకు దూరంగా ఉండదలచుకున్నదని తేలిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో ఏమి జరగనున్నది అనే చర్చకు తెరలేచింది. వైసిపికి తామే అసలైన ప్రతిపక్షమని బిజెపి నేతలు ప్రకటించారు.బిజెపితో తెలుగుదేశం పార్టీ సంబంధాల గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. వాటి ఆధారంగా నిర్ధారణలకు రావటం, జోశ్యాలు చెప్పాల్సిన అవసరం లేదు.అవి కలసినా, విడిగా వున్నా సంఖ్యా పరంగా వైసిపికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఇక బిజెపితో పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలోని జనసేన పార్టీ సంబంధాల గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఊహాగానాలు వచ్చినా వారే చెబుతున్నారు గనుక తలలు బద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు.
‘బిజెపికి నేను ఎప్పుడు దూరమయ్యాను? దగ్గరగానే ఉన్నా. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కోసం కేండ్రంతో విభేదించాను. అమిత్‌షా అంటే నాకు అమితమైన గౌరవం. వైసిపి వాళ్లకు ఆయనంటే భయం.’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తిరుపతి విలేకర్ల సమావేశంలో చెప్పారు. దేశ ప్రజలు బిజెపిని మంచి మోజార్టీతో రెండోసారి అధికారంలో కూర్చోబెట్టారు. మోడీ అమిత్‌షా దేశ ప్రయోజనాలు, దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు. నేను సెక్యులరిస్టును. ఓట్లు వచ్చినా, రాకపోయినా నేను నమ్మే హిందూ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. జగన్‌ నివాసానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా పుష్కర ఘాట్‌లో సామూహిక మత మార్పిడి చేస్తుంటే ఆయనకు తెలియదా? ఎవరి అండ చూసుకొని 40 మందిని సామూహిక మతమార్పిడి చేశారో చెప్పాలన్నారు. హిందూధర్మ పరిరక్షణ గురించి నేను మాట్లాడితే, దాన్ని వక్రీకరించి వైసిపి అసత్య ప్రచారం చేసింది. ఎవరైనా సరే మత విశ్వాసాలను గౌరవించి తీరాల్సిందే అన్నారు. ‘మీరు టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకుంటారా?’ అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ‘చెప్పలేం… ఉండొచ్చు ఏమో…’ అంటూ సమాధానం దాటవేశారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి దళిత, బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారని, రెండోసారి అధికారం కోసం ఎవరిని పక్కన పెట్టి పార్టీని స్థాపించించారో ఆ బ్రాహ్మణులను అక్కున చేర్చుకున్నారని. రాజకీయాలు ఇలా ఉంటాయంటూ సమాధానం చెప్పారు.
జనసేనను బీజేపీలో విలీనం చేయమని ఎన్నికలకు ముందే పవన్‌ కల్యాణ్‌ని అడిగామని, అప్పుడు ఆయన ఒప్పుకోలేదని భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు గుర్తుచేశారు. ఇప్పుడు ఏమైనా పవన్‌ కల్యాణ్‌ మనసు మారి ‘జనసేన’ను భారతీయ జనతా పార్టీలో విలీనం చేసే ఆలోచన ఉంటే తప్పనిసరిగా స్వాగతిస్తామని చెప్పారు.’మా నాయకత్వం కొత్త ఒరవడిని తీసుకురావడానికి ఇష్టపడుతోంది. కేవలం రాజకీయ కారణాలతో ఆరడుగుల బుల్లెట్‌ (పవన్‌ కల్యాణ్‌)ను మా భుజాలపై నుంచి సంధించాలని వేరే వారు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే, పొత్తులు పెట్టుకునే సమయం కాదు ఇది. ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలు జరగడానికి ఇంకా నాలుగున్నర సంవత్సరాల వ్యవధి వుంది. మాతో కలిసి పనిచేయదలచుకున్న పార్టీలు ఏవైనా విలీనం కాదలచుకుంటే స్వాగతిస్తాం.లేదా కలిసి పనిచేసేలా ప్రయత్నిస్తాం’ అని జీవీఎల్‌ పేర్కొన్నారు.

Image result for pawan kalyan chandrababu naidu jagan
తిరుపతి వెంకన్న సాక్షిగా పవన్‌ చెప్పిన మాటలు, బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు స్పందన గురించి వేరే వ్యాఖ్యానాలు అవసరం లేదు. గతంలో సినిమా సమీక్షలు రాసేవారు కథంతా వివరించి చిత్ర ముగింపు ఎలా ఉంటుందో చెప్పకుండా ఆసక్తిని కలిగించేందుకు ప్రయత్నించేవారు. ఇప్పుడు బిజెపి-జనసేన మధ్యలో తెలుగుదేశం అన్నట్లుగా ఉంటుందా ? బిజెపి-జనసేన విలీనం అవుతాయా, మిత్రపక్షాలుగా ఉంటాయా అన్నది కూడా త్వరలోనే స్పష్టం అవుతుంది. అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌-బిజెపిలతో సఖ్యతను చూస్తే కాంగ్రెస్‌ నుంచి విడిపోయిన శక్తులు తిరిగి దానితో సర్దుబాటు చేసుకున్నా ప్రత్యేక పార్టీలుగానే కొనసాగి బేరసారాలు జరుపుతున్నాయి.
చిన్న పార్టీలను కాంగ్రెస్‌ ఎలా మింగివేసిందో గత అనుభవం ఉంది గనుక బిజెపి విషయానికి వస్తే ప్రాంతీయ పార్టీలు ముందు నుంచి తగుజాగ్రత్తలతో వ్యహరిస్తున్నాయి. రెండు పెద్ద జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు విలీనం అయితే ముద్రవేయించుకొని మందలో కలవటం తప్ప చేసేదేమీ ఉండదని ప్రజారాజ్యం నేత చిరంజీవి అనుభవం తెలిసిందే. అన్నింటికీ మించి విడిగా ఉంటేనే ప్రాంతీయ పార్టీలకు బేరసారాలాడే శక్తి ఎక్కువగా ఉంటుంది. అంతకు మించి ఎప్పుడు ఎటుకావాలంటే అటు సులభంగా దూకే సౌలభ్యం ఉంటుంది. అందుకు మహారాష్ట్ర శివసేన చక్కటి ఉదాహరణ. హిందూత్వ విషయంలో విడదీయలేని బిజెపితో పోటీ పడిన ఆ పార్టీ అధికారం విషయంలో పేచీకి దిగి ఎన్‌సిపి-కాంగ్రెస్‌ కూటమితో ఎలా చేతులు కలిపిందో చూశాము. దీన్ని చూసిన తరువాత ఏ పార్టీ ఎప్పుడు దేనితో చేతులు కలుపుతుందో చెప్పలేని స్ధితి ఏర్పడింది. ఎవరి తురుపు ముక్కలను వారు తమ దగ్గరే పెట్టుకొని జూదం ఆడతారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ను తెలుగుదేశం పార్టీనేత చంద్రబాబు నాయుడు వెనుక తిరిగే హచ్‌ కుక్క వంటి వాడని వ్యాఖ్యానించారు. అంతకు ముందు మరో మంత్రి కొడాలి నాని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లుచ్చాగాడు అని సంబోధించారు. గతంలోకి వెళితే 2016 రైతు భరోసా యాత్రలో వైఎస్‌జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ నవనిర్మాణ దీక్షల గురించి చంద్రబాబు చెప్పింది నిజంగా జరగాలంటే చంద్రబాబు నాయుడిని ఎక్కడ కనపడితే అక్కడ చెప్పులతో కొట్టాలన్నారు. చంద్రబాబు సిగ్గుమాలిన మనిషి, నారాసురుడు అని జగన్‌ అంటే, వైఎస్‌ఆర్‌ దొంగలు అని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలంతా విన్నారు, కన్నారు. ఇవన్నీ చూసినపుడు రాష్ట్ర రాజీకీయాల్లో నోరుబట్టని బూతులు, కూతలు నిత్యకృత్యమయ్యాయి.రాబోయే రోజుల్లో బూతులతో పాటు మత,కులాల అంశాలను మరింతగా ముందుకు తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
బూతులు ఎవరు మొదలు పెట్టారు, ఎవరు ఎంత సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు అన్నది నేడు గ్రామాలలో రచ్చబండ చర్చల్లో రచ్చ అవుతోంది. ఏ పార్టీ అభిమానులు ఆ పార్టీ నేతల బూతులను నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల ఉన్మాదంతో ఊగిపోతున్నారు. దాన్నింకా పెంచేందుకు నేతలు బూతుల పంచాంగాలను మరింత శ్రావ్యంగా వినిపిస్తున్నారు. ఇలా బూతులు మాట్లాడటం తప్పనే జ్ఞానం ఎక్కడా కనిపించటం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి, ఆయన అనుయాయుల మీద తమ అనుచరుల నోటి దురుసుతనాన్ని విని ఆనందిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ మీద తన మంత్రులు, ఇతర నేతల బూతులు, కూతలను చూసి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి మహదానందం పొందుతున్నట్లు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం ఉందంటే మన నేతలకు ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో ఎలాంటి గౌరవం దక్కుతుందో చెప్పనవసరం లేదు. తెలుగు సమాజం ఇలాంటి వారిని ఎలా భరిస్తున్నదని ప్రశ్నించే రోజులు రాబోతున్నాయి. ఎవ్వరేమనుకుంటేనేమి నాకేటి సిగ్గు అనుకుంటే చేసేదేముంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకీ పరిస్ధితి, ఎందుకీ దిగజారుడు ? గతంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, స్వతంత్రపార్టీ వంటివి అధికార, ప్రతిపక్షాలుగా ఉన్నపుడు ఇలాంటి దిగజారుడుతనం లేదు. రాజకీయ వైరం తీవ్రంగా ఉన్నప్పటికీ పరస్పర నిందలు లేవు. ఎన్‌టి రామారావు రాజకీయ రంగంలోకి వచ్చినపుడు కుక్కమూతి పిందెలు అని చేసిన విమర్శకు మమ్మల్ని ఇంతలా నిందిస్తారా అని కాంగ్రెస్‌ వారు నొచ్చుకున్నారు. ఇప్పుడు వెలువడుతున్న పదజాలంతో పోల్చితే నిజానికి ఆ విమర్శ పార్లమెంటరీ సంప్రదాయాలకులోబడిందే తప్ప నింద కాదు.
1991 నుంచి అమల్లోకి వచ్చిన నయావుదారవాద విధానాలను అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న జాతీయ, ప్రాంతీయ పార్టీలు(కొన్ని అంశాలలో పరిమితంగా వామపక్షాలు మినహా) ఒకే రకమైన ఆర్ధిక విధానాలను అమలు జరుపుతున్నాయి. అందువలన తెలుగుదేశం, వైసిపి, కాంగ్రెస్‌, జనసేన, బిజెపి వంటి పార్టీలేవీ విధానాల గురించి చట్ట సభల్లో లేదా వెలుపలా ఎక్కడా ప్రస్తావించవు, ఘర్షణ పడవు. వాటి పంచాయతీ అల్లా అధికారం, దాన్ని అడ్డం పెట్టుకొని ఆస్ధులు కూడబెట్టుకోవటం గురించి మాత్రమే. అందువల్లనే అధికారం కోసం ఎంత ఖర్చు పెట్టటానికైనా వెనుదీయరు, ఏమి చేయటానికైనా సిద్దం అవుతారు.
గతంలో అంటే నూతన ఆర్ధిక విధానాలు రాకముందు భూమి దాని మీద పట్టు, గ్రామీణ ప్రాంతాలలోని వనరుల మీద ఆధిపత్యం కోసం పాలెగాళ్లు, భూస్వాములు, ధనిక రైతులు వెంపర్లాడేవారు. గడచిన మూడు దశాబ్దాలుగా వ్యవసాయం గిట్టుబాటు గాకపోవటం, దాని మీద వచ్చేదాని కంటే పరిశ్రమలు, వ్యాపారాలు, రియలెస్టేట్‌ మీద వచ్చే ఆదాయం ఆకర్షణీయంగా మారటంతో రాయలసీమ ఫ్యాక్షనిస్టులు, ఇతర ప్రాంతాల్లోని భూస్వాములు, ధనిక రైతులు వాటి వైపు మొగ్గుచూపారు. రాయలసీమలో ఇప్పటికీ ఫ్యాక్షనిజం ఉన్నప్పటికీ వాటి నేతలకు గ్రామీణ ప్రాంతాలలో వచ్చే ఆదాయాల కంటే పట్టణాలు ఆకర్షణీయంగా ఉండటంతో వారి మధ్య సర్దుబాట్లకు తెరలేచింది. ఒకరి సంపాదనకు మరొకరు అడ్డుపడకుండా ఎవరి సంపాదన వారు చూసుకుందామనే పెట్టుబడిదారీ ఆలోచనలు అందుకు దోహదం చేస్తున్నాయి.అందువల్లనే పేరు మోసిన వైరి ఫ్యాక్షనిస్టులు అటు తెలుగుదేశం పార్టీలో ఇటు వైసిపిలో ఒకేవరలో ఇమిడిపోగలుగుతున్నారు.
నయావుదారవాద విధానాలు ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి తెరలేపాయి.ప్రపంచ బ్యాంకు విధానాల అమలు ప్రయోగశాలగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మారింది. దీనిలో ప్రభుత్వరంగ సంస్ధల ఆస్ధులను ఆశ్రితులకు అయినకాడికి తెగనమ్మటం ద్వారా లబ్ది చేకూర్చటం. విలువైన భూములను కారు చౌకగా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు కట్టబెట్టి వారి నుంచి రాజకీయనేతలు లబ్ది పొందటం తెలిసిందే. అది అపరిమిత లాభాలు చేకూర్చటంతో ఎన్నికలు వ్యాపారంగా మారాయి. పదుల కోట్ల రూపాయలు అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికలలో ఖర్చు చేయటానికి కారణమిదే. దీనికి అనుగుణ్యంగానే స్ధానిక సంస్ధల ఎన్నికలు కూడా డబ్బుమయంగా మారాయి.
ఇదే సమయంలో రాజకీయ వైరం తీవ్రంగా ఉన్న సందర్భాలలో ఎదుటి వారికి ఆర్ధిక మూలాలను దెబ్బతీయటం చేస్తున్నారు. అది కేంద్రంలోనూ, రాష్ట్రాల్లో అధికారాల్లో ఉన్నవారూ చేస్తున్నారు. కాంట్ట్రాక్టర్లుగా ఉన్నవారికి దీర్ఘకాలం పాటు బిల్లులు నిలిపివేయటం, కొర్రీలు వేయటం, గనులు పొందిన వారి మీద దాడులు చేయించటం. గతంలో పొందిన కాంట్రాక్టులను రద్దు చేస్తామని బెదిరించటం ఇలా రకరకాల పద్దతులను రంగంలోకి తీసుకువస్తున్నారు. తెలుగుదేశం హయాంలో గ్రామాల్లో కాంట్రాక్టులు పొంది పనులు చేసిన వారు పార్టీ మారి వైసిపిలోకి వెళితే వెంటనే బిల్లులు మంజూరు చేయటం, మారని వారిని సతాయించటం గురించి వస్తున్న ఫిర్యాదుల సారమిదే.

Image result for pawan kalyan chandrababu naidu jagan

ఎన్నికల్లో డబ్బు ప్రమేయం పెరుగుదల రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సర్దుబాట్లకు-కక్షలకు తెరలేపింది. ఎవరు బిస్కెట్‌ వేస్తే లేదా కర్ర చూపితే వారి వైపు తోకాడించుకుంటూ వెళ్లి చంకనెక్కే బొచ్చుకుక్కల మాదిరి వెళుతున్న వాణిజ్య రాజకీయనేతలను చూస్తున్నాము. డబ్బు, ఓట్లను రాబట్టగలిగిగే సామాజిక తరగతిని బట్టి నిన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీలో పదవులు వెలగబెట్టిన వారు తెల్లవారే సరికి వాటంగా ఉంటుందనుకొంటే మరొక పార్టీలోకి సులభంగా మారిపోతున్నారు. చేర్చుకొనే వారికి, చేరేవారికి ఎలాంటి విలువలు, వలువలు ఉండటం లేదు. ఒక పార్టీలో గెలిచి ప్రజాప్రతినిధిగా ప్రమాణ స్వీకారం కూడా చేయక ముందే మరో పార్టీలో చేరిన వారిని చూశాము. ఫిరాయింపుదార్లను కాపాడేందుకు స్పీకర్ల వ్యవస్ధను దుర్వినియోగం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఎవరు అధికారంలో వుంటే వారికి వ్యతిరేకంగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొనేందుకు ప్రతిపక్షంగా ఉన్న ప్రతి పార్టీ ప్రయత్నిస్తుంది.దానిలో తప్పులేదు. ఇప్పుడు ప్రతిపార్టీ అధికారంలోకి వచ్చేందుకు సంక్షేమ చర్యల విషయంలో పోటీపడుతున్నది తప్ప వేరే అంశాలే లేవు. సంక్షేమ చర్యలను విమర్శించేందుకు ఎవరూ ముందుకు రారు. రాజకీయంగా వేడి పుట్టించాలంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని బూతులతో రక్తి కట్టిస్తే తప్ప జనానికి కిక్కు ఎక్కటం లేదు. ఇప్పుడు బిజెపితో స్నేహం కారణంగా మతాన్ని కూడా ముందుకు తెస్తున్నారు. ఆరు నెలల క్రితం బిజెపికి వ్యతిరేకంగా పని చేస్తా అని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ అప్పటికీ ఇప్పటికీ ఆ బిజెపిలో వచ్చిన మార్పేమిటో, రాష్ట్రానికి చేసిన మేలు ఏమిటో, ఎందుకు తన వైఖరిని మార్చుకున్నారో జనసేనాని జనానికి చెప్పాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అయోధ్య తీర్పు : అనంతర దృశ్యాలు ?

10 Sunday Nov 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

ayodhya verdict, economic challenges before narendra modi, Narendra Modi, post ayodhya verdict, probable scenario of the post ayodhya verdict

Image result for economic challenges before narendra modi

ఎం కోటేశ్వరరావు
అయోధ్య బాబరీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఒక తీర్పు వెలువరించింది. నిజానికి ఆ కేసు రాముడు ఎక్కడ జన్మించాడు అన్నది కాదు, వివాదాస్పద రెండు ఎకరాల 77సెంట్ల భూమి మీద హక్కులకు సంబంధించిన వాజ్యం మీద అలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద దాఖలైన పునర్విచారణ అంశం. దానికి పరిమితం కాకుండా విశ్వాసాలను కలగలపి ప్రభుత్వ భూమి గనుక రాముడికి కేటాయిస్తూ ఇచ్చిన తీర్పు. సరే దీని పర్యవసానాలు, పరిణామాలు ఎలా ఉంటాయన్నది రాబోయే రోజుల్లో నిపుణులు చర్చిస్తారు. ఒక్క ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు తప్ప మిగిలిన ముస్లిం సంస్ధలన్నీ కొన్ని మినహాయింపులతో అయినా తీర్పును స్వాగతించాయి. పునర్విచారణ పిటీషన్‌ దాఖలు చేయాలా లేదా అన్నది త్వరలోనే ముస్లిం పర్సనల్‌ లాబోర్డు నిర్ణయిస్తుంది. పిటీషన్‌ దాఖలు చేస్తే ఈ వివాదం మరికొంతకాలం సాగుతుంది. లేకపోతే ఇంతటితో ముగుస్తుంది. న్యాయమూర్తులకు దురుద్ధేశ్యాలను ఆపాదించకూడదు తప్ప తీర్పు మంచి చెడ్డల గురించి చర్చించే అవకాశం ఇంకా మన దేశంలో మిగిలే ఉంది కనుక ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. సద్వివిమర్శనాత్మక వైఖరి ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్ధలను మరింత పటిష్ట పరుస్తుందే తప్ప ప్రపంచంలో ఎక్కడా దెబ్బతీసిన దాఖలాలు లేవు. అయితే ప్రభుత్వ విధానాలను విమర్శించటం కూడా దేశద్రోహమే అన్న వైఖరి రోజురోజుకూ పాలకుల్లో బలపడుతున్న కారణంగా ఈ స్వేచ్చ ఎంతకాలం ఉంటుంది అన్నది ఊహాజనితమైన ప్రశ్న.
చరిత్రలో ప్రతి ముగింపు మరో దానికి నాంది కావటాన్ని అనేక పరిణామాల్లో చూశాము. సుప్రీం కోర్టు ఎవరికి ఎలా కనిపించినా అది ఒక నూతన అధ్యాయానికి తెర తీసింది అన్నది నిర్వివాదం. గతంలో అనేక ముఖ్య అంశాలపై ఇచ్చిన తీర్పులు వాటి స్వభావాన్ని బట్టి న్యాయమూర్తుల మీద పూలూ రాళ్లూ కూడా పడ్డాయి. మహాత్మా గాంధీ ప్రస్తావన వచ్చినపుడు ఆయన హంతకుడైన హిందూ మతోన్మాది గాడ్సే పేరును తలవకుండా ఉండలేము కదా ! చరిత్ర పేజీలో ఎవరి అవగాహన మేరకు వారు రాసేందుకు అవకాశం ఉంది కనుక దీని గురించి కూడా అదే జరుగుతుంది. అయోధ్యపై సుప్రీం తీర్పు గురించి గాంధీ ముని మనవడు తుషార్‌ గాంధీ వ్యాఖ్యానిస్తూ మన న్యాయవ్యవస్ధలో విశ్వాసానికి సంబంధించిన నేరం కూడా చేరిందని, మహాత్మాగాంధీ హత్యకేసును ఇప్పుడు గనుక సుప్రీం కోర్టు పునర్విచారణ జరిపితే గాడ్సే హంతకుడే అయితే అతను దేశభక్తుడు కూడా అని తీర్పు చెప్పి ఉండేవారు అని వ్యాఖ్యానించాడు. దీనికి టీకా, తాత్పర్యాలు చెబితే అంత బాగోదు ! అయోధ్య తీర్పు అనంతరం ఏమి జరుగుతుంది ?

పునర్విచారణలో తీర్పును కొట్టి వేస్తే ?
ముస్లిం పర్సనల్‌ లా బోర్డు పునర్విచారణ కోరితే ఐదుగురు సభ్యుల బెంచ్‌ లేదా అంతకంటే ఎక్కువ సభ్యుల బెంచ్‌ గానీ దానిని విచారణ చేయవచ్చు. కోర్టు తీర్పులను ఊహించలేము గనుక పునర్విచారణలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును తోసి పుచ్చ వచ్చు లేదా నిర్ధారించనూ వచ్చు, నిర్దారణ ఏక గ్రీవం కావచ్చు లేదా మెజారిటీ ప్రకారమూ కావచ్చు. ఒక వేళ ఇప్పుడిచ్చిన తీర్పును కొట్టి వేసి కొత్త తీర్పు ఇస్తే అది కేంద్రంలో ఉన్న పాలకపక్షానికి అంగీకారం కానట్లయితే ? గతంలో షాబానో కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్‌ సర్కార్‌ మైనారిటీలను సంతృప్తి పరచేందుకు పార్లమెంట్‌ ద్వారా ఆ తీర్పును రద్దు చేసింది. ఇప్పుడు బిజెపి సర్కార్‌కు నచ్చని తీర్పు వస్తే అదేపని చేసి మెజారిటీ పజానీకాన్ని సంతృప్తి పరచవచ్చు.
విశ్వాసాల ప్రాతిపదికన కొత్త డిమాండ్లను ముందుకు తెస్తే ?
ఒక్క అయోధ్య వివాదం తప్ప మిగిలిన ప్రార్ధనా స్ధలాలు 1947 ఆగస్టు 15 నాటికి అంటే స్వాతంత్య్రం వచ్చిన సమయానికి ఏ స్ధితిలో ఉన్నాయో వాటిని అదే విధంగా ఉంచాలని 1991లో కేంద్ర ప్రభుత్వం ప్రార్దనా స్ధలాల ప్రత్యేక అంశాల చట్టం నిర్దేశిస్తోంది. దాని ప్రకారం అప్పటి వరకు ఉన్న కేసులను కోర్టుల నిర్ణయానికి వదలి వేయాలి. మిగతా వాటిని వివాదం చేయటానికి లేదు. దానికి అనుగుణ్యంగానే అయోధ్య కేసును కోర్టు నిర్ణయానికి వదలివేశారు. అయోధ్య తీర్పు ప్రాతిపదికన మధుర, కాశీలోని మసీదులను కూడా దేవాలయాలను కూల్చి నిర్మించినవే అని లేదా లేదా ఇతర ప్రార్ధనా స్దలాల గురించి వివాదాలను ముందుకు తెచ్చినా కోర్టులలో చెల్లవు.
అయితే ఈ చట్టానికి సవరణలు లేదా రద్దు జరగనంత వరకు మాత్రమే ఆ స్ధితి కొనసాగుతుంది. ఒక వేళ ప్రస్తుత పాలకులు లేదా తరువాత వచ్చే వారు గానీ దాన్ని సవరిస్తే ఏమిటి ? ప్రస్తుతం ఊహాగానంగా లేదా మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారని ఎవరైనా అనుకోవచ్చు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు అని సుప్రీం కోర్టు గతంలో తీర్పు చెప్పినప్పటికీ దాన్ని పక్కన పెట్టి తన రాజకీయ అజెండాకు అనుకూలంగా బిజెపి ఒక మౌలిక లక్షణమైన ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తీరు చూసిన తరువాత ఏ రాజకీయ పార్టీ అయినా తన రాజకీయ అజెండాకు అనుగుణంగా ఏ చట్టాన్ని అయినా మార్చే అవకాశం ఉంటుంది అన్నది స్పష్టమైంది. అనేక దేశాలలో పాత రాజ్యాంగాలను మార్చి కొత్త వాటిని ఉనికిలోకి తీసుకు వచ్చారు. ఎన్నడో మధ్యయుగాల్లో, అంతకు ముందో యూదులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే పేరుతో ఇజ్రాయెల్‌ అనే దేశాన్నే ఐక్యరాజ్యసమితి సృష్టించటాన్ని చూశాము. అదే పేరుతో చరిత్రలో జరిగిన తప్పిదాలను సరిదిద్దే పేరుతో మన రాజ్యాంగాన్ని మార్చి తమ అజెండాను అమలు చేసేందుకు పూనుకోరు అన్న హామీ ఎక్కడుంది.

సంఘపరివార్‌ హిందూత్వ అజెండా పూర్తి అయినట్లేనా ?
మన దేశాన్ని హిందూ దేశంగా మార్చాలన్నది హిందూత్వశక్తుల లక్ష్యం. అందుకు గాను ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ విభాగంగా జనసంఘాన్ని ఏర్పాటు చేసింది. తరువాత దాన్ని జనతా పార్టీలో విలీనం చేసింది. దాన్నుంచి విడదీసి భారతీయ జనతా పార్టీగా మార్చింది. రాజకీయ, ఇతరంగా ఏర్పాటు చేసిస సంస్దల ద్వారా జన సమీకరణకు ఎంచుకున్న అనేక అంశాలలో ఆర్టికల్‌ 370, రామజన్మభూమి, ఉమ్మడి పౌరస్మృతి. వీటిలో రెండింటిని పూర్తి చేశారు.మూడవ దానిని కొంత చేశారు. ఒకసారి వివాదాస్పద అంశాలు పూర్తి అయిన తరువాత అజెండా అయిపోయింది కనుక దుకాణాన్ని మూసుకుంటారు అనుకుంటే పొరపాటు. గుళ్లకు, ఇళ్లకు పరిమితం కావాల్సిస దేవుళ్లను వీధుల్లోకి తీసుకు వచ్చారు. ఇంకా అనేక వివాదాస్పద అంశాల గురించి మాట్లాడుతున్నందున వాటిని ఏ రూపంలో ముందుకు తీసుకు వస్తారో చూడాల్సి ఉంది.

Image result for economic challenges before narendra modi
అయోధ్య తీర్పు అనంతర పర్యవసానాలు ఏమిటి ?
దేశంలో మతాలను నమ్మే వారు, నమ్మని వారు కూడా మతం,ఆలయం, మసీదుల పేరుతో జరిగిన రాజకీయాలు, మారణకాండలను చూసి ఏదో ఒక పరిష్కారం కావాలని కోరుకున్నారు. పెద్ద మనుషుల మాదిరి రెండు పక్షాలను సంతృప్తి పరచేందుకు ఇచ్చిన తీర్పుగా చూసి జనంలో కూడా ఒక సంతృప్తి వ్యక్తం అవుతోంది. మొత్తంగా చూసినపుడు 370 అర్టికల్‌ కంటే రామజన్మభూమి ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే సదరు ఆర్టికల్‌ కాశ్మీర్‌కు చెందినదిగా భావిస్తే రాముడు అనే దేవుడి ఆలయం హిందువులందరూ తమదిగా భావించే స్ధితికి తీసుకువచ్చారు. అది ఒక కొలిక్కి వచ్చింది కనుక. జనం ఇప్పుడు తాము ఎదుర్కొన్న అసలు సమస్యల మీద దృష్టి కేంద్రీకరించే పరిస్ధితులు ఏర్పడతాయి.
అలా కేంద్రీకరించకపోతే జనమే నష్టపోతారు, కేంద్రీకరిస్తే బిజెపి నష్టపోతుంది. నరేంద్రమోడీ కల్పించిన భ్రమల తీవ్రత కారణంగా మూడు సంవత్సరాల క్రితం పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించిన వారిని దేశద్రోహులు అన్నట్లుగా చూశారు. నోట్ల మార్పిడి, బ్యాంకుల్లో వున్న సొమ్ము కోసం పని పాటలు మాని బ్యాంకుల వద్ద బారులు తీరటాన్ని దేశభక్తియుతమైనదిగా పరిగణించారు. మూడేండ్ల క్రితం రొమ్ము విరుచుకొని మతి మాలిన ఆ చర్యను సమర్ధించిన వారిలో ఇప్పుడా పరిస్ధితి లేదు. పకోడీలు అమ్ముకోవటం కూడా ఉపాధి కల్పనే అన్న మోడీ మాటను ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సమర్ధించేవారిని జనం అపహాస్యం చేస్తారు.

ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరపడుతుందా !
రాజకీయ, సామాజిక అంశాలలో వివాదాస్పద అంశాలను ముందుకు తీసుకురావటంలో, అధికారాన్ని పొందటంలో బిజెపి-కాంగ్రెస్‌ ఇతర ప్రాంతీయ పార్టీల మధ్య వివాదాలు, విబేధాలు ఉన్నాయి తప్ప విధానాల పరంగా వామపక్షాలు మినహా అన్నీ ఒక్కటే. మైనారిటీలను ఓటు బ్యాంకుగా చేసుకొనేందుకు కాంగ్రెస్‌ రాజకీయాలు చేసింది. మెజారిటీ జనంతో ఓటు బ్యాంకు ఏర్పాటుకు బిజెపి తెరతీసింది. అంతకు మినహా ఆర్ధిక విషయాల్లో వాటికి తేడా లేదా పంచాయితీ లేదు. అమలు జరపటంలో పోటీ పడుతున్నాయి. ఆవిధానాలే భారీ కుంభకోణాలు, అవినీతి అక్రమాలకు, జన జీవితాలు అతలాకుతలం కావటానికి తద్వారా కాంగ్రెస్‌, కొని ప్రాంతీయ పార్టీల పతనానికి దారి తీశాయి. బిజెపి విషయంలో కూడా అది జరగటానికి ఎంతో సమయం పట్టదు. అచ్చే దిన్‌ బదులు మోడీ విధానాలు జనాలు చచ్చే దినాలకు దారి తీశాయని, రోజు రోజుకూ ముదురుతున్న ఆర్ధిక మందగమనం వెల్లడిస్తోంది. ఆటోమొబైల్‌ రంగంలో కొనుగోళ్లు పడిపోయాయంటే జనం కొత్త మోడళ్ల కోసం కొనుగోలు వాయిదా వేసుకున్నారని చెప్పారు. ఇప్పుడు రోజువారీ వినియోగ వస్తువుల కొనుగోళ్లు, విదేశాల నుంచి దిగుమతులు కూడా పడి పోయాయని వస్తున్న వార్తలకు ఏ సాకు చెబుతారు? అక్టోబరు నెలలో నిరుద్యోగం 8.5శాతానికి పెరిగింది. అంటే మరింత మెరుగైన వాటికోసం జనాలు ఉద్యోగాల్లో చేరటం లేదని సిద్ధాంతీకరిస్తారా ? పని పాటలు లేని యువత కొంత భాగం పక్కదారి పట్టటమే కాదు, సరైనదారి కోసం కూడా ఆలోచించేది కూడా యువతే. ప్రస్తుతం అనేక దేశాల్లో జరుగుతున్న ఆందోళనలో ముందుంటున్నది వారే. ఆ ధోరణి నుంచి మన దేశం ఎలా తప్పించుకోగలదు ? కొందరిని కొంతకాలం మభ్యపెట్టగలరు గానీ అందరినీ ఎలా కాలం మోసగించలేరుగా !

బిజెపి చెబుతున్న జాతీయ వాదం పర్యవసానాలు ఏమిటి ?
బిజెపి ముందుకు తెచ్చిన హిందూత్వ అజెండాలో భాగమే జాతీయ వాదం. ఏ దేశమైనా కుంభకోణాలు, అవినీతి మయంగా మారినపుడు, పాలకుల విధానాల వైఫల్యాలతో ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నపుడు జాతీయ వాదాలను, ప్రజాకర్షక నినాదాలను ముందుకు తేవటం సులభం. అయితే అవి ఎక్కువ కాలం పని చేయవన్నది అంతర్జాతీయ అనుభవం. ఒక దేశం వాటికి దూరంగా ఉండజాలదు. బిజెపి నేతలు ఒక వాదనను ముందుకు తెచ్చారు. మేము ముస్లింలందరినీ ఉగ్రవాదులు అనటం లేదు గానీ, ఉగ్రవాదులంతా ముస్లింలే ఉన్నారు అని చెబుతారు. ఇప్పుడు మన జనం నోళ్లలో నానుతున్న అంశం ఏమంటే పాకిస్ధాన్‌ నుంచి యుద్ధం, ఉగ్రవాద చర్యలు అందరికీ తెలిసినవే గానీ అదేమిటో బిజెపి అధికారంలో ఉన్నపుడు సరిగ్గా అవి ఎన్నికల ముందే జరుగుతున్నాయి అనే చర్చ ప్రతి ఉదంతం సందర్భంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఎందుకంటే వాటిని ఆ పార్టీ ఎన్నికల అస్త్రాలుగా, మనోభావాలను రెచ్చగొట్టేందుకు వినియోగిస్తున్న తీరు చూసిన తరువాత బిజెపి అభిమానుల్లో కూడా నాటుకున్న అనుమానం అదే. జాతీయ వాదం పులి స్వారీ వంటిది. పులినెక్కిన వారు దాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి లేదా దానికే బలి కావాలి. నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరించకుండా జాతీయ వాదాన్ని తిని, జాతీయవాదాన్ని చెప్పి, జాతీయ వాదాన్ని పీల్చి బతకమంటే కుదిరేది కాదు.

కిన్లే బదులు ఆవు మూత్రం తాగి, బాబా గారి సబ్బుల బదులు ఆవు పేడతో స్నానం చేస్తామా ?
దేశభక్తి అంటే ఆవు మూత్రం, ఆవు పేడలో సుగుణాలను అంగీకరించటంగా తయారైంది. నిజానికి అలా చెప్పే వారు రోజూ గోమూత్రం తాగుతూ సబ్బుల బదులు ఆవు పేడతో స్నానం చేస్తున్నారా ? ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ! ప్రధాని నరేంద్రమోడీ గారూ, వారి పార్టీ నేతలూ కాంగ్రెస్‌ 50 ఏండ్లలో సాధించలేని వాటిని మేము ఐదేండ్లలో సాధించాం అని వూరూ వాడా ఎన్నికల ప్రచారం చెశారు. రెండోసారి అధికారానికి వచ్చాక 70 ఏండ్లుగా చేయలేని దానిని 70 రోజుల్లో చేశాం అన్నారు. నీతి ఆయోగ్‌ వుపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ సరిగ్గా ఈ సమయంలోనే 70 సంవత్సరాలలో ఎన్నడూ తలెత్తని అసాధారణ పరిస్ధితి ఏర్పడింది అని వ్యాఖ్యానించారు.
ఆరు సంవత్సరాల క్రితం అంటే 2012, 2013లో రూపాయి విలువ పతనంతో ధరలు పెరుగుతాయని మిగతా వారంతా ఆందోళన పడుతుంటే ‘నేనూ పాలనలోనే వున్నాను(ముఖ్యమంత్రిగా) ఇంత వేగంగా రూపాయి విలువ పడిపోకూడదని నాకు తెలుసు, ఈ విధంగా పతనం కావటానికి కారణం ఏమై వుంటుంది. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి, సమాధానం కావాలని దేశం డిమాండ్‌ చేస్తోంది.రూపాయి ఈ రోజు ఆసుపత్రిలో వుంది, జీవన పోరాటం చేస్తోంది, అని మన్మోహన్‌ సింగ్‌ గురించి నరేంద్రమోడీ అన్నారు. గతేడాది గరిష్టంగా రికార్డు స్ధాయిలో ఒక రోజు రూపాయి విలువ 74.48కి పడిపోయింది. ఆజ్‌తక్‌ టీవీ యాంకర్‌ రూపాయి విలువ పతనం వార్త సందర్భంగా ‘ కాలం మారింది. నరేంద్రమోడీ ప్రధాని అయ్యారు. ఇప్పుడు రూపాయి విలువ పతనం అవుతోంది. ఆయనేమీ చెప్పటం లేదు’ అన్నారు.

Image result for economic challenges before narendra modi
ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడితే ….. ?
నల్ల ధనం దేశం నుంచి బయటకు పోతున్న కారణంగా రూపాయి విలువ పడిపోతున్నదని 2018 సెప్టెంబరు 23న గోవాలో జరిగిన ఒక సభలో బిజెపి నేత సుబ్రమణ్య స్వామి చెప్పారు. అమెరికా డాలరుతో మన రూపాయి విలువ పతనానికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నల్లధనం దేశం నుంచి బయటకు పోతున్నది, రూపాయల సరఫరా ఎక్కువైనపుడు విలువ పతనం అనివార్యం. ‘ అన్నారు. యుపిఏ హయాంలో రూపాయి విలువ పతనం భయానకం అన్న అరుణ్‌ జైట్లీ ఆర్ధిక మంత్రిగా మాట్లాడుతూ ‘ ప్రపంచలోనే అత్యంత వేగంగా అభివ ద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్ధ గనుక మనం భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు ‘ అన్నారు.
స్వాతంత్య్రం వచ్చినపుడు రూపాయి విలువ 4.16 అంటే సుబ్రమణ్య స్వామి తర్కం ప్రకారం ఆ రోజు నల్లధనం బాగా వున్నట్లు, అది క్రమంగా తగ్గుతూ వున్న కారణంగా 2004లో 45.32కు పడిపోయింది. నల్లధనాన్ని వెలికి తీసే పేరుతో నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు చేసిన ఏడాది విలువ 66.46 అంటే అప్పటికి ఇంకా నల్లధనం తగ్గిపోయింది లేదా బయటకు పోయింది. 2018లో 70.09కి చేరింది. అంటే పెద్ద నోట్ల రద్దు తరువాత నల్లధనం ఇంకా వున్నట్లే, ఇప్పుడు 72రూపాయలకు చేరింది కనుక నోట్ల రద్దు తరువాత నల్లధనం ఇంకా పెరిగినట్లే కదా ! బిజెపి వారు ఎది చెబితే అదే దేశ భక్తి, అదే జాతీయవాదం, అదే ఆర్ధశాస్త్రం. దాన్ని నమ్మిన ఆమోదించిన వారు దేశభక్తులు, కాని వారు దేశద్రోహులు. నాడు బ్రిటీష్‌ వారి ద ష్టిలో భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురు వంటి వారందరూ దేశ ద్రోహులే. ఇప్పుడు బిజెపి చెప్పేదాన్ని అంగీకరించని వారందరూ దేశ ద్రోహులే.
సంవత్సరం -రూపాయి సగటు విలువ

2004 45.32

2005 44.10

2006 45.31

2007 41.35

2008 43.51

2009 48.41

2010 45.73

2011 46.67

2012 53.44

2013 56.57

2014 62.33

2015 62.97

2016 66.46

2017 67.79

2018 70.09
2019 70.31 (జనవరి నుంచి నవంబరు పదవ తేదీ వరకు సగటు విలువ)

నరేంద్రమోడీ నిజం చెప్పినా జనం నమ్మని రోజులు రాబోతున్నాయి. యుపిఏ పదేండ్ల కాలంలో రూపాయి విలువ ఏడాది సగటు 47.04గా వుంది. అదే నరేంద్రమోడీ 2014-19 మధ్య 66.65కు పతనమైంది. రామాలయ సమస్య ఒక కొలిక్కి వచ్చింది కనుక అప్రకటిత కర్ఫ్యూ, ఆంక్షలతో మూతవేసిన కాశ్మీరును ఎప్పుడు తెరుస్తారు, నిరుద్యోగాన్ని కనీసం ఆరేండ్ల స్ధాయికి ఎప్పుడు తగ్గిస్తారు వంటి ప్రశ్నలన్నీ ఎదురు కానున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసు : బిజెపి, మిత్ర పక్షాల వైఖరి ఏమిటి ?

07 Monday Oct 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Intolerance, Narendra Modi, Prime Minister Narendra Modi, sedition case against 49 celebrities

Image result for sedition case against 49 celebrities

ఎం కోటేశ్వరరావు

జై శ్రీరామ్‌, గోరక్షణ తదితర నినాదాల మాటున దేశంలో జరుగుతున్న అసహన, విద్వేషపూరిత, మూక దాడులను నివారించాలని కోరుతూ వివిధ రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు ప్రధాని నరేంద్రమోడీకిి బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ చర్య ద్వారా దేశ ద్రోహానికి పాల్పడ్డారంటూ బీహార్‌లోని ముజఫర్‌ పూర్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి (సిజెఎం) కేసు నమోదుకు జారీ చేసిన ఆదేశాలు మరోసారి ఆ లేఖపై మరో రూపంలో చర్చకు దారి తీశాయి. అసలు దేశ ద్రోహం ఏమిటి అన్న ప్రశ్నను ముందుకు తెచ్చాయి. కోర్టు తీరు తెన్నులపై సామాజిక, సాంప్రదాయ మాధ్యమంలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. (మేథావులూ మీరెటు వైపో తేల్చుకోండి అనే శీర్షికతో 49 మంది మేథావులు, దానికి పోటీగా 62 మంది రాసిన లేఖ గురించిన విశ్లేషణలో చర్చించినందున చర్విత చరణం కాకుండా వుండేందుకు ఆసక్తి కలిగిన వారికోసం లింక్‌ను అందచేస్తున్నాను.https://vedikaa.com/2019/07/27/intellectuals-which-side-are-you-on/)

Image result for sedition case against 49 celebrities: what is the bjp and its allies view ?

కేసును ఆమోదించి ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి , కేసును దాఖలు చేసిన లాయరు ఎలాంటి రాజకీయ అభిప్రాయాలు కలిగివున్నారన్నది ఒక అంశం. విధులలో వున్న న్యాయమూర్తి గనుక ఆయనకు వాటిని ఆపాదించలేము. ఫిర్యాదులోని అంశాలను బట్టి న్యాయవాది సుధీర్‌ కె ఓఝా బిజెపి మద్దతుదారుగా కనిపిస్తున్నది, కాకపోవచ్చు కూడా, ఎందుకంటే సదరు పెద్దమనిషి గత చరిత్రను చూస్తే మీడియాలోనూ, న్యాయవ్యవస్ధలో పేరు కోసం, తన వృత్తి, కక్షిదారులను పెంచుకొనేందుకు వందల కేసులు దాఖలు చేసి ఒక పెద్ద లిటిగెంట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఏ పార్టీ వారిని, ఏ రంగ ప్రముఖులను వదలిపెట్టలేదు. అది ఎప్పటి నుంచో సాగుతోంది. మానసిక సమస్య కూడా కావచ్చు.

ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినవి, కోర్టులలో ప్రజాప్రయోజన వాజ్యాల (పిల్స్‌) దాఖలుకు సంబంధించి కొన్ని సవరణలు లేదా సంస్కరణలు తీసుకురావాల్సి వుంది. న్యాయవాది సుధీర్‌ కె ఓఝా చేసిన ప్రధాన ఆరోపణ 49 మంది ప్రముఖులు రాసిన లేఖ కారణంగా ప్రపంచ వ్యాపితంగా దేశ పరువుకు నష్టం కలిగింది, ప్రభావం కలిగించే ప్రధాని పని తీరును గుర్తించలేదు, దేశద్రోహ ధోరణులను ప్రోత్సహించేదిగా వుంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేదిగా వుంది.

నలభై తొమ్మిది మంది ప్రముఖుల లేఖ అంశాలలో ఎక్కడా పై లక్షణాలు లేవు. ప్రధానికి దేశంలో తలెత్తిన పరిస్ధితి గురించి వినతి మాత్రమే వుంది. ఒక వేళ వున్నాయి అనుకుంటే దానికి పోటీగా రాసిన 62 మంది ప్రముఖుల లేఖతో ఆ నష్టం పూడినట్లే, దేశ పరువు నిలబడినట్లే, ప్రధాని పని తీరు దేశానికి తెలిసింది, దేశద్రోహ ధోరణులకు అడ్డుకట్ట వేసింది కనుక న్యాయవాది దాఖలు చేసిన పిటీషన్‌ను న్యాయమూర్తి కొట్టివేసి వుండాల్సింది. లేదూ మరొక కోణంలో చూస్తే దేశద్రోహ ధోరణులను ప్రోత్సహించేదిగా 49 మంది లేఖ వుందనుకుంటే 62 మంది లేఖకే మీడియాలో ఎక్కువ ప్రచారం వచ్చింది. తొలి లేఖ అంశాలను చూడని వారు అనేక మంది దీన్ని చూసి తెలుసుకున్నారు. అంటే పరోక్షంగా ‘దేశద్రోహాన్ని ప్రోత్సహించే ధోరణులకు ‘ 62 మంది ప్రచారం ఇచ్చి, వ్యాప్తికి దోహదం చేసినట్లే కదా ! కేసు దాఖలు చేసిన వారికి, అంగీకరించిన న్యాయమూర్తి ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారా ? అలాంటి వారి మీద చర్య వుండాలా వద్దా ?

ఈ కేసులో నిర్దిష్టమైన నేరం లేదు. ఆవు వ్యాసం వంటిది. ఆవును పెంచితే అలా జరుగుతుంది, ఇలా లబ్ది కలుగుతుంది అని చెప్పినట్లుగా వుంది తప్ప మరొకటి కాదు. అందువలన కేసు నమోదైంది బీహార్‌లో గనుక దీని పట్ల రాష్ట్ర జెడియు-బిజెపి సంకీర్ణ సర్కార్‌ వైఖరి ఏమిటి ? రాసిన లేఖ కేంద్రానికి కనుక కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పరిగణిస్తోందన్నది స్పష్టం కావాలి. లేఖ రాసిన ప్రముఖులను, లేఖలోని అంశాలను ఈ ప్రభుత్వాలు ఏ విధంగా పరిగణిస్తున్నాయి. దేశ ద్రోహానికి పాల్పడినట్లు అవికూడా భావిస్తే తమ వైఖరి కూడా అదే అని, లేనట్లయితే వారికి వున్న భావప్రకటనా స్వేచ్చను వుపయోగించుకున్నారు, అది దేశద్రోహం కాదని అయినా కోర్టుకు చెప్పాలి. అలాగాక మేము కేసు పెట్టలేదు, దానితో మాకు సంబంధం లేదు, చట్టం తనపని తాను చేసుకుపోతుంది అని చెబితే భావ ప్రకటనా స్వేచ్చను హరించటానికి మద్దతు ఇస్తున్నట్లే లెక్క !

రాజ్యాంగంలో కోర్టుల పరిధులు స్పష్టంగా వున్నాయా ? వుంటే ఈ కేసులో నిందితులుగా వున్న వారు ముజఫర్‌ నగర్‌ జిల్లా వాసులు లేదా బీహార్‌, ఒక రాష్ట్రానికి చెందిన వారు కాదు. ఒక వేళ కుట్రకేసు అయితే అది ఎక్కడ జరిగిందో దాని వివరాలను పోలీసులు దాఖలు చేయాలి. లేఖ రాసిన వారిలో ఒక రైన ఆదూర్‌ గోపాలకృష్ణన్‌ తమ మీద దాఖలైన దేశద్రోహ కేసు వార్త విని ‘ ఈ దేశంలో ఏమి జరుగుతోందో నాకు అర్ధం కావటం లేదు, అలాంటి పిటీషన్‌ను ఒక కోర్టు ఎలా స్వీకరిస్తుంది ? గాడ్సేను పొగిడిన వారు దేశ వ్యతిరేకులుగా కనిపించటం లేదు. గాంధీ చిత్రాలపై కాల్పులు జరిపిన వారు ఎంపీలుగా స్వేచ్చగా తిరుగుతున్నారు. వారిని ఏ కోర్టూ ప్రశ్నించలేదు.” ఈ మాటలు ఒక్క గోపాలకృష్ణన్‌వే కాదు, కాస్త బుర్రవున్న ప్రతివారి మదిలో తలెత్తినవి. అనేక అంశాలను సూమోటోగా తీసుకొని విచారిస్తున్న కోర్టులు ఈ మాటలను పరిగణనలోకి విచారణ తీసుకోవాలని ఎవరైనా కోరుకోవటం తప్పెలా అవుతుంది?

కోర్టులు ఒక నిర్ణయం తీసుకొనే ముందు, అదీ ఇలాంటి అంశాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంది. కోర్టు ఆదేశాల ప్రకారం దాఖలైన కేసు నిందితులలో ఒకరైన ప్రముఖ దర్శకులు శ్యాం బెనెగల్‌ బంగ్లాదేశ్‌తో కలసి నిర్మించబోయే ఒక చిత్ర పధకానికి మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి తన మీద దేశద్రోహం కేసులా, ఏం జరుగుతోందో అర్ధం కావటం లేదు అని శ్యాం బెనెగల్‌ ఆశ్చర్యపోయారు. దేశద్రోహం నేరారోపణ ఎందుకు చేశారో నాకు చిన్నమెత్తు కూడా అర్ధం కాలేదు, అసంగతానికి పరాకాష్ట. దేశంలో భయంతో కూడిన వాతావరణం వుంది, దాన్ని మనం తొలగించాలి. ఆ పని ఎవరు చేయగలరు? ప్రధాన మంత్రి దేశాన్ని నడుపుతున్నారు. అందుకే మేము అయనకు విజ్ఞప్తి చేశాము. మా మీద దాఖలైన కేసుకు సంబంధించి నేను ఎలాంటి చర్య తీసుకోను. నేను ఇక్కడ ఒక సామాన్య పౌరుడిని. పెరుగుతున్న నేరాలను గమనంలోకి తీసుకోవాలని ప్రధాని ముందుకు ఒక సమస్యను తీసుకువచ్చాము. ఆ విధంగా ఆయనకు తెలుస్తుంది. జూలైలో ప్రముఖులు లేఖ రాస్తే అప్పటి నుంచి ఇంతవరకు ప్రధాని కార్యాలయం నుంచి స్పందన లేదు’ అన్నారు. బంగ బంధు ముజిబుర్‌ రహ్మాన్‌ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమాలో ఆయన భాగస్వామి. మరి ఆయన వ్యాఖ్యలకు కోర్టు సమాధానం ఏమిటి ?

ఈ అంశం మీద ఇంకా అనేక స్పందనలు వెలువడ్డాయి. కేసును వెనక్కు తీసుకోవాలని వినతులు వచ్చాయి. స్ధలాభావం రీత్యా ప్రస్తావించటం లేదు. కోర్టుద్వారా కేసు నమోదు చేయటంతో మరోసారి దేశ ప్రధాని, కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల తీరు తెన్నులు మరోసారి మీడియా, జనం నోళ్లలో నానుతున్నాయి. అంతర్జాతీయ ప్రచారం వచ్చింది. అంటే మరోసారి దేశ ప్రతిష్టకు, ప్రధాని పనితీరుకు మచ్చ వచ్చింది కనుక స్పందించిన రాజకీయ పార్టీలు, ప్రముఖులతో పాటు ఇప్పుడు మీడియాను కూడా దేశద్రోహం కేసుల్లో ఇరికిస్తారా ?

న్యాయవాది సుధీర్‌ కె ఓఝా విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు ఒక లిటిగెంట్‌గా కనిపిస్తోంది. అనేక మందిపై గతంలో కేసులు దాఖలు చేశాడు. ఢిల్లీలో దొరికే వుచిత వైద్య లబ్దికోసం జనాలు ఇక్కడికి వాలిపోతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజరీ వాల్‌ అన్నారని, బీహార్‌ నుంచి వచ్చేవారిని వేరు చేసి మాట్లాడారంటూ తాను కేజరీవాల్‌పై కూడా కేసు దాఖలు చేస్తానంటూ ఓఝా తాజాగా ప్రకటించాడు. జాతీయ రాజధాని ఢిల్లీలో అమలు చేస్తున్న వైద్య సౌకర్యాల గురించి సెప్టెంబరు 30న కేజరీవాల్‌ ఒక ప్రకటన చేశారు. దానిలో ‘ ఒక వ్యక్తి బీహార్‌ నుంచి ఐదు వందల రూపాయల టికెట్‌ కొని ఢిల్లీ వస్తాడు. ఇక్కడ లభించే ఐదు లక్షల రూపాయల విలువైన వుచిత చికిత్స తీసుకొని తిరిగి వెళ్లిపోతాడు. పరిస్ధితి అలా వుంది. వారు మన దేశ పౌరులు గనుక అలా జరగటం సంతోషమే, అయితే ఢిల్లీ సామర్ధ్యం పరిమితమే కదా ‘ అని పేర్కొన్నారు. దీనిలో బీహార్‌ అని పేర్కొన్నారు కనుక కేసు వేస్తా అని ఓఝా చెప్పాడు. నిజానికి ఓఝా కేసు దాఖలు చేయాల్సింది బీహార్‌ పాలకుల మీద. వారి నిర్వాకం కారణంగానే అక్కడి జనం ఇతర చోట్లకు పోయి అవమానాల పాలు కావాల్సి వస్తోంది కనుక స్వంత జనానికి వుచిత ఆరోగ్య సదుపాయం కల్పించాలని కేసులు దాఖలు చేస్తే అర్ధం వుంది.

1996లో న్యాయవాదిగా వృత్తి ప్రారంభించినప్పటి నుంచి 745 ప్రజాప్రయోజన వ్యాజ్య కేసులు దాఖలు చేసినట్లు చెప్పుకున్నాడు. వాటిలో ఒకటి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మీద కూడా స్ధానిక కోర్టులో వేసింది వుందట.భారత్‌కు వ్యతిరేకంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తామని ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడటం పరోక్షంగా యుద్దానికి కాలుదువ్వటమే అన్నది అభియోగం.

ఏమిటంటే కాశ్మీరులో హింస, గుజరాత్‌లో కొట్లాటలు, ముంబై వుగ్రముట్టడికి గురైనపుడు నలభై తొమ్మిది మంది ప్రముఖులు ఎందుకు స్పందించలేదని ఓఝా ప్రశ్నించాడు. వారు స్పందించారా లేదా అన్నది పక్కన పెడదాం. ఆ వాదన ప్రకారం అయితే ఆయా సందర్భాలలో స్పందించని యావత్‌ రాతి గుండెల మీద కేసులెందుకు దాఖలు చేయలేదు, వాటిని నివారించటంలో విఫలమైన పాలకులను ఎందుకు బోనెక్కించ లేదు, అనేక అంశాల మీద స్వయంగా స్పందించే కోర్టులు, న్యాయమూర్తులు కూడా స్పందించలేదని కేసులు ఎందుకు వేయలేదు. స్పందించిన అంశం సరైనదా కాదా అన్నది వదలి పెట్టి మిగతా వాటి మీద ఎందుకు స్పందించలేదని ఎదురు దాడి చేయటం అంటే ప్రశ్నించే తత్వాన్ని సహించకపోవటం తప్ప వేరు కాదు. సచిన్‌ టెండూల్కర్‌కు భారత రత్న అవార్డు ఇవ్వటం గురించి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మీద క్రిమినల్‌ కేసు దాఖలు చేశాడు. ఇలా ఎందరి మీదనో కేసులు వేశాడు.

Related image

ఈ సందర్భంగా ఇలాంటి వారి వల్ల కోర్టుల సమయం వృధా అవుతోంది. కేసుల్లో వున్నవారికి చేతి చమురు వదులుతుంది. అందువలన న్యాయవ్యవస్ధలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం కూడా వుంది. తమ పరిధి వెలుపుల వున్న కేసులను కోర్టులు దాఖలు చేసిన సమయంలోనే తోసి పుచ్చి ఎక్కడ దాఖలు చేయాలో ఫిర్యాదుదారుకు దారి చూపాలి. ఏదీ వూరికే రాదు అన్నట్లు తమ సమయాన్ని వృధా చేసినందుకు తగిన ఫీజును అర్జీదారు నుంచి వసూలు చేయాలి. వుదాహరణకు 49 మంది ప్రముఖులు ఒక రాష్ట్రానికి చెందిన వారు కాదు. అలాంటి వారి మీద కేసును ఒక జిల్లా కోర్టు చేపట్టటం అర్ధరహితం. ఇటీవలి కాలంలో ఈ ధోరణి పెరిగిపోతోంది. పని గట్టుకొని ప్రశ్నించే, విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించే గొంతులను అణగదొక్కేందుకు ప్రయత్నం జరుగుతోంది. జనాలకు న్యాయం మరీ దూరంగా వుండకూడదు, ప్రాధమిక సాక్ష్యాలు వున్నాయి అనుకుంటేే స్ధానిక కోర్టుల్లో దాఖలైన వాటిని పై కోర్టులకు నివేదించాలి. లేదూ అంత సీన్‌ లేదనుకుంటే అసలు స్వీకరణ దశలోనే తిరస్కరించాలి. రాజకీయ పరమైన, భావజాలాలకు, విమర్శలకు సంబంధించిన అంశాలను ఏ కోర్టులు విచారించాలో, కేసులను ఎక్కడ దాఖలు చేయాల్లో నిర్దిష్ట నిబంధనలను రూపొందించటం అవసరం. అన్ని ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్నది అదే. తమ పరిధిలో లేని వాటిని వున్నతాధికారులకు పంపినట్లే, కోర్టులు కూడా అలాగే వ్యవహరించినపుడే వాటి పని తీరు మెరుగుపడుతుంది. దుర్వినియోగమూ తగ్గుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం- ఆర్ధిక నిందితులకు రాజకీయ ఆశ్రయం !

06 Sunday Oct 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Adani, Ambani, Ambani and Adani, crony capitalism in India, India crony capitalism, Narendra Modi

Image result for political patronage  for economic offenders, india

(ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం- ఆర్ధిక నేరస్ధులకు అవధుల్లేని అవకాశాలు ! విశ్లేషణ ముగింపు రెండవ భాగం)

ఎం కోటేశ్వరరావు

ఆర్ధిక నేరగాళ్ల గురించి కూడా మన దేశంలో రాజకీయాలు చేయటం ఒక విషాదం. ఒక పార్టీలో వుంటూ ఆర్ధిక నేరాల ఆరోపణలను ఎదుర్కొన్నవారు మరో పార్టీలో చేరగానే పునీతులౌతున్నారు. కేసులు మరుగునపడుతున్నాయి. దీనికి ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం తప్ప మరొక కారణం కనిపించటం లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ 17న ఎకనమిక్‌ టైమ్స్‌లో ఒక వార్త వచ్చింది. గత మూడు సంవత్సరాలలో మహారాష్ట్రలో ఆర్ధిక నేరాలకు పాల్పడిన వారి వివరాల గురించి సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన వివరాలను ఆ పత్రిక ఇచ్చింది. నూట ఎనభైకి పైగా కేసులు రాగా ఆర్ధిక నేరాల ముంబై పోలీసు విభాగం చేపట్టింది రెండు మాత్రమే. ఈ కేసులలో రూ. 19,317 కోట్ల మేరకు దుర్వినియోగం జరిగినట్లు అంచనా లేదా అనుమానం కాగా స్వాధీనం చేసుకున్న సొమ్ము రెండున్నర కోట్ల రూపాయలు మాత్రమే. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ వార్షిక నివేదిక ప్రకారం తీవ్ర అక్రమాల దర్యాప్తు కార్యాలయం(సిఎఫ్‌ఐఓ)కు 2017 డిసెంబరు నుంచి 2018 నవంబరు వరకు 33 కేసులను దర్యాప్తు చేయాలని ఆదేశించగా కేవలం ఐదు మాత్రమే పూర్తయ్యాయి. కొన్ని కేసులలో మూడు లేదా నాలుగు సంస్ధలు చేపడుతున్నందున సమయంతో పాటు డబ్బు వ ధా అవుతోంది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కేసును మూడు సంస్ధలు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును ముంచిన నీరవ్‌ మోడీ కేసును మూడు సంస్ధలు దర్యాప్తు చేస్తున్నాయి. భూషణ్‌ స్టీల్స్‌ అక్రమాల కేసులో ఎండీ నీరజ్‌ సింగాల్‌ అరెస్టును ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దర్యాప్తు సంస్ధ అనుసరించిన పద్దతుల్లో లోపాలు, ఇతర కొన్ని అక్రమాలు దీనికి కారణం.

2015 నేషనల్‌ క్రైమ్‌ రికార్డుల బ్యూరో సమాచారం ప్రకారం అంతకు ముందు పది సంవత్సరాలలో ఆర్ధిక నేరాలు రెట్టింపైనట్లు వెల్లడైంది.2006లో ప్రతి లక్ష మందికి 6.6 నమోదు కాగా 2015 నాటికి 11.9కి పెరిగాయి. రాజస్ధాన్‌లో 17.42 నుంచి 37.4కు, అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 12.01 వుంటే తెలంగాణాలో 24.6 నమోదయ్యాయి.ఆర్ధిక నేరాల పెరుగుదల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద, సులభతర వాణిజ్యం మీద ప్రతికూల ప్రభావం కలిగిస్తుందని అనేక మంది చెబుతున్నారు. అయితే లావాదేవీలు పెరిగినందున దానికి అనుగుణ్యంగానే నేరాలు కూడా పెరిగాయన్నది కొందరి అభిప్రాయం.ప్రతి స్ధాయిలో డబ్బు అందుబాటులో వుండటం నేరాల పెరుగుదలకు కారణం అని న్యాయవాదులు అంటున్నారు.

గత ఐదు సంవత్సరాలలో దేశం నుంచి 27 మంది ఆర్ధిక నేరగాండ్లు దేశం విడిచి పోయారని 2019 జనవరి నాలుగున కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్‌ శుక్లా లోక్‌సభకు ఒక రాతపూర్వక సమాధానంలో చెప్పారు. వీరిలో 20 మంది మీద రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను కోరగా ఎనిమిది మీద నోటీసులు జారీ అయినట్లు తెలిపారు. 2018 జూలై 25వ తేదీన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వికె సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం 2015 నుంచి ఆరుగురు మహిళలతో సహా 28 మంది ఆర్ధిక అవకతవకలు, నేరాలకు సంబంధించి చట్టపరమైన చర్యలను ప్రారంభించామని, వారంతా విదేశాల్లో వున్నట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు.

2018 మార్చి 23న ప్రభుత్వం రాజ్యసభకు తెలిపిన సమాచారం ప్రకారం నేరగాండ్ల అప్పగింతకు అప్పటి వరకు 48దేశాలతో ఒప్పందాలు, మరో మూడు దేశాలతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది. సిబిఐ 23, ఇడి 13 కేసులను దర్యాప్తు చేస్తుండగా విజయ మాల్య, మెహుల్‌ చోక్సి, నీరవ్‌ మోడీ, జతిన్‌ మెహతా, ఆషిష్‌ జోబన్‌ పుత్ర, చేతన్‌ జయంతిలాల్‌ సందేశరా, నితిన్‌ జయంతి లాల్‌ సందేశరా, దీప్తిబెన్‌ చేతన్‌ కుమార్‌ సందేశారా రెండు సంస్ధల దర్యాప్తులో నిందితులుగా వున్నారు. ఆర్ధిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారి జాబితాలో దిగువ పేర్లు వున్నాయి.

పుష్ప బైద్‌, అషిష్‌ జీబన్‌ పుత్ర, ప్రీతి అషిష్‌ జీబన్‌ పుత్ర, విజయమాల్య, సన్నీ కల్రా,సంజరు కల్రా, సుధీర్‌ కుమార్‌ కల్రా, ఆరతి కల్రా, వర్ష కల్రా, జతిన్‌ మెహతా, వుమేష్‌ పరేఖ్‌, కమలేష్‌ పరేఖ్‌, నిలేష్‌ పరేఖ్‌, ఏకలవ్య గార్గ్‌, వినరు మిట్టల్‌,చేతన్‌ జయంతిలాల్‌ సందేశరా, నితిన్‌ జయంతి లాల్‌ సందేశరా, దీప్తిబెన్‌ చేతన్‌ కుమార్‌ సందేశరా, నీరవ్‌ మోడీ, నీషాల్‌ మోడీ, సబయ సేథ్‌, రాజీవ్‌ గోయల్‌, అల్కా గోయల్‌, లలిత్‌ మోడీ, రితేష్‌ జైన్‌, హితేష్‌ నరేంద్రభారు పటేల్‌, మయూరీ బెన్‌ పటేల్‌.

గత ఐదు సంవత్సరాలలో విదేశాలకు పారిపోయిన ఆర్ధిక, ఇతర నేరగాండ్లు పద్దెనిమిది మందిని కేంద్ర ప్రభుత్వం దేశానికి రప్పించింది.1. అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలు కేసులో రాజీవ్‌ సక్సేనా(యుఏయి నుంచి)తో పాటు లాబీయిస్టు దీపక్‌ తల్వార్‌, ఇదే కేసులో మధ్యవర్తి పాత్ర వహించిన బ్రిటీష్‌ జాతీయుడు క్రిస్టియన్‌ మిచెల్‌, 2. మోసం, ఫోర్జరీ, నేరపూరిత కేసులలో ఇండోనేషియా నుంచి మహమ్మద్‌ యాహ్యా, అక్కడి నుంచే ఇదే కేసులలో వినరు మిట్టల్‌, 3. యుఏయి నుంచి వుగ్రవాద కార్యకలాపాల కేసులో మన్సూర్‌ లేదా ఫరూక్‌ టక్లా, 4. బ్యాంకు అక్రమాల కేసులో రుమేనియా జాతీయుడు ఎంఎం ఫరూక్‌ యాసిన్‌ను నికరాగువా నుంచి, 5. వుద్యోగాల పేరుతో టోకరా కేసులో అబూబకర్‌ కదిర్‌ లోనట్‌ అలెగ్జాండ్రును సింగపూర్‌ నుంచి,6. హత్య కేసులో బంగ్లాదేశ్‌ నుంచి అబ్దుల్‌ రౌత్‌ మర్చంట్‌ మహమ్మద్‌ సుల్తాన్‌, 7. హత్యాయత్నం కేసులో సింగపూర్‌ నుంచి కుమార్‌ క ష్ణ పిళ్లె, 8.భారత్‌కు వ్యతిరేకంగా వుగ్రవాద కేసులో యుఏయి నుంచి అబ్దుల్‌ వాహిద్‌ సిద్ది బాపాను, 9.హత్యాయత్నం కేసులో మారిషస్‌ నుంచి కళ్లం గంగిరెడ్డి, 10. వుగ్రవాద కేసులో అనూప్‌ చెటియా నుంచి బంగ్లాదేశ్‌ నుంచి, కిడ్నాప్‌, హత్య కేసుల్లో ఇండోనేషియా నుంచి చోటా రాజన్‌,11. హత్య కేసులో మొరాకో నుంచి బన్నాజే రాజా, 12. హత్య కేసులో థారులాండ్‌ నుంచి జగతార్‌ సింగ్‌ను మన దేశానికి రప్పించారు.

వీరుగాక ఆర్ధిక నేరాలకు పాల్పడిన మరికొందరిని దేశం విడిచి పోకుండా చూడాలని కార్పొరేట్‌ మంత్రిత్వ వ్యవహారాల శాఖ 20 మంది పేర్లతో ఒక జాబితాను తయారు చేసి ఐబికి అదచేసింది. వారిలో జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌, అనిత గోయల్‌, దీపక్‌ కొచార్‌, వీడియోకాన్‌ ఎండీ వేణుగోపాల్‌ ధూత్‌ తదితరుల పేర్లు వున్నట్లు వెల్లడైంది. నరేష్‌ గోయల్‌, అనితా గోయల్‌ దుబారు మీదుగా లండన్‌ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ముంబ్‌ విమానాశ్రయంలో వారిని నిలిపివేసిన విషయం తెలిసిందే.

ఆర్ధిక నేరాలకు పాల్పడి దేశం వదలి పారిపోయే వారి గురించి విచారణకు వున్న చట్టాలు పటిష్టంగా లేనందున కొత్తగా 2018లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్నే చేయాల్సి వచ్చింది. విజయ మల్య అనే పెద్ద మనిషి 18-20 సంచులు తీసుకొని పారిపోతుంటే నిఘాసంస్ధల సిబ్బంది విమానాశ్రయంలో గుడ్లప్పగించి చూశారు. ఆయన కదలికల మీద కన్నేసి వుండమన్నారు తప్ప అరెస్టు చేయాలనే ఆదేశాలు లేవని వారు చెప్పిన విషయం తెలిసిందే. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును ముంచిన నీరవ్‌ మోడీ విషయంలో కూడా అదే జరిగింది. కొత్త చట్టం ప్రకారం వంద కోట్ల రూపాయలకు పైబడి అక్రమాలకు పాల్పడి పారిపోయిన వారిని ఒక ప్రత్యేక కోర్టులో విచారిస్తారు. విచారణ సమయంలో నిందితుల ఆస్ధులను స్వాధీనం చేసుకోవచ్చు. పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా మాట్లాడిన సభ్యులు దాదాపు రెండులక్షల నలభైవేల కోట్ల రూపాయల మేరకు అక్రమాలకు పాల్పడినట్లు,పారిపోయిన నిందితులు 39 అని చెప్పారు.గతేడాది పార్లమెంట్‌కు ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం 31 మంది దేశం వదలి పారిపోయారు. అలాంటి నిందితులను మనకు అప్పగించటానికి వీలుగా కేవలం 57దేశాలతో మాత్రమే ఒప్పందాలున్నాయి. అనేక మంది నిందితులు అవి లేని దేశాలకు పారిపోయారు.

ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధ సజావుగా వుందా లేక ఇబ్బందుల్లో వుందా అన చెప్పటానికి బ్యాంకుల్లో పేరుకు పోతున్న నిరర్ధక ఆస్ధులు ఒక సూచిక. మన దేశంలో ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు పెరుగుతున్నాయి. ఏటా లక్షల కోట్ల రూపాయల బకాయిలను పారు బాకీలుగా పక్కన పెడుతున్నారు. వాటిని వసూలు చేస్తామని మరోవైపు చెబుతుంటారు. అలాంటి బాకీలను పరిష్కరించుకోవటంలో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. 2019 మార్చి నాటికి 8.06లక్షల కోట్ల రూపాయల నిరర్ధక ఆస్తులున్నాయి. మూడు నెలల గడువు తీరినా కనీస మొత్తం చెల్లించని వాటిని, రుణం తీర్చటం కోసం రుణం తీసుకున్న మొత్తాలను నిరర్ధక ఆస్ధులుగా పరిగణిస్తున్నారు. గతంలో వాటిని రావాల్సిన బకాయిలుగా చూపే వారు. ఇప్పుడు ప్రతి ఏటా రద్దు చేసిన వాటిని మినహాయించి చూపుతూ నిరర్ధక ఆస్ధుల మొత్తం తగ్గుతున్నట్లు చిత్రిస్తున్నారు. అలా చేయకపోతే బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టేవారు ముందుకు రావటం లేదు.ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ అందించిన సమాచారం ప్రకారం 2018 ఆర్ధిక సంవత్సరంలో 1.28లక్షల కోట్లు,2019లో 1.77లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్ధక ఆస్ధులను రద్దు చేశారు. ఈ చర్యలు ఆర్ధిక నేరస్ధులను ఆదుకోవటం కాదా ?

Image result for India crony capitalism cartoons

ప్రతి ఆర్ధిక విధానంలోనూ లబ్ది పొందేవారు వుంటారు. పాతికేండ్ల సంస్కరణల ఫలితాల గురించి ఆర్ధిక వ్యవహారాల ప్రముఖ జర్నలిస్టు స్వామినాధన్‌ ఎస్‌ అంక్లేసరియా అయ్యర్‌ 2016లో రాసిన విశ్లేషణను కాటో సంస్ధ ప్రచురించింది. దానిలో వున్న అంశాలతో ఏకీభవించటం లేదా విబేధించటం వేరే విషయం. ఆర్ధిక నేరాలు అనే ఈ విశ్లేషణతో ముడిపడిన దానిలోని కొన్ని అంశాల సారం ఇలా వుంది.

Image result for India crony capitalism: political patronage

” 1991 తరువాత అంతకు ముందు రాజకీయ సంబంధాలున్న కొన్ని కుటుంబాల ప్రాబల్యం అంతరించి కొత్తవారు ఎదిగారు. కొత్తగా వాణిజ్య రంగంలోకి వచ్చిన(ముఖ్యంగా రియలెస్టేట్‌, మౌలిక సదుపాయాల రంగం) వారిని ఆశ్రిత పెట్టుబడిదారులు అని పిలిచారు. వారికి బలమైన రాజకీయ సంబంధాలు తప్పనిసరిగా వుంటాయి. వారింకా సురక్షితమైన గుత్త సంస్ధలుగా మారలేదు, వాటిలో అనేక మంది(డిఎల్‌ఎఫ్‌, యూనిటెక్‌, లాంకో, ఐవిఆర్‌సిఎల్‌) దారుణంగా విఫలమయ్యారు. భారత్‌లో లంచాలను రాజకీయ నేతల బలవంతపు వసూలు అని పిలుస్తారు, ఎందుకంటే లంచాలు కొన్ని సందర్భాలలో అనిశ్చితంగానూ కొన్ని సార్లు ప్రతికూల ఆపదగా వుంటాయి. ఆర్ధిక సరళీకరణ మరియు పోటీ కొన్ని సందర్భాలలో పేరుగాంచిన పాత కంపెనీలను దివాలా తీయించాయి.(హిందుస్ధాన్‌ మోటార్స్‌, ప్రీమియర్‌ ఆటోమొబైల్స్‌, జెకె సింథటిక్స్‌, డిసిఎం) తీవ్రమైన పోటీని తగినంత సౌష్టవంగా వుంటేనే మనుగడ సాగించగలవని సూచించాయి.1991లో సెన్సెక్స్‌లో వున్న 30 కంపెనీలలో రెండు దశాబ్దాల తరువాత కేవలం తొమ్మిదే మిగిలాయి.కొత్త కంపెనీల గురించి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘ ఈ కంపెనీలు ధనికుల సంతానం కాదు, సరళీకరణ సంతానం ‘ అన్నారు. గత పాతికేండ్లలో పాతపద్దతిలోని లైసన్సులు, అదుపులు రద్దయ్యాయిగానీ కొత్తవి, అధికార యంత్రాంగపు ఆటంకాలు వచ్చాయి. పర్యావరణం, అడవులు, గిరిజన హక్కులు, భూమి, కొత్త అవకాశాలైన చిల్లరవర్తకం, టెలికాం, ఇంటర్నెట్‌ సంబంధిత కార్యకలాపాల్లో వీటిని చూడవచ్చు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తగినంతగా సరళీకరించటంలో ఘోరంగా విఫలమయ్యాయి. దాంతో వాణిజ్య, పారిశ్రామికవేత్తలు అవినీతి, ఫైళ్లను పక్కన పడేయటం గురించి తీవ్రంగా ఫిర్యాదులు చేస్తున్నారు.

భారత్‌లో నేరగాండ్లు రాజకీయాల్లో భాగస్వాములౌతున్నారు, తరచుగా కాబినెట్‌ మంత్రులు అవుతున్నారు.దీంతో వారి మీద వున్న ఆరోపణలను పరిశీలించకుండా చేసుకోగలుగుతున్నారు. ఏడిఆర్‌ విశ్లేషణ ప్రకారం 2014లో ఎన్నికైన 543 మంది లోక్‌సభ సభ్యులలో 186 మంది మీద నేరపూరిత కేసులు పెండింగ్‌లో వున్నాయి. 2009లో ఎన్నికైన వారిలో 158 మంది మీద వున్నాయి. 2014లో ఎన్నికైన వారిలో 112 మంది మీద హత్య, కిడ్నాప్‌, మహిళల మీద నేరాల వంటి తీవ్ర కేసులు వున్నాయి. ఏ పార్టీ కూడా పరిశుద్దంగా లేదు. అన్ని పార్టీల్లో నేరగాండ్లు పుష్కలంగా వున్నారు. అలాంటి వారు ప్రతిపార్టీకి డబ్బు,కండబలం, ప్రాపకాలను సమకూర్చుతారు.

 

Image result for India crony capitalism cartoons

దేశాల్లో జిడిపితో పాటు అవినీతి పెరుగుతోంది. భారత గత పాతిక సంవత్సరాల అనుభవం దీనికి మినహాయింపు కాదు. వ్యభిచార కేంద్రాన్ని నిర్వహించే ఒక మహిళ ప్రచారంలో పెట్టిన ఫొటోల కారణంగా సెక్స్‌ కుంభకోణంలో ఒక రాష్ట్ర గవర్నర్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. నగంగా వున్న ముగ్గురు యువతులు ఆ గవర్నర్‌తో వున్నారు. వ్యభిచార కేంద్ర నిర్వాహకురాలికి ఒక గని అనుమతి ఇప్పిస్తానన్న వాగ్దానాన్ని గవర్నర్‌ నిలబెట్టుకోలేకపోయాడు. ప్రతీకారంగా ఆమె ఫొటోలను బయటపెట్టింది.మొదట వచ్చిన వారికి తొలి కేటాయింపు( వాస్తవానికి గడువు గురించి ముందుగానే స్నేహితులకు తెలియచేసి లబ్ది చేకూర్చారు) పద్దతిలో స్పెక్ట్రమ్‌ కేటాయింపుల వలన ఖజానాకు 1.76లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని, వేలం వేయకుండా మంత్రిత్వశాఖ విచక్షణతో బొగ్గు గనులు కేటాయించిన కారణంగా 1.86లక్షల కోట్ల నష్టం వచ్చిందని కాగ్‌ నివేదిక పేర్కొన్నది. ఆర్ధిక సంస్కరణలు పెద్ద ఎత్తున అవినీతికి ఆస్కారమిచ్చాయని విమర్శకులు అంటారు. సమగ్రంగా సరళీకరణ గావించిన రంగాలలో అవినీతి అద శ్యమైంది. 1991కి ముందు పారిశ్రామిక, దిగుమతి లైసన్సులు, విదేశీమారకద్య్రవ్య కేటాయింపులు, రుణాల వంటి వాటికి లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. సంస్కరణల తరువాత అవన్నీ సులభంగా లభ్యమౌతున్నాయి. పన్నుల తగ్గింపు కారణంగా స్మగ్లింగ్‌ దాదాపు అంతమైంది. అయితే అన్ని సహజవనరుల, టెలి కమ్యూనికేషన్స్‌ స్ప్రెక్ట్రమ్‌ విలువలను భారీగా పెంచిన కారణంగా వాటి కేటాయింపుల్లో ముడుపులకు అవకాశం కలిగింది. గతంలో ప్రభుత్వ రంగానికి మాత్రమే కేటాయించబడిన రంగాలలో ప్రయివేటు రంగ భాగస్వామ్యానికి తెరిచారు. ప్రభుత్వ-ప్రయివేటు రంగ భాగస్వామ్యం తరచుగా ఆశ్రిత పెట్టుబడిదారుల కారణంగా నష్టం కలిగిస్తోంది. సరళీకరణ తరువాత అనేక రంగాల్లో అవినీతి పోయిందని అయితే కొన్నింటిలో ఎక్కడైతే ఎక్కువగా నియంత్రణలు, అవినీతి ఎక్కువగా వుంటాయో సహజవనరులు, రియలెస్టేట్‌ రంగాల్లో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో అవినీతి మరింత పెరిగింది. ఇటీవలి కాలంలో కొన్ని రంగాలలోని విస్త త అవినీతి పూర్తిగా సరళీకరించిన రంగాల్లో మెరుగుదలను మరుగున పడవేస్తున్నది.” నయా వుదారవాద లేదా సరళీకరణ విధానాలను పూర్తిగా సమర్ధించే అంక్లేసరియా అయ్యర్‌ వంటి వారే అవినీతి గురించి చెప్పకతప్పలేదు. అందరికీ కనిపిస్తున్న అవినీతి సమర్ధకులకు ఒక పట్టాన కనిపించదు. సరళీకరణ విధానం అంటే ప్రజల సంపదను కొంత మందికి కట్టబెట్టటం. ఈ క్రమంలో రాజకీయ-వ్యాపారవేత్తలు లేదా కలగలసిన వారు ప్రజాధనంతో నడిచే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటం, ఎగవేయటం అనే అక్రమాలు సర్వసాధారణంగా మారాయి. తెల్లవారే సరికి ధనవంతుడి వయ్యావా లేదా అన్నదే గీటు రాయి, ఎలా అయ్యారన్నది అనవసరం అన్న విలువలే నేడు సమాజాన్ని నడిపిస్తున్నాయి. అలాంటపుడు అక్రమాలకు కొదవేముంటుంది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం- ఆర్ధిక నేరస్ధులకు అవధుల్లేని అవకాశాలు !

06 Sunday Oct 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

crony capitalism, crony capitalism BJP, crony capitalism in India, crony capitalism INC

Image result for crony capitalism in indiaమొదటి భాగం

ఎం కోటేశ్వరరావు

లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్నది పాత సామెత. లాభం వుంటేనే రాజకీయనేతలు, వ్యాపారులు కూడా వరద, కరవు ప్రాంతాలకు పోతారు అన్నది సరికొత్త నానుడి. ప్రస్తుతం లాభం, వ్యాపారం, రాజకీయాలను, వాటికోసం పని చేసే వారిని విడదీసి చూడలేని స్ధితి. తొలి పార్లమెంట్‌లో లక్షాధికారులైన ఎంపీలు ఎందరున్నారు అని వెతకటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు కోట్లకు పడగలెత్తని, వ్యాపారులు కాని ఎంపీలు ఎందరున్నారు అని తెలుసుకొనేందుకు బూతద్దాలతో చూడాల్సి వస్తోంది.
రాజకీయం-వ్యాపారానికి వున్న సంబంధాలను మన దేశంలో రెండుగా చూడాల్సి వుంది. ఇది పరాయి దేశాల వలసలుగా, అక్రమణలుగా మారిన అన్ని దేశాలలో పూసల్లో దారంలా కనిపిస్తుందని చెప్పవచ్చు. స్వాతంత్య్రానికి ముందు పరాయి పాలకులను పారద్రోలేందుకు సమాజంలోని పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో సహా అన్ని తరగతుల వారూ పాల్గొన్నారు. ఏ తరగతి అజెండా వారికి వున్నప్పటికీ వాటిని ముందుకు తీసుకుపోవాలంటే పరాయిపాలకులు ఆటంకంగా వున్నారన్న ఏకైక కారణమే వారిని ఒక వేదిక మీదకు తెచ్చింది. అందువల్లనే జాతీయ వాదంలో రెండు పార్శ్వాలున్నాయి. ఒకటి దోపిడీకి గురయ్యే కష్టజీవులు తాము దోపిడీ నుంచి విముక్తి కావాలని కోరుకున్నారు. రెండవది స్వదేశీ పారిశ్రామిక, వాణిజ్య శక్తులు బలపడి తాము స్వంతంగా వ్యవహరించగలం అనుకున్న తరువాత విదేశీ కంపెనీలతో పోటీకి వ్యతిరేకంగా జాతీయవాదాన్ని ముందుకు తేవటం. స్వాతంత్య్రం రాకముందు మన దేశంలో బ్రిటీష్‌ కంపెనీల ప్రయోజనాలకు పెద్దపీట వేసే విధంగా అక్కడి పెట్టుబడిదారులు విధానాలను నిర్దేశించారు. తరువాత మన దేశంలో పెట్టుబడిదారులు, ఫ్యూడల్‌ వ్యవస్ధ ఇంకా బలంగా వున్న వున్నందున పెట్టుబడిదారులు, భూస్వామ్య తరగతులను కలుపుకొని తమ అజెండాను అమలు జరిపారు. తమ పెట్టుబడులు, వ్యాపారాలకు పోటీ రాకుండా చూసేందుకు అప్పటికే ఒక స్ధాయికి చేరిన వారు లైసన్స్‌ పద్దతిని ముందుకు తీసుకు వచ్చారు. భూస్వాముల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఆ వ్యవస్ధను కాపాడేందుకు చేయాల్సిందంతా చేశారు. భూ సంస్కరణల చట్టాలను ఆలశ్యం చేయటం, చేసిన వాటిని నీరుగార్చటం దానిలో భాగమే.
స్వాతంత్య్రం తరువాత ఎవరైనా పరిశ్రమలు, వ్యాపారాలను ఏర్పాటు చేయాలంటే లైసన్సులు అవసరం. వాటికోసం పారిశ్రామిక, వ్యాపారవేత్తలు అధికారంలో వున్న రాజకీయ నేతలను ఆశ్రయించటంతో అవినీతి ప్రారంభమైంది. తమ పనులు జరిపించుకొనేందుకు కొందరు రాజకీయనేతలను లాబీయిస్టులుగా మార్చుకోవటం లేదా అలాంటి వారిని రాజకీయాల్లోకి ప్రోత్సహించి నిధులిచ్చి గెలిపించుకోవటం చేసే వారు. 1991కి ముందే వ్యాపారులు రాజకీయ ప్రవేశం చేయటం, రాజకీయాల్లో వున్న వారు వ్యాపారాల్లో ప్రవేశించటం ప్రారంభమైనా ఆ తరువాత అది మరింత వేగం పుంజుకుంది. నూతన ఆర్ధిక విధానాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్మటం, పారిశ్రామిక, వాణిజ్య, సేవా రంగాల నుంచి ప్రభుత్వం వైదొలగాలనే విధానపర నిర్ణయాల తరువాత అది జనానికి మరింత స్పష్టంగా కనిపించింది. దాన్నే నీకది, నాకిది అని అందరూ కుమ్మక్కై పంచుకోవటంగా చూస్తున్నాము. ఇది వాటంగా వున్న తరువాత పార్టీలు లేవు, సిద్ధాంతాలు లేవు. బెల్లం ఎక్కడ వుంటే అక్కడకు చీమలు చేరినట్లు ఎక్కడ అధికారం వుంటే అక్కడకు చేరటం, దానికి కార్యకర్తల అభీష్టమనో, నియోజకవర్గ అభివృద్ధి అనో చెప్పే వారు. ఇప్పుడు వాటి జాబితాలోకి దేశ ప్రయోజనాల కోసం అని కొత్త పదాన్ని చేర్చారు. కమ్యూనిస్టు పార్టీలు తప్ప మిగిలిన పార్టీలు వేటికీ అంటూ సొంటూ, నీతి, అవినీతి తేడా లేదు.

Image result for crony capitalism in india
సంపదలను పోగేసుకొనేందుకు ఎంతకైనా తెగించే వ్యాపారులు, రాజకీయవేత్తలు, వారికి సహకరించే వున్నత అధికారగణం ఒక దగ్గర చేరినపుడు నీకిది, నాకది, వారికది అని పంచుకుంటారు. దీన్నే క్రోనీ కాపిటలిజం లేదా ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అంటున్నాము. మీడియా రంగంలో సైతం ఏ పత్రిక, ఏ ఛానల్‌ చరిత్ర చూసినా ఏమున్నది కొత్తదనం, సమస్తం వ్యాపారమయం అన్నట్లుగా ఇలాంటి వ్యాపార-రాజకీయవేత్తలు వాటి వెనుక వుంటారు. వార్తలను అందించి జనానికి సేవ చేద్దామని కాదు, అది కూడా తమ రాజకీయ లాభం కోసమే అన్నది తెలిసిందే. గత ప్రభుత్వం తమ ఆశ్రితులకు బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్ధల నుంచి అపరిమితంగా రుణాలిప్పించి అక్రమాలకు పాల్పడిందన్నది ప్రస్తుత పాలకుల తీవ్ర ఆరోపణ. చిత్రం ఏమిటంటే అలాంటి అక్రమార్కుల మీద ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి అన్నది అంతగా ఎవరూ అడగటం లేదు. గతంలో వారు ఇచ్చిన రుణాలలో లక్షల కోట్లను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తున్నది.

ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం దేశం మీద ఎలా ప్రభావం చూపుతుందో రిజర్వుబ్యాంకు గవర్నర్‌గా పని చేస్తున్న సమయంలో 2014 ఆగస్టు 11న లలిత్‌ దోషి స్మారక వుపన్యాసంలో రఘురామ్‌ రాజన్‌ హెచ్చరించారు. దీని వుచ్చునుంచి బయట పడాలంటే పౌర సేవలను పటిష్టం చేయటం ఒక మార్గం అన్నారు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం పారదర్శకత, పోటీని దెబ్బతీసి చివరకు ఆర్ధిక పురోగతిని మందగింప చేస్తుందని అన్నారు.(అంటే లైసన్స్‌ రాజ్యాన్ని మరోరూపంలో ముందుకు తెస్తుంది) ” వుపాధి, పౌర సేవలను పొందేందుకు పేదలు, నోరు లేని వారికి రాజకీయ నేతల అవసరం వుంది. కుటిల రాజకీయవేత్తకు అందుకు గాను నిధులు, ఇతర అవసరాల కోసం వాణిజ్యవేత్తల ప్రాపకం అవసరం. అవినీతి పరులైన వాణిజ్యవేత్తలు పౌర వనరులు, కాంట్రాక్టులను చౌకగా పొందాలంటే కుటిల రాజకీయవేత్తల మద్దతు అవసరం. రాజకీయవేత్తలకు పేదలు, నోరులేని వారి ఓట్లు అవసరం. ఇలా ప్రతి ఒక్కరూ ఇతరుల మీద ఆధారపడే బంధంతో ఒక వలయంలో వున్నారు. అది యథాతధ స్ధితిని పటిష్టపరుస్తుంది….ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం రాజ్యాధికారం గల కొందరు ధనిక పెద్దలను సృష్టిస్తుంది, అది అభివృద్ధిని మందగింప చేస్తుంది” అన్నారు.

Image result for crony capitalism in india

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇతర అవసరాలకు మళ్లించి తిరిగి చెల్లించగల శక్తి వుండి కూడా ఎగవేసే వారిని బుద్ది పూర్వక ఎగవేతదారులు అంటున్నాము. 2015 మార్చి నెల నుంచి 2019 మార్చినెలతో ముగిసిన ఆర్ధిక సంవత్సరం వరకు బుద్ధి పూర్వకంగా రుణాలు ఎగవేసిన వారి సంఖ్య 5,349 నుంచి 8,582కు పెరిగిందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జూన్‌ 25న లోక్‌సభకు రాతపూర్వక సమాధానంలో చెప్పారు. అంటే ఐదేండ్లలో 60శాతం పెరిగారు. వీరిలో 6,251కేసులలో తనఖా వున్న ఆస్ధుల మీద చర్యలు ప్రారంభించారు, 8,121కేసులలో రుణ వసూలు దావాలు వేశారు, 2,915 కేసులలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎగవేసిన వారి నుంచి 7,600 కోట్ల రూపాయలను వసూలు చేశారు. బ్యాంకులకు ఇలాంటి బాపతు చెల్లించాల్సిన సొమ్మునే నిరర్ధక ఆస్తులంటున్నాము. ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఆ మొత్తం 8.06లక్షల కోట్ల రూపాయలు. 2016-19 ఆర్ధిక సంవత్సరాల మధ్య బ్యాంకులు వసూలు చేసిన సొమ్ము 3.59లక్షల కోట్లు పోను ఇంకా రావాల్సింది పైన పేర్కొన్న మొత్తం. యాభై కోట్ల రూపాయలు, అంతకు మించి రుణాలు తీసుకొని ఎగవేసిన వారి ఫొటోలను బ్యాంకుల్లో ప్రదర్శించాలని(పోలీస్‌ స్టేషన్లలో పాత నేరస్దులు, కేడీ గాండ్ల మాదిరి) ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులను కోరింది. వారి కోసం గాలింపునకు నోటీసులు జారీ చేయాలని కూడా కోరింది. వారి పాస్‌పోర్టుల సర్టిఫైడ్‌ కాపీలను సంపాదించాలని సూచించింది.

Image result for crony capitalism in india

సాధారణ పెట్టుబడిదారీ విధానంలో పరిశ్రమలు, వ్యాపారం వర్ధిల్లాలి అంటే నష్టభయం వుంటుంది. కానీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంలో లాభాలను ఎలా సంపాదించాలో వ్యాపారులు-అధికారంలో వున్న రాజకీయవేత్తలు, వారికి సహకరించే వున్నతాధికారులు కుమ్మక్కై ముందుగానే నిర్ధారించుకొని అందుకు అనుగుణ్యం పావులు కదుపుతారు. దీనిలో మరొకరితో పోటీ వుండదు. కావాల్సిన అనుమతులు, ప్రభుత్వ నిధులు, పన్నుల రాయితీలు ఇతర అన్ని రకాల సౌకర్యాలను అధికారంలో వున్న పెద్దలు సమకూర్చుతారు. దానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఇలాంటి వారు మన కళ్ల ముందే అనూహ్యంగా అపార సంపదలను పోగేసుకుంటారు. దీనికి అనువైన అవకాశాలను నయావుదారవాద విధానాలు కల్పించాయి. తెలంగాణాలో ప్రాజక్టుల రీ డిజైనింగ్‌ పేరుతో చేసిన పనుల మీద తలెత్తిన అవినీతి ఆరోపణలు, ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు పనుల అప్పగింత, టెండర్ల విధానం. రెండు చోట్లా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల వివాదాలు వీటి పర్యవసానమే.
మిలిటరీ, సరిహద్దులు, కరెన్సీ, పోలీసుల వంటి విభాగాలు మినహా మిగిలిన అన్ని రంగాల నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలి, ప్రయివేటు రంగానికి, విదేశీ కంపెనీలకు గేట్లు బార్లా తెరవాలని సంస్కరణల పేరుతో ఎప్పుడైతే నిర్ణయించారో అప్పటి నుంచి ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం మూడు పూవులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. ఏ దోపిడీ విధానమైనా దానికి అవినీతి తోడుగా వుంటుంది. ఈ కారణంగానే దేశంలో నేడు ఏ పెద్ద కంపెనీ ఏ అక్రమానికి పాల్పడింది, దాని వెనుక ఏ రాజకీయనేతలున్నారో అనే వార్తలు వెలువడుతున్నాయి. అధికార అండచూసుకొని బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్ధల నుంచి ఇచ్చిన మేరకు అప్పులు, ప్రభుత్వం నుంచి రాయితీలు దండుకో, నిధులను దేశం దాటించు, వాటినే విదేశీ పెట్టుబడుల రూపంలో తిరిగి తీసుకురా లేదా ఇతర బినామీ కంపెనీలకు మళ్లించు, సంస్ధలను దివాలా తీయించు. కేసులు పెడతారా విదేశాలకు పారిపో లేదా దొరికిపోతావా పోయేదేముంది పైసాకు కొరగాని పరువు తప్ప కూడబెట్టుకున్న ఆస్ధులేవీ పోగొట్టుకున్నవారెవరూ లేరుగా ! ఇదే కదా పై నుంచి కింది వరకు నేడు దేశంలో వున్న ఆలోచనా సరళి.
Image result for crony capitalism in india
మన దేశంలో నయా వుదారవాదం 1980దశకంలోనే ప్రారంభమైనా 1991లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం తరువాత సంస్కరణల పేరుతో గత విధానాలకు తిలోదకాలివ్వటం పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయట పడటానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకుల నుంచి రుణాలు, నిధులు ఎప్పుడైతే తీసుకున్నామో వాటికి విధించిన షరతుల్లో భాగంగా విదేశీ వస్తువులపై ఆంక్షలను ఎత్తివేసి ఆ కంపెనీలకు మార్కెట్‌ను తెరిచే, ప్రయివేటు రంగానికి అన్ని బాధ్యతలు, అవకాశాలను ఇచ్చే నయా వుదారవాద విధానాలు ప్రారంభమయ్యాయి. వీటిని కాంగ్రెస్‌ ప్రారంభించినా తరువాత అధికారానికి వచ్చిన బిజెపి నాయకత్వం కూడా పూర్తిగా, మరింత ఎక్కువగా అమలు జరిపింది, జరుపుతోంది. అంతకు ముందు వివిధ కారణాలతో అప్పులపాలైన రైతులు కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడినా, 1991లో నూతన విధానాలు అమలులోకి వచ్చిన తరువాత వ్యవసాయ రంగంలో సంక్షోభం తలెత్తి రోజూ ఏదో ఒక మూలన రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కాకమ్మ కథలు కాదు – సుదర్శన చక్రాలు, సమ్మోహనాస్త్రాలకు సమయమిదే !

21 Saturday Sep 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, Others, STATES NEWS, Telangana, Uncategorized

≈ Leave a comment

Tags

BJP on Uranium, cock and bull stories, puranic weapons, saffron talibans, TRS government, Uranium

Image result for puranic weapons

ఎం కోటేశ్వరరావు

కుక్క పిల్లా, అగ్గిపుల్లా, సబ్బు బిళ్లా కాదేదీ కవితకనర్హం అన్నాడు మహా కవి శ్రీశ్రీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో , దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ప్రతిదానినీ రాజకీయం చేస్తున్నారు, రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. అసలు సిసలు దేశభక్తులం మేమే అని చెప్పుకొనే వారి గురించి ఇక చెప్పనవసరం లేదు. మహాభారతంలో ఒక కధ వుంది. ద్రోణాచార్యుడు తన శిష్యుల కేంద్రీకరణ సరిగా వుందో లేదో పరీక్షించేందుకు ఒక రోజు పరీక్ష పెట్టాడు. ముందు కుమారుడు అశ్వధ్దామను పిలిచి చెట్టుమీద ఒక పక్షి వుంది,నీకేమి కనిపిస్తోంది అని అడగాడు. నాకు చెట్టు, దాని మీద పిట్ట, మీ పాదాలు కనిపిస్తున్నాయి అన్నాడు అశ్వధ్దామ. ఓకే, నీ బాణం కింద పెట్టు అని దుర్యోధనుడిని పిలిచి అదే ప్రశ్న అడిగాడు. గురువు గారూ నాకు చెట్టుమీద కొమ్మలు, వాటి మీద కూర్చున్న పిట్ట కనిపిస్తోంది, కొట్టమంటరా అన్నాడు, వద్దు వద్దు నీ ఆయుధాన్ని కింద పెట్టు అన్నారు. తరువాత వంతు అర్జునుడిది. నాకు పిట్ట తప్ప మరేమీ కనిపించటం లేదు అన్నాడు, అంతేనా అన్నాడు ద్రోణాచార్య. అంతే సర్‌ అన్నాడు అర్జునుడు. బిజెపి ఒక కంటికి అధికారమనే పిట్టమాత్రమే కనిపిస్తోంది. రెండో కంటికి యురేనియం వంటి సమస్యల మీద గుడ్డి సమర్దనకు అనేకం కనిపిస్తున్నాయి.

యురేనియం తవ్వకాలు, సర్వే గురించి సంప్రదాయ, సామాజిక మాధ్యమం రెండింటిలోనూ ఇప్పుడు చర్చ జరుగుతోంది. అనేక మంది సినీ ప్రముఖులు ముందుకు వచ్చి వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అవసరమైతే ఆందోళనలో పాల్గొంటామని ప్రకటిస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు పిల్లి మొగ్గలు వేస్తున్నాయి.. ముందేమి మాట్లాడుతున్నాయో వెనకేమి అంటున్నాయో చూడటం లేదు. తవ్వకాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటించారు మరోవైపున శాసన మండలిలో మాట్లాడిన కెటిఆర్‌ యురేనియం అవసరాన్ని గురించి నొక్కి చెప్పారు. బిజెపి నేతలు తమ వైఖరి ఏమిటో చెప్పకుండా గతంలో సర్వే, తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, మేము (కేంద్రం) తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు, కనుగొనేందుకు మాత్రమే, అయినా అది పనికి వస్తుందో లేదో తెలియదు అంటూ ఏవేవో చెబుతూ తాము తవ్వకాలకు అనుకూలమో కాదో చెప్పటం లేదు. యురేనియం అవసరం అంటూ పరోక్షంగా సర్వే, తవ్వకాలను సమర్ధిస్తున్నది.ఈ చర్చలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి కూడా భాగస్వామి అయ్యారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు ఆయన యురేనియం కంటే బొగ్గుతవ్వకమే ఎక్కువ ప్రమాదకరం అని చెప్పారు. ప్రమాదకరమైన వాటిన్నింటినీ ఆపివేయాలి, ఎవరు తవ్వమన్నారు. మరోవైపున సంఘపరివార్‌ శ్రేణులు సామాజిక మాధ్యమంలో యురేనియం తవ్వకం ఒక దేశభక్తి, దేశరక్షణ చర్యగా, పనిలో పనిగా కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. సామాజిక మాధ్యమంలో వారు వ్యాపింప చేస్తున్న ఒక సమాచారం దిగువ విధంగా వుంది. వూరూ పేరు లేకుండా ప్రచారం చేయటం అలాంటి వారి పద్దతి గనుక దానిలో వున్న భాష, భావాన్ని బట్టి అది వారి ప్రచారమే అని చెప్పాల్సి వస్తోంది.

Image result for sammohana astra

” యూరేనియం..ఇప్పుడు ఇదొక తర్కం..పర్యావరణం ఎంత ముఖ్యమో..దేశానికీ అణువిద్యుత్తు, అణ్వాయుధాల సమృద్ధి, అణ్వస్త్ర ప్రయోగశాల కార్యాచరణ కూడ అంతే ముఖ్యమన్న విషయ విజ్ఞానం మనం అర్ధంచేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది..ప్రస్తుతం కేవలం రీసెర్చ్‌ స్థాయిలో ఉన్న ఈ అంశం పై ఇంతగా ఆందోళన అనవసరం.జంతు జీవాలు మృగ్యం అయిపోతై, పురాతన కట్టడాలు ధ్వంసం అయిపోతై, అక్కడ నివాసితుల జీవితాలు నాశనం అయిపోతై, వింతరోగాలు ప్రబలిపోతాయి అంటూ కమ్మీస్‌ చేస్తున్న ప్రచారం కేవలం చైనా ఎజండా మాత్రమే.నిజానికి అది కమ్మీల విషప్రచారం మాత్రమే. 30000 ఎకరాల విస్తీర్ణంలో వున్న నల్లమల అడవుల్లో కేవలం 1000 ఎకరాల భూభాగంలో మాత్రమే ఈ రీసెర్చ్‌ జరగబోతోంది.రీసెర్చ్‌ ముగిసిన తర్వాత యురేనియం అందుబాటు స్థాయిని అధ్యయనం చేశాక యురేనియం ప్రాసెసింగ్‌ జరగాలి.అప్పుడు రేడియేషన్‌ విడుదల అవుతుంది.విడుదలయ్యే రేడియేషన్‌ వలన పై చెప్పబడిన ఏ ఒక్క విభాగము భారీ విపత్తుకు లోను కాకుండా తగు చర్యలు పటిష్టంగా తీసుకుంటుంది. కేంద్రంలో ఉన్నది ఆషామాషీ ప్రభుత్వమో.అభాధ్యతతో కూడిన ఆలోచనలతో సాగే యంత్రాంగమో, కాసుల కోసం క్షుద్ర ప్రయోగాలు ఆవిష్కరించే నీచ సంస్కృతికి నిలయమో కాదు.అనునిత్యం దేశహితమే తన మతంగా,130 కోట్ల భారతీయులే తన కుటుంబం అంటూ సాగుతున్న రాజర్షి నమో సారథ్యంలో దూసుకెళ్తున్న భారత్‌.. మేము విశ్వగురు భారత్‌ సంతతి అని భావితరాలు సగర్వంగా చాటుకునే స్థాయిని ఆవిష్కరిస్తున్న ప్రయాణం..అది

యురేనియం ఐనా,త్రిపుల్‌ తలాక్‌ ఐనా, ఆర్టికల్‌ 370, జి ఎస్‌ టి,నోట్ల రద్దైనా, జమిలి ఎన్నికలయినా, మరో అంశమైనా దేశంకోసం,దేశప్రతిష్ఠ కోసం, భావి భారతీయుల ఉజ్వల భవిష్యత్తుకోసం,ప్రపంచపటంలో భారతావనిని అగ్రగామిగా నిలపడంకోసం చేసే ప్రయత్నాలే.చైనాలో దోమ కుడితే ఇక్కడ గోక్కునే కమ్మీలు.అణ్వస్త్ర విభాగంలో భారత్‌ ఎక్కడ తమను మించిపోతుందో అనే చైనా భయాందోళనల మధ్య పుట్టుకొచ్చిన కుట్రలో భాగమే ఈ యాంటి యూరేనియం స్లొగన్స్‌, మావోయిస్టుల గంజాయి సాగుకు ఆటంకం, వాళ్ళ ఆయుధసేకరణకు అవసరమయ్యే ఆదాయవనరులకు గండి పడతాయి.ఇలాంటి అనేక అంశాలు ఈ కమ్మీలను పట్టిపీడిస్తున్నాయి.ఈ కమ్మీల ట్రాప్లో పడకుండా ప్రజలు అప్రమత్తంగా వుండాలి.నాణానికి రెండువైపులా అధ్యయనం చేయాలి.పర్యావరణాన్ని కాపాడుకుంటూ,అవసరమైన యురేనియం సమృద్ధిని పెంచుకుంటూ చైనా, పాకిస్తాన్‌ వంటి శత్రుదేశాల ఆగడాలను తరిమికొట్టే అణ్వస్త్ర ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచుకుని దేేశరక్షణ ప్రాముఖ్యతను గుర్తించి గౌరవించవలసిన బాధ్యత మనదే అనే ఆలోచన ప్రతి భారతీయ గుండెల్లో మారుమ్రోగాలి.జై భారత్‌. ”

ఇది కాషాయ తాలిబాన్ల వాదన తప్ప మరొకటి కాదు. మాకు సంబంధం లేదు అని వారు స్పష్టం చేస్తే అప్పుడు ఆలోచిద్దాం. అణు యుద్దం జరిగితే విజయం సంగతి తరువాత అసలు మానవాళిలో మిగిలేది ఎంత మంది, ఒకరూ అరా మిగిలినా వారు చేసేది ఏమిటి అన్నది సమస్య. అణుబాంబులు హిందువులను, ఆవులను వదలి, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర జంతుజాలాల మీదనే ప్రభావం చూపుతాయి అనుకుంటున్నట్లు కనిపిస్తోంది ! హిరోషిమా, నాగసాకి నగరాల్లో జరిగిన విధ్వంసాన్ని చూస్తే కాషాయ దళానికి తప్ప ప్రపంచానికి అంతటికీ వాటి ముప్పు ఏమిటో అర్ధం అయింది. అందుకే ఇప్పటికే ఒకసారి ప్రయోగించిన అమెరికా తప్ప తమంతట తాముగా ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమని మనతో సహా ప్రతి దేశం ప్రతిన పూనింది. ఈ విషయంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రేరణ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ . అతగాడి ప్రేలాపనలను అవకాశంగా మార్చుకొని తమలోని యుద్దోన్మాదాన్ని బయట పెట్టుకొంటున్నారు. ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమనే దేశవైఖరిని తాము పునరాలోచించుకోవాల్సి వుంటుందని మన రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ చెప్పటాన్ని ఏమనాలి? ఆయనకు ఇమ్రాన్‌ఖాన్‌కు తేడా ఏముంది?

అణువిద్యుత్‌ కేంద్రం కలిగిన ప్రతి దేశమూ అణ్వాయుధాలను తయారు చేసి పరిక్షించకపోయినా ఏ క్షణంలో అయినా వాటిని తయారు చేయగలిగిన పరిజ్ఞానాన్ని సమకూర్చుకున్నాయనేది బహిరంగ రహస్యం. ఇక కాషాయ దళాల వున్మాదం గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. మొదటి ప్రపంచ యుద్దం తరువాత జర్మనీకి ఏ కమ్యూనిస్టు లేదా పెట్టుబడిదారీ దేశం నుంచీ ముప్పు లేకపోయినా దేశాన్ని సమున్నతంగా నిలుపుతానంటూ జాతీయోన్మాదాన్ని, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన హిట్లర్‌ గురించి అంతకంటే చెప్పాల్సిన పనిలేదు. వాడి వారసులే కాషాయ తాలిబాన్లు. ప్రతి దేశమూ తన రక్షణకు చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు, అందుకు అవసరమైన ఆయుధాలను కలిగి వుండటమూ అభ్యంతరం కాదు. అయితే అణ్వాయుధాలు ఏ దేశాన్నీ రక్షించలేవు. అందుకోసం జనాన్ని, పర్యావరణాన్ని ఫణంగా పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. విద్యుత్‌ కోసం అనే వాదనలో కూడా అర్ధం లేదు. అనేక ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. చెర్నోబిల్‌, పుకుషిమా ప్రమాదాలు జరిగిన తరువాత ఇంకా అణువిద్యుత్‌ గురించి మాట్లాడేవారిని ఏమనాలో అర్దం కాదు.

ఇక్కడ కాషాయ దళాలను జనం ఒక ప్రశ్న అడగాలి. మీరు చెబుతున్నట్లు కాసేపు యురేనియం తవ్వకాల వ్యతిరేక నినాదం చైనా కోసమే కమ్యూనిస్టులు చేస్తున్నారనే అనుకుందాం. మీరెందుకు విదేశాలను అనుకరించి యురేనియంతో ఆయుధాలు తయారు చేయాలని ఆరాటపడుతున్నారు. అసలు సిసలు అభినవ స్వదేశీ దేశభక్తులు కదా ! వేదాల్లోనే అన్నీ వున్నాయి, భారతీయ పురాతన విజ్ఞానం అంతా సంస్కృత గ్రంధాల్లో వుంది అని ప్రచారం చేస్తున్నది మీరు. ఈ గోబెల్స్‌ ప్రచారం ఎంతగా పెరిగిపోయిందంటే దీన్ని ప్రశ్నించేవారి పరిస్ధితి ఇప్పుడు నూరు కాకుల్లో ఒక్క కోకిల మాదిరి తయారైంది. అమెరికా,ఆస్ట్రేలియా, అనేక ఐరోపా దేశాలకు వెళ్లి వుద్యోగాలు, విదేశీ సంస్ధల్లో పరిశోధనలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నవారు కూడా ఎవరేమనుకుంటే నాకేటి సిగ్గు అన్నట్లుగా వేదాల్లో అన్నీ వున్నాయష అనే అగ్రహారీకుల కబుర్ల్లే వల్లిస్తున్నారు.

విష్ణుమూర్తి సుదర్శన చక్రం అనే అస్త్రం నియంత్రిత క్షిపణి మాదిరి వ్యవహరించి లక్ష్యంగా చేసుకున్న శత్రువులను మాత్రమే హతమార్చి తిరిగి వస్తుందని కదా చెబుతారు. అంటే అది అణ్వాయుధాల కంటే అధునాతనం, సురక్షితమైనది. అమాయకుల జోలికిపోదు, సంస్కృత పండితులు, ఆర్‌ఎస్‌ఎస్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ వారు, ఇతరులు కలసి మేకిన్‌ ఇండియా కింద స్వదేశీ సుదర్శన చక్రాలను తయారు చేయవచ్చు కదా ! విదేశీ అణ్వాయుధాలెందుకు, వాటికోసం యురేనియమో మరొకటో తవ్వినపుడు ప్రమాదకరమైన కిరణాలను విడుదల చేయటం ఎందుకు ? వాటితో క్యాన్సర్‌, ఇతర భయంకర జబ్బులు రావటం ఎందుకు? అన్నీ కాలుష్యం కావాల్సిన పనేముంది? సుదర్శన అస్త్రం, ఇతర మరికొన్ని పురాణ అస్త్రాలు హింసాత్మకమైనవి మనది శాంతిభూమి కదా ఎవరైనా అనవచ్చు. పురాణాలలో సమ్మోహనాస్త్రాలు కూడా వున్నాయి. వాటిని తయారు చేసి మనకు నిత్యం తలనొప్పిగా వున్న పాక్‌ పాలకుల మీద, వారు పంపే తీవ్రవాదుల మీద దేశంలో వున్న వుగ్రవాద మావోయిస్టులు, ఇతర తీవ్రవాదుల మీద ప్రయోగిస్తే మంచివారిగా మారిపోతారు కదా ! అప్పుడు వారికి డబ్బు అందకుండా చూసేందుకు మరోసారి నోట్ల రద్దు అనే పిచ్చిపని, సర్జికల్‌ స్ట్రైక్స్‌ అవసరం వుండదు, వాటితో శతృవులను హతమార్చామని చెప్పుకోపని లేదు, ప్రతిపక్షాలకు రుజువులు చూపమని అడిగే అవకాశం వుండదు. అన్నింటికీ మించి మన శాస్త్ర పరిశోధనా కేంద్రాలన్నింటినీ మూసివేసి లేదా వాటిలో పని చేస్తున్న శాస్త్రవేత్తలను కట్టగట్టి ఇంటికి పంపి వేదాలు, సంస్కృత పండితులు, బవిరి గడ్డాల యోగులు, యోగినులతో నింపి వేస్తే ఎంతో ఖర్చు కలసి వస్తుంది. కారుచౌకగా కావాల్సిన అస్త్రాలను తయారు చేయించవచ్చు. వందల కోట్లు పెట్టి కిరస్తానీ దేశాల నుంచి రాఫెల్‌ విమానాలు, ఇతర ఆయుధాలను కొనుగోలు చేయాల్సిన అవసరం వుండదు. అందుకు అవసరమైన విదేశీ డాలర్లతో అసలే పని వుండదు. ఇది కలి యుగం గనుక అస్త్రాల తయారీ కాస్త ఆలశ్యం అవుతుంది అనుకుంటే ప్రజ్ఞా సింగ్‌ వంటి సాధ్వులను రంగంలోకి దించి శత్రువుల మీద శాపాలు పెట్టించండి. వారి నోటి దూల తీరి శత్రువుల పీడ విరగడ అవుతుంది. వందల కోట్లు ఖర్చు చేసి ఇస్రో ప్రయోగాలు చేయటం ఎందుకు, వేదగణితంతో లెక్కలు, డిజైన్లు వేసి వుంటే ఈ పాటికి చంద్రుడి మీన వారు రియెలెస్టేట్‌ ప్రారంభించి ఎంతో లబ్ది చేకూర్చి పెట్టి వుండేవారు. చంద్రయాన్‌ రెండవ ప్రయోగం విఫలమైందని మన ప్రధాని శాస్త్రవేత్తల మీద విసుక్కున్నారని వార్తలు వచ్చి వుండేవి కాదు, దాన్ని దాచుకునేందుకు తరువాత వారిని అక్కున జేర్చుకొని ఓదార్పుల దృశ్యాలు చూసే ఖర్మ మనకు తప్పేది.

Image result for puranic weapons

కొన్ని పురాణ అస్త్రాలు రక్షణ, శత్రు సంహారానికి సంబంధించినవి. వాటిలో సమ్మోహనాస్త్రం అయితే బహుళ ప్రయోజనకారి. నరేంద్రమోడీ గత ఐదు సంవత్సరాలలో ఎన్ని విదేశాలు తిరిగినా, ఎంత మంది విదేశీ నేతలను కౌగిలించుకున్నా మన దేశానికి పెద్దగా పెట్టుబడులు వచ్చింది లేదు. పరిశ్రమలు, వాణిజ్యాలు పెరిగి వుంటే నిరుద్యోగం నాలుగున్నర దశాబ్దాల నాటి రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను స్దాపించేది కాదు. మన గడ్డమీద నుంచే సమ్మోహనాస్త్రాలను ప్రయోగించినా, విదేశాలకు వెళ్లినపుడు కొన్నింటిని వెంటబెట్టుకు వెళ్లి ప్రయోగించినా సినిమాల్లో మాదిరి గింగిరాలు తిరుక్కుంటూ అన్ని దేశాల వారూ ఈ పాటికి ఇక్కడ పడి వుండేవారు. ఇంకచాలు బాబోయ్‌ అనేవరకు మనకు కావాల్సినవన్నీ తెచ్చి పడవేశేవారు. అందువలన ఇప్పటికీ మించిపోయింది లేదు. పెద్ద నోట్లను, ఆర్టికల్‌ 370 రద్దు చేసినా వుగ్రవాద సమస్య పోలేదు, మొత్తం కాశ్మీర్‌లో ఆగస్టు ఐదు నుంచి విధించిన కర్ఫ్యూను ఇంతవరకు తొలగించలేదు. దేశం ఆర్దిక మాంద్యం నుంచి గట్టెక్కాలంటే నిర్మలమ్మ గారు ఎన్ని వుద్దీపన పధకాలు ప్రకటించినా ప్రయోజనం వుందనే ఆశ లేదు. కనుక రక్షణ కోసం, సుదర్శన చక్రాలు, పెట్టుబడులు, ఎగుమతుల కోసం సమ్మోహన అస్త్రాలు తయారు చేసేందుకు పూనుకొని కాషాయ దళాలు తమ దేశభక్తిని నిరూపించుకోవాలి. ప్రపంచానికి భారత సత్తా చాటాలి. కాకమ్మ కబుర్లు కాదు కార్యాచరణ ముఖ్యం !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d