• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Others

కొడదామంటే కడుపుతో వుంది-తిడదామంటే అక్కకూతురై పోయింది !

01 Tuesday Mar 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Others, Telangana

≈ Leave a comment

Tags

Amaravati, ANDHRA PRADESH, Andhrapradesh new Capitol, AP CM, Central budget 2016, tdp, Telangana, trs

 

ఎం కోటేశ్వరరావు

   సాంకేతికంగా చూస్తే రెండోదే కావచ్చు గానీ నరేంద్రమోడీ గారీ ముచ్చటైన మూడో బడ్జెట్‌ రెండు తెలుగు రాష్ట్రాల సారధులకు పెద్ద ఇబ్బందే తెచ్చి పెట్టింది. అందరికీ తెలిసిన సామెత ‘కొడదామంటే కడుపుతో వుంది, తిడదామంటే అక్క కూతురై పోయింది’ అన్నట్లుగా ఇద్దరు చంద్రుల పరిస్ధితి తయారైంది. జనం ముందు ఎలా కనిపించినా తగిలిన ఎదురు దెబ్బలతో వెనక్కు తిరిగి గుడ్ల నీరు కుక్కుకుంటున్నారు. బడ్జెట్‌ అంటే నిబంధనల ప్రకారం రూపొందించేది. మనం ప్రజాస్వామ్యంలో వున్నాం. మహారాజులు, పాదుషాల హయాం కాదిది. ఒక రాష్ట్రానికి ఒక రూపాయి అదనంగా కేటాయించాలన్నా ఏదో ఒక ప్రాతిపదిక, వాటికి సవాలక్ష నిబంధనలు వుంటాయి.వాటిని దాచి పెట్టి కేంద్రం దగ్గర తమ కెంతో పలుకుబడి వుందని చూపుకొనేందుకు కబుర్లు చెప్పటం ఒక ఫ్యాషనై పోయింది.

   హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీకి సీట్లేమీ రావని చంద్రబాబుకు ముందే తెలుసని ఆయన అంతరంగంగా అందరూ పరిగణించే ఒక మీడియా వ్యాఖ్యాత ఫలితాలు వెలువడిన తరువాత ఒక పెద్ద రహస్యాన్ని వెల్లడించారు. దీన్ని బట్టి ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ల పాటు వున్న కాలంలో చంద్రబాబు జోతిష్య శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేసి వుండాలి. తాను అభివృద్ధి చేసిన పరాయి రాష్ట్ర రాజధాని హైదరాబాదులో తన జనం తనకు ఒక్కటంటే ఒక్కటే కార్పొరేటర్‌ సీటను కట్టబెడతారని ముందే తెలుసుకున్నపుడు తన స్వంత రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా మోడీ ఈ బడ్జెట్‌లో ఎలాంటి నిధులు ఇవ్వరని చంద్రబాబుకు తెలియకుండా ఎలా వుంటుంది. అందుకే తాత్కాలిక సచివాలయం పేరుతో కధ నడిపించేందుకు పూనుకున్నారా ? ఏపికి ప్రత్యేక హోదారాదని ముందే నిర్ధారణ అయినందున అసలు అలాంటి ఒక ప్రతిపాదన వుందని కూడా ఎరగనట్లుగా అమాయకత్వం నటిస్తున్నారు.తొలి రోజుల్లో ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్రయోజనం కల్పిస్తారని కట్టుకధలు ప్రచారం చేశారు. వాటిని ఎంతో కాలం చెప్పలేరు కదా. దాంతో ఇప్పుడు లీకుల్లో గానీ చెప్పేవాటిలో గానీ దాని ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడుతున్నారు.

    పైసా పైసాను ఒకటికి రెండుసార్లు లెక్కలు వేసుకోవాల్సిన రీతిలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న మాట తిరుగులేని నిజం. చంద్రబాబు నాయుడి ఇరవై నెలల పాలన చూస్తే అసలు విషయాలను దాచిపెట్టి ఏదో ఒకదానిపై జనం దృష్టిని మళ్లించి తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఈ స్థితిలో చంద్రబాబు అభివృద్ధి ఆకర్షణకు తట్టుకోలేక ఆ పార్టీలో చేరుతున్నామని చెప్పిన లేదా రేపు చెప్పబోయే వైసిపి ఎంఎల్‌ఏలలో కొందరికి మంత్రి పదవులు, కొందరికి పైరవీలు తప్ప దక్కేది మరేమీ వుండవు, వచ్చే ఎన్నికలలో మరో పార్టీ కండువా కప్పుకునేందుకు ఇప్పటి నుంచే ఆలోచన చేయటం కూడా అవసరమేమో ? ఎంత లేదనుకున్నా తొలిసారి మారటానికి కాస్త సిగ్గూ బిడియం, మాన,మర్యాదల గురించి జంఝాటం వుంటుంది. ఒకసారి అలవాటు పడి అదొక జీవన విధానం అయినపుడు మారేవారు , చేర్చుకొనే వారు సిగ్గుపడితే పనులెలా అవుతాయి? రాజకీయాల్లో కిక్కేముంటుంది?

     అమరావతి శాశ్వత రాజధానికి నిధులు ఇచ్చే విషయంలో కేంద్ర బడ్జెట్‌ మౌనం దాల్చింది. నూతన రాజధానికి ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని లేదా నిర్మించాలని చంద్రబాబు విభజన సమయంలో చెప్పిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేయాలి. నాలుగు వేల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి ఈ ఏడాది కావాలని చంద్రబాబు కోరారు. ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవు. పెద్ద ఎత్తున వందల కోట్లు ఖర్చు చేసి రాజధాని శంకుస్తాపన పేరుతో నిధులు తగలేశారు. దాన్ని పక్కన పెట్టి తాత్కాలిక సచివాలయానికి ఖర్చు చేస్తామని చెబుతున్న మూడు లేదా నాలుగు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల జేబులు నింపుతాయి . జనం సొమ్ము కాంట్రాక్టర్ల పాలు కావటమే. ఇప్పటికే రెవెన్యూ ఆర్ధిక లోటు రు.13,779 కోట్లు వుండగా ఒకటి తాత్కాలికంగా, మరొకటి శాశ్వత రాజధాని నిర్మాణానికి వుదారంగా ఖర్చు చేసే డబ్బు ఎక్కడుంది? ఎవడబ్బ సొమ్మని రామచంద్రా ఈ ఖర్చు ? వుమ్మడి రాజధానిగా మరో ఎనిమిది సంవత్సరాలపాటు హైదరాబాదులో వున్న వసతులను వుపయోగించుకోవటానికి అవకాశం వుండగా తాత్కాలిక సచివాలయం పేరుతో మూడు లేదా నాలుగు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయటం ఏ జవాబుదారీతనం కిందికి వస్తుంది ? వాటినే శాశ్వత సచివాలయ నిర్మాణానికి ఎందుకు వుపయోగించరు? ఈ ప్రశ్న వస్తుందని గ్రహించే తాత్కాలిక సచివాలయ భవనాన్ని కూడా భవిష్యత్‌లో వుపయోగించుకుంటామని చంద్రబాబు చెప్పారు. అదే వాస్తవం అయితే తన మకాం విజయవాడకు మార్చే సమయంలోనే హైదరాబాదులోని తన కార్యాలయ సుందరీకరణకు పదుల కోట్లు ఎందుకు వెచ్చించినట్లు ? ఆ తరువాత ఒక్క రోజైనా ఆఫీసును వుపయోగించుకున్నారా ? ఇప్పటికే మంత్రులు, అధికారులు పనీ పాటా లేకుండా విజయవాడ-హైదరాబాదు చుట్టూ తిరుగుతూ అనవసరంగా జనం సొమ్మును ఖర్చు చేస్తున్నారు అనే అభిప్రాయం బలపడుతోంది.

     కేంద్ర నిబంధనలు అంగీకరించవని తెలిసి కూడా అడుక్కోవటంలో పిసినారితనం ఎందుకన్నట్లుగా రాజధాని పరిసరాల్లో పెట్టబోయే పరిశ్రమలకు నూటికి నూరుశాతం పన్ను రాయితీలు ఇవ్వాలన్న కోరికను కేంద్రం అసలు పట్టించుకోలేదు. విజయవాడ మెట్రోకు రెండువేల కోట్లు అడిగితే వంద కోట్లు ప్రకటించారు. అంతకంటే పెద్ద దైన విశాఖ మెట్రోకు మాత్రం మొండిచేయి చూపారు.అసలే అవి గిట్టుబాటు కావన్న అభిప్రాయం వుండగా ఇలాంటి కేటాయింపులతో నిర్మాణ భారం పెరిగిపోతే వాటిని జనం నెత్తిమీదే కదా రుద్దేది? ఇక కేంద్రం ప్రకటించిన విద్యా సంస్ధల భవన నిర్మాణాలకు కూడా విదిలింపులే తప్ప గణనీయమొత్తాలను కేటాయించలేదు. దీని వలన అరకొర అద్దె లేదా వసతులు లేని భవనాలలోనే వాటిని దీర్ఘకాలం కొనసాగించాలన్నమాట.

      తెలంగాణా పరిస్ధితి కూడా ఇంతకంటే మెరుగ్గా లేదు. ఆ మధ్య ముఖ్య మంత్రి చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటన జరిపి మోడీ పాదుషా గారిని ఖుషీ చేసేందుకు ముఖస్తుతి చేసి వచ్చినట్లు ,ఎంతో ఆత్మీయంగా, చొరవగా మాట్లాడినట్లు మీడియా కధనాలు వచ్చాయి. ఎక్కడన్నా బావే కాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా మోడీ ఈ బడ్జెట్‌లో స్పష్టం చేశారు.మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరధ వంటి పధకాలకు 30వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని, కొన్నింటిని జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలని ఢిల్లీ ప్రభువులకు కెసిఆర్‌ పెద్ద జాబితానే ఇచ్చి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించిన 30వేల కోట్ల పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేశామని చెబుతున్న బకాయిలను కూడా పూర్తిగా చెల్లించని కేంద్రం గతేడాది మాదిరే ఈ ఏడాది కూడా వంద కోట్లు కేటాయించింది.ఈ లెక్కన ఆ ప్రాజెక్టు 150వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి గాని పూర్తి కాదేమో ?అలాంటపుడు అలూచూలూ లేని తెలంగాణా ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇస్తుందా?

     బడ్జెట్‌ ప్రతిపాదనల తీరుతెన్నులను చూసినపుడు గత యుపిఏ పాలనకూ, గుజరాత్‌ మోడల్‌ను దేశమంతటికీ వర్తింప చేస్తామన్న నరేంద్రమోడీ పాలనకూ ఇంతవరకు పెద్ద తేడా ఏముంది? కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇచ్చే నిధుల వాటాను పెంచారు. ఇది హర్షణీయమే. ఇదే సమయంలో కొన్ని పధకాల అమలు బాధ్యతను రాష్ట్రాలపై మోపటం ద్వారా ఆ పెంపుదల కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్నట్లుగా అయింది తప్ప వేరు కాదు. కేంద్రం నుంచి ఆశించిన నిధులు రాని పర్యవసానం రానున్న సంవత్సరాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి, సంక్షేమ పధకాలపై తీవ్రంగా పడుతుందని వేరే చెప్పనవసరం లేదు.నిధులకు ఎంత కటకట ఏర్పడితే పాలకులు కబుర్లు అంత ఎక్కువగా చెబుతారు.అంతగా జనం మోసపోతారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ముదిమది తప్పిందా? వుమ్మెత్త కాయలు తిన్నారా ?

19 Friday Feb 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others, Politics

≈ Leave a comment

Tags

defections, tdp, telangana tdp, telugudesam

రాష్ట్ర విభజనతో తనకేమీ సంబంధం లేనట్లు, వేరే ఎవరో తీరని నష్టం చేసినట్లు చెబుతున్నారు.ఇంతకీ రెండు కళ్ల సిద్ధాంతం, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎట్టి పరిస్ధితుల్లో తీసుకు వస్తా, ఇంటికి ఒక వుద్యోగం ఇస్తా , రాష్ట్రాన్ని సింగపూర్‌, మలేసియాలా మారుస్తా అని చెప్పిన చంద్రబాబూ ఈయనా ఒకరేనా ?

ఎం కోటేశ్వరరావు

     సరైన దర్శకుడు, మాటల రచయిత లేకపోతే ఈ రోజుల్లో సినిమాలు బాక్స్‌ ఆఫీస్‌ వద్ద హిట్‌కు బదులు ఫట్‌ అవుతున్నాయి. ఒక మహానటుడు పెట్టిన పార్టీకి ఈ రోజు సరైన దర్శకులు, పదునైన డైలాగులు రాసే మాటల రచయితలే కరవయ్యారా ? హత విధీ ఏమి ఖర్మ పట్టినది ? సమర్ధులైన నటులు రంగస్ధలం మీద వున్నపుడు తోటి నటీనటులు తమ డైలాగులు మరిచిపోతే దాన్ని కనిపించకుండా నాటకాన్ని రక్తి కట్టించిన ఎందరో నటుల గురించి మనకు తెలుసు. కానీ తెలుగు దేశం డ్రామాలో ఏ నటుడేం మాట్లాడుతున్నారో, దానికి అర్ధం తెలిసి పలుకుతున్నారా ? వెనుక నుంచి ప్రాంప్టింగ్‌ సరిగా లేక ఒకటి చెప్పబోయి మరొకటి చెబుతున్నారా ?

     ఏమిటిది ? ఎన్ని ఇబ్బందులెదురైతే మాత్రం ఈ మాటలేమిటి ? రాజకీయాలు, విలువలు, ఫిరాయింపు నిరోధక చట్టం, ఫిరాయింపులు, నైతిక విలువలను పాటించాలను కొనే వారంతా రాజకీయాలకు పనికిరారని ఎప్పుడో తేలిపోయింది. అందువలన అ విలువల వలువలు విప్పిన వారు కూడా మరీ ఇంతగా బరితెగిస్తారా అని ఎవరైనా అనుకోవచ్చు. అధికార రాజకీయాలలో ఇలాంటివి సహజం. మహాను భావులు అయారాం గయారాంలు ఎప్పుడో వీటికి ప్రాతిపదిక వేశారు. అందుకే అలాంటి చర్చను రానివ్వకూడదని పాలకపార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అందుకే వాటి గురించి ఎవరూ మాట్లాడరు.

     విషాద నాటకాలు, సినిమాలలో కూడా హాస్యాన్ని పండించే దృశ్యాలు వుంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోని తెలుగుదేశం పార్టీలో కూడా అదే జరుగుతోందా అనిపిస్తోంది. ఏదైనా అకాల వైపరీత్యాలు సంభవించి ఏరులు వరదలై పారినపుడు ప్రాజెక్టుల గేట్లు తెరవండి అని ఆదేశించటం తెలుసు. కానీ ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించేందుకు గేట్లు తెరవండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ మంత్రులతో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. చదివేవారికి, వినే వారికి, చూసే వారికి బుర్రల్లేవనుకుంటేనే ఇలాంటి వార్తలను వండి వడ్డిస్తారు. అసలు తెలుగుదేశం ఇతర పార్టీల నుంచి వలసల నిరోధానికి తెరిచిన గేట్లను మూసిందెప్పుడు? అయినా ఈ వార్తలను ఖండించలేదు కనుక నిజమే అనుకోవాలి. ప్రతిదాన్నీ ఎక్కడ ఖండిస్తాం మా ముఖ్యమంత్రి ఆ మాట అన్నట్లు ఆధారాలున్నాయా అంటే ఎవరైనా ఏం చెబుతారు. మీడియాకు లీకులు ఇవ్వటంలో, అవసరమైనపుడు కధలు రాయించుకోవటంలో అందెవేసిన చేయి ఎవరిదో ఎవరికి తెలియనిది. 1950,60,70 దశకాలలో జనం సినిమాల గురించి ముఖ్యంగా పల్లెటూళ్లలో గుంపులు గుంపులుగా చెప్పుకొనే వారు. ఎవరైనా ఒక సినిమా చూసి వస్తే దానిలోని కథను సచిత్రంగా వర్ణిస్తుంటే అబ్బ ఎంత బాగా చెప్పిండు అన్నట్లుగా వినేవారు, సంతృప్తి చెందేవారు. ఇప్పుడు కూడా కొన్ని పత్రికలు, టీవీ ఛానల్సు కూడా అంతకంటే గొప్పగా కధలు చెబుతున్నాయి. మంత్రివర్గ సమావేశాలలో సైతం పక్కనే కూర్చుని విన్నట్లు, స్వయంగా చూసినట్లు తమ ప్రతిభా పాటవాలను ఆ విలేకరులు ప్రదర్శిస్తున్నారు.అయితే ఫిరాయింపుల గురించి చంద్రబాబు నిజంగానే చెప్పి వుంటారనేందుకు ఆస్కారం వుంది. ఎందుకంటే తెలంగాణాలో తగిలిన షాక్‌ నుంచి ఇంకా ఆయన తేరుకోలేదు.అపర చాణుక్యుడనని తనకు తాను అనుకుంటారో లేదో తెలియదు గానీ తన మీద అనుయాయులకు వున్న అలాంటి విశ్వాసం తగ్గకుండా వుండాలంటే ఏదో ఒకటి చేయాలి కదా ! ఏ మాటకామాటే చెప్పుకోవాలి .చంద్రబాబు తన అనుయాయులకు కన్నుగీటటంలో ఆయన స్టైలే వేరు.

     చంద్రబాబు స్వయంగా చెప్పినట్లు తాను అభివృద్ధి చేసిన హైదరాబాదు నగరంలో పూలమ్మిన చోటే కట్టెలమ్మినట్లుగా తెలుగుదేశం పార్టీ ఒక్కటంటే ఒక్క కార్పొరేటర్‌ స్ధానాన్ని గెలుచుకుంది. మావ తిట్టినందుకు కాదు తోడల్లుడు సానుభూతి పలికినందుకు ఎక్కడలేని బాధ అన్నట్లుగా తమకు ఒక్క సీటు రావటం కంటే తమదే పెద్ద పార్టీ అని బిజెపిని భాగస్వామిగా చేసుకొని పోటీ చేస్తే దానికి నాలుగు సీట్లు రావటం మరింత బాధ కలిగించింది. కంటి చూపు తప్ప నోట మాట రాలేదు. ఈ స్ధితిలో గోరుచుట్టు మీద రోకటి పోటు మాదిరి తెలంగాణాలో శాసనసభా పక్ష నాయకుడే ఫిరాయించటంతో వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో జనం దృష్టి మళ్లించేందుకు తెలుగుదేశం నేతలకు చంద్రబాబు కన్నుగీటినట్లుగా వుంది. వెంటనే కొందరు మంత్రులు వైఎస్‌ఆర్‌ సిపి నుంచి తమ పార్టీలోకి ఫిరాయించే ఎంఎల్‌ఏల గురించి చెప్పి చంద్రబాబును ఓదార్చే యత్నం చేశారు. కారణాలేమయినా ఒకరిద్దరు శాసనసభ్యులు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశాం తప్ప పార్టీ మారేందుకు కాదని చెప్పారు.ఎంతో ఆశించి, ఏదో జరుగుతుందని భ్రమపడిన వారు ఇంతకాలం అధికారానికి దూరంగా వుండటమే విశేషం. చివరికి తమ నాయకుడి మాదిరి తాము కూడా ఐదు సంవత్సరాల పాటు ఓదార్పు యాత్రలతోనే కాలం గడపాలా అని కొందరిలో ఆలోచన రావటంలో ఆశ్చర్యం ఏముంది. అదేమి చిత్రమో ఎప్పటికప్పుడు కొత్త సాఫ్ట్‌వేర్‌లు, ప్రోగ్రామ్‌లు వస్తున్నా వైఎస్‌ఆర్‌సిపి ఇంకా పాతబడిన ఓదార్పు యాత్రలనే కొనసాగిస్తున్నది.

     ఇంత జరుగుతున్న తరువాత తాను మాట్లాడకుండా వుంటే తన శిబిరంలోని వారు ఆందోళన పడరా మరి, దాంతో తాను తలచుకుంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని పడగొడతానని వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి తొడగొట్టారు. 21 మంది తెలుగుదేశ పార్టీ ఎంఎల్‌ఏలు తనతో సంబంధాలలో వున్నారని అయితే వారి పేర్లు అవసరమైనపుడు చెబుతానని, చెప్పిన వెంటనే గంటలో ప్రభుత్వం పడిపోతుందని జగన్‌ చెప్పారు. మా వారు టిడిపిలోకి వెళ్లటం, వారు మాలోకి రావటం ఎందుకు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు పెట్టమని కూడా జగన్‌ సవాల్‌ చేశారు. తాను లేస్తే మనిషిని కానని దారిన పొయ్యే వారిని బెదిరించిన కుంటి మల్లయ్య కధ కొందరికి గుర్తుకు వస్తే రావచ్చు.

    జగన్‌ తొడగొట్టడాన్ని సహించలేని తెలుగుదేశం మంత్రులు మా ప్రభుత్వాన్ని పడగొట్టటం కాదు, మీ వారి చేతే రాజీనామాలు చేయించి, ఎన్నికలు జరిపించి మీ సంఖ్యను మీరు నిలుపుకుంటే మేం దేనికైనా రెడీ అని సినిమా డైలాగులు చెప్పారు. అన్నింటికంటే విచిత్రం ఏమంటే మంత్రాలయం నియోజకవర్గ సభల్లో ప్రసంగించిన వుప ముఖ్యమంత్రి కెయి కృష్ణ మూర్తి ‘ ఓర్పు వున్నంత వరకు సహిస్తాం, ఓర్పు నశిస్తే వైసిపి ఎంఎల్‌ఏలను మా పార్టీలో చేర్చుకుంటాం, ఇక ఎవరూ మిగలరు జాగ్రత్త ! అడుగడునా అభివృద్ధికి అడ్డుపడితే వైసిపి నుంచి జంప్‌ చేయటానికి సిద్ధంగా వున్న 28 మంది ఎంఎల్‌ఏలను మా పార్టీలో చేర్చుకుంటాం ‘ అని హెచ్చరించారు. వైసిపితో సంబంధాలలో వున్న టిడిపి ఎంఎల్‌ఏల పేర్లు బహిర్గతం చేయాలని ఎంఎల్‌సి ముద్దుకృష్ణమ నాయుడు సవాల్‌ చేశారు. ఇతర మంత్రులు, నాయకులు ఇలాంటి కామెడీ డైలాగులు సభల్లో చెప్పి జనాన్ని నవ్వించారు. దీన్ని చూస్తే తెలుగుదేశం పార్టీలో తెరవెనుక వుండి మంచి డైలాగులు రాసేవారు, డైరెక్షన్‌ చేసే సమర్దులు వున్నట్లు కనిపించటం లేదు. అన్ని వారే చూసుకోవాలంటే చంద్రబాబు, లోకేష్‌ బాబుకు ఎక్కడ సాధ్యం అవుతుంది.

   ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇలా వుంటే తెలంగాణా నేతలు మరింత హాస్యం పండిస్తున్నారు. మొగుడు పోతేనేం పొన్నకాయలా గుండు నున్నగా బలే వుందే అన్న సామెత మాదిరి వుంది. టిఆర్‌ఎస్‌కు వందసీట్లు వస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్‌ చేశా , అటువంటి పరిస్ధితి రాకుండా కాపాడి తనను రాజకీయాల్లో నిలబెట్టినందుకు కూకట్‌పల్లి వాసులకు కృతజ్ఞతలంటూ తెలంగాణా టిడిపి నేత రేవంతరెడ్డి సన్మానాలు చేయించుకొని మరీ నవ్వులు పండిస్తున్నారు. హైదరాబాదులో టిఆర్‌ఎస్‌కు వందసీట్లు వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని రేవంతరెడ్డి ఎన్నికలకు ముందు సవాలు చేశారు. టిఆర్‌ఎస్‌కు 99 వచ్చాయి. తెలుగుదేశం పార్టీ తరఫున ఒకే ఒక్కరు గెలిచారు.ఈ ఒక్క సీటు రానందుకు కెసిఆర్‌ అసంతృప్తితో వున్నారు, గ్రేటర్‌ సవాల్‌లో నాదే విజయం అని చెప్పుకున్నారు. ఆ సభకు వచ్చిన అనేక మందికి దేనితో నవ్వాలో అర్ధం కాలేదట. ఇక మిగతా వుపన్యాస విషయానికి వస్తే టిడిపి నుంచి ఫిరాయించిన ఎమ్మేల్యేలది వెన్నెముక లేనిబతుకు అని వర్ణించారు. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్‌ టిడిపిలోకి వచ్చిన వారందరి పరిస్ధితీ అదే. రావటానికి సిద్ధంగా వున్నారని చెబుతున్నవారిదీ అదే స్ధితి అని రేవంత రెడ్డి చెప్పినట్లే.

    ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి శంకుస్ధాపన చేసిన చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హైదరాబాదు లేకుంటే తెలంగాణాలో ఏముంది అని వ్యాఖ్యానించారు. అన్నింటికంటే విభజనతో రాష్ట్రానికి తీరని నష్టం చేసిన వారే అసూయపడేలా రాజధానిని నిర్మించి తీరతామని చెప్పారు. విద్యార్ధులకు చరిత్ర పాఠాలు ఎందుకు దండగ అన్న చంద్రబాబు నాయుడికి నిజంగా ఎంతో ముందు చూపు వుంది. చరిత్రలో తన గురించి చదువుకోకుండా వుండేందుకే ముందు జాగ్రత్త చర్యగా అలా చేసి వుంటారు. అందుకనే రాష్ట్ర విభజనతో తనకేమీ సంబంధం లేనట్లు, వేరే ఎవరో తీరని నష్టం చేసినట్లు చెబుతున్నారు.ఇంతకీ రెండు కళ్ల సిద్ధాంతం, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎట్టి పరిస్ధితుల్లో తీసుకు వస్తా, ఇంటికి ఒక వుద్యోగం ఇస్తా , రాష్ట్రాన్ని సింగపూర్‌, మలేసియాలా మారుస్తా అని చెప్పిన చంద్రబాబూ ఈయనా ఒకరేనా ? నేను చరిత్ర విద్యార్ధిని కాదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చంద్రబాబు వలవల- వీర భక్తుల విలవిల

14 Sunday Feb 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

CHANDRABABU, Nara lokesh, tdp, telangana tdp

మనకు ఇప్పటి వరకు  ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యాల గురించే తెలుసు. తెలంగాణా తెలుగుదేశం నుంచి వలసలు చూసిన తరువాత జరిగిన సభలో ప్రసంగించిన నేతల తీరుతెన్నులు చూస్తే ఫిరాయింపు వైరాగ్యాన్ని కూడా ఆ జాబితాలో చేర్చుకోవాల్సి వుంటుందనిపిస్తోంది. పార్టీ అన్న తరువాత ఇతర పార్టీల వారిని చేర్చుకోకుండా వుంటామా? వారు వచ్చినట్లే తిరిగి పోకుండా వుంటారా, ఈరోజు వారు రేపు మనం , ఎవరైనా పోయేది ఎక్కడ అధికారం వుంటే అక్కడికే కదా, అంతా పైవారి వినోదం, మనం నిమిత్త మాత్రులం అనుకోవాలేమో !

ఎం కోటేశ్వరరావు

      ధర్మాన్ని మీరు కాపాడండి-ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఈ మాట ఎక్కడో చూసినట్లు, విన్నట్లు వుంది కదూ ! చంద్రబాబు నాయుడు అనే గొప్ప సంస్క ర్త( ఇది నేను చెప్పింది కాదు, ఎవరూ ఎస్సీలుగా పుట్టాలనుకోరు అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యకు ఆయన ఒక సంస్కర్తలా అనుగ్రహ భాషణం చేశారని ఆయన మద్దతుదార్లు ఇచ్చిన టీకా తాత్పర్యంలో భాగం) తెలంగాణాలో మీరు పార్టీని కాపాడండి-పార్టీ మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పిన మాటలు వినగానే గుర్తుకు వచ్చాయి. తీరా చూస్తే అనేక చోట్ల గోడల నిండా రాసి కూడా వున్నాయి. యుగ యుగాలుగా, తరతరాలుగా ఇలాంటి సంస్కర్తలు నాలుగు పాదాల నడిచిన ధర్మానికి ఇప్పుడు అసలు ఒక పాదం అయినా వుందో లేదో తెలియకుండా చేశారు. అదీ ధర్మాన్ని రక్షించే పేరుతోనే సుమా ! అయినా ధర్మం తనను తాను కాపాడుకోలేక పోవటమే కాదు ధర్మంగా వున్న వారిని కూడా కాపాడలేకపోయిందని ప్రతి యుగంలో, తరంలో ఏ రంగంలో చూసినా మనకు తెలుస్తూనే వుంది.

      అలాంటిది తెలంగాణాలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు ఎలా కాపాడగలుగుతారు? ఆయన కుమారుడు లోకేష్‌ అంటే పుట్టుకతో తెలుగుదేశం కనుక సిద్ధాంతాల గురించి మాట్లాడే నైతిక అర్హత వుంది.అయితే తెలుగు దేశం పార్టీ పుట్టిన తరువాత భూమ్మీదకు వచ్చిన లోకేష్‌ అంతకు ముందే పార్టీలోకి వచ్చిన నేతల కంటే ఎక్కడలేని అధికారం ఎలా చెలాయిస్తున్నట్లు అంటే సమాధానం కష్టం.(మన అదృష్టం కొద్దీ లోకేష్‌ ఇంకా సిద్ధాంతాల గురించి వాటి పవిత్రత, కాపాడటం గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే కొంత మంది అవతార పురుషులు, కారణ జన్ములు అవసరం వచ్చినపుడే నోరు విప్పుతారు మరి ! చంద్రబాబు నాయుడు పుట్టింది కాంగ్రెస్‌లో పెరిగింది కాంగ్రెస్‌లో, తొలి మంత్రి పదవి వెలగబెట్టింది కాంగ్రెస్‌లో కనుక ఆయన నీతి సూత్రాల గురించి మాట్లాడటం వినేవారికి కాస్త ఇబ్బందే. తెలుగుదేశం హైదరాబాదులో సరిగ్గా పనిచేయని కారణంగానే నష్టం జరిగిందని చంద్రబాబు చెప్పారు. నిజమే, నారా లోకేషే అన్నీ అయి పని చేశారు అన్నది అందరికీ తెలిసిందే.

     మనకు ఇప్పటి వరకు  ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యాల గురించే తెలుసు. తెలంగాణా తెలుగుదేశం నుంచి వలసలు చూసిన తరువాత జరిగిన సభలో ప్రసంగించిన నేతల తీరుతెన్నులు చూస్తే ఫిరాయింపు వైరాగ్యాన్ని కూడా ఆ జాబితాలో చేర్చుకోవాల్సి వుంటుందనిపిస్తోంది. పార్టీ అన్న తరువాత ఇతర పార్టీల వారిని చేర్చుకోకుండా వుంటామా? వారు వచ్చినట్లే తిరిగి పోకుండా వుంటారా, ఈరోజు వారు రేపు మనం , ఎవరైనా పోయేది ఎక్కడ అధికారం వుంటే అక్కడికే కదా, అంతా పైవారి వినోదం, మనం నిమిత్త మాత్రులం అనుకోవాలేమో ! ఏకంగా శాసనసభా పక్ష నాయకుడే ఫిరాయించిన తరువాత జరిగిన సంతాపసభలో (పోయిన వారికి అని వక్తలు చెప్పినప్పటికీ మిగిలి వున్న వారికి ధైర్యం చెప్పిన సంతాపసభ అది అనటం బాగుంటుందేమో ) పాల్గొన్న నారాయణపేట(మహబూబ్‌ నగర్‌ జిల్లా) ఎంఎల్‌ఏ రాజేంద్రరెడ్డి మాట్లాడుతూ తన వంటి వారు హైదరాబాదు వచ్చి వెళితే శీలపరీక్ష చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరీక్షల అవసరం లేకుండా చేసుకొనేందుకు కాబోలు అలా మాట్లాడిన కొద్ది నిమిషాలలోనే ఏం జరిగింది. సమావేశానికి పసుపు సైకిల్‌పై వచ్చి వెళ్లేటపుడు గులాబీ కారులో వెళ్లారు. అందరికీ ఎడాపెడా శరీరాన్ని కోసి ఆపరేషన్లు చేసే వైద్యుడు తన కాలుకు ముల్లు గుచ్చుకోగానే విలవిల్లాడి పోతాడట. పాపం చంద్రబాబు నాయుడు అంతకంటే ఎక్కువే బాధపడి వుంటారు.ఎందుకుంటే ఆకర్ష… ఆకర్ష అని నిత్యం ఏదో ఒక పార్టీలోని వారికి గాలం వేసే వారు తన గేలానికి చిక్కిన చేపలే తప్పించుకుపోతుంటే నిజంగా ఎంత బాధగా వుంటుందో కదా ! అతనికంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు ఆయన కంటే ఎక్కువగా వీరాభిమానులు విలవిలాడి పోతున్నారు. ఆ క్రమంలో తమ నాయకుడికి భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని కూడా చూడకుండా తెగ సుభాషితాలు చెబుతున్నారు. అలాంటి వాటిలో కొన్ని ఆణి ముత్యాలు ఇలా వున్నాయి. ‘పార్టీ మారటానికి ఒక విధానమంటూ వుంటుంది. మరీ ఇంత నిర్లజ్జగా వ్యవహరించాల్సిన అవసరం ఏముంటుంది. ఎర్రబెల్లి దయాకరరావు ప్రభృతుల జంపింగ్‌ పట్ల ప్రజలెవ్వరూ ఆశ్చర్యపోలేదు.అయితే, ఈ సందర్బంగా వారు వ్యవహరించిన తీరు, చేసిన వ్యాఖ్యలు మాత్రం ఔరా అనిపించేలా వున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యలు తనవి కావని, పార్టీ నాయకత్వం ఇచ్చిన డైరెక్షన్‌తోనే ఆ విమర్శలు చేశానని ఎర్రబెల్లి దయాకరరావు చెప్పటం మాత్రం రోతగా వుంది.’అని ఒక పత్రికా వ్యాఖ్యాత వాపోయారు.

     గతంలో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీల వారిని ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవటానికి ఏ విధానాన్ని అనుసరించింది? ఏ లజ్జ ప్రకారం వచ్చిన వారు వచ్చారు, చేర్చుకున్నవారు ముద్ర వేశారు. మామూలుగా పార్టీ మారితే ఎవరు గుర్తిస్తారు, ఏ ప్రచార సాధనాలు పట్టించుకుంటాయి.ఇప్పుడు దేనికైనా ఒక కిక్కు కావాలి.అదే జరుగుతోంది. ఒక మహానటుడు పెట్టిన తెలుగుదేశం పార్టీలో ఎందరో రాజకీయ మహానటులు చేరారు. అందువలన అక్కడ జరిగేది కూడా అంతా నాటకీయమే, సినిమా ఫక్కీనే .తెలుగుదేశం పార్టీలో ఎవరైనా చేరితే ఒక పద్దతి వున్నట్లు ఆ పార్టీ నుంచి బయటకుపోతే లజ్జలేనట్లా ?

    పార్టీ ఫిరాయించిన ఎర్రబెల్లి దయాకరరావు తాను టిఆర్‌ఎస్‌ నాయకత్వం గురించి అనుచితంగా మాట్లాడి వుంటే క్షమించాలని అదంతా అధినేత డైరెక్షన్‌ ప్రకారమే జరిగిందని చెప్పటంపై అభ్యంతరం ఎందుకు ? అసలు అలా మాట్లాడని వారెవరు? పార్టీ ఫిరాయించిన తరువాత అలా చెప్పని వారెవరు? ఎక్కడో ఒక్కడ మొదలు పెట్టాలి గనుక చంద్రబాబు నాయుడినే తీసుకుందాం. తెలుగుదేశం పార్టీ ప్రారంభంలో చంద్రబాబు నాయుడు తొలి ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసినపుడు ఎన్టీరామారావు మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎలాంటి విమర్శలు చేశారో కావాలంటే పాత పత్రికలు తిరగవేసుకోవచ్చు. ఎందుకు చేసినట్లు ? ఏ గూటి చిలక ఆగూటి పలుకులు పలికినట్లు అదే చంద్రబాబు తెలుగుదేశంలో చేరిన తరువాత కాంగ్రెస్‌ పార్టీని తిట్టని తిట్టు , చేయని విమర్శ వుందా ? ఎవరి డైరెక్షన్‌ ప్రకారం అదంతా జరిగింది? మైసూరా రెడ్డి కాంగ్రెస్‌లో వున్నపుడు విద్యుత్‌ చార్జీల వుద్యమం సందర్బంగా తెలుగుదేశం నాయకత్వంపై చేసిన విమర్శలేమిటి ? తరువాత అదే పెద్దమనిషి తెలుగుదేశంలో చేరినపుడు చెప్పిన మాటలు తియ్యగా అని పించలేదా ? అంతెందుకు ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యులుగా వున్నవారు, పార్టీలో ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సీలు,ఎంపీలుగా వున్న వారు ఎక్కడి నుంచి వచ్చారు ? పూర్వపు పార్టీలలో వున్నపుడు చేసిన విమర్శలు తెలుగుదేశంలో చేరి తిరిగి తమ పాత పార్టీలపై చేస్తున్న విమర్శలు రోతగా అనిపించటం లేదా ? అంతెందుకు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నూతన శాసనసభా పక్ష నాయకుడిగా నియమితుడైన రేవంత రెడ్డి ఒకనాడు టిఆర్‌ఎస్‌లో వున్న పెద్ద మనిషే కదా ! అప్పుడు ఇతర పార్టీలను ఎందుకు తిట్టావంటే నాయకత్వ డైరెక్షన్‌ అనో పార్టీ విధానమనో గాక కొత్తగా ఇప్పుడేమి చెబుతారు ?

     ఈ రోజు తెలుగుదేశం పార్టీలో మిగిలివున్న నేతలు, ఎంఎల్‌ఏలు కూడా ఆ పార్టీలో ఎంత కాలం వుంటారనేది ఒక ప్రశ్న. రేపు టిఆర్‌ఎస్‌తో రేవంత రెడ్డి సర్దుబాటుకు రారన్న గ్యారంటీ ఏమన్నా వుందా ? ఒకప్పుడు సిపిఎంలో వున్న సండ్రవెంకట వీరయ్య తెలుగుదేశంలోకి వెళ్లగలిగినపుడు మరో పార్టీలోకి వెళ్లటానికి అభ్యంతరం ఏముంటుంది? డొల్లుపుచ్చకాయలకు ఒక మార్గం, ఒక పద్దతి ఏముంటుంది?ఎటయినా దొర్లుతారు . ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి పోయిన రేవంత రెడ్డి, ఇతరులు రేపు పార్టీ ఫిరాయించి దయాకరరావు మాదిరే తాము నాయకత్వ డైరెక్షన్‌ మేరకే ఆలా చేశాం, డబ్బు కూడా వారే సమకూర్చారు తప్ప మావరకు మేము పరిశుద్ధులమే అని అప్రూవర్‌లుగా మారరని గ్యారంటీ ఏముంది? తెలుగుదేశం పార్టీ మహిళ అధ్యక్షురాలిగా రోజా కాంగ్రెస్‌ పార్టీని ఎలా తిట్టిందో తెలిసిందే. రేపు తిరిగి ఆమె మరో శుభముహూర్తాన స్వంత ఇంటికి రారని, వస్తే తిరస్కరిస్తారన్న గ్యారంటీ ఏమైనా వుందా ? నిత్యం వైఎస్‌ఆర్‌సిపి ప్రజాప్రతినిధులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న తెలుగు దేశం వారు తిట్టిన తిట్లు లేదా మర్యాదస్తుల భాషలో చెప్పాలంటే విమర్శలను పట్టించుకుంటుందా ? ఎందుకీ ఆత్మవంచన ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

దేనికీ ‘అసహనం’, ఎందుకా ‘సహనం ‘ ఓ మహాత్మా ! ఓ మహర్షీ !!

13 Saturday Feb 2016

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

Intolerance, Reservations, Tolerance

 

ఎం కోటేశ్వరరావు

     ఇటీవలి కాలంలో సామాజిక మీడియాలో రిజర్వేషన్లు,సామాజిక వివక్షపై జరుగుతున్న చర్చలలో రెండు రకాల ధోరణులు వ్యక్తం అవుతున్నాయి. భాష, భావం తీరుతెన్నులు చూస్తే వుభయులూ తీవ్ర స్ధాయిలోనే వున్నట్లు కనిపిస్తోంది. ఒకటి వేల సంవత్సరాల అణచివేత, అమానుష వివక్షపై ఎందుకీ సహనం అన్న ఆగ్రహంతో కూడిన జ్వాల. రెండవది దీనికి బాధ్యత తమది కానపుడు దాని పర్యవసానాలను తామెందుకు అనుభవించాలన్న ఆక్రోశం, దాని నుంచే దళితులు, గిరిజనులు, ఓబిసిలకు రిజర్వేషన్లు ఎంతకాలం కొనసాగిస్తారు అనే తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. పుట్టుక అన్నది యాదృచ్చికం. కానీ ఒక చోట పుట్టిన వారికి ఒక ముద్రవేసి ఒక విధంగానూ, మరొక చోట పుట్టిన వారికి మరో తోక తగిలించి వేరే విధంగా చూడటం అన్నది కాదనలేని వాస్తవం. రిజర్వేషన్ల వయస్సు ఏడు పదులు, మరి అమానుష వివక్ష, అణచివేత ఎంత కాలం నుంచి కొనసాగుతోంది, ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది, చెప్పేవారెవరు ?

      రిజర్వేషన్ల గురించి రానున్న రోజుల్లో మరోసారి తీవ్ర చర్చకు తెరలేవ నుంది.ప్రయివేటు రంగంలో కూడా వుద్యోగాలలో రిజర్వేషన్‌ విధానాలను పాటించాలని వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ (ఎన్‌సిబిసి) కేంద్ర ప్రభుత్వానికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన సిఫార్సు చేసింది. ప్రభుత్వ రంగంలో వున్న రిజర్వేషన్లనే తొలగించాలని తాము కోరుతుంటే ప్రయివేటు రంగంలో కూడా అమలు జరపాలని సిఫారసు చేయటం ఏమిటని రిజర్వేషన్‌ వ్యతిరేకులు మండిపడుతున్నారు. 1991లో ప్రారంభమైన సరళీకరణ విధానాల కారణంగా అప్పటి నుంచి క్రమంగా ప్రభుత్వరంగంలో పెట్టుబడులు నిలిచిపోయాయి. అటు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గానీ కొత్త పరిశ్రమ ఒక్కటంటే ఒక్కటి రాలేదు. హెచ్‌ఎంటి, ఐడిపిఎల్‌ , భెల్‌ వంటి కొన్నింటిని ఒక పధకం ప్రకారం మూతపడేట్లు చేశారు. అవి పోగా వున్నవాటిలో యాంత్రీకరణ, పాక్షిక ప్రయివేటీకరణ వంటి చర్యల ద్వారా 2006 -12 మధ్య కాలంలో ప్రభుత్వ రంగంలో 3.3శాతం వుద్యోగాలు తగ్గిపోగా, ఇదే సమయంలో ప్రయివేటు రంగంలో 35.7శాతం పెరిగాయి. ప్రయివేటు రంగం అందరికీ గౌరవ ప్రదమైన జీవనానికి వుపాధి కల్పించి వుంటే అసలు ఈ రిజర్వేషన్ల అనుకూలం లేదా వ్యతిరేకత సమస్య తలెత్తి వుండేది కాదు. ఈనేపధ్యంలోనే ఈ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు జరపాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. దానికి అనుగుణ్యంగానే ఎన్‌సిబిసి సిఫారసు వెలువడింది. ఇప్పటికే ఈ డిమాండ్‌పై పలు చోట్ల ప్రచార ఆందోళన చేపట్టిన వామపక్షాలు, అవి పనిచేసే ప్రజాసంఘాలు సహజంగానే ఈ పరిణా న్ని హర్షిస్తాయి. తమ వుద్యమాలను మరో మెట్టు ముందుకు తీసుకుపోతాయి.

     ప్రస్తుతం అధికారంలో వున్న కేంద్ర ప్రభుత్వం ఈ సిఫారస్‌ను తిరస్కరిస్తుందా? ఆమోదిస్తుందా? ఆమోదిసే,్త అమలు జరుపుతుందా? ఎప్పటి నుంచి? ఎంత కాలం అమలు జరుపుతుంది వంటి అనేక ప్రశ్నలు ముందుకు వస్తాయి. ఇవన్నీ చర్చకు తెరలేపుతాయి. బిజెపి, కాంగ్రెస్‌, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌, డిఎంకె, అన్నాడిఎంకె వంటి ప్రాంతీయ పార్టీలన్నీ పాలకవర్గ పార్టీలే. అధికారంలో లేనపుడు సామాన్య జనం పట్ల కడవల కొద్దీ కన్నీరు కార్చి, అధికారం రాగానే వారిని మర్చిపోయి పెట్టుబడిదారులు, భూస్వాముల సేవలో తరిస్తూ వారి ప్రయోజనాలను కాపాడే వారిని పాలకవర్గ పార్టీలు అంటారు.మిగతావాటిలో సిపిఎం, సిపిఐ వంటి వామపక్ష పార్టీలు కొన్ని సందర్బాలలో అక్కడక్కడా అధికారానికి వచ్చినప్పటికీ వాటిని పాలకవర్గ పార్టీలుగా పరిగణించటం లేదు. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలలో డెమోక్రటిక్‌, లేబర్‌, సోషలిస్టు పార్టీల పేరుతో వున్నవి కూడా ప్రతిపక్షంలో వుండగా ఏమి చెప్పినా సామాజికాంశాలలో తరతమ తేడాలు తప్ప ఆర్ధిక విషయాలలో మిగతా పార్టీలకు ఏమాత్రం తీసిపోవు కనుక వాటిని కూడా పాలకవర్గ పార్టీలే అంటున్నారు.

       ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల విషయానికి వస్తే ఎన్‌సిబిసి సిఫార్సును బిజెపి స్వాగతించింది. అయితే సాధ్వీ సావిత్రీ అదియును నీ పతిప్రాణంబు దక్క అని యముడు షరతు పెట్టినట్లు ఒక చిన్న మెలిక పెట్టింది. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు జరపటానికి అనువైన పరిస్ధితులు వచ్చినపుడు మాత్రమే అమలు జరపాలి తప్ప బలవంతంగా చేయకూడదు అని బిజెపి ప్రతినిధి విజయ్‌ సోంకార్‌ శాస్త్రి ముక్తాయింపు ఇచ్చారు. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఏ ప్రభుత్వం ఈ దిశగా ఏమీ చేయలేదని కూడా విమర్శించారు. అమలుకు అనుకూలమైన పరిస్ధితులంటే ఏమిటో, అవి ఎప్పుడు వస్తాయో మాత్రం చెప్పలేదు. ప్రతి పక్ష కాంగ్రెస్‌ కూడా స్పందించింది.’ ఎల్లవేళలా సమాజంలో సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు తాము చర్యలు తీసుకున్నామని,అందుకోసం ఎస్‌సి,ఎస్‌టి మరియు ఓబిసిల రిజర్వేషన్లు అమలు జరిపేందుకు తాము చట్టాలు తెచ్చామని, ప్రయివేటు రంగంలో కూడా రిజర్వేషన్ల గురించి తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నామని కాంగ్రెస్‌ గుర్తు చేసింది.

       ఈ సమస్యపై ప్రతిపక్షాలు దెబ్బలాటలకు కవ్వించే అవకాశం వున్నందున బిజెపి జాగ్రత్తగా వ్యవహరించాలని ఆ పార్టీ మేథావులు అప్పుడే ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు.ఈ సవాలును తేలికగా తీసుకోవద్దంటూ రిజర్వేషన్ల ఫలాలు దిగువకు సక్రమంగా అందాల్సిన వారికి అందనందున వాటిని సమీక్షించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగత్‌ చేసిన వ్యాఖ్యలు వాస్తవమే అయినా బీహార్‌ ఎన్నికలలో బిజెపి భారీ మూల్యం చెల్లించించిందని వారు గుర్తుకు తెచ్చారు. రాజ్యాంగం ఆర్టికల్‌ 16లో ప్రభుత్వరంగంలో రిజర్వేషన్ల గురించి మాత్రమే వుందని ప్రయివేటు రంగం గురించి ఏ కోశానా ప్రస్తావన లేదని, అయితే రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పని చేయవచ్చని, దీని వలన తాత్కాలికంగా బిజెపి రాజకీయ ప్రయోజనం పొందినప్పటికీ మండల్‌ తరహా ఘర్షణలు చోటు చేసుకోవచ్చని, ఓబిసిల తరువాత మతపరమైన మైనారిటీలు కూడా తమకూ అమలు జరపాలని కోరతారని, ఆర్ధిక వ్యవస్ధకు ఎంతో నష్టం కలిగిస్తుందని కాషాయ మేథావులు హెచ్చరిస్తున్నారు. యుపిఏ-2 హయాంలో పారిశ్రామికవేత్తలు బయటి దేశాలలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రాధాన్యత ఇవ్వటంతో పెట్టుబడులు బయటకు పోయాయని, ఇప్పుడు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తే మేథావులు కూడా వలస పోతారని బెదిరిస్తున్నారు. సామాజికంగా వెనుక బడిన తరగతుల వారికి కావాలంటే వుచిత విద్య, విద్యా రుణాల సౌకర్యం వంటివి కలిగించాలని ఎంతో వుదారంగా సలహాలు ఇస్తున్నారు.

     ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు వుద్రేకాలను తగ్గించుకొని ఆలోచించటం అవసరం. సమాజంలోని మెజారిటీ ఎస్‌సి,ఎస్‌టి,ఓబిసి సామాజిక తరగతుల శ్రమ స్వేదంతో సృష్టించబడేదే సంపద. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శ్రమలో ఏ మాత్రం పాత్రలేని కొన్ని సామాజిక తరగతులు వునికిలో వుండటం మన సమాజ ప్రత్యేకత. దానికి కూడా తమకు అనుకూలమైన నియమనిబంధనలను రూపొందించారు. సామాజిక పరిణామ క్రమంలో వివిధ రూపాలలో అధికారిక వ్యవస్ధలు వునికిలోకి వచ్చాయి.అవి సమాజ పురోభివృకి ఆటంకంగా మారినపుడు వాటిని తొలగించి మెరుగైన కొత్త వ్యవస్ధలను ఏర్పాటు చేసుకుంది సమాజం. భూస్వామిక వ్యవస్ధ తమకు ఆటంకం అని భావించినపుడు ఐరోపా దేశాలలో పెట్టుబడిదారులు ఆ భూస్వామిక వ్యవస్ధను నామరూపాలు లేకుండా నాశనం చేశారు. ఫ్రెంచి విప్లవం అంటే అదే. అటువంటిది మన మన దేశంలో జరగలేదు. బ్రిటీష్‌ వారు మన దేశాన్ని ఆక్రమించి తమకు అవసరమైన కొన్ని పరిశ్ర మలను ప్రోత్సహించారు తప్ప మన దేశాన్ని తమకు అవసరమైన ముడిసరకులను అందచేసే దేశంగానే వుంచారు. అందుకే భూస్వాములతో రాజీపడి వారిని కూడా కొనసాగించారు. ఈ కారణంగానే ప్రస్తుతం మన దేశంలో పెట్టుబడిదారుల నాయకత్వంలో భూస్వాములు కూడా అధికార వ్యవస్ధలో పెత్తనం సాగిస్తున్నారు. ఇటువంటి ప్రత్యేక పరిస్ధితి ప్రపంచంలో మరోచోట కనపడదు.అందువలననే మన సమాజంలో కూడా భూస్వామిక, పెట్టుబడిదారీ లక్షణాలు రెండూ జంటగా కనిపిస్తున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రభావంతో కొన్ని అంశాలో పురోగామి వైఖరిని ప్రదర్శించేవారు మరికొన్ని విషయాలలో తిరోగామి భావజాలానికి లొంగిపోతున్నారు. సామాజిక వివక్ష చట్ట ప్రకారం నేరం అని అంగీకరిస్తూనే తమదాకా వచ్చేసరికి సాంప్రదాయం, ఎప్పటి నుంచో వుంది, ఆ మనోభావాలను కూడా మనం అంగీకరించాలి కదా అనే వాదనలతో చట్ట వ్యతిరేకమైన తాతగారి నాన్నగారి భావాలను ముందుకు పెడుతున్నారు. అది సమాజంలో ఘర్షణకు దారితీస్తోంది.

     ప్రయివేటు రంగ రిజర్వేషన్ల విషయంలో కూడా దీన్ని చూడవచ్చు. ప్రయివేటు రంగంలో ఏ చిన్న పరిశ్రమ పెట్టాలన్నా, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కావాలన్నా చేయాల్సింది ఎవరు ? ప్రభుత్వమే. పెట్టుబడి ఇవ్వాల్సింది ఎవరు ప్రభుత్వరంగంలోని బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలే. అంటే ప్రయివేటు రంగం గాలిపీల్చి మనుగడ సాగించాలంటే ప్రభుత్వం లేకుండా ఒక్క క్షణం నడవదు. ప్రభుత్వమంటే ప్రజలు తప్ప మరొకటి కాదు. అందువలన ప్రభుత్వ రంగం పాటిస్తున్న విధానాలను ప్రయివేటు రంగం అమలు జరపాలని కోరటం ప్రజల హక్కు తప్ప దయాదాక్షిణ్యం కాదు. ఎవరైనా తమకు అందుకు మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటే ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా తమ స్వంత పెట్టుబడులు, విద్యుత్‌, నీరు, భూమి, రోడ్ల వంటి మౌలిక సదుపాయాలను స్వంతంగా సమకూర్చుకోమనండి. అది సాధ్యం కాదు కనుకనే 2004 నవంబరు 18న దేశంలోని 218 అగ్రశ్రేణి సంస్ధలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు సాధికారత కలిగించేందుకు మనసా వాచా కర్మణా తాము చేయాల్సిందంతా చేస్తామని రాతపూర్వంగా నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు నివేదించాయి. అంటే అర్ధం ఏమిటి స్వచ్చందంగా ఆ తరగతుల వారికి తగు స్ధానం కల్పిస్తామని చెప్పటమే కదా? ఆ వాగ్దానాన్ని ఎన్ని సంస్ధలు ఎంత మేరకు అమలు జరిపాయి? రాజ్యాంగంలో హక్కులు కాకుండా ఆదేశిక సూత్రాల పేరుతో అనేక పురోగామి భావాలను అమలు జరపాలని చెప్పారు. కానీ వాటిని హక్కుగా అమలు జరిపే పరిస్ధితి ఇంకా మనకు రాలేదనే పేరుతో మన పాలకులు ఎగవేస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు ఎటా ఐదారు లక్షల కోట్ల రూపాయలను రాయితీలుగా ఇస్తున్న ప్రభుత్వాలు స్కూళ్లలో పిల్లలకు అవసరమైన తరగతి గదులు, మరుగుదొడ్లు కట్టించాలంటే డబ్బు లేదంటూ ఇంతకాలం వాయిదా వేశాయా లేదా ? కనుకనే ప్రయివేటు రంగంలో వుద్యోగాల రిజర్వేషన్లు చట్టబద్దంగా అమలు జరపాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది.

     రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు జరపాల్సింది పది సంవత్సరాలే కదా, అయినా డెబ్బయి సంవత్సరాలుగా అమలు జరుపుతున్నారు, ఇంకా ఎంతకాలం ఇలా అని అనేక మంది ‘అసహనం’ వ్యక్తం చేస్తున్నారు. నిజమే దానిని అర్ధం చేసుకోవాల్సిందే, మనది ప్రజాస్వామ్యం కనుక ఆ భావాల వ్యక్తీకరణను ‘సహించాల్సిందే’, ఎలాంటి మినహాయింపులు లేవు. ఎలాంటి చట్టాలు లేకుండానే వేల సంవత్సరాల పాటు కుల వివక్ష, అణచివేతను సమాజం అమలు జరిపింది. చట్టబద్దంగా రద్దు చేసిన తరువాత కూడా అమలు జరిపేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారు. దళితులు దేవాలయ ప్రవేశ ం చేస్తే అవి మలిన పడ్డాయనే పేరుతో శుద్ధి చేయటం నేరం. దానికి ఎవరినైనా ఇంతవరకు శిక్షించారా ? వివక్షను ఇంకా రూపు మాపలేదెందుకన్న ‘అసహనం’ ఎందుకు వ్యక్తం చేయరు? అసలు రిజర్వేషన్లకు మూలం ఆ సామాజిక వివక్షే కదా ? దాన్ని నిర్మూలించకుండా దాని పర్యవసానాలను వ్యతిరేకించటం, అసహనం వ్యక్తం చేస్తే ప్రయోజనం వుంటుందా ?

     కుల వివక్షకు వ్యతిరేకంగా ఆరువందల సంవత్సరాల నాడే వేమనతో ప్రారంభించి అంబేద్కర్‌ వరకు ఎందరో సంస్కర్తలు తమ పరిధులు, పద్దతులలో వాటిని నిరసించి వ్యతిరేకించారే మరి సమాజం మొత్తంగా దానిని ఎందుకు నిరసించటంలేదు? ఎక్కడైనా వ్యతిరేకిస్తే సామూహిక దాడులకు పాల్పడటాన్ని ఏమనాలి? ఎక్కడో దక్షిణాఫ్రికాలో, అమెరికాలో నల్లజాతీయుల పట్ల వివక్షను ఖండించే మనం మన చుట్టుపక్కల మానవత్వానికే మాయని మచ్చగా వున్న వివక్ష పట్ల ఎక్కడలేని ‘సహనం ‘ ఎందుకు వహిస్తున్నట్లు? ఆ వివక్షను ఎదుర్కొనే వారి ఆక్రోశానికి ఎవరు సమాధానం చెబుతారు ?

     ఏదేశంలోనూ లేని రిజర్వేషన్లు మన దేశంలోనే ఎందుకు అని ప్రశ్నించే వారు ఎక్కడా లేని వివక్ష, కుల వ్యవస్ధ ఇక్కడ ఎందుకో చెప్పాల్సిన అవసరం లేదా ? అదంతా పూర్వజన్మ సుకృతం ఎవరు ఎంత చేసుకుంటే అంత అనుభవించాలి అని చెబుతారా ? అయితే రిజర్వేషన్లు కూడా అలాంటివే అనుకోవాలి. వేదాలలోనే విజ్ఞానం అంతా నిక్షిప్తమై వుందని ఎప్పటి నుంచో చెబుతున్నారు. తిరోగమన శక్తులు అధికార కేంద్రాలలో తిష్టవేయటంతో ఇటీవలి కాలంలో మరోసారి చెప్పటం ఎక్కువైంది. అదెంత నిజమో ? వాస్తవాలేమిటో కాసేపు పక్కన పెడదాం. ఆ వేదాలను బ్రహ్మ ముఖంలోంచి పుట్టుకు వచ్చారని చెప్పుకొనే బ్రాహ్మణులు మాత్రమే చదవాలని,చెప్పాలన్న రిజర్వేషన్లు అవి పుట్టినప్పటి నుంచి కొనసాగుతున్నాయి కదా ? బ్రాహ్మణులు తప్ప వేరే కులాల వారు చదవకూడదన్న నిషేధం ఇప్పటికీ కొనసాగుతున్నదా లేదా ? వేదాలు, పురాణాలలో చెప్పినట్లు బ్రాహ్మణులు తిరిపెమొత్తుకుని తినాలి తప్ప వుద్యోగాలు చేయకూడదనే నిషేధాలు ఇప్పుడు లేవే ? రిజర్వేషన్లు కూడా జనాభా ప్రాతిపదికగా దామాషా పద్దతి ప్రకారం అమలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదే. వేద పఠనంపై కొనసాగిన రిజర్వేషన్లతో పోల్చితే నేటి వుద్యోగ, విద్యా రిజర్వేషన్ల వ్యవధి ఎంత ? అన్నింటినీ మన ఖర్మ అనుకొని సహిస్తున్నవారు రిజర్వేషన్ల విషయంలో కూడా అలా అనుకోకుండా వ్యతిరేకంగా వీధులకు ఎందుకు ఎక్కుతున్నట్లు ? హింసాకాండకు ఎందుకు పాల్పడుతున్నట్లు ?

    సామాజిక అంశాలలో కొనసాగుతున్న వివక్ష గురించి ఎక్కడలేని ‘సహనం’ వ్యక్తం అవుతోంది. రిజర్వేషన్లపై వెల్లడిస్తున్న వ్యతిరేకత, ఇతర సామాజిక వివక్షపై వ్యక్తం చేయటం లేదంటే అర్ధం దాన్ని సహిస్తున్నట్లే. సమాజంలో ఈ వైఖరి కొనసాగినంత కాలం ఏదో ఒక రూపంలో దాని పర్యవసానాలు సంభవిస్తూనే వుంటాయి. రిజర్వేషన్లు కొనసాగుతూనే వుంటాయి. అయితే రిజర్వేషన్లే అణచివేతకు గురైన సామాజిక వర్గాలకు ఆశించిన మేలు చేకూర్చలేవని కూడా ఈ కాలంలో రుజువైంది. అందువలన పరిమితంగా వున్న అవకాశాలను చేజిక్కించుకొనేందుకు కొట్లాడుకోవటం కాకుండా అందరికీ అన్ని అవకాశాలు కల్పించే ప్రత్యామ్నాయ విధానాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం లేదా ? ఆలోచించండి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

తమరెవరి వలలో చిక్కుకున్నారు లోకేశా ?

11 Thursday Feb 2016

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, CHANDRABABU, Nara lokesh

సత్య

     ‘తాను అభివృద్ధి చేశానని చెప్పుకున్న హైదరాబాదు నగరం తన పార్టీకి ఒక్కటంటే ఒక్కటే కార్పారేటర్‌ సీటు కట్టబెట్టిందంటే ఆయన చెప్పింది అవాస్తవమైనా అయి వుండాలి లేదా చంద్రబాబును నమ్ముకుంటే కుక్కతోకను బట్టి గోదావరిని ఈదినట్లే అని జనం నిర్ధారణకు వచ్చి వుండాలి.’ అని హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల పర్యవసానాల గురించిన వ్యాఖ్యలో పేర్కొన్నాను. జనమే కాదు, తెలుగుదేశం నేతలు కూడా అదే నిర్ధారణకు వచ్చారని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. తెలుగుదేశంలో ఇంకే మాత్రం కొనసాగినా తమకు భవిష్యత్‌ లేదని ఇంతకాలం దాన్ని వుపయోగించుకొని లబ్ది పొందిన వారంతా భావిస్తున్నారు. అందుకే తట్టాబుట్టా సర్ధుకుంటున్నారు. ఇంకా మేయర్‌ ఎన్నికలు జరగక ముందే ఏకంగా తెలుగుదేశం శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు తెరాస కారు ఎక్కేశారు. తిమ్మినిబమ్మిని చేయటంలో, చాణక్య నీతిని ప్రదర్శించటంలో తెలుగుదేశం నేతలు తిరుగులేని చంద్రబాబు నాయుడిని చూసి ఎంతో నేర్చుకొని ఆయనకే పాఠాలు చెబుతున్నారంటే అతిశయోక్తికాదు. పార్టీలు మారటం సాకులు చెప్పటం ఇప్పుడు ఎంత సులభమైందో. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా ఏ పార్టీలో అయినా చేరవచ్చు. అందుకు మారేవారికే కాదు, చేర్చుకొనే వారికి కూడా సిగ్గు ఎగ్గులు లేవు.ఎక్కడ ఎలా కట్టిందా అని కాదు మా దొడ్లో ఈనిందా లేదా అన్నదే ప్రాతిపదిక. ఇంతకాలం కాంగ్రెస్‌లో వున్నా తెలుగుదేశంలో వున్నా వారు జ నానికి చెప్పిందేమిటి తమ నియోజకవర్గాలను, ప్రజలను తామెంతో అభివృద్ధి చేశామనే కదా ! అలాంటి వారు పార్టీ మారటానికి చెబుతున్న తొలిసాకు నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలు తీర్చటం కోసమే అని కదా చెబుతోంది. ఎంత ఆత్మవంచన. అయినా సరే జనం అలాంటి వారికి పట్టం కడుతున్నారు. ఇదింకా సామూహిక ఆత్మవంచన.

     హైదరాబాదు ఎన్నికలలో అనూహ్యంగా మట్టి కరచిన తెలుగుదేశం నేతలు కింద పడ్డా మాదే పైచేయి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికలలో తమకు హైదరాబాదులో లక్షన్నర ఓట్లు అధికంగా వచ్చాయని, తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ చెబుతున్నారు. ఇంకా నయం గత ఎన్నికల కంటే నా వయస్సు ఐదేళ్లు పెరిగింది అని చెప్పలా. తాను తెలంగాణా తెలుగు దేశం నాయకులతో మాట్లాడానని ఇంకెవరూ పార్టీ నుంచి బయటకు పోరని చెప్పిన మాటలు ఇంకా టీవీలలో మోగుతుండగానే ఏకంగా పార్టీ శాసనసభా పక్షనేతే ఫిరాయించటాన్ని లోకేష్‌ బాబు పసిగట్టలేకపోయారు. ఒకే ఒక్కడు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడెందుకు అంటే దానికి కారణాలు చెప్పకుండా తాము వేసిన ఎత్తుగడలో తెరాస చిక్కుకు పోయి జనానికి అమలు జరపలేని 60వేల కోట్ల రూపాయల వాగ్దానాలు చేసిందని లోకేష్‌ చంకలు కొట్టుకుంటున్నారు. అదీ ఎక్కడా ? విజయవాడ నడి గడ్డ మీద ! అమరావతితో కూడిన ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్‌లా మారుస్తానని వాగ్దానం చేసిన చోట. కాపులకు రిజర్వేషన్లు, రైతులతో సహా అన్ని తరగతుల రుణమాఫీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, లక్షల కోట్లతో రాజధాని నిర్మాణం, బాబొస్తే ఇంటికో జాబు ఇలా ఎన్నిలక్షల కోట్లో తెలియని వాగ్దానాలను తెలుగుదేశం ఎవరి వలలో చిక్కుకొని చేసినట్లో లోకేష్‌ చెప్పగలరా ? తెరాస అమలు జరపలేని వాగ్దానాలు చేసి ఇరుక్కు పోయిందని సంతోష పడుతున్న లోకేష్‌ ఆంధ్రప్రదేశ్‌లో తాను, తన తండ్రి చేసిన వాగ్దానాలతో ముందుంది ముసళ్ల పండుగ అని గుర్తించినట్లు లేదు. తెలంగాణాలో తగిలిన ఎదురు దెబ్బలతో జనం దృష్టిని మరల్చటానికి ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఫిరాయింపులను ప్రోత్సహించటానికి తెలుగుదేశం ప్రయత్నించవచ్చు. ఈ రోజుల్లో అత్యంత సులభమైన చౌకబారు వ్యవహారమది. కోట్ల రూపాయలలో పెట్టుబడి పెట్టి ఎన్నికలలో గెలిచిన వారు వాటితో పాటు లాభాలను కూడా రాబట్టుకొనేందుకు అధికారం ఎక్కడ వుంటే అక్కడ చేరతారు. అందులో తెలియనిదేముంది?

     చంద్రబాబు నాయుడు డబ్బుతో కూడుకున్న వాగ్దానాలు అమలు జరపకుండా కాలక్షేపం చేస్తున్నారంటే కొంత వరకు అర్ధం చేసుకోవచ్చు. తెలుగుదేశం చేసిన కాపురిజర్వేషన్ల వాగ్దానం వలన ప్రభుత్వంపై అదనపు ఆర్ధిక భారం పడేదేముంది. అయినా ఇరవై నెలల పాటు పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక కమిషన్‌ వేసి ఏడు నెలలు, తొమ్మిది నెలల్లోనో ఫలితం చూపాలని హడావుడి చేస్తున్నారు. ఇది కొత్త సమస్యలు, సమీకరణాలకు దారి తీయటం అనివార్యంగా కనిపిస్తోంది. ఆ గందరగోళం కారణంగానే బుర్ర ఖరాబై గత వారంలో చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారా అని పిస్తోంది.

     అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణాలో తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఆర్‌ కృష్ణయ్య అని చంద్రబాబు నాయుడు ప్రకటించి వెనుకబడిన తరగతులలో ఒక బలమైన తరగతి ఓట్ల కోసం గాలం వేశారు. ఎవరినైనా వాడుకో, వుపయోగించుకో, అవసరం తీరిన తరువాత వదిలెయ్‌ అన్న ఆధునిక నీతి చంద్రబాబు నాయుడికి తెలిసినంతగా మరొకరికి తెలియదు.ఎన్నికలు ముగిసిన తరువాత ముఖ్యమంత్రి అభ్యర్ధి కృష్ణయ్యను కనీసం శాసనసభా పక్ష నేతగా కూడా చేయలేదు. గత ఎన్నికలలో ఎల్‌బి నగర్‌ నియోజకవర్గంలో కృష్ణయ్యను నిలిపిన కారణంగా అపుడు తమకు రావాల్సిన మెజారిటీ తగ్గిపోయిందని హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలలో అక్కడ ఒక్కటంటే ఒక్క కార్పొరేటర్‌ స్ధానమైనా దక్కించుకోలేకపోయిన తరువాత చంద్రబాబు మాట్లాడుతున్నారు. బోడిగుండుకు మోకాలికీ ముడి పెట్టటం అంటే ఇదే. ఎంతో అనుభవం కలిగిన రాజకీయ నేత చంద్రబాబు నోటి నుంచి ఇలాంటి మాటలు రావటం అంటే మున్సిపల్‌ ఎన్నికలు ఆయన బుర్రను ఎంతగా ఆందోళనకు గురిచేశాయో అర్ధం చేసుకోవచ్చు. అదే విధంగా ఎస్సీలలో ఎవరూ పుట్టాలని కోరుకోరు అని ఒక అసందర్భ ప్రేలాపన దాని పర్యవసానమే.తనకు కుల పట్టింపులు లేవని చంద్రబాబు నాయుడు నమ్మబలుకుతారు. అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గరా అని తిరుపతి ఎస్‌వి యూనివర్సిటీ చరిత్ర విప్పితే కులాన్ని వుపయోగించుకొని పైకి వచ్చిన పెద్ద మనుషులెవరో బహిరంగ రహస్యం. విశ్వవిద్యాలయాలలో కుల జాడ్యం అక్కడి నుంచే వ్యాపించిందన్నది దాచినా దాగని సత్యం .

     కుల రాజకీయాలు చేయటం, దాని వలన పొందేలబ్ది ఏమిటో ఈ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీలకు తప్ప మిగతా పార్టీలన్నింటికీ వెన్నతో పెట్టిన విద్య.ఎవరు దీనికి కారకులు అని తర్కించుకోవటం అంటే గొంగట్లో అన్నం తింటూ వెంట్రుల గురించి మాట్లాడుకోవటం వంటిదే. ఎవరు వాటి నుంచి బయట పడ్డారన్నదే నేడు గీటురాయిగా వుండాలి. రిజర్వేషన్లు సమస్యల పరిష్కారానికి మార్గాలు కావన్నది చరిత్ర చెబుతున్నది. అసలు ప్రభుత్వ రంగమే అంతరిస్తున్న తరువాత ప్రభుత్వ వుద్యోగాలకు మాత్రమే రిజర్వేషన్లు పరిమితం అవుతున్నాయి. రిజర్వేషన్లు కుల నిర్మూలనకు ఒక మార్గంగా అంబేద్కర్‌ భావించారు. ఇప్పుడు ప్రయివేటీకరణ పర్యవసానంగా ప్రభుత్వ వుద్యోగాలు తగ్గిపోతూ దానికి అనుగుణంగా రిజర్వేషన్లు కూడా తగ్గిపోతున్నాయి. దీనికి తోడు తగిన అభ్యర్ధులు లేని కారణంగా ఎస్‌సిఎస్‌టి బ్యాక్‌లాగ్‌ పోస్టులు పెరుగుతున్నాయి. కొన్ని సందర్బాలలో వుద్యోగ ప్రకటనలు చేసినపుడు అవే ఎక్కువగా వుండటంతో మిగిలిన వారు అపార్ధం చేసుకోవటం కూడా జరుగుతోంది. ఈ పూర్వరంగంలోనే రిజర్వేషన్ల పరిధిలోకి తమనుకూడా తీసుకురావాలని కొత్త వారు డిమాండ్‌ చేయటం, కొత్త వారిని తీసుకువచ్చి తమ అవకాశాలను దెబ్బతీయ వద్దని ఇప్పటికే రిజర్వుడు తరగతులుగా వున్నవారు ప్రతిఘటించటం దేశమంతటా జరుగుతోంది.ఏది సమర్ధనీయం ఏది కాదు కాదు అంటే తిరిగి చర్చ విత్తు ముందా చెట్టుముందా అన్నదగ్గరకు చేరుతోంది.

     అందరికీ విద్య, వుద్యోగ అవకాశాలు వుంటే ఇలాంటి సమస్యలు అంతగా ముందుకు రావు. మన దేశంలో ఈ సమస్యలతో పాటు ప్రపంచంలో ఎక్కడాలేని సామాజిక విభజన, వివక్ష సమస్యలు కూడా జనానికి తోడయ్యాయి. ముందుగా వర్గదోపిడీ అంతమైతే కుల సమస్య అంతరిస్తుందని కమ్యూనిస్టులు చాలా కాలంగా నమ్మారు. ముందు కుల సమస్య అంతరించిన తరువాతే వర్గ సమస్య సంగతి చూడాలని అంబేద్కరిస్టులు నమ్మారు. భారత్‌లో వున్న సంక్లిష్టతల కారణంగా రెండు వైఖరులను పునరాలోచించుకోవాల్సి వచ్చింది. వర్గ సమస్యలతో పాటు కుల వివక్ష సమస్యను కూడా తక్కువగా చూడరాదని కమ్యూనిస్టులు చాలా కాలం క్రితమే గుర్తించారు. దానిలో భాగంగానే అనేక రాష్ట్రాలలో కుల వివక్ష వ్యతిరేక సంఘాలను ఏర్పాటు చేసి ఆ సమస్యపై పని చేస్తున్నారు. తాము కలలు కన్న కుల నిర్మూలన ఇప్పట్లో జరిగేది కాదని అంబేద్కరిస్టులు అంతర్గతంగా ఆలోచిస్తున్నా అంగీకరించటానికి ముందుకు రావటం లేదు.ఈ వైఖరి అటు వర్గ, కుల నిర్మూలన పోరాటాలు రెండిండికీ హాని కలిగిస్తుందని గుర్తించటం అవసరం. ఎవరి అభిప్రాయాలు వారు కలిగి వుండవచ్చు, అదే సమయంలో ఎక్కడ ఏ సమస్య ముందుకు వస్తే దానిని, రెండు సమస్యలపై ఐక్యంగా పని చేయవచ్చు. కావాల్సింది చిత్త శుద్ధి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హైదరాబాద్‌ ఎన్నికల ఫలితాలు-పార్టీలపై పర్యవసానాలు

06 Saturday Feb 2016

Posted by raomk in AP, BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others, Telangana

≈ Leave a comment

Tags

BJP, Congress, GHMC, HYDERABAD, tdp, trs

ఎంకెఆర్‌

     ఈనెల రెండున జరిగిన హైదరాబాదు మహానగర పాలక సంస్ధ ఎన్నికలు అటు ఘన విజయం సాధించిన అధికార పార్టీని, ఇటు ఘోరపరాజయం పాలైన తెలుగుదేశం-బిజెపి కూటమి, కాంగ్రెస్‌ను ఆశ్చర్యంలో ముంచాయంటే అతిశయోక్తి కాదు. మూడు జిల్లాల పరిధిలోని 150 వార్డులకు గాను తెలంగాణా రాష్ట్రసమితి 99,  కాంగ్రెస్‌ మెదక్‌ జిల్లాలోని పటాన్‌చెరు, రంగారెడ్డి జిల్లాలోని నాచారం స్ధానంతో సరిపెట్టుకొని హైదరాబాదు జిల్లాలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇక అసలైన పరాజయం గౌరవ ప్రద స్ధానంలో వుంటామని కలలు కన్న తెలుగుదేశం-బిజెపి కూటమిది. తెలుగు దేశం పార్టీ రంగారెడ్డి జిల్లాలోని కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్టు స్థానాన్ని గెలుచుకొని ఎట్టకేలకు ప్రాతినిధ్యం సాధించింది, బిజెపి నాలుగు స్ధానాలు తెచ్చుకుంది.మజ్లీస్ 44 తెచ్చుకుంది

    ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర రాజధాని స్ధానిక ఎన్నికలలో పాల్గొనటం, ఘోరంగా ఓడిపోవటం మన దేశ చరిత్రలో బహుశా ఇదే మొదటిసారేమో.ఆ ఖ్యాతి ఎన్‌ చంద్రబాబు నాయుడికి దక్కింది. మరొకరెవరూ ఇలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా హెచ్చరికలు చేసింది. హైదరాబాదు ఎన్నికలలో తాము 99 స్ధానాలను గెలుచుకుంటామని అసలు తెలంగణా రాష్ట్ర సమితికే నమ్మకం లేదు.వుంటే ముందు జాగ్రత్త చర్యగా కార్యనిర్వాహక అధికారాల ద్వారా చట్ట సవరణ చేసి ఎంఎల్‌సీల ఓట్లతో గద్దె నెక్కాలని చూసేది కాదు. దానిని కొట్టివేస్తామని కోర్టు సూచన ప్రాయంగా చెప్పటంతో ఎన్నికలు జరిగి-ఫలితాలు వెలువడే మధ్యలో ఒక అసాధారణ ఆర్డినెన్సు ద్వారా చట్ట సవరణ తెచ్చి విమర్శలకు తావిచ్చింది. అయితే ఎంఎల్‌సి దొడ్డిదారితో నిమిత్తం లేకుండానే అప్పటికే ఓటర్లు తమ నిర్ణయాన్ని తీసుకున్నారని అది వూహించలేకపోయింది. ఏ మాత్రం పసిగట్టినా అపర ప్రజాస్వామికంగా వుండేది.

    విజయం సాధించింది కనుక చంద్రశేఖరరావు కోర్టు అభిప్రాయాన్ని మన్నించినట్లు ఆ ఆర్డినెన్సుకు కొత్త భాష్యం చెప్పారు. అంత మాత్రాన దానివెనుక వున్న దురాలోచన దాస్తే దాగేది కాదు. ఈ విజయం తెలంగాణా రాష్ట్రసమితిలో కొత్త పరిణామాలకు నాంది పలుకుతుంది. హైదరాబాద్‌ ఎన్నికలను చంద్రశేఖరరావు తనయుడు, మంత్రి కెటిఆర్‌ ఒక్కడే తన బాధ్యతగా ఎదుర్కొన్నారు. అదేదో యాదృచ్పికంగా జరిగిందంటే ఎవరూ నమ్మరు. ఎన్నికల స్క్రిప్టు, డైలాగులు, డైరెక్షన్‌ అంతా కెసిఆర్‌ వారసుడు ఎవరో స్పష్టం చేసేందుకే అన్నది సుస్పష్టం.ఈ విజయంతో తెరాసలో మిగిలిన మంత్రులు, ఇతరులు మరింతగా డమ్మీలుగా మారతారు. అధికారం మరింతగా కుటుంబపరంగా కేంద్రీకృతం అవుతుంది. అది వచ్చే ఎన్నికల నాటికి కొత్త సమస్యలకు నాంది పలుకుతుంది. అన్ని పాలక రాజకీయ పార్టీలలో జరిగిందీ, జరుగుతున్నదీ, జరగబోయేది ఇదే.

    ఒక వూరి మునసబు పక్క వూరికి వెట్టితో సమానం అన్నది ఒక సామెత.దీనిని వినయంతో ఎవరైనా గుర్తిస్తే పరువు నిలబడుతుంది. లేకుంటే చంద్రబాబు నాయుడి మాదిరి శృంగభంగం తప్పదు.కోటి మంది జనాభా వున్న హైదరాబాదు ఎన్నికలకు ప్రాధాన్యత లేదని ఎవరూ అనరు. స్వంత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావే ప్రచారానికి దిగకుండా ఒక బహిరంగ సభ పెట్టి గౌరవ ప్రదంగా వ్యవహరించారు. ఒక వేళ ఓడిపోతే, తగినన్ని సీట్లు రాకపోతే ముఖ్యమంత్రి ప్రచారానికి వెళ్లినా ఓడిపోయారంటారు. లేకపోతే సిఎం వచ్చి వుంటే విజయం దక్కేది అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద విజయం లేదా ఓటమిపై సంశయం కారణంగానే కెసిఆర్‌ ఈ విధంగా ప్రచారానికి దూరంగా వున్నారు. తన కొడుకును దించారు. ఓడిపోయినా ఇబ్బంది లేదు, గెలిస్తే చెప్పక్కర లేదు. కానీ మిగతావారి పరిస్ధితి అది కాదు.

   పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ఆయనకంటే తెలుగుదేశంలో పలుకుబడిన నాయకుడిగా చక్రంతిప్పుతున్నారని కొందరంటే, రాజ్యాంగేతర శక్తిగా పనిచేస్తున్నారని కొందరి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కుమారుడు నారా లోకేష్‌, కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ తరువాత అంతటి పలుకుబడి కలిగిన మోడీ అంతరంగికులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు వంటి వారు ప్రచారం చేసినా , తమ కూటమి వారిని గెలిపించకపోతే కేంద్రం నుంచి నిధులు రావని బెదిరించినా పరాభవమే మిగిలింది. వారు చేసిన ప్రచారం ఓటర్లలో ఎంత వుత్సాహం నింపిందంటే తాము ఓటు వేయకపోయినా సరే తెలుగుదేశం-బిజెపి కూటమి విజయం సాధిస్తుందనే విశ్వాసంతో కాబోలు అసలు ఓటింగ్‌కే రాలేదు. కొన్ని పరిణామాలు మరికొన్నింటిని వేగవంతం చేస్తాయి. ఎక్కడో స్విచ్‌ వేస్తే ఎక్కడో లైటు వెలుగుతుంది.ఎన్నడూ ఓటింగ్‌కు రాని వారు కూడా గత అసెంబ్లీ ఎన్నికలలో పనిగట్టుకొని వచ్చి హైదరాబాదులోని కొన్ని ప్రాంతాలలో తెరాసకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. నగరం మరింతగా విస్తరిస్తోంది. పరిశ్రమలు పెరగటం లేదు,మూతపడుతున్నాయి, కొత్తగా వచ్చే వాటిలో వుపాధి తక్కువగా వుంటోంది. అసమానతలు తీవ్ర మౌతున్నాయి.నగరంలో పారిశుధ్యం, కాలుష్యం, ట్రాఫిక్‌ సమస్య రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా కానుంది.వాటిని పరిష్కరించకుండా ఎక్కువ కాలం గడపలేరు.

     గతంతో పోలిస్తే తాను మారానని చెబుతూ చంద్రబాబు నాయుడు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పదే పదే జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నించారు. ఆయనలో ఎలాంటి మార్పూ లేదని ఎన్నికైన తరువాత ప్రతి చర్య ద్వారా జనాలలో గట్టి విశ్వాసం కల్పించేందుకు ఎలాంటి లోపం లేకుండా ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాటిలో హైదరాబాడు నగర ఎన్నికలలో తెలుగుదేశం, దానితో జతకట్టిన బిజెపి ఓడిపోవటం పార్టీల కన్నా చంద్రబాబు నాయుడికి వ్యక్తిగతంగా కలిగిన ఘోరపరాభంగానే పరిగణించాలి. తాను అభివృద్ధి చేశానని చెప్పుకున్న హైదరాబాదు నగరం తన పార్టీకి ఒక్కటంటే ఒక్కటే కార్పారేటర్‌ సీటు కట్టబెట్టిందంటే ఆయన చెప్పింది అవాస్తవమైనా అయి వుండాలి లేదా చంద్రబాబును నమ్ముకుంటే కుక్కతోకను బట్టి గోదావరిని ఈదినట్లే అని జనం నిర్ధారణకు వచ్చి వుండాలి. చంద్రబాబు నాయుడు తనను తానే నమ్మడని ప్రతీతి. అందుకని ఇతరులను నమ్మే పరిస్ధితి వుండదు. అలాంటి వ్యక్తి ఎండమావులను కూడా సునామీ వరదలని నమ్మించగల దిట్ట కావటం వలనే ప్రతి తరంలో ఎంతో కొంత మంది అపరచాణుక్యుడని నమ్ముతూ వుంటారు. మాటల ద్వారా మూతులు, డబ్బుతో చేతులు కాల్చుకుంటారు. ఇప్పుడు హైదరాబాదులో అదే జరిగింది.

     తెలంగాణాలో తెలుగు దేశం పార్టీ దుకాణం మూతపడటం గత ఎన్నికల మరుసటి రోజునుంచే ప్రారంభమైంది. అయినా అవకాశం లేని వారు, అనివార్యంగా ప్రతిపక్షంలో వుండాల్సిన వారు లేదా చంద్రబాబు చాణక్యం మీద అతి విశ్వాసం వున్నవారు గానీ మొత్తం మీద పార్టీలో మిగిలారు. ఇప్పుడు మిగిలిన పార్టీ కూడా ఎంత త్వరగా అంతరిస్తుందన్నదే సమస్య. దేశ చరిత్రలో ప్రాంతీయ పార్టీ ఒకటికి మించి రెండు రాష్ట్రాలలో కొనసాగిన దాఖలా మనకు ఎక్కడా కనపడదు. బీహార్‌, వుత్తర ప్రదేశ్‌లను చీల్చి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిన తరువాత సమాజవాది పార్టీ యుపికి, ఆర్‌జెడి బీహార్‌కు పరిమితం అయ్యాయి తప్ప రెండోచోట లేవు. తెలుగుదేశం పార్టీ అందుకు మినహాయింపు అనుకుంటే అంతకంటే భ్రమ మరొకటి వుండదు. తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాదులో తెలుగుదేశం పార్టీకి ఇంతటి పరాభవం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్‌లోని వారు అసలు వూహించి వుండరు. ఎందుకంటే చంద్రబాబు మంత్రదండంపై నమ్మకం వున్నవారు ఇంకా గణనీయంగా వున్నారు. వారి సంఖ్యను హైదరాబాద్‌ ఎన్నికలు గణనీయంగా తగ్గిస్తాయి.

    హైదరాబాదు ఎన్నికలలో తెలుగుదేశం ఓడిపోతే చంద్రబాబు నాయుడికి పోయేదేమీ లేదు, తీరని నష్టం బిజెపికి. మతోన్మాద అజెండా లేకుండా అది మనుగడ సాగించలేదు. ప్రస్తుతం హైదరాబాదులో అటువంటి పరిస్ధితులు లేవు. తెలుగుదేశం వంటి పార్టీతో అది సర్దుబాటు చేసుకోవాలంటే తాత్కాలికంగా అయినా అది మేకతోలు కప్పుకోవాలి. స్వంత ఎజండా మతోన్మాదాన్ని రెచ్చగొట్టటాన్ని నిరంతరం కొనసాగిస్తున్నది కనుక, ప్రతి ఎన్నికలో అది ఏదో ఒక పార్టీతో లోపాయికారీ వప్పందాలకు వస్తుండటంతో మజ్లిస్‌ తన స్ధానాన్ని నిలబెట్టుకోగలుగుతున్నది. తెరాస స్వంతంగా మెజారిటీ తెచ్చుకున్నది కనుక మజ్లిస్‌ అప్రజాస్వామిక పోకడలను అడ్డుకొని హైదరాబాదు పాతబస్తీలో మార్పులకు శ్రీకారం చుడితే దానిని రాజకీయంగా వ్యతిరేకించేవారు కూడా హర్షిస్తారు.లేనట్లయితే మజ్లిస్‌ను చూపి బిజెపి, బిజెపిని చూపి మజ్లిస్‌ మత రాజకీయాలు చేస్తాయి. అది తెరాసకు రాజకీయంగా నష్టదాయకమే గాక, తెలంగాణాకు పెట్టుబడులపై కూడా ప్రభావం చూపుతుంది.

     కాంగ్రెస్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దాని అవకాశ వాదానికి అటు వుమ్మడి రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన ఆంధ్రప్రదేశ్‌ జనమూ వ్యతిరేకించారు. తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చామని చెప్పుకున్న చోటా అదే పరిస్ధితి కల్పించారు. వామపక్షాల విషయానికి వస్తే గతంలో వాటికి వున్నదీ లేదు ఇప్పుడు పోగొట్టుకున్నదీ లేదు. తమ నుంచి తమ జనం చేజారి పోయిన చోటే వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాయి గనుక తిరిగి ఓటర్ల విశ్వాసాన్ని చూరగొనటానికి ఎలాంటి పద్దతులు అనుసరిస్తాయన్నది చూడాల్సి వుంది

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏదో జరుగుతోందని అందరికీ తెలుసు ? ఏమిటది ?

29 Friday Jan 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, CHANDRABABU, Modi

మన్మోహన్‌ సింగ్‌ శంకుస్ధాపన – నరేంద్రమోడీ ప్రారంభోత్సవం

ఎంకెఆర్‌

అటు కాకలు తీరిన పాలకపార్టీ పెద్దలు నిండు పేరోలగంలో ప్రతిపాదిస్తే ఇటు తలలు పండిన ఎందరో ప్రతిపక్ష యోధులు ఆమోదించారు. (సిపిఎం మినహా) వారూ వీరూ , వారితో చేరినవారూ చేతులు కలిపి లేదా కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్‌లో ప్రకటించిన ప్రత్యేక హోదా, లోటు భర్తీకి నిధులు, కొత్త రాజధాని అమరావతి నిర్మాణాలకు ప్రారంభోత్సవంగా భావించి క్యా సీన్‌ హై అనుకోకండి. వట్టిస్తరి మంచినీళ్లు మాత్రమే. శంకస్ధాపన మాదిరి కొన్ని వందల కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి అమరావతి తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి నిర్ణయం జరిగినపుడే అంతసీన్‌ లేదని తేలిపోయింది.

ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆఫ్ఘనిస్తాన్‌ పార్లమెంట్‌ భవనం గురించి. వేసిన అంచనాల కంటే ఎక్కువ కావటం, పనులు ఇంకా పూర్తి గాక పోవటంతో సవరించిన అంచనా ఖర్చు రు.960 కోట్లకు చేరుకోవటంతో బుధవారం నాడు జరిగిన మన కేంద్ర కాబినెట్‌ సమావేశం ఆమోదం తెలిపింది. ఇంకా అయితే తరువాత ఎలాగూ చెల్లిస్తారు లెండి. ఇదేమిటి ఎక్కడి ఆఫ్ఘనిస్తాన్‌ ! ఎక్కడి మోడీ సర్కార్‌ !! వారి పార్లమెంట్‌ భవనం మనం కట్టటం ఏమిటి !!!

ఆఫ్ఘనిస్తాన్‌ సర్వనాశనం కావటానికి కారకులు నూటికి రెండువందల శాతం అమెరికా, దాని చుట్టూ తోకాడించుకుంటూ తిరిగే ఐరోపా ధనిక, సౌదీ అరేబియావంటి అమెరికా తొత్తు దేశాలు. దాన్ని పునరుద్ధరించేందుకు మాత్రం ప్రపంచ దేశాలన్నీ తలాకాస్త సాయం చేయాలంటూ అమెరికా ఆదేశించింది. అదే లెండి దొరగారు తలా కాస్త చేయండి అంటే చేయకపోతే అయ్యగారితో ఎప్పుడు ఏతంటా వస్తుందో, ఎప్పడు ఏ అవసరం వస్తుందో పోయిందేముంది లే అనుకొని మన వాటాగా పార్లమెంట్‌ భవనం నిర్మాణం, మరికొన్ని చేస్తామని మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా వున్నపుడు వాగ్దానం చేసి వచ్చారు. అది సకాలంలో పూర్తిగాక చివరికి డిసెంబరులో పూర్తి కావటంతో 25వ తేదీన ఆఫ్ఘన్‌ అధ్యక్షుడితో కలసి నరేంద్రమోడీ ప్రారంభోత్సవం చేసి వచ్చారు. మిగిలిన ఎలక్ట్రానిక్‌ పరికరాల బిగింపు వంటి ఫినిషింగ్‌ పనులు పూర్తి చేసి ఈ ఏడాది మార్చి 31 నాటికి భవనాన్ని అఫ్ఘన్‌ అధికారులకు అందచేయాల్సి వుంది. అందుకుగాను పెరిగిన ఖర్చుకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. అంతర్జాతీయ సంబంధాలు సజావుగా కొనసాగటానికి ఎవరి హయాంలో ఏ నిర్ణయం జరిగినా దానిని కొనసాగించటం తరువాత అధికారంలో వున్న వారి బాధ్యత అనుకుందాం. మరి ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్‌లో చేసిన వాగ్దానాల మాటేమిటి ? ఆంధ్రులు అంత నోరు లేనివారా ?

కన్నమ్మకు కూడు పెట్టని కొడుకు పిన్నమ్ముకు ఒంటి నిండా బంగారు ఆభరణాలు తొడిగిస్తా అని చెప్పినట్లుగా చ ంద్రబాబు నాయుడు, బిజెపి నాయకులు హైదరాబాదు కార్పొరేషన్‌ ఎన్నికలలో కురిపించని వాగ్దానాలు లేవు. హైదరాబాదు నుంచి ఏటా 45వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందంటే ఆ శ్రమ తనదే అని చంద్రబాబు నాయుడు చెప్పారు, నైజాం నవాబులు హైదరాబాదును 400 సంవత్సరాలలో, బ్రిటీష్‌ వారు సికిందరాబాదును 200 సంవత్సరాలలో తీర్చిదిద్దితే ఈ రెండింటికీ ప్రపంచ పటంపై కేవలం తొమ్మిది సంవత్సరాలలోనే ఎనలేని కీర్తి తెచ్చి పెట్టానని, హైటెక్‌ సిటీని కేవలం 15నెలల్లోనే నిర్మింపచేయించిన ఘనత తనదేనని, తాను ఆనాడు అభివృద్ధి చేయకపోయి వుంటే ఈ రోజున తెలంగాణా ప్రభుత్వానికి సంక్షేమ పధకాలు అమలు జరపటం సాధ్యమయ్యేది కాదని చంద్రబాబు హైదరాబాదు వీధుల్లో చెప్పారు. అంతేనా ! కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పధకాల్లో తెలంగాణాకు అన్యాయం జరగకుండా చూస్తానని, అవసరమైతే ప్రధాని మోడీని ఒప్పించి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని మరీ చెప్పారు. పిట్టల దొర గుర్తుకు రావటం లేదూ ?

ఈ వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వారికి కూడా తెలిసి వుంటే బాబ్బాబు….. ఐదు సంవత్సరాలలో ఇప్పటికే మూడోవంతు అయిపోయింది. లేస్తే మనిషిని కాను అని దారిన పొయ్యేవారిని బెదిరించి దండుకున్న కుంటి మల్లయ్య కధ మాదిరిగాక ముందే కొత్తవి రాకపోతే పోయే చేసిన వాగ్దానాల అమలుకు కేంద్రాన్ని ఒప్పిద్దురూ మీకు పుణ్యముంటుంది అని ఆంధ్రప్రదేశ్‌ జనాలు పోకిరి సినిమాలో మాదిరి విజయవాడ రాగానే చంద్రబాబు వెంట బడటం ఖాయం.

రాజధాని అమరావతి శంకుస్ధాపన కార్యక్రమానికి వచ్చినపుడు తాను కూడా దాని నిర్మాణానికి కొంత విరాళం ప్రకటిద్దామని అనుకున్నానని, అయితే ప్రధాని మోడీ అంతటి వ్యక్తే పిడికెడు మట్టి, కుండెడు నీళ్లు ఇచ్చినపుడు తాను విరాళం ప్రకటిస్తే తెలంగాణాపై మోడీ ఎక్కడ మరింత కక్ష పెంచుకుంటాడోనని తాను ప్రకటించలేదని, అయినా అమరావతికే దిక్కులేదు, హైదరాబాదుకేం వరాలిస్తారని అటు బిజెపిని ఇటు తెలుగుదేశం పార్టీని తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గాలితీశారు. వెంకయ్య(నాయుడు) ప్రాసకోసం ఎన్నయినా మాట్లాడతాడు, అలా మాట్లాడటం నాకూ వస్తుంది, ఆయనకంటే తెలుగు సాహిత్యం నాకే బాగా వచ్చు అని కూడా చెప్పారు.

ఏ దేశం వెళితే అక్కడి తెలుగు వారిని, భారతీయులను పొగడటం, మీరే ఆ దేశాలను పెంచి పోషిస్తున్నారన్నట్లుగా చెప్పటం చంద్రబాబు బ్యాండు బృందానికి బాగా వచ్చు. కానీ ఆయన మాత్రం సావిత్రీ నీ పతి ప్రాణంబు దక్క మరొక్క వరం కోరుకో అని యమధర్మరాజు చెప్పినట్లుగా తెలుగువారి రాజధాని నిర్మాణ రూపకల్పన బాధ్యత మాత్రం తెలుగు వారికీ ఇవ్వలేదు, భారతీయులకు ఇవ్వలేదు. ఎంత రాష్ట్ర భక్తి, ఎంత దేశ భక్తి ? పోనీ మనవారేమైనా తక్కువ వారా ?

మయసభకు ప్రతిరూపాన్ని నిర్మించారే, ప్రపంచ స్దాయి కట్టడాలకు ఏ విషయంలో తక్కువ తిన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో భారతీయులు నిర్మించిన నూతన పార్లమెంట్‌ భవనం ప్రపంచంలో అత్యుత్తమ పార్లమెంట్‌ భవనాలలో ఒకటిగా భావిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో వున్న అరాచక పరిస్దితులు, భద్రతా సమస్యల కారణంగా 2009లో ప్రారంభమై 2012లో పూర్తి కావాల్సింది 2015 వరకు సాగింది.దీనిలో ప్రధాన ఆకర్షణ ఏమంటే 17.15 మీటర్ల ఎత్తుండే కంచు గుమ్మటం ఆసియాలోనే పెద్దదట. ఇక భవనం లోపలా బయటా ఆకర్షణలు చూడాల్సిందే తప్ప వర్ణించనలవి కాదట. ఇంత మంచి కన్సల్టెంట్స్‌, నిర్మాణ కంపెనీలు, నిపుణులైన పనివారు మన దగ్గర వుండగా అందునా మేకిండియా పిలుపు ఇచ్చిన ప్రధాని కేంద్రంలో వుండగా రాజధాని అమరావతిని సింగపూర్‌ వారికి ఎందుకు కట్టబెట్టినట్లు ? నీకిది నాకది అని పక్కా అవగాహనలతో పంచుకొనే రోజుల్లో ఏది ఎందుకు జరుగుతుందో ? గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లు అలాంటి విషయాల్లో పండిపోయిన వారే చెప్పాలి. కాకపోతే అలాంటి వారికి విస్వసనీయత వుండదు, అందరికీ తెలుసు ఏదో జరుగుతోందని. అదేమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిల్లర దుకాణాలకు ముంచుకు వస్తున్న ముప్పు

26 Tuesday Jan 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

India Retailers, Rapid Growth of E-commerce, Traditional Retailers

ఎంకెఆర్‌

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తమదే అని వ్యాపారవర్గాలకు చెందిన వారు అనేక మంది భావించటం సహజం. ఎందుకంటే వ్యాపారమే వృత్తిగా వున్న కులాలకు చెందిన వారు ఇప్పటికీ వుత్తరాదిలో ఆ పార్టీ మద్దతుదార్లుగా వున్నారు. అలాంటి వారంతా పునరాలోచించాల్సిన సమయం ముంచుకు వస్తోంది. రిటైల్‌ వ్యాపారం మన దేశంలో కోట్లాది మందికి వుపాధి కల్పిస్తోంది.అనేక మంది తమ కాళ్లమీద తమను నిలబెట్టటమే కాదు, నలుగురికి పని కలిపిస్తున్నారు. వారికి తగిన వేతనాలు ఇస్తున్నారా లేదా అన్నది వేరే విషయం. ఇప్పుడా పని కూడా దొరకని పరిస్ధితి వస్తోంది. ఇప్పటికే ధోరణులు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ వాణిజ్యం లేదా ఆన్‌లైన్‌ వ్యాపారాన్ని ఒక్కసారిగా అనుమతిస్తే తన సాంప్రదాయ ఓటు బ్యాంకు కు గండిపడుతుందనే ఆందోళనతో బిజెపి క్రమంగా పొమ్మనకుండా పొగబెడుతున్నట్లు దుకాణాలు మూసుకోక తప్పదు అని సంప్రదాయ దుకాణదారులే అనుకొనే విధంగా పావులు కదుపుతోంది.

విదేశీ బడా కంపెనీలు, వాటితో భాగస్వాములుగా చేరుతున్న స్వదేశీ పెద్ద వాణిజ్యవేత్తలు మొత్తం కలిసి 2014-15 సంవత్సరంలో ఇంటర్నెట్‌ వ్యాపారంలో నాలుగు బిలియన్‌ డాలర్ల మేరకు అంటే 25వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. గతేడాది డిసెంబరు నాటికి ఇంటర్నెట్‌ లేదా ఆన్‌లైన్‌ వ్యాపార లావాదేవీల విలువ 12 బిలియన్‌ డాలర్లు.( ఒక బిలియన్‌ డాలర్లు అంటే ప్రస్తుత మారక ధరను బట్టి ఆరువేల ఆరువందల కోట్ల రూపాయలు) అంతకు ముందు సంవత్సరం 4.5 బిలియన్‌ డాలర్లతో పోల్చితే ఏడాది కాలంలోనే మూడు రెట్లు పెరిగింది. భారత రిటైలర్స్‌ అసోసియేషన్‌ చెబుతున్నదాని ప్రకారం సంఘటిత లేదా ఆధునిక చిల్లర వ్యాపార వాటా 17నుంచి 13శాతానికి పడిపోయింది. 2014లో అంటే నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం రెండు శాతంగా వున్న ఎలక్ట్రానిక్‌ వాణిజ్యం ఆయన పదవీ కాలం లేదా దిగిపోయే 2019 నాటికి 11శాతానికి పెరగనుందని అంచనా.

రాబోయే రోజుల్లో ఆన్‌లైన్‌కు ఇంటర్నెట్‌ కంప్యూటర్లే వుండనవసరం లేదు. ఇప్పటికే ఫోన్ల ద్వారా వున్న సౌకర్యాన్ని త్వరలో ఎక్కడబడితే అక్కడ వైఫై సౌకర్యం కల్పించి మరింత ముమ్మరంగా వస్తువులకు ఆర్డర్లు చేయబోయే రోజులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు ధనికులు, కాస్త మధ్యతరగతి వారు కొనుగోలు చేసే ఎలక్ట్రానిక్‌ వంటి ఖరీదైన వస్తువుల నుంచి క్రమంగా జడ పిన్నులు, పిన్నీసులను కూడా ఆన్‌లైన్‌ ద్వారా కంపెనీలు సరఫరా చేసినా ఆశ్చర్యం లేదు.అన్ని వస్తువులు మన ఇంటికే వస్తున్నపుడు జడ పిన్నుల కోసం మార్కెట్‌కు వెళ్లటం శుద్ధ దండగ కదా !

ఇప్పుడు మన దేశంలోని చట్టాలు ఒక వాణిజ్య సంస్ధ నుంచి మరొక వాణిజ్య సంస్ధ మధ్య(బి టు బి) జరిగే లావాదేవీలలో నూరు శాతం విదేశీ పెట్టుబడులను మన సర్కార్‌ అనుమతిస్తోంది.అంటే మనకు రోజూ వినిపించే ఫ్లిప్‌ కార్ట్‌, స్నాప్‌డీల్‌, అమెజాన్‌ వంటివి. వాణిజ్యం నుంచి వినియోగదారునికి వస్తువులు చేరే విభాగంలో మాత్రం వందశాతానికి అనుమతి లేదు. అయినా మనం రోజూ వాటిలో వస్తువులను ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంటున్నాం గనుక అవి ఇప్పటికే దొడ్డిదారి చూసుకున్నాయన్నది స్పష్టం. అవేం చెబుతాయంటే అబ్బే వస్తువులను మేం సరఫరా చేయం, మార్కెట్‌ స్ధలాలలో పెద్ద మొత్తంలో సరకులను నిల్వచేయటానికి గోదాములు, వాటికి చేర్చటానికి రవాణా, చెల్లింపులు చేయటానికి మాత్రమే పరిమితం అవుతున్నాయని నమ్మబలుకుతున్నాయి. మన మోడీ, కెసిఆర్‌, చంద్రబాబు నాయుడు వంటి రాష్ట్ర సర్కార్‌లన్నీ నిజమే కదా అని ఆమోద ముద్ర వేస్తున్నాయి. చట్ట వ్యతిరేక చర్యలను పట్టపగలు ఆమోదించటమే ఇది.

ఇటీవల రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఆలిండియా ఫుట్‌వేర్‌ మాన్యుఫాక్చరర్స్‌ అండ్‌ రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేశాయి. ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్ధలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పొందుతున్నాయని ఆ కారణంగా అవి పెద్ద ఎత్తున వినియోగదార్లకు డిస్కౌంట్లు ఇస్తున్నాయని, సంప్రదాయ రిటైలర్లు అలా ఇవ్వలేరని కోర్టుకు ఫిర్యాదు చేశాయి. అందుకు ప్రాధమిక ఆధారాలున్నాయని ఎఫ్‌డిఐ నిబంధనల వుల్లంఘన జరుగుతోందని ప్రభుత్వం తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.కేంద్ర పారిశ్రామిక విధాన మరియు అభివృద్ధి విభాగం(డిఐపిపి) ప్రారంభించిన చర్యలతో వాణిజ్య సంస్ధల నుంచి వినియోగదారులకు(బి టు సి) ఎలక్ట్రానిక్‌ వాణిజ్యంలో ఎఫ్‌డిఐలకు అనుమతి లేదని అలాగే మార్కెట్‌ స్థలాలకు వస్తువులను చేరవేసే పద్దతికి కూడా గుర్తింపు లేదని తేలింది.అయితేనేం ఆ తరువాత కూడా ప్రతి పండుగ ఇతర సందర్బాలలో పేజీలకు పేజీలు ప్రకటనలు ఇచ్చిమరీ ఆ సంస్ధలు వస్తు విక్రయాలు జరుపుతూనే వున్నాయి.మన పాలకులు గుడ్లప్పగించి చూస్తూనే వున్నారు. అందుకే చిల్లర దుకాణదారులకు ముప్పు ముంచుకు వస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హిందూయిజంపై విమర్శలు ఎందుకు పెరుగుతున్నాయి ?

18 Monday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

criticism against Hinduism, Hinduism, RSS

ఒక యజమాని తన ఫ్యాక్టరీలో ఏ రోజు ఎంత వుత్పత్తి చేయాలో, ఏ వుత్పత్తిని పెంచాలో తగ్గించాలో ఆదేశించినట్లుగా హిందూ మహిళలు ఎంత మందిని పిల్లలన్ని కనాలో చెబుతున్న సంఘపరివార్‌ యోగులు, యోగినులు, సన్యాసులు, సన్యాసినులు భోగులుగా మారి పదుగురికి ఆదర్శంగా తాము చెప్పిన సంఖ్యలో ఎందుకు పిల్లల్ని కనటం లేదు?

ఎం కోటేశ్వరరావు

      హిందూయిజాన్ని చులకనగా చూస్తున్నారని అనేక మంది వుద్రేకపడిపోతున్నారు. అంతకు ముందు లేని ఆసక్తిని కొందరు ప్రదర్శిస్తున్నారు. అలాగే ఇతర మైనారిటీ మతస్థులలో కూడా దానికి ప్రతి ధోరణి మొదలైంది. ఎవరికి వారు తమ మతచిహ్నాలను ప్రదర్శించుకోవటం ఎక్కువైంది. ఇతర విషయాలలో సమానత్వం, తోటి మనిషిగా చూడకపోయినా పేరు వరకు సమానత్వాన్ని పాటిస్తూ పేరు చివర కులాన్ని సూచించే తోకలను ఆడపిల్లలకూ తగిలించటం పెరిగి పోయింది (ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు పెరిగి పోతున్న కారణంగా ఇతర కులాల వారు ప్రేమించటం, తలిదండ్రులు అంగీకరించకపోవటం గొడవలు ఎందుకని ముందే ఆడపిల్లకు పేరు తగిలిస్తే ఇతర కులాల వారు వారివైపు చూడరని, ఎవరైనా చూసినా తోటి కులం లేదా తత్సమాన కులం వారే పూనుకుంటారనే వుద్ధేశ్యంతో ఇలా పెడుతున్నట్లు ఒక తల్లి వివరణ ఇచ్చింది). ఇది ప్రతి మారు మూల పల్లెలో కూడా కనిపిస్తోంది. ఏ తరానికి ఆ తరంలో తమ పబ్బం గడుపుకొనేందుకు ఆరోగ్యకర రాజకీయాలను వెనుకపట్టు పట్టించి కుల, మత రాజకీయాలను చొప్పించి తమ పబ్బం గడుపుకోవాలనే పాలకవర్గ శక్తుల ఎత్తుగడలు ఫలించిన పర్యవసానమే ఇది. సమాజంలో అస్థిత్వ ధోరణులు పెరగటం కూడా దీనికి తోడైంది.

      ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాల్సి వుంది? ఇతర మతాల మాదిరి హిందూ మతాన్ని ఏ ఒక్కరో స్ధాపించలేదు లేదా ప్రబోధించలేదు. బైబిల్‌,ఖురాన్‌ మాదిరి ఈ మతానికి ఒక ప్రామాణిక గ్రంధం లేదు. అందువలన వేల సంవత్సరాల కాలంలో ఎవరికి అవసరమైన మేరకు వారు కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించి నట్లు , ఎలాగంటే గతేడాది జరిగిన గోదావరి పుష్కరాలకు వెళ్లేవారు తలా కాస్త మట్టి తీసుకువెళ్లి స్నానఘట్టాల దగ్గర వేయాలని ఒక పెద్దమనిషి ప్రబోధించినట్లుగా అనేక అంశాలను జొప్పించారు. చొప్పిస్తున్నారు. వేదాలలో కానరాని చాతుర్వర్ణ వ్యవస్ధ, మను ధర్మ శాస్త్రం, మహిళల పట్ల వివక్ష వంటి తిరోగమన అంశాలన్నీ మధ్యలో చొప్పించినవే అనే ఒక బలమైన అభిప్రాయం వుంది. ఒక జీవన విధానంగా హిందూయిజమంటే అందరూ కలసి మెలసి జీవించటం. కానీ జరుగుతోంది అందుకు విరుద్ధం. హిందూత్వ వాదులుగా, హిందూయిజాన్ని పరిరక్షించే వారిగా ఫోజు పెడుతూ ఇప్పుడు రంగంలో వున్న శక్తులు, వ్యక్తులు నిజానికి కుహనా హిందువులు, నిజమైన వారు కాదు. దాయిష్‌(ఐఎస్‌) వుగ్రవాదులు, తాలిబాన్లు నిజమైన ముస్లింలు ఎలా కాదో వీరు కూడా అదే కోవకు చెందినవారు.

     కొంత మంది చెబుతున్నట్లుగా హిందూయిజాన్ని ఎక్కువగా విమర్శిస్తున్నారనే వాదనలో కొంత వాస్తవం కూడా లేకపోలేదు.కుహనా హిందుత్వ వాదులపై ఇంకా తగినంత లేదనేదే ఆందోళన కలిగించే అంశం.అసలు ఈ విమర్శ, ప్రతి విమర్శలకు కారణం ఏమిటి? ఎవరు దీనికి ఆద్యులు ? ఓటు బ్యాంకు రాజకీయాలు. స్ధిరమైన ఓటు బ్యాంకులను ఏర్పాటు చేసుకొనేందుకు కాంగ్రెస్‌, ఇతర కుహనా లౌకక పార్టీలు మైనారిటీలను బుజ్జగించేందుకు పూనుకున్నాయని పాడిందే పాడరా అన్నట్లు పాడుతోంది, ప్రచారం ప్రారంభించింది ఎవరు? ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం కింద పనిచేసే దాని అనుబంధ సంస్థలైన బిజెపి, ఏబివిపి, విశ్వహిందూపరిషత్‌ వంటివే కదా ! హిందువునని గర్వించు, హిందువుగా జీవించు అన్న నినాదం కనిపించని గోడ,ఫ్లెక్సీ, బ్యానర్‌లు ఎక్కడైనా వున్నాయా ? రాజకీయంగా దిగజారటంతో పాటు దేశాన్ని జనాన్ని దివాలా తీయించే ఆర్ధిక విధానాలను అనుసరించిన కాంగ్రెస్‌ పోతున్న తన పట్టును నిలుపుకొనేందుకు అనుసరించని తప్పుడు పద్దతులు లేవు.వాటిలో మైనారిటీలను బుజ్జగించటం ఒకటి అనటం నిస్సందేహం. అంతేనా బింద్రన్‌వాలే వంటి వుగ్రవాదులను పెంచి పోషించిన దుష్ట చరిత్ర కూడా ఆ పార్టీకి వుంది. చివరికి ఆ బింద్రన్‌వాలా దయ్యం పట్టిన వారే ఇందిరా గాంధీని బలితీసుకొనేందుకు సాధనాలయ్యారు. కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) తదితర వామపక్షాలు ఇలాంటి బుజ్జగింపు చర్యలకు వ్యతిరేకం అన్నది చరిత్ర చెప్పిన సత్యం. కాంగ్రెస్‌ మైనారిటీ మతాల వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తే బిజెపి చేసిందేమిటి ? మొదట జనసంఘం అన్నారు, తరువాత దానిని జనతా పార్టీలో కలిపామన్నారు, దాన్నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీని పెట్టామన్నారు. ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాలలోనూ అధికారంలోకి రాకపోవటంతో హిందూమతానికి అన్యాయం జరుగుతోందని ఒకవైపు రెండోవైపు వివాదాస్పద బాబరీ మసీదు, రామజన్మభూమి వివాదాన్ని ముందుకు నెట్టింది. మెజారిటీ మతం వారిని బుట్టలో వేసుకొని అధికార అందలాలెక్కేందుకు ప్రయత్నించింది, అధికారానికి వచ్చిన తరువాత దానిని సుస్ధిరం చేసుకొనేందుకు గుజరాత్‌లో ఎలాంటి దారుణాలకు పాల్పడిందో, ఇప్పుడు దేశంలో ఏ విధంగా వ్యవహరిస్తోందో మనం చూస్తూనే వున్నాం. అందువలన ఆ విమర్శ చేయటానికి బిజెపి లేదా సంఘపరివార్‌కు, వారిని బలపరుస్తూ, కాంగ్రెస్‌ పద్దతులను మక్కీకి మక్కీ అనుసరించే తెలుగుదేశం, తెరాస వంటి ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి నైతిక హక్కు లేదు.

అన్నీ త్యజించి సన్యాసులుగా మారాము, దేశం కోసం లేదా సంఘ్‌ కోసం వివాహాలు మానాము, తత్వం తలకెక్కిన తరువాత తెలియక అంతకు ముందు కట్టుకున్న భార్యనే త్యజించాము, బోధనలే మాకు ముఖ్యం అని చెప్పుకొనే వారికి అధికార, రాజకీయ పదవులు ఎందుకు ? బుద్దుడు, వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాల్సింది సామాన్య జనమేనా వారు కాదా ?

     ఈ దేశం హిందూ దేశమని, మతమార్పిడులు, పిల్లల్ని ఎక్కువ మందిని కనటం ద్వారా ఇతర మతాలు ముఖ్యంగా ముస్లింలు మెజారిటీగా మారేందుకు పెద్ద కుట్ర పన్నారని, హిందూయిజానికి ముప్పు వచ్చిందని ఆధారంలేని, ఊహాజనిత ప్రచారం ఎక్కువ చేసింది, చేస్తున్నదీ ఎవరు ? అది వాస్తవం కాదని చెప్పిన కమ్యూనిస్టులు, ఇతర అభ్యుదయశక్తులన్నింటినీ దేశ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు, విదేశీ సిద్ధాంతాలను పాటించేవారని తన యంత్రాంగం ద్వారా నిత్యం దాడులు చేస్తూ, జనాల బుర్రలను కలుషితం చేస్తున్నది ఎవరు ? సంఘపరివార్‌ కాషాయ కుహనా హిందుత్వ వాదులు కాదా ? ఒక యజమాని తన ఫ్యాక్టరీలో ఏ రోజు ఎంత వుత్పత్తి చేయాలో, ఏ వుత్పత్తిని పెంచాలో తగ్గించాలో ఆదేశించినట్లుగా హిందూ మహిళలు ఎంత మందిని పిల్లలన్ని కనాలో చెబుతున్న సంఘపరివార్‌ యోగులు, యోగినులు, సన్యాసులు, సన్యాసినులు భోగులుగా మారి పదుగురికి ఆదర్శంగా తాము చెప్పిన సంఖ్యలో ఎందుకు పిల్లల్ని కనటం లేదు? బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌ హిందూ మతాన్ని కాపాడేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలంటాడా ?ఈ అంకెల ఆట అంతటితో ఆగలేదు. శ్యామల్‌ గోస్వామి అనే బిజెపి పెద్దమనిషి ఐదుగురు అంటే బదరికాశ్రమం శంకరాచార్య, శ్రీ వాసుదేవానంద సరస్వతి పదికి పెంచారు. మహిళంటే పిల్లల్ని కనే యంత్రాలనుకుంటున్నారా ? హిందూ మతాన్ని కాపాడి తరువాత ఏం చేస్తారు? వీరు పుట్టక ముందు నుంచి హిందూ మతాన్ని ఎవరు కాపాడుతున్నారు? ఎవరు వీరు ? హిందూయిజానికి ప్రతినిధులమని స్వయంగా నిర్దేశించుకున్నవారే కదా ?చెప్పే వారికి బాధ్యత లేదా ? దేశం కంటే సన్యాసం ఎక్కువా ? లేదు అన్నీ త్యజించి సన్యాసులుగా మారాము, దేశం కోసం లేదా సంఘ్‌ కోసం వివాహాలు మానాము, తత్వం తలకెక్కిన తరువాత తెలియక అంతకు ముందు కట్టుకున్న భార్యనే త్యజించాము, బోధనలే మాకు ముఖ్యం అని చెప్పుకొనే వారికి అధికార, రాజకీయ పదవులు ఎందుకు ? బుద్దుడు, వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాల్సింది సామాన్య జనమేనా వారు కాదా ? యోగులు, సన్యాసుల గురించి వివేకానందుడు చెప్పిందేమిటి ? సన్యాసులకు ఒక మతం వుండకూడదు, అన్ని మతాల నుంచి మంచిని తీసుకోవాలి. ఇపుడు జరుగుతోందేమిటి ?

    నేడు ప్రతి మతంలోనూ తాలిబాన్లు తలెత్తుతున్నట్లు ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం వుండే మన దేశాన్ని కూడా ఆ వైపు నడిపించటానికి పెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఆ కారణంగానే ఇటీవలి కాలంలో మతాలపై ముఖ్యంగా హిందూ మతంపై చర్చ ఎక్కువగా జరుగుతోంది. అది వికటిస్తే పర్యవసానాలు భిన్నంగా వుంటాయి. కొంత మంది ముందుకు తెస్తున్న కొన్ని వాదనలను పరిశీలిద్దాం.

ఇస్లాం వంటి వాటిని విమర్శించటానికి వారికి( హిందూమతాన్ని విమర్శించేవారికి) భయం, వణికిపోతారు.

      మతాలన్నీ ఛాందసత్వంతో కూడుకున్నవే అన్నది ముందు గ్రహించాలి. వాటిలో సంస్కర్తలు మారుతున్న కాలానికి అనుగుణంగా మతాలు, ఆచారాలను వ్యాఖ్యానిస్తుంటే ఛాందసులు వాటిని అలాగే వుంచటం లేదా వెనక్కు తీసుకుపోవాలని చూస్తున్నారు. కొన్ని దేశాలలో నూటికి 99శాతం ముస్లింలే వుంటారు. అయినా అక్కడ తాలిబాన్లు ఎందుకు పుట్టుకు వచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మారేందుకు సిద్ధపడని ఛాందసులు షరియత్‌ పేరుతో మతోన్మాదులుగా మారుతున్నారు. మన సమాజంలో ఎప్పటి నుంచో వున్న ఆచారాల ప్రకారం ఇప్పటికీ దళితులు అంటరానివారే. రాజ్యాంగం దానిని నిషేధించింది. పాటిస్తే శిక్షార్హం అని చెప్పింది. ఆ హక్కును అమలు జరుపుకొనేందుకు ఎక్కడైనా దళితులు ప్రయత్నిస్తే అగ్రకులాలనబడేవారు దాడులకు తెగబడటాన్ని ఏమనాలి? హిందూ మతానికి చెందిన వారు హిందూమతాన్ని విమర్శిస్తే హిందూమతం వారే సహించటం లేదు. అటువంటుపుడు పూర్తిగా వివరాలు తెలియని అన్యమతాలను అన్యమతస్తులు విమర్శించటం సరైనది కాదు, సహేతుకంగా విమర్శించినా సహించే అవకాశం లేనపుడు ఏ మతానికి చెందిన వారు ఆ మతాన్ని విమర్శించటమే సరైనది. దాన్ని అంతవరకే పరిమితం చేయాలి.దీన్ని గురించి చౌకబారు అడ్డుసవాళ్లు విసిరే వారి వలలో పడాల్సిన అవసరం లేదు.దొంగబాబాలు, యోగినుల బండారాల గురించి అనేక సినిమాలలో ఎంతో చక్కగా చూపించారు, చూపుతున్నారు. కానీ ఎవరైనా ఒక బాబా లేదా యోగిని గురించి ప్రత్యక్షంగా విమర్శిస్తే వారిపైకి భౌతికదాడులకు జనాన్ని రెచ్చగొడుతున్న తీరు తెలిసిందే. నిజమైన విమర్శకులు శాంతి భద్రతల పరిస్ధితి తలెత్తాలని కోరుకోరు. మన దేశంలో నూటికి 80శాతం మంది హిందువులే గనక చర్చలలో కూడా ఆ వాటా అలాగే వుంటుంది. అందుకే మొత్తంగా దీనినే విమర్శించినట్లు కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు.అమెరికా,ఐరోపా వంటి దేశాలలో హేతువాదుల నుంచి 90శాతం విమర్శలు క్రైస్తవం మీద వుంటాయి తప్ప ఇతర మతాల మీద కాదు, ఇక్కడ కూడా అంతే.

తస్లీమా సస్రీన్‌, సాల్మన్‌ రష్డీలను వారు సహించటం లేదు అలాంటపుడు ఇక్కడ ఎందుకు సహించాలి?

    తస్లీమా, సాల్మన్‌ రష్డీ మొరటు పద్దతులలో మత ఛాందసులను విమర్శించారు కనుక వారు దాడులకు తెగబడుతున్నారు.ఇక్కడ కూడా అదేపని చేస్తామంటారా? అలాంటపుడు వారికీ వీరికి తేడా ఏముంటుంది? ఇతరులను విమర్శించటం లేదని అడిగే హక్కు వారికి వుండదు. అహింస, విమర్శ, సహనం భారతీయ సంప్రదాయం. దాన్ని ముందు మనం కాపాడు కుందాం. ముందు మెజారిటీ జనం వాటిని పాటిస్తే అందుకు భిన్నంగా వ్యవహరించేవారిపై కూడా వత్తిడి పెరుగుతుంది. వారు కూడా తమ వైఖరిని మార్చుకుంటారు. ఇతర మతాల దేవతలు దేవుళ్లపై సద్విమర్శలు చేయటం వేరు, కించపరచటం వేరు. కించపరిస్తే జరిగేది కొట్లాటలే అని అనేక అనుభవాలు తెలిపాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అవగాహన ఒప్పందాలలో మోడీని అధిగమించేందుకు చంద్రబాబు యత్నం !!

11 Monday Jan 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, CHANDRABABU, Mou's

ఇలాంటి మాజిక్‌లను మోడీ గతంలోనే చేశారు కేవలం 24 గంటల్లో 2.1లక్షల కోట్ల పెట్టుబడులుండే 21వేల అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించారు.అంటే ప్రతి నాలుగు సెకండ్లకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే పిటి వుష, వుసేన్‌ బోల్ట్‌ రికార్డులను తిరగరాశారు.

సత్య

విశాఖ పట్టణంలో మూడు రోజుల పెట్టుబడుల ఆకర్షక సదస్సులో మొదటి రోజే రెండు లక్షల కోట్ల రూపాయల విలువగల అవగాహనా ఒప్పందాలపై సంతకాలు జరిగాయన్నది వార్త. అతిధి సత్కార్యాలకు పెట్టింది పేరు ఆంధ్రావని. అరిసెలు, వెన్న వుండలు, పూతరేకులు, గారెలు, నాటు కోడి కూర, గుంటూరు గోంగూర, జగ్గయ్య పేట దోసకాయ పచ్చడి, భీమవరం టైగర్‌ రొయ్యలు, నెల్లూరు చేపల పులుసు, బొంగులో చికెన్‌ వంటి వంటకాలను భారీగా వడ్డిస్తామని ముందే ప్రభుత్వం చెప్పింది కనుక మొదటి రోజు అవి తిన్న వారు ఆ మత్తులో గమ్మత్తులో మరికొన్ని కొత్త ఒప్పందాలపై సంతకాలు పెడతారన్నా అతిశయోక్తి కాదు. మొత్తం ఏడు లక్షల కోట్ల మేరకు ఒప్పందాల జరగవచ్చని ముందే అంచనా వేశారు కనుక తొలి రోజు వూపును బట్టి మలి, మూడవ రోజు ఇంకా జోరుగా ఎడా పెడా ఒప్పందాలు జరుగుతాయన్నది స్పష్టం. ఇలాంటి మాజిక్‌ చేయాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు, చంద్రబాబు చేయగలరని నమ్ముతున్నారు గనుక అది వమ్ము కాకూడదని రాష్ట్ర భక్తులైన వారు కోరుకుంటారు. 1947 ఆగస్టు 16 నుంచి దేశభక్తి క్రమంగా తగ్గుతూ ఢిల్లీ నుంచి గల్లీ చివరికి ఇంటికి, అక్కడ కూడా నేను, నా కుటుంబ స్ధాయికి దిగజారిన పరిస్ధితుల్లో రాష్ట్ర భక్తి అనటం కొందరికి అతిశయోక్తిగా తోచవచ్చు, క్షంతవ్యుడను.

ఇటీవలి కాలంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టటాన్ని నిలిపివేసిన 1991 నూతన ఆర్ధిక సంస్కరణల అమలు నుంచి రాష్ట్రాలు పెట్టుబడుల కోసం తరచూ పెద్ద మేళాలను నిర్వహిస్తున్నాయి. వివాహాలకు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి విందులు ఆరగించి చందన తాంబూలాలు స్వీకరించి పోయినట్లుగా కొన్ని వేల మంది, లక్షల మంది విదేశీ కంపెనీల ప్రతినిధులు, వారి వంది మాగధులు మన రాష్ట్రాలను సందర్శించి వేలాది అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేసి వెళ్లి వుంటారు. అవన్నీ వాస్తవ రూపం దాల్చి వున్నట్లయితే తెలుగు రాష్ట్రాలు రెండు ఏర్పడి వుండేవి కాదు, మన దేశం మొత్తంగా ఎప్పుడో అమెరికా అంత గాకపోయినా కనీసం చైనాను వెనక్కు నెట్టి వుండివుండేది.

ఆంధ్రప్రదేశ్‌కు మూడు వైపుల తమిళనాడు(చెన్నయ్‌) కర్ణాటక(బెంగలూరు) తెలంగాణా(హైదరాబాదు) అనే మూడు మహానగరాలు వున్నాయి. నాలుగో వైపున వున్నది బంగాళాఖాతం కనుక పెట్టుబడుల ఆకర్షణ పోటీలో అది వుండదు, అయినా మూడు మహానగరాలను తట్టుకొని ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు పెట్టేందుకు దేశం నలు మూలల నుంచి 1100 మంది 41 దేశాల నుంచి 315 మంది తొలిరోజు హాజరు కావటం చంద్రబాబు నాయుడి యాజమాన్య నిర్వహణకు నిదర్శనం. వివిధ కారణాలతో తొలి రోజు రాలేకపోయిన వారు చివరి రెండు రోజులలో రావచ్చు, వాటికీ రాలేని వారు తరువాత వచ్చి విజయవాడలో సంతకాలు చేసి వెళతారు. అన్నయ్యా ఎంత మంది వచ్చారు, ఏం తిన్నారు, ఎన్ని సంతకాలు చేశారని కాదు, ఎన్ని వాస్తవ రూపం దాల్చాయన్నది ముఖ్యం అన్నట్లుగా గతంలో జరిగిన ఆకర్షక సమావేశాల ఫలితాలేమిటో మచ్చుకు కొన్ని చూద్దాం.

ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే అందుకు అనువైన వాతావరణం అంటే దండిగా లాభాలు వచ్చే పరిస్ధితులు వున్నాయా లేవా అని చూస్తారు. లేకుంటే ప్రపంచం నలుమూలలు, పొరుగు రాష్ట్రాల నుంచి ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంటుంది ? ఏ దేశంలో అయినా ఆర్ధిక వుత్పత్తి వనరులలో ఎంతశాతాన్ని వినియోగించుకుంటున్నారు? కొత్త పరిశ్రమలు పెడితే వాటి భవిష్యత్‌ ఎలా వుంటుంది అని ఎవరైనా వెనుకా ముందు ఆలోచిస్తారు. గత ఆగస్టు ఎనిమిదవ తేదీన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక ప్రచురించిన క్రిసిల్‌ రేటింగ్‌ నివేదిక ఆధారంగా ఇచ్చిన ఒక వార్త ప్రకారం మన దేశంలో పెట్టుబడులు తగ్గుతున్నాయి, సామర్ధ్యవినియోగం ఐదేళ్ల కనిష్టానికి పడిపోయిందన్నది దాని సారం. వర్తమాన ఆర్ధిక సంవత్సరం(2015-16)లో రెండుశాతం పెట్టుబడులు తగ్గుతాయని, ప్రయివేటు రంగ పెట్టుబడులు గత కొద్ది సంవత్సరాలుగా తగ్గటం ఆందోళన కలిగిస్తోందనిఈ ఏడాది మరో ఎనిమిదిశాతం తగ్గవచ్చని నివేదిక పేర్కొన్నది. పన్నెండు భారీ పరిశ్రమల రంగాలకు గాను పదింటిలో సామర్ధ్య వినియోగం ఐదేళ్ల కనిష్టానికి పడిపోయినందున కొత్త ప్రాజెక్టుల ఆశలు ఆవిరి అవుతున్నాయని, పర్యవసానంగా గతేడాది కాలంలో ప్రకటించిన లేదా అనుమతించిన పరిశ్రమలలో కేవలం 20శాతం మాత్రమే అమలులోకి రావచ్చని, మూల ధన పెట్టుబడులు 2017లోనే అర్ధవంతమైన విధంగా పెరగవచ్చని క్రిసిల్‌ వెల్లడించింది.

అల్యూమినియం, వుక్కు రంగాల సామర్ధ్యం పెంచిన కారణంగా వాటిని దిగుమతి చేసుకొనే భారత్‌ ఎగుమతి చేసే దేశంగా మారింది,ప్రపంచ మార్కెట్‌లో వస్తువుల ధరలు తగ్గిన కారణంగా చమురు శుద్ధి, మార్కెటింగ్‌, పెట్రోకెమికల్‌ రంగాలపై ప్రభావం పడింది.కాగితంతో సహా కొన్ని రంగాలలో సామర్ధ్య వినియోగం ఐదు సంవత్సరాల కనిష్టానికి తగ్గింది. కొద్ది కాలం తరువాత గాని తిరిగి పూర్వస్ధితికి చేరుకోలేవు. ఈ రంగాలలో కొత్త ప్రాజెక్టులకు అవకాశాలు పూర్తిగామృగ్యమయ్యాయి. ఆటోమొబైల్‌, ఎరువుల రంగంలోనే పెట్టుబడులు పెరిగే అవకాశాలు వున్నాయి. ఎరువుల రంగంలో కల్పించే రాయితీలు, చమురు ధరలు, వడ్డీలు తగ్గిన కారణంగా ఆటోమొబైల్‌ రంగంలో ముఖ్యంగా కార్ల రంగంలో అవకాశాలు వున్నాయి.

మౌలిక సదుపాయాల విషయానికి వస్తే పరిస్ధితి పూర్తి తిరోగమనంలో వుంది. విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు తగ్గుతాయి.ధర్మల్‌ విద్యుత్‌ విభాగంలో జతచేయదలచిన సామర్ధ్యం గత రెండు సంవత్సరాలలో40వేల మెగావాట్లకు తగ్గగా మరో రెండు సంత్సరాలలో36వేలకు తగ్గిపోనుంది. ప్రయివేటు రంగంలో పెట్టుబడులు లేకపోవటం, పంపిణీ సంస్ధల ఆర్ధిక స్ధితి బలహీనంగా వున్న కారణంగా కొత్త కొనుగోలు ఒప్పందాలు లేని కారణంగా కొత్త ప్రాజక్టుల ప్రకటనలు రావటం లేదు అని క్రిసిల్‌ పేర్కొన్నది. ఇలాంటి నివేదికలను గమనంలోకి తీసుకొనే ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు తప్ప మరొక ప్రాతిపదిక వుండదు. ఈ పూర్వరంగంలో కొన్ని రాష్ట్రాలు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు చిత్తుకాగితాలుగా మారాయి. పంజాబ్‌లో 2011-12 నుంచి ఖన్నా-మండి గోవింద ఘర్‌ పారిశ్రామిక ప్రాంతంలో 688 పరిశ్రమలు మూతపడ్డాయి. పంజాబ్‌లో భూముల ధరలు ఎక్కువగా వున్న కారణంగా పారిశ్రామిక సంస్ధలు విస్తరణకు మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, చత్తీస్‌ఘర్‌లను ఎంచుకుంటున్నాయి. అసోచెమ్‌ తన అధ్యయనంలో ఇలా పేర్కొన్నది. పంజాబ్‌లో 2015 మార్చి వరకు ఆకర్షించిన పెట్టుబడులు రెండులక్షల కోట్ల రూపాయలు. వాటిలో 1.6లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్లో ఎలాంటి పురోగతి లేదు. మిగిలినవి ఖర్చు పెరిగిందని, సమయం పడుతుందని పేర్కొన్నాయి. పరిశ్రమల రంగ అభివృద్ధి 2006-07లో 20శాతం వుండగా 2014-15లో రెండుశాతానికి పడిపోయింది. పురోగమన పంజాబ్‌ మదుపుదార్ల సదస్సు 2013 డిసెంబరులో జరిగింది. ఆ సదస్సును ఘన విజయంగా అకాలీదళ్‌, బిజెపి వర్ణించాయి. దానిలో 65వేల కోట్ల రూపాయల అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇప్పటికీ అవి అలాగే వున్నాయి. కొన్ని కంపెనీలు కనీసం తమ ప్రతిపాదనలేమిటో కూడా సమర్పించలేదు. కొత్తవి రాకపోగా 2013-14లో వచ్చిన 7,200 కోట్లకు గాను మరుసటి సంవత్సరంలో రు.2,600 కోట్లకు పడిపోయాయి.

కర్ణాటకలో మూడు సంవత్సరాల తరువాత గతేడాది పెట్టుబడిదారుల సదస్సు జరిగింది.దానికంటే కొద్ది వారాల ముందే గతేడాదే తమిళనాడులో కూడా జరిగింది. ఇప్పుడు విశాఖలో ఆంధ్రప్రదేశ్‌ సదస్సు జరుగుతున్నది ఈ మూడు కూడా కేవలం నాలుగు నెలల వ్యవధిలో జరిగాయి. దేశ, విదేశాల ప్రతినిధులు ఈ సదస్సులన్నింటికీ హాజరయ్యారు. ఒప్పందాలపై సంతకాలు చేశారు, వాగ్దానాలు చేశారు. ఏ రాష్ట్రానికి ఆరాష్ట్రం తాము ఇచ్చే రాయితీలను పెట్టుబడిదారుల ముందు ఏకరువు పెడుతున్నాయి,తమ ప్రత్యేకతలు ఏమిటో వివరిస్తున్నాయి. జోస్యం చెప్పే కోయరాజులు తాము ఎంత పెద్దవారికి జోస్యం చెప్పామో తెలిపేందుకు వారితో దిగిన ఫొటోలను ముందుగా తమవద్దకు వచ్చేవారికి చూపినట్లు ఏ ఏ కంపెనీలు ఇప్పటికే తమ రాష్ట్రాలలో వున్నాయో, ఎవరు ఆసక్తి చూపుతున్నారో చూడండంటూ హడావుడి చేస్తున్నాయి. పెట్టుబడుల సదస్సుల గురించి జనంలో ముఖ్యంగా నిరుద్యోగ యువకుల్లో ఎన్నో ఆశలు రేపుతున్నారు. గోరంతను కొండంతలు చేసి చూపుతున్నారు. దీనిలో ఏ ఒక్కరూ తక్కువ తినలేదు.

వుదాహరణకు కర్ణాటకలో 2012లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు జరిగింది. సదానందగౌడ రాష్ట్రముఖ్య మంత్రి. ప్రభుత్వం శాసనసభకు సమర్పించిన సమాచారంలో ఇలా వుంది. ‘2010లో ఎడ్డియూరప్ప ముఖ్యమంత్రిగా వున్న సమయంలో 2010లో జరిగిన సదస్సులో 3.92లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, 7.27లక్షల వుద్యోగాలు కల్పించబడతాయని ప్రభుత్వం ఆరోజు చెప్పింది, వాస్తవానికి వచ్చింది 32,957 కోట్లు, 93,102 వుద్యోగాలు మాత్రమే. సదానందగౌడ 2012లో 2.81లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నానని, 13.99లక్షల వుద్యోగాలు వస్తాయని చెప్పారు. దానికి గాను వచ్చింది 12,468 కోట్లు వుద్యోగాలు 21,794 మాత్రమే. ఈ రెండింటినీ కలుపుకుంటే పెట్టుబడుల వాగ్దానం 6.37లక్షల కోట్లు , వస్తాయన్న వుద్యోగాలు 21.26లక్షలు కాగా వచ్చిన పెట్టుబడి 45,425 కోట్లు ఇచ్చిన వుద్యోగాలు 1.14లక్షలు మాత్రమే.

రాజకీయ నాయకుల వాగ్దానాలు ఎలా వుంటాయంటే లోక్‌సభ ఎన్నికల సమయంలో బిజెపి నేత నరేంద్రమోడీ విదేశాల్లో వున్న నల్లధనాన్ని వెలికితీస్తానని దానిని ఒక్క్కొరికి పంచితే 15లక్షలు వస్తుందని చెప్పారు. బహుశా దాన్ని తీసుకు వచ్చే క్రమంలోనే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రానికి లక్షా నలభైవేల కోట్ల రూపాయల ప్రత్యేక పాకేజి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్‌ నిండు సభలో ప్రకటించిన ప్రత్యేక హోదా గురించి ఇంతవరకు కంటి చూపు తప్ప నోటమాటలేదు.

విశాఖ సభకు వచ్చిన ప్రతి ఒక్కరితో ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకొనే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆయన సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్‌ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.ఇలాంటి మాజిక్‌లను మోడీ గతంలోనే చేశారు కేవలం 24 గంటల్లో 2.1లక్షల కోట్ల పెట్టుబడులుండే 21వేల అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించారు.అంటే ప్రతి నాలుగు సెకండ్లకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే పిటి వుష, వుసేన్‌ బోల్ట్‌ రికార్డులను తిరగరాశారు. అలాగే నరేంద్రమోడీ గతేడాది ఎర్రకోట ప్రసంగంలో 17కోట్ల బ్యాంకు ఖాతాలను తెరుస్తామని ప్రకటించారు అంటే సెకనుకు ఆరు అన్నమాట. ఎప్పుడూ విదేశాల్లోనే తిరుగుతుంటారు మీకు భారత్‌లో చేసే పనేమీ లేదా అంటే దేశానికి కనీసం లక్ష కోట్ల డాలర్లు అంటే 66లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావటం తన లక్ష్యమని చెప్పుకున్నారు. అందువలన అలాంటి నరేంద్రమోడీని స్ఫూర్తిగా తీసుకున్న చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క ప్రతినిధితో ఒక్కొక్క ఒప్పందం కుదుర్చుకోవటంలో అతిశయోక్తి ఏముంటుంది, గొప్ప ఏముంది?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d