• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: ANDHRA PRADESH Politics

ఆంధ్రప్రదేశ్‌లో కంపుకొడుతున్న అవకాశవాదం – దివాలా కోరు, అసంబద్ద వాదనలు !

11 Sunday Feb 2024

Posted by raomk in AP, AP NEWS, BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Religious Intolarence, tdp, TDP, Ycp

≈ Leave a comment

Tags

Andhra Pradesh Elections 2024, ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, jana sena party, Narendra Modi Failures, pavan kalyan, tdp, Ycp, YS jagan


ఎం కోటేశ్వరరావు


రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రకటన నాటికి ఏవైనా అనూహ్య మలుపులు తిరిగితే తప్ప ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో తెలుగుదేశం-జనసేన-బిజెపి ఒక కూటమిగా, వైసిపి విడిగా, ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌,వామపక్షాలు,ఇతర కొన్ని పార్టీలు, శక్తులు ఒక కూటమిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటి పట్ల జనం ఎలా స్పందిస్తారన్నది ఎత్తులు, పొత్తులు ఒక కొలిక్కి వచ్చిన తరువాత, ఇతర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మూడు ప్రధాన ప్రాంతీయ రాజకీయ పార్టీలు నోటాకంటే తక్కువ ఓట్లున్న బిజెపి చుట్టూ తిరగటం అనేక మందికి జీర్ణం కావటం లేదు. వైసిపి విషయానికి వస్తే తన సంక్షేమ పధకాలను చూసి ఓటేయమంటోంది. ఇప్పుడున్న వాటిని మరింత మెరుగుపరుస్తామని, కొత్త వాటిని అమలు చేస్తామని తెలుగుదేశం-జనసేన చెబుతున్నాయి. తమ కూటమి కేంద్రంలో అధికారానికి వస్తే ప్రత్యేక హౌదా అమలు చేస్తుందని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తున్నది. సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రాలు రుణ ఊబిలో కూరుకుపోతాయని చెబుతున్న బిజెపి ఏం చెబుతుందో చూడాలి. వివిధ పార్టీలు, కొన్ని శక్తులూ ముందుకు తెచ్చిన కొన్ని దివాలాకోరు, అసంబద్ద వాదనల గురించి చూద్దాం.


అధికార వైసిపిని ఓడించేందుకు బిజెపితో నిమిత్తం లేకుండానే తెలుగుదేశం-జనసేన కూటమికి తగిన మద్దతు ఉందని, బిజెపితో పొత్తును తెలుగుదేశంలోనే కొందరు వ్యతిరేకిస్తున్నారని అంటూనే విధిలేని పరిస్థితిలో బిజెపితో చేతులు కలపక తప్పదు అని చేదు మాత్రను మింగించేందుకు చూస్తున్నారు. ఎందుకటా ? వచ్చే ఎన్నికలు సజావుగా జరగాలంటే కేంద్రం, ఎన్నికల కమిషన్‌ సహకారం అవసరం గనుక బిజెపితో దోస్తీ అవసరమట.ఎన్నికలను సక్రమంగా జరపటం ఎన్నికల కమిషన్‌ విధి. దాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే బిజెపిని భుజాల మీద ఎక్కించుకొని మోయాలని చెప్పటమే. గత ఐదు సంవత్సరాలలో ఎన్నికల జాబితాలో జరిగిన అక్రమాల గురించి తెలుగుదేశం, జనసేన, ా బిజెపి లేవనెత్తిన అంశాలను ఎన్నికల సంఘం పెద్దగా పట్టించుకోలేదు. తెలుగుదేశం నేత చంద్రబాబును బిజెపి పెద్దలు పిలవగానే సిద్దం సుమతీ అన్నట్లు వెళ్లారు. వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పొలో మంటూ ఢిల్లీ యాత్ర చేశారు. మరికొన్ని శాలువాల ఖర్చు దండగ. ఎందుకయ్యా అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడగటానికని వైసిపి పెద్దల వివరణ. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తన చివరి(ఓట్‌ఆన్‌ఎకౌంట్‌) బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. వైసిపి కూడా ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌తో సరిపుచ్చింది. ఇప్పుడు నిధుల గురించి అడిగితే పట్టించుకొనేదెవరు ? పక్కా రాజకీయ యాత్ర మాత్రమే. గత ఐదేండ్లుగా అన్ని సందర్భాలలో మద్దతు ఇచ్చి ఆదుకున్నట్లుగానే రానున్న రోజుల్లో కూడా విధేయులుగా ఉంటామని, తెలుగుదేశాన్ని నమ్మవద్దని చెప్పేందుకు తప్ప ఢిల్లీ పర్యటన వెనుక మరొక కారణం కనిపించటం లేదు.


నరేంద్రమోడీ ఎంతో బలంగా ఉన్నారని అందువలన కేంద్రాన్ని ఎదిరించి చేసేదేమీ లేదని పిరికిమందు నూరిపోస్తున్న వారిని ఏమనాలి. అలాంటపుడు ఆ బిజెపి మందలోనే చేరిపోవచ్చు, వేర్వేరు పార్టీల దుకాణాలు ఎందుకు ! బతికిన చేప ఎదురీదుతుంది చచ్చిన చేప వాలునబడి కొట్టుకుపోతుంది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కూడా రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని మనం ఎదిరించలేమంటూ దాని మోచేతి నీళ్లు తాగుదామని చెప్పిన వారు ఆ రోజుల్లో కూడా ఉన్నారు. ఫలితంతో నిమిత్తం లేకుండా చేయాల్సింది చేశామా లేదా అన్నదే గీటురాయి. కేంద్రంలో ఉన్న పాలకులు రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంటే, అనుచిత పద్దతులకు పాల్పడుతుంటే రాష్ట్రాల హక్కులు, ప్రజల కోసం పోరాడాలి, మెడలు వంచాలి తప్ప మోకాళ్ల మీద కూర్చుంటే కనికరిస్తారా ? ఎన్‌టి రామారావు ప్రభుత్వాన్ని అక్రమంగా కూల్చివేసినపుడు ఆ నాటి తిరుగులేని బలమైన కాంగ్రెస్‌కు తెలుగుదేశం లొంగిపోయి మీ అడుగుజాడల్లో నడుస్తామని చెప్పలేదు, జనాన్ని వీధుల్లోకి సమీకరించి ఆందోళన చేసి పునరుద్దరణ జరిపించుకున్న చరిత్రను తెలుగుదేశం మరిచినా జనం మరిచిపోతారా ?


నాదెండ్ల భాస్కరరావు రూపంలో తిరుగుబాటు చేయించి ఎన్‌టి రామారావు సర్కార్‌ను కూలదోయించింది కాంగ్రెస్‌ పార్టీ. నేడు బిజెపి వివిధ రాష్ట్రాలలో అంతకంటే తక్కువ చేస్తున్నదా ? రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సయోధ్యతో ఉండాలని కాంగ్రెస్‌కు ఏనాడైనా తెలుగుదేశం మద్దతు ఇచ్చిందా ? మరి ఇప్పుడెందుకు ఆ పేరుతో బిజెపిని మోసేందుకు సాకులు వెతుకుతున్నట్లు ? తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించింది అని చెప్పవచ్చు, బిజెపి చేసిందేమిటి ? తెలుగుదేశం రాజ్యసభ పక్షం మొత్తాన్ని తనలోనే విలీనం చేసుకుంది కదా ! వాజ్‌పాయి సర్కారుకు తెలుగుదేశం మద్దతు ఇచ్చింది. స్పీకరు పదవి(జిఎంసి బాలయోగి)ని కూడా తీసుకుంది. నాడు రాష్ట్రానికి కేంద్రం నుంచి శాశ్వతంగా గుర్తుపెట్టుకోదగిన పెట్టుబడులు గానీ, మరొకటి గానీ ఏమీ రాలేదు. దేశం వెలిగిపోతోంది అంటూ బిజెపితో కలిసి పోటీ చేసి 2004 ఎన్నికల్లో ఓడిన తరువాత తిరిగి బిజెపితో చేతులు కలిపేది లేదని తెలుగుదేశం ప్రకటించిన అంశాన్ని మరచిపోలేము. పదేండ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి 2014లో తిరిగి అదే బిజెపితో చేతులు కలిపి ఎన్నికల్లో నెగ్గారు. పోనీ అప్పుడేమైనా సాధించారా అంటే ఏమీ లేదని అందరికీ తెలిసిందే. ప్రత్యేక హౌదా లేదని నరేంద్రమోడీ అడ్డం తిరిగితే సరే అన్నారు, దాని బదులు ప్రత్యేక పాకేజీ అంటే మహాభాగ్యం జీహుజూర్‌ అంటూ తల ఊపారు. చివరికి దానికి కూడా మొండి చేయి చూపితే బిజెపితో తెగతెంపులు చేసుకున్నారు.2019 ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా ఎంతటి తీవ్ర విమర్శలు చేసుకున్నారో తెలిసిందే.


ఇప్పుడు అవన్నీ విస్మరించి రాష్ట్రం కోసం జనాన్ని కూడా మరచిపొమ్మంటున్నారు. తాము నందంటే నంది పందంటే పంది అనాలని చెబుతున్నారు. పోనీ ఇప్పుడు బిజెపి పెద్దలు విభజన హామీల అమలు గురించి, రాష్ట్రానికి చేయాల్సిన వాటి గురించి మారుమనసు పుచ్చుకున్నారా అంటే దుర్భిణివేసి చూసినా కనిపించటం లేదు. రేపు బిజెపి తిరిగి కేంద్రంలో అధికారానికి వస్తుందో రాదో తెలియదు, వచ్చినా గత పది సంవత్సరాల ఆచరణను బట్టి రాష్ట్రానికి ప్రత్యేక హౌదా లేదా దానికి సమానమైన ప్రత్యేక పాకేజీ ఇచ్చే సమస్యే లేదు. విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వే జోన్‌ గురించి తెలుగుదేశం-బిజెపి ఉమ్మడి పాలనలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఎందుకో తెలుగుదేశం పెద్దలు చెప్పాలి. గత లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు కొద్ది వారాల ముందు విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రకటనను కేంద్రం వెలువరించింది. పోనీ దాన్నయినా నోటిఫికేషన్‌ ఇచ్చి ఏర్పాటు చేసిందా అంటే అదీ లేదు. మరోసారి ఎన్నికలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదు అని చెబుతున్నారు. కేంద్రం ఎప్పుడైనా భూమి ఎందుకు ఇవ్వరు అని రాష్ట్ర ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చిందా?ఇస్తామని చెప్పిన భూమిని స్వీకరించేందుకు ముందుకు రాకుండా వంకలు చెబుతున్నది. జోనల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు విశాఖలో రైల్వేలకు అసలు భవనాలే దొరకవా ? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే తప్ప అసలు భూమే లేదా ? విశాఖ డివిజన్ను రద్దు చేయాలని నిర్ణయించారు, అక్కడే కార్యాలయాన్ని ఏర్పాటు చేసి తరువాత తీరికగా భూమి తీసుకొని కొత్త భవనాలు నిర్మించుకోవచ్చు, అదీ చేయలేదు. నాటకాలాడుతున్న అలాంటి బిజెపిని బలపరిచి రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవచ్చని చెబితే జనం మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా ?


తోలువలవటం, తాటతీయటమే తన కార్యాచరణ అని ప్రకటించుకున్న జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ ఉక్కును ప్రయివేటీకరించవద్దని చెబుతున్నారు, అది మంచిదే. కానీ పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన ప్రతిసారీ ఉక్కును తుక్కుకింద అమ్మివేస్తామని చెబుతూనే ఉన్నా నోటికి తాళం వేసుకున్నారు. పాచిపోయిన లడ్డూలంటూ ప్రత్యేక హౌదా గురించి మాట్లాడిన ఆ పెద్ద మనిషి తరువాత దాన్ని మరిచిపోయి తనకు అధికారం లేదు గనుక అడగటం లేదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నోటికి తాళం వేసుకున్నారు. ఆ డిమాండ్‌ను వదులుకున్న తెలుగుదేశంతో చేతులు కలిపి రాష్ట్రాన్ని బాగుచేస్తామని చెబుతున్నారు. ప్రత్యేక హౌదా గురించి మరిచి పొమ్మని, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం తమ విధానమని పదే పదే చెబుతున్న బిజెపిని బలపరచి రేపు ఒక వేళ అధికారానికి వచ్చినా బిజెపి విధానాలను తెలుగుదేశం-జనసేన కూటమి మార్చగలదా ? ప్రకటించిన రైల్వేజోన్‌ గురించి కూడా అడగలేని వారు రాష్ట్ర ప్రయోజనాలను సాధిస్తామని అంటేే నమ్మేదెలా ? పన్నులలో వాటాలు, కేంద్రం అమలు జరిపే పథకాలను నుంచి కొన్ని రాష్ట్రాలను మినహాయించే అవకాశమే లేదు. కొన్ని నిధులకు సంబంధించి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నమాట నిజం. అలాంటి సందర్భాలలో వత్తిడి తేవాలి, పోరాడాలి లేకుంటే కేరళ మాదిరి సుప్రీం కోర్టును ఆశ్రయించాలి తప్ప లొంగుబాటు మార్గం కాదు. అందులోనూ ఆత్మగౌరవ నినాదం ముందుకు తెచ్చిన వారికి, ప్రశ్నించటం తమ డిఎన్‌ఏలోనే ఉందని చెప్పుకొనే వారికి అసలు తగనిపని.


వైఎస్‌ జగన్మోహనరెడ్డి సర్కార్‌ ప్రశ్నించిన ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగులు, టీచర్ల మీద అణచివేత చర్యలకు పాల్పడుతున్నది, అనేక భారాలను మోపిన మాటనిజం. ఆ ప్రభుత్వాన్ని మార్చాలన్న వాంఛను తప్పు పట్టాల్సిన పనిలేదు.రాజధాని మార్పుతో సహా అనేక అంశాలలో బిజెపి నాటకాన్ని ఇంతకాలం జనం చూశారు.వైసిపికి అండదండగా ఉన్న అంశం తెలిసిందే. ఏనాడూ దాని విధానాలను నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన ఉదంతాలు లేవు. తెలుగుదేశం పార్టీని బలహీన పరిచేందుకు వైసిపిని ప్రోత్సహించింది, తిరిగి అధికారంలోకి వస్తుందని, తనకు విధేయురాలిగా ఉంటుందని ఇంతకాలం భావించిన కారణంగానే ఎన్ని విమర్శలు వచ్చినా ఖాతరు చేయలేదు. రోడ్డుమాప్‌ ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌ కోరినా పూచికపుల్ల కింద తీసిపారవేసింది. వచ్చే ఎన్నికల్లో సీట్లు గణనీయంగా తగ్గనున్నట్లు బిజెపి పసిగట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో మారుతున్న సమీకరణాల్లో వైసిపికి అవకాశాల్లేవని నిర్ధారించుకున్న తరువాత సరిగ్గా ఎన్నికల ముంగిట బిజెపి తన వైఖరి మార్చుకొని తెలుగుదేశానికి స్వాగతం పలుకుతోంది తప్ప వేరు కాదు.


బిజెపి తన మత అజెండాను ముందుకు తీసుకువస్తున్నది.సిఏఏను అమలు జరుపుతామని ఇప్పుడు ప్రకటించటం దానిలో భాగమే. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తమకు మియాల(అసోంలో ముస్లింలను అలా పిలుస్తారు) ఓట్లు అవసరం లేదన్నారు. గతేడాది కర్ణాటక ఎన్నికల సందర్భంగా బిజెపి అగ్రనేత జగదీశ్వరప్ప తమకు ముస్లింల ఓట్లు అవసరం లేదని ప్రకటించారు.అలాంటి మాటలే ఆంధ్రప్రదేశ్‌లోనూ చెప్పగలరా ? మణిపూర్‌లో గిరిజనుల మీద, వారి చర్చీల మీద దాడులు జరుగుతుంటే, మహిళలను నగంగా తిప్పితే ఇంతవరకు ప్రధాని ఆ రాష్ట్రాన్ని సందర్శించి వారికి ఎలాంటి భరోసా కల్పించలేదు. తెలుగుదేశం పార్టీ బిజెపితో సర్దుబాటు చేసుకుంటే ఈ అంశాలన్నింటికీ జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన కూటమిలో బిజెపి కలిస్తే కలిగే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువ అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చెల్లెలు షర్మిల రాజకీయం : వసుదేవుడి స్థితిలో అన్న వైఎస్‌ జగన్మోహనరెడ్డి ?

01 Monday Jan 2024

Posted by raomk in AP, AP NEWS, BJP, BRS, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, tdp, TDP, Telangana, Ycp

≈ Leave a comment

Tags

#YS Sharmila, ANDHRA PRADESH, Andhra Pradesh Elections 2024, ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Janasena, Ycp, YS jagan


ఎం కోటేశ్వరరావు


కాంగ్రెస్‌లో చేరవద్దు, అన్నతో చేతులు కలిపి కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగాలని, అక్కడ ఉన్న ఎంపీ అవినాష్‌ రెడ్డిని అసెంబ్లీకి పోటీ చేయిస్తామని సిఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి చెల్లెలు షర్మిలకు రాయబారం పంపినట్లు, ఆమె తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. అవి నిజమా కాదా అన్నది పెద్దగా ప్రాధాన్యత కలిగిన అంశం కాదు. అన్నతో కలిస్తే లేదా లడాయికి దిగితే జరిగే పరిణామాలు, పర్యవసానాలు ఏమిటన్నదే చర్చ. నిజానికి షర్మిల కాంగ్రెస్‌లో చేరటం తెలంగాణా ఎన్నికలకు ముందే ఖరారైంది. ఆమె ఎక్కడ తన నూతన ప్రస్థానాన్ని ప్రారంభిస్తే పార్టీకి ప్రయోజనం అన్న తర్జనభర్జనల తరువాత చివరికి ఆంధ్రప్రదేశ్‌ను కార్యస్థానంగా ఎంచుకోవాలని కాంగ్రెస్‌ కోరింది. ఇది వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఊహించని పరిణామేమీ కాదు. తెలంగాణాలో తిరిగి బిఆర్‌ఎస్‌ గెలుస్తుందని వేసుకున్న లెక్కల పరీక్షలో జగన్‌ తప్పారు. అతని ధీమా గురించి ఎరిగిన వైసిపి అభిమానులు తెలంగాణాలో బిఆర్‌ఎస్‌ విజయం మీద ధీమాతో పెద్ద మొత్తంలో పందాలు కాసి చేతులు కాల్చుకున్నారు.సోదరి కాంగ్రెస్‌ ప్రవేశం గురించి ఆ ఎన్నికలకు ముందు తరువాత అంచనాల్లో మార్పులతో జగన్‌మోహన్‌రెడ్డి ఆమెను ప్రసన్నం చేసుకొనేందుకు పూనుకున్నారని చెబుతున్నారు. తల్లీ, చెల్లిని ఇంటి నుంచి, రాష్ట్ర రాజకీయాల నుంచి గెంటివేశారన్న విమర్శలకు జగన్మోహనరెడ్డి గానీ, వైసిపి నేతల వద్దగానీ సరైన, సమర్ధనీయమైన సమాధానం లేదు. షర్మిలను ఇంటికి ఆహ్వానించటం అంటే తల్లిని కూడా చేరదీయటమే అవుతుందని, తమ మీద ఉన్న విమర్శలకు సమాధానం చెప్పినట్లు అవుతుందని వైసిపి నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు.తమ నేత అవినీతి కేసుల్లో జైలు పాలయ్యారని, చిప్పకూడు తిన్నారని తెలుగుదేశం, జనసేన ఇతర పార్టీలు, మీడియా చేస్తున్న దాడిని తక్కువ చేసేందుకు, మీ నేత కూడా అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లారు, అదే చిప్పకూడు తిన్నారు అని తమ గణాలకు ఒక ఆయుధం ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడిని కేసులతో జైలుకు పంపారన్న విమర్శలు, ఆ ఉదంతాన్ని వైసిపి శ్రేణులు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. షర్మిలను దగ్గరకు తీయటం జరుగుతుందా ?


రాజకీయాల్లో ఏదీ అనూహ్యం కాదు, ఎవరు ఎప్పుడు దేనికి ఎవరితో చేతులు కలుపుతారో ఊహించలేము.నారా లోకేష్‌కు క్రిస్మస్‌ బహుమతి పంపిన షర్మిల తీరును సాధారణ అంశంగా కొట్టివేయలేము. ఊహాగానాల్లో ఉన్న అంశం ప్రకారం షర్మిల తన అన్న జగన్మోహనరెడ్డితో కలిస్తే జరిగేదేమిటి ? అన్న చేసిన అన్యాయానికి ఎంత లబ్దిపొంది చేతులు కలిపారు అన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగానే అన్నా-చెల్లెళ్లు ఒకటైతే తెరవెనుక షర్మిలకు జరిగే లాభం ఏమిటో వెల్లడికాదు కానీ తెరముందు జగన్‌కు అది పెద్ద నష్టానికి దారి తీస్తుంది. ఓట్ల పరంగా షర్మిల తెచ్చేదేమీ ఉండదు. వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్లు పట్టుకోవాల్సి వచ్చిందన్న లోకోక్తి తెలిసిందే. అయితే పురాణాల్లో అది ఒక మహత్తర కార్యం కోసం అలా చేశారని సమర్దిస్తారు. కానీ షర్మిల కోసం జగన్‌ తలవంచినా, ఒక అడుగువెనక్కు తగ్గినా సమర్థన జనానికి ఎక్కదు. ఓడిపోయే పరిస్థితి వచ్చింది కనుకనే అలా చేస్తున్నారని అనుకోవటం ఖాయం. అదే జరిగితే వైసిపి శ్రేణుల్లో జగన్‌ మీద ఉన్న విశ్వాసం మరింతగా సన్నగిల్లుతుంది, డొల్లతనం బయటపడుతుంది, ఓటర్ల మీద ప్రతికూల ప్రభావంతో మరింత నష్టం జరుగుతుంది. తమకు ఎవరితో పనిలేదని ఇంతకాలం చేసిన ప్రచారానికి ఎదురుదెబ్బ. అలాగాక రాయబారం లేదా బేరాన్ని షర్మిల తిరస్కరించినట్లు వచ్చిన వార్తలు నిజమే అయితే అది కూడా జగన్‌కు ఎదురుదెబ్బే. వ్రతం చెడ్డా ఫలం దక్కని స్థితి. దాన్ని కూడా జగన్‌ బలహీనతగానే ప్రత్యర్ధి పార్టీలు ప్రచారం చేస్తాయి. ఎలా జరిగినా అన్నను చెల్లెలు ఇరకాటంలోకి నెట్టినట్లే. బహుశా జగన్‌ లేదా సలహాదారులు దీన్ని ఊహించి ఉండరు.


2024 ఎలా ఉంటుందో తెలియదు గానీ 2023 వైఎస్‌ జగన్‌కు నిద్రలేని రాత్రులతో వీడ్కోలు పలికిందని చెప్పవచ్చు. మరోవైపు తెలుగుదేశ-జనసేన కూటమికి ఆశావహ సూచనలతో 2024 స్వాగతం పలికింది.అయితే బిజెపితో తెలుగుదేశం సయోధ్యకు పూనుకున్నట్లు వస్తున్న వార్తలు నిజమైతే ఆ సంతోషం తాత్కాలికమే కావచ్చు.నాలుగు లోక్‌సభ, పన్నెండు అసెంబ్లీ స్థానాల కోసం బిజెపి బేరమాడుతున్నట్లు చెబుతున్నారు. ఒప్పందం కుదురుతుందా లేదా ప్రచారమేనా, ఎన్ని సీట్లు కొనుక్కుంటారు అన్నది పక్కన పెడితే వచ్చే పర్యవసానాలు ఏమిటన్నది ముఖ్యం. 2004లో బిజెపితో చేతులు కలిపి చేతులు కాల్చుకున్న చంద్రబాబు నాయుడు పదేండ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది.2014లో బిజెపితో ముడివేసుకొని ఐదేండ్లూ కాపురం చేయకుండానే ఎవరిదారి వారు చూసుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు చేసిన విమర్శలకు ఫలితాల తరువాత మోడీ, ఇడి, ఐటి, సిబిఐలను చూసి తెలుగుదేశం నోటికి తాళం వేసుకుంది. ఇప్పుడు వైసిపిని ఓడించటమనే ఏకైక అజండా తప్ప బిజెపి- తెలుగుదేశం కలవటానికి మరొక కారణం లేదు. అధికార యావతప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టలేదని జనం భావిస్తారు. తమకు ముస్లింల ఓట్లు అవసరం లేదని కర్ణాటకలో బిజెపి నేతలు స్వయంగా ప్రకటించారు. రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల తీరుతెన్నులు చూసినపుడు మైనారిటీలు బిజెపికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు ఓటుచేసినట్లు స్పష్టమైంది. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయించింది వైఎస్‌ జగన్మోహరెడ్డి అయితే వెనుక నుంచి ప్రోత్సహించింది లేదా మీ ఇష్టం అన్నట్లు వ్యవహరించింది బిజెపి అని తెలుగుదేశం శ్రేణులు భావించాయి. ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలపటాన్ని ఎంతవరకు జీర్ణించుకుంటాయి ?ప్రస్తుతం తెలుగుదేశం కూటమి, వైసిపి మధ్య నువ్వానేనా అన్నట్లుగా పరిస్థితి ఉంది. అలాంటపుడు వచ్చే-పోయే ప్రతి ఓటుకూ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణా, రాజస్థాన్లో కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో అధికార మార్పిడి జరిగిన సంగతి తెలిసిందే.


అధికారమే పరమావధిగా ఉన్న రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులూ ఎవరూ ఉండరు.ఇప్పటి వరకు తెరవెనుక వైసిపి మద్దతుదారుగా ఉన్న బిజెపి ఒక్కసారిగా తెరముందు తెలుగుదేశంతో చేతులు కలిపితే షర్మిల చేరిన కాంగ్రెస్‌తో జగన్మోహనరెడ్డి చేతులు కలిపే అవకాశాన్ని కొట్టిపారవేయలేము. ఇప్పుడు అది ఊహాజనితమే కావచ్చు. జగన్మోహనరెడ్డికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టలేదని, కేసులు బనాయించిందన్న దుగ్దతప్ప కాంగ్రెస్‌తో వైసిపికి ఇతర పంచాయితీ ఏముంది. తన సత్తాఏమిటో జగన్‌ నిరూపించుకున్నందున అతనితో కలిసేందుకు కాంగ్రెస్‌కూ ఇబ్బంది ఉండదు. దానికి పార్టీ పునరుద్దరణ ముఖ్యం తప్ప మరొకటి కాదు. పాత సంవత్సరం తెలుగుదేశానికి ఒక పీడకల అని చెప్పాలి. చంద్రబాబునే అరెస్టు చేయించిన జగన్మోహనరెడ్డి తమ మీద కేంద్రీకరిస్తే ఏమిటన్న ఆందోళన తెలుగుదేశ శ్రేణుల్లో తలెత్తిందన్నది కాదనలేని వాస్తవం. ఒక విధంగా చంద్రబాబు నాయుడి మీద బనాయించిన కేసు, రిమాండ్‌కు పంపటం తెలుగుదేశం కార్యకర్తల్లో ఇంతకంటే ఏం చేస్తారు అన్న తెగింపును కూడా తెచ్చింది. బెయిలు వచ్చిన తరువాత వారిలో చలి వదిలింది..


మూడు రాజధానులతో రాష్ట్ర అభివృద్ధి చేస్తామనే పేరుతో వైసిపి ఆడిన క్రీడ వికటించింది.వట్టిస్తరి మంచినీళ్లు అన్నట్లుగా అభివృద్దీ లేదు, దానికి రోడ్‌మాపూ లేదు. అమరావతిని గాలికి వదలివేశారు. కర్నూలుకు హైకోర్టు తరలింపు రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో లేదు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు రకరకాల ఆందోళనలను, న్యాయపోరాటాలను సాగిస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద, గత ఒప్పందాలను విస్మరించటం మీద కేసులు దాఖలు చేశారు. విశాఖకు కార్యనిర్వాహక రాజధాని అన్న ప్రచారం అక్కడ భూ దందాలకు తెరలేపేందుకే అన్న సంగతిని ఆ ప్రాంత వాసులు ఇప్పటికే గుర్తించారు.ముహూర్తాలు ఎన్నో చెప్పారు. చివరికి 2023 నవంబరు 22న జారీచేసిన ఉత్తరువులో ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి, సంక్షేమ పధకాల సమీక్షల నిమిత్తం ముఖ్యమంత్రి, శాఖాధిపతుల క్యాంపు కార్యాలయాలను విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దానిలో ఎక్కడా కార్యనిర్వాహక రాజధాని అనే పదం లేదు. చివరికి కోర్టులో కేసు దాఖలు కావటంతో అది కూడా ఆగిపోయింది. ఇది జగన్‌కు ఊహించని దెబ్బ. కోర్టు కేసు ఇప్పట్లో తేలే అవకాశాలు లేవు. ఈ లోగా ఎన్నికల షెడ్యూలు ప్రకటన రానుంది. కాళేశ్వరాన్ని చూపి ఓట్లు కొల్లగొట్టాలన్న బిఆర్‌ఎస్‌ ఆశలను మేడిగడ్డ బారేజ్‌ పిల్లర్ల కుంగుబాటు ఎలా దెబ్బతీసిందో చూశాము. వైసిపికి మూడు రాజధానుల అంశం కూడా అలాంటిదే. ప్రతిపక్షం మీద ఆరోపణలు చేసేందుకు మాత్రమే పనికి వస్తుంది తప్ప జనాన్ని మెప్పించేది కాదు.


జగన్మోహనరెడ్డికి 2023 మిగిల్చిన మరో ఆశాభంగం స్కిల్‌డెవలప్‌మెంట్‌, ఇతర కేసులు. తెలుగుదేశం పార్టీ నేతలను ప్రత్యేకించి మాజీ సిఎం నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌లను వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు లేదా కనీసం ఎన్నికల తేదీ వరకు జైలుకు పంపి ప్రచారానికి దూరం చేయటం, అంతకంటే ముఖ్యంగా అగ్రనేతలకే ఏ గతి పట్టిందో చూడండి అని తెలుగుదేశం శ్రేణులను భయపెట్టేందుకు చూశారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈకేసుల్లో సిఐడి వ్యవహరించిన తీరు ఊహించినదానికంటే ముందుగానే జనసేనను తెలుగుదేశానికి మరింతదగ్గర కావించింది. చంద్రబాబు నాయుడిపై బనాయించిన కేసు బలం, తమ ప్రభుత్వం గురించి గొప్పగా ఊహించుకున్న వైసిపి శ్రేణులు పైకి చెప్పుకోలేని విధంగా తీవ్ర ఆశాభంగం చెందాయి. నాలుగేండ్లు మౌనంగా ఉండి 2023 చివరిలో చంద్రబాబును ముద్దాయిగా చేర్చటం విఫల రాజకీయ వ్యూహంలో భాగమే. బెయిలు రాదు అనుకున్న చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటికి రావటమే కాదు, రాజకీయ ప్రచారం చేసుకొనేందుకు కూడా కోర్టు అనుమతించింది. మంత్రులు, ఎంఎల్‌ఏల పని తీరు మీద అటు జనంలోనూ ఇటు పార్టీ కార్యకర్తల్లోనూ అసంతృప్తి ఉన్నట్లు చాలా కాలం నుంచి వార్తలు వచ్చాయి. ఎంఎల్‌ఏలు, ఎంపీలను వదిలించుకొనేందుకు, వీలుగాకపోతే బదిలీలు చేసేందుకు జగన్‌ పూనుకున్నారు. పొమ్మనకుండా పొగపెట్టినట్లు ముందుగానే భారీ మొత్తంలో నిధి సమర్పించుకోవాలని చెబుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. వైసిపికి 90 సీట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదని ఇంటలిజెన్స్‌ ఇచ్చిన నివేదిక పేర్కొన్నట్లు చెబుతున్నారు. అధికారానికి కావాల్సిన సంఖ్య 88, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వైసిపి మునిగిపోయే నావ మాదిరి ఉంది. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప రక్షించటం కష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వెంట తిరిగే హచ్‌ కుక్కలు – చంకనెక్కే బొచ్చు కుక్కలు !

05 Thursday Dec 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Janasena, P&K, pavan kalyan, tdp, Ycp, YS jagan

Image result for pawan kalyan chandrababu naidu jagan

ఎం కోటేశ్వరరావు
కొత్త సర్కార్‌కు ఈ మధ్యనే ఆరు నెలలు నిండాయి. అసాధారణ పరిస్ధితులు ఏర్పడితే తప్ప ఇప్పుడప్పుడే ఎన్నికలు రావు. అయినా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ రంగంలో వేడి పుడుతోంది. ఇది ప్రకటనలకు ఆవేశ, కావేషాలకే పరిమితం అవుతుందా ? అంతకు మించుతుందా ? ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చదరంగంలో ఎలా గెలవాలా అని ప్రతిపక్షాలు చూస్తుంటే ప్రత్యర్ధులను ఎలా కట్టడి చేయాలా అని సహజంగానే అధికారపక్షం ప్రయత్నిస్తుంది.ఈ క్రమంలో ఎత్తులు పై ఎత్తులు సహజం.
ఆరునెలల క్రితం జరిగిన ఎన్నికలకు ముందు వైసిపి-బిజెపి బంధం గురించి తెలుగుదేశం మైండ్‌ గేమ్‌ ఆడింది. ఇప్పుడు వైసిపి నాయకత్వం ఆడుతున్న ప్రతి క్రీడలో భాగంగా బిజెపి-తెలుగుదేశం-జనసేన బంధాన్ని ముందుకు తెస్తోంది. గత ఎన్నికల్లో జనసేన-వామపక్షాలు సర్దుబాట్లతో ఐక్యంగా పోటీ చేశాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఏ పార్టీతోనూ కలసి కార్యాచరణ చేపట్టకూడదని జనసేన నాయకత్వం నిర్ణయించినపుడే ఆ పార్టీ వామపక్షాలకు దూరంగా ఉండదలచుకున్నదని తేలిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో ఏమి జరగనున్నది అనే చర్చకు తెరలేచింది. వైసిపికి తామే అసలైన ప్రతిపక్షమని బిజెపి నేతలు ప్రకటించారు.బిజెపితో తెలుగుదేశం పార్టీ సంబంధాల గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. వాటి ఆధారంగా నిర్ధారణలకు రావటం, జోశ్యాలు చెప్పాల్సిన అవసరం లేదు.అవి కలసినా, విడిగా వున్నా సంఖ్యా పరంగా వైసిపికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఇక బిజెపితో పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలోని జనసేన పార్టీ సంబంధాల గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఊహాగానాలు వచ్చినా వారే చెబుతున్నారు గనుక తలలు బద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు.
‘బిజెపికి నేను ఎప్పుడు దూరమయ్యాను? దగ్గరగానే ఉన్నా. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కోసం కేండ్రంతో విభేదించాను. అమిత్‌షా అంటే నాకు అమితమైన గౌరవం. వైసిపి వాళ్లకు ఆయనంటే భయం.’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తిరుపతి విలేకర్ల సమావేశంలో చెప్పారు. దేశ ప్రజలు బిజెపిని మంచి మోజార్టీతో రెండోసారి అధికారంలో కూర్చోబెట్టారు. మోడీ అమిత్‌షా దేశ ప్రయోజనాలు, దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు. నేను సెక్యులరిస్టును. ఓట్లు వచ్చినా, రాకపోయినా నేను నమ్మే హిందూ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. జగన్‌ నివాసానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా పుష్కర ఘాట్‌లో సామూహిక మత మార్పిడి చేస్తుంటే ఆయనకు తెలియదా? ఎవరి అండ చూసుకొని 40 మందిని సామూహిక మతమార్పిడి చేశారో చెప్పాలన్నారు. హిందూధర్మ పరిరక్షణ గురించి నేను మాట్లాడితే, దాన్ని వక్రీకరించి వైసిపి అసత్య ప్రచారం చేసింది. ఎవరైనా సరే మత విశ్వాసాలను గౌరవించి తీరాల్సిందే అన్నారు. ‘మీరు టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకుంటారా?’ అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ‘చెప్పలేం… ఉండొచ్చు ఏమో…’ అంటూ సమాధానం దాటవేశారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి దళిత, బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారని, రెండోసారి అధికారం కోసం ఎవరిని పక్కన పెట్టి పార్టీని స్థాపించించారో ఆ బ్రాహ్మణులను అక్కున చేర్చుకున్నారని. రాజకీయాలు ఇలా ఉంటాయంటూ సమాధానం చెప్పారు.
జనసేనను బీజేపీలో విలీనం చేయమని ఎన్నికలకు ముందే పవన్‌ కల్యాణ్‌ని అడిగామని, అప్పుడు ఆయన ఒప్పుకోలేదని భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు గుర్తుచేశారు. ఇప్పుడు ఏమైనా పవన్‌ కల్యాణ్‌ మనసు మారి ‘జనసేన’ను భారతీయ జనతా పార్టీలో విలీనం చేసే ఆలోచన ఉంటే తప్పనిసరిగా స్వాగతిస్తామని చెప్పారు.’మా నాయకత్వం కొత్త ఒరవడిని తీసుకురావడానికి ఇష్టపడుతోంది. కేవలం రాజకీయ కారణాలతో ఆరడుగుల బుల్లెట్‌ (పవన్‌ కల్యాణ్‌)ను మా భుజాలపై నుంచి సంధించాలని వేరే వారు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే, పొత్తులు పెట్టుకునే సమయం కాదు ఇది. ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలు జరగడానికి ఇంకా నాలుగున్నర సంవత్సరాల వ్యవధి వుంది. మాతో కలిసి పనిచేయదలచుకున్న పార్టీలు ఏవైనా విలీనం కాదలచుకుంటే స్వాగతిస్తాం.లేదా కలిసి పనిచేసేలా ప్రయత్నిస్తాం’ అని జీవీఎల్‌ పేర్కొన్నారు.

Image result for pawan kalyan chandrababu naidu jagan
తిరుపతి వెంకన్న సాక్షిగా పవన్‌ చెప్పిన మాటలు, బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు స్పందన గురించి వేరే వ్యాఖ్యానాలు అవసరం లేదు. గతంలో సినిమా సమీక్షలు రాసేవారు కథంతా వివరించి చిత్ర ముగింపు ఎలా ఉంటుందో చెప్పకుండా ఆసక్తిని కలిగించేందుకు ప్రయత్నించేవారు. ఇప్పుడు బిజెపి-జనసేన మధ్యలో తెలుగుదేశం అన్నట్లుగా ఉంటుందా ? బిజెపి-జనసేన విలీనం అవుతాయా, మిత్రపక్షాలుగా ఉంటాయా అన్నది కూడా త్వరలోనే స్పష్టం అవుతుంది. అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌-బిజెపిలతో సఖ్యతను చూస్తే కాంగ్రెస్‌ నుంచి విడిపోయిన శక్తులు తిరిగి దానితో సర్దుబాటు చేసుకున్నా ప్రత్యేక పార్టీలుగానే కొనసాగి బేరసారాలు జరుపుతున్నాయి.
చిన్న పార్టీలను కాంగ్రెస్‌ ఎలా మింగివేసిందో గత అనుభవం ఉంది గనుక బిజెపి విషయానికి వస్తే ప్రాంతీయ పార్టీలు ముందు నుంచి తగుజాగ్రత్తలతో వ్యహరిస్తున్నాయి. రెండు పెద్ద జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు విలీనం అయితే ముద్రవేయించుకొని మందలో కలవటం తప్ప చేసేదేమీ ఉండదని ప్రజారాజ్యం నేత చిరంజీవి అనుభవం తెలిసిందే. అన్నింటికీ మించి విడిగా ఉంటేనే ప్రాంతీయ పార్టీలకు బేరసారాలాడే శక్తి ఎక్కువగా ఉంటుంది. అంతకు మించి ఎప్పుడు ఎటుకావాలంటే అటు సులభంగా దూకే సౌలభ్యం ఉంటుంది. అందుకు మహారాష్ట్ర శివసేన చక్కటి ఉదాహరణ. హిందూత్వ విషయంలో విడదీయలేని బిజెపితో పోటీ పడిన ఆ పార్టీ అధికారం విషయంలో పేచీకి దిగి ఎన్‌సిపి-కాంగ్రెస్‌ కూటమితో ఎలా చేతులు కలిపిందో చూశాము. దీన్ని చూసిన తరువాత ఏ పార్టీ ఎప్పుడు దేనితో చేతులు కలుపుతుందో చెప్పలేని స్ధితి ఏర్పడింది. ఎవరి తురుపు ముక్కలను వారు తమ దగ్గరే పెట్టుకొని జూదం ఆడతారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ను తెలుగుదేశం పార్టీనేత చంద్రబాబు నాయుడు వెనుక తిరిగే హచ్‌ కుక్క వంటి వాడని వ్యాఖ్యానించారు. అంతకు ముందు మరో మంత్రి కొడాలి నాని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లుచ్చాగాడు అని సంబోధించారు. గతంలోకి వెళితే 2016 రైతు భరోసా యాత్రలో వైఎస్‌జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ నవనిర్మాణ దీక్షల గురించి చంద్రబాబు చెప్పింది నిజంగా జరగాలంటే చంద్రబాబు నాయుడిని ఎక్కడ కనపడితే అక్కడ చెప్పులతో కొట్టాలన్నారు. చంద్రబాబు సిగ్గుమాలిన మనిషి, నారాసురుడు అని జగన్‌ అంటే, వైఎస్‌ఆర్‌ దొంగలు అని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలంతా విన్నారు, కన్నారు. ఇవన్నీ చూసినపుడు రాష్ట్ర రాజీకీయాల్లో నోరుబట్టని బూతులు, కూతలు నిత్యకృత్యమయ్యాయి.రాబోయే రోజుల్లో బూతులతో పాటు మత,కులాల అంశాలను మరింతగా ముందుకు తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
బూతులు ఎవరు మొదలు పెట్టారు, ఎవరు ఎంత సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు అన్నది నేడు గ్రామాలలో రచ్చబండ చర్చల్లో రచ్చ అవుతోంది. ఏ పార్టీ అభిమానులు ఆ పార్టీ నేతల బూతులను నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల ఉన్మాదంతో ఊగిపోతున్నారు. దాన్నింకా పెంచేందుకు నేతలు బూతుల పంచాంగాలను మరింత శ్రావ్యంగా వినిపిస్తున్నారు. ఇలా బూతులు మాట్లాడటం తప్పనే జ్ఞానం ఎక్కడా కనిపించటం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి, ఆయన అనుయాయుల మీద తమ అనుచరుల నోటి దురుసుతనాన్ని విని ఆనందిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ మీద తన మంత్రులు, ఇతర నేతల బూతులు, కూతలను చూసి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి మహదానందం పొందుతున్నట్లు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం ఉందంటే మన నేతలకు ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో ఎలాంటి గౌరవం దక్కుతుందో చెప్పనవసరం లేదు. తెలుగు సమాజం ఇలాంటి వారిని ఎలా భరిస్తున్నదని ప్రశ్నించే రోజులు రాబోతున్నాయి. ఎవ్వరేమనుకుంటేనేమి నాకేటి సిగ్గు అనుకుంటే చేసేదేముంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకీ పరిస్ధితి, ఎందుకీ దిగజారుడు ? గతంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, స్వతంత్రపార్టీ వంటివి అధికార, ప్రతిపక్షాలుగా ఉన్నపుడు ఇలాంటి దిగజారుడుతనం లేదు. రాజకీయ వైరం తీవ్రంగా ఉన్నప్పటికీ పరస్పర నిందలు లేవు. ఎన్‌టి రామారావు రాజకీయ రంగంలోకి వచ్చినపుడు కుక్కమూతి పిందెలు అని చేసిన విమర్శకు మమ్మల్ని ఇంతలా నిందిస్తారా అని కాంగ్రెస్‌ వారు నొచ్చుకున్నారు. ఇప్పుడు వెలువడుతున్న పదజాలంతో పోల్చితే నిజానికి ఆ విమర్శ పార్లమెంటరీ సంప్రదాయాలకులోబడిందే తప్ప నింద కాదు.
1991 నుంచి అమల్లోకి వచ్చిన నయావుదారవాద విధానాలను అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న జాతీయ, ప్రాంతీయ పార్టీలు(కొన్ని అంశాలలో పరిమితంగా వామపక్షాలు మినహా) ఒకే రకమైన ఆర్ధిక విధానాలను అమలు జరుపుతున్నాయి. అందువలన తెలుగుదేశం, వైసిపి, కాంగ్రెస్‌, జనసేన, బిజెపి వంటి పార్టీలేవీ విధానాల గురించి చట్ట సభల్లో లేదా వెలుపలా ఎక్కడా ప్రస్తావించవు, ఘర్షణ పడవు. వాటి పంచాయతీ అల్లా అధికారం, దాన్ని అడ్డం పెట్టుకొని ఆస్ధులు కూడబెట్టుకోవటం గురించి మాత్రమే. అందువల్లనే అధికారం కోసం ఎంత ఖర్చు పెట్టటానికైనా వెనుదీయరు, ఏమి చేయటానికైనా సిద్దం అవుతారు.
గతంలో అంటే నూతన ఆర్ధిక విధానాలు రాకముందు భూమి దాని మీద పట్టు, గ్రామీణ ప్రాంతాలలోని వనరుల మీద ఆధిపత్యం కోసం పాలెగాళ్లు, భూస్వాములు, ధనిక రైతులు వెంపర్లాడేవారు. గడచిన మూడు దశాబ్దాలుగా వ్యవసాయం గిట్టుబాటు గాకపోవటం, దాని మీద వచ్చేదాని కంటే పరిశ్రమలు, వ్యాపారాలు, రియలెస్టేట్‌ మీద వచ్చే ఆదాయం ఆకర్షణీయంగా మారటంతో రాయలసీమ ఫ్యాక్షనిస్టులు, ఇతర ప్రాంతాల్లోని భూస్వాములు, ధనిక రైతులు వాటి వైపు మొగ్గుచూపారు. రాయలసీమలో ఇప్పటికీ ఫ్యాక్షనిజం ఉన్నప్పటికీ వాటి నేతలకు గ్రామీణ ప్రాంతాలలో వచ్చే ఆదాయాల కంటే పట్టణాలు ఆకర్షణీయంగా ఉండటంతో వారి మధ్య సర్దుబాట్లకు తెరలేచింది. ఒకరి సంపాదనకు మరొకరు అడ్డుపడకుండా ఎవరి సంపాదన వారు చూసుకుందామనే పెట్టుబడిదారీ ఆలోచనలు అందుకు దోహదం చేస్తున్నాయి.అందువల్లనే పేరు మోసిన వైరి ఫ్యాక్షనిస్టులు అటు తెలుగుదేశం పార్టీలో ఇటు వైసిపిలో ఒకేవరలో ఇమిడిపోగలుగుతున్నారు.
నయావుదారవాద విధానాలు ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి తెరలేపాయి.ప్రపంచ బ్యాంకు విధానాల అమలు ప్రయోగశాలగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మారింది. దీనిలో ప్రభుత్వరంగ సంస్ధల ఆస్ధులను ఆశ్రితులకు అయినకాడికి తెగనమ్మటం ద్వారా లబ్ది చేకూర్చటం. విలువైన భూములను కారు చౌకగా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు కట్టబెట్టి వారి నుంచి రాజకీయనేతలు లబ్ది పొందటం తెలిసిందే. అది అపరిమిత లాభాలు చేకూర్చటంతో ఎన్నికలు వ్యాపారంగా మారాయి. పదుల కోట్ల రూపాయలు అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికలలో ఖర్చు చేయటానికి కారణమిదే. దీనికి అనుగుణ్యంగానే స్ధానిక సంస్ధల ఎన్నికలు కూడా డబ్బుమయంగా మారాయి.
ఇదే సమయంలో రాజకీయ వైరం తీవ్రంగా ఉన్న సందర్భాలలో ఎదుటి వారికి ఆర్ధిక మూలాలను దెబ్బతీయటం చేస్తున్నారు. అది కేంద్రంలోనూ, రాష్ట్రాల్లో అధికారాల్లో ఉన్నవారూ చేస్తున్నారు. కాంట్ట్రాక్టర్లుగా ఉన్నవారికి దీర్ఘకాలం పాటు బిల్లులు నిలిపివేయటం, కొర్రీలు వేయటం, గనులు పొందిన వారి మీద దాడులు చేయించటం. గతంలో పొందిన కాంట్రాక్టులను రద్దు చేస్తామని బెదిరించటం ఇలా రకరకాల పద్దతులను రంగంలోకి తీసుకువస్తున్నారు. తెలుగుదేశం హయాంలో గ్రామాల్లో కాంట్రాక్టులు పొంది పనులు చేసిన వారు పార్టీ మారి వైసిపిలోకి వెళితే వెంటనే బిల్లులు మంజూరు చేయటం, మారని వారిని సతాయించటం గురించి వస్తున్న ఫిర్యాదుల సారమిదే.

Image result for pawan kalyan chandrababu naidu jagan

ఎన్నికల్లో డబ్బు ప్రమేయం పెరుగుదల రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సర్దుబాట్లకు-కక్షలకు తెరలేపింది. ఎవరు బిస్కెట్‌ వేస్తే లేదా కర్ర చూపితే వారి వైపు తోకాడించుకుంటూ వెళ్లి చంకనెక్కే బొచ్చుకుక్కల మాదిరి వెళుతున్న వాణిజ్య రాజకీయనేతలను చూస్తున్నాము. డబ్బు, ఓట్లను రాబట్టగలిగిగే సామాజిక తరగతిని బట్టి నిన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీలో పదవులు వెలగబెట్టిన వారు తెల్లవారే సరికి వాటంగా ఉంటుందనుకొంటే మరొక పార్టీలోకి సులభంగా మారిపోతున్నారు. చేర్చుకొనే వారికి, చేరేవారికి ఎలాంటి విలువలు, వలువలు ఉండటం లేదు. ఒక పార్టీలో గెలిచి ప్రజాప్రతినిధిగా ప్రమాణ స్వీకారం కూడా చేయక ముందే మరో పార్టీలో చేరిన వారిని చూశాము. ఫిరాయింపుదార్లను కాపాడేందుకు స్పీకర్ల వ్యవస్ధను దుర్వినియోగం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఎవరు అధికారంలో వుంటే వారికి వ్యతిరేకంగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొనేందుకు ప్రతిపక్షంగా ఉన్న ప్రతి పార్టీ ప్రయత్నిస్తుంది.దానిలో తప్పులేదు. ఇప్పుడు ప్రతిపార్టీ అధికారంలోకి వచ్చేందుకు సంక్షేమ చర్యల విషయంలో పోటీపడుతున్నది తప్ప వేరే అంశాలే లేవు. సంక్షేమ చర్యలను విమర్శించేందుకు ఎవరూ ముందుకు రారు. రాజకీయంగా వేడి పుట్టించాలంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని బూతులతో రక్తి కట్టిస్తే తప్ప జనానికి కిక్కు ఎక్కటం లేదు. ఇప్పుడు బిజెపితో స్నేహం కారణంగా మతాన్ని కూడా ముందుకు తెస్తున్నారు. ఆరు నెలల క్రితం బిజెపికి వ్యతిరేకంగా పని చేస్తా అని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ అప్పటికీ ఇప్పటికీ ఆ బిజెపిలో వచ్చిన మార్పేమిటో, రాష్ట్రానికి చేసిన మేలు ఏమిటో, ఎందుకు తన వైఖరిని మార్చుకున్నారో జనసేనాని జనానికి చెప్పాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమరావతి నిర్మాణం- బొత్స శల్యసారధ్యం !

01 Sunday Sep 2019

Posted by raomk in AP, Current Affairs, History, INDIA, Opinion, Political Parties, STATES NEWS

≈ Leave a comment

Tags

Amaravati capital, Amaravati capital controversy, ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, Chandra Babu, pavan kalyan, YS jagan

Image result for amaravati capital

ఎం కోటేశ్వరరావు

మహాభారతాన్ని ఒక రచనగా నమ్మేవారు గానీ, నిజంగా జరిగిందని విశ్వసించే వారికి గానీ శల్యుడి గురించి తెలిసిందే. యుద్ధంలో కర్ణుడి రధ సారధిగా వ్యవహరించిన తీరు శల్యసారధ్యంగా గణుతికెక్కింది. అర్జునుడిని గెలిపించేందుకు గాను కర్ణుడి సారధిగా వుంటూ అర్జునుడిని పొగుడుతూ కర్ణుడి దృష్టిని పక్కదారి పట్టించే అంటే ఒక నమ్మక ద్రోహి పాత్రను పోషించాడు. ఇదంతా ధర్మరాజు కోరిక మేరకే చేశాడని, తరువాత కృష్ణుడి సలహా మేరకు ఆ ధర్మరాజు చేతిలోనే శల్యుడు హతమయ్యాడన్నది కధ.

తెరవెనుక ఏమి జరిగిందన్నది ఎవరికి వారు వూహించుకోవటం తప్ప ఎవరూ విన్నది లేదు కన్నదీ లేదు గానీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతి విషయంలో శల్యుడి పాత్రను పోషిస్తున్నట్లుగా స్పష్టమైంది. వెంటనే దీనికి సూత్రధారి ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఏదీ రహస్యం కాదు, కాస్త వెనుకో ముందో అన్నీ బయటకు వస్తాయి. చివరికి బొత్స ఏమౌతారో తెలియదు గానీ, ఈ పరిణామాలను చూస్తున్న వారు సహజంగానే పెద్దన్న అంటే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వైపే వేలెత్తి చూపటం సహజం.

అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఆమోదించటం వేరు, దానికి భూములు సేకరించిన తీరును విమర్శించటం మరొకటి. ఈ విషయంలో వైసిపి పక్ష నాయకుడిగా జగన్‌ అసెంబ్లీలో ఆమోదించారు. భూ సేకరణ పద్దతిని విమర్శించారు. ఐదు సంవత్సరాల తరువాత వారు వీరయ్యారు. రాజధాని నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని, ఆ ప్రాంత భూముల లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని, రాజధాని నిర్ణయం జరగక ముందే చంద్రబాబు నాయుడు తన బినామీలు, అనుయాయులకు వుప్పందించి ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయించారని, వాటికి రేట్లు పెరిగే విధంగా తరువాత రాజధాని ప్రాంత పరిధిని విస్తరింపచేసి లబ్ది చేకూర్చారనే విమర్శలు గతంలోనే వెల్లడయ్యాయి. వైసిపి నాయకత్వం కూడా చెప్పింది. వాటన్నింటి మీద విచారణ జరిపి అక్రమాలను బయట పెడతామంటే అంతర్గతంగా ఏమనుకున్నప్పటికీ తమకేమీ అభ్యంతరం లేదని తెలుగుదేశం పార్టీ కూడా ప్రకటించింది.

గతంలో జరిగిన అక్రమాలను వెలికి తీయటానికి ఎవరికీ అభ్యంతరం లేదు. ఇదే సమయంలో ఇప్పటి వరకు బయట పెట్టటానికి తీసుకున్న చర్యలేమీ లేవు. కొన్ని విద్యుత్‌ ఒప్పందాల సమీక్ష, పోలవరం టెండర్ల రద్దు, రివర్స్‌ టెండర్ల విషయంలో వేగంగా తీసుకున్న చర్యలను చూసిన జనం అమరావతి అక్రమాల విషయంలో లేస్తే మనిషిని కాదు అన్న కాళ్లు లేని మల్లయ్య మాదిరి అవసరమైనపుడు బయట పెడతాం అంటున్నారు. ఇది ఒక వైపు సాగుతుండగానే ముందే చెప్పుకున్న శల్యసారధ్యం మాదిరి బొత్స సత్యనారాయణ తెల్లారితే వెలుగు వస్తుంది, పొద్దు గూకితే చీకటి పడుతుంది అన్నట్లుగా వరదలు వస్తే అమరావతి మునిగిపోతుంది. పునాదులు లోతుగా తీయాలి, కట్టడాలను ఎత్తుగా కట్టాలి, మిగతా చోట్ల కంటే ఖర్చు రెట్టింపు అవుతుంది, అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలి అనే రీతిలో మాట్లాడి ఈ ప్రభుత్వానికి అమరావతి రాజధాని అభివృద్ధి అంటే ఇష్టం లేదు, మరో ప్రాంతానికి తరలిస్తారు అని ప్రచారం చేసేందుకు, జనం నమ్మేందుకు ఆస్కారం కలిగించారు. బొత్స చెబుతున్నదాని ప్రకారం అయితే గతంలో రాజులు, రంగప్పల మాదిరి కొండలు, గుట్టల మీద దుర్గాలు, కోటల మాదిరి నిర్మాణాలు చేయాలి. మంత్రిగారికి మద్దతుగా వైసిపి నేతలు ఆయన మాట్లాడిందాంటో తప్పే ముంది, రాజధానిని తరలిస్తామని చెప్పలేదుగా అంటూ సమర్దనకు దిగారు. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి అమెరికాలో వుండగా ప్రారంభమైంది. ఆయన రాష్ట్రానికి తిరిగి వచ్చిన తరువాత బొత్సవ్యాఖ్యలతో తలెత్తిన వివాదం లేదా గందరగోళానికి తెరదించుతారని, ముఖ్యమంత్రిగా ఒక వివరణ ఇవ్వాలని అందరూ ఆశించారు, కోరుకున్నారు. అదేమీ చేయలేదు, రాష్ట్రంలో ఒక ముఖ్యమైన అంశం మీద ముఖ్యమంత్రి స్పందించలేదంటే, కావాలనే ఇదంతా చేస్తున్నారు, సిఎం ఆశీస్సులు లేకుండా మంత్రి మాట్లాడి వుండరనే అభిప్రాయాన్ని నిర్దారించినట్లే భావించాల్సి వుంటుంది.

అమరావతి ప్రాంతం రాజధానిగా వుంటే ఎదురయ్యే సమస్యల గురించి శివరామ కృష్ణన్‌ కమిషన్‌ వెల్లడించిన అభిప్రాయాలను ఖాతరు చేయకుండా ఆ ప్రాంతంలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానికి మద్దతు తెలిపిన సమయంలో వైసిపి నాయకత్వానికి ఆ ప్రాంతంలో వరద ముప్పు తెచ్చే కొండవీటి వాగు గురించి తెలియదని, వారంతా అమాయకులని అనుకోలేము. రాజధానితో నిమిత్తం లేకుండానే రైతాంగాన్ని నష్టపరిచే ఆ వాగు ముంపు నివారణ చర్యలు తీసుకోవాలని మంగళగిరికి గతంలో ప్రాతినిధ్యం వహించిన సిపిఎం ఎంఎల్‌ఏ నిమ్మగడ్డ రామమోహనరావు, ఆ పార్టీ ఆధ్యర్యంలో అనేక సార్లు పాలకుల దృష్టికి తెచ్చినా తెలుగుదేశం పార్టీ గానీ, వైసిపి మాతృక కాంగ్రెస్‌ పాలకులు గానీ పట్టించుకోలేదన్నది తెలిసిందే. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన తరువాత ముంపు నివారణకు కొన్ని పధకాలను రూపొందించారు. వాటన్నింటినీ విస్మరించి మంత్రి ఆ సమస్యను ఇప్పుడు ముందుకు తేవటం ఏమిటి? అమరావతిపై అసెంబ్లీ చర్చ సందర్భంగా వైసిపి నేతలు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ?

అమరావతి అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తే మిగతా ప్రాంతాలు ఏమి కావాలన్నట్లు వైసిపి నేతలు కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్నారు. మిగతా ప్రాంతాల అభివృద్ధికి ఎవరు అడ్డుపడ్డారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో కాంగ్రెస్‌ లేదా తెలుగుదేశం ఎవరున్నా కేంద్ర, రాష్ట్రాల పెట్టుబడులు, సంస్ధలను హైదరాబాదులోనే కేంద్రీకరించి అటు తెలంగాణా ఇటు రాయలసీమ, ఆంధ్రప్రాంతాలను నిర్లక్ష్యం చేసిన నేరానికి అందరినీ బోనులో నిలబెట్టాల్సిందే. మన దేశ అనుభవం తీసుకున్నా లేక ప్రపంచ దేశాల తీరు చూసినా ప్రయివేటు పెట్టుబడులు ఎక్కడ లాభసాటిగా వుంటే అక్కడికే తరలి వచ్చాయి, వస్తున్నాయి, వస్తాయి తప్ప మరోచోటికి రావటం లేదు. 1991 నుంచి కొన్ని రక్షణ సంబంధ సంస్ధల విషయంలో తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టటం నిలిపివేశాయి. అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి చెబుతున్న వైసిపి తన ఎన్నికల ప్రణాళికలో నవరత్నాల గురించి తప్ప తాను అధికారంలోకి వస్తే ప్రభుత్వ పరంగా ఏఏ ప్రాంతాల్లో ఏ పరిశ్రమలకు పెట్టుబడులు పెడతానో ఎందుకు చెప్పలేదు. పాలకులు కోరిన చోట పెట్టుబడులు పెట్టేందుకు ప్రయివేటు వారు ఎవరూ ముందుకు రారు. అదే గనుక జరిగితే గత ఐదు సంవత్సరాలలో చంద్రబాబు, లోకేష్‌ బాబు దేశ విదేశాల్లో చేసిన హడావుడికి ఇంక చాలు బాబో అన్నట్లుగా పెట్టుబడులు, పరిశ్రమలు, సంస్ధలూ వచ్చి వుండాల్సింది. ఇంత ఘోరపరాజయాన్ని మూటగట్టుకొని వుండేవారు కాదు. అమెరికా, ఐరోపా వంటి దేశాలలో విమానాశ్రయాల వంటి మౌలిక సదుపాయాలకు కొదవలేదు, అయినా పెట్టుబడిదారులు అక్కడ పరిశ్రమలు, సేవలపై పెట్టుబడులు పెట్టటం మాని శ్రమశక్తి చౌకగా వున్న చైనా, బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాలలో పెట్టుబడులు, పరిశ్రమలను పెట్టి వుత్పత్తులను తిరిగి తమ దేశాలకే ఎగుమతులు చేస్తున్నారు. ఆయా దేశాల కంపెనీలు మన దేశంలో ఐటి ఇంజనీర్లు వెట్టి చాకిరీ చేయటానికి అందుబాటులో వున్నారు గనుక పొరుగు సేవల రూపంలో ఐటి రంగ సేవలను పొందుతున్నాయి, కంపెనీలను పెడుతున్నాయి.

అమరావతి విషయంలో ఎన్నికబుర్లు చెప్పినా, భ్రమరావతిగా గ్రాఫిక్స్‌ ఎన్ని చూపినా తాత్కాలిక నిర్మాణాలు చేసినపుడే కాలక్షేపం చేయటానికి చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు, దాన్ని సాగదీస్తూ పూర్తి చేయాలంటే తనకు తిరిగి అధికారం కట్టాబెట్టాలని జనం కోసం ముందుకు వెళ్లాలని పధకం వేసినట్లు రుజువైంది.ఐదేండ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయిన చంద్రబాబును నిలవేయని జనం మరో ఐదేండ్ల పాటు అదే పని చేస్తే వైసిపిని ప్రశ్నిస్తారని అనుకోలేం. తమకు ఖాళీ ఖజానా అప్పగించారని వైసిపి సర్కార్‌ వాపోతోంది, అందులో వాస్తవం కూడా వుంది. ఏ సర్కార్‌ అయినా వేలు లేదా లక్షల కోట్లు మిగిల్చి తరువాత వచ్చే ప్రభుత్వాలకు ఖజానా అందించిన వుదంతాలు ఎక్కడా లేవు. ఏ ప్రభుత్వం కూడా అలా మిగిల్చిన దాఖలాలు లేవని బడ్జెట్టను చూస్తేనే తెలుస్తుంది. అందువలన ఆ పేరుతో జగన్‌ సర్కార్‌ కాలక్షేపం చేయవచ్చు. రాజధాని నిర్మాణాలను పూర్తి చేయటానికి మా దగ్గర డబ్బు లేదు, అందువలన మరో ఐదేండ్లు తాత్కాలిక నిర్మాణాల్లోనే కాలక్షేపం చేస్తాం, రాజధాని అక్కడే వుంటుంది అని చెప్పండి. వివాదానికి తెరదించండి, అలా చేస్తే బొత్స సత్యనారాయణ ప్రతిష్టకు వచ్చే భంగమూ లేదు, జగన్‌ సర్కార్‌కు పోయే పరువూ లేదు. ఏదో ఒక స్పష్టత ఇచ్చి మంచి పని చేశారనే సానుకూల వైఖరే వ్యక్తం అవుతుంది. అలాగాక నాలుగు ప్రాంతాల్లో లేదా పదమూడు జిల్లాల్లో రాజధానులను ఏర్పాటు చేస్తాం అన్నట్లుగా మాట్లాడితే తుగ్గక్‌తో పోల్చుకుంటారు. తుపాకి రాముడు లేదా పిట్టల దొరలు అనుకుంటారు.

రాజధాని నిర్మాణం గురించి తెలుగుదేశం పార్టీ దాని సమర్ధకులు మరో వైపు లాగుతున్నారు. రాజధాని అంటే సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ప్రభుత్వశాఖల ప్రధాన కేంద్రం. సిబ్బందికి అవసరమైన వసతుల కల్పనకు ఏర్పాట్లు. అలాంటి రాజధానికి, రాజధాని నగర నిర్మాణానికి ముడిపెట్టి రియలెస్టేట్‌ స్పెక్యులేషన్‌కు తెలుగుదేశం తెరలేపింది. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకోవటంలో తప్పులేదు. చత్తీస్‌ఘర్‌ రాష్ట్రం 2000 సంవత్సరంలో ఏర్పడింది. రాయపూర్‌ను రాజధానిగా ఎంచుకున్నారు. దాని శివార్లలో నయా రాయపూర్‌ నిర్మించి అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2031 నాటికి అక్కడ ఐదులక్షల ముఫ్పై వేల మంది నివసించటానికి ఏర్పాట్లు అవసరమైని రూపకల్పన చేశారు. ఝార్ఖండ్‌ కాత్త రాష్ట్రాన్ని కూడా 2000 సంవత్సరంలోనే ఏర్పాటు చేశారు. రాజధానిగా రాంచీని ఎన్నుకున్నారు. అలాగే వుత్తరాఖండ్‌ రాజధానిగా డెహ్రాడూన్‌ వుంది. గుజరాత్‌లో పెద్ద నగరం అహమ్మదాబాద్‌ వున్నప్పటికీ గాంధీనగర్‌ పేరుతో ప్రత్యేకంగా రాజధాని ప్రాంతాన్ని నిర్మించారు. కొన్ని దశాబ్దాల తరువాత కూడా దాని జనాభా మూడులలక్షలు దాటలేదు. హైదరాబాదు నగరం వంటి దానిని నిర్మిస్తే రాష్ట్రానికి ఆదాయం బాగా వస్తుంది, ఆ దిశగా అమరావతి నిర్మాణం అని చెబుతున్నారు. ఆదాయం కోసం ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ రాజధాని నగరాల నిర్మాణాలు జరపలేదు. అలా జరపటం అంటే అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించటం అనే ఒక తప్పుడు ఆలోచనలో భాగమే.హైదరాబాద్‌ లేదా ఏ మహానగర చరిత్ర చూసినా వందల సంవత్సరాల చరిత్ర, లక్షల కోట్ల రూపాయల మేర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడి, వాటిని ఆసరా చేసుకొని ప్రయివేటు రంగ విస్తరణ కనిపిస్తుంది.

చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా రాష్ట్ర సంపదను పెంచగలగటం గొప్ప విషయం కాదని ఎవరు మాత్రం అనగలరు అంటూ ఒక మీడియా సంస్ధ అధిపతి, జర్నలిస్టు సెలవిచ్చారు. దీన్ని గుర్తించటానికి నిరాకరించే నాయకులు, కుహనా మేథావులు వివాదాస్పదం చేశారు అంటూ అమరావతి గురించి, అందుకోసం చంద్రబాబు నాయుడు పడిన తపన గురించి వ్యాఖ్యానించారు. నాయకులందరూ, మేథావులు గానీ చంద్రబాబు నాయుడు లేదా జగన్‌మోహన్‌ రెడ్డి నందంటే నంది పందంటే పంది అని తలలూపే గంగిరెద్దులు కాదు.ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరిగే ఆ బాపతు వేరే వుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు పిల్లి మొగ్గలు వేసిన సందర్భంగా అది వెల్లడైంది. ఇప్పుడు రాజధాని విషయంలో వైసిపి నేతలు అలాంటి పనిలోనే వున్నట్లు కనిపిస్తోంది. ఒక అభిప్రాయం, అంచనాలతో వ్యతిరేకించే వారిని, విబేధించేవారందరినీ కుహనా మేథావులుగా ముద్రవేస్తే సదరు మీడియా సంస్ధ నడిపే పత్రికలు, టీవీ ఛానల్స్‌లో అలాంటి విబేధాలను నిత్యం ఏదో ఒక అంశం మీద వెల్లడిస్తూనే వున్నారు. అంటే వాటిని నిర్వహించే వారు, పని చేసే వారు కుహనా జర్నలిస్టులే అనుకోవాల్సి వుంటుంది. అది రాజధాని కావచ్చు లేదా పదమూడు జిల్లాల్లో కావచ్చు అసలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు ద్వారా అభివృద్ధి అని చెప్పటమే జనాన్ని తప్పుదారి పట్టించటం. ఎక్కడో ప్రభుత్వ కార్యాలయాలను పెడితే హోటల్స్‌, షాపింగ్‌ మాల్స్‌ వస్తాయా అని ఒక ముక్తాయింపు, అభివృద్ధి అంటే మాల్స్‌, హోటళ్లా ? గుంటూరు పొగాకు, పత్తి, మిర్చి పంటలకు పెద్ద వాణిజ్య కేంద్రం. ఎందరో విదేశీ పొగాకు వ్యాపారులు ప్రతి ఏడాది అక్కడకు వచ్చే వారు. అలాంటి చోట నిన్నమొన్నటి వరకు పెద్ద హోటళ్లు ఎన్ని వున్నాయి? లాభం వుంది గనుకనే గుంటూరులో పొగాకు వ్యాపారులు హోటళ్లను మించిన వసతి గృహాలను ఏర్పాటు చేశారు. లాభం వస్తే వ్యాపారి వరదన పోవటానికైనా వెనుకాడడు. విమానాల సౌకర్యమే ప్రాతిపదిక అయితే ఢిల్లీ, ముంబైకి వచ్చినన్ని విమానాలు ఏ నగరానికి రావు. అయినప్పటికీ బెంగలూరు, హైదరాబాదు మాత్రమే ఐటి రంగంలో ఒకటి రెండు స్ధానాల్లో ఎందుకు ఎదిగాయి. హిమచల్‌ ప్రదేశ్‌, వుత్తరాఖండ్‌ వంటి చోట్ల హైదరాబాదు నుంచి వెళ్లి మరీ ఔషధ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నారు, అక్కడికి వున్న విమాన సౌకర్యాలు ఏపాటి ? లాభాల కోసం పరిశ్రమలు, వాణిజ్యం చేయాలనుకున్న పెట్టుబడిదారులు గానీ, వుద్యోగం కావాలనుకున్న యువత విమాన సౌకర్యాన్ని బట్టి నగరాలను ఎంచుకోరు. అవకాశం వుంటే ఆఫ్రికాకు అయినా వెళుతున్నారు.

Image result for amaravati capital

రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ కోరటం పైన పేర్కొన్న మీడియా అధిపతికి ఆశ్చర్యం కలిగిస్తోందట.ఇది ఒక రాజకీయ నేత నోటి నుంచి వస్తే అర్ధం చేసుకోగలం, ఒక జర్నలిస్టు కలం నుంచి వెలువడటం అంటే చౌకబారు జర్నలిజం తప్ప మరొకటి కాదు. ఒక్క పవన్‌ కల్యాణ్‌ ఏమిటి? చంద్రబాబు వైఖరిని విమర్శించిన వామపక్షాలు కూడా అదే కోరుతున్నాయి, రాజధాని నిర్మాణం అక్కడే జరపాలని చెబుతున్నాయి. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కాంగ్రెస్‌ నిర్వాకం చూసి అనేక మంది ఇలాంటి స్వాతంత్య్రాన్ని కాదు మేము కోరుకున్నది అని ఆవేదన చెందారు. అయినంత మాత్రాన ప్రజానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేయకుండా వదల్లేదు. అమరావతిపై చర్చ సందర్భంగా ప్రతి పార్టీ, మేథావులు అనేక అభిప్రాయాలు చెప్పారు, వాటిలో వ్యతిరేకమైనవీ వున్నాయి. చంద్రబాబు భూసేకరణ తీరును తప్పు పట్టారు. వాటిని చంద్రబాబు పట్టించుకోలేదు. ఆ వైఖరి మాత్రం సదరు జర్నలిస్టుకు ఆమోదం అయింది గానీ ఆశ్చర్యం కలిగించలేదు. ఇష్టమైన రైతులు ప్రలోభాలకు గురయ్యో, అత్యాశలకు లోనయ్యో భూములు ఇచ్చారు. కొందరిని బెదిరించారని కూడా విమర్శలు వున్నాయి. స్వాతంత్య్ర వుద్యమ సమయంలో ఎందరో మహిళలు తమ వంతు త్యాగంగా భావించి వంటి మీద వున్న నిలువెత్తు బంగారాన్ని మహాత్మాగాంధీకి ఇచ్చారు. రాజధాని విషయంలో చంద్రబాబును కూడా అంతటి మహోన్నతుడిగా భ్రమించి కొందరు మహిళలు బంగారాన్ని ఇవ్వటం, కొన్ని మీడియాలు దాన్ని బాహుబలి స్ధాయిలో ప్రచారం చేయటం తెలిసిందే. ఇప్పుడు సదరు మహిళలు, భూములిచ్చిన వారికి నష్టం జరిగేట్లుగా కనిపిస్తున్నపుడు న్యాయం చేయాలని ఎవరైనా అడగవచ్చు, దానికి తప్పు పట్టటం ఏమిటి. అత్త పెత్తనం సామెత మాదిరి జనాన్ని ముంచినా తేల్చినా చంద్రబాబే చేయాలని చెప్పటమా ?

రాజధాని నిర్మాణం జరగని కారణంగానే ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం తగ్గుతోందని అనే భావన కలిగేలా చిత్రిస్తున్నారు. అసలు దేశం మొత్తంగానే ఆ పరిస్ధితి ఎందుకు ఏర్పడిందో కనిపించదా? హైదరాబాదూ, ఆదాయం అంటూ అరచేతిలో వైకుంఠాన్ని చూపుతున్న వారు ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో కూడా ఆదాయం పడిపోయిందని, పొదుపు పాటించాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావే చెబుతున్న విషయాన్ని విస్మరించకూడదు. ఆదాయం లేని ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఆదాయం వున్న తెలంగాణా కూడా ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చిందో, ఆరోగ్యశ్రీకి చెల్లింపులు చేయలేక ఆసుపత్రులు సమ్మెకు దిగాల్సిన పరిస్దితి ఎందుకు ఏర్పడిందో చెప్పాలి. రాజధాని నిర్మాణం గురించి వెంటనే జగన్‌మోహన్‌ రెడ్డి జనంలో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయాలి, అది ఒక ముఖ్యమంత్రి విధి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తప్పుడు సంకేతాల గురించి మీరు కూడా చెప్పటమా చంద్రబాబూ ? హతవిధీ !

28 Wednesday Jun 2017

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, chandababu, dalits

ఎం కోటేశ్వరరావు

తప్పుడు సంకేతాల గురించి చెప్పిన చంద్రబాబు షేక్స్పియర్‌ ప్రఖ్యాత నాటకం జూలియస్‌ సీజర్‌లో బ్రూటస్‌ పాత్రధారిని గుర్తుకు తెచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మత్స్యకారుల వుపాధికి, అంతకు మించి అనేక గ్రామాలను కాలుష్యానికి గురి చేసే తుందుర్రు ఆక్వా ఫ్యాక్టరీని తరలిస్తే ‘తప్పుడు’ సంకేతాలు వెళతాయి గనుక తరలించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. ఈ ప్రకటన ద్వారా అలాంటి హానికరమైన పరిశ్రమలను చివరకు ప్రజల పడక గదుల్లో పెట్టినా తమకు మద్దతు ఇస్తారని పౌరుల ఆరోగ్యాలు, ప్రాణాల నుంచి కూడా లాభాలు పిండుకోవాలనే పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినట్లయింది. అందువలన తేల్చుకోవాల్సింది జనమే. చంద్రబాబుకు, అలాంటి కాలుష్యకారక, ప్రమాదకర పరిశ్రమలకు మద్దతు తెలిపే వారికి ఎలాంటి సంకేతాలు పంపాలో తేల్చుకోవాలి. ఫ్యాక్టరీని తరలించేది లేదన్న ముఖ్యమంత్రి, అధికార పార్టీ నేతల, ప్రభుత్వ యంత్రాంగ మొండి వైఖరి సంకేతాలను గత మూడు సంవత్సరాలుగా జనం చూస్తూనే వున్నారు. అయినను పోయి రావలె అమరావతికి అన్నట్లుగా ఆ ప్రాంత జనం వెళ్లారు.ఐదూళ్లు కాదు సూది మోపినంత కూడా స్ధలం ఇచ్చేది లేదన్న కౌరవుల మాదిరి చంద్రబాబు ఇచ్చిన సందేశం స్వయంగా విన్నారు. ఇప్పటివరకు సాగించిన పోరాటాన్ని మరో రూపంలో సాగించటమా ఆ కాలుష్యానికి తామే గాక తమ ముందు తరాల వారిని కూడా బలి చేయటానికి ఫ్యాక్టరీ యాజమాన్యం, వారికి మద్దతు పలుకుతున్న పాలకులు, పార్టీల ముందు సాగిల పడటమా అన్నది జనం ముందున్న ప్రశ్న. ఈ సమస్య పరిష్కారానికి దగ్గర దారులు లేవు అని గ్రహించటం అవసరం.

స్వాతంత్య్ర పోరాటం మనకు అనేక అనుభవాలు నేర్పింది. తెల్లవారికి తొత్తులుగా, జనానికి నష్టం చేకూర్చే శక్తులు, వ్యక్తులకు సహాయ నిరాకరణ ఒక మార్గం. ఫ్యాక్టరీ యాజమాన్యానికి, ప్రజల వాంఛలకు వ్యతిరేకంగా దానిలో పని చేసేందుకు ఎవరైనా వెళితే వారి గురించి ఆలోచించాల్సి వుంటుంది. మనల్ని చంపటానికి ఎవరైనా పూనుకున్నపుడు ఆత్మరక్షణ కొరకు అలాంటివారి ప్రాణాలు తీసినా అది నేరం కాదు. తుందుర్రు ఫ్యాక్టరీ కూడా అలాంటిదే అని భావించుతున్నారు నుకనే మూడున్నర సంవత్సరాలుగా అనేక అక్రమ కేసులు, జైళ్లకు వెళ్లటానికి అలవాటు పడ్డారు. లొంగిపోయి అనారోగ్యాలతో ఆ ప్రాంతంలో ఈసురో మంటూ గడిపే కంటే దూరంగా వున్న జైళ్లే నయం కదా ! అంతకంటే పాలకులు ఏం చేస్తారు. లేదా పాలకుల మద్దతు వుంది కనుక యాజమానులు గూండాలను పంపి కొంత మందిని హత్య చేయిస్తారు. వుపాధిపోయి, రోగాలపాలై, నిత్యం బతుకు భయంతో చచ్చే కంటే అది నయం. ఇతర ప్రాంతాలలో అలాంటి ఫ్యాక్టరీలు రాకుండా జనం ముందే మేలుకొనేందుకు ధృవతారలుగా మారతారు.

చంద్రబాబు వైఖరిని అర్ధం చేసుకొని తుందుర్రు ప్రాంతం వారే కాదు, ఆ జిల్లా, యావత్‌ రాష్ట్ర ప్రజలు నిరసన తెలపాల్సిన అవసరం వుంది. నిరంకుశత్వానికి బలి అయిన సందర్భంగా జనం జర్మనీలో ఫాసిస్టు హిట్లర్‌ చర్యలను పట్టించుకోని పర్యవసాల గురించి ఒక జర్మన్‌ కవి రాసిన కవితను గుర్తుకు తెచ్చుకోవటం అవసరం.

వారు తొలుత కమ్యూనిస్టుల కోసం వచ్చారు

నేను కమ్యూనిస్టును కాదు కనుక మాట్లాడలేదు

తరువాత వారు కార్మికనేతల కోసం వచ్చారు

నేను కార్మికుడిని కాదు కనుక పట్టించుకోలేదు

ఆ తరువాత వారు యూదుల కోసం వచ్చారు

నేను యూదును కాదు కనుక మౌనంగా వున్నారు

తరువాత నా కోసం వచ్చారు

తీరా చూస్తే నా గురించి మాట్లాడేవారు ఎవరూ లేరు

అందువలన తుందుర్రు ఫ్యాక్టరీ వలన మనకేం నష్టం అని ఎవరైనా అనుకుంటే వారి చైతన్యస్ధాయి గురించి విచారపడటం తప్ప చేసేదేమీ లేదు. ప్రతి ప్రాంతంలోనూ ఆక్వా గాకపోతే మరో ఫ్యాక్టరీ తుందుర్రు రూపంలో వస్తుంది. అయ్యో పాపం అనేవారు మిగలరు.

రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో నీరు, చెట్టు, పేరుతో అధికారపక్షం, వారితో చేతులు కలిపిన శక్తులు దళితుల భూములను తవ్వి మట్టిని డబ్బుగా మార్చుకుంటున్న , భూములను ఆక్రమించుకుంటున్న వుదంతాలు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా దేవరాపల్లి, గుంటూరు జిల్లా వేలూరు, గొరిజవోలు ఇలా ప్రతిఘటించిన గ్రామాలే కాదు, వెలుగులోకి రానివి, పెత్తందార్లకు భయపడి చేతులు మూడుచుకొని చేతలుడిగి కూర్చున్నవి చాలా వున్నాయి. తుందుర్రు పక్కనే వున్న గరగపర్రులో అంబేద్కర్‌ విగ్రహం పెట్టటాన్ని వ్యతిరేకించటమే గాక, ఇదేమని ప్రశ్నించిన దళితులపై సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై చర్య తీసుకొనేందుకు చంద్రబాబు సర్కార్‌ మీన మేషాలు లెక్కించటమే కాదు, అన్యాయం అన్నవారిని అరెస్టులు చేయిస్తోంది. ఈ వైఖరి ఎలాంటి ‘సంకేతాలు, సందేశాలను ‘ పంపుతోందో తెలుగుదేశం నేతకు తెలియదనుకుంటే పొరపాటు. ఓట్ల జాతర సమయంలో ఐదువేలయినా ఇవ్వగలమని స్వయంగా చంద్రబాబే నంద్యాలలో సెలవిచ్చిన సంగతి తెలిసిందే. నిద్రపోయేవారిని లేపగలం గాని నటించేవారిని లేపటం సాధ్యం కాదు. గరగపర్రు వుదంతం గురించి తాము ఇప్పుడే మేలుకున్నట్లు, మేలుకోగానే తెలిసినట్లు అధికార పార్టీకి చెందిన దళితనేతలు కొత్త పాట పాడుతున్నారు. ఇదే సమయంలో అనేక దళిత సంస్ధలు, వ్యక్తులు ఇంతకాలంగా దళితులను చైతన్య పరిచేందుకు చేసిన యత్నాలు మరోదారి తొక్కాల్సి వుంది. దళితుల సమస్యలను దళితులే పరిష్కరించుకోవాలని, మరొకరు జోక్యం చేసుకోకూడదని, రిజర్వేషన్ల సమస్యపై చీలిపోయి గిరిగీసుకుంటే నష్టపోయేది దళితులే. ఇలాంటి పరిస్ధితులు వున్నాయి గనుకనే గ్రామాలలో పెత్తందారీ శక్తులు చెలరేగుతున్నాయి.

ఇక చంద్రబాబు స్వంత రాష్ట్రం, పొరుగు తెలంగాణా, యావత్తు దేశానికి పంపిన ‘సంకేతాలు, సందేశాలు’ ఎలాంటివో తెలిసిందే. నోట్లతో ఓట్లు, అధికారాన్ని ఎరచూపి ఫిరాయింపులు, ఫిరాయింపు చట్టాన్ని ఎలా వుల్లంఘించవచ్చో మొదలైన ఎన్నో ‘ఆదర్శనీయ’ చర్యలు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్యాకేజి ప్రహసనం ఇలా చెప్పుకుంటూ పోతే రామాయణ, మహాభారతాలు, పురాణాలు, వేదాలను మించిపోతాయి. నవ్వటానికి జనానికి నోళ్లు చాలవు. తన స్నేహితుల బృందంలో వున్న బ్రూటస్‌ తన హంతకులతో చేతులు కలిపిన వైనాన్ని తెలుసుకొని హతాశుడైన జూలియస్‌ సీజర్‌ యూ టూ బ్రూస్‌ (బ్రూటస్‌ చివరికి నువ్వుకూడా !) అంటాడు. ఇందులేడని అందుకలడని సందేహము వలదు ఎందెందు చూసినా అందందు కలడు చక్రి సర్వోపగతుడున్‌ అన్నట్లు తప్పుడు సంకేతాలు, సందేశాలను పంపటంలో, అన్ని రకాల అప్రజాస్వామిక చర్యలకు పాల్పడటంలో దేన్నీ వదలలేదని విమర్శకులు చంద్రబాబు నాయుడు గురించి చెబుతారు. అలాంటి పెద్ద మనిషి ప్రాణాంతక తుందుర్రు ఫ్యాక్టరీని తరలిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని సుభాషితం చెప్పటాన్ని చూస్తే కొందరి విశ్వాసం ప్రకారం పైన వున్నాయని చెబుతున్న స్వర్గంలోనో నరకంలోనో వున్న జూలియస్‌ సీజర్‌ చివరికి చంద్రబాబూ నువ్వు కూడా సుభాషితాలు పలుకుతున్నావా అని ఆశ్చర్యపోతాడు.దీని కంటే బ్రూటస్‌ చేసిన ద్రోహం పెద్దది కాదని క్షమించేసి వుంటాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సీతయ్య ఎవరి మాటా వినడు !

06 Tuesday Jun 2017

Posted by raomk in AP, BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH Politics, Andhrapradesh, ap special asistance, ap special status, chandrababu naidu, Congress party, Rahul gandhi

ఎంకెఆర్‌

ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా పండే రొయ్య మీసాల పొడవు- విస్తృత ప్రచారం పొందిన చంద్రబాబు నాయుడి సీనియారిటీ గురించి ఎవరైనా విబేధిస్తే అంతకంటే అమాయకులు మరొకరు వుండరు. అయితే ఎవరూ వివాదం చేయకపోయినా ఈ మధ్యకాలంలో, తాజాగా తన సీనియారిటీ గురించి తానే చెప్పుకుంటున్న చంద్రబాబు గురించి ప్రస్తావన రాకుండా ఎలా వుంటుంది? అసలా అవసరం ఏమొచ్చిందన్నదే ప్రశ్న. తాను మారానని మూడో సారి పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో, అంతకు ముందు చంద్రబాబు చెప్పారు. చూస్తుంటే ఎప్పటి కెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సమతీ అన్న నీతి బాగా వంట పట్టించుకున్నట్లు తేలిపోయింది.

గుంటూరు సభలో రాహుల్‌ గాంధీ రాజకీయాల గురించి, రాష్ట్రం గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకు మోడీ భయం పట్టుకుందని విమర్శించారు. ఆ మాటకు వస్తే నరేంద్రమోడీ, చంద్రబాబు కూడా సభలలో తాము చెప్పదలచుకున్నవి చెప్పారు, అతి వినయం ప్రదర్శించి చేయాల్సిన నటన చేయలేదా, ఎవరు తక్కువ ? అలాగే రాహుల్‌ చెప్పిన మాటలు వినటమా లేదా, చేసిన విమర్శలను పట్టించుకోవటమా లేదా సూచనలను పాటించటమా లేదా అన్నది వేరే విషయం. తాను ఎవరికీ భయపడటం లేదని, దేశంలోనే సీనియర్‌ రాజకీయవేత్తను కనుక ఇప్పుడే రాజకీయాలు నేర్చుకుంటున్న వారు చెబితే వినేది లేదని చంద్రబాబు చెప్పాల్సిన పనేముంది. నిజానికి అది నరేంద్రమోడీకి ఎక్కడో మండే మాట. మరో విధంగా అలా అనటం అంటే జ్ఞాన ద్వారాన్ని మూసుకోవటమే. ఆ మాట అన్న తరువాత ఈగలు, చీమలు, దోమల మాదిరి అధికారం చుట్టూ మూగే ఇతర పార్టీల వారూ, తెలుగుదేశం పార్టీలోని సహచరులు, జూనియర్లు చెప్పిందానిని కూడా చంద్రబాబు ఎలా వింటారు. ఇప్పటికే ‘సీతయ్య నివాస్‌’ మాదిరి తెలుగు దేశం పార్టీలో అసలు అలా చెప్పే వాతావరణం ఎక్కడుంది. గతంలో ఒక్క పెదబాబే అనుకుంటే తండ్రికి తగ్గ తనయుడు చినబాబు కూడా తోడయ్యారు. దీంతో చంద్రబాబు తప్ప తెలుగుదేశంలోని సీనియర్లందరూ నారావారి కుటుంబంలో పుట్టబోయే వారికి అన్నలుగానూ పుట్టిన వారికి తమ్ములుగానూ మారిపోయారు. గతంలో పది సంవత్సరాలు ముఖ్య మంత్రిగా, మరో పది సంవత్సరాలు ప్రతిపక్షనాయకుడిగా చంద్రబాబు శైలిని దగ్గరగా చూసిన వారికి ఆయనకు సీనియారిటీతో నిమిత్తం లేకుండానే ఇతరులు చెప్పేదానిని పరిగణనలోకి తీసుకొనే తత్వం లేదన్నది బాగా తెలిసిందే. ఈ సందర్భంగా ప్రచారంలో వున్న మహాకవి కాళిదాసు గర్వభంగం కథను గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. సరస్వతి దేవి పెట్టిన పరీక్షలో సున్నా మార్కులు తెచ్చుకున్న కాళిదాసుకు కనువిప్పు కలగగానే విద్యతో వినయం వృద్ధి చెందాలి గాని అహంకారం కాదు నాయనా కీర్తి ప్రతిష్టల మాయలో పడిన నీ బుద్ధిని మార్చటానికే ఈ పరీక్ష అని దాహంతో వచ్చిన కాళిదాసుకు మంచినీరు ఇచ్చి అనుగ్రహిస్తుంది.

అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ, బయట ప్రతిపక్షాలకు తాను చెప్పటం తప్ప ఇతరులు చెప్పింది వినే అలవాటు లేదనే విమర్శలు వున్న చంద్రబాబు ఎవరూ చూడకుండా అయినా వేమన, సుమతీ శతకాలు ఒక్కసారి తిరగేసుకుంటే మంచిది.

వినదగు నెవ్వరు చెప్పిన,

వినినంతనే వేగపడక వివరింపదగున్‌,

గని కల్లనిజము లెరిగిన,

మనుజుడే పో నీతిపరుడుడు మహిలో సుమతీ

అన్న ప్రబోధ పద్యాన్ని చంద్రబాబు మరిచి పోయి వుంటారు.

మూడు సంవత్సరాల పాలనలో సున్నా మార్కులు తెచ్చుకున్న చంద్రబాబు వైఫల్యాన్ని ఎవరైనా ప్రస్తావిస్తే మండిపడుతున్నారు. తానే చెప్పుకున్నట్లు ఒక సీనియర్‌గా గోబెల్స్‌ ప్రచారంలో కూడా ఆయనను మించిన వారు లేరు. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజమై కూర్చుంటుందన్నది హిట్లర్‌ ప్రచార మంత్రి గోబెల్స్‌ సూత్రం. చంద్రబాబుకు గోబెల్స్‌ను మించిన బిజెపి తోడు కావటంతో ఇక చెప్పాల్సిందేముంది.

రాష్ట్ర విభజన సమయంలో వ్యతిరేకించింది ఒక్క సిపిఎం తప్ప మరొకపార్టీ లేదు.అందుకే ఆ పార్టీ దానికి ప్రత్యామ్నాయంగా ఫలాన వరం ఇవ్వాలని కోరలేదు. గతంలో అలా ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. అలా అడగటం అంటే విభజనను అంగీకరించినట్లే. ఆసుపత్రులలో పెద్ద ఆపరేషన్లు చేయాల్సి వచ్చినపుడు సంభవించే పర్యవసానాలకు అంగీకారం తెలుపుతూ రోగి లేదా సమీప బంధువుల సంతకాలతో లేఖలు తీసుకుంటారు. రెండు కళ్ల సిద్ధాంతం చెప్పి ఆంధ్రప్రదేశ్‌ కన్ను పొడవటానికి ఆమోదం తెలిపి ఒకటికి రెండు లేఖలు ఇచ్చింది చంద్రబాబు. ఆపరేషన్‌ చేసే వైద్యుడు కోరిన కత్తులు, కటార్లు అందించి సహకరించే సిబ్బంది మాదిరి ఆంధ్రప్రదేశ్‌ కన్ను పొడిచే సమయంలో పెద్ద ఎత్తున హడావుడి చేసి కాంగ్రెస్‌కు అన్ని విధాలుగా సహాయపడింది బిజెపి. తిరుపతి సభలో ప్రత్యేక హోదా గురించి వెంకన్న సాక్షిగా వాగ్దానం చేసింది నరేంద్రమోడీ. తరువాత దానిని తిరస్కరించిందీ ఆ పెద్ద మనిషే. మూడు సంవత్సరాల కాలంలో ఇన్ని జరిగితే వాటన్నింటినీ వదలి పెట్టి చంద్రబాబు నాయుడు కేవలం కాంగ్రెస్‌ మీదే ఎదురుదాడులకు దిగారు. రాష్ట్రానికి హాని చేయటంలో కాంగ్రెస్‌ పాత్ర ఎంతో బిజెపిదీ అంతే. హోదా బదులు ప్రత్యేక పాకేజీ ఇచ్చారని, దాని కంటే హోదా వలన అదనంగా వచ్చే ప్రయోజనమేమిటో చెప్పాలని కూడా చంద్రబాబు సవాలు విసురుతున్నారు. ఇప్పుడు సమస్య పాకేజి వలన కలిగిన ప్రయోజనం ఏమిటన్నదే, ఆ ప్రశ్నకు ఇంతవరకు ఆ పెద్ద మనిషి లేదా బిజెపి నేతలు గానీ నోరు విప్పటం లేదు.

ఏ పార్టీలో ఎంతకాలం వుంటారో, ఎప్పుడు ఏ పార్టీ మారతారో తెలియని విశ్వసనీయతలేని నాయకులతో తెలుగుదేశం పడవ నడుస్తోంది. అలాంటి పార్టీ నేతగా దానిని నిరూపించుకోవాలంటే ఇప్పటికైనా ఆయన చెప్పే కాంగ్రెస్‌ అడ్డగోలు రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ఎలా నష్టపోయిందో, ఆ నష్టాన్ని పూడ్చేందుకు మిత్రపక్షం బిజెపి ఇచ్చిన ప్రత్యేక పాకేజి కారణంగా వచ్చే లాభాలు ఏమిటో, తెలుగుదేశం పార్టీ చెప్పే న్యాయబద్ద విభజన కోసం తాము చెప్పిందేమిటో, చేసిందేమిటో ప్రభుత్వం తరఫున ఒక శ్వేత పత్రం ప్రకటించి వాస్తవాలు చెప్పటం తప్ప మరొక మార్గం లేదు. అదేమీ లేకుండా అడ్డగోలు రాజకీయాలు, దాడులు చేస్తే రాష్ట్ర ప్రజలకు పూచికపుల్ల ప్రయోజనం కూడా వుండదు. క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేస్తున్నారు. కానీ ఆ కాంగ్రెస్‌లో చివరి వరకు వుండి తెలుగు దేశం పడవలోకి ఎక్కిన నేతలను మాత్రం ఎలాంటి క్షమాపణ అడగకుండానే పార్టీలో చేర్చుకొని పదవులు ఇచ్చి అందలమెక్కించారు. అదే కాంగ్రెస్‌ నేతలు బిజెపిలో కూడా చేరి దానిని కూడా పునీతం చేశారు. తెలుగుదేశం సరసన కూర్చొని వారిపుడు ధర్మపన్నాలు వల్లిస్తున్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజెపికి కేంద్రంలో, రాష్ట్రంలో మిత్రపక్షంగా వున్నామని చంద్రబాబు చెబుతున్నారు. ఆ విషయాన్ని నొక్కి వక్కాణిస్తే ఆయనకే నష్టం. ఒక రాజకీయపార్టీ పట్ల మరొక రాజకీయ పార్టీ ఎలా వ్యవహరించాలనేది అది వారిష్టం.కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆని చెబుతున్నారు కనుక సాధించిన అదనపు ప్రయోజనాలేమిటో కూడా చెప్పాలి.ప్రతి ఏటా నవనిర్మాణ దీక్షలంటూ ప్రత్యర్ధులపై ఎదురుదాడులు తప్ప జనానికి సానుకూల అంశాలను వివరించిన పాపాన పోలేదు. కులం, మతం, ప్రాంతీయ భావనలను తలకెక్కించుకున్న జనంలోని ఒక తరగతి అటు కేంద్రం, ఇటు రాష్ట్ర వైఫల్యాల గురించి పట్టించుకోకపోవచ్చు. ఎల్లకాలం ఇదే పరిస్ధితి వుండదు. అటు బిజెపి తెలుగుదేశం పార్టీని ముందుగదిలో కూర్చో పెట్టి దాని ప్రత్యర్ధి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు వెనుక ద్వారం తెరిచింది. శ్రీకృష్డుడి రాజకీయం మాదిరి ముందుగ వచ్చితీవు, మున్ముందుగ అర్జునుడిని చూచితి నేను అన్నట్లుగా బిజెపి తనకు ఏది వాటంగా వుంటే అది చేసేందుకు పావులు కదుపుతోంది. చంద్రబాబు అస్త్రాలు తుప్పు పట్టటం లేదా ఒక్కొక్కటిగా మొద్దుబారి పనికి రాకుండా పోతున్నాయి. అవ్వతో వసంతమాడినట్లు కాంగ్రెస్‌ క్షమాపణలతో కాలక్షేపం చేస్తే కుదురుతుందనుకుంటే పొరపాటు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రత్యేక హోదా, పాకేజీ కూడా లేదని చెప్పటానికి ఇన్ని నాటకాలు ఆడాలా ?

08 Thursday Sep 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ 1 Comment

Tags

ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, BJP, special status to Andhra pradesh, tdp

నాడు పార్లమెంట్‌ తలుపులు మూసి ప్రహసన ప్రాయంగా కాంగ్రెస్‌,బిజెపి ఇతర పార్టీల నేతలు కుమ్మక్కై చీకట్లో రాష్ట్ర విభజన తీర్మానం చేశారు. అయితే ఆ విభజన హామీలను తుంగలో తొక్కేందుకు మిగతా పార్టీలకు అవకాశం ఇవ్వకుండా నేడు బిజెపి నేతలు అర్ధరాత్రి సమాయాన్ని ఎంచుకొని ప్రత్యేక హొదా లేదని ప్రకటించారు. అది విద్రోహం అని మిగతా పార్టీలన్నీ విమర్శిస్తే తెలుగు దేశం, బిజెపి పార్టీలు స్వాగతం పలికాయి.

ఎం కోటేశ్వరరావు

     ప్రతిపక్ష వైసిపి సభ్యులు నిశ్శబ్దంగా కూర్చుంటే ప్రత్యేక హోదా గురించి ప్రకటన చేస్తానని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు శాసనసభలో పదే పదే ప్రకటించటాన్ని యావత్‌ తెలుగు ప్రజలూ గమనించారు. రెండు సంవత్సరాలకు పైగా రాజకీయ పార్టీలు, జనం నోర్మూసుకుని కూర్చున్నా ఎన్నడూ దాని గురించి సూటిగా మాట్లాడని చంద్రబాబు ప్రత్యేక హోదా, పాకేజీ కూడా ఇచ్చేది లేదని ఒకవైపు కేంద్రం తేట తెల్లంగా ప్రకటించిన తరువాత దాని గురించి తాను ప్రకటన చేస్తానని చెప్పటమే రాజకీయ జాణతనం. తెలుగుదేశం పార్టీ ఎంతగా ఆత్మరక్షణలో పడిపోయిందంటే వైసిపి సభ్యులు అసెంబ్లీ కార్యకలాపాలు సాగకుండా నినాదాలతో అడ్డుకుంటుంటే తెలుగు దేశం సభ్యులు ముఖాలు వేలాడవేసుకొని నిస్సహాయంగా కూర్చుండి పోయారు. అదే మిగతా సందర్బాలలో గతంలో వారెన్నడూ అంత వినమ్రతతో కూర్చోలేదు. బహుశా ప్రస్తుత అసెంబ్లీలో అధికారపక్షం ఇలా నీరుగారి పోయి వుండటం ఇదే మొదటిసారి.

    నాడు పార్లమెంట్‌ తలుపులు మూసి ప్రహసన ప్రాయంగా కాంగ్రెస్‌,బిజెపి ఇతర పార్టీల నేతలు కుమ్మక్కై చీకట్లో రాష్ట్ర విభజన తీర్మానం చేశారు. అయితే ఆ విభజన హామీలను తుంగలో తొక్కేందుకు మిగతా పార్టీలకు అవకాశం ఇవ్వకుండా నేడు బిజెపి నేతలు అర్ధరాత్రి సమాయాన్ని ఎంచుకొని ప్రత్యేక హొదా లేదని ప్రకటించారు. అది విద్రోహం అని మిగతా పార్టీలన్నీ విమర్శిస్తే తెలుగు దేశం, బిజెపి పార్టీలు స్వాగతం పలికాయి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు కూడా లేదని తేలిపోయింది. ప్రత్యేక పాకేజీ లేకుండా ప్రత్యేక సాయం అని అది కూడా 2015 నుంచి 2020 వరకు మాత్రమే అని కేంద్రం స్పష్టం చేసింది. పోనీ దాని వివరాలు ఏమిటి అంటే రేపు ఆర్ధిక మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పెడతాం చూసుకోమని విలేకర్లకు చెప్పి పంపారు.ఈ మాత్రం చెప్పటానికి అర్దరాత్రి ప్రత్యేకంగా పత్రికా గోష్టి పెట్టటం అవసరమా ?

    తాము రాజకీయంగా నిండా మునిగి జనాన్ని ముఖ్యంగా యువత భవిష్యత్‌ను అంధకారంలో ముంచిన పెద్దలు ముసుగులో గుద్దులాట ఎందుకనుకున్నారో ఏమో వెంటనే తేల్చివేశారు. ఇక తేల్చు కోవలసింది జనమే. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయం చేసేందుకు ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారని కేంద్ర మంత్రులు ప్రకటించినపుడే అది వట్టిస్తరి మంచినీళ్లని తేలిపోయింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తున్నట్లు పెద్ద వూదరగొడుతున్నారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు నుంచే ఆ డిమాండ్‌ వుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శక సూత్రాల ప్రకారం ఏ సాగునీరు, విద్యుత్‌ ప్రాజెక్టుకైనా ఆ సూత్రాలు వర్తిస్తే కేంద్ర ప్రభుత్వం వాటిని జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించి 90శాతం నిధులు అంద చేస్తుంది.ఇప్పటికే అలాంటి 14 ప్రాజెక్టుల జాబితాను ఈ చిరునామాలో చూడవచ్చు.http://wrmin.nic.in/writereaddata/Guidelines/NProjects572133778.pdf పోలవరం ప్రాజెక్టును కేంద్రం చేపట్టటం ద్వారా ఆ మేరకు రాష్ట్రానికి వెసులుబాటు కలుగుతుంది. అలాంటి హోదా ఇవ్వటానికి రాష్ట్రాన్ని విభజించటానికి సంబంధం లేదు. రాష్ట్రాన్ని విభజించిన కారణంగా వెసులు బాటు కోసం ఆహోదా ఇచ్చినట్లు చెప్పటం మోసం చేయటమే. నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక హోదాను కల్పించటాన్ని మిగతా రాష్ట్రాలు వ్యతిరేకించినపుడు, జాతీయ ప్రాజెక్టు హోదా తమ పధకాలకు సైతం ఎందుకు కల్పించరని కేంద్రాన్ని ఇతర రాష్ట్రాలు అడగకుండా వుంటాయా ? ఒక వేళ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రాన్ని విభజించినందుకు పరిహారంగా ఇస్తే ఆమేరకు నిబంధనలను కూడా సవరించకుండా ఎలా సాధ్యం. ఒక రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వటానికి మిగతా రాష్ట్రాలు ఎలా అంగీకరిస్తాయి ?

    ప్రత్యేక హోదా విషయమై ఒకే నోటితో రెండు మాటలు మాట్లాడుతూ అనేక అనుమానాలకు తావిస్తున్నారు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కలిపిస్తే మరో పదకొండు రాష్ట్రాలు అడుగుతాయి కనుక రాజకీయంగా సమస్యలు తలెత్తే అవకాశం వుంది కనుక కొత్తగా ఏ రాష్ట్రానికీ ఇవ్వదలచలేదు. ఒక వేళ ఇచ్చినా రాయితీలను గణనీయంగా తగ్గించిన కారణంగా పెద్దగా ప్రయోజనం వుండదు. ఇదే సమయంలో ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు కూడా పెద్దగా లబ్డి పొందింది లేదు. ఇప్పుడు ఇన్ని విషయాలు చెబుతున్న పెద్దలకు ఈ విషయాలన్నీ రెండు సంవత్సరాలకు ముందు ఎన్నికల సందర్భంగా, లేదా గత రెండు సంవత్సరాలుగా తెలియవా ? వేదికల మీద వాగ్దానాలు కురిపించిన పెద్దలు రాజ్యాంగం, నిబంధనలు తెలియని అజ్ఞానులు కాదే ! కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటా 32 నుంచి 42 శాతానికి పెంచారు. అయితే కుడి చేత్తో ఇచ్చి ఎడమచేత్తో తీసుకున్నట్లుగా కేంద్రం అమలు జరుపుతున్న అనేక పధకాలను రాష్ట్రాలకు బదలాయించారు. ఫలితంగా పది శాతం నిధులతో పాటు అంత కంటే ఎక్కువే భారం మోపారు. రెండవది రాష్ట్రాలకు వాటా లేని సెస్సుల వంటి వాటిని ఇటీవలి కాలంలో విపరీతంగా పెంచారు. దాని వలన జనం జేబుల నుంచి కేంద్రానికి వెళ్లేది కూడా పెరిగింది.

     ప్రత్యేక హోదా రాయితీలకు అవకాశం వున్న రాష్ట్రాలలో ఇప్పటికే అనేక మంది వాటిని నమ్ముకొని పరిశ్రమలు పెట్టారు. ఇప్పుడు జిఎస్‌టి వచ్చింది కనుక ఆ రాయితీలను మధ్యలో నిలిపివేస్తారా ? అదే మాదిరి జమ్మూ కాశ్మీర్‌కు రాజ్యాంగ బద్దంగానే ప్రత్యేక ప్రతిపత్తి వుంది. మరి అక్కడ ఎలా అమలు జరుపుతారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు పార్లమెంట్‌లో , వెలుపలా వాగ్దానం చేసిన మాదిరి ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటిస్తే మిగతా రాష్ట్రాలకు అమలు జరిగినంత కాలం అమలు జరుగుతాయి. మిగతావాటికి ఆగిపోతే ఆంధ్రప్రదేశ్‌కూ నిలిచిపోతాయి, నలుగురితో నారాయణ ! పేచీ వుండదు, బిజెపి మోసం చేసిందనే విమర్శలూ వుండవు. అలాంటపుడు వాగ్దానం చేసిన మేరకు ప్రకటించటానికి ఇబ్బంది ఏమిటి ? ఇప్పటికైనా చౌకబారు రాజకీయాలు మానుకొని యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు పని చేయటం అవసరం. కేంద్రం తన విధానాలు మార్చుకొని ఆంధ్రప్రదేశ్‌లో తగినన్ని పెట్టుబడులు పెట్టి వుపాధి కల్పించాలి. కడపలో మరో వుక్కు ఫ్యాక్టరీ ఎందుకు పెట్టరు, వివిధ రంగాలలో ి ప్రయివేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్న కేంద్ర ప్రభుత్వం మౌలిక రంగాలైన పెట్రోలియం, రక్షణ వంటి రంగాలకు అవసరమైన వుత్పత్తుల తయారీకి మరో ఇసిఐఎల్‌, మరో ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ,అణ ఇంధన కాంప్లెక్స్‌, వంటివి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టటానికి ఆటంకం ఏమిటి ? ఐడిపిఎల్‌ వంటి వాటిని స్ధాపించి యువతకు వుపాధితో పాటు జనానికి చౌకగా ఔషధాలు అందించటానికి వున్న ఇబ్బంది ఏమిటి ?

   ఇప్పుడున్నపరిస్థితుల్లో ఎవరైనా ఇప్పటికే మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్‌ వున్న ప్రాంతాలలోనే పరిశ్రమలు పెడతారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే చైనాలోనే ప్రయివేటు రంగం పరిశ్రమలన్నీ ఆ విధంగా కొన్ని అభివృద్ధి చెందిన ప్రాంతాలలోనే కేంద్రీకృతమయ్యాయి. అభివృద్ధి కొత్త సమస్యలను సృష్టించింది. దాంతో పరిశ్రమలు లేని ప్రాంతాలలో పెట్టుబడులకు కేంద్రీకరించింది. గతంలో ప్రభుత్వం పెట్టుబడి పెట్టిన విధానం కూడా కొన్ని అసమానతలను సృష్టించింది. ప్రభుత్వ రంగ పరిశ్రమలు, పలు సంస్థలను హైదరాబాదులోనే కేంద్రీకరించటంతో అటు తెలంగాణాలో మిగిలిన జిల్లాలు, ఇటు ఆంధ్రప్రాంతంలో కొంతమేరకు విశాఖ మినహా మిగిలిన జిల్లాలన్నీ వెనుకబడిపోయాయి. మన దేశంలో కూడా వెనుకబడిన ప్రాంతాలలో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టకుండా ప్రయివేటు వారి వచ్చి ఒరగపెడతారనుకుంటే అంతకంటే భ్రమ మరొకటి వుండదు.అందువలన ప్రత్యేక హోదాతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని డిమాండ్‌ చేయటం ఎంతో సముచితం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పవన్‌ కల్యాణ్‌ గబ్బర్‌ సింగా ? రబ్బర్‌ సింగా ?

30 Tuesday Aug 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, ap special status, BJP, jana sena party, Pawan kalyan, tdp

విశ్వసనీయత సమస్య ఎదుర్కొంటున్న పవర్‌ స్టార్‌

ఎంకెఆర్‌

    సినిమా వాళ్లు ఏది చేసినా నాటకీయంగా వుంటుంది.అది లేకపోతే జనానికి కిక్కు వుండదు. ప్రేక్షకులకు కిక్కు ఎక్కితేనే పోనీలెమ్మని సినిమాలు చూసిపెట్టి నాలుగు డబ్బులు నిర్మాతల మొహాన వేస్తారు. సినిమా కధ వూహించని మలుపులు తిరిగి వీక్షకులకు వుత్కంఠ కలగ చేసినట్లుగా ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనే డాక్యుమెంటరీ కూడా ఆసక్తికలిగిస్తోంది. దీనిలో నటులు, పాత్రలు కాకుండా నిజమైన వ్యక్తులే నటిస్తున్నారు గనుక డాక్యుమెంటరీ అనాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆకస్మికంగా పవర్‌ స్టార్‌ పవర్‌ కల్యాణ్‌ తిరుపతిలో ఒక సభ జరిపి ఏకపాత్రాభినయంతో ప్రత్యేక హోదా గురించి పోరు ప్రకటన చేశారు. అనేక మందికి ముఖ్యంగా అధికారంలో వున్న తెలుగుదేశం-బిజెపి కూటమికి ఇష్టం లేని మాటలలో ప్రత్యేక హోదా ఒకటి.ఎందుకంటే అది గుర్తుకు వచ్చినపుడల్లా ఆంధ్రప్రదేశ్‌ జనం ఇంకా దాని కోసం ఎదురు చూస్తున్నారేమో అనే చిన్న అనుమానంతో కొద్ది క్షణాలే అయినా వారి మనసంతా వికలం అవుతుంటుంది.

     అన్నట్లు నాటకీయం అంటే తిరుపతి సభకు వారం రోజుల ముందు హైదరాబాదులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమార స్వామి ప్రత్యేకంగా వచ్చి పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. ఆ సమయంలో వారు మీడియా ముందుకు వచ్చారు. తన కుమారుడి సినిమా విడుదల సందర్భంగా పవన్‌ను మర్యాద పూర్వకంగా కలిసేందుకు వచ్చానని కుమారస్వామి చెప్పారు. కానీ అంతకు ముందే రాబోయే ఎన్నికలలో పవన్‌ కల్యాణ్‌ మద్దతును కుమారస్వామి కోరుతున్నట్లు దాని గురించి చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అటు న్యూఢిల్లీలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రత్యేక హోదా గురించి తీవ్ర చర్చ, బంద్‌ జరిగిన సమయంలో పవన్‌ కల్యాణ్‌ మౌనంగా వున్నారు. ఈ పూర్వరంగంలో కుమార స్వామితో కలసి మీడియా ముందుకు వచ్చినపుడు పవర్‌ స్టార్‌ ఎంతో ప్రశాంతంగా, స్ధిత ప్రజ్ఞుడి మాదిరి ప్రత్యేక హోదా ఇవ్వను అని ఇంకా కేంద్రం స్పష్టంగా చెప్పలేదు, అయినా ఇది సున్నితమయిన అంశం కనుక ఇపుడే మీ మాట్లాడను తగు సమయంలో స్పందిస్తా అని చెప్పి ఎంతో సంయమనం పాటించారంటూ కొందరు విలేకర్లు వ్యాఖ్యానించారు.మరి అలాంటి వ్యక్తికి వారం రోజుల్లో ఏం మార్పులు కనిపించాయి, అదనంగా వచ్చిన స్పష్టత ఏమిటి, సున్నితాంశం కాస్తా తక్షణాంశంగా దాని స్వభావం ఎలా మార్చుకుంది, అసలు ప్రత్యేక హోదా గురించి రాజకీయ పార్టీలు, జనం కూడా మరిచి పోతున్న తరుణంలో పవన్‌ కల్యాణ్‌కు గుర్తుకు వచ్చి ఎందుకు ఆగ్రహం వచ్చింది అని అనేక మంది పరిపరి విధాలా ఆలోచిస్తున్నారు. చీకట్లో ఏదైనా చెట్టు తొక్కాడా లేక తెలియకుండా ఎక్కడైనా బోధి వృక్షం కింద కూర్చొని వచ్చారా ? పవన్‌ కల్యాణే స్వయంగా చెబితే తప్ప తెలియదు, అప్పటి వరకు పది మంది నానా రకాలుగా అనుకుంటూనే వుంటారు.

     పుష్కరాల సందర్బంగా తాను స్వయంగా మునిగి జనాన్ని కృష్ణ నీటిలో మునకలు వేయించి ఎంతో పుణ్యం జనం ఖాతాలలో ఎంతో పుణ్యం జమ చేయించిన చంద్రబాబు, ఆయన పరివారం తమకు వచ్చిన ప్రచార కండూతి, ఇతర పుష్కర లాభాల గురించి లెక్కించుకుంటుండగా పవన్‌ కల్యాణ్‌ తెలుగుదేశం, బిజెపి పార్టీని కూడా విమర్శించి కాస్త ఇబ్బంది పెట్టారనే చెప్పాలి. ప్రత్యేక హోదా లేదా ప్యాకేజి వస్తుందనీ చెప్పలేరు, రాదనీ చెప్పలేని స్ధితిలో వారు వున్నారు. పవన్‌ కల్యాణ్‌ మాటల్లో చెప్పాలంటే మేడమ్‌ ఎలాగూ లేరు కనుక బిజెపి వారు సార్‌తో భైంటక్‌( సమావేశం) ఏర్పాటు చేయిస్తామని మాత్రమే చెప్పగలరు. వారి దగ్గర అంతకంటే మాటలు లేవు.

   రాజకీయాల్లోకి రావాలని, చక్రం తిప్పాలని, నాలుగు డబ్బులు చేసుకోవాలని అనేక మంది కోరుకుంటున్నపుడు పవన్‌ కల్యాణ్‌ కోరుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు. ఎన్‌టి రామారావు జనం కోసం సినిమాలను వదులుకొని ఎంతో త్యాగం చేశానని చెప్పుకున్నారు, కానీ ముందు జాగ్రత్తగా వవన్‌ కల్యాణ్‌ రాజకీయ, సినిమా నటన రెండూ చేస్తానని చెప్పారు. ఎందుకంటే పెద్ద కుటుంబం కదా ! గత ఎన్నికలలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రంగంలోకి వచ్చి చివరిదాకా నిలబడినట్లుగా తిరుపతి సభలో ఆ జాబితాలో బిజెపి, తెలుగుదేశం పార్టీలను కూడా జమ చేశారు, ఆ పార్టీలను ఎంత గట్టిగా విమర్శించారు, ఏకి పారేశారు అని కాదు, వాటికి అనుగుణంగా కట్టుబడి వుంటారా లేదా ఆ డైలాగులను పెట్టుబడిగా పెట్టి లబ్ది పొందుతారా అన్నదే సమస్య. రాజకీయాలలో విస్వసనీయతను ఏడు నిలువుల లోతున పాతరేసిన పార్టీలలో బిజెపి, తెలుగుదేశం తక్కువేమీ తినలేదు. వాటినేమీ పట్టించుకోకుండా, తెలిసినా తెలియనట్లు గా గత ఎన్నికలలో వాటి కొమ్ముకాశారు. ఎందుకైనా మంచిది అన్నట్లు స్వంతంగా జనసేన అనే స్వంత పార్టీని ఏర్పాటు చేశారు. మధ్య మధ్యలో కొన్ని డైలాగులు తప్ప ఇంతవరకు తెలుగుదేశం, బిజెపిలను విమర్శించలేదు. అవి చెప్పిన మాటలను ఇంతకాలం గాఢంగా నమ్మటానికి దారితీసిన పరిస్థితులేమిటి ? ఇప్పుడు జ్ఞానోదయం కావటానికి కారణాలేమిటి అన్నది జనానికి సూటిగా చెప్పాలి. అప్పుడే తాను ప్రారంభిస్తానంటున్న ప్రత్యేక హోదా ఆందోళన వెనుక జనం చేరే అవకాశం వుంటుంది. గత ఎన్నికల నాటికీ ఇప్పటికీ వచ్చిన తేడా ఏమిటంటే విస్వసనీయతలేని రాజకీయ నాయకుల సరసన పవన్‌ కల్యాణ్‌ కూడా చోటు సంపాదించుకున్నారు. గత ఎన్నికల సందర్భంగా పాకేజి కుదుర్చుకున్నారని విమర్శలు ఎదుర్కొన్న పవన్‌ కల్యాణ్‌ మరోసారి అలాంటిదానికి పూనుకోరన్న గ్యారంటీ ఏమిటన్న ప్రశ్న వుండనే వుంది.

    రాజకీయాలలో ముందురోజు పొద్దు పోయే వరకు ఎదుటి పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన వారు తెల్లవారే సరికి అదే పార్టీలోకి ఫిరాయిస్తున్నారు, అంతకు ముందు వరకు తాను వున్న పార్టీని అంతకంటే ఎక్కువగా వుతికి పారేస్తున్నారు. ఏమిటీ ఈ విపరీతం అంటే ఈ రోజుల్లో మీకు తెలియందేముంది మాకు ఇష్టం వున్నా లేకపోయినా అధినాయత్వ చెప్పినట్లు చేయాలి కదా అని ఎలాంటి సిగ్గు ఎగ్గూ లేకుండా సమర్ధించుకుంటున్నారు. ఇటువంటి స్ధితిలో గత ఎన్నికల తరువాత ఏడాదికి ఒకసారి వచ్చే సైబీరియా పక్షుల మాదిరి ఇలా వచ్చి అలా ఒక ప్రకటన చేసి పోతున్నారని ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న కారణంగా ఈ సారి కూడా అలాగే చేస్తారా అని అనుమానిస్తున్నవారు లేకపోలేదు. ఆర్ధికంగా ఇబ్బందులలో వున్న పవన్‌ కల్యాణ్‌ ఈమధ్య తాను ఎంతో అభిమానించే ఒక వాహనాన్ని కూడా అమ్ముకున్నాడని మీడియాలో వార్తలు వచ్చాయి.అలాంటి వ్యక్తి ఈ రోజుల్లో ఒక పార్టీని స్ధాపించటం అంటే వందల కోట్ల రూపాయలు అప్పనంగా వచ్చిన సొమ్మయినా వుండాలి లేదా ఎన్నికలలో అభ్యర్ధిగా నిలబెడతానని చెప్పి సీట్లు అమ్ముకొని అయినా ఆమేరకు పోగెయ్యాలి. పవన్‌ కల్యాణ్‌ దగ్గర అంత సొమ్ము వుందని ఎవరూ అనుకోరు, పోనీ సీట్లు అమ్ముకోవటానికి ఇంతవరకు పార్టీ లేదు, కార్యకలాపాలు లేవు, అన్నింటికీ మించి అప్పుడే ఎన్నికలు లేవు, అధికారానికి వస్తారనే వాతావరణమూ లేదు. బద్దశత్రువులు అనుకుంటున్నవారే జనం కోసం అనే పేరుతో చేతులు కలిపిన విపరీత పోకడల మన కళ్ల ముందే వున్నాయి. పార్టీ పెట్టిన కొద్ది నెలల్లోనే తెలుగుదేశం అధికారానికి వస్తే, అధికారానికి వచ్చిన తరువాత జనతా పార్టీ ఏర్పడిన చరిత్రా మన దేశంలో వుంది. అందువలన జనం తలచుకుంటే ఎప్పుడు ఏమైనా జరుగుతుంది. సినిమాలు మారినపుడు డైలాగులు కూడా మారతాయి, ఒక నటుడు ఒకే డైలాగులతో రెండు సినిమాలలో నటిస్తే జనం చూడరని తెలిసిందే. అందువలన బిజెపి, తెలుగుదేశం పార్టీలను విమర్శించినప్పటికీ రాజకీయ చాణక్యంలో భాగంగా పవన్‌ కల్యాణ్‌ను ఆకస్మికంగా వారే ప్రయోగించారన్న ప్రచారాలు వున్నాయి.

   ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు కల్పిస్తే ఏ ఏ రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయో వెంకయ్య నాయుడు వంటి వారు వారికి పదే పదే గుర్తు చేస్తారు. ఏపికి కల్పిస్తే మోడీని మరో పదకొండు రాష్ట్రాలు అడుగుతాయని మరో మంత్రి చెబుతారు.తాను 21 సార్లు ప్రధానిని కలిశానని, 31 సార్లు కలిశానని మరోసారి అవసరమైతే ఇంకా ఎన్నిసార్లయినా కలుస్తానని, వత్తిడి పెంచుతానని చంద్రబాబు చెబుతూనే వుంటారు. పాకేజీల ప్రహసనమూ తెలిసిందే. బీహార్‌ ఎన్నికల సమయంలో స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ వేల కోట్ల రూపాయల పాకేజీ ప్రకటించారు. దానిని అమలు జరిపిందీ లేనిదీ తెలియదు.టీ కప్పులో తుఫాను మాదిరి కాంగ్రెస్‌ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రయివేటు బిల్లుపై చర్చ తరువాత దానిని శీతల గిడ్డంగిలో పెట్టారు. ఒక రోజు బంద్‌ చేసి జనం కూడా తరువాత మౌనంగా వున్నారు. దీనికి విశ్లేషకులు కొందరు రెండు కారణాలు చెబుతున్నారు. ఒకటి ప్రత్యేక హోదా వస్తే పెద్దగా ఒరిగేదేమీ వుండదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కూడా చెప్పారు. దాని కంటే భారీ పాకేజ్‌ మెరుగు అని వారితో పాటు వారికి నిత్యం సలహాలు చెప్పే జిగిని లేదా జిగురు జర్నలిస్టులు కూడా సందర్భం వచ్చినపుడు జనం బుర్రల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు.

    జనంలో ఇంకా ఏదో మూలన ప్రత్యేక హోదా గురించి మోజు వుందని, దాన్ని తాము తీర్చని కారణంగా ప్రతిపక్ష వైసిపి, కాంగ్రెస్‌ వుపయోగించుకుంటాయామో, దాన్ని అడ్డుకోవాలంటే రాణీగారి అధికారపక్షం మాదిరి రాణీగారి ప్రతిపక్షాన్ని కూడా తామే ఏర్పాటు చేసుకోవాలనే ఎత్తుగడలో భాగంగా తెలుగుదేశం స్క్రిప్టు రాసి, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిందన్నది ప్రచారంలో వున్న ఒక విశ్లేషణ. అయితే తెలుగుదేశం వారు కొందరు పవన్‌ కల్యాణ్‌ విమర్శలపై ఘాటుగా ఎందుకు స్పందిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. ఒక బాణాన్ని వదిలిన తరువాత అది తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుతుందో లేదో తెలియదు. కనుక ఒక జేబులో అనుకూల మరో జేబులో ప్రతికూల ప్రకటనలు, వివిధ పార్టీల జండాలు బొడ్డు చుట్టూ కట్టుకొని తిరుగుతూ ఏది వాటంగా వుంటే దాన్ని బయటకు తీసే రోజులివి. అందువలన కొందరు నేతలు పవన్‌ ప్రకటనను ఆహ్వానిస్తే ఎంతైనా వ్యాపార వేత్త గనుక దేనికి మార్కెట్‌లో డిమాండ్‌ వుంటుందో తెలిసిన వ్యక్తి కనుక టిజి వెంకటేష్‌ వంటి వారు కాస్త మసాలా దట్టించి డైలాగులు వదులుతున్నారు. గడ్డం పెంచి గడ్డం గీసుకున్నంత సులభం కాదు రాజకీయాలంటే అన్న గడ్డం భాష ఒకటి. దానికి కొద్ది నెలల క్రితం రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఎంత ఖర్చు చేసిందీ బహుశా గుర్తుకు వచ్చి వుంటుంది.

     తెలుగుదేశం అనే మర్రి చెట్టు నీడలో తాము ఎదగటం కష్టమనే విషయం బిజెపి నాయకత్వంలో మొదలైందని, తగినంత మెజారిటీ రాదనే కారణంతో ఎన్నికలకు ముందు కలసి నప్పటికీ ఇప్పుడు స్వంతంగా ఎదగాల్సిన అవసరం ఏర్పడిందన్నది ఆ పార్టీలో బహిరంగ చర్చ. అయితే ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌ మాదిరే బిజెపి కూడా మోసం చేసిందనే అభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కారణంగా గతంలో వున్న మోజు చాలా మందికి తీరింది. తాము నేరుగా రంగంలోకి దిగే అవకాశం లేనందున పవన్‌ కల్యాణ్‌ అనే బాణాన్ని బిజెపి వారే ప్రయోగించారన్న అభిప్రాయమూ వుంది. దీని వలన తెలుగుదేశాన్ని దెబ్బతీయటం, వైసిపి, కాంగ్రెస్‌లకు నోరు లేకుండా చేయవచ్చన్న ఎత్తుగడవుంది.రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు ఏదో విధంగా ప్రత్యేక హోదా సమస్యను సాగదీసి చంద్రబాబు వలన దాన్ని సాధించటం సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని కలగచేయటం ద్వారా తెలుగుదేశాన్ని దెబ్బతీయటం ఒకటి. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా వుత్తుత్తి పాకేజ్‌లు ప్రకటించి ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నించిన విధంగా అజాగళ స్ధనం మాదిరి పేరుకు ఏదో ఒక హోదా ప్రకటన చేసి దాన్ని పవన్‌ కల్యాణ్‌ ఖాతాలో వేసి ఇచ్చింది బిజెపి, తెచ్చింది జనసేన అనే పేరుతో మిగతావారిని పక్కకు పెట్టి తాము రాజకీయ లబ్ది పొందటంగా బిజెపి ఎత్తుగడ వుందన్నది ఒక అభిప్రాయం. తమ రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ సంస్ధలను ఏర్పాటు చేయటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అందెవేసిన చేయి. వాటిలో తమ అదుపులో వుండేవారిని ప్రవేశపెట్టి అవసరమైన సందర్భాలలో వుపయోగించుకుంటుంది. తిరుపతి సభలో విమర్శలు చేసినప్పటికీ బిజెపి, తెలుగుదేశం పార్టీలపై గతంలో కాంగ్రెస్‌ మాదిరి విరుచుకుపడలేదు. ఒకవేళ రానున్న రోజుల్లో విరుచుకుపడినా అది లాలూచీ కుస్తీ మాత్రమే అనే అభిప్రాయమూ వుంది. పవన్‌ కల్యాణ్‌కు కుల తత్వం వుందా లేదా అన్నది సమస్య కాదు, ఆయన చేసుకున్న వివాహాలను బట్టి కులతత్వాన్ని అంటకట్టలేరు. కానీ ఆయన వెనుక చేరుతున్న వారిలో కులశక్తులు వున్న వాస్తవాన్ని మాత్రం కాదనలేరు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర రాజకీయాలలో కులం ప్రాధాన్యం వహిస్తున్న కారణంగా అలాంటి విమర్శలు లేదా ఆరోపణలు రావటం సహజం. అధికారం కోసం కులాలు, మతాలను, మూఢనమ్మకాలను పూర్తి స్ధాయిలో వుపయోగించుకుంటున్న రోజులివి.అందువల్లనే అది ఏ రాజకీయ పార్టీ లేదా నేత అయినా ఇప్పుడు విస్వసనీయత సమస్యను ఎదుర్కొంటున్నారు. పవన్‌ కల్యాణ్‌ అందుకు మినహాయింపు కాదు.

    నేను సింహం లాంటోడ్ని అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను అదే తేడా మిగతావన్నీ సేమ్‌ సేమ్‌టు సేమ్‌ అన్న డైలాగ్‌తో జనాన్ని ఆకట్టుకున్న పవన్‌ కల్యాణ్‌ తన విశ్వసనీయతను రుజువు చేసుకుంటారా లేక సేమ్‌ టు సేమ్‌ అన్నట్లు మిగతా రాజకీయ నేతల మాదిరి తానూ ఒకటే అని నిర్ధారిస్తారా ?ఎటు సాగదీస్తే అటు సాగే మాదిరి గబ్బర్‌ సింగ్‌ కాదు రబ్బరు సింగ్‌ అన్న విమర్శను నిజం చేస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

విశ్వసనీయతను దిగజార్చుకుంటున్న చంద్రబాబు

02 Thursday Jun 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Congress party, special status to Andhra pradesh

ఎం కోటేశ్వరరావు

   ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ జనాలను వెర్రివాళ్ల కింద జమకడుతున్నారా ? తన విశ్వసనీయతను తానే దెబ్బతీసుకుంటున్నారా ? ఇది ప్రతిపక్ష పార్టీల వారికి వస్తున్న ఆలోచన కాదు, స్వంత బుర్రలను వుపయోగించి తెలుగు దేశం పార్టీని పది కాలాలపాటు పరిరక్షించుకోవాలని కోరుకొనే కార్యకర్తలలో కూడా తలెత్తున్న ప్రశ్న. విజయవాడ బెంజి సర్కిల్‌లో జూన్‌ రెండవ తేదీన నవ నిర్మాణ దీక్ష పేరుతో చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని చూసిన తరువాత కలుగుతున్న సందేహాలివి.

   ముఖ్యమంత్రి, అనుచర గణం రాష్ట్ర నవనిర్మాణం కోసం దీక్ష అనే ఒక పెద్ద బ్యానర్‌ కింద మౌనంగా కూర్చొని వుంటే ఎంతో హుందాగా వుండేది. లేదూ తస్మదీయ పత్రికలు, ఛానళ్ల వారిని,తెలుగుదేశం కార్యకర్తలను సంతోష పెట్టేందుకు అసలు ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు సంవత్సరాలలో జరిగిందేమిటి? జరగాల్సిందేమిటి? విభజన సమయంలో కేంద్రం చేసిన చట్టం, వాగ్దానాలు ఏమిటి ? అవి ఎంతవరకు అమలు జరిగాయి? జరగకపోతే ఎదురైన సమస్యలేమిటి మొదలైన అంశాలతో రాష్ట్ర ప్రజల ముందు శ్వేత పత్రం పెట్టి ఏం చేయాలో చర్చించండని ఒక్క మాట చెప్పి వుంటే జనం అర్ధం చేసుకొని వుండేవారు. తమ నిర్ణయం తాము తీసుకొని వుండేవారు.

     అటువంటి సదవకాశాన్ని చంద్రబాబు చేతులారా పోగొట్టుకున్నారు. వుపాధి హామీ పధకం కింద జనానికి పని కల్పించినా లేకపోయినా, బాబొస్తే జాబొస్తుందని ఎదురు చూస్తున్న జనాలు గోళ్లు గిల్లు కుంటూ కూర్చున్నా, వున్న వుద్యోగాలు కూడా వూడగొడుతున్నారని అనేక మంది చిరుద్యోగులు నిస్సహాయులైన స్ధితిలో వున్నా, వెంకయ్య నాయుడు చెప్పినట్లు ఎవరికైనా దేవదూతేమో గాని తమకు మాత్రం మాత్రం సైతాన్‌గా పరిణమించారని నరేంద్రమోడీ గురించి ఆంధ్ర ప్రదేశ్‌ జనం భావిస్తున్న తరుణంలో చంద్రబాబు వుభయుల పక్షాన ప్రతిపక్షాలకు మాత్రం చేతి నిండా పని కల్పిస్తున్నారు. సమీప భవిష్యత్‌లో తనను సవాలు చేసే ప్రతిపక్ష పార్టీ ఏదీ లేదని, జనం విసుక్కున్నా, తిట్టుకున్నా తిరిగి తనకు తప్ప మరొకరికి పట్టం కట్టే అవకాశం లేదన్న ధీమాతో చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారా ? గతంలో కాంగ్రెస్‌ కూడా ఇలాంటి చులకన భావంతోనే ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించి ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో తెలియంది కాదు. గతం మాదిరి కాకపోయినా, పాత్రలు మారినా కొత్త రూపంతో చరిత్ర పునరావృతం కాక తప్పదు.

     గతంలో చంద్రబాబు ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు, అదేమిటంటే ఎన్నికలపుడు మాత్రమే రాజకీయాలు చేస్తాను, మాట్లాడతానని మిగతా సమయాలలో రాష్ట్ర అభివృద్ధి తప్ప తనకు మరొకటి పట్టదని, ప్రతిపక్షాలు ప్రతిదానిని రాజకీయం చేస్తున్నాయని ఆరోపించేవారు. ఒకవైపు గత రెండు సంవత్సరాలుగా దేశ, విదేశాలలో పెట్టుబడులు కోసం తిరిగిన దారి ఖర్చులు తప్ప పర్యటనలు ఏ మేరకు ఫలించాయో కనిపించటం లేదు. తరుణం రాక ముందే కూసిన కోయిల మాదిరి కొత్త రాజధాని నిర్మాణానికి ఐదు లక్షల కోట్ల రూపాయలు కావాలని రాష్ట్రం విడిపోక ముందే కోరిన చంద్రబాబు కేంద్రం నుంచి ఐదువేల కోట్ల రూపాయలు కూడా తీసుకురాలేక, వచ్చిన డబ్బుతో తాత్కాలిక రాజధాని కడుతున్నారని జనం సానుభూతి చూపుతున్నారు. తొలి బిడ్డ పెళ్లికి అవసరమైన డబ్బు సంగతి తేల్చుకోకుండానే అన్నీ కుదుర్చుకొని, చివరకు ముహూర్తాలు కూడా పెట్టుకొని పనులు మొదలు పెట్టిన తరువాత అప్పు ఇస్తానన్న వారు సొమ్ము ఇవ్వకపోతే ఆ గృహస్థు పరిస్థితి ఎలా వుంటుందో ప్రత్యేక రాష్ట్ర హోదా గురించి జనానికి కలిగించిన ఆశలు కూడా అలాగే కల్లలయ్యాయి. అప్పు ఇస్తామన్న వారు కనీసం మధ్యవర్తితో అయినా కొద్ది రోజుల ముందు డబ్బు సర్దుబాటు కాలేదు ఇవ్వలేకపోతున్నాము వేరే చూసుకోండని కబురు చేస్తారు. అదేమి చిత్రమో ఐదు కోట్ల ఆంధ్రప్రజలు ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తున్న ప్రత్యేక హోదా, లోటు నిధుల భర్తీ , పాకేజ్‌ల గురించి ప్రధాని నరేంద్రమోడీ వులకరు పలకరు, అవుననీ చెప్పరు కాదనీ చెప్పకపోగా ఇప్పటికే చాలా ఇచ్చామని పార్టీ వారి చేత చెప్పిస్తున్నారు, ఎవరైనా ప్రశ్నిస్తే ఇచ్చిన దానికి లెక్కలు చెప్పమంటున్నారు. ప్రత్యేక హోదా గురించి వూరించి చివరికి పొమ్మనకుండా పొగబెట్టినట్లు, ఇంక దాని గురించి అయితే న్యూఢిల్లీ రావద్దు అని జనానికి బాగా స్పష్టమయ్యే రీతిలో సందేశాలు పంపారు.

     ఇటువంటి స్ధితిలో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. దీనికంటే మౌనంగా దీక్ష చేసి వుంటే అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో పాటు అధోగతి పాలు చేస్తున్న బిజెపి గురించి కూడా చంద్రబాబు ఆగ్రహంతో వున్నారని అయినా జనం అనుకొనే వారు. చంద్రబాబు చెబుతున్నట్లు అసాధారణ రీతిలో అప్రజాస్వామికంగా పార్లమెంట్‌లో ఎలా విభజన బిల్లును ఆమోదించిదీ పదే పదే చెప్పనవసరం లేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో అదేగా చెప్పారు. ఇప్పుడు ఆ కాంగ్రెస్‌లేదు, అలాంటి పని చేసిన వారికి రాష్ట్ర శాసన సభలో కనీసం ప్రాతినిధ్యం కూడా లేకుండా జనం తగిన విధంగా తీర్పు నిచ్చారు. అంతటితో ఆ అధ్యాయం ముగిసింది. ఇంకా చంద్రబాబు దాని గురించి మాత్రమే మాట్లాడితే ఆయన విశ్వసనీయత సమస్య తలెత్తుతుంది. రెండు కళ్ల సిద్దాంతాలు చెప్పి విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ చరిత్ర చెరిగిపోదు. పార్లమెంట్‌లో చట్టం చేస్తున్న సమయంలో కాంగ్రెస్‌ ఒక్కటే లేదు, అంతకంటే ఎక్కువ హడావుడి చేసిన బిజెపి ఏం చేసింది? పోనీ వారేమీ చిన్న పిల్లలు, తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టిన వారు కాదే. అందువలన చంద్రబాబు చెప్పినట్లు సంబరాల బదులు విభజన కారణంగా జరిగిన అన్యాయానికి దీక్షలు చేయాల్సి రావటానికి కాంగ్రెస్‌ ఎంత కారకురాలో బిజెపి కూడా అంతే బాధ్యురాలు. కాంగ్రెస్‌ అధికారం నుంచి పోయింది. ఇంకా మూడు సంవత్సరాలు అధికారంలో కొనసాగాల్సిన బిజెపికి న్యాయం చేయాల్సిన బాధ్యత లేదా ? అలాంటి పార్టీతో స్నేహం కొనసాగించాలా లేదా అనేది తెలుగు దేశం పార్టీ ఇష్టం. తమ్ముడు తమ్ముడే న్యాయం న్యాయమే బిజెపి కూడా ఏపికి న్యాయం చేయలేదు అనే మాట చెప్పటానికి నోరు రావటం లేదే. అవ్వతో వసంత మాడినట్లు అన్నీ అయి పోయిన కాంగ్రెస్‌ను మాత్రమే విమర్శిస్తే అది జనాన్ని మభ్యపెట్టే రాజకీయం తప్ప మేలు చేసేది కాదు.

    విభజన చేసి అప్పులు మాత్రమే జనాభా దామాషాలో పంచారు, ఆస్థులు మాత్రం ఎక్కడివి అక్కడే అన్నారని చంద్రబాబు మాట్లాడుతున్నారు. సచివాలయం, ఇతర ప్రభుత్వ భవనాలను తరలించుకుపొమ్మని చెబితే చంద్రబాబు తీసుకు వస్తారా? అనేక రాష్ట్రాలను విడగొట్టారు. ఎక్కడైనా ఎక్కడి ఆస్థులు అక్కడే వుంచారు, అప్పులు పంచారు తప్ప మరొక పద్దతిని పాటించలేదు. పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా, మరో పదేండ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా దేశంలో ఒక రికార్డు సృష్టించిన చంద్రబాబుకు నిజంగా ఈ మాత్రం తెలియదా ? తెలిసినా ఎందుకు ఇలాంటి అంశాలను జనం మెదళ్లకు ఎక్కిస్తున్నారు ? ఒక సీనియర్‌ రాజకీయవేత్తగా విశ్వసనీయత కోల్పోవటం, పోసుకోలు కబుర్లకు తప్ప దాని వలన ఆంధ్రప్రదేశ్‌కు ఏమైనా వుపయోగం వుంటుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చంద్రబాబుకు ఓ అభిమాని బహిరంగ లేఖ

03 Tuesday May 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Modi, Narendra Modi, special status to Andhra pradesh, YS jagan

బాబు గారూ మీరు మెతక మనిషని ఎవరన్నారు ?

      చంద్రబాబు నాయుడు అంటే రాజకీయంలో అపర చాణుక్యుడు, సర్దార్‌ పటేల్‌ కంటే గట్టి పిండం, గ్రీకు వీరుడు హెర్క్యులస్‌ను మించిన బలశాలి అనుకుంటున్న మీ అభిమానులను ఒక్కసారిగా నాగలోకం నుంచి నక్కల మధ్య పడేశారు. సందేహ సముద్రంలో ముంచేశారు. నేను మెతక మనిషినేం కాదు, ధృడచిత్తంతో వున్నాను అని స్వయంగా మీరు చెప్పటంతో మా చిత్తాలు చిత్తడి అయిపోతున్నాయి. బాబు గారూ అసలు మీరు మెతక మనిషని ఎవరన్నారు ? మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేసుకుంటారు ? వైఎస్‌ రాజశేఖరరెడ్డితో పోటీ పడి వస్తున్నా మీ కోసం పేరుతో మీరు చేసిన పాదయాత్ర మెతక మనుషులకు సాధ్యమా ? బిజెపి, నరేంద్రమోడీ పట్ల ఒకసారి కఠినంగా మరోసారి మెతకగా వున్నట్లు మీపై విమర్శలు వస్తే వచ్చి వుండవచ్చుగాక, అవి రాజకీయాలు, నిరంతరం మీరు కలలు కనే రాష్ట్రం కోసం తప్ప మీ మెతక తనానికి నిదర్శనాలు ఎలా అవుతాయి ? మామ అని కూడా చూడకుండా ఎన్‌టి రామారావు పట్ల కూడా ఎంత కఠినంగా వ్యవహరించారో మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసిన మాకు మీరు మెతక మనుషులని అనుకోవటానికే ఏదోగా వుంది.

    అసలు మీకు ఏమైంది ? మీరు ఏనుగు వంటి వారు. ఒక వేళ ఎప్పుడైనా ఎవరైనా రాజకీయ ప్రత్యర్ధులు మీ వెనుక ఏదో అంటే మిమ్మల్ని సమర్ధించటంలో మీ మంత్రులు సరిగా వ్యవహరించనందుకు మందలించారని పత్రికల్లో వార్తలు వచ్చాయి గానీ మా వంటి అభిమానులు ఎక్కడైనా తగ్గినట్లు విన్నారా? మేం ఎన్నడైనా అంగీకరించామా? లేదే ! అటువంటిది నేను మెతక మనిషిని కాదు అని బేలగా, జాలిగా మీరు అనటం ఏమిటి బాబూ ! మేం ఏం కావాలి ? కష్టపడటం నా తప్పా అని మీరు అంటుంటే చివరికి మనప్రత్యర్ధి వైఎస్‌ఆర్‌సిపికి, జగన్‌కు సైతం ఇలాంటి పరిస్థితి రాకూడదురా బాబూ అన్నట్లు మా కడుపు తరుక్కు పోతోంది.

   మిమ్మల్ని (మనల్ని )నమ్ముకొని అనేక మంది తమ నియోజకవర్గాలను కూడా తెల్లారేసరికి సింగపూరో, మలేషియానో, జపానో, అమెరికాగానో మార్చేద్దామనే కదా వైసిపినుంచి ఎంఎల్‌సీలు, ఎంఎల్‌ఏలు, కాంగ్రెస్‌ నుంచి గాదె వెంకట రెడ్డి వంటి నేతలు సైతం పార్టీకిలోకి ప్రవాహాలుగా వస్తున్నారు.నేను మెతక మనిషిని కాదు అన్న మాట ఏ వుద్ధేశ్యంతో అన్నారో గానీ లేస్తే మనిషిని కాదు అన్న కుంటి మల్లయ్య సామెతను గుర్తుకు తెస్తోందని ప్రతిపక్ష పార్టీల వారు అంటుంటే అటు కాదనలేక ఇటు అవుననలేక మేం మెత్తపడక పడక తప్పటం లేదు. రెండు సంవత్సరాలు చూశాం కేంద్రంలో మంత్రి పదవులు అనుభవించటం తప్ప రాష్ట్రానికి ఏం పనులు జరిగాయి, ఏం పీకారు అంటుంటే వెర్రి మొహాలు వేసుకొని ఇంకా ఎంతకాలం సమర్ధించాలో అర్ధం కావటం లేదు. దీనికి తోడు పార్టీ అధికారానికి వస్తే గడ్డ పెరుగు ముక్కల మాదిరి తిందామని అనుకుంటుంటే ఎదుటి పార్టీల నుంచి ఎందరు వస్తే అంత మందినీ కలుపుకోండని, అంతా మనమంచికే అని చెబుతున్నారు. మీకేం బాబూ ! మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుంది. గత ఎన్నికలలో ఎంత ఖర్చు చేశామో మీకు తెలియనిది కాదు. ఇది ఎప్పుడూ వుండేదే . కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుపోతుంది. ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి, ఎన్నికల సమయంలో వున్న కార్యకర్తల కంటే తరువాత ఫిరాయించిన వారు ముద్దు , ఓడమల్లయ్య బోడి మల్లయ్య వంటి ఈ విషయాల గురించి తరువాత మరోసారి విన్నవించుకుంటా.

    మన రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధికారుల నుంచి ప్రధానికి సరైన సమాచారం అందుతోందా లేదా అనే సందేహాన్ని వ్యక్తం చేసినట్లు వార్తలు చదివాం. బాబు గారూ మీరు ఒక జాగ్రత్త తీసుకోవాలి. మీరు బాగానే చేస్తున్నా మంత్రులు, అధికారులు సక్రమంగా లేరని మన శ్రేయోభిలాషుల మాదిరి వుండే కొందరు జర్నలిస్టులు రాసిందానిని నిజమే అని గతంలో నమ్మారని ఇప్పుడూ అనుకుంటున్నారని వింటున్నాం. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమంటే అదే జర్నలిస్టులు ఇటు మిమ్మల్ని, అటు కేంద్రంలో అంతకంటే ప్రధాన మంత్రిని ఎక్కువగా సమర్ధిస్తున్నారు. అందువలన కేంద్ర అధికారులు ప్రధానికి సరిగా తెలియచేయటం లేదనే పాట మీ కోసం కాదేమో చూడండి. లేక ప్రధాని మీద మాట పడకుండా మిమ్మల్ని ‘సంతృప్తి ‘ పరుస్తున్నారా? బిజెపికి సంతృప్తి రాజకీయాలు గిట్టవని తెలుసు కదా ! జర జాగ్రత్త, జనం నమ్మేట్లు లేరు. ఆంధ్రప్రదేశ్‌ విషయంలో కేంద్ర మనోగతం ఏమిటో అర్ధం కావటం లేదు, కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారా లేక సమస్య తీవ్రత తెలియక పట్టించుకోవటం లేదా అన్నది అర్ధం చేసుకోలేకపోతున్నాం. వెళ్లి కలిసినపుడు బాగా మాట్లాడుతున్నారు, కాని ఫలితం రావటం లేదు అన్నారు.

   ముందు మన శాసన మండలి, అసెంబ్లీ తీర్మానాలు చేయటమేనా, అసలు వాటిని మన అధికారులు కేంద్రానికి పంపారా ? అన్న అనుమానం కలుగుతోంది. మరి పంపితే వాటికి వచ్చిన సమాధానాలు ఏమిటి , మన మంత్రులు, ఎంపీలు కలిసినపుడు ఏం చెప్పారు. మన అధికారులు వచ్చిన వర్తమానాలను పూర్తిగా చూపటం లేదా అన్న సందేహం తలెత్తుతోంది. పార్లమెంట్‌లో సమాధానాలు, ఇతర లోగుట్టు కధనాల పేరుతో రాసిన వార్తలు తప్ప మాకు నిజం తెలియటం లేదు. రాష్ట్రం పంపిన తీర్మానాలేమిటి ? వాటికి కేంద్రం నుంచి వస్తున్న సమాధానాలు ఏమిటో అధికారికంగా తెలియచేస్తే అభిమానులం మేం కూడా ఒక పట్టు పడతాం కదా? అదేం వుండటం లేదు. అసలూ మనకు కేంద్రంలో ఇద్దరు మంత్రులు, ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధులు కూడా వున్నారు. వారు రోజూ కేంద్రంతో సంప్రదించవచ్చు. మరి వారేమి చేస్తున్నట్లు ? మీరు అనేక సార్లు ప్రధాన మంత్రిని కలిశారు. మీకేమో గుజరాతీ, హిందీ రాదు, ఆయనకేమో తెలుగు రాదు. అందువలన అసలు మీరు ఏ భాషలో మాట్లాడుకున్నారు అన్న అనుమానం కలుగుతోంది. ఆవో బాబూ ఆవో మై హూనా కాఫీ, చాయ్‌ పానీ పీనేకే బాద్‌ తుమ్‌ ఏపి జావో, బాద్‌మే అచ్చే దిన్‌ ఆ రహా హయ్‌ అంటే మీరు మంచిగా మాట్లాడుతున్నట్లు అనుకుంటున్నారా ఏమిటి ? ఇలా అయితే మీరు మరో 30 సార్లు ఢిల్లీ వెళ్లినా ఇదే జరుగుతుందన్న నీరసం వస్తోంది మాకు. మీరు నిరాశగా మాట్లాడటం చూస్తుంటే ఏదో దాస్తున్నట్లు , చెప్పుకోలేని బాధ, కేంద్రంలో మీకు అవమానం జరిగిందేమో అన్న అనుమాన బీజం మాలో పడింది.

    కేంద్రంలో వున్న మన వెంకయ్య నాయుడు గారేమో తాను రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ ఒక సమస్య పరిష్కారమో, కొత్త పధకమో తెస్తున్నట్లు చెబుతారు.ప్రధాని ఆయన ఎంత చెబితే అంత అంటారు. మీరేమో ప్రధాన మంత్రి దృష్టిపెడితే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయంటున్నారు.అంటే మీరు ప్రధాని దృష్టిని, కనీసం తోటి వెంకయ్య నాయుడి దృష్టిని సైతం ఆంధ్రప్రదేశ్‌పై మళ్లించటంలో రెండు సంవత్సరాలుగా విఫలమయినట్లేనా అన్న వూహనే తట్టుకోలేకపోతున్నాము.

    ఇంతవరకు జరిగిందానిని బట్టి, అనేక రాష్ట్రాలలో జరుగుతున్నదానిని బట్టి మన వంటి వారిపై ఆధారపడే కంటే స్వంతంగా బలపడాలని, అందుకు గాను వచ్చే ఎన్నికల నాటికి బిజెపిని మరింత బలపరుచుకోవాలన్నది మోడీ లక్ష్యంగా కనిపిస్తోంది.ఎదుటి పార్టీ వారిని ఆకర్షించటం మాకూ చేతనవును అని అనేక రాష్ట్రాలలో చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది మీకు అర్ధం అయ్యేట్లు చేయాలని బిజెపి నేతలకు అర్ధం అయింది. ఈ విషయం మీకు అర్ధం అయినా మరొక దారి లేక బింకాలు పోతున్నారని జనం చెవులు కొరుక్కుంటున్నారు.

    బిజెపి రాష్ట్ర నేతలు కేంద్రం అన్ని విధాలుగా సాయం చేస్తున్నది అనే ప్రచారం క్రమంగా పెంచుతున్నారు. కేంద్రం సహకరించినా దానిని వినియోగించుకోవటంలో బాబు గారు విఫలమయ్యారు కనుక ఒక అవకాశం మాకే ఇవ్వండి అని వారు ముందుకు వస్తారా ? వస్తే మన పార్టీలో ఎందరు మిగులుతారు అన్నవి ప్రస్తుతానికి వూహా జనిత ప్రశ్నలే కావచ్చు కానీ, ప్రస్తుతం మన వంటి పార్టీల నేతలు డొల్లుపుచ్చకాయల వంటి వారు, ఎటైనా దొర్ల వచ్చు. ఇంతకు ముందు మన పార్టీలో కాంగ్రెస్‌ రక్తం ఎంత వ్యతిరేక రక్తం ఎంత అని కొలిచేవారు, ఇప్పుడు కాక్‌టెయిల్‌ మందు మాదిరి, ఏది ఎంతో తెలియటం లేదు.

   చివరగా ఒక్క మాట. అధికారంలో లేనపుడు అభిమానుల సూచనలు పట్టించుకుంటారని, అధికారం వచ్చిన తరువాత ఇతరుల మాటలు వింటారని మీ గురించి గిట్టని వారూ, గిట్టే వారు కూడా చెబుతుంటారు. ఈ సంవత్సరం కూడా నవ నిర్మాణ దీక్ష చేపడతామని ప్రకటించారు.ఏదో తొలి ఏడాది దీక్ష అంటే అర్ధం వుంది, ప్రతి ఏడాదీ దీక్షలేమిటంటే ఏం చెప్పాలి. ప్రతిపక్ష నాయకులు దీక్షలు చేయటం అంటే అర్ధం వుంది. అధికారంలో వున్నవారు దీక్షలు చేస్తే చాలా బాగోదు. బరువు తగ్గటానికైతే ఓకే. ప్రత్యేక తరగతి రాష్ట్ర హోదా, రైల్వే జోన్‌, లోటు బడ్జెట్‌ పూడ్చేందుకు సాయం వంటి వాటిపై దీక్ష చేస్తేనన్నా ప్రధాని రాష్ట్రం వైపు దృష్టి పెడతారేమో చూడండి బాబు గారూ.ప్రావిడెంట్‌ ఫండ్‌ వుపసంహరణ, వడ్డీ తగ్గింపుపై కార్మికుల తడాఖాను చూసిన తరువాతే ప్రధాని వాటిపై దృష్టి సారించారు.వెనక్కు తగ్గారు. కేసుపోయినా మన ప్లీడరు గట్టిగా వాదించాడు అని వచ్చే ఎన్నికలలో మేమంతా చెప్పుకోవటానికి దారులు వెతుక్కోవటం మంచిదేమో చూడండి మరి.

    వుంటా బాబూ ! రెండు సంవత్సరాల నుంచి మన రాష్ట్రం, మన అమరావతి , మన ఇటుకలు, మన మట్టి, మన నీరు అంటూ వుత్సాహంతో, వుద్వేగంతో ఎంతో అభిమానంతో ఎదురు చూసిన మా వాడు జాబు గురించి హైదరాబాదో, బెంగలూరో పోవాలంటున్నాడు. దాని సంగతేదో చూడాల, మన అమరావతిలో జాబులు వచ్చినపుడు వాడిని ఇక్కడికే రప్పిస్తాలే, అప్పటి దాకా వుంచుకోలేకం కదా ! ఎంతైనా పెళ్లి కావాల్సిన పిల్లాడు కదా !

మీ అభిమాని

ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d