• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Others

కుష్‌బూతో బిజెపి సినిమా హిట్టా ఫట్టా !

13 Tuesday Oct 2020

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

AIADMK, DMK, Kushboo Sunder, Kushboo Sunder in BJP, Tamilnadu politics


ఎం కోటేశ్వరరావు


సినిమా గోలగా చెప్పాలంటే ఒక హీరో లేదా హీరో తమ తదుపరి చిత్రంలో చేసేందుకు అంగీకరించటమే సగం విజయమన్నట్లుగా కొందరు నిర్మాతలు తమ ఖుషీని ప్రకటిస్తారు. ఒకప్పటి అగ్రశ్రేణి హీరోయిన్‌గా నీరాజనాలందుకున్న ఖుషఉ్బ గతంలో డిఎంకె, కాంగ్రెస్‌ చిత్రాల్లో నటించి ఇప్పుడు బిజెపి సినిమాలో పని చేసేందుకు అంగీకరించారు. ఇల్లలకగానే పండుగ కాదు అన్నట్లుగా ఎంతో గొప్ప తారాగణంతో తీసిన సినిమాలను జనం ఇంటికి పంపిన చరిత్ర కూడా సినిమా రంగంలో నమోదైంది.


ఒక వ్యక్తిగా ఏ పార్టీలో చేరేందుకైనా ఉన్న హక్కును ఎవరికీ కాదనలేము. అయితే జనాలకు సుద్దులు చెబితేనే మండుతుంది.పార్టీలు ఫిరాయించేవారు చెప్పే ఇలాంటి కబుర్లు విని విని జనానికి బోరు కొట్టింది. నేను ఎన్ని పార్టీలైనా మారవచ్చు, మార్పు సహజం, మారాలి అని సెలవిచ్చిన ఆమె తన సిద్దాంతాలు మాత్రం మారలేదని చెప్పారు. హీరోయిన్‌గా ఎన్ని సంవత్సరాలైనా ఫిట్‌నెస్‌ మారలేదు, ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా చేస్తాను అంటే నిర్మాతలు అంగీకరించవచ్చు, అలా చేస్తే ప్రేక్షకులు ఆదరించవచ్చు. కానీ రాజకీయాలు సినిమాలు కావు. కుష్‌బూ ఏ పార్టీలో చేరితో ఆమె చెప్పిన సిద్దాంతంతో ఆయా పార్టీలు మారిపోతాయా ? ఇంతకీ ఆమె సిద్దాంతం ఏమిటి ?
తన సిద్దాంతాలు లేదా భావజాలం మారలేదు అని చెబుతున్న కుష్‌బూ పెళ్లికి ముందు కన్యలు పవిత్రంగా ఉండాలనే చాదస్తాల నుంచి సమాజం బయటపడాలని, కోరుకున్న పురుషుడితో జీవించే స్త్రీ వివాహంతో నిమిత్తం లేకుండానే పిల్లల్ని కూడా కనవచ్చంటూ గతంలో వెలిబుచ్చిన భావజాలానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు ఆమె బిజెపి వేదికల మీద ప్రకటించగలరా ? గతంలో బిజెపి మీద చేసిన విమర్శలకు కట్టుబడి ఉంటారా ? డిఎంకెతో రాజకీయాలను ప్రారంభించి కాంగ్రెస్‌లో చేరి ఇప్పుడు బిజెపి కండువా కప్పుకున్నారు. రేపు మరొక పార్టీలోకి వెళ్లరనే గ్యారంటీ ఏముంది ? డొల్లు పుచ్చకాయలు, పార్టీలు మారేవారు ఒకే చోట ఉంటారా ? పార్టీ మారటానికి కొద్ది వారాల ముందు నరేంద్రమోడీది జుమ్లా సర్కార్‌ (అవసరానికి అనుగుణంగా మాట్లాడటం) అని చెప్పిన ఆమె ఇప్పుడు మాట మార్చితే అదియును సూనృతమే ఇదియును సూనృతమే అని తలూపేందుకు జనం గొర్రెలా ?


తమిళనాడులో నాలుగు సీట్లు సంపాదించుకోవటం ఎలా అనే యావలో బిజెపి ఉందన్నది బహిరంగ రహస్యం. దానిలో భాగంగానే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తలుపు తట్టింది. లేస్తే మనిషిని కాదు అని దారినపోయే వారిని బెదిరించే కుంటి మల్లయ్య సామెత మాదిరి ఇప్పటి వరకు రజనీ వైఖరి ఉంది. ఇంతవరకు లేచింది లేదు, ఇప్పుడు లేస్తారో లేదో తెలియదు. 1996 నుంచి ఏదో ఒక రూపంలో రాజకీయ రంగ ప్రవేశం గురించి చెప్పటమో సూచనలు ఇవ్వటమో చేస్తున్నారు. 2021 ఎన్నికలలో తన సత్తా చూపేందుకు సిద్దం అవుతున్నారని కొన్ని కథనాలు ఎప్పటి నుంచో తిరుగుతున్నాయి. తానే ఒక పార్టీని పెడతానని కూడా 69 ఏండ్ల రజనీ కాంత్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ తీవ్రత తగ్గిన తరువాత ప్రకటిస్తారని చెబుతున్నారు.
సినిమా తారలు బిజెపిలో చేరటం కొత్తేమీ కాదు. గతంలో గౌతమి, నమిత, రాధారవి ఆ పార్టీలో చేరినా ఒరిగిందేమీ లేదు. కుష్‌బూ తమిళనాడులో పరిచయం అవసరం లేని స్టార్‌, మాట్లాడగల చాతుర్యం ఉంది. అందువలన వస్తారో రారో తెలియని రజనీ కోసం వేచి చూడటం కంటే ఆమెతో ప్రచారం చేయించుకోవచ్చని బిజెపి ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తున్నది.కుష్‌బూ డియంకె నుంచి బయటకు వచ్చినపుడు ఆ పార్టీకి పోయింది లేదు, కాంగ్రెస్‌లో చేరినపుడు కొత్తగా ఆ పార్టీకి పెరిగిందేమీ లేదు. ఇప్పుడు బిజెపికి కూడా ప్రచారానికి తప్ప ఓట్ల ప్రయోజనం కలగకపోవచ్చు. నేను ఇప్పుడే పార్టీలో చేరాను, ఆరునెలల తరువాత చూడండి అని విలేకర్లతో చేసిన వ్యాఖ్య బహుశా వచ్చే అసెంబ్లీ ఎన్నికల గురించి కావచ్చు.

గతంలో కొన్ని అంశాల మీద ఆమె చేసిన వ్యాఖ్యల మీద బిజెపి లేదా హిందూమత శక్తులు సామాజిక మాధ్యమంలో ఎలా విరుచుకుపడ్డాయో, ఎన్ని కేసులు నమోదు చేశాయో తెలిసిందే. ఇప్పుడు ఆమె బిజెపిలో చేరి సిద్దాంతాల గురించి చెప్పటాన్ని ఆశక్తులు ఎలా జీర్ణించుకుంటాయో చూడాల్సిందే. పచ్చిమితవాదులు ఆమెను అంగీకరిస్తారా ఆమె తన వైఖరిని మార్చుకుంటారా ? గతంలో ఆమె చేసిన బిజెపి వ్యతిరేక వ్యాఖ్యలు ఎన్నికల ప్రచార అస్త్రాలుగా మారకుండా ఉంటాయా ? గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధిత్వాన్ని ఆశించి భంగపడిన ఆమె ఈ ఏడాది మార్చినెల నుంచి బిజెపిలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కుష్‌బూ పేరు నఖత్‌ ఖాన్‌ అంటూ ఆమె మతం గురించి బిజెపి మరుగుజ్జులు(ట్రోల్స్‌) దాడి చేసినపుడు అవును నేను ముస్లింగానే పుట్టాను, దాని గురించి ఇంత ఆలస్యంగా తెలుసుకున్నారు అంటూ ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో చేరినపుడు ఆ పార్టీ తన భావజాలానికి సరిపడిందని చెప్పారు. మరి బిజెపి గురించి ఏమి చెబుతారు అంటే ఎవరైనా కులం, మతం, జాతి గురించి మాట్లాడితే నా రక్తం సలసల కాగుతుంది. నేను దేశభక్తురాలిని, లౌకికవాదిని కాషాయ, హిందూత్వవాదాలకు వ్యతిరేకం అని చెప్పారు. అలాంటి హిందూత్వవాదులతోనే ఆమె చేతులు కలిపారు.


ద్రవిడ కజగం పార్టీ స్దాపకుడు, హేతువాది, జీవితాంతం బ్రాహ్మణిజానికి, బ్రాహ్మలకు వ్యతిరేకంగా ఉన్న ఇవి రామస్వామి నాయకర్‌ మనవడైన సతీష్‌ కృష్ణన్‌ ఆగస్టు నెలలో అన్నాడిఎంకె నుంచి బిజెపిలో చేరారు. ఇలా కాంగ్రెస్‌, డిఎంకె, అన్నాడిఎంకె మూడు పార్టీలలో అసంతృప్తికి గురైన వారందరనీ చేర్చుకొనేందుకు బిజెపి తాపత్రయపడుతోంది. ఈ క్రమంలోనే గంధం చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ కుమార్తె విద్యను పార్టీ యువజన విభాగ ఉపాధ్యక్షురాలిగా చేసి ఆ పార్టీలోకి చేర్చుకుంది. నా తండ్రిని చూసి కాదు, నేను ఏమిటన్నది చూడాలని ఆమె చెప్పుకుంది. నా తండ్రి మంచివాడని, జనాలకు సాయం చేసేవాడని నాకు చెప్పారని, తండ్రితో స్ఫూర్తి పొందానని విలేకర్లతో చెప్పింది. వచ్చే ఎన్నికల్లో ఎవరైనా ఎంఎల్‌ఏగా ఎన్నికైతే వారికి పార్టీ తరఫున ఒక ఇన్నోవా కారును బహుమతిగా ఇస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ మురుగన్‌ పార్టీ సమావేశంలో ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. కనీసం 25 మంది ఎంఎల్‌ఏలను పార్టీ గెలుచుకుంటే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించవచ్చని చెప్పారు. పార్టీ గెలుపుకోసం బాగా పనిచేసినట్లు గుర్తించిన వారికి తమిళనాడులో పార్టీలు బంగారు ఉంగరాలు, గొలుసులు బహుమతిగా ఇవ్వటం సాధారణ విషయం. బిజెపి మరొక అడుగు ముందుకు వేసి ఏకంగా ఇన్నోవా కార్లనే ఎరగా చూపింది.


ముఖ్యమంత్రి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ముఠాలు పార్టీలో ఆధిపత్యం మాదంటే మాదని కొట్టుకున్నాయి. అది ముదిరితే ఏదో ఒక వర్గం తమతో వస్తుందన్న ఆశలు ఒక దశలో బిజెపిలో కలిగాయి. అయితే తామిద్దరూ ఒకటేనని పళని స్వామి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పని చేసేందుకు నిర్ణయించినట్లు అన్నాడిఎంకె ప్రకటించింది. అయితే ఆ సయోధ్య ఎన్నికల వరకు నిలుస్తుందా ఏమి జరుగుతుంది అనేది అప్పుడే చెప్పలేము.

2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 234 స్ధానాలకు పోటీ చేసిన బిజెపి 2.86శాతం ఓట్లు తెచ్చుకుంది. అన్నాడిఎంకెకు 40.88శాతం, డిఎంకె కూటమికి 39.1శాతం వచ్చాయి. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో డిఎంకె కూటమి 55శాతంపైగా ఓట్లు తెచ్చుకుంది, 39కి గాను 38 సీట్లు గెలుచుకుంది. ఇంతే కాదు 216 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ సంపాదించింది. అన్నా డిఎంకె కూటమి 16 చోట్ల మెజారిటీ తెచ్చుకోగా అన్నాడిఎంకె 12, పట్టలి మక్కలి కచ్చి 3, బిజెపి ఒక చోట ఆధిక్యత ప్రదర్శించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో డిఎంకె కూటమిలో సీట్ల పంపకం పెద్ద సమస్యగాక పోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలలో తామే నాయకత్వం వహిస్తామని బిజెపి చెప్పుకోవటంపై అన్నాడిఎంకె గుర్రుగా ఉంది. ఎన్నికల నాటికి ఆ పార్టీ నేత శశికళ జైలు నుంచి బయటకు వస్తారని చెబుతున్నారు. ఆమె ఏ వైఖరి తీసుకుంటారో తెలియదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి-అన్నాడిఎంకె విడివిడిగా పోటీ చేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్ధానాల్లో పోటీ చేసిన పట్టలి మక్కల్‌ కచ్చి 5.36 శాతం ఓట్లు తెచ్చుకుంది. లోక్‌సభ ఎన్నికల నాటికి పిఎంకె, బిజెపి, తమిళమానిల కాంగ్రెస్‌ అన్నా డిఎంకె కూటమిలో చేరాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎలాంటి వైఖరి తీసుకుంటుందో తెలియదు. అన్నాడిఎంకె బలహీనపడిన కారణంగా గత పార్లమెంట్‌ ఎన్నికలలో 20 స్ధానాలకే పరిమితమై పిఎంకెకు 7, బిజెపికి ఐదు, డిఎండికెకు నాలుగు, మరో మూడు పార్టీలకు మూడు సీట్లు కేటాయించింది. ఇదే ప్రాతిపదికన అసెంబ్లీ సీట్ల కేటాయింపు జరుగుతుందా ? అన్నాడిఎంకె తన సీట్లను సగానికి తగ్గించుకుంటుందా ?


మరోవైపు డిఎంకె కూటమిలో 2019 లోక్‌ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీ డిఎంకె 138, కాంగ్రెస్‌ 49, సిపిఎం, సిపిఐ పన్నెండు చొప్పున, ముస్లింలీగ్‌ ఐదు చోట్ల ఆధిక్యత ప్రదర్శించింది. ఇంతటి భారీ విజయం సాధించిన కారణంగా డిఎంకెలో సీట్ల కోసం పోటీ పడేవారు సహజంగానే ఉంటారు. అసంతృప్తి చెందిన వారిని పిలిచి పార్టీ కండువాలు కప్పేందుకు అన్నాడిఎంకె, బిజెపి సిద్దంగా ఉన్నాయి. అయితే పార్లమెంట్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల నాటికి బలాల్లో పెను మార్పులు జరిగే పరిణామాలేవీ జరగలేదు. ఈ నేపధ్యంలో ఫలితాలు కూడా లోక్‌సభ మాదిరే ఉంటాయని భావిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జిఎస్‌టి మాదిరి దేవుడి లీల అంటే మా రైతుల గతేంగాను మోడీ గారూ !

23 Wednesday Sep 2020

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices

≈ Leave a comment

Tags

Act of God, Farmers matters, Indian agri reforms, indian farmers, narendra modi promises and facts


అయ్యా నరేంద్రమోడీ గారూ !


ఒక రైతు బిడ్డగా మీకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నా. మీకు గానీ, మీ అభిమానులకు గానీ నచ్చకపోతే నచ్చ లేదని చెప్పండి, నేను చెప్పినదాంట్లో తప్పేమిటో చర్చించండిగానీ దేశద్రోహులు అని ముద్రవేయటం చాల బాగోదని మీ వారికి చెప్పండి. రైతులను తూలనాడిన వారికి ఈ దేశంలో భవిష్యత్‌ ఉండదు. వెన్ను విరగ కొడతారు.


ఉద్యోగాలు రాకపోవటానికి కుర్రాళ్లకు నైపుణ్యం లేదని ఎత్తున శిక్షణా కేంద్రాలంటూ పెద్ద హడావుడి చేశారు. నైపుణ్యం సంగతి దేవుడెరుగు ఆ పేరుతో వేల కోట్ల రూపాయలను ఆ పేరుతో స్వాహా చేశారు. కొత్త ఉద్యోగులు రాకపోగా ఉన్న ఉపాధిపోయింది. మభ్యపెట్టే కళలో మీకు మాత్రం నైపుణ్యం పెరిగిందన్నది స్పష్టం. ఆ చాతుర్యం గురించి గతంలో మా పెద్దలు ఇందిరా గాంధీ గురించి చెప్పేవారు. ఇప్పుడు మీరు ఆమెను మించిపోయినట్లు చెబుతున్నారు. తాడిని ఎక్కేవాడుంటే వాడి తలదన్నే వాడు వస్తాడు. తెలివి ఏ ఒక్కరి సొత్తూ కాదు. ఇక విషయానికి వస్తా !
పార్లమెంట్‌లో ఆమోదించిన వ్యవసాయ సంస్కరణల చట్ట సవరణ బిల్లులు ఒక మూలమలుపు అని మీరు వర్ణించారు. నిజంగానే, అయితే అది రైతులను ముంచేందుకా తేల్చేందుకా అన్నదే సమస్య. అధికారానికి వచ్చిన నాటి నుంచి నేటి వరకు చెప్పిన మాట చెప్పకుండా, చెప్పినదాని గురించి మరోసారి మాట్లాడకుండా కొత్త విషయాలను జనానికి చెప్పటంలో దిట్టగా మారారు. ఈ విషయంలో మీకు మరొకరు సాటి రారు. అమెరికా అగ్రనేత అబ్రహాం లింకన్‌ ఒక మాట చెప్పారు. ” మీరు కొంత మంది జనాన్ని ఎల్లవేళలా, అందరినీ కొన్ని వేళల్లో వెర్రి వెంగళప్పలను చేయగలరు. అయితే మీరు అందరినీ, అన్ని వేళలా ఆ పని చేయలేరు ” అన్నారు. ఆ మాదిరిగానో మరో విధంగానో తెలియదు గానీ ఈ సారి మీ మాటలను నమ్మేందుకు సిద్దంగా లేమంటూ కరోనాను సైతం ధిక్కరించి రైతులు వీధుల్లోకి వస్తున్నారు. మీ సిబ్బంది లేదా మీ పార్టీ వారు మీకు ఈ విషయాలు సరిగా చెబుతున్నట్లు లేదు ? లేక మీరే వినేందుకు సిద్దంగా లేరా ? ఏదైనా కావచ్చు, జనానికి మీరు ఏం చేస్తున్నారనేదే ముఖ్యం. నా అమాయకత్వం గాకపోతే అప్రియములు రాజుగారికి చెప్పకూడదనే వంది మాగధుల లోకోక్తి మీకు తెలియకుండా ఉంటుందా ? మీ దోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ మాదిరి మీరు తరచూ విలేకర్ల సమావేశాలు పెడితే రెండోవైపు ఏం జరుగుతోందో మీకు తెలిసేది. సముద్రాలు ఇంకి పోయినా, భూమ్యాకాశాలు దద్దరిల్లినా, అటు సూర్యుడు ఇటు పొడిచినా, ఇసుక నుంచి తైలం తీసినా, కుందేటి కొమ్ము సాధించినా పదవిలో ఉన్నంత కాలం విలేకర్ల గోష్టి పెట్టను, వారి ముందు నోరు విప్పను అని మీరు పట్టిన పంతం అనితర సాధ్యమే ! మీరు తప్ప ఇంతవరకు ప్రపంచంలో మరొక లేరు, భవిష్యత్తులో ఉండరు !


2022-23 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని మీరు గతంలో ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. దాని గడువు ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉంది. 2015-16 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఏడు సంవత్సరాల్లో రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలని మీరు ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌ తయారు చేసిన ఒక పత్రంలో పేర్కొన్నారు. దీనికి గాను ఏటా వృద్ధి రేటు 10.4శాతం ఉండాలని పేర్కొన్నారు. ఇప్పుడు మీరు దాని ప్రస్తావన లేకుండా కొత్తవిషయాలు చెబుతున్నారు. పాత వాగ్దానం మరచిపోయినట్లుగా కనిపిస్తోంది, దేని మీదా నిలకడ కనిపించటం లేదు. అందుకే మాకు అనుమానం. ఈ విషయంలో మీకు మీరే సాటి కదా ! నల్లధనం అన్నారు, పెద్ద నోట్లను రద్దు చేశారు. సాధించిందేమిటో మీ నోట మేం వినలేదు. గుజరాత్‌ తరహా అభివృద్ధి అన్నారు, అదీ అంతే, అచ్చే దినాలన్నారు. చచ్చేదినాలు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఆ మధ్య మన్‌కీ బాత్‌లో కుక్కలను పెంచాలని పిలుపు ఇచ్చారు. ఆకలో అన్నమో రామచంద్రా అని జనం అంటుంటే పోషకాహారం తినాలని చెప్పారు. ఎమితిని సెపితివి కపితము అన్నట్లుగా అలా ఎందుకు మాట్లాడుతున్నారో, మీకు ఏమైందో అని మేమంతా జుట్టు పీక్కుంటున్నాము.


కరోనాతో నిమిత్తం లేకుండానే మీ అచ్చేదిన్‌లోనే ఒక్క ఏడాది కూడా నీతి అయోగ్‌ చెప్పిన 10.4శాతం వృద్ధి రేటు లేదు. అసలు మొత్తం జిడిపి వృద్ధి రేటే ఆ స్దాయిలో లేదు. అయితే ఈ కాలంలో విత్తనాల బిల్లు, నగదు బదిలీ, కనీస మద్దతు ధరల పెంపు, జీరో బడ్జెట్‌, సహజ వ్యవసాయ సాగు, వ్యవసాయ ఉత్పత్తిదార్ల వ్యాపార సంఘాల గురించి మీరు, మీ మంత్రులు ఎన్ని కబుర్లు చెప్పారో ఎప్పుడైనా ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటారా ? అవన్నీ పక్కన పెట్టి కొత్త విషయాలు చెబుతున్నారు ? నిజమే, ఇన్ని తెలివి తేటలు ఎక్కడి నుంచి వచ్చాయా అని సాగుపనులు ముగిసిన తరువాత పిచ్చాపాటీలో మేము అనుకుంటూ ఉంటాం.


మాట్లాడితే స్వామినాధన్‌ పేరు చెబుతారు. కనీస మద్దతు ధరల నిర్ణయంలో ఆయన కమిటీ చేసిన సిఫార్సును గత పాలకులు, మీరూ పట్టించుకోలేదు.విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ కూలీలు, దున్నకం,కుటుంబ సభ్యుల శ్రమ, భూమి కౌలును పరిగణనంలోకి దీసుకొని ఉత్పాదక ఖర్చు మీద 50శాతం అదనంగా కనీస మద్దతు ధరలను ప్రకటించాల్సి ఉండగా దాన్ని నీరుగార్చారు. చిన్న రైతుల వ్యవసాయ వాణిజ్య సహాయతా సంఘం(సఫాక్‌) పేరుతో ఒక సంస్ధను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.నిజానికి అలాంటి ఉత్పత్తిదారుల సంఘాలు చాలా కాలం నుంచి ఉన్నాయి. అవిగాక కొత్తగా ఐదువేల కోట్ల రూపాయలతో 2023-24 నాటికి పదివేల నూతన సంఘాలను ఏర్పాటు చేయతలపెట్టారు. ఇప్పటి వరకు నాలుగు వేల సంస్ధలను నాబార్డ్‌ ఏర్పాటు చేసింది. ఇవన్నీ సహకార సంఘాల వంటివే. గతంలో భూస్వాములు, ధనిక రైతులు సహకార వ్యవస్ధలను ఎలా నాశనం చేసిందీ చూశాము. అయితే సహకార సంఘాలకు, వీటికీ తేడా ఉంది. వీటికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావటం లేదు, హామీ కావాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ సంస్ధలు ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా గతంలో ఏర్పాటు చేసిన అనేక సంస్ధలు మూతపడ్డాయి, అనేకం నామమాత్రంగా పని చేస్తున్నాయి. సఫాక్‌ ఇటీవల విడుదల చేసిన ఒక పత్రంలో వెల్లడించిన సమాచారం ప్రకారం 30శాతం సంస్దలు మాత్రమే బతికి బట్టగలుగుతున్నాయి, 20శాతం జీవన పోరాటం చేస్తున్నాయి. మిగిలిన కంపెనీలు వివిధ దశల్లో ఉన్నాయి, కార్యకలాపాలను ప్రారంభించలేదు. కొత్తగా ఏర్పాటు చేసే సంస్ధలకు ఐదు సంవత్సరాల పాటు ఏటా ప్రతి సభ్యుడికీ రెండువేల రూపాయల చొప్పున లేదా ఒక సంస్దకు గరిష్టంగా 15లక్షలకు మించకుండా మాచింగ్‌ గ్రాంట్‌, రెండు కోట్ల రూపాయల వరకు రుణం ఇస్తుంది. ఈ పరిమితుల కారణంగా అనేక సంస్ధలు చిన్న స్ధాయిలో మాత్రమే వ్యాపారం చేస్తున్నాయి. అయినా కంఠశోష గాకపోతే మీకు ఈ విషయాలు తెలియవా ? కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్‌లో ఆమోదం పొందిన బిల్లులు చట్ట రూపం దాల్చిన తరువాత బడాకంపెనీలు పెద్ద ఎత్తున రంగంలోకి దిగుతాయి. పెద్ద కంపెనీలే బడా సంస్ధల దెబ్బకు తట్టుకోలేకపోతున్నపుడు వాటితో రైతు సంస్ధలు ఏమేరకు బతికి బట్టకడతాయన్నది మా ప్రశ్న.


నేరుగా (సబ్సిడీ) నగదు బదిలీ పధకం వలన తమ పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయని, గతంలో మాదిరే సబ్సిడీ ధరలకే ఎరువులను అందించాలని నీతి అయోగ్‌ తరఫున జరిపిన ఒక సర్వేలో 64శాతం మంది రైతులు చెప్పినట్లు తేలింది. అయితే దీన్ని అంగీకరిస్తే సబ్సిడీల ఎత్తివేతకు సోపానమైన నేరుగా నగదు బదిలీ పధకాన్ని నిలిపివేయాల్సి వస్తుందని గాకపోతే దాన్ని ఎందుకు అంగీకరించలేదో చెబుతారా ? నిరుద్యోగం నాలుగు దశాబ్దాల రికార్డును బద్దలు కొట్టింది అని గతేడాది పార్లమెంట్‌ ఎన్నికల ముందు ఒక ప్రభుత్వ నివేదిక వచ్చింది. పకోడీలు అమ్మేవారికి కూడా ఉపాధి కల్పించినట్లే, అలాంటి వాటిని లెక్కల్లోకి తీసుకోలేదని అప్పుడు చెప్పారు. తరువాత గుట్టుచప్పుడు కాకుండా దాన్నే ఆమోదించారు. నేరుగా సబ్సిడీ బదిలి గురించి అబ్బే అబ్బే ఇది సమగ్రమైన సర్వే కాదు, తగినంత మంది లబ్దిదారులను ప్రశ్నించలేదు అని నివేదికను తిరస్కరిస్తున్నట్లు 2019నవంబరు 19న పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు చెప్పించిన మీ చతురతను ఎలా మరచిపోగలం !


జీరో బడ్జెట్‌, సేంద్రీయ వ్యవసాయం పేరుతో మీ బిజెపితో కలసి పాలన సాగించిన చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ఊదరగొట్టారు. అది రైతాంగ ఆదాయాలు రెట్టింపు కావటానికి, రైతులు రుణ విముక్తులు కావటానికి తోడ్పడుతుందని చెప్పారు.ఈ తరహా వ్యవసాయాన్ని చేయించే తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఉన్నట్లు 2018లో పెద్ద హడావుడి చేశారు. ఎనభై లక్షల ఎకరాల్లో రసాయన ఎరువులు లేని సేంద్రీయ వ్యవసాయాన్ని 60లక్షల మంది రైతులు 2024 నాటికి సాగిస్తారని చెప్పారు. ఏమైనట్లు ? దేశంలో ఇప్పుడు దాని ఊసే ఎత్తటం లేదేమి ? ఆవు పేడ, మూత్రం పేరుతో రాజకీయాలు చేయటం తప్ప మీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా వాటితోనే పంటలు పండిస్తున్నారా ? ఇప్పుడు మీరు చెబుతున్న కార్పొరేట్‌ లేదా కాంట్రాక్టు వ్యవసాయం ఆవు పేడ, మూత్రంతోనే చేయిస్తారా ? అమాయక రైతులం మీరు ఏం చెప్పినా వినక చస్తామా ?


కేంద్ర వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు వీధుల్లోకి వచ్చారు. దీని వెనుక మార్కెట్లు రద్దయితే ఆదాయం కోల్పోయే వ్యాపారులు ఉండి నడిపిస్తున్నారని మీ పార్టీ బిజెపి ప్రచారం చేస్తోంది. ఒక వైపు మార్కెట్లను రద్దు చేస్తామని మేమెక్క డ చెప్పాం అంటారు , ఏంది సారూ ఇది ! ఆందోళనకు దిగిన వారు దేశద్రోహులని మీవారే సామాజిక మాధ్యమంలో దాడి చేస్తున్నారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటానికి ప్రధాన కారణం ఈ రంగానికి సబ్సిడీలను రద్దు లేదా గణనీయంగ కోత పెట్టటం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టకపోవటం, తగిన ధరలు లేకపోవటం, దిగుబడులు పెరగకపోవటం, పరిశోధనలను పక్కన పెట్టటం వంటి అనేక కారణాలు ఉన్నాయి. వ్యాపారుల దోపిడీ అనేది ఒక కారణం మాత్రమే. పాలకులకు చిత్తశుద్ది ఉంటే దాన్ని కూడా తగ్గించవచ్చు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించాలి కనుక ఏదో ఒక సాకు చూపాలి. రైతులకు ప్రత్యక్షంగా కనిపించేది వ్యాపారులు, వారి అక్రమాలే కనుక వారిని చూపి మీరు చేయదలచుకున్నది చేస్తున్నారు తప్ప మరొకటి కాదని అనుకుంటున్నాం. పార్లమెంటులో మాదిరి వ్యవసాయ చట్టాలను మా మీద రుద్దటం సాధ్యం కాదని సవినయంగా మనవి.
వ్యవసాయ మార్కెట్‌ యార్డులను రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిస్తాయి. అక్కడ వ్యాపారం చేసే వారు విధిగా ప్రభుత్వం వద్ద నమోదు కావాలి. అక్కడ జరిగే లావాదేవీల వలన ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. కనీస మద్దతు ధరలకంటే తక్కువకు కొనుగోలు చేస్తే ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. దళారులను అరికట్టేందుకే జాతీయ ఎలక్ట్రానిక్‌ వ్యవసాయ మార్కెట్‌ (ఇనామ్‌)ను ప్రవేశపెడుతున్నట్లు మీరు 2016లోనే చెప్పారు. అనేక రాష్ట్రాలకు చెందిన మార్కెట్లను వాటితో అనుసంధానం చేశారు. మొత్తం 2,500 మార్కెట్‌ కమిటీలకు గాను 585 ఈ వ్యవస్ధలో ఉన్నాయి. (బీహార్‌లో వాటిని 2006లోనే రద్దు చేశారు) ఇప్పటివరకు దాని వలన గతం కంటే రైతులు పొందిన ప్రయోజనాలు ఏమిటో ఎవరైనా రైతులకు వివరించారా ? అది నిజంగా ప్రయోజనకరంగా ఉంటే అన్నింటినీ అనుసంధానించాలని వత్తిడి తెచ్చి ఉండేవారు కాదా ?ఈ పాటికి రైతులు మొత్తం ఆ వ్యవస్ధ ద్వారానే లావాదేవీలు ఎందుకు జరపటం లేదు ?


ఇక్కడ మరో విషయాన్ని కూడా చెప్పాలి. మార్కెట్‌ యార్డుల వెలుపల వాణిజ్య లావాదేవీలు జరిపితే వ్యాపారులు పన్ను చెల్లించాలి. ఇప్పుడు మీరు మార్కెట్‌ యార్డులతో నిమిత్తం లేకుండా ఎక్కడైనా వ్యాపారులు కొనుగోలు చేయవచ్చు అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఈ బిల్లులకు మద్దతు ఇచ్చే విషయంలో తెలుగుదేశంతో పోటీపడి మరీ మద్దతు ఇచ్చారు. జగన్‌ నవరత్నాల అమలుకు ఇప్పటికే డబ్బు లేదు. ఇప్పుడు మార్కెట్ల ఆదాయం కూడా పోతే ఏం చేస్తారో తెలియదు. ఆదాయ నష్టానికి కేంద్రం ఒక్క పైసా కూడ ఇవ్వదు మరి. సీత కష్టాలు సీతవి- పీత కష్టాలు పీతవి అన్నట్లుగా జగన్‌ కష్టాలు జగన్‌వి పాపం !


ఆంధ్రప్రదేశ్‌ను మీరూ కాంగ్రెస్‌ మరికొన్ని పార్టీలు కలసి పోటీ బడి విభజించాయి. అప్పుడు నా సామిరంగా పార్లమెంటులో మీ వెంకయ్య నాయుడు, సుష్మ స్వరాజ్‌ వంటి నేతలు చేసిన హడావుడి, అబ్బో చూడవలసిందేగానీ చెప్పతరం కాదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా ఐదు సంవత్సరాలు పెడతామని మన్మోహన్‌ సింగ్‌ చెబితే మీ వెంకయ్య నాయుడు హడావుడి చేసి ఐదును పదేండ్లకు ఒప్పించటానికి చెమటోడ్చాల్సి వచ్చినట్లు చెప్పారు. తరువాత మీరు తిరుపతి వెంకన్న సాక్షిగా అదే చెప్పారు. తీరా జరిగిందేమిటి ? ప్రత్యేక హౌదా లేదూ పాడూ లేదు. కాంగ్రెస్‌ నేతలు విభజన చట్టంలో పెట్టి ఉంటే సాధ్యమయ్యేది నేరం వారిదే అంటూ తప్పించుకున్నారు. దాని గురించి మరోసారి మాట్లాడవద్దని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఇప్పటి సిఎం జగన్మోహనరెడ్డిగారికీ తెగేసి చెప్పారు.
పార్లమెంట్‌లో చర్చనూ విస్మరించారు. నిత్యం దేవుడి గురించి చెప్పే మీరు వెంకన్న సాక్షిగా చేసిన వాగ్దానాన్ని ఖాతరు చేయలేదు. వ్యవసాయ చట్ట సవరణల్లో కనీస మద్దతు ధర గురించి, పంటల సేకరణ హామీలను చేర్చకుండా బిల్లులను ఆమోదించారు. మరోవైపు అబ్బే అవేమీ రద్దు కావు అని నమ్మమంటున్నారు. ఒక్క మాట అడిగితే ఏమనుకోరుగా సారూ ! మీరు దేవుడు అని మా వెంకయ్య నాయుడు గారు గతంలో వర్ణించారు. జిఎస్‌టి విషయంలో కేంద్రం-రాష్ట్రాల మధ్య చట్టబద్దమైన ఒప్పందం కుదిరింది. ఐదేండ్ల పాటు పన్ను ఆదాయం తగ్గితే కేంద్రం భర్తీ చేస్తుందని దానిలో అంగీకరించారు. మన నిర్మలమ్మగారు దేవుడి లీల కారణంగా తగినంత ఆదాయం రాలేదు కనుక కేంద్రం చేసేదేమీ లేదు, కావాలంటే అప్పులిప్పిస్తాం అప్పు ఎలా కావాలో తేల్చుకోండి అన్నారు. అదేంటి సారూ మీరు దేవుడై ఉండి ఇంతవరకు మాట్లాడలేదు. పోనీ అదేమి నిర్మలమ్మా అలా మాట్లాడావేమిటి, ఆ లీల లేదా పాపం నాకు అంటుకోదా అన్ని అంతర్గతంగా కూడా ప్రశ్నించినట్లు లీకుల వార్తలు కూడా రాలేదు.


నిత్యావసర సరకుల చట్టాన్ని కూడా సవరించారు. ఏ సరుకును ఎంతైనా నిల్వచేసుకోవచ్చు. విపరీతంగా ధరలు పెరిగినపుడు మాత్రమే ఆంక్షలు అమల్లోకి వస్తాయన్నారు. ఇదేంటి సారు, నిల్వ చేసుకొనేందుకు అవకాశం ఇవ్వటం ఎందుకు, ధరలు విపరీతంగా పెరిగేంతవరకు చోద్యం చూడటం ఎందుకు ? అప్పుడు ఆంక్షలు ఎందుకు ? దీన్నే మేము నక్క పోయిన తరువాత బొక్క కొట్టటం అంటాం. మేం పండిస్తాంగానీ, వినియోగదారులంగా కూడా ఉంటాం. అంటే మా పంటలను మేమే అదానీ, అంబానీ, అమెజాన్‌లకు అమ్ముకోవాలి వారి దగ్గర నుంచి అధిక ధరలకు కొనుక్కోవాలా ఏంది సారూ. దీన్నే గోడదెబ్బ చెంపదెబ్బ అనుకుంటాం మేము. పాలనా జోక్యం తక్కువ పేరుతో మమ్మల్ని ఉత్పత్తిదారులుగా, వినియోగదారులుగా కార్పొరేట్లకు అప్పగిస్తూ చట్టాలు చేసి మీ చేతులు మీరు దులుపుకొని పోతే రేపు మాగతేంగాను ? జిఎస్‌టి మాదిరే రేపు మాకు సైతం అన్యాయం జరిగితే, అప్పుడు కూడా అంతా దైవ లీల, విధి వైపరీత్యం, మనం నిమిత్త మాత్రులం, దేవుడు ఆడించినట్లు ఆడటం, అనుభవించటం తప్ప విధి లేదా తలరాత మార్చలేం అంటే మా గతేంగాను సారూ ?
భవదీయుడు
ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

సాధికారత కాదు రైతులపై దాడి-కార్పొరేట్ల దోపిడీకి అప్పగింత !

21 Monday Sep 2020

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices, Telangana

≈ Leave a comment

Tags

Agri Bills, agriculture in india, Farmers empowerment, indian farmers


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


రైతుల స్థితిగతుల గురించి ఏమాత్రం స్పహ లేకుండా కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన సెప్టెంబరు 20 ” రైతుల పాలిట దుర్దినం”. పైగా బిల్లులు రైతుల పరిస్థితులను మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చని, ధరలను తామే నిర్ణయించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు అంటూ కేంద్రం తెచ్చిన ఈ మూడు బిల్లులు ”కరోనా వ్యాధికన్నా కూడా ప్రమాదమైనవి”.
కేవలం పెట్టుబడులు- లాభాలు తప్ప ఏ నిబంధనలు పాటించని విదేశీ, స్వదేశీ కంపెనీలు రైతుల పంటలను తక్కువ ధరలకు కొని, భారీగా నిల్వ చేసి, వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతాయి. ఇప్పటివరకు చట్టవిరుద్దంగా బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తున్నారు.కొత్త బిల్లు ప్రకారం ఎంతైనా నిల్వ చేసుకోవచ్చని చట్టమే అనుమతిస్తే ఇక వీరికి అడ్డెవరు? ఎవరూ ప్రశ్నించటానికికూడా చట్టం అనుమతించదు. ఇప్పటివరకూ చట్టవిరుద్దమైన బ్లాక్‌ మార్కెటింగ్‌ ఇకనుండి చట్టబద్దమవుతుంది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు నిర్వీర్యంమవుతాయి. ప్రభుత్వం నిర్ణయిస్తున్న మద్దతు ధరను అమలుపరచటానికి మార్కెట్‌ యార్డులుండవు. ప్రైవేట్‌ కంపెనీలు ఇష్టమొచ్చిన ధరకు ఇష్టమొచ్చిన చోట కొనుక్కోవచ్చు, ఇష్టమొచ్చినంత సరుకును గోదాములలో దాచుకోవచ్చు. వారిపై ఎటువంటి పన్నులూ వుండవు. అగ్రి బిజినెస్‌ కంపెనీలు ధరలు నిర్ణయించటానికి, ముందస్తు వ్యాపారానికి( ఫ్యూచర్‌ ట్రేడింగ్‌ )కీఈబిల్లులు అవకాశం కల్పిస్తాయి.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిత్యావసర వస్తువుల చట్టంలో చిరుధాన్యాలు,పప్పు ధాన్యాలు,ఆలుగడ్డలు ఉల్లిపాయలు ఇకపై నిత్యావసర సరుకుల చట్టం పరిధిలోకి రావు, నిల్వ చేసుకోవచ్చు. అసాధారణంగా ధరలు పెరిగినపుడే ప్రభుత్వాలు ఆంక్షలు విధించాలని చెబుతున్నాయి. ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. పెద్ద మొత్తంలో నిల్వ చేసుకున్నవారే ధరలను నియంత్రిస్తారు.ఎగుమతి దిగుమతి విధానాలు కూడా వీరే నిర్ణయిస్తారు. ఇకపై వ్యాపార సంస్ధలు,కంపెనీలు, ఎటువంటి రుసుములు లేకుండా వ్యాపారం చేసుకోవచ్చని కొత్తచట్టం చెప్తోంది.రిలయన్స్‌, అదానీ, పెప్సీ వంటి బడా కంపెనీలు వ్యవసాయ వ్యాపారంలో ప్రవేశించారు. వారికి మార్గం సుగమం చేయటమే వ్యవసాయ, నిత్యావసర సరకుల చట్టాల సవరణ బిల్లుల లక్ష్యం.
ఈబిల్లు వలన నిత్యావసర సరుకుల కత్రిమ కొరత సష్టించేందుకు దారితీసే ప్రమాదం ఉందని అనుభవం చెప్ప్తున్నది. బ్రిటిష్‌ పాలనలో రైతులను కాల్చుకు తిన్నారు. అదే విధంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చట్టం ద్వారా అన్నదాత పొట్ట కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నది. రైల్వేల నుంచి విమానాల వరకు అన్నింటిని ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలకు అప్పచెప్తున్నది. కోల్డ్‌ స్టోరేజ్‌లు ఎక్కువ కట్టినందువలన వ్యవసాయఉత్పత్తులను నిల్వ చేసుకోటానికి రైతులకు అవకాశం లభిస్తుందంటున్నారు. కోల్డ్‌ స్టోరేజి లు ఎవరివి? ఎవరు కడతారు? వ్యాపారులకు అది కూడా ఒక లాభసాటి వ్యవహారమే.
ఎక్కువ రోజులు వ్యవసాయ ఉత్పత్తులను ఆపుకోగలిగిన శక్తి సామాన్య రైతులకు లేదు. చిన్న రైతులు 86.2 శాతం మందివున్నారు. 12 కోట్ల 60 లక్షల చిన్న రైతులకు ఒక్కొక్కరికీసగటున 0.6 హెక్టార్ల సాగు భూమి మాత్రమేవున్న విషయాన్ని గమనించాలి. కౌలు రైతులైనా చిన్న రైతులయినా పంటను ఎక్కువ రోజులు నిల్వ చేసి మంచి ధర కోసం ఎదురు చూడలేరు. తెచ్చిన అప్పులను చెల్లించటానికి, కుటుంబం గడవటానికి పంటను అమ్ముకోక తప్పదు. ఎక్కువ శాతం పంట అమ్ముకున్న తరువాత ధరలను పెంచటం ప్రపంచ అగ్రిబిజినెస్‌ నాటకంలో భాగమే.

కనీస మద్దతు ధరకే కొనాలని ఈ బిల్లులో వుందా?
కనీస మద్దతు ధరకన్నా తక్కువ ధరకు కంపెనీలు కొనటానికి వీలులేదని ఈ బిల్లులో ఎందుకు చేర్చ లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.పెద్ద పెద్ద కంపెనీలకు స్టోరేజ్‌, ప్రాసెసింగ్‌ సదుపాయాలు కల్పించి మార్కెట్‌ పై పూర్తి అధికారాలను వారికి కట్టపెట్టే ప్రయత్నంలో భాగమే ఈ బిల్లు, ఇది రైతులకు గిట్టుబాటు ధర లభించే పరిస్థితిని ఇంకా దూరం చేస్తుంది. కార్పొరేటు కంపెనీలకి మేలుచేసేందుకే ఈ బిల్లులకు ఆమోదం పొందారు. ఒప్పంద వ్యవసాయం ప్రారంభమైతే ప్రభుత్వం నిర్ణయించే కనీస మద్దతు ధరల ప్రమేయం ఉండదు. ఒప్పంద షరతులను ఒక సారి రైతులు అంగీకరించిన తరువాత ఎవరైనా కోర్టుకు వెళ్లినా చెల్లదు.
ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ , తెలుగుదేశం రెండు కూడా ఈ బిల్లును సమర్థించాయి. దీన్ని ఎలా వ్యతిరేకించాలా అని రైతులు, ప్రజలు ఆలోచించాలి. స్వామీనాధన్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధరల నిర్ణయం, అవసరమైనపుడు పంట కొనుగోళ్ళను ప్రభుత్వం చేపట్టనంతకాలం రైతుకు మంచి ధర దొరకదు. వ్యవస్ధలో వున్న లోపాలను సవరించి రైతులకు లాభంచేయాల్సిన ఫ్రభుత్వాలు ఏకంగా వ్యవసాయమార్కెట్లను నాశనం చేయపూనుకున్నాయి. ఇల్లంతా ఎలుకలున్నాయని ఇల్లు తగలపెట్టడానికి పూనుకుంటున్నారు.
ఆహారస్వావలంబన సాధించి దేశానికి అన్నం పెట్టే రైతులను నాశనం చేయటం వలన దేశ స్వాతంత్య్రం, సార్వభౌమత్వం నాశన మౌతాయి. బీహార్‌ రాష్ట్రం లో 2006 సం.లోనే వ్యవసాయమార్కెట్‌ లను రద్దు చేశారు.మార్కెట్‌ కమిటీల రద్దు తర్వాత ధరలు తగ్గిపోయాయి. ఉదాహరణకు మొక్కజొన్న క్విటాలుకు మద్దతుధర రూ.1850.వుంది. ఎక్కువ మంది రైతులు 1000 రూపాయల కన్నా తక్కువ ధర కే అమ్ముకోక తప్పలేదు. మద్దతు ధర కే కొనాలనే నిబంధన బిల్లులో ఎక్కడా లేదు. క్రమేపీ కనీస మద్దతు ధరను ఉపసంహరించుకోవటానికే ఆ నిబంధనలను చేర్చలేదని అర్ధమౌతుంది.

ఫెడరలిజం స్ఫూర్తికి వ్యతిరేకం

రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం ఉమ్మడి జాబితా లోనిది. ఫెడరలిజం స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తన పెత్తనాన్ని రుద్దుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే బిల్లులను నిరంకుశంగా తెచ్చారు. రైతన్నలలో తలెత్తుతున్న ఆందోళనలను ఖాతరు చేయకుండా ప్రవేశపెట్టొందంటూ తాను ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం వినిపించుకోలేదని అకాలీదళ్‌ నేత, కేంద్ర మంత్రి హరిసిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా చేశారు.

బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లులను సెలెక్ట్‌ కమిటీ కి పంపాలన్న ప్రతిపాదనను కూడా ప్రభుత్వం తిరస్కరించింది. ఓటింగ్‌ జరపాలన్న ప్రతిపాదనను ఖాతరు చేయలేదు. రూల్స్‌ ప్రకారం ఒక్క ఎంపీ అడిగినా ఓటింగ్‌ పెట్టాలి. పార్లమెంటు సభ్యులు చేసేదేమీ లేక కోపంతో బిల్లు ప్రతులను చించివేశారు. పోడియం వైపు దూసుకు వెళ్లారు. గొంతెత్తి అరిచారు.
విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌ ప్రకటించారు.

బిల్లుల పై భిన్న వ్యాఖ్యానాలు..

వ్యవసాయ బిల్లులను పార్లమెంటు ఆమోదించటం వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని మార్చేస్తుందని, కోట్లాదిమంది రైతులకు సాధికారతను ఇస్తుందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు.
రైతుల దగ్గర నుంచి ప్రైవేటు వ్యక్తులు పంటను కొనేధర కనీస మద్దతు ధర కంటే తక్కువ ఉండకూడదనే నిబంధనను బిల్లులలో ఎందుకు పొందుపరచ లేదని మాజీ మంత్రి చిదంబరం ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు ఆహార భద్రతకు విఘాతం కల్పిస్తాయని కూడా అన్నారు.

వ్యవసాయ రంగ బిల్లులు” రైతుల పాలిట మత్యు గంటలు” అని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ అన్నారు. ఈ బిల్లు చట్టంగా మారితే వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలు అన్ని కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్తాయని ఫలితంగా రైతులకు కనీస మద్దతు ధర లేకుండా పోతుందని స్ఠాలిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్కరణల పేరుతో మోదీ సర్కార్‌ తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు దేశానికి తీరని నష్టం చేస్తాయని, దేశానికి వెన్నెముక అయిన రైతుల్ని కార్పొరేట్‌ శక్తులకు బానిసలుగా మార్చేస్తుందని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. రైతాంగం, వ్యవసాయం పై ముప్పేట దాడి చేస్తున్నారని, బడా వ్యా పారవేత్తలు, కార్పోరేట్‌ సంస్ధలు, అగ్రిబిజినెస్‌ సంస్ధలు పెద్దఎత్తున దోపిడీ చేయటానికి ఒక నిబంధనావళిని రూపొందిస్పున్నారని మార్క్సిస్టు పార్టీ నాయకులు అన్నారు.
తమకున్న కొద్దిపాటి సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్ళి అమ్ముకోవటం సాధ్యమేనా ? ఇది తేనెపూసిన కత్తి లాంటి చట్టం అని, దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించితీరాలని, కార్పోరేట్‌ గద్దలకోసమే ఈ వ్యవసాయ బిల్లు అని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వ్యవసాయబిల్లులు అన్నదాతలకు డెత్‌ వారెంట్‌ లాంటివని కాంగ్రెస్‌ ఎంపీ ప్రతాప్‌ సింగ్‌ బస్వా వ్యాఖ్యానించారు.రైతుల ప్రాణాలను హరించే ఈ బిల్లిలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
రైతులనుబానిసలుగా మారుస్తారా అని డీయంకే ఎంపీ ఇళంగోవాన్‌ ప్రశ్నించారు. రైతుల ఉసురు తీసుకునేవి.రైతులను ఆటవస్తువులుగా మార్చేస్తాయని ఇళంగోవాన్‌ విమర్శించారు.ఈ బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో కనీసం ఆర్‌ యస్‌ యస్‌ అనుబంధరైతు సంఘాలతోనూ చర్చించలేదని ఎస్‌ పీ నేత రాంగోపాల్‌ యాదవ్‌ అన్నారు.

25న ఆందోళనకు 250 రైతుసంఘాల పిలుపు

వ్యవసాయ రంగ బిల్లుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేష్‌ రాష్ట్రాలలో తీవ్ర ఆందోళనలు మొదలు పెట్టారు. బిల్లులను ఉపసంహరించుకునేలా ఆందోళన తీవ్రతరం చేయాలని భారతదేశంలోని 250 రైతుసంఘాలు నిర్ణయించాయి. ఈ నెల 25న బందుకు పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాలలోనూ కలెక్టర్‌ఆఫీసుల వద్ద ఆందోళనలకు సిద్దమవుతున్నారు. రైతుల పైనా వ్యవసాయం పైనా జరుగుతున్నదాడిని ఎదుర్కోవాలి.

గమనిక : వ్యాస రచయిత ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమడ ప్రాంత రైతు సంఘం నాయకులు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అకాలీ మంత్రి రాం రాం, 25న భారత బంద్‌ – బిజెపి భజన పార్టీల్లో భయం భయం !

19 Saturday Sep 2020

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices, Telangana

≈ Leave a comment

Tags

Farmers agitations, SAD minister quits modi cabinet, September 25th Bharat Bandh


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వం మీద ఉన్న భ్రమలను పోగొట్టటంలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు సాధ్యం కాలేదని చెప్పుకొనేందుకు సంకోచించాల్సిన అవసరం లేదు. జనంలో కిక్కు అలా ఉన్నపుడు ఒక్కోసారి సాధ్యం కాదు మరి. గతంలో ఇందిరా గాంధీ మీద కూడా జనం ఈగవాలనిచ్చే వారు కాదు. ఈనెల 25న భారత బంద్‌కు పిలుపు ఇవ్వటం ద్వారా రైతు సంఘాలు మట్టి పిసుక్కునే రైతును మోడీ గురించి ఆలోచింప చేస్తున్నాయి. అకాలీ దళ్‌ మంత్రి హరసిమ్రత్‌ కౌర్‌ నరేంద్రమోడీ కొలువు నుంచి తప్పుకుంటూ చేసిన రాజీనామా మోడీ మీద మరులుకొన్న వారిని ఒక్క కుదుపు కుదిపింది. దీనర్ధం ఇప్పటికిప్పుడు ఏదో జరిగిపోతుందని కాదు. సంస్కరణలు, రైతాంగాన్ని ఆదుకొనే పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ ముందుకు తెస్తున్న ముప్పు గురించి గ్రామీణ భారతంలో తీవ్ర మధనానికి ఈ పరిణామం తోడ్పడుతుంది. ఈ రోజు కావాల్సింది అదే. పొలాలు పదునెక్కితేనే పంటలకు అదును, సాగు సాధ్యం. రైతాంగ బుర్రలకు అదే వర్తిస్తుంది. తమ పంటలకు మిత్ర పురుగులేవో శత్రుకీటకాలేవో తెలుసుకోగలిగిన రైతాంగం తమకు మేలు-కీడు చేసే వారిని, విధానాలను గుర్తించలేరా ?
పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రైతాంగం కరోనాను కూడా లెక్కచేయకుండా వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. దాన్ని లెక్కచేయకుండా నాకెదురేముంది అన్నట్లు పార్లమెంట్‌లో నరేంద్రమోడీ రైతాంగానికి నష్టం-కార్పొరేట్లకు ఇష్టమైన వ్యవసాయ సంబంధిత బిల్లులను ఆమోదింపచేసుకున్నారు. మేమూ సంగతేమిటో తేల్చుకుంటామని రైతులు చెబుతున్నారు. రైతువ్యతిరేకమైన చర్యలను తాము ఆమోదించలేమని చెబుతూ పంజాబ్‌ శిరోమణి అకాలీదళ్‌(ఎస్‌ఏడి) పార్టీకి చెందిన మంత్రి హరసిమ్రాత్‌ కౌర్‌ బాదల్‌ గురువారం నాడు రాజీనామా చేయటం, దాన్ని శుక్రవారం నాడు రాష్ట్రపతి ఆమోదించటం వెంటవెంటనే జరిగిపోయాయి. రాజ్యసభలో ముగ్గురు, లోక్‌సభలో ఇద్దరు సభ్యులున్న ఈ పార్టీ మంత్రి వర్గం నుంచి తప్పుకుంది తప్ప ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చినట్లు ఇది రాస్తున్న సమయానికి ప్రకటించలేదు. తాము పదవి వీడినా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తూనే రైతాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తామని అకాలీదళ్‌ నేత, లోక్‌సభ ఎంపీ అయిన సుఖవీందర్‌ సింగ్‌ ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ కుమారుడే సుఖవీర్‌, ఆయన భార్యే హరసిమ్రాత్‌ కౌర్‌. స్ధానిక వత్తిళ్ల కారణంగానే ఆమె రాజీనామా చేశారు తప్ప తమ రైతాంగ విధానాలు కాదని బిజెపి ప్రకటించి సమస్య తీవ్రతను మభ్యపెట్టేందుకు, ఆందోళన చేస్తున్న రైతాంగాన్ని అవమానించేందుకు ప్రయత్నించింది. ఈ పూర్వరంగంలో ఆ పార్టీని తమ కూటమిలో ఉంచుకొని బిజెపి బావుకొనేదేమీ ఉండదు, అలాగే కొనసాగి అవమానాల పాలుకావటం తప్ప అకాలీదళ్‌ పొందే లబ్ది ఏమీ ఉండదు. ఈ నెల 25న భారత బంద్‌కు రైతు సంఘాలు పిలుపు నిచ్చినందున ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ పార్టీ దాని పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటాయన్నది యావత్‌ ప్రజానీకం కన్పార్పకుండా చూడనుంది.
అకాలీ మంత్రి రాజీనామాకు ముందు జరిగిన పరిణామాలు ఆసక్తికరంగా, చిత్తశుద్ధిని ప్రశ్నించేవిగా ఉన్నాయి. అకాలీదళ్‌ అగ్రనేత అయిన 92 ఏండ్ల ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ నివాసం ముందు రైతులు నిరసన తెలిపారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను అంతకు ముందు కేంద్రం ఆర్డినెన్స్‌ల ద్వారా తెచ్చింది. అవి రైతులకు మేలు చేకూర్చేవి అంటూ ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ సెప్టెంబరు మూడవ తేదీన ఒక వీడియో ద్వారా పంజాబ్‌ పౌరులకు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అవి రైతులకు హాని చేస్తాయంటూ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ రైతాంగాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. బాదల్‌ ప్రకటనకు నిరసగా మూడు రోజులు వరుసగా రైతులు ఆయన నివాసం ఎదుట నిరసన తెలిపారు.ఈ నేపధ్యంలో తాము కేంద్రం నుంచి రాజీనామా చేయటం తప్ప మరొక మార్గం లేదని దళ్‌ రైతు విభాగనేత సికిందర్‌ సింగ్‌ మల్కా ప్రకటించారు. బిల్లులను వ్యతిరేకించాలని దళ్‌ విప్‌ జారీ చేసింది. చర్చలో బిల్లులకు వ్యతిరేకంగా ఆ పార్టీ సభ్యులు ప్రసంగించారు. గురువారం నాడు మంత్రి రాజీనామా ప్రకటన వెలువడింది. తాను ఒక రైతుబిడ్డ, సోదరిగా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సామాజిక మాధ్యమంలో ప్రకటించారు.
అంతర్గతంగా అకాలీ దళ్‌ నాయకత్వం ఏ విధంగా భావించినప్పటికీ రైతాంగంలో తలెత్తిన భయాందోళనలను రాజకీయంగా తమను మరింతగా దూరం చేస్తాయని భయపడిందన్నది స్పష్టం. ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన మార్కెట్‌ యార్డులకు వెలుపల వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలకు ప్రభుత్వ బిల్లు అవకాశం కల్పిస్తుంది. ఇది తమకు నష్టదాయకమని రైతులు భావిస్తున్నారు. వ్యాపారులు దేశంలో ఎక్కడైనా ఎలక్ట్రానిక్‌ పద్దతుల్లో పంటలను కొనుగోలు చేయవచ్చు.రైతులు అమ్కుకోవచ్చు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశిత మార్కెట్ల వెలుపల జరిగి క్రయ, విక్రయాలపై మార్కెట్‌ ఫీజు, లెవీ, సెస్‌ల వంటివి విధించేవి.కార్పొరేట్లకు అనుకూలంగా తాజా బిల్లుతో వాటిని రద్దు చేశారు.
నిత్యావసరకుల చట్టానికి చేసిన సవరణల ప్రకారం కొన్ని ఉత్పత్తులను నిత్యావసర లేదా అత్యవసర వస్తువులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు. వాటి ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యాలను క్రమబద్దీకరించటం లేదా నిషేధించవచ్చు. యుద్దం, కరవు, అసాధారణంగా ధరల పెరుగుదల, ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే కొన్ని ఆహార వస్తువులు, ఉత్పత్తుల సరఫరాలను ప్రభుత్వం నియంత్రిస్తుంది. ధరలు గణనీయంగా పెరిగినపుడు మాత్రమే వ్యవసాయ ఉత్పత్తుల నిల్వల పరిమాణాలపై ఆంక్షలను ప్రకటించాల్సి ఉంది.తోటల ఉత్పత్తుల ధరలు వందశాతం, ఆహార వస్తువు ధరలు 50శాతం పెరిగినపుడు వ్యాపారుల నిల్వలపై పరిమితులు విధిస్తారు. ధరల పెరుగుదలను నిర్ధారించేందుకు గడచిన పన్నెండునెలల్లో ఉన్న ధరలు లేదా గడచిన ఐదు సంవత్సరాలలో ఉన్న ధరల సగటు తీసుకొని ఏది తక్కువైతే దాన్ని పరిగణనలోకి తీసుకొంటారు. ఉదాహరణకు ఉల్లిధర ఒక నెలలో కిలో 15 నుంచి 40 రూపాయలకు పెరిగిందనుకుందాం. అప్పుడు ఆంక్షలు విధించాలంటే పన్నెండు నెలల సగటు చూసినపుడు 30, ఐదేండ్ల సగటు లెక్కించినపుడు 40 రూపాయలు ఉంటే 30 రూపాయల మీద వందశాతం అంటే 60 రూపాయలకు పెరిగినపుడు, ఇదే విధంగా ఆహార వస్తువుల ధరల పెరుగుదల కూడా అలాగే ఉంటే 30 రూపాయల మీద యాభైశాతం అంటే 45 రూపాయలకు పెరిగినపుడు మాత్రమే వ్యాపారుల నిల్వల మీద ఆంక్షలు విధిస్తారు. లేనట్లయితే అపరిమితంగా నిల్వలు చేసుకోవచ్చు. వినియోగదారుల జేబులు కొల్లగొట్టవచ్చు.
రైతుల సాధికార మరియు రక్షిత బిల్లు పేరుతో తెచ్చిన దానిలో రైతులు మరియు వ్యాపారుల మధ్య ఒప్పందం( కాంట్రాక్టు ) కుదుర్చుకోవచ్చు. దాని ప్రకారం అంగీకరించిన మేరకు రైతులకు వ్యాపారులు ధరలు చెల్లించాలి, వ్యాపారులకు రైతులు నాణ్యమైన ఉత్పత్తులను అందించాలి. ఇక్కడే మతలబు ఉంది. నాణ్యతను నిర్ణయించేది వ్యాపారులుగానే ఉంటున్నారు తప్ప రైతుల చేతుల్లో ఏమీ ఉండదు. ఆ పేరుతో ధరల్లో కోత విధిస్తే చేసేదేమీ ఉండదు. ఇప్పుడు మార్కెట్‌ యార్డుల్లోనే నాణ్యత లేదనే పేరుతో వ్యాపారులు ధరలను తగ్గిస్తున్న విషయం తెలిసిందే. రేపు కాంట్రాక్టు వ్యవసాయంలో వ్యాపారులు అదే పని చేస్తే రైతులకు చెప్పుకొనే దిక్కు కూడా ఉండదు.
ఈ బిల్లులు చట్ట రూపం దాల్చి అమల్లోకి వస్తే భవిష్యత్‌ సాగు అవసరాలకు అనువుగా ఉంటాయని వ్యవసాయంలో మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు దోహదం చేస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ” బిల్లులు చట్టాలైన తరువాత పోటీ పెరుగుతుంది మరియు ప్రయివేటు పెట్టుబడులు గ్రామాలకు చేరతాయి. వ్యవసాయ ప్రాధమిక సదుపాయాలు సమకూరుతాయి, నూతన వ్యవసాయ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తాయి. ఈ సంస్కరణల ద్వారా తమ వ్యవసాయం లాభసాటిగా మారేందుకు రైతులు బడా వ్యాపారులు, ఎగుమతిదార్లతో సంబంధాలను నెలకొల్పుకోవచ్చు, ఆదాయాన్ని పెంచుకోవచ్చు ” అని కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్‌ చెప్పారు. ఇవన్నీ రైతాంగాన్ని మభ్యపెట్టేవే తప్ప మరొకటి కాదు.
పంజాబ్‌ రాజకీయాలను చూసినపుడు బిజెపి, నరేంద్రమోడీ పలుకుబడి అక్కడ పని చేయలేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలిచింది, అదే విధంగా లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎక్కువ సీట్లు తెచ్చుకుంది. ఒక నాడు తిరుగులేని ప్రాంతీయ పార్టీగా ఉన్న అకాలీదళ్‌ నేడు ఒక చిన్న శక్తిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలలో మూడో స్ధానానికి పడిపోయింది. రైతులు ముఖ్యంగా సిక్కు జాట్ల పార్టీగా ఉన్నది కాస్తా రైతుల్లో తన పట్టును కోల్పోయింది. కేంద్రం పైన చెప్పిన వ్యవసాయ ఆర్డినెన్స్‌లు జారీ చేసిన తరువాత గత మూడు నెలలుగా వాటిని సమర్ధించేందుకు అకాలీదళ్‌ నానా పాట్లు పడింది. దేశంలో కరోనా వైరస్‌ నిరోధంలో వైఫల్యం, ఆర్ధిక రంగంలో రికార్డు స్ధాయిలో దిగజారుడు, ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతాంగ ఆందోళనలు చూసిన తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పరువు నిలవాలంటే వాటిని వ్యతిరేకించటం తప్ప మరొక మార్గం లేదనే అంచనాకు వచ్చినట్లు కనిపిస్తోంది. లాభసాటిగా ఉంటుంది అనుకుంటే ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చినా ఆశ్చర్యం లేదు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పంజాబ్‌ రైతులు వీధుల్లోకి రావటానికి కారణాలు ఏమిటన్నది అసక్తి కరం. ఒప్పంద వ్యవసాయం అన్నది గత అకాలీ-బిజెపి ప్రభుత్వ హయాంలో 2013లోనే ప్రవేశపెట్టారు తప్ప దాని అమలు గురించి రైతాంగాన్ని వత్తిడి చేయలేదు. నరేంద్రమోడీ సర్కార్‌ తీరుతెన్నులు చూసిన తరువాత ఒప్పంద వ్యవసాయాన్ని బలవంతంగా చేయిస్తారనే భయం రైతాంగంలో తలెత్తినట్లు వార్తలు వచ్చాయి.
ఆర్డినెన్స్‌లను రద్దు చేయాలని కోరుతూ పంజాబ్‌ అసెంబ్లీ ఆగస్టు 28న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిణామం చోటు చేసుకోలేదు. గత రెండు వారాలుగా వివిధ రైతు సంఘాలు ఆందోళనలు ప్రారంభించాయి.వాటిని ఖాతరు చేయకుండా కేంద్రం ఆర్డినెన్స్‌ల స్ధానంలో బిల్లులను ప్రతిపాదించి పార్లమెంట్‌లో ఆమోదింపచేయించుకుంది.లోక్‌సభలో ఆమోదం పొందిన తరువాత అకాలీ మంత్రి రాజీనామా చేశారు. తాము కూడా బిల్లులకు వ్యతిరేకంగా ఓటువేస్తామని ఆమ్‌ ఆద్మీ ప్రకటించటంతో అకాలీల మీద వత్తిడి పెరిగింది.రాజీనామాతో తాము రైతుల కోసం పదవులను త్యాగం చేశామని చెప్పుకొనేందుకు అకాలీలు వెంటనే పావులు కదిపినట్లుగా భావిస్తున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్ధానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 77, ఆమ్‌ఆద్మీకి 20, అకాలీ- బిజెపి కూటమికి 18 మాత్రమే వచ్చాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో 13 స్ధానాలకు గాను అకాలీ, బిజెపి రెండేసి సీట్లు మాత్రమే గెలిచాయి. అకాలీ పార్టీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న బిజెపి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సగం సీట్లు కావాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. బాదల్‌ కుటుంబం కారణంగానే తాము కూడా ఓటమి పాలైనట్లు భావిస్తోంది. అందువలన కూడా రాజీనామా అస్త్రం ప్రయోగించారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం నుంచి అకాలీ మంత్రి రాజీనామా ఎన్‌డిఏలోని ఇతర చిన్న పార్టీలకు, విడిగా ఉంటూ బిజెపికి మద్దతు ఇస్తున్న ప్రాంతీయ పార్టీలకు నిస్సందేహంగా ఒక కుదుపు వంటిదే. భారత బందుకు మద్దతు ఇవ్వాలా లేదా అన్న పరీక్ష ఆ పార్టీల ముందుకు రానుంది. ఆర్ధిక వ్యవస్ధ, ఉపాధి గురించి ఆందోళనకరమైన వార్తలు వస్తున్నాయి. మరోవైపు నరేంద్రమోడీ సర్కార్‌ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. జిఎస్‌టి నష్టపరిహారాన్ని చెల్లించకుండా తప్పించుకొనేందుకు దేవుడి మీద నెట్టిన తీరు తెలిసిందే. రాబోయే రోజుల్లో ఇలాగే ఎంతకైనా తెగించే అవకాశాలున్నట్లు ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి.
ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు మంగళం పాడే విద్యుత్‌ సంస్కరణల బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణా అసెంబ్లీ తీర్మానం చేయటం ప్రాంతీయ పార్టీల్లో నెలకొన్న భయాలను వెల్లడిస్తోంది. కానీ అదే పార్టీ వ్యవసాయ సంస్కరణల గురించి ఎలాంటి తీర్మానం చేయలేదు. తీవ్రమైన అవినీతి కేసుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని వైసిపి సర్కార్‌ ఏ వైఖరి తీసుకుంటే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో అనే గుంజాటనలో ఉంది. జిఎస్‌టి బకాయిలపై దేవుడి లీల అన్న కేంద్ర వైఖరిని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలతో కలిసేందుకు ముందుకు రాలేదు. మరోవైపున విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా కేంద్రం విధించిన షరతులను అమలు చేసేందుకు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని నిర్ణయించింది. 2004 ఎన్నికల్లో బిజెపితో కలసి భంగపడిన తెలుగుదేశం2014లో లబ్ది పొందింది. వైసిపి దాడులు, కేసులను ఎదుర్కొనేందుకు బిజెపితో సఖ్యతకు ప్రయత్నించినా తాజా విద్యుత్‌, వ్యవసాయ సంస్కరణల పర్యవసానాల గురించి పునరాలోచనలో పడటం ఖాయం. ఇదే విధంగా తమిళనాడులోని అన్నాడిఎంకె, ఇతర రాష్ట్రాల్లోని బిజెపి భజన పార్టీలు కూడా ఆర్ధిక రంగంలో నరేంద్రమోడీ అనుసరించే విధానాలు, ఆర్ధిక వ్యవస్ధ కోలుకొనే తీరు, వ్యవసాయ, విద్యుత్‌ సంస్కరణలు వాటి పర్యవసానాలు, అకాలీ పార్టీ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఏ గట్టునుండాలో తేల్చుకొనేందుకు పరిణామాలు తొందర పెడుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమరావతి మూడు ముక్కలాట మరో మలుపు ?

01 Saturday Aug 2020

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, BJP, CHANDRABABU, Ycp, YS jagan


ఎం కోటేశ్వరరావు
మొండి వాడు రాజుకంటే బలవంతుడు అన్నది బాగా ప్రాచుర్యంలో ఉన్న సామెత. ఏకంగా రాజే మొండి అయితే ….గతంలో అలాంటి చరిత్ర మనకు తెలియదు, మన పెద్దలూ చెప్పలేదు. ఇప్పుడు రాజరికం లేదు గానీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి గురించి అలాంటి అభిప్రాయం అయితే ఉంది. ఆయన ఏమి చేసినా ప్రత్యర్ధులు దాన్ని వేరే విధంగా చూస్తే మద్దతుదారులు సానుకూలంగా చూస్తూ మురిసిపోతున్నారు.
మూడు రాజధానుల ఏర్పాటుకు రూపొందించిన బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయటంతో ఇతర ప్రాంతాల్లోని జగన్‌ మద్దతుదారులు ఫెళ్లున నవ్వారు. గవర్నర్‌ మీద దింపుడు కల్లం ఆశలు పెట్టుకున్నవారు, బిజెపి-జనసేన, తెలుగుదేశం పార్టీ నేతల మీద భ్రమలు పెంచుకున్నవారు గొల్లుమంటున్నారు. ఇంత ద్రోహమా అని గుండెలు బాదుకుంటున్నారు. ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్లుగా ఈ బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్రవేయగానే అంతా అయిపోలేదు కోర్టులు ఉన్నాయి అనే వారు కూడా ఉన్నారు. ఊహించినట్లుగానే గవర్నర్‌ చర్య మీద రాజధాని గ్రామాల్లో ఆగ్రహం వ్యక్తమైనా మిగతా చోట్ల లోలోపల ఉడికి పోయినా, గ్రామాల్లో, పట్టణాల్లో కరోనా పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న కారణంగా పెద్ద స్పందన వెల్లడి కాలేదు. అమరావతి కారణంగా తమ ఆస్ధుల విలువ పెరిగిందని సంతోషించిన వైసిపి మద్దతుదారులు తక్కువేమీ కాదు. రాజధాని, పరిసర ప్రాంతాల్లో గెలిచిన ఎంఎల్‌ఏలందరూ ఆ పార్టీకి చెందిన వారే. ఇప్పుడు సచివాలయం తరలింపు గురించి పైకి బింకంగా ఏమి మాట్లాడినా తమ ఆస్ధుల విలువ కూడా హరించుకుపోతున్నపుడు వైసిపి మద్దతుదారుల్లో అంతర్గతంగా సంతోషం ఏమీ ఉండదు. తమ నేతకు చెప్పలేకపోయినా గవర్నర్‌ అడ్డుకుంటే బాగుండు అని కోరుకున్న వారు లేకపోలేదు.
సుప్రీం కోర్టు, రాష్ట్రపతి ఆమోదంతో హైకోర్టు ఏర్పడింది కనుక, ఆ వ్యవస్ధల పాత ఆమోదాన్ని చెత్తబుట్టలో వేసి కొత్త ప్రతిపాదన చేస్తే దానికి కూడా ఆమోదం పొందవచ్చని కొందరు న్యాయవాదులు చెబుతున్నారు. ఇలాంటి సలహాలను నమ్మే జగన్‌ సర్కార్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విషయంలో చేతులు కాల్చుకుంది అని గమనించాలి. లేదూ హైకోర్టు మార్పు విషయంలో హక్కుల అంశం లేదు కనుక ఎవరైనా కోర్టులకు ఎక్కినా విధాన పర నిర్ణయంగా భావించి కోర్టులు అభ్యంతర పెట్టవు అన్నది ఒక అభిప్రాయం. హైకోర్టును కర్నూలులో పెట్టాలని బిజెపి కూడా కోరుతున్నది, దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర అవసరం అయితే కేంద్ర అధికారంలో ఉన్న తాము దాని సంగతి చూసుకుంటామని, సాయం చేస్తామని బిజెపి నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రపతి అంటే రబ్బరు స్టాంపు గనుక ఎక్కడ ముద్రవేయమంటే అక్కడ వేస్తారు అని చెప్పేవారూ ఉన్నారు. తనకు లాభం అని బిజెపి భావించినా- వైసిపితో తెరవెనుక ముడి గట్టిగా పడినా అది కూడా జరిగినా ఆశ్చర్యం లేదు. పాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయంతో సహా కార్యాలయాల తరలింపును కోర్టులు అడ్డుకోలేవు.
ముందు అమరావతి నుంచి సచివాలయాన్ని తరలించి తమ పంతం నెగ్గించుకోవాలన్నది వైసిపి పట్టుదల కనుక దాని కోసం బిజెపితో ఎలాంటి రాజీకైనా అంగీకరించే అవకాశం ఉంది. ఒక వేళ హైకోర్టు తరలింపులో అనుకోని అవాంతరాలు ఎదురై ఆగిపోయినా వైసిపికి పోయేదేమీ లేదు. ఆ సాకును చూపి న్యాయ రాజధానిని సీమలో ఏర్పాటు చేయలేక పోయామని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే రాజధాని ప్రాంత రైతుల్లో భూ సమీకరణ దగ్గర నుంచి అధికారంలో ఉన్నంత కాలం అది కల్పించిన ఆశలు, భ్రమలు, మునగచెట్టు ఎక్కించిన తీరు ఒకటైతే, జగన్‌ అధికారంలోకి వచ్చి అమరావతికి మంగళం పాడటానికి నిర్ణయించుకున్న తరువాత కూడా కేంద్రంలో తమకు ఉన్న పలుకుబడితో చక్రం అడ్డువేస్తామని తెలుగుదేశం నమ్మించింది. రైతులు కూడా నమ్మారు. ఇప్పుడు చంద్రబాబు నిజంగానే భావోద్వేగానికి గురైనా అదంతా నటన అనుకొనే వారే ఎక్కువగా ఉంటారు. ఎవరైనా ఒకసారి విశ్వసనీయత కోల్పోతే నిజం చెప్పినా నమ్మరు !
బిజెపి విషయానికి వస్తే అది నమ్మించి మోసం చేసిన తీరును జనం మరచిపోరు. అందువలన కన్నా లక్ష్మీనారాయణ అనే బొమ్మను పక్కన పెట్టి సోము వీర్రాజు అనే మరో బొమ్మను జనం ముందు పెట్టినా దానికి ఉన్నది పోయేదేమీ లేదు కొత్తగా వచ్చేదేమీ కనిపించటం లేదు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పరిస్ధితి ఏమిటో అర్దం కాకుండా ఉంది. నటుడు కనుక తిరిగి సినిమాల్లోకి పూర్తిగా వెళ్లవచ్చు, లేదా కాల్షీట్లు తీసుకొని బిజెపి రాజకీయ సినిమాలో పాత్రపోషించవచ్చు, నమ్ముకున్న కార్యకర్తలేమౌతారు ?
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌-బిజెపి రెండూ తమ వంతు పాత్రలను ఎలా పోషించాయో పదే పదే చెప్పుకోవనవసరం లేదు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది. బిజెపి నాటకాలు ఇంకా ఆడుతూనే ఉంది. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర పాత్ర ఉండదని, 2015 నోటిఫికేషన్‌ ప్రకారం రాజధాని అమరావతే అని, మూడు రాజధానుల విషయం పత్రికల్లో మాత్రమే చూస్తున్నామని కేంద్ర ప్రభుత్వం గతంలో పార్లమెంటులో ప్రకటించింది. వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటుకు అవసరమైన బిల్లులను రూపొందించటం, వాటిని గవర్నర్‌ ఆమోదించటంతో చట్టాలు కావటం తెలిసిందే. ఇప్పుడు గతంలో మాదిరి చెబితే కుదరదు. తన వైఖరి ఏమిటో చెప్పకతప్పదు.
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని విషయమై శివరామకృష్ణన్‌ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రమే. రాజధాని ఖరారు అయ్యేంత వరకు పదేండ్ల పాటు హైదరాబాదులో రాజధాని కొనసాగవచ్చనే అవకాశం ఇచ్చిందీ కేంద్రమే. శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులపై తెలుగుదేశం-బిజెపి సంకీర్ణ రాష్ట్ర ప్రభుత్వం నారాయణ కమిటీని వేసి అది చేసిన సిఫార్సుల ప్రకారం రాజధానిని ప్రతిపాదించింది. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారం అమరావతిని ఖరారు చేయటాన్ని కేంద్రం అంగీకరించింది. తాము నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక స్ఫూర్తి లేదా సిఫార్సులకు అనుగుణ్యంగా అమరావతి ఎంపిక లేదని కేంద్రం నాడు ఎలాంటి వివరణా కోరలేదు, అభ్యంతరమూ వ్యక్తం చేయలేదు. అక్కడ సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు నిధులు కూడా మంజూరు చేసి విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వయంగా వచ్చి రాజధానికి శంకుస్ధాపన చేశారు. చంద్రబాబు రమ్మంటే వచ్చి రాయి వేసి వెళ్లారు తప్ప దానితో బిజెకి సంబంధం లేదని ఇప్పుడు ఆ పార్టీ వారు చెబుతున్నారు. రేపు మరి విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని శంకుస్ధాపనలకు కూడా పిలిస్తే వస్తారా ? వైసిపి ప్రభుత్వం అసలు పిలుస్తుందా ? ఏం జరుగుతుందో ఎలా కథ నడిపిస్తారో చూడాలి. ఈ మూడు రాజధానుల గురించి కేంద్రానికి రాష్ట్రం ఏ రూపంలో నివేదిస్తుందో కూడా ఆసక్తి కలిగించే అంశమే.
రాజధాని ఏర్పాటులో కేంద్రం జోక్యం చేసుకోదని బిజెపి కొత్త నేత సోము వీర్రాజు చెప్పారు. దీనిలో కొత్తదనం ఏముంది. గతం నుంచీ చెబుతున్నదే. బిజెపి నేతలు పార్టీగా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నాం తప్ప కేంద్ర ప్రభుత్వ పరంగా జోక్యం చేసుకొనే అవకాశం లేదని చెబుతున్నారు, దీనిలో అవకాశవాదం తప్ప పెద్ద తెలివితేటలేమీ లేవు. ఇప్పుడు మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్రవేయటాన్ని కూడా సమర్ధిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నియామకం విషయంలో గవర్నర్‌ తీసుకున్న చర్య సరైనది అయినపుడు రాజధానుల బిల్లుల విషయంలో గవర్నర్‌ చర్య తప్పిదం ఎలా అవుతుందని చెట్టుకింది ప్లీడర్‌ వాదనలు చేస్తున్నారు. మేము గవర్నర్ల వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని పత్తిత్తు కబుర్లు చెబుతున్నారు.
ఎన్నికల కమిషనర్‌ నియామకం గవర్నర్‌ చేయాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది, కొత్త కమిషనర్‌ పదవీకాలం గురించి తెచ్చిన ఆర్డినెన్స్‌, కొత్త కమిషనర్‌ నియామకం తప్పని హైకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు దాని మీద ఎలాంటి స్టే ఇవ్వలేదు కనుక తన పదవి గురించి రమేష్‌ కుమార్‌ తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌ను కలవండన్న కోర్టు సూచన మేరకే కలిశారు. కానీ మూడు రాజధానుల బిల్లుల విషయం వేరు. వాటిని ఆమోదించవద్దని గవర్నర్‌కు లేఖ రాసిన పార్టీలలో బిజెపి కూడా ఉందని వారు మరచిపోతే ఎలా ? గవర్నర్‌ వ్యవస్ధలో జోక్యం చేసుకోము అని చెబుతున్నవారు లేఖ ఎందుకు రాసినట్లు ? లేఖ రాసినందుకే కన్నా లక్ష్మీ నారాయణను పదవి నుంచి తప్పించారా ? పోనీ లేఖ రాయటం తప్పని కొత్త అధ్యక్షుడు పశ్చాత్తాపం ఏమైనా ప్రకటిస్తారా ?
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను శాసనమండలి ఆమోదించలేదు, సెలెక్టు కమిటీకి నివేదిస్తున్నట్లు మండలి అధ్యక్షుడు ప్రకటించారు.సిఆర్‌డిఏ రద్దు బిల్లు, రాజధానికి సంబంధించి ఇతర అంశాల గురించి కోర్టులలో కొన్ని కేసులు దాఖలై ఉన్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ద చర్యలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్న వారు రాజ్యాంగ ప్రతినిధి గవర్నర్‌ గనుక వాటిని ఆమోదించవద్దని లేదా న్యాయసలహాలు తీసుకోవాలని బిజెపితో పాటు ఇతర పార్టీలు కోరాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా లేదా ఆయన కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చిన తరువాతే గవర్నర్‌ ఈ చర్య తీసుకున్నారనే విమర్శలు వున్నాయి.వాటికి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు లేదా లేదని నిరాకరిస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా మూడు రాజధానుల గురించి బిజెపిలో ఏకాభిప్రాయం లేదు. ఈ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్న లేదా ప్రకటనలు చేస్తున్న వారిని ఆ పార్టీ ఇంతవరకు కట్టడి చేయలేకపోయింది.
ఇక హైకోర్టు గురించి గతంలో చేసిన వాదనలనే బిజెపి నేతలు చేస్తున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందే ప్రావిన్సులలో హైకోర్టులు ఉన్నాయి. రాష్ట్ర రాజధానిలోనే హైకోర్టు ఉండాలన్న అంశం రాజ్యాంగంలో స్పష్టంగా లేదు. అందువలన రాష్ట్రాల ఏర్పాటు, సంస్దానాల విలీనాల సమయంలో జరిగిన ఒప్పందాల ప్రకారం రాజధాని ఒక చోట హైకోర్టు ఒక చోట ఏర్పాటు చేశారు. తిరువాన్కూరు-కొచ్చిన్‌ సంస్ధానాల విలీనం సమయంలో రాజధాని తిరువనంతపురం, హైకోర్టు కొచ్చిన్‌లో ఉండాలన్నది ఒప్పందం. అలాగే మద్రాసు ప్రావిన్సు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు రాజధాని కర్నూల్లో, హైకోర్టు గుంటూరులో ఉండాలన్నది పెద్ద మనుషుల ఒప్పందం. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినపుడు ఈ సమస్యకు బదులు ఇతరంగా ముల్కీ వంటి ఒప్పందాలు జరిగాయి. రాజధానిని విజయవాడలో పెట్టాలని కొందరు కోరినా హైకోర్టుతో సహా చివరకు హైదరాబాద్‌ను ఖరారు చేశారు. రాజధానులలో కాకుండా ఇతర చోట్ల హైకోర్టులు ఉన్న ప్రాంతాలన్నింటికీ ఇలాంటి ఏదో ఒక నేపధ్యం ఉన్నది. తరువాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలలో ఉత్తరాఖండ్‌లో హైకోర్టు నైనిటాల్‌ నగరంలో ఉంది. రాజధాని చలికాలంలో డెహ్రాడూన్‌లో, వేసవి కాలంలో దానికి 250కిలోమీటర్ల దూరంలోని గైరాసియన్‌ పట్టణంలో ఉంటుంది. ఇవేవీ వివాదం కాలేదు, ఒక సారి ఖరారు అయిన తరువాత మార్పులు జరగలేదు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఖరారైన రాజధాని విషయంలో రాజకీయం మొదలైంది.
న్యాయమూర్తుల నియామకం, హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటు వంటివి సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వ వ్యవహారం కనుక హైకోర్టు తరలింపు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రీం కోర్టు, కేంద్రమే. సచివాలయాన్ని తరలిస్తే కేంద్రం చేయగలిగిందేమీ లేదు. కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు లేదా తీరుస్తారు అన్నట్లుగా హైకోర్టు తరలింపును సుప్రీం కోర్టు ఆమోదించకపోతే, అది జరగకుండా కేవలం సచివాలయాన్నే తరలిస్తే జగన్‌ సర్కార్‌ రాజకీయంగా చిక్కుల్లో పడుతుంది. దాన్ని సొమ్ము చేసుకొనేందుకు బిజెపి రంగంలోకి దిగవచ్చు. అనేక రాష్ట్రాలు హైకోర్టు బెంచ్‌లను ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రాన్ని ఇప్పటికే అనేక సార్లు కోరి ఉన్నాయి. వాటిలో దేనినీ కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు తరలింపుకు ఆమోదం తెలిపితే కొత్త సమస్యలకు తెరలేపినట్లవుతుంది.
ఇక 2015లో వెలువరించిన గజెట్‌ నోటిఫికేషన్‌ లేదా రాజధానిగా అమరావతి ఉత్తర్వు మార్చటానికి వీలు లేని శిలాశాసనమో, చంద్రబాబు చెక్కిన శిలాఫలకమో కాదని, కొత్త ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మరొకదానిని జారీ చేయవచ్చని బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు గతంలోనే చెప్పారు. 2015లో అప్పటి ప్రభుత్వం జీవో ద్వారా నోటిఫై చేసింది కనుక ప్రస్తుతానికి అమరావతే రాజధాని అని లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో కేంద్రం పేర్కొందని ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకొని భవిష్యత్తులో రాజధానిని మరోచోటుకి మార్చి, ఆ విషయాన్ని తెలియజేస్తే కేంద్రం గుర్తిస్తుందని కూడా నరసింహారావు చెప్పారు. అదే ముక్క పార్లమెంటు సమాధానంలో బిజెపి సర్కార్‌ ఎందుకు చెప్పలేదు అని అడిగినవారు లేకపోలేదు.
ఏదీ శిలాఫలకం, శాసనం కానపుడు, మార్చుకోవటానికి అవకాశం ఉన్నపుడు స్వయంగా బిజెపి నేతలు కోరిన పదేండ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హౌదాకు విధానాలను మార్చటానికి, ఉత్తర్వులు జారీ చేసేందుకు కేంద్రానికి ఉన్న అడ్డంకి, అభ్యంతరం ఏమిటి? ఎందుకు హౌదా ఇవ్వరు. పోనీ ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు తీసుకున్న ఇతర చర్యలేమైనా ఉన్నాయా అంటే లేవు.
చంద్రబాబు నాయుడు అమరావతిని ఒక భ్రమరావతిగా చూపుతూ సింగపూర్‌, కౌలాలంపూర్‌, మరొకటో మరొక దాని పేరో చెప్పి రైతులకు, జనాలకు భ్రమలు కల్పించారు. రాజధాని తరలింపు జరిగితే రైతులకు ఎలా న్యాయం చేస్తారనే ప్రశ్న ముందుకు వచ్చింది. రాజధాని తమ ప్రాంతంలో పెడతామని చెప్పారు గనుకనే మేము భూములను ఇచ్చామని, ఇప్పుడు రాజధాని తరలిపోయి, తాము ఇచ్చిన భూములు దేనికీ పనికి రాకుండా పోతే తామేమి కావాలని వారు అడుగుతున్నారు. దానిలో తప్పు లేదు. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. వారు ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకొని భూములు ఇచ్చారు. దానికి ప్రతిఫలంగా కొన్ని సంవత్సరాల పాటు కౌలు చెల్లింపు, వారు ఇచ్చిన భూమి విస్తీర్ణాన్ని బట్టి అభివృద్ధి చేసిన రాజధాని ప్రాంతంలో కొంత స్ధలాన్ని వారికి అందచేయాల్సి ఉంది. చట్టపరంగా ప్రభుత్వం ఆ పని చేయకపోతే కోర్టులకు వెళ్లి దాన్ని సాధించుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఇక్కడ సమస్య అది కాదు. రాజధాని ఏర్పడితే ఆ ప్రాంతంలో తమ వాటాగా వచ్చిన స్ధలాలకు మంచి రేట్లు వస్తాయని, అవి మొత్తం భూముల విలువ కంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంటాయని ఆశించారు. ప్రభుత్వం అభివృద్ధి చేసిన ప్లాట్లు అంటే రోడ్లు, డ్రైనేజి వంటి మౌలిక సదుపాయాలు కల్పించి అందచేయటం. అలా ఇచ్చినా తాము ఆశించిన మేరకు ధరలు రావన్నది రైతుల అసలు ఆందోళన. దీనికి తోడు పేదలకు ఇండ్ల స్ధలాలు ఇచ్చే పేరుతో ఇతర ప్రాంతాల వారికి ఇక్కడ స్ధలాలు కేటాయిస్తే తమ భూములకు డిమాండ్‌ పడిపోతుందని, ఇలాంటి ఎన్నో అనుమానాలు ఆ ప్రాంత వాసుల్లో ఉన్నాయి.
ఇప్పటికీ బిజెపి నేతలు రాజధాని ప్రాంత రైతులకు న్యాయం చేస్తామని, చేయాలనే తాము కోరుతున్నట్లు చెబుతుంటారు. మరోవైపు మూడు రాజధానుల విషయంలో తాము చేయగలిగిందేమీ లేదంటారు. వారితో కలసిన లేదా గత ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నందున వారిని కలుపుకు ఉద్యమిస్తానని ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌ ఏమి చేస్తారో, ఏమి చెబుతారో చూద్దాం. వైసిపి నాయకులు కూడా రాజధాని రైతులకు న్యాయం చేస్తామనే చెబుతున్నారు. వారి ఆచరణ ఏమిటో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మామాా అల్లుళ్ల బడ్జెట్ల మతలబు ఏమిటి !

08 Sunday Mar 2020

Posted by raomk in Current Affairs, Economics, History, Opinion, Others, Telangana

≈ Leave a comment

Tags

T Harish Rao, Telangana Budget 20-21, Telangana CM

Image result for harish rao budget

ఎం కోటేశ్వరరావు
రెండవ సారి ముఖ్యమంత్రి అయిన తరువాత గత బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రవేశపెడితే వచ్చే ఏడాది బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి టి హరీష్‌ రావు ప్రవేశపెట్టారు. వారిద్దరూ మేనమామ-మేన అల్లుళ్లన్న సంగతి తెలిసిందే. ఇద్దరి బడ్జెట్లకు ఏమైనా తేడా ఉందా ? రాష్ట్రంలో అసలేం జరుగుతోంది అన్నది ఒక్కసారి విహంగ వీక్షణం చేద్దాం.
ఆర్ధిక మంత్రులు అంటేనే అంకెల గారడీ ఆటగాళ్లు. ఈ వర్ణనలో కొత్త దనం ఏమీ లేదు గానీ గారడీ జరిగిందనే చెప్పాలి. ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేయాల్సి వస్తే బడ్జెట్‌లో పెరుగుదల పెద్దగా లేదు. ఖర్చు చూస్తే గతం కంటే తగ్గిందన్న పచ్చినిజాన్ని చెప్పకతప్పదు. గతేడాది ఓట్‌ ఆన్‌ అకౌంట్‌లో 1,82,017 కోట్ల రూపాయలను ప్రతిపాదిన కెసిఆర్‌ తరువాత వాస్తవ బడ్జెట్‌ పేరుతో 1,46,492 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. ఆ మొత్తాన్ని 1,42,152 కోట్లుగా సవరించిన అంచనాగా పేర్కొన్న హరీష్‌ రావు తన బడ్జెట్‌ 1,82,914 కోట్లుగా ప్రతిపాదించారు. దీనిలో వాస్తవంగా ఎంత ఖర్చు చేస్తారో ఏడాది తరువాత గానీ తెలియదు.2018-19 సంవత్సర బడ్జెట్‌ను 1,74,454 కోట్లుగా ప్రతిపాదించి దాన్ని 1,61,223 కోట్లకు సవరించారు, దాన్నింకా సవరించి తాజా తాత్కాలిక లెక్కల ప్రకారం ఖర్చు చేసిన మొత్తం 1,57,150 కోట్ల రూపాయలు. అందువలన మార్చినెలతో ముగిసే బడ్జెట్‌ ఖర్చు 1,42,152 కోట్ల కంటే తక్కువే ఉంటుంది తప్ప పెరిగే అవకాశం లేదు. అంటే అంతకు ముందు ఏడాది కంటే కనీసం 20వేల కోట్ల రూపాయల ఖర్చు తగ్గిపోయినట్లే. ఇది అభివృద్ధి అని పాలకులకు అనుగుణ్యంగా ఎవరైనా పొగడకపోతే సన్నాసుల భాష రంగంలోకి వస్తుంది.
తగ్గింపు, కోతలు దేనికి ఉంటాయంటే సంక్షేమ కార్యక్రమాలకు పెడితే జనం ఓట్లు వేయరు గనుక ఆస్ధుల సృష్టికి తోడ్పడే పెట్టుబడి వ్యయాలకు కోత పెడుతున్నారు. అది ఎంతకాలం అంటే ఎంతకాలం సాగితే అంతకాలం .2017-18లో పెట్టుబడి వ్యయం ఖరారైన లెక్కల ప్రకారం రూ.57,768 కోట్ల రూపాయలైతే, తరువాత అది గణనీయంగా పడిపోయింది. 2018-19 బడ్జెట్‌ అంచనా రూ.48,999 కోట్లు కాగా సవరించిన మొత్తం రూ.42,196 కోట్లు, 2019-20 బడ్జెట్‌ ప్రతిపాదన రూ.35,436 కోట్లు కాగా సవరించిన ఖర్చు రూ.13,165 కోట్లు మాత్రమే. అయినా వచ్చే ఏడాది దాన్ని రూ.22,061 కోట్లుగా ప్రతిపాదించారు. అంటే రాబోయే సంవత్సరం కూడా కాంట్రాక్లర్ల నుంచి ప్రజాప్రతినిధులు కమిషన్లు పొందే అవకాశాలు మరింత తగ్గిపోతాయనే చెప్పాలి. ఎన్నికల్లో వారు పెట్టిన పెట్టుబడులను రాబట్టుకొనేందుకు ఏ ఇతర మార్గాలు వెతుక్కుంటారో చూడాలి. నిధులు లేకపోతే పనులు జరగవు, కాంట్రాక్టర్లు ఉండరు, కమిషన్లు ఉండవు. సంక్షేమ పధకాలకు కేటాయిస్తున్నందుకు సంతోషించాలా, ఆస్ధుల కల్పన నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసించాలా ?
రాబడులు పరిమితం అయి, పెట్టుబడి వ్యయాన్ని మరింతగా కుదించిన తరువాత సంక్షేమ పధకాలకే కోత. రెండు పడక గదుల ఇండ్ల గురించి కొండంత రాగం తీసిన కెసిఆర్‌ ఆచరణలో వైఫల్యం కావటానికి కారణమిదే. అందుకే ఈ బడ్జెట్‌లో కూడా స్వంత ఇంటి స్ధలం ఉన్నవారిని కట్టుకొనేందుకు ప్రోత్సహిస్తామని చెబుతున్నారు. లేని వారికి ఇండ్ల స్ధలం ఎందుకు ఇవ్వరు ? అయితే పెట్టుబడి వ్యయం బడ్జెట్‌ కేటాయింపుల్లో తగ్గుతున్నప్పటికీ నీటి పారుదల మరికొన్ని రంగాలలో అప్పులు తెచ్చి పెట్టుబడి వ్యయంగా ఖర్చు పెడుతున్నారు. బడ్జెట్‌ కేటాయింపులకు వడ్డీ చెల్లింపు ఉండదు, బయటి నుంచి తెచ్చే అప్పులకు వడ్డీ అదనం. ఇది వినియోగదారుల మీద లేదా అంతిమంగా ప్రభుత్వం మీద భారంగా మారనుంది. ఈ ధోరణి పెరిగితే రాబోయే రోజుల్లో వినియోగ చార్జీల మోత మోగటం లేదా ఎత్తి పోతల వంటి పధకాలు నామమాత్రం కావటం లేదా మూతపడటం తప్ప మరొక మార్గం ఉండదు.
స్వంత డబ్బా కొట్టుకోవటంలో పాలకులకు మించిన వారు మరొకరు ఉండరు. తెలంగాణా అందుకు మినహాయింపు కాదు, దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపామంటారు. కొన్ని కీలక రంగాలలో కేటాయింపులే తక్కువగా ఉంటున్నాయి. ఉదాహరణకు గ్రామీణాభివృద్ధిని తీసుకుంటే 2019-20 బడ్జెట్‌లో కేటాయింపు 3.5శాతం అయితే అంతకు ముందు సంవత్సరంలో వివిధ రాష్ట్రాల సగటు 6.1శాతంగా ఉంది.ఇదే విధంగా విద్యకు 7.5 అయితే రాష్ట్రాల సగటు 15.9, ఆరోగ్యానికి 4శాతం అయితే రాష్ట్రాల సగటు 4.5శాతంగా ఉంది. పెన్షన్ల వంటి వాటికి అదనంగా ఇచ్చే రాష్ట్రాలలో తెలంగాణా ఒకటి.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోతున్నాయి. హరీష్‌ రావు ప్రసంగంలో చెప్పినదాని ప్రకారం గత ఐదు సంవత్సరాలలో స్వంత రాబడి సగటు పెరుగుదల రేటు 21.5శాతం ఉంటే ఫిబ్రవరి నెలలో 6.3శాతానికి పడిపోయింది. ఈ పూర్వరంగంలో వచ్చే ఏడాది బడ్జెట్‌ లోటును రూ.33,191 కోట్లుగా పేర్కొన్నారు. దీన్ని పూడ్చుకోవాలంటే ఉన్న అవకాశాలేమిటి? అప్పులు తీసుకురావటం, కెసిఆర్‌ చెప్పినట్లు విద్యుత్‌ ఛార్జీలు, మరోసారి ఆర్‌టిసి బస్సు ఛార్జీల పెంపు, ఇంకా తన పొదిలో ఏమున్నాయో తెలియదు. మరో మార్గం ప్రభుత్వ ఆస్తులు అవి భూములు లేదా మిగిలిన ప్రభుత్వరంగ సంస్దల అమ్మకం వలన గానీ రాబట్టుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన దాని ప్రకారం పన్ను ఆదాయాన్ని 71వేల కోట్ల నుంచి 85వేల కోట్లుగానూ, పన్నేతర ఆదాయం 12 నుంచి 30వేల కోట్లకు పెరుగుతుందని చూపారు. ఈ మొత్తాలను పైన పేర్కొన్న వనరుల నుంచి సేకరిస్తారు. ఇప్పటికే తెలంగాణాలో జనం తప్పతాగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వారి నుంచి ఈ ఏడాది రూ.12,600 కోట్లను రూ.16,000 కోట్లకు పెంచనున్నారు. ఇది తాగుడును మరింతగా పెంచటం లేదా మద్యం రేట్లను పెంచటంద్వారాగానీ రాబడతారు.
ఇక వృద్ది విషయానికి వస్తే ప్రభుత్వం చెబుతున్న సీన్‌ కనిపించటం లేదు. 2016 మార్చి నుంచి 2019 మార్చినెల వరకు మూడు సంవత్సరాలలో జిఎస్‌డిపి వృద్ధి రేటు వ్యవసాయం, వస్తూత్పత్తి, సేవారంగాలలో 14,2,14.3,15శాతాల చొప్పున ఉంది. వ్యవసాయ రంగంలో 17.3 నుంచి 10.9శాతానికి పడిపోయింది. వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో ఆ రంగంలో దిగజారుడు ఆందోళన కలిగించేదే.

Image result for harish rao budget
రుణభారం ఏటేటా పెరుగుతున్నది. 2017-18లో అన్ని రకాల ప్రభుత్వ రుణాల మొత్తం రూ. 1,52,190 కోట్లు కాగా 2020-21నాటికి ఆ మొత్తం 2,29,205 కోట్లుగా చూపారు. ఇవి గాక మిషన్‌ కాకతీయ, భగీరధ వంటి పధకాలకు తీసుకున్న అప్పులు మరో 40వేల కోట్లు అదనం. ఇతర సంస్దలు తీసుకున్నవాటిని కూడా చేర్చితే ఇంకా పెరుగుతాయి. దీనికి అనుగుణ్యంగానే చెల్లించాల్సిన వడ్డీ భారం కూడా పెరుగుతుంది. వివిధ పధకాలకు కేటాయింపులు ఘనంగా జరిపినా చివరికి వాటిలో ఖర్చు చేసేదెంత అన్నది ప్రతి బడ్జెట్‌లోనూ ప్రధానమైన ప్రశ్నగా ముందుకు వస్తున్నది. ఆదాయరాబడి గణనీయంగా తగ్గిందని చెబుతున్నారు గనుక ఈ బడ్జెట్‌కు అదే ప్రశ్నను మరింత గట్టిగా వేయాల్సి ఉంటుంది.
భజన చేయు విధము తెలియండీ భక్తులారా అన్నట్లుగా రెండు బడ్జెట్లకు కొట్టచ్చినట్లు కనిపించే మార్పు ఏమంటే కెసిఆర్‌ భజన. గత బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన మామ తన గురించి తాను పొగడుకోలేరు. దాన్ని భర్తీ చేయాలి, గనుక ఈ ఏడాది గవర్నర్‌ ప్రసంగంలో , ఆర్ధిక మంత్రి ప్రసంగంలోనూ అసలు, వడ్డీతో సహా భజన చేయించుకున్నారు. బడ్జెట్‌ ప్రసంగ పాఠం 79 పేజీల్లోనూ అంతకంటే ఎక్కువగానే కెసిఆర్‌ను ఆకాశానికి ఎత్తారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ -ట్రంప్‌ ఉల్లాసాన్ని దెబ్బతీసిన ఢిల్లీ ‘పధకం’ !

01 Sunday Mar 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, USA

≈ Leave a comment

Tags

Delhi violence, Donald trump, Donald Trump India tour, Narendra Modi

Image result for delhi planned violence spoils modi-trump party

ఎం కోటేశ్వరరావు
నరేంద్రమోడీ అనుకున్నదొకటీ, అయింది ఒకటి. కొన్ని సందర్భాలలో ఎవరి పథకాలు, ఎత్తుగడలు వారినే దెబ్బతీస్తాయి. మోడీ ఆహ్వానం మేరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబ సమేతంగా రెండు రోజుల పర్యటన జరిపి వెళ్లారు. ఆ పెద్దమనిషి ఢిల్లీలో ఉండగానే జరిపించిన, జరిగిన ఘటనలతో కాషాయ దళాల ముసుగు మరింతగా తొలిగింది, చాలా దగ్గరగా అనేక మంది వారిని చూడగలిగారు. దొంగకే తాళాలు ఇస్తే దొంగతనాలు ఆగిపోతాయని అనేక మంది భ్రమపడినట్లే మతోన్మాదులకే అధికారమిస్తే మత ఘర్షణలు జరగకుండా ప్రశాంతంగా బతకవచ్చు అనుకున్నవారికి కూడా ఢిల్లీ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మత ఘర్షణల చరిత్రను చూసినపుడు అవి ఎన్నడూ వాటంతట అవి పుట్టలేదు, ఎక్కడో ఒక దగ్గర రూపొందించిన పథకాలతోనే జరిగాయి. లేదా ఎక్కడైనా అనుకోకుండా జరిగిన ఘటనలను ఉపయోగించుకొనేందుకు సిద్దంగా ఉన్న వారు చెలరేగిపోయినపుడు తలెత్తాయి.
ఢిల్లీ ఎన్నికలకు ముందునుంచీ బిజెపి నేతల రెచ్చగొట్టుడు తీరు తెన్నులు, వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో అని అనేక మంది భయపడ్డారు. దానికి అనుగుణ్యంగానే అనేక మంది అనుమానిస్తున్నట్లుగా ఉత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చిన అపర ‘జాతీయ వాదులు లేదా దేశ భక్తులు ‘ ఈశాన్య, తూర్పు ఢిల్లీలో జరిపిన హింసాకాండను చూశాము. దాన్ని ప్రతిఘటించే క్రమంలో కూడా కొందరు బలై ఉంటారు. హింసాకాండ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి మురళీధర్‌ను రాత్రికి రాత్రే ఢిల్లీ హైకోర్టు నుంచి బదిలీ చేసిన తీరుతో హింసాత్మక శక్తులను రక్షించేందుకు కేంద్ర పాలకులు ఎంతకైనా తెగిస్తారని అనేక మందికి ఎవరూ చెప్పకుండానే అర్ధం అయింది. దీన్నుంచి తేరుకోక ముందే శుక్రవారం నాడు రికార్డు స్ధాయిలో స్టాక్‌ మార్కెట్‌ పతనం, వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మూడవ త్రైమాసిక అభివృద్ధి అంచనా 4.7శాతంగా ఉన్నట్లు ప్రభుత్వమే ప్రకటించింది. డోనాల్డ్‌ ట్రంప్‌ నుంచి పొందిన ప్రశంసలతో కొద్ది రోజులు కాలక్షేపం చేద్దామని సంబరపడిన మోడీ పరివారాన్ని వెంట వెంటనే జరిగిన ఈ ఘటనలన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ పరిణామాలు దేశాన్ని ఎటు తీసుకుపోనున్నాయో, ఆర్ధిక సమస్యల నుంచి ఎలా బయటపడతామో తెలియని అయోమయంలో దేశం ఉంది.
సామాజిక మాధ్యమంలో కాషాయ దళాలు భారతమాతాకి జై అనే పేరుతో వ్యాపింప చేస్తున్న ఒక పోస్టులోని అంశాలు ఇలా ఉన్నాయి.” బీజేపీ దేశం కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.ఇప్పటి వరకు కొన్ని నిర్ణయాలు మాత్రమే తీసుకున్నాము, 1. జిఎస్‌టి,2.ట్రిపుల్‌ తలాఖ్‌ రద్దు 3. రామ మందిర్‌ 4.370ఆర్టికల్‌ రద్దు-5.( సిఎఎ)పౌరసత్వ సవరణ చట్టం,నోట్ల రద్దు.6. బినామీ చట్టం 7.కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడం,8.త్రివిధ దళాల అధిపతి నియామకం (సీడీఎస్‌),ఇవన్నీ కేవలం సాంపిల్స్‌,మాత్రమే. ఇప్పటి నుంచి అసలు కథ . ఇండియా యాక్షన్‌ ప్లాన్‌ 2020. రాబోయే రోజులో ఇంకా చాలా ఉన్నాయి.1. ఎన్‌ఆర్‌సి,2. యుసిసి(ఉమ్మడి పౌరస్మృతి), 3.ఆక్రమిత కాశ్మీర్‌,4. కుటుంబ నియంత్రణ చట్టం,5. జమిలి ఎన్నికలు,6. మత మార్పిడి నిరోధక చట్టం. ఇలా చాలా చాలా చేస్తాము, చేస్తూనే ఉంటాము .. దేశ క్షేమమే మా లక్ష్యం..దేశం కోసం, దేశ శ్రేయస్సు కోసం, సనాతన భారతీయత ధర్మ పరి రక్షణ కోసం చేయవలసినది చేస్తాము .. తనకు ….సంపదన మీద ఆశ లేదు …. అవినీతి సంపాదన పోతుందీ అన్న బెంగా లేదు, తన ప్రాణం మీద ప్రీతీ లేదు,ఉన్నది ఒకటే, ఇదీ..మన దేశం… నా దేశం.అంతే..ఉంటే ఉంటాం పోతే పోతాం..దేశానికి మేలు చేసే పోతాం.”
పైన పేర్కొన్న అంశాలలో ఏ ఒక్కటీ దిగజారుతున్న దేశ ఆర్ధిక స్ధితిని మెరుగుపరచేది కాదు, ఉపాధిని పెంచేది కాదు, ఉద్యోగాలు ఇచ్చేదీ, ధరలు తగ్గించేదీ కాదు. వివాదాస్పద అంశాలతో సామాజికంగా అశాంతిని, విభజనను మరింతగా పెంచే భావోద్వేగ అంశాలు తప్ప దేశ ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపరచే చర్యలేవీ వాటిలో లేవు. గత ఆరు సంవత్సరాలలో కూడా చేసింది ఇదే. దేశ వృద్ధి రేటు గరిష్టంగా ఉన్న ఏడున్నరశాతం నుంచి ఏడేండ్ల కనిష్టానికి( ఐదుశాతానికి ) దిగజారింది. సామాజికంగా పరస్పరం అపనమ్మకాలు, విద్వేషాలు పెరిగాయి. అయినా ఇప్పటి వరకు నమూనా మాత్రమే, అసలైన అజెండా ముందుంది అంటూ కాషాయ దళాలు దేశాన్ని మరింతగా ఇబ్బందుల పాలు చేసే అజెండాను అమలు జరుపుతామని రెచ్చిపోతున్నాయి. భావోద్వేగాలు పరిస్ధితిని మరింత దిగజార్చుతాయి తప్ప మెరుగుపరచే అంశాలేమీ వాటిలో ఉండవు.
పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) దేశంలో చిచ్చు రేపింది. దీని వలన ఎవరికీ పౌరసత్వం పోదు కదా ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అంటూ కాషాయ దళాలు అమాయకంగా అడుగుతున్నాయి. దానివలన పౌరసత్వం పోతుందని ఎవరూ చెప్పటం లేదు. ఎన్‌ఆర్‌సి పేరుతో పౌరసత్వాన్ని నిరూపించుకొనేందుకు అవసరమైన పత్రాలు సమర్పించాలన్న అంశంతో అసలు ఆందోళన ప్రారంభమైంది.సిఎఎ తరువాత ఎన్‌ఆర్‌సి అని చెప్పింది బిజెపి వారే. సిఎఎ ద్వారా ఎందరికి పౌరసత్వం కల్పించనున్నారో చెప్పండని బిజెపి వారిని ఎవరినైనా అడిగితే వారి దగ్గర సమాధానం లేదు. పౌరసత్వం ఒకరు ఇచ్చేది కాదు, విదేశీయులకు ఏ గడ్డమీద అయినా పిల్లలు పుడితే అక్కడి పౌరులు కావటం అనేక దేశాలలో జన్మతహ: ఇస్తున్న హక్కు. మన దేశంలో పుట్టిన వారినే ఆధారాలు చూపమని అడుగుతున్నారు. ఈ విపరీత పోకడ ప్రపంచంలో ఎక్కడా లేదు. గత 70సంవత్సరాలుగా పౌరసత్వం రాని లక్షలు, కోట్లాది మందికి మందికి పౌరసత్వం ఇవ్వనున్నామని కాషాయ దళాలు చెప్పటం మోసకారితనమే.
తాము మత ప్రాతిపదికన దాడులకు గురయ్యామంటూ మన దేశ పౌరసత్వాన్ని కోరుకున్న విదేశీయుల సంఖ్య కేవలం 31,313 మంది మాత్రమే అని వారిలో హిందువులు 25,447, సిక్కులు 5,807, క్రైస్తవులు 55, బౌద్దులు ఇద్దరు మాత్రమే అని ఇంటెలిజెన్స్‌ బ్యూరో గతేడాది వెల్లడించింది. వీరందరూ నిజంగా మత పరమైన దాడులకు గురయ్యారా లేక మన దేశం రావటానికి ఆ మార్గం అయితే సులువుగా వుంటుందని ఆ కారణాలు చెబుతున్నారో అన్నది కూడా అనుమానమే. అంటే సిఎఎ ద్వారా లబ్ది పొందేది వీరు మాత్రమే. సిఎఎ దీనికి మాత్రమే పరిమితం అయితే సమస్య లేదు, దాని కొనసాగింపుగా జాతీయ పౌరసత్వ జాబితా తయారు చేస్తామని దానిలో పౌరసత్వాన్ని నిరూపించుకొనే పత్రాలు ఇవ్వాలని చెప్పటమే అసలు అందోళనకు మూలం. నిజానికి సిఎఎ ద్వారా పొరుగుదేశాల్లో ఉన్న హిందువులు, ఇతర ముస్లిమేతర మైనారిటీల మీద దాడులకు, ఆయా దేశాల నుంచి తరిమి వేయాలని అక్కడి మతోన్మాదులను ప్రోత్సహించటమే. ఇక్కడి మతోన్మాదులను మైనారిటీల మీదకు ఉసిగొల్పే దుష్ట ఆలోచనే. ఒక వేళ ఎక్కడైనా అలాంటి దాడులు జరిగితే ఆయా ప్రభుత్వాల మీద వత్తిడి తెచ్చి వాటిని ఆపాలి తప్ప మతం పేరుతో రాజకీయాలు చేయటం, ముస్లింలపై ద్వేషాన్ని రెచ్చగొట్టటం అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను అమలు జరపటమే. దానికోసం దేశాన్ని బలిపెట్టాలా ?

Image result for delhi violence
ఎన్‌ఆర్‌సి, ఎన్‌ఆర్‌పిలను వ్యతిరేకిస్తున్నది ఒక్క ముస్లింలే కాదు, హిందువులతో సహా అన్ని మతాల వారు వ్యతిరేకిస్తున్నారు. వారిలో ఎన్‌ఆర్‌సితో తమను ఇబ్బందులు పెట్టాలన్న ఎత్తుగడ ఉందని భయపడుతున్న ముస్లింలు గత కొద్ది నెలలుగా బహిరంగంగానే ఆందోళన చేస్తున్నారు. బిజెపి అజెండాలో తొలి దాడి ముస్లింల మీద ఉంది కనుక వారు ముందుగా మేలుకొని వీధుల్లోకి వచ్చారు తప్ప ఆధారాలు సమర్పించలేని కోట్లాది మంది ఇతర సామాజిక తరగతుల్లో కూడా అలాంటి ఆందోళన లేకపోలేదు. దేశ విభజన సమయంలో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అనేక మంది మారిపోయారు గనుక వెంటనే ఒక పౌరజాబితాను తయారు చేయాల్సి వచ్చింది. తరువాత బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన వారి సమస్య కారణంగా అసోంలో జాబితాను తయారు చేయాల్సి వచ్చింది తప్ప మిగతా దేశానికి అవసరం ఏమిటి? అక్రమంగా వచ్చే వారిని నిరోధిస్తున్నారు లేదా శరణార్ధులుగా వచ్చే వారికి పౌరసత్వం ఇవ్వాలా లేదా లేక వారిని పౌరసత్వం లేని పౌరులుగా గుర్తించి అనుమతించాలా అనేందుకు ఇప్పటికే చట్టాలు ఉన్నాయి. అలాగాక తలిదండ్రులు, తాతలతో సహా పుట్టిన ఆధారాలు సమర్పించి పౌరులని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనకు లేదు. కానీ పౌరజాబితా తయారీని అమలు జరపాలని ఆందోళన చేస్తున్నవారెవరు ? దాని వెనుక ఉన్న లక్ష్యం ఏమిటి? ఎన్‌ఆర్‌సి, ఎన్‌ఆర్‌పి అమలు జరపాలనటానికి, జై శ్రీరామ్‌ నినాదాలతో పనేముంది ? ఈశాన్య ఢిల్లీలో జై శ్రీరాం పేరుతో చెలరేగిపోవటం, సిఎఎ వ్యతిరేక ఆందోళనను మత ఘర్షణలుగా మార్చటం వెనుక ఉన్నది ఎవరు ? వారు కూడా షాహిన్‌బాగ్‌ లేదా మరొక చోటో కూర్చొని శాంతియుత ఆందోళన చేసేందుకు అవకాశం ఉంది కదా ? లేదూ సిఎఎ వ్యతిరేకుల కుట్రే ఇది అని చెబుతున్న బిజెపి పెద్దలే ఢిల్లీ చుట్టుపట్ల ఉన్న రాష్ట్రాలన్నింటా అధికారంలో ఉన్నారు. వారి పోలీసు, గూఢచార, కేంద్ర గూఢచార వ్యవస్ధలన్నీ ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? అందునా ట్రంప్‌ పర్యటనకు వస్తున్నపుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా ? అయినా స్వేచ్చగా అల్లరి మూకలు చెలరేగటం, ఢిల్లీ పోలీసులు ప్రేక్షకపాత్ర వహించటాన్ని బట్టి సిఎఎ, ఎన్‌ఆర్‌సి వ్యతిరేకులు, ప్రతిపక్షాల మీద నిందమోపే ఒక కుట్రలో భాగంగానే ఢిల్లీ పరిణామాలు జరిగాయని అందరూ అనుకుంటున్నారు. అమెరికా సిఐఏ, ఇజ్రాయెల్‌ మొసాద్‌ల నుంచి నేర్చుకున్న ఇలాంటి చావు తెలివి తేటలను ప్రయోగించి చూస్తున్నారు. ఒక ఆప్‌ కౌన్సిలర్‌ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అతను నిజంగా అల్లర్లను ప్రేరేపించాడా లేక రాజకీయంగా ఆప్‌ను దెబ్బతీసేందుకు తప్పుడు కేసు బనాయించారా అన్నది చెప్పలేము. పేలని తుపాకులు, కమ్యూనిస్టు సాహిత్యాన్ని పక్కన పడవేసి బూటకపు ఎన్‌కౌంటర్లు చేయటం లేదా విప్లవ సాహిత్యం పేరుతో కేసులు నమోదు చేయటాన్ని చూస్తున్న మనకు పోలీసులు ఎంతకైనా తెగిస్తారన్నది తెలిసిందే.
గతేడాది అక్టోబరు రెండవ వారంలో చైనా అధిపతి గ్జీ జింపింగ్‌ మహాబలిపురం పర్యటనకు వచ్చారు, ఫిబ్రవరి చివరి వారంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా వచ్చారు. ఇద్దరినీ నరేంద్రమోడీ ఆహ్వానించారు. వారి పర్యటనల్లో ఎంత వ్యత్యాసం ఉందో మనం గమనించాము. గ్జీ పర్యటన సాదాసీదాగా సాగింది, ట్రంప్‌ పరస్పర పొగడ్తలు, కౌగిలింతలు, అదిరింపులు, బెదిరింపులను యావత్‌ ప్రపంచం చూసింది. ఈ పర్యటనల్లో ఉన్న తేడాలు ఏమిటి ? అమెరికాతో మన వాణిజ్యం మిగులులో ఉంది. చైనాతో లోటులో ఉంది. మనకు గతంలో ఇస్తున్న రాయితీలను ఎత్తివేసింది అమెరికా, మనలను అభివృద్ది చెందిన దేశంగా పరిగణించి మరికొన్ని రాయితీలను రద్దు చేసింది. మనం ప్రతిగా విధించిన పన్నులను చూపి మన మీద బెదిరింపులకు దిగింది. తమ వస్తువుల మీద పన్నులు తగ్గించాలని, ఎక్కువగా కొనుగోలు చేయాలంటూ ట్రంప్‌ వత్తిడి తెచ్చారు, మిలిటరీ హెలికాప్టర్ల ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో తమ దగ్గర నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతులను మరింతగా పెంచాలని, కోళ్ల ఉత్పత్తులు, పాల ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలు చేయకపోతే ఆలోచించాల్సి వస్తుందని బెదిరింపులతో కూడిన హెచ్చరికలు చేసి వెళ్లారు. అదే జింపింగ్‌ విషయానికి వస్తే నిర్దిష్ట అజెండా లేకుండానే వచ్చారు. రాబోయే రోజుల్లో మా వస్తువులను మరింతగా కొనుగోలు చేయాలంటూ నరేంద్రమోడీ సర్కార్‌ సాధారణపద్దతుల్లోనే కోరింది తప్ప వత్తిడి, డిమాండ్ల రూపంలో వ్యవహరించలేదు. చైనా నేత బెదిరింపులకు దిగలేదు.
2018-19లో అమెరికాతో మన వాణిజ్య మిగులు 16.85 బిలియన్‌ డాలర్లు, తరువాత సంవత్సరంలో కూడా అదే ధోరణి కొనసాగింది. నిజానికి అమెరికాతో మన మిగులు నరేంద్రమోడీ సర్కార్‌ సాధించిన ఘనత కాదు. అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో కూడా మన దేశం మిగుల్లోనే ఉంది. కొద్ది పాటి హెచ్చు తగ్గులు తప్ప దాదాపు గత ఆరు ఏడు సంవత్సరాలుగా ఒకే మోస్తరులో ఉంది. ఇదే సమయంలో సంఘపరివార్‌ చైనాను ఎంతగా ద్వేషిస్తుందో దాని నేతగా ఉన్న నరేంద్రమోడీ హయాంలో వాణిజ్యంతో పాటు లోటు కూడా గణనీయంగా పెరిగిందన్నది చాలా మంది జీర్ణించుకోలేని అంశం. 2012లో మన దేశ వాణిజ్య లోటు చైనాతో 39.4 బిలియన్‌ డాలర్లు ఉంటే గతేడాది 74 బిలియన్‌ డాలర్లకు చేరింది.
ఈ కారణంగానే మన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయాలని మనం చైనాను డిమాండ్‌ చేస్తుంటే తమ వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయాలని అమెరికా మనలను డిమాండ్‌ చేస్తోంది. అమెరికా నుంచి కొన్ని వస్తువులను కొనుగోలు మన మీద అధిక భారం పడుతుంది. కోళ్లు, పాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే వాటి మీద అమెరికా ఇచ్చే రాయితీలు, తక్కువ ధరల కారణంగా మన కోళ్ల, పాడిపరిశ్రమ మీద ఆధారపడిన దాదాపు పది కోట్ల మంది రైతాంగం, కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. ఈ రంగాలలో మనం సాధించిన స్వయం పోషకత్వం పోయి పరాయి దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. అందుకే ఎవరు అధికారంలో ఉన్నా ఈ రంగాలలో అమెరికా లేదా మరొక దేశ వస్తువుల దిగుమతుల అనుమతికి జంకుతున్నారు తప్ప నేతల గొప్పతనం లేదా ట్రంప్‌ చెప్పినట్లు మోడీ కఠినంగా వ్యవహరించటమూ కాదు. ఇదే నరేంద్రమోడీ గారు కొన్ని విషయాల్లో బాంచన్‌ దొరా మీరు అనుకున్నట్లే చేస్తా అని ఎలా లొంగిపోతున్నారో మరోచోట చూద్దాం.
ఇక డోనాల్డ్‌ ట్రంప్‌ను ఆహ్వానించి నరేంద్రమోడీ తన పలుకుబడితో భారత్‌కు ఎంతో మేలు చేకూర్చుతారని ఎందరో ఆశించారు. అదే విధంగా ఎన్నికల సంవత్సరంలో తమ ట్రంప్‌ ప్రతి దేశంతోనూ గీచి గీచి బేరాలాడి లేదా బెదిరించి తమ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తారని అమెరికన్లు కూడా ఆశించారు. అక్కడ కార్పొరేట్లు ఆశలు పెట్టుకుంటే దిగజారుతున్న దేశ ఆర్ధిక పరిస్ధితిని మోడీ చక్కదిద్ది తమ జీవితాలను మరింతగా దిగజారకుండా చూస్తారా అని సామాన్యులు ప్రధానంగా ఇక్కడ ఎదురు చూశారు. జరిగిన పరిణామాలను బట్టి అక్కడ ట్రంప్‌, ఇక్కడ నరేంద్రమోడీ కూడా నిరాశపరిచారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తేడా అల్లా అక్కడ కొన్ని కార్పొరేట్లు తాత్కాలికంగా నిరాశచెందితే ఇక్కడ సామాన్యులు ఆశాభంగం పొంది ఇక మన బతుకులింతే అనే నిర్వేదానికి గురవుతున్నారు.
ట్రంప్‌ పర్యటన సమయంలోనే ఒక వార్త వెలువడింది. ట్రంప్‌ భజనలో మీడియాలో దానికి అంత ప్రాచుర్యం రాలేదని చెప్పాలి. ఇటీవలి వాణిజ్య లావాదేవీలలో మన వాణిజ్యం చైనాను అధిగమించి అమెరికాతో ఎక్కువ జరిగింది అన్నది వార్త సారాంశం. చైనా వ్యతిరేకులకు ఇది వీనుల వింపైన సంగీతం వంటిదే. అదే దేశభక్తి అని భావించేవారు కూడా లేకపోలేదు. ఇక్కడ ప్రశ్న ఏ దేశంతో అయినా వాణిజ్యం జరిపేది కార్పొరేట్‌ సంస్ధలే, సామాన్యులు కాదు అన్నది పచ్చినిజం. ఎవరి కోసం తొలి రోజు గుజరాత్‌ పర్యటనలో ట్రంప్‌-నరేంద్రమోడీ ఆరుసార్లు కౌగలించుకున్నట్లు ? నాటకంలో ప్రతి పాత్రధారి తన పాత్రను రక్తి కట్టించేందుకు ప్రయత్నించారు అని సమీక్షకులు రాస్తారు.ఈ కౌగిలింతల పర్వం కూడా అదే. దేశం కోసమే ఇదంతా అన్నట్లుగా ఎవరికి వారు నటించారని చెప్పవచ్చు. ఎన్నికల్లో మరోసారి విజయం కోసం ట్రంప్‌ తాపత్రయ పడుతుంటే రెండవ సారి గెలిచి రాజకీయంతో సహా అన్ని రంగాలలో వైఫల్యాలను ఎదుర్కొంటున్న నరేంద్రమోడీ తన పరపతి ఎలాంటిదో ఒక అగ్రరాజ్యనేత నోట వినిపించాలని తహతహలాడారు. ఆర్ధిక పరిస్ధితి, ఢిల్లీ పరిణామాలతో ట్రంప్‌ పొగడ్తలను నెమరు వేసుకొని ఆనందించే అవకాశం లేకుండా పోయింది. ట్రంప్‌ నోట కాశ్మీర్‌, సిఎఎ వంటి అంశాలపై ఎక్కడ ప్రతికూల వ్యాఖ్యలు వస్తాయో, రాకుండా చూడు గోమాతా అన్నట్లుగా బిజెపి నేతలు ఉగ్గపట్టుకు కూర్చున్నారు. భవిష్యత్‌లో మరింత పెద్ద అవసరానికి లేదా ప్రయోజనానికి తురుపు ముక్కగా ప్రయోగించుదాం అన్నట్లుగా విలేకర్లు అడిగినా ట్రంప్‌ తప్పించుకోవటానికి అర్దం ఇదే.

Image result for delhi planned violence spoils modi-trump party
మీ ప్రధాని నరేంద్రమోడీ ఎంతో గట్టిగా వ్యవహరిస్తారబ్బా అని ట్రంప్‌ పొగిడారు. ఇది మోడీని ఉబ్బవేయటానికి చెప్పిన మాటలు మాత్రమే. ఏ దేశంతో స్నేహం చేసినా మన దేశ ప్రయోజనాలను సదా గమనంలో ఉంచుకోవాలి.ఎదుటి వారి పొగడ్తల కోసం మనల్ని మనం మరిచిపోకూడదు. అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఐరోపా యూనియన్‌ కలసి ఇరాన్‌తో ఒక అణు ఒప్పందాన్ని చేసుకున్నాయి. దాన్నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అంతేకాదు, ఇరాన్‌తో వాణిజ్యలావాదేవీలు జరిపే దేశాల మీద ఆంక్షలు పెట్టింది. చిత్రం ఏమిటంటే ఒప్పందంలోని ఏ ఒక్కదేశ మూ అమెరికా వైఖరిని సమర్ధించలేదు, ఆంక్షలను ఖాతరు చేయలేదు. కానీ అమెరికాతో మనం సమాన భాగస్వాములుగా ఉన్నాం, ఎంతో కఠినంగా వ్యవహరిస్తాం, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తాం అని గొప్పలు చెప్పుకుంటున్న మోడీ సర్కార్‌ మాత్రం ఆంక్షలను అమలు జరిపేందుకు అమెరికాకు సాగిల పడింది. మన రూపాయలు ప్రపంచ మార్కెట్లో దేనికీ పనికి రావు, అయినా ఎప్పటి నుంచో ఉన్న స్నేహం కారణంగా వాటిని తీసుకొని చమురు విక్రయిస్తున్న ఇరాన్‌ దగ్గర కొనుగోలు చేయటం నిలిపివేసి అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాం. అమెరికా నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేనపుడు కరాచీ రేవుతో పని లేకుండా ఇరాన్‌లోని చాబహార్‌ రేవును అభివృద్ధి చేయటం ద్వారా మన వాణిజ్య లావాదేవీలు నిర్వహించుకోవాలని నరేంద్రమోడీ సర్కార్‌ అక్కడ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. అమెరికా బెదిరింపుల కారణంగా ఇప్పుడు ఆ పధకాన్ని పక్కన పడేసింది. ఇరాన్‌-అమెరికా మధ్య పంచాయతీ తలెత్తటం ఏమిటి? అమెరికాకు కోపం రాగానే మన ప్రయోజనాలకోసం నిర్మించే రేవును మధ్యలో వదలి వేసి రావటం ఏమిటి ? ఈ పరిణామం మన దేశం అమెరికాకు లొంగిపోవటాన్ని సూచిస్తున్నదా? లేక స్వతంత్ర వైఖరి, సమాన భాగస్వామిగా మన దేశ ప్రతిష్ట,మాన మర్యాదలను నిలబెట్టేదిగా ఉందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు: నూతన రాజకీయ సమీకరణలకు నాంది కానున్నాయా ?

09 Sunday Feb 2020

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Others, Politics

≈ Leave a comment

Tags

Arvind Kejriwal, BJP, BJP motor mouths, Delhi election result, Delhi Polls, political polarization

Image result for delhi election result

ఎం కోటేశ్వరరావు
నోటి తుత్తర గాళ్లు మీడియా ముందు నోరు మూసుకొంటే మంచిదని రెండు సంవత్సరాల క్రితం ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరించారు. అదంతా జుమ్లా అని రుజువైంది. విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తారని చేసిన నరేంద్రమోడీ వాగ్దానం ఏమైందని ప్రశ్నిస్తే అది జుమ్లా పట్టించుకోవద్దు అని మోడీ ఆత్మ అమిత్‌ షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఏదో చెబుతుంటాం, జనాలు వాటిని పెద్దగా పట్టించుకోవద్దు అన్నది జుమ్లా అనే ఉర్దూపదానికి భాష్యం. ఢిల్లీ ఎన్నికల సమయంలో బిజెపి నేతల నోటితుత్తరను యావత్‌ ప్రపంచమూ చూసింది.
మోడీ భజన టీవీ ఛానళ్లతో సహా అన్నీ ఢిల్లీ గద్దె మీద తిరిగి అరవింద్‌ కేజరీవాల్‌నే ప్రతిష్టించేందుకు జనం నిర్ణయించుకున్నారని ఎగ్జిట్‌ పోల్స్‌లో స్పష్టం చేశాయి. ఏ పార్టీకి ఓటు వేసినా అది కమలం గుర్తుకే పడేట్లుగా ఓటింగ్‌ యంత్రాల్లో మార్పులు చేస్తారనే ప్రచారాన్ని నేను విశ్వసించను గానీ, అనేక మంది అనుమానిస్తున్నట్లుగా అసలు యంత్రాలనే మార్చివేసి కొత్తవాటిని పెట్టి తీర్పును వమ్ము చేస్తే తప్ప ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలుపు తధ్యం. ఎందుకంటే బిజెపి వారు ఎంతకైనా తెగిస్తారని అనేకసార్లు స్పష్టమైంది.
దేశమంతటా తమకు ఎదురులేదని విర్రవీగుతున్న వారికి దేశపాలనా కేంద్రంలో అధికారం లేకపోతే తలకొట్టేసినట్లు అవుతుంది. అందుకే ప్రధాని మొదలు గల్లీ నేతల వరకు ఎన్ని పాట్లు పడ్డారో చూశాము. జాత్యంహంకార ఉన్మాదాన్ని రెచ్చగొట్టినపుడు అనేక దేశాల్లో ఎలాంటి ప్రమాదకర ధోరణులు వ్యక్తమయ్యాయో, గత కొన్ని దశాబ్దాలుగా రెచ్చగొట్టిన మతోన్మాదం ఎలాంటి వెర్రితలలు వేస్తుందో ఢిల్లీ ఎన్నికలు చూపాయి. ఈ ఉన్మాదం కేవలం ముస్లింలకే పరిమితం అని ఎవరైనా అనుకుంటే పొరపాటు పడినట్లే. మతం, కులం, ప్రాంతంతో నిమిత్తం లేకుండా తమతో విబేధించే అంశాలన్నింటినీ శాసించేందుకు మతోన్మాదం పూనుకుంటుంది.
తాము వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని బిజెపి స్వంతడబ్బా కొట్టుకుంటుంది.బిజెపినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌ సింగ్‌ వర్మ పుత్రరత్నమైన పరవేష్‌ వర్మ పశ్చిమ ఢిల్లీ బిజెపి ఎంపీ. ఎన్నికల సమయంలో కేజరీవాల్‌ను ఉగ్రవాది అని నిందించాడు, షాహిన్‌బాగ్‌లో గుడారాలు వేసిన వారు మీ ఇండ్లలోకి ప్రవేశించి మీ కూతుళ్లను, అక్కచెళ్లళ్ల మీద అత్యాచారాలు చేస్తారు, వారిని చంపేయండి, అక్కడ నిరసన తెలుపుతున్న వారికి కేజరీవాల్‌ బిర్యానీలు పెడుతున్నారు, డబ్బులు ఇస్తున్నారని నోరు పారవేసుకున్నందుకు ప్రచారంలో పాల్గనకుండా రెండు సార్లు ఎన్నికల సంఘం నిషేధం విధించింది. చివరికి ఓటింగ్‌ జరుగుతున్న సమయంలో సామాజిక మాధ్యమంలో ఒక వీడియోను విడుదల చేస్తూ షాహిన్‌బాగ్‌ జనం పెద్ద సంఖ్యలో వరుసల్లో నిలిచారు, ఆమ్‌ ఆద్మీ పార్టీ పెట్టిన బిర్యానీ తిని, ఇచ్చిన డబ్బులు తీసుకొన్న వారందరూ రుణం తీర్చుకొనేందుకు ఆ పార్టీకే ఓటు వేస్తామని నినదిస్తున్నారు. దానికి ప్రతిగా ఇండ్లలో ఉన్న జాతీయవాదులంతా బయటకు రావాలి. మీరు దేశానికి ఎంతో రుణపడి ఉన్నారు. పెద్ద సంఖ్యలో వరుసల్లో నిలిచి జాతీయ పార్టీకి ఓటు వేయాలి, అది మాత్రమే చాలదు తమ గుర్తింపు కార్డులను చూపుతూ జై శ్రీరామ్‌ అని నినాదాలు చేయాలి, దేశభక్తియుత పార్టీకే ఓటు వేస్తామని చెప్పాలి అని దానిలో పేర్కొన్నాడు. మత విద్వేషాన్ని, ఉన్మాదాన్ని రెచ్చగొట్టటం గాక దీన్నేమనాలి.
అంతే కాదు కర్ణాటక బిజెపి కూడా రెచ్చగొట్టే ట్వీట్లు చేసింది. ఢిల్లీ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు వచ్చిన ముస్లిం మహిళలు కాగితాలను (ఆధారాలను) చూపబోము అనే నినాదాన్ని ప్రదర్శిస్తు నిలుచున్న ఫొటోలను చూపుతూ మీ వద్ద ఉన్న గుర్తింపు పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోండి, రేపు ఎన్‌పిఆర్‌ సందర్భంగా ఇవ్వాల్సి వస్తుందంటూ ట్వీట్లు చేశారు. ఇది మతదురభిమానం తప్ప మరొకటి కాదు. ఒక వైపు ఎన్‌పిఆర్‌కు ఎలాంటి ఆధారాలూ చూపనవసరం లేదని మోడీ సర్కార్‌ చెప్పేదానికి ఇది విరుద్దం. ఎన్‌పిఆర్‌, ఎన్‌సిఆర్‌ గురించి బిజెపి ఏమి చెప్పినప్పటికీ ఆధారాలు లేవనే పేరుతో తమను ఇబ్బందులు పెడతారని ముస్లింలు, సంచార జాతులు, గిరిజనులు, దళితులు, ఇతర వెనుకబడిన తరగతుల వారు ఆందోళన చెందుతున్న తరుణంలో అధికార పార్టీ నుంచి ఇలాంటి ట్వీట్లు వెలువడటం వారి కడుపులో ఏముందో వెల్లడి చేస్తున్నది.
ఢిల్లీ ఎన్నికల సమయంలో, అంతకు ముందు బిజెపి నేతలు రెచ్చగొట్టుడు ప్రచారానికి ప్రభావితులైన వారు ఎలా ప్రవర్తిస్తారో చూశాము. అలాంటి పరిస్ధితినే బిజెపి కోరుకుంటోందని అనేక మంది భయపడుతున్నది నిజమే అని వెల్లడి అయింది. ఈనెల ఐదవ తేదీ రాత్రి రాజస్ధాన్‌కు చెందిన కవి,రచయిత బప్పతీయ సర్కార్‌ ముంబైలో తన స్నేహితుడిని కలుసుకొనేందుకు ఉబెర్‌ కాబ్‌ను బుక్‌ చేసుకున్నాడు. ప్రయాణ సమయంలో తన స్నేహితుడితో ఫోన్‌లో దేశంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల గురించి, జైపూర్‌లో ఎలా నిర్వహించాలో చర్చించాడు. కారు డ్రైవర్‌ రోహిత్‌ సింగ్‌ ఆ మాటలు విన్నాడు. గమ్యస్ధానం బదులు శాంతాక్రజ్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆపాడు. కొద్ది సేపటిలో వస్తానని చెప్పి ఇద్దరు కానిస్టేబుళ్లను వెంటబెట్టుకు వచ్చాడు. తన కారులో ఒక కమ్యూనిస్టు ఎక్కాడని, దేశాన్ని ఎలా తగులబెట్టాలో ఇతరులతో చర్చించాడని,దేశం మొత్తాన్ని షాహిన్‌బాగ్‌గా మార్చేందుకు చూస్తున్నాడని, తాను ఆ మాటలన్నింటినీ రికార్డు చేశానని కాబ్‌ డ్రైవర్‌ పోలీసులకు చెప్పాడు. ఇదెక్కడి విడ్డూరమయ్యా బాబూ అని డ్రైవర్‌ను ప్రశ్నిస్తే మీరు దేశాన్ని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా ? నేను గాబట్టి వేరే చోట్లకు తీసుకుపోకుండా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకు వచ్చాను సంతోషించండి అని డ్రైవర్‌ సమాధానమిచ్చినట్లు సర్కార్‌ తెలిపాడు. పోలీసులు రెండున్నర గంటల పాటు రచయితను స్టేషన్‌లో కూర్చోబెట్టి ఆయన రచనలు,ఇ తర విషయాల గురించి అనేక రకాలుగా ప్రశ్నించి అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో వదలి పెట్టారు.
భిన్నాభిప్రాయం కలిగి ఉండటం, వ్యక్తం చేయటం దాని ప్రాతిపదికన నిరసన వ్యక్తం చేయటాన్ని దేశద్రోహంగా బిజెపి, ఇతర సంఘపరివార్‌ శక్తులు చేస్తున్న ప్రచారం ఎలాంటి ప్రభావం కలిగిస్తోందో ఈ ఉదంతం తెలియ చేస్తోంది. అదే డ్రైవర్‌కు ఉన్మాద స్దాయి మరింత పెరిగి ఉంటే రచయిత సర్కార్‌ పరిస్ధితి ఏమై ఉండేదో ఊహించుకోవటానికే భయమేస్తోంది.
ఢిల్లీలో షాహిన్‌బాగ్‌ శిబిరం వద్దకు వచ్చిన యువకుడు కపిల్‌ గుజ్జార్‌ నిరసన కారులను దూషిస్తూ చంపివేస్తానంటూ జై శ్రీరామ్‌ అని నినాదాలు చేస్తూ గాలిలోకి కాల్పులు జరిపిన ఉదంతం తెలిసిందే. అతడు ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్త అంటూ వెంటనే పోలీసులు ఒక ఫొటోను విడుదల చేసి బిజెపి ఎన్నికల ప్రచారానికి తోడ్పడేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆమ్‌ ఆద్మీ పార్టీయే అతని చేత అలా చేయించిందని చెప్పటంలో పోలీసులు బిజెపితో కుమ్మక్కయ్యారు. అలా ప్రకటించటం నిబంధనావళికి విరుద్దం. తీరా చూస్తే తమ కుమారుడు నరేంద్రమోడీ భక్తుడు, అమిత్‌ షా అభిమాని తప్ప అరవింద కేజరీవాల్‌తో ఎలాంటి సంబంధాలు లేవని కపిల్‌ తండ్రి, సోదరుడు మీడియాతో చెప్పారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీ అందరికీ తమ టోపీలు పెట్టి ఓట్లు అడిగిందని, ఆ సందర్భంగా తీసిన ఫొటోను పోలీసులు విడుదల చేశారని, తమ కుటుంబానికి ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. తమ కుమారుడు ఎప్పుడూ హిందుస్తాన్‌, హిందుత్వ గురించి మాట్లాడుతూ ఉంటాడని కూడా తెలిపారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బిజెపి ఎలాంటి చౌకబారు చర్యలకు పాల్పడుతుందో ఈ ఉదంతం వెల్లడించింది.
మనకు గిరిరాజ్‌ సింగ్‌ అనే ఒక కేంద్ర మంత్రి ఉన్నారు. నోటి నుంచి ఒక్కటీ సరైన మాట రాదు. బహుశా ఆయన నోట్లో పుట్టే విద్వేష వైరస్‌లు అలా మాట్లాడిస్తూ ఉండి ఉండాలి. షాహిన్‌బాగ్‌ ఆత్మహత్యా దళాలను తయారు చేసే కేంద్రంగా మారిందని ఢిల్లీ ఎన్నికల సమయంలో నోరు పారవేసుకున్నాడు. షాహిన్‌బాగ్‌లో ఒక మహిళ మరణించిన తన కుమారుడు అమరజీవి అంటోంది, ఆత్మహాత్యాబాంబరు కాకపోతే ఏమిటిది అని కూడా ప్రశ్నించాడా పెద్ద మనిషి.
షాహిన్‌ బాగ్‌లో పాకిస్ధాన్‌ ప్రవేశించిందని, ఎన్నికలు భారత్‌-పాకిస్దాన్‌ మధ్య పోటీగా జరగాలని కపిల్‌ మిశ్రా అనే బిజెపి అభ్యర్ధి ప్రకటించారు. అలాంటి వారందరికీ ఉపదళపతి అమిత్‌ షా ఎన్నికల్లో మాట్లాడినదేమిటి ? ఢిల్లీ ఎన్నికలు రెండు పార్టీల మధ్య పోటీ కాదు. షాహిన్‌బాగ్‌కు మద్దతు ఇస్తున్న రాహుల్‌ బాబా-కేజరీవాల్‌ మరియు దేశాన్ని రక్షిస్తున్న ప్రధాని మోడీ మధ్య పోటీ అని చెప్పారు.
మతోన్మాద భావజాలం తలకెక్కిన గుంజా కపూర్‌ అనే ఒక జర్నలిస్టు తానెవరో బయట పడకుండా ఉండేందుకు బుర్ఖా తగిలించుకొని షాహిన్‌ బాగ్‌ శిబిరంలో ప్రవేశించింది. నిజానికి ఆ శిబిరానికి ఎందరో ఆందోళనతో విబేధించే వారు కూడా సందర్శనకు వచ్చారు గానీ ఎవరూ ఇలాంటి ముసుగులతో రాలేదు. బహుశా అంతకు ముందు జెఎన్‌యులో ముసుగులు వేసుకొని దాడులు జరిపిన ఎబివిపి, వారి మద్దతు దారులనుంచి స్ఫూర్తి పొంది ఉండాలి. అనుమానం వచ్చిన షాహిన్‌బాగ్‌ మహిళలు అడిగిన ప్రశ్నలకు తడబడటంతో సదరు కాషాయ జర్నలిస్టు అసలు రూపాన్ని బహిర్గతం చేసి మర్యాదగా పోలీసులకు అప్పగించారు. అంతకు ముందు తుపాకి ధరించిన ఒక వ్యక్తిని శిబిరంలోని వారు పట్టుకున్న విషయం, మరో సందర్భంలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌ మీద వెళుతూ శిబిరం సమీపంలో గాల్లోకి కాల్పులు జరుపుతూ పారిపోయిన సంగతి తెలిసిందే.
జరియాను షరియాగా చిత్రించిన బిజెపి నేత
ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అమంతుల్లా ఖాన్‌ షరియా చట్టాన్ని అమలు జరపాలని కోరాడంటూ బిజెపి నేత సంబిత్‌ పాత్ర వక్రీకరించారు.హమ్‌ జరియా బనాయేంగే(మనం ఒక మార్గాన్ని కనుగొనాలి) అని వాడిన పదజాలాన్ని షరియా(ఇస్లామిక్‌ చట్టం)గా పేర్కొని సంబిత్‌ పాత్ర వక్రీకరించారు.ఇలాంటి పనులు చేయటం పాత్రకు అలవాటే. ఉత్తర ప్రదే శ్‌ కాంగ్రెస్‌ నేత ఒకరు కేసు కూడా నమోదు చేశారు.
భావోద్వేగాలను ముందుకు తేవటంలో, వాటిని రాజకీయంగా ఉపయోగించుకోవటం మీద ఉన్న శ్రద్ద దేశ ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపచటం,జనం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం మీద లేదని ఆరేండ్ల పాలన రుజువు చేసింది. సుదీర్ఘ బడ్జెట్‌ ప్రసంగం చేసి ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలని, అన్ని అంశాలను వివరించేందుకు తప్పలేదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. నిజానికి ఆమె స్వయంగా ఇబ్బంది పడి చివరి పేజీలను చదవకుండా వదలి వేశారు. అన్నింటికంటే ఆ బడ్జెట్‌ అసలు సమస్యల జోలికిపోలేదు.

Image result for delhi election
ముందే చెప్పుకున్నట్లు బ్యాలట్‌ బాక్సుల తారుమారుకు పాల్పడకపోతే ఎన్నికలకు ముందు, తరువాత సర్వేల ప్రకారం ప్రకారం ఆమ్‌ ఆద్మీ అధికారానికి వస్తే దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపటం ఖాయం. 2014లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి విజయం తరువాత మరుసటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘోరపరాజయం పాలైంది.తాజా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అన్ని స్ధానాలను తిరిగి గెలుచుకుంది.ఆమ్‌ ఆద్మీ పద్దెనిమిదిశాతం ఓట్లతో మూడవ స్ధానంలో కాంగ్రెస్‌ 22శాతం, బిజెపి 56శాతం ఓట్లతో ముందంజలో ఉంది.ఎనిమిది నెలల కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలైతే తమకు ఎదురులేదని అని ఛాతీ విరుచుకొనే వారు వెనక్కు తగ్గాల్సి ఉంటుంది. ఇప్పటికే మోడీ మీద అనేక మందిలో భ్రమలు తొలిగాయి, భావోద్రేకాలు లేదా భావోద్వేగాలతో ఓటు వేసిన వారిలో కూడా ఢిల్లీ ఎన్నికలు పునరాలోచనకు, నూతన రాజకీయ సమీకరణలకు నాంది పలుకుతాయి. ఒక వేళ ఎన్నికలను తారు మారు చేస్తే ఆ పరిణామం కూడా కొత్త సమీకరణలకు మరో రూపంలో నాంది పలుకుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి రాజధాని ‘తర్కం’ ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాకు వర్తించదా ?

06 Thursday Feb 2020

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, Amaravathi capital, Amaravati capital controversy, ap special status, BJP's capital logic, CM YS Jagan

Image result for why not bjp's  capital logic apply to ap special status too
ఎం కోటేశ్వరరావు
మూడు రాజధానుల రాజకీయం మరో మలుపు తిరిగింది. కొత్త అధ్యాయం ప్రారంభమైంది. జనంలో గందరగోళం మరింత పెరిగింది. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర పాత్ర ఉండదని, 2015 నోటిఫికేషన్‌ ప్రకారం రాజధాని అమరావతే అని, మూడు రాజధానుల విషయం పత్రికల్లో మాత్రమే చూస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. దీని గురించి ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. నిజానికి ఇది రాజధాని మార్పును ఆమోదించటమూ కాదు, తిరస్కరించటమూ కాదు. ప్రస్తుతం ఉన్న స్ధితిని తెలియచేయటమే అన్నది ఒక అభిప్రాయం. రాష్ట్ర రాజధానికి కేంద్రానికి సంబంధం లేదని చెప్పటం వెనుక రాజకీయం లేకపోలేదు.
కేంద్ర బడ్జెట్‌ వలన రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని ఒకవైపు చెబుతారు, మరోవైపు మంచి బడ్జెట్‌ అని కితాబు, ప్రత్యేక హౌదా గురించి మరచిపొమ్మని మరోసారి పార్లమెంట్‌లో చెప్పిన తరువాత దాన్ని పరిశీలించాలని లేఖ రాయటం నక్కపోయిన తరువాత బక్క కొట్టుకున్నట్లుగా ఉంది తప్ప మరొకటి కాదు. రాజధాని రాజకీయంలో జనసేన-బిజెపి ఏమి చేయనున్నాయన్నది ఆసక్తి కరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని విషయమై శివరామకృష్ణన్‌ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రమే. రాజధాని ఖరారు అయ్యేంత వరకు పదేండ్ల పాటు హైదరాబాదులో రాజధాని కొనసాగవచ్చనే అవకాశం ఇచ్చిందీ కేంద్రమే. శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులపై తెలుగుదేశం-బిజెపి సంకీర్ణ రాష్ట్ర ప్రభుత్వం నారాయణ కమిటీని వేసి అది చేసిన సిఫార్సుల ప్రకారం రాజధానిని ప్రతిపాదించింది. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారం అమరావతిని ఖరారు చేయటాన్ని కేంద్రం అంగీకరించింది. తాము నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక స్ఫూర్తి లేదా సిఫార్సులకు అనుగుణ్యంగా అమరావతి ఎంపిక లేదని కేంద్రం ఎలాంటి వివరణా కోరలేదు, అభ్యంతరమూ వ్యక్తం చేయలేదు. అక్కడ సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు కేంద్రం నిధులు కూడా మంజూరు చేసి విడుదల చేసింది. ఆ నిధులను ఎలా ఖర్చు చేశారన్నది ఒక ప్రశ్న. జనానికి కూడా అర్ధం కావటం లేదు. తాము ఇచ్చిన నిధుల ప్రకారం వాటిని నిర్మించిందీ లేనిదీ నిర్ధారించాలని, ఏ దశలో ఉన్నాయో తెలపాలని గానీ కేంద్రం ఇంతవరకు రాష్ట్రాన్ని కోరినట్లు జనానికి తెలియదు. చంద్రబాబు కొన్ని భవనాలను నిర్మించి వాటిలో తాత్కాలికంగా సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. దాని ప్రకారం వాటిలో కార్యాలయాలు తాత్కాలికం తప్ప భవనాలు శాశ్వత ప్రాతిపదికన నిర్మించినవే.
ఇక రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు జనానికి చెప్పటమే తప్ప కేంద్రానికి అధికారికంగా ఇంతవరకు తెలియచేయలేదు. అందుకే వాటి గురించి మీడియాలో మాత్రమే చూశామని కేంద్రం చెప్పాల్సి వచ్చింది. అసెంబ్లీలో పెట్టిన బిల్లులో కూడా పాలనా వికేంద్రీకరణలో భాగంగా కొని చర్యలను ప్రతిపాదించింది తప్ప రాజధానుల ఏర్పాటుగా వాటిని పేర్కొనలేదు. విజిలెన్స్‌ కమిషన్‌, ఎంక్వైరీస్‌ కమిషన్‌ కార్యాలయాలను కర్నూలుకు తరలించాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులో తరలించకూడదని ఎక్కడ ఉందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. తన కార్యాలయాలను ఎక్కడైనా ఏర్పాటు చేసుకొనే స్వేచ్చ ఆయా ప్రభుత్వాలకు ఉంటుంది. ఆ వెసులుబాటును ఉపయోగించుకొనే సచివాలయాన్ని, హైకోర్టును తరలిస్తామని జగన్‌ ప్రభుత్వం చెబుతున్నది. న్యాయమూర్తుల నియామకం, హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటు వంటివి సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వ వ్యవహారం కనుక హైకోర్టు తరలింపు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రీం కోర్టు, కేంద్రమే. సచివాలయాన్ని తరలిస్తే కేంద్రం చేయగలిగిందేమీ లేదు. అందుకే బిజెపి నేతలు పార్టీగా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నాం తప్ప ప్రభుత్వ పరంగా జోక్యం చేసుకొనే అవకాశం లేదని చెబుతున్నారు, దీనిలో పెద్ద తెలివితేటలేమీ లేవు.
కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు లేదా తీరుస్తారు అన్నట్లుగా హైకోర్టు తరలింపును సుప్రీం కోర్టు ఆమోదించకపోతే, అది జరగకుండా కేవలం సచివాలయాన్నే తరలిస్తే జగన్‌ సర్కార్‌ రాజకీయంగా చిక్కుల్లో పడుతుంది. దాన్ని సొమ్ము చేసుకొనేందుకు బిజెపి రంగంలోకి దిగవచ్చు. ఇక 2015లో వెలువరించిన గజెట్‌ నోటిఫికేషన్‌ లేదా రాజధానిగా అమరావతి ఉత్తర్వు మార్చటానికి వీలు లేని శిలాశాసనమో, చంద్రబాబు చెక్కిన శిలాఫలకమో కాదని, కొత్త ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మరొకదానిని జారీ చేయవచ్చని బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు చెప్పారు. 2015లో అప్పటి ప్రభుత్వం జీవో ద్వారా నోటిఫై చేసింది కనుక ప్రస్తుతానికి అమరావతే రాజధాని అని లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో కేంద్రం పేర్కొందని ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకొని భవిష్యత్తులో రాజధానిని మరోచోటుకి మార్చి, ఆ విషయాన్ని తెలియజేస్తే కేంద్రం గుర్తిస్తుందని కూడా నరసింహారావు చెప్పారు. అదే ముక్క పార్లమెంటు సమాధానంలో ఎందుకు చెప్పలేదన్నది ప్రశ్న. కేంద్ర వైఖరి గురించి ఆయనకు ఉన్న సాధికారత ఏమిటి ? లేకపోతే బిజెపి-వైసిపి మధ్య కుదిరిన తెరవెనుక ఒప్పందానికి సూచికా, ఎలా అర్ధం చేసుకోవాలి. మొత్తం మీద రాజకీయ దోబూచులాట నడుస్తోంది.

బిజెపి నేతలను ఇక్కడ ఒక సూటి ప్రశ్న అడగాలి. జివిఎల్‌ తర్కం ఒక్క అమరావతికేనా దేనికైనా వర్తిస్తుందా ? ఏదీ శిలాఫలకం, శాసనం కానపుడు, మార్చుకోవటానికి అవకాశం ఉన్నపుడు స్వయంగా బిజెపి నేతలు కోరిన పదేండ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు విధానాలను మార్చటానికి, ఉత్తర్వులు జారీ చేసేందుకు కేంద్రానికి ఉన్న అడ్డంకి, అభ్యంతరం ఏమిటి? ఎందుకు హౌదా ఇవ్వరు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని గతంలోనే పలుమార్లు చెప్పామని జీవీఎల్‌ నరసింహారావు అంటున్నారు. రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని, ముగిసిన అనేక అధ్యాయాలను తిరిగి తెరుస్తున్నది బిజెపి, జరిగిన తప్పిదాలను సరిచేస్తామని చెబుతున్నది ఆ పార్టీ, అలాంటపుడు ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు చేతులు రావటం లేదా ? ప్రత్యేక హోదా కొనసాగించాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులకు గురవుతుందనే సరికొత్త వాదనను బిజెపి నేత ముందుకు తెచ్చారు. దేశ ఆర్ధిక వ్యవస్ధ ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే కార్పొరేట్లకు లక్షా 45వేల కోట్ల రూపాయల మేరకు వర్తమాన ఆర్ధిక సంవత్సరంలోనే కేంద్రం ఎలా కట్టబెట్టగలిగింది? తాజా బడ్జెట్‌లో డివిడెండ్‌ పన్ను చెల్లింపు పన్నుతో సహా అనేక రాయితీలను తాజా బడ్జెట్‌లో ఎలా ప్రకటించారు. వాటికి లేని ఆర్ధిక ఇబ్బందులు ఆంధ్రప్రదే శ్‌ ప్రత్యేక హోదాకే వస్తాయా ? ప్రత్యేక హోదా డిమాండ్‌ చంద్రబాబు మెడకు చుట్టుకున్నట్లే పదేపదే ఈ డిమాండ్‌ లేవనెత్తితే జగన్‌ కూడా ప్రమాదకర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని జివిఎల్‌ అనటం బెదిరింపా మరోసారి అడగవద్దని హెచ్చరించటమా ?

చంద్రబాబు నాయుడు అమరావతిని ఒక భ్రమరావతిగా చూపుతూ సింగపూర్‌, కౌలాలంపూర్‌, మరొకటో మరొక దాని పేరో చెప్పి రైతులకు, జనాలకు భ్రమలు కల్పించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కూడా అదే బాటలో నడుస్తున్నారు. తేడా ఏమిటంటే చంద్రబాబు విదేశీ బూట్లు వేసుకుంటే జగన్‌ స్వదేశీ తగిలించుకున్నారు. చంద్రబాబు కార్పొరేట్‌ పరిభాషలో గతంలో తనను సిఇఓగా వర్ణించుకుంటే జగన్‌ ఫ్యూడల్‌ పద్దతిలో రాష్ట్రానికి తండ్రినని చెప్పుకున్నారు. విజయవాడ గేట్‌వే హౌటల్‌లో నిర్వహించిన హిందూ పత్రిక కార్యక్రమంలో మాట్లాడుతూ అమరావతిలో ఖర్చు చేసే డబ్బులో 10 శాతం విశాఖలో ఖర్చు చేస్తే పదేళ్లలో విశాఖ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడగలదని చెప్పారు. ఒక తండ్రిగా ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు, అభివ అద్ది కోసం నిర్ణయాలు తీసుకున్నానని స్పష్టం చేశారు.
ఆరువందల సంవత్సరాల నాటి విజయనగర సామ్రాజ్యంలో చెన్నై ఒక రేవు పట్టణంగా ఎదిగింది, దానిని 1639లో బ్రిటీష్‌ వారు తీసుకున్నట్లు చరిత్ర, అదే విధంగా బెంగలూరు నగరం 1535లో, హైదరాబాద్‌ 1591లో ప్రారంభమైంది. స్వాతంత్య్రం రాకముందే అక్కడ పరిశ్రమలు అభివృద్ధి అయ్యాయి. తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టి అనేక సంస్ధలను నెలకొల్పారు. వాటి అభివృద్ధిలో అవి పధాన పాత్ర పోషించాయి. అమరావతిలో మౌలిక సదుపాయలకే లక్ష కోట్ల రూపాయలకు పైగా అవుతుందని, అంతసొమ్ము తాము అక్కడ వెచ్చించలేమని చెబుతున్న జగన్‌ దానిలో పదోవంతు పదివేల కోట్లతో విశాఖలో సచివాలయం నెలకొల్పితే ఆ మూడు నగరాలతో పోటీబడి అభివృద్ధి చెందుతుందని చెప్పటం అంటే భ్రమలు కొల్పటం గాక మరేమిటి ? ప్రభుత్వ రంగంలో కేంద్రం, లేదా రాష్ట్రం పెట్టుబడులు పెట్టటాన్ని ఎప్పుడో నిలిపివేశాయి. ప్రయివేటు పెట్టుబడులు ఎక్కడ లాభం ఉంటే అక్కడకు పోతాయి తప్ప మూడు రాజధానులు పెడితే పదమూడు జిల్లాలకు ఎలా చేరతాయి. ఎవరూ పెద్దగా ప్రయత్నం చేయకుండానే, రాజధానిగాక ముందే విశాఖలో ప్రభుత్వ రంగ సంస్ధల ఏర్పాటు కారణంగా, దానికి ఉన్న రేవు, ఇతర కారణాలతో అభివృద్ధి అయింది. రాబోయే రోజుల్లో కూడా అది కొనసాగుతుంది. గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లు విశాఖను తామే అభివృద్ధి చేశామని చెప్పుకొనే ఎత్తుగడ తప్ప మరొకటి దీనిలో కనిపించటం లేదు. ఒక సైబర్‌టవర్‌ నిర్మించి మొత్తం సైబరాబాద్‌ను, ఐటి పరిశ్రమను తానే తెచ్చినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. గొప్పలు చెప్పుకోవటంలో ఆయనతో జగన్‌ పోటీ పడదలచుకున్నారా ?

కేంద్ర బడ్జెట్‌పై ప్రజల అసంతృప్తిాజగన్‌ అభినందనలా ?
” ఏపీని ఆదుకునేందుకు తాజా బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రజలందరూ అసంత అప్తితో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కల్పించే అంశం తమ పరిధిలో లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసినందున రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని” సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖలో విజ్ఞప్తి చేశారు.
విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఈ బడ్జెట్‌లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ఈ నేపథ్యంలో ప్రజల బాధను మీ దఅష్టికి తెస్తున్నానని, ప్రత్యేక హౌదా కల్పించే విషయం పూర్తిగా కేంద్రం పరిధిలోనే ఉన్నందున అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని కోరారు. బడ్జెట్‌ మీద జనం అసంతృప్తి సరే ముఖ్యమంత్రి జగన్‌ సంగతేమిటి?
”ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న సంక్లిష్ట తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్‌ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేదిగా, వఅద్ధి రేటును పెంచేదిగా విశ్వాసాన్ని కలిగించి,నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఏపీని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు.” అని జగన్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఒక వైపు రాష్ట్రానికి తండ్రినని చెప్పుకుంటారు. మరో వైపు మీ చర్యల కారణంగా మా పిల్లలు అసంతృప్తి చెందారు గానీ నేనైతే అభినందనలు చెబుతున్నా అన్నట్లు లేఖ ఉంది. పిల్లలకు జరిగిన అన్యాయానికి కనీసం నిరసన కూడా తెలపకుండా వేరే విషయాలకు అభినందనలు తెలిపే తండ్రిని ఏమనుకోవాలి? మొగుడు పోతే పోయాడు గానీ గుండు మాత్రం పొన్నకాయలా బలే ఉందే అని వెనకటికి ఎవరో అన్నట్లుగా లేదూ !
2020ా-21కి సంబంధించి 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నివేదికలో కూడా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. పలు రాష్ట్రాలు ప్రత్యేక హౌదా కల్పించాలని విజ్ఞప్తి చేశాయని, కానీ ఆ అంశం తమ పరిధిలో లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే సముచిత నిర్ణయం తీసుకోవాలని జగన్‌ కోరారు. 2018 అక్టోబర్‌లో మీడియా 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ను ప్రశ్నించిన సందర్భంలోనూ ప్రత్యేక హౌదా అనేది ఆర్థిక సంఘం పరిధిలో లేదని కుండబద్ధలు కొట్టారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ప్రత్యేక హౌదాపై 15వ ఆర్థిక సంఘం వెల్లడిస్తున్న దానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతున్న దానికీ పొంతన లేదనేది స్పష్టమవుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను తీవ్ర అసంత అప్తికి గురి చేస్తోంది. దయచేసి ఈ అంశంపై మీరు జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షల మేరకు నిర్ణయం తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు.
బడ్జెట్‌లో జరిగిన అన్యాయానికి కనీసం నిరసన తెలపరు, ఆర్ధిక సంఘం పరిధిలో ప్రత్యేక హోదా అంశం లేదని ముందే తెలిసి కూడా బడ్జెట్‌కు హారతులు పడుతూ ప్రత్యేక హోదా కల్పించాలని కోరటం భలే ఉందిలే ! ఇప్పటికే బిజెపి జనం చెవుల్లో పూలు పెట్టింది, ముఖ్యమంత్రి జగన్‌ రాసిన లేఖ కూడా అంతకు మించి మరొకటి కాదు. మోడీగారికి పంపేందుకు పోస్టల్‌ ఖర్చు దండగ తప్ప లేఖలతో రాష్ట్రానికి ఒరిగేదేముంది ?
రాజధాని అమరావతి విషయమై జనసేన-బిజెపి ప్రకటించిన విజయవాడ లాంగ్‌ మార్చ్‌ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు లేదా వాయిదా వేశాం అంటారు. మూడు రాజధానులకు పార్టీగా వ్యతిరేకం తప్ప తమ పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అనుకూలం అంటుంది బిజెపి, ఏమిటీ నాటకం, ఎవరిని మోసం చేసేందుకు ఈ ద్వంద్వ మాటలు ? జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కేంద్రం తోలు వలుస్తారా ? తాట తీస్తారా? పార్టీ నిర్వహణ నిధుల కోసమనే పేరుతో హీరోయిన్లతో తైతక్కలాడుతూ సినిమాలు తీస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కంటి చూపుతో కాషాయ తాలిబాన్లపై విరుచుకుపడ్డ హీరో దీపిక !

10 Friday Jan 2020

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

ABVP, Aishe Ghosh, Deepika Padukone, JNU violence, JNUSU President, saffron taliban, sfi, sound of silence

Image result for deepika padukone ,jnuఎం కోటేశ్వరరావు
దేశంలో ఒక్కొక్క ఉదంతం జరిగిన ప్రతిసారీ తామే పక్షంలో ఉండాలో తేల్చుకోవాలంటూ జనాన్ని కాషాయ తాలిబాన్లు ముందుకు తోస్తున్నారు. కాంగ్రెస్‌ తన ఐదు దశాబ్దాల పాలనలో చేయలేని ఈ సమీకరణ క్రమాన్ని గత ఐదు సంవత్సరాలలో వీరు వేగంగా ముందుకు తెచ్చారు. ఆ గట్టునుండాలో ఈ గట్టునుండాలో తేల్చుకోవాల్సింది ఇంక జనమే. అలాంటి తాజా ఉదంతం జనవరి ఐదవ తేదీ రాత్రి మూడు గంటల పాటు ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ముసుగులు ధరించిన కొందరు యువతులతో సహా గూండాలు విద్యార్ధులు, ప్రొఫెసర్ల మీద జరిపిన దాడి.
ఒక సినిమాలో ప్రముఖ హీరో బాలకృష్ణ కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్న మాటలు తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. సుప్రసిద్ధ హీరోయిన్‌ దీపికా పదుకోన్‌ ఇప్పుడు ఒక్క దేశంలోనే కాదు,సకల భాషల్లోనూ, ప్రపంచంలోనూ ఉన్న కాషాయ తాలిబాన్లు, వారి సమర్ధకులమీద ‘కంటి చూపు’తో విరుచుకుపడ్డారు. ఒక్కోసారి నిశ్శబ్దం కూడా భరించలేనిదిగా మారుతుంది. దీపికా పదుకోన్‌ చేసింది అదే. దాడికి గురైన వారిని మౌనంగా పరామర్శచేశారు తప్ప దాడి చేసిన వారి గురించి ఆ సమయంలో పల్లెత్తు మాట అనలేదు. అయినా సరే దాన్ని కూడా భరించలేని కాషాయ మూకలకు గంగవెర్రులెత్తి సామాజిక , సాంప్రదాయ మాధ్యమాల్లో ఆమెపై ధ్వజమెత్తుతున్నారు. ఆమె నిర్మించి, నటించిన ‘ఛపాక్‌’ సినిమాను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దేశద్రోహులకు, దేశాన్ని ముక్కలు ముక్కలు(తుకడే తుకడే) చేసే గ్యాంగ్‌లకు మద్దతు ఇచ్చినట్లు చిత్రించి నోరు మూయించేందుకు చూస్తున్నారు.
బేటీ బచావో బేటీ పఢావో అని ప్రధాని నరేంద్రమోడీ నాలుగేండ్ల క్రితం పిలుపునిచ్చినపుడు ఎందరో మంచి పని చేశారని అనుకున్నారు. ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలను చదివించండి అని దాని అర్ధం. జామియా మిలియా విశ్వవిద్యాలయంలో పోలీసులే స్వయంగా అనుమతి లేకుండా దూరి ఆడమగ తేడా లేకుండా దాడులు చేశారు. ఆ తీరు మీద తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. తన అనుమతి లేకుండా పోలీసులు ప్రవేశించి దాడులు చేశారని వైస్‌ ఛాన్సలర్‌ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో జెఎన్‌యు విశ్వవిద్యాలయంలో సరికొత్త దాడులకు తెరతీశారు. జామియా విద్యార్దులు సిఎఎ లేదా ఎన్‌ఆర్‌సి సమస్య మీద నిరసన తెలిపారు, అది వారి హక్కు, లేదా కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లు దేశద్రోహం కనుక పోలీసులు దాడి చేశారని కాసేపు అనుకుందాం. జెఎన్‌యులో అలాంటి ఆందోళన లేదే !
దాదాపు 50మంది ప్రొఫెసర్లు, 200 మంది విద్యార్దులు గత రెండు నెలలుగా చేస్తున్న ఫీజులు, ఇతర ఛార్జీల పెంపుదల ఆందోళన గురించి ఒక చోట చర్చించుకుంటుండగా వారి మీద, హాస్టల్‌ గదుల్లో వున్నవారి మీద జై శ్రీరామ్‌, తదితర నినాదాలతో మూడు గంటల పాటు కొందరు యువతులతో సహా 50 మందికిపైగా ముసుగులు ధరించిన గూండాలు ఎంపిక చేసుకున్న విద్యార్ధుల మీద హాస్టళ్లపైనా దాడులు చేశారు. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు వచ్చిన వైద్యులను అడ్డుకున్నారు. దాడి సమయంలో వీధి లైట్లను ఆర్పివేశారు. ఒక పధకం ప్రకారం జరిగిన ఈ దాడిలో 36 మంది గాయపడ్డారు. పోలీసులు, యూనివర్సిటీ అధికారులు, ఎబివిపితో కుమ్మక్కయి ముసుగులతో వచ్చిన గూండాలు చదువుకుంటున్న ఆడపిల్లల మీద ఎలా దాడులు చేశారో చూసిన దేశం నివ్వెరపోయింది. ఎటు తిరిగి ఎటు చూసినా వాటి వెనుక ఉన్నది నరేంద్రమోడీ అనుచర గళం, అధికార యంత్రాంగం కావటాన్ని ఆయన అభిమానులు చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. చివరికి బిజెపి అగ్రనేత మురళీ మనోహర్‌ జోషి కూడా విసి జగదీష్‌ కుమార్‌(తెలుగువాడే అని చెప్పుకొనేందుకు చాలా మంది సిగ్గుపడుతున్నారు) రాజీనామా చేయాలని చెప్పాల్సి వచ్చింది. దాడులకు గురయిన వారి గురించి అందరూ మాట్లాడుతున్నారు తప్ప ఇతరుల గురించి ఎందుకు ప్రకటనలు చేయరంటూ ఆయన ఎదురుదాడులకు దిగారు. దుండగులు విశ్వవిద్యాలయాన్ని ఆక్రమించి దాడులు చేస్తుంటే అసలు విసి ఏమి చేస్తున్నట్లు అని ప్రశ్నిస్తూ రాజీనామా చేయాలని అందరూ డిమాండ్‌ చేస్తుంటే దాని గురించి మాట్లాడకుండా ఎదురుదాడులు, దాడులకు గురైన వారి మీదనే తప్పుడు కేసులు పెట్టించిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయుధాలు ధరించి ముసుగులు వేసుకున్నవారిలో తమ వారున్నట్లు ఎబివిపి నేతలు అంగీకరించారు. వారి దాడులకు గురైన బాధితులను పరామర్శించేందుకు జెఎన్‌యుకు రావటమే దీపికా పదుకోన్‌ చేసిన ‘ నేరం, ఘోరం ‘. నిందితులపై ఇంతవరకు చర్యలు లేవు.
ఈ తరహాదాడి మన దేశంలో ఇదే ప్రధమం. దాడులలో తీవ్రంగా గాయపడిన వారిని పరామర్శించేందుకు విశ్వవిద్యాలయానికి వచ్చిన దీపిక ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండానే తన సానుభూతి, మద్దతు ప్రకటించి వెళ్లారు. ఈ వార్త బయటకు రాగానే కాషాయ తాలిబాన్లు సామాజిక మాధ్యమంలో రెచ్చిపోయారు. ఆమె తాజా చిత్రం ‘ఛపాక్‌’ను బహిష్కరించాలని, దేశ ద్రోహులతో చేతులు కలిపారంటూ ఏకత, శీలము, సంస్కారం, సంస్కృతి, మహిళలకు ఇవ్వాల్సిన మర్యాదల గురించి నిత్యం ప్రవచనాలు చెప్పేవారు వాటన్నింటినీ తీసి గట్టున పెట్టి నోరు బట్టని విధంగా ఆమెపై దాడి ప్రారంభించారు. తమ అసహ్య రూపాన్ని మరోసారి స్వయంగా బహిర్గతపరచుకున్నారు.
ముంబైలో మరికొందరు బాలీవుడ్‌ నటీ నటులు దాడులను నిరసిస్తూ జరిగిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఈ దాడిని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, ఎస్‌ జైశంకర్‌లు ఖండించారు. వారి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయని పెద్దలు దాడికి గురైన వారిని పరామర్శించేందుకు వెళ్లిన బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పడుకోన్‌ చర్యను తప్పు పడుతూ దేశద్రోహి అని నిందలు వేస్తున్నారు. ముసుగులు వేసుకున్న దుండగులు తాము లక్ష్యంగా చేసుకున్న చేసిన వారి మీద మాత్రమే దాడులు చేశారు. ముసుగుల్లేని బిజెపి నేతలు కూడా ఎంపిక చేసిన వారి మీద మాత్రమే విరుచుకుపడుతున్నారు. వారికీ వీరికీ ఒక్క ముసుగులు తప్ప తేడా ఏముంది?

Image result for deepika padukone ,jnu
జనవరి పదవ తేదీన విడుదల కానున్న తన చిత్ర ప్రచారం కోసం దీపిక ఈ ఉదంతాన్ని వినియోగించుకున్నారని నిందించిన వారు లేకపోలేదు. బహుశా వారికి ఎన్నికల కోసం ఉగ్రవాదుల దాడులను ఉపయోగించుకున్న రాజకీయ పార్టీలు గుర్తుకు వచ్చి ఉంటాయి. కొన్ని రాజకీయ పార్టీలు రంగంలో ఉన్నపుడు మాత్రమే ఉగ్రవాదదాడులు జరుగుతాయని నమ్మే వారి గురించి తెలిసిందే. కాషాయ తాలిబాన్ల దాడి తీవ్రతను తక్కువ చేసి చూపేందుకు కొందరు కాషాయ జర్నలిస్టులు దీపిక చర్యను దాడులను సమర్ధించేవారితో పాటు దాడులకు గురైన వారు కూడా విమర్శించారని చిత్రించారు. ఆమె మాట్లాడకుండా మౌనంగా ఉండటాన్ని ఐషి ఘోష్‌ తప్పుపట్టినట్లుగా వ్యాఖ్యానించారు. పేరెన్నికగన్న బాలీవుడ్‌ బాద్‌షాలు కాషాయ తాలిబాన్ల నోటి దురుసుకు భయపడి అనేక అంశాల మీద నోరెత్తని స్ధితిని చూస్తున్నాము. బతికిన చేపలు ఏటికి ఎదురీదుతాయి, చచ్చిన చేపలు వాలునపడి కొట్టుకుపోతాయి. ఆమె చిత్ర ప్రచారం కోసమే అయితే ఇంకా అనేక మార్గాలున్నాయి. దీపిక మీద దాడులు జరగటం కొత్తేమీ కాదు. గతంలో పద్మావత్‌ సినిమా సందర్భంగా అటు బిజెపి ఇటు కాంగ్రెస్‌ వారు, సమాజాన్ని వెనక్కు తీసుకుపోవాలని చూసే శక్తులన్నీ ఆమెమీద ఎలాంటి ప్రచారం చేసిందీ, భౌతికంగా దాడులు చేసేందుకు యత్నించిన తీరు చూశాము. బహుశా ఇది కూడా ఆమెను ప్రేరేపించి ఉంటుందని భావించవచ్చు. రెండు రోజుల తరువాత ఆజ్‌తక్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిన తన జెఎన్‌యు పర్యటన గురించి నోరు విప్పారు.
విద్యార్ధుల మీద హింస తనను బాధించిందని, పద్మావత్‌ సినిమా సందర్భంగా తాను ఇదే పరిస్ధితిని ఎదుర్కొన్నానని, ఇలాంటివి సర్వసాధారణంగా మారకూడదని తాను ఆశాభావంతో ఉన్నట్లు దీపిక చెప్పారు. ” నేను చెప్పదలచుకున్నది ఏమంటే రెండు సంవత్సరాల క్రితం పద్మావత్‌ విడుదల సందర్భంగా నేను ఇదే చెప్పాను. ఈ రోజు నేను చూస్తున్నది నాకు ఎంతో బాధ కలిగించింది. ఇది సర్వసాధారణ అంశంగా మారకూడదని నేను ఆశిస్తున్నాను. నాకు భయమూ విచారమూ కలిగింది. మన దేశపునాది ఇది కాదు. జరుగుతున్న వాటి పట్ల నాకు ఆగ్రహంగా ఉంది, అయితే ఎలాంటి చర్య తీసుకోకపోవటం అది మరింతదారుణం ‘ అన్నారు.

విద్యార్ధులను దీపిక పరామర్శించిన వార్త తెలియగానే బిజెపి నేత తేజీందర్‌ పాల్‌ సింగ్‌ బగ్గా ట్వీట్‌ చేస్తూ తుక్‌డే తుక్‌డే గ్యాంగ్‌ మరియు అఫ్జల్‌ గ్యాంగ్‌లకు మద్దతు ఇచ్చినందుకు దీపికా పదుకొనే చిత్రాలను బహిష్కరించాలని పిలుపునిచ్చాడు. అనురాగ్‌ కాశ్యప్‌, తాప్సీ, విశాల్‌ భరద్వాజ్‌, అలీ ఫజల్‌, రిచా చద్దా, అనుభవ్‌ సిన్హా, జోయా అక్తర్‌, దియా మీర్జా, సౌరవ్‌ శుక్లా, సుధీర్‌ మిశ్రా, రాహుల్‌ బోస్‌, స్వానంద కిర్కరే, షబనా ఆజ్మీ వంటి వారు దాడులను నిరసిస్తూ జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Image result for deepika padukone ,jnu
పులి తన చారలను దాచుకొనేందుకు ఆవు మేకప్‌ వేసుకున్నంత మాత్రాన దాని స్వభావాన్ని దాచుకోగలుగుతుందా ? ఒక కేంద్ర మంత్రి జవదేవకర్‌ ఛపాక్‌ సినిమాను బహిష్కరించాలనటాన్ని తాను అంగీకరించనని చెబుతారు, మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాత్రం దేశాన్ని విధ్వంసం చేసే వారితో దీపిక పదుకోన్‌ నిలిచిందని దాడి చేస్తారు. దేశంలో కాషాయ దళాలను అనుసరించే వారు, వారిని గుడ్డిగా నమ్మిన జనం చెవుల్లో పూలు పెట్టుకున్నారు తప్ప అందరూ పెట్టుకోలేదని మంత్రులకు అర్ధం కావటం లేదు. ఎవరైనా ఏదైనా వార్త చదివితే తాము ఎవరికి మద్దతు ఇచ్చేందుకు పోతున్నామో తెలుసుకోవాలని స్మృతి గారు సెలవిచ్చారు. మరి ఈ దాడిని ఖండించిన కేంద్ర మంత్రులకు సైతం ఇదే సూత్రం వర్తిస్తుందో లేదో ఆమె చెప్పాలి. వారిని కూడా దేశద్రోహులు అంటారా, ఒక వార్త వినగానే తాము ఎవరిని ఖండిస్తున్నామో తెలుసుకోవాలని వారికి చెబుతారా ? జెఎన్‌యులో ముసుగులు వేసుకొని గూండాయిజానికి పాల్పడింది ఎబివిపి వారే అని కొందరు, పోలీసులే ముసుగులతో దాడి చేశారని, బయటి వ్యక్తులను రప్పించి ముసుగులు తగిలించి ఎబివిపి వారు దగ్గరుండి కొట్టించారని రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముసుగుల్లో వచ్చి దాడి చేసింది తామే అని హిందూ రక్షక దళం పేరుతో ఒక ప్రకటన వెలువడింది. ఎటు తిప్పి ఎటు చూసినా కాషాయ తాలిబాన్లు, వారికి మద్దతుగా ఉన్న పోలీసులు ఈ దాడికి బాధ్యులు అన్నది స్పష్టం. ఈ దుండగాన్ని ఖండిస్తూ పారిశ్రామికవేత్తలు ఆనంద మహింద్రా, కిరణ్‌ షా మజుందార్‌, హర్షా మారివాలా కూడా ఖండించారు.

Image result for deepika padukone ,jnu
మన దేశంలోనూ, ప్రపంచ వ్యాపితంగా అనేక మంది మేథావులు నిరసన తెలిపారు. ఈ రోజు జెఎన్‌యులోని విద్యార్ధులను, వారికి మద్దతు తెలిపిన వారినీ పాలకపార్టీ పెద్దలు దేశ ద్రోహులుగా చిత్రిస్తోంది. ఇదొక ప్రమాదకర పోకడ, భిన్నాభిప్రాయం వ్యక్తం చేయటం పాలకపార్టీకి భజన చేయకపోవటమే దేశద్రోహమా ? బ్రిటీష్‌ తెల్లజాతి పాలకులు కూడా అదే చేశారు. తమను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా చిత్రించారు. అలాంటి వారిని సాగనంపిన జాతి మనది. మరి ఈ కాషాయ నల్లజాతి పాలకులు బ్రిటీష్‌ వారి చెప్పుల్లో కాళ్లు దూర్చి అణచివేతకు పూనుకుంటే, తమతో ఏకీభవించని వారిని దేశద్రోహులుగా పరిగణిస్తే ఏమి చేయాలి?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d