• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: CHANDRABABU

జనవాదం ! మనువాదం !! అవకాశవాదం !!!

10 Sunday Apr 2016

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, communist, Congress, CPI(M), K CHANDRA SEKHRA RAO, manuvadam, Narendra Modi, opportunism, pro people, RSS, tdp, trs

గద్దె నెక్కిన తరువాత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు పని కంటే మాట్లాడటం ఎక్కువ చేసి వుండవచ్చు. నరేంద్రమోడీ విదేశీ పర్యటనలు, జన్‌కీ బాత్‌తో సంబంధం లేని మన్‌కీ బాత్‌ తప్ప పనీ, మాట్లాడటం రెండూ ఆపి వుండవచ్చు.

   ఎం కోటేశ్వరరావు

      అటు కేంద్రంలో ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు కొలువు దీరి రెండు సంవత్సరాలు కావస్తోంది. వచ్చే నెలలో ద్వితీయ వార్షికోత్సవాలు జరుపుకోబోతున్నాయి.ఈ రెండేళ్లలో వారు చేసిందేమిటో తెలియదు గానీ వసంతం రా ముందే కూసిన కోకిల మాదిరి వచ్చే ఎన్నికల రావాలు అక్కడక్కడా అప్పుడప్పుడు వినిపిస్తున్నారు. దీపం వుండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్లుగా ఫిరాయింపుదారులు కూడా జాగ్రత్తలు పడుతున్నారు. మూడు ప్రభుత్వాలకు ముగ్గురు భిన్న పార్టీల వారు నేతృత్వం వహిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అన్నట్లుగా మొత్తం మీద ఏ ఒక్కరూ తాము ఓటర్లకు చేసిన బాసలు మినహా మిగతా అంశాలపైనే, (అవి ఎవరికి లబ్ది చేకూర్చేవి అన్నది వేరే విషయం ) కేంద్రీకరిస్తున్నారు. ఇదంతా ముందే కూడ బలుక్కున్నారా లేక అధికారానికి వచ్చాక సమన్వయం చేసుకుంటున్నారా,లేక ముగ్గురూ ఒకతానులో ముక్కలేనా అంటే ఎవరికి వారు తమకు తాము అన్వయించుకోవచ్చు. ఫిరాయింపుదారులు కూడా పార్టీలతో నిమిత్తం లేకుండా నియోజక అభివృద్ధి కోసమే తాము పార్టీలు మారుతున్నట్లు ఒకే మాట చెబుతున్నారు. అంతిమ ఫలితం, మనకు కనిపిస్తున్నదే ముఖ్యం. మూడు పక్షాలకూ సంపూర్ణ మెజారిటీ వుంది, అన్నింటికీ మించి ఏ పార్టీలోనూ తిరుగుబాటు శక్తులూ, వున్నవారికి అంత సీనూ, శక్తీ లేదు. ఎందుకంటే అనేక అనుభవాల తరువాత నీకది, నాకిది అనే సర్దుబాటు మనస్థత్వం బాగా వంట బట్టించుకున్నారు గనుక ఎవరూ తెగించి కూర్చున్న వారిని కూలదోసేందుకు గద్దెల కాళ్లు లాగటం లేదు. అందుకే పుష్పక విమానాల్లా ఎంత మంది వచ్చినా ఒకరికి ఖాళీ అన్నట్లు ఎన్ని పార్టీల నుంచి, ఎన్ని ముఠాల నుంచి ఎందరు వచ్చినా మరొకరికి ఖాళీ కనిపిస్తోంది.అక్షయ పాత్ర మాదిరి జనం సొమ్ము ఎంత తిన్నా తరగటం లేదు. అందుకే ముగ్గురు నేతలూ ప్రత్యర్ధి పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి తమకు ఎదురు లేకుండా చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నవారే. అధికారంలో తాము మాత్రమే వుండాలి, ప్రశ్నించే వారెవరూ వుండకూడదు అనేది తప్ప నైతిక సూత్రాలు, రాజ్యాంగంపట్ల గౌరవం, భవిష్యత్‌ తరాలు తమను ఎలా భావిస్తాయి అనే అంశాన్ని ఎవరూ ఖాతరు చేయటం లేదు. ఇలా అనేక అంశాల విషయంలో వారి వ్యవహారశైలిలో ఏకీభావం కనిపిస్తోంది.

    గద్దె నెక్కిన తరువాత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు పని కంటే మాట్లాడటం ఎక్కువ చేసి వుండవచ్చు. నరేంద్రమోడీ విదేశీ పర్యటనలు, జన్‌కీ బాత్‌తో సంబంధం లేని మన్‌కీ బాత్‌ తప్ప పనీ, మాట్లాడటం రెండూ ఆపి వుండవచ్చు. మోడీకి, బిజెపికి, ఇతర అనుబంధ సంఘాల వారికీ మార్గదర్శనం చేసే ఆర్‌ఎస్‌ఎస్‌ పరివార నేతల మాటలు లేదా విధానాలను వెల్లడించే అనేక ప్రకటనలు పెరిగి తమ నిజమైన ఎజెండాను ముందుకు తెచ్చి వుండవచ్చు గానీ కాలం ఆగలేదు. మరికొద్ది వారాలలో ముగ్గురు నేతలూ రెండవ వార్షికోత్సవం జరుపుకోవటానికి, వెంకయ్య నాయుడి వంటి వందిమాగధుల స్తోత్ర పారాయణాలు వినటానికి, విజయాల గురించి చెప్పుకోవటానికి సిద్ధం అవుతున్నారు.

     ఈరెండు సంవత్సరాల కాలంలో జనానికి దేశంలో అసలేం జరుగుతోంది అన్నది పూర్తిగా తెలియటం లేదు అనే అభిప్రాయం రోజు రోజుకూ బలపడుతోంది. ఎంత వరకు నిజమో ఎవరికి వారు తమ అనుభవంతో తేల్చుకోవాలి. ఆవు,ఎద్దులు, గొడ్డు మాంస రాజకీయాలు, ఫిరాయింపులు, రాష్ట్రపతి పాలనల మొదలు తాజాగా దేశభక్తులా కాదా అనటానికి భారతమాతాకి జై అన్నారా లేదా జాతీయ గీతంగా జన గణమన కంటే వందే మాతరం గొప్పది అన్న ప్రకటనల వంటి చరిత్ర చెత్తబుట్టలో వేసిన వాటిని పైకి తీసి సంఘపరివార్‌ తన అజెండాగా నడిపిస్తోంది. తొలుత వివాదాస్పద అంశాలపై వ్యాఖ్యానించటం, తరువాత ప్రతిస్పందన తమకు వ్యతిరేకంగా వస్తే వాటిపై వివరణ పేరుతో తోకముడవటం. కానీ దాని అనుయాయులు మాత్రం మొదటి దానినే కొనసాగిస్తారు. ఇదంతా పిర్ర గిల్లి జోలపాడే చౌకబారు ఎత్తుగడలో భాగమే. భారత మాతాకీ జై నినాదం గురించే చూస్తే ఇది అర్ధంలేని వివాదమని అద్వానీ అంతటి కరడు గట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ వాదే కొట్టి పారవేశారు. ఆ తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి కూడా ఆ నినాదాన్ని ఎవరికి వారు అనాలి తప్ప ఎవరిమీదా బలవంతంగా రుద్ద కూడదు అని సుద్దులు చెప్పారు. ఇదంతా జరిగిన తరువాతే మరో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖ్‌ మహారాష్ట్ర ముఖ్య మంత్రి ఫడ్నవీస్‌ ఆ నినాదం చేయనివారు దేశం విడిచి వెళ్లాలని సెలవిచ్చారు. ఇక బాబాగా చెప్పుకొనే రామ్‌దేవ్‌ చట్టాలు వుండబట్టిగానీ లేకపోతే లక్షల మంది తలలు నరికేసేవాడినని నోరు పారవేసుకుంటాడు. అలా మాట్లాడటానికి ఆయనకు వాక్‌ స్వాతంత్య్రం వర్తించదా అని బిజెపి అధిపతి అమిత్‌ షా సమర్ధిస్తారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ వివాదాన్ని ప్రతిపక్ష పార్టీలే ప్రారంభించాయని బిజెపి అధికార ప్రతినిధి ఎంజె అక్బర్‌ పచ్చి అవాస్తవాన్ని చెప్పారు.మార్చినెల మూడవ తేదీన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంలో మాతృశక్తి అవార్డు ఇచ్చే కార్యక్రమంలో మాట్లాడిన ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ యువతరానికి భారత మాతాకు జై అని నినదించటం నేర్పాలని వ్యాఖ్యానించారు. ఆ తరువాత పది రోజులకు మజ్లిస్‌ నేత తాను అలా నినదించనని ఏం చేస్తారో చేసుకోండని రెచ్చగొట్టాడు. ఆ తరువాత అది ఎన్ని మలుపులు తిరుగుతున్నదీ చూస్తున్నాము. కమ్యూనిస్టులకు జనవాదం, మతశక్తులకు మనువాదం(మైనారిటీ మతశక్తులకు సైతం వాటి ఛాందసవాదాలు వాటికి ఎలాగూ వుంటాయి) పాలకవర్గ పార్టీలకు అవకాశవాదం తప్ప మరొకటి పట్టదు. నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా గురించి, బాబొస్తే జాబొస్తుందని తెలుగుదేశం, రాష్ట్రం విడిపోతే తెలంగాణా యువతకు వుపాధి పెరుగుతుందని టిఆర్‌ఎస్‌ ఏం చెప్పినా రంగుల పూసల్లో తెల్ల దారంలా ఒకటే . వివిధ పార్టీలు చెప్పిన అన్ని అంశాలనూ ఇక్కడ చర్చించటం సాధ్యం కాదు. అన్నం వుడికిందా లేదా అని చూడటానికి ఒక మెతుకు చూస్తే చాలన్నట్లు అనేక అంశాలతో ముడి పడి వున్న వుపాధి గురించి చూద్దాం.

    ఈమధ్య కాలంలో రాజకీయ పార్టీల ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్‌,టిడిపి, టిఆర్‌ఎస్‌ వంటి పాలక పార్టీల భాష, పదజాలంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.ప్రభుత్వాలు ఒక్కొక్క రంగం నుంచి క్రమంగా తమ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నాయి. వుదాహరణకు వుపాధి కల్పిస్తామని చెప్పటానికి బదులు వుపాధిని చూపుతామనే పదాలను వాడుతున్నాయి. వెంటనే బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటే యువతరంలో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో మన యువతకు నైపుణ్యం తక్కువగా వుందనే ప్రచారం మొదలు పెట్టారు. అందుకు గాను నైపుణ్య శిక్షణ, అప్రెంటిస్‌షిప్‌ అవకాశాలు కల్పిస్తామని ఎక్కువగా చెబుతున్నారు. ప్రభుత్వ రంగంలోని విద్యా సంస్ధలు వున్నత ప్రమాణాలకు పెట్టింది పేరు. అలాంటి వాటిని నిర్వీర్యం చేసింది ఎవరు ? వాటికి తగిన సిబ్బందిని నియమించకుండా, నిధులు ఇవ్వకుండా చేయటంతో పాటు ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించారు. ఆ విద్యా సంస్ధలలో ఎక్కడో ఒకటీ అరా తప్ప అత్యధిక భాగం కేవలం డిగ్రీలు అమ్ముకొనే వ్యాపార సంస్ధలు తప్ప మరొకటి కాదని తేలిపోయింది.చివరకు వైద్య సంస్ధలు కూడా అదేపని చేస్తున్నాయి. అవి ఇచ్చే డిగ్రీలను పట్టుకొని బయటకు వచ్చే వారికి కనీస పరిజ్ఞానం కూడా వుండటం లేదని వెల్లడైంది. మరోవైపు అలాంటి పరిస్థితిని సృష్టించిన వారే మన యువతలో నైపుణ్యం లేదని నిందలు వేస్తూ తాము శిక్షణ కల్పిస్తామంటూ తయారయ్యారు. ఏమిటీ నాటకం ? అది కూడా ప్రభుత్వ ఖర్చుతో అంటే పేరుకు యువతకు శిక్షణ ఆచరణలో ప్రయివేటు రంగానికి పరోక్షంగా ఆమేరకు ఖర్చు తగ్గించి లాభాలను పెంచటం తప్ప మరొకటి కాదు.

     ప్రధాని పదవిలో కూర్చున్న తరువాత నరేంద్రమోడీ వుపాధి కల్పన, నైపుణ్య అభివృద్ధికి పది అంశాలతో కూడిన ఒక పధకాన్ని ప్రకటించిన విషయం బిగ్గరగా వినిపిస్తున్న భారతమాతకు జై నినాదాల మధ్య జనానికి గుర్తు చేయటం అవసరం.ప్రధాని ఎక్కువ కాలం విదేశాల్లో ఎందుకు గడిపారంటే మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం తప్ప విహార యాత్రలు చేయటం లేదని బిజెపి పెద్దలు మండినపుడు జనం కామోసు అనుకున్నారు. తీరా చూస్తే రెండేళ్ల తరువాత ప్రధాని, కేంద్ర మంత్రుల , చంద్రబాబు నాయుడి వంటి ముఖ్య మంత్రుల విదేశీ ప్రయాణ ఖర్చులు కూడా దండగమారితనంగా తేలిపోయింది.

    తాము రాజకీయాలు, పాలన, ఆర్ధిక విషయాలలో ప్రపంచంలో భారత దేశ విస్వసనీయతను పునరుద్ధరించామని, ప్రపంచ రాడార్‌లో మన దేశం తిరిగి కనిపిస్తున్నదని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. మోడీ ప్రభుత్వం తొలి ఆరునెలల్లో 2.75లక్షల వుద్యోగాలు సృష్టించింది అని ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. అంతకు ముందు సంవత్సరం అదే కాలంలో కేవలం లక్షా ఇరవై వేల వుద్యోగాలు మాత్రమే గత ప్రభుత్వం సృష్టించింది. అంటే మోడీ 118శాతం అదనంగా సృష్టించటానికి కారణం 25 రంగాలలో మేకిన్‌ ఇండియా కార్యక్రమ శుభ ప్రారంభమని దానిలో పేర్కొన్నారు. ఆర్ధిక మంత్రిత్వశాఖ 2014-15 వార్షిక నివేదికలో 2022 నాటికి 50 కోట్ల మందికి నైపుణ్యం కలిగించటం అవసరమని పేర్కొన్నారు. ప్రయివేటు రంగ భాగస్వామ్యంతో 15 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని జాతీయ నైపుణ్య శిక్షణ అభివృద్ధి కార్పొరేషన్‌ లక్ష్యంగా పెట్టుకోగా గతేడాది జూన్‌ నాటికి 51లక్షల మందికి శిక్షణ ఇచ్చారని, వారిలో 15లక్షల మందికి వుపాధి దొరికినట్లు ఆ వార్త వివరించింది.ఈ శిక్షణా కార్యక్రమాలు ఎంత ప్రహసంగా నడుస్తున్నాయో, నిధులు దుర్వినియోగం ఏ స్థాయిలో వుందో అందరికీ తెలిసిందే. ప్రతిదానిలో కుంభకోణం, కుంభకోణం.

     గతేడాది ఏప్రిల్‌ 17వ తేదీన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రచురించిన వార్త ప్రకారం గత ఆర్ధిక సంవత్సరంలో ఎనిమిది కీలక రంగాలలో మూడవ త్రైమాసికంలో అంతకు ముందు మూడు త్రైమాసికాల కంటే వుద్యోగఅవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. 2014 అక్టోబరు-డిసెంబరు మాసాలలో కేవలం 1.17లక్షల వుద్యోగాలు రాగా అంతకు ముందు సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో 1.58, ఏప్రిల్‌-జూన్‌లో 1.82లక్షల వుద్యోగాలు వచ్చాయి. ఇలా అంకెలను పేర్కొంటూ పోతే ఆల్జీబ్రా మైండ్‌ గాబరా అని ఒకప్పుడు అనుకున్న విధంగా బుర్ర తిరిగి పోతుంది. అంకెలను ఎలా అయినా వినియోగించుకోవచ్చన్నది ఆరునెలల విజయ గాధ, రెండవది ఏడాది పాలన అసలు గాధ వెల్లడించింది. మా తాతలు నేతులు తాగారు కావాలంటే మా మూతులు వాసన చూడండి అని చెప్పుకుంటే కుదరదు. ఇప్పుడేంటి ? మాకేంటి అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలి? నరేంద్రమోడీ లేదా ఆయన భక్త బృందంగానీ ఏం చెబుతుందో తెలియదు.

      ఈ ఏడాది మార్చి 31వ తేదీన హిందూ పత్రిక ‘వుపాధి పెరుగుదల ఆరు సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది’ అనే శీర్షికతో వార్తను ప్రచురించింది.దాని సారాంశం ఇలా వుంది. కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ కార్మికులు ఎక్కువగా అవసరం వుండే ఎనిమిది కీలక రంగాలలో సేకరించిన సమాచారం ప్రకారం 2015 తొలి తొమ్మిది మాసాలలో కేవలం 1.55లక్షల నూతన వుద్యోగాలు మాత్రమే నికరంగా వచ్చాయి. ఇది ఆరు సంవత్సరాలలో కనిష్టం. ఇదే సమయాలలో 2013,14 సంవత్సరాలలో మూడు లక్షలకు పైగా వుద్యోగాలు వచ్చినట్లు కార్మికశాఖ సమాచారం తెలిపింది. ఇది ఆరోగ్యకరమైన సూచిక కాదని విశ్లేషకులు పేర్కొన్నారు. ‘ మన పారిశ్రామిక అభివృద్ధి తక్కువగా వుంది,వుత్పత్తి పెరిగినపుడు మాత్రమే వుపాధి వుంటుంది.కార్పొరేట్‌ రంగంలో పెద్ద ఎత్తున సిబ్బందిని క్రమబద్దీకరిస్తున్నారు(తగ్గించటానికి పెట్టిన ముద్దు పేరు).ప్రభుత్వం రంగం కూడా కార్మికులను నియమించటం లేదు. అభివృద్ధి ప్రధాన ఆశయం వుద్యోగ కల్పన. అంతిమంగా మనం అన్ని స్ధాయిలలో వుద్యోగాలను సృష్టించాలి. అదే జరగటం లేదు.’ అని కేర్‌ రేటింగ్‌ సంస్ధ ప్రధాన ఆర్ధికవేత్త మదన్‌ సబ్నవిస్‌ చెప్పారు.

    కేంద్ర కార్మిక శాఖ వుద్యోగకల్పన గురించి 2009 నుంచి ప్రతి మూడు మాసాలకు ఒకసారి సర్వే నిర్వహిస్తున్నది. వస్త్ర, తోళ్ల,లోహ, ఆటోమొబైల్‌, ఆభరణాలు, రవాణా, చేనేత, ఐటి రంగాలలో ప్రపంచ ఆర్ధిక సంక్షోభ ప్రభావం ఎలా పడింది అనే అధ్యయనం కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలలో ప్రతి ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు వివరాలు ఇలా వున్నాయి. 2009లో నికరంగా 2.49లక్షల వుద్యోగాలు పెరిగాయి.(2009 జనవరి-మార్చిలో 1.17, ఏప్రిల్‌-జూన్‌లో 1.31లక్షలు తగ్గగా జూలై-సెప్టెంబరులో 4.97లక్షలు పెరిగాయి. ఈ కాలంలో నికర పెరుగుదల 2.49లక్షలు) ఇదే విధంగా 2011లో 7.04లక్షలు, 2013లో 3.36లక్షలు, 2015లో 1.55లక్షల వుద్యోగాలు నికరంగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ అధికారికంగా వెల్లడించిన ఈ సమాచారంపై కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్‌ స్టాఫింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు రితుపర్ణ చక్రవర్తి దీని గురించి మాట్లాడుతూ ‘ స్టాఫింగ్‌ పరిశ్రమ ఆరోగ్యకరంగా 18-20శాతం పెరుగుతోంది.కార్మిక శాఖ విడుదల చేసిన సమాచారం వుద్యోగ పెరుగుదల గురించి సమగ్ర చిత్రాన్ని ఇవ్వటం లేదు.అనేక రంగాలను అది స్వీకరించలేదు’ అన్నారు. నరేంద్రమోడీని సంతృప్తి పరచటానికి ఇలా వ్యాఖ్యానిస్తే ఓకే. ఎనిమిది ప్రధాన రంగాలలోనే పరిస్థితి అలావుంటే మిగతా రంగాలలో గొప్పగా వుందని చెబుతుంటే నమ్మటానికి జనం చెవుల్లో పూలు పెట్టుకు లేరు. 2015లో కాంట్రాక్టు వుద్యోగుల నియామకం గణనీయంగా తగ్గినట్లు లేబర్‌ బ్యూరో పేర్కొన్నది. వుపాధి కల్పన లేదా కోల్పోయిన వుపాధి గురించి సమగ్ర సమాచారం సేకరించటం మన దేశంలో సాధ్యం కాదు.ఎందుకంటే అసలు అధికారికంగా నమోదు అన్నది సమగ్రం కాదు. ధోరణులు మాత్రమే మనకు తెలుస్తాయి. కేంద్ర కార్మిక శాఖ ప్రభుత్వ విభాగం కనుక వున్నంతలో దాని సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకోవటం తప్ప మరొక మార్గం లేదు

      వుపాధి కల్పన గురించి కొన్ని సందర్భాలలో ప్రధాని నరేంద్ర మోడీతో సహా ఇతరులు ఏం చెప్పారో చూడండి.’ కేవలం వాగ్దానాలు మాత్రమే అద్బుతాలను సృష్టించవు’ అని మోడీ పాలన ఇరవై నెలల తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగున బెంగలూరులో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా చెప్పారు. విదేశీయలు మన సరిహద్దులు దాటి పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌లో ప్రవేశించటం లేదన్నది టాటాతో సహా ప్రముఖ పారిశ్రామికవేత్తల అంతరంగం, బహిరంగం కూడా. ప్రపంచ పెట్టుబడిదారీ దేశాలలో ఆర్ధిక మాంద్యం 2008 నుంచి అనేక సమస్యలను ముందుకు తెస్తోంది. పెట్టుబడిదారులు తమకు ఎక్కడ అప్పనంగా లాభాలు వస్తాయో అక్కడికే పెట్టుబడులను తరలిస్తున్నారు. నరేంద్రమోడీ, చంద్రబాబు వంటి వారు జనం సొమ్ము ఖర్చు చేసి ఎన్ని విదేశీ పర్యటనలు చేసినా అయ్యగారి సంపాదన అమ్మగారి బుట్టలోలకులకు చాలటం లేదన్నట్లుగా పరిస్థితి తయారైంది.

    మన దేశంలో పెట్టుబడుల గురించి అధ్యయనం చేసే భారతీయ ఆర్ధిక పర్యవేక్షణ కేంద్రం( సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సిఎంఐఇ) కూర్చిన సమాచారం ఇంతవరకు ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. 2015 మూడవ త్రైమాసికంలో నూతన సామర్ధ్య కల్పనకు ప్రతిపాదనలు అంతకు ముందుతో పోల్చితే 74శాతం తగ్గిపోయాయి.కేవలం లక్ష కోట్లరూపాయల విలువగల 383 పధకాలు మాత్రమే ప్రకటించబడ్డాయి. ఇది అంతకు ముందు ఐదు త్రైమాసికాల కంటే కనిష్టం. అన్ని రంగాలలో తగ్గుదల కనిపిస్తోందని, కచ్చితంగా ఫలానా అంశాలు కారణమని అప్పుడే చెప్పలేమని సిఎంఐఇ పేర్కొన్నది.నిలిచిపోయిన పధకాల విలువ 10.8లక్షల కోట్ల రూపాయలు. మరి కొత్త ప్రతిపాదనల సంగతేమిటి ? నరేంద్రమోడీ విదేశీ పర్యటనలన్నీ విజయవంతమయ్యాయని అప్పుడు చెప్పారు.ఇప్పుడు వాటి అర్ధమేమిటి ?

    ఐటి రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల గురించి చంద్రబాబు నాయుడు, ఆయన ప్రచార మంత్రి పల్లె రఘునాధ రెడ్డి, ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్‌ తమ పలుకుబడిని వుపయోగించి అనేక ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. వస్తూత్పత్తి చేసే పరిశ్రమలు పెట్టటానికి, అవి వుత్పత్తి ప్రారంభం కావటానికి సమయం పడుతుంది. కానీ ఐటి కంపెనీలకు అలాంటి అవసరం లేదు. వుదయం కార్యాలయం ప్రారంభిస్తే సాయంత్రానికి వుత్పత్తి ప్రారంభించవచ్చు. అలాంటి మాజిక్‌ జరగటం లేదు. అన్నింటి కంటే అన్నింటి తాను అమెరికాలో కాలి నడకన తిరిగి హైదరాబాదులో ఐటి పరిశ్రమను అభివృద్ధి చేశానని చెప్పుకుంటారు చంద్రబాబు. తాజా సమాచారం ప్రకారం హైదరాబాదులో పదిశాతం కంటే తక్కువే ఐటి వుద్యోగులు వున్నారు. బెంగలూరు నాలుగో వంతు వుద్యోగాలను కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ స్ధానమెక్కడో వేరే చెప్పనవసరం లేదు. దేశంలో ఐటి రంగం 2015-16లో 12-14శాతం అభివృద్ధి వుంటుందని భావిస్తే అది 10-12 శాతంగా వుందని అంచనా.’ ప్రభుత్వం చేసిన ప్రకటనలు, మేము చూసిన ధోరణులను బట్టి ఒక వేగంతో దేశీయ విభాగం పెరుగుతుందని అంచనా వేశాము. అయితే వాటిలో ఎక్కువ భాగం ఆచరణలోకి రాలేదు. అవి ఎప్పుడు ఆచరణలోకి వస్తే అప్పుడు మనం పెద్ద ప్రభావాన్ని చూడవచ్చు ‘ అని నాస్కామ్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి విదేశీ పర్యటనల మోజు తగ్గిపోయినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే విమాన ఖర్చులకు కూడా సరిపడా ప్రయోజనం లేకపోతే జనానికి చెప్పుకొనేదేమీ వుండదు. బహుశా ఈ కారణంగానే ఆయన మంత్రులు కొత్త పల్లవి అందుకున్నారు. తమ ప్రభుత్వ ఖాదీ పధకాల కారణంగా 2016-17లో 70-80లక్షల వుద్యోగాలు లభిస్తాయని చిన్న, సన్న, మధ్యతరగతి పరిశ్రమల మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ చెబుతున్నారు. అంటే జనం చౌకగా దొరికే మిల్లు వస్త్రాల బదులు ఖరీదయిన ఖాదీ ధరిస్తారని అర్ధమా ? ఖాదీ వడికేందుకు సోలార్‌ రాట్నాలను ప్రవేశపెడితే ఖర్చు తగ్గుతుందని,లాభాలు వస్తాయని మంత్రిగారు చెబుతున్నారు. ‘ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞాపనలో ఏదో మాజిక్‌ వుంది. ఖాదీ పెరుగుదల రేటును చూస్తే గణనీయంగా పెరిగిందని’ ఖాదీగ్రామీణ పరిశ్రమల సంస్ధ సిఇఓ అరుణ్‌ కుమార్‌ చెబుతున్నారు. అది పిట్ట కధలా లేదూ !

     ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే బాబొస్తే జాబ్‌ అన్న నినాదం పెద్ద ప్రహసనంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్ధిక సర్వే నివేదిక 2014-15 ప్రకారం 2014 నవంబరు నాటికి 1742 భారీ, మెగా పరిశ్రమలు రు.78,860 కోట్ల పెట్టుబడితో వుత్పత్తిలోకి వచ్చి 4,21,222 మందికి వుపాధి కల్పించాయి.2014-15లో 15 పరిశ్రమలపై 1875 కోట్ల రూపాయలతో 6814 మందికి వుపాధి కల్పించారు.ఇది గాక 1,06,504 చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 11,65,102 మందికి 2014 మార్చి వరకు వుపాధి కల్పించాయి. వాటిపై పెట్టిన పెట్టుబడి 1,69,121 కోట్ల రూపాయలు.2014-15లో సెప్టెంబరు వరకు 2,263 కోట్లతో 25,175 మందికి వుపాధి కల్పించారు.

    చంద్రబాబు నాయుడు పూర్తి పాలన సాగించిన 2015-16 ప్రకారం రు.81,261 కోట్ల పెట్టుబడితో 1784 భారీ, మెగా పరిశ్రమలలో కల్పించిన వుపాధి 4,35,506 మందికి మాత్రమే. అంటే ఏడాది కాలంలో ప్రయివేటు రంగంలో సైతం అదనంగా కల్పించిన వుపాధి 14,384 మాత్రమే.ఈ మధ్య రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ వుద్యోగాల గురించి ఆశలు పెట్టుకున్నవారు వాటి బదులు వేరే చూసుకోవటం మంచిదని ఒక ప్రకటనలో పరోక్షంగా చెప్పారు. రాష్ట్రంలో మంజూరు చేసిన పోస్టుల సంఖ్య 6,97,621 కాగా వాటిలో 1,42,825 ఖాళీ వున్నట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదని పేర్కొన్నారు. మంజూరైన పోస్టులు 4,83,491కాగా ఖాళీలు 77,737 మాత్రమే అని తెలిపారు. వీటన్నింటినీ నేరుగా నింపటం జరగదని, ప్రమోషన్లు, ఇతర సేవల నుంచి బదిలీల ద్వారా నింపుతారని, అందువలన నేరుగా నింపేవి 20వేలకు అటూ ఇటూగా మాత్రమే వుంటాయని వెల్లడించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా నింపాల్సిన పోస్టుల గురించి సమీక్ష జరపాలనుకుంటున్నామని, స్వల్పకాలిక, దీర్ఘకాలిక అభివృద్ధికి అవసరమైన పోస్టులను మాత్రమే నింపాలని ప్రస్తుత ఆలోచనగా వుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర స్వంత ఆదాయంలో 55శాతం వుద్యోగుల వేతనాలకు పోతున్నదని, ప్రభుత్వ రంగంలోనే వుపాధి కల్పించటం పరిష్కారం కాదని స్పష్టం చేశారు. కానీ ఇదే మంత్రి నాయకత్వంలో 2014 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికాంశాలపై శ్వేత పత్రం విడుదల చేసింది. దానిలో వుద్యోగుల వేతనాలకు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో స్వంతాదాయంలో 58శాతం ఖర్చు కాగా మిగిలిన ఏపీలో అది 73 శాతానికి పెరుగుతుందని తెలిపారు. అందువలన అంకెలతో ఆడుకోవటంలో యనమల తన అనుభవన్నాంతా రంగరిస్తారనటంలో సందేహం ఏముంది?

    చివరిగా ఒక్క మాట. మన దేశంలో నూతన ఆర్ధిక విధానాలపేరుతో వినాశకర సంస్కరణలు ప్రారంభించి పాతికేళ్లు గడిచాయి. గతంలో కేంద్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన అశోక్‌ పార్ధ సారధి తాజాగా హిందూ పత్రికలో రాసిన వ్యాసంలో మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం జయప్రదం కావాలంటే 1991 దశకం తరువాత చేసిన నష్టాన్ని ముందుగా సరిచేయాలని నరేంద్రమోడీ సర్కార్‌కు సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన స్వదేశీ జాగరణ మంచ్‌ పైకి ఏమి చెప్పినా ఆచరణలో గతంలో వాజ్‌పేయి హయాంలో ప్రస్తుతం మోడీ ఏలుబడిలో అది విదేశీ ఆదరణ మంచ్‌గా మారిపోయింది. గత కాంగ్రెస్‌ పాలకులు విదేశీ ఐటి హార్డ్‌వేర్‌ పరిశ్రమలకు లబ్ది చేకూర్చేందుకు స్వదేశీ హార్డ్‌వేర్‌ పరిశ్రమను దెబ్బతీస్తూ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి ముసుగులో విదేశీ హార్డ్‌వేర్‌ వుత్పత్తులపై పన్నులను తగ్గించి దిగుమతులకు తలుపులు బార్లా తెరిచారు. ఫలితంగా 1990 దశకంలోనే మన తయారు చేయగలిగిన వాటిని ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్నాం. మన సాప్ట్‌ వేర్‌ పరిశ్రమ దిగుమతి చేసుకున్న హార్డ్‌ వేర్‌ను అప్పటికే మన దేశంలో తయారు చేయగలిగి వున్నామని పార్ధ సారధి పేర్కొన్నారు. మన రక్షణ, అణు ఇంధనం, అంతరిక్ష సంస్ధలు వాటిని వుపయోగించటమే గాక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతులు కూడా చేసినట్లు ఆయన గుర్తు చేశారు. నూతన విధానాలు మన పరిశ్రమలను ఎలా దెబ్బతీసిందీ, దిగుమతులపై ఎలా అధారపడుతున్నదీ ఆయన సోదాహరణంగా పేర్కొన్నారు. మేకిన్‌ ఇండియా ప్రధాని వినిపించుకుంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆనందం-విషాదం

16 Wednesday Mar 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

CHANDRABABU, Narendra Modi sarkar, NDA, special status to Andhra pradesh, Ycp, ycp jagan

ఢిల్లీలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లందనే నినాదంతో వునికిలోకి వచ్చిన పార్టీ అదే ఢిల్లీపై నోరు మెదపలేని స్థితిలో పడిందంటే నిజంగా ఎంత కష్ట కాలం వచ్చింది.బహుశా ఎన్‌టిరామారావు ఈ పరిస్థితిని వూహించి వుండరు.

ఎం కోటేశ్వరరావు

     ఆంధ్రప్రదేశ్‌ శాసన సభలో ప్రభుత్వం మీదా, శాసన సభాపతి మీదా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను చాకచక్యంగా తిప్పి కొట్టగలిగామని తెలుగుదేశం పార్టీలు శ్రేణులు చంకలు కొట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదూ ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా అరటి పండు వలిచి అరచేతిలో పెట్టినట్లుగా చెప్పటంతో తెలుగు తమ్ముళ్లలో ఆనందం ఆవిరై నీరు గారి పోతున్నారు. ప్రత్యేక హోదా లేదని ఎన్నిసార్లు చెప్పినా పదే పదే అడుగుతూ విసిగిస్తున్నారు అర్ధం కాదా మీకు ముందు బయటకు పొండి అన్న రీతిలో కేంద్ర మంత్రి అరుణ్‌ జెట్లీ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం, బిజెపి ఎంపీలతో మాట్లాడినట్లు తెలుగు దేశం పార్టీకి అనుకూలమైన పత్రికలోనే వార్తలు వచ్చాయి. హాస్యాస్పదం, విచారకరం ఏమంటే అది జరిగిన మరుసటి రోజే అలా మాట్లాడితే ఎలా దొరా మంచి మనసు చేసుకొని మా సంగతి చూడండి, మరొక మాట చెప్పండి అన్నట్లుగా విభజస సమయంలో తమకు ఇచ్చిన హామీలు అమలు జరపాలని అధికార తెలుగుదేశం పార్టీ బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కంద్రానికి మరోసారి విన్నవించుకుంది. ఢిల్లీలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లందనే నినాదంతో వునికిలోకి వచ్చిన పార్టీ అదే ఢిల్లీపై నోరు మెదపలేని స్ధితిలో పడిందంటే నిజంగా ఎంత కష్ట కాలం వచ్చింది.బహుశా ఎన్‌టిరామారావు ఈ పరిస్థితిని వూహించి వుండరు.

     ముందుగా ఆనందం గురించి చూద్దాం. ఒకసారి నీతి తప్పిన తరువాత ఎన్నిసార్లు తప్పినా ఒకటే అని తెలుగు దేశం పార్టీ గత రెండు రోజులలో రుజువు చేసింది. తొలిసారి పడితే సిగ్గు. ప్రతిసారీ పడితే అది ఎబ్బెట్టుగా వుంటుంది. కనుక అసలు తొలిసారే సిగ్గు పడనివారు దాని స్థానంలో పండుగ చేసుకోవటంలో ఆశ్చర్యం ఏముంది. గతంలో కాంగ్రెస్‌,బిజెపి ఇతర పార్టీలు చేసినా ఇప్పుడు తెలుగుదేశానికి అయినా అది వర్తిస్తుంది. కాకపోతే సందర్భం తెలుగుదేశం పార్టీ గనుక దాని గురించి ముచ్చటించుకోక తప్పదు. ఇతర పార్టీల అజెండా,గుర్తులపై ఎన్నికైన వారు పార్టీ మారాలనుకుంటే తాము ఎన్నికైన స్థానానికి రాజీనామా చేసి ఇష్టమొచ్చిన పార్టీలో చేరవచ్చు. చేర్చుకొనే వారికి కూడా అభ్యంతరం వుండనవసరం లేదు. ఆ నీతికి కట్టుబడి వుంటే అయినట్లే అని వారూ వీరు అనుకోవటం వలనే ఈ పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీలో చేరిన ఎనిమిది మంది వైసిపి సభ్యులను పార్టీలో చేర్చుకోవటమే రాజ్యాంగం, స్ఫూర్తికి కూడా విరుద్దం. వారిపై ఫిరాయింపు నిరోధక చట్టం వేటు పడకుండా వుండాలంటే అవిశ్వాస తీర్మానాలపై ఓటింగ్‌ సందర్బంగా వారు ఎన్నికైన పార్టీ విప్‌ జారీ చేయకుండా వుండేందుకు తగిన వ్యవధి లేకుండా తక్షణమే అనుమతించి ఓటింగ్‌ కూడా పెట్టి తీర్మానం వీగి పోయిందని సంతోషించారు. వెంటనే సభాపతిపై పెట్టిన అవిశ్వాసంపై అంతకంటే దారుణంగా ముందుగా అసలు నిబంధనలనే ఎత్తివేసి ఓటింగ్‌ పెట్టి రెండోసారి ‘ఘనవిజయం’ సాధించారు. మొదటిది చాణక్యం అనుకుందాం, మరి రెండవది ?

     ఒక తప్పుడు సాంప్రదాయం లేదా పద్దతికి తెరతీశారు. ఇలాంటి చర్య వలన సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు గౌరవం పెరగదు. గాంధీ పేరు గుర్తున్నంత కాలం గాడ్సే కూడా వుంటాడన్నట్లు పార్లమెంటరీ వ్యవస్ధలో చెడు సాంప్రదాయంతో గట్టెక్కిన స్పీకర్‌గా చరిత్రకు ఎక్కారు. స్పీకర్లు పాలక పార్టీకి చెందిన వారిగానే వుంటారు, పైకి ఏం చెప్పినా, నిబంధనలు ఎలా వున్నా పాలకపార్టీని కాపాడటానికి స్పీకర్లు తమ స్థానాలను వుపయోగిస్తున్నట్లు దాదాపు అన్ని శాసనసభల, పార్లమెంట్‌ అనుభవం. అందుకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ అతీతం కాదు. గతంలో తెలుగుదేశం అధికారంలో వుండగా స్పీకర్‌ ప్రవర్తన, దానిపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ రాజశేఖరెడ్డి ఎలా వ్యవహరించారో తెలియంది కాదు. తెలుగుదేశం ప్రతిపక్షంలో వుండగా కూడా అదేపని చేసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీపై దాడిలో భాగంగా ఆ పార్టీకి చెందిన స్పీకరుపై ప్రతిపక్ష వైసిపి నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు అదే ఎత్తుగడలను వుపయోగిస్తోంది. వుత్తమ, చెడు సాంప్రదాయాల గురించి భవిష్యత్‌లో జరిగే చర్చలో అప్పుడు ఇప్పుడూ స్పీకర్‌గా ఎవరున్నారో వారిని ప్రస్తావిస్తారు తప్ప అలాంటి తప్పుడు సలహాలు చెప్పిన వారిని కాదు.

     నిజానికి తెలుగు దేశం పార్టీకి స్పీకరు స్థానాన్ని, దానిలో వున్న గౌరవనీయ సభ్యుడిని ఫణంగా పెట్టాల్సిన అవసరం వుందా ? ఫిరాయించిన వారి మద్దతు లేకపోతే ప్రభుత్వం నిలబడే స్థితి లేదా అంటే అలాంటిదేమీ లేదు. పాలకపార్టీలో లుకలుకలున్నాయా అంటే అదీ లేదు. అంతా సర్దుబాటే తప్ప కుమ్ములాట బాట అవసరం ఏముంది. ఎక్కడ అధికారం వుంటే అక్కడ అనుభవించి తరువాత ఎవరు అధికారానికి వస్తే అభివృద్ది పేరుతో ఆ పార్టీలో చేరటానికి, చేర్చుకోవటానికి తలుపులు బార్లా తెరిచి వుంటాయి గనుక భవిష్యత్‌కూ ఢోకా వుండదని ఫిరాయింపుదార్లు రుజువు చేశారు. అవిశ్వాస తీర్మానాలు పెట్టటం అన్నది పార్లమెంటరీ చరిత్రలో ప్రతిపక్షానికి వున్న ఒక హక్కు, అవకాశం. ప్రస్తుతం శాసనసభలో వున్న బలాబలాల రీత్యా వైసిపి పెట్టిన తీర్మానాలు ఓడిపోతాయని ఆ పార్టీకి తెలుసు, పాలకపక్షానికి తెలుసు. ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలను ఎండగట్టటానికే ఈ అస్త్రాన్ని వాడతారు. అక్రమంగా పార్టీ ఫిరాయించిన వారి సభ్యత్వాలను కాపాడే క్రమంలో ప్రతిపక్ష పార్టీకి మరొక అస్త్రాన్ని అందించటంతప్ప ఇంత అప్రతిష్ట మూటగట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరైనా వుత్తమ సాంప్రదాయలను నెలకొల్పాలని లేదా ముందుకు తీసుకుపోవాలని కోరుకొనే వారికి తప్ప ఈక్షణం గడిచిందా లేదా ప్రత్యర్ధిపై దెబ్బతీశామా లేదా అని చూసే వారికి విమర్శలు పట్టవు.

     ఇక రెండో అంశం విషాదం. చంద్రబాబుపై అవిశ్వాసం, స్పీకర్‌పై అవిశ్వాసంలో విజయ తెలుగుదేశం పార్టీకి ఆనందం, వైసిపి విషాదం క్షణ భంగురాలు. ప్రత్యేక హోదా గురించి మరింత వివరణ,స్పష్టత వచ్చింది కనుక తమ అవిశ్వాస తీర్మానాలు ఓడిపోయాయని, తమ పార్టీ జంప్‌ జిలానీలపై వేటు వేసే అవకాశం చేజారిందని వైసిపి నేతలు విషాదంలో మునగనవసరం లేదు. అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యోగం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదారాదని, ప్రత్యేకంగా నిధులు కూడా రావని చంద్రబాబుకు, వెంకయ్య నాయుడికి తెలియని విషయం కాదు. ఆ విషయం తాము చెప్పకుండానే జనం గ్రహించాలని, తమపై ఎలాంటి ఆగ్రహం ప్రదర్శించకుండా చెవుల్లో పూలు పెట్టుకొని తలలాడించాలని వారు కోరుకుంటున్నారు. రాష్ట్ర విభజనే ఒక రాజకీయం. ప్రత్యేక హోదా మరొక రాజకీయం, ప్రతిదీ రాజకీయమే, ఒక్క సిపిఎం తప్ప ఎవరికి వారు ఈ రాజకీయంలో తమ వంతు పాత్రను రక్తి కట్టించి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను తప్పుదారి పట్టించారు. మంగళవారం నాటి పార్లమెంట్‌ చర్చలో విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చకుండా మోసం చేసిందని వెంకయ్య నాయుడు ఇప్పుడు ఎదురుదాడికి దిగారు. నిజమే కాంగ్రెస్‌ మోసం చేసింది. ప్రత్యేక హోదా ఐదు కాదు పది సంవత్సరాలు కావాలని కోరిన వెంకయ్య అది చట్టంలో పొందుపరచలేదనే విషయాన్ని అప్పుడు ఎలా మరిచి పోయారు ? ఆ సమయంలో బిజెపి, తెలుగు దేశం ఎంపీలు ఏ గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారు? చిన్న పిల్లలేం కాదే, చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం చెప్పారే తప్ప ఒక కన్నును పొడుస్తుంటే ఎందుకు వూరుకున్నారు? పోనీ తరువాత అయినా చట్టాన్ని సవరించి ప్రత్యేక హోదాను చేర్చటానికి ఏ పార్టీ అడ్డుచెప్పింది? ఎందుకు ఆపని చేయలేదు. ఇప్పటికైనా చట్టసవరణ చేయవచ్చు కదా ?

    ఎందుకు గతంలో చేయలేదు, ఇపుడు చేయటం లేదంటే. రాష్ట్ర విభజన జరిగే సమయంలోనే 14వ ఆర్ధిక సంఘం ముసాయిదా తయారైంది. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రకటించటాన్ని నిలిపివేయాలనే సిఫార్సు చేసే ఆలోచనలో వుంది. ఒక వేళ కాంగ్రెస్‌-బిజెపిలు ఆంధ్రప్రదేశ్‌ విషయంలో చట్టంలో చేర్చినా తరువాత వెలువడే ఆర్ధిక సంఘం సిపార్సులకు అది వ్యతిరేకం కనుక ఏ రాష్ట్రం అభ్యంతరం చెప్పినా, కోర్టుకు వెళ్లినా అది చెల్లదు. అందుకనే తెలివిగా దాని ప్రస్తావన లేకుండా చట్టం చేశారు. బిజెపి తెలిసి కూడా మౌనం దాల్చింది. తరువాత ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అవకాశం లేకుండా ఆర్ధిక సంఘం సిపార్సులు అమలులోకి వచ్చాయి. అందువలన రాజకీయాలు తప్ప చట్ట సవరణ చేసే అవకాశం లేదు. ఒక వేళ చేస్తే అనేక రాజ్యాంగ సమస్యలు వస్తాయి. అందుకే ఎవడికి పుట్టిన బిడ్డరా అన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పట్ల వ్యవహరిస్తున్నారు.

    బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలోప్రత్యేక హోదా అమలుకోసం కేంద్రాన్ని అర్ధిస్తూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో చంద్రబాబు నాయుడు ఎంతో వినమ్రతతో తన బాడీ లాంగ్వేజ్‌ను సవరించుకొని మాట్లాడారు. బిజెపి సభ్యుడు విష్ణుకుమార్‌ రాజు తమ కేంద్ర ప్రభుత్వాన్ని, అన్నింటికీ మించి తమ వెంకయ్య నాయుడిని జనం ఎక్కడ అపార్ధం చేసుకుంటారో అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం లక్షా 40వేల కోట్ల రూపాయల పాకేజి ఇచ్చిందని , ఏ విద్యా సంస్ధకు ఎన్ని వందల కోట్లు ఇచ్చిందో లెక్కలు చెప్పారు. ఆ మాటలు విన్నవారికి ఎవరికైనా అత్యాశ కాకపోతే ఇంకా ఎక్కడి నుంచి కేంద్రం ఇస్తుందనే భావం లుగుతుంది. అందుకే వెంటనే చంద్రబాబు నాయుడు చర్చమధ్యలో జోక్యం చేసుకొని అన్ని విద్యాసంస్థలకు కలిపి ఇప్పటికి ఇచ్చింది 172 కోట్లేనని, విష్ణుకుమార్‌ రాజు చెప్పే మొత్తాలు అవి పూర్తయ్యే నాటికి వస్తాయని అసలు విషయం చెప్పారు. అందువలన ఇప్పటివరకు చేసిన సాయం లేదా ప్రకటించిన సాయం గురించి అటు చంద్రబాబు ఇటు బిజెపి రెండూ కూడా అంకెల గారడీ చేస్తున్నాయి తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. ఇలాంటి తీర్మానాలు ప్రతి రోజూ పంపినా అవి నరేంద్రమోడీ చెత్తబుట్ట నింపటానికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అదనపు ఖర్చు తప్ప మరొక ప్రయోజనం వుండదన్నది స్పష్టం. అందుకే రాష్ట్ర విభజన, ఆ సందర్భంగా ఇచ్చిన హామీలు ఆంధ్రప్రదేశ్‌ యువతకు పెద్ద విషాదం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అబ్బ ! ఎంత బాగా చెప్పిండో కదా !

04 Friday Mar 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Amaravathi, CHANDRABABU, land scam, tdp, YS jagan, ysrcp

సత్య

   అబ్బో ఆ భూములన్నీ వారే దగ్గరుండి కొనిపించినట్లు, రిజిస్టర్‌ చేయించినట్లు రాశారే అని అమరావతి ప్రాంతంలో అధికారపక్ష నేతలు భూములు కొనుగోలు గురించి వచ్చిన వార్తలను చూసి ఒక వ్యక్తి వ్యాఖ్య.

   నిజమే, వైఎస్‌ఆర్‌సిపి నేత జగన్‌ మోహన్‌ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు అక్రమంగా సంపాదించారని ఇప్పటికీ తెలుగు దేశం వారు చెబుతున్నారు. అంటే జగన్‌ ఆ డబ్బంతా తీసుకుంటున్నపుడు వారంతా దగ్గరుండి చూశారా, లేక వారే ఇప్పించారా అని తాపీగా మరొకరి ప్రశ్న.

     వాస్తవం ఏమిటి ?ఎంతో కొంత రెండూ నిజమే. అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే.అసలు అవినీతి పాల్పడని వారు ఎవరు అని జనం అనుకొంటున్న స్ధితిలో ఎవరూ అక్రమంగా సంపాదించటానికి వెనుకాడటం లేదు. సిగ్గు పడటం అసలే లేదు, ఆడామగా తేడా, వయస్సు బేధం లేదు, సంపాదించకపోతే జనమే అసమర్ధులంటారు కదా !

    అమరావతి ప్రాంతంలో ఎవరి డబ్బు పెట్టి వారు భూములు కొంటే తప్పేంటి అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా అమాయకంగా, ఎంతో ప్రజాస్వామ్య యుతంగా అడుగుతున్నారు. ఎవరో భూములు కొనుక్కుంటే అది మాకు అనవసరం, నాకు కావలసింది నిబంధనలు పాటించారా లేదా అన్నదే అని కూడా చెప్పారు. నిజమే కదా తప్పేముంది !

    జగన్‌ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారు ముఖ విలువ కంటే ఎన్నో రెట్లకు వాటిని కొనుగోలు చేసినట్లు ,ఆ రూపంలో అక్రమంగా లంచాలు సమర్పించినట్లు తెలుగుదేశం వారు విమర్శించారు. వారి డబ్బు వారిష్టం ఒక రూపాయి వస్తువును వందరూపాయలు పెట్టి ఎందుకు కొన్నారంటే అది వారిష్టం అని జగన్‌ మద్దతుదార్లు సమర్ధించారు.అదీ చట్టబద్దంగానే జరిగింది, రికార్డులలో వున్నది కావాలంటే చూసుకోండి అన్నారు. చిత్రంగా వుందే అదీ నిజమే కదా ! కాదంటారా ?

    అప్పుడు జగన్‌ కంపెనీ రికార్డులను చూపి అవినీతి జరిగిందని తెలుగు దేశం వారు విమర్శించారు.ఇప్పుడూ అదే పద్దతుల్లో దస్తావేజులను చూసి చూపి జగన్‌ మీడియా లేదా మద్దతుదార్లు బదులు తీర్చుకున్నారు. కాదంటారా ? అవునంటారా ?

   పక్కవారిపై బురదజల్లి తుడుచుకోమన్నట్లు నిజం నిరూపించుకో అంటున్నారు ఎక్కడైనా అవినీతి వుంటే చర్యలు తీసుకోవచ్చు అన్నారు చంద్రబాబు.

   లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని జగన్‌పై ఆరోపించి కాదని రుజువు చేసుకోమన్నపుడు చంద్రబాబుకు ఆయన సైనికులకు ఈ తర్కం బహుశా గుర్తులేదేమో కదా !

    జగన్‌ లేదా రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు ఆ మాటకు వస్తే అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ నాయకుడు, నాయకురాలూ, వారి వారసులూ అవినీతికి పాల్పడలేదని ఎవరూ అనటం లేదు, అవి తేలే వరకు ఆరోపణలు, అంతవరకు నిందితులు మాత్రమే.

     అప్పుడూ-ఇప్పుడూ జరుగుతున్న అవినీతి అక్రమాలు అన్నీ చట్ట ప్రకారమే జరుగుతున్నాయి. అదే నేటి ప్రత్యేకత. ఎవరూ అతీతులు కాదు.

     జగన్‌ పత్రిక ఇష్టానుసారం రాసిందని, ఆ రాతలతో అమరావతి ఇమేజ్‌కు పెద్ద డామేజ్‌ చేయటమే లక్ష్యమని, ఆ పత్రిక రాసిన రాతలు నిరూపించకపోతే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది ప్రతి భారత పౌరుడికీ వున్న హక్కు. వుపయోగించండి, మరొకరు ఇలా రాయకుండా చేయండి.

     ఇక్కడ మరో సమస్య అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్‌ ఇమేజ్‌ను ఎవరు ఎంత డామేజ్‌ చేశారనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. పది సంవత్సరాల పాటు రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులపై పదేళ్లపాటు ప్రతిపక్ష నాయకుడిగా, కుడి ఎడమల ఢాల్‌ కత్తుల మాదిరి రెండు పత్రికలు, రెండు టీవీ ఛానల్స్‌ మద్దతుతో చేసిన ఆరోపణలతో రాష్ట్ర ఇమేజ్‌ డామేజ్‌ కాలేదా ? అక్కడకు వెళితే మా కెంత ఇస్తారు అని పీక్కు తింటారని విదేశీ కంపెనీలు అనుకోలేదా ? అందువలన ఇప్పుడు అమరావతి కుంభకోణాల గురించి రాయటంతో కొత్త వారు వచ్చినా ఇంతే కదా అని ఎవరూ రారని కదా చంద్రబాబు లబలబలాడి పోతున్నారు. ఇక్కడొక పాయింటు వుంది, గతంలో ఇలాంటి డామేజ్‌ను ఎదుర్కొన్నవారు దాన్ని తొలగించలేకపోయారు. కానీ చంద్రబాబు నాయుడు తన చాణక్య నీతితో దాన్ని సరిచేయలేరా ? అవి కేవలం ఆరోపణలే వాస్తవాలు ఇవీ అని టెక్‌ బాబు డిజిటల్‌ టెక్నాలజీతో నిరూపించలేరా ?

     కానీ కొన్ని విషయాలు సామాన్యులకు అర్ధం కావటం లేదు. భూములు కొన్నది ఎవరో ప్రయివేటు వ్యక్తులైతే వారి గురించి చర్చ, బయట పెట్టాల్సిన అవసరం లేదు.అవి కూడా వాస్తవానికి రహస్యమైనవి కాదు. ఎవరైనా ఆసక్తి ప్రదర్శిస్తే వాటి వివరాలు తెలుసుకోవచ్చు. అలాంటి దారిలోనే కదా జగన్‌ కంపెనీల వివరాలన్నీ చంద్రబాబు లేదా ఆయన మద్దతుదారులు తెలుసుకోగలిగింది. అసలు అమరావతి ప్రాంతం, గ్రామాలు కూడా ఎక్కడుంటాయో తెలియని వారు కోట్లు పెట్టి స్ధలాలు కొనటం దగ్గరే అసలు సమస్య వచ్చి పడింది. డబ్బున్న వారు స్దలాలు కొనటం కొత్త విషయమేమీ కాదు, అధికారంలో వున్న పెద్దలందరూ కూడబలుక్కున్నట్లు అమరావతి ప్రాంతంలోనే ఎలా కొన్నారన్నది సమస్య. మిగతా వారంతా వేరే చోట ఎందుకు కొన్నారు, అమరావతి ప్రాంతంలో కొన్న వారంతా మంత్రులు, అధికార పక్ష శాసనసభ్యుల బినామీలన్నది విమర్శ. దస్తావేజుల వివరాలతో సహా ఒక పత్రిక ప్రచురించింది. అవే రుజువులని, చెబుతోంది. అంతకంటే ఇంకా ఏమి రుజువులు ఇవ్వాలి. ఒక వేళ అవి నకిలీ దస్తావేజులైతే సదరు పత్రిక యాజమాన్యం మీద, వాస్తవమే అయితే తన మంత్రులు, ఎంఎల్‌ఏల మీద ముఖ్యమంత్రి చర్య తీసుకుంటారా లేదా ? అధికారంలో వున్నవారికి ఆ మాత్రం కనీస బాధ్యత కూడా లేదా, ఎవరికీ ఇవ్వని అవకాశం తనకు ఇచ్చారని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు కదా? అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతగా వారందరూ ఎదురు చూస్తున్న వాస్తవాలను బయట పెట్టి అవసరమైతే తాటతీసి తన నిజాయితీని వెల్లడించుకోవచ్చు కదా ! లేకపోతే తన ఇమేజ్‌ను తానే డామేజ్‌ చేసుకున్నట్లు అవుతుందేమో ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎందుకు మారుతున్నారో ! ఏం చేస్తారో చెప్పండి ప్లీజ్‌ !!

20 Saturday Feb 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, anti defection, CHANDRABABU, defections, tdp

గత ఎన్నికలలో తాము వ్యక్తిత్వంతో, ఒక విజన్‌తో, వైఎస్‌ఆర్‌ కుటుంబంపై అభిమానంతో పోటీచేసి గెలిచామని భూమా చెప్పారు. జనం వీటిని నమ్ముతారా ? అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని చెప్పేవారు ఇంతకు ముందు తాము ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలలో తమ ప్రాతినిధ్య కాలంలో సాధించిన అభివృద్ధి ఏమిటి? ఇంకా ఏమి మిగిలి పోయి వున్నాయి? వాటిని పూర్తి చేయటానికి పార్టీ మారితే ఎలా అవకాశాలు వస్తాయో శ్వేత పత్రం విడుదల చేయటం అవసరం.

ఎం కోటేశ్వరరావు

     ఓకే, భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిల ప్రియ ఇతర సపరివార బంధు మిత్రులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరటానికి లేదా ఫిరాయించటానికి సర్వహక్కులూ వున్నాయి.భూమాకు పార్టీలు మారటం కొత్తేమీ కాదు, కొట్టిన పిండే గనుక మార్గాల గురించి వేరే చెప్పనవసరం లేదు. అభివృద్ధికి అడ్డుపడితే ఎవరినైనా తమ పార్టీలో చేర్చుకుంటాం, మా సహనాన్ని పరీక్షించవద్దు అని వైఎస్‌ఆర్‌సిపికి ముందే తెలుగుదేశం నాయకులు చెప్పారు, ఆ వెంటనే భూమా పార్టీ మారటం గురించి వార్తలు వచ్చాయి. ఎన్నికలలో ఓట్ల లెక్కింపు పూర్తి కాక ముందే తాను పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయని చెప్పారు తప్ప వాటిని ఆయన పూర్తిగా ఖండించనూ లేదు తిరస్కరించనూ లేదు. తెలంగాణాలో జరిగిన పరిణామాలను చూసిన తరువాత ఏం జరిగినా ఆశ్చర్యం లేదు. లెక్కలు తేల్చుకోవటాన్ని బట్టి వుంటుంది. పార్టీ మారితే భూమా కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా అనో, లేకపోతే వైసిపి నాయకుడు జగన్‌ పనితీరు నచ్చలేదనో ఏదో ఒక కారణం చెప్పవచ్చు. ఏ కారణం చెప్పినా తన అనుచరులతో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నా అని ప్రతివారూ సమర్ధించుకుంటారు. దీనిలో పెద్ద కిక్కుండటం లేదు. మన రాజ్యాంగంలో ఓటర్లను సంప్రదించాలి లేదా వారి అంగీకారం తీసుకోవాలనే నిబంధనలేమీ లేవు గనుక ఫిరాయించటం సులభం. తిరిగి గెలుస్తామనే ధైర్యం వుంటే ఫిరాయింపు చట్టం కింద అనర్హత వేటు పడినా తిరిగి ఎన్నికలలో నిలబడవచ్చు. ఈలోపల ఎంఎల్‌ఏ కాకున్నా ఆరునెలల పాటు మంత్రి పదవిలో వుండవచ్చు కనుక మంత్రిగా ఎన్నికలలో తిరిగి పోటీ చేయవచ్చు. లేదా తెలంగాణాలో మాదిరి వేరే పార్టీలో వుంటూ కూడా మంత్రివర్గంలో చేరవచ్చునని కొత్త మార్గాన్ని ఏర్పరిచారు. స్పీకర్‌ను బట్టి అది వుంటుంది. కోర్టులు కూడా ఏమీ చేయలేవు. లేదా తేలే లోపల ఐదు సంవత్సరాలు పూర్తి అవుతాయి. ఇంకా ఇలాంటివి చాలా చూశాము గనుక పెద్దగా చర్చించాల్సినపని లేదు.

     గత ఎన్నికలలో తాము వ్యక్తిత్వంతో, ఒక విజన్‌తో, వైఎస్‌ఆర్‌ కుటుంబంపై అభిమానంతో పోటీచేసి గెలిచామని భూమా చెప్పారు. జనం వీటిని నమ్ముతారా ? అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని చెప్పేవారు ఇంతకు ముందు తాము ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలలో తమ ప్రాతినిధ్య కాలంలో సాధించిన అభివృద్ధి ఏమిటి? ఇంకా ఏమి మిగిలి పోయి వున్నాయి? వాటిని పూర్తి చేయటానికి పార్టీ మారితే ఎలా అవకాశాలు వస్తాయో శ్వేత పత్రం విడుదల చేయటం అవసరం. దీని వలన అనుచరులే కాదు సామాన్య ఓటర్లను కూడా చైతన్య వంతులను చేసిన వారౌతారు. ఓటు వేసిన వారికి కాస్త సంతృప్తి అయినా మిగులుతుంది. పార్టీ మారే వారే కాదు, వారిని చేర్చుకొనే అధికార పార్టీ లేదా ప్రతిపక్షం ఎందుకంటే జగన్‌ కూడా తనతో టిడిపి ఎంఎల్‌ఏలు టచ్‌లో వున్నారని చెబుతున్నారు గనుక వారు కూడా ఆ నియోజకవర్గాల ఓటర్లకు శ్వేతపత్రం వెల్లడించాలి. ఫలానా నియోజకవర్గంలో ఇంతవరకు జరిగిన అభివృద్ధి ఇది, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే ప్రతినిధి తమ పార్టీలో వుండి వుంటే అభివృద్ది ఇంకా ఏమి జరిగి వుండేదో, చేర్చుకుంటే ఏమేమి చేయాలనుకుంటున్నామో అని అధికార పార్టీ కూడా ప్రకటించాలి. లేదా అధికార పార్టీ నుంచి ఎవరైనా ప్రతిపక్షంలోకి ఫిరాయిస్తే తమ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా కుంటుపడిందో, పార్టీ మారి దాన్ని ఎలా పట్టాలపైకి ఎక్కించాలనుకుంటున్నారో ప్రతిపక్షపార్టీ అయినా ఓటర్లకు తెలపాలి.

   ఏదో ఒక పద్దతి పాటించాలి. కర్నూలు జిల్లాలో భూమా కుటుంబం తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజారాజ్యం పార్టీలో చేరింది, తరువాత వైఎస్‌ఆర్‌సిపిలో చేరింది. ఆ కుటుంబ సభ్యులు మధ్యలో కొంతకాలం తప్ప ఎక్కువ భాగం ప్రజాప్రతినిధులుగానే వున్నారు. అందువలన ఒకవేళ పార్టీ మారితే గీరితే ఇంతవరకు తాము ప్రాతినిధ్యం వహించిన కాలంలో సాధించిన అభివృద్ధి ఏమిటో, పార్టీ మారి ఇంకా ఏమి చేయబోతున్నారో చెబితే ఆ కుటుంబంపై వున్న గౌరవం ఇంకా ఇనుమడిస్తుంది. పార్టీలు మారే వారికి ఒక కొత్త ఆదర్శాన్ని చూపినవారు అవుతారు. అభివృద్ధి అయినా మరొక కారణం చెప్పినా నైతిక బాధ్యత ఒకటి వుంటుంది. కలియుగంలో నీతి నియమాలేమిటి తూనా బొడ్డుబాలు అనుకుంటే వేరే విషయం. లేదు కేవలం అధికారం కోసమే పార్టీ మారుతున్నాం అని నిజం చెప్పినా అదీ ఒక నిజాయితీయే ఈ రోజుల్లో, ఏం చెబుతారో చూద్ధాం. రాయలసీమలో ముఠాకక్షలలో ఎన్నోమార్పులు జరుగుతున్నాయి. వారిలో కూడా పాతకాలపు మొరటు పద్దతులు పోయి ఆధునిక సర్దుబాటు ధోరణులు వ్యక్తమౌతున్నాయి. మా ప్రయోజనాలకు మీరు అడ్డురావద్దు, మీకు మేము అడ్డురాము అనే సహనం,సహజీవనం పెరుగుతోంది. ఈ పూర్వరంగంలోనే కర్నూలు జిల్లా తెలుగుదేశం నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి. కొంత కాలం క్రితం అక్రమంగా తిన్నవాడెవడో చెప్పాలని నిలదీసిన జనం ఈ రోజు అసలు తినని వాడెవడో చెప్పండని దబాయిస్తున్న రోజులివి.జనం ఇలాంటి ఫిరాయింపులు, అనైతిక వ్యవహారాలను సహించినంత కాలం ఏం జరిగినా ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చంద్రబాబు వలవల- వీర భక్తుల విలవిల

14 Sunday Feb 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

CHANDRABABU, Nara lokesh, tdp, telangana tdp

మనకు ఇప్పటి వరకు  ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యాల గురించే తెలుసు. తెలంగాణా తెలుగుదేశం నుంచి వలసలు చూసిన తరువాత జరిగిన సభలో ప్రసంగించిన నేతల తీరుతెన్నులు చూస్తే ఫిరాయింపు వైరాగ్యాన్ని కూడా ఆ జాబితాలో చేర్చుకోవాల్సి వుంటుందనిపిస్తోంది. పార్టీ అన్న తరువాత ఇతర పార్టీల వారిని చేర్చుకోకుండా వుంటామా? వారు వచ్చినట్లే తిరిగి పోకుండా వుంటారా, ఈరోజు వారు రేపు మనం , ఎవరైనా పోయేది ఎక్కడ అధికారం వుంటే అక్కడికే కదా, అంతా పైవారి వినోదం, మనం నిమిత్త మాత్రులం అనుకోవాలేమో !

ఎం కోటేశ్వరరావు

      ధర్మాన్ని మీరు కాపాడండి-ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఈ మాట ఎక్కడో చూసినట్లు, విన్నట్లు వుంది కదూ ! చంద్రబాబు నాయుడు అనే గొప్ప సంస్క ర్త( ఇది నేను చెప్పింది కాదు, ఎవరూ ఎస్సీలుగా పుట్టాలనుకోరు అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యకు ఆయన ఒక సంస్కర్తలా అనుగ్రహ భాషణం చేశారని ఆయన మద్దతుదార్లు ఇచ్చిన టీకా తాత్పర్యంలో భాగం) తెలంగాణాలో మీరు పార్టీని కాపాడండి-పార్టీ మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పిన మాటలు వినగానే గుర్తుకు వచ్చాయి. తీరా చూస్తే అనేక చోట్ల గోడల నిండా రాసి కూడా వున్నాయి. యుగ యుగాలుగా, తరతరాలుగా ఇలాంటి సంస్కర్తలు నాలుగు పాదాల నడిచిన ధర్మానికి ఇప్పుడు అసలు ఒక పాదం అయినా వుందో లేదో తెలియకుండా చేశారు. అదీ ధర్మాన్ని రక్షించే పేరుతోనే సుమా ! అయినా ధర్మం తనను తాను కాపాడుకోలేక పోవటమే కాదు ధర్మంగా వున్న వారిని కూడా కాపాడలేకపోయిందని ప్రతి యుగంలో, తరంలో ఏ రంగంలో చూసినా మనకు తెలుస్తూనే వుంది.

      అలాంటిది తెలంగాణాలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు ఎలా కాపాడగలుగుతారు? ఆయన కుమారుడు లోకేష్‌ అంటే పుట్టుకతో తెలుగుదేశం కనుక సిద్ధాంతాల గురించి మాట్లాడే నైతిక అర్హత వుంది.అయితే తెలుగు దేశం పార్టీ పుట్టిన తరువాత భూమ్మీదకు వచ్చిన లోకేష్‌ అంతకు ముందే పార్టీలోకి వచ్చిన నేతల కంటే ఎక్కడలేని అధికారం ఎలా చెలాయిస్తున్నట్లు అంటే సమాధానం కష్టం.(మన అదృష్టం కొద్దీ లోకేష్‌ ఇంకా సిద్ధాంతాల గురించి వాటి పవిత్రత, కాపాడటం గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే కొంత మంది అవతార పురుషులు, కారణ జన్ములు అవసరం వచ్చినపుడే నోరు విప్పుతారు మరి ! చంద్రబాబు నాయుడు పుట్టింది కాంగ్రెస్‌లో పెరిగింది కాంగ్రెస్‌లో, తొలి మంత్రి పదవి వెలగబెట్టింది కాంగ్రెస్‌లో కనుక ఆయన నీతి సూత్రాల గురించి మాట్లాడటం వినేవారికి కాస్త ఇబ్బందే. తెలుగుదేశం హైదరాబాదులో సరిగ్గా పనిచేయని కారణంగానే నష్టం జరిగిందని చంద్రబాబు చెప్పారు. నిజమే, నారా లోకేషే అన్నీ అయి పని చేశారు అన్నది అందరికీ తెలిసిందే.

     మనకు ఇప్పటి వరకు  ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యాల గురించే తెలుసు. తెలంగాణా తెలుగుదేశం నుంచి వలసలు చూసిన తరువాత జరిగిన సభలో ప్రసంగించిన నేతల తీరుతెన్నులు చూస్తే ఫిరాయింపు వైరాగ్యాన్ని కూడా ఆ జాబితాలో చేర్చుకోవాల్సి వుంటుందనిపిస్తోంది. పార్టీ అన్న తరువాత ఇతర పార్టీల వారిని చేర్చుకోకుండా వుంటామా? వారు వచ్చినట్లే తిరిగి పోకుండా వుంటారా, ఈరోజు వారు రేపు మనం , ఎవరైనా పోయేది ఎక్కడ అధికారం వుంటే అక్కడికే కదా, అంతా పైవారి వినోదం, మనం నిమిత్త మాత్రులం అనుకోవాలేమో ! ఏకంగా శాసనసభా పక్ష నాయకుడే ఫిరాయించిన తరువాత జరిగిన సంతాపసభలో (పోయిన వారికి అని వక్తలు చెప్పినప్పటికీ మిగిలి వున్న వారికి ధైర్యం చెప్పిన సంతాపసభ అది అనటం బాగుంటుందేమో ) పాల్గొన్న నారాయణపేట(మహబూబ్‌ నగర్‌ జిల్లా) ఎంఎల్‌ఏ రాజేంద్రరెడ్డి మాట్లాడుతూ తన వంటి వారు హైదరాబాదు వచ్చి వెళితే శీలపరీక్ష చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరీక్షల అవసరం లేకుండా చేసుకొనేందుకు కాబోలు అలా మాట్లాడిన కొద్ది నిమిషాలలోనే ఏం జరిగింది. సమావేశానికి పసుపు సైకిల్‌పై వచ్చి వెళ్లేటపుడు గులాబీ కారులో వెళ్లారు. అందరికీ ఎడాపెడా శరీరాన్ని కోసి ఆపరేషన్లు చేసే వైద్యుడు తన కాలుకు ముల్లు గుచ్చుకోగానే విలవిల్లాడి పోతాడట. పాపం చంద్రబాబు నాయుడు అంతకంటే ఎక్కువే బాధపడి వుంటారు.ఎందుకుంటే ఆకర్ష… ఆకర్ష అని నిత్యం ఏదో ఒక పార్టీలోని వారికి గాలం వేసే వారు తన గేలానికి చిక్కిన చేపలే తప్పించుకుపోతుంటే నిజంగా ఎంత బాధగా వుంటుందో కదా ! అతనికంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు ఆయన కంటే ఎక్కువగా వీరాభిమానులు విలవిలాడి పోతున్నారు. ఆ క్రమంలో తమ నాయకుడికి భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని కూడా చూడకుండా తెగ సుభాషితాలు చెబుతున్నారు. అలాంటి వాటిలో కొన్ని ఆణి ముత్యాలు ఇలా వున్నాయి. ‘పార్టీ మారటానికి ఒక విధానమంటూ వుంటుంది. మరీ ఇంత నిర్లజ్జగా వ్యవహరించాల్సిన అవసరం ఏముంటుంది. ఎర్రబెల్లి దయాకరరావు ప్రభృతుల జంపింగ్‌ పట్ల ప్రజలెవ్వరూ ఆశ్చర్యపోలేదు.అయితే, ఈ సందర్బంగా వారు వ్యవహరించిన తీరు, చేసిన వ్యాఖ్యలు మాత్రం ఔరా అనిపించేలా వున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యలు తనవి కావని, పార్టీ నాయకత్వం ఇచ్చిన డైరెక్షన్‌తోనే ఆ విమర్శలు చేశానని ఎర్రబెల్లి దయాకరరావు చెప్పటం మాత్రం రోతగా వుంది.’అని ఒక పత్రికా వ్యాఖ్యాత వాపోయారు.

     గతంలో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీల వారిని ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవటానికి ఏ విధానాన్ని అనుసరించింది? ఏ లజ్జ ప్రకారం వచ్చిన వారు వచ్చారు, చేర్చుకున్నవారు ముద్ర వేశారు. మామూలుగా పార్టీ మారితే ఎవరు గుర్తిస్తారు, ఏ ప్రచార సాధనాలు పట్టించుకుంటాయి.ఇప్పుడు దేనికైనా ఒక కిక్కు కావాలి.అదే జరుగుతోంది. ఒక మహానటుడు పెట్టిన తెలుగుదేశం పార్టీలో ఎందరో రాజకీయ మహానటులు చేరారు. అందువలన అక్కడ జరిగేది కూడా అంతా నాటకీయమే, సినిమా ఫక్కీనే .తెలుగుదేశం పార్టీలో ఎవరైనా చేరితే ఒక పద్దతి వున్నట్లు ఆ పార్టీ నుంచి బయటకుపోతే లజ్జలేనట్లా ?

    పార్టీ ఫిరాయించిన ఎర్రబెల్లి దయాకరరావు తాను టిఆర్‌ఎస్‌ నాయకత్వం గురించి అనుచితంగా మాట్లాడి వుంటే క్షమించాలని అదంతా అధినేత డైరెక్షన్‌ ప్రకారమే జరిగిందని చెప్పటంపై అభ్యంతరం ఎందుకు ? అసలు అలా మాట్లాడని వారెవరు? పార్టీ ఫిరాయించిన తరువాత అలా చెప్పని వారెవరు? ఎక్కడో ఒక్కడ మొదలు పెట్టాలి గనుక చంద్రబాబు నాయుడినే తీసుకుందాం. తెలుగుదేశం పార్టీ ప్రారంభంలో చంద్రబాబు నాయుడు తొలి ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసినపుడు ఎన్టీరామారావు మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎలాంటి విమర్శలు చేశారో కావాలంటే పాత పత్రికలు తిరగవేసుకోవచ్చు. ఎందుకు చేసినట్లు ? ఏ గూటి చిలక ఆగూటి పలుకులు పలికినట్లు అదే చంద్రబాబు తెలుగుదేశంలో చేరిన తరువాత కాంగ్రెస్‌ పార్టీని తిట్టని తిట్టు , చేయని విమర్శ వుందా ? ఎవరి డైరెక్షన్‌ ప్రకారం అదంతా జరిగింది? మైసూరా రెడ్డి కాంగ్రెస్‌లో వున్నపుడు విద్యుత్‌ చార్జీల వుద్యమం సందర్బంగా తెలుగుదేశం నాయకత్వంపై చేసిన విమర్శలేమిటి ? తరువాత అదే పెద్దమనిషి తెలుగుదేశంలో చేరినపుడు చెప్పిన మాటలు తియ్యగా అని పించలేదా ? అంతెందుకు ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యులుగా వున్నవారు, పార్టీలో ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సీలు,ఎంపీలుగా వున్న వారు ఎక్కడి నుంచి వచ్చారు ? పూర్వపు పార్టీలలో వున్నపుడు చేసిన విమర్శలు తెలుగుదేశంలో చేరి తిరిగి తమ పాత పార్టీలపై చేస్తున్న విమర్శలు రోతగా అనిపించటం లేదా ? అంతెందుకు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నూతన శాసనసభా పక్ష నాయకుడిగా నియమితుడైన రేవంత రెడ్డి ఒకనాడు టిఆర్‌ఎస్‌లో వున్న పెద్ద మనిషే కదా ! అప్పుడు ఇతర పార్టీలను ఎందుకు తిట్టావంటే నాయకత్వ డైరెక్షన్‌ అనో పార్టీ విధానమనో గాక కొత్తగా ఇప్పుడేమి చెబుతారు ?

     ఈ రోజు తెలుగుదేశం పార్టీలో మిగిలివున్న నేతలు, ఎంఎల్‌ఏలు కూడా ఆ పార్టీలో ఎంత కాలం వుంటారనేది ఒక ప్రశ్న. రేపు టిఆర్‌ఎస్‌తో రేవంత రెడ్డి సర్దుబాటుకు రారన్న గ్యారంటీ ఏమన్నా వుందా ? ఒకప్పుడు సిపిఎంలో వున్న సండ్రవెంకట వీరయ్య తెలుగుదేశంలోకి వెళ్లగలిగినపుడు మరో పార్టీలోకి వెళ్లటానికి అభ్యంతరం ఏముంటుంది? డొల్లుపుచ్చకాయలకు ఒక మార్గం, ఒక పద్దతి ఏముంటుంది?ఎటయినా దొర్లుతారు . ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి పోయిన రేవంత రెడ్డి, ఇతరులు రేపు పార్టీ ఫిరాయించి దయాకరరావు మాదిరే తాము నాయకత్వ డైరెక్షన్‌ మేరకే ఆలా చేశాం, డబ్బు కూడా వారే సమకూర్చారు తప్ప మావరకు మేము పరిశుద్ధులమే అని అప్రూవర్‌లుగా మారరని గ్యారంటీ ఏముంది? తెలుగుదేశం పార్టీ మహిళ అధ్యక్షురాలిగా రోజా కాంగ్రెస్‌ పార్టీని ఎలా తిట్టిందో తెలిసిందే. రేపు తిరిగి ఆమె మరో శుభముహూర్తాన స్వంత ఇంటికి రారని, వస్తే తిరస్కరిస్తారన్న గ్యారంటీ ఏమైనా వుందా ? నిత్యం వైఎస్‌ఆర్‌సిపి ప్రజాప్రతినిధులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న తెలుగు దేశం వారు తిట్టిన తిట్లు లేదా మర్యాదస్తుల భాషలో చెప్పాలంటే విమర్శలను పట్టించుకుంటుందా ? ఎందుకీ ఆత్మవంచన ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

తమరెవరి వలలో చిక్కుకున్నారు లోకేశా ?

11 Thursday Feb 2016

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, CHANDRABABU, Nara lokesh

సత్య

     ‘తాను అభివృద్ధి చేశానని చెప్పుకున్న హైదరాబాదు నగరం తన పార్టీకి ఒక్కటంటే ఒక్కటే కార్పారేటర్‌ సీటు కట్టబెట్టిందంటే ఆయన చెప్పింది అవాస్తవమైనా అయి వుండాలి లేదా చంద్రబాబును నమ్ముకుంటే కుక్కతోకను బట్టి గోదావరిని ఈదినట్లే అని జనం నిర్ధారణకు వచ్చి వుండాలి.’ అని హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల పర్యవసానాల గురించిన వ్యాఖ్యలో పేర్కొన్నాను. జనమే కాదు, తెలుగుదేశం నేతలు కూడా అదే నిర్ధారణకు వచ్చారని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. తెలుగుదేశంలో ఇంకే మాత్రం కొనసాగినా తమకు భవిష్యత్‌ లేదని ఇంతకాలం దాన్ని వుపయోగించుకొని లబ్ది పొందిన వారంతా భావిస్తున్నారు. అందుకే తట్టాబుట్టా సర్ధుకుంటున్నారు. ఇంకా మేయర్‌ ఎన్నికలు జరగక ముందే ఏకంగా తెలుగుదేశం శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు తెరాస కారు ఎక్కేశారు. తిమ్మినిబమ్మిని చేయటంలో, చాణక్య నీతిని ప్రదర్శించటంలో తెలుగుదేశం నేతలు తిరుగులేని చంద్రబాబు నాయుడిని చూసి ఎంతో నేర్చుకొని ఆయనకే పాఠాలు చెబుతున్నారంటే అతిశయోక్తికాదు. పార్టీలు మారటం సాకులు చెప్పటం ఇప్పుడు ఎంత సులభమైందో. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా ఏ పార్టీలో అయినా చేరవచ్చు. అందుకు మారేవారికే కాదు, చేర్చుకొనే వారికి కూడా సిగ్గు ఎగ్గులు లేవు.ఎక్కడ ఎలా కట్టిందా అని కాదు మా దొడ్లో ఈనిందా లేదా అన్నదే ప్రాతిపదిక. ఇంతకాలం కాంగ్రెస్‌లో వున్నా తెలుగుదేశంలో వున్నా వారు జ నానికి చెప్పిందేమిటి తమ నియోజకవర్గాలను, ప్రజలను తామెంతో అభివృద్ధి చేశామనే కదా ! అలాంటి వారు పార్టీ మారటానికి చెబుతున్న తొలిసాకు నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలు తీర్చటం కోసమే అని కదా చెబుతోంది. ఎంత ఆత్మవంచన. అయినా సరే జనం అలాంటి వారికి పట్టం కడుతున్నారు. ఇదింకా సామూహిక ఆత్మవంచన.

     హైదరాబాదు ఎన్నికలలో అనూహ్యంగా మట్టి కరచిన తెలుగుదేశం నేతలు కింద పడ్డా మాదే పైచేయి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికలలో తమకు హైదరాబాదులో లక్షన్నర ఓట్లు అధికంగా వచ్చాయని, తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ చెబుతున్నారు. ఇంకా నయం గత ఎన్నికల కంటే నా వయస్సు ఐదేళ్లు పెరిగింది అని చెప్పలా. తాను తెలంగాణా తెలుగు దేశం నాయకులతో మాట్లాడానని ఇంకెవరూ పార్టీ నుంచి బయటకు పోరని చెప్పిన మాటలు ఇంకా టీవీలలో మోగుతుండగానే ఏకంగా పార్టీ శాసనసభా పక్షనేతే ఫిరాయించటాన్ని లోకేష్‌ బాబు పసిగట్టలేకపోయారు. ఒకే ఒక్కడు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడెందుకు అంటే దానికి కారణాలు చెప్పకుండా తాము వేసిన ఎత్తుగడలో తెరాస చిక్కుకు పోయి జనానికి అమలు జరపలేని 60వేల కోట్ల రూపాయల వాగ్దానాలు చేసిందని లోకేష్‌ చంకలు కొట్టుకుంటున్నారు. అదీ ఎక్కడా ? విజయవాడ నడి గడ్డ మీద ! అమరావతితో కూడిన ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్‌లా మారుస్తానని వాగ్దానం చేసిన చోట. కాపులకు రిజర్వేషన్లు, రైతులతో సహా అన్ని తరగతుల రుణమాఫీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, లక్షల కోట్లతో రాజధాని నిర్మాణం, బాబొస్తే ఇంటికో జాబు ఇలా ఎన్నిలక్షల కోట్లో తెలియని వాగ్దానాలను తెలుగుదేశం ఎవరి వలలో చిక్కుకొని చేసినట్లో లోకేష్‌ చెప్పగలరా ? తెరాస అమలు జరపలేని వాగ్దానాలు చేసి ఇరుక్కు పోయిందని సంతోష పడుతున్న లోకేష్‌ ఆంధ్రప్రదేశ్‌లో తాను, తన తండ్రి చేసిన వాగ్దానాలతో ముందుంది ముసళ్ల పండుగ అని గుర్తించినట్లు లేదు. తెలంగాణాలో తగిలిన ఎదురు దెబ్బలతో జనం దృష్టిని మరల్చటానికి ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఫిరాయింపులను ప్రోత్సహించటానికి తెలుగుదేశం ప్రయత్నించవచ్చు. ఈ రోజుల్లో అత్యంత సులభమైన చౌకబారు వ్యవహారమది. కోట్ల రూపాయలలో పెట్టుబడి పెట్టి ఎన్నికలలో గెలిచిన వారు వాటితో పాటు లాభాలను కూడా రాబట్టుకొనేందుకు అధికారం ఎక్కడ వుంటే అక్కడ చేరతారు. అందులో తెలియనిదేముంది?

     చంద్రబాబు నాయుడు డబ్బుతో కూడుకున్న వాగ్దానాలు అమలు జరపకుండా కాలక్షేపం చేస్తున్నారంటే కొంత వరకు అర్ధం చేసుకోవచ్చు. తెలుగుదేశం చేసిన కాపురిజర్వేషన్ల వాగ్దానం వలన ప్రభుత్వంపై అదనపు ఆర్ధిక భారం పడేదేముంది. అయినా ఇరవై నెలల పాటు పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక కమిషన్‌ వేసి ఏడు నెలలు, తొమ్మిది నెలల్లోనో ఫలితం చూపాలని హడావుడి చేస్తున్నారు. ఇది కొత్త సమస్యలు, సమీకరణాలకు దారి తీయటం అనివార్యంగా కనిపిస్తోంది. ఆ గందరగోళం కారణంగానే బుర్ర ఖరాబై గత వారంలో చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారా అని పిస్తోంది.

     అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణాలో తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఆర్‌ కృష్ణయ్య అని చంద్రబాబు నాయుడు ప్రకటించి వెనుకబడిన తరగతులలో ఒక బలమైన తరగతి ఓట్ల కోసం గాలం వేశారు. ఎవరినైనా వాడుకో, వుపయోగించుకో, అవసరం తీరిన తరువాత వదిలెయ్‌ అన్న ఆధునిక నీతి చంద్రబాబు నాయుడికి తెలిసినంతగా మరొకరికి తెలియదు.ఎన్నికలు ముగిసిన తరువాత ముఖ్యమంత్రి అభ్యర్ధి కృష్ణయ్యను కనీసం శాసనసభా పక్ష నేతగా కూడా చేయలేదు. గత ఎన్నికలలో ఎల్‌బి నగర్‌ నియోజకవర్గంలో కృష్ణయ్యను నిలిపిన కారణంగా అపుడు తమకు రావాల్సిన మెజారిటీ తగ్గిపోయిందని హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలలో అక్కడ ఒక్కటంటే ఒక్క కార్పొరేటర్‌ స్ధానమైనా దక్కించుకోలేకపోయిన తరువాత చంద్రబాబు మాట్లాడుతున్నారు. బోడిగుండుకు మోకాలికీ ముడి పెట్టటం అంటే ఇదే. ఎంతో అనుభవం కలిగిన రాజకీయ నేత చంద్రబాబు నోటి నుంచి ఇలాంటి మాటలు రావటం అంటే మున్సిపల్‌ ఎన్నికలు ఆయన బుర్రను ఎంతగా ఆందోళనకు గురిచేశాయో అర్ధం చేసుకోవచ్చు. అదే విధంగా ఎస్సీలలో ఎవరూ పుట్టాలని కోరుకోరు అని ఒక అసందర్భ ప్రేలాపన దాని పర్యవసానమే.తనకు కుల పట్టింపులు లేవని చంద్రబాబు నాయుడు నమ్మబలుకుతారు. అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గరా అని తిరుపతి ఎస్‌వి యూనివర్సిటీ చరిత్ర విప్పితే కులాన్ని వుపయోగించుకొని పైకి వచ్చిన పెద్ద మనుషులెవరో బహిరంగ రహస్యం. విశ్వవిద్యాలయాలలో కుల జాడ్యం అక్కడి నుంచే వ్యాపించిందన్నది దాచినా దాగని సత్యం .

     కుల రాజకీయాలు చేయటం, దాని వలన పొందేలబ్ది ఏమిటో ఈ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీలకు తప్ప మిగతా పార్టీలన్నింటికీ వెన్నతో పెట్టిన విద్య.ఎవరు దీనికి కారకులు అని తర్కించుకోవటం అంటే గొంగట్లో అన్నం తింటూ వెంట్రుల గురించి మాట్లాడుకోవటం వంటిదే. ఎవరు వాటి నుంచి బయట పడ్డారన్నదే నేడు గీటురాయిగా వుండాలి. రిజర్వేషన్లు సమస్యల పరిష్కారానికి మార్గాలు కావన్నది చరిత్ర చెబుతున్నది. అసలు ప్రభుత్వ రంగమే అంతరిస్తున్న తరువాత ప్రభుత్వ వుద్యోగాలకు మాత్రమే రిజర్వేషన్లు పరిమితం అవుతున్నాయి. రిజర్వేషన్లు కుల నిర్మూలనకు ఒక మార్గంగా అంబేద్కర్‌ భావించారు. ఇప్పుడు ప్రయివేటీకరణ పర్యవసానంగా ప్రభుత్వ వుద్యోగాలు తగ్గిపోతూ దానికి అనుగుణంగా రిజర్వేషన్లు కూడా తగ్గిపోతున్నాయి. దీనికి తోడు తగిన అభ్యర్ధులు లేని కారణంగా ఎస్‌సిఎస్‌టి బ్యాక్‌లాగ్‌ పోస్టులు పెరుగుతున్నాయి. కొన్ని సందర్బాలలో వుద్యోగ ప్రకటనలు చేసినపుడు అవే ఎక్కువగా వుండటంతో మిగిలిన వారు అపార్ధం చేసుకోవటం కూడా జరుగుతోంది. ఈ పూర్వరంగంలోనే రిజర్వేషన్ల పరిధిలోకి తమనుకూడా తీసుకురావాలని కొత్త వారు డిమాండ్‌ చేయటం, కొత్త వారిని తీసుకువచ్చి తమ అవకాశాలను దెబ్బతీయ వద్దని ఇప్పటికే రిజర్వుడు తరగతులుగా వున్నవారు ప్రతిఘటించటం దేశమంతటా జరుగుతోంది.ఏది సమర్ధనీయం ఏది కాదు కాదు అంటే తిరిగి చర్చ విత్తు ముందా చెట్టుముందా అన్నదగ్గరకు చేరుతోంది.

     అందరికీ విద్య, వుద్యోగ అవకాశాలు వుంటే ఇలాంటి సమస్యలు అంతగా ముందుకు రావు. మన దేశంలో ఈ సమస్యలతో పాటు ప్రపంచంలో ఎక్కడాలేని సామాజిక విభజన, వివక్ష సమస్యలు కూడా జనానికి తోడయ్యాయి. ముందుగా వర్గదోపిడీ అంతమైతే కుల సమస్య అంతరిస్తుందని కమ్యూనిస్టులు చాలా కాలంగా నమ్మారు. ముందు కుల సమస్య అంతరించిన తరువాతే వర్గ సమస్య సంగతి చూడాలని అంబేద్కరిస్టులు నమ్మారు. భారత్‌లో వున్న సంక్లిష్టతల కారణంగా రెండు వైఖరులను పునరాలోచించుకోవాల్సి వచ్చింది. వర్గ సమస్యలతో పాటు కుల వివక్ష సమస్యను కూడా తక్కువగా చూడరాదని కమ్యూనిస్టులు చాలా కాలం క్రితమే గుర్తించారు. దానిలో భాగంగానే అనేక రాష్ట్రాలలో కుల వివక్ష వ్యతిరేక సంఘాలను ఏర్పాటు చేసి ఆ సమస్యపై పని చేస్తున్నారు. తాము కలలు కన్న కుల నిర్మూలన ఇప్పట్లో జరిగేది కాదని అంబేద్కరిస్టులు అంతర్గతంగా ఆలోచిస్తున్నా అంగీకరించటానికి ముందుకు రావటం లేదు.ఈ వైఖరి అటు వర్గ, కుల నిర్మూలన పోరాటాలు రెండిండికీ హాని కలిగిస్తుందని గుర్తించటం అవసరం. ఎవరి అభిప్రాయాలు వారు కలిగి వుండవచ్చు, అదే సమయంలో ఎక్కడ ఏ సమస్య ముందుకు వస్తే దానిని, రెండు సమస్యలపై ఐక్యంగా పని చేయవచ్చు. కావాల్సింది చిత్త శుద్ధి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏదో జరుగుతోందని అందరికీ తెలుసు ? ఏమిటది ?

29 Friday Jan 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, CHANDRABABU, Modi

మన్మోహన్‌ సింగ్‌ శంకుస్ధాపన – నరేంద్రమోడీ ప్రారంభోత్సవం

ఎంకెఆర్‌

అటు కాకలు తీరిన పాలకపార్టీ పెద్దలు నిండు పేరోలగంలో ప్రతిపాదిస్తే ఇటు తలలు పండిన ఎందరో ప్రతిపక్ష యోధులు ఆమోదించారు. (సిపిఎం మినహా) వారూ వీరూ , వారితో చేరినవారూ చేతులు కలిపి లేదా కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్‌లో ప్రకటించిన ప్రత్యేక హోదా, లోటు భర్తీకి నిధులు, కొత్త రాజధాని అమరావతి నిర్మాణాలకు ప్రారంభోత్సవంగా భావించి క్యా సీన్‌ హై అనుకోకండి. వట్టిస్తరి మంచినీళ్లు మాత్రమే. శంకస్ధాపన మాదిరి కొన్ని వందల కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి అమరావతి తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి నిర్ణయం జరిగినపుడే అంతసీన్‌ లేదని తేలిపోయింది.

ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆఫ్ఘనిస్తాన్‌ పార్లమెంట్‌ భవనం గురించి. వేసిన అంచనాల కంటే ఎక్కువ కావటం, పనులు ఇంకా పూర్తి గాక పోవటంతో సవరించిన అంచనా ఖర్చు రు.960 కోట్లకు చేరుకోవటంతో బుధవారం నాడు జరిగిన మన కేంద్ర కాబినెట్‌ సమావేశం ఆమోదం తెలిపింది. ఇంకా అయితే తరువాత ఎలాగూ చెల్లిస్తారు లెండి. ఇదేమిటి ఎక్కడి ఆఫ్ఘనిస్తాన్‌ ! ఎక్కడి మోడీ సర్కార్‌ !! వారి పార్లమెంట్‌ భవనం మనం కట్టటం ఏమిటి !!!

ఆఫ్ఘనిస్తాన్‌ సర్వనాశనం కావటానికి కారకులు నూటికి రెండువందల శాతం అమెరికా, దాని చుట్టూ తోకాడించుకుంటూ తిరిగే ఐరోపా ధనిక, సౌదీ అరేబియావంటి అమెరికా తొత్తు దేశాలు. దాన్ని పునరుద్ధరించేందుకు మాత్రం ప్రపంచ దేశాలన్నీ తలాకాస్త సాయం చేయాలంటూ అమెరికా ఆదేశించింది. అదే లెండి దొరగారు తలా కాస్త చేయండి అంటే చేయకపోతే అయ్యగారితో ఎప్పుడు ఏతంటా వస్తుందో, ఎప్పడు ఏ అవసరం వస్తుందో పోయిందేముంది లే అనుకొని మన వాటాగా పార్లమెంట్‌ భవనం నిర్మాణం, మరికొన్ని చేస్తామని మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా వున్నపుడు వాగ్దానం చేసి వచ్చారు. అది సకాలంలో పూర్తిగాక చివరికి డిసెంబరులో పూర్తి కావటంతో 25వ తేదీన ఆఫ్ఘన్‌ అధ్యక్షుడితో కలసి నరేంద్రమోడీ ప్రారంభోత్సవం చేసి వచ్చారు. మిగిలిన ఎలక్ట్రానిక్‌ పరికరాల బిగింపు వంటి ఫినిషింగ్‌ పనులు పూర్తి చేసి ఈ ఏడాది మార్చి 31 నాటికి భవనాన్ని అఫ్ఘన్‌ అధికారులకు అందచేయాల్సి వుంది. అందుకుగాను పెరిగిన ఖర్చుకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. అంతర్జాతీయ సంబంధాలు సజావుగా కొనసాగటానికి ఎవరి హయాంలో ఏ నిర్ణయం జరిగినా దానిని కొనసాగించటం తరువాత అధికారంలో వున్న వారి బాధ్యత అనుకుందాం. మరి ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్‌లో చేసిన వాగ్దానాల మాటేమిటి ? ఆంధ్రులు అంత నోరు లేనివారా ?

కన్నమ్మకు కూడు పెట్టని కొడుకు పిన్నమ్ముకు ఒంటి నిండా బంగారు ఆభరణాలు తొడిగిస్తా అని చెప్పినట్లుగా చ ంద్రబాబు నాయుడు, బిజెపి నాయకులు హైదరాబాదు కార్పొరేషన్‌ ఎన్నికలలో కురిపించని వాగ్దానాలు లేవు. హైదరాబాదు నుంచి ఏటా 45వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందంటే ఆ శ్రమ తనదే అని చంద్రబాబు నాయుడు చెప్పారు, నైజాం నవాబులు హైదరాబాదును 400 సంవత్సరాలలో, బ్రిటీష్‌ వారు సికిందరాబాదును 200 సంవత్సరాలలో తీర్చిదిద్దితే ఈ రెండింటికీ ప్రపంచ పటంపై కేవలం తొమ్మిది సంవత్సరాలలోనే ఎనలేని కీర్తి తెచ్చి పెట్టానని, హైటెక్‌ సిటీని కేవలం 15నెలల్లోనే నిర్మింపచేయించిన ఘనత తనదేనని, తాను ఆనాడు అభివృద్ధి చేయకపోయి వుంటే ఈ రోజున తెలంగాణా ప్రభుత్వానికి సంక్షేమ పధకాలు అమలు జరపటం సాధ్యమయ్యేది కాదని చంద్రబాబు హైదరాబాదు వీధుల్లో చెప్పారు. అంతేనా ! కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పధకాల్లో తెలంగాణాకు అన్యాయం జరగకుండా చూస్తానని, అవసరమైతే ప్రధాని మోడీని ఒప్పించి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని మరీ చెప్పారు. పిట్టల దొర గుర్తుకు రావటం లేదూ ?

ఈ వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వారికి కూడా తెలిసి వుంటే బాబ్బాబు….. ఐదు సంవత్సరాలలో ఇప్పటికే మూడోవంతు అయిపోయింది. లేస్తే మనిషిని కాను అని దారిన పొయ్యేవారిని బెదిరించి దండుకున్న కుంటి మల్లయ్య కధ మాదిరిగాక ముందే కొత్తవి రాకపోతే పోయే చేసిన వాగ్దానాల అమలుకు కేంద్రాన్ని ఒప్పిద్దురూ మీకు పుణ్యముంటుంది అని ఆంధ్రప్రదేశ్‌ జనాలు పోకిరి సినిమాలో మాదిరి విజయవాడ రాగానే చంద్రబాబు వెంట బడటం ఖాయం.

రాజధాని అమరావతి శంకుస్ధాపన కార్యక్రమానికి వచ్చినపుడు తాను కూడా దాని నిర్మాణానికి కొంత విరాళం ప్రకటిద్దామని అనుకున్నానని, అయితే ప్రధాని మోడీ అంతటి వ్యక్తే పిడికెడు మట్టి, కుండెడు నీళ్లు ఇచ్చినపుడు తాను విరాళం ప్రకటిస్తే తెలంగాణాపై మోడీ ఎక్కడ మరింత కక్ష పెంచుకుంటాడోనని తాను ప్రకటించలేదని, అయినా అమరావతికే దిక్కులేదు, హైదరాబాదుకేం వరాలిస్తారని అటు బిజెపిని ఇటు తెలుగుదేశం పార్టీని తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గాలితీశారు. వెంకయ్య(నాయుడు) ప్రాసకోసం ఎన్నయినా మాట్లాడతాడు, అలా మాట్లాడటం నాకూ వస్తుంది, ఆయనకంటే తెలుగు సాహిత్యం నాకే బాగా వచ్చు అని కూడా చెప్పారు.

ఏ దేశం వెళితే అక్కడి తెలుగు వారిని, భారతీయులను పొగడటం, మీరే ఆ దేశాలను పెంచి పోషిస్తున్నారన్నట్లుగా చెప్పటం చంద్రబాబు బ్యాండు బృందానికి బాగా వచ్చు. కానీ ఆయన మాత్రం సావిత్రీ నీ పతి ప్రాణంబు దక్క మరొక్క వరం కోరుకో అని యమధర్మరాజు చెప్పినట్లుగా తెలుగువారి రాజధాని నిర్మాణ రూపకల్పన బాధ్యత మాత్రం తెలుగు వారికీ ఇవ్వలేదు, భారతీయులకు ఇవ్వలేదు. ఎంత రాష్ట్ర భక్తి, ఎంత దేశ భక్తి ? పోనీ మనవారేమైనా తక్కువ వారా ?

మయసభకు ప్రతిరూపాన్ని నిర్మించారే, ప్రపంచ స్దాయి కట్టడాలకు ఏ విషయంలో తక్కువ తిన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో భారతీయులు నిర్మించిన నూతన పార్లమెంట్‌ భవనం ప్రపంచంలో అత్యుత్తమ పార్లమెంట్‌ భవనాలలో ఒకటిగా భావిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో వున్న అరాచక పరిస్దితులు, భద్రతా సమస్యల కారణంగా 2009లో ప్రారంభమై 2012లో పూర్తి కావాల్సింది 2015 వరకు సాగింది.దీనిలో ప్రధాన ఆకర్షణ ఏమంటే 17.15 మీటర్ల ఎత్తుండే కంచు గుమ్మటం ఆసియాలోనే పెద్దదట. ఇక భవనం లోపలా బయటా ఆకర్షణలు చూడాల్సిందే తప్ప వర్ణించనలవి కాదట. ఇంత మంచి కన్సల్టెంట్స్‌, నిర్మాణ కంపెనీలు, నిపుణులైన పనివారు మన దగ్గర వుండగా అందునా మేకిండియా పిలుపు ఇచ్చిన ప్రధాని కేంద్రంలో వుండగా రాజధాని అమరావతిని సింగపూర్‌ వారికి ఎందుకు కట్టబెట్టినట్లు ? నీకిది నాకది అని పక్కా అవగాహనలతో పంచుకొనే రోజుల్లో ఏది ఎందుకు జరుగుతుందో ? గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లు అలాంటి విషయాల్లో పండిపోయిన వారే చెప్పాలి. కాకపోతే అలాంటి వారికి విస్వసనీయత వుండదు, అందరికీ తెలుసు ఏదో జరుగుతోందని. అదేమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఐటి ఆశావహులపై ఐస్‌ చల్లిన విశాఖ పెట్టుబడుల సభ

13 Wednesday Jan 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, CHANDRABABU, investments, sunrise AP, Visakha Partnership Summit

Port Development To Propel Andhra's Growth: Chandrababu Naidu

సత్య

రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ‘వుషోదయ ఆంధ్రప్రదేశ్‌ విజన్‌ 2029’ పేరుతో భారత పరిశ్రమల సమాఖ్య(సిఐఐ)తో కలసి ఈనెల 10-12 తేదీలలో పెట్టుబడుల ఆకర్షక సదస్సు నిర్వహించారు. దీనిలో ‘ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టాలి’ అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా సదస్సుకు ముందు ఒక పత్రిక కధనం.’4.5లక్షల కోట్ల టార్గెట్‌ ‘ మరో పత్రిక శీర్షిక. ఈ రెండూ చంద్రబాబు దృష్టిలో వున్నవి వున్నట్లుగా రాసే పత్రికలే. ‘ భాగస్వామ్య సదస్సు బంపర్‌ హిట్‌ అయింది. ప్రభుత్వమే రూ.2 లక్షల కోట్ల ఒప్పందాలు కుదరగలవని భావించగా అనూహ్యంగా రు.4,76,878 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదరటంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ఆనందం వెల్లి విరుస్తోంది’ అని ఏడు కోట్ల లక్ష్యం అని రాసిన పత్రిక సదస్సు తరువాత రాసింది. చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకొని నిర్వహించిన ఈసదస్సు గ్రాండ్‌ సక్సెస్‌ అయిందని రెండో పత్రిక రాసింది. ఇవి గాకుండా కేంద్ర మంత్రి అనంత కుమార్‌ ప్రతిపాదించిన (75వేల కోట్లు) అదనం అంటూ ఊహించినదానికన్నా ఎక్కువ స్పందన వచ్చింది, వచ్చే ఏడాది కూడా విశాఖలోనే భాగస్వామ్య సదస్సు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కుదిరిన ఒప్పందాలతో పెట్టే పరిశ్రమలు, ఇతర సంస్ధలలో పదిలక్షల పదిహేను వేల వుద్యోగాలు వస్తాయని సదస్సు నిర్వాహకులు ప్రకటించారు. ఇవన్నీ త్వరలో ఆచరణకు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారటనటంలో సందేహం లేదు.

ఈ సదస్సుతో ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది సంక్రాంతి మరింత కాంతి వంతం అవుతుందని అనేక మంది భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీలనే కర్మాగారాలలో ఏటా లక్షా 50వేల మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుఏట్లు వుత్పత్తి అవుతున్నారు. మన ఇంజనీర్లు వుత్పత్తి అవుతున్నంత వేగంగా మన ఆర్ధిక వ్యవస్ధ పెరగటం లేదు. దాంతో ఇంజనీరింగ్‌ నిరుద్యోగుల సైన్యం ఏడాది కేడాది గణనీయంగా పెరుగుతోంది. మన విద్యార్ధులు వుద్యోగాలు అడిగేవారు కాకుండా వుద్యోగాలు కల్పించేవారుగా తయారు కావాలని మన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ మధ్య సందేశమిచ్చారు.

2013లో ‘యాస్పిరింగ్‌ మైండ్స్‌ ‘ అనే ఒక పరిశోధనా సంస్ధ కొన్ని తట్టుకోలేని నిజాలను వెల్లడించింది. చెన్నయ్‌ పట్టణం అక్కడి అన్నా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలనుంచి డిగ్రీ చేతపట్టుకు వస్తున్న ఇంజనీర్లలలో ఒక శాతానికి మాత్రమే వుద్యోగాలు కల్పిస్తున్నదని, అత్యధిక వుద్యోగాల కల్పన రేటు వున్న ఢిల్లీలో 13శాతం, భారత సిలికాన్‌ వ్యాలీగా పేరుగాంచిన బెంగలూరులో 3.2శాతం కల్పిస్తున్నట్లు అది వెల్లడించింది. వాటితో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్టణం, రాజధాని అమరావతి ఎంతశాతం కల్పిస్తుందో మనం చంద్రబాబు సిద్దం చేసిన విజన్‌ 2029, 2050 పత్రాలను చూడాల్సిందే.

విశాఖలో కుదిరిన అవగాహనా ఒప్పందాల ప్రకారం ఐటి రంగంలో వస్తాయని చెబుతున్న పెట్టుబడుల మొత్తం 3,368 కోట్ల రూపాయలు, దాని వలన వస్తాయని చెప్పిన వుద్యోగాలు 50వేలు. తనకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రెండు కళ్లవంటివని దేన్నీ నిర్లక్ష్యం చేయనని హైదరాబాదు కార్పొరేషన్‌ ఎన్నికల సభలో జనవరి 12న చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అందువలన ఒక కన్ను ఆంధ్రప్రదేశ్‌లో ఐటి కంపెనీల స్ధాపనకు ఆయన మరోసారి అధికారంలోకి వచ్చిన గత ఇరవై నెలల నుంచీ స్వయంగా, మధ్యలో రాష్ట్ర ఐటి మంత్రి పల్లె రఘనాధరెడ్డి, చంద్రబాబు తనయుడు లోకేష్‌ ఇబ్బడి ముబ్బడి విదేశీ పర్యటనల సందర్బంగా మొత్తం పెట్టుబడుల ఆకర్షణకే సమయాన్ని వెచ్చించినట్లు మనం మీడియాలో చదువుకున్నాం, టీవీలలో చూశాం. వాటి ఫలితమే 3,368 కోట్ల రూపాయలని అనుకోవాలి. ‘ ఇలాంటి సదస్సులలో కుదిరే ఒప్పందాలలో సహజంగా 15 నుంచి 25శాతం వాస్తవ రూపం దాల్చితే గొప్ప విజయం సాధించినట్లు పరిగణించాల్సి వుంటుందని పరిశ్రమల వర్గాల మాట. అయితే ఈ సారి 50 నుంచి 60శాతం వరకు ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నది చంద్రబాబు నిర్దేశం’ అని చంద్రబాబు చెప్పే బి పాజిటివ్‌ పత్రిక ఒకటి రాసింది. కాబట్టి ఐటి నిరుద్యోగులు, కాబోయే నిరుద్యోగులూ ఎవరో వస్తారని, ఏదో తెస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్న శ్రీశ్రీ గీతాన్ని నిత్యం గుర్తుకు తెచ్చుకోవాల్సి వుంటుందేమో? ఒకవేళ వచ్చినా వస్తాయని చెబుతున్న 50వేల వుద్యోగాలకు గాను పదిహేను శాతం అంటే ఏడున్నర వేలు మాత్రమే. ఆపై ఎన్ని వచ్చినా అది బాబొస్తే జాబ్‌ అన్న పధకంలో బోనస్‌గా భావించాలి.

పోనీ ఐటి వుద్యోగాల బదులు ఇతర రంగాలలో వుద్యోగావకాశాల గురించి చూడాలంటే ఒక వూరి మునసబు మరోవూరికి వెట్టి కింద లెక్క అన్న సామెత తెలిసిందే. ఐటి ఇంజనీరు మిగతా రంగాలకు క్యాజువల్‌ కార్మికుడి కిందే లెక్క. ఇండ్ల నిర్మాణ రంగంలో 41వేల 500 కోట్లు పెట్టుబడులు వస్తాయని, వాటి ద్వారా రెండున్నరలక్షల వుద్యోగాలు వస్తాయని చెప్పారు. అవేమి వుద్యోగాలో ? ఎన్నిరోజులు పని ఇస్తాయో? ఈ రోజుల్లో రోడ్లు, ఇండ్ల నిర్మాణంలో యంత్రాలకే వుద్యోగాలు, శుభం పలకరా అంటే ఏదో అన్నట్లుగా సంతోష సమయంలో ఇదేమిటి అనుకుంటారేమో, ముగిద్దాం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అవగాహన ఒప్పందాలలో మోడీని అధిగమించేందుకు చంద్రబాబు యత్నం !!

11 Monday Jan 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, CHANDRABABU, Mou's

ఇలాంటి మాజిక్‌లను మోడీ గతంలోనే చేశారు కేవలం 24 గంటల్లో 2.1లక్షల కోట్ల పెట్టుబడులుండే 21వేల అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించారు.అంటే ప్రతి నాలుగు సెకండ్లకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే పిటి వుష, వుసేన్‌ బోల్ట్‌ రికార్డులను తిరగరాశారు.

సత్య

విశాఖ పట్టణంలో మూడు రోజుల పెట్టుబడుల ఆకర్షక సదస్సులో మొదటి రోజే రెండు లక్షల కోట్ల రూపాయల విలువగల అవగాహనా ఒప్పందాలపై సంతకాలు జరిగాయన్నది వార్త. అతిధి సత్కార్యాలకు పెట్టింది పేరు ఆంధ్రావని. అరిసెలు, వెన్న వుండలు, పూతరేకులు, గారెలు, నాటు కోడి కూర, గుంటూరు గోంగూర, జగ్గయ్య పేట దోసకాయ పచ్చడి, భీమవరం టైగర్‌ రొయ్యలు, నెల్లూరు చేపల పులుసు, బొంగులో చికెన్‌ వంటి వంటకాలను భారీగా వడ్డిస్తామని ముందే ప్రభుత్వం చెప్పింది కనుక మొదటి రోజు అవి తిన్న వారు ఆ మత్తులో గమ్మత్తులో మరికొన్ని కొత్త ఒప్పందాలపై సంతకాలు పెడతారన్నా అతిశయోక్తి కాదు. మొత్తం ఏడు లక్షల కోట్ల మేరకు ఒప్పందాల జరగవచ్చని ముందే అంచనా వేశారు కనుక తొలి రోజు వూపును బట్టి మలి, మూడవ రోజు ఇంకా జోరుగా ఎడా పెడా ఒప్పందాలు జరుగుతాయన్నది స్పష్టం. ఇలాంటి మాజిక్‌ చేయాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు, చంద్రబాబు చేయగలరని నమ్ముతున్నారు గనుక అది వమ్ము కాకూడదని రాష్ట్ర భక్తులైన వారు కోరుకుంటారు. 1947 ఆగస్టు 16 నుంచి దేశభక్తి క్రమంగా తగ్గుతూ ఢిల్లీ నుంచి గల్లీ చివరికి ఇంటికి, అక్కడ కూడా నేను, నా కుటుంబ స్ధాయికి దిగజారిన పరిస్ధితుల్లో రాష్ట్ర భక్తి అనటం కొందరికి అతిశయోక్తిగా తోచవచ్చు, క్షంతవ్యుడను.

ఇటీవలి కాలంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టటాన్ని నిలిపివేసిన 1991 నూతన ఆర్ధిక సంస్కరణల అమలు నుంచి రాష్ట్రాలు పెట్టుబడుల కోసం తరచూ పెద్ద మేళాలను నిర్వహిస్తున్నాయి. వివాహాలకు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి విందులు ఆరగించి చందన తాంబూలాలు స్వీకరించి పోయినట్లుగా కొన్ని వేల మంది, లక్షల మంది విదేశీ కంపెనీల ప్రతినిధులు, వారి వంది మాగధులు మన రాష్ట్రాలను సందర్శించి వేలాది అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేసి వెళ్లి వుంటారు. అవన్నీ వాస్తవ రూపం దాల్చి వున్నట్లయితే తెలుగు రాష్ట్రాలు రెండు ఏర్పడి వుండేవి కాదు, మన దేశం మొత్తంగా ఎప్పుడో అమెరికా అంత గాకపోయినా కనీసం చైనాను వెనక్కు నెట్టి వుండివుండేది.

ఆంధ్రప్రదేశ్‌కు మూడు వైపుల తమిళనాడు(చెన్నయ్‌) కర్ణాటక(బెంగలూరు) తెలంగాణా(హైదరాబాదు) అనే మూడు మహానగరాలు వున్నాయి. నాలుగో వైపున వున్నది బంగాళాఖాతం కనుక పెట్టుబడుల ఆకర్షణ పోటీలో అది వుండదు, అయినా మూడు మహానగరాలను తట్టుకొని ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు పెట్టేందుకు దేశం నలు మూలల నుంచి 1100 మంది 41 దేశాల నుంచి 315 మంది తొలిరోజు హాజరు కావటం చంద్రబాబు నాయుడి యాజమాన్య నిర్వహణకు నిదర్శనం. వివిధ కారణాలతో తొలి రోజు రాలేకపోయిన వారు చివరి రెండు రోజులలో రావచ్చు, వాటికీ రాలేని వారు తరువాత వచ్చి విజయవాడలో సంతకాలు చేసి వెళతారు. అన్నయ్యా ఎంత మంది వచ్చారు, ఏం తిన్నారు, ఎన్ని సంతకాలు చేశారని కాదు, ఎన్ని వాస్తవ రూపం దాల్చాయన్నది ముఖ్యం అన్నట్లుగా గతంలో జరిగిన ఆకర్షక సమావేశాల ఫలితాలేమిటో మచ్చుకు కొన్ని చూద్దాం.

ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే అందుకు అనువైన వాతావరణం అంటే దండిగా లాభాలు వచ్చే పరిస్ధితులు వున్నాయా లేవా అని చూస్తారు. లేకుంటే ప్రపంచం నలుమూలలు, పొరుగు రాష్ట్రాల నుంచి ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంటుంది ? ఏ దేశంలో అయినా ఆర్ధిక వుత్పత్తి వనరులలో ఎంతశాతాన్ని వినియోగించుకుంటున్నారు? కొత్త పరిశ్రమలు పెడితే వాటి భవిష్యత్‌ ఎలా వుంటుంది అని ఎవరైనా వెనుకా ముందు ఆలోచిస్తారు. గత ఆగస్టు ఎనిమిదవ తేదీన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక ప్రచురించిన క్రిసిల్‌ రేటింగ్‌ నివేదిక ఆధారంగా ఇచ్చిన ఒక వార్త ప్రకారం మన దేశంలో పెట్టుబడులు తగ్గుతున్నాయి, సామర్ధ్యవినియోగం ఐదేళ్ల కనిష్టానికి పడిపోయిందన్నది దాని సారం. వర్తమాన ఆర్ధిక సంవత్సరం(2015-16)లో రెండుశాతం పెట్టుబడులు తగ్గుతాయని, ప్రయివేటు రంగ పెట్టుబడులు గత కొద్ది సంవత్సరాలుగా తగ్గటం ఆందోళన కలిగిస్తోందనిఈ ఏడాది మరో ఎనిమిదిశాతం తగ్గవచ్చని నివేదిక పేర్కొన్నది. పన్నెండు భారీ పరిశ్రమల రంగాలకు గాను పదింటిలో సామర్ధ్య వినియోగం ఐదేళ్ల కనిష్టానికి పడిపోయినందున కొత్త ప్రాజెక్టుల ఆశలు ఆవిరి అవుతున్నాయని, పర్యవసానంగా గతేడాది కాలంలో ప్రకటించిన లేదా అనుమతించిన పరిశ్రమలలో కేవలం 20శాతం మాత్రమే అమలులోకి రావచ్చని, మూల ధన పెట్టుబడులు 2017లోనే అర్ధవంతమైన విధంగా పెరగవచ్చని క్రిసిల్‌ వెల్లడించింది.

అల్యూమినియం, వుక్కు రంగాల సామర్ధ్యం పెంచిన కారణంగా వాటిని దిగుమతి చేసుకొనే భారత్‌ ఎగుమతి చేసే దేశంగా మారింది,ప్రపంచ మార్కెట్‌లో వస్తువుల ధరలు తగ్గిన కారణంగా చమురు శుద్ధి, మార్కెటింగ్‌, పెట్రోకెమికల్‌ రంగాలపై ప్రభావం పడింది.కాగితంతో సహా కొన్ని రంగాలలో సామర్ధ్య వినియోగం ఐదు సంవత్సరాల కనిష్టానికి తగ్గింది. కొద్ది కాలం తరువాత గాని తిరిగి పూర్వస్ధితికి చేరుకోలేవు. ఈ రంగాలలో కొత్త ప్రాజెక్టులకు అవకాశాలు పూర్తిగామృగ్యమయ్యాయి. ఆటోమొబైల్‌, ఎరువుల రంగంలోనే పెట్టుబడులు పెరిగే అవకాశాలు వున్నాయి. ఎరువుల రంగంలో కల్పించే రాయితీలు, చమురు ధరలు, వడ్డీలు తగ్గిన కారణంగా ఆటోమొబైల్‌ రంగంలో ముఖ్యంగా కార్ల రంగంలో అవకాశాలు వున్నాయి.

మౌలిక సదుపాయాల విషయానికి వస్తే పరిస్ధితి పూర్తి తిరోగమనంలో వుంది. విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు తగ్గుతాయి.ధర్మల్‌ విద్యుత్‌ విభాగంలో జతచేయదలచిన సామర్ధ్యం గత రెండు సంవత్సరాలలో40వేల మెగావాట్లకు తగ్గగా మరో రెండు సంత్సరాలలో36వేలకు తగ్గిపోనుంది. ప్రయివేటు రంగంలో పెట్టుబడులు లేకపోవటం, పంపిణీ సంస్ధల ఆర్ధిక స్ధితి బలహీనంగా వున్న కారణంగా కొత్త కొనుగోలు ఒప్పందాలు లేని కారణంగా కొత్త ప్రాజక్టుల ప్రకటనలు రావటం లేదు అని క్రిసిల్‌ పేర్కొన్నది. ఇలాంటి నివేదికలను గమనంలోకి తీసుకొనే ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు తప్ప మరొక ప్రాతిపదిక వుండదు. ఈ పూర్వరంగంలో కొన్ని రాష్ట్రాలు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు చిత్తుకాగితాలుగా మారాయి. పంజాబ్‌లో 2011-12 నుంచి ఖన్నా-మండి గోవింద ఘర్‌ పారిశ్రామిక ప్రాంతంలో 688 పరిశ్రమలు మూతపడ్డాయి. పంజాబ్‌లో భూముల ధరలు ఎక్కువగా వున్న కారణంగా పారిశ్రామిక సంస్ధలు విస్తరణకు మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, చత్తీస్‌ఘర్‌లను ఎంచుకుంటున్నాయి. అసోచెమ్‌ తన అధ్యయనంలో ఇలా పేర్కొన్నది. పంజాబ్‌లో 2015 మార్చి వరకు ఆకర్షించిన పెట్టుబడులు రెండులక్షల కోట్ల రూపాయలు. వాటిలో 1.6లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్లో ఎలాంటి పురోగతి లేదు. మిగిలినవి ఖర్చు పెరిగిందని, సమయం పడుతుందని పేర్కొన్నాయి. పరిశ్రమల రంగ అభివృద్ధి 2006-07లో 20శాతం వుండగా 2014-15లో రెండుశాతానికి పడిపోయింది. పురోగమన పంజాబ్‌ మదుపుదార్ల సదస్సు 2013 డిసెంబరులో జరిగింది. ఆ సదస్సును ఘన విజయంగా అకాలీదళ్‌, బిజెపి వర్ణించాయి. దానిలో 65వేల కోట్ల రూపాయల అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇప్పటికీ అవి అలాగే వున్నాయి. కొన్ని కంపెనీలు కనీసం తమ ప్రతిపాదనలేమిటో కూడా సమర్పించలేదు. కొత్తవి రాకపోగా 2013-14లో వచ్చిన 7,200 కోట్లకు గాను మరుసటి సంవత్సరంలో రు.2,600 కోట్లకు పడిపోయాయి.

కర్ణాటకలో మూడు సంవత్సరాల తరువాత గతేడాది పెట్టుబడిదారుల సదస్సు జరిగింది.దానికంటే కొద్ది వారాల ముందే గతేడాదే తమిళనాడులో కూడా జరిగింది. ఇప్పుడు విశాఖలో ఆంధ్రప్రదేశ్‌ సదస్సు జరుగుతున్నది ఈ మూడు కూడా కేవలం నాలుగు నెలల వ్యవధిలో జరిగాయి. దేశ, విదేశాల ప్రతినిధులు ఈ సదస్సులన్నింటికీ హాజరయ్యారు. ఒప్పందాలపై సంతకాలు చేశారు, వాగ్దానాలు చేశారు. ఏ రాష్ట్రానికి ఆరాష్ట్రం తాము ఇచ్చే రాయితీలను పెట్టుబడిదారుల ముందు ఏకరువు పెడుతున్నాయి,తమ ప్రత్యేకతలు ఏమిటో వివరిస్తున్నాయి. జోస్యం చెప్పే కోయరాజులు తాము ఎంత పెద్దవారికి జోస్యం చెప్పామో తెలిపేందుకు వారితో దిగిన ఫొటోలను ముందుగా తమవద్దకు వచ్చేవారికి చూపినట్లు ఏ ఏ కంపెనీలు ఇప్పటికే తమ రాష్ట్రాలలో వున్నాయో, ఎవరు ఆసక్తి చూపుతున్నారో చూడండంటూ హడావుడి చేస్తున్నాయి. పెట్టుబడుల సదస్సుల గురించి జనంలో ముఖ్యంగా నిరుద్యోగ యువకుల్లో ఎన్నో ఆశలు రేపుతున్నారు. గోరంతను కొండంతలు చేసి చూపుతున్నారు. దీనిలో ఏ ఒక్కరూ తక్కువ తినలేదు.

వుదాహరణకు కర్ణాటకలో 2012లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు జరిగింది. సదానందగౌడ రాష్ట్రముఖ్య మంత్రి. ప్రభుత్వం శాసనసభకు సమర్పించిన సమాచారంలో ఇలా వుంది. ‘2010లో ఎడ్డియూరప్ప ముఖ్యమంత్రిగా వున్న సమయంలో 2010లో జరిగిన సదస్సులో 3.92లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, 7.27లక్షల వుద్యోగాలు కల్పించబడతాయని ప్రభుత్వం ఆరోజు చెప్పింది, వాస్తవానికి వచ్చింది 32,957 కోట్లు, 93,102 వుద్యోగాలు మాత్రమే. సదానందగౌడ 2012లో 2.81లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నానని, 13.99లక్షల వుద్యోగాలు వస్తాయని చెప్పారు. దానికి గాను వచ్చింది 12,468 కోట్లు వుద్యోగాలు 21,794 మాత్రమే. ఈ రెండింటినీ కలుపుకుంటే పెట్టుబడుల వాగ్దానం 6.37లక్షల కోట్లు , వస్తాయన్న వుద్యోగాలు 21.26లక్షలు కాగా వచ్చిన పెట్టుబడి 45,425 కోట్లు ఇచ్చిన వుద్యోగాలు 1.14లక్షలు మాత్రమే.

రాజకీయ నాయకుల వాగ్దానాలు ఎలా వుంటాయంటే లోక్‌సభ ఎన్నికల సమయంలో బిజెపి నేత నరేంద్రమోడీ విదేశాల్లో వున్న నల్లధనాన్ని వెలికితీస్తానని దానిని ఒక్క్కొరికి పంచితే 15లక్షలు వస్తుందని చెప్పారు. బహుశా దాన్ని తీసుకు వచ్చే క్రమంలోనే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రానికి లక్షా నలభైవేల కోట్ల రూపాయల ప్రత్యేక పాకేజి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్‌ నిండు సభలో ప్రకటించిన ప్రత్యేక హోదా గురించి ఇంతవరకు కంటి చూపు తప్ప నోటమాటలేదు.

విశాఖ సభకు వచ్చిన ప్రతి ఒక్కరితో ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకొనే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆయన సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్‌ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.ఇలాంటి మాజిక్‌లను మోడీ గతంలోనే చేశారు కేవలం 24 గంటల్లో 2.1లక్షల కోట్ల పెట్టుబడులుండే 21వేల అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించారు.అంటే ప్రతి నాలుగు సెకండ్లకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే పిటి వుష, వుసేన్‌ బోల్ట్‌ రికార్డులను తిరగరాశారు. అలాగే నరేంద్రమోడీ గతేడాది ఎర్రకోట ప్రసంగంలో 17కోట్ల బ్యాంకు ఖాతాలను తెరుస్తామని ప్రకటించారు అంటే సెకనుకు ఆరు అన్నమాట. ఎప్పుడూ విదేశాల్లోనే తిరుగుతుంటారు మీకు భారత్‌లో చేసే పనేమీ లేదా అంటే దేశానికి కనీసం లక్ష కోట్ల డాలర్లు అంటే 66లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావటం తన లక్ష్యమని చెప్పుకున్నారు. అందువలన అలాంటి నరేంద్రమోడీని స్ఫూర్తిగా తీసుకున్న చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క ప్రతినిధితో ఒక్కొక్క ఒప్పందం కుదుర్చుకోవటంలో అతిశయోక్తి ఏముంటుంది, గొప్ప ఏముంది?

Share this:

  • Tweet
  • More
Like Loading...

రూపాయి విరాళానికి ప్రచారఖర్చు పాతిక

08 Friday Jan 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

Amaravathi, CHANDRABABU, Janmabhumi, students

చంద్రబాబు చేతిలో మంత్రదండం !

సత్య

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చేతిలో మంత్రదండటం వుందా ? భక్తులను కరుణించేందుకు గతంలో పుట్టపర్తి సత్యసాయి బాబా హాంఫట్‌ అంటూ విభూతి,బంగారు చైనులు తీసి ఇచ్చేవాడని,ఆయన వేలు ముంచటంతో బకెట్‌లోని నీరు పెట్రోలుగా మారిందని గతంలో చెప్పారు. తిరుపతి జన్మభూమి సభలో అక్కడికక్కడ ఒక విద్యార్ధికి ఒక టాబ్‌ను చంద్రబాబు బహుకరించారంటే ఆయన కూడా అదే పరంపరకు చెంది వుండాలి.

ఎవరైనా బడి ఎగ్గొడితే మందలించాలి.పిల్లలను బడి ఎగ్గొట్టించి పిల్లలను తీసుకువస్తే టీచర్లను మందలించాలి. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశారు ? వచ్చిన 23 మంది పిల్లల్లో వుపన్యాసం చేసిన విద్యార్ధినికి టాబ్‌ బహుకరించారు. ఆది ఆయన జేబులోంచి తీశారా, పక్కన వున్న అధికారి చేతిలోది లాక్కొని ఇచ్చారా లేక ముందే చెప్పుకున్నట్లు మంత్రదండంతో సృష్టించారా అన్నది గొర్రెల గోత్రాలు కాపర్లకు ఎరుక అన్నట్లు తెలుగు దేశం మాజీ నాయకురాలు ప్రస్తుతం ఆ జిల్లాకు చెందిన వైసిపి శాసనసభ్యురాలు రోజాను అడగాల్సిందే.

సినిమాల్లో, కధల్లో మాఫియా నాయకుడు ఫలానా రోజున ఫలానా చోట నాకు ఇంత సొమ్ము తెచ్చి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. అది కూడా స్వచ్ఛందంగానే అని తెలుసు కదా. అదే మాదిరి నా రాజధాని… నా అమరావతి…. నా ఇటుక పేరుతో ప్రతి విద్యార్ధి, టీచరు తలా పది రూపాయల చొప్పున విధిగా విరాళంగా వసూలు చేసి పంపాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయటంపై ప్రభుత్వం హైకోర్టులో మొట్టికాయలు తిన్నది. బలవంతపు వసూళ్లు చేయటం లేదని, గతంలో ఇచ్చిన వుత్తరువులను సవరిస్తూ ఒక మెమో జారీ చేశామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ పరువు పోవటంతో విరాళాల వసూలుకు ఆదేశాలు ఇచ్చిన అధికారులపై ఆగ్రహించి, చర్య తీసుకోవాలని ముఖ్య మంత్రి ఆదేశించారన్న వార్తలు కూడా పక్కపక్కనే వచ్చాయి. అంటే బాబుగారు మంచోరే మధ్యలో అధికారులే ఆయనకు మచ్చ తెస్తున్నారనే భజనలో భాగం కూడా ఇది కావచ్చు. ఎందుకంటే ఇలాంటి చర్యల వార్తల ప్రకారం నిజంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే ఈ పాటికి ఒక్క అధికారి కూడా మిగిలి వుండేవారు కాదు, అన్నింటికి మించి ఇలాంటి వుత్తరువులు వచ్చి వుండేవి కాదు. ఎందుకంటే వుత్తరువులు ఇవ్వనేల ఆపైన చర్యలకు గురికానేల అని ఏపనీ చేసే వారు కాదు. ఇంత జరిగాక కూడా స్కూలు ఎగ్గొట్టి పలమనేరు నుంచి తిరుపతికి 120 కిలోమీటర్ల దూరం మూడు గంటల పాటు ప్రయాణించి 23 మంది పిల్లలు స్వచ్ఛందంగా పోగుచేసిన 230 రూపాయల విరాళాన్ని జన్మభూమి సభలో అందచేశారు. అంతదూరం ప్రయాణించటానికి వారికి అంతకంటే కొన్ని రెట్లు ఎక్కువ ఖర్చు అయి వుండాలి. వారికి రానుపోను ఛార్జీలు, ఎంతో సమయం వెచ్చించాలి గనుక పిల్లలకు భోజనాల ఖర్చు ఇవన్నీ కలుపుకుంటే రూపాయి విరాళానికి పాతిక రూపాయల ప్రచార ఖర్చు అన్నట్లు ఆ మొత్తాన్ని ఎవరు భరించారు?

పలమనేరులో జన్మభూమి సభ జరుగుతూ వుండి వుంటే పిల్లలు వుత్సాహపడి విరాళం అందచేశారంటే అర్ధం చేసుకోవచ్చు. కనీసం పక్క నియోజకవర్గం కూడా కాదు, జిల్లా కేంద్రమూ కాదు, చిత్తూరు దాటి ప్రయాణించి రావాలి. ఇది టీచర్లు లేదా అధికారపార్టీ కార్యకర్తలు గానీ ముఖ్యమంత్రి మెప్పుకోసం నిర్వహించిన కార్యక్రమం తప్ప మరొకటి కాదు. దీన్ని అవకాశంగా తీసుకొని తాము స్వచ్ఛందంగానే విరాళాలు కోరామని, వత్తిడి చేయలేదని సదుద్దేశ్యంతో ముందుకు పోతుంటే కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కోర్టులకూ వెళ్లారని వాళ్లు ఏ పనీ చేయరనీ ముఖ్య మంత్రి ధ్వజమెత్తారు. ఇతరులు తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పిన సిఎం వుత్తరువును సవరించినట్లు కోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ ద్వారా విన్నపం చేయించటం ఏమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d