• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రం -2 : పెరుగుతున్న మతోన్మాద ముప్పు !

09 Monday Aug 2021

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA

≈ 1 Comment

Tags

75th India Independence Day, India foreign policy under narendra modi, India independence @75, Narendra Modi Failures, Quadrilateral Security Dialogue


ఎం కోటేశ్వరరావు


1757లో ప్లాసీ యుద్దంలో ఈస్టిండియా కంపెనీ విజయం సాధించిన తరువాత ఆంగ్లేయులు మన దేశంలో అత్యధిక భాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని 1947వరకు పాలించారు, మన సంపదలను దోచుకున్నారు, వారి పారిశ్రామిక ఉత్పత్తులకు మన దేశాన్ని ముడి వస్తువులను సరఫరా చేసేదిగానూ, వినియోగ మార్కెట్‌గా మార్చివేశారు. ఏడున్నర దశాబ్దాల తరువాత చూస్తే పరిస్ధితి ఏమిటి ? బ్రిటీష్‌ వారు భౌతికంగా మనలను పాలించటం లేదు తప్ప ఆ దేశానికి చెందిన వాటితో సహా అనేక దేశాల సంస్దలు మనలను కొత్త రూపాల్లో ఇంకా దోపిడీ చేస్తూనే ఉన్నాయి. మన దగ్గర లేని పెట్టుబడులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చుకొనేందుకు విదేశీ కంపెనీలను అనుమతించాలా వద్దా అంటే అనుమతించక తప్పదు, ఎవరూ అభ్యంతర పెట్టటం లేదు. కానీ ఆ పేరుతో విదేశీ కంపెనీలకు మన మార్కెట్‌ ద్వారాలు తెరిస్తే మనం అభివృద్ధి చెందేది ఎప్పుడు, మన జనానికి ఉపాధి దొరికేది ఎన్నడు ? ప్రభుత్వ రంగమూ లేదు, ప్రయివేటు రంగం ముందుకు రావటం లేదు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు చైనాకు పోటీగా మన దేశాన్ని మరో ప్రపంచ ఫ్యాక్టరీగా చేస్తామని నరేంద్రమోడీ మేక్‌ ఇండియా,మేకిన్‌ ఇండియా అన్నారు. వాటి సూచనలే లేవు. పిలుపులు ఇస్తే చాలదు, ఆచరణకు అనువైన విధానాలను చేపట్టాలి. చివరకు ఆ చైనా నుంచే వస్తువులను దిగుమతి చేసుకోకపోతే గడవని స్ధితి.


మన కంటే రెండు సంవత్సరాలు ఆలశ్యంగా విదేశీ దురాక్రమణ నుంచి రెండవసారి స్వాతంత్య్రం తెచ్చుకుంది చైనా. ఆ నాటికి వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో మనకంటే వెనుకబడి ఉంది. అలాంటి దేశం ఇప్పుడు ఎక్కడ ఉంది ? అత్యంత అభివృద్ది చెందిన అమెరికా, ఐరోపా ధనిక దేశాలను అధిగమించి ముందుకు పోతున్నది. మరో పది సంవత్సరాలలో ఆర్ధికంగా అమెరికాను వెనక్కు నెట్టి ప్రధమ రాజ్యంగా అవతరించనుంది. ఇప్పటికే టెలికాం రంగం, మరికొన్ని పరిజ్ఞానాల్లో పశ్చిమ దేశాల కంటే ముందుంది. వారికి సాధ్యమైంది మనకు ఎందుకు కావటం లేదు ? అది కమ్యూనిస్టు నియంత దేశం మనది ప్రజాస్వామ్యం కనుక చైనాతో పోల్చకూడదు అంటారు. ప్రపంచంలో అనేక దేశాలను ఏలిన నియంతలందరూ తమను ప్రజాస్వామ్యవాదులుగా వర్ణించుకున్నారు. మరి ఆ దేశాలు చైనా మాదిరి వృద్ది చెందలేదేం ? పోనీ మనది నిజమైన ప్రజాస్వామ్యం అనుకుంటే చైనాతో పోల్చితే మనం ఎక్కడ ఉన్నాం. స్వేచ్చ, స్వాతంత్య్రం అవసరం అయినదాని కంటే ఎక్కువ ఉందంటున్నారు గనుక అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో మన జనం పని చేయాలి కదా ? లోపం ఎక్కడుంది ?


బ్రిటీష్‌ వారు వెళ్లిపోతూ దేశాన్ని రెండు ముక్కలు చేశారు. హిందూ-ముస్లిం విబేధాలను రగిలించారు. ఆ సందర్భంగా జరిగిన హింసాత్మక ఉదంతాలలో లక్షలాది మంది మరణించారు, ఆ సంఖ్యను రెండు నుంచి 20లక్షలుగా చెబుతారు. అలాగే కోటి నుంచి రెండు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. నాడు ఆంగ్లేయులు తమ అజెండాను అమలు చేసేందుకు తనకు అనుకూలంగా పాకిస్ధాన్‌ పేరుతో కొంత ప్రాంతాన్ని మరల్చుకొనేందుకు మత విభజనను ముందుకు తెచ్చారు. ఏడున్నర దశాబ్దాల తరువాత ఇప్పుడు దేశంలో పెరుగుతున్న మత విభజనను ఎవరు తెస్తున్నారు, ఎవరి ప్రయోజనం కోసం ? వీరికీ బ్రిటీష్‌ వారికీ తేడా ఏముంది ? బ్రిటీష్‌ వారిని తప్పు పట్టిన వారు వీరి విషయంలో అలా ఎందుకు ఉండలేకపోతున్నారు ?


మనకు స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ప్రభుత్వం దగ్గర అవసరమైన పెట్టుబడిలేకపోవటంతో ప్రభుత్వ రంగంతో పాటు ప్రయివేటు రంగాన్ని కూడా ప్రోత్సహిస్తూ మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధ పేరుతో ప్రభుత్వం ఒక పునాది వేసింది. పంచవర్ష ప్రణాళికల ద్వారా అభివృద్ధి సాధించాలనే పద్దతిని అనుసరించారు. ప్రభుత్వ రంగం ప్రజల ఆస్తులను పెంచటమే కాదు, సామాజిక న్యాయాన్ని అమలు జరపటంలో, ఆదర్శయజమానిగా వ్యవహరించటంలో ముందుంది. మిలిటరీ, కరెన్సీ, పోలీసుల, సరిహద్దుల భద్రత, కీలకమైన రక్షణ పరిశ్రమల వంటి తప్ప మిగిలిన రంగాల నుంచి ప్రభుత్వం వైదొలగాలన్న ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశాల మేరకు 1990దశకం నుంచి ప్రభుత్వం క్రమంగా వైదొలుగుతోంది. ప్రభుత్వ రంగ సంస్ధలను క్రమంగా వదిలించుకుంటున్నారు. ఈ విధానాలలో కాంగ్రెస్‌-బిజెపికి ఉన్న తేడా ఏమంటే బిజెపి వేగం పెంచింది. గత మూడు దశాబ్దాలలో ఎవరు అధికారంలో ఉన్న కొన్ని రక్షణ విభాగాల్లో తప్ప మిగతావాటిలో ఎక్కడా ఒక్క పైసా కూడా పెట్టుబడులు పెట్టటం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే చేస్తున్నాయి. తాజాగా రక్షణ రంగంలో కూడా ప్రయివేటుకు ద్వారాలు తెరిచారు. అమెరికా, ఐరోపా దేశాల అనుభవం చూసినపుడు ముఖ్యంగా అమెరికాలో మిలిటరీ పరిశ్రమల సముదాయాలు అభివృద్ధి చెందాయి. ఫలితంగా వాటి లాభాలను పెంచేందుకు ప్రపంచ వ్యాపితంగా నిత్యం ఎక్కడో ఒకచోట స్వయంగా యుద్దాలకు దిగటం లేదా రెండు దేశాల మధ్య తంపులు పెట్టి ఇరుపక్షాలకూ ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకుంటున్నది. గతంలో భారత్‌ -పాక్‌ మధ్య అదేపని చేసిన అమెరికా ఇప్పుడు చైనా మీదకు మనలను ఉసిగొల్పి మనకు ఆయుధాలు అమ్ముతున్నది. విమానాలతో సహా స్వంతంగా తయారు చేసుకొనే స్ధితిలో వారున్నారు గనుక అమెరికా ఆయుధాల భారం మోసేది మనమే. ఏడు సంవత్సరాలుగా చమురు పన్నులు పెంచుతున్న పాలకులు ఎందుకు పెంచారంటే గాల్వన్‌ ఉదంతాన్ని చెబుతున్నారు. అది జరిగింది ఎప్పుడు ? మనల్ని బాదటం ప్రారంభించింది ఎప్పుడు ?


ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారీ పరిశ్రమలను ఆసరా చేసుకొని అనేక ప్రయివేటు పరిశ్రమలు అభివృద్ది చెందాయి. ఐడిపిఎల్‌లో పని చేసిన వారు అనేక మంది ఔషధ రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగారో చూస్తున్నాము. అలాంటి వారు నేడు ప్రభుత్వ రంగంలో ఫార్మా పరిశ్రమలను మూసివేసే విధంగా వత్తిడి తెచ్చి వాటి స్ధానాన్ని వారు అక్రమించటం తెలిసిందే. వాక్సిన్ల తయారీని సీరం, భారత్‌ బయోటెక్‌ వంటి ప్రయివేటు సంస్ధలకు వదలివేసి ప్రభుత్వరంగంలోని సంస్ధలను పాడు పెట్టటం గురించి ఇటీవలనే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మన దేశంలో తయారీ బదులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే లాభమా నష్టమా అని లెక్కలు వేసుకొని మన బిహెచ్‌యిఎల్‌ను దెబ్బతీసి దిగుమతులు చేసుకోవటం విద్యుత్‌ రంగంలో చూశాము.ఇదే పరిణామం అనేక రంగాల్లో కనిపిస్తుంది. మన దేశంలో అనేక మంది నిపుణులు ఉన్నప్పటికీ పరిశోధన-అభివృద్ది రంగంలో తగిన పెట్టుబడులు పెట్టకుండా సాంకేతిక రంగంలో ముందుకు పోవటం ఏ దేశానికీ సాధ్యం కాదు. చైనాలో సోషలిస్టు వ్యవస్ధను నిర్మించాలన్న కమ్యూనిస్టు పార్టీ లక్ష్యమొక్కటే కాదు, పరిశోధనా రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన కారణంగానే నేడు పశ్చిమ దేశాలకు సవాలుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కూడా ముందుకు పోతోంది.


ప్రభుత్వం పెట్టుబడులు పెట్టటం నిలిపివేసింది. ప్రయివేటు రంగం మీద అన్నింటినీ వదలివేసింది. అమెరికా, ఐరోపా దేశాల ప్రయివేటు సంస్ధలు తమ దేశాల్లో పరిశ్రమలు పెట్టటం కంటే చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌ వంటి దేశాలనుంచి వినియోగవస్తువులను దిగుమతి చేసుకొని లబ్దిపొందాయి. గత ఏడు సంవత్సరాల కాలంలో నరేంద్రమోడీ ఏలుబడిలో చైనా నుంచి దిగుమతులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయంటే దాని అర్ధం ఇక్కడి పారిశ్రామిక-వాణిజ్య సంస్దలు కూడా అదేబాట పట్టాయన్నది స్పష్టం.లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌లోయలో రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణల తరువాత చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టారు. ఏడాది కాలంలో కరోనా కారణంగా మొత్తంగా మన దిగుమతులు తగ్గాయి కనుక ఆమేరకు చైనా నుంచి తగ్గాయి తప్ప ఇప్పటికీ అక్కడి నుంచే మనం ఎక్కువగా దిగుమతులు చేసుకుంటున్నాము. ఇటీవలి కాలంలో తిరిగి పెరుగుదల ప్రారంభమైంది.


విదేశాంగ విధానంలో అటు అమెరికా ఇటు సోవియట్‌ వైపు మొగ్గకుండా అలీన విధానాన్ని అనుసరించి అలాంటి దేశాల నేతగా మన దేశం ఎదగటమే కాదు స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించింది. సోవియట్‌ యూనియన్ను కూల్చివేసిన తరువాత మన దేశం అలీన విధానానికి స్వస్తిపలికింది. అమెరికాకు చేరువ కావటమే కాదు, దాని జూనియర్‌ భాగస్వామిగా మారేందుకు అడుగులు వేసింది. దానితో సంబంధాల కారణంగానే యుపిఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. గత ఏడు సంవత్సరాల పరిణామాలను చూస్తే అమెరికాకు దగ్గరయ్యే వేగం పెరిగింది. ట్రంప్‌ హయాంలో మన దేశం నుంచి చేసుకుంటున్న దిగుమతుల మీద ఇస్తున్న పన్ను రాయితీలను అమెరికా రద్దు చేసింది. అదే విధంగా మనం అనుసరిస్తున్న కనీస మద్దతు ధరల విధానం ద్వారా పరిమితులకు మించి సబ్సిడీలు ఇస్తున్నామనే పేరుతో దాన్ని రద్దు చేసేందుకు ప్రపంచ వాణిజ్య సంస్ధలో అమెరికా కేసులు దాఖలు చేసింది. ఆ వత్తిడికి లొంగి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల పేరుతో చట్టాలను పార్లమెంట్‌లో ఎంత హడావుడిగా ఆమోదింప చేయించుకుందో చూశాము. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొని విదేశీ-స్వదేశీ ప్రయివేటు కార్పొరేట్లకు అప్పగించేందుకు వేసిన తొలి అడుగు అవి. వాటి ప్రమాదాన్ని గ్రహించిన పంజాబ్‌, హర్యానా, యుపిలోని వ్యవసాయ ప్రధాన ప్రాంతాల రైతాంగం గతేడాది నవంబరు నుంచి నిరవధిక ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.


అలాంటి అమెరికాతో కలసి మలబార్‌ తీరంలో సైనిక విన్యాసాలు జరుపుతున్నాము. మనకు సంబంధం లేని దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్చగా నౌకారవాణాను అనుమతించాలనే పేరుతో అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాతో కలసి చతుష్టయం పేరుతో చైనా వ్యతిరేక కూటమిలో చేరాము. అంతేకాదు అమెరికాకు అంగీకారం లేదు గనుక ప్రాంతీయ ఆర్దిక సమగ్ర భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)లో చేరేందుకు నిరాకరించాము. దానిలో చేరితే మన రైతాంగం, పరిశ్రమలు, వాణిజ్యాలకు హాని జరిగే మాట నిజం. దాన్ని సాకుగా చూపినప్పటికీ అమెరికాతో బిగుస్తున్న ముడే ప్రధానంగా వెనక్కు లాగింది. మరోవైపు తమ ప్రయోజనాలను బేరీజు వేసుకొని అమెరికా వద్దని వారిస్తున్నా ఆర్‌సిఇపిలో జపాన్‌, ఆస్ట్రేలియా భాగస్వాములయ్యాయి. ఈ పరిణామాల తరువాత ఆకస్మికంగా గాల్వన్‌ ఉదంతాలు జరిగాయి. అంతకు ముందు ఎలాంటి ప్రత్యేక అజెండా లేకుండానే నరేంద్రమోడీ చైనా పర్యటన తరువాత గ్జీ జింపింగ్‌ అదే మాదిరి మహాబలిపురం వచ్చిన విషయం తెలిసిందే.


రాచపీనుగ ఒంటరిగా పోదన్న సామెత తెలిసిందే. అమెరికాతో అంటకాగితే దానికి వచ్చే సమస్యలను మనం కూడా అనుభవించాల్సి ఉంటుంది. దానికి చక్కటి ఉదాహరణ ఆఫ్ఘన్‌ ఉదంతమే. అక్కడి నుంచి అమెరికా సేనల ఉపసంహరణ తరువాత వారి నమ్మి పెట్టుబడులు ఏమౌతాయో తెలియదు. అన్నింటికీ మించి తాలిబాన్ల ముప్పు మన దేశానికి ఎదురవుతుందా అన్న సమస్య ముందుకు వచ్చింది. ఉగ్రవాదంపై పోరు పేరుతో అమెరికాతో వ్యవహరించిన మన దేశం అమెరికా మాదిరే ఉగ్రవాదులైన తాలిబాన్లతో రహస్యంగా చర్చలు జరపాల్సి వచ్చింది. తాలిబాన్లను అదుపు చేయాలంటే పాకిస్దాన్‌ సహకారం అవసరం గనుక నాటకీయ పరిణామాల మధ్య సరిహద్దులో కాల్పుల విరమణ గురించి ఒప్పందం కుదిరినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో మన ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇరాన్‌ – అమెరికా వివాదంలో మనకేమీ సంబంధం లేదు. అమెరికన్లు ఇరాన్‌ మీద ఆంక్షలు విధించారు. తమ నిర్ణయాన్ని ఉల్లంఘించే దేశాల మీద కూడా చర్యలు తీసుకుంటామని అమెరికా బెదిరించింది. మన దేశం భయపడిపోయి ఇరాన్‌ నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసింది.అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటోంది. మన మిత్రదేశం ఇరాన్‌ గతంలో సమదూరంలో ఉండేది ఇప్పుడు చైనాకు దగ్గర అయింది. మన చుట్టుపక్కల దేశాలన్నీ అదే విధంగా మారాయి. కారణం అమెరికాను మనం కౌగలించుకోవటమే.


తొలి 75 సంవత్సరాల స్వాతంత్య్ర దేశంలో రాజకీయ రంగంలో ప్రధానంగా ముందుకు వచ్చిన ధోరణి కాంగ్రెస్‌ వ్యతిరేకత. ఇప్పుడు 75 సంవత్సరాల తరువాత దాని స్ధానంలో బిజెపి వ్యతిరేకతకు పునాది పడింది. రెండింటికీ కారణం ఒక్కటే. కాంగ్రెస్‌ ఎలా అయితే అప్రజాస్వామికంగా ప్రత్యర్ది పార్టీల ప్రభుత్వాలను కూల్చివేయటం, పార్టీలను దెబ్బతీయటం చేసిందో, బిజెపి ఏడు సంవత్సరాల్లోనే దాన్ని మించి పోయింది. దానికి తోడు మతతత్వాన్ని జోడిస్తోంది. ఇది సమాజం చీలిపోవటానికి దారి తీస్తుంది. వామపక్షాలు మినహా కాంగ్రెస్‌, బిజెపి, వివిధ ప్రాంతీయ పార్టీల మధ్య ఆర్దిక విధానాల విషయంలో ఎలాంటి పేచీ లేదు. పంచాయతీ అల్లా అధికారం దగ్గరే. అందుకే గతంలో కాంగ్రెస్‌ వ్యతిరేకత ముందుకు వస్తే దాని స్దానంలో ఇప్పుడు బిజెపి వచ్చింది. అయితే జనం కాంగ్రెస్‌కు ఇచ్చినంత అవకాశం బిజెపికి ఇచ్చే స్ధితి లేదు.


ఏ దేశమైనా తమ ప్రయోజనాలకు తొలి పీట వేయటం ఇప్పుడు ప్రపంచమంతటా జరుగుతోంది. అది దురహంకారంగా మారకపోతే, ఇతర దేశాల ప్రయోజనాలకు ఎసరు పెట్టే విధంగా లేకపోతే ఇబ్బంది లేదు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా అమెరికా, జపాన్‌, ఐరోపా దేశాలు తమ దేశాల ఆర్ధిక వ్యవస్ధలను బాగు చేసుకోవటం లేదా ముందుకు పోవటం ఎలా అనేదాని కంటే చైనాను దెబ్బతీయటం మీదనే కేంద్రీకరిస్తున్నాయి.దేశీయంగా దివాలా కోరు విధానాలను అనుసరిస్తున్నంత కాలం మరో 75 సంవత్సరాలు గడచినా జన జీవితం మెరుగు పడదు. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని వదలి ఏదో ఒక దేశానికి తోకగా మారితే దాని తప్పులకు మనం కూడా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. పాలకులు ఎలాగూ ఈ విషయాలను పట్టించుకొనే స్ధితి లేదు. జనం పట్టించుకోకపోతే ఆమృత మహౌత్సవం ముగిసిన తరువాత హాలా హలాన్ని మింగాల్సి వస్తుందన్నదే 75వ స్వాతంత్య్రదినోత్సవ హెచ్చరిక !

మొదటి భాగం https://vedikaa.com/2021/08/08/india-independence-75-what-is-happening-part-one/

ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రం-1 : అమృత ఉత్సవమా ! హాలాహలమా !!
ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రం-1 : అమృత ఉత్సవమా ! హాలాహలమా !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రం-1 : అమృత ఉత్సవమా ! హాలాహలమా !!

08 Sunday Aug 2021

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK, Uncategorized

≈ 1 Comment

Tags

75th anniversary of India's Independence, Azadi Ka Amrit Mahotsav, BJP, India independence @75, Indian national Congress, Mahatama Gandhi, Narendra Modi Failures, Nathuram Godse, RSS


ఎం కోటేశ్వరరావు


” ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం- నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం,
తారీఖులు దస్తావేజులు ఇవి కాదోయి చరిత్ర సారం ” అన్న శ్రీశ్రీని మనం ఇప్పుడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుర్తు తెచ్చుకోవటం అవసరం. స్వాతంత్య్రానికి ముందు పుట్టి తరువాత దేశాన్ని చూసిన వారి కలలు కల్లలయ్యాయి. తరువాత పుట్టిన వారు ఈ దేశం మాకేమిచ్చిందన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్ధితి. బిడ్డ పుట్టి పెరిగే క్రమంలో జరిగే పరిణామాల మాదిరే స్వాతంత్య్ర తరువాత దేశంలో కూడా మార్పులు వచ్చాయి. పుట్టిన బిడ్డ ఆరోగ్యంతోనా లేక ఈసురో మంటూ ఎదిగినట్లా అన్నదే అసలు సమస్య. స్వాతంత్య్ర దేశాన్ని కూడా అలాగే చూడాలి.


కాలం గడిచే కొద్దీ మెరుగు పరచాల్సిన ప్రజాస్వామ్య వ్యవస్ధలకు తూట్లు పొడుస్తున్నారు. విపరీత అర్ధాలు చెబుతున్నారు. పోరాడి సాధించుకున్న హక్కులు ఒక్కొక్కటి హరించుకుపోతున్నాయి లేదా కదలా మెదల్లేని బంధనాల్లో ఇరుక్కు పోతున్నాయి. మనకు నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా ? స్వాతంత్య్రం అంటే ఇదా, ఇలాంటిది మనకు అవసరమా అనే ప్రశ్నలు అనేక మందిలో ఉన్నాయి. ఇంతకాలం తరువాత ఇలాంటి ఆలోచనలు కలగటం విచార, విషాదకర స్దితి. ప్రస్తుత తీరు తెన్నులు చూస్తుంటే రానున్న రోజుల్లో పరిస్దితి ఇంకా దిగజారుతుందా అన్న ఆందోళన తలెత్తుతోంది. సాగు, నిత్య పర్యవేక్షణ లేకపోతే పంట భూముల్లో కలుపు మొక్కలు పుట్టినట్లు లేదా కబ్జాకు గురైనట్లుగానే అనేక దేశాల్లో ఇలాంటి పరిస్ధితులు తలెత్తినపుడు నియంతలు ముందుకు వచ్చేందుకు అనువుగా ఉంటుంది. ఎవడొస్తే మనకేంలే మన మీద భారాలు, మనకు బాధలు తప్పవు అని జనం నిర్లిప్తతకు లోనవుతారు.


డెబ్బయి అయిదేళ్ల స్వాతంత్య్ర సందర్భాన్ని ఏమని పిలవాలి అన్నది ఒక మీమాంస. వజ్రోత్సవం లేదా ప్లాటినం వాటి నిర్వచనాలకు సరిపోదు. నూటయాభయ్యవ సంవత్సరాన్ని ఆంగ్లంలో సెస్‌కో సెంటెనియల్‌ అన్నారు. దీనికి తెలుగులో తగిన పదం లేదని గూగుల్తల్లి నిఘంటువు సమాధానం చెప్పింది. తెలిసిన వారెవరైనా సూచిస్తే దాన్నే ఉపయోగిద్దాం. డెబ్బయి అయిదు అంటే నూటయాభైలో సగం కనుక సెమీ సెస్‌కో సెంటినియల్‌ అనాలన్నారు. మన ప్రధాని నరేంద్రమోడీ గారు అమృత మహౌత్సవ్‌ అన్నారు. పేరులోనేమున్నది పెన్నిధి. వదిలేద్దాం. దానితో ఎవరికీ పేచీ లేదు.
జూలై ఒకటిన చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలైన సందర్భంగా వారు ఎంత గొప్పగా ఆ ఉత్సవాన్ని జరుపుకున్నారో, కమ్యూనిస్టు ఆశయాలకు ఎలా పునరంకితమయ్యారో యావత్‌ ప్రపంచం చూసింది. మనకంటే రెండు సంవత్సరాలు ఆలశ్యంగా అక్కడ కష్టజీవుల ప్రభుత్వం ఏర్పడింది, 75 ఏండ్ల ఉత్సవాన్ని వారెలా జరుపుకుంటారో తరువాత చూద్దాం. మోడీ గారు ఏడేళ్ల క్రితం అనేక మాటలు చెప్పారు. తరువాత చెప్పిన మాట చెప్పకుండా చేసేది చెప్పకుండా చెప్పింది చెయ్యకుండా అసాధారణ ప్రతిభతో ” నిత్య నూతనత్వంతో ” గడుపుకు వస్తున్నారు. నిజంగా మనం ఇప్పుడు అమృత మహౌత్సవం జరుపుకొనే స్ధితిలో ఉన్నామా హాలాహలం మింగాల్సిన దుస్దితిలో ఉన్నామో తెలియటం లేదు. అచ్చేదిన్‌ (మంచి రోజులు) తెస్తామని వాగ్దానం చేసిన ప్రస్తుత కేంద్ర పాలకులు జనం చేత దేన్ని మింగిస్తారో అర్ధం కావటం లేదు.


ప్రతి ఏడాదీ పంద్రాగస్టు పండగ జరుపుకుంటున్నాం. అదొక తంతులా మారిపోయిందని ఎవరైనా అంటే తప్పు పట్టాల్సిన పని లేదు. అంతకు మించి జరుగుతున్నదేమీ లేనపుడు ఎవరైనా అలాగే అనుకుంటారు మరి. పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు అయ్యవార్లకు చాలు ఐదు వరహాలు అన్నట్లుగా మార్చివేశారు. ఉదయాన్నే దేశభక్తి గీతాలు, పాటలను వినిపించటం, మూడు రంగుల జండా ఎగురవేయటం, ప్రతిజ్ఞలు, పప్పు బెల్లాల స్ధానంలో ఏదో ఒకటి తిని మిగిలిన రోజంతా సెలవుగా గడిపేయటానికి అలవాటు పడ్డాము. స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన సంస్దగా ఉన్న కాంగ్రెస్‌ను రాజకీయ పార్టీగా మార్చి వేశారు. ఆ ఉద్యమం ఏ లక్ష్యాలనైతే ముందుకు తెచ్చిందో వాటిని ఆ పార్టీ 1947 ఆగస్టు 16 నుంచే మరచి పోయింది. దాన్ని నీరుగార్చే, ముప్పు తెచ్చే, జనానికి విశ్వాసం కోల్పోయే చర్యలకు పాల్పడింది. చరిత్ర దాస్తే దాగేది కాదు. విజేతలే చరిత్రను రాస్తారు అన్నది తెలిసిందే. అందువలన అది వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఇప్పుడు జనం కూడా చరిత్రను రాస్తున్నారు. అందువలన దానిలో ఎలాంటి వివక్ష, పక్షపాతం ఉండదు. చరిత్ర నిర్దాక్షిణ్యంగా ఉంటుంది. కాంగ్రెస్‌ వైఫల్యాలను ఉపయోగించుకొనేందుకు స్వాతంత్య్ర ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేకపోవటమే కాదు బ్రిటీష్‌ వారికి సేవచేసుకుంటామని రాతపూర్వకంగా హామీ ఇచ్చిన వారి వారసులతో నిండిన బిజెపి రంగంలోకి దిగింది. బ్రిటీష్‌ పాలన నుంచి దేశ విముక్తి అన్న నినాదాన్ని కాపీ కొట్టి కాంగ్రెస్‌ విముక్త భారత్‌ అనే పేరుతో జనం ముందు మాట్లాడింది. కాంగ్రెస్‌ విధానాలనే వేగంగా అమలు చేస్తూ దేశం మరింత దిగజారే విధంగా ఏలుబడి సాగిస్తోంది.


ఎందుకీ పరిస్ధితి తలెత్తింది ? దీక్షా దినంగా పాటించాల్సిన స్వాతంత్య్ర దినాన్ని సెలవుగా మార్చినపుడే ఆ మహౌద్యమాన్ని జనం మరచి పోవాలన్న అంశం దానిలో ఇమిడి ఉంది. చివరకు అది ఎంతవరకు వచ్చిందంటే స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యాలకు ముప్పు వచ్చిందని చెబుతున్నవారిని ఇప్పుడు జనం అపహాస్యం చేస్తున్నారు. అవి ఉంటేనేం లేకపోతేనే అంటున్నారు. పంద్రాగస్టు పండగకు 75 వారాల ముందే ప్రధాని నరేంద్రమోడీ మార్చి 12న గుజరాత్‌లో అజాదీ కా అమృతమహౌత్సవాన్ని ప్రారంభించారు. 2022 ఆగస్టు 15న నాటికి డెబ్బయిఅయిదు సంవత్సరాలు నిండి 76వ ఏట ప్రవేశిస్తాము. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్రాలు కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాయి. ఇది రాసిన సమయానికి వాటిని ఖరారు చేయలేదు. అమృతమహౌత్సవాన్ని ప్రజాఉద్యమంగా నిర్వహించాలని దాని అమలుకు హౌమ్‌ మంత్రి అమిత్‌ షా నాయకత్వాన ఒక జాతీయ కమిటీ ఉంటుందని చెప్పారు. వారేమి చేస్తారో, అవెలా ఉంటాయో మరో సందర్భంగా చర్చించుకుందాం.


స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నవారు అందరూ ఒకే పార్టీలో లేరు, అనేక పార్టీలలో చేరారు. మెజారిటీ కాంగ్రెస్‌ పార్టీలో చేరినందున తామే దేశాన్ని విముక్తి చేశామని వారు చెప్పుకుంటారు. అలాంటి కాంగ్రెస్‌ దేశానికి శనిలా దాపురించిందని దాన్నుంచి ముక్తి కలిగిస్తామంటూ కాంగ్రెస్‌ ముక్త భారత్‌గా మారుస్తామని బిజెపి ప్రకటించుకుంది. దేశ రాజ్యాంగం ప్రకారం నాలుగు ఉన్నత పదవుల్లో అసలు స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేకపోవటమే కాదు, ముందే చెప్పుకున్నట్లు బ్రిటీష్‌ వారికి లొంగిపోయిన వారి రాజకీయ వారసులు ఇప్పుడు అధిష్టించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి,ప్రధాని,లోక్‌సభ స్పీకర్లుగా సంఘపరివార్‌ రాజకీయ విభాగమైన బిజెపికి చెందిన వారే ఉన్నారు. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాధూరామ్‌ గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తి, హత్య సమయంలో అతను తమ సంస్ధలో లేడని వారు చెబుతారు గానీ గాడ్సే కుటుంబసభ్యులు సంఘపరివార్‌లోనే ఉన్నట్లు చెప్పారు. అది తేలేది కాదు గనుక ఆ వివాదాన్ని పక్కన పెడదాం. గాంధీని నేనెందుకు చంపాను అంటూ కోర్టులో గాడ్సే చేసిన వాదనలను పుస్తకరూపంలో ప్రచురించి ప్రచారం చేస్తున్నవారు, సామాజిక మాధ్యమంలో అవే వాదనలను చేస్తున్న వారెవరో మనకు తెలుసు, అయితే అదంతా అనధికారికంగానే అనుకోండి. అలాంటి వారికి స్వాతంత్య్రం , దాని లక్ష్యాల మీద , ప్రజాస్వామిక వ్యవస్ధల పట్ల గౌరవం ఉంటుందా ? ఒకవైపు గాంధీకి నివాళులు అర్పిస్తూ మరోవైపు గాడ్సేను ఆరాధించే వారు పెరుగుతున్నారు, వారు ఎంతకైనా తెగిస్తారు. ఇంతకంటే ఆందోళనకరమైన అంశం ఏముంటుంది ?


జనాభాలో సగ భాగం గురించి ఇన్నేండ్లుగా కబుర్లు చెప్పటమే తప్ప ఫ్యూడల్‌ భావజాలం నుంచి ఇంకా బయటపడలేని స్ధితి ఇప్పటికీ కొనసాగుతోంది. అనేక దేశాల చట్ట సభల్లో మహిళలు సగం మంది ఉన్నారు. తాజాగా చిలీ రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికలే అందుకు నిదర్శనం. మన దేశంలో చట్టసభల్లో 33శాతం గురించి ఎప్పటి నుంచో చర్చ. తమకు సంపూర్ణ మెజారిటీ ఉంటే అమలు జరుపుతామని బిజెపి చెప్పింది. ఇప్పుడు పార్లమెంట్‌ ఉభయ సభల్లో వారికి, వారిని బలపరిచే మిత్రపక్షాలతో కలిపి అవసరమైన మెజారిటీ ఉంది. మెజారిటీ రాష్ట్రాలూ వారివే. అయినా దాని గురించి ఎప్పుడైనా ప్రధాని మన్‌కీబాత్‌లో ప్రస్తావన చేశారా అంటే లేదు.


మన దేశం అనేక రంగాలలో అభివృద్ధి చెందింది అని చెబుతుంటాం, నిజమే. కానీ అది జనానికి ఏ మేరకు ఉపయోగపడిందన్నదే గీటురాయి. వేల కోట్ల రూపాయలను పెట్టి రాఫెల్‌ విమానాలను కొనుగోలు చేయటానికి, అవసరం లేకపోయినా కొత్త పార్లమెంట్‌ భవనం కట్టేందుకు నిధుల కొరత లేదు. కరోనా మహమ్మారి పోరు గురించి కబుర్లకూ అంతకంటే కొదవ లేదు. అంతరిక్ష రంగంలో అనేక విజయాలు సాధించి రాకెట్లను ఎగరేశాం గానీ చాలా చౌకగా లభించే ఆక్సిజన్‌ ఇవ్వలేకపోయారు. అనేక మంది కరోనా పీడితులు ఆ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆనందయ్య ఆకుల పసరు ఆక్సిజన్‌ అందిస్తుందంటే, పచ్చడి కరోనాను అరికడుతుందంటే నిజమని జనం నమ్మారు. దీన్ని ఎలా చూడాలి ? కరోనా నిరోధం కోసం లాక్‌డౌన్‌ పెట్టినపుడు రెక్కాడితే తప్ప డొక్కాడని వలస కార్మికులు స్వస్ధలాలకు వెళ్లేందుకు అయ్యే రైలు ఖర్చులను కేంద్రం – రాష్ట్రాలు ఎవరు భరించాలి అని వివాదపడిన అపర మానవతా వాదులను మనం తప్ప మరేదేశమూ చూడలేకపోయింది.

పది లక్షల కోట్ల రూపాయల పారుబాకీలను వేళ్ల మీద లెక్కించదగిన బడాబాబులకు రద్దు చేయటానికి ఉదారంగా నిర్ణయాలు చేసిన పాలకులకు వాక్సిన్లు వేయటానికి చేతులు రాలేదు. తాము స్వయంగా చెప్పిన ఉచితవాక్సిన్లు వేసేందుకు మధ్యలో ఠలాయించి సగం భారం రాష్ట్రాల మీద మోపేందుకు, చివరకు సుప్రీం కోర్టు వాక్సిన్ల పేరుతో కేటాయించిన సొమ్ముకు లెక్కలు చెప్పండని నిలదీస్తే తప్ప లొంగని నేతలు ఇప్పుడున్నారు. కరోనాను ప్రపంచ విపత్తుగా ప్రకటించారు. మనం దేశంలో విపత్తు సహాయ చట్టం ప్రకారం ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తారు. కరోనా జాతీయ విపత్తుగా పరిగణించినపుడు నష్టపరిహారం ఎందుకు ఇవ్వరు. ఎవరి జేబులో డబ్బు ఇస్తున్నారు ? ఎవరు ఎవరికి జవాబుదారులుగా ఉన్నారు, ఎవరు ఎవరిని రక్షిస్తున్నారు ? రెండు విడతలుగా ఇరవై ఆరులక్షల కోట్ల ఆత్మనిర్భర తాయిలాలను అందించిన కేంద్ర పెద్దలు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మూడు వాయిదాల కరువు భత్యం చెల్లింపునకు ఎసరు పెట్టారు. నీవు నేర్పిన విద్యయే అన్నట్లుగా రాష్ట్రాలు కూడా అదే బాటలో పయనిస్తాయా అన్నది చూడాల్సి ఉంది. అనేక దేశాలలో కరోనా సహాయ చర్యలకు గాను ప్రభుత్వాలు కార్పొరేట్ల మీద ప్రత్యేక పన్ను విధించి నిధులు సమకూర్చుకున్నారు. మన దేశంలో అలాంటిదేమీ లేకపోగా ఉద్యోగుల పొట్టగొట్టేందుకు పూనుకున్నారు. నిలిపివేసిన కరవు భత్యాన్ని వాయిదాల రూపంలో లేదా పిఎఫ్‌ ఖాతాలకు జమ చేస్తామన్నా అదొక దారి, ఎగ్గొట్టటం ఏమిటి ?
(రెండవ భాగంలో ముగింపు https://vedikaa.com/2021/08/09/india-independence-75-what-is-happening-part-two/ )

Share this:

  • Tweet
  • More
Like Loading...

జపాన్‌ మీద అణుబాంబు వేస్తామని చైనా బెదిరించిందా ? నిందలు-నిజాలేమిటి ?

07 Saturday Aug 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#Nuke Japan, China Threat, Taiwan Matters


ఎం కోటేశ్వరరావు


జూలై మూడవ వారంలో మన దేశంతో సహా ప్రపంచ మీడియాలో ఒక వార్త వచ్చింది. అదేమంటే జపాన్‌ మీద అణుబాంబులు వేస్తామని చైనా కమ్యూనిస్టు పార్టీ బెదిరించింది లేదా ప్రకటించింది. నిత్యం చైనాను రెచ్చగొట్టే దేశాలలో జపాన్‌ కూడా ఒకటి గనుక దానికి చైనా దిమ్మతిరిగే జవాబు ఇచ్చిందని ఎవరైనా కమ్యూనిస్టులు కూడా లోలోపల సంతోషించారేమో తెలియదు. వ్యతిరేకులు మాత్రం వెంటనే అందుకున్నారు. దీనిలో నిందలు- నిజాలేమిటి ? కౌపీన సంరక్షణార్ధం చివరికి ఒక సర్వసంగ పరిత్యాగి సంసార ఊబిలోకి దిగాల్సి వచ్చిందనే కథ తెలిసిందే కదా ! సదరు వార్తను పట్టుకొని గోతికాడ నక్కల్లా కూర్చున్న కొందరు అలాంటి కథలనే అల్లారు, వ్యాఖ్యానాలు చేశారు. వాటిలో చెప్పింది ఏమిటి ?


” అణ్వాయుధాలను తాముగా ముందు ఉపయోగించబోమని గతంలో ప్రకటించిన విధానానికి చైనా తిలోదకాలు ఇచ్చింది. ఇప్పుడు జపాన్ను బెదిరించింది కనుక యావత్‌ దేశాలకూ ముప్పు వచ్చింది. చైనా వారు 250 అణుబాంబులను భూగర్భంలో దాస్తున్నారు. వాటిని ప్రత్యర్ధులు పసిగట్టలేరు. కానీ అమెరికా కనుగొన్నది. ప్రత్యర్ధుల దాడికి దొరకవు. అందువలన ఆసియన్‌ దేశాలన్నీ అణ్వాయుధాలను సమకూర్చుకోవాలి.” ఇలాంటి వ్యాఖ్యానాలతో చైనా బెదిరింపుల గురించి సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రచారం జరుగుతోంది. ఈ కధనాలను ఆగస్టు ఆరవ తేదీన ఈనాడు పత్రికలో వ్యాసరచయిత కూడా తలకెత్తుకొని నేను సైతం అన్నట్లుగా ఒక రాయి వేశారు.


చైనా గురించి వచ్చిన వార్తలు, వ్యాఖ్యల్లో నిజమెంత, అసలేం జరుగుతోంది ? తైవాన్ను ఆక్రమించుకొనేందుకు చైనా ప్రయత్నించినపుడు దాన్ని అడ్డుకొనేందుకు జపాన్‌ ఒక సైనికుడు, ఒక నౌక, ఒక విమానాన్ని పంపినప్పటికీ అది లొంగిపోయేంతవరకు అణుబాంబులను ప్రయోగించాల్సిందే అని చైనా కమ్యూనిస్టు పార్టీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. చైనా ప్రధాన ప్రాంతానికి 130 కిలోమీటర్ల దూరంలో తైవాన్‌ దీవి ఉంది. అది చైనాలో తిరుగుబాటు రాష్ట్రం. దానికి ఒక వైపున దక్షిణ చైనా సముద్రం, రెండో వైపు తూర్పు చైనా సముద్రం ఉంది. మరోవైపున జపాన్‌ ఉంది. ఐక్యరాజ్యసమితి జాబితాలో తైవాన్‌ అనే దేశం లేదు. నిత్యం వివాద పడుతున్న అమెరికా, జపాన్‌ కూడా ఆ ప్రాంతం చైనాకు చెందినదే అని అంగీకరించాయన్న వాస్తవాన్ని ముందు తెలుసుకోవాలి. చైనా విప్లవ సమయంలో కమ్యూనిస్టులను ఎదిరించిన నాటి పాలకుడు చాంగ్‌కై షేక్‌ అప్పటి మిలిటరీ, ఆయుధాలను అన్నింటినీ తీసుకొని తైవాన్‌ దీవిలో కేంద్రీకరించాడు. అతగాడికి అమెరికా,బ్రిటన్‌,జపాన్‌ వంటి దేశాలన్నీ ఆయుధాలు అందించి పటిష్టపరిచాయి. కమ్యూనిస్టులు తైవాన్‌ దీవి మీద తమ బలాన్నంతటినీ కేంద్రీకరించటం కంటే మిగతా దేశంలో ఎదురవుతున్న ప్రతిఘటనను అణచివేయటమే ముఖ్యం, తరువాత తైవాన్‌ సంగతి చూద్దాం లెమ్మని అనుకున్నారు. మావో నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ తన అధికారాన్ని స్ధిరపరచుకొనేందుకు పది సంవత్సరాల పట్టింది. ఈలోగా తైవాన్‌లోని మిలిటరీని మరింత పటిష్టపరిచారు.

1970వరకు అంటే రెండు దశాబ్దాల పాటు తైవాన్‌ ప్రభుత్వాన్నే అసలైన చైనాగా ఐక్యరాజ్యసమితిలో గుర్తించటం, అధికారిక సంబంధాలు పెట్టుకోవటం వంటి పరిణామాలు జరిగాయి. ఈ నేపధ్యంలో సైనిక చర్య కంటే శాంతియుత విలీనానికే ప్రాధాన్యత ఇవ్వాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. తరువాత రెండు చైనాలు అనేవి లేవు, ఉన్నది ఒకటే, అది కమ్యూనిస్టుల నాయకత్వంలో ఉన్న ప్రధాన ప్రాంతంలోనిదే అసలైన చైనా అని, తైవాన్‌ దానిలో అంతర్భాగమే అని ఐరాస గుర్తించింది. కానీ విలీనానికి తగిన పరిస్ధితులు లేవు, తైవానీయుల్లో అనుమానాలు ఉన్నాయి, అవి తొలగిన తరువాతే విలీనం జరగాలి అంటూ అమెరికా నాయకత్వంలోని దేశాలు అప్పటి నుంచి నేటికీ విలీనానికి అడ్డుపడుతున్నాయి.


జపాన్ను బెదిరించిందంటూ పేర్కొంటున్న ఆ వీడియో కథేమిటి ? మిలిటరీ వ్యవహారాలను పరిశీలించే కొందరు వ్యాఖ్యాతలు సిక్స్‌ ఆర్మీ స్ట్రాటజీస్‌ పేరుతో నడుపుతున్న ఇంటర్నెట్‌ ఛానెల్లో సదరు వీడియోను ప్రసారం చేశారు. దాన్ని గ్జి గువా (యు ట్యూబ్‌ వంటిది)లో పెట్టారు. సదరు ఛానల్‌తో కమ్యూనిస్టు పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అవసరం అయితే అణుబాంబులు వేయాలి అన్న వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ వీడియోను తొలగించాలని చైనా ప్రభుత్వం సలహా ఇచ్చి ఉండవచ్చు లేదా ఛానల్‌ స్వయం నిర్ణయంతోగానీ దాన్ని తొలగించారు. అయితే అప్పటికే దానిని లక్షలాది మంది షేర్‌ చేశారు. స్ధానిక కమ్యూనిస్టు పార్టీ శాఖలు నిర్వహించే సామాజిక మాధ్యమ ఛానళ్లు వాటిలో ఉన్నాయి. వాటిని కూడా తరువాత తొలగించారు. ప్రపంచ మీడియాలో వార్తలకు కారణమైన సదరు వీడియో బావోజీ అనే పట్టణంలోని కమ్యూనిస్టు పార్టీ ఛానల్‌లో అలాగే ఉంది. దాన్ని చూపి అమెరికాలో స్ధిరపడిన చైనా జాతీయురాలు ఒకామె జపాన్ను కమ్యూనిస్టు పార్టీ బెదిరించింది అంటూ ట్వీట్లు చేశారు, దానిలో ఉన్న వ్యాఖ్యానాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. వాటిని ఆధారం చేసుకొని మీడియాలో కథలు రాశారు. తరువాత దాన్నుంచి కూడా తొలగించారు.


దేశ విధానం, ప్రభుత్వాలతో, అధికార పార్టీలతో నిమిత్తం లేకుండా ఇలాంటి అనధికార వ్యక్తులు, వారి వ్యాఖ్యలతో కూడిన వీడియోల ప్రచారాన్ని పార్టీలు, ప్రభుత్వాలకు అంటగట్టటం రాళ్లు వేసే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. ఇక్కడ మౌలిక సమస్య ఆ వీడియో ఇప్పుడు ఎందుకు వచ్చింది ? ప్రధాన భూభాగంతో తైవాన్‌ విలీనానికి చైనా చేసే యత్నాలు తమ అస్తిత్వానికే ముప్పు అంటూ జూలై రెండవ వారంలో విడుదల చేసిన జపాన్‌ మిలిటరీ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. గడచిన ఐదు దశాబ్దాల్లో జపాన్‌ వైపు నుంచి ఇలాంటి పదజాలంతో ఆరోపణలు లేదా నివేదికలు లేవు, ఇదే తొలిసారి. ప్రస్తుతం అమల్లో ఉన్న జపాన్‌ రాజ్యాంగం ప్రకారం ఆత్మరక్షణకు అవసరమైతే యుద్దానికి దిగేందుకు అనుమతి ఉంది. అందుకే జాగ్రత్తగా అస్తిత్వం అనే పదాలను వినియోగించారు.దీని ప్రకారం చైనా మిలిటరీ గనుక తైవాన్‌ విలీనానికి పూనుకుంటే అది తమ ఉనికికే ముప్పు గనుక యుద్ధానికి దిగి అమెరికా దళాలతో కలసి జపాన్‌ ప్రతిఘటిస్తుందని జపాన్‌ ఉపప్రధాని తారో అసో ప్రకటించారు. అదే చేస్తే జపాన్‌ మిలిటరీని నాశనం చేస్తామని చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌లో వ్యాఖ్యాతలు పేర్కొన్నారు తప్ప అణుదాడి చేస్తామని ఎక్కడా చెప్పలేదు. చైనా 1964లో అణుబాంబును రూపొందించింది. ఆత్మరక్షణకు ప్రత్యర్ధులు ఉపయోగిస్తే తప్ప తాముగా ముందు వాటిని ప్రయోగించబోమని ప్రకటించింది. జపాన్‌ విషయంలో ఆ విధానాన్ని పాటించాల్సిన అవసరం లేదని సిక్స్‌ ఆర్మీ స్ట్రాటజీస్‌ వీడియో సలహా యిచ్చింది.


జపాన్‌ మీద చైనాలో అంత ఆగ్రహం ఎందుకు ఉంది ? ఎవరినుంచి ఎవరికి ముప్పు ఉంది? ఆసియాలో మిలిటరీ శక్తిగా ఎదిగిన జపాన్‌ ఆక్రమించిన దేశాలలో చైనా కూడా ఒకటి. దానికి వ్యతిరేకంగా జరిపిన పోరాటాలు తెలిసినవే. అందుకే జపాన్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను పెద్ద సంఖ్యలో నెటిజన్లు బలపరిచారు. జపాన్‌ దేశం దీవుల సముదాయం. ప్రధాన దీవుల ప్రాంతం నుంచి ఒకినావా అనే దీవి 640కిలోమీటర్లు, (అదే టోకియో నగరానికి 1,550 కిలోమీటర్లు,) అక్కడి నుంచి తైవాన్‌ 500కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనా సముద్రతీర ప్రాంతం ఏడు వందల కిలోమీటర్లలో ఉంది. జపాన్‌ మొత్తంలో ఎన్ని అమెరికా నౌకా స్దావరాలు ఉన్నాయో వాటిలో 62శాతం అంటే 28 ఈ దీవిలోనే ఉన్నాయి. అక్కడ పన్నెండు వందల అణ్వాయుధాలు, యాభైవేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఎందుకటా ? అక్కడికి పన్నెండువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూయార్క్‌, ఇతర అమెరికా ప్రాంతాల భద్రత కోసం ఇక్కడ తిష్టవేయాలని అమెరికా చెబుతోంది. అందుకు జపాన్‌ అంగీకరించింది. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి ఎక్కడుందో చూద్దామని అని చెప్పినట్లుగా లేదూ !


సదరు వీడియోలో ఉన్నదేమిటి ? ” మనం తైవాన్ను విముక్తి చేసినపుడు ఒక వేళ జపాన్‌ బలంతో జోక్యం చేసుకుంటే, అది ఒక సైనికుడిని, ఒక విమానాన్ని, ఒక నౌకను మాత్రమే దించినా మనం ప్రతిదాడికి దిగటమే కాదు, పూర్తి స్ధాయి యుద్దానికి పూనుకోవాలి. తొలిసారిగా మనం అణుబాంబులను వినియోగించాలి. బేషరతుగా లొంగిపోతున్నట్లు రెండవ సారి జపాన్‌ ప్రకటించే వరకు అణుబాంబులను వినియోగిస్తూనే ఉండాలి.(రెండవ ప్రపంచ యుద్దంలో తొలిసారిగా బేషరతుగా లొంగిపోతున్నట్లు బ్రిటన్‌,చైనాలతో జపాన్‌ ఒప్పందం చేసుకుంది) జపాన్‌ యుద్ద సామర్ధ్యం పూర్తిగా కోల్పోయేవరకు మన లక్ష్యం ఉండాలని మేము చెబుతున్నాము.ఇంకే మాత్రం యుద్ద మూల్యం చెల్లించలేమని జపాన్‌ గుర్తించినపుడే తైవాన్‌కు దూకుడుగా అది సైన్యాన్ని పంపేందుకు సాహసించదు.


ఇప్పుడు అంతర్జాతీయ పరిస్ధితి నాటకీయంగా మారిపోయింది.ప్రస్తుతం మన దేశం ఒక శతాబ్ది కాలంలో ఎన్నడూ చూడని విధంగా ఒక ప్రధాన పరివర్తన మధ్యలో ఉంది. అన్ని రాజకీయ విధానాలు, ఎత్తుగడలు, వ్యూహాలను దానికి అనుగుణ్యంగా సర్దుబాటు చేసుకోవాలి, పరివర్తనకు అనుగుణ్యంగా మార్చుకోవాలి. అణువిధానాన్ని కూడా పరిమిత సర్దుబాట్లకు వీలుగా మార్చాల్సి ఉంది. జపాన్‌ మినహాయింపు అనే సిద్దాంతాన్ని ఒక నిష్టగా మనం ముందుకు తీసుకుపోవాలి. అణ్వాయుధాలను తొలి సారిగా ఉపయోగించకూడదు అనే విధానానికి జపాన్‌ మినహాయింపు అని సూచించాలి. మనం జపాన్‌కు హెచ్చరిక చేస్తున్నాం, ప్రపంచానికి తెలియచేస్తున్నాం. అదేమంటే ప్రధాన భూభాగంతో తైవాన్‌ విలీనంతో సహా జపాన్‌ మిలిటరీ పద్దతుల్లో మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే జపాన్‌కు వ్యతిరేకంగా అణ్వాయుధాలను ఉపయోగించాలి. బేషరతుగా లొంగిపోయేంతవరకు వాటిని వినియోగిస్తూనే ఉండాలి.


జపాన్‌ గనుక మూడోసారి చైనాతో యుద్దానికి దిగితే చైనా జనం పాత, కొత్తల బదులు తీర్చుకోవాలి. వారితో శాంతి చర్చలు వద్దు. దియాయు,రియుకు దీవులను (ఒకినావా పరిసరాల్లో ఉన్న దీవులు) తిరిగి స్వాధీనం చేసుకుందాం ” అనే వ్యాఖ్యానం ఆ వీడియోలో ఉంది.
జపాన్‌ మిలిటరీ నివేదికను వెలువరించక ముందే తైవాన్‌ గురించి జపాన్‌ రెచ్చగొడుతున్నది. జూన్‌ 24న రక్షణ మంత్రి నోబు కిషి మాట్లాడుతూ తైవాన్‌ భద్రతకు జపాన్‌కు ప్రత్యక్ష సంబంధం ఉంది అన్నాడు. చైనా ఒకటే అనే విధానం అనుసరించాలంటే అది కాలపరీక్షకు నిలబడుతుందా ? అది సరైనదేనా, నాకు తెలియదు అని జపాన్‌ ఉపరక్షణ మంత్రి యుషిహైడ్‌ నకయామా అన్నాడు. అధికారికంగా జపాన్‌ వైఖరిలో మార్పు లేనప్పటికీ దానికి కట్టుబడి ఉండాల్సిన అగత్యం లేదని పరోక్షంగా చెప్పటం, తైవాన్‌ సమస్యను తురుపుముక్కగా ఉపయోగించుకొనే యత్నమే. తైవాన్‌ వేరు కాదు, చైనాలో అంతర్భాగమే అని గుర్తిస్తూనే దానికి ఆయుధాలు అందిస్తున్న అమెరికా బాటలోనే జపాన్‌ కూడా నడుస్తున్నది. చైనాాజపాన్‌ సాధారణ సంబంధాలు నెలకొల్పుకొని ఐదు దశాబ్దాలు గడచింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, జపాన్‌ ప్రధాని సుగా విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో తొలిసారిగా తైవాన్‌ సమస్యను ప్రస్తావించారు. ప్రస్తుతం జపాన్‌ రాజ్యాంగం ప్రకారం జపాన్‌ నేరుగా చైనా మీద యుద్దానికి దిగకపోయినా తన గడ్డపై ఉన్న అమెరికా స్దావరాలకు అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందించగలదు. ఒక వేళ నేరుగా యుద్దంలోకి దిగితే చైనా చేతిలో చావు దెబ్బలు తింటుంది.


చైనా వీడియో ప్రయివేటు వ్యవహారం గనుకనే జపాన్‌ అధికారికంగా స్పందించలేదు. దాని రక్షణకు హామీ ఇచ్చిన అమెరికా వైపు నుంచి కూడా వ్యాఖ్యలేమీ లేవు. మరి మీడియా వార్తలు ఏమిటి అంటే, స్పందన ఎలా ఉంటుందో తెలుసుకొనేందుకు అమెరికా, జపాన్‌ ప్రచారదాడిలో భాగంగా వెలువడిన కట్టుకధలు మాత్రమే.ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్దంలో బైడెన్‌ కొత్తగా చేరినా అమెరికన్లు నెగ్గే సూచనలు కనుచూపు మేరలో లేవు. ఏదో విధంగా చైనాతో గిల్లి కజ్జా పెట్టుకోవాలంటే దక్షిణ చైనా సముద్రం, తైవాన్‌, హాంకాంగ్‌ సాకులు ఉన్నాయి. జపాన్‌, ఆస్ట్రేలియాలు అన్ని విషయాల్లో, కొంత మేరకు మన దేశం అమెరికాతో యుగళగీతాలు పాడుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా కోసం మనం చైనాను రెచ్చగొట్టటం అవసరమా ?

05 Thursday Aug 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China, Diplomacy Matters, INDIA, Joe Biden, Narendra Modi, US Tibetan Policy


ఎం కోటేశ్వరరావు


చైనాతో సరిహద్దు వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవటం మినహా మరొక మార్గం లేదని తేలిపోయింది. ఎవరెన్ని మాటలు మాట్లాడినా, ఎంతగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా గాల్వన్‌ ఉదంతం తరువాత రెండు దేశాల మధ్య మరో ఘర్షణకు తావు లేకుండా ఇప్పటి వరకు 12 దఫాల చర్చలు జరపటమే అందుకు నిదర్శనం. పరస్పరం విశ్వాసం కుదిరి రెండు వైపులా మోహరించిన సేనల ఉపసంహరణ జరిగేందుకు ఎంతకాలం పడుతుందో తెలియదు. చర్చలు ఒకవైపు జరుపుతూనే మరోవైపు ఉభయ దేశాలూ సరిహద్దు వెంట బలాలను మోహరిస్తున్నాయి. ఎవరు ముందు, ఎవరు వెనుక అన్నది పక్కన పెడితే ఎవరి సైనికులను వారు ఉత్సాహపరిచేందుకు లేదా నైతికంగా మద్దతు ప్రకటించేందుకు ఉభయ దేశాల నేతలు సరిహద్దు సందర్శనలు చేశారు. ఎవరి జాగ్రత్త వారు పడాలనటంలో ఎలాంటి పేచీ లేదు. పరస్పరం అనుమానాలను పెంచినప్పటికీ ఈ చర్యలు తప్పదు. యుద్దం జరిగే అవకాశాలేమీ లేవు, అందుకు ఎవరూ సిద్దంగా లేరు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ గత నెలాఖరులో మన దేశ సందర్శనకు వచ్చారు. రావటాన్ని తప్పు పట్టనవసరం లేదు, వచ్చి ఏం చేశాడనేదే సమస్య.


ఈ సమావేశాల తరువాత ఢిల్లీలోని టిబెట్‌ హౌస్‌ డైరెక్టర్‌ గెషె డోర్జీ డామడుల్‌ వివిధ మీడియా సంస్ధల ప్రతినిధులతో మాట్లాడాడు.గెషె గతంలో దలైలామాకు దుబాసీగా వ్యవహరించాడు. పౌర సమాజంతో కలయిక పేరుతో జరిగిన సమావేశంలో అమెరికా మంత్రి బ్లింకెన్‌ పాల్గొన్నాడు.ఈ సందర్భంగా దలైలామా ప్రతినిధి, టిబెట్‌ తిరుగుబాటు ప్రభుత్వంలో కీలక వ్యక్తి అయిన గోడుప్‌ డోంగ్‌ చంగ్‌లతో ప్రత్యేకంగా భేటీ అయ్యాడు. చైనా విస్తరణ వ్యూహాన్ని అమెరికా, భారత్‌ ఐక్యంగా దెబ్బతీయాలని,ప్రపంచ శాంతికి చైనా శత్రువు అని టిబెట్‌ హౌస్‌ డైరెక్టర్‌ గెషె ఆరోపించాడు. టిబెట్‌కు అమెరికా మద్దతు ఇవ్వటం చైనా కమ్యూనిస్టు పార్టీని నిలువరించేందుకే అని ప్రపంచానికి బలమైన సందేశం ఇవ్వటమే అని కూడా అన్నాడు.ప్రపంచంలో ప్రజాస్వామ్య సూత్రాలు, చట్టాలు, నాగరికతను చైనా నాశనం చేస్తున్నదని, టిబెట్‌కు ఏం జరిగిందో ప్రపంచానికి అదే జరుగుతుందని ఆరోపించాడు.


పాక్‌ ఆక్రమిత కాశ్మీరులో జరిపిన ఎన్నికలు, తాలిబాన్ల ప్రతినిధులు చైనా సందర్శన, చైనా-పాక్‌ అర్ధిక నడవా గురించి మన దేశం స్పందించింది. ఆక్రమించిన ప్రాంతాలన్నింటి నుంచి పాక్‌ వైదొలగాలని మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్జీ డిమాండ్‌ చేశారు. ఆక్రమిత ప్రాంతంలో ఎన్నికలు మసిపూసి మారేడు కాయ చేయటం తప్ప మరొకటి కాదు, చట్టవిరుద్దం అన్నారు. దీని గురించి తీవ్ర నిరసన తెలిపామన్నారు. ఆ ఎన్నికలను స్ధానికులు నిరసించి తిరస్కరించారన్నారు. చైనా-పాక్‌ ఆర్ధిక నడవా అక్రమంగా పాకిస్తాన్‌ ఆక్రమించిన మన ప్రాంతం నుంచి పోతున్నదని చెప్పారు. ఆక్రమిత ప్రాంతాలలో యథాతధ స్దితిలో మార్పు చేయటాన్ని అంగీకరించబోమన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ మన దేశాన్ని సందర్శించిన సమయంలోనే తాలిబాన్ల ప్రతినిధులు బీజింగ్‌లో చైనా విదేశాంగ అధికారులను కలిశారు. తమ గడ్డను మరో దేశానికి వ్యతిరేకంగా వినియోగించుకొనేందుకు అంగీకరించేది లేదని వారు అంతకు ముందే ప్రకటించారు. ఏకపక్షంగా మరో దేశం ఆప్ఘనిస్తాన్‌ మీద తమ వాంఛలను రుద్దటాన్ని భారత్‌ అంగీకరించదని, అలాంటి చర్య అక్కడ స్ధిరత్వాన్ని, చట్టబద్దతను కల్పించదని మన ప్రతినిధి అరిందమ్‌ అన్నారు. గత రెండు దశాబ్దాలుగా సాధించిన విజయాలను పరిరక్షించాలని చెప్పారు.


టిబెట్‌ లేదా చైనా విషయంలో భారత్‌ చేయాల్సినంతగా చేయటం లేదని,తన ప్రయోజనాలను సాధించుకొనేందుకు టిబెట్‌ సమస్యను భారత్‌ ఉపయోగించుకోరాదని మన దేశంలోని టిబెట్‌ తిరుగుబాటు ప్రభుత్వ నూతన అధ్యక్షుడు పెంపా సెరింగ్‌ అన్నారు. మే నెలలో తాను ఎన్నికైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. దౌత్య, రాజకీయ అవసరాల కోసం టిబెట్‌ను ఉపయోగించుకోరాదని ఇప్పుడు భారత్‌ గుర్తిస్తున్నదని, ఇప్పటి వరకు అదే చేశారని, దానికి బదులు సమస్యను పరిష్కరించేందుకు పూనుకోవాలన్నాడు.అసలు భారత్‌ – చైనా మధ్య సరిహద్దే లేదని అది టిబెట్‌ -భారత్‌ మధ్య సరిహద్దు అన్నాడు. ఆ రీత్యా చైనాకు భూమి దక్కదన్నాడు. దీర్ఘకాలంగా భారత దేశం చైనా పట్ల సానుకూలంగా ఉందని, అయితే భారతీయుల మనోభావాలను చైనా గాయపరచిందన్నాడు. సెరింగ్‌ కర్ణాటకలోని టిటెట్‌ శరణార్దుల శిబిరం బయలకుప్పెలో జన్మించాడు.


తాలిబాన్ల చేతుల్లో చావు దెబ్బలు తినటం లేదా వారిని అణచివేయటంలో వైఫల్యంతో అమెరికా, దాని మిత్రపక్షాలు వారికి ఒక సలాంగొట్టి తమ మిలిటరీని ఉపసంహరించుకొనేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చిందన్నట్లుగా వారిద్దరూ బాగానే ఉన్నారు, మనకు సమస్యను తెచ్చిపెట్టారు. తాము తప్పుకుంటూ తాలిబాన్లతో పోరాడే బాధ్యతను మనకు అంట గట్టేందుకు అమెరికా తెలివిగా పావులు కదిపింది. ఇప్పటికీ వదలటం లేదు. నరేంద్రమోడీని ”దేశపిత ” అని కీర్తిస్తూ మనలను మునగ చెట్టు ఎక్కించటంలో గతంలో ట్రంప్‌ ఏమి చేశాడో ఇప్పుడు బైడెన్‌ కూడా అదే బాటలో ఉన్నాడు. లేకపోతే ఢిల్లీ వచ్చిన బ్లింకెన్‌ ఆఫ్ఘనిస్తాన్‌ స్ధిరత్వానికి, అభివృద్దికి భారత్‌ ఎంతో చేయాల్సి ఉంది, కొనసాగిస్తుంది అని చెప్పడు. ఆ సమస్య మనలను వదిలేట్లు లేదు. నరేంద్రమోడీ అమెరికా తలనొప్పిని తగిలించుకుంటారా, లేదా, ఏం జరగనుందో తెలియదు.


అమెరికా ఖాళీ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ స్ధానాన్ని చైనా ఆక్రమించుకుంటుందనే వార్తలను వండి వారుస్తున్నారు.చైనాను భూతంగా చూపి మన దేశాన్ని ఇరికించే ఎత్తుగడ దీనివెనుక ఉందన్నది స్పష్టం. అక్కడ అధికారంలో ఎవరు ఉండాలనేది తేల్చుకోవాల్సింది అదేశ వాసులే. తాలిబాన్లే అధికారాన్ని పొందినా లేదా మిలిటరీ పైచేయి సాధించి వారిని అణచివేసి ఇప్పుడున్న ప్రభుత్వమే కొనసాగినా తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇతర దేశాలు దౌత్య సంబంధాలను కొనసాగించాల్సి ఉంటుంది. అక్కడ స్ధిరత్వం ముఖ్యం. మిగతా అంశాలు తరువాత. ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లాలని ఎవరు కోరారు, ఇప్పుడు ఖాళీ చేయాలని ఎవరు చెప్పారు ? అమెరికా అనుభవం చూసిన తరువాత ఎవరైనా అక్కడ అడుగుపెట్టి చేతులు కాల్చుకుంటారా ? ఒకటి స్పష్టం ఆక్కడ స్ధిరత్వం ఉండటం సరిహద్దు బంధం లేని మన దేశానికి ఎంత అవసరమో బంధం ఉన్న చైనాకూ అంతకంటే ఎక్కువే ఉంది. ఇప్పటి వరకు మనకు పాకిస్తాన్‌ ద్వారా తాలిబాన్లు దిగుమతి అయితే చైనాకు నేరుగా వెళ్లారు, చైనా తాలిబాన్లకు తమ గడ్డమీద ఆశ్రయం కల్పించారు.


అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకన్‌ మన దేశంలో దలైలామా ప్రతినిధులను కలవటాన్ని చైనా వ్యతిరేకించింది. టిబెట్‌ ప్రాంతం చైనా అంతర్భాగమే అని గుర్తించిన అమెరికా విధానానికి ఇది వ్యతిరేకమని, దలైలామా కోరుతున్న స్వాతంత్య్రాన్ని అంగీకరించరాదని, చైనా నుంచి వేరు చేసే చర్యలను సమర్ధించరాదని వ్యాఖ్యానించింది. టిబెట్‌ సమస్యల పేరుతో తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేసింది. తైవాన్‌, టిబెట్‌, హాంకాంగ్‌తో సహా చైనాలో అంతర్భాగమే అని అధికారికంగా అమెరికా గుర్తిస్తున్నది. అయితే ఏదో ఒకసాకుతో వాటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నది. భౌగోళికంగా టిబెట్‌ ప్రధాన ప్రాంతానికి దూరంగా ఉండటం, చైనా పాలకులకు సామంత రాజ్యంగా ఉంది తప్ప చరిత్రలో స్వతంత్ర దేశంగా లేదు. అయితే బ్రిటన్‌, నేపాల్‌, మంగోలియాలు అక్కడ దౌత్య కార్యాలయాల ఏర్పాటు, కొన్ని ఒప్పందాలు చేసుకోవటం, వాటిని గుర్తించకపోవటం వంటి అంశాలన్నీ చరిత్రలో ఉన్నాయి. వాటికి ఎవరికి తోచిన, అవసరమైన భాష్యాన్ని వారు చెబుతున్నారు. టిబెట్‌ సామంత పాలకులు బ్రిటీష్‌ వారితో చేసుకున్న ఒప్పందాన్ని చైనా గుర్తించలేదు.

1910లో నాటి చైనా పాలకులు(కమ్యూనిస్టులు కాదు) దలైలామా తిరుగుబాటును అణచేందుకు సైన్యాన్ని పంపారు. నాటి దలైలామా పారిపోయి మన దేశం వచ్చి మూడు సంవత్సరాలు ఇక్కడే ఉండి తిరిగి టిబెట్‌ వెళ్లాడు. మనకు స్వాతంత్య్రం వచ్చే నాటికి అక్కడ ఉన్న బ్రిటీష్‌ వారి దౌత్య కార్యాలయం భారత కార్యాలయంగా మారింది. కమ్యూనిస్టులకు ముందు చాంగ్‌కై షేక్‌ అధికారంలో ఉన్నపుడు అమెరికా, బ్రిటన్‌ వంటి పశ్చిమ దేశాలన్నీ టిబెన్‌ను చైనా అంతర్భాగంగానే గుర్తించాయి. స్వాతంత్య్రం తరువాత మన ప్రభుత్వం మాత్రం స్వతంత్ర దేశమనే వైఖరితోనే వ్యవహరించింది. దాని కొనసాగింపుగానే 1959లో దలైలామా తిరుగుబాటుకు అమెరికా పన్నిన కుట్రలో మనమూ భాగస్వాములమై ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని సౌకర్యాలను కల్పించాము. తరువాత 1962లో యుద్దం, సరిహద్దు వివాద చరిత్ర తెలిసిందే. 1988లో ప్రధాని రాజీవ్‌ గాంధీ చైనా పర్యటన చేసిన సమయంలో టిబెట్‌ స్వయం ప్రతిపత్తి కలిగిన చైనా రాష్ట్రమనే దీర్ఘకాలిక వైఖరిని పునరుద్ఘాటిస్తున్నట్లు ప్రకటించి ఒక స్పష్టతను ఇచ్చారు.2003లో ఎన్‌డిఏ ప్రధాని అతల్‌ బిహారీ వాజపాయి ఈ మేరకు చైనాతో ఒక ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. రాజీవ్‌ గాంధీ తొలుత ప్రకటన చేసినప్పటికీ వాజపాయి మాత్రమే అధికారిక గుర్తింపు ఇచ్చారు. అదే సమయంలో టిబెట్‌ ప్రవాస ప్రభుత్వాన్ని కూడా మన గడ్డపై కొనసాగించారు. అదే ద్వంద్వ వైఖరి ఇప్పటికీ కొనసాగుతున్నది. టిబెట్‌ వ్యవహారాల్లో పరోక్షంగా మనం వేలుపెడుతూనే ఉన్నాం.

టిబెట్‌ తిరుగుబాటు దారులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాము.2014లో నరేంద్రమోడీ ప్రమాన స్వీకార ఉత్సవానికి టిబెట్‌ తిరుగుబాటు ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న టిబెన్‌-అమెరికన్‌ లోబ్‌ సాంగ్‌ సాంగేకి ఆహ్వానం పంపాము.2017లో అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేమా ఖండు ఒక ప్రకటన చేస్తూ తమ రాష్ట్రానికి టిబెట్‌తో తప్ప చైనాతో సరిహద్దు లేదని ప్రకటించాడు. తరువాత దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ పట్టణ పర్యటనకు వెళ్లాలన్న నిర్ణయాన్ని చైనా అభ్యంతర పెట్టింది.ప్రధాని నరేంద్రమోడీ 2018లో చైనాలో ఊహాన్‌ నగర సందర్శన తరువాత మన అధికారులు తిరుగుబాటు టిబెట్‌ ప్రభుత్వ కార్యక్రమాలకు, దలైలామా కార్యక్రమాలకు ఎవరూ హాజరు కాకూడదని మన విదేశాంగశాఖ ఆదేశాలు జారీ చేసింది. గాల్వన్‌ ఉదంతమైనా, అదే విధంగా సరిహద్దు సమస్య అయినా చైనాతో మన ప్రభుత్వం పరిష్కరించుకోవాల్సి ఉంది. చైనాకు వ్యతిరేకంగా తిరుగుబాటు టిబెటన్లతో ఏర్పాటు చేసిన అనధికార, కిరాయి స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌(ఎస్‌ఎఫ్‌ఎఫ్‌) వంటి చర్యలు చైనాను రెచ్చగొట్టేవే అన్నది స్పష్టం. ప్రవాస టిబెటన్‌ ప్రభుత్వం, దలైలామాలను మనం చైనాతో బేరసారాలకు వినియోగించుకోవటం, కీడెంచటం ప్రతికూల ఫలితాలకు దారి తీసిందని మన విదేశాంగశాఖ కార్యదర్శిగా పని చేసిన శ్యామ్‌ చరణ్‌ వ్యాఖ్యానించారు.

గత నెలాఖరులో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ తిరుగుబాటు టిబెటన్‌ ప్రతినిధులతో భేటీ కావటాన్ని మన గడ్డ మీద అనుమతించటం కూడా అలాంటిదే. అమెరికా కోసం మనం చైనాతో తగాదా తెచ్చుకోవాల్సిన అగత్యం ఏమిటి ? కావాలంటే అమెరికన్లు దలైలామాను తమ దేశానికి పిలిపించుకోవచ్చు. చైనా నుంచి టిబెట్‌ను విడదీయటం అమెరికా కాదు,దాని తాతలు దిగివచ్చినా జరిగేది కాదు.మనం సహకరిస్తే అది జరుగుతుందని ఎవరైనా అనుకుంటే వారు ఈ లోకానికి చెందిన వారు కాదు. కాశ్మీరులో కొంత భాగం మన ఆధీనంలో లేదు. టిబెట్‌ విషయంలో చైనాకు అలాంటి సమస్య లేదు. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లో భాగమే అని చెబుతున్నప్పటికీ దానికోసం సాయుధ చర్యకు పూనుకుంటామనే మాట చైనా వైపు నుంచి లేదు. టిబెట్‌ వ్యవహారంలో మనం ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్న కారణంగానే కాశ్మీరు విషయంలో చైనా కూడా అదే పద్దతిలో వ్యహరిస్తున్నది. చైనా పూర్తి మద్దతు లేకుండా ఎప్పటికైనా ఆక్రమిత కాశ్మీరును తిరిగి తెచ్చుకోవాలనుకొనే మన ప్రభుత్వం అనుసరించే ఎత్తుగడలు సరైనవేనా ? అంతిమంగా నష్టపోయేది ఎవరు అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చైనాను కాల్చేందుకు అమెరికా మన భుజాల మీద తుపాకి ఎక్కుపెడుతున్నది. మనమెందుకు దాన్ని మోయాలి ? కాశ్మీరు సమస్యను మరింత సంక్లిష్టం చేసుకోవాల్సిన అవసరం ఏముంది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ముస్లిం సంతుష్టీకరణ : ఆర్‌ఎస్‌ఎస్‌ టక్కు టమార, గజకర్ణ గోకర్ణ విన్యాసాలు !

01 Sunday Aug 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Hindu Fundamentalism, Hinduthwa, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


చరిత్ర అడక్కు చెప్పింది విను ! ఇది ఒక సినిమాలో మాట.పాకిస్తాన్‌ జాతిపితగా పరిగణించే మహమ్మదాలీ జిన్నాను పొగిడినందుకు 2005లో ఎల్‌కె అద్వానీ పార్టీ అధ్యక్ష పదవిని పోగొట్టుకున్నారు. ఆ వ్యాఖ్యలకు ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు వార్తలు వచ్చాయప్పుడు. కేంద్ర మంత్రిగా పని చేసిన జస్వంత సింగ్‌ రాసిన పుస్తకంలో జిన్నా గురించి చేసిన సానుకూల వ్యాఖ్యలకు గాను ఏకంగా పార్టీ నుంచే పంపేశారు. బిజెపి, అంతకు ముందు దాని పూర్వ రూపం జన సంఫ్‌ు చరిత్ర చూసినపుడు వారి పార్టీల గొప్పతనం కంటే తాము తప్ప ఇతర పార్టీలన్నీ ముస్లింలను సంతుష్టీకరించి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయన్న నిరంతర ప్రచారమే ఎక్కువగా ఉండేది. హిందువులు-ముస్లింల డిఎన్‌ఏ ఒకటే అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ జూలై నాలుగున వ్యాఖ్యానించారు. ఘజియాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కుదురులోని ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ సమావేశంలో ఉపన్యసించారు. దీని గురించి అనేక విమర్శలు, సమర్దనలూ వెలువడ్డాయి.భారత్‌లో ఇస్లాం ప్రమాదంలో పడిందని ఎవరూ భయవలయంలో చిక్కుకోవద్దని, మతం ఏదైనా భారతీయుల డిఎన్‌ఏ ఒకటే అని, అసలు హిందూ-ముస్లిం ఐక్యత అనేదే తప్పుదారి పట్టించే మాట అని భగవత్‌ చెప్పారు. తరువాత జూలై 21న గౌహతిలో ఒక పుస్తక ఆవిష్కరణ సభలో కూడా దాన్ని పునరుద్ఘాటించారు. భిన్నమైన మతాలలో ఉన్నప్పటికీ శతాబ్దాల తరబడి కలసి మెలసి ఉన్నారని, ఆహార అలవాట్లు, సంస్కృతి ఒకటే అని చెప్పారు. ఇంతవరకు అద్వానీ, జస్వంత్‌ ఉదంతాలు పునరావృతం కాలేదు. అయ్యే సూచనలు కూడా లేవు.


భగవత్‌ ప్రసంగం మీద వెల్లడైన, ఇంకా వెల్లడవుతున్న కొన్ని స్పందనల తీరు తెన్నులు చూద్దాం. ముస్లింలకు సన్నిహితం అయ్యేందుకు చేసిన సంతుష్టీకరణ వ్యవహారమిది అన్నది కొందరి అభిప్రాయం. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగా విరమించుకొనేందుకు మోహన్‌ భగవత్‌ తేదీని స్వయంగా ముందుకు జరిపారు అని మరుసటి రోజే మితవాద ప్రతీకగా ఉండే జర్నలిస్టు మధు కిష్వర్‌ ట్వీట్‌ చేశారు. ” హిందూ భావజాలాన్ని ప్రచారం చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్నదేమీ లేదు, వారు గాంధీ కంటే ఎక్కువ గాంధేయులుగా ఉన్నారు. స్వంత జనాలను, భావజాలాన్ని వారు రక్షించటం లేదు, వారు మంచి పిల్లలుగా కనిపించాలని కోరుకుంటున్నారు. వారికి మద్దతు ఇవ్వటానికి మేమేమీ ఆర్‌ఎస్‌ఎస్‌ నేపధ్యం నుంచి వచ్చిన వాళ్లం కాదు, కానీ హిందువులను రక్షించే చిత్తశుద్ది వారిలో లేదని తరువాత కనుగొన్నాం. వారి కంటే కాంగ్రెస్‌ ఎంతో నిజాయితీగా ఉంది.” అన్నారు. సిబిఐ తాత్కాలిక ఉన్నతాధికారిగా పనిచేసిన సంఘపరివార్‌కు చెందిన రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి ఎం నాగేశ్వరరావు గౌహతిలో భగవతి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. ” కేవలం జిన్నాను పొగిడినందుకే అద్వానీని అవమానకరంగా బిజెపి జాతీయ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఎంఆర్‌ఎం, సర్వధర్మ సంభవ్‌ లేదా సమాదరణ, ఒకే డిఎన్‌ఏ, రోటీ-బేటీ సంపర్క తదితరాల ప్రచారంతో హిందూ సమాజానికి అంత (అద్వానీ) కంటే పదిలక్షల రెట్ల హాని చేశారు.” అని ట్వీట్‌చేశారు.


వక్రీకరణలకు, తప్పుడు వార్తలకు పేరు మోసిన ఒపిఇండియా వెబ్‌ సైట్‌ రాసిన వ్యాసంలో డిఎన్‌ఏ వ్యాఖ్యలు ఆర్‌ఎస్‌ఎస్‌ గాంధియన్‌ బలహీనత (దోషం) అని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంతో గౌరవం పొందిన సంస్ధ. లౌకికవాదం అనే అబద్దం గురించి మేలుకున్న సామాన్య హిందువులను దూరం చేసుకొనే ప్రమాదాన్ని కొని తెచ్చుకొంటోంది అని హెచ్చరించారు. ”ఆర్‌ఎస్‌ఎస్‌ను స్ధాపించిన గురు గోల్వాల్కర్‌ దాన్ని ఒక హిందూ సంస్దగా ఏర్పాటు చేశారు తప్ప ముస్లింల కోసం కాదు. ముస్లింలు, క్రైస్తవులకు ఓటు హక్కు నిరాకరించాలని కూడా గోల్వాల్కర్‌ చెప్పారు. హిందువులు-ముస్లింలకు సంబంధం లేని ఆయన స్పష్టం చేశారు. ముస్లింల మీద ఇవన్నీ కొత్తగా వృద్ది చెందిన ఆలోచనలు ” అని నయా ఇండియా అనే పత్రికలో శంకర షరాన్‌ అనే జర్నలిస్టు పేర్కొన్నారు. ” భగవత్‌ ప్రతి ఒక్కరి సంరక్షకుడు కాదు. ఆయన తన డిఎన్‌ఏ గురించి ఎలా అయినా మాట్లాడవచ్చు. బహుశా ఆయన ఔరంగజేబు డిఎన్‌ఏ పంచుకొని ఉండవచ్చు, అది అందరి విషయంలో వాస్తవం కాదు ” అని ఘజియాబాద్‌లోని దర్శన దేవి దేవాలయ వివాదాస్పద పూజారి యతి నరసింహానంద సరస్వతి వ్యాఖ్యానించారు. ఇక విశ్వహిందూ పరిషత్‌ నేత సాధ్వి ప్రాచీ అయితే ” ఆవు మాంసాన్ని తినేవారెవరినీ ఎన్నడూ మనలో కనుగొనలేము” అన్నారు.


ఆర్‌ఎస్‌ఎస్‌ నేత భగవత్‌ మీద ధ్వజమెత్తిన వారే కాదు, భజన చేసిన వారు కూడా ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి పుస్తకాలు రాసిన రతన్‌ శారద ఆయన ఉపన్యాసంలో కొత్తగా చెప్పిన విషయాలేమీ లేవన్నారు. సుదర్శన్‌ గారు అధిపతిగా ఉన్న 2000-09లో కూడా హిందూాముస్లిం ఐక్యత గురించి చెప్పారు. అందుకోసమే ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ను ఏర్పాటు చేశారు.ఆహార అలవాట్లు, పూజా పద్దతులు వేర్వేరుగా ఉండవచ్చుగానీ ఏకీకరణ మీద అవి పెత్తనం చేయలేవు, మెజారిటీ, మైనారిటీ అనేవి లేవు. ప్రార్ధించే పద్దతిని బట్టి సమాజంలో వర్గీకరణ చేయటమే ముస్లింల సంతుష్టీకరణ, ఓటు బ్యాంకు రాజకీయాలకు కారణం, ఆర్‌ఎస్‌ఎస్‌ దాన్ని వ్యతిరేకిస్తున్నది ” అన్నారు. భగవత్‌ డిఎన్‌ఏ ఉపన్యాసంతో తలెత్తిన ఆగ్రహాన్ని చల్లార్చేందుకు సంఘీయులు ఊహించినట్లుగానే సాము గరిడీలు చేస్తున్నారు. గురూజీ హిందూత్వను వదులుకున్నట్లు ప్రకటించలేదు, దానికే కట్టుబడి ఉన్నారు, ఐక్యతను మాత్రమే కోరుకుంటున్నారు. విశ్వహిందూ పరిషత్‌, ఇతర హిందూ సంస్ధలు చేపట్టిన ఘర్‌వాపసీ కార్యక్రమాన్ని ఆయన ప్రోత్సహించిన అంశాన్ని గుర్తు తెచ్చుకోండి. గోవధ హిందూత్వ వ్యతిరేకం అని కూడా చెప్పారు. సంఫ్‌ు ఇంతకాలంగా చెబుతున్నదానిని-భగవత్‌ ప్రసంగాన్ని విడదీసి చూస్తే కొత్తగా చెప్పినట్లు అనిపించవచ్చు తప్ప కొత్తేమీ లేదు అంటూ మొత్తం మీద సంఫ్‌ు అజెండాలో ఎలాంటి మార్పూ లేదు కనుక ఎవరూ కంగారు పడనవసరం లేదనే భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.భగవత్‌ ప్రసంగాన్ని విమర్శించిన వారిని ఎక్కడా తప్పు పట్టటం లేదు. ఆయన మాట్లాడింది ముస్లింలు పాల్గొన్నసభ, ఐక్యతను కోరుకుంటున్నది, రెండు మతాల మధ్య ఒక చర్చను ప్రారంభించాలనే లక్ష్యంతో మాట్లాడినవిగా గుర్తించాలని ఓదార్పు పలుకుతున్నారు. భారతీయత గురించి మాట్లాడటం అంటే దాని అర్ధం ముస్లింలు, ఇతర మైనారిటీలను తిరిగి మతమార్పిడి చేస్తామని కాదు, వారు ఈ గడ్డను స్వంతంగా చేసుకొని, విధేయులై జీవించాలన్నదే అని ముస్లింలకు హామీ ఇస్తున్నారు.


అయితే ఇప్పుడెందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత డిఎన్‌ఏ, హిందూ ముస్లిం ఐక్యత అంశాన్ని మరోసారి ముందుకు తెచ్చారు. ఊరకరారు మహాత్ములు అన్నట్లుగా ఎలాంటి ఉద్దేశ్యం లేకుండానే అలా మాట్లాడతారా ? ప్రతి పార్టీ తనకంటూ ఒక ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకొనేందుకు ప్రయత్నించటం రాజకీయాల్లో సహజం. బిజెపి పత్తిత్తేం కాదు. మెజారిటీగా ఉన్న హిందూ మత ఓటు బ్యాంకును సృష్టించుకొనేందుకు దాని మాతృ సంస్ధ సంఘపరివార్‌ ఎంచుకున్న మార్గం వారి సంతుష్టీకరణ. హిందువుల ఉనికికే ప్రమాదం ముంచుకు వస్తోందని, కొద్ది కాలంలో ముస్లింలు మెజారిటీగా మారేందుకు ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారని ప్రచార యుద్దం చేస్తున్న విషయం తెలిసిందే. సాధ్వి ప్రాచీ ఎవరు ఎంత మంది భార్యలను అయినా కలిగి ఉండండి, పిల్లలు మాత్రం ఇద్దరి కంటే ఎక్కువగా ఉండకూడదని చెప్పారు. 1990దశకం చివరిలో వాజ్‌పాయి అధికారానికి వచ్చారు. అందువలన భవిష్యత్‌లో 14శాతంగా ఉన్న ముస్లిం ఓట్లను గంపగుత్తగా ప్రతిపక్షాలకు వేయించటం మంచిది కాదు గనుక వారి పట్ల రాగం, తానం, పల్లవి మార్చాలనే ఆలోచన సంఘపరివార్‌లో ప్రారంభమైంది. ఈ సమయంలోనే 2002 మార్చినెలలో జరిగిన గుజరాత్‌ మారణకాండ ముస్లింలలో మరింత భయాన్ని రేకెత్తించటమే కాదు, బిజెపికి పెద్ద మచ్చగా మారింది. అంతకు ముందు వరకు ఇతర పార్టీల మీద తాను పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ముస్లిం సంతుష్టీకరణకు తానూ నాంది పలికింది. అదే ఏడాది డిసెంబరులో ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ కొత్త దుకాణాన్ని తెరిచింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో అంతకు ముందు వచ్చిన ఓట్లు సీట్లను కూడా బిజెపి నిలుపుకోలేకపోయింది. ఎన్నికలకు మూడు నెలల ముందే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన భగవత్‌ అదే ఏడాది డిసెంబరులో తొలిసారిగా డిఎన్‌ఏ ప్రస్తావన చేశారు. ఆ సమయంలో బిజెపి, దాని అభిమానులు ఓటమి విషాదంలో ఉన్నారు గనుక పెద్దగా పట్టించుకోలేదనిపిస్తుంది.
ఇటీవలి కాలంలో అభిమానులు విశ్వగురువుగా కీర్తించే నరేంద్రమోడీ పరువు ప్రపంచ వ్యాపితంగా పోయింది. అసహనం, ఢిల్లీ దాడులు, రైతుల ఉద్యమం సందర్భంగా రోడ్లపై మేకులు కొట్టటాలు, టూల్‌కిట్‌ కేసులు, కరోనాను నిర్లక్ష్యంలో పేరుమోసిన ప్రపంచ నేతల్లో ఒకరిగా మోడీ పేరు చేరటం వంటి అనేక కారణాలు అంతర్జాతీయంగా, జాతీయంగా పలుకుబడిని మసకబార్చాయి. మోడీ ఉంటే ఆర్‌ఎస్‌ఎస్‌ పెత్తనం, ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు ఉంటేనే మోడీకి పదవి అన్నది స్పష్టం కనుక పరస్పరం రక్షించుకోవటంలో భాగంగా మోహన్‌ భగవత్‌ డిఎన్‌ఏ సుభాషితాలకు తెరతీశారన్నది కొందరి అభిప్రాయం.
అన్నింటి కంటే ముఖ్యమైనది ఆఫ్ఘనిస్తాన్‌ పరిణామాలు అన్నది మరో బలమైన అభిప్రాయం. సంపాదించే ఇంటి యజమాని కరోనాతో అనూహ్యంగా మరణిస్తే ఆ కుటుంబం ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో ఇప్పుడు నరేంద్రమోడీ అదే స్ధితిలో ఉన్నారు. రవి గాంచనిది అజిత్‌ దోవల్‌కు కనిపించింది. నాటకీయ పరిణామాల మధ్య ఫిబ్రవరిలో పాకిస్తాన్‌తో మన ప్రభుత్వం సయోధ్య కుదుర్చుకుంది. ఒకేసారి పాక్‌, చైనాలతో వైరుధ్యం కొనసాగించటం సాధ్యం కాదు కనుక ఈ ఏర్పాటు అని కొందరు చెబితే, తాలిబాన్ల సమస్య దానికి పురికొల్పిందన్న వారు మరికొందరు. ఏ ఉగ్రవాదం మీద పోరు సలుపుతామని మోడీ సర్కార్‌ అమెరికాతో కలసి భీకర ప్రతిజ్ఞలు చేసిందో, ఆ ఉగ్రవాద తాలిబాన్లతో తెరముందు -వెనుక మంతనాలు ప్రారంభించింది. అమెరికా ట్రంపు లేడు, తిరిగి వచ్చే అవకాశాలూ లేవు, జో బైడెన్‌తో ఇంకా కౌగిలింతలు ప్రారంభం కాలేదు. చైనాతో సయోధ్యగా ఉంటామని ఆ తాలిబాన్లు ఏకపక్షంగా ప్రకటించటమే కాదు బీజింగ్‌ వెళ్లి మరీ ఆ దేశ నేతలను కలసి వచ్చారు. ఈ నేపధ్యం కూడా దేశంలోని ముస్లింలను సంతుష్టీకరించాల్సిన అవసరం ఉందని సంఘపరివార్‌ ఆలోచించి ఉండవచ్చన్నది కొందరి అభిప్రాయం. ఈ దశలో దేన్నీ తోసిపుచ్చలేము.
2009 డిసెంబరు నాలుగున ఢిల్లీలోని బాబా సాహెబ్‌ ఆప్టే స్మారక సమితి దేశ విభజన గురించి ఒక జాతీయ గోష్టిని ఏర్పాటు చేసింది. దానిలో మోహన భగవత్‌ ఒక వక్త.దేశంలో నివసిస్తున్న వారందరూ హిందూ వారసులే, ఈ ప్రాంతంలోని వారందరి డిఎన్‌ఏ ఒకటే అని సైన్సు కూడా నిరూపించింది. మనం కోరుకుంటే జాతీయ ఐక్యత మరియు ఏకత్వాన్ని పునరుద్దరించవచ్చు, మనల్ని విడదీస్తున్న విబేధాలను తొలగించుకోవచ్చు అని భగవత్‌ చెప్పారు. సరే హిందూత్వ గురించి అంతకు ముందు నుంచీ చెబుతున్నవాటినే పునశ్చరణ చేశారు. ఆ గోష్టిలో పాల్గొన్నవారందరూ కాషాయ దళానికి చెందిన వారే. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ నివేదించినదాని ప్రకారం బిజెపి నేత విజయకుమార్‌ మల్హోత్ర చేసిన ప్రసంగం ఎలా ఉందో చూడండి.ఐక్యతా యత్నాలతో పాటు దేశంలో నేడున్న పరిస్దితిని కూడా చూడాలంటూ ” హిందువుల జనాభా 90 నుంచి 80శాతానికి తగ్గింది. ముస్లింలు 13శాతానికి పెరిగారు. దేశంలోని అనేక ప్రాంతాలలో ముస్లింలు అధికులుగా ఉన్నారు. జాతీయ సంపదల మీద తొలి హక్కు ముస్లింలకే ఉందని చివరికి ప్రధాని కూడా బహిరంగంగా చెబుతున్నారు. ఇది సిగ్గు చేటు. పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల్లోని ముస్లిం జనాభా ప్రస్తుతం దేశంలోని ముస్లింలను కలుపుకుంటే మొత్తం నలభైశాతానికి పెరుగుతారు, అప్పుడు హిందువుల పరిస్ధితి ఎలా ఉంటుందో సులభంగానే ఊహించుకోవచ్చు.” అన్నారు.
ఇటీవలి సంవత్సరాలలో గోవులను తరలిస్తున్నారనో, గో మాంసం తింటున్నారనే సాకుతోనో గోరక్షకుల పేరుతో ముస్లింలను వధించటం తెలిసిందే. మోహన్‌ భగవత్‌ తన ప్రసంగంలో గోవులను వధించటం హిందూత్వకు వ్యతిరేకం అన్నారు. ఇది ఎదురుదాడి, గోరక్షణలో వాటిని వధించేవారి కంటే రక్షించేవారే ఎక్కువ మంది మరణిస్తున్నారని పరివార్‌ ప్రచారం తెలిసిందే. ముస్లింలందరూ గోవులను వధించకపోయినా వధిస్తున్నవారందరూ ముస్లింలే అని మాట్లాడుతున్నారు. ముస్లింలందరూ ఉగ్రవాదులు కాకపోయినా ఉగ్రవాదులందరూ ముస్లింలే అనే ప్రచారం తెలిసిందే. ఉగ్రవాదం, చర్యలు ఇస్లామ్‌కు వ్యతిరేకం అని అనేక సంస్ధలు ప్రకటించాయి. ఇలాంటి మాటలను ఎవరు చెప్పినా తప్పు పట్టాల్సిన పని లేదు. ఆచరణ ఏమిటన్నదే ముఖ్యం.


తాము మారిపోయామని చెప్పుకొనేందుకు, బిజెపికి వ్యతిరేకతను తగ్గించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ పడుతున్న తంటాలు ఒకటి రెండు కాదు, టక్కు టమార గోకర్ణ గజకర్ణ విద్యలన్నింటినీ ప్రయోగిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతుల్లో ఎంఎస్‌ గోల్వాల్కర్‌కు ప్రత్యేక స్దానం ఉంది. రెండవ అధిపతిగా దీర్ఘకాలం ఉన్నారు. బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌(ఆలోచనల గుత్తి ) పేరుతో ఆయన హిందూత్వ గురించి రాసిన అంశాలు పరివార్‌కు ప్రామాణికాలుగా ఉన్నాయి. రెండవసారి నరేంద్రమోడీ సర్కార్‌ తిరిగి అధికారానికి వచ్చే అవకాశాల్లేవనే అభిప్రాయం సర్వత్రా వెల్లడి అవుతున్న తరుణంలో ఎన్నికలకు ఆరునెలల ముందు 2018 సెప్టెంబరులో విజ్ఞాన్‌ భవన్‌లో మూడు రోజుల పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ ఉపన్యాసాల కార్యక్రమం జరిగింది. చివరి రోజు ప్రశ్నోత్తరాల సమయంలో మారిన పరిస్ధితులకు అనుగుణ్యంగా లేని గోల్వాల్కర్‌ చెప్పిన అంశాలను కొన్నింటిని తిరస్కరిస్తున్నట్లు భగవత్‌ చెప్పారు. ఇదేదో అనాలోచితంగా చెబుతున్నది కాదు, కొన్ని సంవత్సరాలుగా సంఫ్‌ు అంతర్గత మధనంలో ఉన్నదే, ఇప్పుడు బయటికి చెబుతున్నా, అందరికీ తెలియాల్సిన సమయం అసన్నమైందన్నారు. కొన్ని సందర్భాలలో చెప్పిన మాటలు అప్పటికి తగినవి కావచ్చు, అవే శాశ్వతంగా ఉండవు, కాలాలతో బాటు ఆలోచనలు కూడా మారుతుంటాయి.మారేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్దాపకుడు డాక్టర్‌ హెడ్గెవార్‌ అనుమతి ఇచ్చారు అన్నారు. అదే భగవత్‌ ఏడాది తరువాత 2019 అక్టోబరు 2న ఒక పుస్తకాన్ని విడుదల చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌కు హెడ్గేవార్‌ ప్రవచించిన హిందూ రాష్ట్ర తప్ప ప్రత్యేక సిద్దాంతం, సిద్దాంతకర్తలంటూ ఎవరు లేరు అని చెప్పారు. గోల్వాల్కర్‌ రాసిన ఆలోచనల గుత్తి పుస్తకంతో సహా ఏదీ ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రతినిధి కాదు, హెడ్గెవార్‌ కూడా సంఘగురించి తనకు పూర్తిగా తెలుసని ఎప్పుడూ చెప్పలేదు, అర్ధం చేసుకోవటం ప్రారంభించానని మాత్రమే చెప్పారు అని భగవత్‌ చెప్పారు. అందువలన గోల్వాల్కర్‌నే కాదంటున్న వారు రేపు మరో అధిపతి వచ్చిన తరువాత డిఎన్‌ఏ సిద్దాంతం కూడా మారదని భగవత్‌తో సహా ఎవరూ చెప్పలేరు. హిందూ రాష్ట్రతప్ప ప్రతిదీ మారుతుంటుంది, దానికోసం దేనికైనా సిద్దపడతారు.


అసలు సంతుష్టీకరణ అన్నదానిని కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ విదేశాల నుంచి అరువు తెచ్చుకున్నదే అని చెప్పవచ్చు.జర్మన్‌ కార్మికులు కమ్యూనిస్టుల వైపు ఎక్కడ మొగ్గుతారో అనే భయంతో వారిని సంతుష్టీకరించేందుకు మొదటి ప్రపంచ యుద్దం తరువాత ” నేషనల్‌ సోషలిస్టు జర్మన్‌ వర్కర్స్‌ పార్టీ ”ని 1920లో ఏర్పాటు చేశారు.ఒక ఏడాది పాటు వేరే అతను అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ 1921నుంచి 1945వరకు హిట్లర్‌ అధిపతిగా ఉన్నాడు.మెజారిటీ జర్మన్లను యూదుల మీద రెచ్చగొట్టటం, కుహనా జాతీయవాదాన్ని ముందుకు తీసుకురావటం వంటి అంశాలన్నీ తెలిసినదే. మన దేశంలో యూదులు లేరు గనుక హిందూత్వ శక్తులు ముస్లింలను ఎంచుకున్నాయి. అందువలన ఆ విధానాలన్నీ విదేశీ హిట్లర్‌ నుంచి అరువు తెచ్చుకున్నారని అంటే ఎవరూ ఉడుక్కోనవసరం లేదు. దానికి కాంగ్రెస్‌ అనుసరించిన దివాలా కోరు విధానాలు అవి పెరగటానికి దోహదం చేశాయి. హిందువుల చట్టాల్లో జోక్యం, మార్పులు చేసిన మాదిరి ఇతర మతాల వారి విషయంలో జరగలేదని సంఘపరివార్‌ చేస్తున్న ప్రచారాన్ని షా బానో కేసులో సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్‌ ప్రభుత్వం వమ్ము చేయటం నిర్దారించింది. వివాదాస్పద బాబరీ మసీదు గేట్లను తెరిచేందుకు రాజీవ్‌ గాంధీ సర్కార్‌ తీసుకున్న నిర్ణయం మెజారిటీ హిందువులను సంతుష్టీకరించేందుకే అన్నది స్పష్టం.1989 ఎన్నికల ప్రచారాన్ని తొలుత నాగపూర్‌ నుంచి ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ వేదికను అయోధ-ఫైజాబాద్‌కు మార్చటం ఆ రాజకీయాల కొనసాగింపే అన్నది స్పష్టం. తొలుత మైనారిటీ సంతుష్టీకరణ తరువాత మెజారిటీ సంతుష్టీకరణకు పూనుకుంది. చివరికి రెండిటికీ చెడ్డ రేవడిలా మారటాన్ని చూశాము.


కాంగ్రెస్‌కు భిన్నంగా సంఘపరివార్‌-బిజెపి తొలుత మెజారిటీ సంతుష్టీకరణ-మైనారిటీ విద్వేషాన్ని రెచ్చగొట్టింది. అధికారం వచ్చాక దాన్ని నిలుపు కొనేందుకు ఇప్పుడు మైనారిటీ సంతుష్టీకరణకు పూనుకుంది.నిత్యం ముస్లింలు, ఇతర మైనారిటీల పట్ల విద్వేష ప్రసంగాలు, ప్రచారం చేసే వారందరూ ఆర్‌ఎస్‌ఎస్‌ అంశ నుంచి వచ్చిన వారు లేదా అది తయారు చేసిన ప్రచార వైరస్‌ బాధితులే. దేశం మొత్తాన్ని మెజారిటీ మతోన్మాద పులిని ఎక్కించేందుకు తీవ్ర ప్రయత్నం జరుగుతోంది. వామపక్షాలు మినహా రాజకీయంగా బిజెపిని వ్యతిరేకించే ఇతర పార్టీల వారు కూడా గణనీయంగా పులిని ఎక్కారు. చెవులు కొరుకుతారు తప్ప బహిరంగంగా చెప్పరు. ఈ నేపధ్యంలో భగవత్‌ వ్యాఖ్యలు చేశారు. భగవత్‌ వ్యాఖ్యలలో నిజాయితీ ఉందా ? రెండు మతాలవారూ కలసి మెలసి ఉండాలని, డిఎన్‌ఏ ఒకటే అని చెబుతున్నవారు ఆర్‌ఎస్‌ఎస్‌లో ముస్లింలకు చోటు, నాయకత్వంలో భాగస్వామ్యం కల్పించ కుండా ఇతర వేదికలను ఎందుకు ఏర్పాటు చేసినట్లు ? ఇంతకాలం తాము నిర్వహించిన విద్వేష ప్రచారానికి స్వస్తి పలుకుతామని, ఇంతకు ముందు చేసిన దానికి చెంపలు వేసుకుంటున్నామని చెప్పి ఉంటే కాస్తయినా విశ్వసనీయత ఉండేది ! అవేమీ లేవు. అందుకే టక్కు టమార విద్యలని అనాల్సి వస్తోంది, కాదంటారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మూడు దశాబ్దాల సంస్కరణలు : టీవీలు, సెల్‌ ఫోన్లు వచ్చాయి- ఉద్యోగాలు పోయాయి !

31 Saturday Jul 2021

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

India economy slowdown, India Reforms @ 30, India reforms matters, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


1991 సంస్కరణలకు ముందు తరువాత అంటూ కొంత మంది మనకు మహారంజుగా కథలు వినిపిస్తారు. నా చిన్నతనంలో పల్లెటూరిలో ఉన్న నాకు పక్కనే ఉన్న పట్టణంలో సినిమా చూసి వచ్చిన వారు వాటి కధ, నటీ నటుల గురించి చెబుతుంటే, కొన్న పాటల పుస్తకాలను గర్వంగా చూపుతుంటే మనదీ ఒక బతుకేనా ! ఛా మనకు ఆ ఛాన్స్‌ ఎప్పుడు వస్తుందో అన్నట్లు ఉండేది. ఆ రోజులు మారాయి, ఇప్పుడు సినిమాల స్ధానాన్ని సీరియళ్లు ఆక్రమించాయి. ఎంతకాలం సాగుతాయో తెలియదు. చూసినవారందరూ తరువాత ఏం జరుగుతుందో అన్న ఆందోళనతో చర్చలు జరుపుకుంటున్నారు. అందువలన కొత్త కథలు వినదగు నెవ్వరు చెప్పిన అన్నట్లుగా విందాం. వినినంతనే వేగపడక బుర్రలతో ఆలోచిద్దాం. ఆశల పల్లకి నుంచి దిగుదాం, నేల మీద నడుద్దాం !


మూడు దశాబ్దాల క్రితం ఉన్న జిడిపితో పోల్చితే ఇప్పుడు పది రెట్లు పెరిగింది అని లొట్టలు వేసుకుంటారు. కాదని ఎవరన్నారు. కొందరు చెప్పే అభివృద్ది ఆర్ధిక శాస్త్రం ప్రకారం మూడు దశలు ఉంటాయి. సేవారంగం మూడవ దశలో అగ్రస్ధానంలో ఉంటుంది. ఈ ప్రాతిపదికన అభివృద్ది చెందిన దేశాలలో దాని వాటా 70శాతంపైన (అమెరికాలో 80శాతం వరకు ఉంది), వర్ధమాన దేశాలలో 50శాతంపైగా ఉంటుంది. మనదేశంలో 1980దశకంలో సేవారంగం వాటా 38.6శాతం ఉంది. ఆరోజుల్లో ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి ట్రంకాల్‌ కలవటానికి పట్టే వ్యవధిలో వెళ్లి తిరిగి రావచ్చు అనే జోకులు పేలేవి. నిజమే మరి. 1991సంస్కరణల తరువాత ఆ దశకంలో సేవారంగం వాటా 44.3శాతానికి పెరిగింది. ఇప్పటి పరిస్ధితిని చూస్తే 2017లో చైనా సేవారంగం వాటా 52.2శాతం ఉండగా మనది 61.5శాతం ఉంది.దాని ప్రకారం మనం కేవలం మూడు సంవత్సరాలకే నరేంద్రమోడీ నాయకత్వాన చైనాను అధిగమించాం అని చెప్పినా మారు మాట్లాడకుండా అంగీకరించాల్సిందే. లేకపోతే దేశద్రోహి అని కేసులు పెడతారు లేదా మన ఫోన్లలో పెగాసెస్‌ వచ్చి కూర్చుంటుంది. 2020 సంవత్సరంలో సేవారంగం వాటా మన దగ్గర 53.89శాతానికి తగ్గింది. ఇదే చైనా వాటా 54.5 శాతం ఉంది. దీన్ని బట్టి మన దేశం తగ్గి చైనా పెరిగి ఇప్పుడు రెండు దేశాలూ అభివృద్దిలో సమంగా ఉన్నట్లా ? మన జిడిపిలో వ్యవసాయవాటా 20.19, పారిశ్రామికరంగం 25.92 కాగా ఇదే సమయంలో చైనా వాటాలు 7.7, 37.8శాతాల చొప్పున ఉన్నాయి.


మూడు దశాబ్దాల సంస్కరణలు దేశాన్ని ఎంతో ముందుకు తీసుకుపోయాయని, అందువలన ఇప్పుడు మరిన్ని సంస్కరణలు అమలు చేస్తే మరింత ముందుకు పోతామని, చైనాను అధిగమిస్తామని చెబుతున్నవారు మనకు ఎక్కడ చూసినా కనిపిస్తారు. అభివృద్దిలో ఎవరు ఎవరితో అయినా పోటీ పడాలి. స్వార్ధం బాగా పెరిగి పోయిన వర్తమానంలో అందరూ బాగుండాలి అందులో మనముండాలి అన్న మాట ఈ మధ్య కాలంలో బాగా ప్రచారం అవుతోంది.ఎదుటి వారి గురించి ఏడవటం మన భారతీయ సంస్కృతి కాదు, అయినా చైనా, పాకిస్దాన్‌ నాశనం కావాలి, వాటి స్దానంలో మనమే బాగు పడాలి అని సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసే, కోరుకొనే వారు కూడా ఉన్నారు. చైనా గురించి కమ్యూనిస్టులో లేదా ఆ దేశ అభిమానులో చెబితే అబ్బే అంతా ఉత్తిదే అనేవారి సంగతి తెలిసిందే. అందుకే ప్రపంచబ్యాంకు విడుదల చేసిన సమాచారాన్ని ఇక్కడ పరిశీలనకు తీసుకుందాం. ప్రతి పది సంవత్సరాలకు జిడిపి విలువ బిలియన్‌ డాలర్లలో, తలసరి జిడిపి డాలర్లలో ఏదేశంలో ఎలా పెరిగిందో దిగువ చూడవచ్చు.1990వ సంవత్సరం నుంచి వివరాలను తీసుకుందాం.
సంవత్సరం××× చైనా ××× భారత్‌ ××× చైనా ××× భారత్‌
1990 ×× 361 ×× 321 ××× 318 ××× 368
2000 ×× 1,211 ×× 468 ××× 959 ××× 449
2010 ×× 6,087 ×× 1,675 ××× 4,550 ×× 1,358
2019 ××14,280 ×× 2,869 ××× 10,217 ×× 2,100


సంస్కరణలు ఏ దేశంలో ఎంత మేరకు పురోగతి సాధించాయో, మన దేశ అభివృద్ది ఎక్కడ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎందుకు ఇంత తేడా ఉందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ కాలంలో చైనా జిడిపి 39.66 రెట్లు పెరగ్గా మనదేశంలో 8.9 రెట్లు, తలసరి జిడిపి చైనాలో 32 రెట్లు మన దేశంలో 5.8 రెట్లు మాత్రమే పెరిగాయి.చైనా జిడిపి 361 నుంచి 960 బి.డాలర్లకు చేరేందుకు ఏడు సంవత్సరాలు పట్టింది. అదే భారత్‌ జిడిపి 321 నుంచి 940 బి.డాలర్లకు చేరేందుకు పదహారు సంవత్సరాలు పట్టింది. సంస్కరణల ద్వారా స్ధానిక సంస్ధలు దశలవారీగా అంతర్జాతీయ పోటీ తత్వాన్ని సంతరించుకుంటాయని, సామర్ద్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని 1991లో ఆర్ధిక మంత్రిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ చెప్పారు. ఎగుమతి-దిగుమతి విధానంలో మార్పులు చేశామని, దిగుమతుల అనుమతులను తగ్గిస్తామని, ఎగుమతులను పెంచుతామని కూడా చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల విషయానికి వస్తే 1990లో దిగుమతి పన్నులు 82శాతంగా ఉండగా 1992నాటికి 56శాతానికి తగ్గాయి. ఇదే సమయంలో డాలరు విలువతో సంబంధం ఉండే పన్ను మొత్తాలు 1995-96 నాటికి 50 నుంచి 25 శాతానికి తగ్గించాలని రాజా చెల్లయ్య కమిటీ సూచించింది. ఇవి ప్రపంచబ్యాంకు లక్ష్యానికి(ఆదేశాలకు) దగ్గరగా ఉన్నాయి. సగటు పన్నుల శాతం 38.7శాతానికి, డాలరు విలువతో సంబంధం ఉన్న పన్ను మొత్తం 23.6శాతానికి తగ్గింది. ప్రపంచబ్యాంకు చెప్పినదాని కంటే ఇంకా ఎక్కువగానే పన్నులను తగ్గించారు. రెండంకెల పన్నులను ఒక అంకెకు తగ్గిస్తామని యుపిఏ ప్రభుత్వం చెప్పినప్పటికీ పూర్తిగా జరగలేదు.


సంస్కరణల గురించి రంజుగా చెబుతారని ముందే అనుకున్నాం. వారు చెప్పే అంశాలను ఒక్కసారి చూద్దాం.1991లో 84 కోట్ల మంది జనాభాకు కేవలం ఐదు కోట్ల మందికి మాత్రమే ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు అన్ని రకాల ఫోన్లు 117 కోట్ల మందికి అందుబాటులోకి వచ్చాయి. డబ్బు కోసం మీరు ఈ రోజు బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేదు, సమీపంలోని ఎటిఎంకు వెళ్లి ఏ సమయంలో అయినా డబ్బు తీసుకోవచ్చు. ఫోన్‌ ద్వారా మీరు ఉన్న చోట నుంచి ఎవరికైనా, ఎక్కడికైనా పంపవచ్చు. ఇప్పుడు 82 కోట్ల డెబిట్‌ కార్డులు, 5.7 కోట్ల క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. జేబులు ఎత్తుగా డబ్బు కట్టలను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టీవీ తొలిసారిగా 1959లో వచ్చినపుడు దూరదర్శన్‌ విద్యా సంబంధమైన ఒక గంట కార్యక్రమం వారానికి రెండుసార్లు ప్రసారం చేసేవారు. ఆరు సంవత్సరాల తరువాత రోజుకు నాలుగు గంటలు అవి కూడా ప్రధానంగా వార్తా కార్యక్రమాలు మాత్రమే. వచ్చేవి, అదే ఇప్పుడు పదిహేను భాషల్లో నాలుగు వందలకు పైగా వార్తా ఛానళ్లతో సహా 926 ఛానళ్లు జనాలకు అందుబాటులోకి వచ్చాయి.


నిజమే ఈ అభివృద్దిని ఎందుకు కాదనాలి, కళ్ల ముందు కనిపిస్తుంటే ఎలా అంటాం ? సంస్కరణలు ఎందుకు అంటే మనకు చెప్పింది వీటిని గురించా ? కానే కాదు. ఉపాధి, దారిద్య్ర నిర్మూలన, అభివృద్ది మంత్రాన్ని జపించారు. జరిగిందేమిటి ? అభివృద్ధి చెందిన దేశాల లక్షణం ఏమిటి ? వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నవారు తగ్గిపోయి, వస్తూత్పత్తి, సేవారంగాల ఉపాధి పెరగటం. ప్రస్తుతం దేశంలో ఎటు చూసినా వేతనాలు తక్కువ, కాంట్రాక్టు లేదా తాత్కాలిక ఉపాధి, భారీ పెట్టుబడులు-తక్కువ మందికి ఉపాధి, ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు. బిఏ అంటే బొత్తిగా అన్యాయం, ఎంఏ అంటే మరీ అన్యాయం అనే రోజులు పోయి అంతకంటే ఎక్కువగా ఇంజనీరింగ్‌ పట్టాలు పెరిగాయి. వారి పరిస్ధితి ఏమిటి ? మరీ ఘోరంగా ఉంది. మంచి వేతనాలు పొందిన వారిలో గతంలో బిఏలు, ఎంఎలు ఉన్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్‌ ఉన్నా రోజు వారి సాధారణ కార్మికుడికి పని దొరికిన రోజుల్లో వస్తున్న వేతనాలు కూడా చాలా మందికి రావటం లేదు.


సెల్‌ఫోన్లు, టీవీ ఛానళ్లు, ఏటిఎంలు ఉపాధి చూపవు, తిండి పెట్టవు అని తేలిపోయింది. పరిశ్రమల్లో ఇచ్చే వేతనాలు గౌరవ ప్రదమైన జీవితాలను గడిపేందుకు అనువుగా లేవు. ఇదే సమయంలో ఐటి వచ్చింది. ఆ రంగంలో వేతనాలు, విదేశీ అవకాశాలు ఉండటంతో తలిదండ్రులు, యువత పొలోమంటూ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ వైపు వెళ్లారు. ఇప్పుడు ఆ రంగంలో కూడా పరిస్ధితి తారుమారైంది.కొద్ది మందికి ఇప్పటికీ మెరుగైన పరిస్ధితే ఉన్నా అత్యధికులు అరకొర జీతాలకే శ్రమను అమ్ముకోవాల్సి వస్తోంది. వారంతా చిరు, నిరుద్యోగ చౌరస్తాలో ఉన్నారు. 2011లో యుపిఏ ప్రభుత్వం ఒక జాతీయ వస్తు తయారీ విధానాన్ని ప్రకటించింది. దాని ప్రకారం 2022 నాటికి జిడిపిలో 15శాతంగా ఉన్న వస్తూత్పత్తి వాటాను 25శాతానికి పెంచాలని, తద్వారా కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించాలని చెప్పారు. 2014లో మోడీ గారు అధికారానికి వచ్చి దాని పేరు మార్చి కొత్తగా మేకిన్‌ ఇండియా అని నినాదంగా ప్రచారం చేశారు.గడువు కంటే ముందుగానే ఆమేరకు పెరిగింది. దానిలో ఎవరి వాటా ఇంత అని వారు తేల్చుకోవచ్చు. కానీ ఉద్యోగాలు రాలేదే, జిడిపి వృద్ది రేటు ఎనిమిది నుంచి నాలుగు శాతానికి పడిపోయిందే. ఇదీ అసలు సమస్య. కరోనాకు ముందే నిరుద్యోగం 45 ఏండ్ల రికార్డును దాటిపోయింది. ప్రభుత్వాలు ఇప్పుడు కరోనా మాటున తమ వైఫల్యాలను దాస్తున్నాయి. ఎంతకాలం మూసిపెడతాయో చూద్దాం !


చైనా గురించి ఎవరైనా ఏదైనా చెబితే దానికి ఒక ముద్రవేయటం లేదా చెప్పేదంతా వాస్తవం కాదు అనేవారు మనకు ఎక్కడబడినా తారసపడతారు. చైనాలో కార్మికుల వేతనాలు పెరిగాయి గనుక అనేక విదేశీ కంపెనీలు అక్కడి నుంచి బయటకు వస్తున్నాయి, అవి మన దేశానికి వస్తాయి అని ఏడాది క్రితం స్వయంగా ప్రధాని మోడీయే చెప్పారు. అందుకోవటానికి సిద్దంగా ఉండాలని రాష్ట్రాలను కోరారు. దీని అర్ధం ఏమిటి ? అంకెలతో పని లేదు. అక్కడితో పోల్చితే మన దగ్గర వేతనాలు తక్కువ అనే కదా ! లేకపోతే ఎందుకు వస్తారు ? లేబర్‌ కోడ్‌ పేరుతో కార్మిక చట్టాలను నీర్చుగార్చబోతున్నాం వాటిలో కొన్ని ఉన్నా అమలు గురించి పట్టించుకోం అనే సూచనలు ఇస్తున్నా వస్తున్నవారు లేరు. చైనా నుంచి ఒకరూ అరా బయటికి వచ్చినా వేరే దేశాలకు పోతున్నారు తప్ప మన దేశానికి రావటం లేదు.


2000 సంవత్సరం నుంచి మన దేశంలో నిజ వేతనాలలో పెరుగుదల లేదని లెక్కలు చెబుతున్నాయి. పరిశ్రమల్లో కాంట్రాక్టు కార్మికుల పెరుగుదల ఒక కారణమని 2017లో అంతర్జాతీయ కార్మిక సంస్ధ చెప్పింది. సంఘటిత రంగంలో 1997-98లో కాంట్రాక్టు కార్మికులు 16శాతం ఉంటే 2014-15 నాటికి 35శాతానికి పెరిగినట్లు పరిశ్రమల వార్షిక సర్వేలు వెల్లడించాయి. వారికి ఎలాంటి సంక్షేమ పధకాలు, చట్టాలు వర్తించవు. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే సంఘటిత రంగంలో 2000-01లో7.75 మిలియన్ల మంది ఉపాధి పొందితే 2015-16 నాటికి 13.26 మిలియన్లకు పెరిగారు. దీన్ని బట్టి కాంట్రాక్టు కార్మికుల సంఖ్య ఎంత ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. దీని వలన వేతనాలు, హక్కుల కోసం పోరాడేశక్తి కూడా కార్మిక సంఘాలకు తగ్గిపోతోంది.ఒక యజమాని ఒక కార్మికుడిని తొలగిస్తే ఆ స్ధానంలో పని చేసేందుకు పదిమంది సిద్దంగా ఉన్నారు, ఒకరు నిచ్చెన ఎక్కితే ఇరవై మంది కింద ఉండిపోతున్న పరిస్ధితి ఉన్నపుడు వేతనాల కోసం బేరమాడే శక్తిగానీ, సంఘాలలో చేరి సంఘటితం అయ్యే అవకాశాలు ఎలా ఉంటాయి.

నూతన సాంకేతిక పరిజ్ఞానం నూతన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందన్నది నిజం. దానికి సంస్కరణలే అవసరం లేదు.టెలికాం రంగంలో ప్రయివేటు సంస్ధలను అనుమతించిన కారణంగా పది నుంచి 30లక్షల వరకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కొన్ని సంస్దలు అంచనాలు వేశాయి. జిరాక్సు మెషిన్లు రావటంతో ప్రతి పెద్ద గ్రామం మొదలు పట్టణాల్లో వాటిని వినియోగిస్తున్నారు. కొందరికి ఉపాధి కలిగిన మాట నిజం. ఎక్కడో తప్ప కేవలం జిరాక్స్‌ మిషన్‌ మీద వచ్చే ఆదాయంతోనే బతుకు వెళ్లదీయటం సాధ్యం కాని వారు, నెట్‌, లామినేషన్‌ వంటి వాటిని కూడా జతచేశారు. టెలికాం రంగంలో ప్రయివేటు కంపెనీలు ఉపాధి కల్పించాయి, పోగొట్టాయి. రిలయన్స్‌ కంపెనీ 52వేల మందికి ఉద్యోగాలు కల్పించి అది పోటీకి తట్టుకోలేక మూతపడటంతో మొత్తం సిబ్బందిని తొలగించింది. రిలయన్స్‌ టెలికమ్యూనికేషన్స్‌ మూత పడిన లేదా వేరేదానిలో విలీనం తరువాత రిలయన్స్‌ జియో వచ్చింది. అది కొన్ని కొత్త ఉద్యోగాలను కల్పిస్తే దాని పోటీకి తట్టుకోలేని మిగతా సంస్దలు ఆ మేరకు సిబ్బందిని ఇంటికి పంపి ఖర్చులను తగ్గించుకున్నాయి. కొన్ని విలీనమయ్యాయి, దాంతో సిబ్బంది మరింత తగ్గారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులను ఎలా ఇంటికి పంపిందో తెలిసిందే. ఇక టెలికాం సేవారంగం కొత్త ఉపాధి అవకాశాలను కల్పించినట్లే ఉన్న ఉపాధిని కూడా పోగొట్టింది. సెల్‌ఫోన్లు రాక ముందు మన ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఎస్‌టిడి బూత్‌ ఏర్పాటు పధకాన్ని ప్రకటించింది, అమలు జరిపింది. ఇప్పుడు ఎక్కడైనా ఎవరికైనా కనిపిస్తున్నాయా ? ఎంత మంది ఎస్‌టిడి బూత్‌లను నెట్‌ సెంటర్లుగా మార్చారు ? ఒక వేళ మార్చారే అనుకుందాం. ఒక రంగంలో పోయిన ఉపాధి మరోరంగంలో వచ్చింది.అదనం ఏమిటి ? టెలికాం, వస్తూత్పత్తి, వ్యవసాయం ఏ రంగంలో చూసినా ఆధునిక పరిజ్ఞానం,ఆటోమేషన్‌, రోబోల ప్రవేశం గత మూడు దశాబ్దాలలో పెద్ద ఎత్తున పెరిగింది.పెట్టుబడులు కూడా పెరిగాయి, కార్మికుల సంఖ్య తగ్గిపోయింది. దాని వలన సంస్ధల యాజమాన్యాలకు ఖర్చులు తగ్గాయి, ఉత్పత్తి పెరిగింది. ఈ పోటీలో భారీ పెట్టుబడులు పెట్టలేనివారు తమ సంస్దలను మూసివేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే చిన్న పరిశ్రమల మూత పెరిగింది. అందుకే మూడుదశాబ్దాల తరువాత మంచి చెడ్డలను బేరీజు వేసుకుంటే ఇప్పుడు తలెత్తిన నిరుద్యోగం, కొనుగోలు శక్తి తగ్గిపోవటం, అది మాంద్యానికి దారిదీయటానికి కారణాలు ఏమిటి ? మనం చైనాతో పోటీ పడాలని చెప్పుకుంటున్నాం గనుక ఇదే సమయంలో చైనాలో అభివృద్ది రేటు ఒక ఏడాది ఒకశాతం తగ్గవచ్చు మరోఏడాది పెరగవచ్చు తప్ప మనం ఎదుర్కొంటున్న మాదిరి సమస్యలు అక్కడ లేవు. ఎందుకో అధ్యయనవేత్తలు చెప్పాలి, జనం ఆలోచించాలి.


మన దేశంలో టాటా మోటార్స్‌ కంపెనీ కోసం గతంలో రాష్ట్రాలు రాయితీలు ఇస్తామంటూ రాష్ట్రాలు ఎలా పోటీ పడ్డాయో చూశాము. తాజాగా కేరళకు చెందిన కిటెక్స్‌ కంపెనీకోసం కూడా అదే పద్దతిలో రాష్ట్రాలు పోటీ పడ్డాయి. తెలంగాణా సర్కార్‌ సదరు కంపెనీ ప్రతినిధుల కోసం ప్రత్యేక విమానాన్ని కేరళకు పంపటాన్ని చూశాము. ఇన్నేండ్ల సంస్కరణల తరువాత మాంసం ముక్క కోసం కుక్కలు కొట్లాడుకున్న మాదిరి రాష్ట్రాలు పరిశ్రమల కోసం ప్రయత్నించటం సిగ్గు చేటు. ఈ పోటీ ఎంతవరకు పోతుంది? కేంద్ర ప్రభుత్వానికి, బాధ్యత, ఒక అభివృద్ది అజండా పద్దతి ఉంటే ఇలాంటి పోటీని సహిస్తుందా ? అభివృద్దిలో అసమానతలు పెరగవా ? చైనాలో పరిస్ధితి దీనికి భిన్నం. వారు ఎక్కడ పరిశ్రమలు పెట్టమంటే అక్కడ పెట్టటమా లేదా అన్నది కంపెనీలు తేల్చుకోవాలి. రాష్ట్రాలు కొట్లాడుకోవు. తొలి సంవత్సరాలలో కొన్ని అనువైన ప్రాంతాలలో పరిశ్రమలను ప్రోత్సహించిన తరువాత దేశంలో తలెత్తిన సమస్యను గమనంలో ఉంచుకొని వెనుక బడిన ప్రాంతాలలో మాత్రమే కొత్తవాటిని ప్రోత్సహిస్తున్నారు. అందుకు అంగీకారమైతేనే సంస్దలు పెడుతున్నారు. గ్రామీణ, టౌన్‌షిప్‌ సంస్దలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహమిచ్చిన ఫలితంగా వ్యవసాయంలో మిగులు ఉన్న శ్రామికులు వాటిలో చేరిపోయారు. ఈ సంస్ధలు అక్కడ అధ్బుతాలు సృష్టించాయి.


మన సంస్కరణలు గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలను తేలేకపోయాయి. నీతి అయోగ్‌ నివేదిక ప్రకారం 2004-05 నుంచి 2011-12 మధ్య గ్రామీణ ప్రాంతంలో కేవలం 12లక్షల ఉద్యోగాలు మాత్రమే పారిశ్రామిక రంగంలో పెరిగాయి. అదే చైనాలో 1980 నుంచి 2000 సంవత్సరాల మధ్య పది కోట్ల మందికి పని దొరికింది. మన వంటి దేశాలకు మరిన్ని పారిశ్రామిక ఉద్యోగాలు అవసరమని అందరూ అంగీకరిస్తారు. మూడు దశాబ్దాల సంస్కరణలు ఆ లక్ష్యాన్ని ఎంతమేరకు సాధించాయి.1980-2018 మధ్య ఈ రంగంలో ఉన్న కార్మికులు మొత్తం శ్రామిక శక్తిలో 30 నుంచి 10శాతానికి తగ్గిపోయారు.2019లో వ్యవసాయంలో 14 కోట్ల మంది, నిర్మాణ రంగంలో ఆరుకోట్ల మంది, ఉండగా పారిశ్రామికరంగంలో నాలుగు కోట్ల మంది ఉన్నట్లు సిఎంఐఇ విశ్లేషణ తెలిపింది. పెద్ద సంఖ్యలో నైపుణ్యం లేని కార్మికులు ఉన్నందున వారిని ఎలా ఉపయోగించుకోవాలో ప్రత్యామ్నాయ విధానాలను వెతకాలని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల పేరుతో తెచ్చిన మూడు చట్టాలు రైతుల బాగుకోసం కాదు. అధ్యయనాలు వెల్లడించిన అంశాల ప్రకారం రెండువేల సంవత్సరం తరువాత వాణిజ్యం వ్యవసాయం, అనుబంధ రంగాల వైపు మళ్లింది, పెరిగింది. దారిద్య్రం తగ్గింపులో ఇది గణనీయమైన పాత్ర పోషించిందని చెబుతున్నారు. ఈ కారణంగానే వ్యవసాయంలో ప్రవేశించేందుకు విదేశీ-స్వదేశీ కార్పొరేట్లకు అవకాశాలు కల్పించేందుకే వ్యవసాయ చట్టాలు. ఇదే సమయంలో గత ఏడు సంవత్సరాలుగా వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది.వృద్ది రేటు గిడసబారింది. వేతనాలు కూడా పెద్దగా పెరగలేదు. ఈ నేపధ్యంలో వ్యవసాయాన్ని కార్పొరేట్‌ జలగలకు అప్పగిస్తే అనే భయమే రైతాంగ ఉద్యమానికి అంకురార్పణ చేసింది. ప్రస్తుతం నరేంద్రమోడీ సర్కార్‌ తలపెట్టిన మరిన్ని సంస్కరణలు మరింత మందిని ఉద్యమాల్లోకి తీసుకు వస్తుందా ? ఆర్ధిక వృద్దిని తిరోగమనం నుంచి పురోగమానికి తీసుకుపోతాయా ? ఏం జరగనుంది ? ఊహలు ఎందుకు, చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

తీవ్ర సంస్కరణల అమలు : నరేంద్రమోడీకి ముందు నుయ్యి వెనుక గొయ్యి ?

28 Wednesday Jul 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

India Reforms @ 30, India reforms matters, Narendra Modi Failures


ఎం కోటేశ ్వరరావు
మన్మోహన్‌ సింగ్‌ నూతన ఆర్ధిక విధానాలను ప్రవేశపెట్టి మూడు దశాబ్దాలు గడచింది. 1991 జూలై 24న పివి నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉండగా మన్మోహన్‌సింగ్‌ సంస్కరణలతో కూడిన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వాటికి ఆద్యులం మేమే అని గతంలో ఛాతీలు విరుచుకున్న కాంగ్రెస్‌, వాటిని పొగిడి అమలు జరిపేందుకు పోటీ పడిన తెలుగుదేశం వంటి ప్రాంతీయ పార్టీలు, అదే సంస్కరణలను మరింత గట్టిగా అమలు చేస్తున్న బిజెపిలోగానీ ఎక్కడా సంతోషం కాదు గదా కనీస చిరు హాసం కూడా కనిపించటం లేదు. ఎందుకు ?


సంస్కరణలను గతంలో సమర్ధించిన వారు గానీ ఇప్పుడు భజన చేస్తున్న పెద్దలు గానీ చెప్పేది ఏమిటి ? అంతకు ముందు టెలిఫోను కావాలంటే పార్లమెంట్‌ సభ్యుడి సిఫార్సు కావాలి, ఎక్కువ సేపు మాట్లాడితే జేబులు ఖాళీ, స్కూటర్‌ కొనుక్కోవాలంటే సంవత్సరాలు ఆగాలి, గ్యాస్‌ కావాలన్నా ఏండ్లు పూండ్లు గడిచేవి. ఇప్పుడు వద్దన్నా సరే తీసుకోండి బాబూ అంటూ జనాన్ని వదల – కదలకుండా సతాయిస్తున్నాయి. పరిస్ధితి మరింత మెరుగుపడాలి, ఇంకా అందుబాటులోకి రావాలంటే మరిన్ని సంస్కరణలు అవసరం అన్నది కొందరి వాదన. ప్రపంచ వ్యాపితంగా 2019లో వంద మంది జనాభాకు సగటున 104 ఫోన్‌ కనెక్షన్లు ఉన్నాయి. మన దగ్గర 2020లో 110.18, చైనాలో 113.38, క్యూబాలో 11.6(2011) ఉన్నాయి. అంటే మనం చైనాకు దగ్గరగా ఉన్నాం, ఎంత అభివృద్ది ? క్యూబా అందనంత దూరంలో వెనుకబడి ఉంది చూడండి అని అంకెలను చూసి ఎవరైనా చెబుతారు. మరి దీనిలో వాస్తవం లేదా ? కంటికి కనిపిస్తుంటే లేదని ఎలా చెప్పగలం !

గతి తార్కిక సూత్రాల ప్రకారం ప్రతిదీ నిరంతరం మారుతూ ఉంటుంది. అందువలన సంస్కరణలు, మరొకదానిని వద్దని చెప్పటం అంటే రివర్స్‌ గేర్‌లో నడపాలని చూడటమే. పురోగమనం ఏ దారిలో నడవాలన్న దగ్గరే అసలు సమస్య. దాన్ని తమవైపు మళ్లించుకోవాలని కార్పొరేట్‌ సంస్దలు చూస్తాయి. తమ వైపు రావాలని సామాన్య జనం కోరుకుంటారు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్దలు(ఐఎంఎఫ్‌) ఏం చెబుతాయి ? వాటిని రూపొందించింది ధనిక దేశాలు గనుక వాటి ప్రయోజనాలకు అనుగుణ్యమైన సిఫార్సులే చేస్తాయి. దాని అర్ధం సమాజంలో ఒక తరగతి ఆ సంస్కరణలతో లబ్దిపొందుతుంది. భిన్నమైన ఆచరణ అయితే మరో తరగతికి ప్రయోజనం.


ఐక్యరాజ్యసమితి 2020 మానవాభివృద్ది సూచికలో 189 దేశాలకు గాను క్యూబా 70వ స్ధానంలో, చైనా 85, మన దేశం 131, బంగ్లాదేశ్‌ 133లో ఉంది. సంస్కరణల లక్ష్యం సెల్‌ఫోన్ల కనెక్షన్ల పెరుగుదలా లేక మానవాభివృద్దిగా ఉండాలా ? మూడు దశాబ్దాల సంస్కరణల తరువాత కరోనా సమయంలో ఆక్సిజన్‌ కోసం విదేశీ దానం, దిగుమతుల మీద ఆధారపడాల్సిన దుస్ధితిని ఎలా వర్ణించాలి ? అందుకే సంస్కరణల లక్ష్యం ఏమిటి అన్నది గీటురాయిగా ఉండాలి. మన దేశం స్వంతంగా ఒక వాక్సిన్‌ తయారు చేసినందుకే మన జబ్బలను మనం చరుచుకుంటున్నాం. నరేంద్రమోడీ ఉండబట్టే అది సాధ్యమైందన్న భజన తెలిసిందే. సున్నా కంటే ఒకటి విలువ అపారం. సెల్‌ఫోన్ల కనెక్షన్లలో త్వరలో మనం చైనాను అధిగమించినా ఆశ్చర్యం లేదు. ఒక వాక్సిన్‌కే మనం తబ్బిబ్బు అవుతుంటే చైనా 20వాక్సిన్ల ప్రయోగాలు జరుపుతోంది. అమెరికా ఆర్ధిక దిగ్బంధనం ఉన్నా, ఇబ్బందులు పడుతూ ఉన్నంతలోనే పెద్ద మొత్తం వెచ్చించి క్యూబా ఐదు కరోనా వాక్సిన్లను అభివృద్ధి చేస్తోంది. కావాలంటే ఇతర దేశాలు ఉత్పత్తి చేస్తామంటే ఫార్ములా ఇస్తామని ప్రకటించింది. ఇలా ఉదహరించుకుంటూ పోతుంటే విదేశాలను పొగిడే దేశద్రోహులుగా ముద్రవేస్తారు. టూల్‌కిట్ల కేసులు బనాయిస్తారు. పెగాసస్‌ను ప్రయోగిస్తారు.


మూడు దశాబ్దాల క్రితం మన్మోహన్‌ సింగ్‌ ఆర్ధిక మంత్రిగా సంస్కరణల బడ్జెట్‌ను ప్రతిపాదిస్తూ పదిహేను రోజులకు సరిపడా మాత్రమే విదేశీ మారక ద్రవ్యం ఉందని చెప్పారు. ఇప్పుడు మన దేశం దగ్గర పదిహేను నెలలకు సరిపడా ఉన్నాయి. చిత్రం ఏమిటంటే అప్పుడూ పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించేవారు సంస్కరణలు కావాలని కోరారు. మూడు దశాబ్దాల తరువాత ఇప్పుడూ మరిన్ని సంస్కరణలు కావాలని కోరుతున్నది వారే. సామాన్య జనంలో నాడున్నంత మోజు, క్రేజు ఇప్పుడు లేదు. ఎందుకని ? స్వాతంత్య్రం వచ్చిన పద్నాలుగు సంవత్సరాలకు వెలుగు నీడలు(1961) అనే సినిమా వచ్చింది. మహాకవి శ్రీశ్రీ పాడవోయి భారతీయుడా అంటూ రాసిన పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. స్వాతంత్య్రం వచ్చెనని సంబరపడబోకోయి, స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయీ, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి.. ఆకామందుకొనే ధరలకవైపు అదుపులేని నిరుద్యోగమింకొకవైపు, అవినీతి బంధుప్రీతి చీకటి బజారూ అలుముకున్న నీ దేశమెటు దిగజారూ, కాంచవోయి నేటి దుస్ధితీ ఎదిరించవోయి ఈ పరిస్ధితీ, పదవీ వ్యామోహాలు కులమత బేధాలూ భాషా ద్వేషాలూ చెలరేగేనేడు ప్రతి మనిషి మరియొకనీ దోచుకునే వాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూసుకొనే వాడే అంటూ ఆరుదశాబ్దాల క్రితమే పరిస్ధితిని ఎదిరించమని సందేశమిచ్చాడు శ్రీశ్రీ . మూడు దశాబ్దాల సంస్కరణల తరువాత అవన్నీ మరింత పెరిగాయి.


1991నాటి సంస్కరణలకు విదేశీ చెల్లింపుల సమస్య తలెత్తటం ఒక ప్రధాన కారణం. నరేంద్రమోడీ హయాంలో విదేశీమారక ద్య్రవ్యం పెరుగుదలను ఒక ఘన విజయంగా ఊరూ వాడా ఊదరగొడుతున్నారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మొత్తం మీద మన దేశ ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి. అంటే మనకు అవసరమైన విదేశీమారక ద్రవ్యం లోటులోనే ఉంది. ఎవరి ఘనత అయినా మిగులు సాధించినపుడే. ఇప్పుడు 612 బిలియన్‌ డాలర్లు (జూలై 16నాటి ఆర్‌బిఐ సమాచారం) దాటినప్పటికీ ప్రముఖ ఆర్ధికవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు. మరోసారి చెల్లింపుల సంక్షోభం తలెత్తవచ్చని, జాగ్రత్తపడాలని చెప్పేవారు కొందరు, ఐఎంఎఫ్‌ను ఆశ్రయించవచ్చని కొందరు హెచ్చరిస్తున్నారు.” ఊహించని విదేశీ అఘాతాల(షాక్‌లు)లను తట్టుకొనే శక్తిని విదేశీమారక ద్రవ్య స్ధాయిలు కల్పిస్తాయని చెప్పటం మోసకారితనం ” అని రిజర్వుబ్యాంకు డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ దేవవ్రత పాత్ర రిజర్వుబ్యాంకు బులిటెన్‌లో రాశారు. జూన్‌ నాలుగవ తేదీ నాటికి 605 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ప్రధమ స్ధానంలో ఉన్న చైనా, జపాన్‌, స్విడ్జర్లాండ్‌, రష్యా తరువాత అధిక విదేశీమారక డాలర్ల ద్రవ్యం ఉన్న దేశంగా ఐదవ స్ధానానికి చేరింది. ఈ మొత్తం పదిహేను నెలల పాటు మనం దిగుమతులు చేసుకొనేందుకు సరిపోతాయని చెబుతున్నారు. వారం వారం ఇవి పెరగటానికి ప్రత్యక్ష పెట్టుబడులు రావటం, దేశ ఆర్ధిక వ్యవస్ధ సరిగా లేనప్పటికీ కంపెనీల వాటాల కొనుగోలుకు విదేశీ మదుపుదార్లు ఎగబడటం కారణాలు అన్నది స్పష్టం. స్విడ్జర్లాండ్‌ దగ్గర ఉన్న నిధులు 39 నెలలు, జపాన్‌ 22, రష్యా 20, చైనా 16నెలల పాటు దిగుమతులు చేసుకొనేందుకు సరిపోతాయని మన దేశం దగ్గర పదిహేను నెలలకు సరిపడా ఉన్నందున మన పరిస్ధితి మెరుగ్గా ఉందని కొందరు నమ్మబలుకుతున్నారు.చైనా వాణిజ్య మిగులులో ఉంది తప్ప తరుగులో లేదు. అందువలన మన పరిస్ధితిని ఇతరులతో పోల్చుకుంటే ప్రయోజనం ఏముంది ? మన దేశ అంతర్జాతీయ నిఖర పెట్టుబడులను విశ్లేషిస్తే సంపదలకంటే అప్పులు 12.9శాతం ఎక్కువగా ఉన్నాయి. అందువలన ఆచరణాత్మక విశ్లేషణలు చేయటం అవసరం. మనకంటే వేరే దేశాల్లో లాభం అనుకుంటే పొలో మంటూ ఆ పెట్టుబడులన్నీ తెల్లవారే సరికి మాయాబజార్‌లా మాయం అవుతాయి. అప్పుడు పరిస్ధితి ఏమిటన్నది సమస్య.


విదేశీ మదుపుదారులు తమ దేశాల్లో కంటే తక్కువ ప్రతిఫలం వస్తున్న కారణంగానే మన మార్కెట్లోకి వస్తున్నారు. అందువలన వారికి ఎక్కడ వాటంగా ఉంటే అక్కడికి ఎప్పుడైనా తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోవచ్చు. మన్మోహన్‌ సింగు చెప్పినట్లు పదిహేను రోజులకు సరిపడా విదేశీమారక ద్రవ్య నిల్వలున్నపుడు ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ధ ఆదేశాల మేరకు సంస్కరణలు తీసుకువచ్చారు. అందువలన సహజంగానే అవి కొన్ని తరగతులను సంతృప్తి పరచాయి, సంపదలను పెంచాయి. వాటిని చూసి అనేక మంది తాము కూడా ఆ జాబితాలో చేరేందుకు మహదావకాశం వచ్చిందనే ఆశతో వెనుకా ముందూ చూడకుండా వాటిని సమర్ధించారు. యుపిఏ పాలనలో దేశంలో ఆర్ధిక పరిస్దితి దిగజారటం, కొత్త పద్దతుల్లో దేశ సంపదలను దోచుకొనే క్రమంలో జరిగిన అక్రమాల కారణంగా జనంలో అసంతృప్తి తలెత్తింది. దాన్ని ఉపయోగించుకొని నరేంద్రమోడీ రంగంలోకి వచ్చారు.


ఏడు సంవత్సరాల తరువాత అనేక వైఫల్యాలు కళ్లెదుట కనిపిస్తున్నా ప్రధాని మోడీ పలుకుబడి తగ్గలేదని కొందరు చెబుతున్నారు. అంగీకరిద్దాం. ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపి లక్ష్యం గురించి ఎవరూ ఇప్పుడు మాట్లాడటం లేదు. నాడు పివి నరసింహారావు, మన్మోహన్‌ సింగులు చేసిన మాదిరి కరోనాతో కుదేలైన ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు నరేంద్రమోడీ అద్భుతాలు చేయగలరా లేదా అని కొందరు పోల్చి చూస్తున్నారు. కొందరు పండితులు, విధాన నిర్ణేతలు ఆశపడుతున్నారు గానీ అంత సీన్‌ లేదు, ఆశాభంగం చెందుతారు అని కొందరు హెచ్చరిస్తున్నారు. వారు చెబుతున్న కారణాల సారాంశం ఇలా ఉంది. 1991 నాటి ఏకీభావం ఇప్పుడు లేదు. అవి ఆకస్మికంగా ఆకాశం నుంచి ఊడిపడలేదు. సంస్కరణలతో చైనా పురోగమనం, ఆసియాలో మరికొన్ని దేశాల పురోగమన ప్రభావం, అన్నింటికీ మించి సోవియట్‌ యూనియన్‌ పతనం వంటి అంశాలన్నీ ప్రభావితం చేశాయి.

ఇందిరా గాంధీ హయాంలోనే ప్రపంచబ్యాకు,ఐఎంఎఫ్‌ చెప్పిన వాటిని అమలు చేయటం ప్రారంభించారు, దాని వలన ప్రయోజనం లేదని అరకొర అవీ పైపైన గాక కచ్చితంగా వాటిని అమలు జరపటం, రక్షణాత్మక విధానాల బదులు స్వేచ్చా మార్కెట్‌, ఉదారవాదవిధానాలు తప్ప మరొక మార్గం లేదనే అభిప్రాయాలు బలపడటం వంటి అంశాలున్నాయి. ప్రభుత్వ రంగ విస్తరణ, పెట్టుబడుల విధానాన్ని పక్కన పెట్టి సర్వం ప్రయివేటుకే అప్పగించారు. అయినా సేవారంగంలో వచ్చిన మార్పులు తప్ప పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో సాధారణ పెరుగుదల తప్ప సంస్కరణల ప్రభావం ప్రత్యేకంగా కనిపించటం లేదు. మన దిగుమతులు తప్ప ఎగుమతులు పెరటం లేదు. సంస్కరణలను మరింతగా అమలు జరపాలని అందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలనే వాదనలు మన్మోహన్‌ సింగ్‌ హయాంలోనే ఇంటా బయటి నుంచి వత్తిళ్లు ప్రారంభమయ్యాయి. యుపిఏ ఒకటి హయాంలో వామపక్షాల మద్దతుతో ప్రభుత్వం నడవటం వలన కార్పొరేట్ల కోరికలు తీర్చటం సాధ్యం కాలేదు. యుపిఏ 2 హయాంలో వామపక్షాలతో నిమిత్తం లేకుండానే పాలన సాగినా ధరల పెరుగుదల, అవినీతి అక్రమాల కుంభకోణాలతో పరువు పోయిన సమయంలో వెనకడుగు వేయక తప్పలేదు.

గుజరాత్‌-గోద్రా-మారణకాండ నేపధ్యంలో అవసరమైతే జనాన్ని అణచి తమ అజెండాను అమలు జరిపే సాహసవంతుడు కార్పొరేట్లకు నరేంద్రమోడీలో కనిపించారు. అంతకంటే కావాల్సింది ఏముంది.అవసరమైన ప్రచారం, హంగు, అర్భాటాలతో కొత్త దేవుడు వచ్చాడన్నట్లుగా పరిస్ధితిని తయారు చేశారు. ఒక అజెండాను కూడా రూపొందించారు. పారిశ్రామికవేత్తలు కోరిన విధంగా భూమి పొందేట్లు నిర్ణయాలు తీసుకోవాలి, కార్మిక చట్టాలను నీరు గార్చాలి, పన్ను సంస్కరణలను అమలు జరపాలి, బ్యాంకులు, బీమా రంగం నుంచి తప్పు కోవాలి.మిగిలిన ప్రభుత్వ రంగ సంస్దలను ప్రయివేటీకరించాలి, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించాలి. ఇందుకు అవసరమైన ఇతర అనుబంధ చర్యలు తీసుకోవాలి. దానిలో భాగంగానే అంతకు ముందు తాము వ్యతిరేకించిన జిఎస్‌టిని మోడీ అమలు చేశారు. మిగతావాటికీ రంగం సిద్దం చేశారు. అయితే పెద్ద నోట్ల రద్దు వంటి పిచ్చిపనితో తలెత్తిన ఇబ్బందులు, జిఎస్‌టితో వచ్చిన సమస్యలు, ఆర్ధిక రంగంలో వృద్ధి రేటు ఎనిమిది నుంచి నాలుగుశాతానికి పడిపోవటం, దాదాపు అన్ని రంగాలలో వైఫల్యం కారణంగా మిగతా అంశాల అమలును వేగం చేస్తే జనం నుంచి ప్రతిఘటన ఎదురవుతుందనే భయమే ఇప్పుడు నరేంద్రమోడీని పీడిస్తోంది. మొరటుగా ముందుకు పోతే అధికారానికే మోసం వస్తుందనే బెరుకు మొదలైంది.


అన్ని వ్యవస్ధలను దిగజార్చుతున్న మాదిరే మోడీ హయాంలో ఏకాభిప్రాయ సాధన, భిన్నాభిప్రాయాల వెల్లడి లేదా చర్చకు అవకాశాలు ఇవ్వని నిరంకుశ ధోరణి పెరుగుతోంది. గతంలో పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బిల్లుల్లో 60-70శాతం కమిటీల చర్చకు పంపేవారు ఇప్పుడు అవి పదిశాతానికి పడిపోయాయి. ప్రవేశపెట్టే బిల్లుల గురించి ముందుగా చర్చించటం కూడా తగ్గిపోయింది. తొలి ఐదు సంవత్సరాలలో 186 బిల్లులను ప్రవేశపెడితే వాటిలో 44 మీదే ముందుగా సంప్రదింపులు జరిపారు. కరోనా సమయంలో వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా సరైన సంప్రదింపులు, చర్చలు లేకుండా మూడు బిల్లులను ఆమోదించుకున్న తీరు, వాటికి వ్యతిరేకంగా రైతాంగం ఎనిమిది నెలలుగా జరుపుతున్న ఉద్యమం గురించి తెలిసిందే. ఆ చట్టాల అమలును సుప్రీం కోర్టు తాత్కాలికంగా పక్కన పెట్టింది. వ్యవసాయ చట్టాల తరువాత కార్మిక చట్టాలకు రంగం సిద్దం చేశారు. అయితే అనూహ్యంగా కరోనా వచ్చింది. సహాయక చర్యలు, దాన్ని గుర్తించటంలో నిర్లక్ష్యం, వైఫల్యం ఒకటైతే ఆర్ధికంగా దేశం కుదేలు కావటం వలన సంస్కరణల కిక్కు జనానికి ఎక్కించటం సాధ్యం కాదు. ఏ చమురు ధరలైతే మోడీ అధికారానికి రాగానే గణనీయంగా పడిపోయి ప్రభుత్వం మీద భారం తగ్గించటంతో పాటు ఆమేరకు జనం మీద భారం మోపి అదనపు వనరులను సమకూర్చుకొనేందుకు దోహదం చేశాయో ఇప్పుడు అవే రాబోయే రోజుల్లో మెడకు చుట్టుకోనున్నాయి. ఇప్పుడు మోడీ తలపెట్టిన సంస్కరణల అజెండా యుపిఏ హయాంలోనే ఉంది.వాటి అమలు, తటపటాయింపు మన్మోహనసింగు ఇష్ట అయిష్టాల కారణంగా వాయిదా పడలేదు. ధరల పెరుగుదల వంటి అంశాలతో పాటు అవినీతి అక్రమాలు ఆ ప్రభుత్వాన్ని కుదిపివేసిన కారణంగా తగ్గారు. అందుకే కార్పొరేట్లు సింగును పక్కన పెట్టి మోడీకి జై కొట్టారు.


ఏడు సంవత్సరాల తరువాత ఆర్ధిక వ్యవస్ధ కుదేలు కావటం, పన్నుల కారణంగా చమురు ధరలు రికార్డు స్ధాయికి చేరటం, వాక్సిన్‌పై పిల్లిమొగ్గలు, ఆక్సిజను కూడా అందించలేని కరోనా వైఫ్యల్య నేపధ్యం అన్నింటికీ మించి రైతుల ప్రతిఘటన వంటి అంశాల నేపధ్యంలో మోడీ మీద ఇంకా మోజు ఉన్నప్పటికీ మరిన్ని సంస్కరణల గురించి కబుర్లు చెబితే నమ్మే స్ధితిలో జనం లేరు. అదే అసలు సమస్య. చెప్పిన మాట, చేసిన వాగ్దానాలను మరోసారి చెప్పటం, మాట్లాడే అలవాటులేని మోడీ గారికి పరిస్ధితి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా ఉంది. మొరటుగా ముందుకు పోతే జనంలో ప్రతిఘటన, కోరిక తీర్చకపోతే కార్పొరేట్లు చేయాల్సింది చేస్తారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉత్తర ప్రదేశ్‌ సంతుష్ట రాజకీయాలు : బహుజనుల నుంచి బ్రాహ్మలపై మాయావతి దృష్టి !

21 Wednesday Jul 2021

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, STATES NEWS

≈ Leave a comment

Tags

BJP, BSP, Mayawati, SP, UP Appeasement matters, UP Assembly Elections 2022


ఎం కోటేశ్వరరావు


వసుదేవుడు అంతటి వాడు అవసరార్దం గాడిద కాళ్లు పట్టుకున్నాడన్న కథ తెలిసిందే.ఉత్తర ప్రదేశ్‌లో అధికారం కోసం అక్కడ పన్నెండు నుంచి పదిహేను శాతం వరకు ఓట్లున్న బ్రాహ్మణులను సంతుష్టీకరించేందుకు ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ పాట్లు పడుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నెలలోగా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఆ రాష్ట్ర అధికారం కోసం రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో తెలియదు. దేశవ్యాపితంగా ఐదుశాతం మంది (ఆరు ఏడు కోట్ల మధ్య) బ్రాహ్మణ సామాజిక తరగతి ఓటర్లు ఉంటారని అంచనా. ఉత్తరాదిన అత్యధిక మంది ఉన్నారు. జనాభాలో శాతాల రీత్యా ఉత్తరాఖండ్‌లో 20, హిమచల్‌ ప్రదేశ్‌ 14, ఢిల్లీ 12, జమ్మూ-కాశ్మీరు 11, ఉత్తర ప్రదేశ్‌ 10, ఒడిషా 9, రాజస్ధాన్‌, గోవా 7, హర్యానా, అరుణాచల్‌ ప్రదేశ్‌ 6, పశ్చిమ బెంగాల్‌, సిక్కిం, పంజాబ్‌, బీహార్‌, మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక ఐదు, మహారాష్ట్ర, అసోం నాలుగు, ఝార్ఖండ్‌, త్రిపుర మూడు, చత్తీస్‌ఘర్‌ రెండు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ ఒకశాతం చొప్పున ఈ సామాజిక తరగతిని కలిగి ఉన్నాయి. ఇవి పాత అంచనాలు, 2021లో శాతాలు స్వల్పంగా మారవచ్చు. ఉత్తర ప్రదేశ్‌లో సంఖ్య రీత్యా రెండున్నర కోట్ల మంది వరకు ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణులు అంటే పూజా పునస్కారాలు, ఇతర క్రతువులు నిర్వహించేవారిగా మాత్రమే తెలుసు. ఉత్తరాదిన వారు వీటితో పాటు వ్యవసాయం చేస్తారు. వీరిలో కూడా శాఖాబేధాలు, ఎక్కువ తక్కువ నిచ్చెనమెట్లు ఉన్నాయి. కొందరిని కొందరు బ్రాహ్మణులుగా గుర్తించని వంటి అంశాలూ ఉన్నాయి. ఉదాహరణకు భూమిహార్‌లను బ్రాహ్మణులుగా గుర్తించరు. వారిని కూడా కలిపితే ఉత్తర ప్రదేశ్‌లో వారి శాతం 14-15కు పెరుగుతుంది. మనువాదానికి ప్రతీకగా బ్రాహ్మణులను చూస్తున్నప్పటికీ అందరినీ ఆ గాటన కట్టలేము. నిజానికి మనువాదం ఇప్పుడు మిగతా కులాల్లోనే ఎక్కువగా ప్రబలింది. బిజెపి పెరుగుదలకు అది కూడా ఒక కారణం. ఇటీవలి బిజెపి చర్యలను చూసినపుడు ఉత్తర భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో గణనీయంగా ఉన్న ఈ సామాజిక తరగతిని సంతుష్టీకరించేందుకు ఎంతకైనా తెగిస్తుందని తేలిపోయింది. కాశ్మీరీ పండిట్ల సమస్యను పెద్ద ఎత్తున ప్రచారం చేయటం, ఆర్టికల్‌ 370తో పాటు అసలు కాశ్మీరు రాష్ట్రాన్నే రద్దు చేయటం దానిలో భాగమే అని చెప్పవచ్చు.


మనువాద వ్యతిరేక భావజాల ప్రాతిపదికన ఏర్పడిన బహుజన సమాజవాది పార్టీ అధినేత్రి మాయావతి మరోసారి ఉత్తర ప్రదేశ్‌లో బ్రాహ్మణ సంతుష్టీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎనిమిది సంవత్సరాలు ఏలుబడి సాగించిన ఆమెకు అధికార రుచి, అది రంజుగా ఉండాలంటే బ్రాహ్మణ ఓట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొలిసారి 2007లో ఆమెకు అధికారం రావటంలో వారి మద్దతు ప్రధాన పాత్ర పోషించింది. దేశమంతటా దళితులు, గిరిజనులు, ఇతర సామాజిక బలహీనవర్గాల మీద దాడులు, అత్యాచారాల గురించి పార్టీలు చెప్పటం సాధారణ విషయం. కానీ దానికి భిన్నంగా ఉత్తర ప్రదేశ్‌లో బ్రాహ్మణుల మీద అవి జరుగుతున్నాయని మాయావతి చెప్పటమే గమనించాల్సిన అంశం.ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళితుల మీద అత్యాచారాలు, హత్యలు, దాడులు తగ్గిందేమీ లేదని, తక్కువ ఉన్నట్లు చూపేందుకు నమోదు చేయవద్దని పోలీసు శాఖను అదేశించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తాను అధికారాన్ని చేపట్టిన తరువాత బ్రాహ్మల గౌరవం, ప్రయోజనాలను కాపాడతానని ఆమె ప్రకటించారు. జూలై 23న అయోధ్యలో పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర మిశ్రా బ్రాహ్మణ మేలుకొలుపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. 2007 అసెంబ్లీ ఎన్నికలలో బిఎస్‌పి విజయానికి బ్రాహ్మణ ఓటర్ల మద్దతు ఒక ప్రధాన కారణమనే అంశం మరోసారి మాయావతికి గుర్తుకు వచ్చింది. 2017లో బ్రాహ్మణ ఓటర్ల మద్దతు పొంది అధికారానికి వచ్చిన బిజెపి వారి సంక్షేమానికి పాల్పడకుండా వేధించిందని, వారిని దోచుకుందని, బిజెపికి మద్దతు ఇచ్చినందుకు వారు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారని మాయావతి చెప్పారు.


మాయావతి 2007 నుంచి 2012వరకు అధికారంలో ఉన్న సమయంలో సంతుష్టీకరణ రాజకీయాలకు పాల్పడ్డారని, అగ్రకులాల వారిని పక్కన పెట్టి ఇప్పుడు ఎన్నికల కారణంగా బ్రాహ్మణులను ఆకర్షించేందుకు పూనుకున్నారని బిజెపి ప్రతినిధి రాకేష్‌ త్రిపాఠీ విమర్శించారు. అయితే వారి గౌరవ మర్యాదలు, సంక్షేమానికి పాటు పడేది బిజెపి అని తెలుసు గనుక వచ్చే ఏడాది ఎన్నికల్లో తమకే ఓటు చేస్తారని చెప్పుకున్నారు. మద్దతు తగ్గిపోతున్న కారణంగా మాయావతి కుల రాజకీయాలకు పాల్పడుతున్నారని, తాము అన్ని కులాల వారి సంక్షేమానికి కృషి చేస్తామని కాంగ్రెస్‌ ప్రతినిధి నసీముద్దీన్‌ సిద్దికీ, తాము అన్ని కులావారినీ సమంగా చూస్తామని, మాయావతి ప్రతిపక్షాల మీద చేస్తున్న దాడిని చూస్తే బిజెపితో లోపాయి కారీ ఒప్పందం ఉందన్నది వెల్లడైందని సమాజవాది పార్టీ ప్రతినిధి అబ్దుల్‌ హఫీజ్‌ గాంధీ అన్నారు.


ఉత్తర ప్రదేశ్‌లో సామాజిక సమీకరణాలను చూసినపుడు బ్రాహ్మణులు సంఖ్యరీత్యా ఎక్కువ కానప్పటికీ విజయావకాశాలను ప్రభావితం చేసే స్ధితిలో ఉన్నారు.దళితులు 20.8, ముస్లింలు 19, ఓబిసి 40 అగ్రకులాలు 20 శాతం ఉంటారని అంచనా. కుల రాజకీయాలు ప్రభావం చూపే ఈ రాష్ట్రంలో గత మూడు దశాబ్దాలలో మొత్తంగా బ్రాహ్మణులు బిజెపితోనే ఉన్నారు. అయితే రాజపుత్రుల ప్రాబల్యం ముఖ్యంగా యోగి ఆదిత్యనాధ్‌ హయాంలో పెరిగిపోయి తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే అభిప్రాయం పెరుగుతోంది. వికాస్‌ దూబే అనే గూండానేతను, ఐదుగురు సహచరులను పోలీసులు కాల్చిచంపారు. ఆ ఉదంతంలో దూబే గ్యాంగు చేతిలో ఎనిమిది మంది పోలీసులు మరణించారు. దూబే ఉదంతాన్ని చూపి బ్రాహ్మణ వ్యతిరేక చర్యగా చిత్రించే ప్రయత్నం ఆ సమయంలో జరిగింది.నిజానికి అది కులపరంగా జరిగిన ఉదంతం కాదు.బ్రాహ్మణులు బిజెపికి గట్టి మద్దతుదారులుగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నప్పటికీ బిజెపికి ఎక్కడో అనుమానాలు ఉన్నాయన్నది స్పష్టం. అయినా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులు కోకూడదని బిజెపి అనుకుంటోంది. అందుకే ప్రముఖ బ్రాహ్మణ నేతగా పేరున్న జితిన్‌ ప్రసాదను ఇటీవల కాంగ్రెస్‌ నుంచి ఆకర్షించింది. బ్రాహ్మణ చేతన పరిషత్‌ పేరుతో ప్రసాద ఒక సంస్దను ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్‌ అధికారి ఎకె శర్మను ఉద్యోగానికి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకున్నారు. అంతే కాదు, ఎంఎల్‌సి పదవి ఇచ్చి మంత్రివర్గంలో చేర్చుకోవాలన్న అధిష్టాన వర్గ ఆదేశాన్ని యోగి ఖాతరు చేయలేదు. ఆయను ఎంఎల్‌సి చేసి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించారు. శర్మను కలుసుకొనేందుకు యోగి నిరాకరించారని కూడా వార్తలు వచ్చాయి. అయోధ్య రామాలయ నిర్మాణాన్ని కూడా సంతుష్టీకరణలో భాగంగా చూపుతున్నది. ఆర్ధికంగా బలహీనవర్గాలకు పదిశాతం ఉద్యోగ రిజర్వేషన్లు ఏర్పాటు చేసినందున వారే ఎక్కువ లబ్ది పొందుతారని ప్రచారం చేసింది. తాము పరశురాముడి అంశకు చెందిన వారమని బ్రాహ్మలు భావిస్తున్న కారణంగానే తాము అధికారానికి వస్తే భారీ పరుశురాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బిఎస్‌పి, సమాజవాది పార్టీ ప్రకటించాయి.


బిఎస్‌పి విషయానికి వస్తే 2002లో ఆ పార్టీకి బ్రాహ్మణులు ఆరుశాతం ఓటు వేయగా 2007నాటికి 17శాతానికి పెరిగింది. ఇదే సమయంలో బిజెపికి 50 నుంచి 42శాతానికి తగ్గాయి. తరువాత 2012లో 38శాతానికి పడిపోయినా 2014లోక్‌ సభ ఎన్నికల్లో 72, 2107 అసెంబ్లీలో 80శాతం, 2019లోక్‌సభ ఎన్నికల్లో 82శాతానికి పెరిగాయి. రాజపుత్రుల ఓట్లు కూడా అదేస్ధాయిలో బిజెపికి పడ్డాయి. నరేంద్రమోడీ కారణంగా పన్నెండుశాతం ఓట్లు బిజెపికి అదనంగా వచ్చినట్లు సర్వేలు తెలిపాయి. అగ్రకులాల, బిసిల్లోని కుర్మీల ఓట్లు ఈ ఎన్నికల్లో బిజెపికి ఐదింట నాలుగు వంతులు పడగా, ఓబిసీల్లోని దిగువ తరగతి వారు నాలుగింట మూడు వంతులు వేశారు. బిసిల్లో ముందుపడిన వారు సమాజవాది పార్టీతో ఉన్నందున దిగువ తరగతులను చేరదీసేందుకు బిజెపి ఎరవేసింది. బిజెపి ఎత్తుగడలో భాగంగా ముస్లింలను దూరంగా పెట్టి మెజారిటీ హిందువుల ఓటు బ్యాంకు సృష్టికి పూనుకుంది. అది సహజంగానే బ్రాహ్మణులకు సంతృప్తి నిస్తుంది.


బ్రాహ్మణ సంతుష్టీకరణకు రాహుల్‌ గాంధీ కూడా ప్రయత్నించారు. తాను కౌల్‌ బ్రాహ్మణ పూర్వీకుల వారసుడనని, తనది దత్తాత్రేయ గోత్రమని చెప్పుకున్నారు. గతంలో బ్రాహ్మణులు కాంగ్రెస్‌కు తిరుగులేని మద్దతుదారులుగా ఉండేవారు. బిఎస్‌పి పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ బ్రాహ్మణ సామాజిక తరగతికి చెందిన వారినే ఇప్పుడు నాయకులుగా నియమించారు. మాయావతి మంత్రివర్గంలో గరిష్ట స్ధాయిలో వారున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో గరిష్ట సంఖ్యలో అభ్యర్దులుగా వారిని నిలిపారు. నామమాత్రంగా బ్రాహ్మణులు, నాలుగోవంతు దళితులు ఉన్న అంబేద్కర్‌ నగర్‌ లోక్‌ సభ స్ధానంలో పోటీ చేసిన రితేష్‌ పాండే తప్ప మిగిలిన బ్రాహ్మణ అభ్యర్ధులందరూ ఓడిపోయారు.


ఉత్తర ప్రదేశ్‌ మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాలను ” ఆవు ప్రాంతం ” అని పిలుస్తారు. బిజెపి ముందుకు తెచ్చిన మతపరమైన అజెండాలో ఆవు కూడా ఒకటి. సాధారణంగానే తమ కారణంగానే హిందూమతం ఇంకా ఉనికిలో ఉందని బ్రాహ్మణులు అనుకుంటారనే అభిప్రాయం ఉంది. ఇలాంటి అనేక కారణాలతో వారు కాంగ్రెస్‌ నుంచి బిజెపి అభిమానులుగా మారారు.
ఉత్తర ప్రదేశ్‌ ఇప్పుడు కులాలు, మతాల రాజకీయం నడుస్తోంది. బిజెపి హిందూత్వ తన గుత్త సొమ్మని భావిస్తోంది. మాకూ వాటా ఉందని మేమూ హిందుత్వశక్తులమే అని ఓటర్ల ముందు నాలుగు ప్రధాన పార్టీలూ ఓట్ల జోలె పట్టుకొని నిలుచోబోతున్నాయి. ఆయోధ్య రామమందిరాన్ని చూపి ఓట్లడిగేందుకు బిజెపి పూనుకుంటే బిఎస్‌పి అక్కడే తన బ్రాహ్మణ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టబోతున్నది. శ్రీరాముడి దర్శనం చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తరువాత మిగతా దేవుళ్ల పట్టణాల్లో సభలు జరుపుతారు. ప్రతిచోటా దేవుడి దర్శనంతోనే ప్రారంభం. గత ఎన్నికల్లో బిజెపికి ఓట్లు వేసిన వారిలో అగ్రకులాల వారే కాదు, దళితులు కూడా గణనీయంగా మొగ్గారు. అందువలన వారి హిందూత్వను సంతుష్టీకరించేందుకు బిఎస్‌పి ఎలాంటి కార్యక్రమాలను చేపడుతుందో చూడాల్సి ఉంది. గుళ్లు గోపురాలను సందర్శించి తామూ హిందువులమే అని కనిపించేందుకు బిఎస్‌పి, ఎస్‌పి, కాంగ్రెస్‌ నేతలు బారులు తీరుతున్నారు. స్ధానిక మనోభావాలను అర్ధం చేసుకోవాలీ అని ఎవరికి వారు సమర్ధించుకుంటున్నారు. అందరూ తమకు పోటీ వస్తున్నందున మత కిక్కు ఎక్కించేందుకు బిజెపి ఏం చేయనుందో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మైనారిటీ స్కాలర్‌ షిప్‌ల సమస్య : కేరళ ప్రభుత్వ సూత్రబద్దవైఖరి !

19 Monday Jul 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, BJP-Kerala, Kerala LDF, Kerala Minority Scholarship issue, Muslim League, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


ఓటు బ్యాంకు రాజకీయాలకు సిపిఎం ఆమడ దూరం అని మరోసారి నిరూపితమైంది. యుడిఎఫ్‌ ప్రభుత్వం 2016 అసెంబ్లీ ఎన్నికలను గమనంలో ఉంచుకొని 2015లో మైనారిటీ తరగతులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌లలో 80శాతం ముస్లింలు, ఇరవైశాతం క్రైస్తవులకు నిర్ణయిస్తూ ఉత్తరువులు జారీ చేసింది. దాన్ని హైకోర్టులో సవాలు చేశారు. సూత్రబద్ద వైఖరితో ఆ సమస్యను పరిష్కరించాలని సూచిస్తూ ఆ ఉత్తరువును కోర్టు కొట్టివేసింది. ఈ నేపధ్యంలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అనేక మంది నిపుణులను సంప్రదించి 2011 జనాభా ప్రాతిపదికన ఆ దామాషాలో స్కాలర్‌షిప్పులు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర జనాభాలో ముస్లింలు 26.56, క్రైస్తవులు 18.38, బౌద్దులు, సిక్కులు, జైనులు 0.01శాతం చొప్పున ఉన్నారు. స్కాలర్‌ షిప్పులు ఇప్పుడు అందరికీ అదే ప్రాతిపదికన లభిస్తాయి. ప్రస్తుతం స్కాలర్‌ షిప్‌లు పొందుతున్న వారికి లేదా మొత్తాలకు ఎలాంటి భంగం కలగదని, ఇతర మైనారిటీలకూ కొత్తగా లభిస్తాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో చర్చించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఈ విధానం, నిర్ణయాన్ని ప్రతిపక్షంగా ఉన్న యుడిఎఫ్‌లోని కాంగ్రెస్‌, కేరళ కాంగ్రెస్‌ సమర్దించాయి. అయితే తమ సామాజిక తరగతికి అన్యాయం జరిగిందంటూ ముస్లిం లీగు వ్యతిరేకించింది. ఆ పార్టీ వత్తిడికి లొంగిపోయిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు తాము సమర్ధించిన మాట నిజమే గానీ తాము సూచించిన దానిని ప్రభుత్వం పూర్తిగా అమలు జరపలేదని తరువాత అర్ధం అయిందని అందువలన వ్యతిరేకిస్తున్నట్లు మాట మార్చారు. అంతేకాదు భాగస్వామ్య పక్షాలేవీ బహిరంగంగా ఈ సమస్యపై ప్రకటనలు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. టీవీ చర్చలలో మాట్లాడకూడదని ఆంక్షలు విధించారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ ఎంపీ కె మురళీధరన్‌ మాట్లాడుతూ వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ లేదని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చూసుకుంటుందన్నారు. దీని గురించి మాట్లాడేందుకు ఎల్‌డిఎఫ్‌ పక్షాలకు స్వేచ్చ లేదని ఆరోపించారు. తమ యుడిఎఫ్‌లో ఎవరైనా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చని ఎల్‌డిఎఫ్‌లో భూస్వామి-కౌలుదారు మాదిరి ఉంటుందన్నారు.


సచార్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు ముస్లింల అభివృద్ది కోసం గత ప్రభుత్వం 80:20 దామాషా నిర్ణయించిందని ఇప్పుడు అందుకు భిన్నంగా జరిగిందనే వాదనను ముస్లింలీగు ముందుకు తెచ్చింది.పభుత్వ నిర్ణయాన్ని తాము కోర్టులో సవాలు చేస్తామని ప్రకటించింది. ఎవరికీ అన్యాయం జరగదని సూత్రబద్దమైన వైఖరి అని ఎల్‌డిఎఫ్‌ పేర్కొన్నది. లీగు వైఖరి సమాజాన్ని విభజించేదిగా ఉందని సిపిఎం తాత్కాలిక రాష్ట్ర కార్యదర్శి ఏ విజయ రాఘవన్‌ విమర్శించారు. స్కాలర్‌ షిప్‌ల పధకం కేవలం ముస్లింల కోసమే ఏర్పాటు చేశారని ప్రభుత్వం దామాషా ప్రాతిపదికన ఇవ్వటం సరికాదని పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొన్నది. గతంలో చేసిన నిర్ణయంలో 20శాతం వెనుకబడిన క్రైస్తవులకు కల్పించటమే తప్పిదమని, ముస్లింలకు తగ్గించకుండా ఇతరులకు కావాలంటే ఇచ్చుకోవచ్చని పేర్కొన్నది. సంఘపరివార్‌, కొన్ని క్రైస్తవ సంస్దలు సమాజంలో విభజన తెచ్చే విధంగా ప్రచారం చేస్తున్నాయని విమర్శించింది. గత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం అది మైనారిటీల కోసం ఉద్దేశించింది తప్ప కేవలం ముస్లింలకు మాత్రమే అని ఎక్కడా లేదు. ఈ కారణంగానే 80:20శాతం దామాషాను హైకోర్టు కొట్టివేసింది. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం కొత్త విధానంలో ముందే చెప్పినట్లు జనాభాను బట్టి దామాషాను నిర్ణయించింది.

సమీప భవిష్యత్‌లో ఎన్నికలు లేవు. అసలు ఎన్నికలకు దానికి సంబంధం లేదు. అయినప్పటికీ మీడియాలో ఓటుబ్యాంకు రాజకీయాల ప్రాతిపదికన కొందరు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ విధానంపై యుడిఎఫ్‌ పక్షాలలో విబేధాలు ఎల్‌డిఎఫ్‌కు లాభమన్నది వాటిలో ఒకటి. కాంగ్రెస్‌లో మిగిలి ఉన్న క్రైస్తవులు మరింత ఎక్కువగా ఎల్‌డిఎఫ్‌కు మద్దతు ఇస్తారన్నది రెండవది. అన్యాయం జరిగిందని నిరూపించే స్దితిలో యుడిఎఫ్‌ లేదన్నది మరొకటి. ఇక్కడ గమనించాల్సిందేమంటే యుడిఎఫ్‌ కూటమి గతంలో ఎన్నికల కోసమే స్కాలర్‌షిప్పుల విధానాన్ని రూపొందించి అది లబ్దిపొందింది లేదు. ఒక సూత్రబద్ద వైఖరి తీసుకున్న కారణంగా ఎల్‌డిఎఫ్‌ లబ్దిపొందితే పొందుతుందా లేదా అన్నది వేరే అంశం. మీడియా విశ్లేషకులకు కడుపు మంట ఎందుకో తెలియదు.

బక్రీద్‌ సందర్భంగా కరోనా ఆంక్షల సడలింపు వివాదం !


డెబ్బయి ఒక్క రోజుల తీవ్ర ఆంక్షల తరువాత బక్రీద్‌ సందర్భంగా కేరళ ప్రభుత్వం మూడు రోజుల పాటు దుకాణాలను తెరిచేందుకు షరతులతో ఆంక్షలను సడలించింది. కేరళలో ఉన్న జనాభా పొందికను చూసినపుడు హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలను అనుసరించే వారి ప్రధాన పండగల రోజుల్లో వ్యాపారాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. బక్రీద్‌ సందర్భంగా దుకాణాల్లో పాటించాల్సిన నిబంధనల అమలుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను నియమించారు. యజమానులకు గట్టి ఆదేశాలను జారీ చేశారు. ప్రార్ధనా స్ధలాల్లో అనుమతించిన దానికి మించి గుమి కూడదనే షరతు విధించారు. మసీదులతో పాటు దేవాలయాలు, చర్చ్‌లకు అలాంటి ఆంక్షలతోనే అనుమతులు ఇచ్చారు. కన్వర్‌ యాత్ర నిర్వహణ తప్పన్నపుడు బక్రీద్‌కు ఇవ్వటం కూడా తప్పే అని కాంగ్రెస్‌ జాతీయ ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వి అభ్యంతరం చెప్పారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కూడా వ్యతిరేకత తెలిపింది. ప్రస్తుతం దేశంలో కేసులు ఎక్కువ ఉన్న కేరళలో ఇలాంటి అనుమతులు ఇవ్వకూడదన్నది దాని వాదన. ప్రభుత్వ నిర్ణయాన్ని కేరళకు చెందిన బిజెపి మంత్రి వి మురళీధరన్‌ రాజకీయ ప్రయోజనాలకోసం తీసుకున్నదిగా ఆరోపించారు. శాస్త్రీయ పద్దతిలో కరోనా నిరోధ చర్యలను తీసుకోవాలన్నారు.

బక్రీద్‌ సందర్భంగా మసీదుల్లో పరిమిత సంఖ్యలో ప్రార్ధనలకు తప్ప బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేదు. రాష్ట్రాన్ని ఏబిసిడి తరగతులుగా విభజించారు. డి తరగతి ప్రాంతాల్లో ఒక్క రోజు మాత్రమే వస్తువుల కొనుగోలుకు అవకాశం ఇచ్చారు.
మసీదులో వంద మందికి మాత్రమే అనుమతి, ఆరు అడుగుల దూరం పాటించాలి. ఎవరి దుప్పటి లేదా చాప వారే తెచ్చుకోవాలి. ఒక వేళ అంత మంది పట్టే అవకాశం లేకపోతే సంఖ్యను తగ్గించుకోవాలి.అరవై అయిదు సంవత్సరాలు దాటిన పది సంవత్సరాల లోపు వారిని ప్రార్ధనలకు అనుమతించరు. మాస్కుతప్పని సరి, చేతులను శానిటైజ్‌ చేసుకోవాలి, మసీదులో ప్రవేశించే ముందు శరీర ఉష్ణ్రోగ్రతను చూస్తారు. ప్రార్ధనలకు వచ్చిన వారి చిరునామా, ఫోను నంబర్లు లేదా వారిని కనుగొనేందుకు అవసరమైన సమాచారాన్ని మసీదు నిర్వాహకులు నమోదు చేయాలి. జంతుబలి సమయంలో ఐదుగురికి మించి ఉండకూడదు. కరోనా నిబంధనలకు విరుద్దంగా ఎవరూ గుమికూడవద్దని ముస్లిం మత పెద్దలు బహిరంగ ప్రకటన చేశారు. ఆయా జిల్లాల యంత్రాంగాలు నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుంది. మలప్పురం జిల్లాలో ప్రార్ధన స్దలాల్లో 40 మందికి మించి అనుమతించేది లేదని, రెండు విడతల వాక్సిన్‌ తీసుకున్నట్లు, కరోనా లేదనే ధృవీకరణ పత్రాలు ఉన్నవారినే అనుమతించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బక్రీదు సందర్భంగా ఆది, సోమ, మంగళ వారాల్లో దుకాణాలను తెరిచేందుకు అనుమతించి రాష్ట్ర ప్రభుత్వం మనుషు ప్రాణాలతో ఆడుకుంటున్నదంటూ అనుమతి రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఢిల్లీ నివాసి పికెడి నంబియార్‌ ఒక పిటీషన్‌ దాఖలు చేశారు. దాని మీద ఈ రోజే సమాధానం ఇవ్వాలని కేరళ ప్రభుత్వ న్యాయవాదిని సుప్రీం కోర్టు కోరింది. మంగళవారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే ఈ కేసును చేపట్టనున్నట్లు డివిజన్‌ బెంచ్‌ పేర్కొన్నది.


బక్రీద్‌ సందర్భంగా మూడు రోజుల పాటు నిబంధనల సడలింపు మీద మిశ్రమ స్పందన వెలువడింది. ప్రభుత్వ చర్యను సమర్ధించే వారు చెబుతున్న అంశాల సారాంశం ఇలా ఉంది. కేరళలో ఓనం-బక్రీదు తరుణంలో వాణిజ్యం పెద్ద ఎత్తున జరుగుతుంది. గత ఏడాది ఐదులక్షల కోట్ల లావాదేవీలు జరుగుతాయని అంచనా వేస్తే 3,62,620 కోట్లు మాత్రమే జరిగాయి. ప్రభుత్వానికి 75వేల కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. ఓనం సమయంలో 25వేల కోట్లని అంచనా వేస్తే వచ్చింది రు.18,131 కోట్లు. గత మూడు సంవత్సరాలుగా ఓనం పండగ సందర్భంగా వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. వరదల కారణంగా 2018,19 సంవత్సరాల్లో దెబ్బతింటే గతేడాది కరోనా వచ్చింది. కేరళ వ్యాపార వ్యవసాయి ఏకోపన సమితి అంచనా ప్రకారం ఇరవై వేల మంది వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. పదిమంది వ్యాపారులు ఆత్మహత్య చేసుకున్నారు, ఇరవై వేల కోట్ల రూపాయల సరకు పనికిరాకుండా పోయింది. ప్రస్తుత పరిస్ధితుల్లో కొత్త సరకు తెచ్చేందుకు భయపడుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రాణాలు తీస్తున్న అధిక పని గంటలు -పనిలేక నిరుద్యోగుల ఆత్మహత్యలు !

18 Sunday Jul 2021

Posted by raomk in Current Affairs, Economics, employees, Health, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, UK, Uncategorized, USA, Women

≈ 1 Comment

Tags

#workers Health, extreme work weeks, ILO, Long working hours, Occupational diseases, overwork in India, WHO


ఎం కోటేశ్వరరావు


పని సందర్భంగా వడదెబ్బ సంబంధిత అత్యధిక గాయాలు, సమస్యలు పరిగణనలోకి రావటం లేదని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక జూలై 15న ఒక విశ్లేషణ ప్రచురించింది. వడగాలులు శ్రమ జీవులను ప్రత్యేకించి పేదవారిని అనూహ్య పద్దతులలో ఎలా గాయపరుస్తాయో తాజా సమాచారం వెల్లడించిందని పేర్కొన్నది. దాని సారాంశం ఇలా ఉంది. తీవ్ర వడగాడ్పులు సంభవించినపుడు పెద్ద సంఖ్యలో వడదెబ్బలే కాదు పడిపోవటం, యంత్రాలను సరిగా పనిచేయించలేకపోవటం, వాహనాల మధ్య ఇరుక్కుపోవటం వంటివి కూడా గణనీయంగా ఉంటున్నాయి. పని స్ధలాల్లో ఇతర కారణాలతో తగిలే గాయాలకు కాలిఫోర్నియాలోనే అదనంగా ప్రతి సంవత్సరం వడదెబ్బ గాయాలు ఇరవై వేలు తోడవుతున్నాయి. వీటి వలన పని మీద కేంద్రీకరించటం కష్టం అవుతోంది. పశ్చిమ అమెరికా, బ్రిటీష్‌ కొలంబియాలో ఇటీవలి వడగాడ్పులకు 800 మంది మరణించారు. బహిరంగ ప్రదేశాల్లోనే కాదు ఉత్పాదక యంత్రాలు, గోడవున్లలో పని చేసే వారికి కూడా వడగాడ్పులు ముప్పు తెస్తున్నాయి. వడగాడ్పు గాయాల వలన వేతనాలను కోల్పోవటం, వైద్య ఖర్చు పెరగటం, ఉష్ట్రోగ్రతలు పెరిగే కొద్దీ వేతన వ్యత్యాసం కూడా పెరుగుతోంది. 2001 నుంచి 2018వరకు కాలిఫోర్నియాలో గాయాలకు పరిహారం చెల్లించిన కోటీ పదిలక్షల నివేదికలను పరిశోధకులు విశ్లేషించారు. తేదీలు, పని ప్రాంతాలు, వడగాడ్పుల తీవ్రత, గాయాల సంఖ్య తీరుతెన్నులను విశ్లేషించగా వేడి ఎక్కువగా ఉన్నపుడు గాయాలు ఎక్కువగా నమోదైనట్లు తేలింది. అధికారికంగా సగటున 850 గాయాలైనట్లు నివేదికలు చూపాయి. అయితే వాస్తవ గాయాలతో పోల్చితే ఇవి చాలా తక్కువ. అరవై డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉన్నపుడు తగిలిన గాయాలతో పోల్చితే 85-90 డిగ్రీలు ఉన్నపుడు ఐదు నుంచి ఏడుశాతం, వంద డిగ్రీలకు పెరిగినపుడు పది నుంచి 15శాతం పెరిగాయి. వడ దెబ్బ గాయాలు గరిష్ట వేతనాలు పొందే వారితో పోల్చితే కనిష్ట వేతనాలు పొందే కార్మికులకు ఐదు రెట్లు ఎక్కువ ఉన్నాయి.వడదెబ్బ తగల కుండా కొన్ని చర్యలు తీసుకున్న తరువాత కేసులు సంఖ్య తగ్గింది తప్ప తీరుతెన్నులు మాత్రం అలాగే ఉన్నాయి.


మనది ఉష్టమండల ప్రాంతం. ఉష్ణోగ్రతలు అమెరికా కంటే ఎక్కువ నమోదౌతున్నాయి.వేసవిలో 110-115 మధ్య ఉన్న సందర్భాలు ఎన్నో. రికార్డు స్ధాయిలో రాజస్దాన్‌లో 124 కూడా నమోదైంది. అధిక ఉష్ణోగ్రత నమోదైనపుడు వడదెబ్బ తగలకుండా నివారణ చర్యలు తీసుకున్న సంస్దలు ఎన్ని ఉన్నాయన్నది ప్రశ్నార్దకం. అమెరికా మాదిరి మన దేశంలో కూడా పరిశోధన చేస్తే తప్ప తీవ్రత బయటకు రాదు. వడదెబ్బ ఒక్కటే కాదు కష్టజీవుల జీవితాలను దెబ్బతీస్తున్న వృత్తి రుగ్మత అంశాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఓవర్‌టైమ్‌ కూడా ఒకటి.ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యుహెచ్‌ఓ) తొలిసారిగా అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ఐఎల్‌ఓ)తో కలసి దీర్ఘపని గంటల మీద నిర్వహించిన సర్వే ప్రకారం ఏడాదికి ఆ కారణంగా మరణిస్తున్నవారు 7,45,000 మంది(ఇది 2016 సంఖ్య) ఉన్నారట. గుండెపోటు, హృదయ సంబంధ వ్యాధులు దీనికి కారణం. ఆగేయ ఆసియా, పశ్చిమ పసిఫిక్‌ ప్రాంత దేశాలలోని కార్మికులు ఎక్కువగా ప్రభావితులౌతున్నారు.ఆసియాలో గుండెపోటు ముప్పు మామూలుగానే ఎక్కువ, దీనికి అధిక పని గంటల సమస్య మరింత పెంచుతోంది. వారానికి 35-40 గంటల పాటు పని చేసేవారితో పోల్చితే 55 గంటలు, అంతకు మించి పని చేసే వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు 35శాతం, గుండె సంబంధ వ్యాధులతో ప్రాణాలు కోల్పోయే ముప్పు 17శాతం ఎక్కువగా ఉంది. ఈ కారణంగా మరణిస్తున్న వారిలో నాలుగింట మూడు వంతులు మధ్యవయస్కులు లేదా వృద్దులు ఎక్కువగా ఉన్నారు. రోజుకు ఎక్కువ గంటలు పని చేసిన వారిలో ఇది పని మానేసిన తదుపరి జీవితంలో, కొన్ని సందర్భాలలో దశాబ్దాల తరువాత కూడా ప్రభావం చూపుతోంది. అధిక పని గంటలు అంటే భౌతిక శ్రమే చేయనవసరం లేదు, ఇతరత్రా పనిలో ఎక్కువ గంటలు ఉన్నా ముప్పు ఉంటుంది.పిల్లలతో సహా అధిక గంటలు పని చేస్తున్నవారు ప్రపంచ జనాభాలో తొమ్మిదిశాతం ఉన్నారు.2000 సంవత్సరం తరువాత వీరి సంఖ్య పెరుగుతోంది.


వృత్తిపరంగా తలెత్తే రుగ్మతలకు కారణాలు అనేక వాటిలో సింహభాగం అధిక పని గంటలే అని తేలింది. ఎక్కువ సేపు భౌతిక శ్రమ చేయటం ముప్పు కారణమైతే, అది లేకుండా ఇతరంగా ఎక్కువ గంటలు పని చేసే వారు మద్యం, పొగాకు వినియోగం, తక్కువ సేపు నిద్రపోవటం, వ్యాయామం లేకపోవటం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవటం వంటి అంశాలు కూడా ముప్పును పెంచుతున్నాయి. దీర్ఘకాలం పనిచేసే వారి సంఖ్య ప్రపంచ వ్యాపితంగా పెరుగుతోంది. కరోనా మహమ్మారి సమయంలో అది మరింత పెరిగింది. అధికపని చేసినందుకు ప్రతిఫలం కూడా అన్ని సందర్భాలలో ఉండటం లేదు. ఇంటి నుంచి పని చేసే వారు సగటున 3.6 గంటలు ఎక్కువ సేపు విధి నిర్వహణలో ఉంటున్నారని తేలింది. యజమానులు వృత్తి రుగ్మతలను పరిగణనలోకి తీసుకోవాలని, తక్కువ పని గంటలు ఉంటే ఉత్పత్తి ఎక్కువ వస్తుందని గ్రహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్ద పేర్కొన్నది. అప్పగించిన ప్రాజెక్టు పనులు నిర్ణీత గడువులోగా పూర్తికావాలనే లక్ష్యాలు నిర్ణయిస్తున్నందున వాటికోసం ఇంట్లో లేదా పని స్ధలాల్లో ఎక్కువ సేపు పని చేయటంతో పాటు వత్తిడి సమస్య కూడా తలెత్తుతోంది. అధిక పని గంటల కారణంగా గుండెపోటు, హృదయ సంబంధ వ్యాధులతో మరణిస్తున్న వారిలో నాలుగింట మూడు వంతుల మందికి గుండెకు రక్త ప్రసరణ తగ్గిన కారణంగా తలెత్తే ఇస్కీమిక్‌ హృదయ వ్యాధి మూలం అని తేలింది. దీనికి వత్తిడి, అధికరక్తపోటు కారణం.ప్రస్తుతం ప్రపంచంలో కేవలం 15శాతం మంది కార్మికులకు మాత్రమే వృత్తిపరమైన రుగ్మతల చికిత్స ప్రత్యేక సేవలు అందుబాటులో ఉన్నాయి. తమిళనాడులోని తిర్పూరు-కోయంబత్తూరు ప్రాంతంలోని నూలు, వస్త్ర, దుస్తుల పరిశ్రమలో వెలువడే పత్తి ధూళి కారణంగా కార్మికుల్లో బ్రోంకైటిస్‌, టీవి, బరువు తగ్గటం, వినికిడి శక్తి నష్టపోవటం వంటి రుగ్మతలు తలెత్తుతున్నాయని విశ్లేషణలో తేలింది. ఈ పరిశ్రమల్లో పని చేసే వారి జీవిత కాలం కూడా తగ్గిపోతోంది. ఎన్‌ఎస్‌ఎస్‌ 2018 సర్వే ప్రకారం 83శాతం మంది కార్మికులకు ఆరోగ్య బీమా లేదు.


అధిక గంటలు పని చేస్తున్న వారు ఆసియాలో ఎక్కువగానూ ఐరోపాలో తక్కువగానూ ఉన్నారు. తగిన ప్రతిఫలం లేదా ఆదాయం లేని కారణంగా ఆసియాలోని అనేక ప్రాంతాలలో రోజుకు ఒకటి కంటే ఎక్కువ పనులు చేస్తున్నవారెందరో. పని గంటల పరిమితులు ఉన్నప్పటికీ వాటికి వక్రభాష్యాలు, మరొక కారణమో చెప్పి ఎక్కువ పని గంటలు చేయిస్తున్నారు. అదొక లాభసాటి వ్యవహారంగా కూడా ఉంటోంది. ఒకరిని అదనంగా నియమించుకొని పని చేయించుకోవటం కంటే ఆ మేరకు ఇద్దరో ముగ్గురి చేతో ఓవర్‌ టైమ్‌ చేయించుకోవటం యజమానికి లాభం కనుకనే ఆ పని చేస్తున్నారు.


పని చేయటంలో జపనీయులను ఆదర్శంగా తీసుకోవాలని కొంత మంది చెబుతారు. అక్కడి కార్మికులు నిరసన తెలియచేయాలంటే సమ్మెల కంటే అదనంగా ఉత్పత్తి చేసి యజమానుల మీద వత్తిడి చేస్తారనే కథలు కూడా బాగానే వినిపిస్తారు.సెలవులు తీసుకోవాలంటే సిగ్గుపడతారని ఆకాశానికి ఎత్తుతారు. 1970దశకంలో చమురు సంక్షోభం తలెత్తినపుడు అక్కడి కార్మికవర్గం మీద పెట్టుబడిదారులు 70గంటల పనిని రుద్దారు.అలా పని చేయటం గర్వకారణం, జపనీయుల దేశభక్తికి నిదర్శనం అన్నట్లు ప్రచారం చేసి సాధారణం కావించారు. ఇప్పుడు అనేక దేశాల్లో పెట్టుబడిదారీ వర్గం అదే చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ, ప్రపంచ కార్మిక సంస్ధ చేసిన సర్వే అంశాలవే. అయితే జపాన్‌లో 70గంటల పని రుద్దుడు పర్యవసానం ఏమిటి ? అక్కడి పని సంస్కృతికి మరోపేరు ” కరోషి ” అంటే అధికపనితో చావు. ఇలాంటి చావులు పెరిగిన కారణంగా పని గంటల గురించి అక్కడ పునరాలోచన ప్రారంభమైంది. అనేక మంది కార్మికులు పని వత్తిడి తట్టుకోలేక కార్యాలయాల మీద నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకున్నవారున్నారు. ఇదొక సామాజిక సమస్యగా మారింది. ప్రతి ఏటా కరోషీ బాధితులు పెరుగుతున్నారు. ఏటా పదివేల మంది మరణిస్తున్నారని అంచనా. కానీ ప్రభుత్వ లెక్కల్లో రెండు వందలు మాత్రమే ఉంటున్నాయి. మరీ ఎక్కువ వత్తిడి చేస్తే మొదటికే మోసం వస్తుందని లేదా పరిహారం చెల్లించాల్సిన కారణాల వలన గానీ ఇటీవలి కాలంలో కొందరు యజమానులు తమ సిబ్బందికి బలవంతంగా సెలవులను ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. సెలవులకు వేతనాలు పొందుతున్న కార్మికులు 2018లో 52.4శాతం మందే ఉన్నారు. సెలవు తీసుకుంటే వేతనం ఇవ్వరు గనుక అనేక మంది వాటి జోలికి పోరు. చూశారా జపాను వారు సెలవులు కూడా తీసుకోకుండా పని చేస్తారని బయటి ప్రపంచం సుద్దులు చెబుతుంది.


ఆర్ధిక సహకార మరియు అభివృద్ది సంస్ధ (ఓయిసిడి) సభ్య దేశాలలో పదకొండు చోట్ల వారానికి 50 గంటల కంటే ఎక్కువే పని చేస్తున్నారు.నాలుగు దేశాల్లో అధిక గంటలు పని చేసే వారు టర్కీలో 33, మెక్సికోలో 29, కొలంబియాలో 26.6, దక్షిణ కొరియాలో 25.2, జపాన్‌లో 17.9శాతం మంది ఉన్నారని ఓయిసిడి చెబుతోంది.పని-కుటుంబం, వ్యక్తిగత జీవితాలను సమన్యయ పరచుకోవటంలో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది లాభాలు తప్ప మరొకటి పట్టని పెట్టుబడిదారీ వ్యవస్ధ సృష్టించిన సమస్య తప్ప మరొకటి కాదు.


తాజాగా మాన్‌పవర్‌ గ్రూప్‌ సంస్ధ జరిపిన సర్వే ప్రకారం అధిక గంటలు పని చేసే దేశాల్లో మనం ప్రధమ స్దానంలో ఉన్నాం.1981-1996 మధ్య కాలంలో పుట్టిన వారిని మిలీనియల్స్‌ అంటున్నారు.వీరు మన దేశంలో 52, చైనాలో 48, అమెరికాలో 45, బ్రిటన్‌లో 41 గంటలు పని చేస్తున్నారని సర్వేలో తేలింది. తీవ్ర పోటీ, పని చేయకపోతే ఉద్యోగం ఊడుతుందన్న భయం వంటి అంశాలు రోజుకు పది గంటల కంటే ఎక్కువ సేపు పనిలో ఉండేట్లు చేస్తున్నాయి. ఫోర్డ్‌ కంపెనీ చేసిన సర్వే ప్రకారం వారానికి 12 గంటలు ఉద్యోగులు వాహనాలు నడపటానికి వెచ్చిస్తున్నారు. అంటే పని గంటలకు ఇది అదనం. ఉదాహరణకు 52 పని గంటలైతే అందుకోసం మరోపన్నెండు గంటల పాటు ప్రయాణంలో వెచ్చించాల్సి వస్తోంది.


మన దేశంలో సంభవిస్తున్న ఆత్మహత్యలలో పదిశాతం నిరుద్యోగం, దారిద్య్రం, దివాలా వంటి కారణాలతో జరుగుతున్నాయి. ఒకవైపు అధిక గంటలు పని చేసే వారు అత్యధికులుండగా మరో వైపు అసలు పనే లేని నిరుద్యోగులు కనిపిస్తారు. అధిక గంటలు పనిచేసే దేశాలలో మనది ఐదవ స్ధానమని ఐఎల్‌ఓ తెలిపింది. 2020-21 ప్రపంచ వేతన నివేదికలో అతి తక్కువ కనీస వేతనాలు చెల్లిస్తున్న దేశాల్లో మనది ఒకటని కూడా వెల్లడించింది. 2019 మన జాతీయ గణాంక సంస్ద సర్వే ప్రకారం రోజులో పదో వంతు కూడా దేశ ప్రజలు తీరుబడి కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. కార్మికశక్తిలో మహిళల శాతం తగ్గిపోతున్నదని ప్రపంచబ్యాంకు పేర్కొన్నది, గత సంవత్సరం 20.3శాతమే ఉన్నారని, అంతకు ముందుకంటే గణనీయంగా తగ్గినట్లు తెలిపింది. మన దేశంలో వారానికి నాలుగు దినాలు, రోజుకు పన్నెండు గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది యజమానుల లబ్ది కోసం తప్ప మరొకటి కాదు. ఓవర్‌టైమ్‌కు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా చేయటమే ఇది. అధిక పని గంటలు, వృత్తి రుగ్మతల కారణంగా తలెత్తే పర్యవసానాల గురించి మన దేశంలో సమగ్రమైన చట్టాలు చేయాల్సి ఉంది. ఉన్న చట్టాలనే నీరుగార్చేందుకు పూనుకుంటున్న పాలకుల హయాంలో అది జరిగేనా !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d