• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Others

కూలుతున్న హిందూత్వ గోడలు :ఆర్‌ఎస్‌ఎస్‌ను ఠారెత్తిస్తున్న సిక్కు-ముస్లిం-జాట్‌ల ఐక్యత !

26 Friday Nov 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Prices, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

#Hindutva, BJP, farm acts repeal, farm laws, Farmers agitations, Hindutva groups, Jats, Muslims, Narendra Modi, Narendra Modi Failures, RSS, Sikhs


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ సాగు చట్టాలను వెనక్కు తీసుకొని రైతులకు క్షమాపణలు చెప్పారు. సాధించిన మహత్తర విజయం తో యావత్‌ కష్టజీవులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.దీనిలో భాగస్వాములు కాని వారు కార్పొరేట్‌లు, వారికి మద్దతు ఇస్తున్న స్వదేశీ జాగరణ మంచ్‌ వంటి సంస్ధలను పుట్టించిన సంఘపరివారం, దాని ఇతర ప్రత్యక్ష -పరోక్ష సంతతి, సాగు చట్టాలకు మద్దతు ఇచ్చిన వారు మాత్రమే. ఈ మద్దతుదార్ల పరిస్ధితి మరీ ఘోరం. చట్టాల రద్దు గురించి నోరెత్తలేరు. తప్పు తెలుసుకున్నా సంతోషంలో భాగస్వాములు కాలేరు.ఇంకా సాధించాల్సిన డిమాండ్ల గురించి తదుపరి కార్యాచరణ గురించి రైతులు ఆలోచిస్తున్నారు. కరవమంటే కప్పకు కోపం-విడవమంటే పాముకు ఆగ్రహం అన్నట్లుగా రైతులు, ఇతర తరగతుల డిమాండ్లకు మద్దతు ఇవ్వకపోతే వారికి దూరం, సంఘీభావం తెలిపితే నరేంద్రమోడీ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది కనుక రాజకీయ మేథోమద్దతుదారులు దిక్కుతోచని స్ధితిలో పడ్డారు. ఇక నరేంద్రమోడీ వెనుకడుగుకు కారణాలు ఏమిటి అన్న చర్చ పరిపరివిధాలుగా సాగుతోంది. వాటిలో ఒకటి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్లుగా సంఘపరివారం(ఆర్‌ఎస్‌ఎస్‌) మీదకు మళ్లింది. ఒక నాటకం లేదా సినిమాలో మనకు తెర మీద తైతక్కలాడే నటీ నటులు మాత్రమే కనిపిస్తారు.దర్శకత్వం, మాటలు, పాటలు, నేపధó్య నిపుణులు మనకు దర్శనమివ్వరు. బిజెపి నేతలు అగ్ర నటులైతే, ఇతరులు సహాయ, జూనియర్‌ ఆర్టిస్టులు కాగా తెరవెనుక నిపుణులు ఆర్‌ఎస్‌ఎస్‌ వారు అన్నది తెలిసిందే. హిట్‌ అనుకున్న ” సాగు చట్టాలు – నరేంద్రమోడీ క్షమాపణ ” అనే మహా ప్రదర్శన ఫట్‌ మంది.


ఏడాది కాలంలో జరిగిన పరిణామాలు సంఘపరివారానికి చెమటలు పట్టిస్తున్నట్లు చెప్పవచ్చు. అది రైతులు, దేశం గురించి అనుకుంటే తప్పులో కాలేసినట్లే. పలువురు ముందుకు తెచ్చిన అంశాలను చూస్తే వారికి తమ హిందూత్వ పధకానికి ఎసరు వస్తోందన్నదే అసలైన ఆందోళన కారణంగా చెప్పవచ్చు. ఇండియా టుడే హిందీ పత్రిక మాజీ మేనేజింగ్‌ ఎడిటర్‌ దిలీప్‌ మండల్‌ అభిప్రాయం ప్రకారం సాగు చట్టాల రద్దు ఎందుకు అన్నదానికి సమాధానం ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌ ఎన్నికల కంటే సావర్కర్‌ రాసిన అంశాల్లో దాగుంది. దిలీప్‌ మండల్‌ రాసినదాని సారాంశం ఇలా ఉంది. సాగు చట్టాల రద్దు ప్రకటనకు మోడీ సిక్కులు పవిత్రంగా పరిగణించే గురుపూర్ణిమ రోజును ఎంచుకుంటే అదే రోజు ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చత్తీస్‌ఘర్‌ రాజధాని రాయపూర్‌ లోని ఒక గురుద్వారాలో ప్రణమిల్లారు. పంజాబ్‌ ఎన్నడూ ఎన్నికల రంగంలో బిజెపికి ముఖ్యం కాదు, దేశ విభజన సమయంలో ఉత్తర ప్రదేశ్‌లోని తెరాయి, పశ్చిమ ప్రాంతంలోని అరడజను జిల్లాలో భూములు పొందిన సిక్కులు పరిమిత ప్రభావమే చూపుతారు. ఎన్నికల కంటే వి.డి. సావర్కర్‌ ఊహించిన హిందూత్వ భావనే హిందూత్వ దళానికి ముఖ్యం. మిమ్మల్ని మేము(ఆర్‌ఎస్‌ఎస్‌) మరో ముస్లింగా చూడటం లేదని సిక్కులకు చెప్పటమే సాగు చట్టాల రద్దు సందేశం. హిందూత్వలో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపికి సిక్కుల అవసరం తప్పనిసరి. ” హిందూత్వ అనివార్యతలు ” అనే తన పుస్తకంలో భారత్‌లో విమర్శకు అతీతులైన సామాజిక తరగతి హిందువుల తరువాత ఏదైనా ఉందంటే వారు పంజాబ్‌లోని మన సిక్కు సోదరులు మాత్రమే. సప్త సింధు ప్రాంతంలోని సింధు లేదా హిందువుల ప్రత్యక్ష వారసులు సిక్కులు మాత్రమే అని రాశారు. నేటి సిక్కులు నిన్నటి హిందువులు, నేటి హిందువులు రేపటి సిక్కులు కావచ్చు. దుస్తులు, సంప్రదాయాలు, రోజువారీ జీవనంలో మార్పులుండవచ్చు తప్ప వారి రక్తం, జన్యువులు మారవని చెప్పారు. తన పుస్తకంలో అరవైసార్లు సిక్కులను సావర్కర్‌ ప్రస్తావించారు.


దిలీప్‌ ఇంకా ఇలా చెప్పారు. ” అన్ని మతాలకు చెందిన రైతులు ఈ ఉద్యమంలో భాగస్వాములు, వారి డిమాండ్లన్నీ ఆర్ధికపరమైనవి, ప్రభుత్వ విధానాలతో సంబంధం కలిగినవే.హిందూ, ముస్లిం నేతలను అన్ని ప్రతినిధి వర్గాలు, పత్రికా సమావేశాలలో భాగస్వాములను చేయటం ద్వారా రైతుల ఆందోళన మతపరమైనదిగా కనిపించకుండా చూసేందుకు అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక అభిప్రాయాన్ని సృష్టించారు-ఉద్ధేశ్యపూర్వకంగా చేసిన దానిలో భాగం కావచ్చు – అదేమంటే ప్రభుత్వం సిక్కులను అణచివేస్తున్నది. బిజెపి దీన్ని ఎన్నడూ కోరుకోలేదు.ఒక పరిమితిని దాటి సిక్కులు దూరం కావటం హిందుత్వ భావం, ఆర్‌ఎస్‌ఎస్‌కు విరుద్దమైనది కనుక బిజెపి అంతిమంగా సన్నిహితం కావటానికి నిర్ణయించింది.ఈ నిర్ణయం తీసుకొనేందుకు బిజెపి ఎందుకు ఇంత సమయం తీసుకుందని ఎవరైనా అడగవచ్చు. అర్ధిక అజెండా-భావజాలం మధ్య వైరుధ్యం ఉంది కనుకనే బిజెపి నిర్ణయం చేసేందుకు వ్యవధి తీసుకుంది. కచ్చితంగా చెప్పలేము గానీ గురుగ్రామ్‌లో జరిగిన ఒక చిన్న సంఘటన నిర్ణయాత్మకం గావించి ఉండవచ్చు. అక్కడ శుక్రవారం నాడు బహిరంగ స్ధలంలో నమాజు చేయటం గురించి వివాదం ఉంది. పట్టణంలోని సాదర్‌ బజార్‌ గురుద్వారా కమిటీ తమ ప్రాంగణంలో నమాజ్‌ చేసుకోవచ్చని స్వాగతం పలికింది. ఆ మేరకు నమాజైతే జరగలేదు గానీ సిక్కులు-ముస్లింలు దగ్గర అవుతున్నారనే భావన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ను వణికించి ఉండవచ్చు. 2020 ప్రారంభంలో అలాంటి సౌహార్ధ్రత ఢిల్లీలోని షహీన్‌ బాగ్‌లో జరిగిన సిఎఎ-ఎన్‌ఆర్‌సి వ్యతిరేక నిరసన సందర్భంగా స్పష్టంగా వ్యక్తమైంది. నిరసనకారులకు వండిన ఆహారాన్ని తాజాగా అందించేందుకు సిక్కులు ఒక వంటశాలను అక్కడ ఏర్పాటు చేశారు. రైతు ఉద్యమంలో ప్రధానమైన సిక్కులు తమకు దూరం కావటం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లను గడగడలాడించింది.” అని దిలీప్‌ పేర్కొన్నారు.


పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో జాట్‌ – ముస్లిం మతపరమైన విభజన గోడ కూలిపోతుండటాన్ని బిజెపి గమనించటం మోడీ సాగు చట్టాలను వెనక్కు తీసుకొనేట్లు చేసిందని మానవహక్కుల కార్యకర్త విద్యాభూషణ్‌ రావత్‌ తన విశ్లేషణలో పేర్కొన్నారు. దానిలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. సాగు చట్టాల రద్దుకు సాగిన ఆందోళనతో బిజెపి తన దీర్ఘకాల మిత్రపక్షాలలో ఒకటైన అకాలీదళ్‌ను కోల్పోయింది. రైతుల్లో కనిపించిన రాజకీయ అవగాహన పట్టణాల్లో ఆంగ్లం మాట్లాడే మధ్యతరగతి వారికంటే ఎంతో ఉన్నతంగా ఉంది.2013లో తెచ్చిన భూసేకరణ చట్టంలో సహేతుకమైన పరిహారంతో పాటు, కఠిన నిబంధనలు, రైతుల సమ్మతి వంటి అంశాలు ఆ తరువాత దేశంలో రైతుల నిరసనలు తగ్గటానికి ఒక కారణంగా విశ్లేషణలు వెల్లడించాయి.గత రెండు సంవత్సరాల్లో అనేక జాతీయ సమ్మెలు, రైల్‌, రోడ్డు రోకో, బందులు జరిగాయి. పోలీసులు అణచివేతకు పాల్పడినా కూడా శాంతియుతంగా జరిగాయి.లఖింపూర్‌ ఖేరీలో మోటారు వాహనాలను ఎక్కించి రైతులను చంపిన ఉదంతంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్న తరువాతే నిందితుడైన కేంద్ర మంత్రి కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి ఎంత విలువ ఇస్తుందో ఈ ఉదంతం వెల్లడించింది.


సాగు చట్టాల రద్దు ప్రకటన చేసిన తీరు తీవ్ర అభ్యంతరకరం, రాజ్యాంగ వ్యతిరేకం. ప్రధాని లేదా ఏ మంత్రైనా విధానపరమైన అంశాలను పార్లమెంట్‌ వెలుపల ప్రకటించకూడదు.( ప్రధాని ప్రకటన నాటికే పార్లమెంటు సమావేశాల నోటిఫికేషన్‌ వెలువడింది. కాబినెట్‌ ఆమోదమూ లేదు) మోడీ, బిజెపి ప్రతిదాన్నీ తమ రాజకీయ లాభనష్టాల అంకెల మేరకు చేస్తారు. సాగు చట్టాల రద్దు రైతులపై ప్రేమతో తీసుకున్న చర్య కాదని, ఎన్నికలకోసం చేసిందని ఎవరూ మరిచి పోకూడదు.పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో ప్రత్యేకించి జాట్లు గత రెండు దశాబ్దాలలో బిజెపి మద్దతుదార్లుగా మారారు. దేశ రాజకీయాలను మండలీకరణ గావించిన తరువాత జాట్లు మరింతగా అగ్రకుల పార్టీల వైపు మొగ్గారు, బిజెపి వారికి సహజమైనదిగా కనిపించింది. 2013 ముజఫర్‌నగర్‌ ఘర్షణల ద్వారా వ్యవసాయ ప్రాంతంలో బిజెపి హిందూత్వ అజెండాను ముందుకు తీసుకుపోయింది. ఆ ఉదంతంలో ఆప్రాంతంలో ముస్లింలను వేరు చేశారు, అవాంఛనీయమైన వారిగా చేశారు. ఈ సమీకరణను బిజెపి తన అధికార క్రీడలో ఎల్లవేళలా ఉపయోగించుకుంది. అయితే ఈక్రమంలో జాట్‌లు రాజకీయంగా ఆరోవేలుగా మారిపోయారు.దానికి తోడు జాట్‌లు బిజెపికి ఓటు చేసిన హర్యానాలో ఖత్రి సామాజిక తరగతికి చెందిన నేతను ముఖ్యమంత్రిగా చేశారు. రైతు ఉద్యమం జాట్‌ల పూర్వపు ఔన్నత్యం, ముస్లింతో మమేకం కావటాన్ని ముందుకు తెచ్చింది.వాస్తవానికి జాట్‌-ముస్లిం ఐక్యత బిజెపి ఆలోచనలో ఆఖరాంశం. అది పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో పార్టీకి తీవ్ర విపత్కర పరిస్ధితిని సృష్టిస్తుంది, అక్కడ పార్టీనేతలు తమ నియోజకవర్గాలకు వెళ్లలేనిదిగా మారింది.


మోడీ నిర్ణయం వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ దాగుందని అవుట్‌లుక్‌ పత్రిక విశ్లేషకుడు స్నిగ్దేందు భట్టాచార్య పేర్కొన్నారు. సారాంశం ఇలా ఉంది.” సాగు చట్టాలపై సిక్కు సామాజిక తరగతిలో తలెత్తిన వేదన వారిని ముస్లింలకు సన్నిహితం చేసినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు గమనించారు. ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలే సాగు చట్టాలు వెనక్కు తీసుకొనేందుకు కారణం అనుకుంటే గురునానక్‌ జయంతి రోజునే ప్రకటనకు ఎందుకు ఎంచుకుంటారు ? బిజెపి సైద్దాంతిక మాతృక ఆర్‌ఎస్‌ఎస్‌ హిందుత్వ లేదా హిందూ సాంస్కృతిక జాతీయవాదంలో సిక్కిజం అంతర్భాగం కనుక ఈ పని చేశారని ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ సిద్దాంతవేత్త ఒకరు తన గుర్తింపును వెల్లడించవద్దనే షరతుతో అవుట్‌లుక్‌ ప్రతినిధికి చెప్పారు. సాగు చట్టాలపై సిక్కుల వేదన వారిని ముస్లింలకు సన్నిహితులను చేస్తోంది.పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) వ్యతిరేకించే ఆందోళన నిర్వాహకులు సాగు చట్టాల నిరసనకారులకు ఎలా దగ్గర అవుతున్నారనే అంశంపై మాకు నిర్దిష్ట సమాచారం ఉంది. గురుగ్రామ్‌లోని గురుద్వారా నిర్వాహకులు తమ ప్రాంగణంలో నమాజు చేసుకోవచ్చన్న ఇటీవలి ఉదంతాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాము.దేశంలో ఉద్భవించిన అన్ని రకాల విశ్వాసులను ఏకం చేయాలన్న మా దీర్ఘకాలిక ప్రణాళికకు ఇవి ఆందోళన కలిగించే ధోరణులు ‘ అని సిద్దాంతవేత్త చెప్పారు.

ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ విశ్వహిందూపరిషత్‌తో సహా ఇతర సంస్ధలన్నీ భారత్‌లో జన్మించిన మతాలు అంటే బౌద్దం, జైనం, సిక్కు అన్నీ హిందూ సాంస్కృతిక గుర్తింపులో భాగమే అని, దురాక్రమణదారుల మతమైన ఇస్లాం దానికి విరుద్దమని భావిస్తున్నాయి. బిజెపి సారధ్యంలోని ప్రభుత్వ విధానాలపై తన ప్రభావం ఏమీ ఉండదని లాంఛనంగా ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతుంది. విష్ణుమూర్తి పదవ అవతారమే బుద్దుడని, ముస్లిందురాక్రమణదారుల మీద సిక్కులు తమ శౌర్యాన్ని ప్రదర్శించారన్నట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ సాహిత్యంలో చిత్రించారు. సిక్కులతో వైరానికి ముగింపు పలికేందుకు వెనక్కు తగ్గుతున్నాము, సిక్కులు ముస్లింలతో సన్నిహితం కావటంలో ఆర్ధిక ప్రయోజనం తప్ప మరొకటి లేదని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ రైతు సంఘనేత చెప్పినట్లు అవుట్‌లుక్‌ పేర్కొన్నది.ఆర్‌ఎస్‌ఎస్‌ నేపధ్యం కలిగిన బిజెపి నేత ఒకరు మాట్లాడుతూ రైతు ఉద్యమ సమయంలో ప్రభుత్వ విధానాలను సమర్ధించేవారిలో కొందరు అత్యుత్సాహపరులు నిరసనకారులను ఖలిస్తానీలని చిత్రించారు. అది సిక్కులలో ఒక పెద్ద భాగాన్ని హిందూత్వను ప్రబోధించే వారికి వ్యతిరేకులను చేసింది. మా హిందూ భావజాలంలో సిక్కులు కూడా ఉన్నారు. ప్రతి నిజమైన సిక్కు హృదయంలో చూస్తే హిందువే అని గురూజీ గోల్వాల్కర్‌ చెప్పేవారు. ఈ ఆందోళన హిందువులందరినీ ఏకం చేయాలన్న మా ముఖóó్య అజెండాకు ఈ నిరసన హాని చేసింది. సంస్ధల ఉన్నతనేతలు ఈ అంశాన్ని చూస్తున్నందున తాము బహిరంగంగా అభిప్రాయాలను చెప్పలేమని ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నేతలు చెప్పినట్లు ఆవుట్‌లుక్‌ పేర్కొన్నది.


సాగు చట్టాలపై రైతుల ఆగ్రహం కేవలం ఉత్తర ప్రదేశ్‌లో బిజెపికి సవాలు మాత్రమే కాదని ది ఫెడరల్‌ డాట్‌ కామ్‌ ప్రతినిధి పునీత్‌ నికోలస్‌ యాదవ్‌ తన విశ్లేషణలో పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ను వికాస పురుషుడిగా చిత్రిస్తూ ప్రచారం ప్రారంభమైంది. సాగు చట్టాల రద్దుపై మోడీ ప్రకటనకు కొద్ది రోజుల ముందు రెండు భిన్న బృందాలు సర్వేలు నిర్వహించాయి. సిఓటర్‌-ఎబిపి సర్వే ప్రకారం 403 స్ధానాల్లో 2017లో బిజెపి తెచ్చుకున్న 312లో వంద సీట్లు తగ్గుతాయి చెప్పగా పోల్‌స్టార్ట్‌-టైమ్స్‌ నౌ సర్వే ప్రకారం 213-245 మధ్యవస్తాయని పేర్కొన్నారు.1989 తరువాత ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ మరోసారి నెగ్గని ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి తిరిగి అధికారంలోకి రావటం పెద్ద అసాధారణ కృత్యమే. ఇప్పటి వరకు మోడీ విధానాలు, రాజకీయాలను ఎవరూ మార్చలేరని అనుకొనే వారు, సాగు చట్టాలను రద్దు చేసిన తరువాత రోడ్ల మీద జనం ఇప్పుడు మోడీ భయపడ్డారని అనుకుంటున్నారు, కొద్ది నెలలో ఎన్నికలు జరగనుండగా ఇది మాకు మంచిది కాదని ఉత్తర ప్రదేశ్‌ మంత్రి ఒకరు చెప్పారు. లోక్‌సభ సభ్యుడు సాక్షి మహరాజ్‌ వంటి మా నోటి తుత్తర నేతలు ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు ముగిసిన తరువాత సాగు చట్టాలను తిరిగి తీసుకువస్తారని బహిరంగంగా ప్రకటించారు, ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల కోసమే వెనక్కు తీసుకున్నారని అనుకుంటుండగా మేము రైతుల విశ్వాసాన్ని తిరిగి పొందగలమని మీరెలా అనుకుంటారని ఒక ఎంఎల్‌ఏ ప్రశ్నించినట్లు ఫెడరల్‌ పేర్కొన్నది. . ఈ దిగజారిన పరిస్దితిలో రైతుల మీద కార్లను తోలి నలుగురు రైతులను చంపిన లఖింపూర్‌ ఖేరీ ఉదంతానికి బాధ్యుడిని చేస్తూ కేంద్ర మంత్రి అజయ మిశ్రాను తొలగించాలన్న డిమాండును నెరవేర్చకపోవచ్చు.అదే జరిగితే ఆదిత్యనాధ్‌ ఠాకూర్లకు ప్రాధాన్యత ఇచ్చి తమను నిర్లక్ష్యం చేస్తున్నారని భావిస్తున్న బ్రాహ్మణులను మరింతగా కలవర పెట్టవచ్చు.(తొలగించకపోతే రైతులు తేల్చుకుంటారు) ఏడాది క్రితం వరకు బిజెపి, యోగి నడక నల్లేరు మీద బండిలా ఉంటుందని మొత్తం మీద అందరూ అనుకున్నారు.రైతుల ఆందోళన, హత్రాస్‌లో దళిత యువతిపై అత్యాచారం, హత్య,కరోనా రెండవ తరంగం,బిజెపి 2014లో ఏర్పాటు చేసిన కులాల కుంపటిలో కుమ్ములాటలు పరిస్ధితిని మార్చివేశాయని ఫెడరల్‌ పేర్కొన్నది.


సంఘపరివార్‌ బహిరంగంగా ఎన్నడూ సాగు చట్టాలను వ్యతిరేకించటం లేదా చట్టాల రద్దును సమర్ధించటం గానీ చేయ లేదని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో దీప్తిమన్‌ తివారీ పేర్కొన్నారు.హిందువు-సిక్కుల మధ్య గండి ఏర్పడుతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ భయపడిందని, సమస్యను పరిష్కరించలేని కేంద్ర అసమర్ధత గురించి హెచ్చరిస్తూ ఇబ్బందికి గురైందని కూడా పేర్కొన్నారు. ఫిబ్రవరిలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ జోషి మాట్లాడుతూ సామాజిక ఐక్యత మీద చూపుతున్న ప్రభావం గురించి ఆందోళన చెందారు. ఇలాంటి చట్టాలను ఏ దేశంలోనూ వెనక్కు తీసుకోలేదని అన్నారు. గతేడాది దసరా ఉపన్యాసంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ సాగు చట్టాలను సమర్ధించారు.


భిన్నమైన సామాజిక తరగతులు ఐక్యంగా ఉద్యమాన్ని విస్తరించేందుకు పూనుకోవటం సర్వాంగీకార స్వభావాన్ని సంతరించుకోవటం ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి కూటమికి మనస్తాపాన్ని కలిగించిందని జర్నలిజం ప్రొఫెసర్‌ నళిన్‌ వర్మ పేర్కొన్నారు. రైతుల నిరసన బిజెపి హిందూత్వ రాజకీయాలకు సవాలుగా మారిందని, నిరసనకారులు ఇతర జీవన్మరణ సమస్యలపై సామాజిక న్యాయం నుంచి పౌరహక్కుల వరకు ఉద్యమాన్ని విస్తరించేందుకు అంగీకరించారని పేర్కొన్నారు. ప్రభుత్వం మీద ఇప్పటికీ రైతుల్లో అనుమానాలు పెద్ద ఎత్తున ఉండగా వాటిని మరింతగా పెంచేరీతిలో రాజస్తాన్‌ గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా, ఎంపీ సాక్షి మహరాజ్‌ మాట్లాడుతూ ఈ చట్టాలను తిరిగి చేస్తారని చెప్పారు. రైతులు కోరుతున్న డిమాండ్లను ఆచరణ సాధ్యం కానివని, అరాచకాన్ని పెంచుతాయని ఇప్పుడు అమితాసక్తిగల ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి మద్దతుదారులు చిత్రించుతున్నారు. నిజానికి వారు కొత్తగా జతచేసిన డిమాండ్లేవి లేవు. ఎంఎస్‌పి డిమాండు మూడు చట్టాలకంటే పాతదే, దానికి చట్టబద్దత కల్పించాలన్న కోరిక 2011లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ సంతకం చేసి అందచేసిన మెమోరాండంలో ఉన్న అంశమే. 2014లో ఓట్ల కోసం అనేక సభల్లో మోడీ చెప్పినదే.


1974నాటి జయప్రకాష్‌ నారాయణ సంపూర్ణ విప్లవానికి, ఇప్పుడు రైతు ఉద్యమానికి కొన్ని పోలికలు ఉన్నాయి. గుజరాత్‌లో ఒక హాస్టల్లో ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా తలెత్తిన నిరసన జెపి ఉద్యమానికి నాంది. రైతులు తొలుత పంజాబ్‌లోనే ఆందోళనకు దిగారు. విద్యార్ది ఆందోళన ఉత్తరాదిన అనేక ప్రాంతాలకు విస్తరించినట్లుగానే రైతు ఉద్యమం హర్యానా,హిమచల ప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్తాన్‌,మధ్యప్రదేశ్‌లకు విస్తరించి దక్షిణాదిన మద్దతు పొందింది. జెపి ఉద్యమం తొలుత విద్యార్దులతో ఉన్నప్పటికీ తరువాత జనసంఫ్‌ు(బిజెపి పూర్వరూపం) లోక్‌దళ్‌, డిఎంకెపి, ఇతర సోషలిస్టు, మితవాద పార్టీలన్నీ చేరాయి. చివరకు అవన్నీ జనతా పార్టీగా ఏర్పడ్డాయి.


జాగ్రత్తగా రూపొందించిన హిందూత్వ భావజాలానికి తగిన సామాజిక విభజనపై మోడీ-అమిత్‌షా రాజకీయాలు వృద్ది చెందాయి. హర్యానాలో జాట్‌-జాటేతర కులాల ప్రాతిపదికన బిజెపి రాజకీయాలు చేసింది, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో కొట్లాటలతో జాట్లకు పోటీగా ముస్లింలను నిలిపారు.ములాయం సింగు యాదవ్‌ కుటుంబాన్ని చీల్చారు. లాలూ యాదవ్‌ ఇంట్లో తగాదాలు పెట్టారు అని రాకేష్‌ తికాయత్‌ దీని గురించి వక్కాణించారు. హిందూత్వ ఆధిపత్య రాజకీయాలకు సవాలుగా జీవన సమస్యలపై చివరికి రాజకీయ పార్టీలు ఏకమౌతాయా అన్నది చూడాల్సి ఉంది. సాగు చట్టాల రద్దు తరువాత నవంబరు 22న గోరఖ్‌పూర్‌లో జరిపిన సభలో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్‌లో మహమ్మదాలీ జిన్నా (పాకిస్తాన్‌) మద్దతుదార్లను వ్యతిరేకించాల్సిన బాధ్యత జాతీయవాదుల మీద ఉందని పిలుపునిచ్చారని నళిన్‌ వర్మ తన విశ్లేషణలో పేర్కొన్నారు.


నరేంద్రమోడీ సర్కార్‌ చర్య పర్యవసానాలు పరిణామాల గురించి వెలువడిన మరికొన్నింటిని స్ధలాభావం వలన సృజించటం లేదు. రానున్న రోజుల్లో మరిన్ని విశ్లేషణలు వెలువడుతాయి. బిజెపి కనుసన్నలలో నడిచే మీడియా వాటికి తగిన చోటు కల్పించినా కల్పించకపోయినా అవి జనంలో ఏదో ఒక రూపంలో వెళతాయి. హిందూత్వ రాజకీయాలు, ఎత్తుగడలను మరింతగా బట్టబయలు చేస్తాయి. నీవు జనాలందరినీ కొంతకాలం వాజమ్మలుగా చేయవచ్చు,కొందరిని ఎల్లకాలం చేయవచ్చు గానీ, అందరినీ అన్ని వేళలా చేయలేవన్న అబ్రహాం లింకన్‌ మాటలను, ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో తెలుసుకోనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు అన్న లెనిన్‌ బోధను ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా సదా గుర్తుంచుకోవాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీకి యావత్‌ దేశం ” కృతజ్ఞతలు ” చెప్పాలి మరి !

21 Sunday Nov 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

BJP, farm laws, Farmers agitations, Farmers Delhi agitation, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ఒక ధుర్యోధనుడు, ఒక రావణుడు, ఒక ముస్సోలినీ, ఒక హిట్లర్‌, ఒక జారు చక్రవర్తి, ఒక ఇందిరాగాంధీ, ఒక నరేంద్రమోడీ చరిత్రను మలుపుతిప్పే మహానుభావుల పరంపర ఇది. కొంత మంది నమ్ముతున్నట్లు విధి లిఖితం ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది. ఇలాంటి ప్రతినాయకుల జన్మ ప్రతి కాలంలోనూ పునరావృతం అవుతున్నందున ఆ క్రమంలోనే ప్రజా నాయకులు కూడా పుట్టుకువస్తారు. ఇప్పుడు రైతుల రూపంలో అదే జరిగింది. కొందరు త్యాగధనులు ఉద్యమాలకు ఊపిరిలూదుతారు. రైతు ఉద్యమం అనేక పోరాటాలకు ఊతమిచ్చింది. యాభై ఆరుగాదు 112 అంగుళాల గుండెలున్నవారిని కూడా పిండిచేయగలమని, దిగివచ్చేట్లు చేయగలమనే ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. బ్రిటీష్‌ వారిని పారద్రోలాలనే ఏకైక లక్ష్యం భిన్న రాజకీయ ధోరణులు కలిగిన వారిని ఒక దగ్గరకు చేర్చింది. ఆ తరువాత అత్యవర పరిస్ధితి విధింపు కొంత మేరకు అందుకు దోహదం చేసింది. ఇప్పుడు అంతకంటే మరింత ప్రాముఖ్యత కలిగినదిగా దేశంలో రైతుల ఆందోళన ఒక మహత్తర దృశ్యానికి తెరతీసింది. అందుకు పురికొల్పిన ” మహానుభావుడు” ప్రధాని నరేంద్రమోడీకి యావత్‌ జాతి కృతజ్ఞతలు చెప్పాలి కదా !


చరిత్రలోని ప్రతినాయకులందరికీ వారి తీరుతెన్నులను చూసి ఇది తగదు, అది తగని పని అంటూ వారి మంచి కోరుకొనే వారు చెప్పినా వినిపించుకోలేదన్నది చరిత్ర, సాహిత్యం చెప్పిన సత్యం. విధి లేదా తలరాత అలా రాసి ఉంటుంది మరి. ముస్లింలపై గుజరాత్‌లో జరిగిన మారణకాండ సమయంలో రాజధర్మాన్ని అనుసరించాలని నాటి ప్రధాని అతల్‌బిహారీ వాజ్‌పాయి హితవు చెప్పారు. వాజ్‌పాయిగారు ఏదైతే చెప్పారో సరిగ్గాదాన్నే పాటిస్తున్నా అని అదే వేదిక మీద ముఖ్యమంత్రి నరేంద్రమోడీ చెప్పారు. పూర్వకాలపు మనిషి గనుక వాజ్‌పాయి మరోదారి లేక అవును ఆయన అదే చేస్తున్నారు అని చెప్పకతప్పలేదు.సీత గీత దాటకపోతే రామాయణమే లేదు. పాండవులకు ఐదూళ్లు ఇచ్చి ఉంటే మహాభారతమే ఉండేది కాదు. సాగు రాష్ట్రాల అంశమైనా వాటితో సంప్రదించకుండా కరోనా తాండవిస్తుంటే ఆర్డినెన్సుల రూపంలో రుద్దటం, తరువాత వాటి మీద పార్లమెంటులో చర్చ లేకుండా ఆమోదం, రాష్ట్రపతి ముద్ర వెనుక ఏదో ఒక మహత్తరశక్తి లేకపోతే మానవమాత్రులను అలా చేయిస్తుందా ? అందుకుగాను ” నిమిత్తమాత్రుడైన ” నరేంద్రమోడీకి కృతజ్ఞతలు చెప్పకపోవటం తప్పుకదా !


కరోనా నివారణకు చప్పట్లు, కంచాలు, గిన్నెలు మోగించాలంటే ఆ పని చేశారు. దివ్వెలు వెలిగించమంటే గౌరవభావంతో వెలిగించారు. ఏ కతలు చెబితే వాటిని నమ్మారు కదా అని బతుకు దీపాలనే ఆర్పుతాం అంటే రైతులు సహిస్తారా ? సాగు చట్టాల గురించి కూడా నరేంద్రమోడీకి హితవు చెప్పిన వారు లేకపోలేదు. జనంతో సంబంధం లేని, కార్పొరేట్లకు సేవలు చేసే జయప్రకాష్‌లు, జనాల మీదకు ఎక్కే ఆర్నాబ్‌లు, గుడ్డిగా సమర్ధించే ప్రాంతీయ పార్టీల నేతలమద్దతు, కార్పొరేట్‌లు కళ్ల ముందు కనిపిస్తుంటే రైతుగోడు వినిపించుకొనే తీరిక ఎక్కడుంటుంది పాపం ! విదురనీతి, హితవచనాలు విని ఉంటే రైతు భారతం ఎలా జరుగుతుంది? మోడీ క్షమాపణలు చెప్పేంతవరకు ఉద్యమం గురించి పట్టని ఇతర రైతులు, తలకు ఎక్కించుకోని ఇతర జనాలకు కిక్కు దిగేది కాదు, యావత్‌ ప్రపంచానికి తెలిసేది కాదు కదా ! అంతటి కనువిప్పు కలిగించి మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పకపోవటం ” క్షంతవ్యం ” కాదేమో !


సంచలనాలు సృష్టించటం బలవంతులకే కాదు బలహీనులకూ, పిరికిబారిన వారికీ సాధ్యమే. తిరుగులేని రామబాణం కలిగినట్లు చెప్పే రాముడూ పరువు కోసం సీతను కష్టాల పాలు చేసిన బలహీనతకు గురైన సంగతి తెలిసిందే. రామాయణంలో రాముడు, రావణ పాత్రలకు ఎంత ప్రాధాన్యత ఉందో రాముడిని తప్పుపట్టిన రజకుడికీ అంతే ఉంది ! నరేంద్రమోడీలో చాలా మందికి వారు రాజకీయంగా వ్యతిరేకించే లేదా అనుకూలించే వారికి ఇప్పటి వరకు ఒక రూపమే కనిపించింది. ఎన్ని విమర్శలు ఎదురైనా తాను చేయదలచుకున్నదానిని చేస్తారని గుజరాత్‌ మారణకాండ సమయంలో అభిమానుల్లో పేరు తెచ్చుకున్నారు. ఇతరుల్లో భయం పుట్టించారు. తాము కోరుకున్న సంస్కరణలను అమలు జరిపేందుకు జనాన్ని అవసరమైతే అణచివేసే బాహుబలుడిని కార్పొరేట్లకు నరేంద్రమోడీలో చూపింది కూడా అదే. కట్టుకున్న ఇల్లాలిని కూడా విస్మరించి దేశం కోసం సంఘపరివార్‌ పెంచిన బిడ్డగా నరేంద్రమోడీకి రెండు బాధ్యతలున్నాయి. ఒకటి సమాజాన్ని వెనక్కు నడపాలనే తిరోగామి హిందూత్వ కాగా, రెండవది దానికి అధికారం, అందుకోసం అవసరమైన కార్పొరేట్ల ఆసరా. రెండూ సాధించారు గానీ రెండు కత్తులు ఒక ఒరలో ఇమడవు.

హిందూత్వను అమలు జరిపేందుకు స్వమతమౌఢ్యం-పరమత ద్వేషం నింపాలి. మన దేశంలో అది చాలా ప్రమాదకరం. కార్పొరేట్లకు అంగీకారం కాదు, కొంత మేరకు వారు రాజీపడతారు తప్ప వాటిది పైచేయి కానివ్వరు. ఐరోపాలో ఫ్యూడల్‌ ప్రభువులను, ప్రభుత్వాల మీద పెత్తనం చేస్తున్న చర్చిని వదిలించుకున్న చరిత్ర తెలిసిందే. మన దేశంలో ఉన్న పరిస్ధితులను బట్టి కార్పొరేట్లు గుళ్లూ గోపురాలను కట్టించారు, మత, ఉదారశక్తులకూ మద్దతు ఇచ్చారు, భూస్వాములు, ధనిక రైతులతో రాజీపడ్డారు. భూమి కేంద్రీకరణ వారి లాభాలను అడ్డుకుంటుంది కనుక భూ సంస్కరణలను ముందుకు తెచ్చారు. గ్రామాల్లో ఉన్న భూస్వాములను, వారి కండబలాన్ని వదులుకొనేందుకు కాంగ్రెస్‌ సిద్దంగా లేనందున వాటిని నీరుగార్చింది. ధనిక రైతులను సంతుష్టీకరించే చర్యలను తీసుకుంది.

ఇప్పుడు గ్రామాల్లో కూడా పరిస్ధితులు మారాయి. ఓట్లకొనుగోలులో అక్రమాలను సహించేది లేదని హూజారాబాద్‌లో మహిళలు రోడ్డెక్కే విధంగా పరిణామాలు పురోగమించటాన్ని చూశాము.దళారీలు లేకుండా నేరుగా ఓట్లు కొనుగోలు, అందరికీ ఒకే రేటు ఇవ్వాలని కోరారు. భూస్వాముల పెత్తనం సాగదింక, అంటే కార్పొరేట్ల డబ్బుతోనే ఇక ముందు పార్టీలకు పని. కనుకనే కార్పొరేట్ల కన్ను వ్యవసాయ రంగం మీద పడింది. దీనికి తోడు బహుళజాతి గుత్త సంస్దల వత్తిడి కూడా తోడైంది. అవసరమైతే ధనిక రైతులను వదులు కొనేందుకు మోడీ సర్కార్‌ సిద్దమైంది కనుకనే ఆదరాబాదరా మూడు సాగు చట్టాలు. ఇప్పుడు వాటికి మంగళం పాడుతూ అధికారానికి ఎసరు రాకుండా చూసుకొనేందుకు కొత్త నాటకానికి తెరతీశారు. దీనివలన కార్పొరేట్లలో మోడీ మీద ఉన్న భ్రమలు తొలుగుతాయి. కొత్త బొమ్మను వెతుకుతారు. ఏడాది కాలంగా మోడీ తీరుతెన్నులను చూసిన ఏ రైతూ అంత తేలికగా బిజెపిని బలపరచడు. ఏమైనా సరే దేశాన్ని వెనక్కు నడుపుతారు, హిందూత్వను ఏర్పాటు చేస్తారని హిందూ హృదయ సామ్రాట్‌గా భావిస్తున్న శక్తులలోనూ మోడీ అనుమానాలు రేకెత్తించారు. లేదూ అలాంటిదేమీ లేదు, వ్యూహాత్మకంగానే తమ నేత వెనక్కు తగ్గినట్లు, మరింత గట్టిగా తాను చేయదలచుకున్నది చేస్తారని భక్తులు చెబుతున్నారు. కనుక ఏది జరిగినా తలెత్తే అనూహ్యపరిణామాలకు కచ్చితంగా మోడీకి కృతజ్ఞతలు చెప్పాల్సిందే.


తమ నేత ఓట్ల కోసం జనాన్ని సంతుష్టీకరించరు, దేశం కోసం అవసరమైతే కఠిన చర్యలను తీసుకొనేందుకూ వెనుకాడరంటూ ప్రజావ్యతిరేక చర్యలను సమర్ధించేందుకు పూనుకున్న వారున్నారు. మోడీ వెనక్కు తగ్గినా వారు తగ్గేట్లు లేరని సాగు చట్టాల రద్దు ప్రకటన తరువాత సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తున్న తీరు వెల్లడిస్తున్నది. ఒకసారి పులిని ఎక్కిన తరువాత అంత తేలికగా దిగుతారా ! మోడీ నిర్ణయంతో తమకు నిమిత్తం లేదు, ఆ చట్టాలు సరైనవే అని కొందరు ప్రబుద్దులు కొత్త వాదన మొదలు పెట్టారు. నరంలేని నాలికలు, అద్దె నోళ్లు ఏమైనా మాట్లాడగలవు. ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. రైతులు తమకు వ్యతిరేకమైన మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు తప్ప ఎవరూ క్షమాపణ కోరలేదే ! ఎవరైనా ఎప్పుడు అలాంటి పని చేస్తారు. తప్పుచేసి తప్పించుకొనే దారిలేక అడ్డంగా దొరికినపుడు, లేదా తీవ్రమైన తప్పిదానికి పాల్పడినపుడు చెబుతారు.

” నేను దేశ ప్రజలకు క్షమాపణ చెబుతున్నాను..సాగు చట్టాల గురించి రైతులను ఒప్పించలేకపోయాము. మూడు చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను. దేశ అవసరాలకు అనుగుణంగా పంటల మార్పిడి, కనీస మద్దతు ధరలను మరింత సమర్దవంతంగా, పారదర్శకంగా చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం” అని మోడీ చెప్పారు. నరేంద్రమోడీ తరువాత ప్రధాని పదవికి సిద్దంగా ఉన్నట్లు ప్రచారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌ సిఎం యోగి అదిత్య నాధ్‌ స్పందిస్తూ ” బహుశా మావైపు నుంచి లోపం ఉన్న కారణంగా మేము చెప్పదలచుకున్నదాన్ని జనాలకు చెప్పటంలో మేము విఫలమయ్యాము ” అన్నారు.సాగు చట్టాలకు రైతాంగంలో ఎక్కువ మంది మద్దతు ఇచ్చారని కూడా సెలవిచ్చారు. గతంలో చట్టాలు చేసినపుడు వాటిని చారిత్రాత్మకమైనవని వర్ణించిన ఈ పెద్దమనిషి ఇప్పుడు రద్దును కూడా చారిత్రాత్మకంగానే వర్ణించారు. జనానికి మతిమరపు ఎక్కువని భావించేవారే ఇలా సమర్ధించుకోగలరు. మొత్తం మీద సాగు చట్టాలు తేవటం తప్పన్న మాట పెద్దల నోట రాలేదు. అందుకే జనంలో మోడీకి పెద్దగా సానుకూలత రాలేదు. కొంత మందిని కొంతకాలం మోసం చేయ గలరు తప్ప అందరినీ ఎల్లకాలం చేయలేరు. తన పదజాలం వెనుక ఉన్న మర్మాన్ని జనం గ్రహించేట్లు చేసినందుకు నరేంద్రమోడీకి కృతజ్ఞత చెప్పాలి మరి !


సాగు చట్టాలు దేశానికి వెన్నెముకగా ఉన్న రైతాంగాన్ని ప్రభావితం చేసేవి. వాటి దుష్ఫరిణామాలు తక్కువ కాదు. ముందుగా ఉప్పందుకున్న వేళ్లమీద లెక్కించదగిన అధికారపార్టీ పెద్దలు, ఆశ్రితులైన వారు తప్ప మోడీగారి పెద్ద నోట్ల రద్దు దేశం మొత్తాన్ని అతలాకుతలం చేసింది, జనాన్ని నానా యాతనల పాలు చేసింది-ఘోరంగా విఫలమైంది. అలాంటి పిచ్చిపని ప్రకటించిన లక్ష్యం నెరవేరలేదు, దానికి గాను జనాన్ని ఇబ్బంది పెట్టాను, ఆర్ధిక రంగాన్ని చెప్పరాని ఇబ్బందులపాలు చేశాను అని ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పి ఉంటే ఇప్పుడు చేసిన ప్రకటనను జనం నమ్మి ఉండేవారు.తమకళ్ల ముందే జరిగిన పెద్ద నోట్ల రద్దు వైఫల్యాన్ని అంగీకరించకపోగా డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయి, పన్ను చెల్లింపుదార్లు పెరిగారంటూ కొత్త కతలు చెప్పారు. పొద్దున్నే రైతులకు క్షమాపణలు చెప్పిన ప్రధాని తరువాత ఉత్తర ప్రదేశ్‌లో ప్రవేశించగానే వేరే శక్తి అవాహనలోకి వెళ్లారు. బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని మహూబా జిల్లాలో జరిగిన సభలో మాట్లాడుతూ కొంత మంది రైతులను పావులుగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఇది ప్రతిపక్షాన్ని విమర్శించటం కంటే రైతులను తెలివితక్కువ దద్దమ్మలుగా నిందించటం తప్ప వేరు కాదు. ఇది కూడా రైతాంగాన్ని చైతన్యపరిచేదే, మరింత కసి పెంచేదే కనుక అందుకూ మోడీకి కృతజ్ఞతలు చెప్పాల్సిందే ?


వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో చట్టాల రద్దుకు అవసరమైన తతంగం పూర్తి చేస్తామని చెప్పారు. ఐనా సంయుక్త కిసాన్‌ మోర్చా నమ్మలేదు. ముందుగా ప్రకటించిన ఆందోళనా కార్యక్రమంతో ముందుకు పోవాలని ప్రకటించింది. నెలాఖరులో మరోసారి సమావేశమై మిగతా అంశాల గురించి ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. విదేశీ-స్వదేశీ కార్పొరేట్ల వత్తిడికి లొంగి ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశాల మేరకు చేసిన చట్టాలను పార్లమెంటు ఎంత ప్రహసన ప్రాయంగా ఆమోదించిందీ ప్రపంచం చూసింది. 2020జూన్‌లో ఆర్డినెన్స్‌ల ద్వారా వాటిని తెచ్చారు. ఎలాంటి చర్చ లేకుండా మూజువాణీ ఓటుద్వారా ఆమోదముద్ర వేశారు. తరువాత వాటిని వెనక్కు తీసుకొనేందుకు ససేమిరా అన్న పాలకులు రైతాంగాన్ని అపహాస్యంపాలు చేశారు. వారు అసలు రైతులే కాదన్నారు, దళారీలన్నారు, ఖలిస్తానీలు, ఉగ్రవాదులు అని ముద్రవేశారు. విదేశీ నిధులతో ఆందోళనలు చేశారని నిందించారు. చర్చలను ప్రహసన ప్రాయంగా మార్చారు. రైతుల మీద భౌతికంగా దాడులు చేశారు, రెచ్చగొట్టేందుకు చూశారు. తరువాత సుప్రీం కోర్టు వాటి అమలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఒక కమిటీని ఏర్పాటు చేసింది, నివేదిక ఇమ్మంది. ఇంతవరకు ఆ నివేదిక వెలుగు చూడలేదు. దాన్ని కూడా మూసిపెట్టారు.

సాగు చట్టాల రద్దు రైతుల విజయం అని వేరే చెప్పనవసరం లేదు. దానికెంత ప్రాధాన్యత ఉందో రద్దు, మోడీ క్షమాపణల ప్రకటన ఆ చట్టాలను నిస్సిగ్గుగా సమర్దించటానికి తమ మేధాశక్తి నంతటినీ రంగరించి రైతుల మీద రుద్దటానికి ప్రయత్నించిన ప్రబుద్దులకు చెప్పుకోవటానికి వీల్లేని చోట నరేంద్రమోడీ కొట్టిన తిరుగులేని దెబ్బగా కూడా చెప్పవచ్చు.సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడు, అంతకు ముందు చట్టాలను సమర్ధించిన షేత్కారీ సంఘటన నేత అనిల్‌ గన్వట్‌ గోడు మామూలుగా లేదు. వాటిని రద్దు చేసినంత మాత్రాన ఆందోళనకు తెరపడదు, బిజెపి ఆశించినట్లుగా ఆ పార్టీకి రాజకీయంగా ఉపయోగపడదని చెప్పారు. ఆ నివేదికలో ప్రభుత్వ చర్యను గుడ్డిగా సమర్ధించి ఉండకపోవచ్చు, అది ఎప్పటికైనా వెలుగులోకి వస్తే చట్టాలను వెనక్కు తీసుకోవాలని సుప్రీం కోర్టు సలహా ఇస్తే మోడీ సర్కార్‌ పరువు మరింతగా పోతుంది, అందువలన మరింత నష్టం జరగకుండా విధిలేక ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల కోసం ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. మోడీ వెనక్కు తగ్గే అవకాశం లేదని గట్టిగా నమ్మి అతని కంటే ఘనులు అన్నట్లు ఎక్కువగా సమర్ధించిన వారు మోడీ తమను వెన్నుపోటు పొడిచినట్లు బయటికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారు.అందువలన ఇక ముందు మోడీ లేదా మరొకరు ఎవరు ప్రకటించిన లేదా అమలు జరిపే విధానాలనైనా గుడ్డిగా సమర్ధించకూడదని ఇప్పటికే అనే మంది మనసులోనే చెంపలు వేసుకుంటున్నారు. వారిలో అలాంటి మారుమనసు తెచ్చినందుకు నరేంద్రమోడీని అభినందించకుండా ఉండగలమా ?


రైతుల ఆందోళనకు ఏడాది పూర్తి కావస్తుండగా నవంబరు 26వ తేదీ తరువాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తిన్న బిజెపి వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే మరో ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పరాభవం ఎదురుకానుందనే వార్తలు వెలువడుతున్న నేపధ్యంలో నరేంద్రమోడీ సర్కార్‌ వెనక్కు తగ్గింది. తాను నోరు విప్పినా విప్పకపోయినా, పరోక్షంగా రైతులను పరిహసించినా రాజును మించి రాజభక్తిని ప్రదర్శించి సాగు చట్టాలను సమర్ధించిన వారికి వెన్నుపోటు పొడిచి తన లబ్దిని తాను చూసుకున్నారు. మోడీ మొండి వైఖరి కారణంగా కొందరు రైతుల్లో తమ పోరాటం ఫలిస్తుందా అన్న అనుమానాలు తలెత్తటం అసాధారణం కాదు, అలాంటి వారి సంశయం-ఇటు తన మద్దతుదారుల ధృడవిశ్వాసానికి భిన్నంగా రైతు చట్టాల మీద మోడీ తోకముడిచారు. వ్రతం చెడినా ఫలందక్కదు. సాగు చట్టాలకు దారి సుగమం చేసుకొని కార్మిక చట్టాలను దెబ్బతీసేందుకు, ఆర్ధిక రంగంలో పెను మార్పులకు మోడీ సర్కార్‌ అస్త్రాలను ప్రయోగించాలని కాచుకు కూర్చున్నది.వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాలని చూస్తున్న వారికి సాగు చట్టాల రద్దు ఎంతో ఊపునిస్తుంది.రైతుల ఆందోళన వెలుగులో దీర్ఘకాలిక పోరాటాలకు సిద్దం అవుతారు. అందుకు దోహదం చేసిన ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ఞతలు చెప్పకపోవటం అన్యాయం కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ధాన్యం కొనుగోలు వ్యవహారం : తెరాస మాత్రమే కాదు, ఇతర పార్టీలూ రంగంలోకి రావాలి !

18 Thursday Nov 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Economics, Farmers, NATIONAL NEWS, Opinion, Others, Politics, Prices, STATES NEWS, Telangana

≈ Leave a comment

Tags

BJP, Fci, KCR, Telangana paddy procurement matters


ఎం కోటేశ్వరరావు


తారీఖులు, దస్తావేదులు ఇవి కాదోయి చరిత్ర సారం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. వడ్ల కొనుగోలు గురించి ఇప్పటి వరకు ఏ రోజున కేంద్రంతో కెసిఆర్‌ ఏం మాట్లాడారు, ఏ ఒప్పందం చేసుకున్నారు, ఏది ముందు ఏది వెనుక అన్నది గతం. ఇప్పుడు రైతులకు తక్షణం కావాల్సింది వారి పంట కొనుగోలు, వేసవిలో వరి వేసుకోవాలా లేదా అన్నది వారికి చెప్పాలి. కేంద్రం వడ్లను కొనుగోలు చేయాలని కోరుతూ ఏకంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ గురువారం నాడు ధర్నాకు దిగారు. రెండు రోజుల్లోపల కేంద్రం తేల్చని పక్షంలో ఆందోళనను ఢిల్లీకి తీసుకుపోతానని ప్రకటించారు. ఇలాంటి ఉదంతం ఇటీవలి కాలంలో ఎక్కడా జరగలేదు. ఇది కేవలం హడావుడేనా లేక పరిస్ధితి తీవ్రతకు ప్రతిబింబమా ? కేంద్ర ప్రభుత్వం-తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం లేదా తెలంగాణా రాష్ట్ర సమితి – బిజెపి కేంద్ర నాయకత్వం మధ్య జనం అనుకుంటున్నట్లుగా ఇంతకాలం తెరవెనుక జరిగిన మంతనాలేమిటన్నది ఇప్పుడు ముఖ్యం కాదు, ఆరుబయట వానకు తడిచి ఎండకు ఎండుతున్న వడ్లను కొంటారా లేదా అన్నదే రైతులకు కావాల్సింది. గత కొద్ది రోజులుగా రెండు పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మూడు వివాదాలు ఆరు రేటింగులు అన్నట్లుగా మీడియాకు రంజుగా ఉండవచ్చు. రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. చేతికొచ్చిన పంటను కొంటారా లేదా రబీ(వేసవి లేదా యాసంగి)లో వరి వేయాలా వద్దా ? అదిగాకపోతే ఏ పంటను సాగు చేయాలి అన్నది వారికి అంతుబట్టటం లేదు. వెంటనే తేల్చాల్సిన తరుణం వచ్చింది.


ప్రభుత్వం, అధికారపార్టీ వరి వేయవద్దని చెబుతోంది, ప్రతిపక్షం, కేంద్రంలో అధికారపార్టీ వరి సాగు చేయండి ఎలా కొనుగోలు చేయరో చూస్తాం అంటూ సవాలు విసిరింది. మాటలకే పరిమితం కాకుండా బిజెపి కొనుగోలు కేంద్రాల పరిశీలన పేరుతో రాజకీయ యాత్రలకు పూనుకుంది. పరిశీలించవచ్చు, తప్పుపట్టనవసరం లేదు, వందల కార్లు,జనంతో అట్టహాసం ఏమిటి ? బిజెపి నేతలు పరిశీలిస్తే టిఆర్‌ఎస్‌కు వచ్చే నష్టం ఏమిటి ? అది కూడా పోటాపోటీగా కొనుగోలు కేంద్రాల వద్దకు తన మద్దతుదార్లను దింపింది. బిజెపి నేత మీద రాళ్ల దాడి జరిగింది.ఆగ్రహించిన రైతులే ఆ దాడి చేసినట్లు టిఆర్‌ఎస్‌ చెబుతోంది. సరే రాళ్లంటే పొలాల్లో, రోడ్ల మీద దొరుకుతాయి గనుక ఆగ్రహించి రైతులే విసిరారు అనుకుందాం. మరి కోడిగుడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? బిజెపి వారి వెంట రౌడీషీటర్లు ఉన్నారంటూ అధికారపక్షం ఫొటోలు కూడా చూపుతోంది. అధికారం కోసం పాకులాడే రాజకీయం పార్టీల వెంట అందునా బిజెపితో రౌడీలు, గూండాలు ఉండటం ఆశ్చర్యం లేదు. ఎవరినైనా చంపినపుడు నక్సల్స్‌ ఎవరు చంపారంటే జనమే ఖతం చేశారు అని చెప్పినట్లుగా బిజెపి మీద ఆగ్రహిస్తున్న రైతులే ఆ పార్టీ నేతల మీద దాడి చేసినట్లు అధికారపార్టీ చెబుతోంది. ఎవరైనా ముందుగా పధకాన్ని రూపొందించుకోకపోతే కోడి గుడ్లను వెంట తీసుకుపోరు అన్న సామాన్యుల సందేహానికి సమాధానం ఏమిని చెబుతారు. అలాగే బిజెపి నేతల వెంట రౌడీలు, గూండాలు అనుసరించాల్సిన అవసరం ఏమిటి అన్నదానికి కూడా వారు చెప్పాలి.


ముఖ్యమంత్రి కెసిఆర్‌, మంత్రులు, పార్టీల నేతలు ముందుకు తెచ్చిన కొన్ని అంశాలను చూద్దాం. పంజాబ్‌ తరహాలోనే మొత్తం వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలి. ఈ డిమాండ్‌లో తప్పులేదు. ఏడున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వారు ఇంతకాలం దాని గురించి ఎందుకు చెప్పలేదు, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు అన్నది రైతులకు, ఇతర జనాలకు తెలియాలి కదా. పంజాబ్‌లో రైతులు పండించిన వడ్లలో ఒక్క గింజను కూడా అక్కడి జనం తినరు, వాటిని విక్రయించటానికే వేస్తారు. తెలంగాణా, మరికొన్ని రాష్ట్రాలు అలా కాదే, వినియోగమూ, అమ్మకమూ రెండు కలిసి ఉంటాయి.అందువలన అన్ని చోట్లా ఒకే పరిస్ధితి లేదు. కేంద్రం తన బాధ్యతను తప్పించుకోజాలదు.


ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయాలని మరోసారి అడగను అని కెసిఆర్‌ రాతపూర్వకంగా కేంద్రానికి రాసి ఇచ్చిన సంగతి రైతులకు చెప్పలేదు. అదనపు కొనుగోలుకు కేంద్రాన్ని ఒప్పించినట్లు ప్రచారం చేసుకున్నారు.ప్రసాదాన్ని దేవుడు తినడు అనే అంశం పూజారికి మాత్రమే తెలుసు. అలాగే రాతపూర్వకంగా కూడా రాసి ఇచ్చినందున ఉప్పుడు బియ్యం కొనరనే అంశం కెసిఆర్‌కు మాత్రమే తెలుసు. అందుకనే కొద్ది నెలల క్రితం సన్నవరి రకాలు వేసుకోవాలని, ఆ రైతులకు అదనంగా ప్రోత్సాహక మొత్తాలను ఇస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యం బదులు అంత మేరకు గతం కంటే అదనంగా పచ్చి బియ్యం కొంటుందనే హామీ లేకపోవటంతో కెసిఆర్‌కు తత్వం తలకెక్కి రోడ్డెక్కారు. రైతుల కోసమే గనుక ఆందోళనకు దిగటాన్ని తప్పుపట్టనవసరం లేదు. ఈ సంగతులన్నీ రైతులకు, ఇతర జనాలకు చెప్పకుండా దాచటంలో ఆంతర్యం ఏమిటన్నదే ప్రశ్న.


రాజకీయంగా టిఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేని బిజెపి కేంద్ర అధికారాన్ని ఉపయోగించుకొని వడ్ల సంగతి తేల్చకుండా రైతుల్లో కెసిఆర్‌ను గబ్బు పట్టించాలన్న దురా,దూరాలోచన ఉంది కనుకనే కొనుగోలు గురించి కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయటం లేదన్నది తేలిపోయింది. రెండు అవకాశాలున్నాయి. ఒకటి మరికొద్ది రోజులు సమస్యను ఇలాగే నానబెట్టి రైతాంగాన్ని కెసిఆర్‌, అధికారపార్టీ మీదకు రెచ్చగొట్టటం, కెసిఆర్‌ విఫలమైనట్లు చెప్పటం, తరువాత రాష్ట్ర బిజెపి పెద్దలు ఢిల్లీ పర్యటనలు జరిపి కేంద్రాన్ని ఒప్పించినట్లు తతంగం జరిపి మావల్లనే వడ్లు కొనుగోలు చేస్తున్నారని చెప్పుకొనేందుకూ అవకాశం ఉంది. కేంద్రం, ఎఫ్‌సిఐ నిమ్మకునీరెత్తినట్లుగా రైతుల ఆందోళనను పట్టించుకోకుండా స్పందించకుండా ఉందంటే ఏమనుకోవాలి ?
కెసిఆర్‌ రోడ్డుమీదకు రావటం వెనుక బహుశా ఇతర కారణాలు కూడా ఉండి ఉండాలి. విద్యుత్‌ సంస్కరణలను అమలు జరపాలని కేంద్రం వత్తిడి తెస్తోంది. దానికి లొంగిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు అంగీకరించి ప్రకటన చేసింది. తదుపరి తెలంగాణా వంతు రానుంది. పంపుసెట్లకు మీటర్లు అంటే తక్కువ సంఖ్య ఉన్న ఆంధ్రప్రదేశ్‌ లోనే రైతులు గుర్రు మంటున్నారు. తెలంగాణాలో అది పెద్ద ఆందోళనకు దారితీస్తుంది. అందుకే ఇప్పుడు కెసిఆర్‌ విద్యుత్‌ సంస్కరణల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికే దళిత బంధు పేరుతో నిండా మునిగి ఏమి చేయాలో దిక్కుతోచని కెసిఆర్‌ కొంత కాలమైనా దాని గురించి చర్చ జరగకుండా వడ్ల సమస్యను తెచ్చారా ? కేంద్రం కూడా వెంటనే వత్తిడి తేలేదు, ఏం జరుగుతుందో చెప్పలేము.


కేంద్ర ప్రభుత్వ విషయానికి వస్తే ఇప్పటికే ఆహార ధాన్యాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం చేస్తోంది. ఇది సేకరణ బాధ్యతనుంచి తప్పుకొనే ఎత్తుగడలో ఒక ప్రచారం. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత వివిధ సూచికల్లో మన దేశం మెరుగుపడకపోగా దిగజారుతోంది. సులభతర వాణిజ్య సూచికలో మెరుగుదలను ప్రకటించినపుడేమో దాన్లో ఎలాంటి లోపాలు కనిపించవు, కానీ దిగజారిన మిగతావాటి గురించి లెక్కించిన పద్దతి తప్పు, మన స్ధానం మరింత మెరుగుపడిందనే వితండవాదానికి దిగుతోంది. ఇదే బిజెపి ప్రతిపక్షంలో ఉండగా ఆ సూచికలను చూపే గత ప్రభుత్వాలను తూర్పారపట్టిందని మరచిపోరాదు. అప్పుడు లెక్కింపు పద్దతి దానికి గుర్తుకు రాలేదు. ప్రపంచ ఆకలి సూచిక 2021 వివరాలను అక్టోబరులో ప్రకటించారు. చైనాతో సహా పద్దెనిమిది దేశాలు ఒకటో స్దానంలో ఉంటే 116దేశాలకు గాను మనం 101వ స్ధానంలో ఉన్నాం.మోడీ ఏలుబడిలో 2016లో 97గా ఉన్నది ఇప్పుడు 101కి దిగజారింది.మన తరువాత 103వదిగా ఆఫ్ఘనిస్తాన్‌ ఉంది. శ్రీలంక 65, మయన్మార్‌ 71, బంగ్లాదేశ్‌, నేపాల్‌ 76, పాకిస్తాన్‌ 92వ స్ధానాల్లో ఉన్నాయి. మెజారిటీ రాష్ట్రాలు బిజెపి ఏలుబడిలో ఉన్నప్పటికీ ఇలా జరిగింది. ఈ సూచికకు నాలుగు అంశాలు ప్రాతిపదిక. తగిన్ని కాలరీలు తీసుకోలేని ఆహారలేమి, ఐదేండ్లలోపు పిల్లల పెరుగుదల గిడసబారుతనం, తగినంత ఆహారలేమి, ఐదేండ్లలోపు మరణించేవారి రేటు ప్రాతిపదికగా తీసుకొని లెక్కిస్తారు.


ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే మెజారిటీ జనానికి ఆహారధాన్యాల కొనుగోలు శక్తి పెరగాలి. అది జరగాలంటే అందుకు సరిపడా వేతనాలు లభించే ఉపాధిని వారికి చూపాలి.దేశంలో మొత్తంగా చూసినపుడు ఆ రెండూ లేవు.మరోవైపున జనానికి సబ్సిడీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం కోత పెడుతున్నది. రోజు రోజుకూ ఆహారానికి చేసే ఖర్చును జనం తగ్గించుకొని ఇతర అవసరాలకు వెచ్చిస్తున్నారు. గోదాముల్లో గోధుమ, బియ్యాలను ఎలుకలు, పందికొక్కులకు పెట్టటాలు, ముక్కిపోయిన తరువాత పనికిరాని వాటిని పారపోసేందుకైనా కేంద్రం సిద్దపడుతోంది, లేదా సబ్సిడీలిచ్చి విదేశాలకు ఎగుమతులు చేస్తోంది గానీ మన జనానికి అందించేందుకు ముందుకు రావటం లేదు. కరోనా కారణంగా ఇరవైలక్షల కోట్లతో ఆత్మనిర్భర పాకేజ్‌లంటూ ఆర్భాటం చేసిన పాలకులు తెలంగాణాలో ఉప్పుడు బియ్యాన్ని కొనేందుకు ముందుకు రావటం లేదు. గత వేసవిలో అంగీకరించిన మేరకు ఇంకా ఐదు లక్షల టన్నులు తీసుకోవాల్సి ఉండగా దాని గురించి ఎటూతేల్చటం లేదు. ఖరీఫ్‌లో పండిన పంటలో ఎంత మేరకు కొనుగోలు చేస్తారో అదీ చెప్పదు. ఉప్పుడు బియ్యాన్ని కొనేది లేదని ముందే చెప్పిన కేంద్రం పచ్చిబియ్యాన్ని ఎంత పరిమాణంలో కొంటారో ఎందుకు చెప్పటం లేదు. ఎఫ్‌సిఐ ముందుగానే ఏ రాష్ట్రం నుంచి ఎంత కొనుగోలు చేయాలో ప్రణాళికలను రూపొందించుకోదా ? సిబిఐ, ఆదాయపన్ను, ఇడి, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్దలను తనకు లొంగని లేదా తనతో చేరని నేతల మీద ప్రయోగిస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెరాసను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఎఫ్‌సిఐని ఆయుధంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇది ప్రమాదకర పోకడ.

ప్రతిపక్ష పార్టీల పట్ల కెసిఆర్‌ అనుసరిస్తున్న వైఖరి, తూలనాడుతున్న తీరు అభ్యంతరకరమే. ఎన్నికలు వచ్చినపుడు ఎవరి వైఖరిని వారు తీసుకోవచ్చు. వడ్ల కొనుగోలు లేదా బలవంతపు విద్యుత్‌ సంస్కరణల వంటి వాటి మీద పోరాడాల్సి వచ్చినపుడు వాటిని వ్యతిరేకించే పార్టీలన్నీ రోజువారీ విబేధాలను పక్కన పెట్టి పెట్టి రైతాంగం, ఇతర పీడిత జనం కోసం కేంద్రం మీద వత్తిడి తేవాల్సిన తరుణం ఆసన్నమైంది. తెరాసతో కలిసేందుకు ఇబ్బందైతే ఎవరి కార్యాచరణతో వారు ముందుకు రావాలి.కెసిఆర్‌ది కేవలం హడావుడే అయితే విశ్వసనీయత మరింత దిగజారుతుంది. రైతాంగ ఆగ్రహం, ఆవేశాలు కెసిఆర్‌, టిఆర్‌ఎస్‌ నేతల మీదకు మళ్లుతాయి.రాజకీయంగా తగిన ఫలితం అనుభవిస్తారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

2014లోనే అసలైన స్వాతంత్య్రం – కంగనా రనౌత్‌ భుజం మీద నుంచి తూటా పేల్చిన సంఘపరివార్‌ !

13 Saturday Nov 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

1947 freedom was 'bheekh', BJP, Kangana ranaut, Kangana's controversial statement, Narendra Modi, RSS


ఎం కోటేశ్వరరావు


స్వాతంత్య్రం గురించి చేసిన వ్వాఖ్వలను వెనక్కు తీసుకొనేది లేదని , తన ప్రశ్నలకు ఎవరైనా సమాధానం చెబితే తాను పొందిన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చివేస్తానని సినీనటి కంగన రనౌత్‌ ఊగిపోతున్నారు. ఆమెను ఎప్పుడు ఏ అమ్మోరు ఆవహిస్తుందో తెలియదు- దాంతో ఏం మాట్లాడతారో అసలు ఊహించలేము.మరోసారి అదే జరిగింది. గతంలో మతపరమైన హింసాకాండ, పురోగామిశక్తుల హత్యల మీద పాలకుల మౌనానికి నిరసనగా అనేక మంది తమ అవార్డులను తిరిగి ఇచ్చివేస్తున్నట్లు ప్రకటించారు.స్వాతంత్య్రం గురించి సెలవిచ్చిన కంగన మతిమాలిన ప్రకటనను ఇప్పుడు ప్రశ్నించినందుకు ఆమె శివాలెత్తారు. పురోగామిభావజాల రచయితలు, ఉద్యమకారులైన కలుబుర్గి, నరేంద్ర దబోల్కర్‌, గోవింద పన్సారే వంటి వారి హత్యలకు, మతహింసాకాండపై నిరసనగా అనేక మంది ప్రముఖులు తమ అవార్డులను తిరిగి ఇచ్చివేస్తున్నట్లు ప్రకటించిన ఉదంతాలు తెలిసిందే. 2015లో దాదాపు 40 మంది అలాంటి వారున్నారు. తిరోగామి భావజాలానికి చెందిన వారు వీరిని అవార్డు వాపసీ గాంగ్‌ అని నిందిస్తూ ఎదురుదాడి చేశారు. కంగన కంటే అనేక మంది అనుభవం, సీనియారిటీ ఉన్న వారు ఉండగా ఆమెకు ఎందుకు అవార్డు వచ్చిందో అర్ధం చేసుకోవటం కష్టం కాదు. తెరమీద ఆమె ఒళ్లు దాచుకోకుండా నటించటానికి ఎలా కష్టపడతారో రాజకీయ తెరమీద అంతకంటే ఎక్కువగా శ్రమిస్తున్న అంశం తెలిసిందే.
కరోనాను ఎదుర్కోవటంలో వైఫల్యానికి మోడీదే బాధ్యత అంటూ రాజీనామా చేయాలని ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున నెటిజన్లు డిమాండ్‌ చేసినపుడు కంగనకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ” మోడీ గారికి ఎలా నడపాలో(దేశాన్ని) తెలియదు, కంగనకు ఎలా నటించాలో తెలియదు, సచిన్‌ టెండూల్కర్‌కు బ్యాటింగ్‌ ఎలా చేయాలో తెలియదు, లతామంగేష్కర్‌కు ఎలా పాడాలో రాదు గానీ ప్రమాణాల్లేని ఈ మరుగుజ్జులకు మాత్రం అన్నీ తెలుసు. మోడీ గారూ మీరు రాజీనామా చేసి విష్ణు అవతారాలైన ఈ మరుగుజ్జుల్లో ఒకరిని తదుపరి ప్రధానిగా చేయండి ” అంటూ టీట్లతో కంగన శివతాండవం చేశారు.


రైతుల ఆందోళన గురించి మనం ఎందుకు మాట్లాడటం లేదు అంటూ అంతర్జాతీయంగా పేరున్న ప్రఖ్యాత పాప్‌ గాయని, నటి రీఅనే చేసిన ట్వీట్‌ కేంద్ర ప్రభుత్వానికి కాక పుట్టించింది.స్వీడన్‌కు చెందిన 18 ఏండ్ల గ్రేటా టన్‌బెర్జ్‌ ట్వీట్‌ ప్రచారాన్ని మరో మలుపు తిప్పింది.ఆమె తన ట్వీట్‌తో పాటు రైతు ఉద్యమానికి సంబంధించిన సమాచారంతో ఒక కిట్‌ను కూడా తోడు చేసింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం మండి పడింది. అంతేనా ఢిల్లీ పోలీసులు ఒక కేసును కూడా నమోదు చేశారు. అయినా ఖాతరు చేయకుండా కిట్‌ను సవరించి మరో ట్వీట్‌ చేస్తూ తాను ఉద్యమానికి ప్రకటించిన మద్దతుకు కట్టుబడే ఉన్నానని స్పష్టం చేసింది. రీఆనె గురించి కంగనా చేసిన ట్వీట్లో ” ఆమె ప్రత్యేకత ఏమిటంటా పాటలు పాడుతూ కెమెరా ముందు తన పిరుదులు కదిలిస్తుంది-ముందున్నవాటిని ప్రదర్శిస్తుంది. అంతకు మించి ఏముంది ? ఇక గ్రేటా అదొక ఎలుక, బడికి పోవాలనుకోదు, చదువంటే ద్వేషం, అంతర్జాతీయ కుట్రలో ఆమె ఒక భాగం అని పేర్కొన్నది. కంగన సినిమాలను చూసిన వారికి పద్మశ్రీ కంగన ఏమి చూపిందో చెప్పనవసరం లేదు. ఒక వేళ చూసినా వర్ణించటానికి ఆ స్ధాయికి దిగజారలేము.గతంలో రైతులను ఉగ్రవాదులంటూ తూలనాడిన కంగనా బూతు నటి అంటూ రీఅనెను తిట్టిపోసింది. వామపక్ష పాత్రకు ఆదర్శం అంది. రీఆనె స్పందనకు అభినందనగా ఒక పాటను అంకితం చేసిన పంజాబీ గాయకుడు, రచయిత దల్జీత్‌ దోసాంజ్‌ మీద విరుచుకుపడుతూ ఖలిస్తానీ అని తిట్టిపోసింది. అంతేనా అనేక మంది క్రెకెటర్లను ఉద్దేశించి ” రజకుడి కుక్కలు ” అంటూ నోరు పారవేసుకుంది. దాంతో ట్విటర్‌ నిర్వాహకులకే సిగ్గువేసి దాన్ని తొలగించారు. మీరు ఎటువైపో (నరేంద్రమోడీకి అనుకూలమో వ్యతిరేకమో ) తేల్చుకోలేకపోతే రజకుడి కుక్క మాదిరి అటు ఇంట్లోనో ఇటు చాకిరేవు దగ్గరో కాకుండా అటూ ఇటూ తిరుగుతుంటారు అన్నది దాని అర్ధం. పద్మశ్రీ కంగన తీరుతెన్నులివి. ఆమెకు తెలియని అంశం ఉండదు మరి.


బాధ్యతారహితంగా ట్వీట్లు చేయటంలో, ఎదుటి వారిని నిందించటంలో పేరు మోసిన కంగనకు నెటిజన్లు ఆమె గడ్డిని ఆమెకే తినిపిస్తున్నారు. ఆమె చేసిన ఒక ట్వీట్‌లో ఇలా సలహాయిచ్చారు.” ఆక్సిజన్‌ స్ధాయిలు తక్కువగా ఉన్న వారు ఇలా చేసి చూడండి.చెట్లు నాటటం శాశ్వత పరిష్కారం. మీరా పని చేయలేకపోతే కనీసం వాటిని నరకవద్దు. వాడిన దుస్తులను తిరిగి ఉపయోగించండి, వేద ఆహారం తీసుకోండి, సహజమైన జీవితం గడపండి, ఇది తాత్కాలికమైన పరిష్కారం, ఇప్పటికైతే ఇది మీకు తోడ్పడుతుంది. జై శ్రీరామ్‌ ” దీని మీద బాజార్‌ చిత్ర దర్శకుడు గౌరవ్‌ కె చావ్లా అపహాస్యం చేస్తూ ” ఆక్సిజన్‌ వృధా మనిషి ” అని ఎద్దేవా చేశారు. దాని మీద కంగనా మండిపడుతూ ” మీ వంటి వారు పాలు సంచుల నుంచి వస్తాయనుకుంటారు.హ హ ఎంత బుద్దిహీనత, సిలిండర్లలోని ఆక్సిజన్‌ కూడా చెట్ల నుంచే తీసుకుంటారు. గాలిలో కాలుష్యం తక్కువ ఉంటే దానిలోని ఎక్కువ భాగం ఆక్సిజన్‌ను తీసుకొనే ఊపిరితిత్తులను కలిగి ఉంటారు, ఏదైతేనేం అమాయకత్వం ఆనందం కలిగించే అంశం, దానిలోనే జీవించండి ” అని పేర్కొన్నారు. నైట్రోజన్‌ నుంచి ఆక్సిజన్‌ను వేరు చేస్తారు అని పేర్కొన్న అంశాన్ని కంగనా షేర్‌ చేశారు.ఆక్సిజన్‌ గురించి కంగన్‌ ట్వీట్ల మీద నెటిజన్లు ఆమెను ఆటపట్టించారు. మీరు పూర్తిగా పిచ్చివారయ్యారు చికిత్స చేయించుకోండి అని సలహా ఇచ్చిన వారున్నారు. విద్య ఎంత అవసరమో పెద్దలు ఇందుకే చెప్పారంటూ మరొకరు ఎకసెక్కాలాడారు. వారినీ కంగన వదల్లేదు. ప్రకృతి ప్రకోపం గురించి శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. ఇది శాస్త్రీయంగా రుజువైంది. చెట్లకూ బాధ,భావోద్వేగాలు ఉంటాయి. వాటిని విచక్షణా రహితంగా వినియోగిస్తూ నాశనం చేస్తున్నాము, ఈ రోజు గాలిపీల్చుకొనేందుకు ఇబ్బంది పడుతున్నాము, వాటిని బతకనివ్వండి అని ట్వీట్‌ చేశారు.


రైతు ఉద్యమం సందర్భంగా తాప్సీపన్ను మీద విరుచుకు పడిన కంగన బస్తీమే సవాల్‌ అంటూ ట్వీట్లతో వీధులకెక్కారు. తాప్పీ తనను అనుకరించిందని, చౌకబారు స్టార్‌, ఆడ పురుషుడు అంటూ నోరు పారవేసుకుంది. ఆమె పద్మశ్రీ అవార్డు గ్రహీత మరి. ఇక తాజా విషయానికి వస్తే మన దేశానికి నిజమైన, అసలైన స్వాతంత్య్రం నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014లోనే వచ్చిందని, 1947లో వచ్చింది బ్రిటీష్‌ వారు వేసిన భిక్ష తప్ప నిజమైనది కాదని పద్మశ్రీ కంగన రనౌత్‌ ప్రకటించారు. భారతీయ చైతన్యం,అంతరాత్మ, నశించిన నాగరికత పునరుజ్జీవం పొంది గర్జింపు, ఉన్నత స్దాయి 2014లోనే వచ్చిందన్నారు. తనకు అవార్డు ఇచ్చినందుకు నరేంద్రమోడీ గారి గురించి ఆ మాత్రం చెప్పకపోతే బాగుంటుందా ? డోనాల్డ్‌ ట్రంప్‌ మోడీని దేశపితగా ప్రకటించారు, ఇక కంగన అండ్‌ కో జాతిపితగా ప్రకటించటమే తరువాయి. కంగన సినిమాల్లో డైరెక్టర్‌ చెప్పినట్లు ఆడతారు,పాడతారు, మాట్లాడతారు. కానీ ప్రజాజీవితంలో అలాంటి డైరెక్టర్లు ఉండరు. అందుకే చివరికి బిజెపి ప్రతినిధితో సహా వివిధ రాజకీయ పక్షాలు, నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. దాంతో గుక్కతిప్పుకోలేక స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన వారిని అగౌరవపరచినట్లు ఎవరైనా నిరూపిస్తే తన అవార్డును తిరిగి ఇచ్చివేస్తానంటూ వీధులకు ఎక్కారు.1857లో స్వాతంత్య్రం కోసం తొలి పోరు జరిగింది, 1947 ఏ పోరు జరిగింది ?నాకు తెలియదు. ఎవరైనా తెలిపితే నా అవార్డును తిరిగి ఇచ్చేస్తా, క్షమాపణలు కూడా చెబుతా, దయచేసి నాకు సాయం చేయండి అంటూ అతి తెలివి ప్రదర్శించారు. మరి 2014లో ఏ పోరు జరిగి,ఎవరు జరిపితే అసలైన స్వాతంత్య్రం వచ్చిందో కంగన చెబుతారా ?


కాంగ్రెస్‌ బిచ్చగత్తె అని అన్నది తానొక్కదాన్నే కాదంటూ కొంత మంది చేసిన వ్యాఖ్యలను ఉటంకించిన ఒక పుస్తకంలోని పేజీని కంగన చూపారు. కాంగ్రెస్‌ కేవలం వినతులకే పరిమితమైందని, మిలిటెంట్‌ పోరాటాలకు సిద్దం కావటం లేదంటూ కొంత మంది చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా చెప్పుకున్నారు. కాంగ్రెస్‌ అడుక్కునే సంస్ధ అని అరవింద ఘోష్‌, అడుక్కోవటానికి, హక్కుగా కోరటానికి ఉన్న తేడాను కాంగ్రెస్‌ తెలుసుకోవాలని లాలా లజపతిరాయి, కాంగ్రెస్‌ బుడగలతో ఆడుకుంటున్నదని బిపిన్‌ చంద్రపాల్‌ అన్న మాటలు దానిలో ఉన్నాయి. వారు కాంగ్రెస్‌ను విమర్శించినా బ్రిటీష్‌ వారికి లొంగినవారు కాదు. కానీ బ్రిటీష్‌ వారికి లొంగిపోయి, స్వాతంత్య్ర ఉద్యమానికి దూరంగా ఉంటానని పదే పదే లేఖలు రాసి సావర్కర్‌ను తమ ఆదర్శంగా పరిగణించే నరేంద్రమోడీ ప్రధాని అయిన తరువాతే అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లు కంగన చెప్పటం తప్పుడు ప్రచారంలో భాగం, ఆమె భుజం మీద నుంచి సంఘపరివార్‌ పేల్చిన తుపాకి తూటా తప్ప మరొకటి కాదు. ఆమె పేర్కొన్న పుస్తకాలు, ఇతర అంశాలు సంఘపరివార్‌ ప్రచారంలో ఉంచినవి తప్ప కంగనకు అంతసీన్‌ ఉందని భావించలేము. ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్‌ చంద్రబోస్‌ల సరసన సావర్కర్‌ను చేర్చి గొప్ప దేశభక్తుడని చెప్పటం దాన్లో భాగమే. తాను 1957నాటి ప్రధమ స్వాతంత్య్ర పోరాటాన్ని ఎంతగానో పరిశోధించానని, ఝాన్నీ లక్ష్మీబాయి సినిమాలో నటించానని అంటూ ఆ పోరాటం ఎందుకు ఆకస్మికంగా నిలిచిపోయింది, ఎందుకు గాంధీ భగత్‌ సింగ్‌ను మరణించేట్లుగా వదలివేశారు, నేతాజీని ఎందుకు చంపారు, గాంధీ ఎందుకు ఎన్నడూ మద్దతు ఇవ్వలేదు, దేశవిభజనను తెల్లవారెందుకు చేశారు, స్వాతంత్య్రాన్ని ఉత్సవంగా చేసుకోకుండా ఒకరినొకరు ఎందుకు చంపుకున్నారు, వీటి మీద సమాధానం కావాలని కూడా కంగన కోరారు. సంఘపరివార్‌ స్క్రిప్టును ఒక నటి మాదిరి కంగన వల్లించటం తప్ప ఇది వేరు కాదు.

కంగన ఉవాచ వైరల్‌ కావటంతో ఆమె మీద దేశద్రోహ, రెచ్చగొట్టే వైఖరి మీద కేసులు నమోదు చేయాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ బిజెపి అధికార ప్రతినిధి ప్రవీణ్‌ శంకర్‌ కపూర్‌ ఒక ట్వీట్‌ చేస్తూ కంగనపై చర్య తీసుకోవాలని కోరారు.స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబనుంచి ఒక సమరయోధుడి కుమారుడిగా కంగన ప్రకటనలు అమరజీవులను అవమానించటమే అని స్వాతంత్య్రాన్ని దుర్వినియోగం చేయటమే అన్నారు.కంగన వ్యాఖ్యలను ఉన్మాదం అననా దేశద్రోహం అనాలా అని బిజెపి ఎంపీ వరుణ్‌ గాంధీ అడిగారు.శివసేన, కాంగ్రెస్‌ కూడా ఖండించింది. కొన్ని చోట్ల కంగన మీద కేసులు నమోదు చేశారు. ఇంత రచ్చ జరిగినా కేంద్ర బిజెపి మౌనం దాల్చింది. ఇలాంటి తప్పుడు ప్రచారం తనపని తాను చేసుకుపోతుంది, కొందరి బుర్రలను చెడగొడుతుంది, చరిత్రను వక్రీకరించే వారికి, తిరగరాయదలచుకున్నవారు కోరుకుంటున్నది ఇదే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కెసిఆర్‌ సారు విశ్వసనీయత ? జగనన్నకు బిజెపి సెగ !

10 Wednesday Nov 2021

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, BJP, fuel politics, K. Chandrashekar Rao, KCR, telugudesam, YS jagan


ఎం కోటేశ్వరరావు


తెలంగాణా రాష్ట్రసమితి సారధి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఏమైంది ? ఆంధ్రప్రదేశ్‌ పాలక పార్టీ వైసిపికి బిజెపి సెగ పెరిగిందా ? రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాల పర్యవసానాలేమిటి ? తెలంగాణాలో కాంగ్రెస్‌, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేనల దారెటు ? రెండు చోట్లా ముందస్తు ఎన్నికలు వస్తాయా ? అనేక మందిలో ఇప్పటికిప్పుడు సమాధానం దొరకని, తలెత్తుతున్న ప్రశ్నలలో ఇవి కొన్ని మాత్రమే. కెసిఆర్‌ వరుసగా రెండు రోజులు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ బిజెపి మీద, కేంద్ర ప్రభుత్వంతో చావో రేవో తేల్చుకుంటామంటూ బ్యాటింగ్‌ ప్రారంభించి సిక్సర్లు కొట్టి తరువాత మంత్రులకు అప్పగించారు. కెసిఆర్‌ సారుకు ఏమైందీ అనుకుంటున్నవారికి చెప్పేదేమంటే, ఏమీ కాలేదు. హుజూరాబాద్‌లో అవమానకర ఓటమి, నాలుగువైపుల నుంచీ రాజకీయ సెగతగలటం ప్రారంభమైంది, పాత బంధులు-కొత్త బంధులు కుదురుగా కూర్చోనివ్వటం లేదు. అవే బంధనాలుగా మారతాయనే భయం కూడా తలెత్తి ఉండవచ్చు. అందువలన ఏదో ఒకటి మాట్లాడకపోతే పార్టీ శ్రేణులు మరింతగా డీలాపడతాయి.


మరి ఆంధ్రప్రదేశ్‌లో జగనన్నకు ఏమైంది. కెసిఆర్‌ మాదిరి మాటల మాంత్రికుడు కాదు. విలేకర్లతో మాట్లాడే అనుభవం సంగతేమో గానీ ఆసక్తిలేదని స్పష్టమైంది. వైసిపి అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం అమలు జరుపుతున్న నవరత్నాలు ఏమౌతాయో తెలియని స్ధితి. వాటితో ఐదేండ్లూ ప్రచారం, కాలక్షేపం చేయలేమని రెండు సంవత్సరాలకే అర్ధమైంది. ఉన్నవాటినే ఎలా కొనసాగించాలో తెలియని అయోమయంలో పడి కెసిఆర్‌ మాదిరి కొత్త బంధులను తలకెత్తుకొనే సాహసం చేయటం లేదు. అప్పుల తిప్పలు గుక్కతిప్పుకోనివ్వటం లేదు. జెన్‌కో, ఏపి పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చెల్లించాల్సిన కిస్తీలను సకాలంలో చెల్లించకపోవటంతో ఆర్‌ఇసి జెన్‌కోను నిరర్దక ఆస్తిగా ప్రకటించిందంటే పరిస్ధితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపధ్యంలో పెట్రోలు, డీజిలు మీద వ్యాట్‌ తగ్గించాలని బిజెపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వత్తిడి తెస్తున్నాయి. దీంతో ఏకంగా ప్రభుత్వమే పత్రికలకు పూర్తి పేజీ ప్రకటన జారీ చేసి చమురుపై కేంద్రం, రాష్ట్రాల పన్నుల గురించి వివరాలు అందచేసి కేంద్ర బిజెపిని ఎండగట్టేందుకు పూనుకుంది. కెసిఆర్‌ మాదిరి జగన్‌మోహనరెడ్డి మీడియా ముందుకు రాలేదు గానీ ప్రకటనలు, పార్టీ నేతలు, మంత్రులతో ఆ పని చేయిస్తున్నారు.


హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తగిలిన తీవ్ర ఎదురుదెబ్బతో నాకు ఎదురులేదు, నా ఎత్తుగడకు తిరుగులేదు అనుకొనే వారు కెసిఆర్‌ లేదా మరొకరు ఎవరికైనా మైండ్‌ బ్లాంక్‌ కావాల్సిందే. అక్కడ గెలిచేందుకు బహుశా దేశంలో, ప్రపంచంలో కూడా ఏ పార్టీ కూడా ఇంతవరకు ఆ స్ధాయిలో డబ్బు వెదజల్లటం, అధికార దుర్వినియోగానికి పాల్పడి ఉండదంటే అతిశయోక్తి కాదు. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లుగా ఘోరపరాజయంతో టిఆర్‌ఎస్‌ శ్రేణులు డీలాపడిపోయాయి. తమనేత చాణక్యతను అనుమానించటం ప్రారంభించాయి. వారిని నిలబెట్టుకొనేందుకు కెసిఆర్‌ నడుంకట్టినట్లుగా కనిపిస్తోంది. అది జరిగేదేనా !


దుబ్బాక ఉప ఎన్నికల్లో అంతకు ముందు అక్కడ పోటీ చేసిన బిజెపినేత రఘునందనరావు మీద సానుభూతి, టిఆర్‌ఎస్‌లోని ఒక సామాజిక తరగతి సానుకూలత, దానిలో భాగంగా కెసిఆర్‌ సైతం ఉపేక్షించారన్న ప్రచార నేపధ్యం, చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలను అభివృద్ధి చేసి దుబ్బాకను ఉపేక్షించారన్న ప్రచారం అన్నీ కలసి టిఆర్‌ఎస్‌ ఓటమి-బిజెపి గెలుపుకు తోడ్పడ్డాయి. తరువాత జరిగిన హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో అధికార పార్టీ కార్పొరేటర్ల మీద ఉన్న అసంతృప్తికి తోడు వరదల నివారణలో వైఫల్యం, సాయంలో అవకతవకలు అన్నీ కలసి అధికార పార్టీకి తలబొప్పి కట్టించాయి.తరువాత జరిగిన నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో బిజెపి బొక్కబోర్లాపడింది.అభ్యర్ధిని కూడా కాంగ్రెస్‌ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. బలమైన కాంగ్రెస్‌ నేత కె.జానారెడ్డిని ఓడించేందుకు టిఆర్‌ఎస్‌ పడరాని పాట్లు పడి గెలిచింది.తరువాత పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో హైదరాబాదులో బిజెపి ఉన్న సీటును కోల్పోయింది. మరొకస్ధానం వరంగల్‌లో ఊహించని ఎదురుదెబ్బతిన్నది. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం టిఆర్‌ఎస్‌ ఎన్ని పాట్లు పడిందీ చూశాము.హుజూరాబాద్‌ గురించి ముందే చెప్పుకున్నాం. అక్కడ బిజెపి కంటే కెసిఆర్‌ అహం మీద ఈటెల దెబ్బకొట్టారు. మొత్తం మీద జరిగిందేమంటే టిఆర్‌ఎస్‌ సారధి కెసిఆర్‌ విశ్వసనీయత గ్రాఫ్‌ పడిపోతోందన్నది స్పష్టమైంది. హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల తరువాత వరదసాయం మిగిలిన వారికీ అందచేస్తామని ప్రకటించి మాటనిలుపుకోలేదు. ఈ కారణంగానే దళితబంధును హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తరువాత రాష్ట్రమంతటా అమలు జరుపుతామని చెప్పినప్పటికీ జనాలు విశ్వసించలేదని తేలిపోయింది. దళితబంధును అమలు చేస్తానని ఉప ఎన్నిక తరువాత కూడా ప్రకటించారు. అయినా అమలు జరుపుతారా ? అప్పు రేపు అని గోడమీద రాస్తారా ? ఏదో ఒకపేరుతో నీరుగారుస్తారా అన్నది పెద్ద ప్రశ్న. దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి గురించి జనం మరచిపోగలరా ?


పోగాలము దాపురించినపుడు తాడే పామై కరుస్తుందంటారు. బంధులే టిఆర్‌ఎస్‌, కెసిఆర్‌కు బంధనాలుగా మారే దృశ్యాలు కనిపిస్తున్నాయి.ప్రపంచమంతటా ఈ ఏడాది పత్తి ధరలు పెరిగాయి, దాన్లో భాగంగా మద్దతు ధరకంటే అదనంగా లభిస్తున్నందున రైతుల్లో సంతృప్తి ఉండవచ్చు. ధాన్యం ధర, మార్కెటింగ్‌,ఎఫ్‌సిఐ కొనుగోలు తీవ్ర సమస్యగా మారనుంది. అది రైతు బంధు సంతృప్తి స్ధానంలో అసంతృప్తికి దారి తీయవచ్చు. రైతులకు కావాల్సింది తాము పండించిన వరి, ఇతర పంటలకు మద్దతుధర, మార్కెటింగ్‌ తప్ప మిగతా అంశాలు అంతగా పట్టవు. ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయించింది. మన్మోహన్‌ సింగ్‌కు అమలు జరిపే ధైర్యం లేకపోయింది. నరేంద్రమోడీకి 56అంగుళాల ఛాతీ ఉందని చెబుతున్నారు గనుక ఎవరేమనుకున్నా ముందుకు పోవాలని నిర్ణయించారు. దానిలో భాగమే మూడు సాగు చట్టాలు. మద్దతు ధర అమల్లో ఉంది కనుక కాస్త భరోసా ఉందని వరి పండించటం తప్ప వడ్లను ఉప్పుడు బియ్యంగా మారుస్తారా, పచ్చి బియ్యాన్నే ఎఫ్‌సిఐకి ఇస్తారా అనేదానితో వారికి నిమిత్తం లేదు. ఎంత ధాన్యమైనా కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వాలు ఇప్పుడు ఆకస్మికంగా వరి వద్దు అంటే కుదురుతుందా ? రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వద్దు అంటే కేంద్రంలో ఉన్న పార్టీ పండించమంటోంది. తెలంగాణాలో పండించిన ధాన్యం ఉప్పుడు బియ్యానికి మాత్రమే పనికి వస్తుందని పాలకులకు, విధాన నిర్ణేతలకు ముందే తెలిస్తే వేరే రకాల సాగుకు రైతులను క్రమంగా ఎందుకు ప్రోత్సహించలేదు ? శాస్త్రీయంగా అలాంటి నిర్దారణలు ఎవరు చేశారు. అసలు సాగు వద్దే వద్దంటే ఎలా కుదురుతుంది. గతేడాది కరోనా కారణంగా చమురు నిల్వలు పెరిగిపోయి, నిల్వచేసే సౌకర్యాలు లేక అమ్మకందార్లకు కొనుగోలుదారులు ఎదురు డబ్బు ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే మాదిరి తెలంగాణా రైతులు వరి వేయటం తక్షణమే నిలిపివేయాలంటే ప్రతామ్నాయం చూపేంతవరకు పరిహారం ఇస్తే నిరభ్యంతరంగా సాగు నిలిపివేస్తారు. వరి పండించాల్సిందే అని బిజెపి నేతలు కూడా చెబుతున్నారు గనుక పంట మొత్తాన్ని కొనుగోలు చేస్తారా లేక పరిహారం ఇస్తారా ? అది కేంద్రం ఇస్తుందా, రాష్ట్రం ఇస్తుందా అన్నది తేల్చాల్సింది రైతులు కాదు.


అసలేం జరుగుతోందో టిఆర్‌ఎస్‌ లేదా బిజెపి రైతాంగానికి ఎప్పుడైనా వాస్తవాలు చెప్పిన పాపాన పోయాయా ?ఇప్పుడు రెండు పార్టీలు రాజకీయానికి పాల్పడ్డాయి. గతవేసవిలో పండిన ధాన్యం నుంచి 24.75 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం మాత్రమే తీసుకుంటామని కేంద్రం చెప్పిన అంశాన్ని కెసిఆర్‌ రైతులకు ఎప్పుడైనా చెప్పారా ? అంతకు మించి ఉన్న మిగిలిన వాటిని తీసుకొనేది లేదని కేంద్రం చెప్పి ఉంటే అదైనా చెప్పాలి. మరిన్ని ఉప్పుడు బియ్యం తీసుకోవాలని కెసిఆర్‌ కేంద్రాన్ని కోరారు, మరో 20లక్షల టన్నులు తీసుకొనేందుకు అంగీకరించినట్లు చెప్పారు తప్ప దానికి తాను అంగీకరించిన షరతు గురించి చెప్పలేదు. ఆ ఇరవైలక్షల టన్నులు తీసుకుంటే భవిష్యతో ఇవ్వబోమనే షరతుకు అంగీకరించిన అంశాన్ని దాచిపెట్టారు. తమ చేత బలవంతంగా రాయించుకున్నారని ఇప్పుడు చెబుతున్నారు. దానిలో నిజాయితీ, విశ్వసనీయత ప్రశ్నార్దకమే. ఏవైనా కేసుల్లో దళితులు, ఇతర బలహీన తరగతుల వారిని పోలీసులు బెదిరించి బలవంతంగా తెల్లకాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారంటే నమ్మవచ్చు, కేంద్రం ఒక ముఖ్యమంత్రిని బలవంతం చేసిందంటే నమ్మగలమా, ఆ దారుణం గురించి జనానికి ఎందుకు చెప్పలేదు ? పంజాబ్‌లో మాదిరి తెలంగాణాలో కూడా ఎఫ్‌సిఐ నేరుగా ఎందుకు కొనుగోలు చేయదని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మేమే సేకరించి ఇస్తామని తొలుత ఎందుకు అంగీకరించినట్లు ? పోనీ ఎప్పుడైనా ఈ అంశాన్ని రైతులు, కేంద్రం దృష్టికి తెచ్చారా ? తమ నుంచి కొనుగోలును తప్పించటానికే కేంద్రం సాగు చట్టాలను తెచ్చిందని పంజాబ్‌,హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ రైతులు ఏడాది కాలంగా రాజధాని శివార్లలో ఆందోళన చేస్తున్న అంశం కెసిఆర్‌కు తెలియదంటే నమ్మే అమాయకులెవరూ లేరు. ఆ సాగు చట్టాలకు మద్దతు ఎందుకు ఇచ్చారు, రైతులకు ఒకసారి మద్దతు ఇచ్చి తరువాత ఎందుకు ముఖం చాటేసినట్లు ? మొత్తం వడ్లు కొనుగోలు చేయాలని ఆందోళనకు ఇప్పుడు పిలుపులు ఇస్తే రైతులు నమ్ముతారా ? బిజెపి కూడా దాగుడుమూతలాడుతోంది, రైతులకు భరోసా కల్పించటం లేదు.


ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే చమురు మీద వ్యాట్‌ తగ్గించాలని బిజెపి, తెలుగుదేశం వత్తిడి చేసిన తరువాత గానీ వైసిపికి చమురు మంట తగల్లేదా ? కేంద్రం పన్నుల పేరుతో పెంచిన సెస్‌ల నుంచి రాష్ట్రాలకు వాటాలు రావని రెండున్నర సంవత్సరాలుగా వారికి తెలియదా ? ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? వ్యాట్‌ తక్కువగా ఉన్న ఉత్తర ప్రదేశ్‌ పన్నెండు రూపాయలు తగ్గిస్తే వ్యాట్‌ ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఎందుకు తగ్గించదు అంటున్నారు. బిజెపి పాలనలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో పెట్రోలు, డీజిలు మీద 26.8-17.48శాతాల చొప్పున వ్యాట్‌ వుండగా అదే బిజెపి ఏలుబడిలోని అసోంలో 32.66-23.66శాతం ఉంది. అంత ఎక్కువ వసూలు చేస్తున్న అసోం ఏడు రూపాయలు మాత్రమే ఎందుకు తగ్గించినట్లు ? ఇన్ని సంవత్సరాలుగా కేంద్రం ఎందుకు, ఎంత పెంచింది, ఇంతకాలం ససేమిరా తగ్గించేది లేదని తిరస్కరించి ఇప్పుడు ఎందుకు, ముష్టి విదిల్చినట్లుగా తగ్గించిందో, ఉత్తర ప్రదేశ్‌ మాదిరి డీజిలు, పెట్రోలు మీద కేంద్రం కూడా పన్నెండు రూపాయలు కేంద్రం ఎందుకు తగ్గించలేదో బిజెపి నేతలు చెప్పాలి. మోడీ గారు అధికారంలోకి వచ్చినపుడు 58గా ఉన్న రూపాయి విలువ ఇప్పుడు 75కు పడిపోవటానికి కారణం మోడీ గారు అనుసరిస్తున్న విధానాలే. అందువలన ముందు దాన్ని కనీసం పూర్వపువిలువకైనా పెంచాలి, లేదా వారి అసమర్ధతకు జనాన్ని బలిచేయకుండా మరింతగా ఏడున్నర సంవత్సరాల స్ధాయికి పన్ను తగ్గించాలి. లేదా చమురును కూడా జిఎస్‌టి పరిధిలోకి తేవాలి, రాష్ట్రాల ఆదాయం తగ్గినంతకాలం ఇప్పుడు జిఎస్‌టి పరిహారం ఇస్తున్న మాదిరే ఎంతకాలం లోటు ఉంటే అంతకాలం చెల్లించాలి. కేంద్రం పెంచిన మాదిరి రాష్ట్రాలు వ్యాట్‌ విపరీతంగా పెంచలేదు. అందువలన కేంద్రం ముందు దారి చూపి రాష్ట్రాలను అనుసరించాలని కోరవచ్చు తప్ప డిమాండ్‌ చేసే హక్కు లేదు. కేంద్రం తగ్గిస్తే దానికి అనుగుణంగా రాష్ట్రాలు తగ్గించకుండానే భారం తగ్గుతుంది. కేంద్రం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది రూపాయలు తగ్గిస్తే ఆమేరకు రాష్ట్రాల వ్యాట్‌ భారం కూడా తగ్గుతుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు మీద 31శాతం వ్యాట్‌ వసూలు చేస్తున్నారు. కేంద్రం తగ్గించినదాని ప్రకారం పెట్రోలు మీద లీటరుకు 155పైసలు, డీజిలు మీద 22.25శాతం ఉన్నందున 2.25పైసలు రాష్ట్రవాటాగా తగ్గుతుంది. కేంద్రం తగ్గించిన మేరకు ఆ దామాషాలో రాష్ట్రానికి కూడా వాటా తగ్గుతుంది.


కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధుల గురించి కేంద్రం ఎటూ తేల్చదు, బిజెపికి పట్టదు.ప్రకటించిన విశాఖ రైల్వేజోన్‌ సంగతి మాట్లాడరు. చమురు ధరల తగ్గింపు గురించి ఆందోళనకు దిగిన తెలుగుదేశం రైల్వే జోన్‌, ఇతర అంశాల గురించి ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? రెండు తెలుగు రాష్ట్రాల్లోను అధికార పార్టీలైన తెరాస-వైసిపి కేంద్రంలోని బిజెపితో ఘర్షణకు దిగేందుకు సిద్దం కావటం లేదు. తాజా పరిణామాలు అనివార్యంగా బిజెపితో తెరాస-వైసిపి మధ్యం దూరం పెంచనున్నాయని భావిస్తున్నారు. రెండు పార్టీలను మింగివేసేందుకు లేదా తన ఉపగ్రహాలుగా మార్చుకొనేందుకు బిజెపి చేయాల్సిందంతా చేస్తోంది. విధానపరమైన తేడాలు లేవు, తేడా అధికారం దగ్గరే కనుక, బిజెపి బలహీనపడుతున్న కారణంగా రెండు పార్టీలు రానున్న రోజుల్లో ప్రతిఘటించేందుకే పూనుకోవచ్చు.లేదూ బిజెపికి లొంగితే అది ఆత్మహత్యాసదృశ్యం అవుతుంది . సమస్యలు చుట్టుముడుతున్న నేపధ్యంలో రెండు రాష్ట్రాల సిఎంలూ ఏదో ఒకసాకుతో మధ్యంతర ఎన్నికలకు తెరలేపినా ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

లఖింపూర్‌ ఖేరీ ఉదంతంపై అయ్యో పాపం అని కూడా నరేంద్ర మోడీ అనలేరా !

08 Friday Oct 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Lakhimpur Kheri killings, Narendra Modi, Navjot Singh Sidhu, Supreme Court of India, Yogi Adityanath


ఎం కోటేశ్వరరావు


అక్టోబరు మూడవ తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతులపై బిజెపి నేతల వాహనాలను ఎక్కించి నలుగురిని దారుణంగా హత్య చేశారు. ఆ వాహనాల్లో కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు అషిష్‌ మిశ్రా ఉన్నాడా, అతనే స్వయంగా వాహనాన్ని రైతుల మీద ఎక్కించాడా లేక వాహనంలో ఉండి డ్రైవర్‌ను అందుకు పురికొల్పాడా అన్నది ఇప్పటివరకు వివాదాస్పద అంశంగా ఉంది. ఆ సమయంలో తన కుమారుడు అక్కడ లేడని కేంద్ర మంత్రి నమ్మబలుకుతున్నారు. దారుణ, గర్హనీయ ఉదంతం జరిగింది తమ ఏలుబడిలోని రాష్ట్రం, పోలీసులు, పాలకులూ తమ వారే, కేసులో ఇతర నిందితులు ఎవరైనా మంత్రిగారి కొడుకు ఉన్నందున పోలీసు కస్టడీ అయినా, రిమాండ్‌లో ఉన్నా ఇతర సాధారణ నిందితుల మాదిరి పోలీసు మర్యాదలేమీ ఉండవు, మంచిగానే చూసుకుంటారు. అయినా అక్టోబరు మూడున ఉదంతం జరిగితే ఇది రాస్తున్న సమయానికి కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు. లేదా మంత్రిగారు అమాయకుడని చెబుతున్న తన కుమారుడిని పోలీసులకు అప్పగించలేదు. చట్టాన్ని అమలు జరపాల్సిన వారు, దాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసిన వారి తీరూ ఇలా ఉంది.

ఆరోగ్యం సరిగా లేని కారణంగా గురువారం నాడు తన కుమారుడు పోలీసుల ఎదుట హాజరుకాలేదని, శనివారం నాడు వెళతాడని మంత్రి అజయ మిశ్రా చెప్పారు. అమాయకుడని మరోసారి చెప్పారు. కాగా శనివారం ఉదయం పదకొండు గంటలకు హాజరు కావాలనే నోటీసును శుక్రవారం నాడు పోలీసులు కేంద్ర మంత్రి ఇంటి గోడకు అంటించారు. రుజువులు లేకుండా వత్తిడి తెచ్చినంత మాత్రాన ఎవరి మీదా ఎలాంటి చర్యలూ ఉండవని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ చెప్పారు. పార్టీ వైఖరికి భిన్నంగా రైతు ఉద్యమం, లఖింపూర్‌ ఖేరీ ఉదంతంపై స్పందించిన బిజెపి ఎంపీ వరుణ్‌ గాంధీ, మాజీ మంత్రి, వరుణ్‌ తల్లి అయిన మేనకా గాంధీని బిజెపి కేంద్ర కార్యవర్గం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. మరణించిన జర్నలిస్టు రామన్‌ కాశ్యప్‌ కుటుంబాన్ని శుక్రవారం నాడు పరామర్శించిన కాంగ్రెస్‌ నేత నవజోత్‌ సింగ్‌ సిద్దూ నిందితులను అరెస్టు చేసేంత వరకు తాను అక్కడే మౌన వ్రత దీక్ష చేయనున్నట్లు ప్రకటించి ప్రారంభించారు.


విశ్వగురువుగా భజంత్రీలు కీర్తిస్తున్నారు గనుక నిజమే అనుకుంటున్నట్లుగా ఉంది. అందుకే లఖింపూర్‌ ఖేరీ ఉదంతం తన స్థాయికి తగినదని భావించలేదా లేక ఇంకా పెద్దవి జరిగితే తప్ప స్పందించరో గానీ మొత్తం మీద ప్రధాని నరేంద్రమోడీ నోరు విప్పలేదు. ఈ ఉదంతం అంతర్జాతీయ మీడియాలో కూడా వచ్చిందని బహుశా యంత్రాంగం మోడీగారికి నివేదించి ఉండకపోవచ్చు. రాజును బట్టే కదా బంట్లు . అనూహ్యమైన ఈ పరిణామాన్ని బిజెపి పెద్దలు ఊహించి ఉండరు.అందుకే షాక్‌లో ఉన్నారు, గుక్క తిప్పుకోలేకపోతున్నారు. కేంద్రంలో అధికారానికి కీలకమైన ఉత్తర ప్రదేశ్‌లో ఎలాగైనా తిరిగి గద్దెను దక్కించుకొనేందుకు పధకాల మీద పధకాలను రచిస్తున్న వారి జాబితాలో వేరే ఉంటాయి తప్ప ఇలాంటి మెడకు చుట్టుకునే దారుణాలు ఉండవు. రైతు ఉద్యమం మీద నిరంతరం బురద చల్లటం, ఎద్దేవా చేయటం, అసహనానికి గురై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటే ఇలాంటివి జరగటం సాధారణం. నేను ప్రజాప్రతినిధిని గాక ముందు మనిషిగా ఉండి ఉంటే రెండు నిమిషాల్లో తేల్చేసి ఉండేవాడిని అని ఒక సారి రౌడీ షీటరుగా నమోదైన అజయమిశ్రా సెప్టెంబరు 25న ఆప్రాంతంలోనే మంత్రి వేషంలో ఉండి చెప్పారంటే ఏమనుకోవాలి. ఇదే సమయంలో హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‌ వంటి జాతి రత్నాలు తక్కువ తినలేదు. సమూహాలుగా ఏర్పడి కర్రలు తీసుకొని తిరగండి, జైలుకు పోవటం గురించి ఆలోచించవద్దని బిజెపి కార్కకర్తలకు కర్తవ్యబోధ చేశారంటే పుత్రరత్నాలు వాహనాలను జనం మీదకు నడపటం లేదా నడిపించటంలో ఆశ్చర్యం ఏముంది.

లఖింపూర్‌ ఖేరీ కేసు ఏమౌతుంది. అనేక కేసులు ఏమయ్యాయో ఇది కూడా అదే అవుతుంది. కేసు గురించి కాదు, పాలకపార్టీ ప్రమాదకర పోకడల గురించి తీవ్రంగా ఆలోచించాలి. సుప్రీం కోర్టుకు రాసిన లేఖలను తీసుకొని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేత్రత్వంలోని బెంచ్‌ కేసును విచారణ జరుపుతోంది. ఇంకా ఎందుకు మంత్రి పుత్రరత్నాన్ని అరెస్టు చేయలేదని ప్రశ్నించాల్సి వచ్చింది. ఇతర కేసుల్లో ఇలాంటి విచారణకు ఉన్నత న్యాయస్ధానానికి అవకాశం ఉంటుందా అంటే కచ్చితంగా ఉండదు. చిత్రం ఏమంటే సుప్రీం కోర్టు కేసు చేపట్టినట్లు తెలిసిన తరువాత కూడా ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు ఆషిష్‌ మిశ్రాను అరెస్టు చేయలేదు. ఏం చేస్తారో చూద్దామనో లేక సుప్రీం కోర్టు అయితే ఏంటి అన్న వైఖరో తెలిదు. ఇతర హత్యకేసుల్లో కూడా మీరు ఇలాగే పని ప్రవర్తిస్తారా అని కోర్టు ప్రశ్నించాల్సి వచ్చింది. తాను పోలీసుల ముందుకు రావటానికి మరింత సమంయం కావాలని ఆషిష్‌ మిశ్రా కోరాడని శనివారం ఉదం పదకొండు గంటల వరకు వ్వధి ఇచ్చినట్లు, అప్పటికీ రాకపోతే అరెస్టు వారంటు జారీ చేస్తామని ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.ఎంతైనా యోగుల పాలన గనుక నిందితుల మనోభావాలను గౌరవించటంగా దీన్ని భావించవచ్చు.

కేసును ఈనెల 20కి వాయిదా వేసినందున మరో పది రోజుల పాటు ఏదో ఒక సాకుతో పోలీసులు కాలం గడపవచ్చు. లేదా కోర్టును సంతృప్తిపరచేందుకు అరెస్టు చూపవచ్చు. రిపబ్లిక్‌ దినోత్సవం రోజున జరిగిన ఢిల్లీలో ఉదంతంలో కుట్రదారైన బిజెపికి చెందిన నటుడు దీప్‌ సిద్దు తమ కళ్ల ముందునుంచే వెళుతున్నా అడ్డగించని పోలీసులు అతగాడిని పదిహేను రోజుల తరువాత అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ఉదంతాలలో ప్రభుత్వ వ్యతిరేకుల మీద మోపిన కేసుల్లో పోలీసులు ఎంత వేగంగా అరెస్టులు చేశారో చూశాము. కానీ లఖింపూర్‌ ఖేరీ ఉదంతంలో నిదానమే ప్రదానం అన్నట్లుగా యోగి సర్కార్‌ ఉంది. సమస్య సున్నితత్వం కారణంగా తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయటం లేదదని, కేసులో ఉన్న వ్యక్తుల కారణంగా సిబిఐ గురించి ఏమీ చెప్పనప్పటికీ అది పరిష్కారం కాదని,ప్రస్తుతం ఉన్న రాష్ట్ర అధికారులతో దర్పాప్తు సరిగా జరగదని, ఉన్న సాక్ష్యాలను నాశనం చేయకూడదని ప్రధాన న్యామూర్తి ఎన్‌వి రమణ అన్నారంటే కేసు తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. బిజెపికి ఈ సున్నితత్వం అర్దం అవుతుందా ?


పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం ” ఈ ఉదంతం సాయంత్రం మూడు గంటల సమయంలో జరిగింది.ఆషిష్‌ మిశ్రాతో పాటు 15-20 మంది ఆ వాహనాలలో ఉన్నారు. నిరసన తెలుపుతున్న బబీర్‌పూర్‌ వద్దకు మూడు వాహనాల్లో వచ్చారు. ఆషిష్‌ మిశ్రా తన మహింద్రా తార్‌ వాహనంలో ఎడమవైపు కూర్చున్నాడు.రోడ్డుకు రెండు వైపులా ఉన్న రైతుల మీదకు వాహనాలను పోనిచ్చిన తరువాత రైతుల మీద కాల్పులు జరిపాడు. గుర్విందర్‌ సింగ్‌ అనే రైతు కాల్పుల కారణంగా అక్కడికక్కడే మరణించాడు. వాహనాలు బోల్తాపడిన కారణంగా పక్కనే ఉన్నవారు గాయపడ్డారు. తరువాత ఆషిష్‌ కాల్పులు జరుపుతూ చెరకు తోటలవైపు వెళ్లి అక్కడ దాక్కున్నాడు.” అని ఉంది. ఇలాంటి తీవ్రనేరారోపణ చేసిన కేసుల్లో ఇతరులైతే అరెస్టుకు మీనమేషాలు లెక్కిస్తారా ? అయితే తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినప్పటికీ నేరారోపణ చేసే సమయానికి దానిలో మార్పులు చోటు చేసుకోవని చెప్పలేము. మంత్రి కుమారుడి కాల్పుల కారణంగా మరణించినట్లు చెబుతున్న గుర్విందర్‌ సింగ్‌ పోస్టు మార్టంలో తుపాకి గాయాల ప్రస్తావన లేదు. దాంతో కుటుంబ సభ్యుల డిమాండ్‌ మేరకు రెండోసారి చేసినా అదే మాదిరి ప్రస్తావన లేని అంతకు ముందు నివేదికే ఇచ్చారు. మంత్రి కుమారుడిని రక్షించేందుకు ఇది జరిగిందనే అనుమానాలు రావటం సహజం.


ఈ దారుణకాండలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు, ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారి మీదే కేసులు కూడా పెట్టారు. అంటే ప్రజాస్వామ్యం సంగతి రాముడెరుగు బాధిత కుటుంబాలకు కనీసం సానుభూతి కూడా తెలిపేందుకు యోగి అంగీకరించరన్నది స్పష్టం. ఇది హత్రాస్‌ ఉదంతంలో కూడా జరిగింది. చివరికి పోలీసులే అంత్యక్రియలను కూడా ఎలా చేశారో చూశాము. మంత్రి అనుచరుల కార్ల మీద రైతులు దాడి చేసినపుడు అవి బోల్తాపడి రైతులు మరణించారని ముందు చెప్పారు. తరువాత కార్లను ఎక్కిస్తున్న వీడియో బయటకు రావటంతో వేరే కథలు వినిపిస్తున్నారు. కార్లను రైతుల మీద నడిపించినపుడు నిజంగా మంత్రి కుమారుడు ఉంటే ఆగ్రహించిన రైతులు అతన్ని ప్రాణాలతో బతకనిచ్చి ఉండేవారా అని ఎదురుదాడి చేస్తున్నారు. కారు డ్రైవరు, మరో ఇద్దరు బిజెపి కార్యకర్తల మాదిరి చంపివుండేవారు కదా అని తర్కిస్తున్నారు. అయితే అతను ఆ సమయంలోవేరే చోట ఉన్నట్లు చెప్పటం తప్ప ఇంతవరకు ఎలాంటి ఆధారాలను ఈ వాదన చేస్తున్న మంత్రిగానీ, అనుచరులుగానీ వెల్లడించలేదు.


లఖింపూర్‌ ఖేరీ ఉదంత రాజకీయ పర్యవసానాల గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ కేసు దర్యాప్తు సిబిఐ లేదా ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు గానీ వచ్చే ఏడాది ప్రారంభంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే లోగా తేలుతుందన్నది అనుమానమే.ఆలస్యం జరిగినా లేక మంత్రి కుమారుడి ప్రమేయం లేదని చెప్పినా లేదా విధిలేక అతగాడే దారుణానికి కారకుడని తేలినా బిజెపి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. పది నెలలుగా జరుగుతున్న రైతు ఉద్యమం ఈ ఉదంతంతో మరోమలుపు తిరిగింది. మరణించిన రైతుల కర్మకాండలు ముగిసేలోగా నిందితులను అరెస్టు చేయాలని, మంత్రిని తొలగించాలని కోరుతున్నారు. మంత్రిని తొలగిస్తే తప్పిదాన్ని అంగీకరించినట్లు లేకపోతే తమ వారిని రక్షించుకొనేందుకే బిజెపి పూనుకున్నదనే సందేశం రైతుల్లోకి వెళుతుంది. అన్నింటికీ మించి రాబోయే రోజుల్లో ప్రతి చోటా బిజెపి మంత్రులు, ప్రజాప్రతినిధుల కార్యక్రమాల సందర్భంగా రైతుల ఆందోళనలు జరిగే అవకాశం ఉంది. హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‌ చెప్పినట్లు బిజెపి కార్యకర్తలు కర్రలు తీసుకొని దాడులకు దిగితే, మరిన్ని లఖింపూర్‌ ఖేరీ ఉదంతాలు జరిగితే ఏం జరుగుతుందో చెప్పలేము.


లఖింపూర్‌ ఖేరీ దారుణం జరిగి 48 గంటలు కూడా గడవక ముందే అక్కడి నుంచి కేవలం 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని లక్నో నగరానికి అక్టోబరు 5వ తేదీన ఎన్నికల శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు, మూడు రోజుల అజాదీ కా అమృత మహౌత్సవం ప్రారంభానికి ప్రధాని నరేంద్రమోడీ వచ్చారు. ఉపన్యాసం చేశారు.ఎన్నికల పధకాల్లో భాగంగా నయా భారత్‌కా నయా ఉత్తర ప్రదేశ్‌ పేరుతో 75 పధకాలను ప్రధాని ప్రారంభించారు. దేశాన్ని కుదిపివేసిన లఖింపూర్‌ ఉదంతం ప్రస్తావనే చేయలేదు. ఆ కార్యక్రమం ఎంతో ముందుగానే రూపొందించి ఉండవచ్చు, వాయిదా వేస్తే భిన్నమైన రాజకీయ సంకేతాలు వెళతాయని దాన్ని కొనసాగించి ఉండవచ్చు. తమ మంత్రి, అతని కుమారుడి నిర్వాకం కారణంగా జరిగిన ఉదంతం మంచి చెడ్డలను ప్రస్తావించకపోవచ్చు గానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి చెందిన ఎనిమిది విలువైన ప్రాణాలు పోతే కుటుంబాలకు సానుభూతి ప్రకటన చేస్తే సొమ్మేం పోతుంది. మరణించిన వారిలో ఇద్దరు బిజెపి కార్యకర్తలు, మంత్రి కారు డ్రైవర్‌, ఒక జర్నలిస్టు కూడా ఉన్నారుగా. రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రాణాలకు లేదా ?
.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆసక్తి గొలుపుతున్న తెలంగాణా రాజకీయాలు – ఈ సారీ ముందస్తు ఎన్నికలేనా !

20 Monday Sep 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Telangana, Telugu, Uncategorized

≈ Leave a comment

Tags

Bandi Sanjay, BJP, KCR, Revanth Reddy, Telangana Left, Telangana politics, trs

ఎం కోటేశ్వరరావు


తెలంగాణాలో రాజకీయాలు ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి.ఈ నెల 27న భారత బంద్‌ను జయప్రదం చేసేందుకు, బిజెపి,టిఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు కాంగ్రెస్‌, వామపక్షాలు, టిజెఎస్‌ నేత కోదండరామ్‌, ఇంటి పార్టీ నేతలు ఒక్కటిగా కదలాలని నిర్ణయించటం సరికొత్త పరిణామం. ఇది కేవలం రెండు పాలక పార్టీల విధానాల మీద ఉద్యమించటం వరకే పరిమితం అవుతుందా ? రాబోయే ఎన్నికల సర్దుబాట్లకు దారి తీస్తుందా అన్నది ఇప్పుడే చెప్పలేము. అధికార టిఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు, తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు రంగంలోకి దిగిన కొత్త పార్టీ వైఎస్‌ షర్మిల నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌ పార్టీ, మాజీ ఐపిఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ రాజకీయ తీర్ధం పుచ్చుకున్న బిఎస్‌పి, మజ్లిస్‌, వామపక్షాలైన సిపిఎం, సిపిఐ, ఇతర పార్టీలు, శక్తులు తమ తమ అజెండాలతో ముందుకు పోతున్నాయి. అన్ని పార్టీలు ఒకే పద్దతిలో, ఒకే స్ధాయిలో లేవు. కాంగ్రెస్‌ తన శంఖారావాన్ని పూరించేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నియోజకవర్గమైన గజ్వేల్‌ను ఎంచుకోవటం అక్కడ భారీ బహిరంగసభ నిర్వహించటం గమనార్హం. మరోవైపున కాంగ్రెస్‌ నుంచి ఎదురవుతున్న సవాలను ఎదుర్కొనేందుకు బిజెపి కూడా నడుం కట్టింది. అమిత్‌షాను రప్పించి సెప్టెంబరు 17 తెలంగాణా విమోచన పేరుతో తన మత అజెండాను నిర్మల్‌లో ప్రారంభించింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ హస్తినలో తిష్టవేసి జరిపిన మంత్రాంగం గురించి ఎవరికి తోచిన ఊహాగానాలతో వారు ఉన్నారు. వాటిని పూర్తిగా కొట్టిపారవేయనవసరం లేదు అలాగని యథాతధంగా తీసుకోవాల్సిన అగత్యమూ లేదు. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము.


గత అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు, లేదా స్ధానిక సంస్థలకు వచ్చిన సాధారణ ఎన్నికల సమయంలో కొట్టవచ్చినట్లు కనిపించిన ఒక అంశం ఏమంటే వాగ్దానాల వరద. అది ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే తమ నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే ఎన్నికైన ప్రతినిధులు రాజీనామా చేయాలి, ఉప ఎన్నికలు జరిపించాలనే డిమాండ్లు తలెత్తేందుకు దోహదం చేశాయి. చేసిన వాగ్దానాలు, చెప్పిన ఊసులు అమల్లోకి వస్తాయా లేదా అని ఎవరూ చూడటం లేదు. అన్నీ జరగవనీ తెలిసి కూడా ఎందుకు కోరుకుంటున్నారు అంటే అసల్లేనిదాని కంటే ఎంతో కొంత జరుగుతుంది కదా అన్నది అంతర్గత తర్కం.

హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు ముందు జరిగిందేమిటి ? వరదల్లో మునిగిపోయిన వారికి, మునిగిపోయినట్లు నమోదైన వారికీ పదివేల రూపాయల చొప్పున చాలా మందికి ఇచ్చారు. ఎన్నికల నిబంధనల ఆటంకం కారణంగా మిగిలిన వారికి తరువాత ఇస్తామని వాగ్దానం చేశారు. ఏం జరిగింది, అధికారపక్షానికి అనుకున్న స్ధాయిలో స్ధానాలు రాలేదు. ఎన్నికలు ఐదు సంవత్సరాలు ఉన్నాయి గనుక అప్పుడు చూసుకుందాం లెమ్మని నిజమైన బాధితులకు సైతం ఎగనామం పెట్టారు. హుజూర్‌ నగర్‌, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల సమయంలో, తరువాత జరిగింది కూడా దీనికి భిన్నమేమీ కాదు.


ఇప్పుడు హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక. మిగతా రాష్ట్రాలతో పాటు దీనికి ప్రకటించలేదు. దానికి ఎవరి కారణాలను వారు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ గారే వాయిదా వేయించారన్నది ఒక కథనం. కేంద్ర ప్రభుత్వం లేదా ఎన్నికల కమిషన్‌ దగ్గర బిజెపి కంటే కెసిఆర్‌ పలుకుబడి ఎక్కువ కాదు, ఎలాగూ గెలిచేది తామే కనుక ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టేందుకు బిజెపి వారే వాయిదా వేయించారన్నది మరొక కథ. ఇక్కడ ఏ కధ వాస్తవం అయినా రాజ్యాంగ వ్యవస్దల విశ్వసనీయత ప్రశ్నార్దకం అవుతోంది. ఎన్నికను వాయిదా వేయాల్సినంతగా కరోనా తీవ్రత లేదన్నది నిజం.
మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ను ఎట్టి పరిస్ధితిలో అయినా ఓడించాలన్నది అధికారపక్ష పట్టుదల, ఎలాగైనా గెలిచి తమదే టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అని ఓటర్ల ముందుకు వెళ్లాలన్నది బిజెపి తాపత్రయం. ఈ నేపధ్యంలో వచ్చిందే దళిత బంధు. ఈ పధకాన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించే అవకాశం ఉండదు. బండి గుర్రానికి కళ్ల ముందు గడ్డి కట్ట పెట్టినట్లుగా దీన్ని ఆశచూపితే దళితులందరూ తమకే ఓట్లు వేస్తారని, ఓటు బ్యాంకుగా మారతారన్నది అధికారపక్ష ఎత్తుగడ. కాంగ్రెస్‌ పార్టీ దళిత బంధుతో పాటు గిరిజన బంధు ఎందుకు అమలు జరపరంటూ ముందుకు వచ్చింది. మిగిలిన సామాజిక తరగతుల్లో కూడా నిజమే కదా మాకూ బంధు ఎందుకు అమలు జరపరు అనే ఆలోచన ప్రారంభమైంది.తమ పధకంతో ప్రతిపక్షాలను దెబ్బకొట్టటంతో పాటు దళితులను బుట్టలో వేసుకుంటామన్నంత వరకే అధికారపార్టీ ఆలోచించింది తప్ప అది అంతటితో ఆగదు అన్నది ఊహించి ఉండరు. ఎవరికైనా తట్టినా ముఖ్యమంత్రికి చెప్పే సాహసం చేసి ఉండరు. అలాంటి వాతావరణం లేదు కదా !


మొత్తం మీద ఇతర కులాల్లో కూడా దళితబంధు ప్రచారం కావటంతో అధికారపక్షానికి సెగతగిలింది. అర్హులైన దళిత కుటుంబాలు ఎన్ని ? పన్నెండు లక్షలా, పదిహేను లక్షలా ? ఆ కుటుంబాల సంఖ్య పెరగదు, స్ధిరంగా ఉంటుంది అనుకుంటే పన్నెండు అయితే లక్షా ఇరవై, పదిహేను అయితే లక్షా యాభై వేల కోట్లు కావాలి.ఒకటో తారీఖున ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలే ఇవ్వని స్ధితిలో ఉన్న ప్రభుత్వం ఇంత మొత్తం ఎక్కడి నుంచి తెస్తుంది అన్నది ఒక ప్రశ్న. షెడ్యూలు కులాలు, గిరిజనులకు ఉప ప్రణాళికల నిధులు, వారికి అమలు జరుగుతున్న కొన్ని పధకాల నుంచి దళితుల వాటాను ఈ కొత్త పధకానికి మళ్లించే అవకాశం ఉంది. ఈ పధకంతో దళిత కుటుంబాలను ఉద్దరించినట్లే అని రికార్డుల్లో రాసి అమల్లో ఉన్న కొన్ని పధకాలకు మంగళం పాడినా, నామమాత్రం చేసినా ఆశ్చర్యం లేదు. ఏం జరుగుతుందన్నది అప్పుడే చెప్పలేము. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముగిసే వరకు అది బ్రహ్మదార్ధమే. దళితులకు మూడెకరాల భూమి కొందామని చూస్తున్నా భూమి, దానికి అవసరమైన నిధులు లేవని చేతులెత్తేసిన పెద్దలు ఆ ఎన్నిక తరువాత దళిత బంధుకూ అదే గతి పట్టించినా ఆశ్చర్యం లేదు.


దళిత బంధును ఇప్పుడు హుజూరాబాద్‌కే అమలు జరిపి వచ్చే బడ్జెట్‌లో ఇరవైవేల కోట్ల నిధులు కేటాయిస్తాం అని కెసిఆర్‌ చెప్పారు. అది నెరవేరినా పన్నెండు లక్షల కుటుంబాలైతే ఆరు సంవత్సరాలు, పదిహేను అయితే ఎనిమిదేండ్లు పడుతుంది. ఇతర కులాల్లో అసంతృప్తి లేదా ఆశ ప్రారంభం కావటంతో వీలైతే వారికి కూడా అమలు చేస్తాం అని బండి గుర్రపు గడ్డి కట్టలను సిఎం ప్రదర్శించారు. పులిని ఎక్కిన వారు దాన్ని అదుపు చేయాలి లేకపోతే అది ఎక్కిన వారిని మింగివేస్తుంది. సంక్షేమ, ప్రజాకర్షక పధకాలు కూడా అంతే. పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు సంస్ధలను ఏర్పాటు చేసినందుకు పెద్ద ఎత్తున రాయితీలు, సబ్సిడీ ఇస్తున్నారు. వస్తువులను ఎగుమతులు చేసినందుకూ ప్రోత్సహకాల పేరుతో కట్టబెడుతున్నారు. అందువలన మన సమాజంలో రక్షణ లేని, అల్పాదాయ వర్గాలకు సంక్షేమ పధకాలను అమలు జరపాలనటంలో మరొక మాట ఉండనవసరం లేదు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా ఒక పరిమితి దాటితే వాటిని అమలు జరపటం ఎలా అన్నదే సమస్య. రాష్ట్ర వ్యాపితంగా పేదలు, మధ్యతరగతి వారు ఉపయోగించే ఆర్‌టిసికి వస్తున్న నష్టాలను భర్తీ చేసేందుకు ముందుకు రాకుండా దాన్ని మూసివేసేందుకు పావులు కదుపుతున్న సర్కార్‌ మరోవైపు హైదరాబాద్‌ మెట్రోకు వస్తున్న నష్టాలను భరించేందుకు ఆలోచిస్తామని సిఎం చెప్పారు.


రకరకాల సాకులు చూపి ఉద్యోగులకు పిఆర్‌ఎసి అమలు విషయంలో ఎంతదగా చేశారో చూశాము. ఒక ఏడాది మినహా మిగిలిన కాలానికి బకాయిలు ఇచ్చేది లేదన్నారు. ఆ ఏడాది మొత్తాలను కూడా పెన్షనర్లకు 36వాయిదాల్లో ఇస్తామన్నారు. సర్వీసులో ఉన్న వారికి వాటిని పిఎఫ్‌ ఖాతాల్లో జమచేసినా వాటి మీద నామమాత్ర వడ్డీ అయినా వచ్చేది. అలాగాక వారు ఉద్యోగవిరమణ సమయంలో ఆ మొత్తాలను ఇస్తారట.ప్రకటించిన నెలలో నూతన వేతనాలను అమలు చేయలేదు. ఆ కాలానికి నగదు వేతనాలు, పెన్షన్లతో పాటు ఇస్తామని చెప్పారు. వాటిని కూడా ఇంతవరకు చెల్లించలేదు. మూడు వాయిదాల డిఏ బకాయిలు ఉన్నాయి. జనవరి నాటికి మరోవాయిదా సిద్దం అవుతున్నది. ఇలా చేయించుకున్న పనికే చెల్లించటానికి ఎగనామం పెట్టి, ఇబ్బందులు పెడుతున్నవారు అవసరం తీరిన తరువాత సంక్షేమ పధకాలకు మంగళం పాడితే…!

ఎరువుల సబ్సిడీకి పరిమితి విధించిన కేంద్ర ప్రభుత్వం రైతాంగంలో తలెత్తిన ఆందోళనను తగ్గించేందుకు కిసాన్‌ యోజన పేరుతో ఆరువేల రూపాయలను మూడు విడతలుగా ఇచ్చే పధకాన్ని అమలు జరుపుతోంది. పెరిగిన ఎరువుల ధరల భారంతో పోల్చితే అది నామమాత్రం. ఇప్పుడు విద్యుత్‌ రాయితీలకు మంగళం పాడేందుకు కేంద్రం పూనుకుంది. దాంతో జరిగేదేమిటి ? ఒక యూనిట్‌ విద్యుత్‌ను వినియోగదారుడికి చేర్చేందుకు అయ్యే మొత్తం ఖర్చులో ఇరవై శాతానికి మించి రాయితీలు ఉండకూడదు. ఒక యూనిట్‌ ధర ఏడు రూపాయలైతే సబ్సిడీ 140 పైసలు మాత్రమే ఇవ్వాలి.ఇప్పటి వరకు రాష్ట్రాలు వివిధ వినియోగదారులకు వేర్వేరు ధరలను నిర్ణయించి రైతులకు ఉచితంగా ఇస్తున్నాయి. నూతన విద్యుత్‌ బిల్లు చట్టమైతే కొందరి వద్ద అదనంగా వసూలు చేసేందుకు, దాన్ని ఇతరులకు సబ్సిడీగా ఇచ్చేందుకు వీలు ఉండదు. అందువలన అనివార్యంగా రాష్ట్రాలు తమ బడ్జెట్ల నుంచి కేటాయింపులు జరపాలి. గత పది సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఎరువులకు నిర్ణీత మొత్తాలను కేటాయించి సరిపెట్టుకోమని చెప్పేస్తున్నాయి. విద్యుత్‌కూ అదే రాబోతున్నదని చెప్పవచ్చు. ఎరువుల ధరలు మార్కెట్లో ఎంత ధర ఉంటే అంత మొత్తం చెల్లించి రైతులు కొనుగోలు చేయాలి.ధరతో నిమిత్తం లేకుండా నిర్ణీత సబ్సిడీ మొత్తాన్ని దాన్నుంచి తగ్గిస్తారు. పెరిగితే ఆ భారాన్ని రైతులే పెట్టుకోవాలి.ఇప్పుడు వంట గ్యాస్‌కు దాన్ని వర్తింప చేశారు. టిఆర్‌ఎస్‌ విషయానికి వస్తే రాష్ట్రంలో ప్రధాన పంటగా మారిన వరి ఆ పార్టీకి ఉరిగా మారుతుందా అన్నట్లుగా పరిస్ధితి ఉంది. రైతులకు ఉన్నంతలో మెరుగైన ఫలితాలనిచ్చే ముతక బియ్యం(ఉప్పుడు బియ్యానికి పనికి వచ్చే రకాలు) రాష్ట్ర ప్రభుత్వానికి గుది బండగా మారవచ్చు. దాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకొనే అవకాశమూ లేకపోలేదు. గతంలో అంగీకరించిన మేరకు తప్ప అదనంగా తమకు అవసరం లేదని ఎఫ్‌సిఐ ఇప్పటికే చెప్పేసింది. ఏం జరుగుతుందో తెలియదు. రైతులకు ఎంత ఆర్ధిక నష్టం జరిగితే టిఆర్‌ఎస్‌కు అంతమేరకు రాజకీయ ప్రతికూలత పెరుగుతుంది.

రాష్ట్రంలో ఇప్పుడు మూడు ప్రధాన పార్టీల తీరు తెన్నులు చూస్తుంటే ఈ సారి కూడా అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తాయా అన్న అనుమానాలు కొందరిలో ఉన్నాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నికవరకే అయితే ఇంత హడావుడి ఉంటుందా అన్నదే సందేహం. ఆ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్రంలో ఒక చర్చనీయాంశం అవుతుంది.కేంద్రం విద్యుత్‌ సంస్కరణల బిల్లును ఆమోదించి చట్టంగా మారితే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తగిలే విద్యుత్‌ షాక్‌ దేనికి దారి తీస్తుందో తెలియదు. విద్యుత్‌, వరి, దళితబంధు వంటి పధకాలు-పర్యవసానాలు జనానికి తెలిసే ముందే ఏదో ఒకసాకుతో ఆకస్మికంగా ఎన్నికలకు పోయినా ఆశ్చర్యం లేదు. పోయిన సారి కాంగ్రెస్‌, బిజెపి బలహీనంగా ఉన్నపుడే తమకు లాభమని కెసిఆర్‌ భావిస్తే ఇప్పుడు తన వైఫల్యాలు మరింతగా జనం నోళ్లలో నానక ముందు, ఆ రెండు పార్టీలు పుంజుకోక ముందే అసెంబ్లీ ఎన్నికలు జరపటం మంచిదనే అంశం గురించి మల్లగుల్లాలు పడుతున్నారు. దాని గురించి మరోసారి చెప్పుకుందాం. ఇప్పుడున్న పరిస్ధితి ఏమిటి ? కేంద్రంలోని బిజెపితో అధికార పార్టీ టిఆర్‌ఎస్‌ దోబూచులాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పర్యవసానాలేమిటి ?


దేశంలోని వివిధ రాష్ట్రాలల్లో ప్రాంతీయ పార్టీల తీరుతెన్నులను చూసినపుడు మొత్తంగా ఒక స్ధిరమైన వైఖరితో ఉండటం లేదు.రాష్ట్రాల హక్కుల పరిరక్షణ నేపధ్యంలో పుట్టిన పార్టీలన్నీ ఆ లక్ష్యాన్ని వదలివేశాయి. తెలంగాణా రాష్ట్ర సమితి కూడా అదే బాటలో నడుస్తున్నది. ఎప్పుడు ఏ అవకాశవాద వైఖరి తీసుకుంటుందో చెప్పలేము.ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు జరపటం లేదని అమావాస్యకు పౌర్ణానికి విమర్శించటం తప్ప నిర్దిష్ట కార్యాచరణ లేదు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో జనాల మనోభావాలను ఉన్నత స్ధాయికి తీసుకుపోయారు. ఏడు సంవత్సరాలుగా నియామకాల ప్రహసనం ఎలా సాగుతోందో చూస్తున్నాం. నిధుల సమస్య ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రోజు నుంచే పరిష్కారమైంది. ఉమ్మడి ఆస్తుల పంపకం మాత్రమే మిగిలి ఉంది. ఇక నీళ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌తో వివాదంతో మనోభావాలతో ఆడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో అమల్లో ఉన్న నీటి న్యాయానికి భిన్నమైన డిమాండ్లను ముందుకు తెచ్చారు.

తమిళనాడులో గతంలో మాదిరి లోక్‌సభ సీట్లను గణనీయంగా జాతీయ పార్టీకి అప్పగించి రాష్ట్ర అధికారం నిలుపుకొనేందుకు ప్రయత్నించిన డిఎంకె, అన్నాడిఎంకె మాదిరి మీకది మాకిది అన్నట్లు బిజెపితో ఒప్పందానికి రావటానికి కేసిఆర్‌కు ఇబ్బంది లేదు. అయితే వరుసగా అన్ని రాష్ట్రాలను కబళించేందుకు ప్రయత్నిస్తున్న బిజెపి అందుకు అంగీకరించటం లేదు. ఈ రాష్ట్రంలోని నేతలు ప్రతిఘటిస్తున్నారు. ఆ పంచాయతీ తెగేట్లు లేదు. పశ్చిమబెంగాల్‌ పరిణామాలను చూసిన తరువాత అనివార్యం అయితే టిఆర్‌ఎస్‌ బిజెపితో అమీతుమీ తేల్చుకుంటుంది. దానికి సిద్దపడగానే కేంద్రం ఇడి, సిబిఐ, ఇతర దర్యాప్తు సంస్దలను రంగంలోకి దించేందుకు అవసరమైన ఏర్పాట్లతో ఉంది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో తగులుతున్న ఎదురుదెబ్బల నేపధ్యంలో బిజెపి ఇప్పటికిప్పుడు టిఆర్‌ఎస్‌తో తెగేదాకా లాగకపోవచ్చు. కొన్ని తురుపు ముక్కలను అట్టి పెట్టుకుంటుంది. అదే ఎత్తుగడను టిఆర్‌ఎస్‌కూడా అనుసరిస్తుంది. ఈ లోగా బండి సంజయ-దానికి పోటీగా అధికారపార్టీ నేతల నోటిదూలతో జనానికి కిక్కు ఎక్కిస్తారు.


ఇప్పటికిప్పుడు చూస్తే టిఆర్‌ఎస్‌ ఒక రాజకీయ పార్టీగా మొదటి స్ధానంలో ఉంది. దాని ధనశక్తి, మీడియా మద్దతును తక్కువ అంచనా వేయలేము. జనంలో వాగ్దానాలను విస్మరించిందన్న అసంతృప్తి ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌,బిజెపి పట్ల ప్రత్యేకమైన అభిమానం లేదు. ఏమైనా సరే టిఆర్‌ఎస్‌ను ఓడించాలనే వాతావరణం ప్రస్తుతం ఉన్నట్లు చెప్పలేము. అయితే అది శాశ్వతం కాదని టిఆర్‌ఎస్‌ నేతలకు అర్దం అయింది. కొండమీది రాయి కిందికి జారనంత వరకు స్దిరంగా ఉన్నట్లే కనిపిస్తుంది. కదలటం ప్రారంభమైన తరువాత వేగం అందుకుంటుంది. జనంలో వ్యతిరేకత కూడా అంతే. అందుకే కొత్త కొత్త ప్రజాకర్షక నినాదాలతో, వివాదాలతో ముందుకు వస్తుంది. జనంలో అసంతృప్తి పెరిగితే వాటి కారణంగానే పతనం కూడా అవుతుంది.


దుబ్బాక ఉప ఎన్నిక, తరువాత హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వచ్చిన ఊపుతో బిజెపి తమదే రెండో స్ధానం అని చెప్పుకుంది. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీల నేతలు బిజెపి వైపు చూశారు, లోపాయకారీ సంబంధాలను కూడా పెట్టుకొన్నారు. ఇప్పటికీ టిఆర్‌ఎస్‌లోని అసంతృప్త నేతలను ఆకర్షించేందుకు బిజెపి పావులు కదుపుతోంది. అయితే అధికారమే పరమావధిగా ఉన్న నేతలు ఎంత వీలైతే అంత అధికార పక్షంలో ఉండి పిండుకొని ఎన్నికల ముందు వేరే పార్టీలోకి ఫిరాయించటం ఇటీవలి కాలంలో సాధారణమైంది. తెలంగాణా దానికి మినహాయింపు కాజాలదు. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో తగిలిన దెబ్బ, ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటమి బిజెపి ప్రచార గాలిని తీశాయి. దీనికి తోడు కాంగ్రెస్‌ సారధిగా నోటి దురుసులో ముఖ్యమంత్రి, బిజెపి నేతలకు పోటీగా ఉండే రేవంతరెడ్డి నియామకంతో కాంగ్రెస్‌ నుంచి వలసలకు బ్రేకు పడింది. బిజెపి కంటే మెరుగైన స్ధానానికి చేరుకుంది. అయితే అది నిలుస్తుందా లేదా అన్నది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, అంతకు ముందు బీహార్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరిస్ధితి పెద్దగా మెరుగుపడకపోయినా పెద్దగా దిగజారలేదు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల ఫలితాలు కూడా ఆ పార్టీ మీద ప్రభావం చూపవచ్చు. బిజెపికి తగిలే దెబ్బలు, ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు లాభించే అవకాశం ఉంది.


తెలంగాణాలో వామపక్షాలు ఒక విధంగా చెప్పాలంటే తమ ఉనికిని నిలబెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఆందోళనను బలపరిచిన సిపిఐ బావుకున్నదేమీ లేదు. వ్యతిరేకించిన సిపిఎం సహజంగానే కొంత దెబ్బతిన్నది. అయితే ప్రజాసమస్యలపై ఆ పార్టీలు, అవి పనిచేస్తున్న ప్రజాసంఘాల కార్యకలాపాలు వాటి ఉనికిని కాపాడుతున్నాయి. అన్నింటికీ మించి నయా ఉదారవాద విధానాలు పాలకపార్టీల మీద జనంలో పెద్ద ఎత్తున భ్రమలు కొల్పాయి. ఈ నేపధ్యంలో వామపక్షాలు, వాటి నినాదాలు జనానికి అంత ఆకర్షణీయంగా కనిపించటం లేదు. అయితే ప్రపంచంలో ముఖ్యంగా అమెరికా, లాటిన్‌ అమెరికా దేశాలలో జరుగుతున్న పరిణామాలను చూసినపుడు వామపక్షాల వైపు తిరిగి జనం చూడకతప్పదనే భావం కలుగుతోంది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా జనం పట్ల నిబద్దతే వాటిని కాపాడుతుంది.


ముస్లిం మైనారిటీలు గణనీయంగా ఉన్న తెలంగాణాలో మరింతగా మతతత్వాన్ని రెచ్చగొట్టి బలపడాలని బిజెపి ప్రయత్నిస్తుంటే అదే అస్త్రంతో మజ్లిస్‌ కూడా తన పట్టును పెంచుకోవాలని చూస్తోంది. టిఆర్‌ఎస్‌-మజ్లిస్‌ బంధం గురించి బిజెపి ఎంత రెచ్చగొట్టినా దానికి ఆశించిన ఫలితాలు రావటం లేదు. వచ్చే అవకాశాలు కూడ కనిపించటం లేదు. రాబోయే రోజుల్లో టిఆర్‌ఎస్‌-బిజెపి అమీతుమీ తేల్చుకునేందుకు పూనుకుంటే మైనారిటీలు సహజంగా బెంగాల్లో మాదిరి టిఆర్‌ఎస్‌వైపే మొగ్గుతారు, లేదా కాంగ్రెస్‌ బలపడితే, బిజెపిని ఓడించే పార్టీ అదే అని భావిస్తే ఆ పార్టీ వైపు మొగ్గినా ఆశ్చర్యం లేదు. రెండవ అంశం ప్రస్తుతానికి ఊహాజనితమే. వైఎస్‌ షర్మిల నాయకత్వంలోని పార్టీ ప్రస్తుతానికి ఎవరి అవకాశాలను దెబ్బతీసే లేదా ప్రయోజనం కలిగించే పరిస్దితిలో లేదు. ఒక అధికారిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తీసుకున్న చర్యలు దళితుల్లోని మధ్య తరగతిలో ఆయనపట్ల అభిమానాన్ని పెంచటం సహజం. అయితే అది ఎన్నికల్లో ఫలితాలను ఇస్తుందని చెప్పలేము. ఉత్తర ప్రదేశ్‌లో గతంలో బిఎస్‌పికి ఉన్న పట్టు ఇప్పుడు లేదు, రాబోయే ఎన్నికల్లో వచ్చే అవకాశం కూడా లేదు. అలాంటి పొందిక తెలంగాణాలో వచ్చే అవకాశం లేదు గనుక బిఎస్‌పి, దాని సారధ్యం పుచ్చుకున్న ప్రవీణ్‌ కుమార్‌ భవిత్యం ఏమిటన్నది ఇప్పటికైతే ప్రశ్నార్దకమే. ఇక వ్యక్తులుగా ఉన్న వారు ఏ వైఖరి తీసుకున్నప్పటికీ వారు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిడ్డా రాహుల్‌ గతంలో నోరెత్తలేదేం – నిలదీసిన నిర్మలక్క, స్మృతక్క

27 Friday Aug 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ 1 Comment

Tags

BJP, Narendramodi, National Monetisation Pipeline, Nirmala Sitharaman, Niti Aayog, NMP, Rahul gandhi, Smriti Irani

!
ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వ ఆస్తుల ద్వారా 2025 నాటికి ఆరులక్షల కోట్ల రూపాయల ధన ఆర్జనకు నిర్ణయించినట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆగస్టు 23వ తేదీన ప్రకటించారు. దీనికి నేషనల్‌ మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌-ఎన్‌ఎంపి( జాతీయ ధనార్జన గొట్టపు మార్గం ) అని నామకరణం చేశారు. గొట్టపు బావుల ద్వారా నీటిని తోడినట్లు ప్రభుత్వ ఆస్తులతో ధనాన్ని సంపాదిస్తామన్నది అర్ధం. సమర్ధించేవారు ముందుకు తెస్తున్న వాదనలు ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రభుత్వం ఒక కుటుంబం అనుకుందాం. మనింట్లో ఉన్న బావిని మన కుటుంబం ఒక్కటే వినియోగిస్తున్నది. నీళ్లు తోడమంటే కుటుంబసభ్యులే విసుక్కుంటున్నారు. ఎక్కువ సేపు నిరుపయోగంగా పడి ఉంటున్నది. దాన్ని ఇతరులకు అద్దెకు ఇచ్చి రోజంతా నీళ్లు తోడిస్తే మనకు కొంత సొమ్ము ముట్టచెబుతారు. నీళ్లు లేనివారికి నీటిని అమ్మి సొమ్ము చేసుకుంటారు. కొంత మందికి పని కల్పిస్తారు, తద్వారా ప్రభుత్వానికి పని కల్పించే, నీళ్లు అందించే ఖర్చు తప్పుతుంది. ఒప్పంద గడువు ముగిసే వరకు బావికి వచ్చే మరమ్మతులు, నిర్వహణకు తీసుకున్నవారే పెట్టుబడి పెడతారు. తిరిగి మన బావిని మనకు అప్పగిస్తారు. వారు ఇచ్చే మొత్తాన్ని వేరే అవసరాలకు వినియోగించి మరిన్ని సంపదలు సమకూర్చుకోవచ్చు.


మరొక ఉదాహరణ. మీకు ఒక ఇల్లు ఉంది. ఉద్యోగ రీత్యా వేరే ఊరు, రాష్ట్రం, దేశం పోతారు. దాన్ని అద్దెకు ఇచ్చుకుంటామా పాడు పెట్టుకుంటామా ? అలాగే ఖాళీ స్ధలం ఉంది, ఎవరికైనా అద్దె లేదా కౌలుకు ఇచ్చుకుంటే నాలుగు రూపాయలు వస్తాయా రావా? అలా చేస్తామా, చెట్లుచేమలను మొలిపిస్తామా, పాములు, పుట్టలను పెరగనిస్తామా ? ప్రభుత్వ ఆస్తులను అమ్మటం లేదు, పధకాలకు అవసరమైన డబ్బుకోసం వినియోగానికి మాత్రమే ప్రయివేటు వారికి ఇస్తున్నారు.యాజమాన్య హక్కు ప్రభుత్వానిదే, ప్రయివేటు వారు అభివృద్ధి చేసి గడువు తీరిన తరువాత తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తారు. దీని మీద రచ్చ చేయటం ఏమిటి ? ఇది తీరు ! దీనిలో వాస్తవం లేదా ? కాదని ఎలా అంటాం, ఎంత మంచి ఆలోచన !


దేశవ్యాపితంగా దీని గురించి చర్చ జరుగుతోంది. నరేంద్రమోడీ డీమానిటైజేషన్‌ షాకు తిన్న జనానికి ఇప్పుడు నిర్మలమ్మ మానిటైజేషన్‌ ఆశచూపుతున్నారు. సామాన్యులు ఎంతవరకు పట్టించుకున్నారో తెలియదు. ఆ పదానికి అసలైన అర్ధం ఏమిటి అని కొందరు పండిత చర్చ చేస్తున్నారు. నిఘంటు అర్ధం గురించి తీరికగా తెలుసుకుందాం. ప్రధాని గారూ డీమానిటైజేషన్‌ ఎందుకు అంటే ఉపయోగంలో లేకుండా ఎక్కడెక్కడో మూలుగుతున్న నల్లధనాన్ని వెలికి తీసేందుకు, తద్వారా పెట్టుబడులకు అందుబాటులోకి తెచ్చి అభివృద్ధి కోసం అని చెప్పారు. కమ్యూనిస్టులు, ఇతరులు కొందరు తప్ప అత్యధికులు ఆహౌ ఓహౌ మహత్తర ఆలోచన, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం అని నోట్లు మార్చుకొనేందుకు ఎలా వరుసలు కట్టి నిలుచున్నారో తెలిసిందే. ఇంకేముంది సమాంతర ఆర్ధిక వ్యవస్ధను నడుపుతున్న నల్లధనం నడుం విరిగిపోతుంది అని కొందరు జోశ్యం చెప్పారు. అసలు ఆ ”అవిడియా” నాదే అని చెప్పిన చంద్రబాబు గురించీ తెలిసిందే. ఆచర్యతో ఎంతో నష్టం తప్ప నల్లధనం వెలికి వచ్చిందీ లేదు,వృద్ది ఇంకా దిగజారింది తప్ప దేశానికి వీసమెత్తు ఉపయోగం లేదు. (ఇప్పుడు వీసం పదం వినియోగంలో లేదు గనుక సెంటీమీటరు లేదా పావలా ప్రయోజనం లేదు అనుకోవచ్చు) అనేక అంశాలలో తలలు బొప్పి కట్టిన తరువాత మోడీగారు ధనార్జన పధకాన్ని ప్రకటించటానికి నిర్మలమ్మగారికి అప్పగించారు. ఆచరణలో డబ్బు ఆర్జన జరుగుతుందని చెబుతున్నారు గనుక అలాగే పిలుద్దాం. ప్రభుత్వ అంటే ప్రజల ఆస్తులను కొంత మంది పెద్దలు కాజేయటం ఇప్పటికే ప్రారంభమైంది. ఇంకా మిగిలి ఉన్న ఏ ఆస్తిని ఎలా చేజిక్కించుకోవాలా అని చాలా కాలం నుంచే తన్నుకుపోయేందుకు రాబందుల్లా ఆకాశంలో కార్పొరేట్‌ శక్తులు తిరుగుతున్నాయి.గోతికాడ నక్కల్లా భూమ్మీద కాచుకు కూర్చున్నాయి.భూమి ప్రమేయం ఉన్న ఆస్తులను తెగనమ్మటానికి ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం కేంద్రానికి అధికారం లేదు. ఎవరికైనా వినియోగహక్కు మాత్రమే ఉంటుంది. అందువలన దాన్ని వేరే రూపంలో కట్టబెట్టేందుకు ఎంచుకున్న సరికొత్త మార్గం ఇది అన్నది స్పష్టం.అంతే కాదు తమ మాదిరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి ధనార్జనకు పూనుకుంటే ప్రోత్సాహక నగదు బహుమతి ఇస్తామని కూడా ప్రకటించారు.


బిజెపివారు, కేంద్ర ప్రభువులు, భుజం మార్చుకోకుండా వారిని మోస్తున్నవారు చెబుతున్నట్లుగా నిరుపయోగంగా ఉన్నవాటిని ఎవరైనా వృద్ది చేస్తామంటే ఎవరు అభ్యంతర పెడతారు. సామాన్య జనానికి ప్రయోజనం లేక కేవలం పెద్దల విలాసాలకు మాత్రమే ఉపయోగపడే, ఖజానాకు భారంగా మారిన హౌటళ్లను పశ్చిమబెంగాల్‌లో జ్యోతిబసు ప్రభుత్వం వదిలించుకుంది. చైనా తరువాత ప్రపంచంలో పెద్ద దేశమైన మనం ఒలింపిక్స్‌లో స్వర్ణం కోసం ఎంత తపించామో, ఏ స్ధితిలో ఉన్నామో తెలిసిందే. వినియోగంలో లేని స్టేడియాలను అభివృద్ధి చేసి క్రీడాకారులను ప్రోత్సహించితే ఎవరు వద్దన్నారు. ఆపని చేయకుండా వాటిని కార్పొరేట్లకు అప్పగించితే వాణిజ్య ప్రయోజనాలు తప్ప క్రీడలకు ప్రోత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది ? ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రణాళికలు లేకుండా ఏ దేశంలో అయినా క్రీడాకారులు అభివృద్ది చెందిన దాఖలా ఉందా ? లేదూ వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు అటువంటి లక్ష్యం ఉంటే ఏ సంస్ధ ఇప్పటి వరకు ఎంత మందిని తయారు చేసి ఎన్ని పతకాలు సాధించిందో చెప్పమనండి. నరేంద్రమోడీ గారు టీ అమ్మాను అని చెబుతున్న రైల్వే స్టేషన్ల వంటివి చాలా ఉన్నాయి. దేశభక్తులైన కార్పొరేట్‌ సంస్ధలు, వ్యాపారులు అలాంటి వాటిని అభివృద్ధి చేయమనండి ఇబ్బంది లేదు. కానీ విజయవాడ, సికిందరాబాద్‌ రైల్వే స్టేషన్లు నిరుపయోగంగా ఉన్నాయని బుర్రలో గుంజున్నవారు ఎవరైనా చెబుతారా ? తిరిగే వాహనాలు లేక జాతీయ రహదారులుపాడుపడి పోయాయని తలలో మెదడు ఉన్నవారు అనగలరా ? విశాఖ, కాకినాడ వంటి రేవులకు ఓడలు రాక బోసిపోతున్నాయని రుజువు చూపగలరా ? అందువలన నిరుపయోగంగా ఉన్నవాటిని ప్రయివేటు వారికి ఇచ్చి డబ్బు సంపాదిస్తామని బిజెపి వారు చెబుతున్నదానిలో వాస్తవం ఎంత ? అందుకే ప్రయివేటీకరణకు మారు పేరే మానిటైజేషన్‌ అంటున్నవారిని తప్పుపడితే ఎలా !


దేశం ముందుకు పోవాలంటే,ప్రపంచ స్ధాయి సౌకర్యాలను సామాన్యులకు అందుబాటులోకి తేవాలంటే మోనిటైజేషన్‌ ఒక్కటే ఏకైక మార్గం అని నీతి అయోగ్‌ సిఇఓ అమితాబ్‌ కాంత్‌ ఇండియా టుడే ఇంటర్వ్యూలో చెప్పారు. పూర్వం బ్రతుకు తెరువు కోసం గ్రామాల్లో బుర్రకథలు, హరికథలు చెప్పేవారు గ్రామీణులను ఉబ్బించి సొమ్ము చేసుకొనేందుకు అసలు మీ ఊరి గురించి మీకేమి తెలుసు చుట్టుపట్ల అరవై ఆరు ఊళ్లకు పోతుగడ్డ అనగానే నిజమే కదా అనుకొని పండిన ధాన్యం, పప్పు ధాన్యం వంటివి పెద్ద మొత్తంలో ఇచ్చి సత్కరించే వారు. ఇప్పుడు పాలకులు-అధికారులు ఎవరున్నా ప్రపంచ స్దాయి సౌకర్యాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకే చేస్తున్నవన్నీ అని చెప్పటం పోతుగడ్డలను గుర్తుకు తెస్తోంది.
ప్రపంచ స్ధాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటూ పంచ రంగుల చిత్రాన్ని చూపుతున్నారు. పేదలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామని చెప్పినపుడు జరిగిన చర్చ ఏమిటి గ్యాస్‌ స్టౌవ్‌లు ఇస్తే చాలదు వాటి మీద వండుకొనేందుకు సరకులు, అవికొనుగోలు చేసేందుకు అవసరమైన ఆదాయానికి ఉపాధి సంగతి ఏమిటన్నదే కదా ! కరోనా సమయంలో ఆత్మనిర్భర పధకంలో చెప్పింది ఏమిటి ? కార్పొరేట్‌ ఆసుపత్రులను నెలకొల్పేందుకు తోడ్పాటు అందిస్తామనే కదా ? కార్పొరేట్‌లు గిరిజన ప్రాంతాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఆసుపత్రులు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? వినియోగించే జనం ఆర్ధిక స్ధాయి, చెల్లించేశక్తిని బట్టి క్రమంగా సౌకర్యాలను పెంచాలి తప్ప ప్రపంచస్ధాయి పేరుతో ధనికులకు మాత్రమే ఉపయోగపడే, కార్పొరేట్లకు లాభాలు తెచ్చే వాటిని అమలు జరిపితే అసమానతలు మరింతగా పెరుగుతాయి తప్ప అభివృద్ధి ఫలాలు అందరికీ అందవు. రోడ్ల నిర్మాణానికి పెట్రోలు, డీజిలు కొనుగోలు చేసేవారందరూ సెస్‌ పేరుతో పన్ను కడుతున్నారు. వాటితో వేశామని చెబుతున్న రోడ్లను ఉపయోగించినందుకు తిరిగి వారే టోలు టాక్సు కడుతున్నారు. జాతీయ రోడ్ల అభివృద్ది సంస్ద రోడ్లు వేయగలిగినపుడు వాటిని నిర్వహించలేదా ? అంత అసమర్ధంగా ప్రభుత్వం – అధికార యంత్రాంగం ఉందా ? గత కాంగ్రెస్‌కు బిజెపికి ఇంక తేడా ఏముంది ?


ధనార్జన గొట్టపు మార్గ పధకాన్ని ప్రకటించింది నిర్మలా సీతారామన్‌ అయినప్పటికీ ఇది నరేంద్రమోడీ గారి కలకు రూపకల్పన అని ఆమే చెప్పారు. గతంలో ప్రణాళికా సంఘం ద్వారా ఆస్తుల కల్పన జరిగింది. దాని స్ధానంలో మోడీగారు తెచ్చిన నీతి అయోగ్‌ వాటిని కొంత మందికి కారుచౌకగా కట్టబెట్టే పనిలో ఉంది. ఆ సంస్ధ నివేదిక విడుదల-జాతీయ ధనార్జన గొట్టపు మార్గం ప్రారంభం సందర్భంగా ఆర్ధిక మంత్రి ప్రభుత్వ లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు.వర్తమాన సంవత్సర బడ్జెట్‌లోనే ప్రభుత్వం దీని గురించి చెప్పిది. ఇదేమీ కొత్త కాదు, వినూత్న పధకమూ కాదు. ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య మెల్లగా అయినా రోజు రోజుకూ పెరుగుతోంది. ఇక్కడ జర్మన్‌ నాజీ నరహంతకుడు హిట్లర్‌ పాలన గురించి తొలుత భ్రమపడి చివరకు జైల్లో పడిన తరువాత కనువిప్పు కలిగిన ఒక మతాధికారి జైల్లోనే రాసిన ప్రఖ్యాత కవితను ఇక్కడ గుర్తుకు తేవటం సమయోచితంగా ఉంటుంది. మొదటి లైను జర్మను కవిత, రెండవది దానికి సామ్యం.
” వారు తొలుత కమ్యూనిస్టుల కోసం వచ్చారు నేను కమ్యూనిస్టును కాదు గనుక మౌనంగా ఉన్నాను-
తొలుత నష్టాలు తెచ్చే కంపెనీలను వదిలించుకుందాం అని చెప్పారు కనుక నిజమే పోతే పోనీ అనుకున్నా
వారు తరువాత కార్మిక నేతల కోసం వచ్చారు -నేను కార్మికుడిని కాదు కనుక మాట్లాడలేదు-
ప్రయోజనం లేని కంపెనీలు కొనసాగటం అనవసరం అమ్మేద్దాం, మూసేద్దాం అంటే కామోసు అనుకున్నాను
వారు తరువాత యూదుల కోసం వచ్చారు – నేను యూదును కాదు గనుక ప్రశ్నించలేదు-
కొన్ని కంపెనీల్లో కొన్ని వాటాలు అమ్ముతాం అన్నారు, కొన్నే కదా ఇబ్బందేముంది అనుకున్నా
వారు చివరికి నాకోసం వచ్చారు – తీరా చూస్తే నాగురించి ప్రశ్నించేవారు మిగల్లేదు –
చివరిగా లాభనష్టాలతోనిమిత్తం లేకుండా నేను పనిచేస్తున్న కంపెనీ ప్రయివేటుకు ఇస్తా మంటున్నారు, నాకు మద్దతుగా మాట్లాడేవారు లేకుండా పోయారు ”
అన్నట్లుగా అనేక మంది ఇప్పుడు ముప్పు ముంచుకు వస్తున్నందున వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. వారి సంఖ్య పెరిగే లోపు, ప్రతిఘటనకు సిద్దపడేలోగా లాభాలు, సంపదలను సృష్టించే కంపెనీలను కూడా వదిలించుకొనేందుకు విధానపరంగా పూనుకున్నారు. అందువలన ఇక దాచేదేముంది చెప్పేదేదో గట్టిగా చెబితే అటో ఇటో తేలిపోతుందని, ఇంక ఎంత వ్యతిరేకించినా జరిగేది జరగక మానదని జనం నిరుత్సాహంతో నీరుగారి పోవాలనే ఎత్తుగడతో ఆర్భాటంగా నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. తాము ఎంత కఠినంగా ఉండేది దేశానికి చూపేందుకు రైతులు ఢిల్లీకి రాకుండా రోడ్ల మీద మేకులు కొట్టి, ఎంతకాలం రోడ్ల మీద ఉంటారో ఉండండి అని భీష్మించుకున్న తీరును చూస్తున్నాము. దీనికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్ధ దెబ్బతిన్నది కనుక దానికి నిధులు అవసరమని ఒక సాకుగా చూపవచ్చు. కొంత మందిని అయినా నమ్మించి వ్యతిరేకతను తగ్గించవచ్చు.


ఇప్పటికే ఉన్న ఆస్తుల ద్వారా స్ధిరమైన ఆదాయాన్ని పొందుతామని చెబుతున్నారు. జాతీయ మౌలిక సదుపాయాల గొట్టం(నేషనల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ పైప్‌లైన్‌-నిప్‌) కోసం 43లక్షల కోట్ల రూపాయలతో రూపొందించిన పధకానికి ధన ఆర్జన గొట్టం ద్వారా ఆరు లక్షల కోట్ల రూపాయలు సమకూర్చాలని ప్రతిపాదించారు. మరికొన్ని లెక్కల ప్రకారం వీటితో సహా మొత్తం 111 లక్షల కోట్లతో అభివృద్ది అని చెబుతున్నారు. 2022-25 ఆర్ధిక సంవత్సరాల మధ్య రోడ్లను ప్రయివేటు వారికి అప్పగించటం ద్వారా రు.1,60,200 కోట్లు, రైల్వేల ద్వారా రు.1,52,496 కోట్లు, పవర్‌ ట్రాన్సిమిషన్‌ ద్వారా రు.45,200 కోట్లు, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 39,832 కోట్లు, సహజవాయు పైప్‌లైన్‌ ద్వారా రు.24,462 కోట్లు, టెలికాం టవర్ల ద్వారా రు.35,100, గోదాముల ద్వారా రు.28,900, గనుల నుంచి రు.28,747, ప్రోడక్ట్‌ పైప్‌లైన్‌ ద్వారా రు.22,504, వైమానిక రంగం నుంచి రు.20,782, పట్టణ రియలెస్టేట్‌ నుంచి రు.15,000, రేవుల ద్వారా రు,12,828, స్టేడియంల ద్వారా రు.11,450 కోట్ల రూపాయలను ఆర్జించాలని ప్రతిపాదించారు. వీటిలో నిరర్దక ఆస్తులు లేదా ఆదాయం రాని ఆస్తులు ఏవో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. ఈ మధ్య బ్రౌన్‌ ఫీల్డ్‌ మరియు గ్రీన్‌ ఫీల్డ్‌ ఆస్తులు అనే పదాలు వాడుతున్నారు. ఇప్పుడు ఉనికిలో ఉన్న ఆస్తులు మొదటి తరగతి, కొత్తగా ఏర్పాటు చేసేవి రెండవ తరగతి. రెండవ తరగతిని ప్రయివేటు రంగానికి అప్పగించాలన్నది నిర్ణయం. ఉన్న వాటిని ప్రయివేటీకరించటం లేదా కౌలుకు ఇవ్వటం ద్వారా జనాల నుంచి పిండే మొత్తాల విషయాన్ని కూడా పాలకులు చెబితే నిజాయితీని అర్ధం చేసుకోవచ్చు.


ఆస్తులను ప్రయివేటు వారికి అప్పగించే కేంద్ర ప్రకటన, విధానాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. దాని మీద నిర్మలమ్మ, మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఇతరులకు ఆగ్రహం వచ్చింది. బిడ్డా 2008లో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ అభివృద్దికి ప్రయివేటు వారిని ఆహ్వానించినపుడు ఏం చేసినవ్‌, వాటి పత్రాలను నాడు ఎందుకు చించివేయలేదు ? ఎందుకు నోర్మూసుకున్నవ్‌ అని నిర్మలమ్మ ప్రశ్నించారు. మీ అమ్మ సోనియా గాంధీ అప్పుడు దేశాన్ని అమ్మేందుకు ప్రయత్నించారని స్మృతి ఇరానీ అన్నారు. కాంగ్రెస్‌ పాలనలోని రాష్ట్రాలు కూడా చేస్తున్నది ఇదే, దాని అర్ధం అవి కూడా ప్రయివేటీకరిస్తున్నాయా అని నిలదీశారు. ఒకటి స్పష్టం. గతంలో కాంగ్రెస్‌-ఇప్పుడు బిజెపి రెండూ ప్రజల ఆస్తులను ఏదో ఒక సాకుతో ప్రయివేటు పరం చేస్తున్నారని తేలిపోయింది. అప్పుడు పూర్తిగా చేయలేకపోయారు, ఇప్పుడు తెగించి సంపూర్ణం చేయదలచారు. కాంగ్రెస్‌, ఇతర ప్రాంతీయ పార్టీల పాలిత రాష్ట్రాలు కూడా వీటికి మినహాయింపు కాదు. ఏడు దశాబ్దాల్లో సమకూర్చిన రత్నాలను ఇద్దరు ముగ్గురు స్నేహితులైన వాణిజ్యవేత్తలకు బహుమతిగా కట్టబెడుతున్నారని రాహుల్‌ గాంధీ విమర్శించారు. మొత్తం ప్రయివేటీకరణ, మోనిటైజేషన్‌ గుత్తాధిపతులను సృష్టించేందుకే అని ఇదంతా ఎవరికోసం చేస్తున్నారో ప్రతి ఒక్కరికీ తెలుసు అన్నారు.


సుపరిపాలన అందిస్తామని చెబుతున్న పాలకులు ప్రభుత్వ రంగంలో పని చేసే వారిని దారిలో పెట్టి కమశిక్షణ కలిగిన జాతిగా రూపొందించే కృషిలో పని సంస్కృతిని అభివృద్ధి చేసేందుకు ఎందుకు ప్రయత్నించరు , వారు చెప్పే జాతి నిర్మాణం అంటే ఏమిటి ? ప్రభుత్వ రంగం అంటే అసమర్ధకు మారు పేరు అంటున్న వారు ప్రయివేటు రంగం అసమర్ధత గురించి ఎందుకు చెప్పరు ? నరేంద్రమోడీ ప్రపంచనేత అని చెబుతున్నారు, ధనార్జన ఆయన కలల సాకారం అని కూడా చెప్పారు. అనేక దేశాలను పర్యటించిన అనుభవం కూడా ఉంది. గనుక ఇలాంటి ధనార్జన చేస్తున్న ఇతర దేశాల అనుభవాలను జనానికి ఎందుకు చెప్పరు ? అన్ని దేశాల సంగతి వదిలేద్దాం. చతుష్టయంలో భాగమైన ఆస్ట్రేలియా గురించి అయినా ఎందుకు ప్రస్తావించలేదు ? అక్కడేం జరిగింది ? మరో భాగంలో చూద్దాం !

ఈ వ్యాసానికి రెండవ ముగింపు భాగ లింక్‌
https://vedikaa.com/2021/08/29/national-monetisation-pipeline-part-two-modi-inviting-failed-private-sector-to-take-over-public-assets/

Share this:

  • Tweet
  • More
Like Loading...

తాలిబాన్లు వద్దు – తాలిబానిజం ముద్దు ! మరోసారి ముందుకు వచ్చిన మనువాద చర్చ !!

22 Sunday Aug 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Women

≈ Leave a comment

Tags

Afghanistan Talibans, BJP, Hindu Fundamentalism, Hinduism, Manu Statue, Manusmriti, RSS, saffron talibans


ఎం కోటేశ్వరరావు


అమెరికా వాడు ఆఫ్ఘనిస్తాన్నుంచి పారిపోవటాన్ని ఎవరి కోణంలో వారు చూస్తున్నారు. మిగతా అంశాల గురించి రాబోయే రోజుల్లో ఎలాగూ చర్చించుకుంటాం. మన దేశానికి చేసిన ఒక మంచి గురించి చెప్పకతప్పదు. తమకు ఏది మంచి అయితే దాన్ని చేయటం తప్ప నమ్మిన వారిని పట్టించుకొనే అవసరం మాకు లేదు అని మన దేశంలో వారి మీద మరులు గొన్నవారికి చెంపచెళ్లు మనిపించి మరీ చెప్పాడు. మతశక్తుల మంచి చెడ్డల గురించి చర్చ, విశ్లేషణలు జరిగేందుకు దోహదం చేశాడు. ఇప్పుడు అదే జరుగుతోంది.అనేక మంది తాలిబాన్లు-ఆర్‌ఎస్‌ఎస్‌ పోలికలను ముందుకు తెస్తున్నారు. గతంలో ఏదైనా అడిగితే పాకిస్తాన్‌ వెళ్లండి అని చెప్పే బిజెపి నేతలు ఇప్పుడు బాణీ మార్చి ఆప్ఘనిస్తాన్‌ వెళ్లమని సలహా ఇస్తున్నారు. తమ ప్రత్యర్ధులను తాలిబాన్ల మాదిరి తన్నాలని పిలుపులు ఇస్తున్నారు.


మధ్య ప్రదేశ్‌లోని కట్ని జిల్లా బిజెపి అధ్యక్షుడు రామ్‌రతన్‌ పాయల్‌ను ద్రవ్యోల్బణం, పెట్రోలు ధరల గురించి ఒక విలేకరి అడిగితే దురదగొండి ఆకు పూసుకున్నట్లుగా ప్రవర్తించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పెట్రోలు లీటరు 50రూపాయలైనా కొనేవారు లేరంట అక్కడికి వెళ్లి కొనుక్కోండి అంటూ మండిపడ్డారు. కరోనా మూడవ తరంగం వస్తుందని అందరూ అనుకుంటుంటే పెట్రోలు గురించి మాట్లాడుతున్నావు, కరోనా కనిపించటం లేదా అని ఎదురుదాడికి దిగిన వీడియో తెగ ప్రచారం అయింది. బీహార్‌లోని బిస్‌ఫీ నియోజకవర్గ బిజెపి ఎంఎల్‌ఏ హరిభూషన్‌ ఠాకూర్‌ను ఒక విలేకరి తాలిబాన్లు అధికారానికి వచ్చిన ప్రభావం భారత్‌ మీద ఎలా ఉంటుంది అని అడిగారు. ఆ పాపానికి ఇక్కడ భయపడేవారంతా అక్కడికి పోవచ్చు, పెట్రోలు, డీజిలు ధరలు చౌక అని ఎద్దేవా చేశారు. ఒకసారి అక్కడికి వెళితే ఇక్కడి ప్రత్యేకత తెలుస్తుంది అన్నారు. మతమేదైనా ఆప్ఘన్‌ శరణార్దులను అందరినీ అనుమతించాలన్న జెడియు నేత వ్యాఖ్యను గేలిచేస్తూ అప్పుడు మన దేశం కూడా తాలిబాన్లతో నిండిపోతుందన్నారు. తాలిబాన్లు మన దేశంలో స్వాతంత్య్ర సమర యోధుల వంటి వారు అని ఉత్తర ప్రదేశ్‌లోని సమాజవాది పార్టీ ఎంపీ షఫికుర్‌ రహమాన్‌ వ్యాఖ్యానించినందుకు యుపి బిజెపి ప్రభుత్వం దేశద్రోహ కేసు బనాయించింది. ఇటీవలనే కేంద్ర మంత్రిగా నియమితులైన ప్రతిమా భౌమిక్‌ గారిని సన్మానించేందుకు త్రిపురలోని బెలోనియా పట్టణంలో బిజెపి వారు ఒక సభను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు అడుగుపెడితే తాలిబాన్ల పద్దతుల్లో వారిని తరిమివేయాలని పార్టీ ఎంఎల్‌ఏ అరుణ్‌ చంద్ర భౌమిక్‌ బిజెపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


తాలిబాన్లను ఎవరూ సమర్ధించటం లేదు. ఆప్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా పారిపోయినందుకు సంతోషం తప్ప మతఛాందసులు వచ్చినందుకు కాదు. అయినా మన దేశంలో తాము తప్ప మిగిలిన వారందరూ తాలిబాన్లకు మద్దతు ఇస్తున్నారన్నట్లుగా బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నారు. తాలిబాన్లకు అధికారాన్ని అప్పగించేందుకు ఒప్పందం చేసుకున్నది అమెరికా, దాని సంతకాల కార్యక్రమానికి హాజరై సంతోషాన్ని వెలిబుచ్చింది నరేంద్రమోడీ సర్కార్‌. అమెరికా తప్పుకున్న తరువాత దేశం తాలిబాన్ల వశం అవుతుందన్న కనీస పరిజ్ఞానం మన ప్రభుత్వానికి లేదా ? ఎందుకు సమర్ధించినట్లు ? జనానికి బుర్రల్లేవనుకుంటున్నారా ? తాలిబాన్‌ షరియా చట్టాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న బిజెపి వారు ఇప్పటికే అమల్లో ఉన్న దేశాల్లో మహిళల గురించి ఎప్పుడైనా ఈ మాదిరి గుండెలు బాదుకున్నారా ? ముస్లింలు ఉన్న ప్రతి చోట దేశ రాజ్యాంగాలతో నిమిత్తం లేకుండా మత పెద్దలు అనధికారికంగా ఆ చట్టాలను అమలు జరుపుతున్నారు. ఇక పూర్తిగా లేదా పాక్షికంగా అధికారిక గుర్తింపు ఇచ్చిన దేశాలలో ఆఫ్ఘనిస్తాన్‌, ఇండోనేషియా, పాకిస్తాన్‌, ఈజిప్టు, ఎమెన్‌, ఇరాన్‌, ఇరాక్‌, మలేషియా, మాల్దీవులు, మారుటేనియా, కతార్‌, సౌదీ అరేబియా,నైజీరియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఉన్నాయి.


ఇక మనుస్మృతి విషయానికి వస్తే ఇస్లాంలో షరియత్‌ను ముస్లింలు అందరూ ఆమోదించారని, ఆ మాదిరి మనుస్మృతిని హిందువులందరూ ఆమోదించాలనే బలవంతం ఏమీ లేదని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఇస్లామిక్‌ రాజ్యాలుగా ప్రకటించుకున్నవి బలవంతంగా అమలు జరపటం తప్ప షరియత్‌ను పాటించటమా లేదా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకొనే స్వేచ్చ ఇస్తే అప్పుడు తెలుస్తుంది. మన దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని, సమాజాన్ని వేల సంవత్సరాల వెనక్కు తీసుకుపోవాలని చూస్తున్న మనువాదుల లక్ష్యం నెరవేరితే జరిగితే సంభవించే పరిణామం ఏమిటి ? మరో పాకిస్తాన్‌గా మారిపోతుంది. అవకాశం లేకగానీ లేకుంటే ఈ పాటికి దేశాన్ని ఎప్పుడో మతరాజ్యంగా మార్చి ఉండేవారు. అప్పుడు రాజ్యాంగం స్దానంలో మనుస్మృతిని అమలు చేసేవారు.ఇదేమీ నిరాధార ఆరోపణ కాదు. అనేక మంది ఈ దేశంలో ఇప్పుడు భయపడుతున్నది ఇదే.


ఆర్‌ఎస్‌ఎస్‌ వాణి ఆర్గనైజర్‌ పత్రిక 1949 నవంబరు 30వ తేదీ సంచికలో రాసిందేమిటి ? ” భారత నూతన రాజ్యాంగం గురించి చెప్పాలంటే అత్యంత చెడు ఏమంటే దానిలో భారతీయం లేకపోవటమే.రాజ్యాంగాన్ని రాసిన వారు బ్రిటీష్‌, అమెరికా, కెనడా, స్విస్‌ మరియు ఇతర రాజ్యాంగాలలోని అంశాలను చేర్చారు. పురాతన భారతీయ చట్టాల ఆనవాళ్లు, వ్యవస్ధలు, నామావళి,శబ్ద-శైలీ విన్యాసాలుగానీ లేవు. పురాతన భారత్‌లో జరిగిన అపూర్వమైన రాజ్యాంగ అభివృద్ది ప్రస్తావన గానీ లేదు. పురాతన గ్రీకు, పర్షియా చట్టాల కంటే ఎంతో ముందుగా రాసినవి మను చట్టాలు.మనుస్మృతిలో ఉద్ఘోషించిన చట్టాలు ప్రపంచవ్యాపితంగా ఉద్వేగ పరిచే, ఆరాధించేవి, అనుసరణకు పురికొల్పేవి, కానీ మన రాజ్యాంగ పండితులకు అర్ధం లేనివి.” కాశ్మీరు రాష్ట్రాన్ని , రాజ్యాంగంలోని మౌలిక అంశమైన ఆర్టికల్‌ 370 ఒక్క రోజులో ఎలాంటి చర్చ లేకుండా రద్దు చేసిన పెద్దలు రాబోయే రోజుల్లో మనుస్మృతి, పురాణాలు, వేదాలతో రాజ్యాంగాన్ని నింపివేయరనేే హామీ ఏముంది ?


మనుస్మృతిలో ఏముంది ? రెండున్నరవేల శ్లోకాలు ఉంటే వాటిలో బ్రాహ్మలు, క్షత్రియుల విధులు, కర్తవ్యాలు, పాలన,హక్కులకు సంబంధించి రెండువేలకు పైగా ఉంటే, వైశ్యులు, శూద్రుల బాధ్యతలు, మహిళల కట్టుబాట్లు, పరిమితుల గురించి మిగిలినవి ఉన్నాయి. పాలక – పురోహిత పెత్తనం తప్ప సామాన్యుల హక్కుల గురించి ఉన్నదేమిటో ఎవరైనా చెబితే సంతోషం. అలాంటి దాని ప్రాతిపదికన రాజ్యాంగ రచన అంటే కాషాయ తాలిబానిజం తప్ప మరొకటి ఏముంది? మనువాదం అంత గొప్పది, పురాతనమూ, ఆదర్శమూ అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంటరానితనం, పిల్లలను కనటానికి, వంట, ఇంటికి మహిళలను ఎందుకు పరిమితం చేసినట్లు ?
మనుస్మృతిలో పరస్పర విరుద్ద అంశాలు కూడా ఉన్నాయి. ఎవరికి వారు తమకు అనుకూలమైన వాటిని తీసుకొని వాదనలను సమర్ధించుకుంటున్నారు. అయితే ఆచరణను గీటురాయిగా తీసుకుంటే వ్యతిరేకమైనవే అమల్లో ఉన్నాయి.ఉదాహరణకు మహిళల హక్కులకు సంబంధించి ఒక దగ్గర స్త్రీ పురుషులెవరూ వివాహాన్ని రద్దు చేసుకోరాదని ఉంది. మరికొన్ని చోట్ల చేసుకోవచ్చని ఉంది. కానీ హిందూకోడ్‌ బిల్లు వచ్చేంత వరకు అలాంటి హక్కులు అమలు జరుపుకున్నవారెంత మంది ? తన కులం గాని వారిని వివాహం చేసుకోవటాన్ని నిషేధించింది. ఇప్పుడు జరుగుతున్న అనేక హత్యలు, కులపంచాయతీలకు ప్రాతిపదిక అదే కదా ! బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, అవసానదశలో మగపిల్లల రక్షణలో ఉండాలని, భర్తను దేవుడిగా పూజించాలని చెప్పారు. మహిళలను ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు సంతోషిస్తారని ఒక చోట చెబుతారు. స్వంతంత్ర జీవనం కోరుకోరాదని మరోచోట అదేశిస్తారు. పురుషులను భ్రష్టు పట్టించటం మహిళల సహజలక్షణ మని చెబుతారు.ఇలా స్త్రీని కించపరిచే, ఆంక్షలు విధించే అంశాలు ఎన్నో ఉన్నాయి.


కొన్ని కులాల వారు ” గుట్టలు, చెట్లు, శ్మశానాల దగ్గర, కొండలు, తోపుల్లో ఉండాలి.జన్మసిద్దమైన కార్యకలాపాల జీవనంతో గుర్తు పట్టేవిధంగా ఉండాలి.” ” భరించలేని అంటరాని వారు,కుల భ్రష్ట జనితులు గ్రామాల వెలుపల ఉండాలి, పారవేసిన పాత్రలు, కుక్కలు, గాడిదలను తమ సంపదలుగా పరిగణించాలి. వారు మరణించిన వారి దుస్తులను ధరించాలి, పగిలిపోయిన పాత్రల్లో వారి ఆహారం ఉండాలి, ఆభరణాలు ఇనుముతో చేసినవిగా ఉండాలి, ఎప్పుడూ దూరంగానే తిరుగుతుండాలి. తన విధులు నిర్వర్తిస్తున్న పురుషుడు వారితో సంబంధాన్ని కోరుకోకూడదు, ఒకరి తరువాత ఒకరితో కార్యకలాపాలు నిర్వహించాలి.వారి మాదిరి ఉండేవారితోనే వివాహం చేసుకోవాలి. ఆహారం కోసం వారు ఇతరుల మీద ఆధారపడాలి.వారికి పగిలిపోయిన పాత్రల్లోనే ఆహారం పెట్టాలి. వారు పట్టణాలు,గ్రామాల్లో రాత్రుళ్లు నడవ కూడదు. పగలు తమ పనికోసం వారు తిరగవచ్చు. రాజు జారీ చేసిన ఆజ్ఞల ప్రకారం ప్రత్యేకమైన గుర్తులతో గుర్తుపట్టేవిధంగా వారు ఉండాలి. బంధువులు లేని వారి శవాలను వారు మోయాలి, ఇది తిరుగులేని నిబంధన. రాజాజ్ఞ ప్రకారం మరణశిక్షలను అమలు జరపాలి. మరణశిక్షకు గురైనవారి దుస్తులు, పక్కలు, ఆభరణాలను తమ కోసం తీసుకోవాలి.” ఈ మనుచట్టాలను రాజ్యాంగం రచనలో పరిగణనకు తీసుకోలేదనే వైఖరిని ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా ఆర్గనైజర్‌ మార్చుకున్నదా ? నాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు, ఎవరైనా చెబితే అంగీకరిద్దాం ! అంతేనా ? ” పూజారి పేరు శుభప్రదమైన, సౌకర్యవంతమైన పదంతో ఉండాలి, పాలకుడి పేరు బలాన్ని, రక్షణను సూచించాలి, సాధారణ జనానికి ఆస్తి సంబంధమైనవి, సేవకుడి పేరు సేవను సూచించే, చిరాకు పుట్టించేదిగా ఉండాలి.” ఇవి కూడా మనుధర్మంలో చెప్పినవే సుమా ! సినిమాల్లో అలాంటి ఉదంతాలను ఎవరైనా గుర్తు పట్టవచ్చు.

ముస్లిం మహిళల రక్షణకు ఎవరూ తీసుకురాని చట్టాన్ని తీసుకు వచ్చామని బిజెపి ఊరూ వాడా ప్రచారం చేసుకుంటున్నది. ఎప్పటికెయ్యది అప్పటికా అవసరాలు, అజెండాకు అనుగుణ్యంగా ఎత్తుగడలను మార్చుకోవటాన్ని చూసి ఊసరవెల్లులే సిగ్గుపడతాయి. హిందూ మహిళలకు ఆస్తి , వివాహ, విడాకుల హక్కులు ఇచ్చేందుకు, బహు భార్యాత్వాన్ని నిషేధించేందుకు ఉద్దేశించిన హిందూకోడ్‌ బిల్లు పట్ల అనుసరించిన వైఖరి ఏమిటి ? కేంద్ర మంత్రిగా అంబేద్కర్‌ ప్రతిపాదించిన బిల్లులను వ్యతిరేకిస్తూ 1949 డిసెంబరు 11న ఢిల్లీ రామలీలా మైదానంలో ఆర్‌ఎస్‌ఎస్‌ సభ నిర్వహించింది. హిందూ సమాజం మీద ఆటంబాంబు వంటిది ఈ బిల్లు అని ఒక వక్త సెలవిచ్చారు. అవి పార్లమెంట్‌ ముందుకు వచ్చినపుడు బెంగాల్‌ నుంచి స్వతంత్య్ర అభ్యర్ధిగా ఎన్నికైన హిందూమహాసభ నేత నిర్మల్‌ ఛటర్జీ( సిపిఎం నేత, లోక్‌సభ స్పీకర్‌గా పని చేసిన సోమనాధ్‌ చటర్జీ తండ్రి) వాటిని తీవ్రంగా వ్యతిరేకించారు. సంఘపరివార్‌, హిందూత్వశక్తులే కాదు, కాంగ్రెస్‌లోని మితవాదులు కూడా వాటికి వ్యతిరేకమే. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ కూడా వారిలో ఒకరు. ఇలాంటి ప్రతిపాదనలను ముందు పార్టీల ఎన్నికల ప్రణాళికల్లో పెట్టి ఓటర్ల ముందు చర్చ తరువాత పార్లమెంట్‌కు తీసుకురావాలన్నారు. ఎందుకని మనుధర్మం వాటికి వ్యతిరేకం గనుక ! చివరికి నెహ్రూ అనేక రాజీలతో చట్టానికి ఆమోదం పొందారు.


మన రాజ్యాంగం ప్రకారం మనువు, మహమ్మద్‌, ఏసుక్రీస్తు మరొక మత బోధనలకు స్ధానం లేదు. అయినప్పటికీ రాజస్తాన్‌ హైకోర్టు ముందు 1989లో రాజస్తాన్‌ జుడీషియల్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ మను పేరుతో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి దానికి వ్యతిరేకంగా అనుకూలంగా నిరనసలు-సమర్ధనలు జరుగుతున్నాయి. అదే ఏడాది ఆ విగ్రహాన్ని తొలగించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఒక పాలనాపరమైన ఉత్తరువు జారీ చేసింది. దాన్ని సవాలు చేస్తూ విశ్వహిందూపరిషత్‌ నేతలు, ఇతరులు ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దాని మీద ఆదేశాన్ని నిలుపు చేస్తూ హైకోర్టు ఆదేశించింది. ప్రదాన న్యాయమూర్తి ఆధ్వర్యాన ఏర్పడిన డివిజన్‌ బెంచ్‌ వాజ్యవిచారణ చేపట్టింది. గత మూడు దశాబ్దాలుగా ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు. కొంత మంది దళిత సంఘకార్యకర్తలు ఆ కేసులో ప్రతివాదులుగా చేరారు. చివరి విచారణ 2015లో జరిగింది. బ్రాహ్మణ న్యాయవాదుల నిరసనల కారణంగా కేసు ముందుకు పోలేదు. ప్రతి ఏటా మను విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా జరిగాయి. కేసు తేలేవరకు విగ్రహం కనపడకుండా ముసుగు కప్పాలని అధికారులు ఆపని చేయకపోతే తామే అందుకు పూనుకుంటామని కార్యకర్తలు హెచ్చరించారు.మనుధర్మం పేరుతో అమలు చేసిన అంశాలు దళితులు, మహిళలను అణచివేశాయని కొందరు చెబుతున్నారు. వాటికీ మను ధర్మానికి సంబంధం లేదు అని మరికొందరు అంటున్నారు. మరోనోటితో మను ధర్మాలు అమలు జరిగాయంటారు. ఏది నిజం ? మరి స్వేచ్చ లేకపోవటానికి, అణచివేత, అంటరానితనం, కులాలవారీ చీలిపోవటానికి కారణాలు ఏమిటి ? మనువాదుల నుంచి సరైన సమాధానం లేదు.వారు చెప్పేవి తర్కానికి నిలిచేవి కాదు. ఇదే సూత్రం షరియ చట్టాలకూ వర్తిస్తుంది.అదీ తర్కానికి నిలవదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ముందు ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్లాల్సింది ఎవరు ? నిర్మలక్క, స్మృతక్క, కంగనక్క, సాధ్వులు, ప్రచారక్‌లా ? ఇతరులా !!

20 Friday Aug 2021

Posted by raomk in BJP, CHINA, Communalism, Congress, CPI(M), Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Afghanistan Talibans, Akhand Bharat, BJP, BJP’s trolling army, China, Donald trump, Narendra Modi, Propaganda War, RSS


ఎం కోటేశ్వరరావు


” అరెస్టు స్వర భాస్కర్‌ ” ఇప్పుడు సామాజిక మాధ్యమంలో నడుస్తున్న మరుగుజ్జుదాడి. ఎందుకటా ! ఆ సినీ నటి తాలిబాన్ల భయానికి – హిందూత్వ భయానికి(టెర్రర్‌) పెద్ద తేడా లేదని తన అభిప్రాయాన్ని సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. ఏకీభావం ఉంటే సరే లేకపోతే విభేదించవచ్చు, అభిప్రాయం చెప్పినంత మాత్రాన్నే ఆమెను అరెస్టు చేయాలనటం ఏ ప్రజాస్వామిక న్యాయం? ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చింది ఎవరు ? ఇంతకీ స్వర భాస్కర్‌ చెప్పిందేమిటి ? ” తాలిబాన్‌ భయంతో దిగ్భ్రాంతికి గురైనట్లు, సర్వనాశనం అయిందని అనుకుంటున్నారు అందరూ, హిందూత్వ భయాన్ని కూడా మనం అంగీకరించకూడదు. తాలిబాన్‌ భయంతో నీరుగారి పోకూడదు, హిందూత్వ భయం మీద అందరం ఆగ్రహించాలి. అణిచివేసిన మరియు అణచివేతకు గురైన వారెవరు అన్న ప్రాతిపదికన మన మానవత్వం మరియు నైతిక విలువలు ఉండకూడదు.” దీన్లో తప్పేముంది. అమెఎవరినీ పేరు పెట్టి కూడా విమర్శ చేయలేదు.


ఆమె మీద ప్రచారదాడికి దిగిన వారు అంటున్నదేమిటి ? తాలిబాన్‌ – హిందుత్వ రెండింటినీ ఒకేగాటన కట్టకూడదు. ఆ మాటే చెప్పండి. అరెస్టు చేయాలనటం ఏమిటి ? ఈ డిమాండ్‌ ఎందుకు వచ్చింది ?మహారాష్ట్రలో బిజెపికి చెందిన ఒక లాయర్‌గారు ఆమె మీద పోలీసులకు ఒక ఫిర్యాదు ఇచ్చారు. మతం పేరుతో జనాల్లో శత్రుత్వాన్ని పెంచుతున్నారు అన్నది ఆరోపణ. అంతవరకే పరిమితం కాలేదు. స్వరభాస్కర్‌ను అరెస్టు చేయాలనే హాషటాగ్‌తో సామాజిక మాధ్యమంలో ప్రచారానికి కూడా దిగారు. దాన్ని అందుకొని మిగతావారు తలా ఒకరాయి వేస్తున్నారు. ఎవరు వారంతా… బిజెపి వారే. స్వర భాస్కర్‌ మీద కాషాయ తాలిబాన్ల దాడి కొత్త కాదు. గతంలో ఇజ్రాయెల్‌ చర్యలను వ్యతిరేకిస్తూ పాలస్తీనియన్ల నిరసనలకు ఆమె మద్దతు ప్రకటిస్తూ ఇజ్రాయెల్‌ను జాతివివక్ష దేశంగా వర్ణించారు. దానికి గాను ఆమెను తూలనాడుతూ దాడి చేశారు. ఇజ్రాయెల్‌ను ఆమె విమర్శిస్తే వారికి ఇబ్బంది ఏమిటి ? పెగాసెస్‌ ఉప్పు తిన్నందున కృతజ్ఞతగా ఇజ్రాయెల్‌ను పొగడండి, పూజించండి. ఎవరిష్టం వారిది. భగవద్గీతను కూడా అంత నిష్టగా, సంఘటిత పద్దతిలో పంచరు. హంతకుడు గాడ్సే నేనెందుకు గాంధీని చంపాను అంటూ కోర్టులో చేసిన వాదనను పుస్తకంగా ప్రచురించి పంచుతుంటే ఎవరైనా అడ్డుకున్నారా? ఏది సరైనదో జనం నిర్ణయించుకుంటారు. ఏ దేశాన్ని ఎలా విమర్శించకూడదో మీరే నిర్ణయిస్తారా ? విమర్శకుల మీద దాడి ఫాసిస్టు లక్షణం తప్ప మరొకటి కాదు. ఇస్లామ్‌కు షరియత్‌ ఎలాగో హిందూ మతం అని చెప్పుకొనే వారికి మనుస్మృతి కూడా అలాంటిదే కదా ! మన రాజ్యాంగంలో మనుస్మృతి ప్రతిబింబించలేదని, దానికి అడ్డుపడింది అంబేద్కరే అనే విమర్శలు చేస్తున్నదెవరు ? మనువాద భావజాలం ఉన్నవారే కదా ! స్వర భాస్కర్‌ వంటి వారు చెబుతున్నది అదే కదా !


ఇప్పుడు తాలిబాన్ల రాకతో ఆఫ్ఘన్‌ మహిళల ఉనికికే ముప్పు ముంచుకు వచ్చిందని సాంప్రదాయ, సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నిజమే, ఉగ్రవాదం అది మత లేదా మరొక ఉగ్రవాదం అయినా ముందు బలయ్యేది మహిళలే. భావజాలం రీత్యా, రాజకీయంగా వ్యతిరేకులైన మహిళానేతలు, కార్యకర్తలు, ప్రముఖులు, కొన్ని పార్టీల వారి పేర్లతో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ వెళతారా అని ఎద్దేవా చేస్తూ ఊరూ పేరూ లేకుండా కొందరు పోస్టులు పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఒక పోస్టులో ఇలా ఉంది.” సంధ్యక్క, దేవక్క, పుణ్యవతక్క, మలాలా,బర్ఖదత్‌, అమీర్‌ ఖాన్‌, జావేద్‌ అక్తర్‌, హమీద్‌ అన్సారీ, నసీరుద్దీన్‌ షా, దీపికా పడుకొనే, తమన్నా బాటిల్‌, మిర్చి దేశారు, రాజ్‌దీప్‌ సర్దేశాయి, దయచేసి ఆప్ఘాన్‌ ఆడపిల్లలను రక్షించండి. తక్షణమే మీ అవసరం వారికి ఉంది. మోడీ పెద్ద ఫాసిస్టు ….. ఆయన చేయలేరు. మీరే వెళ్లండి…. వారిని రక్షించండి. ఒవైసీ దయచేసి వారికి నేతృత్వం వహించండి. కావాలి అంటే దేశంలో పెద్ద యువకుడు కరాటే కుంగ్ఫు లాంటి విలువిద్యల్లో నైపుణ్యుడు రాహుల్‌ గాంధీని, పెళ్లికాని యువకురాలు, రెండు చేతులతో రాళ్లు రప్పలు సోడాలు విసరగల మమతా బేగాన్నీ సహాయకంగా తీసుకు వెళ్లండి. అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయించండి. ఎలాగూ లాయర్‌ కప్ప చీబల్‌ ఉన్నాడు… మర్చి పోకండి పిల్లిజ్‌ ” అంటూ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌ పరిణామాల మీద సామాజిక మాధ్యమంలో ఊరూ పేరు చెప్పుకొనేందుకు సిగ్గుపడే కొంత మంది పేరు లేకుండా ఒక పధకం ప్రకారం లౌకివాదులు, కమ్యూనిస్టులు, ఇతర పార్టీల వారి మీద చేస్తున్న దాడి ఇది.


వారు వెళతారా లేదా అన్నది తరువాత చూద్దాం. ముందు వెళ్లాల్సిన వారు వెళ్లకుండా ఇతరుల మీద ఎదురుదాడికి దిగారు. కొంతమంది ప్రవచించే అఖండభారత్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ ఉందా లేదా ! అది ఉందని చెబుతూ మడికట్టుకున్నట్లు ప్రచారం చేసుకొనే ప్రచారక్‌లు, సాధ్వులు, సాధువులు, వారికి మద్దతు ఇస్తున్న కాషాయ దళాలు కదా ముందుగా ఆఫ్ఘన్‌ వెళ్లాల్సింది. ఒకనాడు అఖండభారత్‌లో భాగమై, ఇప్పుడు విడిగా ఉంటున్న దేశాలన్నీ( ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌, చైనా-టిబెట్‌, నేపాల్‌, భూటాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, మయన్మార్‌) ఎప్పటికైనా ఒకటి కావాల్సిందే అని చెబుతున్నవారు కదా ముందుగా కదలాల్సింది ! అందులోనూ నిన్నటి వరకు ఉగ్రవాదుల మీద పోరు సలిపామని చెప్పుకొనే వారు ఇప్పుడు ఇతరులు వెళ్లాలని చెప్పటం ఏమిటి ?తాలిబాన్లు వచ్చారు కనుక మహిళలకు ముప్పు వచ్చిందని ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నవారు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలున్నాయి. వారితో ఒప్పందం చేసుకున్నది అమెరికా ! దాన్ని హర్షించింది నరేంద్రమోడీ సర్కార్‌ ! తాము మారినట్లు తాలిబాన్లు ఇప్పుడు చెబుతున్నారు తప్ప ఒప్పంద సమయంలో స్వయంగా వారు గానీ-అమెరికా వారు గానీ చెప్పలేదు. అయినా దాన్ని దాన్ని మనంఎందుకు హర్షించినట్లు ? (2020 ఫిబ్రవరి 29, హిందూ పత్రిక) ఏమాత్రమైనా బాధ్యత ఉందా ? అమెరికా వాడు ఏది చేస్తే అదే కరెక్టు అనే గుడ్డి అనుసరణ కాదా ? దోహాలో జరిగిన సంతకాల కార్యక్రమానికి కతార్‌ ప్రభుత్వం మనలను ఆహ్వానించగానే మనం ఎందుకు హాజరు కావాలి? రాజుగారు నందంటే నంది పందంటే పంది అనాలన్నట్లుగా ఉగ్రవాదులుగా ప్రకటించిన తాలిబాన్లతో అమెరికా వాడు ఒప్పందం చేసుకోవటం ఏమిటి ? వారి మీద పోరాడుతున్నట్లు చెప్పుకున్న మనం దాన్ని హర్షించటం ఏమిటి ? మనకు ఒక స్వతంత్ర వైఖరి లేదా ? అమెరికాతో పాటు మనమూ తాలిబాన్లు ఉగ్రవాదులు కాదని చెప్పినట్లే కదా ? మరి ఇప్పుడు బిజెపి మద్దతుదార్లు తాలిబాన్ల గురించి గుండెలు బాదుకోవటం నటన తప్ప నిజాయితీ ఉందా ? ఏకత, శీలము ఉన్నవారు చేయాల్సిన పనేనా ?


ఈ ఒప్పందానికి ముందు డోనాల్డ్‌ ట్రంప్‌ – నరేంద్రమోడీ మధ్య భేటీ జరిగింది. ఆ తరువాతే తాలిబాన్‌ ఉగ్రవాదులతో ప్రజాస్వామ్య అమెరికా చేసుకున్న ప్రయివేటు ఒప్పంద సమయంలో మనం సాక్షులుగా దోహా సమావేశంలో పాల్గొన్నాం. ఆ సందర్భంగా మనకు వినిపించిన కహానీలను 2020 ఫిబ్రవరి 29వ తేదీ హిందూస్తాన్‌ టైమ్స్‌ కథనంలో చూడవచ్చు. ఏమిటటా ! పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కోరిన కోరికలు వ్యక్తిగత స్ధాయిలో ఏవగింపు కలిగించినా ఆఫ్ఘనిస్తాన్‌లో తమ లక్ష్యాల సాధనకు అతనితో మాట్లాడాల్సి వచ్చిందని అమెరికా మనకు చెప్పిందట.పాకిస్తాన్‌ తమకు నమ్మదగిన మిత్రుడు కాదని కూడా చెప్పారట. అలా అయితే సరే అని మనం అన్నామట. గత 19 సంవత్సరాలుగా మనం సాధించిన ఆఫ్ఘన్‌ రాజ్యాంగం, మహిళల, మైనారిటీల హక్కులు, ఆఫ్‌ఘన్‌ రక్షణ దళాలను నష్టపోకూడదనే అంశం గమనంలో ఉంచుకోవాలని కూడా అమెరికాకు చెప్పామట. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే బాణాకర్రను (బిక్‌ స్టిక్‌) ప్రయోగించే అవకాశాన్ని అట్టిపెట్టుకుంటామని అమెరికా మనకు చెప్పిందట. అమెరికా-తాలిబాన్ల మధ్య అవగాహనలో పాకిస్తాన్‌ కీలకపాత్రధారి అని ప్రపంచానికి కంతటికీ తెలిసినప్పటికీ మనకు ఇలాంటి లీకు కథలను వినిపించారు.


తీరా జరిగిందేమిటి ? గడువు కంటే ముందే బతుకు జీవుడా అంటూ అమెరికన్లు పారిపోయారు.తమకు సహకరించిన వారి రక్షణకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆప్ఘన్‌ సైన్యం చేతులెత్తేసి లొంగిపోయింది. రాజ్యాంగమూ లేదు పాడూ లేదు. తాలిబాన్లు చెప్పిందే వేదం. మహిళలకు రక్షణ లేకపోయిందని మన పరివార్‌ దళాలే చెబుతున్నాయి. మరి ఇంత జరుగుతుంటే అమెరికా బాణా కర్ర ప్రయోగం ఏమైనట్లు ? మనం ఎందుకు అడగలేకపోతున్నాము. నరేంద్రమోడీ నోరు మెదపటం లేదేం? ఆగస్టుమాసం అంతా భద్రతా మండలి అధ్యక్ష స్ధానం మనదేగా, అక్కడ మానవ హక్కుల రక్షణకు తీసుకున్న చర్యలు, దానికి చొరవ ఏమిటి ? అది చేతగాక మలాలా,సంధ్యక్క, దేవక్క, పుణ్యక్క ఆఫ్ఘనిస్తాన్‌ వెళతారా అని అడుగుతున్నారు. నిజానికి అఖండ భారత్‌లో ఎప్పటికైనా అంతర్భాగం చేస్తామని చెబుతున్న ఆఫ్ఘానిస్తాన్‌కు ముందుగా వెళ్లాల్సింది ఎవరు ? అక్కడి తోటి మహిళలను కాపాడే బాధ్యత నిర్మలక్క, స్మృతక్క, మీనాక్షక్క, కంగనక్క, శాపాలశక్తి గలిగిన సాధ్వీమణులకు లేదా ?


తాలిబాన్ల వెనుక చైనా ఉన్నదని పెద్ద ఎత్తున చెబుతున్నారు, రాస్తున్నారు ? మీడియా వంటవారికి ఈ విషయం ఎప్పుడు తెలిసింది ? అమెరికా వాడు ఒప్పందం చేసుకున్నపుడు, దాన్ని మనం హర్షించినపుడు గానీ ఎవరైనా తాలిబాన్ల వెనుక చైనా ఉంది అని చెప్పిన వారున్నారా ? ఎందుకు చెప్పలేదు ?తోటి ముస్లిం దేశంలో జనాన్ని ఇబ్బందులు పెడుతుంటే ఇతర ముస్లిం దేశాలు, వాటి మిత్ర దేశం చైనా ఎందుకు జోక్యం చేసుకోవు, అక్కడి శరణార్ధులకు ఆశ్రయం ఎందుకు కల్పించవు అంటూ ఒక ప్రచారం. మరికొందరైతే ఇంకొంచెం ముందుకు పోయారు. ఇప్పటి వరకు ముస్లిం దేశాల్లో పరిస్ధితులు బాగోలేనపుడు శరణార్ధులుగా వచ్చిన వారందరినీ పశ్చిమ దేశాల వారే ఆదరించారు. అయితే సదరు ముస్లింలందరూ అక్కడ తమ జనాభాను పెంచి వేసినందున ఇప్పుడు ఆయా దేశాల వారందరూ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ప్రపంచం మొత్తాన్ని ముస్లింలతో నింపటానికి వేసిన ఒక పధకం కనుక ఇతర దేశాల వారెవరూ వారిని అనుమతించటం లేదన్నది మరొక ప్రచారం. ఇలాంటి ప్రచారాలకు ప్రాతిపదికలు, వాస్తవాలతో నిమిత్తం లేదు. మన దేశాన్ని కూడా ముస్లింలతో నింపి వేయటానికి కుటుంబ నియంత్రణ పాటించటం లేదనే ప్రచారం తెలిసిందే.


ఆఫ్ఘనిస్తాన్‌లో 1978లో కొంత మంది అభ్యుదయ వాదులు అక్కడ వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని నాటి సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ గుర్తించింది. అప్పుడు అక్కడ జనమూ ముస్లింలే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వారూ ముస్లింలే. ఆ ప్రభుత్వానికిి వ్యతిరేకంగా జోక్యం చేసుకున్నది ఎవరు ? అమెరికా, ఇతర పశ్చిమ దేశాల వారే కదా ! తొలుత ముజాహిదీన్లు, తరువాత తాలిబాన్లకు మద్దతు, ఆయుధాలు, శిక్షణ ఇచ్చింది ఎవరు ? ఒసామా బిన్‌ లాడెన్‌ను తయారు చేసింది ఎవరు ? వారు ఏకు మేకైన తరువాత అక్కడికి సైన్యాన్ని పంపి దాడులకు రెండు నుంచి మూడులక్షల కోట్ల డాలర్ల వరకు ఖర్చుచేసి దేశాన్ని సర్వనాశనం చేసింది ఎవరు ? పునర్‌నిర్మాణం చేస్తున్నామని చెప్పింది ఎవరు ? అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు, వారితో స్నేహం చేసిన మన దేశమే కదా ? ప్రపంచంలోని ఇతర ముస్లిం దేశాలేవీ ఏనాడూ జోక్యం చేసుకోలేదు, తమ సైన్యాన్ని పంపలేదు, దాడులకు దిగలేదు. పునర్‌నిర్మాణం చేస్తామని చెప్పలేదు, పెట్టుబడులూ పెట్టలేదు. చేసిందంతా అమెరికా, దాని మిత్రులుగా ఉన్న నాటో దేశాల వారైతే ముస్లిం దేశాలు ఆఫ్ఘన్లకు ఆశ్రయం ఇవ్వరెందుకంటూ అతి తెలివి ప్రదర్శనలెందుకు ? ఇప్పటి వరకు ఎంత మంది అలా శరణు కోరారు ? అంటే ఏది చెప్పినా బుర్ర ఉపయోగించకుండా వినే జనాలుంటారన్న చిన్న చూపా ? మానవత్వం మాయమై మతోన్మాదం పెరిగిపోయిన ప్రతి వారికి ప్రతిదానిలో అదే కనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా మత ప్రాతిపదికన శరణార్ధులను ఆదుకున్న దేశాలు ఉన్నాయా ?


ఈ ప్రచారం చేస్తున్న వారే చైనా గురించి చెబుతున్నదేమిటి ? ఆప్ఘన్‌ సరిహద్దులో ఉన్న చైనా రాష్ట్రమైన గ్జిన్‌గియాంగ్‌లో ముస్లింలను ప్రభుత్వం ఊచకోతకు గురి చేస్తుంటే ముస్లిం దేశాలు చైనాను ఖండించవు, దానితో లావాదేవీలను ఎందుకు నిలిపివేయవు అని ప్రచారం చేశాయి. ఇప్పుడు తాలిబాన్లకు-చైనాకు ముడిపెట్టి ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏమిటి ? అదే తాలిబాన్లు, అమెరికా ఇతర దేశాల మద్దతు ఉన్న ఉఘిర్‌ ముస్లిం తెగకు చెందిన కొందరు చైనాలో ఉగ్రవాద, విచ్చిన్న కార్యకలాపాలకు పాల్పడుతూ ఆప్ఘన్‌ గడ్డ మీద ఆశ్రయం పొందుతున్నారు. అమెరికా వెళ్లిపోయిన తరువాత మరొక దేశానికి వ్యతిరేకంగా తమ గడ్డను ఉపయోగించుకొనే శక్తులకు తాము తావివ్వబోమని తాలిబాన్లు రష్యాతో చెప్పారు. చైనాతో చర్చల సమయంలో ఇక ముందు తాము ఉఘిర్‌ తీవ్రవాదులకు మద్దతు, ఆశ్రయం ఇవ్వబోమని చెప్పారు. అయితే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత గుర్తింపు గురించి నిర్ణయిస్తామని చెనా చెప్పింది. తాలిబాన్లు తాము చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారా, ఉల్లంఘిస్తారా ? అప్పుడు చైనా ఏం చేస్తుంది అన్నది ఊహాజనిత ప్రశ్న. తాలిబాన్లు ఉగ్రవాదులా మరొకటా ఏమిటన్నది ఒక సమస్య. ఆఫ్ఘన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరైనా దానికి గుర్తింపు వేరే అంశం. మన పక్కనే ఉన్న మయన్మార్‌లో మిలిటరీ తిరుగుబాటు చేసి అక్కడి ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసి అధికారాన్ని చేపట్టింది. ఆ కారణంతో ఏ దేశమైనా వారితో దౌత్య సంబంధాలను రద్దు చేసుకుందా ? మిలిటరీ చర్య సరైనదే అని సర్టిఫికెట్లు ఇచ్చాయా ? అంతెందుకు, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గోద్రా ఉదంతం అనంతర జరిగిన మారణకాండకు కారకుడంటూ అమెరికా సందర్శనకు అక్కడి ప్రభుత్వం వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు గనుక ఆపని చేయగలిగింది. అదే అమెరికా ప్రభుత్వం ప్రధాని అయిన తరువాత నరేంద్రమోడీపై చేసిన విమర్శను వెనక్కి తీసుకోకుండానే ఎర్రతివాచీ స్వాగతం పలికిందా లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d