• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Others

ఆత్మవంచన మాని బిజెపి తన కింది నలుపును చూసుకుంటుందా !

27 Monday Mar 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, RELIGION

≈ Leave a comment

Tags

BJP, BJP values, Casinos, Goa, Goa BJP, Goa Casinos, RSS, RSS Duplicity, The hippocratic BJP, UP News, Yogi Adityanath

Image result for yogi adityanath sabka sath,sabka eek cartoons

ఎంకెఆర్‌

యోగులైనా, భోగులైనా తమ తమ మఠాలు, మందిరాలకు పరిమితమైనంత వరకే వారి చర్యలు ప్రయివేటు వ్యవహారాలు. గీత దాటి బహిరంగ జీవితంలోకి వస్తే వారి చర్యల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసేందుకైనా సభ్య సమాజానికి హక్కు, అవకాశం వుంటుంది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న, తలెత్తుతున్న చర్చలు, అభిప్రాయాలపై కొన్ని శక్తులు తమ అసహనాన్ని వెళ్ల గక్కుతున్నాయి. వాటిపై ప్రతి వ్యాఖ్య, విమర్శ వేరు, అవి చేయలేక అసహనం వ్యక్తం చేయటం మరో తీరు. గతంలో ఎన్నో నీతులు, రీతులు బోధించిన బిజెపి ఇప్పుడు వాటిని తానే దిగమింగి వ్యవహరిస్తోందనే విమర్శలను ఎదుర్కొంటోంది. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినవారిపై ఆ పార్టీ అనుచరగణం విరుచుకుపడిపోతున్నది. మిత్ర సూచనలు, హెచ్చరికలను కూడా ‘సహించ ‘టం లేదు. ఇది కచ్చితంగా భారతీయ సంస్కృతి కాదు.

Image result for yogi adityanath sabka sath,sabka eek cartoons

ప్రస్తుతం వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బిజెపి ఎంపిక చేసిన వ్యక్తి యోగి ఆదిత్యనాథ్‌. అయోధ్యలో బాబరీ మసీదును కూలదోసి దాని స్ధానంలో రామమందిరం కట్టాలన్న హిందూత్వ వాదుల నాయకత్వాన్ని చూసి వుత్తేజితుడై తన జీవితాన్ని రామమందిరం, హిందూత్వకోసం అంకితం చేయాలని చిన్నతనంలోనే నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇష్టం, దానిలో భాగంగానే ముస్లింల వ్యతిరేక వ్యాఖ్యలు, ఇతరనేరపూరిత చర్యలకు పాల్పడిన కారణంగా కేసులు నమోదు చేసినా వెనక్కు తగ్గలేదు. చట్టం ఇంకా తనపని తాను చేయలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన హిందూత్వకు ప్రతీక, హిందూత్వను అమలు జరపటానికే బిజెపి, దాని మార్గదర్శ సంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంపిక చేసిందని కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలపై యోగి అనుయాయులు భజరంగ భళీ-బలి అంటున్నారు. వారు ఆత్మవంచనకు పాల్పడుతున్నారని ఎవరైనా అంటే తప్పేముంది.

ప్రజాసేవకోసం చిన్నతనంలోనే దేశ సేవకు, బ్రిటీష్‌ వారిని ఎదిరించేందుకు అంకితమైన అల్లూరి, భగత్‌సింగ్‌, సుందరయ్య వంటి వారి గురించి ఎన్నో విన్నాం. సామాన్యజనం వారిని విప్లవకారులని పిలిచినందుకు వారి జీవితాలను ఆదర్శంగా తీసుకున్నవారేమీ అభ్యంతర పెట్టలేదు, అసహనం వ్యక్తం చేయలేదు. వారి చర్యలతో తమకు ప్రమాదం అని భావించిన శక్తులు వాటికి ప్రాతినిధ్యం వహించిన నాటి ప్రభుత్వాలు వారిని సమాజంలో అశాంతిరేపేవారుగా చిత్రించి ఆరోపణలు చేయటాన్ని జనం అంగీకరించలేదు. అనేక మంది వారి బాటలో నడిచారు, ఇప్పటికీ నడుస్తున్నారు.

Image result for BJP, hippocracy, values cartoons

అలాగే ఆంగ్లేయుల పాలనను వ్యతిరేకించే వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి జైలు జీవితాన్ని తట్టుకోలేక అదే బ్రిటీష్‌ ప్రభుత్వానికి లొంగిపోయి లేఖలు రాసి తన రాణీగారీ భక్తిని ప్రదర్శించుకున్న విడి సావర్కర్‌ గురించి కూడా మనకు తెలుసు. ఆయనొక ఎత్తుగడలో భాగంగా ఆ లేఖలు రాశారని అందువలన ఆయన దేశభక్తుడే అన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ వారి వ్యాఖ్యానం. దాన్ని సమాజం అంగీకరించిన దాఖలాలు లేవు. కానీ ఆ తరువాత స్వాతంత్య్రపోరాటంలోకి దూకిన భగత్‌ సింగ్‌కు అలాంటి తెలివితేటలు, ఎత్తుగడలు లేవు, చిరునవ్వుతో ప్రాణాలు అర్పించటం తప్ప మరొకటి తెలియని అసలు సిసలు దేశ భక్తుడు. బ్రిటీష్‌ వారికి విధేయుడిగా వుంటానని లేఖ రాసిన సావర్కర్‌ ఆ తరువాత ఎక్కడా బ్రిటీష్‌ వ్యతిరేకపోరాటంలో కనపడరు. వారికి మరో రూపంలో సాయం చేసేందుకు హిందూత్వను ముందుకు తెచ్చారు. ఆయన రాసిన లేఖ బయటపడిన తరువాత కూడా సావర్కర్‌ను దేశభక్తుడిగా సమర్ధించేందుకు, భగత్‌ సింగ్‌ కంటే పెద్ద త్యాగధనుడిగా చిత్రించేందుకు, ఆయన ముందుకు తెచ్చిన హిందూత్వకు వారసులుగా చెప్పుకోవటానికి అనేక మందికి ఎలాంటి అభ్యంతరం వుండటం లేదు. అలాంటపుడు యోగి ఆదిత్యనాధ్‌ హిందూత్వవాది గురించి ఆయనను వ్యతిరేకించేవారు ఏమి అన్నప్పటికీ సరైన బాటలోనే నడుస్తున్నారని భావించే ఆయన అభిమానులు సంతోషంతో పులకించి పోవటానికి బదులు హిందూత్వ ప్రతినిధి అని వ్యాఖ్యానించిన వారిని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది. అలా చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నారా ?

కాంగ్రెస్‌ తాను ప్రవచించిన ఆదర్శాలను ఎప్పుడో వదలి పెట్టింది. అందుకు తగిన ఫలితాలు అనుభవిస్తున్నది. దానికి భిన్నమైన పార్టీ అని కదా బిజెపి చెప్పుకున్నది. మాంసం దగ్గర మంచోడి సంగతి తెలుస్తుందన్నది ఒక సామెత. ఇప్పుడు బిజెపికి అది చక్కగా వర్తిస్తుంది. దాని నిజరూపం వామపక్ష శక్తులు, ప్రజాతంత్ర శక్తులలో కొంత భాగానికి ముందే తెలిసినా సామాన్య జనానికి అర్ధం కావటం ఇప్పుడే ప్రారంభమైంది. ఆ పార్టీ ఆత్మవంచన, పరవంచన గురించి మచ్చుకు రెండు అంశాలను చూద్దాం.

Image result for yogi adityanath sabka sath,sabka eek cartoons

హాజ్‌యాత్రకు సబ్సిడీ లేదా రాయితీ ఇచ్చి ముస్లింలను సంతృప్తి పరచి ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకొనేందుకు ఇతర పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయని ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంస్ధలైన బిజెపి వంటివి ఎన్నో ఏళ్లుగా నానా యాగీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ రాయితీని క్రమంగా తగ్గించి 2022 నాటికి పూర్తిగా రద్దు చేయాలని 2012లో సుప్రీం కోర్టు ఆదేశించింది. చిత్రం ఏమంటే మానస సరోవర యాత్ర చేసేందుకు హిందువులకు లక్ష రూపాయల వరకు ఇవ్వటానికి నిర్ణయించినట్లు యోగి ఆదిత్యనాధ్‌ ప్రకటించారు. ముస్లింలకు హాజ్‌ హౌస్‌లు నిర్మించినట్లుగానే మానస సరోవర్‌ యాత్రీకులకూ ఢిల్లీ సమీపంలో భవనాలు నిర్మించనున్నట్లు కూడా ప్రకటించారు. ఇదేమిటి? ఒక మత యాత్రకు అభ్యంతరం తెలిపిన వారు మరొక మత యాత్రకు సబ్సిడీలు ఇవ్వటం ప్రారంభించటాన్ని ఏమనాలి? మైనారిటీ మత సంతుష్టీకరణ మాత్రమే తప్పు మెజారిటీది ఒప్పు అంటారా ?

ఇక బీఫ్‌ గురించి చూద్దాం. రీడ్‌ ఇండియా రైట్‌ ( ఇండియా మితవాదులు చెప్పేది చదవండి) అని టాగ్‌లైన్‌ పెట్టుకున్న పత్రిక ‘స్వరాజ్య ‘. దాని సారధి ఆర్‌ జగన్నాథన్‌. అక్రమంగా వున్న కబేళాల మూసివేతకు యోగి ఆదిత్యనాథ్‌ తొందర పడితే జరిగే మంచికంటే నష్టమే ఎక్కువ అనే శీర్షికతో ఆయనొక విశ్లేషణ రాశారు. ఇంకేముంది ఆ పత్రికను చదివే మితవాదులు అతగాడొక కమ్యూనిస్టు అని, వుద్యోగం నుంచి తొలగించాలంటూ దాడికి దిగారు. ఎన్నికలలో మెజారిటీ సంపాదించటం వేరు ప్రభుత్వాలు అందరికోసం పని చేయాలి. యోగి తొలి చర్యలు చూస్తుంటే సబ్‌కాసాత్‌ సబ్‌కా ఏక్‌ ను సాధించే అవకాశమే లేదని, పెద్ద సంఖ్యలో మైనారీటీల మనసులను విరిచివేస్తాయని జగన్నాధన్‌ వ్యాఖ్యానించారు.గోవధనిషేధం అంటే ఆవు ఆర్ధిక విలువ పడిపోవటమేనని, దున్న లేక బర్రె మాంసానికి డిమాండ్‌ పెరుగుతున్న కారణంగా ఆవుల రాష్ట్రాలుగా వున్న ప్రాంతాలలో వాటి స్ధానంలో గేదెలు పెరుగుతున్నాయని,2007 లెక్కల ప్రకారం దేశంలోని మొత్తం పశు సంపదలో గేదెలశాతం 34.6కాగా హర్యానాలో 79.3, పంజాబ్‌లో 74, వుత్తర ప్రదేశ్‌లో 55.8, ఆంధ్రప్రదేశ్‌లో 54.2, గుజరాత్‌లో 52.4, రాజస్తాన్‌లో 47.8, బీహార్‌లో 34.8శాతం వున్నాయి. గేదెల శాతం అతి తక్కువగా వున్న కేరళ 3.2, బెంగాల్‌ 3.8, ఈశాన్య రాష్ట్రాలలో 4.6శాతం కాగా అక్కడ గోవధ లేదా గొడ్డు మాంసం విక్రయాలపై నిషేధం లేదని జగన్నాధన్‌ పేర్కొన్నారు.అవు ప్రాంతాల హిందువులు తమ పార్టీకి ఓటు వేసిన చోట గేదెల కంటే తక్కువ ఆర్ధిక విలువ కారణంగా ఆవులను వదిలించుకుంటున్న విషయాన్ని యోగి ఆదిత్యనాధ్‌ గమనించవచ్చని ఈ నేపధ్యంలో పశువధ శాలలపై నిషేధం గురించి పునరాలోచించాల్సిన అవసరం వుందని వ్యాఖ్యానించారు. ఆవు మరియు దున్న-గేదె మాంసానికి తేడాను సులభంగా తెలుసుకోలేని స్ధితిలో అత్యధిక నిఘా బృందాలు వున్న కారణంగా యోగి ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారని ముగించారు.

దేశం నుంచి జరుగుతున్న దున్న-గేదె మాంస ఎగుమతుల్లో సగం వుత్తర ప్రదేశ్‌ నుంచే వున్నాయి. అనధికార కబేళాల మూసివేత పేరుతో తీసుకుంటున్న చర్యల వలన జరిగే ఆర్ధిక, వుపాధి నష్టాలను పూడ్చేందుకు ప్రత్యామ్నాయ చర్యలు లేకుండా మొరటుగా ముందుకు పోయినట్లయితే జరిగే నష్టం ముస్లింలకే కాదు, వాటిపై ఆధారపడిన ఇతర వెనుకబడిన తరగతులు, గిరిజనులు, దళితులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అనుమతి వున్న కబేళాల జోలికి తాను పోవటం లేదని, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు అనధికారికంగా నడుపుతున్నవాటి మీదే చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్న ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌ సమర్ధనలు జగన్నాధన్‌ వంటి బిజెపి భక్తులకు తెలియకుండానే ఇలాంటి వ్యాఖ్యానం చేసి వుంటారని అనుకోగలమా ? ఎన్నికల తరువాత ఇలా మాట్లాడుతున్న జగన్నాధన్‌ వంటి వారు బీఫ్‌ లేదా గొడ్డు మాంసాన్ని వివాదాస్పదం చేసి ఓట్ల లబ్ది పొందేందుకు చూస్తున్నపుడు ఎందుకు మౌనంగా వున్నట్లు ?

అనధికార కబేళాలను ఎవరూ సమర్ధించరు, అదే సమయంలో వాటివలన జరిగే నష్టమూ లేదు. సదుద్ధేశ్యంతో వాటిని క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకొని వుంటే అక్కడి మాంసం వ్యాపారులు సమ్మెకు దిగి వుండేవారు కాదు. బీఫ్‌ తినేవారు, తయారు చేసేవారు కేవలం ముస్లింలే కాదు ఇతరులు కూడా వున్నారని గ్రహిస్తే మంచిది. పురాణాల ప్రకారం ఆవులతో పాటు దున్నలు కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినవే. యముడి వాహనం దున్న. ఆవు పవిత్రత దున్నలు-గేదెలకు లేదా?ఎందుకీ ఆత్మవంచన?

ఎన్నో నీతులు చెప్పే బిజెపి ఏటా ఎన్నో కుటుంబాలలో చిచ్చు రేపుతున్న, జేబులను గుల్ల చేస్తున్న జూదశాలలను నిషేధించాలని గతంలో డిమాండ్‌ చేసింది. జూదం మనదే కాదు, ఏ సభ్య సమాజ సంస్కృతీ కాదు. కానీ మన సంస్కృతిని పరిరక్షించే ఏకైక రక్షకురాలిని అని చెప్పుకొనే బిజెపి గత ఐదు సంవత్సరాలుగా అధికారంలో వున్న గోవాలో అక్కడి జూదశాలలపై ఎలాంటి నిషేధం విధించలేదు. గోవా ఆర్ధిక వనరులను పెంచే పేరుతో గతంలో కాంగ్రెస్‌ పాలకులు జూదశాలలకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు గోవా గడ్డమీద, మాండవీ నది మీద కలిపి దాదాపు ఇరవై జూదశాలలున్నాయి. బిజెపి వాటిని కొనసాగించింది. ఈ ఐదు సంవత్సరాలలో గోవాలో ‘ఎంజాయ్‌’ చేసే వారి సంఖ్య పెరగటం తప్ప తగ్గిన దాఖలాలు లేవు. ఆర్‌ఎస్‌ఎస్‌ వారి భారతీయ సంస్కృతి పరిరక్షణ లక్ష్యం ఏమైనట్లు ? అక్కడ జరిగే పర్యావరణ హాని గురించి వారికి పట్టదు.గోవాలో అనధికారికంగా నడుస్తున్న జూదశాలల గురించి తెలిసినప్పటికీ వాటి గురించి పట్టించుకోలేదు.అదేమి చిత్రమో దేశమంతటా సంస్కృతి పరిరక్షణ పేరుతో ఏ పార్కులో ఏ ప్రేమికులున్నారో వెతికేందుకు, వారిపై దాడులు చేసేందుకు వివిధ సంస్ధల ముసుగులో వుత్సాహం చూపే ఆర్‌ఎస్‌ఎస్‌ ఖాకీ వాలాలు, గోవాలో మనకు ఎక్కడా కనపడరు.

అనధికారికంగా మాంసం దుకాణాలు నిర్వహిస్తున్నవారందరూ అక్రమాలకు పాల్పడుతున్నవారిగా జమకడితే అంతకంటే అన్యాయం మరొకటి వుండదు. కానీ యోగి గారు అదే తన ప్రాధాన్యత అంటున్నారు. ఇదే సమయంలో అదే పార్టీకి చెందిన గోవా పాలకులు ఎన్నో కుటుంబాలను బలితీసుకొనే, ఎందరో మహిళల జీవితాలను అతలాకుతలం గావించే అక్కడి జూదశాలలను మాత్రం అరికట్టరు. మాదక ద్రవ్యాలకు, అత్యాచారాలు, హత్యలు, అన్ని రకాల వ్యభిచారాలకు నిలయం గోవా అన్నది జగమెరిగిన సత్యం. అందుకే దేశ విదేశాల నుంచి వీటన్నింటినీ అనుభవించటానికి( ఎంజాయ్‌ చేయటానికి) వచ్చే వారికి మాత్రం టూరిజం పేరుతో సకల సౌకర్యాలను కల్పిస్తున్నారు.ఒకే పార్టీ ! ఎందుకీ ఆత్మవంచన?

Image result for goa bjp,casinos cartoons

అభివృద్ధి నినాదాన్ని నిత్యం పారాయణం చేస్తున్న బిజెపి, దాని మిత్రులైన చంద్రబాబు నాయుడి వంటి వారు టూరిజం అభివృద్ధి పేరుతో జూదశాలలకు తెరతీయటానికి ప్రయత్నిస్తున్నారు. సంస్కృతి పరిరక్షకులుగా ఫోజు పెడుతున్న మనువాదులు, నయా జాతీయ వాదులు, వారి మద్దతుదారులు జూదాన్ని ఎంత నాజూకుగా సమర్ధిస్తున్నారో ‘స్వరాజ్య’ పత్రికలో వెల్లడైన అభిప్రాయాలు చదివితే మతిపోతుంది. పశువధ నిషేధం ద్వారా యోగి ఆదిత్యనాధ్‌ చర్యలతో మంచికంటే చెడే ఎక్కువ వుంటుంది అని చెప్పిన జగన్నాధన్‌ను విమర్శించిన స్వరాజ్య పత్రిక పాఠకులు కొందరు గోవాలో జూదశాలల గురించి సమర్ధనకు పూనుకున్నారు. వేదాలలోనే జూదం గురించి వుందట. బలి ప్రతిపాద, లక్ష్మీపూజ అంటే ద్యూత క్రీడ అని టీకాతాత్పర్యాలు చెబుతున్నారు. బెట్టింగ్‌, నగదు అక్రమలావాదేవీలను అరికట్టాలంటే బ్రిటన్‌ మాదిరి జూదశాలలను అనుమతించాలని కొందరు, ఆదాయపన్ను కట్టేవారినే అలాంటి వాటిలో అనుమతించాలని మరికొందరు సూచించారు. కౌటిల్యుడు తన అర్ధశాస్త్రంలో వేశ్యావృత్తిని పూర్తిగా నిషేధించకుండా క్రమబద్దీకరించాలని మాత్రమే చెప్పాడని కొందరు సమర్ధించారు. ఎవరేమి చెప్పినా నీవు చేయాల్సిందాని గురించి తప్ప పర్యవసానాలపై నీ అదుపు వుండదని శ్రీకృష్ణుడు చెప్పారంటూ మద్దతు. ఇలాంటి వాదనలు దోపిడీదారులు లేదా దోపిడీ సమాజం వున్నదాన్ని వున్నట్లు వుంచాలని కోరుకొనే వారు చేసే వుద్ధేశ్యపూర్వక ప్రచారంలో భాగం లేదా వాటిని ఎందుకు అనే ప్రశ్న వేసుకోకుండా నమ్మి ప్రచారం చేసే వారు మరికొందరు. హానిలేని పశువధ శాలల మూసివేతకు వుత్తర ప్రదేశ్‌లో ఆతృపడుతున్న బిజెపి గోవాలో గత ఐదు సంవత్సరాలలో అధికారంలో వుండి, తాజాగా అడ్డదారిలో పాగావేసి జన జీవితాలను నాశనం చేసే జూదశాలల అనుమతుల రద్దుకు, అనుమతి లేని ఇతర అక్రమ చర్యల నివారణకు ఎందుకు చర్యలు తీసుకోదు ? పశ్చిమ దేశాలు ఆత్మవంచన చేసుకుంటున్నాయని విమర్శించే బిజెపి తన కింది నలుపును చూసుకుంటుందా ? జనాన్ని మభ్యపెట్టటం మానుకుంటుందా?

Share this:

  • Tweet
  • More
Like Loading...

తెలంగాణా ముందస్తు ఎన్నికలకు రంగం సిద్దం అవుతోందా !

04 Saturday Mar 2017

Posted by raomk in CPI(M), Current Affairs, History, INDIA, Opinion, Others, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

KCR, KODANDARAM, midterm elections, Telagana politics, Telangana, Telangana CM, trs

Image result for is telangana going for midterm elections

ఎం కోటేశ్వరరావు

   తెలంగాణాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే రాజకీయ రంగంలో అనూహ్య చర్యలకు తెరలేవనున్నదా అనే అనుమానం కలగక మానదు. అవలోకిస్తే రెండు దృశ్యాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.ఒకటి తెరాస అధికారానికి వచ్చి మూడో సంవత్సరం పూర్తి కావస్తున్నా నిర్ధిష్టంగా ఫలానా పని చేశామని చెప్పుకొనేందుకేమీ లేకపోవటంతో అధికారపక్షంలో ఆందోళన, ప్రతిపక్షాలలో ఆశలు మొలకలెత్తటం, కొంత అస్పష్టంగానే వున్నప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తిగాక ముందే ఏదో ఒక సాకుతో నాలుగో సంవత్సరం ప్రారంభంలోనే అధికారపక్షం మధ్యంతర ఎన్నికలకు వెళ్ల నుందా అన్నది మరొకటి. రెండు దృశ్యాలూ ఒకదానికొకటి సంబంధం కలిగివున్నాయి.

    తాజాగా ప్రత్యక్షంగా అధికారపక్షానికి, పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలకు మధ్య టిజాక్‌( తెలంగాణా జెఎసి) నేత కోదండరాం లేదా తెరాస ప్రచారం చేస్తున్నట్లు కోదండరాం రెడ్డి కేంద్ర బిందువుగా వున్నారు. ప్రత్యేక తెలంగాణా ఆందోళనకు నాయకుడిగా కోదండరాంను తెరమీదకు తెచ్చిన సారధి కెసిఆర్‌ ఇప్పుడు తన సైనికులతో కోదండరాంపైనే ప్రచార దాడి చేయిస్తున్నారు. తామేమీ చేశామో చెప్పుకొనేందుంకటే ప్రత్యర్ధులపై విరుచుకుపడటానికే అధికారపక్షం, దాని మద్దతుదార్లు, అధికారానికి దగ్గరై ఫలాలను అందుకోవాలని చూస్తున్న శక్తులు ప్రయత్నిస్తున్నాయి.పంచ రంగులలో తాము చూపిన బంగారు తెలంగాణా గురించి చెబుతున్నప్పటికీ ఆ నగ తయారీ ఎంతవరకు వచ్చిందో మాత్రం ఎవరూ చెప్పటం లేదు. అంతకంటే ఎక్కువగా కోదండరాం కులం గురించి, ఒక కులానికి చెందిన నేతలందరూ ఒక్కటవుతున్నారనేదానిపైనే కేంద్రీకరించి మాట్లాడుతున్నారు.

     ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కులం తురుఫు ముక్కలతోనే తన లేదా తమ కుటుంబ పట్టును పదిల పరుచుకునేందుకు పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు రాజ్యాంగ బద్దంగా వున్న షెడ్యూలు కులాలు, తెగల వుప ప్రణాళికలకు తిలోదకాలిచ్చి దానిని నీరు గార్చేందుకు చేయాల్సిందంతా చేస్తూనే మరోవైపు కులాలవారీ ప్రతినిధులను పిలిచి వందల, వేల కోట్ల కేటాయింపులు, సంక్షేమం గురించి ఆకాశంలో వెండి మబ్బులను చూపుతున్నారు. కన్నతల్లికి కాస్తంత కూడు పెట్టని కొడుకు పినతల్లికి బంగారు తొడుగులు చేయిస్తా అన్నట్లుగా దళితులకు వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి పదవే ఇవ్వకపోతే పోయారు వాగ్దానం చేసిన భూమి గురించి మాట్లాడటం లేదు. అలాంటిది బిసిలు, అందులోనూ అత్యంత వెనుకబడిన బీసీలంటూ వారి సంక్షేమానికి వేల కోట్ల రూపాయల కేటాయింపులనే ఎండమావులను చూపి వాటి వెంట పరిగెత్తించాలని చూస్తున్నారు. దళితుల గురించి మాట్లాడటం మాని వెనుకబడిన తరగతుల గురించి జపం చేస్తున్నారు. ఎంత ఎక్కువగా వాగ్దానాలు చేస్తే అంత ఎక్కువగా భ్రమలు పెంచి అంతే స్ధాయిలో నిరసనను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయం తెలియనంత అమాయకుడు కాదు కెసిఆర్‌. అయినా చట్టపరంగా ఇంకా ఎన్నికలు రెండు సంవత్సరాలు వుండగానే ఇంతగా వాగ్దానం చేస్తున్నారంటే కొత్త రాజకీయ ఎత్తులకు తెరలేవనున్నదని భావించకతప్పదు.

    ఇంతకాలం తమ వేతనాలు పెంచాలనిఅందోళన చేసిన కాంట్రాక్టు లెక్షరర్లు, అంగన్వాడీలు, విఆర్వోలు, ఇతర చిరుద్యోగుల డిమాండ్లకు తలొగ్గి కొంతమేరకు వేతనాలు పెంచుతున్నారు. అనివార్యమై కొన్ని పోస్టులను రెగ్యులర్‌ చేసేందుకు నిర్ణయించారు.ఇవన్నీ ఆయా తరగతుల పోరాట ఫలితాలు తప్ప మరొకటి కాదు. ఎవరి సంగతి వారు చూసుకోవటం ముఖ్యమనే వాతావరణం ఆవరించి వున్న నేటి పరిస్థితులలో తమ సంగతేమిటన్నది నిరుద్యోగుల ప్రశ్న. భారత్‌ను ఆక్రమించిన తెల్లవారు దేశం వదలి వెళితే మన పరిస్థితి బాగుపడుతుందని నమ్మి యావత్‌ దేశం ఆశోపహతులైనట్లే, వుమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన ‘ఆంధ్రావలస పాలకులు’ పోయి తెలంగాణా స్వంతపాలకులు అధికారానికి వస్తే ఎంతో మేలు జరుగుతుందని భావించిన వారు కూడా అదే మాదిరి పాలకులు మారారు తప్ప పాలనా పద్దతులు మారలేదని గ్రహించటానికి ఎంతో కాలం పట్టలేదు. మిషన్‌ భగీరధ, సింగరేణి, ఆర్టీసి వంటివాటిలో సంవత్సరాల తరబడి పనికి తగ్గ వేతనాలు లేకుండా పని చేసిన వారిలో ఓ పద్నాలుగువేల మందిని క్రమబద్దీకరించటం అభినందించదగినదే. మిగిలిన వన్నీ గతంలో మాదిరి సాధారణ ప్రక్రియలో భాగంగా చేపట్టిన, చేపట్టనున్న బండి గుర్రానికి గడ్డి చూపుడు వ్యవహారం తప్ప మరొకటి కాదు. హైదరాబాదు మహానగరంలో ముఖ్య మంత్రి వుండటానికి లేదా గృహకార్యాలయ ఏర్పాటుకు భవనాలే లేవా ? కానీ అలాంటివేమీ లేనట్లుగా ఆఘమేఘాల మీద గతంలో వున్న వాటిని పడగొట్టి పూర్వపు రాజులు, దొరల మాదిరి పెద్ద గడీని కట్టించటానికి చూపిన శ్రద్ధ వుద్యోగ నియామకాలలో కనిపించటం లేదన్నదే నిరుద్యోగుల ఫిర్యాదు. అనేక మంది వయసు మీరిపోయి అనర్హులుగా మారిపోతున్నారు. లేదూ మినహాయింపులు ఇచ్చినా ఒక వేళ వారు వుద్యోగం పొందినా వారికి పెన్షన్ల వంటివి లేవు. ఎవరి పెన్షన్‌కు వారు చెల్లించుకోవాలి. ఆ మొత్తంలో కొంత షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులుగా పెడితే లాభం వస్తే ఎంత ఇస్తారో ఇంకా తెలియదు గానీ నష్టం వస్తే అసలుకే మోసం.

    ఈ పూర్వరంగంలోనే కోదండరాం నాయకత్వంలోని జెఎసి నిరుద్యోగ సమస్యపై ప్రదర&శనకు పిలుపు ఇచ్చింది. ఒక ర్యాలీ జరిగినంత మాత్రాన చంద్రశేఖరరావు ప్రభుత్వానికి వచ్చే ముప్పు వుండదు. అయినప్పటికీ నా పాలనను ఎత్తి చూపటమా అన్న భావోద్వేగానికి లోనై లేదా కొందరు చెబుతున్నట్లు దొరతనపు అహం గానీ మొత్తానికి సహించలేక ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవటం, అసాధారణ రీతిలో కోదండరాంను, ఇతరులను అరెస్టు చేయటం అనేక మందిని ఆశ్చర్యపరచింది. ఏట్లో వుండగా ఓడ మల్లయ్య ఓడ దిగింతరువాత బోడి మల్లిగాడన్నట్లుగా కెసిఆరన తయారైనట్లు చెప్పకనే చెప్పినట్లయింది. ప్రత్యేక తెలంగాణా కోసం ఆందోళనలు నిర్వహించి విద్యారు&ధలు, నిరుద్యోగులకు అనేక ఆశలు చూపిన కెసిఆర్లో ఎంతలో ఎంత మార్పు !

    తెలంగాణా రాష్ట్ర సమితి నాయకత్వంలో వెల్లడవుతున్న ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులు ఆ పార్టీ బలహీనతకు రుజువు. వారి వాదనల ప్రకారం తెలంగాణా రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన వారు వారి నాయకత్వంలోని ప్రభుత్వ విధానాలను ప్రశ్నించకూడదు. ఐదు నెలల పాటు నాలుగువేల కిలోమీటర్ల దూరం జరిపే మహాజన పాదయాత్రకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం శ్రీకారం చుట్టినపుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వుక్రోషం వెలిబుచ్చారు. పాదయాత్ర చేపట్టటానికి ఆ పార్టీకి నైతిక హక్కు లేదని, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సిపిఎం నేతలు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, అలాంటి వారిని అసలు తమ ప్రాంతాలకు రానివ్వవద్దని జనానికి పిలుపు ఇచ్చారు. తమ యాత్ర ప్రభుత్వానికి, అధికారపక్షానికి వ్యతిరేకం కాదని దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాల సమస్యలను తెలుసుకొని వారిని చైతన్యపరచటానికి తప్ప మరొకటి కాదని సిపిఎం స్పష్టం చేసింది. తనపాలనను ఎవరూ ఎత్తి చూపవద్దన్న పెత్తందారీ భావజాలంతో ముఖ్యమంత్రి అలాంటి ప్రకటన చేశారు తప్ప మరొకటి కాదని అనేక మంది అప్పుడు భావించారు. ఒక జాతీయ పార్టీగా భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనను సిపిఎం వ్యతిరేకించింది.తెలంగాణాను వ్యతిరేకించిన ఇతర పార్టీలలోని నేతలను, అసలు నిజాంపాలనకు మద్దతు పలికి భారతదేశంలో విలీనాన్నే వ్యతిరేకించిన వారి వారుసులందరినీ తనలో చేర్చుకున్న టిఆర్‌ఎస్‌కు ఇతరులను విమరి&శంచే నైతిక హక్కు ఎక్కడిది అన్న ప్రశ్నకు సమాధానం లేదు. రాష్ట్ర సమైక్యత, విభజన అన్నది ఇప్పుడు ముగిసిన అంశం. దాని గురించి రెచ్చగొడితే రెచ్చిపోయేంత అమాయకత్వం జనంలో లేదని సజావుగా సా సిపిఎం మహాజన పాదయాత్ర నిరూపించింది. రాజకీయాలకు అతీతంగా ఆ యాత్రకు సిపిఐ, తెలుగుదేశం, కాంగ్రెస్‌ నాయకులు ఇతర అనేక సంస్ధల వారు మద్దతు తెలిపారు. తెరాస మద్దతుదారులు కూడా తమనేతల రెచ్చగొట్టుడు వ్యాఖ్యలకు రెచ్చిపోకుండా సంయమనం పాటించారు. ఒక వేళవారా పని చేసి వుంటే పాదయాత్ర మరింతగా జయప్రదం అయి వుండేది. చేసిన వాగ్దానాలను అమలు జరపకుండా అధికార మత్తులో మునిగిపోయారని అధికారపక్షం గురించి జనంలో ఆలోచన ప్రారంభయ్యాకనే సిపిఎం పాదయాత్ర చేపట్టింది, ఆ కారణంగానే దాన్ని వ్యతిరేకించాలన్న ముఖ్యమంత్రి పిలుపును జనం కూడా పట్టించుకోలేదని ఇప్పటికైనా అధికారపక్షం గ్రహిస్తుందా ?

    ‘ఆంధ్రావలసపాలన’ అంతం కాగానే లక్షలాది వుద్యోగాలను కల్పిస్తామని, ప్రభుత్వ వుద్యోగాలను భర్తీ చేస్తామని వాగ్దానం చేసి హడావుడి చేసిన విషయాన్ని యువతకు ఏ కోదండరామో, మరొక ప్రతిపక్ష పార్టీయో గుర్తు చేయనవసరం లేదు. తెలంగాణా యువత మరీ అంత అమాయకంగా లేదు. మూడవ సంవత్సరం పూర్తి కావస్తున్నా వట్టిస్తరి-మంచి నీళ్ల మాదిరి ప్రకటనలు తప్ప నిర్దిష్ట చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వ వుద్యోగాల ఖాళీలను భర్తీ చేయటానికి, అవసరమైన చోట కొత్త వుద్యోగాలను కల్పించటానికి కావాల్సింది చిత్త శుద్ది తప్ప రాజ్యాంగ సవరణ, దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర అవసరం లేదే. అటువంటి చిత్త శుద్ది లోపించిన కారణంగానే టిజాక్‌ నాయకుడు కోదండరాం నిరుద్యోగ నిరసన ప్రదర్శనకు పిలుపు ఇచ్చారు. తెలంగాణా ఆందోళనలో భాగస్వాములైన అనేక మంది తెరాసకు దూరంగా వుంటున్నారు. అదే సమయంలో అధికారం కారణంగా అవకాశవాదులు దగ్గర అవుతున్నారు.

  తెలంగాణాలో వున్న నిరుద్యోగులతో పోల్చితే వుద్యోగఅవకాశాలు పరిమితంగా వున్నాయి. హైదరాబాదు ఐటి, ఐటి అనుబంధ పరిశ్రమలకు ఒక ప్రధాన కేంద్రంగా మారినప్పటికీ ఆ రంగంలో లభించే వుద్యోగాలకు దేశంలోని ఇతర రాష్ట్రాల వారూ పోటీ పడుతున్నారు తప్ప తెలంగాణా వాసులకే పరిమితం కాదు, రిజర్వేషన్లు లేవు. కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు కొన్ని మూతపడటం తప్ప కొత్తవి రావటం లేదు. కొత్త పెట్టుబడులు పెట్టటం కేంద్ర ప్రభుత్వ అజండా నుంచి ఎప్పుడో రద్దయింది. వుమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త పరిశ్రమలేవీ పెట్టలేదు. పోనీ వారు ‘వలస పాలకులు’ అనుకుంటే స్వరాష్ట్ర పాలకులు తెరాస వారు కూడా ఒక్కటంటే ఒక్క పరిశ్రమ పెట్టలేదు. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు లేకుండానే ఓలా, వుబేరన వంటి అంతర్జాతీయ దిగ్గజాలు హైదరాబాదు నగరాన్ని చుట్టేస్తున్నాయి. దీంతో ఆటోలకు కొంత మేర గిరాకీ తగ్గిపోయింది. ఇదే సమయంలో తమ ఆదాయాలు పడిపోతున్నాయని ఓలా, వుబేరన టాక్సీ సిబ్బంది సమ్మెకు దిగినపుడు ప్రభుత్వం వారికే మాత్రం సాయపడలేదు. పరోక్షంగా యజమానుల కొమ్ము కాసింది. త్వరలో మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే అది కూడా ఆటో, టాక్సీ రంగాన్ని ఎంతో కొంత ప్రభావితం చేయటం అనివార్యం. ఈ పూర్వరంగంలో యువతలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్ధలలో వుద్యోగాలు, గౌరవ ప్రదమైన వేతనాల గురించి ఆశలు పెరగటం తప్పు, అత్యాశమే కాదు. వారిని ఎంతగా భ్రమలలో ముంచితే అంతగా అసంతృప్తి పెరుగుతుందని గ్రహించాలి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆందోళనకు ప్రయత్నించి అనేక మంది గతంలో విఫలమయ్యారు.కెసిఆర్‌ నాయకత్వం సఫలమైంది. అలాగే నిరుద్యోగ సమస్యపై తెరాస, దానికి వెన్నుదన్నుగా వున్న మీడియా పెద్దలు కోదండరాం ఆందోళన విఫలమైందని సంతోషపడితే పడవచ్చు. కోదండరాం కాకపోతే మరొకరు, మరొకరు వస్తారు తప్ప ఆగిపోదు.

    ముఖ్య మంత్రి చంద్రశేఖరరావు తన కుమారుడికి ముఖ్యమంత్రి కుర్చీని అప్పగించేందుకు ప్రారంభం నుంచి పావులు కదుపుతున్నారు. అధికారం చుట్టూ తిరిగే పాలక రాజకీయాలలో ఇది సహజం. గడువు ప్రకారం అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల గడువుంది. అయినప్పటికీ కొద్ది నెలల్లోనే ఎన్నికలు రాబోతున్నాయన్నట్లుగా ఆయన చర్యలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం కాంగ్రెస్‌, తెలుగుదేశం ఎవరు అధికారంలో వున్నప్పటికీ ఒక బలమైన సామాజిక వర్గం చక్రం తిప్పిందన్నది ఎవరూ కాదనలేని సత్యం. కెసిర్‌ ఆ వర్గంతో అమీ తుమీ తేల్చుకోవాలనే ఎత్తుగడతో వున్నట్లు కనిపిస్తోంది. అందుకు అవసరమైన ఇతర వెనుకబడిన, మైనారిటీ సామాజిక సామాజిక వర్గాలను కూడగట్టే వైపు పావులు కదుపుతున్నారు. ముందే చెప్పుకున్నట్లు ఇటీవలి కాలంలో కులాలవారీ ప్రతినిధులను పిలిచి వందల కోట్ల రూపాయలను సంక్షేమ కార్యక్రమాల పేరుతో వాగ్దానాలు చేస్తున్నారు. దళితులలో గణనీయంగా వున్న ఒక వర్గాన్ని కూడగట్టుకొనేందుకు రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్‌కు మద్దతు ప్రకటించారు తప్ప అంతకు మించి చేసిందేమీ లేదు. వర్గీకరణను వ్యతిరేకించే మరో బలమైన తరగతిని దూరం చేసుకొనేందుకు అటు కేంద్రంలోని బిజెపి సిద్దంగా లేదు. ఎన్నికల రాజకీయాలలో దేనికైనా ఓట్ల లాభ నష్టాలే ప్రాతిపదిక. బీసి కులాలతో ములాఖత్‌లు నడుపుతున్న కెసిఆర్‌ కుల వృత్తులను పునరుద్దరిస్తామనే వాగ్దానాలతో వందల కోట్ల కేటాయింపుల గురించి రెండు సంవత్సరాల ముందుగానే వాగ్దానాలు కుమ్మరిస్తున్నారంటే వాటి భ్రమల నుంచి వారు బయటపడక ముందే ఎన్నికలకు పోవటం అనివార్యం. దీనికి తోడు రాజకీయ నిరుద్యోగుల వుపాధికి తప్ప మరొకందుకు పనికిరావని గతంలో స్పష్టం చేసిన అనేక కార్పొరేషన్లకు ఇటీవల జరుపుతున్న నియామకాలు ఓట్ల వలతప్ప మరొకటి కాదు. చిన్నా చితకా కలిపి మరో ఐదారువేల పోస్టులలో తమ మద్దతుదార్లను నియమించేందుకు కసరత్తు మొదలైందని వార్తలు. ఇలాంటి వన్నీ ఎన్నికల ముందే చేస్తారు తప్ప మరొకటి కాదన్నది కూడా మరో అనుభవం. పదవులు రాని వారిలో అసంతృప్తి పెరిగి అది సంఘటితం కాక ముందే ఎన్నికలకు పోవాలి తప్ప ఆలస్యం చేస్తే నష్టమే.

    వీటన్నింటినీ చూస్తున్నపుడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణలకు తెరలేచిందని చెప్పవచ్చు. దానికి కోదండరాం నిరుద్యోగ ఆందోళన పిలుపు నాంది అయితే రానున్న నెలల్లో పరిణామాలు ఏ మలుపులు తిరుగుతాయన్నది చూడాల్సి వుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అటు కేంద్రంలో బిజెపి రాజకీయాలు, కార్యాచరణను కూడా ప్రభావితం చేస్తాయి. అది తెరాసమీద కూడా ఏదో ఒక ప్రభావం చూపకపోదు. నరేంద్రమోడీ బలహీనపడే పరిణామాలు వస్తే చంద్రశేఖరరావు వంటి వారిని మచ్చిక చేసుకుంటారు. లేదు తమకు ఎదురు లేదు అనుకుంటే మరొక విధంగా జరుగుతుంది. ఏదైనా పరిణామాలు వేగం పుంజుకుంటాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తమిళనాడులో తదుపరి ఏం జరగనుంది ?

18 Saturday Feb 2017

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

AIADMK, BJP, Congress, DMK, Tamil Nadu

Image result for tamil nadu assembly

సత్య

    తమిళనాడు ముఖ్యమంత్రి ఇకె పళనిస్వామి శనివారం నాడు అసెంబ్లీలో తన ‘బల’ నిరూపణ చేసుకున్నారు. తమిళ మురికి గుంటలో చేపలను పట్టాలని చూసిన బిజెపి, డిఎంకె దాని వెన్నంటి వున్న కాంగ్రెస్‌లకు శృంగభంగమైంది. పళని స్వామి నాయకత్వం రేపేమి చేస్తుంది, పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయి అని ఈ రోజు వూహించటం కష్టం. కొంతమంది వూహలు, వాంఛలకు భిన్నంగా అన్నాడిఎంకెలో మెజారిటీ సభ్యులు శశికళ నాయకత్వంలోని పళనిస్వామికి మద్దతుగా నిలిచారు. కాంపులో వున్న ఎంఎల్‌ఏలు బయటికి వస్తే మరొక కాంపులోకి దూరతారన్న అంచనాలు తారు మారు కావటంతో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా వున్న డిఎంకె, దాని మిత్రపక్షం కాంగ్రెస్‌ ఆశలు ఆవిరై సాధారణంగా జరగాల్సిన బలనిరూపణ ప్రక్రియను అపహాస్యం పాలు చేసినట్లుగా కనిపిస్తోంది.

    అసెంబ్లీలో అవాంఛనీయ వుదంతాలు జరగటం తమిళనాడుకు కొత్త కాదు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిని తిరిగి ఎన్నుకోవటం కూడా సామాన్యంగా జరుగుతోంది. దాని కొనసాగింపుగానే శనివారం నాడు కూడా కుర్చీలు లేచాయి, చొక్కాలు చిరిగాయి. ఎంజిరామచంద్రన్‌ ముఖ్యమంత్రిగా మరణించినపుడు ఆయన భార్య జానకిని సిఎంను చేశారు. ఆమె బలనిరూపణ సమయంలో జరిగినదానితో పోలిస్తే శనివారం నాటి సంఘటనలు ఒక లెక్కలోవి కాదు. ఆ రోజు కొందరు గూండాలు అసెంబ్లీలోకి ప్రవేశించి ఎంఎల్‌ఏలను చితకబాదారని, తరువాత పోలీసులు లాఠీ ఛార్జీ చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఆరోజు కాంగ్రెస్‌ శాసనసభ్యులు నాటి స్పీకర్‌ చర్యను వ్యతిరేకించారు, దెబ్బలు తిన్నారు. ఇపుడు కూడా అదే జరిగింది. నాటి స్పీకర్‌ పిహెచ్‌ పాండియన్‌ ఇప్పుడు పన్నీరు సెల్వం శిబిరంలో, కాంగ్రెస్‌ వారు ఈసారి వారు డిఎంకె పక్షాన వున్నారు. మీడియాకు ప్రవేశం లేకుండా తలుపులు మూసి నిర్వహించిన బలనిరూపణ ప్రక్రియలో ఏం జరిగిందనేది ఎంఎల్‌ఏలు చెప్పిందే సమాచారం. శాసనసభ్యులు రౌడీల మాదిరి ప్రవర్తించినప్పటికీ వారిని గౌరవించాల్సిందేనని కమల్‌ హసన్‌ వ్యంగ్యంగా అన్నారు. కుష్బూ, సిద్ధార్ధ శశికళ వర్గానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు.

   అధికారం తప్ప మరొక పరమార్ధం ఎరుగని పాలక రాజకీయాలు నెరిపే అందునా రాష్ట్రాలలోని కుటుంబపార్టీల ( వాటినింకేమాత్రం ప్రాంతీయ పార్టీలని పిలవాల్సిన అవసరం లేదు) పరిణామాలు ఎటుతిరుగుతాయో తెలియని స్ధితి. స్వాతంత్య్ర వుద్యమానికి సారధ్యం వహించిన పార్టీగా 1947 తరువాత ప్రారంభమైన కాంగ్రెస్‌ను గల్లీ నుంచి ఢిల్లీ వరకు కుటుంబపార్టీగా మార్చివేసేందుకు ప్రయత్నించారు. ఐదుగురికి ఐదూళ్లు కాదు గదా సూది మోపినంత కూడా ఇచ్చేది లేదన్న కౌరవుల మాదిరి వ్యవహరించటంతో దానికి వెలుపల వున్న వారు అధికారం కోసం పడిన తపన అనేక చోట్ల ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి నాంది పలికింది. రాష్ట్రాలు, వాటి సమస్యలపట్ల అవలంభించిన నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రాల అధికారాల కోసమంటూ ప్రారంభమైన పార్టీలు గత నాలుగు దశాబ్దాల కాలంలో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీతో అంటకాగటం, తమ అధికారాన్ని నిలుపుకొనేందుకు ఏ పార్టీ వారు వస్తే ఆ పార్టీ వారిని రాష్ట్ర అభివృద్ధి కోసం అనే పేరుతో చేర్చుకోవటం ( ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ది పేరుతో జరుగుతోందనుకోండి) సాధారణంగా మారిపోయింది. ఇప్పుడు రాష్ట్రాలు-జనం- హక్కులు ఏమీ లేవు. అధికారం-సంపాదన-అధికారం అనే వలయంలో కుటుంబపార్టీలు తిరుగుతున్నాయి.

   ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల హక్కుల పేరుతో రంగంలోకి వస్తే బిజెపి అనేక పార్టీల రంగులు మార్చి(జన సంఘం-జనతా పార్టీ-భారతీయ జనతా పార్టీ) తమ రూటే సపరేటు, కాంగ్రెస్‌కూ మాకూ పోలికే లేదంటూ ముందుకు వచ్చింది. దీనిలో కాంగ్రెస్‌లో, ఇతర ప్రాంతీయ పార్టీలలో వున్న అన్ని అవలక్షణాలతో పాటు అధికారం కోసం అవసరమైతే మతోన్మాదాన్ని, ఘర్షణలను కూడా రెచ్చకొట్టేందుకు వెనుకాడదన్న విమర్శ, వాస్తవం గురించి తెలిసిందే. తమకు లొంగని రాష్ట్ర ప్రభుత్వాల, పార్టీల విషయంలో ఎలా జోక్యం చేసుకుంటున్నది గత మూడు సంవత్సరాలుగా చూస్తున్నదే. గవర్నర్లను ఎలా వుపయోగిస్తున్నదీ తెలిసిందే. కాంగ్రెస్‌ రంగు బయటపడటానికి యాభై సంవత్సరాలు పడితే ఈ పార్టీ అసలు రంగు బహిర్గతం కావటానికి ఐదు సంవత్సరాలు కూడా అవసరం లేదని నిరూపించుకుంది. అంత స్పీడుగా వుంది.

    అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక కావటాన్ని కొంత మంది ప్రశ్నించారు. నిజమే ఆమె జయలలిత స్నేహితురాలిగా తప్ప ఇతరత్రా పార్టీలో ఏమీ కాని మాట నిజమే. అది తప్పయినపుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడి కుమారుడిగా తప్ప లోకేశ్‌ ఏం చేశారని ఏకంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. తెలంగాణాలో తెరాస పరిణామాలను చూసినా అదే వైఖరి కనిపిస్తుంది. జయలలితకు కూడా కుటుంబం వున్నట్లయితే కూతురో కొడుకో నాయకత్వ స్ధానాన్ని ఆక్రమించేవారు. పార్టీకోసం, ప్రజల కోసం ఏ నాడూ ఏమీ చేయని వారు అధికారపీఠం కోసం అర్రులు చాస్తున్నపుడు, ఎవరినైనా ఆమోదించే స్ధితిలో జనం వున్నపుడు జయలలిత మేనకోడలిగా తాను కూడా ఎందుకు ప్రయత్నించకూడదని దీపా జయకుమార్‌ ప్రయత్నించటంలో ఆశ్చర్యం ఏముంది.

    ప్రజాస్వామ్యం పదికాలాలపాటు బతికి బట్టకట్టాలంటే ఇలాంటి పరిణామాలను జనం సహించాలా ? అనేక కారణాలతో వ్యతిరేకించటం లేదన్నది వాస్తవం. కాంగ్రెస్‌ అనుసరిస్తున్న విధానాలనే బిజెపి, ఇతర ప్రాంతీయ పార్టీలు అనుసరిస్తున్నా ప్రశ్నించే ధోరణి వ్యక్తం కావటం లేదు. అందుకే వాటి మధ్య విధానాల మీద రాజీ- అధికారం కోసం కుమ్ములాటలు తప్ప ఎలాంటి పేచీ వుండటం లేదు. మన చేత్తో మన కంటినే పొడుచుకుంటున్నామని గుర్తించే రోజు వచ్చినపుడే వుప్పు-కప్పురాలకు తేడా తెలుసుకోగలుగుతాము. కమ్యూనిస్టు పార్టీలు చిన్నవిగా వున్నా, కొన్ని చోట్ల అధికారానికి వచ్చినా ఎక్కడా ఇలాంటి అవలక్షణాలు ఆ పార్టీలలో కనిపించటం లేదు. అవినీతి, అక్రమాల గురించి వేలెత్తి చూపటానికి లేదు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లుగా సైద్ధాంతిక , విధానాల ప్రాతిపదికగా అవినీతి రహిత పార్టీలు, శక్తులను ఎంచుకొనే క్రమాన్ని ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలు వేగవంతం చేయటం అనివార్యం.

    ప్రతి రాష్ట్రంలో జరిగే ప్రతి రాజకీయ పరిణామం ఒక గుణపాఠం నేర్పుతూనే వుంది. జయలలిత మరణంతో అన్నాడిఎంకె నాయకత్వ సమస్యను ఎదుర్కొన్న తరుణంలో ఆమెకు కేవలం స్నేహితురాలిగా, అక్రమ సంపాదనలో తోడుగా వున్న శశికళ పగ్గాలు చేపట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమై అనూహ్య పరిణామాల మధ్య ఆమెకు శిక్ష పడి జైలు పాలయ్యారు. సమీప భవిష్యత్‌లో ఆమె చట్ట సభలకు పోటీ చేసే అవకాశం లేకపోవటంతో ఇతరులతో కథ నడిపించాల్సి వుంది. మరో నాలుగు సంవత్సరాల పాటు కొనసాగాల్సిన అసెంబ్లీ పూర్తికాలం నడుస్తుందా, అధికారం కోసం ఆతృపడుతున్న డిఎంకె, కాంగ్రెస్‌ కూటమి దానిలో చీలిక తెచ్చి ఆ వర్గం మద్దతుతో అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అన్నది సమస్య. కేంద్రంలో బిజెపి అధికారంలో వుంది. తన స్ధానాన్ని పటిష్టపరచుకోవాలంటే ఏ గడ్డి కరవటానికైనా వెనుకాడటం లేదని అనేక రాష్ట్రాలలో దాని చర్యలను చూస్తే అర్ధం అవుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత వాటిని బట్టి ఏరాష్ట్రాన్ని ఎలా మింగాలో ఆ పార్టీ నిర్ణయించుకుంటుంది. అసాధారణ సంక్షోభం తలెత్తితే తప్ప ఆరునెలల వరకు పళనిస్వామి మరోసారి బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక వేళ అటువంటి పరిస్థితిని ప్రత్యర్ధులు తెచ్చిపెడితే అసెంబ్లీ రద్దుకు ఆదేశించి రాజకీయాలను మరోమలుపు తిప్పినా ఆశ్చర్యం లేదు.

   అన్నాడిఎంకెలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పని చేసిన పన్నీరు సెల్వం సామర్ధ్యంగల నేత అని గతంలో ఎవరూ చెప్పలేదు, భవిష్యత్‌లో చెప్పే అవకాశమూ వుండదు. అతని అధ్యాయం ముగిసిందని చెప్పవచ్చు. పన్నీరు సెల్వాన్ని అడ్డం పెట్టుకొని కథనడింపించాలని చూసిందనే విమర్శలు ఎదుర్కొన్న బిజెపి ఇప్పుడు మరోదారి చూసుకుంటుంది. డిఎంకెతో అంటకాగి అన్నాడిఎంకెను దెబ్బతీసినా ఆశ్చర్యం లేదు. లేదా ఎన్నికలకు సమయం వుంది కనుక రజనీకాంత్‌ వంటి మరొక సినిమా నటుడిని రంగంలోకి తెచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోనూ వచ్చు. అన్నా డిఎంకెలో శశికళ స్ధానంలో మరో నూతన అధికార కేంద్రం ప్రారంభం కావచ్చు, ఆ పార్టీలో మరో సంక్షోభం అంటూ తలెత్తాలంటే పళని స్వామికి మరో విభీషణుడు తయారు కావాలి. లేదా మరో రెండు సంవత్సరాలు కచ్చితంగా అధికారంలో వుండే బిజెపి ముందు పొలోమంటూ లొంగిపోయి, ప్రతిపక్ష డిఎంకె నుంచి రక్షణ అయినా పొందవచ్చు. డొల్లుపుచ్చకాయల వంటి ప్రాంతీయ, కుటుంబపార్టీలు ఎప్పుడేం చేస్తాయో ఎవరు చెప్పగలరు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ పెంపకంలో రక్షణలేని రూపాయి పాపాయి !

07 Saturday Jan 2017

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices

≈ Leave a comment

Tags

Narendra Modi rule, Rupee, Rupee Fall, rupee value

ఎం కోటేశ్వరరావు

    మనకు స్వాతంత్య్రం వచ్చిన రోజు ఒక రూపాయకు కొన్న ఒక వస్తువు ధర నరేంద్రమోడీ పదవిలోకి వచ్చే నాటికి రు.58.58కి పెరిగింది. రెండున్నర సంవత్సరాల తరువాత జనవరి ఆరవ తేదీన రు.67.96కు చేరింది, డిసెంబరు నాటికి రు.69.50 పెరగవచ్చని కొందరి అంచనా. ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన మంచి రోజులంటే ఇవా ?

    2014 సాధారణ ఎన్నికలలో నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి విజయం సాధించనున్నదనే అంచనాలు వెలువడిన సమయంలో అమెరికా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ ప్రతినిధులు అమిత్‌ ప్రకాష్‌, క్రిస్టిన్‌ ఆక్వినో రూపాయి విలువ పెరగటం నరేంద్రమోడీ నిర్ణయాత్మక విజయానికి సూచిక అని వ్యాఖ్యానించారు. దీర్ఘకాలంలో రూపాయి విలువ ఒక అమెరికన్‌ డాలరుకు 2014 మార్చి నెలలో వున్న 61.19 రూపాయల నుంచి 45-40కి పెరిగే క్రమంలో ఎన్నికల ఫలితం ఒక వుత్ప్రేరకంగా పని చేయగలదని, ఒక వేళ బలహీన సంకీర్ణం ఏర్పడితే 2013 అగస్టు 28 నాటి రికార్డు పతనం 68.85ను అధిగమించ వచ్చని సిటీ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ ఆసియా-పసిఫిక్‌ అధిపతి ఆడమ్‌ గిల్‌మౌర్‌ చెప్పిన మాటలను వారు వుటంకించారు. అంతే కాదు, మోడీ విజయం సాధిస్తే అది ఆట తీరునే మార్చివేస్తుందన్నది మార్కెట్‌ అభిప్రాయమని కూడా ఆడమ్‌ వ్యాఖ్యానించాడు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక్క బిజెపికే సంపూర్ణ మెజారిటీతో నరేంద్రమోడీ సంఖ్యరీత్యా అత్యంత బలమైన ప్రధానిగా అవతరించారు. అయితేనేం రూపాయి విలువ పెరగలేదు కదా పతనమై రు.68.86పైసలను తాకి 2016 నవంబరు 25న సరికొత్త రికార్డును సృష్టించింది. అప్పటి నుంచి 67-68కి అటూ ఇటూగా కదలాడుతోంది.ఈ ఏడాది డిసెంబరు నాటికి నరేంద్రమోడీ తన రికార్డును తానే బద్దలు కొట్టగలరని రూపాయి మరింత పతనమై 69.50కి చేరవచ్చని రాయిటర్‌ వార్తా సంస్ధ తన విశ్లేషణలో పేర్కొన్నది. అది పక్కా పెట్టుబడిదారులు నడిపే కంపెనీ తప్ప కమ్యూనిస్టులకు, మోడీ విమర్శకులకు ఎలాంటి సంబంధం లేనిది.

    ప్రధాని నరేంద్రమోడీ విధానాలను తప్పు పట్టే వారు బిజెపి, దానిని సమర్ధించే పార్టీలు అధికారంలోకి రాకూడదని కోరుకొనే వారే అనటంలో ఎలాంటి శషభిషలకు తావులేదు. మోడీ ప్రభుత్వ విధానాలు బాగు, బాగు , బహు బాగున్నాయి, వెనక్కు తిరిగి చూడనవసరం లేదని పొగిడేవారి గురించే అనుమానించాలి. ఇటీవలి కాలంలో ఇలాంటి వారు అనేక వాదనలను ముందుకు తెస్తున్నారు. మోడీ విధానాలు బాగులేకపోతే ఆయనను అంత ఎక్కువ మంది ఎలా సమర్ధిస్తున్నారు అన్నది వాటిలో ప్రధానమైనది. బలపరిచే, వ్యతిరేకించే సర్వేల బండారం, బాగోతం అందరికీ తెలిసిందే. వాటిని పక్కన పెడితే మోడీని సమర్ధిస్తున్న వారందరూ ఆయన విధానాలకు ఆమోద ముద్ర వేశారనే నిర్ణయానికి వస్తే పప్పులో కాలువేసినట్లే. పెద్ద నోట్ల రద్దు విషయమే తీసుకుంటే తాము ఇబ్బందులు పడినా జనం రెచ్చి పోలేదంటే అర్ధం దేశంలో తొలిసారిగా ఏదో మంచి చేస్తున్నాడు, యాభై రోజులే అంటున్నారు కదా చూద్దాం అని సహించారు తప్ప ఆ నిర్ణయ పర్యవసానాలన్నీ తెలిసి మద్దతు ఇవ్వలేదు. అసలు వాటి పర్యవసానాల గురించి రద్దు చేసిన నరేంద్రమోడీి గానీ, ఆయనకు సలహా ఇచ్చిన అంతరంగికులు, చివరకు తానే సలహాయిచ్చానని చెప్పుకున్న , మోడీ కంటే మేథావి అని ఆయన చుట్టూవున్నవారు భావించేే చంద్రబాబు నాయుడు, అంతిమంగా అమలు జరిపిన రిజర్వుబ్యాంకు సైతం నిర్దిష్టంగా ఫలానా ప్రయోజనం లుగుతుంది అని చెప్పలేదని తెలుసుకోవటం అవసరం. ఈ జన్మలో కష్టాలు అనుభవించినా పరలోకంలో స్వర్గ సుఖాలు దక్కుతాయి అన్నట్లుగా తాత్కాలికంగా నష్టం జరిగినా భవిష్యత్‌లో మంచి జరుగుతుంది అని తప్ప అధికార పక్షం లేదా దానిని సమర్ధిస్తున్నవారు గానీ తాత్కాలిక నష్టాలు , శాశ్వత లాభాలు ఎలా వుంటాయో ఎవరైనా చెప్పారా ?

     చైతన్యం, మూఢత్వం, అసంతృప్తి, అభిమానం అనేక కారణాలతో తరతమ స్థాయిలలో వుండే మన దేశంలో గుడ్డిగా నమ్మినట్లే, గుడ్డిగా వ్యతిరేకించటం కూడా సాధారణ విషయమే. అందువలన జనం వ్యతిరేకతలు, సమర్ధనలను కాసేపు పక్కన పెడదాము. కాంగ్రెస్‌ నేతలు దేశాన్ని అన్ని రంగాలలో గాడి తప్పించారు, మేము వస్తే తిరిగి గాడిలో పెడతామనే కదా బిజెపి అండ్‌ కో పార్టీలు, వాటిని భుజాన వేసుకొని మోసిన పవన్‌ కల్యాణ్‌ వంటి పెద్దలు చెప్పింది. తాను పదవిని స్వీకరించగానే విదేశాలలో పోయిన పరువును తిరిగి రాబట్టానని నరేంద్రమోడీ చెప్పారు. సంతోషం మరి దేశం సంగతేమిటి? ఆర్ధిక వ్యవస్ధ విషయమేమిటి?

     అన్ని విషయాలను ఒకేసారి చర్చించటం కుదరదు గనుక రూపాయి విలువ- పతనం, పటిష్టత పర్యవసానాల గురించి చూద్దాం. మన్మోహన్‌ సింగ్‌ గారి పాలనలో ఆయన వయస్సు పెరుగుతున్న మాదిరి రూపాయి విలువ పడిపోతున్నదని బిజెపి, నరేంద్రమోడీ విమర్శించారు. 2013లో మన్మోహన్‌ సింగ్‌ హయాం మొత్తం మీద గరిష్టంగా ఒక డాలరుకు 68.85 రూపాయల వరకు పడిపోయింది.

     2014 మే 25న నరేంద్రమోడీ పదవీ బాధ్యతలను స్వీకరించిన సమయానికి 58.58 గా వుంది. ఇది తమ మోడీ ఘనతే అని అభిమానులు చెప్పారు. రూపాయి విలువ పతనం, పెరుగుదల చరిత్రను చూస్తే https://knoema.com/infographics/rygejhb/rupee-devaluation-against-dollar-1947-till-date ప్రధానిగా జవహర్‌ లాల్‌ నెహ్రూ వున్న సమయంలో 1947 నుంచి 1950 మధ్య ఒక రూపాయి నుంచి రు.4.76కు పడిపోయింది. ఆ ఏడాది నుంచి నెహ్రూ మరణించిన తరువాత లాల్‌ బహదూర్‌ శాస్త్రి పాలనలో 1965 వరకు స్ధిరంగా ఒక డాలరుకు రు.4.76 పైసలు వుంది. శాస్త్రి మరణించిన 1966లో రు.6.36కు పడిపోయింది. తరువాత ఇందిరా గాంధీ హయాంలో రు.6.36 నుంచి 1976లో రు.8.96కు పడిపోయి, ఆమె దిగిపోయే నాటికి రు.8.75కు పెరిగింది. జనతా పార్టీ నేత మొరార్జీ దేశాయ్‌ పాలనలో పెరుగుదల తప్ప పతనం లేదు, రు.8.75 నుంచి రు.8.14కు పెరిగి పెరిగింది.

    రెండవ సారి ఇందిరా గాంధీ అధికారానికి వచ్చిన సమయంలో రు.7.86గా వున్నది కాస్తా ఆమె మరణించే నాటికి రు.11.36కు పతనమైంది. తరువాత రాజీవ్‌ గాంధీ ఏలుబడిలో రు.16.23కు దిగజారింది.1989లో అధికారానికి వచ్చిన విపి సింగ్‌ హయాంలో రు.17.50కి, నూతన ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడిగా పేరు గాంచిన పివి నరసింహారావు పాలనలో రు.22.74 నుంచి 35.43కు తగ్గింది. హెచ్‌డి దేవగౌడ, ఐకె గుజ్రాల్‌ పాలనా కాలంలో రు.41.26కు చేరింది. తరువాత బిజెపి నేత ఎబి వాజ్‌పేయి పాలనలో రు.48.61కి పతనమై చివరికి రు.45.32కు పెరిగింది. మన్మోహన్‌ సింగ్‌ పది సంవత్సరాల కాలంలో కిందికీ మీదికీ పడుతూ లేస్తూ రు.45.32 నుంచి గరిష్టంగా 68.85 వరకు పతనమై నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సమయానికి రు.58.43కు పెరిగింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు మోడీ హయాంలో మన్మోహన్‌ సింగ్‌ గరిష్ట పతనాన్ని తాకి 2017 జనవరి ఆరున రు.67.96 గా ముగిసింది. పది సంవత్సరాల మన్మోహన్‌ సింగ్‌ కాలంలో నిఖర పతనం పదమూడు రూపాయలకు అటూ ఇటూగా అయితే రెండున్నర సంవత్సరాల నరేంద్రమోడీ పాలనలో పది రూపాయలకు అటూ ఇటూగా వుంది. మోడీని అభిమానించే వారు దీనిని విజయం అంటారా పతనంగాక మరేదైనా పేరు పెడతారా ?

    రూపాయి విలువ పతనమైతే సామాన్య జనానికి జరిగే నష్టం ఏమిటి? పోనీ నరేంద్రమోడీకి ఏదైనా లాభం వుంటుందా ? మోడీకి, మన్మోహన్‌ సింగ్‌కో మరొకరికో వ్యక్తిగత నష్టం గురించిన సమస్య కాదిది. మనిషికి బిపి పెరిగినా, తగ్గినా శరీరంలో ఎటువంటి ప్రమాదకర మార్పులు సంభిస్తాయో ఏ దేశ ఆర్ధిక వ్యవస్ధలో అయినా కరెన్సీ విలువ వుద్ధాన, పతనాలు అలాంటి పర్యవసానాలకే దారితీస్తాయి. అంటే మొత్తం జనాన్ని ముఖ్యంగా సామాన్య జనాన్ని తీవ్ర ప్రభావితం చేస్తాయి. ఎలాగో చూద్దాం.

 

  మనకు చమురు నిక్షేపాలు తగినన్ని లేని కారణంగా అత్యధికంగా దిగుమతులపై ఆధారపడుతున్నాం. అందువలన ఆ రంగంలో పర్యవసానాలు మన నిత్యజీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నరేంద్రమోడీ అధికారాన్ని స్వీకరించిన తరువాత 2014 మే 29 జూన్‌ 11వ తేదీతో ముగిసిన పక్షంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా(బారెల్‌) ధర 106.72 డాలర్లు వుంది. ఆ రోజుల్లో డాలరు సగటు రూపాయి విలువ రు. 59.17 ఆ లెక్కన మనం రు 6314 లకు ఒక పీపాను కొనుగోలు చేశాము.పీపాకు వంద లీటర్ల పెట్రోలు అనుకుంటే లీటరు రు.63.14 పడుతుంది. డాలర్లలో లీటరుకు 1.07 , ఇప్పుడు అంటే 2016 డిసెంబరు 14-28 మధ్య ఒక పీపాను 53.05 డాలర్లకు , డాలరుకు రు.67.86 చొప్పున రు.3600కు కొనుగోలు చేశాము. అంటే లీటరుకు రు.36 పడుతుంది. డాలర్లలో ధర 0.53. నరేంద్రమోడీ సర్కార్‌ రూపాయి విలువ పతనాన్ని అరికట్టి స్ధిరంగా వుంచి వుంటే లీటరుకు రు.31.38కే వచ్చి వుండేది.అదే ప్రపంచ ఆర్ధికవేత్తలు వూహించినట్లు 45-40 రూపాయలకు పెరిగి వుంటే మరో పది రూపాయలు తగ్గి వుండేది. అన్నీ తానే అయి చూసుకుంటున్న నరేంద్రమోడీ రూపాయి పతనాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు. మరింతగా దిగజారనుందని ఆర్ధిక విశ్లేషకులు ఎందుకు అంచనా వేస్తున్నారు? అరికట్ట లేకపోగా తన హయాంలో పెట్రోలుపై పదకొండు రూపాయల పన్ను పెంచి అదనపు భారం ఎందుకు మోపి నట్లు ?

    రూపాయి విలువ పతనమైతే ఎక్కువ మందికి నష్టం జరిగితే, లాభపడే వారు కూడా వుంటారు. విదేశాలలో వుద్యోగాలు చేస్తూ మన దేశానికి డాలర్లు పంపే వారికి ఇక్కడ రూపాయలు అదనంగా వస్తాయి. మన వస్తువులను దిగుమతులు చేసుకొనే వారు తక్కువ డాలర్లు చెల్లించి లబ్దిపొందుతారు. మన దేశం దిగుమతి చేసుకొనే ముడి చమురు, ఎరువులు, ఔషధాలు, పురుగుమందులు, పప్పుధాన్యాలు, పామాయిల్‌ వంటి ఖాద్య తైలాలకు ఎక్కువ డాలర్లు చెల్లించాలి, పర్యవసానంగా ధరలు పెరుగుతాయి. అవి ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తాయి. రూపాయి విలువ పతనం కారణంగానే ఇటీవలనే అనేక కంపెనీల కార్ల ధరలు పెంచిన విషయం తెలిసిందే. విదేశాలలో విద్యనభ్యసించేవారిపై భారం పెరుగుతుంది. విదేశాల నుంచి డాలర్ల రూపంలో తీసుకొనే రుణాలకు చెల్లించాల్సిన మొత్తాలు పెరుగుతాయి. పెద్ద నోట్ల రద్దు వలన తాత్కాలికంగా ఇబ్బందులంటే ఆర్ధిక వ్యవస్ధ మందగించటమే, దాని వలన మూడు నుంచి ఐదులక్షల కోట్ల నల్లధనం వెలికి వచ్చి ఆ మేరకు ప్రభుత్వాదాయం పెరుగుతుందని వేసుకున్న అంచనాలన్నీ తారుమారయ్యాయని 40-50వేల కోట్లకు మించి రావని వార్తలు వస్తున్నాయి. ఏ రోజు లావాదేవీలను ఆరోజు సాయంత్రానికి బ్యాంకులు ఖరారు చేస్తాయి. అలాంటిది పెద్ద నోట్ల డిపాజిట్ల గడువు ముగిసి వారం రోజులు గడుస్తున్నా బ్యాంకులకు చేరిన సొమ్మెంతో ఇంకా లెక్కలు వేస్తున్నామని రిజర్వుబ్యాంకు చెప్పటం ఆశ్చర్యంగా వుంది. నోట్ల రద్దు వలన కలిగే లాభం సంగతేమోగాని రెండుశాతం జిడిపి అంటే రెండులక్షల కోట్ల రూపాయల నష్టం ఖాయంగా రానుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మసూద్‌ అజార్‌ను చైనా, దలైలామాను మనం ఎందుకు కాపాడుతున్నాం ?

01 Sunday Jan 2017

Posted by raomk in BJP, CHINA, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, USA

≈ Leave a comment

Tags

anti china, anti india, China, Dalai Lama, INDIA, masood azhar

Image result for masood azhar,  Dalai Lama

ఎం కోటేశ్వరరావు

    ఈ ప్రశ్న రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు వుండాలని కోరుకొనే అనేక మందికి ఆవేదన కలిగిస్తోంది, అదే సమయంలో శత్రుపూరిత సంబంధాలుండాలని కోరుకొనే వారికి ఆనందం కలిగిస్తోందంటే అతిశయోక్తి కాదు. అసలేం జరుగుతోంది ? ఐక్యరాజ్యసమితి పరిభాషలో సాంకేతిక అంశాలు ఎలా వున్నప్పటికీ ఆచరణలో మన దేశానికి వ్యతిరేకంగా వుగ్రవాద చర్యలకు పాల్పడుతున్నట్లుగా మన ప్రభుత్వం చెబుతున్న మౌలానా మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ వుగ్రవాదిగా పరిగణిస్తూ తీర్మానం చేయకుండా ఏప్రిల్‌, అక్టోబరులో భద్రతా మండలిలో తీర్మానం చేయకుండా అడ్డుకుంది. దాని అభ్యంతరాల గడువు డిసెంబరు 31తో ముగియనుంది. అయితే రెండు రోజుల ముందే చర్చకు వచ్చిన ఈ అంశాన్ని మరోసారి అడ్డుకొన్నది. దీంతో వుగ్రవాదం పట్ల చైనా ద్వంద్వ ప్రమాణాలను అసుసరిస్తోందని మన దేశం విమర్శించింది. సరిగ్గా ఈ సమయంలోనే అంటే బుధవారం నాడు కజకస్తాన్‌, మంగోలియా, మన దేశ (కాశ్మీర్‌లోని లడక్‌ ప్రాంతాన్ని అనుకొని వుండే) -చైనా సరిహద్దులలో వున్న చైనా రాష్ట్రం గ్జిన్‌జియాంగ్‌లో కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంపై వుగ్రవాదులు దాడి చేసి ఒక కార్యకర్త, భద్రతా సిబ్బంది ఒకరిని హత్య చేశారు. వెంటనే పోలీసులు దాడిలో పాల్గొన్నవారిలో ముగ్గురిని కాల్చివేశారు. అనేక సార్లు ఇస్లామిక్‌ తీవ్రవాదులు అక్కడ దాడులకు పాల్పడిన కారణంగా ఇప్పుడు కూడా వారే అయి వుండవచ్చని వార్తలలోని వ్యాఖ్యలను బట్టి అనుకోవాలి. ఆ వుగ్రవాదులను ఇరుగు పొరుగు దేశాల వారు పెంచి పోషించి రెచ్చగొడుతున్నందున దాడులు చేస్తున్నట్లు చైనా గతంలో విమర్శించింది. చైనా కూడా వుగ్రవాద సమస్యను ఎదుర్కొంటోంది కదా అలాంటపుడు మసూద్‌ అజార్‌పై చర్యను ఎందుకు అడ్డుకుంటున్నట్లు అన్న సందేహం కొంత మందికి కలుగటం సహజం.

    ఈ సమస్య గురించి గురించి ఏకపక్షంగా ఒక వాదననే సమర్ధిస్తూ చర్చించిన వారిని దేశ భక్తులుగానూ, భిన్న కోణాల గురించి వివరించే వారిని దేశ ద్రోహులు లేదా చైనా అనుకూలురుగానో చిత్రించే వాతావరణంలో వున్నాం. ప్రస్తుతం ముస్లిం పాకిస్థాన్‌, కమ్యూనిస్టు చైనాను వ్యతిరేకించటమే అసలు సిసలైన దేశ భక్తిగా కాషాయ సర్టిఫికెట్లు ఇస్తున్న రోజులివి. సరిహద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పిన సిపిఎంను చైనా అనుకూల పార్టీగా చిత్రించిన వారిలో ఆర్‌ఎస్‌ఎస్‌, అది గతంలో తన రాజకీయ విభాగంగా నడిపిన జనసంఘం ముందు వరుసలో వున్నాయి. అప్పటికీ ఇప్పటికీ సిపిఎం తన వైఖరిని మార్చుకోలేదు. సరిహద్దు గురించి సంప్రదింపులు జరిపేందుకు అర్హత కేంద్రంలో అధికారంలో వున్నవారికి మాత్రమే వుంటుంది. సిపిఎంకు అటువంటి అవకాశం రాలేదు. అంతకు ముందు చైనాతో యుద్ధానికి అవసరమైతే తాము రంగంలోకి వస్తామంటూ వీధులలో ప్రదర్శనలు చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు జనతా పార్టీ ముసుగులో ఒకసారి అధికారానికి వచ్చారు, రెండవ సారి బిజెపి పేరుతో, మూడవ సారి కూడా అదే పేరుతో అధికారానికి వచ్చి చేసిందేమిటయ్యా అంటే సామరస్య పూర్వరంగా చైనాతో చర్చలు జరపటమే కాదు, కమ్యూనిస్టుల కంటే ఎక్కువగా చైనా కమ్యూనిస్టుపార్టీతో అధికారిక సంబంధాలు పెట్టుకొని చైనా యాత్రలు చేసి వస్తున్నారు. అదనంగా వ్యాపారలావాదేవీలతో మునిగి తేలుతున్నారు. చైనాతో ఒకవైపు సంబంధాలు నెరుపుతూనే మరోవైపు చైనా వ్యతిరేక రాజకీయాలలో కూడా భాగస్వాములు అవుతున్న పెద్దలు దేశ భక్తులుగా చెలామణి అవుతున్నారా లేదా ? దీనికి నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు, ఇతర బిజెపి మిత్రపక్ష నేతలెవరూ మినహాయింపు కాదు. అలాంటపుడు మసూద్‌ అజార్‌ను చైనా కాపాడటం కూడా అదే రాజకీయాలలో అంతర్బాగమే అని అభిప్రాయపడిన వారు చైనా అనుకూలురు, దేశద్రోహులు ఎలా అవుతారు ?

     అవన్నీ కాదు మన ప్రయోజనాలే ముఖ్యం, చైనా అయినా మరొక దేశమైనా మనకు అనుకూలంగా వున్నంత వరకు వుపయోగించుకోవాలి, లేనపుడు వ్యతిరేకించాలి అని అనుకోవటానికి ఎవరికైనా హక్కుంది తప్ప భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన వారి మీద రంగులు చల్లితే, బురద వేస్తే కుదరదు. దీన్నే ఇంకో విధంగా చెప్పాలంటే మా ఇంటికొస్తే మాకేం తెస్తావ్‌, మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌ అనే అతి తెలివి అనాలి. కొంచెం కటువుగా వున్నప్పటికీ అంతర్జాతీయ రాజకీయాల్లో ఇలాంటివి పని చెయ్యవు అని చెప్పక తప్పదు. ఇరుగు పొరుగుతో స్నేహం చేసేటపుడు రెండువైపులా స్నేహ ధర్మం పాటించాలి. ఈ పూర్వరంగంలో మసూద్‌ అజార్‌ను చైనా ఎందుకు కాపాడుతోందో వారి వైపు నుంచి కూడా చూడటం అవసరం.

Image result for masood azhar,  Dalai Lama

      మసూద్‌ అజార్‌, ఆ వరుసలో వున్న ఇంకా అనేక మంది టెర్రరిస్టులను అంతర్జాతీయంగా గుర్తించి వారి మీద చర్యలు తీసుకోవాలనటం నిర్వివాదాంశం. ప్రపంచంలో అనేక దేశాలలో టెర్రరిస్టులు, తిరుగుబాటుదారులు, వేర్పాటు వాదులు ఎందరో వున్నారు. వారు మతాధికారులు, మరొకరు ఎవరైనా కావచ్చు, ఇతర దేశాలకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు. అలాంటి అభ్యంతరాలున్న జాబితాలు ప్రతి దేశంలోనూ వుంటాయి. మనకు చైనాకు మధ్య సరిహద్దు వివాదం వుంది. వాటిలో లడఖ్‌ ప్రాంతంలోని ఆక్సాయ్‌ చిన్‌, ఈశాన్య ప్రాంతంలోని అరుణాచల్‌ ప్రదేశ్‌ వున్నాయి. బ్రిటీష్‌ పాలకులు మనకు తెచ్చిన అనేక సమస్యలలో ఇదొకటి. బ్రిటీష్‌ ఇండియా విదేశాంగ కార్యదర్శిగా పని చేసిన బ్రిటీష్‌ అధికారి హెన్రీ మెక్‌మోహన్‌ 1914లో గీసిన సరిహద్దు లైన్ల ఆధారంగా అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం-టిబెట్‌ ప్రభుత్వం మధ్య ఒక సరిహద్దు ఒప్పందం కుదిరింది. టిబెట్‌కు అలాంటి అధికారం లేదని వాదించిన చైనా ఆ హద్దును తాను గుర్తించటం లేదని అప్పుడే స్పష్టం చేసింది. అయితే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మరుసటి ఏడాది చైనా కమ్యూనిస్టుపార్టీ అధికారంలోకి వచ్చింది. కాశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా వుంచటానికి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు కుట్ర చేసినట్లే , సామ్రాజ్యవాదులు టిబెట్‌ను కూడా స్వతంత్ర రాజ్యంగా మార్చేందుకు కుట్ర పన్నారు. మిలిటరీ చర్య ద్వారా కాశ్మీర్‌ను మన దేశంలో అంతర్భాగంగా చేసినట్లే టిబెట్‌ను కూడా చైనా సైనిక చర్య ద్వారా టిబెట్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఆ సమయానికి మనదిగా బ్రిటీష్‌ వారు మ్యాపులలో చూపిన ఆక్సాయ్‌ చిన్‌ చైనాలో, చైనాకు చెందినదిగా పేర్కొన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ మన ఆధీనంలో వుంది. దాంతో ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సిన అగత్యం కలిగింది. కాశ్మీర్‌ మన దేశ అంతర్బాగమని కమ్యూనిస్టు చైనా గుర్తించినట్లే, టిబెట్‌ ప్రాంతం చైనా అంతర్భాగమని మన దేశం కూడా గుర్తించింది. అయితే చైనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, టిబెట్‌ ప్రత్యేక దేశంగా ప్రకటించిన మత పెద్ద దలైలామాకు మన దేశంలో ఆశ్రయం కల్పించటమే గాక హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ప్రవాస ప్రభుత్వ ఏర్పాటును సైతం అనుమతించింది. అయితే దౌత్యపరంగా వాటికి గుర్తింపు ఇవ్వలేదు తప్ప దలైలామా అండ్‌కో చేసే చైనా వ్యతిరేక కార్యక్రమాలు, కార్యకలాపాలన్నింటినీ మన ప్రభుత్వం అనుమతిస్తున్నది.దీనికి కాంగ్రెస్‌, జనతా, నేషనల్‌ ఫ్రంట్‌, బిజెపి అనే తేడా లేకుండా అన్ని ప్రభుత్వాలు ఒకటిగానే వ్యవహరిస్తున్నాయి. ఒక వివాదాన్ని పరిష్కరించాలని కోరుకుంటున్నవారెవరైనా దానికి కొత్త పీఠ ముడులను వేయకుండా చూడాలి. కానీ పరిణామాలు అలా లేవు.

    ఒక శరణార్ధిగా దలైలామాను మన దేశంలో అనుమతించటం వేరు, ఒక తిరుగుబాటు ప్రవాస ప్రభుత్వ నేతగా కార్యకలాపాలను పదే పదే అనుమతించటాన్ని చైనా సహించదని తెలిసి కూడా అనుమతించటాన్ని ఏమనాలి? మన దేశానికి మసూద్‌ అజార్‌ ఎలాంటి ప్రమాదకర వ్యక్తో చైనాకు దలైలామా అంతకంటే ఎక్కువ ప్రమాదకర వ్యక్తి. 1959లో చైనా ప్రభుత్వంపై విఫల తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. అప్పటి నుంచి అనేక మంది టిబెట్‌ తిరుగుబాటుదార్లు వుగ్రవాదులుగా మారి అనేక దేశాలలో చైనా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కుట్రలు చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌ చివరి వారంలో హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాల పట్టణంలో తొలిసారిగా నాలుగు రోజుల పాటు చైనా వ్యతిరేక సంస్ధల అంతర్జాతీయ సమావేశాన్ని జరుపుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించటాన్ని చైనా తీవ్రంగా పరిగణిస్తోంది. దలైలామాకు ఎప్పటి నుంచో మన దేశం ఆశ్రయం కల్పించి మద్దతు ఇస్తున్నా బహిరంగంగా అమెరికా, ఇతర దేశాలలో ప్రభుత్వేతర సంస్ధల ముసుగులో పనిచేసే చైనా వ్యతిరేకుల సమావేశాన్ని అనుమతించిన ఘనత నరేంద్రమోడీకే దక్కింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లోని దక్షిణ ప్రాంతంగా చైనా అంటోంది. అక్కడి తవాంగ్‌ పట్టణం ఆరవ దలైలామా జన్మ స్ధలం. ఈ ఏడాది మార్చి నెలలో తవాంగ్‌ పర్యటన జరపాలని దలైలామా నిర్ణయించుకున్నారు. చైనాకు అభ్యంతరమని తెలిసి కూడా దేశంలో దలైలామా ఎక్కడికైనా స్వేచ్చగా వెళ్ల వచ్చని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రకటించటం, గతేడాది అరుణాచల్‌ ప్రదేశ్‌లో అమెరికా రాయబారి పర్యటనను అనుమతించటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? కాశ్మీర్‌ సమస్యలో మూడో దేశ జోక్యాన్ని మనం అనుమతిస్తామా ?

     దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి మన దేశానికి ఎలాంటి వివాదం, సంబంధం లేదు, మన నౌకలు వెళితే చైనా అడ్డుకున్న వుదంతాలు లేవు. ఆ ప్రాంతంలోని కొన్ని దీవులపై చైనా, జపాన్‌, వియత్నాం, మరికొన్ని దేశాలు వివాదపడుతున్నాయి. ఆ సమస్యను అవే పరిష్కరించుకోవాలి. ఆ ప్రాంతంలో అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం తమ నౌకలు స్వేచ్చగా తిరగటానికి వున్న హక్కును అమలు చేసుకొంటున్నామనే పేరుతో అమెరికా-జపాన్‌ కార్యాచరణ బృందం తమ యుద్ధ నౌకలతో ఆ ప్రాంతంలో 2016 మే-జూలై మధ్య రెండున్నర నెలలపాటు విన్యాసాలు నిర్వహించి చైనాతో కయ్యానికి కాలుదువ్వాయి. వాటితో కలసి జలకాలాడేందుకు మన నాలుగు నౌకలను మోడీ సర్కార్‌ పంపటం ఏమిటి ? అమెరికా, జపాన్‌లకు జూనియర్‌ భాగస్వామిగా మన దేశాన్ని మార్చినట్లా, వాటితో పాటు కలిసి చైనాపై బస్తీమే సవాల్‌ విసిరినట్లా ? జపాన్‌తో అమెరికాకు రక్షణ ఒప్పందం వుంది కనుక అమెరికన్లు ఆ ముసుగులో జోక్యం చేసుకుంటున్నారు. మనకు సంబంధం ఏమిటి ? ఎవరిని సంతోష పెట్టటానికి ఈ పని చేసినట్లు ? మసూద్‌ అజార్‌ విషయంలో చైనా అనుసరిస్తున్నదానికి దెబ్బకు దెబ్బ అని మన దేశంలోని చైనా వ్యతిరేకులు వాదించ వచ్చు. అటువంటి వారికి మసూద్‌తో సహా ఇతర వివాదాలపై చైనాను విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది ? మనం చైనా వ్యతిరేకికి ఆశ్రయం ఇచ్చిన మాదిరి మన వ్యతిరేకి మసూద్‌ అజార్‌కు చైనా ఆశ్రయం కల్పించలేదు, అలాంటి వారితో మనకు వ్యతిరేకంగా తన గడ్డపై సభల నిర్వహణకు ఏర్పాటు చేయలేదు. మసూద్‌ అజార్‌ను వుగ్రవాదిగా తీర్మానించబోయే ముందు ఆ సమస్యను రాజకీయ ప్రయోజనాలకు వుపయోగించుకుంటున్నారేమో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని చైనా కోరింది తప్ప అతను తీవ్రవాది కాదని గానీ అవుననిగానీ చెప్పలేదు. అయితే ఆ వైఖరి ఆచరణలో తీర్మానానికి అడ్డుపడినట్లే అన్నది స్పష్టం. ఇటువంటి వైఖరులతో సంబంధాల మెరుగుదలకు కృషి చేస్తున్నామని వుభయ దేశాలు చేసే ప్రకటనలకు అర్ధం వుండదు. ఎవరు ముందు తప్పు చేశారు, ఎవరు తరువాత చేశారు అనే వాద ప్రతివాదాలలోకి పోతే పరిష్కారం కుదరదు.

    గత పాతిక సంవత్సరాలలో ముఖ్యంగా గత పది సంవత్సరాలలో మన దేశాన్ని అమెరికాకు దగ్గరగా తీసుకుపోతున్న కొద్దీ ఆ మేరకు పాకిస్థాన్‌ చైనాకు దగ్గర అవుతోంది. గతంలో అమెరికా-సోవియట్‌ యూనియన్‌ మధ్య వున్న విబేధాలను మన పాలకవర్గం వుపయోగించుకొని లబ్ది పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు చైనా-అమెరికా మధ్య వున్న విబేధాలను వుపయోగించుకొని పాకిస్థాన్‌ అదేపని చేస్తోందన్నది స్పష్టం. ఒకవైపు పాకిస్థాన్‌ అమెరికన్లతో దగ్గర సంబంధాలను కొనసాగిస్తూనే చైనాతో రోజు రోజుకూ సంబంధాలను పెంచుకొంటోంది. మనకు చైనాతో వివాదాలు పెంచుకొని అమెరికాతో దగ్గర కావటం లాభమా, చైనాతో వివాదాలను తగ్గించుకొని లాభపడటం మంచిదా అని ఆలోచించుకోవాలి. మనకు, పాకిస్తాన్‌కు ఆయుధాలు విక్రయించి లబ్ది పొందుతున్న అమెరికా ఇప్పుడు చైనాతో మరోసారి మన వివాదాలు పెంచుకోవాలని కోరుకుంటోంది. మన దేశానికి వారి ఆయుధాలను మరింతగా విక్రయించాలంటే చైనాతో లడాయి పెరగాలి. అప్పుడే వారి ఆయుధ పరిశ్రమలు మూడు పూవులు ఆరు ఆయుధాలుగా వర్ధిల్లుతాయి. ఈ పరిణామాల పూర్వరంగాన్ని అర్ధం చేసుకుంటే చైనా తిరుగుబాటుదారుడు దలైలామాను మన దేశం ఎందుకు సమర్ధిస్తుందో, వుగ్రవాది మసూద్‌ అజార్‌ను చైనా ఎందుకు రక్షిస్తుందో అర్ధం చేసుకోవటం కష్టం కాదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిర్లా, సహారా డైరీలు – జవాబు లేని ప్రశ్నలు !

24 Saturday Dec 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Others, Political Parties

≈ Leave a comment

Tags

birla sahara diaries, BJP, cbi, CORRUPTION, it, Modi

ఎం కోటేశ్వరరావు

    తన దగ్గరున్న సమాచారం గనుక బయట పెడితే ఏదో జరిగి పోతుందన్నట్లుగా రాహుల్‌ గాంధీ బిల్డప్‌ ఇవ్వటం, అది తుస్సుమనటం తెలిసిందే. చీకట్లను పారద్రోలుతూ వెలుగుతుందనుకున్న ఒక మతాబా, బాగా పేలుతుందనుకున్న దీపావళి బాంబు ఒక్కోసారి తుస్సుమనొచ్చు. అయితే అవి తుస్సుమన్నప్పటికీ వాటి అవశేషాలను తొలగించి వీధిని శుభ్రం చేయాల్సిన బాధ్యత గృహస్తు మీదో స్ధానిక సంస్ధల పారిశుధ్య సిబ్బందిమీదో వుంటుంది. ఇప్పుడు రాహుల్‌ గాంధీ చెప్పిన అంశాలు, ఆ మాటకు వస్తే అవి ఆయన కొత్తగా కనుగొన్నవీ కాదు, తాజాగా బయటపడినవీ కాదు, ఇప్పటికే ప్రముఖ లాయర్‌ ప్రశాంత భూషన్‌ కోర్టులో వేసిన కేసులోనివే. ఇక్కడ రెండు అంశాలున్నాయి.

    ఒకటి నరేంద్రమోడీని సమర్ధిస్తూ బిజెపి నేతలు అత్యంత బలహీనమైన వాదనలు చేశారు. రెండు ఆయన స్వయంగా రాహుల్‌ గాంధీని అపహాస్యం చేశారు. తమ నేత గంగ అంతటి స్వచ్చమైన ముత్యం అన్నది ఒకటి. గంగతో సహా ఏ నది అయినా పుట్టుక స్థానంలో ఎంతో స్వచ్చంగా వుంటుంది. తరువాతే కలుషితంగా మారుతోంది. హిమాలయాల నుంచి బయటపడిన తరువాత గంగ ఎంత కాలుష్యంగా మారిందో మోడీ సర్కార్‌ ప్రకటించిన గంగ శుద్ధి ప్రణాళిక తెలిసిందే.ఎవరైనా పుట్టినపుడు, బాల్యంలో ఎలాంటి మచ్చ లేకుండా వుంటారు. పెరిగేకొద్దీ కథ ప్రారంభం అవుతుంది.మోడీ అయినా అంతే. డైరీల నిగ్గు తేలే వరకు సహారా, బిర్లాల దగ్గర ముడుపులు తన స్వంతానికి తీసుకున్నారా పార్టీ కోసమా అన్నది వేరే విషయం.

    పారిశ్రామిక సంస్ధలు, వ్యక్తులు ఇచ్చే విరాళాలు లేదా ముడుపులు ఎక్కడా ఖాతాలలో పక్కాగా రసీదుల వివరాలతో సహా రాయరు. డైరీలలోనో మరొక చోటో పొట్టి లేదా నిక్‌నేమ్స్‌ పేరుతోనో నమోదు చేస్తారు. ఎందుకంటే ఆ పని చేసే వారు ఆ సొమ్ము స్వంతదారులకు జవాబుదారీగా ఏదో ఒక ఆధారాన్ని చూపాలి. నమ్మకస్తుల ద్వారానే అలాంటి పని చేయిస్తారు. వుదాహరణకు రెండు దశాబ్దాల క్రితం హవాలా కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే. అది కూడా ఎస్‌కె జైన్‌ అనే హవాలా వ్యాపారి నమోదు చేసిన డైరీల ఆధారంగా అని ఇక్కడ గుర్తు చేయాలి. ఆ డైరీలలో వామపక్షాలు తప్ప కాంగ్రెస్‌,బజెపి, జనతాదళ్‌ తదితర 18 పార్టీల నేతల పేర్లు వున్నాయి. ఆ వివరాలు బయటకు రాగానే ఆ జాబితాలో ఒకరైన బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ తన లోక్‌సభ సభ్వత్యానికి రాజీనామా చేసి ఆ మచ్చ తొలిగిన తరువాత గానీ తిరిగి సభలోకి అడుగు పెట్టనని ప్రకటించి నాడు ప్రశంసలు పొందారు. దాంతో అనేక మంది కాంగ్రెస్‌, బిజెపి నేతలు కూడా పదవుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా ఆ కేసులో తేలిందేమీ లేదు, నిర్దోషులుగా ప్రకటించారు.

   చిత్రం ఏమిటంటే అద్వానీ శిశ్యుషుడినని, ఆయన సభ్యుడిగా వున్న మార్గదర్శక మండలి సలహామేరకు పని చేస్తున్నానని చెప్పుకుంటున్న నరేంద్రమోడీ రాజీనామా సంగతి తరువాత, ముందసలు ఆ డైరీల సంగతి నిగ్గుదేల్చమని దర్యాప్తు సంస్ధలను ఆదేశించటానికి కూడా ముందుకు రాలేదెందున్నది అసలు ప్రశ్న. హవాలా డైరీలలో, సహారా, బిర్లా డైరీలలో బిజెపితో పాటు కాంగ్రెస్‌, ఇతర పార్టీల నేతలందరూ వున్నారు. అందుకే తేలు కుట్టిన దొంగ మాదిరి మోడీ సర్కార్‌ మౌనంగా వుండిపోయిందా ? సరే వెంకయ్య నాయుడు తన పాండిత్యాన్ని మొత్తాన్ని వుపయోగించి ఆ డైరీలు బయట పడింది కాంగ్రెస్‌ హయాంలో అప్పుడెందుకు వాటి గురించి చెప్పలేదని చెట్టుకింద లాయర్‌ మాదిరి ప్రశ్న వేశారు. ఆ డైరీలు 2013 అక్టోబరులో, 2014 నవంబరులో నరేంద్రమోడీ అధికారానికి వచ్చాక సిబిఐ, ఆదాయపన్ను శాఖ దాడులలో బయట పడ్డాయి.తమకు దొరికిన వాటిపై ఏ చర్య తీసుకోవాలన్నది ఆ సంస్ధల విధి. తమకు దొరికిన వాటి గురించి ఎటూ తేల్చకుండా మీన మేషాలు లెక్కించటాన్ని చూసిన తరువాత కామన్‌ కాజ్‌ అనే ఒక స్వచ్చంద సంస్ద 2015లో సుప్రీం కోర్టుకు వెళ్లింది.అంటే సిబిఐ, ఆదాయపన్ను శాఖలపై తెరవెనుక నుంచి వత్తిడి వచ్చిందన్నది స్పష్టం. ‘అవినీతి వ్యతిరేక నరేంద్రమోడీ హయాం ‘ ఇలా జరగటం ఏమిటి ? గంగ మాదిరి కాలుష్యం సోకిందా ?

     ఈ డైరీలపై దాఖలైన కేసులో సుప్రీం కోర్టు న్యాయమూర్తుల తర్కం అనేక ప్రశ్నలను ముందుకు తెచ్చింది. డైరీలలో పేర్లు వున్నంత మాత్రాన వాటిపై విచారించటం కుదరదని,ఇలాంటి వాటిపై దర్యాప్తులకు ఆదేశిస్తే పర్యవసానాలు తీవ్రంగా వుంటాయంటూ ఎవరైనా ఒకరు ప్రధానికి ఇంత డబ్బు ముట్టచెప్పామని తమ డైరీలలో రాసుకున్నంత మాత్రాన ఎలా విచారణ జరపాలి అంటూ మరింత స్పష్టమైన సాక్ష్యాలతో రావాలని చెప్పి చింతకాయల రవి సినిమాలో ప్రతిదానికీ సర్టిఫికెట్‌ల ఫ్రూఫ్‌ కావాలనే పాత్రధారిని గుర్తుకు తెచ్చింది. భవిష్యత్‌లో అక్రమంగా నిధులు ఇచ్చేవారు, పుచ్చుకొనే వారు కేసులు, శిక్షల నుంచి తప్పించుకొనేందుకు అనుసరించాల్సిన సులువైన పద్దతిని చెప్పినట్లు , తప్పించుకొనేందుకు అవసరమైన తర్కాన్ని సిద్ధం చేసినట్లుగా వుంది. బిర్లా డైరీలను నమోదు చేసిన వారు తమకు హవాలా మార్గంలో నగదు వస్తుందని, దానిని తమ యజమానుల ఆదేశాల మేరకు రాజకీయ నేతలకు అంద చేస్తాని విచారణలో చెప్పారు. బిర్లా కంపెనీ చైర్మన్‌ సుబేందు అమితాబ్‌ కూడా విచారణలో గుజరాత్‌ సిఎంకు 25 కోట్లు అందచేసినట్లు అంగీకరించారు. అయితే గుజరాత్‌ సిఎం అంటే గుజరాత్‌ ఆల్కలీస్‌ అండ్‌ కెమికల్స్‌ అని చెప్పారు. సి,ఎం అనే పదాలకు ఆ కంపెనీ పేరుకు పొంతన కుదరటం లేదు. దాని గురించి అడిగితే అదంతే అనటం తప్ప సరైన వివరణ ఇవ్వలేదు. పోనీ అక్రమ పద్దతుల్లో నగదు తీసుకున్న సదరు కంపెనీపై చట్టపరమైన చర్యలేమన్నా తీసుకున్నారా ? అదీ లేదు. దీని వాస్తవాలను తేల్చాల్సింది ఎవరు? అందుకే ఆ డైరీలపై దర్యాప్తు జరపాలని తాము డిమాండ్‌ చేస్తున్నట్లు న్యాయవాది ప్రశాంత భూషన్‌ చెబుతున్నారు. హవాలా కేసులో దొరికిన డైరీలలో పొట్టి పేర్లు మాత్రమే వున్నాయి. అయినప్పటికీ దర్యాప్తు జరపటానికి అవి చాలని అప్పుడు సుప్రీం కోర్టు చెప్పింది. ఇప్పుడు పేర్లు, డైరీలు మరింత స్పష్టంగా వున్నప్పటికీ మరింత స్పష్టమైన ఆధారాలు కావాలని అదే కోర్టు వ్యాఖ్యానించటం గమనించాల్సిన అంశం. రాహుల్‌ గాంధీ చెప్పిన అంశాలపై రాజకీయంగా అపహాస్యం చేయవచ్చు, సామాజిక మీడియాలోని తన భక్తులు, సైన్యానికి వుత్సాహం తెప్పించవచ్చు. అంతటితో అది అయిపోదు, కోర్టు లేదా మోడీ సర్కార్‌ దీనిపై ఏదో ఒక వైఖరిని వెల్లడించకతప్పదు. ఆ డైరీల నిగ్గు తేల్చనంత వరకు మోడీవైపు వేలు చూపుతూనే వుంటారు .

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రజాస్వామ్య దేవాలయాన్ని బహిష్కరిస్తున్న పూజారి మోడీ 

12 Monday Dec 2016

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Narendra Modi, Priest Narendra Modi, temple of democracy

Image result for Priest Narendra Modi

సత్య

   ‘జరిగిన ప్రచారాన్ని చూస్తే నరేంద్రమోడీ వుద్యమం దేశపు వుత్తమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసిందనే భావం కలిగింది. అది దేశాన్ని సోషలిజం మరియు విప్లవం వైపు నడిపిస్తుందనిపించింది. ప్రత్యర్ధులను ఆ ప్రచారం వెర్రివాళ్లను చేసింది, ఆశ్యర్యంలో ముంచెత్తి రక్షణ లేని స్థితిలో పడవేసింది, గుక్క తిప్పుకోకుండా దాడులతో వుక్కిరిబిక్కిరి చేసింది. అది కొంత మందిని నేరగాళ్లగా ఆరోపించింది. అవాస్తవాలను ప్రచారం చేసింది. దేశ వ్యవస్ధ యావత్తూ ప్రచారంపై నిర్మితమైంది. భీతిని ఘోరంగా స్థుతించారు.ఈ ప్రచారదాడిలో లక్షల మంది అనుబంధ సంఘాల సభ్యులను సాధనాలుగా వినియోగించారు. మోడీ ప్రచారం మొత్తాన్ని ప్రచార వూహకర్తల పధకాలమేరకు రూపొందించారు .’ నరేంద్రమోడీ నిజస్వరూపం ఏమిటో ముందునుంచీ తెలిసిన వారికి ఈ మాటలు ఆశ్చర్యం గొలపకపోవచ్చు. గత రెండున్నర సంవత్సరాలుగా ఆయన వీర భక్తులుగా మారిన ఎందరినో గత 33 రోజులు ఆలోచనలో పడవేశాయి. ఏమిటిలా జరుగుతోంది అనే అంతర్మధనం వారిలో ప్రారంభమైంది. ఒక అయిడియా జీవితాన్నే మార్చేసింది అంటే ఇదే. పై పేరాలో వర్ణితమైన అంశం నిజానికి నరేంద్రమోడీ గురించి రాసింది కాదు. హిట్లర్‌ గురించి ‘ ద థర్డ్‌ రీచ్‌ ‘ అనే పుస్తకంలో రాసిన ఒక పేరా. అందువలన దానిలో నరేంద్రమోడీ అన్న దగ్గరల్లా హిట్లర్‌ అని చదువుకోవాలి. నోట్ల రద్దు గురించి జరుగుతున్న ప్రచార తీరు తెన్నులు, దానిని అమలు చేసిన తీరును తప్పుపట్టిన వారిపై జరుగుతున్న ప్రచారదాడిని చూస్తే అది యాదృచ్చికంగా జరుగుతోందా లేక హిట్లర్‌ ప్రచార వూహాలను బాగా అధ్యయనం చేసిన నరేంద్రమోడి నియమించిన నిపుణుల ఎత్తుగడల మేరకా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. హిట్లర్‌ లక్షణాలు మాత్రం కనిపిస్తున్నాయి.

    పార్లమెంట్‌ భవనాన్ని తానే తగుల బెట్టించి ఆ పని కమ్యూనిస్టులపై ఆరోపించి వారి అణచివేతకు ఒకసాకుగా వుపయోగించుకున్న హిట్లర్‌ దుర్మార్గానికి ఇప్పుడు రుజువులు అవసరం లేదు. గత కొద్ది రోజులుగా నరేంద్రమోడీ, ఆయన మంత్రులు బాణీ మార్చారు. ప్రతిపక్షాలు తనను పార్లమెంటులో మాట్లాడకుండా అడ్డుకుంటున్నాయని నరేంద్రమోడీ పదే పదే పెద్ద గొంతుకతో చెబుతున్నారు.ప్రతిపక్షాలు నల్లధనులకు మద్దతు పలుకుతున్నాయనేది సరేసరి. ఎంతైనా ప్రధాని కనుక దొంగే దొంగ అని అరచినట్లున్నదని చెప్పటానికి మనస్కరించటం లేదు. పెద్ద నోట్ల రద్దుతో వుగ్రవాదుల పీచమణిచామని చెప్పుకుంటున్నారు. హోంమంత్రి రాజనాధ్‌ సింగు మన దేశాన్ని విడదీసేందుకు పాక్‌ ప్రయత్నిస్తున్నదని, మనం తలచుకుంటే దానిని పది ముక్కలు చేయగలమని మాట్లాడారు. నోట్ల రద్దుతో వుగ్రవాదం తగ్గిపోయిందని, వారికి డబ్బులందించే హవాలా మార్గాన్ని కూడా మూసివేశామని చెబుతున్న తరువాత ఈ మాటలు చెప్పటం విశేషం.

   పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయంగా పదవీ బాధ్యతలు స్వీకరించే సందర్బంగా నరేంద్రమోడీ పేర్కొన్నారు. అలాంటి దేవాలయానికి ఒక ప్రధానిగా నరేంద్రమోడీ ఒక పూజారి లాంటి వారు. ప్రతి రోజూ పూజారి రాకుండా భక్తులు మాత్రం వచ్చి తమ పాత్ర తాము నిర్వహించి భక్తి రసాన్ని రక్తి కట్టిస్తున్నారు. పూజారి దేవాలయానికి రాకుండా తప్పించుకుంటున్నారని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. దానికి సమాధానం చెప్పకుండా తననే అడ్డుకుంటున్నాయని మోడీ ఎదురుదాడికి దిగారు. బలమైన ప్రధానిగా, ఒక్క మగాడు అన్న భుజకీర్తులు తగిలించుకున్న వ్యక్తి నుంచి ఇంతటి బలహీనమైన వాదన వెలువడటం ఆశ్చర్యం. ఏదో మంచి జరగబోతోందన్న భావనతో తాము ఇబ్బందులు పడుతున్నా ఎంతో సహనం ప్రదర్శిస్తున్న జనం బయట వున్నారు. తిరుగులేని మెజారిటీ వున్న మోడీని పార్లమెంటులో అడ్డుకొనేదెవరు ? ఓటింగ్‌కు అవకాశం వున్న నిబంధన కింద చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న మాట నిజం.వాటికా హక్కు లేదా ? పోనీ అదైనా చెప్పమనండి. దానికి బదులు ధర్మోపన్యాసాలతో చర్చను ముగించే నిబంధన కింద జరపాలని అధికారపక్షం మొరాయిస్తోంది. అదే పార్లమెంట్‌ జరగకపోవటానికి కారణం. గతంలో బిజెపి ప్రతిపక్షంలో వుండగా ఇదే మాదిరి డిమాండ్‌ చేసిందా లేదా ? అప్పుడు తనకు సరైనది ఇప్పుడు కాకుండా ఎలా వుంటుంది? లోక్‌సభలో ఓటింగ్‌ జరిగినా మోడీ సర్కార్‌కు ఢోకా లేదు. రాజ్యసభలో ఓడిపోయినంత మాత్రాన రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అసలు ప్రతిపక్షాలు ఓటింగ్‌కు పట్టుబడతాయో లేదో కూడా వూహాజనితమే. చర్చను బట్టి ఎవరి రంగేమిటో జనానికి తెలుస్తుంది. అటువంటపుడు అధికారపక్షం భయపడాల్సిన పనేముంది? ప్రజాస్వామిక దేవాలయాన్ని పూజారి బహిష్కరించాల్సిన అవసరం ఏముంది ?

    అసలు విషయం ఏమంటే నోట్ల రద్దుతో తలెత్తే ప్రయోజనాల గురించి ఆహా ఓహో అన్నట్లుగా పార్లమెంట్‌లో చెబితే కుదరదు, నిర్ధిష్టంగా జరిగే ప్రయోజనం ఏమిటో ప్రభుత్వం స్పష్టీకరించాలి. చీకట్లో బాణం వేసినట్లుగా అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అనటం తప్ప మరొక అంశం లేదుకనుకనే నరేంద్రమోడీ పార్లమెంట్‌లో మాట్లాడేందుకు సిద్ధం కావటం లేదు. దేశ ప్రజలందరినీ అతలాకుతలం చేసిన ఇంతటి తీవ్ర చర్య గురించి కూడా ప్రధాని మీడియా సమావేశం పెట్ట లేదంటే జర్నలిస్టులను చూసి కూడా భయపడుతున్నారా అని సందేహించాల్సి వస్తోంది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్ధలో ఒక మంచి వరవడిని నెలకొల్పాల్సిన వారు ఇలా చేయటం నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయటమే. తాను ప్రధాని గద్దె నెక్కెందుకు పార్లమెంట్‌ సోపానాలు కావాల్సి వచ్చాయి గాని తరువాత మాట్లాడేందుకు మాత్రం పనికిరాకుండా పోయాయా ? ఏంత చిత్రం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ అడుసు తొక్కారు ! కాళ్లు కడిగే విధము చెప్పండి !!

30 Wednesday Nov 2016

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Politics

≈ Leave a comment

Tags

demonetization, demonetization mesh, Modi, modi government

ఎం కోటేశ్వరరావు

    తాంబోలం ఇచ్చేశాను యిహ తన్నుకు చావండి అంటాడు కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు, మా మోడీ అడుసు తొక్కారు, కాళ్లు కడిగే విధము చెప్పండీ అంటున్నారు నమో ప్రహసనంలో ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ .

    మొదటిది నాటకం. కరటకశాస్త్రి, ఆయన శిష్యుడు, మధురవాణి నాటకం ఆడి బాల్యవివాహాన్ని తప్పిస్తారు. కధను సుఖాంతం చేస్తారు. రెండవది వాస్తవం. ఎలా ముగుస్తుందో తెలియదు. అన్నింటికంటే ఎలా ముగించాలో తెలియదు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడికి ముందుగానే వుప్పందిన కారణంగా పెద్ద నోట్ల రద్దును రద్దు చేయాలని లేఖ రాసి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం పొందినట్లు అనుకుంటున్న విషయం తెలిసిందే. నోట్ల రద్దు తరువాత ఆ లేఖను చూపి ఆ ఖ్యాతిలో తమ నేతకు భాగముందన్నట్లుగా మీడియాలో ప్రచారం వచ్చేట్లుగా తెలుగుదేశం వారు మేనేజ్‌ చేశారు. రద్దుతో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు నగదు రహిత లావాదేవీలపై సూచనలు చేసే పేరుతో ఐదుగురు ముఖ్య మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేయతలపెట్టినట్లు, దానికి చంద్రబాబు నాయుడిని సారధ్యం వహించమని కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్‌జైట్టీ ఫోన్లో కోరినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

     కేంద్రం నుంచి అలాంటి ఆఫరు వచ్చినపుడు మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు ఎగిరి గంతేసి వుండేవారు.అనుకున్నదొకటి అయ్యింది ఒక్కటీ బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్‌ పిట్ట అన్నట్లుగా తగిన సన్నాహం, పర్యవసానాలను వూహించకుండానే నరేంద్రమోడీ నోట్ల రద్దును ప్రకటించేశారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే సర్వేల లోగుట్టు గురించి చంద్రబాబుకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాంటపుడు నరేంద్రమోడీ తాను చేయించిన సర్వేలో నోట్ల రద్దుకు 93శాతం మద్దతు వుందని చెబితే నమ్మేంత అమాయకంగా చంద్రబాబు వుంటారా ? ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవాలని చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారు, ఆ విషయాలలో, అలాంటి రాజకీయ చాణక్యంలో సరిలేరు నీకెవ్వరూ సరసాల సుధాకరా అన్నట్లుగా చంద్రబాబు పండిపోయారు. కేంద్రం ప్రతిపాదించిన కమిటీకి సారధ్యం వహించే విషయాన్ని కాదన్నట్లుగా చంద్రబాబులో పరకాయ ప్రవేశం చేసే మీడియాలో వార్తలు వచ్చాయి. అవునంటే కాదనిలే అని ఆడవారి గురించి అనవసరంగా ఆడిపోసుకుంటారు గానీ చంద్రబాబు కాదు అన్నారంటే నరేంద్రమోడీ దగ్గర దేనికో టెండరు పెట్టి వుంటారని గుసగుసలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే నోట్ల రద్దు పర్యవసానాలపై తలుపు చెక్కతో కాకుండా తమలపాకుతో కొట్టినట్లుగా జనం కోసమైనా తన అసంతృప్తిని వెల్లడించారు. కేంద్రం వద్ద తన పలుకుబడిని వుపయోగించి రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో నోట్లు తెప్పిస్తా అన్నట్లు హడావుడి చేసి అవాక్కయ్యారు. ఇనుము బాగా కాలినపుడే దానిని కావలసిన విధంగా మలచుకొనేందుకు సుత్తి దెబ్బలు వేయాలి. నోట్ల రద్దు గురించి మాట్లాడటానికి పార్లమెంట్‌కు వెళ్ల కుండా ముఖంచాటేయటం ఒక బలహీనత. దానిని ప్రదర్శించిన మోడీని ఎలాంటి ప్రతిఫలం లేకుండా -అదేలెండి రాష్ట్ర అభివృద్ధికే సుమా- వూరికే ఆదుకుంటే ప్రయోజనం ఏముంటుంది ? అది పరిష్కారం అయితే ముఖ్యమంత్రుల కమిటీకి నేతృత్వం వహించటానికి చంద్రబాబు క్షణంలో సిద్దం అవుతారు.

    నోట్ల రద్దు పర్యవసానాల గురించి జనం అర్ధరాత్రుళ్లు ఎటిఎంల ముందు క్యూలు కడుతుంటే , బ్యాంకుల్లో తమ డబ్బును తాము తీసుకోవటానికి వీల్లేక జనం అవస్తలు పడుతుంటే వాటిని పరిష్కరించాల్సిన కేంద్రం దాని గురించి స్పష్టంగా చెప్పకుండా తక్షణమే నగదు రహిత బదిలీ గురించి సలహాలు చెప్పాలని ముఖ్య మంత్రుల కమిటీని ప్రతిపాదించటం అర్ధంలేని విషయం. నగదు రహిత లావాదేవీల గురించి ఎవరికీ అభ్యంతరం లేదు. దానికి తగిన పరిస్థితులు వున్నాయా లేవా అన్నదే సమస్య. దయ్యాలు తిరిగే సమయంలో ఒక నాయకుడికి ఒక ఆలోచన వస్తే తెల్లవారేసరికి దానిని అమలు జరపాలని పట్టుబడితే కుదరదు. అనేక అభివృద్ది చెందిన దేశాలలో ఇప్పటికీ నగదు లావాదేవీలు గణనీయంగా వున్నాయి. కొన్ని దేశాలలో ఇటీవలి కాలంలో అవి పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అందువలన తగిన సన్నాహాలు చేసుకొని చేయాల్సిన మార్పులను తొందరపడితే పెద్ద నోట్ల రద్దు పర్యవసానాలే ఏర్పడతాయి. ముందు ప్రభుత్వంతో మొదలు పెట్టి దశలవారీగా అమలు జరిపి అవినీతిని అరికడితే అంతకంటే కావాల్సింది ఏముంటుంది?

నీవు నేర్పిన విద్యయే కదా మోడీ !

     ఎప్పటి కెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరగటంలో కాంగ్రెస్‌-బిజెపి మధ్య ఎలాంటి తేడా లేదని తేలిపోయింది. ఓటింగ్‌కు అనుమతించే నిబంధన కింద చర్చకు అధికారపక్షం తిరస్కరించటంతో బుధవారం నాడు లోక్‌సభ పరిమితంగానే కార్యకలాపాలు చేపట్టి గురువారం నాటికి వాయిదా పడింది. గతంలో 2జి స్కామ్‌పై చర్చ సందర్భంగా ప్రధాని మన్మోహస్‌ సింగ్‌ సభకు హాజరై, ఓటింగ్‌కు అనుమతించే నిబంధనల ప్రకారం చర్చ జరగాలని బిజెపి పెద్దలు పట్టుపట్టారు. ఇప్పుడు వారు వీరయ్యారు. అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. పోయినోడే మంచోడనిపిస్తున్నారు. ఎలాగంటే అప్పుడు చర్చ అవినీతి గురించి కనుక కాంగ్రెస్‌ ప్రధాని సభకు రావటానికి సిగ్గు పడ్డారు, సమర్ధించుకోలేని దుస్థితిలో ఆపని చేశారు. ఇప్పుడు నరేంద్రమోడీ సభకు రావటానికి బిడియమెందుకు ? ఇదేమీ అవినీతి అంశం కాదే. నోట్ల రద్దును అవినీతి అని ఎవరూ అనటం లేదే ! ఓటింగ్‌ జరిగేందుకు వీలు కల్పించే నిబంధనల కింద చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. పార్లమెంట్‌లో పాలక కూటమికి పూర్తి మెజారిటీ వుంది. అయినా వ్యతిరేకిస్తున్నది. ఈ కారణంగా 16వ తేదీ నుంచి జరుగుతున్న వుభయ సభలలో ఈ అంశంపై ముందుకు సాగటం లేదు.ఒక వేళ ఓటింగ్‌ గీటింగ్‌ జరిగితే దాని వలన ప్రభుత్వం పడిపోయే పరిస్థితులేమీ లేవే ! నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఎవరైనా ఓటు చేస్తే ఎందుకు అలా చేశారో వారే చెప్పాల్సి వుంటుంది.

     తాను చేసిన నోట్ల రద్దుకు 93శాతం జనం మద్దతు పలికారని ప్రధానే స్వయంగా చెబుతున్నారు. వందకు రెండువందల మంది మద్దతు వుందనే వంది మాగధుల సంగతి సరేసరి. జనం మద్దతు లేకపోతే మహారాష్ట్ర మున్సిపల్‌ ఎన్నికలలో బిజెపి పెద్ద పార్టీగా ఎలా సీట్లు సంపాదించింది అని కొత్త పాయింటును దొరకబుచ్చుకున్నారు. జనం మద్దతు వుందా లేదా అన్నది తేలాలంటే ఆ సమస్య మీదే ఓటింగ్‌ జరగాలి. నోట్ల రద్దుతో తలెత్తిన జన ఇబ్బందులను ఎప్పటిలోగా తీరుస్తారు, ముందస్తు ఏర్పాట్లు లేకుండా ఇబ్బంది పెట్టే చర్య ఎందుకు తీసుకున్నారని కదా ప్రతిపక్షాలు అడుగుతోంది. ఏ పార్టీ అయినా నోట్ల రద్దును వ్యతిరేకించిందా ? లేదే ! దాని పర్యవసానాల గురించి అడగటానికి ప్రతిపక్షానికి అర్హత లేకపోతే పార్లమెంట్‌కు హాజరై ప్రభుత్వ వైఖరిని ప్రధాని నరేంద్రమోడీ వివరించాలి కదా ! పార్లమెంట్‌తో పని లేకుండా నరేంద్రమోడీ ప్రధాని కాలేదు, ఆయన లోక్‌సభా నాయకుడు. ప్రతిపక్షం చర్చకు అంగీకరిస్తే ప్రధాని సభకు వస్తారు అని పాలకకూటమి వాదిస్తోంది. ప్రధాని రాక నెపంతో పార్లమెంట్‌ను జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షానికి అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వాలి ? జనం సొమ్మును ఎందుకు వృధా చేయాలి? యాభై రోజులలో అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయని, ధరలు తగ్గుతాయని అనటం తప్ప నిర్ధిష్టంగా ఏదీ చెప్పటం లేదు. బంగారం ధరలు తగ్గాయి, జనం దానితో కడుపు నింపుకోలేరు కదా ! కడుపు నింపే పప్పుల ధరలు పెరిగాయి. అలాంటపుడు పాలకులు చెప్పే మాటలను జనం ఎలా నమ్మాలి ?

అత్తమీది కోపం దుత్తమీద చూపినట్లు

       అత్తమీద కోపం దుత్త మీద చూపినట్లు ( ఇది మహిళలను కించపరచటంగా భావించవద్దని మనవి ) చంద్రబాబు నాయుడు పెద్ద నోట్ల రద్దు ఇబ్బందులకు బ్యాంకర్లపై నిందమోపి తన పరిధిని అతిక్రమించారు. మధ్యలో వారేమి చేస్తారు. ఒక చెక్కు తీసుకొని ఒక రోజు బ్యాంకుకు వెళ్లి వుంటే సిబ్బంది ఎంత వత్తిడితో గత కొద్ది రోజులుగా పని చేస్తున్నారో చంద్రబాబుకు తెలిసి వుండేది. రిజర్వుబ్యాంకు నోట్లు పంపితే కదా పంపిణీ చేసేది. తెలుగు నేలలో కొన్ని మీడియా సంస్ధలు ఒక కొత్త లాజిక్‌ను తయారు చేశాయి. అదేమంటే తెలుగుదేశం అధికారంలో వున్నపుడు తమకు మంచివి అనిపించిన అంశాలను చంద్రబాబు ఖాతాలో జమ చేయటం, వైఫల్యాలన్నింటికి అధికారులను బాధ్యులుగా చేసి వారి ఖాతాలో వేయటం. నోట్ల రద్దు పర్యవసానాలకు నరేంద్రమోడీ నిర్వాకాన్ని ఇంతవరకు ఒక్కసారి కూడా సానుకూలంగా కూడా విమర్శించలేదు. బ్యాంకర్లపై నిందలు మోపి, వారిపై వత్తిడి పెంచి ముఖ్యమంత్రి సాధించేదేమీ వుండదని గ్రహించటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నోట్ల రద్దు పర్యవసానాలపై నిరసన విఫలమైందా ? సఫలమైందా ?

28 Monday Nov 2016

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Black Economy in India, black money, Demonetisation, Demonetisation standoff, Narendra Modi, opposition protest on demonetisation, protest on demonetisation

కేరళ హర్తాళ్ దృశ్యమ్

ఎం కోటేశ్వరరావు

    పెద్ద కరెన్సీ నోట్ల రద్దు సందర్భంగా పౌరుల మీద రుద్దిన ఇబ్బందులకు నిరసనగా అనేక పార్టీలు విడివిడిగా ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం నాడు (నవంబరు 28న) దేశ వ్యాపితంగా వచ్చిన స్పందన గురించి రకరకాల వార్తలు, వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. అది ఏ రూపంలో జరిగింది ? జయప్రదమైందా విఫలమైందా అన్న లెక్కలు వేయబోవటం లేదు. జయప్రదమైంది అంటే దాని అర్ధం బిజెపి చిత్రిస్తున్నట్లు నిరసనకు మద్దతు ఇచ్చిన వారందరూ నల్లధనాన్ని, అవినీతిని సమర్ధించేవారు కాదు. విఫలమైంది అంటే ముందు చూపులేకుండా, అనాలోచితంగా నరేంద్రమోడీ చేసిన పిచ్చిపనిని ఆందరూ ఆమోదించినట్లూ కాదు. నోట్ల రద్దుతో తలెత్తిన సమస్యను పక్కదారి పట్టించేందుకు గత కొద్ది రోజులుగా నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు వంటి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాణీగారి ప్రతిపక్షం, రాణీగారీ అనుకూల పక్షాల మాదిరి వ్యవహరిస్తున్న మీడియా సంస్ధలు, వాటిలో పనిచేసే షార్ట్‌ హాండ్‌ జర్నలిస్టులు ఈ సమస్యపై కూడా తమ పాత్రలను చక్కగా పోషిస్తున్నారు.

   గత ఇరవై రోజులుగా దేశ విదేశాల విశ్లేషకుల నుంచి వెలువడుతున్న వ్యాఖ్యలు, సమాచారం ప్రకారం నోట్ల రద్దు వలన నల్లధనం రద్దు పెద్ద ప్రహసనంగా మారనున్నట్లు కేంద్రంలోని పెద్దలు గ్రహిస్తున్న కారణంగానే దానినొక రాజకీయ అంశంగా ప్రతిపక్షాలపై దాడి చేసేందుకు, నగదు రహిత ఆర్ధిక లావాదేవీల పెంపుదల ప్రచార అంశంగా మార్చి వేస్తున్నారు. పార్లమెంట్‌లో ఎంత రచ్చ జరిగినా బయట తప్ప అక్కడ మాట్లేడేందుకు నరేంద్రమోడీ ఇప్పటికీ విముఖంగానే వున్నారు. అంటే అసలు సమస్య నుంచి జనం దృష్టిని వేరే వివాదంపైపు మార్చేందుకు చూస్తున్నట్లుగానే భావించాలి. నోట్ల రద్దును స్వాతంత్య్రానంతర తొలి విప్లవాత్మక చర్య అన్నంత గొప్పగా చెప్పుకుంటున్న నరేంద్రమోడీ దాని గురించి మాట్లాడటానికి, చర్చించటానికి పార్లమెంట్‌కు హాజరు కాకపోవటమే పెద్ద వైఫల్యం. ఎంతకాలం మౌనంగా వుంటారు, ఎంతకాలం తప్పించుకుంటారు ? గతంలో ఏదైనా ఒక అంశంపై పాలకపార్టీని నిలదీయాలంటే భిన్న ధృవాలుగా వున్న పార్టీలు సైతం పార్లమెంట్‌లో సమన్వయం చేసుకొనేవి. అలాంటిది ఇప్పుడు పార్లమెంట్‌లో ఎవరికి వారు తమ అభిప్రాయాలు వెల్లడించటమే కాదు, నోట్ల సమస్యపై వెలుపల కూడా ఒకే రోజు వివిధ రూపాలలో విడివిడిగా ఆందోళనకు పిలుపు ఇవ్వటం బహుశా ఇదే మొదటి సారి అని చెప్పవచ్చు. నోరు వుంది కదా, మీడియాలో ఎక్కడ లేని ప్రచారం దొరుకుతోంది కదా అని పాలకపార్టీ నేతలు సంబర పడవచ్చు. ఎందుకైనా మంచిది, భవిష్యత్‌లో ఎటుబోయి ఎటువస్తుందో ఒక అవకాశం అట్టిపెట్టుకుందామని చంద్రబాబు నాయుడి వంటి వారు ఒకవైపు మంచిదని చెబుతూనే మరోవైపు అసంతృప్తి గళం వినిపించటం మామూలు విషయం కాదు.

    సమస్య తీవ్రత కారణంగా సామాన్యులే కాదు చివరికి ఆర్ధిక మంత్రి కుటుంబం కూడా ఎలా ఇబ్బంది పడుతుందో చూడండి అని నమ్మించేందుకు వండి వార్చిన కట్టుకధలలో భాగంగా కొన్ని పత్రికలలో ఒక వార్త వచ్చింది. ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ గారు ఒక వంద మందికి విందు ఏర్పాటు చేయమని తన సతీమణికి చెప్పారట. తీరా ఆమె తన, భర్త ఖాతాల నుంచి 24వేల చొప్పున తీసుకున్న డబ్బుతో 50 మందికి మాత్రమే ఏర్పాటు చేయవచ్చని చెప్పారట. సరే పెద్ద వారు అంత ఖరీదైన విందులు ఇస్తారు వదిలేద్దాం. నరేంద్రమోడీ, చంద్రబాబు గారు నగదుతో పని లేకుండా అంతా కార్డులతో ఎంత సులభంగా నడిపించవచ్చో జనానికి చెబుతున్నారు. కేంద్రమంత్రి కుటుంబం వంద మంది విందుకు సరిపడా అవసరమైన ఖర్చులకు నగదు లేక ఇబ్బంది పడ్డారంటే వారికి కూడా అలాంటి కార్డులు లేనట్లే కదా ? ఒక వేళ వుంటే ఇలాంటి కట్టుకధలు ఎందుకు పుట్టినట్లు ?

    మరొక కధ. ఇది స్వయంగా నరేంద్రమోడీ చెప్పిన పిట్ట కధ. తాను టీ అమ్మిన సమయంలో పేదలు స్ట్రాంగ్‌ టీ అడుగుతుండేవారట. అలాగే ఇప్పడు నల్లధనంపై గట్టి చర్య తీసుకున్నా అన్నారు. ఒకే. ఆయన టీ అమ్మినట్లు చెబుతున్న ప్రాంతాలు రైల్వే స్టేషన్‌, బస్టాండ్లలో అమాయకులు తప్ప రోజూ టీ తాగే వారు ఎవరైనా స్ట్రాంగ్‌ టీ అడుగుతారా ? అలాంటి చోట్ల స్ట్రాంగ్‌ టీ దొరకటం ఎంత నిజమో పెద్ద నోట్ల రద్దుతో గట్టి చర్య కూడా అంతే నిజం !

   సాంప్రదాయక మీడియా, సామాజిక మీడియాలో అనేక మంది ఈ నిరసనను భారత బంద్‌ పిలుపుగా వర్ణించారు. బంద్‌లు జరపకూడదని, కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కూడా 1997లో సమర్ధించిన తరువాత ఏ పార్టీ కూడా బంద్‌ పిలుపులు ఇవ్వటం లేదు. అయితే తరువాత మరొక కేసు సందర్భంగా బంద్‌లు జరపటం ప్రజాస్వామ్య బద్దమే అని అదే కోర్టు 2009లో చెప్పిందనుకోండి. సోమవారం నాడు స్ధానిక పరిస్థితులను బట్టి వివిధ రూపాలలో నిరసన తెలపమని వామపక్షాలు పిలుపు ఇచ్చాయి.http://cpim.org/pressbriefs/observe-november-28-all-india-protest-day ఈ లింక్‌లో సిపిఎం అధికారిక ప్రకటన వుంది. దానిలో ఎక్కడా బంద్‌ అన్న పదం లేదు.

    ఇక నిరసన రూపం గురించి పాక్షికం, విఫలం, తీవ్ర అంతరాయం ఇలా రకరకాలుగా వర్ణించటాన్ని చూడవచ్చు. తొంభై బస్‌లు ఆగిపోయి ప్రయాణీకులు లేకుండా పంతానికి పది తిప్పినా, రోజంతా మూసి సాయంత్రం కొద్ది సేపు దుకాణాలు తెరిచినా పాక్షికం అని చిత్రించ వచ్చు. స్వతంత్ర భారత చరిత్రలో అనేక బంద్‌లు, నిరసన కార్యక్రమాలు జరిగాయి. అన్ని నిరసనలలోనూ అందరికీ సంబంధించిన సమస్యలు ఎప్పుడూ వుండవు. నోట్ల రద్దు అందుకు మినహాయింపు. సామాన్యుడైనా, ముకేష్‌ అంబానీ అయినా రోడ్డు మీదకు వచ్చి ఒక చాయ్‌ తాగాలంటే స్వయంగా లేదా డ్రైవర్‌ ద్వారా అయినా డబ్చిచ్చి తాగాలే తప్ప చెక్కు లేదా కార్డు గీక్కో మంటే కుదరదు. అందువలన ఇది అందరికీ సంబంధించిన సమస్య కనుక దీనికి ఒక ప్రత్యేకత వుంది. చిత్రం ఏమంటే తాను పేదలకు టీ అమ్మానని చెప్పిన మోడీ ఆ పేదలు టీ డబ్బులను కార్డులు, చెక్కుల రూపంలో ఇవ్వలేరని అర్దం చేసుకోలేకపోయారు. అందువలన నిజంగా అమ్మారా అని ఎవరైనా సందేహించే ఆస్కారం కూడా వుంది.

   నోట్ల రద్దు నల్లధనం రద్దుకు అని చెప్పారు. తీరా ఇప్పుడు పెద్ద లందరూ అసలు నోట్లతో పని లేకుండా మీ చేతిలో ఆండ్రాయిడ్‌ ఫోనుంటే చాలు, దాని మీద మీటలు నొక్కటం నేర్చుకుంటే అంతా అయి పోతుందని వూదర గొడుతున్నారు. నోట్ల రద్దును వేల కోట్ల సంపదలున్న పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు సమర్ధిస్తూ ప్రకటనలు చేయటాన్ని చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

   ఒకటి. నోట్ల రద్దు మరుసటి రోజు నుంచి జరిగిన పరిణామాలను చూస్తే డబ్బుతో పని లేకుండా కార్డులు గీకి వస్తువులు అమ్మే చోట్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి, డబ్బుతీసుకొని అమ్మే దుకాణాలలో తగ్గాయి. అంటే పెద్ద దుకాణాల వారు ఈ నోట్ల రద్దు వెనుక చక్రం తీప్పారా ? కారణం ఏదైనా తనకు కూడా అలాంటి కార్డులు గీకే హెరిటేజ్‌ దుకాణాలు వున్నాయి కనుక ముందు చూపుతో పెద్ద నోట్లు రద్దు చేయాలని అందరి కంటే ముందే కేంద్రానికి లేఖ రాశారా ? చంద్రబాబు నాయుడు కార్డుల ద్వారా లావాదేవీలు జరిపించేందుకు నాలుగు కమిటీలను కూడా వేశామని ప్రకటించారు. మంచిదే. త్వరలో కార్డులు కూడా ఇప్పిస్తారు. ఫోన్లు కూడా ఇప్పిస్తామంటున్నారు కనుక సందేహం లేదు. ( వుద్యోగాలకు బదులు ఫోన్లు, గీకే కార్డులు కావాలని జనాన్ని తిప్పించుకోవచ్చు ) అవి వచ్చిన తరువాత ఏ రోజు పని చేస్తే వచ్చిన ఆరోజు కూలి డబ్బులతో వస్తువులను కొనుగోలు చేసే వారు పల్లె టూళ్ల నుంచి సాయంత్రానికి బ్యాంకులున్న పెద్ద గ్రామాలు లేదా పట్టణాలకు వెళ్లి తమ కూలి డబ్బులను బ్యాంకుల్లో వేయాలి. ఆ సమయానికి బ్యాంకులు మూసివేస్తారు కనుక ఆ రాత్రికి అక్కడ వుండి మరుసటి రోజు వుదయం లేదా వేరే వారికి ఇచ్చి తమ ఖాతాలలో వేయించుకొని మరుసటి రోజు సాయంత్రానికి కార్డుపై సరకులు కొనుక్కోవాలి. ప్రతి రోజు కూలి డబ్బులను అలానే చేయాల్సి వుంటుంది. లేదా కులానికొక కార్పొరేషన్‌ పెట్టినట్లుగా బ్యాంకులు కూడా పెట్టించి వాటి శాఖలను ప్రతి వూరిలో లేదా ఏ కులపు వారికి ఆ కులవీధులలో ఏర్పాటు చేసి అక్కడే వేయించవచ్చు.

   రెండు. బ్యాంకుల వద్దకు చలామణిలో వున్న సొమ్ము పెద్ద మొత్తంలో చేరింది. వెంటనే అనేక బ్యాంకులు తమ వద్ద సొమ్ము దాచుకున్నవారి డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేటను తగ్గించేశారు. అంటే ఆ మేరకు సుజనా చౌదరి, రాజగోపాల్‌ వంటి పెద్దల కుటుంబాల పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు ఇచ్చే రుణాల రేట్లు కూడా తగ్గిపోతాయి. గత రెండున్నర సంవత్సరాలుగా ఇలాంటి కంపెనీలకు వడ్డీ రేట్లు తగ్గించాలని సుబ్రమణ్యస్వామి వంటి వారు వారందరూ పని గట్టుకొని రఘురామ్‌ రాజన్‌కు రెండోసారి అవకాశం ఇవ్వకుండా వుర్జిత్‌ పటేల్‌ను తెచ్చి పెట్టుకోవటం, ఆయన ఆధ్వర్యంలో పెద్ద నోట్ల రద్దు వెనుక పెద్దల హస్తం కూడా వుందా ?

   మూడు. బ్యాంకులలో దోపిడీలు జరుగుతున్నాయని ఎవరైనా బ్యాంకులను మూసి వేస్తారా ? ఎలుకలున్నాయని ఇంటినే తగుల పెట్టుకుంటారా ? రొట్టెను ముక్కలుగా కోయటానికి చాకు బదులు పెద్ద కత్తులను వాడతామా ? పెద్ద సుత్తులతో బాదుతామా ? నరేంద్రమోడీ సర్కార్‌ అదే చేసింది. అసలు మన దేశంలో పాకిస్థాన్‌ లేదా మరొక దేశం నుంచి గానీ వస్తున్న లేదా మన దేశంలో మేకిన్‌ ఇండియా ‘ముద్రణ పరిశ్రమల’ నుంచి వస్తున్న కోయంబత్తూరు నోట్లుగా పిలిచే దొంగ నోట్లు ఎన్ని వున్నాయి? నల్లధనం ఎంత?

    నల్లధనం ఎంత అనే ప్రశ్నకు ప్రభుత్వం వద్ద కూడా కచ్చితమైన సమాధానం లేదు. రెండవది నల్లధనం మొత్తం కూడా నగదు రూపంలో దొంగ నిల్వలుగా లేదు.అధిక భాగం నల్లధనం స్విట్జర్లాండ్‌, పనామా వంటి పన్నులు లేని ప్రాంతాలకు తరలిపోయింది. అక్కడి నుంచి కేవలం తపాల పెట్టె చిరునామా లేదా సూట్‌కేసు కంపెనీల పేరుతో వున్న వాటాల రూపంలో, రియలెస్టేట్‌, బంగారం తదితర రూపాలలో ప్రపంచమంతటికీ పోతోంది. అలాంటి చోట్ల, వివిధ రూపాలలో డబ్బు దాచుకున్న పెద్దలందరూ మోడీ చర్య మంచిదేనని పొగడటమే విషాదం. వారిని వదలి జనానికి ఇబ్బందులు కలుగుతున్నాయని, వాటిని పరిష్కరించాలని కోరుతున్న, విమర్శిస్తున్నవారిని నల్లధనులను బలపరిచేవారిగా బిజెపి, దాని మిత్రపక్షాలు చిత్రిస్తున్నాయి. మన దేశంలోకి విదేశీ పెట్టుబడుల రూపంలో వస్తున్న మొత్తాలలో కూడా నల్లధనం వుంది. ఎంత వంతే అంత ఎర్రతివాచీ పరచి ఆహ్వానించటం తప్ప వాటి మంచి చెడ్డలను కనుగొనేందుకు పాలకులు ప్రయత్నించటం లేదు.

    ఒక గీత పెద్దదా చిన్నదా పెద్దదా అని చెప్పటానికి మరో గీత అవసరం. అలాగే నల్లధనం సమస్య కూడా. షిండర్‌ అంచనా ప్రకారం ఖండాలవారీగా లాటిన్‌ అమెరికా, ఆఫ్రికాలలో నల్లధనం 41-44శాతం మధ్య వున్నది.ఆసియాలో అది 28-30శాతం. అధికారికంగా ప్రకటించిన జిడిపి లెక్కల ప్రకారం 96 అభివృద్ధి చెందుతున్న దేశాల సగటు 38.7శాతం. అదే అంచనా ప్రకారం మన దేశంలో 23-26శాతం మధ్య వుంది. మన దేశానికి వచ్చే విదేశీ పెట్టుబడులలో 35శాతం మారిషస్‌ నుంచి 14శాతం సింగపూర్‌ కంపెనీల పేరుతో వస్తోంది. దీనిలో ఎక్కువ భాగం మన దేశం నుంచి తరలిన నల్లధనమే అని వేరే చెప్పనవసరం లేదు. చైనాకు ఒక్క హాంకాంగ్‌ నుంచే 73శాతం వస్తోంది. అది చైనా నుంచి తరలి వెళ్లిన నల్లధనం అనుకోవచ్చు లేదా హాంకాంగ్‌లో విదేశీయులు దాచుకున్నది కావచ్చు.

   ఇక నకిలీ నోట్ల విషయానికి వస్తే ఇది ప్రపంచవ్యాపిత సమస్య. అమెరికా డాలర్లనే పెద్ద ఎత్తున ముద్రిస్తున్నారు. అయినా డాలర్లను అమెరికా రద్దు చేయలేదు. మన దేశంలో చలామణిలో వున్న నోట్ల మొత్తం 16లక్షల కోట్లు. వాటిలో నకిలీ నోట్లు 400 కోట్లు. అంటే 0.03శాతం. అనేక దేశాలలో వాటి నివారణకు నిరంతరం చర్యలు తీసుకుంటూనే వుంటారు.అనుమానం వచ్చిన సిరీస్‌ నోట్ల వుపసంహరణ వాటిలో ఒకటి.మన దేశంలో కొద్ది నెలల క్రితం ఐదువందల నోట్లపై ముద్రించిన సంవత్సరం వుందా లేదా అని చూసుకోమని జనాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా తెచ్చిన రెండువేలు, ఐదు వందల నోట్లకు సైతం నకిలీలను తయారు చేయటం పెద్ద కష్టమేమీ కాదు. వాటిపై నిరంతర నిఘాతప్ప ఇప్పుడు చేసిన మాదిరి చర్యలు కాదు.

    సోమవారం వారం నాటి నిరసన సమర్ధనీయమా, కాదా అన్న విషయాన్ని పక్కన పెడితే నోట్ల రద్దు చేసిన నాడు వున్న మద్దతు తరువాత క్రమంగా తగ్గిపోయిందన్నది వాస్తవం. ఒక వైపు మోడీని సమర్ధిస్తూనే చేసిన పని బాగాలేదని విమర్శించేవారి సంఖ్య పెరిగింది. ప్రతిపక్షాల విమర్శలకంటే సామాన్యుల్లో వచ్చిన విమర్శనాత్మక స్పందనే బిజెపి వారిని భయపెడుతోంది. దాన్ని దాచుకొనేందుకు నానా పాట్లు పడుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చంద్రబాబుకు నోట్ల రద్దు ‘సంక్షోభ ‘ సెగ

24 Thursday Nov 2016

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

Chandrbabu, Demonetisation

ఎం కోటేశ్వరరావు

    పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయాలంటూ ముందుగానే ప్రధానికి లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడి ఆ చర్యతో తలెత్తిన సంక్షోభ సెగ తగిలింది.ఈనెల 20న సమాచార శాఖ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో ఇన్ని రోజులైనా నోట్ల రద్దుతో తలెత్తిన సమస్య పరిష్కారం కాకపోవటం పట్ల తనకే అసహనం కలుగుతోందంటూ వ్యాఖ్యానించారు. ఒక సమస్య పరిష్కారం కాకపోవటం తన రాజకీయ జీవితంలో ఇదే మొదటి సారని, తుపాన్ల తీవ్రత వలన తలెత్తిన నష్టాలను ఎనిమిది రోజుల్లోనే అధిగమించామని, గోదావరి పుష్కరాలలో మొదటి రోజు ఇబ్బంది వచ్చినా తరువాత 14 రోజులు సమర్ధవంతంగా నిర్వహించామని, అలాంటిది పన్నెండు రోజులైనా నోట్ల రద్దు సమస్య అపరిష్కృతంగా వుండటం బాధాకరమని, తనకే అసహనం కలుగుతోందని అలాంటిది ప్రజల సహనాన్ని మెచ్చుకోవాలన్నారు. తన సహజ శైలిలో తన పరిధిలోని బ్యాంకర్లు ఎలా పనిచేయాలో కూడా చెప్పారనుకోండి.

    తాజాగా గురువారం నాడు నిర్వహించిన టెలికాన్ఫరెన్సు (24న) వుపన్యాసం గురించి సమాచార శాఖ విడుదల చేసిన ప్రకటనలో ప్రతిరోజు తాను నోట్ల రద్దు గురించి ఆర్‌బిఐ, ఎస్‌ఎల్‌బిసి, బ్యాంకర్లతో సమీక్ష జరుపుతున్నానని, దీనిని ఒక సంక్షోభంగా తీసుకుంటే అది అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గదని, సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకుంటే పరిష్కారం సులువు అవుతుందన్నారు. ప్రతి గ్రామం, వార్డుల్లోని కిరణాదుకాణాలలో కూడా పాస్‌ మిషన్‌ వుపయోగించి నగదు రహిత లావాదేవీలవైపు ప్రోత్సహించాలని కోరారు. మొబైల్‌ కరెన్సీ, ఆన్‌లైన్‌ లావాదేవీలు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వినియోగం ద్వారానే ప్రస్తుత సమస్యను అధిగమించగలమని చంద్రబాబు వివరించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d