• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: tdp

తెలుగుదేశం మీద బిజెపి మెరుపుదాడి: నలుగురు ఎంపీల పట్టివేత !

21 Friday Jun 2019

Posted by raomk in AP, AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Telangana, Telugu

≈ Leave a comment

Tags

BJP, bjp surgical strike on tdp, CHANDRABABU, Defections from TDP, tdp

Image result for bjp surgical strike on tdp four mps captured

ఎం కోటేశ్వరరావు

బాలకోట్‌ మీద రాత్రిపూట జరిపిన మెరుపుదాడిలో ఎందరు వుగ్రవాదులను మట్టుబెట్టారో చెప్పలేరు గానీ, పట్టపగలు అందరి ఎదుటే గురువారం సాయంత్రం తెలుగుదేశం మీద జరిపిన మెరుపుదాడిలో బిజెపి నలుగురు రాజ్యసభ సభ్యులను చేజిక్కించుకుంది. ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు విలీనాన్ని ఆమోదించటం, బిజెపి తన సభ్యుల జాబితాలో నలుగురు సభ్యులైన వై సుజనా చౌదరి, సిఎం రమేష్‌, టిజి వెంకటేష్‌, గరికపాటి మోహనరావు పేర్లను చేర్చటం జరిగిపోయాయి. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా అలాంటి దాడులకే సన్నద్దం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గురువారం నాడు పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగం తరువాత వెంటవెంటనే జరిగిన పరిణామాల్లో వూహకు అందని రీతిలో పనికానిచ్చి తమ తీరే వేరని బిజెపి నిరూపించుకుంది. వీరితో పాటు మరి కొందరు ఎంపీలు, ఎంఎల్‌ఏల కోసం కూడా బిజెపి మాటువేసిందని వార్తలు కొద్ది రోజుల క్రితమే వచ్చినప్పటికీ మరీ ఇంత త్వరలో పని పూర్తి చేస్తారని వూహించి వుండరు. ఒక నిర్ణయం జరిగిన తరువాత నలుగురి నోళ్లలో నానటం ఎందుకు వచ్చే చెడ్డపేరు ఎలాగూ వస్తుంది, ఈ మాత్రం దానికి సిగ్గు ఎందుకు అన్నట్లుగా జరిపించేశారు. కాంగ్రెస్‌ పార్టీ అన్ని రకాల అక్రమాలకు, అత్యవసర పరిస్ధితి వంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడటానికి మూడు దశాబ్దాలు పడితే పూవు పుట్టగానే పరిమళించినట్లుగా వాటిలో ఒకటైన ఫిరాయింపుల ప్రోత్సాహం, కేంద్ర దర్యాప్తు సంస్ధలను వుపయోగించుకొని బెదిరించటానికి రెండవసారి సంపూర్ణ మెజారిటీతో అధికారానికి వచ్చిన నాటి నుంచి బిజెపి ప్రారంభించి తమది భిన్నమైన పార్టీ అని నిజంగానే నిరూపించుకుంది.

తమ నేత చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్లటాన్ని చూసి నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ ఫిరాయించారని తెలుగుదేశం నేతలు కార్యకర్తల్లో మనోభావాన్ని రెచ్చగొట్టేందుకు, ఒక సాకును చొప్పించేందుకు ప్రయత్నించారు. ఫిరాయించే వారు అధినేత వుంటే కాళ్లకు మొక్కి ఆశీస్సులు తీసుకొని సకల లాంఛనాలతో పోతారా ? అదే ప్రమాణం అనుకుంటే వైస్రాయ్‌ వుదంతాలలో ఎన్‌టిఆర్‌కు తెలుగు తమ్ముళ్లు ఇచ్చిన గౌరవం ఏమిటో యావత్‌ దేశం సచిత్రంగా చూసింది. ఎవరూ ఎన్‌టిఆర్‌ ఆశీస్సులు తీసుకోలేదు, ఆయన వుండగానే తిరుగుబాటు చేశారు కదా ! పార్టీ ఎంపీలు, మరికొందరు నేతలు ఏక్షణంలో అయినా పార్టీ మారేందుకు సిద్ధంగా వున్నారని వార్తలు వచ్చినప్పటికీ పార్టీని కాపాడుకోవటానికి ప్రయత్నించకుండా చంద్రబాబు నాయుడు విదేశాలకు విహారయాత్రలకు వెళ్లటం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం వుండదు. తమ సభ్యుల పట్ల మితిమీరిన విశ్వాసమా ?

ఒకటి స్పష్టమైంది. కేంద్ర ప్రభుత్వ సిబిఐ, ఇడి అనే వేట సంస్ధల వేటు నుంచి తప్పించుకోవటానికి వ్యాపారులందరూ కేంద్రంలో, రాష్ట్రాలలో వారికి మిత్రపక్షాలుగా ఎవరు అధికారంలో వుంటే వారితో సయోధ్యగా వుండటమో లేక జతకట్టటమో చేస్తుంటారు. అది గత ఎన్నికల్లోనే వైసిపి ఎంపీల విషయంలో రుజువైంది. ప్రత్యర్ధుల ఆర్ధిక మూలాలను దెబ్బతీసి లొంగదీసుకొనేందుకు అసమర్ధ కాంగ్రెస్‌కు ఐదు దశాబ్దాలు పడితే సమర్ధ బిజెపి కేవలం ఐదు సంవత్సరాలలోనే ఆ విజయాన్ని సాధించింది. సమావేశం లేదు, తీర్మానాలు లేవు, సుజనా చౌదరి బహిరంగంగా చెప్పినట్లు నలుగురూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోలేదు కూడా. ఫిరాయించిన ఎంపీలు అనర్హత వేటును తప్పించుకొనేందుకు పార్టీని విలీనం చేసినట్లు అవసరమైన పత్రాలను తయారు చేయటం, దాన్ని ఏకంగా రాజ్యసభ అధ్యక్షుడు, వుపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి అందచేయటం అంతా నాటకీయంగా జరిగిపోయాయి. రాజకీయ నీతులు చెప్పే వెంకయ్య నాయుడు వారి పత్రాన్ని స్వీకరిస్తూ ఫొటోలకు ఇచ్చిన ఫోజును చూసి ఏమనుకోవాలో జనానికే వదలివేద్దాం. రానున్న రోజుల్లో మిగిలిన తెలుగుదేశం ఎంపీల్లో ఎందరు మిగులుతారనేది శేష ప్రశ్న. ఎంపీల ఫిరాయింపు తెలుగుదేశం ఎంఎల్‌ఏల ఫిరాయింపులను వేగవంతం చేసిందనే వార్తలు వచ్చాయి. తమ నేత విదేశాల నుంచి వచ్చేంతవరకు ఆగుతారా లేక వచ్చిన తరువాతే తాము ఫిరాయిస్తే ఏం చేస్తారో చూస్తాం అంటూ వేచి చూస్తారా అన్నది చూడాలి. జరగనున్నది జరగక మానదు, ముందుగా నిర్ణయించుకున్న యాత్ర పూర్తి చేసి కనీసం కుటుంబసభ్యులనైనా సంతోష పెడితే మంచిదేమో చంద్రబాబు ఆలోచించుకోవాలి.అదే నేను ఇక్కడ వుంటేనా అని చెప్పుకొనేందుకైనా అక్కడే వుండి అంతా పూర్తయిన తరువాత తిరిగి వస్తే కాస్త పరువు దక్కుతుంది. ఫేక్‌ ప్రచారాలను చేయించటంలో తెలుగుదేశంతో సహా ఏ ఒక్క పార్టీ తక్కువ తినలేదు. ఇప్పుడు స్వయంగా తెలుగుదేశం నేత, వారి రాజగురువు రామోజీరావు, ఇతర కుల పెద్దలే ఎంపీలను బిజెపిలోకి పంపారనే సామాజిక మాధ్య ప్రచారానికి వారే సమాధానం చెప్పుకోవాలి.

బిజెపి విషయానికి వస్తే ఆ పార్టీలో మత విద్వేషాలను రెచ్చగొట్టేవారు, గో సంరక్షణ పేరుతో దాడులు చేసే వారు, ఇతర అవాంఛనీయ శక్తులు పుష్కలంగా వున్నాయి. ఇతర పార్టీల నుంచి అవినీతి, అక్రమాల ముద్రపడిన వారు, పార్టీకి పెట్టుబడులు పెట్టగలిగిన వారు కొన్ని రాష్ట్రాలలో దానికి కొరతగా వున్నందున దాన్ని పూడ్చుకొనేందుకు ఎంతగా ఆత్రత పడుతోందో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. తాము అవినీతి ఆరోపణలు చేసిన వారు, తమపై రాజకీయంగా దాడి చేసిన వారిని ఇప్పుడు బిజెపి చేర్చుకుంది. గతంలో సిబిఐ, ఇడి దాడులకు, బిజెపి ఆరోపణలకు గురైన వారిని తెలుగుదేశం పార్టీ సమర్ధించింది. ఇదే అదే పార్టీ వారు ఎంపీలు స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీని వీడారని చెబుతున్నారు, వారివి నాలికలా మరొకటా అన్న అనుమానం వస్తోంది. బిజెపి నేతలకు కూడా ఇదే వర్తిస్తుంది. ఆయారామ్‌ గయారామ్‌ టిజి వెంకటేష్‌ ఏ ప్రయోజనం కోసం తెలుగుదేశం పార్టీలో చేరారో అదే ప్రయోజనం కోసం బిజెపి పంచన చేరారు. మిగిలిన ముగ్గురిదీ అదే దారి.

Image result for bjp surgical strike on tdp four mps captured

కేసులు, ఆరోపణలు వున్నంత మాత్రాన నిర్ధారణ అయ్యేంత వరకు ఎంపీలు నేరం చేసినట్లు కాదని అందువలన తెలుగుదేశం ఎంపీలను తమ పార్టీలో చేర్చుకోవటం తప్పుకాదని బిజెపి నేతలు కుంటిసాకు చెబుతున్నారు. గతంలో డేరాబాబా, ఆశారాంబాపు వంటి నేరగాండ్ల గురించి కూడా బిజెపి నేతలు ఇదే వాదనలు చేసి వారితో అంటకాగిన విషయం తెలిసిందే. బిజెపి ఇలాంటి నేర చరిత్ర, కేసులు వున్నవారిని ఇదే వాదనలతో పెద్ద సంఖ్యలో అభ్యర్ధులుగా నిలిపి మద్దతు పలికింది, తర తమ స్ధాయిలో మిగతా పార్టీలు కూడా అదే బాట పట్టాయి. గతంలో పార్టీల నేతలు తాము ఎంత పరిశుద్ధమో చెప్పుకొనేందుకు తమ రక్తాల గురించి చెప్పేవారు. ఇప్పుడు తెలుగుదేశం లేదా బిజెపి, కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ ఇలా ఏ పార్టీని చూసినా వాటి రక్తాలన్నీ లుషితమే. జన్యువుల్లోనే మార్పులు జరిగాయి. కనుకనే ఏ పార్టీ నుంచి ఎవరు చేరినా వారిని తమలో ఇముడ్చుకోవటానికి వాటికి ఎలాంటి ఇబ్బంది కలగటం లేదు. ఎన్నికల ముందు, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తరువాత కూడా ఫిరాయింపుదార్లను చేర్చుకుంటున్నపుడు వారు ఎన్నికలైన తరువాత ప్రమాణస్వీకారం కూడా చేయకముందే వేరే పార్టీ వైపు చూస్తే, ఫిరాయిస్తే తప్పు పట్టాల్సిన పనేముంది? నీవు నేర్పిన విద్యయే కదా ! అసలు తప్పు ఎవరిది అని చెప్పాల్సి వస్తే అలాంటి వారిని గుడ్డిగా ఎన్నుకుంటున్న జనానిదే అనక తప్పదు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం నేతలను బిజెపిలో చేర్చుకోవటం అంటే త్వరలోనే వైసిపి మీద రాజకీయ దాడికి నాందిపలకటమే అన్నది ఒక అభిప్రాయం.అదే జరిగితే జగన్‌, ఇతరుల మీద వున్న కేసులను, తెలుగుదేశం నుంచి కాషాయ తీర్ధం పుచ్చుకున్న నేతల దాడిని వైసిపి ఎలా ఎదుర్కొంటుంది అనేదే ఆసక్తికరం. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, ఇప్పుడు తెలంగాణాలో తెరాస మాదిరి ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల ఆర్ధిక మూలాలను దెబ్బతీసేందుకు తెలుగుదేశం ఫిరాయింపుదార్ల పట్ల, బిజెపినేతల పట్ల వైసిపి వ్యవహరిస్తే కేంద్రం తన వద్ద వున్న పెద్ద కత్తిని వైసిపి మెడమీద ప్రయోగించటానికి వెనుకాడదు. ఇదొక ప్రత్యేక పరిస్ధితి అనవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వైసిపి ‘అనకొండ’ తెలుగు దేశాన్ని మింగు విధంబెట్టిదనిన !

14 Friday Jun 2019

Posted by raomk in Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH CM, Anti defection law, CHANDRABABU, CM YS Jagan, tdp, Ycp, ys jagan vs chandrababu, ysrcp

Image result for jagan chandrababu

ఎం కోటేశ్వరరావు

‘ఇక్కడ ఒక్క విషయం అందరికీ చెప్పదలిచా. నాకు కొంతమంది ఏం చెప్పారంటే.. చంద్రబాబుకు 23 మంది శాసనసభ్యులున్నారు. వారిలో ఐదుగురిని లాగేస్తే ఆయనకు 18 మందో, 17 మందో ఉంటారు. ఫలితంగా ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కదు, విపక్ష ఎమ్మెల్యేలను లాగేద్దామన్నారు. అయితే అలా చేస్తే నాకూ, ఆయనకూ తేడా లేకుండా పోతుందని చెప్పా. ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్పదలిచా. ఆ పార్టీ (టీడీపీ) నుంచి మేమెవరినైనా తీసుకుంటే వారిని తొలుత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించిన తర్వాతే తీసుకుంటాం. అలా కాకుండా ఏదైనా పొరపాటున జరిగితే వెంటనే అనర్హత వేటు వేయాలని కూడా మీకే విన్నవిస్తున్నా. ఇలాంటి గొప్ప విధానాలు మళ్లీ ఈ శాసనసభకు వస్తాయని ఆశిస్తూ, మీరు ఆ పని చేయగలరని పూర్తిగా విశ్వసిస్తూ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నా’ ఇది ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి అసెంబ్లీలో స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ను వుద్దేశించి చెప్పిన మాట. దీనికి వైఎస్‌ఆర్‌సిపి కట్టుబడి వుంటుందని, వుండాలని ఆశిద్దాం. నిజానికి కట్టుబడి వుండటం పెద్ద సమస్య కూడా కాదు.

సీన్‌ తిరగేస్తే ఒక్కటి మాత్రం స్పష్టం. వైసిపి అనే తోడేలు మేకపిల్లగా మారిన తెలుగుదేశాన్ని ఎలాగైనా సరే తినదలచుకున్నదనే సంకేతాలు తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే వెలువడ్డాయి. మరీ పాత కథ చెప్పినట్లు వుందా, అయితే వైసిపి అనకొండ తెలుగుదేశాన్ని మింగదలచుకుంది అందాం. అయితే అది ఎలా ఎప్పుడు అన్నదే కిక్కునిచ్చే అంశం. ఇక్కడ కొన్ని ఆల్జీబ్రా లెక్కలు పరిష్కారం కావాల్సివుంది. ఇటీవలి రాజకీయాలను గమనించినపుడు ఒక ధోరణి స్పష్టం. ఏదైనా ఒక పార్టీ అధికారానికి వస్తే జనానికి ఏమి చేస్తారో తెలియదు గానీ ప్రత్యర్ధి పార్టీని తొక్కివేయటం లేదా విలీనం చేసుకోవటం తక్షణ కర్తవ్యంగా వుంటోంది. అందువలన పైకి ఎవరెన్ని సుభాషితాలు పలికినా జరిగేదేమిటో అందరూ వూహించుకుంటున్నదే. ఆ సినిమా ఎలా వుంటుందో చూడబోయే ముందు కొన్ని అంశాలను చూద్దాం.

ఏదైనా ఒక చట్టం చేస్తే దానిలో వున్న లోపాలను ఎలా తొలగించాలా అనిగాక దానికి ఎలా తూట్లు పొడవాలా అని మన దేశంలో వామపక్షాలు మినహా అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. ఇలాంటి పార్టీలు ఆమోదించిన రాజ్యాంగాలు, వాటికి అనుగుణ్యంగా చేసిన చట్టాల మీద కమ్యూనిస్టులకు అంతగా విశ్వాసం లేకపోయినా, పార్లమెంటరీ పార్టీ వ్యవస్ధను ఆమోదించి చట్టబద్దంగా పని చేస్తున్న కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే వాటికి కట్టుబడి వుంటున్నాయి తప్ప మిగతాపార్టీలేవీ అలా లేవు. ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వచ్చిన గత మూడున్నర దశాబ్దాలు లేదా అంతకు ముందు కూడా కమ్యూనిస్టులు ఫిరాయింపులను ప్రోత్సహించలేదు. అసలా ఫిరాయింపుల చట్టం గురించి నాలుగు ముక్కలు.

హర్యానా మన దేశానికి ఇచ్చిన ఒక బహుమతి ఆయారామ్‌ గయారామ్‌ అంటే అతిశయోక్తి కాదు. 1967లో హర్యానాలో కాంగ్రెస్‌, దానికి వ్యతిరేకంగా రూపొందిన పలు పార్టీల కూటమి యునైటెడ్‌ ఫ్రంట్‌ మధ్య ఫిరాయింపుల పర్వం నడిచింది. పంజాబ్‌ నుంచి విడివడి 1966 నవంబరు ఒకటిన హర్యానా ఏర్పడింది. మరుసటి ఏడాది జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికైన గయాలాల్‌ అనే ఎంఎల్‌ఏ ఒకే రోజు తొమ్మిది గంటల వ్యవధిలో మూడు సార్లు పార్టీ మారాడు.కాంగ్రెస్‌ నుంచి యునైటెడ్‌ ఫ్రంట్‌కు మారిన తరువాత తిరిగి కాంగ్రెస్‌కు వచ్చాడు. అప్పుడు కాంగ్రెస్‌ నేత రావు బీరేంద్ర సింగ్‌ గయాలాల్‌ను చండీఘర్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకర్లకు చూపుతూ గయారామ్‌ ఇప్పుడు ఆయారామ్‌ అయ్యాడు అని ప్రకటించారు. ఆయారామ్‌ తరువాత వెంటనే తిరిగి గయారామ్‌గా మారి తిరిగి యునైటెడ్‌ ఫ్రంట్‌కు ఫిరాయించాడు.( తండ్రి గయాలాల్‌ బాటలో నడిచిన కుమారుడు వుదయ్‌ భాను 2004లో స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచి కాంగ్రెస్‌కు ఫిరాయించారు.) అలాంటి ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు ఎన్నికైన వారు గోడదూకకుండా చూసేందుకు కాంగ్రెస్‌ నేత రాజీవ్‌ గాంధీ ఆలోచనగా 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకు వచ్చారు. పార్టీ నుంచి విడిపోతామనే బెదిరింపులను ఎదుర్కొనే భాగంగానే ఇది జరిగిందన్నది స్పష్టం.

దీని ప్రకారం ఒక సభ్యుడు తనంతట తాను పార్టీకి రాజీనామా చేసినా, లేక పార్టీ విప్‌ను ధిక్కరించి ఓటింగ్‌లో పాల్గొన్నా ,వుద్దేశ్యపూర్వకంగా సభకు గైర్‌హాజరైనా చట్టసభల సభ్యత్వాన్ని కోల్పోతారు. అయితే ఒక పార్టీకి పార్లమెంట్‌ లేదా అసెంబ్లీలో వున్న సంఖ్యాబలంలో మూడో వంతు గనుక చీలి కొత్త పార్టీ పెట్టినా లేదా వేరే పార్టీలో విలీనం అయినా అనర్హత వేటు పడదు. ఇలాంటి చర్యలను చట్టసభల స్పీకర్లు కాకుండా ఎంపీలైతే రాష్ట్రపతి, ఎంఎల్‌ఏలైతే గవర్నర్లు చర్యతీసుకోవాలని కొన్ని కమిటీలు సిఫార్సు చేశాయి గాని వాటిని ఇంతవరకు ఆమోదించి చట్టసవరణ చేయలేదు. అయితే ఒక సభ్యుడు స్వచ్చందంగా రాజీనామా చేయకుండా పార్టీలో తిరుగుబాటు చేసి బహిరంగంగా వేరే పార్టీకి మద్దతు ప్రకటిస్తే లేదా పార్టీని ధిక్కరించినా సభ్యత్వానికి అనర్హుడని, స్వచ్చందంగా రాజీనామా చేసినట్లే పరిగణించాలని సుప్రీం కోర్టు ఒక కేసులో పేర్కొన్నది. తొలుత చేసిన చట్టంలో స్పీకర్‌ నిర్ణయానికి తిరుగులేదు అని పేర్కొన్నారు, అంటే దానిని సమీక్షించే అధికారం కోర్టులకు లేదు. స్పీకర్‌ నిర్ణయం వెలువడే వరకు కోర్టులు జోక్యం చేసుకోవటానికి అవకాశం లేదు. 2015లో తెలంగాణాలో అదే జరిగింది. అయితే అనర్హత పిటీషన్‌పై ఎంత వ్యవధిలోగా నిర్ణయం తీసుకోవాలి అనేది స్పష్టంగా పేర్కొనకపోవటంతో స్పీకర్లు నిరవధికంగా నిర్ణయాన్ని వాయిదా వేసి విమర్శలపాలైన వుదంతాలు వున్నాయి. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ ఎంఎల్‌ఏగా వుంటూ ఫిరాయించిన ఒకరు తెరాస ప్రభుత్వంలో మంత్రిగా చేరినప్పటికీ సభ్యత్వం మీద స్పీకర్‌ నిర్ణయం తీసుకోకపోవటంతో ఎలాంటి అనర్హతకు గురి కాలేదు. 2004లో చేసిన చట్టసవరణకు 91వ రాజ్యాంగ సవరణ ప్రకారం మూడోవంతుకు బదులు మూడింట రెండువంతుల మంది చీలితేనే ఆ చీలికకు చట్టబద్దత వుంటుంది, అనర్హత వేటును తప్పించుకోగలరు. 2014లో తెలుగుదేశం పార్టీ పార్టీ తరఫున ఎన్నికైన 15 మందిలో 12 మంది తెరాసలో చేరేవరకు స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అవసరమైన సంఖ్య చేరగానే 2016లో స్పీకర్‌ తెదే శాసనసభా పక్షం తెరాసలో విలీనమైనట్లు తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి నుంచి ఫిరాయించిన వారిపై 18నెలల పాటు స్పీకర్‌ చర్య తీసుకోనందుకు నిరసన వ్యక్తం చేస్తూ వైసిపి సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణాలో అసెంబ్లీ సభ్యత్వానికి వుత్తమ కుమార్‌ రెడ్డి రాజీనామా చేయగానే అవసరమైన సంఖ్య కూడటంతో కాంగ్రెస్‌ శాసనభా పక్షాన్ని విలీనం చేయటం కూడా ఇదే పద్దతిలో జరిగింది.

ఈ పూర్వరంగంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏమి జరగనుందో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ కొన్ని చిక్కుముడులు వున్నాయి. వాటిని పార్టీలు ఎలా పరిష్కరిస్తాయన్నది ఆసక్తికరం. ప్రస్తుతం వున్న 23 మంది సభ్యులలో పదకొండు మంది మినహా 13 మంది తమతో సంబంధాలలో వున్నారని వైసిపి ఎంఎల్‌ఏలు చెబుతున్నారు. చట్ట ప్రకారం తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే వారు అనర్హత వేటును తప్పించుకోవాలన్నా లేక రాజీనామాలతో నిమిత్తం లేకుండా వైసిపిలో చేరాలన్నా 16 మంది కావాల్సి వుంది. ఇక్కడ అస్పష్టమైన దృశ్యాలు కొన్ని కనిపిస్తున్నాయి. వైసిపి వారు చెబుతున్నట్లు 13 మంది టచ్‌లో వుంటే మరో ముగ్గురు ఎంఎల్‌ఏలను ఆకర్షించితే చట్టబద్దంగానే ఫిరాయింపులకు స్పీకర్‌ ఆమోద ముద్ర వేస్తారు. లేదా నాటకాన్ని రక్తి కట్టించేందుకు ముగ్గురిచేత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయిస్తే తెలుగుదేశం బలం 20కి పరిమితమైతే 13 మంది అనర్హత వేటు తప్పించుకొని చట్టబద్దంగానే వైఎస్‌ఆర్‌సిపి లేదా మరొక పార్టీ దేనిలో అయినా చేరవచ్చు లేదా తమదే అసలైన తెలుగుదేశం అని ప్రకటించుకొని సభలో కూర్చోవచ్చు, అదే జరిగితే పార్టీ మారకుండానే, రాజీనామా చేయకుండానే అధికారపక్షంతో లేదా మరొక పక్షంతో సహజీవనం చేసే అవకాశం వస్తుంది.

దేశంలో లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో నైతిక విలువలకు ఏ పార్టీ కూడా కట్టుబడి వుండటం లేదు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ చీలికపక్షమైన బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలోని పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరటం ఫిరాయింపు కాదా అని తెలుగుదేశం ఎద్దేవా చేసింది. అయితే అప్పుడు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం లేదని వైసిపి సమర్ధించుకుంది. చట్టం వున్నా లేకున్నా ఫిరాయింపు ఫిరాయింపే, నైతికంగా అక్రమమే. బెదిరించి లేదా ప్రలోభపెట్టి ఆకర్షించిన తెలుగుదేశం చర్య కూడా గర్హనీయమే. ముందే చెప్పుకున్నట్లు చట్టాన్ని పటిష్టపరచటం గాకుండా లోపాలను వుపయోగించుకొని తప్పుడు చర్యలను సమర్ధించుకొనేందుకు చూస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో వున్న మూడు ప్రాంతీయ పార్టీలలో రెండు మిత్రపక్షాలుగా వున్నాయి. రెండూ అధికారంలో వున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బిజెపికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కాంగ్రెస్‌కు కొత్తగా పోయిందేమీ లేదు కనుక దానికి ఎలాంటి బాధ లేదు. కేంద్రంలో అపరిమిత అధికారం కలిగివున్న తమకు ఏపిలో ప్రాతినిధ్యం లేకపోవటం బిజెపికి తలకొట్టేసినట్లుగా వుంది. అందుకోసం అది వైసిపికి వల వేసిందన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్నమాట. అది వలపు వలా లేక కేసులదా అన్నది వేరే అంశం. ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక పాకేజీ రెండింటికీ సున్నా చుట్టిన బిజెపితో కలిస్తే మొదటికే మోసం వస్తుందేమో, తరువాత చూద్దాం ముందు మీరు కాస్త తగ్గండి అని వైసిపి చెప్పి వుండవచ్చు, విధిలేని స్ధితిలో బిజెపి సరే అని వుండవచ్చు. అనూహ్యంగా బిజెపి కేంద్రంలో రెండవసారి పెద్ద మెజారిటీతో అధికారానికి వచ్చింది గనుకనే ఎన్నికలకు ముందు మాదిరి అది వుంటుందా అంటే వుండదు. దాని లక్షణం అది కాదు. మహారాష్ట్రలో తోటి హిందూత్వ పార్టీనే తొక్కేసి ముందుకు వచ్చిన పార్టీ అది. పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీతో వ్యవహరిస్తున్న తీరు చూస్తున్నాము. వాటికీ ఆంధ్రప్రదేశ్‌కు తేడా ఏమిటంటే మిగతా చోట్ల సిబిఐ, ఇడిలను ప్రయోగించాల్సి వుండగా ఇక్కడ ఆ పని ఎప్పుడో చేశారు కనుక జగన్‌కు ముందు వాటి నుంచి బయటపడేందుకు ప్రాధాన్యత ఇస్తారు. కనుక బిజెపి ఆ కత్తిని ఎప్పుడూ చూపుతూనే వుంటుంది, జగన్‌కు అది తెలిసిందే కనుక వేటు పడకుండా చూసుకుంటారు. కొంతకాలం రేచుక్క పగటి చుక్క, చిక్కడు-దొరకడు వ్యవహారం నడుస్తుంది.

Image result for jagan chandrababu

రాజకీయం ఒక వ్యాపారం అనుకుంటే ప్రతి పార్టీ లాభం కోసం వెంపర్లాడుతుంటుంది. ఆ రీత్యానే ఎన్నికలైన వెంటనే బిజెపి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆపరేషన్‌ ఆకర్ష పధకానికి తెరతీసినట్లు పరిణామాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణాలో తెరాసలోకి పోగా మిగిలిన కాంగ్రెస్‌ను తమలో విలీనం చేసుకొనేందుకు బిజెపి ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ పనికిరాదు గానీ కాంగ్రెస్‌ నాయకులు బిజెపికి ముద్దు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ నుంచి గతంలోనే కొందరు కాంగ్రెస్‌ పెద్దలు బిజెపిలో చేరారు. బిజెపి ఏకంగా తన అధ్యక్షుడినే కాంగ్రెస్‌ నుంచి తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద కన్నువేసినట్లు చెబుతున్నారు. నిజానికి బిజెపి గతంలోనే తెలుగదేశం పార్టీని మింగివేసేందుకు ప్రయత్నించిందనే వార్తలు వచ్చాయి. అది ప్రత్యేక హోదాకు మోడీ సర్కార్‌ తిరస్కారం వంటి వివిధ కారణాల వల్ల జరగలేదు. ఇప్పుడు అదే జరిగితే ఏమౌతుంది, జగన్‌ దాన్ని పడనిస్తారా అన్నది ప్రశ్న. తన మీద వున్న కేసుల పరిష్కారానికి జగన్‌ తొలి ప్రాధాన్యత ఇస్తారు. ఇంతకాలం ఆయనను వెంటాడిన తెలుగుదేశం నేతలు బిజెపిలో చేరితే వైసిపికి మింగా కక్కలేని స్ధితి వస్తుంది. ఒక వేళ అదే జరిగితే ముందుగా దెబ్బతినేది తెలుగుదేశమే కనుక ఇప్పటికైతే తమకెలాంటి ఢోకా వుండదనుకొని వైసిపి సర్దుకు పోతుందా ? తాను బలపడటానికి ఇతర పార్టీలనుంచి చేర్చుకొన్న నాయకులకు పని ఇవ్వకుండా బిజెపి మాత్రం ఎంతకాలం వుంటుంది? కొద్ది కాలం తరువాత అదే బిజెపి తాను బలపడేందుకు సిబిఐ, ఇడి సంస్ధలను ప్రయోగించి జగన్‌ అనుచరులను లక్ష్యంగా చేసుకొంటే అనివార్యంగా వైసిపి సలాం కొట్టాలి లేదా లడాయికి దిగాల్సి వుంటుంది. కర్నూలు వంటి చోట్ల కోట్ల, కెయి వర్గాలే కలసిపోగా లేనిది వైసిపి తన అవసరాల కోసం కనీసం జగన్‌ కేసుల నుంచి బయటపడేంతవరకు అయినా సర్దుబాటలోనే పయనించే అవకాశాలే ఎక్కువ. లేదూ చేతులారా తెలుగుదేశం నాయకత్వాన్ని బిజెపికి అప్పగించటమెందుకు, చంద్రబాబు నాయుడు మినహా మిగిలిన తెలుగుదేశాన్ని ఏదో విధంగా మనమే కలిపేసుకుంటే ఒక పనై పోలా అని అనుకుంటే వేరే చెప్పాల్సిన పనేముంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

తెలుగుదేశం పార్టీ ఓటమి, చిత్తశుద్ధి లేని పాఠాలు !

30 Thursday May 2019

Posted by raomk in AP, Current Affairs, History, INDIA, Opinion, Others, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

AP Assembly Elections 2019, hypocritical lessons, N Chandra babu naidu, tdp, telugu desam party debacle, ysrcp

Image result for chandrababu naidu debacle

ఎం కోటేశ్వరరావు

2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నాలుగు జిల్లాల్లో తుడిచి పెట్టుకుపోయింది. మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడిని ఒక జిల్లాకు పరిమితం చేయకపోతే విజయ నగరం, నెల్లూరు, కడప, కర్నూలుతో పాటు చిత్తూరు కూడా అదే కోవకు చెందుతుంది. అక్కడ మరొక తెలుగుదేశం అభ్యర్ధి గెలవలేదు. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో రెండేసి స్ధానాలకు, విశాఖ పట్టణం, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలో నాలుగు స్ధానాల చొప్పున ఆ పార్టీ గెలుచుకుంది. ఇక ఓటింగ్‌ వివరాలకు వస్తే వైఎస్‌ఆర్‌సిపికి 49.9, తెలుగుదేశం పార్టీకి 39.2శాతం ఓట్లు వచ్చాయి. జనసేనకు 6.78, దానితో సీట్లు సర్దుబాటు చేసుకున్న సిపిఎం, సిపిఐలకు 0.43శాతం, కాంగ్రెస్‌కు1.17, బిఎస్‌పికి 0.28, బిజెపికి 0.84శాతం ఓట్లు, వైసిపికి 151, తెలుగుదేశం పార్టీకి 23, జనసేనకు ఒక స్ధానం వచ్చాయి.

తెలుగుదేశం పార్టీకి గతంలో ఓటు చేసిన బిజెపి, పవన్‌ కల్యాణ్‌ అభిమానుల ఓట్లు ఈసారి పడవని, ఎవరి బలం వారికి వుంటుందని, ఆ పరిస్ధితి వైఎస్‌ఆర్‌సిపికి అనుకూలంగా వుంటుందనేది అంకెలు చెప్పిన సత్యం. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 44.6, వైసిపికి 44.2, కాంగ్రెస్‌కు 8.8, బిజెపికి 2.2శాతం వచ్చాయి. ఇప్పుడు శాతాల వారీ చూస్తే తెలుగుదేశం పార్టీకి ఐదుశాతం ఓట్లు తగ్గగా వైసిపికి 5.7శాతం పెరిగాయి. దీన్నిబట్టి చూసినపుడు కాంగ్రెస్‌కుకు తగ్గిన ఏడున్నరశాతం ఓట్లు మొత్తం వైఎస్‌ఆర్‌సికికి పడి వుంటే దాని ఓటింగ్‌ ఇంకా పెరిగి వుండేది. మెజారిటీ ఓట్లు మాత్రమే వైసిపికి పడ్డాయన్నది స్పష్టం. ఇక తెలుగుదేశానికి తగ్గిన ఓట్లు, దానిపునాది చెదిరింది అనేదాని కంటే బిజెపి, పవన్‌ కల్యాణ్‌ ప్రభావంతో వచ్చిన ఓట్లు ఐదుశాతం తగ్గినట్లు పరిగణించ వచ్చు. ఈ ఓట్లు తగ్గటం, కాంగ్రెస్‌, బిజెపి ఓటింగ్‌ కొంత మళ్లిన కారణంగా వైసిపి అఖండ విజయం సాధించింది. ఒక వేళ పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీ రెండు పార్టీలలోని ఒక సామాజిక వర్గం ఓట్లు చీల్చింది అనుకున్నా, కొందరు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మారారని అనుకున్నా ఎవరి బలం వారికి వుంది అని అంకెలు చెబుతున్నాయి.

ఈ నేపధ్యంలో తెలుగుదేశం ఓటమి గురించి వెలువడుతున్న విశ్లేషణలు, వెల్లడవుతున్న అభిప్రాయాలను చూద్దాం. తెలుగుదేశం పార్టీ పైనుంచి కింది వరకు అవినీతి అక్రమాలకు పాల్పడిందనటంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి జనం అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేసి వుంటే తెలుగుదేశం ఓటింగ్‌ ఇంకా ఘోరంగా పడిపోయి వుండేది, అన్ని ఓట్లు వచ్చి వుండేవి కాదు, బహుశా చంద్రబాబు నాయుడు నామమాత్ర మెజారిటీతో గెలిచి ఒకే ఒక్కడుగా అసెంబ్లీలో మిగిలి వుండేవారు. అసలు పట్టించుకోలేదు అనలేము గాని ఎవరు తక్కువలే ఎవరు వచ్చినా తినకుండా వుండేవారెవరు అని జనం అవినీతిని నిత్యజీవితంలో విడదీయని భాగంగా పరిగణించి పెద్దగా పట్టించుకోలేదా అన్నది సూక్ష్మ పరిశీలన చేస్తే తప్ప తెలియదు. ఒక వేళ అవినీతి అక్రమాలపై ఆగ్రహం కారణంగా కోల్పోయిన ఓట్లను ఎన్నికల ముందు తెలుగుదేశం పందారం చేసిన తాయిలాలు పూడ్చాయా అన్నది కూడా ఒక ముఖ్య అంశమే.

తెలుగుదేశం పార్టీ అధికారయుతంగా ఎన్నికల ఓటమి కారణాలను ఇంకా వెల్లడించలేదు. అయినా తెలుగుదేశం మద్దతుదార్లుగా లేదా పాకేజి ఒప్పంద భాగస్వాములుగా లేదా వైఎస్‌ఆర్‌సిపి వ్యతిరేకులుగా పేరు ఏదైనా కానివ్వండి ముద్రపడిన పత్రికల వ్యాఖ్యాతలు, ఎన్నికలలో ఆ పార్టీ తరఫున సీట్లు ఆశించి, చివరి వరకు మద్దతుదార్లుగా వున్న జర్నలిస్టులు ఇప్పుడు తెలుగుదేశం ఓటమి కారణాల గురించి వెంటనే స్పందిస్తున్నారు. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దానిలో చిత్తశుద్ధి వుందా, విశ్వసనీయత ఎంత అన్నది అనుమానమే.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విఫలం కాలేదు, పార్టీ నేతగా వైఫల్యం చెందారు అన్నది ఒక సూత్రీకరణ. ఈ మాటలను సెలవిచ్చిన పెద్దలే ఎంఎల్‌ఏల, జన్మభూమి కమిటీ సభ్యుల అవినీతిని అరికట్టలేకపోయారు అంటారు. సన్నిహితులు చెప్పినా ఖాతరు చేయలేదు అంటారు, మరో వైపు జగన్‌కు విజయసాయి రెడ్డి వంటి వారు ఎందరో వున్నారు, చంద్రబాబుకు అలా లేరు అంటారు. మరి చంద్రబాబు సన్నిహితులంటే ఎవరు ? తొలి వ్యాక్యంలో ఏమి రాస్తున్నామో మలిగా ఏమి చెబుతున్నామో తెలలియకుండా రాయటాన్ని ఏమనాలి? ఎడా పెడా ఏదో ఒకటి రాస్తున్నట్లా ? అంటే ముఖ్య మంత్రిగా అవినీతి పరులను సహించటం, చెప్పింది వినకపోవటం చంద్రబాబు విజయమని చెబుతున్నట్లా ? వైఎస్‌ జగన్‌ గురించి గతంలో ఇలాంటి ప్రచారమే చెప్పారు. ఆయన ఎవరి మాటా వినడు, తాను చేయదలచుకున్నది చేస్తాడు , ఎంద పెద్ద వారైనా చేతులు కట్టుకొని నిలబడాల్సిందే ఇంకా అలాంటివి ఎన్నో .ఇప్పుడు అదే నోటితో చంద్రబాబు గురించి చెబుతున్నారు. గుండెలు తీసిన బంట్లంటే వేరే వుంటారా ? గతంలో గత ఐదేండ్లలో కూడా కొన్ని పత్రికలు, ఛానల్స్‌లో ఇదే విధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మంచే చేశారు, అనర్ధాలకు అధికార యంత్రాంగమే కారణం అని సూత్రీకరించి పాఠకుల మెదళ్లకు ఎక్కించారు. రాజకీయాల్లో వెన్నుపోట్లను చూశాము. మీడియా రంగంలో వున్న వారు చంద్రబాబును ఇలా మునగచెట్టిక్కించి మూతిపళ్లు వూడగొట్టేట్లు చేయటం తప్ప మరొకటి కాదు. అయినా నరేంద్రమోడీ కంటే సీనియర్‌ను అని చెప్పుకున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పార్టీనేతగా జరుగుతున్నదానిని చూడలేక పోవటానికి ధృతరాష్ట్రుడేమీ కాదుగా. ఇక్కడ చంద్రబాబును గతంలో సమర్ధించిన, ఇప్పుడు ఏ కారణంతో అయినా సమర్ధిస్తున్న మీడియాలో ఎన్నడైనా ఎంఎల్‌ఏల, జన్మభూమి కమిటీల అవినీతి గురించి పతాకశీర్షికలు కాదు, పక్కన అయినా వార్తలు ఇచ్చాయా ? పాఠకులకు మతిమరపు ఎక్కువ అనే ధైర్యంతో ఇప్పుడు తగుదునమ్మా అంటూ అసలు విషయాలను పక్కదారి పట్టించేందుకు పూనుకున్నారు. మీడియా గురించి చంద్రబాబు నాయుడికి తెలియదు అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి వుండదు. అధికారంలో వున్నవారు, మీడియా సంస్ధలు నీకిది, నాకది అనే పద్దతుల్లో ఎవరికి కావాల్సినదానిని వారు పొందటం బహిరంగ రహస్యం. గతంలో ఎన్‌టి రామారావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, అదే విధంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా పని చేసినపుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయినట్లు ? ఏది వాటంగా వుంటే అది రాయటమేనా ? 2016 నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కళా వెంకటరావు వున్నప్పటికీ వుత్సవిగ్రహంగా తప్ప ఆయనకు అధికారాలు ఎక్కడున్నాయి. మీడియా పండితులు అన్నీ చంద్రబాబు నాయుడే చూసుకున్నారని చెప్పారు కదా !

అధికారంలో వుండి కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో నిధుల కోసం వెతుక్కోవాల్సి వచ్చిందని ఒక ముక్తాయింపు. తెలుగుదేశం పార్టీ వారికి 50 చోట్ల నిధులు అందకుండా ప్రత్యర్ధులు సఫలమయ్యారని మరొక బాజా. ఇలాంటి వాటిని చదివి, చూసి దేనితో నవ్వాలో అర్ధం కాదు. పాఠకులు మరీ అంతగా చెవుల్లో పూలు పెట్టుకొని వున్నారనుకుంటున్నారా ? ప్రత్యర్ధి పార్టీల ప్రజాప్రతినిధులు, నేతల వ్యాపారాలు, పరిశ్రమలలో జరిపే అక్రమాల బలహీనతలను ఆధారం చేసుకొని కేంద్రంలోని బిజెపి మద్దతుతో తెలుగుదేశం పార్టీ అనేక మందిని తన పార్టీలోకి ఫిరాయించేవిధంగా చేసిన గతం ఎవరికి తెలియనిది. దొంగే దొంగ దొంగ అని అరవటం అంటే ఇదే. ఇదే విషయాలను ఎన్నికల సమయంలో సదరు మీడియా ఓటర్ల ముందుకు ఎందుకు తీసుకురాలేదు? అధికారంలో వుండి సంక్షేమ పధకాల పేరుతో ఎన్నికల ముందు ఓటర్లకు ఇచ్చిన వేల కోట్ల తాయిలాల మాటేమిటి? ఐదేండ్ల పాటు ఎంఎల్‌ఏలు, ఎంపీలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని వీరే చెబుతారు, ఎక్కడో ఒకరో అరా తప్ప వారు లేదా వారసులు అభ్యర్ధులుగా వచ్చారు, మరి వారు జనం నుంచి కొల్లగొట్టిన సొమ్మంతా ఏమైనట్లు? అసలు తెలుగుదేశం లేదా వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధుల్లో డబ్బు లేని వారెందరు?

ఆడలేక మద్దెల ఓడన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైఎస్‌ఆర్‌సిపి వ్యూహాలను తెలుగుదేశం తిప్పికొట్టలేకపోయిందని మరొక సూత్రీకరణ. అసలు మన దేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక మాధ్యమాలు అందుబాటులో వున్నవారెందరు? 250 మేర ఛానళ్లు, గ్రూపులతో వైఎస్‌ఆర్‌సిపి చేసిన ప్రచారాన్ని తెలుగుదేశం తిప్పికొట్టలేకపోయిందట. ప్రధాన స్రవంతి మీడియాలో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ సాగించిన ప్రచారం సంగతేమిటి? బహుశా ఇలాంటి మీడియా పండితులు చెప్పిన అంశాలనే తెలుగుదేశం పార్టీ తన సమీక్షగా ముద్రవేసుకొని జనం ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గత అనుభవం ఇదే. లీకుల పేరుతో ఇదే మీడియా పెద్దలు తెలుగుదేశం చెప్పిన అంశాలనే జనానికి అందచేసేవారు. ఇప్పుడు కూడా వారితో మాట్లాడకుండా, వారి అభిప్రాయాలను తమ అభిప్రాయాలుగా పాఠకుల ముందు వుంచలేదని ఎలా అనుకోగలం. రాజకీయనేతల మాదిరే నేడు మీడియా విశ్వసనీయత కూడా ప్రశ్నార్ధకంగా వున్నపుడు ఇలా అనుకోవటంలో తప్పేముంది?

Image result for chandrababu naidu debacle

వుదాహరణకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయానే తీసుకుందాం. దీని గురించి చంద్రబాబు నాయుడుగాని, ఆయనను సమర్ధించిన మీడియా గానీ ఎప్పుడైనా పాఠకులకు వాస్తవాలు చెప్పిందా? ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే మంచిది. దాని మీద చంద్రబాబు నాయుడు, నరేంద్రమోడీ వేసిన పిల్లి మొగ్గలను తు.చ తప్ప కుండా మీడియా కూడా వేసింది. జాతీయ అభివృద్ది మండలి ప్రత్యేక హోదా గురించి గతంలో ఆమోదించిన నిబంధనలను మార్చకుండా హోదాను ఆంధ్రప్రదేశ్‌కు వర్తింప చేయటం అసాధ్యం. అటువంటి ప్రయత్నమే చేయలేదు. పార్లమెంట్‌లో చేసిన ప్రకటన ఆధారంగా అలా చేసేందుకు నిబంధనలు మార్చటం అంటే తేనెతుట్టెను కదిలించటమే. అధికారానికి రాక ముందు ఓటర్లను మభ్య పెట్టేందుకు చెప్పినా నరేంద్రమోడీకి ముందే తెలుసు కనుకనే గద్దెనెక్కిన మరునాటి నుంచి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆ అంశాన్ని ముందుకు రాకుండా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వమే దాని మీద అసెంబ్లీ తీర్మానాల పేరుతో మరొక పేరుతో నాటకాలాడింది. తరువాత దాని బదులు ప్రత్యేక పాకేజి అంటే దానికి కూడా మీడియా తాన తందాన పలికింది. పోనీ దాని బండారాన్ని అయినా బయట పెట్టారా అంటే అదీ లేదు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రావటానికి పాతికేండ్లు పట్టింది, అదే జగన్‌కు పదేండ్లు మాత్రమే అని కొందరి సూత్రీకరణ. దాన్ని ఎవరూ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1983 నుంచి 2004 మధ్య 1989నుంచి ఒకసారి కాంగ్రెస్‌ పాలన ఐదేండ్లు కొనసాగటం తప్ప మిగతా కాలమంతా తెలుగుదేశం పాలనే కొనసాగింది. అందువల్లనే రాజశేఖరరెడ్డి అంతకాలం ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ కాలంలోనే ప్రపంచ బ్యాంకు ఆదేశిత సంస్కరణలు, 1991నుంచి ప్రారంభమైన నూతన ఆర్ధిక సంస్కరణలు అమలు జరిగాయి. వాటితో జనానికి ఎలాంటి ప్రయోజనం లేకపోగా భారాలు పెరిగాయి, అవినీతి పెద్ద ఎత్తున చోటు చేసుకుంది. దేశం దృష్టిని ఆకర్షించిన విద్యుత్‌ వుద్యమం వంటివి ఈ కాలంలోనే జరిగాయి. దీనికి తోడు బిజెపితో తెలుగుదేశం పార్టీ జట్టుకట్టిన పూర్వరంగంలో కాంగ్రెస్‌తో వామపక్షాలతో పాటు టిఆర్‌ఎస్‌కూడా సీట్లు సర్దుబాటు చేసుకుంది కనుకనే 2004లో రాజశేఖరేఖరరెడ్డి అధికారానికి వచ్చారు. అదే విధానాలను అమలు జరిపిన కారణంగా వైఎస్‌ఆర్‌పై కూడా అసంతృప్తి తలెత్తినప్పటికీ 2009లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ లేకపోతే రెండవ సారి అధికారానికి వచ్చేవారు కాదన్నది తెలిసిందే. అంటే నూతన ఆర్ధిక విధానాలు ఏ పాలకపార్టీని కూడా వరుసగా రెండవ సారి అధికారానికి తెచ్చే పరిస్ధితి లేదన్నది స్పష్టం. తెలంగాణాలో తెరాస మీద భ్రమలు తొలగకపోవటం, ఇతర అంశాలు తోడై తిరిగి చంద్రశేఖరరావు అధికారానికి వచ్చారు. ఆరునెలల్లోనే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజావ్యతిరేకత వెల్లడైందా లేదా ? ఆ దివాలా కోరు విధానాలతో రెండవ సారి అధికారానికి వచ్చిన చంద్రబాబు నాయుడు జన విశ్వాసం పొందలేకపోవటంతో పాటు పైన చెప్పుకున్న ఇతర కారణాలు కూడా తోడై ఈ ఎన్నికల్లో జగన్‌కు అవకాశం వచ్చింది.

చంద్రబాబు నాయుడు , మరొకరు ఎవరైనా ప్రజాకర్షక విధానాలతో కొన్ని సంక్షేమ చర్యలను చేపట్టినంత మాత్రాన జనానికి వాటితోనే సంతృప్తి వుండదు. నిరుద్యోగం, దారిద్య్రం వంటి అనేక అంశాలు జనాన్ని పీడిస్తున్నపుడు సంక్షేమ పధకాలు వుపశమనం తప్ప మరొకటి కాదు. తెలంగాణాలో రైతు బంధు సొమ్ము తీసుకున్న రైతులే నిజామాబాద్‌లో రోడ్డెక్కారు, అధికార పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి ఎన్నికలలో కూడా నిరసన తెలిపారు. నయావుదారవాద విధానాలు జనంలో ప్రతి తరగతిలోనూ భ్రమలను పెంచుతాయి. అవినీతిని మరింతగా విస్తరింప చేస్తాయి. అందరూ అడ్డదారిలో సంపాదించుకోగలిగినపుడు మనం కూడా ఎందుకు ప్రయత్నించకూడదనే దగ్గరి దారి ఆలోచనలను ప్రతివారిలో రేకెత్తిస్తాయి.ఈ క్రమంలో ప్రతి పాలక పార్టీ భ్రమలను పెంచటంలో, మరిన్ని ప్రజాకర్షక నినాదాలను ముందుకు తేవటంలో, చర్యలు చేపట్టటంలో పోటీ పడతాయి. విలువలను నాశనం చేస్తాయి. గతంలో ఓటర్లు డబ్బు తీసుకున్నపుడు ఓటేయకపోతే ఎలా అని విశ్వాసంతో తీసుకున్న పార్టీకి ఓటు వేసేవారు, మరో పార్టీ దగ్గర తీసుకొనే వారు కాదు. ఇప్పుడు ఎవరు ఇస్తే ఎంత ఇస్తే అంత తీసుకొని నచ్చిన వారికి ఓటు చేస్తున్నారు. అంటూ ఎవరికీ లేని నిజాయితీ మనకెందుకు అనుకోబట్టే ఈ స్ధితి. అందుకే చంద్రబాబు ఎన్ని తాయిలాలు పెట్టినా ఎన్నికల ముందు ఎవరైనా చేస్తున్నది అదేలే అని లబ్ది పొందిన వారు చూశారు తప్ప, కృతజ్ఞత చూపలేదు. చూపుతారనే ఆశతో గతం చంద్రబాబు నా పధకాల వలన లబ్దిపొందిన వారు నాకే ఓట్లు వేయాలన్నట్లుగా మాట్లాడిన తీరు తెలిసిందే.

Image result for chandrababu naidu hypocrisy

చంద్రబాబు నాయుడి ఐదు సంవత్సరాల కాలంలో వామపక్షాల బలం ఎంత పరిమితం అయినప్పటికీ ఆయన పర్యటనకు వెళ్లిన ప్రతి చోటా ఆ పార్టీల కార్యకర్తలు, నేతలను ముందస్తు అరెస్టులు చేయించటం, వివిధ తరగతుల సమస్యలపై ఆందోళనలకు పిలుపులు ఇచ్చినపుడు వాటిని సాగకుండా ఎక్కడికక్కడ పోలీసులను ప్రయోగించి అణచివేత, విఫలం చేసేందుకు ప్రయత్నించటాన్ని చూశాము. అంటే ప్రజాకర్షక నేతలు వైఫల్యం చెందినపుడు అణచివేతలకు పాల్పడతారన్న ప్రపంచ అనుభవం ఇక్కడ కూడా వాస్తవ రూపం దాల్చింది. దీనికి తోడు కార్మిక సంఘాలను చీల్చటం, నిరంకుశ పద్దతుల్లో డిమాండ్లను వ్యతిరేకించటం, తమతో చేతులు కలిపితే పరిష్కరిస్తామంటూ పోరాడే కార్మిక సంఘాలన్నింటినీ చీల్చటం వంటి అనేక ప్రజాస్వామ్య విరుద్ద చర్యలను చూశాము.

పకోడీలు అమ్ముకోవటం కూడా వుపాధికల్పనకిందికే వస్తుందని నరేంద్రమోడీ చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు, ఆయన బృందం చెప్పకపోవచ్చుగానీ వుద్యోగ కల్పన. పెట్టుబడుల ఆకర్షణ పేరుతో ఎంత ప్రచార ఆర్భాటం చేశారో చూశాము. స్విడ్జర్లాండ్‌లోని దవోస్‌ నగర కేంద్రంగా ప్రపంచ ఆర్ధిక వేదిక పని చేస్తుంది. ప్రతి సంవత్సరం అక్కడ జరిగే సమావేశాలకు చంద్రబాబు నాయుడు పెద్ద పరివారాన్ని వేసుకొని తీర్ధయాత్రల మాదిరి తిరిగి వచ్చేవారు. ఆ పిచ్చి ముదిరి ఎంతవరకు పోయిందంటే దవోస్‌ నగరంలో తిరిగే బస్సుల మీద మేక్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో ప్రచారానికి డబ్బు ఖర్చు చేశారు. అంటే ప్రపంచ పెట్టుబడిదారులు దవోస్‌ రోడ్ల మీద తిరుగుతుంటారని, వారు బస్సుల మీద ప్రకటనలు చూసి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి పెట్టుబడులు పెడతారని జనం నమ్మాలి. ఎంత మందికి వుపాధిని అదనంగా కల్పించారో నరేంద్రమోడీయే కాదు, చంద్రబాబు కూడా చెప్పలేకపోయారు.

ప్రపంచ వ్యాపితంగా ప్రస్తుతం వుపాధి రహిత అభివృద్ధి జరుగుతోంది. దానికి మనం మినహాయింపు కాదు. రోబోట్‌లు, కంప్యూటర్‌ నియంత్రణ యంత్రాలతో పరిశ్రమలు కొత్త పరిశ్రమలు వస్తున్నాయి, పాత పరిశ్రమలను నవీకరిస్తున్నారు. అటువంటపుడు వుపాధి పెరగకపోగా తరుగుతోంది. రెండవది పెట్టుబడులకు తగిన రాయితీలు లేదా మార్కెటింగ్‌ను బట్టి ఆయా ప్రాంతాలకు వస్తాయి తప్ప వ్యక్తుల గొప్పనో, మొహమాటాలకో రావు. ఐటి సంస్ధలు కూడా అంతే ఎక్కడైతే కేంద్రీకరణ జరిగిందో అక్కడికే ప్రతి కంపెనీ వెళ్లాలని చూస్తుంది తప్ప కొత్త ప్రాంతాలలో పెట్టి ప్రయోగాలు జరపదు. అందువలన బాబొస్తే జాబస్తుంది అనే ఒక నినాదం ప్రహసన ప్రాయంగా మారింది. అందువలన ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ, గెలిచిన వైఎస్‌ఆర్‌సిపి అయినా చిత్తశుద్దితో గుణపాఠాలను తీసుకోవటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎట్టకేలకు మోడీ మోక్ష స్వర్గ సోపానాల దగ్గర వైఎస్‌ జగన్‌ ?

11 Thursday May 2017

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi, tdp, YS jagan, ys jagan vs chandrababu, ysrcp

ఎం కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం కొత్త మలుపు తిరిగింది. కాంగ్రెస్‌ బలంగా వున్నచోట దానిని దెబ్బతీసేందుకు ప్రాంతీయ పార్టీలతో జత కట్టిన బిజెపి ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రాంతీయ పార్టీతో బంధం వుండగానే మరొక పార్టీకి కన్నుగీటుతూ సరికొత్త రాజకీయానికి తెరలేపిందా ? బ్రహ్మంగారు మరి ఈ విషయంలో ఏం చెప్పారో తెలియదు. నిజానికి వైఎస్‌ఆర్‌సిపి ఎందుకోసం ప్రధాన మంత్రి దర్శన భాగ్యం కోరిందో, ప్రధాని ఎందుకు జగన్‌ పరివారంతో కలిశారో అధికారికంగా తెలియదు. ప్రధానిని కలిసి బయటకు వచ్చిన తరువాత జగన్‌మోహనరెడ్డి బృందం ప్రధానికి ఇచ్చినట్లు చెప్పిన మెమోరాండం, మీడియాతో మాట్లాడినదాని ప్రకారమే ఎవరైనా వ్యాఖ్యానించగలరు. పరకాయ ప్రవేశ విద్యతో కథనాలు రాసే విలేకర్ల నుంచి ఇంకా ఏమీ వెలువడలేదు కనుక వాటిని నమ్ముకున్న పాఠకులు నిరాశ చెందివుంటారు. కొద్ది వారాల క్రితమే చంద్రబాబు నాయుడు ప్రధానిని కలసి ఆంధ్రప్రదేశ్‌లో మునిగినా తేలినా రెండు పార్టీలు కట్టకట్టుకు వుండాలని నిర్ణయించుకున్నట్లుగా పరకాయ విలేకర్లు వార్తలు రాసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలపరుస్తానంటే ఎవరైనా వద్దన్నారా అంటూ వెంకయ్య నాయుడు బిజెపిలో తలెత్తిన సందేహాలను తీర్చిన విషయం బహిరంగమే. దానిలో భాగంగానే విశాఖలో బిజెపి పెద్ద ఎత్తున సభ జరిపేందుకు పూనుకుందని వార్తలు, వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఇపుడు జగన్‌ పరిణామాలను నిస్సందేహంగా మరో మలుపు తిప్పారు. బిత్తర పోయిన తెలుగు తమ్ముళ్లు కొందరు ఏం మాట్లాడుతున్నారో తెలియని విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నాయుళ్లు విదేశాల్లో వున్న సమయంలో జగన్‌ ప్రధాన మంత్రిని కలిశారు అనేకంటే ప్రధాని కార్యాలయం అవకాశం కల్పించింది అని చెప్పటం సబబుగా వుంటుందేమో ?

ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అన్నది పాత సామెత, పాత టెక్నాలజీ. ఇప్పుడు ఒక అర గురించి మరొక అరకు తెలియకుండా పక్క పక్కనే అనేక కత్తులకు స్ధానం కల్పించటం కొత్త టెక్నాలజీ. ఎన్ని సినిమాలలో చూడటం లేదూ ! పార్టీలో, ప్రత్యర్ధులలో ముఠాలుగా, ఒకరి పొడ మరొకరికి గిట్ట మట్టుపెట్టే వారిని కూడా పార్టీలోని ఒకే వరలో ఇమిడ్చే నేర్పు చంద్రబాబుకు – రెండు రెళ్లు నాలుగు అన్నట్లు శాస్త్రీయంగా చెప్పాలంటే పాలకవర్గ రాజకీయ పార్టీ ప్రతిదానికీ – వున్నట్లే రెండు పార్టీలను కూడా పక్క పక్కనే వుంచేందుకు , ఆంధ్రప్రదేశ్‌ పౌరులను కొత్త బాటలో నడిపించేందుకు బిజెపి నేతలు పూనుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపికి ఇప్పటికిప్పుడు అంత సీను లేదు కనుక తమకు మద్దతు విషయంలో ఎవరు ఎంతగా వంగి విధేయత చూపుతారా అన్నదే వారికి ఇప్పుడు ముఖ్యం. కాల క్రమంలో పరిణామాలు ఎలా వుంటాయన్నది ఇప్పుడే చెప్పలేము. కాంగ్రెస్‌ అయినా తెలుగుదేశం అయినా ఎవరు అధికారంలో వుంటే వారి పంచనచేరి తమ వాటాలను రాబట్టుకొనేందుకు రాయలసీమ మొరటు ప్రత్యర్ధి ఫ్యాక్షనిస్టులే ఒకే పార్టీలో సర్దుకుపోదాం అన్నట్లుగా వుండటం చూశాం, చూస్తున్నాం. అలాగే అనేక చోట్ల రింగురోడ్లు, విమానాశ్రయాలు అటూ ఇటూ, అక్కడా ఇక్కడా అని ప్రచారం చేసి చివరికి తమకు గరిష్ట ప్రయోజనం చేకూరే విధంగా వాటి నిర్మాణాలు చేయటాన్ని చూస్తున్నాం. రాష్ట్ర రాజకీయబాట విషయంలో కూడా అదేవిధంగా జరగబోతోందా ? మేథావులు, వుడుకురక్తంతో వుండే యువతీ యువకులే అలాంటి తప్పుడు రాజకీయాలకు సలాం కొడుతుంటే ఇక సామాన్యుల సంగతి చెప్పనవసరం లేదు. రాజకీయాలలో ఏదైనా సాధ్యమే.

రాష్ట్రానికి వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, ప్రత్యేక పాకేజీ పేరుతో మోసం చేసినా ఫర్లేదు, వాటి గురించి అడగకుండా వుంటాం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌తో మాత్రం ఎలాంటి రాజకీయ అనుబంధం పెట్టుకోకూడదని చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని ,చాణక్యనీతిని వుపయోగించి ఇంతకాలం అడ్డుకున్నారన్నది ఒక అభిప్రాయం. రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్దులెవరో తేలలేదు, నోటిఫికేషన్‌ ఇంకా వెలువడలేదు, మీడియాలో ఎలాంటి వూహాగానాలు రాయలేదు. ఆకస్మికంగా పిడుగులు పడినట్లుగా వైఎస్‌ఆర్‌సిపి ప్రతినిధి వర్గాన్ని కలుసుకొనేందుకు నరేంద్రమోడీ సిద్ధంగా వున్నారంటూ పిలుపు రావటం పొలోమంటూ జగన్‌ పరివారం ఢిల్లీ వెళ్లి కలవటం, రాష్ట్రపతి ఎన్నికలలో మద్దతు ప్రకటించటం అంతా కల మాదిరి జరిగిపోయింది. అదీ చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులు, కంపెనీలను రప్పించేందుకు అమెరికా వీధులలో కాలి నడకన తిరుగుతున్న సమయంలో జరగటం అనేక మందికి మింగుడు పడని అంశం. చంద్రబాబు నాయుడే కాదు వెంకయ్య నాయుడు కూడా దేశంలో లేనపుడు అని ఎవరైనా ముక్తాయింపు ఇవ్వవచ్చు.

మిగతా పత్రికలు ఏమి రాసినా సాక్షి పత్రికలో వక్రీకరణకు అవకాశాలు వుండవు. అదేమి రాసిందో చూడండి

‘ మీడియా : ప్రధాన మంత్రి వద్ద ఏదైనా ప్రస్తావన వచ్చిందా ?

జగన్‌ : రాష్ట్రపతి ఎన్నికలలో వారు పెట్టే అభ్యర్ధికి సంపూర&ణ మద్దతు ఇస్తామని ప్రధాన మంత్రిగారికి చెప్పాం.వైఎసనఆరన కాంగ్రెసు నుంచి సంపూర&ణ మద్దతు వుంటుంది. మాటల సందర&భంలో వారు తప్పనిసరిగా ప్రస్తావిస్తారు. మద్దతు కూడా ఇస్తాం. ఎలాగూ వాళ్లు పెట్టిన వ్యక్తే గెలుస్తారు. ఆ పదవికి పోటీ పెట్టడం కూడా తప్పే అని గట్టిగా నమ్ముతున్నాం. బిజెపికి సంబధించినంతవరకు మేం అన్ని వేళలా మద్దతు ఇచ్చాం. వారితో మాకు ఎప్పుడైనా వ్యతిరేకత వుందీ అంటే అది ప్రత్యేక హోదా విషయంలో, భూ సేకరణ బిల్లు విషయంలో మాత్రమే.అంటే ప్రజలకు మంచి జరుగుతుందంటే ప్రతి విషయంలో అధికార పార్టీకి తోడుగా నిలిచాం. వుంటాం కూడా. ప్రత్యేక హోదా, భూసేకరణ బిల్లు విషయంలోనే మేం బిజెపిని వ్యతిరేేకించాం. ‘

దీనిని చదివిన తరువాత తెలుగులో భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాల గురించి మరోసారి వెనక్కు చూసుకోవాల్సి వచ్చింది. మాటల సందర్భంగా వారు తప్పనిసరిగా ప్రస్తావిస్తారు, మేం ఇస్తాం అంటే భవిష్యత్‌లో అని అర్ధం. మరోవైపున మేం మద్దతు ఇస్తామని చెప్పాం అన్నారు. ప్రధానితో కలిసేందుకు వెళ్లగానే పాహిమాం అంటూ కాళ్లమీద పడినట్లు, విధేయులమై వుంటామని అడగకుండానే మద్దతు ప్రకటించారని అనుకోవాల్సి వస్తుంది. అయితే అది వారి అంతర్గత వ్యవహారం అనుకోండి. ఇక్కడ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్య ఏమంటే అనేక ఓదార్పు యాత్రలు చేసిన జగన్‌ ప్రత్యేక హోదా గురించి కంటి తుడుపు విమర్శలు తప్ప పొలో మంటూ జెపికి మద్దతు ప్రకటించి వచ్చారు. ఎలాగూ బిజెపి అభ్యర్ధి గెలుస్తారని చెబుతున్నారు. అంటే మీ మద్దతు ఆరోవేలు వంటిదే. మరో వైపు ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి అవుతుందని ప్రధానికి విన్నవించిన వైసిపి పెద్దలు హోదా విషయంలో అడ్డంగా మాట తప్పి ఇచ్చేందుకు తిరస్కరించిన బిజెపి విషయంలో కనీసం తటస్థంగా వుంటామని చెప్పి వుంటే కాస్త బెట్టుగా వుండేది. కేసుల నుంచి బయట పడవేయించుకొనేందుకే ఆరాటపడ్డారనే విమర్శ వచ్చి వుండేది కాదు. అయినా బిజెపి అభ్యర్ధి రాష్ట్రపతి అయితే మన రాష్ట్రానికేమి ఒరుగుతుంది, దీనిలో బిజెపి మనకు చేసే మంచేమిటి ? హోదా బదులు ప్రకటించిన ప్యాకేజీ కూడా వట్టిస్తరి మంచినీళ్లే అని తేలిపోయింది. ఏ రకంగానూ మనకు ఒరిగేదేమీ లేనపుడు, గడచిన మూడు సంవత్సరాలలో చేసిందేమీ లేనపుడు, రాబోయే రోజుల్లో ఏం చేస్తారో తెలియనపుడు అడగకుండానే దాని అభ్యర్ధికి మద్దతు అని ప్రకటించటం ఎందుకు ?ఎవరిని మోసం చేద్దామని ? అలాగాక మేం బిజెపితో వూరేగదలచుకున్నాం, కేసుల మీద కేంద్ర సంస్ధలు చూసీచూడనట్లు, వీలైతే బయటపడవేయించమని కోరాం అని చెప్పి వుంటే నిజాయితీగా వుండేది. నరేంద్రమోడీ అంటే అంటరాని వ్యక్తి కాదని 2013లోనే జగన్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తరువాత ఎక్కడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడిన దాఖలాలు లేవు. మోడీ-జగన్‌ కలయికపై తెలుగుదేశ వారి తొలి వ్యాఖ్యానాలు చూస్తే అనుకుంటున్నదొకటీ అయ్యింది ఒకటీ అన్నట్లుగా కనిపిస్తోంది. నూతన పరిస్థితిలో నూతన ఎత్తుగడలకు అగ్రనాయకత్వం బహుశా సమయం తీసుకోవచ్చు. ప్రత్యేక హోదాతో ప్రయోజనం లేదని పక్కన పెట్టిన పెద్దలు- జగన్‌ దొందూ దొందే అయినపుడు ఒకరి గురించి మరొకరు విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది.

ఇక రాష్ట్ర రాజకీయ అవనిక ఎలా వుండబోతోందో చూద్దాం. హోదా, పాకేజీలంటూ ఆంధ్రప్రదేశ్‌ పౌరులను మోసం చేసిన తెలుగుదేశం-బిజెపి కూటమి ఇతర అన్ని రంగాలలో కూడా విఫలబాటలోనే నడుస్తోంది. చెప్పుకొనేందుకు పట్టుమని పది మంచి పధకాలు కూడా లేవు.అందువలన ఈ కూటమి సర్కారుపై జనంలో వ్యతిరేకత పెరగటం ఖాయం. 2014లో వారికి కలసి వచ్చిన సానుకూల అంశాలు వచ్చే ఎన్నికలలో వుండవు. అందువలన ఇప్పుడున్న రాజకీయాన్ని ఇలాగే కొనసాగిస్తే రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లు తెలుగుదేశంతో పాటు బిజెపి కూడా బంగాళాఖాతంలో కలవటం ఖాయం. అందుకే తాము స్వంతంగా బలపడాలనే ఆరాటం బిజెపిలో రోజు రోజుకూ పెరుగుతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ లోగా ఒంటరిగా బిజెపి స్వంతంగా పోటీచేసే సీన్‌ లేదు. జనంలో గబ్బు పడుతున్న తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్‌ఆర్‌సిపితో వెళితే ఎలా వుంటుంది అని నాడి పరీక్షించేందుకే తొలి చర్యగా జగన్‌కు ప్రధాని ఇంటర్వ్యూ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. జగన్‌తోనే వాటంగా వుంటే ఏదో ఒక రూపంలో తెలుగుదేశం పార్టీని ఒదిలించుకుంటుంది. రాజకీయ పార్టీలకు సాకులు దొరక్కపోవు. పార్లమెంట్‌ సీట్లు తాను తీసుకొని అసెంబ్లీలో మెజారిటీ జగన్‌కు వదల వచ్చు. వరుస కుదిరితే సంకీర్ణ సర్కార్‌ను ఏర్పాటు చేయవచ్చు. తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపి వంటి పార్టీలకు వాటి నేతల ప్రయోజనాలు తప్ప మిగతావన్నీ పట్టవు. ఒకవేళ బిజెపితో కలిస్తే వైఎస్‌ఆర్‌సిపికి మద్దతు ఇచ్చిన దళితులు, ముస్లింలు ఎలా స్పందిస్తారన్నది ఒక ప్రశ్న. కొంత ఓటింగ్‌ను అనివార్యంగా కోల్పోవాల్సి వుంటుంది. ప్రత్యేక హోదా, భూసేకరణ బిల్లుల విషయంలో బిజెపిని వ్యతిరేకిస్తున్నామని చెప్పిన జగన్‌ ఒక వేళ సయోధ్య కుదిరితే వాటిని తూనాబొడ్డుబాలు అనటం పెద్ద సమస్య కాదు. ప్రత్యేక హోదాతో ప్రయోజనం లేదని తరువాత తమకు అర్ధమైందని తెలుగుదేశం సమర్ధించుకున్న మాదిరి జగన్‌ మాట మార్చలేరా ? భూ సేకరణ విషయంలో మడమ తిప్పలేరా ? ఎందరిని చూడలేదు !

తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఒంటరిగా లోకేష్‌ నాయకత్వాన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. లోకేష్‌ను ముందు పెట్టి ఓడిపోతే చెప్పుకొనేందుకు వైసిపి రోజా చెప్పిన ముద్దపప్పు అనే ఒక సాకు అయినా వుంటుంది. అదే చంద్రబాబు నాయకత్వాన అయితే అలాంటిదేమీ వుండదు. బిజెపి-వైఎస్‌ఆర్‌సిపి అవకాశాలు కనిపిస్తే అసలు తెలుగుదేశంలో ఎందరు మిగులుతారనేది ఒక పెద్ద ప్రశ్న. ఆయారాం గయారాంలకు కమ్యూనిస్టులు తప్ప అన్ని పార్టీలు పెద్ద పీట వేస్తున్నపుడు ఎవరేమనుకుంటే మాకేటి సిగ్గు అన్నట్లుగా చేరేవారు, చేర్చుకొనే వారూ ఎలాగూ వుంటారు. పార్టీ కార్యాలయాల ఆస్ధులను కబ్జా చేసేందుకు తెలుగుదేశం నామమాత్రంగా వుండవచ్చు.

అత్తారింటికి దారి చూసుకోవటంలో విజయం సాధించిన పవన కల్యాణ్‌ అధికారానికి దారి వెతుక్కోవటం అంత సులభం కాదు. సినిమా పేరును ముందుగా రిజిస్టరు చేసుకున్న మాదిరి పార్టీ పేరును నమోదు చేశారు తప్ప నిర్మాణం లేదు. జనతా మాదిరి అధికారానికి వచ్చిన తరువాత పార్టీ పెట్టిన లేదా, పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారానికి వచ్చిన ఎన్టీరామారావు నాటి రోజులు కావివి. గత ఎన్నికల్లో కాంగ్రెసు తాట తీసినట్లుగా ఈ ఎన్నికల్లో గతంలో బిజెపితో కలిసిన లేదా వచ్చే ఎన్నికలలో ఏదైనా కొత్తగా కలిస్తే వాటి తాటతీయాలి. ఈ నేపధ్యంలో వున్నంతలో వామపక్షాలతో కలసి ఎన్నికలలో పోటీ చేయటం తప్ప మరొక దారి లేదు. లేదా ఏదో ఒక పార్టీతో ఒప్పందం చేసుకొని అందరూ అనుకుంటున్నట్లుగా దానికి లేదా వాటికి కాలీ&షట్లు ఇచ్చి ఎన్నికల ప్రచారంలో నటించాల్సి వుంటుంది. వామపక్షాల విషయానికి వస్తే అవి గతం మాదిరి జనాన్ని ఆకట్టుకోలేకపోతున్నాయి. వివిధ తరగతుల ప్రయోజనాల కోసం అవి తప్ప మిగతా ఏ పార్టీలు గత మూడు సంవత్సరాలలో వుద్యమాలు నిర్వహించిన దాఖలాలు లేవు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా వుద్యమాలు ఆగలేదు. ఎన్నికలలో గెలవటానికి అవి మాత్రమే చాలవన్నది గత అనుభవం.గత ఎన్నికలలో వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు అనే విమర్శలకు గురయ్యాయి. అందువలన అవి కొత్తగా పొగొట్టుకొనేదేమీ లేదు. కమ్యూనిస్టులకు దగ్గరదారులు లేవు, తెలియవు కనుక తమ సైద్ధాంతిక నిబద్దతకు కట్టుబడి, తమతో కలసి వచ్చే శక్తులు, వ్యక్తులతో కలసి మరోసారి ఒంటరి పోరాటం చేయటం తప్ప పెను మార్పులు వచ్చే సూచనలు ఇప్పటికైతే లేవు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వివాదాస్పద కార్టూన్‌పై తెలుగుదేశం వివేచనతో వ్యవహరిస్తుందా ?

22 Saturday Apr 2017

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

cartoonist, cartoons, CHANDRABABU, derogatory jokes, Nara lokesh, social media, tdp

Image result for controversial cartoon, inturi ravikiran

ఎం కోటేశ్వరరావు

పెద్దలకు మాత్రమే అనే కాప్షన్‌తో ఒక ‘ముదురు’ సినిమా పోస్టర్‌, ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి భవనపు ముందుభాగం ఫొటో, నాన్నారూ నేను పెద్దల సభకే వెళతా అనే కాష్షన్‌తో నారా లోకేష్‌, ఆయన తండ్రి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడి ఫొటోలతో కూడిన ఒక చిత్రం సామాజిక మాధ్యమంలో పెద్ద ప్రాచుర్యం పొందింది. ఇదెలాంటి ప్రభావం చూపిందంటే వంద మంది వంది మాగధుల కొలువు మధ్య ఒక్క విమర్శకుడు నోరు విప్పితే రాజో, యువరాజో, యువరాణికో ఎలా వుంటుంది ? నూరు కాకుల కావ్‌ కావ్‌లే మధురగీతాలుగా తన్మయత్వంతో అప్పటికే వూగిపోతున్న వారి మధ్యలో ఒక్క కోయిల చేరి పాడితే ఎలా కర్ణకఠోరంగా వుంటుందో అలా !

కొన్ని మినహా అన్ని అగ్రశ్రేణి సాంప్రదాయక మాధ్యమాలన్నీ ఆహా ఓహో అంటూ పొగుడుతుంటే సామాజిక మాధ్యమంలో వచ్చిన పై చిత్రం కొంతమందికి అభ్యంతరగా కనిపించటంతో వివాదాస్పదమై, చట్టపరమైన చర్యలకు దారి తీసింది. ఇంటూరి రవికిరణ్‌ వేసిన కార్టూన్‌ ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి భవనాన్ని కించపరిచేదిగా వుందంటూ వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి, బెయిలుపై విడుదల చేయటం రెండు తెలుగు రాష్ట్రాలు, జాతీయ మీడియాలో కూడా ఒక సంచలన వార్తగా మారింది. మీడియాలో వచ్చిన ఏదైనా అంశంపై ఎవరికైనా అభ్యంతరం అనిపించినపుడు ఇప్పుడేం జరుగుతోంది. సంబంధిత చట్టపరమైన సంస్ధలకు ఫిర్యాదు చేయటం అవి తీసుకొనే చర్యల కోసం కాలయాపన చేయటం కంటే అసలు చట్టాన్నే తమ చేతుల్లోకి తీసుకుంటే పోలా అన్నట్లు అనేక సందర్భాలలో ప్రత్యక్షంగా తేల్చుకొనేందుకు సిద్ధపడుతున్నారు.

రవికిరణ్‌ తయారు చేసిన చిత్రం విషయంలో ముందుగా చేయాల్సింది. ఏ సామాజిక మాధ్యమంలో అయితే అది తిరుగాడుతోందో దాని యజమానులకు ఫిర్యాదు చేసి దానిని ముందుగా వుపసంహరింప చేయించాలి. అదేమీ జరిగినట్లు లేదు. ఎందుకంటే రవికిరణ్‌ అరెస్టు, విడుదల తరువాత కూడా ఆ చిత్రాన్ని చూపమ్మా అని గూగులమ్మ తల్లిని ప్రార్ధిస్తే అంతకంటేనా నీ కోరిక తీరుతుంది భక్తా అన్నట్లు శనివారం సాయంత్రం మూడు గంటల సమయంలో చూపింది. దానిని పాఠకుల సౌకర్యార్ధం  ఇస్తున్నాం.

మీడియాలో సంచలనాన్ని చూసిన తరువాత ఈ చిత్రం ఇంకా అనేక మందిలో ఆసక్తిని రేకెత్తించి సామాజిక మాధ్యమానికి దూరంగా వున్న వారిలో కూడా ఆసక్తిని రేపి మరింత ప్రాచుర్యం పొందింది. ఆ విధంగా నారా లోకేష్‌, నారా చంద్రబాబు నాయుడి ప్రచార గ్రాఫ్‌లు పెరిగాయంటే అతిశయోక్తి కాదు. పైసా ఖర్చు లేకుండా వచ్చిన ఈ ప్రచారానికి ముందుగా ఆ చిత్రం అభ్యంతరంగా వుందని అనిపించిన పెద్దలకు, , రవి కిరణ్‌ను హైదరాబాదులో అరెస్టు చేసి తుళ్లూరుకు తీసుకురావటంలో ఆలశ్యం చేసి ఆసక్తి పెంచిన పోలీసులకు, దీన్నొక సమస్యగా చేసి సామాజిక మాధ్యమంలో చినబాబు, పెదబాబులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారికి ఒక గుణపాఠం చెప్పాలన్న ఆలోచన ముందుగా వచ్చిన వారికి, మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసి కిసుక్కున నవ్వినందుకు అన్నట్లుగా మా బాబులపై వ్యంగ్యాస్త్రం వేసినందుకు కాదు, శాసనమండలిని కించపరిచినందుకు అన్న ఒక తెలివైన పాయింటును ముందుకు తెచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయించిన, చేసిన వారికి, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ వుదంతంతో ప్రమేయం వున్నవారందరికీ ఎవరెన్ని అభ్యంతరాలు పెట్టినా అభినందనలు చెప్పక తప్పదు.

ఇదే జరిగి వుండకపోతే ప్రపంచానికి అనేక విషయాలు మరుగునపడి తెలియకుండా వుండేవి.భావ ప్రకటనా స్వేచ్చ గురించి అన్ని రకాల మీడియాల్లో నలుగురి నోళ్లలో నాని వుండేది కాదు. కొంత మంది గురించి కొందరు చేసిన పప్పు, సుద్ద పప్పు అన్న వ్యాఖ్యలు వారికి తగవు, పప్పులాగా వున్నా వుప్పు, నిప్పుగా నిరూపించుకొనే సందర్భాలు వస్తాయి అని రుజువైంది. ఏ మీడియా అయినా తమ రేటింగ్‌ను పెంచాలి తప్ప మరొక విధంగా చేయకూడదని రాజకీయ నేతలు కోరుకుంటారు తప్ప విమర్శిస్తే వూరుకోరని గతంలోనే మమతా బెనర్జీతో అనేక మంది నిరూపించారు. తెలుగు దేశం పార్టీ కూడా అందుకు మినహాయింపు కాదని రుజువైంది. సరే ఒక పార్టీకి చెందిన మరుగుజ్జు సేన(ట్రోల్స్‌) తమ నేతలపై విమర్శలు చేసిన వారి పట్ల ఎంత ఘోరంగా ప్రవర్తిస్తుందో సామాజిక మీడియాలో విమర్శనాత్మకంగా పరిశీలించే వారందరికీ తెలిసిందే.

చట్టపరంగా రవి కిరణ్‌ రూపొందించిన చిత్రం శిక్షార్హమైనదా, కాదా, ఆ చిత్రాన్ని ఎవరు ఎవరికోసం వేయించారు, ఎందుకు వేశారు, జరిగిన నష్టం ఏమిటి, అందుకు శిక్ష వుంటుందా, తప్పేమీ లేదని కొట్టి వేస్తారా అన్న అంశాలలో కొన్ని వూహా జనితమైనవి. కేసు దాఖలు చేశారు గనుక చట్టం తనపని తాను చేసుకుపోతుంది. ఆయేషా మీరా హత్య కేసులో పోలీసులు ప్రవేశపెట్టిన సత్యం బాబు నేరం చేయలేదని స్వయంగా ఆయేషా తల్లితండ్రులు కేసు విచారణ రోజు నుంచి ఎంత మొత్తుకున్నప్పటికీ పట్టించుకోకుండా చట్టం తనపని తాను చేసి నిర్దోషి అయిన సత్యంబాబును అన్యాయంగా జైలుపాలు చేసిందని తాజా కోర్టు తీర్పుతో వెల్లడైన విషయం తెలిసిందే. అందువలన కొన్ని సందర్భాలలో చట్టం తనపనే గాక అధికారంలో వున్నవారికి చుట్టంగా కూడా పని చేస్తుందని స్పష్టమైంది. సరే తాజా చిత్రం కేసులో ఏమౌతుందో తెలియదు.

ఈ సందర్భంగా జరుగుతున్న చర్చలో ప్రస్తావనకు వస్తున్న అంశాలేమిటంటే పేరుకు శాసన మండలిని కించపరిచారనేది సాంకేతికంగా కేసు బనాయించటానికి తప్ప వాస్తవానికి ఇద్దరు బాబుల ప్రస్తావన వున్నందుకు ఇది ప్రతీకారం అని ప్రజాభిప్రాయంగా వుంది. అనేక మంది రాజకీయ నాయకులు ఈ రోజుల్లో దేవతా వస్త్రాలు ధరించి రాజకీయాలు చేస్తున్నారు. పుణ్యం చేసుకున్న వారికే దేవతా వస్త్రాలు కనిపిస్తాయి అన్నట్లుగా వారి తీరు అందరికీ కనిపించదు. కొన్ని సందర్భాలలో ప్రజాభిప్రాయం కూడా తప్పు కావచ్చు. హిట్లర్‌ మంచివాడే, అతగాడిని బలపరచాలన్న అభిప్రాయం ప్రజలలో కలిగిన అంశం చరిత్రలో తెలిసిందే. అలాగే మన దేశంలో బాబరీ మసీదు కూల్చివేత కూడా ప్రజాభిప్రాయం, అభిష్టం మేరకే బహిరంగంగానే జరిగింది తప్ప దానిలో కుట్రేమీ లేదని చెబుతున్న విషయం తెలిసిందే. తెనాలి రామకృష్ణ సినిమాలో తాను నియోగినని ఎలా కావాలంటే అలా వినియోగపడతానని రామకృష్ణ కవిచేత చెప్పించారు. చట్టపరంగా ఓటింగ్‌ జరిపి తేలింది తప్ప మిగిలిన ప్రజాభిప్రాయాలన్నీ ఎలా కావాలంటే అలా వినియోగపడేవే.

ఒక చట్ట సభను కించపరచవచ్చా అంటే ఎవరూ సమర్ధించరు. కానీ చట్ట సభలలో జరుగుతున్న విషయాలను చూస్తే నేడు వాటి పట్ల ఎందరిలో సానుకూల వైఖరి వుంది. అనేక అవాంఛనీయ విషయాలు ప్రస్తావనకు వస్తున్నాయి, వుదంతాలు జరుగుతున్నాయి. సభాధ్యక్షుల నిర్ణయం మేరకు అనేక అంశాలు రికార్డుల నుంచి తొలగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతున్న కారణంగా అవన్నీ సమాజ రికార్డులలో నమోదు అవుతున్నాయి. వాటిని తొలగించే అవకాశం లేదు. అధికారాన్ని వుపయోగించలేరు. కర్ణాటక, గుజరాత్‌ అసెంబ్లీలలో ప్రజా ప్రతినిధులు, మంత్రులు సైతం తమ సెల్‌ఫోన్లలో బూతు చిత్రాలు చూస్తున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వారిని అరెస్టు చేసి శిక్షించినట్లు వార్తలు లేవు. ఒక వీధిలో ఎ ఇద్దరు కొట్లాడుకున్నా చట్టపరంగా వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవచ్చు. మన దేశంతో సహా అనేక దేశాలలో చట్ట సభలలో కొట్టుకున్న ప్రజాప్రతినిధులపై ఎక్కడా కేసులు నమోదు చేసినట్లు మనకు తెలియదు. తాజాగా తమిళనాడు అసెంబ్లీలో జరిగిన విషయాలు తెలిసిందే. అందుకనే ఒక గూండా బొమ్మ గీసి నా అడ్డా అసెంబ్లీలో వేయాలని వుంది అంటే అది అసెంబ్లీని కించపరిచినట్లు అవుతుందా ? అవదు, అయితే రవి కిరణ్‌ చిత్రంలో ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి అనే బోర్డుతో వున్న భవనపు బొమ్మ వుంది కనుకనే చట్టపరమైన సమస్యలు వచ్చాయి. ఐరోపాలోని ఐర్లండ్‌ పార్లమెంట్‌ భవనపు బొమ్మపై మార్ఫింగ్‌తో సర్కస్‌ టెంటు వేసి సర్కస్‌, ప్రవేశం అని రాశిన బొమ్మను ఎవరైనా చూడవచ్చు. పార్లమెంట్‌ను ఒక సర్కస్‌గా వర్ణించిన ఆ విమర్శకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ బొమ్మను దిగువ చూడండి.

Image result for derogatory jokes,cartoons on legislative buildings, ireland

ప్రముఖ దర్శకుడు విశ్వనాధ్‌ నిర్మించిన ఒక సినిమాలో ఒక పాత్రను మరో పాత్ర దద్దోజనం అని హేళన చేస్తుంది. అలాగే మరో సినిమాలో పండూ అని పిలిస్తే హీరోయిన్‌ ఎంతలా రెచ్చి పోతుందో తెలిసిందే. ఇండ్లలో వున్నంత వరకు కుటుంబ సభ్యులు, బాగా సన్నిహితులైన ఇరుగుపొరుగు పిల్లలకు చిన్నతనంలో పెట్టిన కొన్ని ముద్దు పేర్లు పెద్దయిన తరువాత కూడా వారిని వదలి పెట్టవు. ఎండ పెరిగే కొద్దీ దున్నలు రెచ్చిపోయి పొలందున్నుతుంటాయి, అదే ఎద్దులు ఎండ పెరిగే కొద్దీ నీడలోకి జారుకొనేందుకు లాగుతాయి. రాజకీయాలలోకి అంటే బహిరంగ జీవనంలోకి వచ్చిన తరువాత ప్రత్యర్ధులు కొన్ని పేర్లు పెడుతూ వుంటారు. అలాంటపుడు ఎంత ప్రతికూల వాతావరణం వున్నా పోలిక కాస్త ఇబ్బంది పెట్టినా దున్నపోతుల మాదిరి వాటన్నింటినీ భరించే విధంగా తయారు కావాలి తప్ప ఎద్దుల్లా సున్నితంగా వ్యవహరించకూడదు. లేదంటే రాజకీయాలకు దూరంగా వుండాలి. అనేక దేశాలలో ప్రత్యర్ధుల మీద ఎన్నో జోకులు వేస్తుంటారు. సందర్భం వచ్చినపుడు ప్రత్యర్ధులు కూడా అదే ప్రయోగం చేస్తుంటారు. వాటిని తేలికగా తీసుకోవాలి తప్ప అంతకు మించి పోకూడదు. కెనడా పార్లమెంట్‌ బొమ్మ వేసి ఎంపీలు, స్పీకర్‌పై వేసిన జోకును చూడండి.

Image result for derogatory jokes,cartoons on legislative buildings

క్షమించాలి స్పీకర్‌ గారూ పరస్పరం గౌరవించుకొనే మన యత్నాలలో భాగంగా దానిని మరో రూపంలో నన్ను చెప్పనివ్వండి !

గౌరవ నీయులైన ప్రతిపక్ష సభ్యుడు దయచేసి సున్నితమైన నోటిలో వున్న వాటిని బయటకు రాకుండా మూస్తారా !

చట్ట సభలలో వుపయోగించే భాషపై వేసిన జోక్‌ ఇది. అంటే దాని అర్ధం మొత్తం సభ్యులందరూ అలా వున్నారంటూ మా మనోభావాలను కించపరిచారని ఎవరూ ఆ కార్టూనిస్టు మీద చర్య తీసుకోలేదు. తొలి ప్రధాని నెహ్రూ ప్రభుత్వం, మంత్రుల వ్యవహారశైలి గురించి ప్రముఖ కార్టూనిస్టు శంకర్‌ తన చిత్రాల ద్వారా ఏకి వదలి పెట్టేవారు. ఒక సందర్భంలో నెహ్రూ నన్ను కూడా వదలి పెట్టవద్దని శంకర్‌తో అన్నారని అందరం చదువుకున్నాం.పూటకో పార్టీ మారుతున్న, అలాంటి వారిని నిస్సంకోచంగా పార్టీలలో చేర్చుకుంటున్న నేటి రాజకీయ నాయకులు కూడా చదువుకోవటం అవసరం.

గీతలతో తమ భావాలను స్వేచ్చగా వెలిబుచ్చే వారికి చట్టపరమైన అవగాహన కూడా అవసరం అని గతంలో కూడా అనేక అనుభవాలు రుజువు చేశాయి. ఐరోపాలోనో మరొకచోటో అలాంటి కార్టూన్లు వేస్తే సహించారు కదా ఇక్కడెందుకు చేయరు అని వాదిస్తే లాభం లేదు. అక్కడా చట్టాలున్నాయి.మనం బూతు అనుకొనే పదాలతో మరింత పచ్చిగా విమర్శలు, వ్యాఖ్యలు చేయటాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకొనే దశను వారు దాటిపోయారు. పార్టీ మారిన వారు పూర్వపు పార్టీ పదవులకు రాజీనామా చేయాలన్నది ఒక నాటి నీతి. అలాంటిదేమీ లేదు ఏ పార్టీ గుర్తు మీద గెలిచినా చివరకు మంత్రి పదవులు కూడా పుచ్చుకోవచ్చన్నది నేటి ఆచరణ. అంటే సిగ్గుపడే దశను దాటి ముందుకు పోయాం. అలాంటి వారిపై గౌరవనీయ చట్ట సభలు, వాటి అధిపతులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. రక్షిస్తున్నారనే ఫిర్యాదులు, విమర్శలున్నాయి. రాజ్యాంగాన్ని అమలు జరిపే గవర్నర్లు సైతం అలాంటి వారి చేత ప్రమాణ స్వీకారాలు చేయిస్తున్నారు. మన రాజ్యాంగం, చట్టాలు, నిబంధనలలో వున్న లొసుగుల కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. గతంలో దిగంబర కవులుగా పేరు పెట్టుకున్న వారు పార్లమెంటు, అసెంబ్లీలను ఎలా తిట్టిపోశారో తెలిసిందే. ఇప్పుడు చట్ట సభలు, వాటిలో జరుగుతున్న వాటి గురించి నైతికంగా ఆలోచించే వారందరూ దిగంబరు కవులు కాకుండానే వాటిని ఏవగించుకుంటున్నారు. ఈ పూర్వరంగంలో సాంకేతికపరమైన, చట్టపర అంశాలకు అతీతంగా ఆలోచించి మందలింపుతోనో మరొక చర్యతోనో సరిపెట్టి కార్టూనిస్టు రవి కిరణ్‌పై క్రిమినల్‌ చర్యలను వుపసంహరిస్తే తెలుగు దేశం పార్టీకి సామాజిక మాధ్యమంలో జరిగిన నష్టం నివారించబడుతుంది. అటువంటి విశాల వైఖరిని వారు ప్రదర్శిస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రత్యేక హోదా, పాకేజీ కూడా లేదని చెప్పటానికి ఇన్ని నాటకాలు ఆడాలా ?

08 Thursday Sep 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ 1 Comment

Tags

ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, BJP, special status to Andhra pradesh, tdp

నాడు పార్లమెంట్‌ తలుపులు మూసి ప్రహసన ప్రాయంగా కాంగ్రెస్‌,బిజెపి ఇతర పార్టీల నేతలు కుమ్మక్కై చీకట్లో రాష్ట్ర విభజన తీర్మానం చేశారు. అయితే ఆ విభజన హామీలను తుంగలో తొక్కేందుకు మిగతా పార్టీలకు అవకాశం ఇవ్వకుండా నేడు బిజెపి నేతలు అర్ధరాత్రి సమాయాన్ని ఎంచుకొని ప్రత్యేక హొదా లేదని ప్రకటించారు. అది విద్రోహం అని మిగతా పార్టీలన్నీ విమర్శిస్తే తెలుగు దేశం, బిజెపి పార్టీలు స్వాగతం పలికాయి.

ఎం కోటేశ్వరరావు

     ప్రతిపక్ష వైసిపి సభ్యులు నిశ్శబ్దంగా కూర్చుంటే ప్రత్యేక హోదా గురించి ప్రకటన చేస్తానని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు శాసనసభలో పదే పదే ప్రకటించటాన్ని యావత్‌ తెలుగు ప్రజలూ గమనించారు. రెండు సంవత్సరాలకు పైగా రాజకీయ పార్టీలు, జనం నోర్మూసుకుని కూర్చున్నా ఎన్నడూ దాని గురించి సూటిగా మాట్లాడని చంద్రబాబు ప్రత్యేక హోదా, పాకేజీ కూడా ఇచ్చేది లేదని ఒకవైపు కేంద్రం తేట తెల్లంగా ప్రకటించిన తరువాత దాని గురించి తాను ప్రకటన చేస్తానని చెప్పటమే రాజకీయ జాణతనం. తెలుగుదేశం పార్టీ ఎంతగా ఆత్మరక్షణలో పడిపోయిందంటే వైసిపి సభ్యులు అసెంబ్లీ కార్యకలాపాలు సాగకుండా నినాదాలతో అడ్డుకుంటుంటే తెలుగు దేశం సభ్యులు ముఖాలు వేలాడవేసుకొని నిస్సహాయంగా కూర్చుండి పోయారు. అదే మిగతా సందర్బాలలో గతంలో వారెన్నడూ అంత వినమ్రతతో కూర్చోలేదు. బహుశా ప్రస్తుత అసెంబ్లీలో అధికారపక్షం ఇలా నీరుగారి పోయి వుండటం ఇదే మొదటిసారి.

    నాడు పార్లమెంట్‌ తలుపులు మూసి ప్రహసన ప్రాయంగా కాంగ్రెస్‌,బిజెపి ఇతర పార్టీల నేతలు కుమ్మక్కై చీకట్లో రాష్ట్ర విభజన తీర్మానం చేశారు. అయితే ఆ విభజన హామీలను తుంగలో తొక్కేందుకు మిగతా పార్టీలకు అవకాశం ఇవ్వకుండా నేడు బిజెపి నేతలు అర్ధరాత్రి సమాయాన్ని ఎంచుకొని ప్రత్యేక హొదా లేదని ప్రకటించారు. అది విద్రోహం అని మిగతా పార్టీలన్నీ విమర్శిస్తే తెలుగు దేశం, బిజెపి పార్టీలు స్వాగతం పలికాయి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు కూడా లేదని తేలిపోయింది. ప్రత్యేక పాకేజీ లేకుండా ప్రత్యేక సాయం అని అది కూడా 2015 నుంచి 2020 వరకు మాత్రమే అని కేంద్రం స్పష్టం చేసింది. పోనీ దాని వివరాలు ఏమిటి అంటే రేపు ఆర్ధిక మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పెడతాం చూసుకోమని విలేకర్లకు చెప్పి పంపారు.ఈ మాత్రం చెప్పటానికి అర్దరాత్రి ప్రత్యేకంగా పత్రికా గోష్టి పెట్టటం అవసరమా ?

    తాము రాజకీయంగా నిండా మునిగి జనాన్ని ముఖ్యంగా యువత భవిష్యత్‌ను అంధకారంలో ముంచిన పెద్దలు ముసుగులో గుద్దులాట ఎందుకనుకున్నారో ఏమో వెంటనే తేల్చివేశారు. ఇక తేల్చు కోవలసింది జనమే. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయం చేసేందుకు ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారని కేంద్ర మంత్రులు ప్రకటించినపుడే అది వట్టిస్తరి మంచినీళ్లని తేలిపోయింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తున్నట్లు పెద్ద వూదరగొడుతున్నారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు నుంచే ఆ డిమాండ్‌ వుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శక సూత్రాల ప్రకారం ఏ సాగునీరు, విద్యుత్‌ ప్రాజెక్టుకైనా ఆ సూత్రాలు వర్తిస్తే కేంద్ర ప్రభుత్వం వాటిని జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించి 90శాతం నిధులు అంద చేస్తుంది.ఇప్పటికే అలాంటి 14 ప్రాజెక్టుల జాబితాను ఈ చిరునామాలో చూడవచ్చు.http://wrmin.nic.in/writereaddata/Guidelines/NProjects572133778.pdf పోలవరం ప్రాజెక్టును కేంద్రం చేపట్టటం ద్వారా ఆ మేరకు రాష్ట్రానికి వెసులుబాటు కలుగుతుంది. అలాంటి హోదా ఇవ్వటానికి రాష్ట్రాన్ని విభజించటానికి సంబంధం లేదు. రాష్ట్రాన్ని విభజించిన కారణంగా వెసులు బాటు కోసం ఆహోదా ఇచ్చినట్లు చెప్పటం మోసం చేయటమే. నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక హోదాను కల్పించటాన్ని మిగతా రాష్ట్రాలు వ్యతిరేకించినపుడు, జాతీయ ప్రాజెక్టు హోదా తమ పధకాలకు సైతం ఎందుకు కల్పించరని కేంద్రాన్ని ఇతర రాష్ట్రాలు అడగకుండా వుంటాయా ? ఒక వేళ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రాన్ని విభజించినందుకు పరిహారంగా ఇస్తే ఆమేరకు నిబంధనలను కూడా సవరించకుండా ఎలా సాధ్యం. ఒక రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వటానికి మిగతా రాష్ట్రాలు ఎలా అంగీకరిస్తాయి ?

    ప్రత్యేక హోదా విషయమై ఒకే నోటితో రెండు మాటలు మాట్లాడుతూ అనేక అనుమానాలకు తావిస్తున్నారు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కలిపిస్తే మరో పదకొండు రాష్ట్రాలు అడుగుతాయి కనుక రాజకీయంగా సమస్యలు తలెత్తే అవకాశం వుంది కనుక కొత్తగా ఏ రాష్ట్రానికీ ఇవ్వదలచలేదు. ఒక వేళ ఇచ్చినా రాయితీలను గణనీయంగా తగ్గించిన కారణంగా పెద్దగా ప్రయోజనం వుండదు. ఇదే సమయంలో ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు కూడా పెద్దగా లబ్డి పొందింది లేదు. ఇప్పుడు ఇన్ని విషయాలు చెబుతున్న పెద్దలకు ఈ విషయాలన్నీ రెండు సంవత్సరాలకు ముందు ఎన్నికల సందర్భంగా, లేదా గత రెండు సంవత్సరాలుగా తెలియవా ? వేదికల మీద వాగ్దానాలు కురిపించిన పెద్దలు రాజ్యాంగం, నిబంధనలు తెలియని అజ్ఞానులు కాదే ! కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటా 32 నుంచి 42 శాతానికి పెంచారు. అయితే కుడి చేత్తో ఇచ్చి ఎడమచేత్తో తీసుకున్నట్లుగా కేంద్రం అమలు జరుపుతున్న అనేక పధకాలను రాష్ట్రాలకు బదలాయించారు. ఫలితంగా పది శాతం నిధులతో పాటు అంత కంటే ఎక్కువే భారం మోపారు. రెండవది రాష్ట్రాలకు వాటా లేని సెస్సుల వంటి వాటిని ఇటీవలి కాలంలో విపరీతంగా పెంచారు. దాని వలన జనం జేబుల నుంచి కేంద్రానికి వెళ్లేది కూడా పెరిగింది.

     ప్రత్యేక హోదా రాయితీలకు అవకాశం వున్న రాష్ట్రాలలో ఇప్పటికే అనేక మంది వాటిని నమ్ముకొని పరిశ్రమలు పెట్టారు. ఇప్పుడు జిఎస్‌టి వచ్చింది కనుక ఆ రాయితీలను మధ్యలో నిలిపివేస్తారా ? అదే మాదిరి జమ్మూ కాశ్మీర్‌కు రాజ్యాంగ బద్దంగానే ప్రత్యేక ప్రతిపత్తి వుంది. మరి అక్కడ ఎలా అమలు జరుపుతారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు పార్లమెంట్‌లో , వెలుపలా వాగ్దానం చేసిన మాదిరి ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటిస్తే మిగతా రాష్ట్రాలకు అమలు జరిగినంత కాలం అమలు జరుగుతాయి. మిగతావాటికి ఆగిపోతే ఆంధ్రప్రదేశ్‌కూ నిలిచిపోతాయి, నలుగురితో నారాయణ ! పేచీ వుండదు, బిజెపి మోసం చేసిందనే విమర్శలూ వుండవు. అలాంటపుడు వాగ్దానం చేసిన మేరకు ప్రకటించటానికి ఇబ్బంది ఏమిటి ? ఇప్పటికైనా చౌకబారు రాజకీయాలు మానుకొని యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు పని చేయటం అవసరం. కేంద్రం తన విధానాలు మార్చుకొని ఆంధ్రప్రదేశ్‌లో తగినన్ని పెట్టుబడులు పెట్టి వుపాధి కల్పించాలి. కడపలో మరో వుక్కు ఫ్యాక్టరీ ఎందుకు పెట్టరు, వివిధ రంగాలలో ి ప్రయివేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్న కేంద్ర ప్రభుత్వం మౌలిక రంగాలైన పెట్రోలియం, రక్షణ వంటి రంగాలకు అవసరమైన వుత్పత్తుల తయారీకి మరో ఇసిఐఎల్‌, మరో ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ,అణ ఇంధన కాంప్లెక్స్‌, వంటివి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టటానికి ఆటంకం ఏమిటి ? ఐడిపిఎల్‌ వంటి వాటిని స్ధాపించి యువతకు వుపాధితో పాటు జనానికి చౌకగా ఔషధాలు అందించటానికి వున్న ఇబ్బంది ఏమిటి ?

   ఇప్పుడున్నపరిస్థితుల్లో ఎవరైనా ఇప్పటికే మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్‌ వున్న ప్రాంతాలలోనే పరిశ్రమలు పెడతారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే చైనాలోనే ప్రయివేటు రంగం పరిశ్రమలన్నీ ఆ విధంగా కొన్ని అభివృద్ధి చెందిన ప్రాంతాలలోనే కేంద్రీకృతమయ్యాయి. అభివృద్ధి కొత్త సమస్యలను సృష్టించింది. దాంతో పరిశ్రమలు లేని ప్రాంతాలలో పెట్టుబడులకు కేంద్రీకరించింది. గతంలో ప్రభుత్వం పెట్టుబడి పెట్టిన విధానం కూడా కొన్ని అసమానతలను సృష్టించింది. ప్రభుత్వ రంగ పరిశ్రమలు, పలు సంస్థలను హైదరాబాదులోనే కేంద్రీకరించటంతో అటు తెలంగాణాలో మిగిలిన జిల్లాలు, ఇటు ఆంధ్రప్రాంతంలో కొంతమేరకు విశాఖ మినహా మిగిలిన జిల్లాలన్నీ వెనుకబడిపోయాయి. మన దేశంలో కూడా వెనుకబడిన ప్రాంతాలలో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టకుండా ప్రయివేటు వారి వచ్చి ఒరగపెడతారనుకుంటే అంతకంటే భ్రమ మరొకటి వుండదు.అందువలన ప్రత్యేక హోదాతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని డిమాండ్‌ చేయటం ఎంతో సముచితం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పవన్‌ కల్యాణ్‌ గబ్బర్‌ సింగా ? రబ్బర్‌ సింగా ?

30 Tuesday Aug 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, ap special status, BJP, jana sena party, Pawan kalyan, tdp

విశ్వసనీయత సమస్య ఎదుర్కొంటున్న పవర్‌ స్టార్‌

ఎంకెఆర్‌

    సినిమా వాళ్లు ఏది చేసినా నాటకీయంగా వుంటుంది.అది లేకపోతే జనానికి కిక్కు వుండదు. ప్రేక్షకులకు కిక్కు ఎక్కితేనే పోనీలెమ్మని సినిమాలు చూసిపెట్టి నాలుగు డబ్బులు నిర్మాతల మొహాన వేస్తారు. సినిమా కధ వూహించని మలుపులు తిరిగి వీక్షకులకు వుత్కంఠ కలగ చేసినట్లుగా ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనే డాక్యుమెంటరీ కూడా ఆసక్తికలిగిస్తోంది. దీనిలో నటులు, పాత్రలు కాకుండా నిజమైన వ్యక్తులే నటిస్తున్నారు గనుక డాక్యుమెంటరీ అనాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆకస్మికంగా పవర్‌ స్టార్‌ పవర్‌ కల్యాణ్‌ తిరుపతిలో ఒక సభ జరిపి ఏకపాత్రాభినయంతో ప్రత్యేక హోదా గురించి పోరు ప్రకటన చేశారు. అనేక మందికి ముఖ్యంగా అధికారంలో వున్న తెలుగుదేశం-బిజెపి కూటమికి ఇష్టం లేని మాటలలో ప్రత్యేక హోదా ఒకటి.ఎందుకంటే అది గుర్తుకు వచ్చినపుడల్లా ఆంధ్రప్రదేశ్‌ జనం ఇంకా దాని కోసం ఎదురు చూస్తున్నారేమో అనే చిన్న అనుమానంతో కొద్ది క్షణాలే అయినా వారి మనసంతా వికలం అవుతుంటుంది.

     అన్నట్లు నాటకీయం అంటే తిరుపతి సభకు వారం రోజుల ముందు హైదరాబాదులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమార స్వామి ప్రత్యేకంగా వచ్చి పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. ఆ సమయంలో వారు మీడియా ముందుకు వచ్చారు. తన కుమారుడి సినిమా విడుదల సందర్భంగా పవన్‌ను మర్యాద పూర్వకంగా కలిసేందుకు వచ్చానని కుమారస్వామి చెప్పారు. కానీ అంతకు ముందే రాబోయే ఎన్నికలలో పవన్‌ కల్యాణ్‌ మద్దతును కుమారస్వామి కోరుతున్నట్లు దాని గురించి చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అటు న్యూఢిల్లీలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రత్యేక హోదా గురించి తీవ్ర చర్చ, బంద్‌ జరిగిన సమయంలో పవన్‌ కల్యాణ్‌ మౌనంగా వున్నారు. ఈ పూర్వరంగంలో కుమార స్వామితో కలసి మీడియా ముందుకు వచ్చినపుడు పవర్‌ స్టార్‌ ఎంతో ప్రశాంతంగా, స్ధిత ప్రజ్ఞుడి మాదిరి ప్రత్యేక హోదా ఇవ్వను అని ఇంకా కేంద్రం స్పష్టంగా చెప్పలేదు, అయినా ఇది సున్నితమయిన అంశం కనుక ఇపుడే మీ మాట్లాడను తగు సమయంలో స్పందిస్తా అని చెప్పి ఎంతో సంయమనం పాటించారంటూ కొందరు విలేకర్లు వ్యాఖ్యానించారు.మరి అలాంటి వ్యక్తికి వారం రోజుల్లో ఏం మార్పులు కనిపించాయి, అదనంగా వచ్చిన స్పష్టత ఏమిటి, సున్నితాంశం కాస్తా తక్షణాంశంగా దాని స్వభావం ఎలా మార్చుకుంది, అసలు ప్రత్యేక హోదా గురించి రాజకీయ పార్టీలు, జనం కూడా మరిచి పోతున్న తరుణంలో పవన్‌ కల్యాణ్‌కు గుర్తుకు వచ్చి ఎందుకు ఆగ్రహం వచ్చింది అని అనేక మంది పరిపరి విధాలా ఆలోచిస్తున్నారు. చీకట్లో ఏదైనా చెట్టు తొక్కాడా లేక తెలియకుండా ఎక్కడైనా బోధి వృక్షం కింద కూర్చొని వచ్చారా ? పవన్‌ కల్యాణే స్వయంగా చెబితే తప్ప తెలియదు, అప్పటి వరకు పది మంది నానా రకాలుగా అనుకుంటూనే వుంటారు.

     పుష్కరాల సందర్బంగా తాను స్వయంగా మునిగి జనాన్ని కృష్ణ నీటిలో మునకలు వేయించి ఎంతో పుణ్యం జనం ఖాతాలలో ఎంతో పుణ్యం జమ చేయించిన చంద్రబాబు, ఆయన పరివారం తమకు వచ్చిన ప్రచార కండూతి, ఇతర పుష్కర లాభాల గురించి లెక్కించుకుంటుండగా పవన్‌ కల్యాణ్‌ తెలుగుదేశం, బిజెపి పార్టీని కూడా విమర్శించి కాస్త ఇబ్బంది పెట్టారనే చెప్పాలి. ప్రత్యేక హోదా లేదా ప్యాకేజి వస్తుందనీ చెప్పలేరు, రాదనీ చెప్పలేని స్ధితిలో వారు వున్నారు. పవన్‌ కల్యాణ్‌ మాటల్లో చెప్పాలంటే మేడమ్‌ ఎలాగూ లేరు కనుక బిజెపి వారు సార్‌తో భైంటక్‌( సమావేశం) ఏర్పాటు చేయిస్తామని మాత్రమే చెప్పగలరు. వారి దగ్గర అంతకంటే మాటలు లేవు.

   రాజకీయాల్లోకి రావాలని, చక్రం తిప్పాలని, నాలుగు డబ్బులు చేసుకోవాలని అనేక మంది కోరుకుంటున్నపుడు పవన్‌ కల్యాణ్‌ కోరుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు. ఎన్‌టి రామారావు జనం కోసం సినిమాలను వదులుకొని ఎంతో త్యాగం చేశానని చెప్పుకున్నారు, కానీ ముందు జాగ్రత్తగా వవన్‌ కల్యాణ్‌ రాజకీయ, సినిమా నటన రెండూ చేస్తానని చెప్పారు. ఎందుకంటే పెద్ద కుటుంబం కదా ! గత ఎన్నికలలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రంగంలోకి వచ్చి చివరిదాకా నిలబడినట్లుగా తిరుపతి సభలో ఆ జాబితాలో బిజెపి, తెలుగుదేశం పార్టీలను కూడా జమ చేశారు, ఆ పార్టీలను ఎంత గట్టిగా విమర్శించారు, ఏకి పారేశారు అని కాదు, వాటికి అనుగుణంగా కట్టుబడి వుంటారా లేదా ఆ డైలాగులను పెట్టుబడిగా పెట్టి లబ్ది పొందుతారా అన్నదే సమస్య. రాజకీయాలలో విస్వసనీయతను ఏడు నిలువుల లోతున పాతరేసిన పార్టీలలో బిజెపి, తెలుగుదేశం తక్కువేమీ తినలేదు. వాటినేమీ పట్టించుకోకుండా, తెలిసినా తెలియనట్లు గా గత ఎన్నికలలో వాటి కొమ్ముకాశారు. ఎందుకైనా మంచిది అన్నట్లు స్వంతంగా జనసేన అనే స్వంత పార్టీని ఏర్పాటు చేశారు. మధ్య మధ్యలో కొన్ని డైలాగులు తప్ప ఇంతవరకు తెలుగుదేశం, బిజెపిలను విమర్శించలేదు. అవి చెప్పిన మాటలను ఇంతకాలం గాఢంగా నమ్మటానికి దారితీసిన పరిస్థితులేమిటి ? ఇప్పుడు జ్ఞానోదయం కావటానికి కారణాలేమిటి అన్నది జనానికి సూటిగా చెప్పాలి. అప్పుడే తాను ప్రారంభిస్తానంటున్న ప్రత్యేక హోదా ఆందోళన వెనుక జనం చేరే అవకాశం వుంటుంది. గత ఎన్నికల నాటికీ ఇప్పటికీ వచ్చిన తేడా ఏమిటంటే విస్వసనీయతలేని రాజకీయ నాయకుల సరసన పవన్‌ కల్యాణ్‌ కూడా చోటు సంపాదించుకున్నారు. గత ఎన్నికల సందర్భంగా పాకేజి కుదుర్చుకున్నారని విమర్శలు ఎదుర్కొన్న పవన్‌ కల్యాణ్‌ మరోసారి అలాంటిదానికి పూనుకోరన్న గ్యారంటీ ఏమిటన్న ప్రశ్న వుండనే వుంది.

    రాజకీయాలలో ముందురోజు పొద్దు పోయే వరకు ఎదుటి పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన వారు తెల్లవారే సరికి అదే పార్టీలోకి ఫిరాయిస్తున్నారు, అంతకు ముందు వరకు తాను వున్న పార్టీని అంతకంటే ఎక్కువగా వుతికి పారేస్తున్నారు. ఏమిటీ ఈ విపరీతం అంటే ఈ రోజుల్లో మీకు తెలియందేముంది మాకు ఇష్టం వున్నా లేకపోయినా అధినాయత్వ చెప్పినట్లు చేయాలి కదా అని ఎలాంటి సిగ్గు ఎగ్గూ లేకుండా సమర్ధించుకుంటున్నారు. ఇటువంటి స్ధితిలో గత ఎన్నికల తరువాత ఏడాదికి ఒకసారి వచ్చే సైబీరియా పక్షుల మాదిరి ఇలా వచ్చి అలా ఒక ప్రకటన చేసి పోతున్నారని ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న కారణంగా ఈ సారి కూడా అలాగే చేస్తారా అని అనుమానిస్తున్నవారు లేకపోలేదు. ఆర్ధికంగా ఇబ్బందులలో వున్న పవన్‌ కల్యాణ్‌ ఈమధ్య తాను ఎంతో అభిమానించే ఒక వాహనాన్ని కూడా అమ్ముకున్నాడని మీడియాలో వార్తలు వచ్చాయి.అలాంటి వ్యక్తి ఈ రోజుల్లో ఒక పార్టీని స్ధాపించటం అంటే వందల కోట్ల రూపాయలు అప్పనంగా వచ్చిన సొమ్మయినా వుండాలి లేదా ఎన్నికలలో అభ్యర్ధిగా నిలబెడతానని చెప్పి సీట్లు అమ్ముకొని అయినా ఆమేరకు పోగెయ్యాలి. పవన్‌ కల్యాణ్‌ దగ్గర అంత సొమ్ము వుందని ఎవరూ అనుకోరు, పోనీ సీట్లు అమ్ముకోవటానికి ఇంతవరకు పార్టీ లేదు, కార్యకలాపాలు లేవు, అన్నింటికీ మించి అప్పుడే ఎన్నికలు లేవు, అధికారానికి వస్తారనే వాతావరణమూ లేదు. బద్దశత్రువులు అనుకుంటున్నవారే జనం కోసం అనే పేరుతో చేతులు కలిపిన విపరీత పోకడల మన కళ్ల ముందే వున్నాయి. పార్టీ పెట్టిన కొద్ది నెలల్లోనే తెలుగుదేశం అధికారానికి వస్తే, అధికారానికి వచ్చిన తరువాత జనతా పార్టీ ఏర్పడిన చరిత్రా మన దేశంలో వుంది. అందువలన జనం తలచుకుంటే ఎప్పుడు ఏమైనా జరుగుతుంది. సినిమాలు మారినపుడు డైలాగులు కూడా మారతాయి, ఒక నటుడు ఒకే డైలాగులతో రెండు సినిమాలలో నటిస్తే జనం చూడరని తెలిసిందే. అందువలన బిజెపి, తెలుగుదేశం పార్టీలను విమర్శించినప్పటికీ రాజకీయ చాణక్యంలో భాగంగా పవన్‌ కల్యాణ్‌ను ఆకస్మికంగా వారే ప్రయోగించారన్న ప్రచారాలు వున్నాయి.

   ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు కల్పిస్తే ఏ ఏ రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయో వెంకయ్య నాయుడు వంటి వారు వారికి పదే పదే గుర్తు చేస్తారు. ఏపికి కల్పిస్తే మోడీని మరో పదకొండు రాష్ట్రాలు అడుగుతాయని మరో మంత్రి చెబుతారు.తాను 21 సార్లు ప్రధానిని కలిశానని, 31 సార్లు కలిశానని మరోసారి అవసరమైతే ఇంకా ఎన్నిసార్లయినా కలుస్తానని, వత్తిడి పెంచుతానని చంద్రబాబు చెబుతూనే వుంటారు. పాకేజీల ప్రహసనమూ తెలిసిందే. బీహార్‌ ఎన్నికల సమయంలో స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ వేల కోట్ల రూపాయల పాకేజీ ప్రకటించారు. దానిని అమలు జరిపిందీ లేనిదీ తెలియదు.టీ కప్పులో తుఫాను మాదిరి కాంగ్రెస్‌ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రయివేటు బిల్లుపై చర్చ తరువాత దానిని శీతల గిడ్డంగిలో పెట్టారు. ఒక రోజు బంద్‌ చేసి జనం కూడా తరువాత మౌనంగా వున్నారు. దీనికి విశ్లేషకులు కొందరు రెండు కారణాలు చెబుతున్నారు. ఒకటి ప్రత్యేక హోదా వస్తే పెద్దగా ఒరిగేదేమీ వుండదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కూడా చెప్పారు. దాని కంటే భారీ పాకేజ్‌ మెరుగు అని వారితో పాటు వారికి నిత్యం సలహాలు చెప్పే జిగిని లేదా జిగురు జర్నలిస్టులు కూడా సందర్భం వచ్చినపుడు జనం బుర్రల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు.

    జనంలో ఇంకా ఏదో మూలన ప్రత్యేక హోదా గురించి మోజు వుందని, దాన్ని తాము తీర్చని కారణంగా ప్రతిపక్ష వైసిపి, కాంగ్రెస్‌ వుపయోగించుకుంటాయామో, దాన్ని అడ్డుకోవాలంటే రాణీగారి అధికారపక్షం మాదిరి రాణీగారి ప్రతిపక్షాన్ని కూడా తామే ఏర్పాటు చేసుకోవాలనే ఎత్తుగడలో భాగంగా తెలుగుదేశం స్క్రిప్టు రాసి, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిందన్నది ప్రచారంలో వున్న ఒక విశ్లేషణ. అయితే తెలుగుదేశం వారు కొందరు పవన్‌ కల్యాణ్‌ విమర్శలపై ఘాటుగా ఎందుకు స్పందిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. ఒక బాణాన్ని వదిలిన తరువాత అది తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుతుందో లేదో తెలియదు. కనుక ఒక జేబులో అనుకూల మరో జేబులో ప్రతికూల ప్రకటనలు, వివిధ పార్టీల జండాలు బొడ్డు చుట్టూ కట్టుకొని తిరుగుతూ ఏది వాటంగా వుంటే దాన్ని బయటకు తీసే రోజులివి. అందువలన కొందరు నేతలు పవన్‌ ప్రకటనను ఆహ్వానిస్తే ఎంతైనా వ్యాపార వేత్త గనుక దేనికి మార్కెట్‌లో డిమాండ్‌ వుంటుందో తెలిసిన వ్యక్తి కనుక టిజి వెంకటేష్‌ వంటి వారు కాస్త మసాలా దట్టించి డైలాగులు వదులుతున్నారు. గడ్డం పెంచి గడ్డం గీసుకున్నంత సులభం కాదు రాజకీయాలంటే అన్న గడ్డం భాష ఒకటి. దానికి కొద్ది నెలల క్రితం రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఎంత ఖర్చు చేసిందీ బహుశా గుర్తుకు వచ్చి వుంటుంది.

     తెలుగుదేశం అనే మర్రి చెట్టు నీడలో తాము ఎదగటం కష్టమనే విషయం బిజెపి నాయకత్వంలో మొదలైందని, తగినంత మెజారిటీ రాదనే కారణంతో ఎన్నికలకు ముందు కలసి నప్పటికీ ఇప్పుడు స్వంతంగా ఎదగాల్సిన అవసరం ఏర్పడిందన్నది ఆ పార్టీలో బహిరంగ చర్చ. అయితే ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌ మాదిరే బిజెపి కూడా మోసం చేసిందనే అభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కారణంగా గతంలో వున్న మోజు చాలా మందికి తీరింది. తాము నేరుగా రంగంలోకి దిగే అవకాశం లేనందున పవన్‌ కల్యాణ్‌ అనే బాణాన్ని బిజెపి వారే ప్రయోగించారన్న అభిప్రాయమూ వుంది. దీని వలన తెలుగుదేశాన్ని దెబ్బతీయటం, వైసిపి, కాంగ్రెస్‌లకు నోరు లేకుండా చేయవచ్చన్న ఎత్తుగడవుంది.రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు ఏదో విధంగా ప్రత్యేక హోదా సమస్యను సాగదీసి చంద్రబాబు వలన దాన్ని సాధించటం సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని కలగచేయటం ద్వారా తెలుగుదేశాన్ని దెబ్బతీయటం ఒకటి. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా వుత్తుత్తి పాకేజ్‌లు ప్రకటించి ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నించిన విధంగా అజాగళ స్ధనం మాదిరి పేరుకు ఏదో ఒక హోదా ప్రకటన చేసి దాన్ని పవన్‌ కల్యాణ్‌ ఖాతాలో వేసి ఇచ్చింది బిజెపి, తెచ్చింది జనసేన అనే పేరుతో మిగతావారిని పక్కకు పెట్టి తాము రాజకీయ లబ్ది పొందటంగా బిజెపి ఎత్తుగడ వుందన్నది ఒక అభిప్రాయం. తమ రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ సంస్ధలను ఏర్పాటు చేయటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అందెవేసిన చేయి. వాటిలో తమ అదుపులో వుండేవారిని ప్రవేశపెట్టి అవసరమైన సందర్భాలలో వుపయోగించుకుంటుంది. తిరుపతి సభలో విమర్శలు చేసినప్పటికీ బిజెపి, తెలుగుదేశం పార్టీలపై గతంలో కాంగ్రెస్‌ మాదిరి విరుచుకుపడలేదు. ఒకవేళ రానున్న రోజుల్లో విరుచుకుపడినా అది లాలూచీ కుస్తీ మాత్రమే అనే అభిప్రాయమూ వుంది. పవన్‌ కల్యాణ్‌కు కుల తత్వం వుందా లేదా అన్నది సమస్య కాదు, ఆయన చేసుకున్న వివాహాలను బట్టి కులతత్వాన్ని అంటకట్టలేరు. కానీ ఆయన వెనుక చేరుతున్న వారిలో కులశక్తులు వున్న వాస్తవాన్ని మాత్రం కాదనలేరు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర రాజకీయాలలో కులం ప్రాధాన్యం వహిస్తున్న కారణంగా అలాంటి విమర్శలు లేదా ఆరోపణలు రావటం సహజం. అధికారం కోసం కులాలు, మతాలను, మూఢనమ్మకాలను పూర్తి స్ధాయిలో వుపయోగించుకుంటున్న రోజులివి.అందువల్లనే అది ఏ రాజకీయ పార్టీ లేదా నేత అయినా ఇప్పుడు విస్వసనీయత సమస్యను ఎదుర్కొంటున్నారు. పవన్‌ కల్యాణ్‌ అందుకు మినహాయింపు కాదు.

    నేను సింహం లాంటోడ్ని అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను అదే తేడా మిగతావన్నీ సేమ్‌ సేమ్‌టు సేమ్‌ అన్న డైలాగ్‌తో జనాన్ని ఆకట్టుకున్న పవన్‌ కల్యాణ్‌ తన విశ్వసనీయతను రుజువు చేసుకుంటారా లేక సేమ్‌ టు సేమ్‌ అన్నట్లు మిగతా రాజకీయ నేతల మాదిరి తానూ ఒకటే అని నిర్ధారిస్తారా ?ఎటు సాగదీస్తే అటు సాగే మాదిరి గబ్బర్‌ సింగ్‌ కాదు రబ్బరు సింగ్‌ అన్న విమర్శను నిజం చేస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నయీం తరువాత గ్యాంగస్టర్ల భవితవ్యం ఏమిటి ?

14 Sunday Aug 2016

Posted by raomk in AP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

BJP, Congress, gangsters, Naeem, tdp, Telangana police, trs

సత్య

   హైదరాబాదుకు యాభై కిలోమీటర్ల దూరంలోని షాద్‌ నగర్‌ దగ్గరలో పోలీసులు మట్టు పెట్టిన గ్యాంగ్‌స్టర్‌ నయీం గురించి కొన్ని మీడియా సంస్ధలు పేజీల కొద్దీ కథనాలను వండి వడ్డిస్తున్నాయి. వాటిని పాఠకులు కూడా ఎంతో ఆసక్తిగా చదువుతున్నారు. స్త్రీ వేషధారణలో వున్న నయీం ఫొటోను విడుదల చేసిన పోలీసులు వాటికి మరింత కిక్కు ఎక్కిస్తున్నారు. అంతకు ముందు గ్యాంగస్టర్‌ కధాంశంగా నిర్మించిన రజనీకాంత్‌ సినిమా కబాలీ గురించి కూడా మీడియా పుంఖాను పుంఖాలుగా వార్తలు, వ్యాఖ్యానాలు ఇచ్చింది. మనం అమ్మే సరకు ఏదన్నది కాదన్నయా దాని వలన మనకు ఎంత డబ్బు వస్తుందన్నదే ముఖ్యం అన్నట్లుగా పత్రికలు, టీవీ ఛానల్స్‌, ప్రయివేటు ఎఫ్‌ఎం రేడియా వంటివి దేనిని ఆదాయవనరుగా మార్చుకోవచ్చో నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. నయీం గురించి వర్ణితమౌతున్న కధనాలు రాంగోపాల్‌ వర్మ తన అభిమాన హీరోయిన్‌ శ్రీదేవికి 53ఏండ్లు నిండిన కారణంగా ఆమెను హీరోయిన్‌గా పెట్టి తీయలేకపోయినా వేరే వారితో హాలీవుడ్‌ మాదిరి సీరియల్‌ సినిమాలు తీయటానికి పనికి వస్తాయి. ఎందుకంటే నయీం కధలలో చీమలను, నరికిన వేళ్లను కరకరా నమిలి తినటం వంటి వాటితో సహా లేడీ డాన్‌లు,గోవా బీచ్‌లు కూడా పుష్కలంగా వున్నట్లు కనిపిస్తోంది కనుక కల్పిత పాత్రల కోసం చూడనవసరం లేదు.

    ఒక గ్యాంగ్‌స్టర్‌ హతమైన తరువాత అతగాడి బాధితుల గురించి కధనాలు రాసినట్లుగానే, నిజాలను నిర్భయంగా చెబుతాం, రాస్తాం అనే మీడియా రాజకీయ నేతల బాధితుల కధలు ఎందుకు రాయటం లేదు ? పోయినోళ్లందరూ మంచోరే అయితే గ్యాంగస్టర్‌లు కూడా అంతేగా ? పోనీ పోయిన అందరు గ్యాంగ్‌స్టర్ల గురించి మీడియా అలా రాస్తోందా? ఎందుకు రాయటం లేదు? నయీం అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఆస్థులను బాధితులకు తిరిగి ఇస్తాం అని చెబుతున్నట్లుగా రాజకీయ నేతలు లేదా ఆ ముసుగులో కబ్జా చేసిన వాటి గురించి ఏమిటి ? ఇలా ఆలోచిస్తే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

   ఈ మధ్య కాలంలో అనేక మంది గ్యాంగస్టర్లు, రాజకీయ నేతల బారిన పడిన కథలే కాకుండా మీడియా బారిన పడి ఎలా నష్టపోయిందీ చెబుతున్నారు. నయీం బాధితులకు భరోసా ఇస్తామని చెబుతున్న అధికార యంత్రాంగం పోలీసులు, రాజకీయ నేతలు, మీడియా బాధితులకు కూడా అలాంటి హామీ ఇవ్వగలదా ? విక్రమార్కుడి కధలో రాజా నిజం తెలిసి కూడా సమాధానం చెప్పలేకపోయావో నీతల వేయి వక్కలౌతుంది అన్నట్లుగా, సమాధానం చెప్పలేకపోతే తల శిరఛ్చేదం అవుతుందనే అపూర్వ చింతామణి కధలు లేదా గులేబకావళికధ సినిమాలో జూదంలో గెలవలేక బందీలుగా మారిపోవటానికి గాని ముందుకు వచ్చే వీరులెవ్వరుంటారు ?

  నయీం వంటి గ్యాంగస్టర్‌లను మట్టుపెట్టినపుడు భవిష్యత్‌లో అలాంటి మరొకరిని ఎదగనీయకూడదని అనేక మంది సామాన్యులు నిజంగానే కోరుకుంటారు. వారి సానుభూతిని కొల్లగొట్టటానికి పాలకులు, అధికార యంత్రాంగం కూడా నిరోధానికి కఠిన చర్యల గురించి భీకర ప్రతిన బూనుతుంది. స్మశాన, ప్రసూతి వైరాగ్యాల మాదిరి రెండవ రోజుకు అవి గుర్తుండవు. అంటే మతి మరపు వైరస్‌ వారిని సోకుతుందా ? ఏమౌతుంది, ఎందుకు అలా జరుగుతుంది.

   భూస్వాములు, దొరలు, దేశముఖ్‌ల హయాంలో వారికి ప్రయివేటు సైన్యాలు వున్న విషయం తెలిసిందే. కావాలంటే పాత సినిమాలు చూడవచ్చు. ఆ ఫ్యూడల్‌ వ్యవస్ధ అంతరించి లేదా అంతరిస్తూ దాని స్ధానంలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందుతున్న క్రమంలో వారి స్ధానాన్ని గ్యాంగస్టర్లు, తాలిబాన్లు (అన్ని రకాల మతోన్మాదులు) భర్తీ చేస్తున్నారు. అనేక హాలీవుడ్‌ సినిమాలు ఇప్పుడు వారి చుట్టూ తిరుగుతున్నాయి. ధనిక దేశాలలో మాఫియా, గ్యాంగస్టర్ల ఆధిపత్యం, పట్టు గురించి ఎన్నో పరిశోధనలు, ఎంతో సాహిత్యం వెలువడుతోంది. వారు అనేక చోట్ల సమాంతర ఆర్ధిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. మాఫియాతో పాటు నేడు ప్రపంచంలో అతిపెద్ద వ్యాపారాలలో బూతు ఒకటి. అన్ని రంగాలలో అగ్రస్ధానంలో వున్న అమెరికాలో హాలీవుడ్‌ సినిమాలతో సమంగా బూతు సినిమాలు తీసి సొమ్ము చేసుకుంటున్నారు. వీటన్నింటినీ పాలక వర్గాలు, వ్యవస్ధ ఎలా అనుమతించింది. ఎలా కొనసాగనిస్తోంది ?

    అందుకే ప్రపంచంలో మనకు ఎక్కడా మంచి భూస్వామి, మంచి పెట్టుబడిదారుడు, మంచివ్యాపారి కనిపించడు. రాజ్యాంగ వ్యవస్ధలు వునికిలోకి వచ్చిన తరువాత వివిధ కాలాలు, దేశాలలో పేరు ఏదైనప్పటికీ పోలీసు, మిలిటరీ అనేది పాలకవర్గాన్ని కాపాడేందుకు ఏర్పాటు చేసుకున్న అధికారిక యంత్రాంగం. విలువలు, చట్టం ముందు అందరూ సమానమే, ప్రజాస్వామ్యం వంటి వాటి గురించి కబుర్లు చెబుతుంటారు కదా ? అలాంటి వారు పోలీసు వ్యవస్ధద్వారా కొన్ని అక్రమాలు చేయించలేరు. అలాంటి వారు ఏర్పాటు చేసుకొనే అనధికార యంత్రాంగమే గూండాలు. భూస్వామి, దొరలు, దేశ ముఖులు అయితే రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికులను అదుపు చేయటానికి, వారిపై దాడులకు, పెట్టుబడిదారులు అయితే కార్మిక సంఘాలను, వుద్యమాలను దెబ్బతీయటానికి గూండాలతో పాటు మత శక్తులను వుపయోగించుకోవటం, అడ్డదారిలో లాభాల సంపాదనకు వ్యాపారులు స్మగ్లర్లను వినియోగించుకోవటం తెలిసిందే.ఈ శక్తులన్నింటితో సంబంధాలు, వాటాలు వుంటాయి కనుక తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు పాలకవర్గ రాజకీయనేతలకు వాటిలో వాటా వుంటుంది. ఈ క్రమంలోనే పోలీసు యంత్రాంగం కూడా పైన పేర్కొన్న అవాంఛనీయ శక్తులు అదుపుతప్పినపుడు అణచివేయటానికి వారిలోని వారినే వినియోగించుకోవటం ప్రారంభమైంది. వుదాహరణకు నక్సల్స్‌ను బూటకపు ఎన్‌కౌంటర్లు చేయటం కొంత కాలం సాగింది. అది బూటకం అని జనానికి అర్ధమైన తరువాత శవాల దగ్గర తుపాకులు,ఎర్ర కరపత్రాలు,సాహిత్యం పెట్టటం వంటి పాతబడిన పద్దతుల స్ధానంలో వారిలోకి కోవర్టులను ప్రవేశపెట్టి వారి చేతే మట్టుపెట్టే సరికొత్త ప్రక్రియకు తెరతీశారు. అది ఇప్పటికీ నడుస్తోంది. నిఘా వ్యవస్ధ, సిబ్బంది కంటే ఈ కోవర్టుల ద్వారానే నక్సల్స్‌, గూండా, మాఫియా గ్యాంగుల పక్కా సమాచారాన్ని పోలీసులు తెలుసుకోగలుగుతున్నారన్నది కాదనలేని వాస్తవం. ఇది ఖర్చు తక్కువ, ఫలితమెక్కువ వ్యవహారం. ఈ క్రమంలోనే స్వామి కార్యంతో పాటు స్వకార్యం అన్నట్లు పోలీసులతో సహా ప్రతివారూ అడ్డదారులు తొక్కుతున్నారు. అంటే ఇది ఒక విషవలయం.

    గతం గురించి ఎలాంటి అనుభవాలున్నప్పటికీ ప్రతి తరంలోనూ ఇది పునరావృతం కావటానికి ఇది కూడా లాభసాటి వ్యాపారమే కనుక దానికి నాయకత్వం వహించే వ్యవస్దే దీనిని పెంచి పోషిస్తున్నది. నక్సల్స్‌ ఎందరో భూస్వాములను ఖతం చేశారు, వారి స్ధానంలో కొత్తవారు పుట్టుకు వచ్చారా లేదా, అలాగే సుబ్బరామిరెడ్డి వంటి ఒక పారిశ్రామికవేత్తను హతమార్చారు, అయినంత మాత్రాన ఆ వర్గం అంతమైందా లేదు. ముంబైలో ఎందరో గ్యాంగస్టర్లను అంతమొందించారు, జైళ్లలో పెట్టారు. అయినా అక్కడ కొత్తవారు పుట్టుకు రావటం ఆగిపోలేదే. అమెరికా పెంచి పెద్ద చేసిన తాలిబాన్లు, ఐఎస్‌ వుగ్రవాదులు, పంజాబ్‌, కాశ్మీర్‌లలో వేర్పాటు వాదులను ఎందరినో హతమార్చారు. అయినా కొత్త వారు తయారు కావటం ఆగిపోలేదే. ఎందుకంటే అమెరికా కొత్తవారిని తయారు చేయటం నిలిపివేయలేదు.

   మీడియా రంగంలో అవాంఛనీయ శక్తులు, ధోరణులు ప్రవేశించటం దేన్ని సూచిస్తున్నది. దిగువ స్ధాయిలో వున్న విలేకర్లు అనేక అక్రమాలను వెలికి తీసి నివేదిస్తే వాటిని ఎరగా చూపి సొమ్ము చేసుకుంటున్న యాజమాన్యాల సంగతి తెలియనిదెవరికి? దీన్ని చూసిన తరువాత అదే విలేకర్లలో కొందరు సంపాదనకు దగ్గరదారిగా వుందని భావించి అదే పని చేస్తున్నారా లేదా ?అలాంటి యాజమాన్యాల గురించి ప్రభుత్వానికి, పోలీసులకు తెలియదా ? తెలిసీ ఎందుకు మౌనంగా వుంటున్నారు. కనీస చట్టాలను కూడా అమలు జరిపేందుకు పూనుకోవటం లేదే ? ఇది పత్రికా యాజమాన్యాలు-ప్రభుత్వనేతలు, రాజకీయనేతల కుమ్మక్కు కాదా ?

    అందువలన గూండాగిరి, గ్యాంగస్టర్‌, మాఫియా వంటి పదాలకు సాంప్రదాయ అర్ధాలను నవీకరించి కొత్త తరగతులను జత చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. బ్రిటీష్‌ వారి పాలనా కాలంలో కొన్ని తరగతుల జనానికి నేరస్థ తెగలనే ముద్రవేసి వారి పునరావాసం పేరుతో కొన్ని కప్పరాలతిప్ప, స్టూవర్టుపురం, సీతానగరం వంటి కొన్ని ఆవాసాలను ఏర్పాటు చేశారు. చివరికి వారి చేతనే పోలీసు యంత్రాంగం, పలుకుబడిగల పెద్దలు దొంగతనాలు చేయించి వారిని శాశ్వత నేరస్థులుగా చేసిన వుదంతాలు మన కళ్ల ముందే వున్నాయి.

   అనేక ప్రాంతాలలో గూండాలుగా తయారై అర్ధంతరంగా జీవితాలు ముగించిన వారి గురించి తెలుసు. అదొక వారసత్వం మాదిరి వారి వారసులు కూడా తయారై కొనసాగటం మన కళ్ల ముందే కనిపిస్తోంది.వారిని వుపయోగించుకుంటున్న రాజకీయ నేతలలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.అందువలన ఒక వీరుడు మరణిస్తే వేయి మంది వుద్బవిస్తారు అన్న మాదిరి ఈ రోజులలో వీరులు వుదయించటం లేదు గాని ఒక గూండా మరణిస్తే పదివేల మంది గూండాలు తయారవుతారు అన్నట్లుగా పరిస్థితి తయారైంది.

    ఎక్కడైనా ఒక కంపెనీలో, ఫ్యాక్టరీలో, పెద్ద దుకాణంలో ఎవరైనా అంతరించి పోగా మిగిలి వున్న తమ హక్కులను కాపాడు కొనేందుకు కార్మికులు యూనియన్‌ పెట్టుకుంటే వెంటనే వారిపై దాడి. వారి వెనుక ఎవరున్నారని ఆరాలు, ఆ యూనియన్లను అధికారపక్షం స్వాధీనం చేసుకోవటం సాధ్యం కాకపోతే వారే ఒక యూనియన్‌ పెడతారు. దానిలో అందరూ చేరాలని వత్తిడి చేస్తారు, బెదిరిస్తారు, వేధిస్తారు, దానికి లొంగకుండా అనివార్య స్ధితిలో ఆందోళన చేస్తే రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టే వారు వెనక్కు పోతారంటూ కఠినంగా అణచివేసేందుకు పూనుకుంటారు.ఈ విషయంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ అందరూ ఏకీభావంతో కూడబలుక్కున్నట్లుగా ఒకే విధంగా వ్యవహరిస్తారు. కార్మిక వుద్యమాల గురించి మీడియా కనీస ప్రస్తావన కూడా చేయదు, రాజకీయ ఫిరాయింపులపై చూపిన ఆసక్తి, కేటాయించిన స్ధలం, సమయాలతో పోల్చితే జనం సమస్యలకు ఇచ్చేది నామమాత్రం.అందుకే వెయ్యి మంది నయీంలు తయారు కావటానికి అయినా ఈ వ్యవస్ధ అంగీకరిస్తుంది కానీ ఒక ప్రజా వుద్యమం పురుడు పోసుకొని ఎదగటాన్ని మాత్రం సహించదు. దోపిడీ వ్యవస్ధల మౌలిక లక్షణం అది.

    అందరూ శాకాహారులే మధ్యలో రొయ్యలబుట్ట మాయం, అన్నట్లుగా అందరూ గ్యాంగస్టర్లుగా కఠినంగా వ్యవహరించినవారే గానీ గ్యాంగస్టర్లు తయారవుతూనే వున్నారు, దందాలు చేస్తూనే వున్నారు. నయీం వంటి ఒక సామాన్యుడు గూండాగా మారి వందల మందిని అనుచరులుగా చేసుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకుంటున్నా, నిత్యం అనేక మందిని బెదిరిస్తున్నా, హత్యలు చేసినా, చేయిస్తూ దశాబ్దాల తరబడి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి వుంటే ఇలాంటి పెద్దా, చిన్న గ్యాంగస్టర్లు ఎంత మంది వున్నారు? వారు కూడబెట్టిన ఆస్తులెన్ని, బాధితులెందరు ? వారిని కాపాడిన పోలీసులెవరు? వారిని అదుపు చేయాలని ప్రయత్నించిన పోలీసులెవరు? వారికి అడ్డుపడిన రాజకీయ నేతలెవరు ? ఎందుకలా చేశారు వంటి అంశాలపై శ్వేత పత్రం ప్రకటించి వాస్తవాలు వెల్లడించాలి. ఇవేమీ దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు కావు, అవాంఛనీయ శక్తుల అసలు రంగు.ప్రభుత్వం అలా చేయకపోతే లేదా తమకు ప్రత్యర్ధులుగా వున్నవారిని మాత్రమే పోలీసు యంత్రాంగం ద్వారా లక్ష్యంగా చేసుకుంటే ఎస్‌సి, ఎస్‌టి కేసుల మాదిరి నయీం ముఠాపై దాఖలైన కేసులు నీరు గారి పోయి, రాబోయే తరాలకు మరింత వుత్సాహమిస్తాయి. ఇప్పటివరకు గ్యాంగస్టర్లపై నమోదు చేసిన కేసులలో వారితో చేతులు కలిపిన వారిని శిక్షించిన దాఖలాలు లేవు. ఒక వేళ అలాంటివి వున్నా ప్రభుత్వం బయట పెట్టి వాస్తవాలను తెలియచేయాలి. అప్పుడే ఎవరైనా ఫిర్యాదు చేయటానికి ముందుకు వస్తారు. రాబోయే రోజుల్లో చిన్న గ్యాంగులు పెద్ద గ్యాంగులుగా మారకుండా చర్యలు తీసుకోవటానికి నిజాయితీగల యంత్రాంగం ముందుకు వస్తుంది.జోక్యం చేసుకొనే పెద్దలు వెనక్కు తగ్గుతారు.

    అలా చేయకపోతే చిత్తశుద్ధిలేని మీడియాలో నయీం గురించి మరికొద్ది రోజులు చదువుకుంటాం. అతగాడి వారసులు రంగంలోకి వచ్చిన తరువాత మీడియాలో వారి గురించి ఒక్క ముక్కా రాదు. ఆ గూండాలు అంతమైన తరువాత అదే మీడియా మరోసారి విజృంభిస్తుంది. కొత్త కథలను వండివారుస్తుంది. యధాప్రకారమే పోలీసు అధికారులు వారిని మేము ఇతర అవసరాలకు వుపయోగించుకున్నాం గానీ, ఇంత ముదురుతారని వూహించలేకపోయాం అంటారు. అతనెవరో కూడా నాకు తెలియదు గానీ అంతమొందించాలని నేను సూచిస్తే పాలకులు అంగీకరించలేదు అని కూడా చెబుతారు. వాటిని నోరు మూసుకొని,చెవుల్లో పూలు పెట్టుకొని జనం నమ్మాలి. ఎవరైనా కాదంటే పాలకులు, పోలీసులు, గూండాలు కలసి వారి అంతు చూస్తారు.అన్ని దోపిడీ వ్యవస్థలు, ప్రాంతాలలో జరుగుతున్నది ఇదే, ఇక్కడా జరగబోయేది అదే.

    ఇలాంటి వారిని అంతం చేస్తే చాలదు, ఇంతింతై వటుడింతై అన్నట్లుగా వారిని తయారు చేస్తున్న వ్యవస్ధను నాశనం చేసి కొత్త సమాజానికి పునాదులు వేయటమే పరిష్కారం. పేరుదేముంది దానికి ఎవరికి నచ్చిన పేరు వారు పెట్టుకోవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏం సాధించారని చంద్రబాబు నవ్వారు ?

07 Sunday Aug 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Telangana

≈ Leave a comment

Tags

Amaravathi capital, Andhrapradesh, ap special status, BJP, tdp

ఎం కోటేశ్వరరావు

ఏమైంది,

ఆంధ్రప్రదేశ్‌ పౌరులు వుగ్గపట్టుకు కూర్చున్నారు.

నాలుగు ఓదార్పు మాటలు చెప్పు, నీకు కూడా నేను అదేచేశాను అంది అమ్మ.

ఏమైంది,

ఆంధ్రప్రదేశ్‌ పౌరులు వుగ్గపట్టుకు కూర్చున్నారు,

నాలుగు ఓదార్పు మాటలు చెప్పు, మీ అమ్మకు కూడా నేను అదేచేశాను అంది అమ్మమ్మ.

ఏమైంది ?

ఆంధ్రప్రదేశ్‌ పౌరులు వుగ్గపట్టుకు కూర్చున్నారు,

నాలుగు ఓదార్పు మాటలు చెప్పు, మీ అమ్మమ్మకు కూడా నేను అదేచేశాను అంది పెద్ద మామ్మ.

తరతరాలుగా ఓదార్పు మాటలు, ఎంతో విశ్వసనీయమైనవి, మీరూ వాటినే వుపయోగించండి !

   ఇవి చదవగానే తరతరాలుగా కొద్ది మార్పులతో వస్తున్న గుడ్‌ వర్డ్‌ గ్రైప్‌ వాటర్‌ వాణిజ్య ప్రకటన గుర్తుకు వచ్చి వుంటుంది.

  ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం-బిజెపి కూటములు నమ్మక ద్రోహానికి పాల్పడటంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు విచారించటం లేదు, ఏడవటం లేదు, కోపగించుకోవటం లేదు గానీ తామెన్నుకున్న పాలకులు, వాగ్దానాలు చేసిన వారు ఏం చేస్తారా అని వుగ్గపట్టుకు కూర్చున్నారు. ప్రత్యేక హోదా విషయంలో నమ్మక ద్రోహానికి గురయ్యామని తెలిసి కూడా ఎలాంటి అందోళనకు పాల్పడకుండా ఎంతో నిబ్బరంగా వున్నారు. బహుశా ఆంధ్రులు ఆరంభ శూరులు అనే విమర్శను తొలగించుకోవాలంటే ఎక్కడో అక్కడ ప్రారంభించాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసినపుడు చేసిన ఆందోళన, వెలిబుచ్చిన ఆగ్రహంతో పోల్చుకుంటే ఇప్పుడు తమ భవిష్యత్‌ను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నా ఎలాంటి ఆవేశ కావేషాలకు లోనుకాకుండా వుండటాన్ని చూస్తే ఆంధ్రులు స్థిత ప్రజ్ఞులైనట్లు నిరూపించుకున్నారని అనుకోవాలి. చంద్రబాబు చెబుతున్న అమరావతి అనే సింగపూర్‌ సిటీ నిర్మాణం జరిగితే గుప్తుల స్వర్ణయుగం మాదిరి చంద్రన్న స్వర్ణయుగం ఆవిర్భవించి ఎవరూ ఏమీ అడగకుండానే అన్నీ సమకూరుతాయనే ధీమా ఏర్పడిందా ? దీని పర్యవసానం ఏమిటి ?

    ఏడాదికి ఒకసారి మాత్రమే కనువిందు చేసే ‘మే ‘పుష్పం మాదిరి ప్రధాని నరేంద్రమోడీని కలిసి బయటకు రాగానే అరుదుగా కనిపించే చంద్రబాబు నాయుడి ముఖంలో నవ్వు వికసించింది. తాము అభిమానించే బాబా నోరు విప్పగానే సమక్షంలో వుండే భక్తులు బాబా మాట్లాడారు, బాబా మాట్లాడారు అని ఆనందంతో కేరింతలు కొట్టినట్లుగా, ఆర్కిమెడిస్‌ తాను కనుగొన్న సూత్రం గురించి యురేకా, యురేకా అంటూ బట్టలు వేసుకోవటం కూడా మరచి స్నానాల తొట్టి నుంచి లేచి వీధులలో పరుగెట్టినట్లుగా చంద్రబాబు నవ్వారని ఆయన భక్తులు మైమరచి పోతున్నారు. రాజ్యసభలో కెవిపి రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రయివేటు బిల్లు ఆర్ధిక పరమైనదా కాదా అని తేల్చేందుకు లోక్‌సభకు నివేదిస్తామనగానే సంతోషంతో కేరింతలు కొడుతూ బల్లలు చరిచిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి రాబోయే రోజుల్లో నయానో భయానో సాధిస్తాం తప్ప ప్రత్యేక హోదాపై ఇంకేమాత్రం నిరసనలు తెలుపబోమని విజయవాడలో చెప్పారు. సుజనా చౌదరి అలా బల్లలు చరిచి వుండాల్సింది కాదని చంద్రబాబు నాయుడు సర్ది చెప్పిన విషయం తెలిసిందే. ఇక వారి నేత బాలయ్య బాబు అయితే హోదా ఇవ్వకపోతే కంటి చూపుతో కాల్చేస్తా అన్నట్లుగా మాట్లాడతారు. అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురంలో మాట్లాడుతూ విభజన హామీలు నెరవేరేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెబుతారు. అసలు పోరాటం ఎప్పుడు మొదలు పెట్టారని ఎవరైనా అమాయకంగా లేదా అమాయకులు అడిగితే తెలుగుదేశం నేతలకు పట్టరాని ఆగ్రహం వస్తుందని సదా గమనంలో పెట్టుకోవాలి.జక్కన్న సినిమాలో బాలకృష్ణను అనుకరించి హాస్యం పండించటాన్నే లైట్‌గా తీసుకోలేని బాలకృష్ణ అభిమానులు హాస్యనటుడు ప్రధ్వీరాజ్‌ను బెదిరించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు ఐదు కాదు పది అన్న వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా అంశాన్ని ఆ నాడు విభజన బిల్లులో ఎందుకు పెట్టలేదని మన్మోహన్‌ సింగ్‌ను ఇప్పుడు నిలదీస్తున్నారు. ప్రత్యేక హోదాకు మరోవైపు ఎవరెవరు అభ్యంతరాలు తెలుపుతున్నారో వెంకయ్య నాయుడు మరోసారి గుర్తు చేసి అలాంటి వారిని అప్రమత్తం గావించారు. ప్రజాస్వామ్యం, సహనంపై జనంలో ఇంకా విశ్వాసం వుంది కదా అని ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, వాదించవచ్చు.

     నరేంద్రమోడీ మాట్లాడేందుకు సిద్దపడితే ఢిల్లీ వెళతానని చెప్పిన చంద్రబాబు ఎలాగైతేనేం ఢిల్లీ వెళ్లారూ, తిరిగి రానూ వచ్చారు. మోడీ గారి వేద గణితం మాదిరి చంద్రబాబు లెక్కల్లో ఇది 31వ సారి అనుకోవాలి. లేదా మోడీతో ప్రత్యేక హోదాపై మాట్లాడటంతో కొంత మంది భ్రమింప చేస్తున్నట్లుగా ఆవిర్భవించిన నూతన శకంలో తొలి పర్యటనగా అయినా లెక్కించుకోవాలి. ఢిల్లీ వెళ్లారా లేదా అని కాదు అన్నయా ఏం సాధించుకువచ్చారని చిలక నవ్వులు నవ్వినట్లు అన్నట్లు చంద్రబాబు సాధించిందేమిటి ? కలలో కూడా నెరవేరని గట్టి హామీ. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వటానికి తమకు అభ్యంతరం లేదని, తమ రాష్ట్రాలకూ దాన్ని ఇవ్వాలని కోరుతున్న ముఖ్య మంత్రులను బుజ్జగింప చేసి ఆంధ్రప్రదేశ్‌కు ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని నరేంద్రమోడీ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. నరేంద్రమోడీ-చంద్రబాబు భేటీ సందర్భంగా తాను పక్కనే వున్నట్లుగా ‘ఏపినీ అదుకొనే బాధ్యత నాది, మీరు నిశ్చింతగా వుండండి అని చంద్రబాబును వుద్ధేశించి ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారంటే ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయని భావించవచ్చు. ప్రతిపక్షాలు కోరుతున్నట్లు ప్రత్యేక హోదా మాత్రమే ఇచ్చి సరిపెట్టుకోకుండా ఆర్ధికంగా ఇబ్బందులు వున్న రాష్ట్రాన్ని ఆదుకోవటానికి ఇతోధికంగా సాయం చేయటంతో పాటు పన్ను రాయితీలు కల్పించటానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించటం శుభసూచకం’ అని వ్యాఖ్యాత పేర్కొన్నారు.నిజంగా అదే జరిగితే అంతకంటే కావాల్సిందేముంది. అలాంటి చిత్తమే వుంటే ఇంత రచ్చ జరగటానికి అవకాశం ఎందుకు ఇచ్చినట్లు ? ప్రతిపక్షాలు కోరుతున్నట్లు అన్నారు, తెలుగుదేశం కోరటం లేదనేనా ? తమకు లేని హోదా, రాయితీలు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చేందుకు అంగీకరించి తమ రాజకీయ పునాదిని తామే కూల్చుకునేంత అమాయకంగా మమతాబెనర్జీ,నవీన్‌ పట్నాయక్‌, జయలలిత వున్నారా ? పోనీ వారు ముగ్గుర్ని ఒప్పిస్తే మిగతావారి సంగతేమిటి? భారతంలో ద్రౌపది తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా అన్న సందేహం లేవనెత్తినట్లుగా ఆ వ్యాఖ్యాత తాను నమ్మి జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారా లేక జనాన్ని మాత్రమే నమ్మించేందుకు పూనుకున్నారా ?

    ఆదాయమున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టటాన్ని ఒక విధాన పరంగానే నిలిపివేసింది.నిధులు అంతగా లేని రాష్ట్రాలు కూడా అదేబాటలో నడుస్తున్నాయి. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా విభజించారు, దానికి రాజధాని కూడా లేదు నుక ప్రత్యేక హోదా, రాయితీలు ఇవ్వటానికి వుదారంగా అంగీకరించండని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అనధికారికంగానే అడిగారనుకోండి. విభజన సమయంలో మా అభిప్రాయం అడగలేదెందుకుని ఎవరైనా అడిగితే ఏం చెబుతారు ? ఒక జాతీయ పార్టీగా కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి ముందుగా తాను అధికారంలో వున్న రాష్ట్రాలకు అలాంటి అభ్యంతరం లేదని ప్రకటింపచేసి మిగతావారిని అడిగితే నిజాయితీగా, నిజమైన రాజనీతిజ్ఞురాలిగా బిజెపిని పరిగణిస్తారు. పశ్చిమ బెంగాల్‌ నుంచి ఎక్కడకు తరలించాలా అని చూసిన టాటా నానో కార్ల కంపెనీకి రాయితీలు ఇచ్చే శక్తి లేక అనేక రాష్ట్రాలు ఆ పోటీలో వెనుకబడగా జనం సొమ్మును కార్పొరేట్లకు కట్టపెట్టటంలో ముందున్న గుజరాత్‌ దానిని దక్కించుకుంది. అటువంటపుడు ఏ రాష్ట్రమైనా ఒక రాష్ట్రానికి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రత్యేక రాయితీలు ఇవ్వటానికి ఎలా ఒప్పుకుంటుంది? ఒక రాష్ట్రానికి వుదారంగా నిధులు సాధ్యం కాదని సాక్షాత్తూ కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్‌ట్లీ రాజ్యసభలో ప్రత్యేక హోదా అనధికార బిల్లుపై చర్చ సందర్భంగా చెప్పిన చారిత్రాత్మక సమాధానంలో స్పష్టం చేసిన విషయాన్ని అప్పుడే ఎలా మరిపోగలం ? ప్రత్యేక హోదా సినిమా చివరికి ఎలా ముగుస్తుందో తెలియదు గాని కధ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం అమోఘంగా వుందనే విధంగా ప్రచారం హోరెత్తుతోంది.

     ప్రత్యేక హోదా రాదని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నిర్ణయించుకున్న తరువాత వాటిని ఇవ్వకూడదని నిర్ణయించుకున్న బిజెపి, ఇవ్వకపోయినా గట్టిగా అడగకూడదు, ఏదో ఒక పేరుతో కాలక్షేపం చేయాలని చూస్తున్న తెలుగు దేశం పార్టీలపై జనంలో తలెత్తిన చిరు అసంతృప్తి లేదా ఆగ్రహాన్ని కూడా వుపశమింపచేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వాటిని చూస్తుంటే కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. మొరటు సామెత మాదిరి వుపస్థ మినహా గర్భాదాన అన్నట్లు కీలకమైన అంశాలు లేకుండా తూతూ మంత్రంగా ప్రత్యేక హోదా కల్పించేందుకు ఏదైనా పధక రచన చేస్తున్నారా ? అన్నది వాటిలో ఒకటి. అదే అయితే వ్యతిరేకించే రాష్ట్రాలేవీ వుండవు. పన్నులు విధించే అధికారాన్ని రాష్ట్రాల నుంచి హరించి కేంద్రం తీసుకొనేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణకు లోక్‌సభ ఆమోదం పొందటం లాంఛనమే కను ప్రత్యేక హోదా ప్రకటించిన రాష్ట్రాలలోని పరిశ్రమలు, వ్యాపారాలకు పన్నులను మినహాయించాల్సింది కూడా కేంద్రమే అవుతుంది. ఏదైనా ఒక రాష్ట్రంలో ఏర్పాటయ్యే వాటికి మినహాయింపులు ఇవ్వటం ద్వారా ఖజానాకు వచ్చే నష్టాన్ని కేంద్రమే భరిస్తుందా? అన్ని రాష్ట్రాలు భరించాలా? పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాలు రాయితీలు ఇవ్వటాన్ని నిరుత్సాహపరచాలని, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని వెనుకబడిన రాష్ట్రాల నుంచి ఒకవైపు డిమాండ్‌ పెరుగుతున్నది, అలాంటపుడు ముందుబడినట్టు చెబుతున్న ఆంధ్రప్రదేశ్‌కు మినహాయింపులు ఎలా ఇస్తారు ? వస్తు, సేవల పన్ను విధానాన్ని అమలు జరపటమే ఒక సవాలుగా మారనుందని విశ్లేషణలు వెలువడుతున్న తరుణంలో ఈ సమస్యలన్నీ మరింతగా ముందుకు వస్తాయా రావా ?

    రాష్ట్ర విభజనకు పూర్తిగా కాంగ్రెస్‌దే బాధ్యత అని నిత్యం దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో వుంది కనుక, అందుకు చొరవ తీసుకుంది కనుక దానిదే బాధ్యత అనటంలో సందేహం లేదు. కానీ మిగతా పార్టీలు ఎలా తప్పుకుంటాయి. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసిన బిజెపి, రెండు కళ్ల సిద్దాంతం పేరుతో విభజనకు అంగీకరించిన తెలుగుదేశం పార్టీ సంగతేమిటి ? అందువలన ముందుగా బిజెపి తన పాలిత రాష్ట్రాల అభిప్రాయాన్ని వెల్లడించి తన నిజాయితీ ఏమిటో జనం ముందు ప్రదర్శించాలి.

      గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లు రాజకీయ పార్టీల ఆలోచనలు, గోత్రాలు వాటికి దగ్గరగా వుండే వారికే బాగా తెలుస్తాయి. అలాంటి వారిలో జిగిని జర్నలిస్టు తెగ ఒకటి.ఎన్నికలు జరిగి రెండేళ్లు గడిచినా సాధించిందేమిటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో తమకు రెండు వందల స్ధానాలకు మించి రావని, అప్పుడు ఇతర పార్టీల మద్దతు కూడగట్టటం అవసరం అని బిజెపి పెద్దలు లెక్కవేస్తున్నారని అలాంటి ఒక జర్నలిస్టు విశ్లేషించారు. అంటే మోడీ గాలి పోవటం ప్రారంభమైందన్నమాట. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై వున్న కేసులలో ఆయనకు శిక్ష పడితే , ఆ పార్టీ వెనుక వున్న జనం తిరిగి కాంగ్రెస్‌వైపే చేరతారని దాంతో కాంగ్రెస్‌ ఎన్నో కొన్ని సీట్లు పొందే అవకాశం వుంది కాబట్టి ప్రస్తుతానికి జగన్మోహన్‌రెడ్డి జోలికి పోగూడదన్నది బిజెపి ఆలోచనగా వుందట.వైసిపిని దెబ్బతీయటానికి సహకరిస్తే రాష్ట్రంలోని 25కు గాను 20 సీట్లు గెలుస్తామని తెలుగుదేశం పార్టీ లెక్కలు వేసుకుంటుందట. అంటే అలా చేస్తే జన్మజన్మల బంధం మాదిరి వచ్చే సారి కూడా మద్దతు ఇచ్చి ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ ముందస్తు ఆశ చూపుతోందా? అవినీతిని అంతం చేస్తామని, అక్రమార్జన పరుల తాటతీస్తామని తమ పార్టీ రూటే సపరేటని చెప్పుకున్న బిజెపి పత్రికల్లో రాసేంతగా తమ అధికార దాహ ఆలోచనలను వెల్లడిస్తోందా ? ఏ పార్టీలో గెలిచినా అమ్ముడు పోయే ఎంపీలు, ఎంఎల్‌ఏలు తామర తంపరగా పెరిగి పోతున్న ఈ రోజుల్లో వారిని కొనుగోలు చేసేందుకు అవసరమైన డబ్బుండి, సైద్ధాంతిక, నైతిక బాదర బందీలేని బిజెపి,తెలుగుదేశం వంటి పార్టీలు రాబోయే అధికారం గురించి ఇప్పటి నుంచే ఆలోచిస్తే వారు ఇంక ప్రజల గురించేమి పట్టించుకుంటారు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కావాల్సింది వృధా చర్చా ! నమ్మక ద్రోహంపై రచ్చా !

04 Thursday Aug 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ap special status, BJP, center's betrayal, CHANDRABABU, tdp

ఎం కోటేశ్వరరావు

     పుష్కర స్నానాల వలన పుణ్యం వస్తుందని బలంగా విశ్వసించటానికి కొంత మందికి ఎలా స్వేచ్ఛ వుందో అదొక మూఢనమ్మకం అని నమ్మేవారికి కూడా అంతే స్వేచ్చ మన దేశంలో వుంది. అందువలన సందర్భం వచ్చినపుడు దాని మంచి చెడ్డలను చర్చించటం తప్పుకాదు. వ్యతిరేక అభి ప్రాయాన్ని వ్యక్తీకరించటం ద్వారా మా మనోభావాన్ని దెబ్బతీశారని ఎవరైనా దెబ్బలాటకు వస్తేనే సమస్య. ప్రపంచంలో ప్రతి మతం, కులం, తెగ ఇలా ఎన్ని తరగతులుంటే అన్నింటికీ సారూప్యత గలిగిన మూఢనమ్మకాలు,ఆచారాలకు కొదవ లేదు. ఆధునిక ప్రవచన కారులు సరికొత్త మూఢనమ్మకాలను ఎక్కిస్తున్నారు. పుష్కరాలనేవి ఒక మతానికి చెందిన నమ్మకం తప్ప వేరు కాదు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పన్నెండు రోజుల పాటు పన్నెండు అంశాల మీద రోజుకొకదానిపై చర్చా గోష్టులు, సదస్సులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. రాష్ట్ర ప్రజానీకంలో పెద్ద ఎత్తున ఆశలు రేకెత్తించటానికి, ఓట్లు దండుకోవటానికి, చివరకు నమ్మక ద్రోహానికి మారుపేరుగా మారిన రాష్ట్ర ప్రత్యేక హోదా రాకపోతే ఏం చేయాలో, ఇప్పటికే చేయాల్సిందానికంటే ఎక్కువే చేశాం లెక్కలు చెప్పటం లేదంటున్న బిజెపి నేతల ప్రచార వాస్తవ అవాస్తవాలేమిటో ఒక సమగ్ర శ్వేత పత్రం ప్రకటించి పన్నెండు కోణాలలో పన్నెండు రోజులు చర్చలు జరపమని చంద్రబాబు నాయుడు రచ్చ చేసి వుంటే చర్చ సమంజసంగా వుండేది. కనీసం జనానికి వాస్తవాలు ఏమిటో అన్నా తెలిసేవి. కేంద్రం ఇచ్చే ప్రత్యేక నిధులతో ఆర్ధిక లోటు తీర్చి, ప్రత్యేక హోదాతో వచ్చే ఆకర్షణీయ రాయితీలతో పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్ర రూపు రేఖలు మార్చివేస్తామని చెప్పిన వారు అసలు ఆ ఆంశాలనే చర్చనీయాంశాల జాబితాలో లేకుండా చేశారు. పుష్కరాలలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసినట్లుగా ప్రత్యేక హోదాకు కూడా అదే చేస్తారా ? చిత్రం ఏమంటే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేని ఒక మూఢనమ్మకం, ఒక మతానికి చెందిన కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వం జరప తలపెట్టిన చర్చలో సమాజ పురోగతికి అవసరమైన శాస్త్రీయ భావజాలాన్ని చర్చ నీయాంశంగా చేయకపోవటం. అసలు మత క్రతువుల సందర్భంగా ఇలాంటి కిరస్తానీ చర్చలేంటి అనే ‘గురజాడ అగ్నిహోత్ర అవధానులు’ ఎవరైనా వుంటే అది వేరే విషయం.

     చర్చ చేయండని చంద్రబాబు చెప్పిన పన్నెండు అంశాలు విజన్‌ 2050లో పేర్కొన్నవాటికి మించి సామాన్యజనానికి ఆసక్తి కలిగించేవి కొత్తగా ఏమన్నా వుంటే వాటి గురించి చర్చించవచ్చు. అన్నింటికీ మించి విచారకరమైన అంశం ఏమంటే రాష్ట్రాల హక్కులు, ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ముందుకు వచ్చిన తెలుగు దేశం పార్టీ ఇప్పుడు అంతకంటే మెరుగైన పరిస్థితేమీ లేకున్నా, నమ్మక ద్రోహం జరిగిందని యావత్‌ ప్రజానీకం భావిస్తున్న స్ధితిలో గతాన్ని గోతిలో పారవేసి ఏం చేసినా పొత్తు పెట్టుకున్నోళ్లతో సర్దుకు పోక తప్పదన్న వైఖరి తీసుకోవటం ఒక విషాదం. రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధి విషయాలలో తాను రాజకీయాలు చేయనని, అందుకు ఇతర సందర్భాలుంటాయని చంద్రబాబు అనేకసార్లు చెప్పి పెద్ద రాజనీతిజ్ఞుడిగా అనేక మంది ప్రశంసలు పొందారు. ఇప్పుడు రాజ్యసభలో బిజెపి తప్ప అన్ని పార్టీలు ప్రత్యేక హోదా గురించి ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన తరుణంలో పరిణితితో అన్ని పార్టీలను ఏకత్రాటిపై నడిపించి కేంద్రంపై వత్తిడి పెంచాల్సిన చంద్రబాబు అందుకు భిన్నంగా తాను, తన సైనికుల ద్వారా రాజకీయాలు మాట్లాడించి నిజమైన రాజనీతిజ్ఞుడు, రాష్ట్రంకోసం నిజాయితీగా పని చేస్తున్నారు అనే పేరు తెచ్చుకొనే అవకాశాన్ని జారవిడుచుకున్నారు.ప్రత్యేక హోదా విషయంలో మిగతా పార్టీలను కలుపుకుంటే దాని ద్వారా పొందే రాజకీయలబ్ది తగ్గుతుందనుకున్నారా ? తద్విరుద్ధంగా ప్రవర్తించి బిజెపిని ఒక్క మాట కూడా అనకుండా మొదటికే మోసం తెచ్చుకొనేందుకు పునాది వేసుకున్నారా ? గోదావరి పుష్కరాలలో మునిగి పుణ్యం పొంది ప్రత్యేక హోదా, కనీసం లోటు పూడ్చుకొనేందుకు నిధులు కూడా తెచ్చుకోలేకపోయారు. మరి ఆ పుణ్యం ఏమైనట్లు ?

     ఇక్కడ మరొక అంశాన్ని ప్రస్తావించటం సందర్భ సహితం అని భావిస్తున్నాను.ముస్లిం లేదా ఇస్లాం హాజ్‌ సబ్సిడీలను 2022 నాటికి రద్దు చేయాలని ఒకవైపు సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే అదే సమయంలో హిందు క్రతువులకు ప్రజల సొమ్మును ఖర్చు చేయటం విపరీతంగా పెరిగిపోతోంది. అవి పుష్కరాలు, కుంభమేళాలు, మానస సరోవర, చార్‌ధామ్‌ వంటి యాత్రలు ఏవైనా కావచ్చు. వాటి సందర్భంగా పెడుతున్న ఖర్చు హాజ్‌ సబ్సిడీల కంటే ఎంతో ఎక్కువగా వుంటోందా లేదా ? హాజ్‌ మాదిరి నగదు సబ్సిడీ ఇవ్వకపోవచ్చు, అందుకోసం ఏర్పాట్ల పేరుతో చేసే ప్రజాధనం ఖర్చు సంగతేమిటి ? ప్రతి సేవకూ రుసుము చెల్లించాల్సిందే ఏదీ వుచితం కాదు అని చెబుతున్న ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాల సందర్బంగా చేసే ఖర్చులకు ఒక ఖాతాను తెరిచి అందుకయిన ఖర్చును, వాటిలో పాల్గొన్నవారి నుంచి రాబడితే అది విమర్శలకు తావుండదు. అలా చేయటం లేదే ! పుష్కర యాత్రీకులను ఘాట్ల వద్దకు చేర్చేందుకు వుచితంగా బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రవాణాశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రకటించారు. అసలే ఆర్టీసి నష్టాల్లో వుందని చెబుతూ ఇలా చేయటాన్ని ఎవడబ్బ సొమ్మని రామచంద్రా అన్నట్లు ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు ?

    బ్రిటీష్‌ వారి కాలంలో రాణీగారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన హాజ్‌ సబ్సిడీ స్వాతంత్య్రం తరువాత కూడా కొనసాగించారు. స్వాతంత్య్రపోరాట కాలంలో ముస్లింలను పోరుబాట నుంచి వేరు చేయటానికి తెల్లవారు అనేక ఎత్తుగడలు వేశారు. వాటిలో ఇది కూడా ఒకటి. విమానాలు రాక ముందు ఓడలే ప్రయాణ సాధనాలు కనుక బ్రిటీష్‌ ప్రభుత్వం తమ దేశ ఓడల కంపెనీ ఓడ ఎక్కి సౌదీ వెళ్లిన వారికే సబ్సిడీ అని కూడా నిబంధన విధించినందున దానిలో కూడా షిప్పింగ్‌ కంపెనీ ప్రయోజనాలు దాగి వుంటాయనటంలో ఎలాంటి సందేహం లేదు.తెల్లవారిని తరిమేసి వారి స్ధానంలో అధికారానికి వచ్చిన నల్లవారు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలలో భాగంగా దానిని కొనసాగించారని చేసే విమర్శలో వాస్తవం లేకపోలేదు. చేసిన మార్పేమిటంటే ఓడల రాయితీని విమానాలకు వర్తింప చేశారు. అది కూడా ప్రభుత్వ రంగ విమానాలకే వర్తిస్తుంది. ఇది లౌకిక వాదానికి విరుద్ధం అంటూ కొందరు కోర్టుకు వెళ్లారు. దానిని విచారించిన సుప్రీం కోర్టు 2012లో ఒక తీర్పు ఇస్తూ 2022 నాటికి సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయాలని ఆదేశించింది. ఈ సబ్సిడీని హిందూత్వ శక్తులు మతకారణంతో వ్యతిరేకిస్తే, మాకు సబ్సిడీ ఇచ్చే పేరుతో ఎయిరిండియాను బతికించేందుకు ప్రభుత్వం దానికి మాత్రమే ఇచ్చిందని, ఇతర కంపెనీల రేట్ల కంటే ఎయిరిండియా రేట్లు ఎక్కువని విమర్శించే ముస్లింలు కూడా లేకపోలేదు.

    పుష్కరాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి.ఒక మత పుష్కరాలను రాష్ట్ర వేడుకగా నిర్ణయించటం లౌకిక వ్యవస్ధకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమా, అనుకూలమా ? గతేడాది గోదావరి, ఈ ఏడాది కృష్ణా పుష్కరాల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పెడుతున్న ఖర్చు, చేస్తున్న హడావుడి గతంలో ఎన్నడూ లేదంటే అతిశయోక్తి కాదు.ఎన్నడూ లేని కొత్త కొత్త పద్దతులను ప్రవేశపెడుతున్నారు. నిజంగా పుష్కరుడు వుండి వుంటే గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన దానికి నిరసనగా కృష్ణా పుష్కర బహిష్కరణ జరిగేదేమో? పుష్కరాల కంటే ముఖ్యమంత్రుల కీర్తి కండూతిని పెంచుకోవటం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. దేశ విదేశాల్లో వున్న వారికి, రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నవారికి , షరా మామూలుగా గ్రామాలు, పట్టణాలలోని ప్రజా ప్రతినిధులు, ముఖ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సంతకంతో కూడిన ఆహ్వానాలు పంపటం ప్రచార ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. వాటి కాంట్రాక్టు పుచ్చుకున్న ముద్రణా సంస్ధలకు తప్ప వాటిని అందుకున్నవారికి, అందుకయ్యే అనవసర ఖర్చు భరించే జనానికి ఒక్క పైసా ప్రయోజనం వుంటుందా? హాజ్‌ సబ్సిడీని రద్దు చేస్తూ అందుకు చేసే ఖర్చును కావాలంటే మైనారిటీల సామాజిక, విద్యా అభివృద్ధికి ఖర్చు చేయవచ్చని సుప్రీం కోర్టు చెప్పిన సలహా ఇతర సందర్భాలకు వర్తించదా ?

   రెండు సంవత్సరాలు గడిచినా చేసిన ప్రధాన వాగ్దానాలలో ఒక్కటి కూడా అమలు జరపని స్ధితి.కొంతకాలం రాజధాని భూ సేకరణ, మరికొంత కాలం రాజధాని ఎలా వుండాలి, మరి కొంత కాలం తాత్కాలిక రాజధాని నిర్మాణం, మరి కొంత కాలం శాశ్వత రాజధాని ఎలా నిర్మించాలి, దానికి అప్పు ఎలా తేవాలి ఇలా ఆవు వ్యాసం రాసిన మాదిరి కాలక్షేపం చేయటం, ప్రతి సందర్భాన్ని అతిశయోక్తులతో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజల దృష్టి మళ్లించటం తప్ప మరొకటి కనిపించటం లేదు. ఇలాంటి వాటికి బుట్టలో పడేంత ఆమాయకంగా ఆంధ్రులు వున్నారా ? ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అతి సర్వత్ర వర్జయేత్‌ అన్నారు పెద్దలు. అతిగా ప్రచారంలో జనాన్ని ముంచితే తామూ దానిలోనే మునుగుతారని గ్రహించటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d