• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: STATES NEWS

వుగాది చారు తాగుతావా ! వుగాది పచ్చడి తింటావా నాయనా !

06 Saturday Apr 2019

Posted by raomk in AP, Current Affairs, Literature., Opinion, Political Parties, Telangana, Telugu

≈ Leave a comment

Tags

Sri Vikari Nama, Ugadi, ugadi panchanga sravanam

Image result for ugadi panchanga sravanam

సత్య

స్వయంగా బిరుదులు తగిలించుకొని జనాన్ని మోసం చేస్తున్న జ్యోతిష పండితులు వీధివీధికీ విస్తరించిన నేపధ్యంలో పేరుమోసిన ప్రముఖ సంస్ధలు, వ్యక్తుల నుంచి మాత్రమే ఎలాంటి రుసుములు చెల్లించకుండా అయిష్టంగా బిరుదులు స్వీకరించిన పండితుడు శ్రీశ్రీశ్రీ స్వామి శర్మ శాస్త్రి రెడ్డి రాయల్‌ నాయుడు గారి నోటి వెంట వికారినామ సంవత్సర రాజకీయ పంచాంగం ఎలా వుంటుందో విందాం. ముందుగా వారి గురించి కొద్ది మాటలు.

శ్రీవారు పూరాశ్రమంలో విధి రీత్యా పుట్టిన కులాన్ని పూర్వ నామం, భవ బంధాలను కూడా తెంచుకొని సర్వజన జ్యోతిష్యం కోసం గురువుల నుంచి స్వీకరించిన నూతన నామంతో సేవ చేస్తున్నారు. జ్యోతిష ఉపాసకులు, జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ, జ్యోతిష కేసరి, జ్యోతిష పంచకల్యాణి వంటి పలు ఉగాదుల స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత. ఎం.ఏ జ్యోతిషం – పి.హెచ్‌.డి”గోల్డ్‌ మెడల్‌” , ఎం.ఏ తెలుగు (ఏల్‌) , ఎం. ఏ సంస్క తం , ఎం.ఏ యోగా , ,ఎం.మెక్‌ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్‌ మెడికల్‌ ఆస్ట్రాలజి (జ్యోతిర్‌ వైద్యం) , పి.జి.డిప్లమా ఇన్‌ జ్యోతిషం, వాస్తు , జ్యోతిష పాలిటిక్స్‌, జ్యోతిష అర్ధశాస్త్రం, జ్యోతిష బయాలజీ,జ్యోతిష జువాలజీ, జ్యోతిష కెమిస్త్రీ, జ్యోతిష ఫిజిక్స్‌, జ్యోతిష బయోటెక్నాలజీ, జ్యోతిష ఇంజనీరింగ్‌ ఇలా వారు పొందని జ్యోతిష మరియు రత్న శాస్త్ర పట్టాలు లేవు. అన్నీ అయిపోయిన తరువాత డాలరు యువతీ, యువకుల కోసం చివరికి అమెరికాలో ఎంఎస్‌ చేసిన నిపుణులు. వారితో ఇంటర్య్వూ చేద్దాం.

నమస్కారం గురువు గారూ

నమస్కారం శ్రీ వికారినామ విజయోస్తు, సర్వజన శుభం, సుఖం ప్రాప్తిరస్తు. అష్టపదుల తెలుగు సంవత్సరాదుల వరుసలో వికారి 33వది, మూడు మూళ్లు తొమ్మిది కావచ్చు, మూడూ మూడూ కలిస్తే ఆరు కావచ్చు, మూడు లోంచి మూడు తీసి వేస్తే సున్నా అవుతుంది. ఎటు చూసినా మూడే కనిపిస్తుంది, అన్నింటికీ మించి దానికి ముందూ వెనుకా రెండూ బేసి సంఖ్యలే వున్నాయి, చూశారా ఎంతటి మహత్తర సంవత్సరమో !

సంతోషం గురువు గారూ ఈ ఏడాది వుగాది ప్రత్యేకత ఏమంటే వెంటనే ఎన్నికల దశ తొలిదశ ప్రారంభం అవుతుంది, ఎవరి భవిష్యత్‌ ఎలా వుండబోతోందో కాస్త వివరిస్తారా ?

నాయనా గతంలో అధికారానికి వచ్చిన వారు వరుణ దేవుడిని తమ వైపు లాక్కుని అనావృష్టి దేవుడిని మరొకవైపు నెట్టారు. అన్న దమ్ముల మధ్య వివాదం వస్తే భూమిని పాడు బెడతారు. ఈ వివాదం తేలే వరకు మనం మాత్రం ఎందుకు పని చేయాలి అంటూ ఆ ఇద్దరు మొత్తం మీద సగం సగం పనులు గత కొద్ది సంవత్సరాలుగా రైతులను ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా అంతే మా సంగతి తెలియదు మేము అధికారానికి వస్తే వరుణదేవుడిని తెస్తాం, మమ్మల్ని ఎన్నుకోకపోతే అనావృష్టి దేవుడిని పంపుతాం అంటున్నాయి అన్ని పార్టీలునూ . అందువలన జనం భవిష్యత్తే అగమ్య గోచరంగా వుంది. మిగతా గ్రహాలు, దేవతలు కూడా ఏ పక్షమో తేల్చుకోలేకుండా అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మనకు జనం కదా నాయనా ముఖ్యం.

అది నిజమే అనుకోండి తెలుగు రాష్ట్రాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీతో మొదలెడదాం వారి భవిష్యత్‌ ఏలా వుండబోతోంది గురువు గారూ !

యూ సీ ఫస్ట్‌ యు హావ్‌ టు అండర్‌స్టాండ్‌ వరల్డ్‌ స్విట్యుయేషన్‌, అదే ముందుగా మీరు ప్రపంచ పరిస్ధితి గురించి తెలుసుకోవాలి. పర్యావరణానికి ముప్పు తలపెట్టిన కారణంగా ఇటీవలి కాలంలో గ్రహాలు కూడా వాటి స్ధానాల్లో అవి వుండలేక కాలుష్యం లేని ప్రాంతాలకు తరలిపోతున్నాయి. మన దేశంలోనూ అదే జరుగుతోంది. ముక్కోటి దేవతలకూ రిసార్టులను సర్దు బాటు చేయలేక హోటల్స్‌ వారు ఇబ్బంది పడుతున్నారు. అందువలన ఏ రాజకీయ నాయకుడి లేదా పార్టీకి చెందిన గ్రహాలు, వాటిని ఆశ్రయించిన తిధులు, నక్షత్రాలు కూడా వాటి వెంటే తరలి పోతున్నాయి. తమ వారిని అవి పర్యవేక్షించే స్ధితి సరిగా వుండటం లేదు. ఎన్నికలకు ముందు ఎవరు ఏ పార్టీలో వుంటారో తరువాత ఎటు వుంటారో తెలియని స్ధితి ఏర్పడటానికి, జనానికి పిచ్చి ఎక్కించటానికి కారణమిదే. షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా ఈ పరిమితులను గమనంలో వుంచుకోవాలి.

ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా చూస్తే రాజకీయ నేతల కంటే జనానికి ఏలినాటి శని పట్టిన స్దితి కనిపిస్తోంది. ఎందుకంటే మూడు ప్రధాన పార్టీల నేతలు చంద్రబాబు, జగన్‌, పవన్‌ కల్యాణ్‌ ముగ్గురినీ ఏలినాటి శని ఇంకా కొన్ని సంవత్సరాల పాటు వదిలేట్లు కనిపించటం లేదు. అందువలన ఆ పార్టీల నేతలు అటూ ఇటూ డొల్లు పుచ్చకాయల మాదిరి ఎక్కడ వాటంగా వుంటే అటు దొర్లు తుంటారు 2014లో పార్టీ పరిస్దితి బాగున్నా జగన్‌ జాతకంలో సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు శని ప్రవేశించి దెబ్బతీసింది. అధికారం రాలేదు, గెలిచిన ఎంఎల్‌ఏలు, ఎంపీలు కొందరు ఫిరాయించారు, చివరకు అసెంబ్లీలో అడుగుపెట్టటాన్ని కూడా శని, బుధుడు, కుజుడు, అంగారకుడు వంటి గ్రహాలన్నీ అడ్డుకొని చెడ్డపేరు తెచ్చాయి.

ఇక చంద్రబాబు నాయుడి విషయానికి వస్తే తొలి రోజుల్లో కాంగ్రెస్‌ రక్తం కొద్దిగా వుంది, తరువాత తెలుగుదేశం రక్తం ప్రవేశించింది. ఆ తరువాత ఒక్క కమ్యూనిస్టుల ఎర్ర రక్తం తప్ప మిగతా పార్టీల రంగుల రక్తాలన్నీ కలసి పోయాయి. పార్టీ కూడా అలాగే తయారైంది. గత ఎన్నికల్లో చంద్రబాబు మీద అంతకు ముందు పదేండ్ల పాటు వదలని శని బలంగానే వున్నప్పటికీ గ్రహాలు అనుకూలించిన మోడీ, పవన్‌ కల్యాణ్‌ మీద లక్ష్మీ దేవి ప్రభావం కారణంగా ఓట్లలో పెద్దగా తేడా లేకున్నా సీట్లు మెజారిటీ తెచ్చుకొనేందుకు చివరి క్షణంలో శని తలొగ్గింది.

ఇక పవన్‌ కల్యాణ్‌ విషయానికి వస్తే గ్రహాలు అనుకూలంగా లేక పోటీ చేయకుండా వెనక్కు లాగి తెలుగుదేశం, బిజెపి పార్టీలను బలపరిచే విధంగా ముందుకు నెట్టాయి. ఈ సారి అవే గ్రహాలు వై డోంట్‌ యు ట్రై మీరే అధికారం కోసం ఎందుకు ప్రయత్నించకూడదని మరింత ముందుకు తోశాయి. పద్మవ్యూహంలో దూరిన అభిమన్యుడిలా వుంది పరిస్ధితి.

మరి ఇప్పుడేం జరుగుతుంటారు ?

నాయనా ప్రపంచం నిరంతరం మారుతూ వుంటుంది, అలాంటపుడు గ్రహాలు ఎలా స్దిరంగా వుంటాయి చెప్పు. యాంటీ బయటిక్స్‌ను కూడా తిని హరాయించుకొని తెగబలిసే వైరస్‌, బాక్టీరియా మాదిరి ప్రతి పార్టీలో రాహువు, కేతువులు బలంగా తయారయ్యాయి. ఒకదానిని ఒకటి మింగేసే విధంగా సాగుతున్న ఎన్నికల ప్రచారాన్ని చూస్తే తెలియటంలా ఎందుకంటావు. వాటి ప్రభావమే.

కొంచెం వివరంగా చెబుతారా గురువు గారూ

తెలంగాణాను చూడు నాయనా టిఆర్‌ఎస్‌ సుస్ధిర ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి నవగ్రహాలన్నీ అనుకూలించాయి. అయినా టిఆర్‌ఎస్‌ నేత కేసి ఆర్‌ మీద బాహుబలి ప్రభావం పడి కాంగ్రెస్‌, ఇతర పార్టీల నాయకులందరినీ ఆకర్షిస్తున్నారు. అది ఆయనకు స్వతహాగా వున్నది కాదు, గ్రహాల ప్రభావం. భగవద్గీత ఏం చేప్పిందీ, చంపేది నేనే చచ్చేదీ నేనే అన్నట్లుగా పాలక పార్టీనేనే, ప్రతిపక్షమూ నాదే అన్నట్లు వ్యవహరించక తప్పటం లేదు. అలాగే రేపు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందనేది చెప్పటానికి ఇప్పుడు ఏ &గ్రహమూ అందుబాటులో లేదంటే నమ్మక తప్పదు. ఎవరు ఏమి చెప్పినా అంతా ఆ సర్వేశ్వరుడిి లీల.

అంటే సర్వేలు చెప్పినట్లు జరుగుతాయంటారా ?

లేదు లేదు నాయనా నేను చెబుతున్నది మీడియా సర్వేల గురించి కాదు, భగవంతుడు, భగవంతుడు. మీ సర్వేల దేముంది నాయనా లైక్‌ పెయిడ్‌ న్యూస్‌ పెయిడ్‌ సర్వేసూ…

కాస్త అర్దమయ్యేట్లు చెబుతారా

నేను చెప్పటం కాదు, వుపాసకులను గ్రహాలు పలికిస్తాయి. జోత్యిష్యంలో వున్నది వెలికి తీస్తున్నా, నిమిత్ర మాత్రుడిని. ప్రతి పార్టీ ఎంఎల్‌ఏ, ఎంపీ బలమైన ముహూర్తాలు, గ్రహాల గతిని చూసే నామినేషన్లు వేశారు. అందరూ గెలుస్తారా లేదే ఒక్కరే గదా అలాగే ఎవరెన్ని జోశ్యాలైనా చెప్పవచ్చు, పంచాంగాలు అయినా విప్పవచ్చు. అంతా జగన్నాటక సూత్రధారి విధి, వినోద క్రీడ. చూసి తరించాలి, విని ఊరుకోవాలి తప్ప ప్రతిస్పందించరాదు. మనలో మాట ఆఫ్‌ ది రికార్డు. గెలిచిన ఎంఎల్‌ఏలు పార్టీ ఫిరాయిస్తారని మాలో ఒక్కడైనా చెప్పాడా, మాకు తెలిసినా ఎన్నికలను ప్రభావితం చేయకూడదనే సెల్ప్‌ రూల్స్‌, అదే మీ మీడియా విధించుకున్న స్వయం నియంత్రణ. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైంది. మా జ్యోతిష్కులతో పాటు, మాకు పోటీగా దుకాణం తెరిచిన లగడపాటి రాజగోపాల్‌ జోస్యంతో జనం వందల కోట్ల పై పందాలు కట్టారు, ఏమైందో తెలుసు కదా ! కోట్లకు కోట్లు వెచ్చించి పార్టీల సీట్లు తెచ్చుకున్నారన్నది భగవంతుడు చూస్తూనే వున్నాడు.అందరూ అదే పని చేస్తున్నపుడు ఎందరిని వారించగలడు. తోటకూర నాడే జోక్యం చేసుకోని ఆ భగవానుడు తరువాత వేలు పెడతాడా ? కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు. ఆ వచ్చిన వారు ఎవరి మీద దాడులు చేయిస్తారో తెలియదు, అందువలన ఎవరు ఏ పార్టీలో గెలిచినా కేంద్రంలో వచ్చే పాలకులను బట్టి ఎటు చేరాలో నిర్ణయించుకుంటారని చెప్పాలని కొద్ది రోజుల క్రితం జరిగిన గ్రహాల సమావేశం నిర్ణయించింది. ఒకదానిని నష్టజాతకమని, మరొకదానిని అదృష్టమని జనం అనుకోవచ్చు తప్ప మనలో మనకు అందరం సమానమే అని తీర్మానించాయి. అందువలన ఫలానా పార్టీయే గెలుస్తుందని, గెలిచిన వారంతా దానితోనే వుంటారని ఎవరూచెప్పలేరు. ఓడిపోయిన పార్టీలో వుంటే నష్టజాతకులు, గెలిచిన పార్టీలోకి ఫిరాయిస్తే అదృష్టజాతకులు అంటారు. అసలు పార్టీలను మొత్తంగా టోకుగా కొనే రోజులు వస్తున్నాయి. ఎన్నికల కోడ్‌ వుంది గనుక పేర్లు చెప్పకూడదు నాయనా ! కోడ్‌ను రాజకీయ పార్టీలు వుల్లంఘిస్తే ఎన్నికల సంఘం ఏమి పీకుతోంది అని మీ వంటి వారు అనవచ్చు, అది దారి తప్పిందని మేమూ తప్పాలని లేదు కదా నాయనా !

మొత్తం మీద ఫలితాలు, పర్యవసానాలు ఎలా వుంటాయంటారు.

యూ సీ ఆల్‌ ఆర్‌ ఫేసింగ్‌ క్రెడిబిలిటీ ప్రాబ్లమ్స్‌ కనుక గ్రహాలు కూడా విస్వసనీయత సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఒకటి మరొకదాని మాట వినటం లేదు. విన్నా కట్టుబడి వుంటాయని నమ్మటం లేదు. ఒక్కొక్క జోతిష్కుడికి ఒక్కొక్క గ్రహం మీద అభిమానం, నమ్మకం వుంటాయి. అందువలన అందరూ చెప్పేది వినండి, దేనీని అంతిమంగా తీసుకోవద్దు. నైవేద్యం గురించి పూజారులకు మాత్రమే తెలుసు, వుగాది జ్యోతిష్యం కూడా అలాంటిదే. ఇంకొక విషయం. మా వరకు వస్తే ప్రతి నాయకుడు, ప్రతిపార్టీ సరిగ్గా పుట్టిన సమయం తేదీ కచ్చితంగా తెలిస్తేనే సరిగ్గా చెప్పగలం. ఎవరి జాతకంలోనూ అలాంటి నిక్కచ్చి సమాచారం లేదు, ఫర్‌ ఎగ్జాంపుల్‌ నూతన పాత్రధారి పవన్‌ కల్యాణ్‌ పుట్టిన సంవత్సరాలు ఏవంటే మూడు చెబుతున్నారు. మూడింటిని బట్టి లెక్కిస్తే మూడు విధాలుగా వస్తున్నాయి. మిగతావారికీ ఇలాంటివే వున్నాయి మరి.

ఆఖరి ప్రశ్న వికారినామ సంవత్సరం గురించి చెప్పండి.

నాయనా వికారి అంటే వికారమైనది, ఎవరికైనా వికారం తలెత్తితే ఆ క్షణంలో ఏమి జరుగుతుందో ఇంత వరకు ఏ ప్రపంచ జ్యోతిష పండితుడూ చెప్పలేదు, జ్యోతిష శాస్త్రం దాని గురించి ప్రస్తావించలేదు, తర్కించలేదని గుర్తించాలి. ఇప్పటి వరకు గంటల పంచాగాలే తప్ప నిమిషాలు,క్షణాల పంచాంగాలు ఇంకా రూపుదిద్దు కోలేదు. వాటికి వాటికి గ్రహాల అనుమతి కూడా అనుమానమే. ఎవరికైనా వికారం కలిగితే తన మీద తానే వాంతి చేసుకోవచ్చు, ఎదుటి వారి మీదా చేయవచ్చు. అది ఎదుటి వారి ప్రారబ్దాన్ని బట్టి వుంటుంది. ఆ సమయంలో వికారం కలిగిన వారి గ్రహాలు కూడా గతులు తప్పుతాయి. అందువలన వారి ప్రవర్తన కూడా అలాగే వుంటుంది. అన్నట్లు నాయనా ఈ రోజు వుగాది కనుక ఇంకా కాఫీ, టీ గట్రా సిద్ధం కాలేదు, కాస్త వుగాది చారు తాగుతావా, పచ్చడి తింటావా !

ఫర్లేదు గురువు గారూ వంటల కార్యక్రమంలో మా యాంకర్లు ఏమి వండినా తినక తప్పదు అలాగే కొంచె వుగాదిచారు, కొంచెం వుగాది పచ్చడి పెట్టండి.

తెలివిగల వాడివి నాయనా నీవు నియోగి వంటి వాడివి, ఎలా అయినా వినియోగపడే వాడే నియోగి అని తెనాలి రామకృష్ణుడు చెప్పాడు కదా . శుభం నాయనా జాగ్రత్తగా వుండు, పొద్దుటి నుంచీ మీ మీడియా వారు అడిగే అర్ధం పర్ధం లేని, మీకు కావాల్సింది చెప్పాలనే సతాయింపు ప్రశ్నలతో నా కెందుకో వికారం కలిగినట్లుగా వుంది అలా వెళొస్తా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చౌకీదారుగా నరేంద్రమోడీ – సిఇఓగా చంద్రబాబు విఫలం !

07 Thursday Mar 2019

Posted by raomk in AP, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

BJP, CEO chandrababu naidu, chandrababu naidu, chowkidar narendra modi, Data Theft, Narendra Modi, trs, ysrcp

Image result for as chowkidar narendra modi

ఎం కోటేశ్వరరావు

దేశంలో ప్రస్తుతం పెద్ద రాజకీయ వ్యాపారం నడుస్తోంది. దీనికి నేరపూరిత అంశాలు తోడవుతున్నాయి. నేను దేశానికి పెద్ద కాపలాదారును అని ప్రధాని నరేంద్రమోడీ పదే పదే చెప్పుకుంటారు. ముఖ్యమంత్రి అని పిలిపించుకోవటం కంటే సిఇఓ అంటేనే నాకు పెద్ద కిక్కబ్బా అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో చెప్పుకొని ఎంతో తృప్తి పొందారు. ఇప్పుడు ఇద్దరూ ఘోరంగా విఫలమయ్యారు అని చెప్పక తప్పదు. పెద్ద కాపలాదారు సంరక్షణలో వున్న రాఫెల్‌ విమానాల లావాదేవీలు, చర్చల పత్రాలు చోరీకి గురైనట్లు మార్చి ఆరవతేదీన అటార్నీ జనరల్‌ కె వేణుగోపాల్‌ సుప్రీం కోర్టుకు తెలిపారు. రెండు దశాబ్దాలకుపైగా తాము నిల్వచేసిన తమ పార్టీ సమాచారం చోరీకి గురైందని తెలుగుదేశం పార్టీ నేతలు తెలంగాణా పోలీసులు, మరికొందరి మీద గుంటూరు జిల్లాలో ఫిర్యాదు చేశారు. అతి పెద్ద కాపలాదారు రక్షణలో వున్న రక్షణ శాఖ పత్రాల చోరీ గురించి ఎలాంటి ఫిర్యాదు లేదా కేసు నమోదు లేకుండానే ఏకంగా వున్నత న్యాయ స్ధానానికి తెలియచేయటం సరికొత్త వ్యవహారశైలికి నిదర్శనం. సమాచార చౌర్యం గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో చర్యలు, చర్చ మొదలైన వారం రోజులకు తమ సమాచారం పోయిందని తెలుగుదేశం గొల్లు మంటూ కేసు దాఖలు చేసింది. సామాన్యులు ఈ పరిణామాలను ఒక పట్టాన అర్ధం చేసుకోవటంలో విఫలమైతే జుట్టుపీక్కోవటం తప్ప ఏమీ చేయలేరు.

రెండు అంశాలు స్పష్టం. రాఫెల్‌ పత్రాలు చోరీకి గురైనట్లు మోడీ సర్కార్‌ కోర్టుకు నివేదించటం అంటే హిందూ పత్రిక వెల్లడించినవి వాస్తవమే అని నిర్ధారించటం. రెండవది చేయాల్సిన పని చేయనందుకు పెద్ద కాపలాదారు మీద ముందు కేసు నమోదు చేసి వుద్యోగం నుంచి వూడగొట్టాలి. ఏండ్ల తరబడి సేకరించిన సమాచారాన్ని నిర్లక్ష్యంగా చోరీ చేసేందుకు వీలుగా వుంచి కాపాడుకోవటంలో విఫలమైన తెలుగుదేశం కంపెనీ సిఇవో లేదా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని బాధ్యతల్లో కొనసాగించటమా లేదా అన్నది సదరు కంపెనీ లేదా పార్టీకి వదిలివేద్దాం. దొంగలు దోచుకుపోయిన తరువాత ఇంటికి తాళాలు వేసినట్లు తెలుగుదేశం వెబ్‌సైట్‌ను మూసివేశారు. ఎందుకాపని చేశారంటే మిగిలిన సమాచారాన్ని కాపాడుకొనేందుకు అంటున్నారు. రాఫెల్‌ విమానాల కొనుగోలు ధర ఎక్కువా, తక్కువా, ఎంతో అనుభం వున్న ప్రభుత్వ రంగ సంస్ధను పక్కన పెట్టి ఎలాంటి అనుభవం లేని రిలయన్స్‌ కంపెనీకి కట్టబెట్టారా లేదా అన్న చర్చ జరుగుతోంది, వున్నత న్యాయస్ధానంలో విచారణలో వుంది. వాటిని పక్కన పెడితే రాఫెల్‌ విమానాలో మరొకటో మన వాయుసేనకు అవసరం అనేదానిలో ఎలాంటి తేడాలు లేవు. రాఫెల్‌గాక పోతే మరోకంపెనీ లావాదేవీలు లేదా ప్రభుత్వం చెబుతున్నట్లు అత్యంత రహస్య సమాచారాన్ని నరేంద్రమోడీ సర్కారు జాగ్రత్త పరచలేదు అన్నది తేలిపోయింది. సదరు పత్రాలు హిందూ పత్రిక చోరీ చేసిందని కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఆరోపించింది.

ప్రపంచంలో ఇలా అధికారిక పత్రాలు బహిర్గతం కావటం కొత్తేమీ కాదు. అమెరికా ప్రభుత్వం అత్యంత రహస్యంగా వుంచే సమాచారాన్ని జూలియన్‌ అసాంజే అనే పెద్ద మనిషి బహిర్గతం చేసిన వాటిని సంవత్సరాల బడి చదువుతూనే వున్నా ఇంకా తరగటం లేదు. కళ్ల ముందు జరిగే ఒక దుర్మార్గం లేదా ఒక అక్రమాన్ని సహించలేని వారో లేదా సదరు లావాదేవీ పోటీలో వెనుక బడి తోటి కంపెనీ అక్రమాలకు బలైన వారో ఇలాంటి పత్రాలను స్వయంగా మీడియాకు తెచ్చి ఇవ్వటం బహిరంగ రహస్యం. అలాంటి వనరు ఏదో ఒకటి లేకుండా మీడియా వ్యక్తులు దొంగతనం చేసి సంపాదించిన దాఖలా లేదా అలాంటి వుదంతాలలో శిక్షలు పడిన వుదంతాలు నాకైతే కనపడలేదు. అదే హిందూ పత్రిక గతంలో బోఫోర్సు పత్రాలను, బిజెపి నేత మాజీ మంత్రి అయిన అరుణ్‌శౌరీ జర్నలిస్టుగా వున్న సమయంలో అనేక కుంభకోణాలను బయట పెట్టారు. కానీ అప్పుడెవరూ ప్రభుత్వ పత్రాలు చోరీ అయినట్లు ఫిర్యాదు చేయలేదు. జర్నలిస్టులను దొంగలుగా చిత్రించి కేసులు నమోదు చేస్తే ఈ దేశంలో, ప్రపంచంలో కేసులు వుండని జర్నలిస్టులు, మీడియా సంస్ధలు వుండవు.

రాఫెల్‌ లావాదేవీల అక్రమాల గురించి హిందూ పత్రిక ప్రకటించిన వెంటనే ఫిబ్రవరి ఎనిమిదిన రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేశారు. దానిలో చోరీ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. నెల రోజుల తరువాత చోరీ జరిగిందని అధికార రహస్యాల వెల్లడి చట్టం కింద వాటిని బయట పెట్టిన రెండు పత్రికల మీద విచారణ, చర్యను పరిశీలిస్తున్నట్లు అటార్నీ జనరల్‌ కోర్టుకు వెల్లడించారు. అది కూడా ఈ లావాదేవీలపై సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పున:పరిశీలించాలన్న పిటీషన్లపై విచారణ ప్రారంభమైన తరుణంలో అన్నది గమనించాలి. కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు కోర్టులో చేసిన వాదనను చూస్తే అధికార రహస్యాల చట్ట వుల్లంఘన అనే కత్తిని మీడియా మీద ప్రయోగించేందుకు పూనుకుందన్నది స్పష్టం. దాన్నే రక్షణగా చేసుకొని పునర్విచారణను అడ్డుకోవాలని చూస్తోంది. పునర్విచారణ పిటీషన్‌ విచారణకు ముందే వార్తా పత్రికలు సంబంధిత అంశాలను ప్రచురించటం కోర్టు నిర్ణయాన్ని ప్రభావితం చేసేందుకే అని అందువలన ఇది కోర్టు ధిక్కారం కూడా అని ఏజి వాదించారు. దీనికి ప్రతిగా పిటీషన్‌దారైన ప్రశాంత భూషణ్‌ కోర్టుకు వాస్తవాలను వివరించే పిటిషనర్లను అడ్డుకొనే ప్రయత్నమే ఏజి ప్రకటనలని నిజానికి అవే కోర్టు ధిక్కరణకిందికి వస్తాయన్నారు.

ప్రపంచంలో ప్రజాస్వామ్యం వున్న ఏదేశంలోనూ ఒక వార్త మీడియాకు ఎలా వచ్చిందో చెప్పాలని ఆదేశించే హక్కు ఏ కోర్టుకూ లేదు. మీడియాకు అనేక వనరుల నుంచి వార్తలు వస్తాయి. వాటిని బయటకు వెల్లడించబోమనే ఎలాంటి రాతకోతలు లేని హామీతోనే స్వీకరిస్తాయి, ప్రచురిస్తాయి.అలాంటి విశ్వసనీయతను మీడియా కాపాడుకొంటూ వస్తోంది. ఈ వుదంతంలో హిందూ పత్రిక ప్రచురించిన వాటి గురించి పత్రిక చైర్మన్‌, స్వయంగా రాఫెల్‌ పత్రాలను బయట పెట్టిన ఎన్‌ రామ్‌ ఈ విషయాలనే స్పష్టంగా చెప్పారు. ఈ అంశాలు కోర్టు విచారణలోనూ వస్తాయి కనుక వాటి గురించి మరోసారి పరిశీలిద్దాం.

Image result for as ceo  chandrababu naidu failed

తెలుగుదేశం- వైసిపి మధ్యలో తెరాస !

రెండవ అంశం ఆంధ్రప్రదేశ్‌, తెలుగుదేశం పార్టీ సమాచార చోరీ వివాదం.సమాచార చోరీ చాలా సంక్లిష్టమైనది. దానికి ముందే చెప్పుకున్న జూలియన్‌ అసాంజే వికీలీక్స్‌ వెల్లడించిన సమాచార వుదంతం చక్కటి వుదాహరణ. అసాంజే ఆస్ట్రేలియా కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌. అమెరికాకు చెందిన ఆఫ్ఘన్‌, ఇరాక్‌ యుద్ధాలు, సిఐఏ, అమెరికా రాయబారులు పంపే ప్రయివేటు సమాచారం లక్షల ఫైళ్లను ప్రపంచానికి విడుదల చేశాడు. అతని మీద నేరుగా చర్యలు తీసుకొనే అవకాశం లేక లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలపై స్వీడన్‌ అరెస్టు చేసి విచారణ జరిపింది, తేలిందేమీ లేదు. స్వీడన్‌తో అమెరికాకు వున్న ఒప్పందం కారణంగా రహస్యాలను బయట పెట్టిన కేసులో అమెరికాకు అప్పగిస్తామని స్వీడన్‌ ప్రకటించింది. దాంతో అతను బ్రిటన్‌ పోలీసులకు లంగిపోయాడు. పదిరోజుల పాటు విచారించి బెయిలు మీద విడుదలయ్యాడు. బ్రిటన్‌ కూడా అమెరికాకు పంపే యత్నాలను గమనించి బ్రిటన్‌ పోలీసుల కళ్లుగప్పి లండన్లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో ఆశ్ర యం పొందాడు. 2017లో ఈక్వెడార్‌ పౌరసత్వం కూడా పొంది అక్కడే వుంటున్నాడు. అంతర్జాతీయ రాజకీయాలు అర్దమైతే తప్ప ఇలా ఎందుకు జరుగుతోంది అనేది అర్ధం కాదు.

స్వాతంత్య్రం తరువాత అనేక రాష్ట్రాలను చీల్చి కొత్త వాటిని ఏర్పాటు చేశారు. బహుశా ఎక్కడా లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రాంతీయ అధికార పార్టీల మధ్య రాజకీయ వివాదాలు చోటు చేసుకోవటం ఒక విధంగా భారత రాజకీయ రంగం మీద కొత్త అంకం అనుకోవాల్సి వుంటుంది. తెలుగు వారు గణనీయ సంఖ్యలో వున్న కర్ణాటకలో తెలుగుదేశం, తెలంగాణా రాష్ట్రసమితి(తెరాస) మధ్య మొదలైన తెరవెనుక రాజకీయ పోరు గతేడాది జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో తెరమీదకు వస్తే, ఇప్పుడు అది కత్తులు దూసుకొనే స్ధాయికి చేరింది. రాజకీయ పార్టీలు ఒకదానినొకటి దెబ్బతీసుకోవాలి అని అనుకోవాలేగానీ అవకాశాలు, సాకులు బోలెడన్ని.మనకు సినిమా పరిజ్ఞానం ఎక్కువ గనుక చిక్కడు-దొరకడు, రేచుక్క-పగటి చుక్క, ఎత్తుకు పై ఎత్తు, దొరికితే దొంగలు, జగత్‌ కిలాడీలు, జగత్‌ జెంత్రీలు వంటి సినిమాలను చూసి తెలుగువారు చాల మెళకువలను నేర్చుకున్నారు. తాజాగా వచ్చిన ఎఫ్‌టు అనే తెలుగు సినిమాలో ఒక అధికారి తాను తెలంగాణా లేదా ఆంధ్రకు చెందిన వాడిని అని చెబితే ఎక్కడ తేడా వస్తుందోనని కేంద్ర పాలిత ప్రాంతం యానం అని చెబుతాడు. ఇప్పుడు వర్తమానానికి వస్తే సమాచార చౌర్యం. సమస్య తెలుగుదేశం-వైసిపి వ్యవహారంలా వున్నప్పటికీ బిజెపి, తెలంగాణా రాష్ట్ర సమితి పాత్రకూడా తక్కువేమీ కాదు. దీనిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన వారు, ఫిర్యాదులు చేసిన వారందరూ సామాన్య జనాన్ని గందరగోళపరుస్తున్నారు. హైదరాబాదుకు చెందిన ఐటి గ్రిడ్స్‌ ఇండియా అనే ఒక కంపెనీ తెలుగుదేశం పార్టీకోసం సేవా మిత్ర అనే ఒక యాప్‌ను తయారు చేసిందని, దానిలో వుపయోగించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వివిధ పధకాల లబ్దిదారులు, ఓటర్ల వివరాలను తస్కరించారని హైదరాబాద్‌కు చెందిన టి లోకేశ్వర్‌ రెడ్డి అనే సమాచార విశ్లేషకుడు మార్చినెల రెండవ తేదీన హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సమాచార చోరీ వివాదం ప్రారంభమై సినిమాల్లో మాదిరి మలుపులు తిరుగుతోంది. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐటిగ్రిడ్‌ కంపెనీలో సోదాలు జరిపి సిబ్బందిని ప్రశ్నించారు. యజమాని ప్రస్తుతం పరారీలో వున్నట్లు పోలీసులు ప్రకటించారు. అతను అమరావతిలో అంటే విజయవాడలో ఏపి పోలీసుల రక్షణలో వున్నాడన్నది బిజెపి, తెరాస ఆరోపణ. దాని గురించి తెలుగు దేశం పార్టీ వారు అవుననీ, కాదనీ ఏమీ మాట్లాడరు. మార్చి మూడవ తేదీన ఏపి పోలీసులు హైదరాబాదు వచ్చి సమాచార చోరీ ఫిర్యాదు చేసిన లోకేశ్వరరెడ్డి ఇంటి మీద దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. అతనేమీ సమాచార దొంగకాదు. ఐటి గ్రిడ్‌ సిబ్బందిని నిర్బంధించారన్న అరోపణలతో కోర్టుకు ఫిర్యాదు చేశారు. వారిని కోర్టులో హాజరు పరచగా తమను ప్రశ్నించారు తప్ప నిర్బంధించలేదని కోర్టుకు తెలపటంతో కోర్టు పిటీషన్‌ను కొట్టివేసింది. ఐటి గ్రిడ్‌ కంపెనీని వేధిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ప్రకటించటంతో సమాచార చౌర్యం కేసు రాజకీయ రంగు పులుము కుంది.

ఈ లోగా హైదరాబాద్‌కు చెందిన దశరధరామి రెడ్డి అనే మరోవ్యక్తి హైదరాబాద్‌ పోలీసులకు మరో ఫిర్యాదు చేశాడు. హైదరాబాదులో తాత్కాలికంగా నివాసం వుంటున్న వారి వివరాలను సేకరించి ఆంధ్రప్రదేశ్‌లోని వారి స్వస్ధలాలలో ఓట్లను కుట్రపూరితంగా తొలగిస్తున్నారన్నది దాని సారాంశం. ఫిర్యాదుదారు హైదరాబాదులో వుండటంతో తాము ఇక్కడ కేసు నమోదు చేశామని పోలీసులు ప్రకటించారు. సమాచార తస్కరణ కేసు సత్వర విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు హైదరాబాదు పోలీసులు ప్రకటించారు. సరిగ్గా ఇదే సమయంలో గుంటూరులో తెలుగు దేశం పార్టీ నేతలు అక్కడి పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలంగాణాకు చెందిన పోలీసులు, కొందరితో కుమ్మక్కై తమ పార్టీ సమాచారాన్ని అపహరించారని పేర్కొన్నారు. తెలంగాణా పోలీసులు సత్వర విచారణకంటూ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తే , దానికి పోటీగా ఏపి సర్కార్‌ రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఒకటి తెలుగుదేశ ం పార్టీ సమాచార చౌర్యం మీద అయితే రెండవది ఫారం ఏడుతో అక్రమంగా ఓటర్లను తొలగించేందుకు దరఖాస్తు చేసిన వారి మీద చర్యతీసుకొనేందుకు అని ప్రకటించారు.

చట్టపరమైన అంశాలు, కేసులు ఏమౌతాయి అన్న అంశాలను కాసేపు పక్కన పెడితే ఈ వివాదం ఎందుకు మొదలైందన్నది ఆసక్తి కలిగించే అంశం. తమ వస్తువులను అమ్ముకొనేందుకు అవసరమైన మార్కెటింగ్‌ వ్యూహాలను రచించుకొనేందుకు ప్రపంచవ్యాపితంగా కార్పొరేట్‌ కంపెనీలు జన ఆమోదంతో నిమిత్తం లేకుండా మభ్య, ప్రలోభపరచి లేదా సాధ్యంగాక తస్కరించి సమాచార సేకరణ,దాయటం అందరికీ తెలిసినదే. ఇప్పుడిది కార్పొరేట్‌ రాజకీయ పార్టీలకు పాకింది. పార్టీ కార్యకర్తల, సభ్యుల పేరుతో తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో సమాచార సేకరణ, ఎన్నికల సమయంలో దాన్ని వుపయోగించుకోవటం ఎప్పటి నుంచో జరుగుతోంది.గతంలో ముఖ్య మంత్రి పేరుతో ప్రతి ఇంటికీ లేఖలు రాస్తే ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వ పధకాల లబ్దిదారులను కూడా చేర్చి తమ ఎన్నికల ప్రచారం కోసం వాడుకోవటం అసలు వివాదానికి మూలం. విచారణలో ఏ విషయాలు బయటపడతాయో లేక ఓటుకు నోటు కేసు మాదిరి తెరవెనుకకు పోతాయో మనకు తెలియదు. ఒకటి జరిగి వుండాలి. ఇది వూహ మాత్రమే. తెలుగుదేశం పార్టీ తాను సేకరించిన సమాచారంతో పాటు ప్రభుత్వ పధకాల లబ్దిదారుల సమాచారాన్ని కూడా ఐటి గ్రిడ్‌కు అప్పగించి తన యాప్‌ ద్వారా ఓటర్లకు చేరువ అయ్యేందుకు నిర్ణయించి వుండాలి. అది తెలుసుకున్న వైఎస్‌ఆర్‌సిపి తెలంగాణాలో తన మిత్రపక్ష సహకారంతో ఆ సమాచారాన్ని స్వాధీనం చేసుకొనేందుకు ప్రతి వ్యూహం రచించి వుండాలి. దానిలో భాగంగానే తస్కరణ ఫిర్యాదులు, ఐటి గ్రిడ్‌పై పోలీసుల విచారణ,సమాచార కాపీ, దాన్ని వైఎస్‌ఆర్‌సిపికి అందచేసి వుండాలి. దీనిలో మరొక అంశం ఏమంటే తమకు ఓటు వేసే అవకాశం లేదు అనుకొనే వారి ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు లక్షల సంఖ్యలో ఓటర్లకు తెలియకుండానే కొందరు కుట్ర చేసి దరఖాస్తులు చేయటం, వాటిని అధికారం యంత్రాంగం తెలిసీ లేదా తెలియనట్లు నటించిగానీ దరఖాస్తులో కోరిన మేరకు ఓటర్ల జాబితా నుంచి తొలగించటం జరుగుతోంది. ఇలాంటి చర్యలకు తెలుగుదేశం-వైసిపి రెండు పార్టీలూ పాల్పడ్డాయన్నది అందరినోటా వినిపిస్తున్న అంశం. ఎవరు సమాచారాన్ని దొంగిలించారు లేదా ఎవరు ఐటి గ్రిడ్‌కు అప్పగించారు, దాని దగ్గర నుంచి టిఆర్‌ఎస్‌ సర్కార్‌ సాయంతో వైసిపికి అందచేశారా అనేది ఒకటైతే ఆ సమాచారం అంతా అసలు మన దేశంతోనే సంబంధం లేని అమెజాన్‌, గూగుల్‌ కంపెనీల సర్వర్లకు చేరిందన్నది మరొక అంశం. మరి అదెలా జరిగినట్లు ?

నిజానికి ఇలాంటి అక్రమాలు గతంలో కూడా జరిగాయిగానీ అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఇప్పుడు ఎందుకు అంటే రెండు పార్టీలు అధికారం కోసం ఎంతకైనా తెగించేందుకు పూనుకున్నాయి. ఏ పార్టీ గెలిచినా రెండో పార్టీ దుకాణం ఖాళీ అవుతుంది. గత ఎన్నికలలో తెలుగు దేశం సీట్ల పరంగా ఎక్కువ పొందినా ఓట్ల పరంగా పెద్దగా రాబట్టలేదు. రెండు పార్టీల మధ్య తేడా కొన్ని లక్షలు మాత్రమే అన్నది తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, మరికొన్ని రాష్ట్రాలలో నెలకొన్న పరిస్ధితులను చూస్తే ఏ పార్టీ అయినా అధికారానికి వస్తేనే అది ఐదు సంవత్సరాలూ నిలుస్తుంది. ఏదో ఒకసాకుతో ప్రతిపక్ష పార్టీలు ఎంపీలు, ఎంఎల్‌ఏలు, ఇతర ప్రజాప్రతినిధులను టోకుగా లేదా చిల్లరగా కొనుగోలు చేస్తూ అధికారంలోకి వచ్చిన పార్టీ తన బలాన్ని పెంచుకొంటోంది. పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం వున్నప్పటికీ స్పీకర్ల అండ, చట్టంలోని లసుగులను వుపయోగించుకొని ఫిరాయింపుదార్లను రక్షిస్తున్నారు. పార్టీ మారకుండానే మంత్రిపదవులను సైతం కట్టబెట్టిన విపరీతాన్ని చూశాము. అందువలన ఎలాగైనా సరే అధికారాన్ని పొందాలన్నదే ఏకైక సూత్రంగా ఇప్పుడు అధికారపార్టీలు పని చేస్తున్నాయి.

ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఎన్నికల తాయిలాలు, డబ్బులు పంచటం, కులాన్ని రంగంలోకి తీసుకురావటం పాత పద్దతులు. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేతలుగా వున్న వారి వ్యాపారాలు, ఇతర లావాదేవీలను దెబ్బతీస్తామంటూ బెదిరింపులకు పాల్పడటం ద్వారా తమవైపు తిప్పుకోవటం అధికారపార్టీలు కొత్తగా ప్రారంభించిన ప్రమాదకరక్రీడ. ఎవరు అధికారంలో వుంటే వారు దీన్ని ఆడుతున్నారు. ఇది రాష్ట్రాలను దాటింది. కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి తన లేదా తన మిత్రపక్ష రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు సిబిఐ, ఐటి, ఇడి వంటి సంస్ధలను వుపయోగించుతోందన్నది ఒక విమర్శ. హైదరాబాదులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులుగా వున్న వారు బహిరంగంగానే ఆరోపించిన అంశం తెలిసిందే. వైఎస్‌ఆర్‌సిపికి లబ్ది చేకూర్చేందుకు తెలంగాణా వున్న టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం ఈ పని చేస్తోందన్నది ఆరోపణ. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలలో ఏపికి చెందిన చంద్రబాబు నాయుడు జోక్య ం చేసుకొని తమను ఓడించేందుకు ప్రయత్నించినదానికి ఇది బదులు తీర్చుకోవటంగా కనిపిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వ సమాచార చోరీ జరిగిందన్న ఫిర్యాదుకు, తమ సమాచారాన్ని చోరీ చేశారన్న ఆరోపణకు రెండింటికీ తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి వుంది. అధికారంలో వున్న పార్టీగా అధికారిక సమాచార చోరీ నివారణకు, చివరకు స్వంత సమాచార చోరీని అడ్డుకోవటంలో ఎందుకు విఫలమైంది అన్నదానికి జవాబు చెప్పాల్సింది వారే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడు జోక్యం చేసుకున్నాడని, సామాజిక మీడియాను వుపయోగించి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్లు వచ్చిన ఆరోపణలు మనకు తెలిసిందే. అమెరికా ఎన్నికల్లో కూడా జాబితా తయారీలోనే ఓటర్లకు ప్రలోభాలు, తమకు ఓట్లు పడవు అనుకున్న ప్రాంతాలలో ఓటర్లజాబితాల్లో అక్రమాలు, కుంటి సాకులు చూపి ఓటర్లను అడ్డుకోవటం బహిరంగ రహస్యం.

ఇప్పుడు ఓటర్ల జాబితాల్లో తొలగింపుల గురించి తెలుగుదేశాంవైసిపి పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు చూస్తే రేపు ఫలితాలు ఎవరికి అనుకూలంగా రాకపోతే రెండోవారిని నిందించటానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు అనుకోవాలి.ఓట్ల తొలగింపు గురించి సాధారణంగా ఎన్నికల రోజు, లేదా తరువాత ఆరోపణ,ప్రత్యారోపణులు వస్తాయి.అలాంటివి ఇప్పుడు ముందే వస్తున్నాయంటే అర్ధం అదే. ఈ పూర్వరంగంలో ఎన్నికల సంస్కరణలు లేదా నిబంధనల సవరణ అంశం ముందుకు వస్తోంది. నిర్ణీత గడువులోగా ఓటర్లుగా నమోదుకు అవకాశం ఇచ్చినట్లే, రద్దు దరఖాస్తుల ప్రకారం ఏ ఓటర్లను తొలగిస్తున్నదీ, అభ్యంతరాలుంటే తెలియచేయాల్సిందిగా కోరుతూ ముసాయిదా ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలకు అందచేస్తే తప్పుడు దరఖాస్తులా నిజమైనవా అన్నది తేలుతుంది. కనీసం తొలగింపు ఓటర్లను బూత్‌ల వారీ ఎలక్ట్రానిక్‌ జాబితాలను అయినా పార్టీలు, ఓటర్లకు అందుబాటులో వుంచి సరిచూసుకొనేందుకు వీలు కల్పించాలి. బోగస్‌ దరఖాస్తులుగా తేలిన వాటిని దరఖాస్తుదారులను, వాటిని విచారణ చేయకుండా ఆమోదించి ఓట్లను తొలగించిన సిబ్బంది మీద క్రిమినల్‌ చర్యలు తీసుకుంటే భవిష్యత్‌లో అటువంటివి పునరావృతం కాకుండా వుంటాయి. ఒకసారి ఓటు హక్కు వచ్చిన తరువాత ఓటరు స్వయంగా కోరితే లేదా మరణిస్తే తప్ప జాబితా నుంచి రద్దయితే దానికి జాబితా తయారు చేసినవారిని బాధ్యులుగా చేయాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సీతయ్య ఎవరి మాటా వినడు !

06 Tuesday Jun 2017

Posted by raomk in AP, BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH Politics, Andhrapradesh, ap special asistance, ap special status, chandrababu naidu, Congress party, Rahul gandhi

ఎంకెఆర్‌

ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా పండే రొయ్య మీసాల పొడవు- విస్తృత ప్రచారం పొందిన చంద్రబాబు నాయుడి సీనియారిటీ గురించి ఎవరైనా విబేధిస్తే అంతకంటే అమాయకులు మరొకరు వుండరు. అయితే ఎవరూ వివాదం చేయకపోయినా ఈ మధ్యకాలంలో, తాజాగా తన సీనియారిటీ గురించి తానే చెప్పుకుంటున్న చంద్రబాబు గురించి ప్రస్తావన రాకుండా ఎలా వుంటుంది? అసలా అవసరం ఏమొచ్చిందన్నదే ప్రశ్న. తాను మారానని మూడో సారి పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో, అంతకు ముందు చంద్రబాబు చెప్పారు. చూస్తుంటే ఎప్పటి కెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సమతీ అన్న నీతి బాగా వంట పట్టించుకున్నట్లు తేలిపోయింది.

గుంటూరు సభలో రాహుల్‌ గాంధీ రాజకీయాల గురించి, రాష్ట్రం గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకు మోడీ భయం పట్టుకుందని విమర్శించారు. ఆ మాటకు వస్తే నరేంద్రమోడీ, చంద్రబాబు కూడా సభలలో తాము చెప్పదలచుకున్నవి చెప్పారు, అతి వినయం ప్రదర్శించి చేయాల్సిన నటన చేయలేదా, ఎవరు తక్కువ ? అలాగే రాహుల్‌ చెప్పిన మాటలు వినటమా లేదా, చేసిన విమర్శలను పట్టించుకోవటమా లేదా సూచనలను పాటించటమా లేదా అన్నది వేరే విషయం. తాను ఎవరికీ భయపడటం లేదని, దేశంలోనే సీనియర్‌ రాజకీయవేత్తను కనుక ఇప్పుడే రాజకీయాలు నేర్చుకుంటున్న వారు చెబితే వినేది లేదని చంద్రబాబు చెప్పాల్సిన పనేముంది. నిజానికి అది నరేంద్రమోడీకి ఎక్కడో మండే మాట. మరో విధంగా అలా అనటం అంటే జ్ఞాన ద్వారాన్ని మూసుకోవటమే. ఆ మాట అన్న తరువాత ఈగలు, చీమలు, దోమల మాదిరి అధికారం చుట్టూ మూగే ఇతర పార్టీల వారూ, తెలుగుదేశం పార్టీలోని సహచరులు, జూనియర్లు చెప్పిందానిని కూడా చంద్రబాబు ఎలా వింటారు. ఇప్పటికే ‘సీతయ్య నివాస్‌’ మాదిరి తెలుగు దేశం పార్టీలో అసలు అలా చెప్పే వాతావరణం ఎక్కడుంది. గతంలో ఒక్క పెదబాబే అనుకుంటే తండ్రికి తగ్గ తనయుడు చినబాబు కూడా తోడయ్యారు. దీంతో చంద్రబాబు తప్ప తెలుగుదేశంలోని సీనియర్లందరూ నారావారి కుటుంబంలో పుట్టబోయే వారికి అన్నలుగానూ పుట్టిన వారికి తమ్ములుగానూ మారిపోయారు. గతంలో పది సంవత్సరాలు ముఖ్య మంత్రిగా, మరో పది సంవత్సరాలు ప్రతిపక్షనాయకుడిగా చంద్రబాబు శైలిని దగ్గరగా చూసిన వారికి ఆయనకు సీనియారిటీతో నిమిత్తం లేకుండానే ఇతరులు చెప్పేదానిని పరిగణనలోకి తీసుకొనే తత్వం లేదన్నది బాగా తెలిసిందే. ఈ సందర్భంగా ప్రచారంలో వున్న మహాకవి కాళిదాసు గర్వభంగం కథను గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. సరస్వతి దేవి పెట్టిన పరీక్షలో సున్నా మార్కులు తెచ్చుకున్న కాళిదాసుకు కనువిప్పు కలగగానే విద్యతో వినయం వృద్ధి చెందాలి గాని అహంకారం కాదు నాయనా కీర్తి ప్రతిష్టల మాయలో పడిన నీ బుద్ధిని మార్చటానికే ఈ పరీక్ష అని దాహంతో వచ్చిన కాళిదాసుకు మంచినీరు ఇచ్చి అనుగ్రహిస్తుంది.

అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ, బయట ప్రతిపక్షాలకు తాను చెప్పటం తప్ప ఇతరులు చెప్పింది వినే అలవాటు లేదనే విమర్శలు వున్న చంద్రబాబు ఎవరూ చూడకుండా అయినా వేమన, సుమతీ శతకాలు ఒక్కసారి తిరగేసుకుంటే మంచిది.

వినదగు నెవ్వరు చెప్పిన,

వినినంతనే వేగపడక వివరింపదగున్‌,

గని కల్లనిజము లెరిగిన,

మనుజుడే పో నీతిపరుడుడు మహిలో సుమతీ

అన్న ప్రబోధ పద్యాన్ని చంద్రబాబు మరిచి పోయి వుంటారు.

మూడు సంవత్సరాల పాలనలో సున్నా మార్కులు తెచ్చుకున్న చంద్రబాబు వైఫల్యాన్ని ఎవరైనా ప్రస్తావిస్తే మండిపడుతున్నారు. తానే చెప్పుకున్నట్లు ఒక సీనియర్‌గా గోబెల్స్‌ ప్రచారంలో కూడా ఆయనను మించిన వారు లేరు. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజమై కూర్చుంటుందన్నది హిట్లర్‌ ప్రచార మంత్రి గోబెల్స్‌ సూత్రం. చంద్రబాబుకు గోబెల్స్‌ను మించిన బిజెపి తోడు కావటంతో ఇక చెప్పాల్సిందేముంది.

రాష్ట్ర విభజన సమయంలో వ్యతిరేకించింది ఒక్క సిపిఎం తప్ప మరొకపార్టీ లేదు.అందుకే ఆ పార్టీ దానికి ప్రత్యామ్నాయంగా ఫలాన వరం ఇవ్వాలని కోరలేదు. గతంలో అలా ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. అలా అడగటం అంటే విభజనను అంగీకరించినట్లే. ఆసుపత్రులలో పెద్ద ఆపరేషన్లు చేయాల్సి వచ్చినపుడు సంభవించే పర్యవసానాలకు అంగీకారం తెలుపుతూ రోగి లేదా సమీప బంధువుల సంతకాలతో లేఖలు తీసుకుంటారు. రెండు కళ్ల సిద్ధాంతం చెప్పి ఆంధ్రప్రదేశ్‌ కన్ను పొడవటానికి ఆమోదం తెలిపి ఒకటికి రెండు లేఖలు ఇచ్చింది చంద్రబాబు. ఆపరేషన్‌ చేసే వైద్యుడు కోరిన కత్తులు, కటార్లు అందించి సహకరించే సిబ్బంది మాదిరి ఆంధ్రప్రదేశ్‌ కన్ను పొడిచే సమయంలో పెద్ద ఎత్తున హడావుడి చేసి కాంగ్రెస్‌కు అన్ని విధాలుగా సహాయపడింది బిజెపి. తిరుపతి సభలో ప్రత్యేక హోదా గురించి వెంకన్న సాక్షిగా వాగ్దానం చేసింది నరేంద్రమోడీ. తరువాత దానిని తిరస్కరించిందీ ఆ పెద్ద మనిషే. మూడు సంవత్సరాల కాలంలో ఇన్ని జరిగితే వాటన్నింటినీ వదలి పెట్టి చంద్రబాబు నాయుడు కేవలం కాంగ్రెస్‌ మీదే ఎదురుదాడులకు దిగారు. రాష్ట్రానికి హాని చేయటంలో కాంగ్రెస్‌ పాత్ర ఎంతో బిజెపిదీ అంతే. హోదా బదులు ప్రత్యేక పాకేజీ ఇచ్చారని, దాని కంటే హోదా వలన అదనంగా వచ్చే ప్రయోజనమేమిటో చెప్పాలని కూడా చంద్రబాబు సవాలు విసురుతున్నారు. ఇప్పుడు సమస్య పాకేజి వలన కలిగిన ప్రయోజనం ఏమిటన్నదే, ఆ ప్రశ్నకు ఇంతవరకు ఆ పెద్ద మనిషి లేదా బిజెపి నేతలు గానీ నోరు విప్పటం లేదు.

ఏ పార్టీలో ఎంతకాలం వుంటారో, ఎప్పుడు ఏ పార్టీ మారతారో తెలియని విశ్వసనీయతలేని నాయకులతో తెలుగుదేశం పడవ నడుస్తోంది. అలాంటి పార్టీ నేతగా దానిని నిరూపించుకోవాలంటే ఇప్పటికైనా ఆయన చెప్పే కాంగ్రెస్‌ అడ్డగోలు రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ఎలా నష్టపోయిందో, ఆ నష్టాన్ని పూడ్చేందుకు మిత్రపక్షం బిజెపి ఇచ్చిన ప్రత్యేక పాకేజి కారణంగా వచ్చే లాభాలు ఏమిటో, తెలుగుదేశం పార్టీ చెప్పే న్యాయబద్ద విభజన కోసం తాము చెప్పిందేమిటో, చేసిందేమిటో ప్రభుత్వం తరఫున ఒక శ్వేత పత్రం ప్రకటించి వాస్తవాలు చెప్పటం తప్ప మరొక మార్గం లేదు. అదేమీ లేకుండా అడ్డగోలు రాజకీయాలు, దాడులు చేస్తే రాష్ట్ర ప్రజలకు పూచికపుల్ల ప్రయోజనం కూడా వుండదు. క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేస్తున్నారు. కానీ ఆ కాంగ్రెస్‌లో చివరి వరకు వుండి తెలుగు దేశం పడవలోకి ఎక్కిన నేతలను మాత్రం ఎలాంటి క్షమాపణ అడగకుండానే పార్టీలో చేర్చుకొని పదవులు ఇచ్చి అందలమెక్కించారు. అదే కాంగ్రెస్‌ నేతలు బిజెపిలో కూడా చేరి దానిని కూడా పునీతం చేశారు. తెలుగుదేశం సరసన కూర్చొని వారిపుడు ధర్మపన్నాలు వల్లిస్తున్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజెపికి కేంద్రంలో, రాష్ట్రంలో మిత్రపక్షంగా వున్నామని చంద్రబాబు చెబుతున్నారు. ఆ విషయాన్ని నొక్కి వక్కాణిస్తే ఆయనకే నష్టం. ఒక రాజకీయపార్టీ పట్ల మరొక రాజకీయ పార్టీ ఎలా వ్యవహరించాలనేది అది వారిష్టం.కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆని చెబుతున్నారు కనుక సాధించిన అదనపు ప్రయోజనాలేమిటో కూడా చెప్పాలి.ప్రతి ఏటా నవనిర్మాణ దీక్షలంటూ ప్రత్యర్ధులపై ఎదురుదాడులు తప్ప జనానికి సానుకూల అంశాలను వివరించిన పాపాన పోలేదు. కులం, మతం, ప్రాంతీయ భావనలను తలకెక్కించుకున్న జనంలోని ఒక తరగతి అటు కేంద్రం, ఇటు రాష్ట్ర వైఫల్యాల గురించి పట్టించుకోకపోవచ్చు. ఎల్లకాలం ఇదే పరిస్ధితి వుండదు. అటు బిజెపి తెలుగుదేశం పార్టీని ముందుగదిలో కూర్చో పెట్టి దాని ప్రత్యర్ధి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు వెనుక ద్వారం తెరిచింది. శ్రీకృష్డుడి రాజకీయం మాదిరి ముందుగ వచ్చితీవు, మున్ముందుగ అర్జునుడిని చూచితి నేను అన్నట్లుగా బిజెపి తనకు ఏది వాటంగా వుంటే అది చేసేందుకు పావులు కదుపుతోంది. చంద్రబాబు అస్త్రాలు తుప్పు పట్టటం లేదా ఒక్కొక్కటిగా మొద్దుబారి పనికి రాకుండా పోతున్నాయి. అవ్వతో వసంతమాడినట్లు కాంగ్రెస్‌ క్షమాపణలతో కాలక్షేపం చేస్తే కుదురుతుందనుకుంటే పొరపాటు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బాబరీ విధ్వంస కుట్ర కేసు విచారణ మధ్యంతర ఎన్నికలకు బాట వేయనుందా ?

19 Wednesday Apr 2017

Posted by raomk in AP, BJP, Communalism, Congress, Current Affairs, Gujarat, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Telangana

≈ Leave a comment

Tags

Guajarat., LOK SABHA, lok sabha midterm poles, Narendra Modi, Trial in Babri Masjid Case

Image result for babri masjid demolition

ఎం కోటేశ్వరరావు

గడువు ప్రకారం 2019లో జరగాల్సిన మన లోక్‌సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముందే జరుగుతాయా ? అన్న వూహాగానాలు చెలరేగుతున్న తరుణంలో బాబరీ మసీదు కూల్చివేత కుట్రకేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన కీలకమమైన తీర్పు మధ్యంతర ఎన్నికలను మరింత వేగిరం చేయనున్నాయా ? దీనికి తోడు బాబరీ మసీదు కూల్చివేత లో కుట్రపూరిత నేరారోపణ నుంచి ఎవరికీ మినహాయింపు ఇవ్వనవసరం లేదని, రెండు సంవత్సరాలలోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అందువలన దాన్నింక వాయిదా వేయటానికి వీలులేదు. ఇప్పుడున్న స్ధితిలో ఆ కేసులో వచ్చే తీర్పు ఎలా వుంటుందనేదాని కంటే బిజెపి అగ్రనాయకులపై విచారణ జరపాలని కోర్టు చెప్పటమే రాజకీయంగా బిజెపికి తొలి చెంపపెట్టు. కరసేవపేరుతో బాబరీ మసీదు కూల్చివేత వాస్తవం. అందుకు పధకం రూపొందించిన వారి బండారాన్ని బయట పెట్టటం, కూల్చివేసిన వారిని శిక్షించటం రాజ్యధర్మం. వీటన్నింటి పూర్వరంగంలో తమ విధానాలను మరింత గట్టిగా అమలు జరపాలంటే మరింత బలం కావాలని, స్పష్టమైన తీర్పు ఇవ్వాలనో మరొక సాకుతోనో కమల దళపతులు కొత్త పల్లవి అందుకోనున్నారా ?

1971 పార్లమెంట్‌ ఎన్నికలలో అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావటంతో ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని, ఆమె ఆరు సంవత్సరాల పాటు పోటీ చేయాటానికి అనర్హురాలని 1975 జూన్‌ 12న అలహాబాద్‌ కోర్టు తీర్పు అదే నెల 26న దేశంలో అత్యవసర పరిస్ధితి విధింపునకు దారి తీసిన విషయం తెలిసిందే. బాబరీ మసీదు కూల్చివేత కుట్ర కేసు అలాంటి పరిణామానికి దారితీసే అవకాశం లేదు. అయితే సరిగ్గా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు గనుక కోర్టు తీర్పు వెలువడితే, అది బిజెపి నేతలను నిందితులుగా నిర్దారిస్తే పరిణామాలు ఎలా వుంటుంది అన్నది ఆసక్తికరం. దాని కంటే ముందు ప్రజాస్వామ్య విలువలకు పెద్ద పీట వేస్తానని చెప్పే నరేంద్రమోడీ తన రాజధర్మాన్ని ఎలా పాటిస్తారు అన్నది తేల నుంది. ఒక కేసులో నిందితులుగా విచారణ ఎదుర్కొనేవారు అధికార పదవులలో కొనసాగవచ్చా ? కేంద్ర మంత్రి వుమా భారతిని మంత్రిగా వుంచుతారా లేక తొలగిస్తారా ? ఒక వేళ కొనసాగిస్తే అలాంటి ఇతరుల గురించి బిజెపి నోరు మూతపడాల్సి వుంటుంది. రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రచారంలోకి వచ్చిన లేదా తెచ్చిన అద్వానీకి కోర్టు నిర్ణయం పిడుగువంటిదే. బాబరీ మసీదు కూల్చివేత ఘటనతో తాత్కాలికంగా అయినా మధ్యతరగతిలో అనేక మంది బిజెపికి దూరమయ్యారు. పాతిక సంవత్సరాల తరువాత కేసు తీర్పు కుట్రను నిర్ధారిస్తే అదే పునరావృతం అవుతుందా అన్నది ప్రశ్న. అదే మధ్యతరగతి ఇటీవలి కాలంలో మోడీ మోజుతో తిరిగి బిజెపి వైపు చేరింది. కుట్ర నిజమే అని ఒక వేళ కోర్టు నిర్ధారిస్తే ఇప్పుడున్న స్ధితిలో హిందూత్వ శక్తులు మరింతగా రెచ్చిపోవచ్చు. లేదని వస్తే చూశారా మేము ఎలాంటి కుట్ర చేయలేదు, ప్రజలే కూల్చి వేశారని అమాయకపు ఫోజు పెట్టవచ్చు. కాంగ్రెస్‌తో సహా అన్ని పాలకవర్గ పార్టీలు ఓట్ల కోసం మతోన్మాదంపై అంత కరకుగా వుండటం లేదు. బిజెపి మాదిరి మెజారిటీ, మైనారిటీ మత ప్రభావిత ఓట్ల కోసం సంతుష్ట రాజకీయాలకు పాల్పడుతున్నాయి. బిజెపికి బీ టీములుగా తయారవుతున్నాయి.అయితే దేశ వ్యాపితంగా తమ పాలన సాగాలని కోరుకుంటున్న బిజెపి కోర్టు తీర్పు ఎలా వచ్చినా నిండా మునిగిన తమకు ఇంకా చలేమిటనే వైఖరితో రిస్కు తీసుకుంటుందా ? అది చెప్పే హిందూత్వలో ఇమడలేని వారు మన దేశంలో మైనారిటీలు, దళితులు, గిరిజనులు 40 కోట్ల మంది వరకు వున్నారు. అంత మంది ఓట్లు లేకుండా ఏ పార్టీ అయినా దేశవ్యాపితంగా అన్ని రాష్ట్రాలలో అధికారాన్ని ఎలా సాధించగలుగుతుంది.

రాజకీయ నాయకుల మాటలకు అరా&థలే వేరులే అని బ్రిటన్‌ ప్రధాని థెరేసా మే రుజువు చేశారు. 2020 వరకు గడువున్న తమ పార్లమెంట్‌ను రద్దు చేయాల్సిన అగత్యం లేదంటూ నమ్మబలికిన థెరెస్సా మే ఆకస్మికంగా జూన్‌ ఎనిమిదిన ఎన్నికలు జరపనున్నట్లు ప్రకటించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం నిర్ణీత గడువులోపల పార్లమెంట్‌ను రద్దు చేయటానికి వీలులేదు. ఏదో ఒక ప్రభుత్వం కొనసాగాల్సిందే. అయితేనేం చట్టమన్నతరువాత లొసుగు లేకుండా వుండదన్నట్లు మూడింట రెండు వంతుల మంది ఎంపీల మద్దతు వుంటే రద్దు చేయవచ్చన్న అవకాశాన్ని వుపయోగించుకొని ఆమేరకు పార్లమెంట్‌లో ఒక తీర్మానం చేయనున్నారు. పోయేదేముంది అవకాశం వుస్తుందేమో అని ఎదురు చూసే ప్రతిపక్షం లేబర్‌ పార్టీ కూడా అందుకు సై అంది. అందువలన లాంఛనంగా పార్లమెంట్‌ రద్దు, ఎన్నికలు జరగాల్సి వుంది. నిజానికి బ్రిటన్‌ కన్సర్వేటివ్‌ ప్రభుత్వానికి ఆకస్మికంగా వచ్చిన ముప్పేమీ లేదు, నాయకత్వాన్ని సవాలు చేసే వారు కూడా లేరు. బ్రెక్సిట్‌ కారణంగా తన విధానాలను పక్కాగా అమలు జరపాలంటే తాజా ప్రజాతీర్పు కోరటం అవసరమని ప్రధాని థెరెస్సా ప్రకటించారు. ఏ వంకా లేకపోతే డొంకట్టుకు ఏడ్చారన్న సామెత వూరికే పుట్టలేదు. బ్రిటన్‌ ఆర్ధిక వ్యవస్ధ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్ధితినుంచి తప్పించుకొనేందుకు ఇదొక ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఆమె ఏ విధానాలను అమలు జరిపినా మద్దతు ఇచ్చే పాలక పార్టీకి సంపూర్ణ మద్దతు వున్నప్పటికీ ఎన్నికలకు తెరతీశారు.

మన దేశంలో కూడా గడువు ప్రకారమే ఎన్నికలంటూ గంభీరంగా నేతలు ప్రకటనలు చేస్తున్నప్పటికీ నిప్పులేనిదే పొగరాదన్నట్లుగా అధికారంలో వున్న పార్టీలలో కనిపిస్తున్న పరిణామాలు, ఇతర అంశాలను చూస్తే జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఏ అంశాలు ఇటువంటి వూహాగానాలకు తావిస్తున్నాయో చూద్దాం. తెలంగాణాలో చంద్రశేఖర రావు వివిధ కార్పొరేషన్లకు, ఇతర పదవులను తన పార్టీవారితో నింపటం, వివిధ కులాల వారిని బుజ్జగించేందుకు తాయిలాలు ప్రకటించటం, రిజర్వేషన్ల పెంపుదలకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశ నిర్వహణ, ప్రత్యర్ధి రాజకీయపార్టీలపై అధికారపక్ష దాడి తీవ్రతరం వంటి వన్నీ కొన్ని సూచనలు. అటు ఆంధ్రప్రదేశ్‌లో కొంత మంది దెప్పి పొడుస్తున్నట్లుగా జయంతికి, వర్ధంతికి కూడా ఇంకా తేడా తెలియని కుమారుడికి చంద్రబాబు నాయుడు అమాత్యపదవి కట్టబెట్టటం, మంత్రివర్గ విస్తరణ ఎన్నికల కోసమే అన్నది విశ్లేషకుల అభిప్రాయం.

ఇటీవలనే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి.వాటిలో బిజెపి, దాని మిత్రపక్షం అకాలీదళ్‌ పంజాబ్‌లో ఘోరపరాజయాన్ని చవిచూశాయి. గోవాలో అధికారంలో వున్న బిజెపి ఓడిపోయింది. వుత్తరాఖండ్‌లో మాత్రమే బిజెపి విజయం సాధించింది. వుత్తర ప్రదేశ్‌లో విజయం సాధించింది, మణిపూర్‌లో ఓడిపోయింది. సాంకేతికంగా 2017లో గడువు ముగిసే అసెంబ్లీలు లేనప్పటికీ 2018లో ఏడు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడాల్సి వుంది. వాటిలో హిమచల్‌ ప్రదేశ్‌లో జనవరి ఏడు, గుజరాత్‌లో జనవరి 22, మేఘాలయలో మార్చి ఆరు, నాగాలాండ్‌లో మార్చి 13, త్రిపురలో మార్చి 14, మిజోరంలో మార్చి 15, కర్ణాటకలో మే 28వ తేదీతో అసెంబ్లీల గడువు ముగుస్తుంది కనుక ముందుగానే ఎన్నికలు జరగాలి. మరుసటి ఏడాది లోక్‌సభ ఎన్నికలు, మరికొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి వుంది. ఈ పూర్వరంగంలో అన్ని రాష్ట్రాల అధికారంలో పాగావేయాలన్నది బిజెపి ఎత్తుగడ. అయితే గత ఎన్నికల ఫలితాలు, పర్యవసానాలను చూసినపుడు బిజెపి పరిస్థితి నల్లేరు మీద బండిలా సాగుతుందా అన్నది చూడాల్సి వుంది.

దేశ ఆర్ధిక స్ధితిని చూస్తే మోడీ సర్కార్‌ మూడు సంవత్సరాలలో సాధించినదాని గురించి అధికార, ప్రయివేటు మీడియా దన్నుతో సంబరాలు చేసుకోవచ్చుగాని సామాన్యుల జీవితాలను ప్రభావితం చేసిన ఒక్క అంశం కూడా లేదన్నది విశ్లేకుల అభిప్రాయం. ధరల పెరుగుదలలో మార్పు లేదు, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో పురోగతి లేదు, ఎగుమతులు పడిపోయాయి, దిగుమతులు పెరిగాయి. సర్వరోగ నివారిణి జిందాతిలిస్మాత్‌ అన్నట్లు గత మూడు సంవత్సరాలుగా కేంద్రీకరించిన వస్తు, సేవల పన్ను చట్టం జూలై నుంచి అమలులోకి రానుంది. దాంతో మొదట ధరలు పెరుగుతాయని, తరువాత జనానికి ఫలితాలు అందుతాయని పాలకపార్టీతో పాటు, దాని సమర్ధకులు వూదరగొడుతున్నారు. అంటే మొరటుగా చెప్పాలంటే ముందు నీ గోచి పాతను కూడా పోగొట్టుకుంటావు తరువాత పట్టుపంచలు పొందుతావు అన్నట్లుగా వుంది. ముందు ధరలు పెరగటం ఏమిటో తరువాత తగ్గటం ఏమిటో, ఇది ఏ పాఠశాల ఆర్ధశాస్త్రపాఠమో ఎవరూ చెప్పరు. ఒకసారి పెరగటం ఎందుకు తరువాత తగ్గటం ఎందుకు ? మానవ జాతి చరిత్రలో ఏ దేశంలో అయినా ఒకసారి పెరిగిన ధరలు తగ్గిన వుదాహరణ వుందా ? అందువలన అధికారం తప్ప మరొకటి పట్టని బిజెపి పెరిగిన ధరల మధ్య మోడీ పాలనలో దేశం వెలిగిపోతోంది అని చెప్పుకోజాలదు. కనుక ధరల సెగ జనానికి పూర్తిగా సోకక ముందే మరోసారి నాకు ఓటేస్తే ఇంకా మంచి రోజులు తెస్తానని గడువుకు ముందే ఎన్నికల ప్రకటన చేసి నరేంద్రమోడీ జనం ముందుకు వెళతారన్నది ఒక విశ్లేషణ.

పూర్వసామెత ప్రకారం ఆరునెలలు సాము గరిడీలు చేసి కనీసం ఓటి కుండలు పగలగొట్టిన ‘ప్రతిభావంతుల’ గురించి మాత్రమే విన్నాం. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని వెలికి తీస్తానని చెప్పిన నరేంద్రమోడీ ఆరునెలలు గడిచిపోతున్నా రద్దు చేసిన పెద్ద నోట్లలో ఎంత మొత్తం తిరిగి వచ్చిందీ, ఎంత డబ్బు రాలేదు, ప్రభుత్వానికి ఎంత లబ్ది కలిగిందీ అన్న విషయాలేవీ ఇంతవరకు చెప్పలేదు. నరేంద్రమోడీకి నల్లధనం తేలు కుట్టింది కనుక మిన్నకున్నారా ? పెద్ద నోట్ల రద్దుతో కాశ్మీరుతో సహా దేశమంతటా తీవ్రవాద వెన్ను విరిచామని చెప్పారు. రాళ్లు విసురుతున్న ఘటనలు ఆ కారణంగానే తగ్గాయన్నారు. అన్ని చెప్పిన ఐదు నెలల తరువాత తమ రక్షణ వలయంగా ఒక యువకుడిని జీపుకు కట్టి వీధులలో రక్షణ పొందిన మిలిటరీ వుదంతం గతంలో ఎన్నడూ లేదంటే బిజెపి విధానాలు విజయవంతమైనట్లా కాశ్మీరులో పరిస్థితులను మరింత దిగజార్చి నట్లా ? ఎన్నికలలో చెప్పిన గుజరాతు నమూనా పాలన, ప్రగతి ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో వున్నాయి. ఇవి జనంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీయక ముందే ఓట్లను కొల్లగొట్టే పని పూర్తి చేసుకోబోతున్నారా ?

పార్లమెంటు ఎన్నికల తరువాత ఢిల్లీ, బీహారులో సంభవించిన పరాభవం తరువాత జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల గురించి బిజెపి ఎన్నో గొప్పలు చెప్పుకోవచ్చు. 2012 పంజాబు అసెంబ్లీ ఎన్నికలలో అకాలీదళ్‌-బిజెపి కూటమికి 34.59,7.15 చొప్పున మొత్తం 41.64 శాతం ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెసుకు 39.92 శాతం వచ్చాయి. 2014 పార్లమెంటు ఎన్నికలలో అకాలీ-బిజెపి కూటమికి 26.3, కాంగ్రెసుకు 33.1, కొత్తగా వచ్చిన ఆమాద్మీ పార్టీకి 24.4 శాతం వచ్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీలకు వరుసగా 25.2, 38.5, 23.7 శాతం చొప్పున వచ్చాయి. మోడీ మాయలు, మంత్రాలు ఇక్కడ పని చేయలేదు.

ఘనవిజయం సాధించామని చెప్పుకుంటున్న వుత్తర ప్రదేశ్‌ వివరాలు చూద్దాము. 2012 ఎన్నికలలో అధికారానికి వచ్చిన సమాజవాది పార్టీకి 29.15, రెండో స్ధానంలో వున్న బిఎస్‌పికి 25.91, బిజెపికి 15, కాంగ్రెస్‌కు 11.63 శాతం ఓట్లు వచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికలలో వరుసగా ఈ పార్టీలకు 22.2, 19.6, 42.3, 7.5 చొప్పున వచ్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలిపి ఎస్‌పి కూటమికి 28, బిఎస్‌పి 22.2, బిజెపి కూటమికి 41.4శాతం వచ్చాయి. ప్రతిపక్ష ఓట్ల చీలిక కారణంగా పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. నిజంగా దేశంలో మోడీ గాలి వీస్తుంటే పెద్ద నోట్ల రద్దు వంటి ప్రయోగం అంతగా విజయవంతమైతే బిజెపి ఓట్లెందుకు తగ్గినట్లు ? గోవాలో బిజెపి అధికారంలో వుండి ఓడిపోయింది. తనపై గెలిచిన కొందరు ఎంఎల్‌ఏలకు ఎర చూపి తిరిగి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయటం వేరే విషయం. అక్కడ ఎంజిపితో కలసి 2012లో పోటీ చేసిన బిజెపి కూటమికి 41.7 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 30.78 శాతం ఓట్లు వచ్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓట్ల శాతం 32.5, కాంగ్రెస్‌ ఓట్లు 28.4 శాతానికి తగ్గినా బిజెపి సీట్లు కోల్పోగా కాంగ్రెస్‌ పెంచుకుంది. విడిగా పోటీ చేసి పదకొండుశాతం ఓట్లు తెచ్చుకున్న ఎంజిపికి మూడు సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు ఎంఎల్‌ఏలను ఫిరాయింప చేసి మిగిలిన చిన్న పార్టీలన్నింటినీ కూడగట్టి బిజెపి అడ్డదారిలో అధికారాన్ని పొందింది.

అందువలన పైకి ఎంత గంభీరంగా మాట్లాడినా ఓట్ల లెక్కలు బిజెపికి అనుకూలంగా లేవన్నది స్పష్టం. ఈ ఏడాది చివరిలో జరగాల్సిన గుజరాత్‌ ఎన్నికలు బిజెపికి ఒక పరీక్ష వంటివి. ఎందుకంటే అక్కడ ఓట్లు చీలే అవకాశం లేదు. మోడీ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తరువాత అక్కడ జరిగిన స్ధానిక సంస్ధ ఎన్నికలలో పట్టణాలలో బిజెపి గెలిచినా గ్రామీణ జిల్లా పంచాయతీలలో బోర్లా పడింది. కాంగ్రెస్‌ అనేక విజయాలు సాధించింది. అందువలన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓడిపోయినా లేక ఇప్పుడున్నదాని కంటే సీట్లు తగ్గినా నరేంద్రమోడీ గాలి తుస్సుమనటం ఖాయం. అందువలన గుజరాత్‌తో పాటే లోక్‌సభ ఎన్నికలను రుద్దే అవకాశాలే ఎక్కువగా వున్నాయి.

బిజెపి సర్కార్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మేకిన్‌ ఇండియా, ఐదు సంవత్సరాలలో రైతుల ఆదాయాల రెట్టింపు వంటివి నినాదాలుగానే మిగిలిపోయాయి. ఇలా ఏ రంగంలో చూసినా ఎదురు దెబ్బలు తప్ప సానుకూల పరిణామాలు లేని స్ధితిలో ఐదేండ్లూ కొనసాగితే ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత పెరగటం అని వార్యం. అందుకే ఏదో ఒకసాకుతో మధ్యంతర ఎన్నికలను దేశం మీద రుద్దనున్నారనే అభిప్రాయం కలుగుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సిఎం చంద్రబాబుకు జర్నలిస్టుల సమస్యలు వినేతీరిక లేదా ?

30 Thursday Mar 2017

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, STATES NEWS

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, APWJF, chandrababu naidu, journalists, journalists problems

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, తెలుగు దేశం నాయకులకు నిత్యం జర్నలిస్టులు లేనిదే గడవదన్నది తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల సమాఖ్య(ఎపిడబ్ల్యుజెఎఫ్‌) తాజాగా ముఖ్యమంత్రికి రాసిన ఒక బహిరంగలేఖలోని అంశాలను చూస్తే గత మూడు సంవత్సరాలలో జర్నలిస్టులతో మాట్లాడటం తప్ప జర్నలిస్టుల సమస్యల గురించి వారివైపు నుంచి వినలేదన్నది స్పష్టం అవుతోంది. జర్నలిస్టులు కూడా రాష్ట్ర ప్రజానీకంలో భాగమే. అయినపుడు వారి గురించి ఎందుకు పట్టించుకోవటం లేదు ? మీడియా సంస్ధల యజమానుల సంక్షేమం చూస్తే తనకు కావాల్సిన, రావాల్సిన రీతిలో ప్రచారం దొరుకుతుందనే ధీమానా? ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అందుకే వారి లేఖ పూర్తి పాఠం ఇస్తున్నాం.

సామాజిక మీడియాలో పని చేస్తున్న నేను, మీరు అందరం జీతం భత్యం, వేళాపాళా లేకుండా మనకు తెలియని యజమానులకు విపరీత లాభాలు తెస్తూ స్వచ్చందంగా పని చేస్తున్నాం. రాష్ట్రం, దేశంలోని ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా యజమానులు కూడా తమ సంస్ధలలో పని చేస్తున్న వారికి చట్టప్రకారం ఇవ్వాల్సిందిఇవ్వకుండా, అసలు చట్టాలతోనే పని లేకుండా ఇష్టా రాజ్యంగా వుంటున్నారనే విషయం మనలో చాలా మందికి తెలియదు. అందుకే వారి సమస్యలేమిటో చూడండి, స్పందించండి.

శ్రీ నారా చంద్రబాబునాయుడు,                                                    ది: 30-03-2017

గౌరవనీయ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల సమాఖ్య (ఎ.పి.డబ్ల్యు.జె.ఎఫ్‌) తరఫున ముందుగా మీకు తెలుగు సంవత్సరాది హేవళంబి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోయి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తోంది. త్వరితగతిన రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం వ్యక్తిగతంగా మీరు, ప్రభుత్వం చేస్తున్న కృషి తక్కువేమీ కాదు. అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర కార్యకలాపాలన్నింటినీ ఈ నేల నుంచి కొనసాగించేందుకు చేస్తున్న మీ ప్రయత్నానికి ఫెడరేషన్‌ మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తోంది. అదేవిధంగా నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో ఫెడరేషన్‌ మా వంతు కృషిని నిర్వహిస్తుందని తెలియజేస్తున్నాం.

నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో భాగంగా మీడియా రంగం అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచేందుకు వీలుగా ప్రభుత్వం కృషి చేయాలని అభిలషిస్తున్నాం. ఇప్పటివరకు అన్ని దినపత్రికలకు సంబంధించిన ప్రచురణ కేంద్రాలు విజయవాడ కేంద్రంగా నడుస్తున్నాయి. కేంద్ర కార్యాలయాలు హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ క్రమంగా ఇక్కడ విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ మీడియాకు సంబంధించి అన్నీ హైదరాబాద్‌ నుంచే పనిచేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క ఛానల్‌ చర్చా కార్యక్రమాలు ఇక్కడి నుంచి చేస్తున్నాయి. ప్రభుత్వం అందించే తోడ్పాటుతో అతి త్వరలోనే అన్ని కార్యకలాపాలు ఇక్కడి నుంచి కొనసాగే కాలం మరెంతో దూరంలో లేదు.

ఈ సందర్భంగా జర్నలిస్టులకు సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అవి అమలవుతున్న తీరుతో పాటు జర్నలిస్టుల ముందున్న సమస్యలను మీ దృష్టికి తీసుకురాదలచి ఈ బహిరంగలేఖ రాస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల సమాఖ్య (ఎ.పి.డబ్ల్యు.జె.ఎఫ్‌) మహాసభలో, కౌన్సిల్‌ సమావేశాల్లో చర్చకు వచ్చిన అనేక అంశాలివి.

జర్నలిస్టులకు ఆరోగ్య బీమా

కొత్త రాష్ట్రంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రజల్లో భాగంగా జర్నలిస్టులు కూడా నవ్యాంధ్ర నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటు అనంతరం జర్నలిస్టుల కోసం ఆరోగ్య బీమా పథకాన్ని మీ చేతుల మీదుగా ప్రవేశపెట్టింది. ప్రభుత్వోద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు 1250 రూపాయలు వాటాధనంగా చెల్లిస్తే వైద్య సదుపాయం కల్పిస్తూంది. ఈ పథకం అమలు సమీక్షించేందుకు ఒక కమిటీ వేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. పథకం అమలు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో అమలు కావడం లేదు. లివర్‌, డెంటల్‌, సాధారణ జ్వరం తదతర అనేక రుగ్మతలు ఈ జాబితాలో లేవు. దీనివల్ల ఈ పథకం పట్ల జర్నలిస్టుల్లో సానుకూల స్పందన లేదు. పథకం అమలు తీరు పర్యవేక్షించేందుకు కమిటీ వేయాల్సి ఉన్నా ఇప్పటివరకు కమిటీ నియమించలేదు.

సమగ్ర బీమా పథకం

జర్నలిస్టులకు తమ వాటాగా 250 రూపాయలు చెల్లిస్తే 10 లక్షల రూపాయల సమగ్ర బీమా పథకం అమలవుతోంది. నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ద్వారా ఈ పథకం అమలవుతోంది. ఈ పథకం వల్ల లభించే ప్రయోజనాల గురించిన సమాచారం గ్రామీణ స్థాయి వరకు జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో తెలుస్తున్న పరిస్థితి లేదు. ఈ పథకం అమలు తీరును సమీక్షించేందుకు ఎలాంటి ఏర్పాటు లేదు.

జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు

ప్రభుత్వం రాష్ట్రస్థాయి అక్రిడిటేషన్‌ కమిటీతో పాటు జిల్లా కమిటీలు నియమించింది. అందులో వివిధ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించింది. అందుకు కృతజ్ఞతలు. రాష్ట్ర అక్రిడిటేషన్‌ కమిటీ సిఫారసు చేసిన యేడాదికి గాని సబ్‌ ఎడిటర్లకు అక్రిడిటేషన్లు కొన్ని పరిమితులతో ఇచ్చారు. కానీ వారికి ఆరోగ్య బీమా కార్డులు ఇవ్వలేదు. అలాగే పలక్ట్రానిక్‌, కేబుల్‌ మీడియాలో జర్నలిస్టు పనిచేసే వారందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వలేదు. ఇవి చాలా పరిమిత సంఖ్యలోనే ఉంటాయి. అయినా ఇప్పటివరకు వారి విషయం తేలలేదు. అన్నింటినీ మించి అక్రిడిటేషన్ల జారీకి సంబంధించి జారీ చేసిన జీవో పాతది. దానికి జతగా అనేక మార్పులు, చేర్పులు చేస్తూ రూపాంతరం చెందిన ఆ జీవోను సమూలంగా మార్చి ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణమైన సమగ్ర జీవోను తీసుకురావడం తక్షణ అవసరం.

దాడుల నివారణకు హైపవర్‌ కమిటీ

జర్నలిస్టులపై దాడులను నివారించేందుకు వీలుగా రాష్ట్ర స్థాయి హైపవర& కమిటీని ప్రభుత్వం నియమించింది. ఇటీవలకాలంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయి. ఇసుక మాఫియా చేతుల్లో కృష్ణ, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో దాడులు జరిగాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆంధ్రప్రభ విలేకరి శంకర్‌ను హత్యచేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ టివి 99 విలేకరిపై దాడి చేశారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్యే సోదరుడు ఆమంచి స్వాములు తన అనుచరులతో బాస అనే పత్రిక విలేకరి నాగార్జునరెడ్డిపై పట్టపగలు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట పాశవికంగా దాడి చేశారు. దానికి తోడు అతనిపై అక్రమంగా ఎస్‌.సి, ఎస్‌.టి అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇవికాక అనేక జిల్లాల్లో జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలు అనేకం. వీటన్నింటిపై చర్యలు తీసుకుని జర్నలిఅ్టల మనోస్థైర్యాన్ని పెంపొందించేందుకు వీలుగా హైపవర్‌ కమిటీ పనిచేయాలి. జిల్లాస్ణాయి కమిటీలు ఏర్పాటు కావాలి. ఆయా కమిటీలు నామమాత్రపు కమిటీలుగా కాక సమస్య పరిష్కారానికి వేదిక కావాలి. అందుకు వీలుగా ఆ కమిటీలను పరిపుష్టం చేయాలి. జర్నలిస్టులపై దాడులు జరగకుండా నివారించేందుకు వీలుగా చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం తగిన నిర్ణయిం తీసుకోవాలి. దాడులలో నష్టపోయిన, సర్వం కోల్పోయిన జర్నలిస్టులను ఆదుకునేందుకు వీలుగా శాశ్వత సహాయం అందజేసేందుకు ఒక నిర్దిష్ట కార్యాచరణ రూపొందించాలి. జర్నలిస్టులు పొరపాట్లు, తప్పులు చేసిన సందర్భంలో వారిపై చట్టపరంగా చర్యతీసుకునేందుకు అవకాశాలున్నప్పటికీ అందుకు భిన్నంగా దాడులకు పాల్పడడం మొత్తంగా మీడియాను భయభ్రాంతం చేయాలని చూడడంగానే భావించి అటువంటి చర్యలను నివారించేందుకు ప్రయత్నించాలి.

జర్నలిస్టుల సంక్షేమ నిధి

జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిధిని ఏర్పాటుచేసింది. ఈ పథగం ద్వారా జర్నలిస్టులకు, వారి కుటుంబసభ్యులకు ఆర్ధిక సహాయం అందజేస్తారు. మూడేళ్లుగా ఈ నిధి పర్యవేక్షణకు కమిటీని నియమించలేదు. దీనివల్ల సహాయం పొందాలనుకునే జర్నలిస్టులకు ఆ సదుపాయ, లేకుండా పోయింది. ఈ కమిటీ నిబంధనలను కొన్ని దశాబ్దాల క్రితం రూపొందించారు. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నిబంధలను మార్పుచేయాల్సి ఉంది. అలాగే సంక్షేమ నిధి మొత్తాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఈ నిధి నిర్వహణకు విధి విధానాల రూపకల్పనతో పాటుగా సంక్షేమ నిధి కమిటీని కూడా తక్షణమే నియమించాలి.

పెన్షన్‌ పథకం

జర్నలిస్టులకు దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెన్షన్‌ పథకం అమలవుతోంది. మన రాష్ట్రంలో చాలా యేళ్లుగా కోరుతున్నప్పటికీ ఒక నిర్ణయం తీసుకోలేదు. అన్ని దక్షిణాది రాష్ట్రాలతో పాటు అస్సాం లాంటి రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. రాష్ట్రంలోని జర్నలిస్టులకు పెన్షన్‌ పథకం అమలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఒక కమిటీని నియమించి దేశంలోని పరిస్థితిని అద్యయనం చేసి పెన్షన్‌ పథకాన్న రూపొందించడం అవసరం.

ఇళ్లస్థలాల కేటాయింపు

జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపు సంబంధించి అనేక జిల్లాల్లో చాలా యేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. స్థలాల కేటాయింపునకు ప్రత్యేకంగా ప్రభుత్వ ఉత్తర్వు లేకపోవడం వల్ల ఈ సమస్య కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు బలహీనవర్గాలకు కేటాయించే కోటాలో ఇస్తున్నప్పటికీ సొసైటీల ద్వారా స్థలం పొందాలనుకునే జర్నలిస్టులు ఎక్కువమంది ఉన్నారు. కాబట్టి వివాదాలకు ఆస్కారం లేకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్లస్తలాలు కేటాయించేందుకు వీలుగా ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకువచ్చి సొసైటీల ద్వారా స్థలాలు పొందే ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే కొన్ని చోట్ల చివరిదాకా వచ్చిన సొసైటీలు కేటాయింపు దశలో ఆగినవి ఉన్నాయి. వాటిని కేటాయించాల్సి ఉంది. అలాంటి సొసైటీ విజయవాడలో ఉంది. విశాఖపట్నంలో సొసైటీకి స్థలం కేటాయించినప్పటికీ పొజిషన్‌ ఇవ్వని పరిస్థితి ఉంది. విజయవాడలో ప్రైవేట్‌గా జర్నలిస్టులు కొనుక్కున్న స్థలాన్ని అభివృద్ది పరుచుకునేందుకు వీలుగా నిధులు కేటాయించాల్సి ఉంది.

ఎలక్ట్రానిక్‌ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు భరోసా

ఎలక్ట్రానిక్‌ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు, ఇతర సిబ్బందికి సంబంధించి వర్కింగ్‌ జర్నలిస్టు చట్టం అమలుకు నోచుకోవడం లేదు . ఆ చట్ట పరిధిలోకి ఎలక్ట్రానిక్‌ మీడియాను తీసుకువచ్చేందుకు వీలుగా ప్రభుత్వ చొరవ చూపాల్సి ఉంది. వర్కింగ్‌ జర్నలిస్టుల చట్టాన్ని అందుకు అనుగుణంగా సవరించేందుకు తగిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. అదేవిధంగా అనేక ఛానళ్లలో ఉద్యోగ భద్రత పంతమాత్రం లేని పరిస్థితి నెలకొంది. ఉద్యోగ భద్రతకు వీలుగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.

మీడియా అకాడెమీ ఏర్పాటు

ప్రభుత్వం ప్రెస్‌ అకాడెమీని ఏర్పాటు చేయడంలోనే జాప్యం చేసింది. చైర్మన్‌ను మాత్రం నియమించి గవర్నింగ్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో మీడియా విస్తృతిని దృష్టిలో పెట్టుకుని ప్రెస్‌ అకాడెమీని మీడియా అకాడెమీగా ఏర్పాటుచేయాలి. రాష్ట్రంలో ఉన్న అన్నిరకాల మీడియాను ఒకే సంస్థ పరిధిలోకి తీసుకురావాలి. ఆ సంస్థ మీడియాలో పనిచేస్తున్నవారికి, మీడియాలో ప్రవేశించాలనుకునేవారికి ఉపయోగపడే సంస్థగా రూపుదిద్దాలి. వృత్తినైపుణ్యాన్ని మెరుగుపెట్టేందుకు వేదికగా ఉండాలి. పరిశోధనా కేంద్రంగా ఎదిగేందుకు వీలయిన రీతిలో ఆ సంస్థ కార్యకలాపాలు సాగాలి.

పత్తాలేని జర్నలిస్టు అవార్డులు

జర్నలిస్టుల పేరిట ప్రతియేటా అవార్డులను ప్రభుత్వం ఇస్తోంది. ఈ మూడు సంవత్సరాల కాలంలో ఒక్క యేడాది కూడా అవార్డులు ఇవ్వలేదు. ఇప్పటికైనా అవార్డులు ఇచ్చే ఏర్పాటు చేయాలి. హైకోర్టు అవార్డుల విషయంలో ఇప్పటికే ఒక తీర్పు ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రకటించి ఇవ్వని అవార్డుల విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎనిమిది వారాల్లో అవార్డులు అందజేయాలని కోరింది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించడం లేదు. గతంలో ప్రకటించిన అవార్డులను వెంటనే ఇచ్చే ఏర్పాటు చేయాలి.

వేతన సిఫారసుల అమలు

పత్రికా రంగంలో పనిచేసే జర్నలిస్టులకు జస్టిస్‌ గురుభక్ష్‌ మజీతియా వేతన సిఫారసులను అన్ని యాజమాన్యాలు అమలు చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు జర్నలిస్టులు, సిబ్బంది పక్షాన తీర్పు ఇచ్చినప్పటికీ అమలు చేయడం లేదు. జిల్లా కేంద్రం నుంచి గ్రామీణ స్థాయి వరకు పనిచేస్తున్న జర్నలిస్టులకు వేతన సిఫారసుల అమలు చేయాల్సిన యాజమాన్యాలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని యాజమాన్యాలు తక్కువ మంది సిబ్బంది ఉన్నట్టు చూపిస్తే మరికొన్ని యాజమాన్యాలు గ్రామీణ ప్రాంత విలేకరుల నుంచి ప్రకటనల సేకరణ పేరిట, సర్క్యులేషన్‌ పేరిట ఎదురు వసూలు చేస్తున్న పరిస్థితి. వేతన సిఫారసుల అమలు కోసం ప్రభుత్వం త్రైపాక్షిక కమిటీని నియమించింది. అందులో యాజమాన్యాల ప్రతినిధులు మాత్రం సమావేశాలకు హాజరుకారు. కార్మిక శాఖ మౌనముద్ర వీడదు.

మీడియా కమిషన్‌ అవసరం

ప్రస్తుత పరిస్థితుల్లో మీడియాలో నెలకొన్న పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. పనిచేస్తున్నవారు ఒక విధంగా ఇబ్బంది పడుతుంటే యాజమాన్యాలు తాము చాలా కష్టాల్లో ఉన్నామని చెప్పుకుంటున్నారు. మరోపక్క పుట్టగొడుగుల్లా పత్రికలు, ఛానళ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మీడియాలోని వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు భయంలేకుండా ఈ రంగంలో పనిచేస్తున్నవారు కొనసాగేందుకు వీలైన వాతావరణాన్ని కల్పించాలి. అందుకోసం కాలపరిమితితో కూడిన మీడియా కమిషన్‌ను నియమించి ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాల్లోని వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తే నిజానిజాలు వెల్లడవుతాయి. అందుకు ప్రభుత్వం తగిన చొరవ తీసుకోవాలి.

ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా మీరు జోక్యం చేసుకుని పై సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరుకుంటున్నాం. మీడియా యాజమాన్యాల పట్ల మీకున్న సానుకూల వైఖరికి సంతోషం. మీడియాలో పనిచేసే జర్నలిస్టుల కష్టనష్టాలను తొలగించే బాద్యత స్వీకరించాల్సింది ప్రభుత్వమే. వేతన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధం చేస్తే వాటిని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. మొత్తం మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు రాష్ట్రంలో 20 వేల మందికి మించి ఉండరు. సంఖ్యలో తక్కువ ఉన్నప్పటికీ మా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపాలి.

మీడియాలో పనిచేస్తున్నవారి సమస్యలను తెలుసుకునేందుకు గతంలో సంఘాలు ఏర్పాటుచేసిన సమావేశాలకు ముఖ్యమంత్రులు హాజరై నేరుగా తెలుసుకునేవారనే విషయం మీకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పుడా పరిస్థితి లేదు. అటువంటి సందర్భంలో మీడియాలోని సంఘాలతో ఉన్నతస్థాయి అధికారులతో కూడిన సమావేశాన్ని ముఖ్యమంత్రి సమక్షంలో నిర్వహించడం ద్వారా పలు సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉంది. ఈ విషయమై ఫెడరేషన్‌ తరఫున గతంలో రాసిన లేఖల్లో మేము కోరాం. ఇప్పటికైనా అటువంటి సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా కొంతవరకు వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు వీలవుతుంది.

ప్రభుత్వం విభిన్న వర్గాల ప్రజల కోసం పలు రకాల పథకాలను అమలు చేస్తోంది. వందల కోట్ల రూపాయలను కేటాయిస్తోంది. రాష్ట్రాభివృద్ధి కోసం నూతన ఆవిష్కరణలకు తెరతీస్తోంది. సంక్షేమ పథకాల పేరుతో పెడుతున్న ఖర్చుకు లెక్కేలేదు. నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకు ప్రతి జర్నలిస్టు తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో మిగిలినవారి కంటే ఒక అడుగు ముందే ఉన్నాడు. అటువంటి జర్నలిస్టు మరింత భద్రతడో కూడిన పరిస్థితుల్లో పనిచేస్తే రాష్ట్రాభివృద్ది మరింత త్వరితగతిన సాగుతుంది. అందుకు మీ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరుకుంటూ పైన పేర్కొన్న సమస్యల పరిష్కారంలో చొరవ చూపిస్తారని ఆశిస్తున్నాం.

అభివందనాలతో

భవదీయుడు

(జి.ఆంజనేయులు)

ప్రధానకార్యదర్శి

Share this:

  • Tweet
  • More
Like Loading...

టిప్పు లేదా సేవా రుసుములపై ప్రభుత్వ వైఖరేమిటి ?

05 Thursday Jan 2017

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, STATES NEWS

≈ Leave a comment

Tags

Department of Consumer Affairs, hotels service charges, National Restaurant Association of India, tip

సత్య

    హోటళ్లకు వెళ్లినపుడు ‘టిప్పు’ ఇవ్వాలా వద్దా అన్నది చాలా మందిని వేధించే ప్రశ్న. ఇవ్వటం ఇష్టం లేని నాన్నలు లేచి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటే కాలర్‌ పట్టి మరీ లాగి కూర్చోపెట్టి పర్సు తీసి టిప్పు ఇచ్చే భార్య, పిల్లలను చూసే వుంటారు. టిప్పు ఇవ్వకుండా వెళ్లే వారిని సర్వర్లు చూసే చూపు తట్టుకోలేక, అవమానంగా భావించి ఇలా చేస్తారని తెలిసిందే. ఇప్పుడా టిప్పు ఇవ్వటమా లేదా అన్నది మీ ఇష్టం ఇష్టముంటే ఇవ్వండి, విధిగా ఇవ్వాల్సిన అవసరం లేదు అని కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ మృదువుగా ప్రకటించింది. టిప్పు చెల్లించాల్సిందే, ఇష్టమైతేనే తినండి లేకుంటే దొబ్బేయండి మీ ఇష్టం అని హోటల్‌ యజమానుల ప్రతినిధి మొహమాటం లేకుండా తెగేసి చెప్పాడు. పెద్ద నోట్ల రద్దు మాదిరి కేంద్ర ప్రకటన ప్రయోజనం లేకుండా పోయింది. ఇష్టమైతే టిప్పు ఇవ్వండి లేకుంటే లేదు అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది అంటే టిప్పు అని సేవా ఛార్జీలు అని వసూలు చేసే యజమానులపై చట్టపరంగా చర్యలు తీసుకొనే అవకాశాలు లేవన్నది స్పష్టం. అందువలన ఇక్కడ తేలాల్సిన అంశం ఏమంటే వుదారంగా ఇచ్చే టిప్పు లేదా విధిగా వసూలు చేసే సేవా రుసుముపై అసలు ప్రభుత్వ వైఖరి ఏమిటి ? తాను ఇచ్చిన వివరణ ప్రకారం హోటళ్లలో అమలు చేయించే దమ్ము ప్రభుత్వాలకు వుందా అన్నది ప్రశ్న. వసూలు విచక్షణ యజమానులకు, సేవలు నచ్చితే చెల్లించాలా లేదా అనే విచక్షణ వినియోగదారులదీ అని చెప్పటం అదీ కరెక్టే ఇదీ కరెక్టే అని చెప్పటం తప్ప మరొకటి కాదు.

    ‘ బుర్ర వుపయోగించకుండా ఇలాంటి ప్రకటనలు చేయటం వుద్యోగులకు తీవ్ర నష్టదాయకం. యజమానులే కాదు సర్వీసు ఛార్జీలపై ఆధారపడిన హోటల్‌ వుద్యోగులందరూ దీనితో ప్రభావితులౌతారు.మంచి చెడ్డలను ఆలోచించకుండా వారి భుక్తిని ఎలా దెబ్బకొడతారు ‘ అని నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు రియాజ్‌ అమ్లానీ వ్యాఖ్యానించారు. ఆహార సేవారంగంతో సంబంధం వున్న 85లక్షల మంది దీనితో ప్రభావితులౌతారని అమ్లానీ చెప్పారు. సేవా చార్జీలు వసూలు చేయాలా లేదా అన్నది రెస్టారెంట్ల యజమానుల ఇష్టం. ఒక వేళ వసూలు చేయాలనుకుంటే ఆ విషయాన్ని పదార్ధాల పట్టికలో లేదా ఇతర విధాలుగా స్పష్టంగా ప్రకటించాలి. దీంతో ఆ సేవలను కోరుకొనే వినియోగదారులకు ఆ విషయం ముందే తెలుస్తుంది.రెస్టారెంట్లు అందుబాటులో వుంచిన ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలా లేదా అన్నది తేల్చుకుంటారు అని ప్రభుత్వ వినియోగదారుల వ్యవహరాలశాఖ పేర్కొన్నది. హోటళ్లు ఎలాంటి సేవలు అందించినా సేవా ఛార్జీల పేరుతో ఐదు నుంచి ఇరవై శాతం వరకు వసూలు చేస్తున్నాయనే ఫిర్యాదులు రావటంతో కేంద్ర ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది.

     దీంతో అనేక మంది హోటల్‌ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సేవా రుసుము వసూలు గురించి తెలిపే ఏర్పాట్లు చేయటం అనేక పర్యవసానాలకు దారితీస్తుంది. ఇప్పటికే 15 శాతం వాట్‌, ఇతర సెస్సులతో వెనుకా ముందు చూసుకొనే వినియోగదారులు అంత మొత్తం టిప్పుకూడా చెల్లించాలంటే అది లేని రెస్టారెంట్లకు వెళతారు. యజమానులు ఇచ్చే నామ మాత్ర జీతాలతో ఎవరు పని చేస్తారు, జీతం కంటే టిప్పు ఎక్కువ వస్తుందనే ఆశతో పని చేస్తున్న కార్మికులకు సమస్యలు వస్తాయి. అమెరికాలో కొందరు యజమానులు టిప్పు రద్దు చేసిన సందర్భాలలో పని చేసేందుకు కార్మికుల లభ్యత సమస్యలు ఏర్పడ్డాయని, హొటళ్లలో పని చేసే వారి వేతనాలు చాలా తక్కువగా వుంటాయి కనుక వారికి కాస్త అదనంగా చెల్లించేందుకు టిప్పు వసూలు చేస్తామని అక్కడి యజమానులు నమ్మ బలుకుతారు. ప్రపంచవ్యాపితంగా టిప్పు ఒక సమస్యగా తయారైంది.

    ఐరోపా కులీన కుటుంబాలలో విందులు, వినోదాలు ఏర్పాటు చేసినపుడు వచ్చిన అతిధులు మెచ్చుకోలుగా పనివారికి కొంత సొమ్మును ఇవ్వటంతో ప్రారంభమైన టిప్పు ఇప్పుడు విధిగా చెల్లించాల్సిన వాటి జాబితాలో చేరిపోయింది. అయితే ప్రపంచమంతటా ఇది ఒకే విధంగా లేదు. అసలు టిప్పు తీసుకోవటం అనేది కార్మికుల గౌరవ మర్యాదలకు సంబంధించిన అంశం. ప్రభుత్వాలు లేదా మార్కెట్‌ ప్రతి పనికీ ఒక వేతనం లేదా విలువ నిర్ణయిస్తున్నాయి. ప్రతి వారు తాము ఏ పని చేసినా గౌరవ ప్రదమైన జీవితం గడిపేందుకు అవసరమైన వేతనం లేదా ప్రతిఫలం పొందటం న్యాయం. ఆ విధంగా చూసినపుడు ఒక హోటల్లో పని చేసే కార్మికులకు అలాంటి వేతనాలు ఇవ్వాల్సిన బాధ్యత యజమానులదే. వారి వేతనాల ఖర్చు, ప్రభుత్వ పన్నులను కూడా కలుపుకొని ఆహార పదార్ధాల ధరలను నిర్ణయించాలి. ఆ ధరలకు సిద్దపడిన వినియోగదారులే వస్తారు. అలాగాకుండా కార్మికులకు నామమాత్ర వేతనాలిచ్చి, వారిని ఆదుకొనే పేరుతో టిప్పు లేదా సేవా రుసుము అంటూ అదనంగా వసూలు చేయటాన్ని మరొక విధంగా చెప్పాలంటే కార్మికులకు వేతనాలు చెల్లించే బాధ్యతను వినియోగదారులపై నెట్టి యజమాని వుచితంగా లేదా నామమాత్ర వేతనాలతో పని చేయించుకోవటం, కార్మికులకు చెల్లించాల్సిన పిఎఫ్‌, ఇఎస్‌ఐ చెల్లింపుల వాటాను యజమానులు ఎగవేయటమే. దీని వలన అంతిమంగా నష్టపోయేది కార్మికులే. మన దేశంలో హొటళ్లు అసంఘటిత రంగంగా వున్నందున వాటిలో పని చేసే వారు కూడా శాశ్వతంగా వుండటం లేదు. రుచిగా వంట చేసే వారికి మంచి డిమాండ్‌ వున్నందున అలాంటి వారికి ప్రభుత్వ నిర్ణయించిన వేతనాలకు కొన్ని రెట్లు అదనంగా ఇచ్చి నియమించుకుంటారు. ఇతర పని వారికి నామ మాత్ర లేదా రోజువారీ వేతనాలతో పనులకు పెట్టుకుంటారు. యజమానికి కోపం వచ్చినా, కార్మికులకు కోపం వచ్చినా పని గోవిందా. నిరుద్యోగులు ఖాళీగా వుండకుండా ఏదో ఒక పని చేయాలి కనుక తాత్కాలిక వెసులుబాటుగా హోటళ్లను ఎంచుకుంటారు.ఈ బలహీనతను యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు.

    చివరిగా ఒక ప్రశ్న. హోటళ్లలో సేవ నచ్చకపోతే టిప్పు చెల్లించాలా లేదా అన్నది వినియోగదారుడి ఇష్టమని చెబుతున్న ప్రభుత్వం అది తాను అందించే సేవలకు సైతం వర్తింప చేస్తుందా ? సేవలకు చార్జీలు వసూలు చేస్తున్న ప్రభుత్వం వాటి మీద అదనంగా రుసుముల పేరుతో వసూలు ఎందుకు చేయాలి? చెత్త సెస్సు వసూలు చేస్తున్నా రోడ్లు శుభ్రంగా వుండటం లేదు, అలాంటపుడు దాన్నెందుకు చెల్లించాలి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చంద్రబాబుకు నోట్ల రద్దు ‘సంక్షోభ ‘ సెగ

24 Thursday Nov 2016

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

Chandrbabu, Demonetisation

ఎం కోటేశ్వరరావు

    పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయాలంటూ ముందుగానే ప్రధానికి లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడి ఆ చర్యతో తలెత్తిన సంక్షోభ సెగ తగిలింది.ఈనెల 20న సమాచార శాఖ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో ఇన్ని రోజులైనా నోట్ల రద్దుతో తలెత్తిన సమస్య పరిష్కారం కాకపోవటం పట్ల తనకే అసహనం కలుగుతోందంటూ వ్యాఖ్యానించారు. ఒక సమస్య పరిష్కారం కాకపోవటం తన రాజకీయ జీవితంలో ఇదే మొదటి సారని, తుపాన్ల తీవ్రత వలన తలెత్తిన నష్టాలను ఎనిమిది రోజుల్లోనే అధిగమించామని, గోదావరి పుష్కరాలలో మొదటి రోజు ఇబ్బంది వచ్చినా తరువాత 14 రోజులు సమర్ధవంతంగా నిర్వహించామని, అలాంటిది పన్నెండు రోజులైనా నోట్ల రద్దు సమస్య అపరిష్కృతంగా వుండటం బాధాకరమని, తనకే అసహనం కలుగుతోందని అలాంటిది ప్రజల సహనాన్ని మెచ్చుకోవాలన్నారు. తన సహజ శైలిలో తన పరిధిలోని బ్యాంకర్లు ఎలా పనిచేయాలో కూడా చెప్పారనుకోండి.

    తాజాగా గురువారం నాడు నిర్వహించిన టెలికాన్ఫరెన్సు (24న) వుపన్యాసం గురించి సమాచార శాఖ విడుదల చేసిన ప్రకటనలో ప్రతిరోజు తాను నోట్ల రద్దు గురించి ఆర్‌బిఐ, ఎస్‌ఎల్‌బిసి, బ్యాంకర్లతో సమీక్ష జరుపుతున్నానని, దీనిని ఒక సంక్షోభంగా తీసుకుంటే అది అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గదని, సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకుంటే పరిష్కారం సులువు అవుతుందన్నారు. ప్రతి గ్రామం, వార్డుల్లోని కిరణాదుకాణాలలో కూడా పాస్‌ మిషన్‌ వుపయోగించి నగదు రహిత లావాదేవీలవైపు ప్రోత్సహించాలని కోరారు. మొబైల్‌ కరెన్సీ, ఆన్‌లైన్‌ లావాదేవీలు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వినియోగం ద్వారానే ప్రస్తుత సమస్యను అధిగమించగలమని చంద్రబాబు వివరించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచబ్యాంకు అక్కర తీర్చే తహ తహ ! ఔరా ఏమిటీ వైపరీత్యము !!

26 Wednesday Oct 2016

Posted by raomk in AP, Current Affairs, Economics, Gujarat, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Doing business, Doing business India rank, Doing business rankings, WB Doing business ranking

ఎం కోటేశ్వరరావు

   వ్యాపార సరళతరం సూచికలో భారత్‌ తన స్ధానాన్ని 131 నుంచి 130కి పెంచుకొని గత ఏడాది కంటే ఒక పాయింట్‌ అదనంగా సాధించిందని ప్రపంచబ్యాంక్‌ 2017 నివేదికలో ప్రకటించింది. నరేంద్రమోడీ నాయకత్వంలో ప్రకటించిన సంస్కరణలన్నీ వూకదంపుడు వుపన్యాసాలే తప్ప ఆచరణ రూపం దాల్చనందున ప్రపంచ బ్యాంకు వాటిని పరిగణనలోకి తీసుకోలేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. భారత్‌లో వ్యాపార విషయాలను చూసే కేంద్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి రమేష్‌ అభిషేక్‌ తాజా సూచికపై స్పందిస్తూ ప్రభుత్వం అమలు జరుపుతున్న 12 సంస్కరణలను ప్రపంచబ్యాంకు పరిగణనలోకి తీసుకోలేదని, వచ్చే ఏడాది నివేదికలో ఈ అంశాలను చేర్చేందుకు వీలుగా ప్రపంచబ్యాంకు అక్కర లేదా ఆవేదనలను తీర్చుతామని కూడా వెల్లడించారు. దివాలా, ఐపి నిబంధనలను ఈ ఏడాది చివరికి ఖరారు చేస్తామని, జిఎస్‌టిని వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి అమలు జరిపితే మన సూచిక గణనీయంగా మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు.http://www.livemint.com/Industry/uOrtVTE4CgFpPnwV3wATmK/India-ranked-130-in-World-Banks-Doing-Business-survey.html

    భారత్‌లో సులభంగా వ్యాపారం చేసుకోవటానికి చర్యలు తీసుకోవటం అంటే ఏమిటో ఈ పాటికే కొంత అర్ధమయ్యే వుంటుంది. సూటిగా చెప్పాలంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇలా వచ్చి వ్యాపారాన్ని పెట్టి అలా లాభాలు తీసుకుపోయేందుకు అనువైన పరిస్ధితులు కల్పించటమే. ఒక వేళ అలా వచ్చిన వారు ఎవరైనా ఇలా దివాలా తీస్తే వారికి నష్టం కలగకుండా చూసేందుకు దివాలా, ఐపి నిబంధనలను కూడా సరళతరం చేస్తామన్నదే మన పరిశ్రమల శాఖ కార్యదర్శి వివరణ ఆంతర్యం. వీటికి సంస్కరణలని ముద్దు పేరు. మన దేశానికి ఈస్టిండియా కంపెనీ పేరుతో వచ్చిన బ్రిటీష్‌, పోర్చుగీసు, డచ్‌, ఫ్రెంచి వారందరూ సులభంగా వ్యాపారం చేసుకొనేందుకే కదా వచ్చారు. వారికి నాటి మన రాజులు, రంగప్పలు సులభంగా అనుమతులు ఇవ్వబట్టే కదా ఏకులా వచ్చి మేకులా మారి మన తలపై కూర్చున్నారు. మరి దానికీ దీనికీ పెద్ద తేడా ఏమిటి అన్నది మౌలిక ప్రశ్న. నాడు వంశపారంపర్య రాజులు అనుమతిస్తే నేడు వారి స్ధానంలో ప్రజలెన్నుకున్న ప్రభువులు ఇవ్వటం తప్ప మరొకటి ఏమైనా వుందా ? విదేశీ కంపెనీలను అనుమతిస్తే అవి మన మూలుగులను పీల్చి పిప్పి చేయటమే కాదు, మన మీద పెత్తనం చెలాయిస్తాయని నాటి మేథావి వర్గానికి తెలిసినా లేదా వేదాల్లో అవి కూడా రాసి వున్నాయని నాటి సంస్కృత పండితులు ఎవరికైనా అనుమానం వచ్చినా కచ్చితంగా వ్యతిరేకించి వుండేవారు. కానీ ఇప్పుడు అన్నీ వేదాల్లో వునాయష అని చెబుతున్నవారు, చరిత్రను తిరగేసి మరగేసి చూసిన మేథావులనబడేవారు కూడా విదేశీ కంపెనీలకు స్వదేశీ ఎర్రతివాచీ పరిచి, దేశ భక్తి భాజా భజంత్రీలతో స్వాగతం పలుకుతున్నారు. నాడు తెలియక చేస్తే నేడు తెలిసి చేస్తున్నారు. దీనికి భిన్నమైనదేమైనా వుంటే చరిత్రకారులు, మేథావులు చెప్పాలి.

    ప్రపంచబ్యాంకును సంతృప్తి పరచటం అంటే అది ప్రాతినిధ్యం వహించే అంతర్జాతీయ కార్పొరేేట్ల అక్కర తీర్చటమే. ఈ విషయంలో మన్మోహన్‌ సింగ్‌తో నరేంద్రమోడీ పోటీ పడుతున్నారు. తానే పెద్ద సంస్కరణ వాదిని అని నిరూపించుకొనేందుకు తహతహలాడుతున్నారు. సింగ్‌ గారి హయాంలో అంటే 2012లో సరళతర వ్యాపారంలో మన దేశ ర్యాంకు 131 అన్న విషయం గుర్తు చేయటం అవసరం.http://www.thehindu.com/business/Economy/india-slips-in-ease-of-doing-business-list-world-bank/article5286594.ece తరువాత అది 134కు పడిపోయింది.అందువలన ఈ ర్యాంకులను చూసి లేదా చూపి పాలకులు తాము సాధించిన ఘనత అని చెప్పుకుంటే జనాన్ని మోసం చేయటం తప్ప మరొకటి కాదు. ప్రతి ఏటా ప్రపంచబ్యాంకు ఈ ర్యాంకులు కేటాయించే పద్దతులలో మార్పులు చేస్తూ వుంటుంది. దేశాల సంఖ్య కూడా మారిపోతూ వుంటుంది. నిజానికి ఇదొక అంకెల గారడీ. మన దేశ ర్యాంకు పెరగటంలో ప్రధాన పాత్ర వహిస్తున్న అంశాలలో విద్యుత్‌ సరఫరా, కనెక్షన్ల ప్రక్రియను సులభతరం చేయటం ప్రధానంగా పని చేస్తున్నది.

  మన దేశంలో వ్యవసాయానికి విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వటానికి రైతాంగాన్ని ఎంత సతాయిస్తారో తెలిసిందే. కానీ అదే పారిశ్రామికవేత్తల విషయానికి వస్తే పరిశ్రమ పెట్టకుండానే కనెక్షన్‌ సిద్ధం అన్నట్లుగా వుంటుంది. వుపాధి కల్పిస్తున్నదనే పేరుతో దానికి రాయితీలు అదనం. మన పాలకులు ప్రతి ఏటా అన్ని లక్షల కోట్లు ,ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులుగా తెచ్చామని ఎంత వూదర గొడుతున్నప్పటికీ మన దేశంలో విద్యుత్‌ వినియోగంలో పరిశ్రమల వాటా తగ్గిపోతున్నది.2012లో 32శాతం వుండగా 2014నాటికి 29శాతానికి పడిపోయింది. దానిలో స్వల్ప మార్పు లేదా స్ధిరంగా వుంటున్నది తప్ప పెరగటం లేదు. దానికి కారణాలలో పరిశ్రమల మూత, ఖాయిలా ఒక ప్రధాన కారణం,అయితే వాటి స్ధానంలో కొత్తవి రాకపోవటం మరొకటి. విద్యుత్‌ సరఫరా మెరుగు పడటానికి గతంలో శంకుస్థాపన చేసిన అనేక విద్యుత్‌ కేంద్రాలు ఈ రెండు సంవత్సరాల కాలంలో వుత్పాదన ప్రారంభించటం కూడా ఒకటి. అందువలన సరేంద్రమోడీ సంస్కరణలకు దీనికి సంబంధం వుందని చెప్పలేము.

   గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ దేశమంతటా చేసిన ప్రచారంలో గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధి ఒకటి. ఎన్నికలు ముగిసిన తరువాత ఒక్కసారి కూడా దాని గురించి మాట్లాడినట్లు ఎక్కడా నేను వినలేదు. తిరిగి వచ్చే ఎన్నికలలో చెబుతారేమో తెలియదు. ప్రస్తుతం వుత్తర ప్రదేశ్‌ సంక్షేమాన్ని తాము తప్ప మరొకరు పట్టించుకోరు అని అక్కడ ఎన్నికల సభల్లో చెబుతున్నారు.http://indianexpress.com/article/business/economy/gujarat-clocks-over-48000-sick-msme-units-in-2014/ నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా వుండి గుజరాత్‌ను ఎలా అభివృద్ధి చేశారో పై వార్తను చూస్తే ఆ ప్రచార బండారం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. 2014లో రిజర్వుబ్యాంకు రూపొందించిన సమాచారంతో చిన్న, సన్నకారు, మధ్యతరగతి పరిశ్రమల శాఖ లోక్‌సభలో మోడీ సర్కారే ఒక ప్రశ్నకు సమాధానంగా విడుదల చేసిన సమాచార సంక్షిప్త వివరాలు ఇలా వున్నాయి. 2014 మార్చి ఆఖరు నాటికి వుత్తర ప్రదేశ్‌లో 63,268, గుజరాత్‌లో నమోదైన చిన్న, సన్నకారు పరిశ్రమలలో ఐదో వంతు అంటే 48,000 ఖాయిలా పడ్డాయి. ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ పాలన చివరి సంవత్సరంలో మూత పడిన వాటి సంఖ్య 20,452 నుంచి 48వేలకు పెరిగాయి. అంతకు ముందు 2011లో ఖాయిలా యూనిట్లు 4321 మాత్రమే. 2013 సచేతన గుజరాత్‌( వైబ్రంట్‌ గుజరాత్‌) పేరుతో నిర్వహించిన హంగామాకు ముందు స్వయంగా గుజరాత్‌ ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం కేవలం ఐదుశాతం మాత్రమే చిన్న పరిశ్రమలు ఖాయిలా పడ్డాయి. కానీ సచేతన గుజరాత్‌ వుత్సవాల సందర్భంగా తీసిన లఘుచిత్రాలలో చిన్న పరిశ్రమలు ఎంతో గొప్పగా వున్నట్లు చిత్రించారు. ఏ ఏటికాయేడు ఎన్నో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు అవగాహనా ఒప్పందాలు జరిగినట్లు అంకెలను ప్రకటించారు.

   నరేంద్రమోడీయే సచేతన గుజరాత్‌ పేరుతో అంత హడావుడి చేసి చిన్న పరిశ్రమల మూతకు పుణ్యం కట్టుకుంటే అంతకంటే పెద్ద జాదూతనంతో అలరిస్తున్న చంద్రబాబు నాయుడు, కెసిఆర్‌ వారి వారసులు తెస్తున్నట్లు చెబుతున్న పెట్టుబడుల గురించి చెప్పాల్సిందేముంది. రాష్ట్రాలలో వాణిజ్య సంస్కరణల విషయమై ర్యాంకుల గురించి ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారు.అసలు పరీక్ష రాయకుండానే మొదటి ర్యాంకులు ఎలా తెచ్చుకుంటారో ఇటీవల మనం చూశాం. అందువలన రాష్ట్రాల ర్యాంకులు కూడా అదే విధంగా వున్నాయా ?ఏమో తెలియదు. ప్రస్తుతం 99.09శాతంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రెండు రాష్ట్రాలు మొదటి ర్యాంకులో వున్నాయట. ప్రశ్నా పత్రం ముందే లీకైతే తప్ప ఒకే మార్కులు ఎలా సాధ్యం అన్న అనుమానం ఎవరికైనా రావచ్చు.ఈ ఏడాది ర్యాంకులను త్వరలో ప్రకటించనున్నట్లు వార్తలు. ర్యాంకులు అనేవి సాధించిన విజయాలుగా ప్రచారం చేసుకోవటానికి తప్ప సామాన్య జనానికి కల్పిస్తున్న వుపాధి, మరొక ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్న. ఒక పాత సినిమాలో మీలో పెద్ద వెధవను నేను ప్రేమిస్తాను అంటే ఎవరు ఎలాంటి ‘ఘనకార్యం’ చేశారో చెప్పుకొనేందుకు పోటీ పడతారు. ఇక్కడ మెరుగైన వాణిజ్య వాతావరణం అంటే గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిన నీకది, నాకిది పద్దతిలో వాటాల లెక్కలను మరింత పకడ్బందీగా అమలు జరపటం, ప్రజల సొమ్మును పంచుకోవటం తప్ప మరొకటి కాదని ఇప్పటికే తెలుగు జనాలందరికీ అర్ధం అయింది. రాబోయే రోజుల్లో ఈ పోటీ మరింత పెరిగినా ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Gujarat becomes the first state to distribute 2 crore LED Bulbs under UJALA

31 Wednesday Aug 2016

Posted by raomk in Current Affairs, Gujarat, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Gujarat, LED Bulbs, UJALA

Under the Government of India’s UnnatJyoti by Affordable LEDs for all (UJALA)scheme, Gujarat has become the first state to distribute 2 crore LED bulbs. Gujarat has reached this milestone in just 96 days andover 42 lakh households have already benefitted from the scheme.Energy Efficiency Services Limited (EESL), under the administration of Ministry of Power, Government of India, is distributing approximately 2 lakh bulbs daily in Gujarat which is again a record in itself.

During his speech in Jamnagar the Prime Minister Shri Narendra Modi said, “There is competition between states to outdo each other in terms of LED distribution. Gujarat, in less than 100 days is now leading in terms of LED distribution across the nation. I congratulate the entire team for implementing the LED Bulb programme. I am confident that every household in Gujarat will adopt LEDs and save on electricity bills. The state will save a lot of energy and will also lead the way in helping protect the environment”

The distribution of 2 crore LED bulbs has led to an annual energy savings of 259 crore kWh which is equivalent to lighting up 5 lakh Indian homes for an entire year. Alongside the savings in units, the state has also benefitted from daily CO2 emission reduction of 5,000 tonnes.The programme has also helped the state to avoid 520MW of peak demand.

In Gujarat, 9W LED bulbs are being distributedunder the UJALA scheme. These energy efficient bulbs come with a free 3 year replacement warranty for any technical defect. To avail the bulbs, consumers have an option of paying upfront amount of Rs. 70 per bulb or they can choose an EMI option. Consumers choosing to pay through EMI will have to pay Rs. 75 in total, where an amount of nearly Rs. 20 per LED bulb will be added to their bi-monthly electricity bill for a period of 4 bill cycles. Consumers stand to save nearly Rs. 336 every year on their electricity bills per LED bulb, making the LED bulbs free to the user in just 3 months. The state government aims to distribute 12 crore LED bulbs across the state. This would lead to energy savings of nearly 650 Crore kWh and cost savings of about Rs. 2,500 crore.

The list of other distribution centres can be viewed on www.ujala.gov.in. For any queries or information regarding UJALA consumers can also call on the Gujarat helpline 0265- 2343678. During the distribution period, replacements can be done through any of the distribution counters that are operating within the city.

Under UJALA, over 15 crore LED bulbs have already been distributed across India. This is leading to annual energy savings of 1948 crore kWh and resulting in avoidance of 3,900 MW of peak demand. Through the programme the estimated cumulative cost reduction of bills of consumers, annually is INR 7990 crores

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

నయీం తరువాత గ్యాంగస్టర్ల భవితవ్యం ఏమిటి ?

14 Sunday Aug 2016

Posted by raomk in AP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

BJP, Congress, gangsters, Naeem, tdp, Telangana police, trs

సత్య

   హైదరాబాదుకు యాభై కిలోమీటర్ల దూరంలోని షాద్‌ నగర్‌ దగ్గరలో పోలీసులు మట్టు పెట్టిన గ్యాంగ్‌స్టర్‌ నయీం గురించి కొన్ని మీడియా సంస్ధలు పేజీల కొద్దీ కథనాలను వండి వడ్డిస్తున్నాయి. వాటిని పాఠకులు కూడా ఎంతో ఆసక్తిగా చదువుతున్నారు. స్త్రీ వేషధారణలో వున్న నయీం ఫొటోను విడుదల చేసిన పోలీసులు వాటికి మరింత కిక్కు ఎక్కిస్తున్నారు. అంతకు ముందు గ్యాంగస్టర్‌ కధాంశంగా నిర్మించిన రజనీకాంత్‌ సినిమా కబాలీ గురించి కూడా మీడియా పుంఖాను పుంఖాలుగా వార్తలు, వ్యాఖ్యానాలు ఇచ్చింది. మనం అమ్మే సరకు ఏదన్నది కాదన్నయా దాని వలన మనకు ఎంత డబ్బు వస్తుందన్నదే ముఖ్యం అన్నట్లుగా పత్రికలు, టీవీ ఛానల్స్‌, ప్రయివేటు ఎఫ్‌ఎం రేడియా వంటివి దేనిని ఆదాయవనరుగా మార్చుకోవచ్చో నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. నయీం గురించి వర్ణితమౌతున్న కధనాలు రాంగోపాల్‌ వర్మ తన అభిమాన హీరోయిన్‌ శ్రీదేవికి 53ఏండ్లు నిండిన కారణంగా ఆమెను హీరోయిన్‌గా పెట్టి తీయలేకపోయినా వేరే వారితో హాలీవుడ్‌ మాదిరి సీరియల్‌ సినిమాలు తీయటానికి పనికి వస్తాయి. ఎందుకంటే నయీం కధలలో చీమలను, నరికిన వేళ్లను కరకరా నమిలి తినటం వంటి వాటితో సహా లేడీ డాన్‌లు,గోవా బీచ్‌లు కూడా పుష్కలంగా వున్నట్లు కనిపిస్తోంది కనుక కల్పిత పాత్రల కోసం చూడనవసరం లేదు.

    ఒక గ్యాంగ్‌స్టర్‌ హతమైన తరువాత అతగాడి బాధితుల గురించి కధనాలు రాసినట్లుగానే, నిజాలను నిర్భయంగా చెబుతాం, రాస్తాం అనే మీడియా రాజకీయ నేతల బాధితుల కధలు ఎందుకు రాయటం లేదు ? పోయినోళ్లందరూ మంచోరే అయితే గ్యాంగస్టర్‌లు కూడా అంతేగా ? పోనీ పోయిన అందరు గ్యాంగ్‌స్టర్ల గురించి మీడియా అలా రాస్తోందా? ఎందుకు రాయటం లేదు? నయీం అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఆస్థులను బాధితులకు తిరిగి ఇస్తాం అని చెబుతున్నట్లుగా రాజకీయ నేతలు లేదా ఆ ముసుగులో కబ్జా చేసిన వాటి గురించి ఏమిటి ? ఇలా ఆలోచిస్తే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

   ఈ మధ్య కాలంలో అనేక మంది గ్యాంగస్టర్లు, రాజకీయ నేతల బారిన పడిన కథలే కాకుండా మీడియా బారిన పడి ఎలా నష్టపోయిందీ చెబుతున్నారు. నయీం బాధితులకు భరోసా ఇస్తామని చెబుతున్న అధికార యంత్రాంగం పోలీసులు, రాజకీయ నేతలు, మీడియా బాధితులకు కూడా అలాంటి హామీ ఇవ్వగలదా ? విక్రమార్కుడి కధలో రాజా నిజం తెలిసి కూడా సమాధానం చెప్పలేకపోయావో నీతల వేయి వక్కలౌతుంది అన్నట్లుగా, సమాధానం చెప్పలేకపోతే తల శిరఛ్చేదం అవుతుందనే అపూర్వ చింతామణి కధలు లేదా గులేబకావళికధ సినిమాలో జూదంలో గెలవలేక బందీలుగా మారిపోవటానికి గాని ముందుకు వచ్చే వీరులెవ్వరుంటారు ?

  నయీం వంటి గ్యాంగస్టర్‌లను మట్టుపెట్టినపుడు భవిష్యత్‌లో అలాంటి మరొకరిని ఎదగనీయకూడదని అనేక మంది సామాన్యులు నిజంగానే కోరుకుంటారు. వారి సానుభూతిని కొల్లగొట్టటానికి పాలకులు, అధికార యంత్రాంగం కూడా నిరోధానికి కఠిన చర్యల గురించి భీకర ప్రతిన బూనుతుంది. స్మశాన, ప్రసూతి వైరాగ్యాల మాదిరి రెండవ రోజుకు అవి గుర్తుండవు. అంటే మతి మరపు వైరస్‌ వారిని సోకుతుందా ? ఏమౌతుంది, ఎందుకు అలా జరుగుతుంది.

   భూస్వాములు, దొరలు, దేశముఖ్‌ల హయాంలో వారికి ప్రయివేటు సైన్యాలు వున్న విషయం తెలిసిందే. కావాలంటే పాత సినిమాలు చూడవచ్చు. ఆ ఫ్యూడల్‌ వ్యవస్ధ అంతరించి లేదా అంతరిస్తూ దాని స్ధానంలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందుతున్న క్రమంలో వారి స్ధానాన్ని గ్యాంగస్టర్లు, తాలిబాన్లు (అన్ని రకాల మతోన్మాదులు) భర్తీ చేస్తున్నారు. అనేక హాలీవుడ్‌ సినిమాలు ఇప్పుడు వారి చుట్టూ తిరుగుతున్నాయి. ధనిక దేశాలలో మాఫియా, గ్యాంగస్టర్ల ఆధిపత్యం, పట్టు గురించి ఎన్నో పరిశోధనలు, ఎంతో సాహిత్యం వెలువడుతోంది. వారు అనేక చోట్ల సమాంతర ఆర్ధిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. మాఫియాతో పాటు నేడు ప్రపంచంలో అతిపెద్ద వ్యాపారాలలో బూతు ఒకటి. అన్ని రంగాలలో అగ్రస్ధానంలో వున్న అమెరికాలో హాలీవుడ్‌ సినిమాలతో సమంగా బూతు సినిమాలు తీసి సొమ్ము చేసుకుంటున్నారు. వీటన్నింటినీ పాలక వర్గాలు, వ్యవస్ధ ఎలా అనుమతించింది. ఎలా కొనసాగనిస్తోంది ?

    అందుకే ప్రపంచంలో మనకు ఎక్కడా మంచి భూస్వామి, మంచి పెట్టుబడిదారుడు, మంచివ్యాపారి కనిపించడు. రాజ్యాంగ వ్యవస్ధలు వునికిలోకి వచ్చిన తరువాత వివిధ కాలాలు, దేశాలలో పేరు ఏదైనప్పటికీ పోలీసు, మిలిటరీ అనేది పాలకవర్గాన్ని కాపాడేందుకు ఏర్పాటు చేసుకున్న అధికారిక యంత్రాంగం. విలువలు, చట్టం ముందు అందరూ సమానమే, ప్రజాస్వామ్యం వంటి వాటి గురించి కబుర్లు చెబుతుంటారు కదా ? అలాంటి వారు పోలీసు వ్యవస్ధద్వారా కొన్ని అక్రమాలు చేయించలేరు. అలాంటి వారు ఏర్పాటు చేసుకొనే అనధికార యంత్రాంగమే గూండాలు. భూస్వామి, దొరలు, దేశ ముఖులు అయితే రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికులను అదుపు చేయటానికి, వారిపై దాడులకు, పెట్టుబడిదారులు అయితే కార్మిక సంఘాలను, వుద్యమాలను దెబ్బతీయటానికి గూండాలతో పాటు మత శక్తులను వుపయోగించుకోవటం, అడ్డదారిలో లాభాల సంపాదనకు వ్యాపారులు స్మగ్లర్లను వినియోగించుకోవటం తెలిసిందే.ఈ శక్తులన్నింటితో సంబంధాలు, వాటాలు వుంటాయి కనుక తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు పాలకవర్గ రాజకీయనేతలకు వాటిలో వాటా వుంటుంది. ఈ క్రమంలోనే పోలీసు యంత్రాంగం కూడా పైన పేర్కొన్న అవాంఛనీయ శక్తులు అదుపుతప్పినపుడు అణచివేయటానికి వారిలోని వారినే వినియోగించుకోవటం ప్రారంభమైంది. వుదాహరణకు నక్సల్స్‌ను బూటకపు ఎన్‌కౌంటర్లు చేయటం కొంత కాలం సాగింది. అది బూటకం అని జనానికి అర్ధమైన తరువాత శవాల దగ్గర తుపాకులు,ఎర్ర కరపత్రాలు,సాహిత్యం పెట్టటం వంటి పాతబడిన పద్దతుల స్ధానంలో వారిలోకి కోవర్టులను ప్రవేశపెట్టి వారి చేతే మట్టుపెట్టే సరికొత్త ప్రక్రియకు తెరతీశారు. అది ఇప్పటికీ నడుస్తోంది. నిఘా వ్యవస్ధ, సిబ్బంది కంటే ఈ కోవర్టుల ద్వారానే నక్సల్స్‌, గూండా, మాఫియా గ్యాంగుల పక్కా సమాచారాన్ని పోలీసులు తెలుసుకోగలుగుతున్నారన్నది కాదనలేని వాస్తవం. ఇది ఖర్చు తక్కువ, ఫలితమెక్కువ వ్యవహారం. ఈ క్రమంలోనే స్వామి కార్యంతో పాటు స్వకార్యం అన్నట్లు పోలీసులతో సహా ప్రతివారూ అడ్డదారులు తొక్కుతున్నారు. అంటే ఇది ఒక విషవలయం.

    గతం గురించి ఎలాంటి అనుభవాలున్నప్పటికీ ప్రతి తరంలోనూ ఇది పునరావృతం కావటానికి ఇది కూడా లాభసాటి వ్యాపారమే కనుక దానికి నాయకత్వం వహించే వ్యవస్దే దీనిని పెంచి పోషిస్తున్నది. నక్సల్స్‌ ఎందరో భూస్వాములను ఖతం చేశారు, వారి స్ధానంలో కొత్తవారు పుట్టుకు వచ్చారా లేదా, అలాగే సుబ్బరామిరెడ్డి వంటి ఒక పారిశ్రామికవేత్తను హతమార్చారు, అయినంత మాత్రాన ఆ వర్గం అంతమైందా లేదు. ముంబైలో ఎందరో గ్యాంగస్టర్లను అంతమొందించారు, జైళ్లలో పెట్టారు. అయినా అక్కడ కొత్తవారు పుట్టుకు రావటం ఆగిపోలేదే. అమెరికా పెంచి పెద్ద చేసిన తాలిబాన్లు, ఐఎస్‌ వుగ్రవాదులు, పంజాబ్‌, కాశ్మీర్‌లలో వేర్పాటు వాదులను ఎందరినో హతమార్చారు. అయినా కొత్త వారు తయారు కావటం ఆగిపోలేదే. ఎందుకంటే అమెరికా కొత్తవారిని తయారు చేయటం నిలిపివేయలేదు.

   మీడియా రంగంలో అవాంఛనీయ శక్తులు, ధోరణులు ప్రవేశించటం దేన్ని సూచిస్తున్నది. దిగువ స్ధాయిలో వున్న విలేకర్లు అనేక అక్రమాలను వెలికి తీసి నివేదిస్తే వాటిని ఎరగా చూపి సొమ్ము చేసుకుంటున్న యాజమాన్యాల సంగతి తెలియనిదెవరికి? దీన్ని చూసిన తరువాత అదే విలేకర్లలో కొందరు సంపాదనకు దగ్గరదారిగా వుందని భావించి అదే పని చేస్తున్నారా లేదా ?అలాంటి యాజమాన్యాల గురించి ప్రభుత్వానికి, పోలీసులకు తెలియదా ? తెలిసీ ఎందుకు మౌనంగా వుంటున్నారు. కనీస చట్టాలను కూడా అమలు జరిపేందుకు పూనుకోవటం లేదే ? ఇది పత్రికా యాజమాన్యాలు-ప్రభుత్వనేతలు, రాజకీయనేతల కుమ్మక్కు కాదా ?

    అందువలన గూండాగిరి, గ్యాంగస్టర్‌, మాఫియా వంటి పదాలకు సాంప్రదాయ అర్ధాలను నవీకరించి కొత్త తరగతులను జత చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. బ్రిటీష్‌ వారి పాలనా కాలంలో కొన్ని తరగతుల జనానికి నేరస్థ తెగలనే ముద్రవేసి వారి పునరావాసం పేరుతో కొన్ని కప్పరాలతిప్ప, స్టూవర్టుపురం, సీతానగరం వంటి కొన్ని ఆవాసాలను ఏర్పాటు చేశారు. చివరికి వారి చేతనే పోలీసు యంత్రాంగం, పలుకుబడిగల పెద్దలు దొంగతనాలు చేయించి వారిని శాశ్వత నేరస్థులుగా చేసిన వుదంతాలు మన కళ్ల ముందే వున్నాయి.

   అనేక ప్రాంతాలలో గూండాలుగా తయారై అర్ధంతరంగా జీవితాలు ముగించిన వారి గురించి తెలుసు. అదొక వారసత్వం మాదిరి వారి వారసులు కూడా తయారై కొనసాగటం మన కళ్ల ముందే కనిపిస్తోంది.వారిని వుపయోగించుకుంటున్న రాజకీయ నేతలలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.అందువలన ఒక వీరుడు మరణిస్తే వేయి మంది వుద్బవిస్తారు అన్న మాదిరి ఈ రోజులలో వీరులు వుదయించటం లేదు గాని ఒక గూండా మరణిస్తే పదివేల మంది గూండాలు తయారవుతారు అన్నట్లుగా పరిస్థితి తయారైంది.

    ఎక్కడైనా ఒక కంపెనీలో, ఫ్యాక్టరీలో, పెద్ద దుకాణంలో ఎవరైనా అంతరించి పోగా మిగిలి వున్న తమ హక్కులను కాపాడు కొనేందుకు కార్మికులు యూనియన్‌ పెట్టుకుంటే వెంటనే వారిపై దాడి. వారి వెనుక ఎవరున్నారని ఆరాలు, ఆ యూనియన్లను అధికారపక్షం స్వాధీనం చేసుకోవటం సాధ్యం కాకపోతే వారే ఒక యూనియన్‌ పెడతారు. దానిలో అందరూ చేరాలని వత్తిడి చేస్తారు, బెదిరిస్తారు, వేధిస్తారు, దానికి లొంగకుండా అనివార్య స్ధితిలో ఆందోళన చేస్తే రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టే వారు వెనక్కు పోతారంటూ కఠినంగా అణచివేసేందుకు పూనుకుంటారు.ఈ విషయంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ అందరూ ఏకీభావంతో కూడబలుక్కున్నట్లుగా ఒకే విధంగా వ్యవహరిస్తారు. కార్మిక వుద్యమాల గురించి మీడియా కనీస ప్రస్తావన కూడా చేయదు, రాజకీయ ఫిరాయింపులపై చూపిన ఆసక్తి, కేటాయించిన స్ధలం, సమయాలతో పోల్చితే జనం సమస్యలకు ఇచ్చేది నామమాత్రం.అందుకే వెయ్యి మంది నయీంలు తయారు కావటానికి అయినా ఈ వ్యవస్ధ అంగీకరిస్తుంది కానీ ఒక ప్రజా వుద్యమం పురుడు పోసుకొని ఎదగటాన్ని మాత్రం సహించదు. దోపిడీ వ్యవస్ధల మౌలిక లక్షణం అది.

    అందరూ శాకాహారులే మధ్యలో రొయ్యలబుట్ట మాయం, అన్నట్లుగా అందరూ గ్యాంగస్టర్లుగా కఠినంగా వ్యవహరించినవారే గానీ గ్యాంగస్టర్లు తయారవుతూనే వున్నారు, దందాలు చేస్తూనే వున్నారు. నయీం వంటి ఒక సామాన్యుడు గూండాగా మారి వందల మందిని అనుచరులుగా చేసుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకుంటున్నా, నిత్యం అనేక మందిని బెదిరిస్తున్నా, హత్యలు చేసినా, చేయిస్తూ దశాబ్దాల తరబడి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి వుంటే ఇలాంటి పెద్దా, చిన్న గ్యాంగస్టర్లు ఎంత మంది వున్నారు? వారు కూడబెట్టిన ఆస్తులెన్ని, బాధితులెందరు ? వారిని కాపాడిన పోలీసులెవరు? వారిని అదుపు చేయాలని ప్రయత్నించిన పోలీసులెవరు? వారికి అడ్డుపడిన రాజకీయ నేతలెవరు ? ఎందుకలా చేశారు వంటి అంశాలపై శ్వేత పత్రం ప్రకటించి వాస్తవాలు వెల్లడించాలి. ఇవేమీ దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు కావు, అవాంఛనీయ శక్తుల అసలు రంగు.ప్రభుత్వం అలా చేయకపోతే లేదా తమకు ప్రత్యర్ధులుగా వున్నవారిని మాత్రమే పోలీసు యంత్రాంగం ద్వారా లక్ష్యంగా చేసుకుంటే ఎస్‌సి, ఎస్‌టి కేసుల మాదిరి నయీం ముఠాపై దాఖలైన కేసులు నీరు గారి పోయి, రాబోయే తరాలకు మరింత వుత్సాహమిస్తాయి. ఇప్పటివరకు గ్యాంగస్టర్లపై నమోదు చేసిన కేసులలో వారితో చేతులు కలిపిన వారిని శిక్షించిన దాఖలాలు లేవు. ఒక వేళ అలాంటివి వున్నా ప్రభుత్వం బయట పెట్టి వాస్తవాలను తెలియచేయాలి. అప్పుడే ఎవరైనా ఫిర్యాదు చేయటానికి ముందుకు వస్తారు. రాబోయే రోజుల్లో చిన్న గ్యాంగులు పెద్ద గ్యాంగులుగా మారకుండా చర్యలు తీసుకోవటానికి నిజాయితీగల యంత్రాంగం ముందుకు వస్తుంది.జోక్యం చేసుకొనే పెద్దలు వెనక్కు తగ్గుతారు.

    అలా చేయకపోతే చిత్తశుద్ధిలేని మీడియాలో నయీం గురించి మరికొద్ది రోజులు చదువుకుంటాం. అతగాడి వారసులు రంగంలోకి వచ్చిన తరువాత మీడియాలో వారి గురించి ఒక్క ముక్కా రాదు. ఆ గూండాలు అంతమైన తరువాత అదే మీడియా మరోసారి విజృంభిస్తుంది. కొత్త కథలను వండివారుస్తుంది. యధాప్రకారమే పోలీసు అధికారులు వారిని మేము ఇతర అవసరాలకు వుపయోగించుకున్నాం గానీ, ఇంత ముదురుతారని వూహించలేకపోయాం అంటారు. అతనెవరో కూడా నాకు తెలియదు గానీ అంతమొందించాలని నేను సూచిస్తే పాలకులు అంగీకరించలేదు అని కూడా చెబుతారు. వాటిని నోరు మూసుకొని,చెవుల్లో పూలు పెట్టుకొని జనం నమ్మాలి. ఎవరైనా కాదంటే పాలకులు, పోలీసులు, గూండాలు కలసి వారి అంతు చూస్తారు.అన్ని దోపిడీ వ్యవస్థలు, ప్రాంతాలలో జరుగుతున్నది ఇదే, ఇక్కడా జరగబోయేది అదే.

    ఇలాంటి వారిని అంతం చేస్తే చాలదు, ఇంతింతై వటుడింతై అన్నట్లుగా వారిని తయారు చేస్తున్న వ్యవస్ధను నాశనం చేసి కొత్త సమాజానికి పునాదులు వేయటమే పరిష్కారం. పేరుదేముంది దానికి ఎవరికి నచ్చిన పేరు వారు పెట్టుకోవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d